చీకట్లోంచి నడిచొచ్చిన అన్నపూర్ణను చూసి ఆనందంతో కేకేసింది శారద.
‘‘ఇదేంటి – ఇంత పొద్దుబోయి. అందరూ బాగున్నారు గదా’’
‘‘అందరం బాగున్నాము. మా బంధువు పెళ్ళికని పొద్దునే వచ్చా. ఇవాళ రాత్రి నీతో కాసేపు మాట్లాడి రేపు పొద్దున వెళ్దామని ` ’’
ఇద్దరూ ఒకరినొకరు పరిశీలనగా సంతోషంగా చూసుకున్నారు.
‘‘ఎలా జరిగాయి ఎన్నికలు ?’’
‘‘ఓడిపోతాననిపిస్తోంది. మీ కాంగ్రెస్ వాళ్ళూ ` ’’
‘‘మా కాంగ్రెస్ అనకు. వాళ్ళు ఏలూర్లో చేసిన పిచ్చి పనులన్నీ నాకు తెలుసు “.
‘‘నువ్వూ వచ్చి కాంగ్రెస్కి ఓటెయ్యమని ప్రచారం చేస్తావనుకున్నాను’’.
‘‘మా పార్టీ వాళ్ళు చాలా ఒత్తిడ చేశారు ఏూరు వెళ్ళమని. వెళ్తాను వెళ్ళి శారదకు ఓటెయ్యమని ప్రచారం చేస్తానన్నాను. దాంతో వెనక్కు తగ్గారు’’.
‘‘నిజంగా అలా అన్నావా ?’’
‘‘మరి – అసలు నీకు ఎదురుగా ఎవర్నీ నిబెట్టొద్దన్నాను. వజ్రంలాంటి మనిషిని ఏకగ్రీవంగా గెలిపించాలని అంటే అక్కడ వినేవాళ్ళెవరు? నీ విలువ తెలిసినవాళ్ళెవరు?’’
‘‘నా స్నేహితురాలివని తెలుసుగా – నీ మాటలేం పట్టించుకుంటారు గానీ ` పోనీ ` మీ పార్టీ సంగతి తెలిసొచ్చింది గదా ` మా పార్టీలో చేరిపోరాదూ?’’
‘‘కాంగ్రెస్ అంటే ఈ మురికి మనుషులే అనుకుంటున్నావా ? గాంధీ, నెహ్రూ, సరోజినీ, దుర్గాబాయ్ -ఎలాంటి వాళ్ళు నడిపిస్తున్నారు. ఆ కాంగ్రెస్ని ఒదలటమే. ఒడ్డున నీళ్ళు మురిగ్గా ఉన్నాయని నదీ ప్రవాహాన్నే కాదంటామా? నేనూ ఆ మహా ప్రవాహంలో ఓ నీటిబొట్టుననుకుంటే కలిగే తృప్తి వేరు. పార్టీ గొడవ ఒదిలెయ్. బాగా నలిగిపోయినట్లున్నావు. నట్టూ నిద్ర పోయిందా? దానిని కాస్త పట్టించుకో. మా పిల్లల్ని నేను చిన్నతనంలో పట్టించుకోలేదని ఇప్పుడు సతాయిస్తారు.’’
‘‘ఎలా కుదురుతుంది చెప్పు అన్నపూర్ణా? ఆస్పత్రి, మహిళా సంఘం, పార్టీ పనులు , మనలాంటి వాళ్ళు పిల్లల్ని కనకూడదేమో `
రాజకీయాలోకి వచ్చి పని చేయటమంటే ఆడవాళ్ళకెంత కష్టం. మనలా అన్నిటికీ తెగించిరావటం కాదు. ప్రతివాళ్ళు తేలికగా రాజకీయాల్లోకి వచ్చే వీలుండాలి. మా ప్రభుత్వం వస్తే మేం అలాగే చేస్తాం.’’
‘‘ఏం చేస్తారు?’’
