అప్పటి దేవుడి రూపం!

 vinod

3

 

గత  వారం రెండవ భాగం 

 

మానవ సమాజానికి సంబంధించిన ఏ ప్రశ్నకయినా సమాధానం తెలుసుకోవడం కోసం సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడం అవసరం. ఏది ఎప్పుడు ఎందుకు పుట్టిందో, ఎలా మారుతూ వస్తోందో అర్థం చేసుకోవాలి. సమాజంలో వస్తున్న మార్పులని వీలైనంత కచ్చితత్వంతో అర్థం చేసుకోలేక పొతే మనకి సమస్యలూ అర్థం కావు, వాటికి పరిష్కారాలూ బోధపడవు.

గత వారం మనం మానవ సమాజంఅభివృద్ధి క్రమాన్ని ఉదాహరణలతో, కొండ గుర్తులతో చూసాము. ఆ మొత్తం క్రమం లో మతం ఎప్పుడు పుట