‘‘అబ్బో – చాలా చేస్తాం.తల్లుల కోసం, పిల్లల కోసం ఎన్ని పథకాలు నా బుర్రలో ఉన్నాయో నీకు తెలియదు. నీకే కాదు – మా వాళ్ళకూ తెలియదు. నేనన్నీ రాసి పెడుతున్నాను . ఆడవాళ్ళు ఆనందంగా తల్లులు కావాలి. రాజకీయాలు నడపాలి. ప్రతి గ్రామంలో ఆడవాళ్ళు రాజకీయాధికారం పొందుతారు. అప్పుడు అక్కడ తల్లులందరూ కలిసి తమ పిల్లల పెంపకం గురించి, ఆరోగ్యం గురించి, చదువు సంధ్య గురించి కలిసి మాట్లాడుకుని అందరికీ బాగుండే సామాజిక నిర్ణయాలు తీసుకుంటారు. సోవియట్లలో అలాగే జరుగుతోంది.’’
‘‘ఔనట. నేనూ విన్నాను. ఈ మధ్య అబ్బయ్య సోవియట్ పుస్తకాలు తెచ్చి చదువుతున్నాడు. ఆయన చదివాక నేనూ, అమ్మాయి కూడా చదువుతాం’’.
‘‘అమ్మాయేమిటి – స్వరాజ్యమని పేరు పెట్టి – మీ అబ్బాయి పేరు మాత్రం గుర్తుండదోయ్ నాకు – అసలు వాడిని చూసిందే తక్కువ. అన్నపూర్ణా ఈ సారి నువ్వొక్క దానివీ వస్తే ఊరుకోను. పిల్లల్ని తీసుకుని, అబ్బయ్యని కూడా తీసుకుని రావాలోయ్. నటాషాకు మీ పిల్లల స్నేహం కావాలిగా – అసలు అబ్బయ్యికి బెజవాడ కాలేజీలో ఉద్యోగమైతే ఎంత బాగుండేది ` ’’
‘‘మేమొచ్చి మీ ఇంట్లో కాపురం పెట్టేవాళ్ళం’’
‘‘తప్పేముంది. ఆ పని చెయ్యకుండా వేరే ఉంటే నేనొప్పుకుంటానా ?’’
ఆ రాత్రి స్నేహితుల కబుర్లతో తెల్లవారింది.
ఎన్నికలలో ఓడిపోవటం శారదనంతగా బాధించలేదు గానీ ఎన్నిక గురించి సమీక్షించుకునేందుకు ఏర్పాటు చేసిన సమావేశం శారదను కుదిపి వేసింది. మహిళా సంఘం సభ్యులు కుంగిపోయారు. కొందరు ఏడ్చారు. వాళ్ళందరినీ శారద ఓదార్చగలిగింది. ఎన్నికలలో పోటీ చేయటం కేవలం గెలవటం కోసం కాదనీ, మన సిద్ధాంతాలు ప్రజలలో ప్రచారం చేసుకునే అవకాశంగా చూడాలని, ప్రతి పక్షాలు తప్పును ఎత్తిచూపగలగటం కూడా చిన్న విషయం కాదనీ చెపితే చాలామంది సమాధాన పడ్డారు.
‘‘అంతమంది ప్రజల ను మనం ఎలా కలుస్తాం? మన సానుభూతి పరుతో మనం మాట్లాడటం వేరు. మనల్ని వ్యతిరేకించే వారిని కూడా ఆలోచింప చేయగలగటం ఎన్నికలోనే సాధ్యం. నేను గెలిచిన , గెలవకపోయిన పార్టీకి, ప్రజలకూ దగ్గరగానే ఉంటాను. అందులో తేడా లేపుడు మనకెందుకు బాధ’’ అంటూ మళ్ళీ సభ్యులలో ఉత్సాహం నింపింది.
కానీ పార్టీ ముఖ్యులు చేసిన సమీక్షలో శారద ఓడిపోయినందుకు కారణం మహిళా సంఘం సభ్యులు , శారద చూపిన అత్యుత్సాహం, తెగువ, తెంపరితనం అని చెబుతుంటే నిర్ఘాంత పోయింది.
‘‘నువ్వు కాంగ్రెస్ సభలో వాళ్ళ వేదిక మీదికి ఎక్కాల్సిన అవసరం ఏమొచ్చింది?’’
‘‘వాళ్ళు అసు విషయాలు కాకుండా అవాకులు చెవాకులు చెపుతుంటే విని ఆనందించాలా?’’ శారద తీవ్రంగా అడిగింది.
‘‘వాళ్ళ మీటింగులో వాళ్ళు ఏదో ఒకటి మాట్లాడుకుంటారు. మనం వెళ్ళి జోక్యం చేసుకోవటం వల్ల శారద తెగించిన మనిషని, అహంభావి అని ఇంకా ఇక్కడ నేను చెప్పలేని నానా మాటలూ మాట్లాడుకున్నారు. ఆ అవకాశం వాళ్ళకెందుకివ్వాలి?’’
‘‘కానీ ఆ తర్వాత నా వ్యక్తిగత జీవితం గురించి మాట్లాడటం మానేశారు’’
‘‘నీ పెళ్లి గురించి మానేశారేమో – కానీ టోటల్గా నీ క్యారెక్టరు గురించి చాలా చెడ్డ ప్రచారం చేశారు. పైగా మహిళా సంఘం వాళ్ళు రౌడీలను కర్రతో కొట్టారు. ఆ రాపూట ఇళ్ళ మీద రాళ్ళేస్తే బైటికి రాకుండా ఉంటే సరిపోయేది. వచ్చి వాళ్ళను కొట్టటంతో కమ్యూనిస్టు ఆడాళ్ళకీ, రౌడీలకూ తేడా లేకుండా పోయింది.’’
‘‘ఆత్మ రక్షణకు, రౌడీయిజానికీ తేడా తెలియకపోతే తెలియజెప్పాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది గానీ, ఆత్మ రక్షణ చేసుకోకపోతే ఎట్లా?’’
‘‘కమ్యూనిస్టు ఆడవాళ్ళని మగరాయుళ్ళుగా మారుస్తున్నారనే పేరు వచ్చింది. అది మంచిది కాదు.’’
‘‘మగ రాయుళ్ళేమిటి? వాళ్ళ గొప్పేమిటి? ఆడవాళ్లు తమ మీదికి ఎవరైన వస్తే ఆత్మరక్షణ చేసుకోగలరని నమ్మి, వాళ్ళకలాంటి శిక్షణ ఇచ్చాం మనం. అది తప్పెలా అవుతుంది?’’
‘‘ఎన్నికల సమయంలో తప్పే అవుతుంది. మామూలు ప్రజలు ఆడవాళ్లు వినయంగా, ఓర్పుగా ఉండాలనుకుంటారు. ఆ నమూనాను మనం ఇవ్వలేదు కమ్యూనిస్టు ఆడవాళ్ళు ` ’’
‘‘ఫాసిస్టు వ్యతిరేక దళాలుగా స్త్రీలు కూడా బెజవాడ వీధుల్లో కవాతు చేశారు. పార్టీ మెచ్చుకుంది. రేపు అవసరమైతే తుపాకులు కూడా పట్టుకుంటారు.’’
‘‘ప్రత్యేక సమయాలు వేరు. ఎన్నికలు వేరు.’’
‘‘మనం ఏమిటో, ఎలా ఉంటామో ప్రజలకు ఎప్పుడైన ఒకటే మెసేజ్ వెళ్ళాలి. ఎన్నికలప్పుడొకటి, ఇంట్లో ఒకటి, బైట ఒకటి ఇదేంటి?’’
‘‘ఇంట్లో భర్త కొడితే కమ్యూనిస్టు భార్య తిరిగి కొడుతుందా?’’
‘‘వై నాట్. ఎందుకు కొట్టకూడదు ? కాదు – ఆ ప్రశ్నే తప్పు. భర్త కొడితే తిరిగి కొట్టాలి. అప్పుడే అతను భార్యను కొట్టటానికి భయపడతాడు. మీరేమంటారు? భర్త కొడుతుంటే పడాలా?’’
‘‘మరి ఇద్దరూ కొట్టుకుంటే ఆ సంసారం ఎలా సాగుతుంది?’’
‘‘ఆ సంసారం సాగకపోతే ఏం? లోకానికి ఏం జరుగుతుంది. ఆ సంసారం సాగితే ` ’’
‘‘శారదా – నువ్వు మాట్లాడే మాటలు మహిళా సంఘంలో మటుకు మాట్లాడకు. వాళ్ళు భయపడతారు. భర్తలు ఒక మాటంటారు. ఒక దెబ్బ వేస్తారు. కాస్త సర్దుకు పోవాలి’’.
శారదకు ఈ చర్చ అవసరమనిపించింది. కమ్యూనిస్టుల్ని బోలెడు మార్చాలి . ఆమెకు జర్మన్ ఐడియాలజీలో మార్క్స్ రాసిన వాక్యాలు గుర్తొచ్చాయి. మగవాడు ఆడదానితో ఎలా వ్యవహరిస్తున్నాడో అనేదానిని బట్టే అతను మనిషిగా ఏ స్థాయిలో ఉన్నాడో తెలుస్తుందని చాలా లోతైన తాత్విక విషయంగా చెప్పాడు.
శారద అది చాలా వివరంగా చెప్పింది. అందరూ నిశ్శబ్దంగా విన్నారు. ఇరవై నిమిషాలు శారద ఉత్సాహంగా మాట్లాడి ఆపేసిన తర్వాత ‘‘ఆ ` ఎజెండాలో తత్వాటి విషయం ఏంటి? చూడండి ’’ అన్నాడు ఆనందరావు.
అందరూ ఆ సంగతి మాట్లాడుతున్నారు. శారద ముఖం అవమానంతో ఎర్రబడింది.
తర్వాతితి సమావేశంలో శారద నోరు తెరవలేదు. తను ఇట్లా మార్క్సిస్టు సిద్ధాంతాలను స్థానిక సమస్యలకు అన్వయించి, మార్క్స్, ఏంగెల్స్ రచనలను ఉదాహరిస్తూ మాట్లాడినప్పుడల్లా ఇలాంటి మౌనమే ఎదురయిందనే విషయం ఆరోజు అర్థమైంది.
తనను క్రమంగా ఆరోగ్య విషయాలకే పరిమితం చేస్తున్నారనీ, మహిళా సంఘానికే పరిమితమవుతున్నాననీ కూడా అనిపించింది.
మహిళా సంఘానికే పరిమితం అవటంలో చిన్నతనమేమీ లేదు. కానీ అక్కడ కూడా తను చేసే పొరపాట్లుగా ఆడవాళ్ళకు ఓర్పు, వినయం నేర్పలేకపోవటాన్ని చూపిస్తున్నారు.
తనను ఒక మేధావిగా, కమ్యూనిస్టు పార్టీ నిర్మాతల లో ఒకదానిగా గుర్తించటానికి నిరాకరిస్తున్నారు.
‘‘ఛ – తను మరీ ఎక్కువ ఆలోచిస్తోంది’’ అనుకుని అప్పటికి ఆ ఆలోచనలను పక్కకునెట్టి సమావేశంలో ఇతర అంశాల మీద మాట్లాడుతున్న వారి మాటలు శ్రద్ధగా వినసాగింది.
***
దేశానికి స్వతంత్రం రాబోతోందనే వాతావరణం వస్తుండగా కమ్యూనిస్టు మీద నిర్భంధం ఎక్కువైంది. బ్రిటీష్ వాళ్ళ ప్రయోజనాలు తీరిపోగానే వాళ్ళకు కమ్యూనిస్టులే అసలు శత్రువులని, వారు తమ వారసులు గా ఎవరికి అధికారం అప్పగించి పోవాలనుకున్నారో వాళ్ళకు కూడా కమ్యూనిస్టులే శత్రువులనీ అర్థమైంది. నిర్బంధం పెరగటంతో మళ్ళీ పార్టీ యంత్రాంగమంత చెల్లాచెదరైంది. రహస్యంగా పత్రికలు నడపటం, నాయకుల అజ్ఞాతవాసం, ప్రజా సంఘాల పని పెరగటం ఎన్నో ప్రతికూలతల మధ్య పని చేయాల్సి వచ్చింది. తెలంగాణలో నిజాం వ్యతిరేక పోరాటంలో కమ్యూనిస్టులు పేద ప్రజలకు అండగా నిలిచారు. సంగాలుగా ప్రజల్లో కలిశారు. సంగపోళ్ళంటే పేద రైతు కూలీలు , చిన్న కులాల వాళ్ళూ ప్రాణాలిచ్చే స్థితికి వచ్చారు. శారదాంబ తెలంగాణా నాయకులకు ఆశ్రయం కల్పించటం వంటి పనులు అదనంగా మీద వేసుకుంది. రజాకార్ల ఆగడాలకు తట్టుకోలేని వాళ్ళు తాత్కాలికంగా బెజవాడ వైపు వచ్చి కొన్ని రోజులు శక్తి పుంజుకున్నారు. వారికి వైద్యం అవసరమైతే శారద ఉండనే ఉంది.
దేశానికి స్వతంత్రం – అర్థ శతాబ్దం దాటిపోయిన స్వతంత్ర సంగ్రామంలో విజయం. భారతదేశం ఒకవైపు విజయోత్సవాలలో మరోవైపు దేశ విభజన సృష్టించిన విలయాలలో మునిగింది. ఉత్తర భారతదేశంలో హిందూ ముస్లిం మధ్య పగలు ప్రతీకారాలు పెరిగిపోయి చరిత్రలోనే అతిపెద్ద విధ్వంసకాండ ఆరంభమైంది. దక్షిణ భారతదేశంలో అది లేదు గానీ హైదరాబాద్ నిజాం గురించిన ఆలోచనలు , చర్చలు మొదలైంది. స్వతంత్ర భారతదేశంలో చేరకుండా తన స్వయం ప్రతిపత్తి నిలబెట్టుకుంటానన్న నిజాం నవాబుపై తెంగాణాలో కాంగ్రెస్, కమ్యూనిస్టు ఆర్యసమాజం వంటి అన్ని పార్టీలలో సాంఘిక గ్రూపుల్లో వ్యతిరేకత ఎక్కువయింది. కాంగ్రెస్ కంటే కమ్యూనిస్టు ప్రాబల్యం పెరగసాగింది. ఆంధ్రప్రాంతంలో కమ్యూనిస్టు జమిందారీ వ్యతిరేక పోరాటాలు ముమ్మరం చేయాలనుకున్నారు. దానితో జమీందార్లు అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీని ఆశ్రయించారు. కాంగ్రెస్లో అంతకు ముందున్న పెద్ద భూస్వాముల సంఖ్య, వారి ప్రాబల్యం కూడా తక్కువ కాదు. దానితో గ్రామాల్లో వర్గ పోరాటం మొదలైందా అన్నంతగా తీవ్ర వైరుధ్యాలు కనిపిస్తున్నాయి.
మారిన ఈ పరిస్థితులలో శారదకు ఒక్క క్షణం తీరిక దొరకటం లేదు. కూతురికి కూడా ఒక్క గంట సమయం ఇవ్వలేకపోతోంది. అమ్మమ్మ పెంపకంలో నటాషాకు వచ్చిన లోటేమీ లేదు గానీ తల్లి కోసం పసి మనసు లోపల ఎక్కడో ఒక ఆరాటం, ఆ ఆరాటం సంతృప్తి చెందక పోవటంతో చిన్న కోపం చోటు చేసుకుంటున్నాయి. మూర్తి దాదాపు ఇంటి పట్టున ఉండటం లేదు. శారద ఆస్పత్రిని ఒదలలేదు గాబట్టి ప్రయాణాలు తగ్గి స్థానిక బాధ్యతలు పెరిగాయి. కృష్ణా గుంటూరు జిల్లాల గ్రామాల లో చిన్న రైతులకు భూస్వాములకు, చల్లపల్లి జమీందారు వంటి జమీందార్లకు మధ్య పోరు పెరగటంతో కమ్యూనిస్టులు తీవ్ర నిర్బంధాన్ని ఎదుర్కొంటున్నారు. వారి ప్రాణాలు ప్రమాదంలో పడుతున్నాయి. కొందరు ప్రాణాలు కోల్పోయారు.
*
> మగవాడు ఆడదానితో వ్యవహరించే దాన్ని బట్టే వ్యక్తిగా అతడే స్థాయిలో ఉంది తెలుస్తుంది.<
విలువైన మాట.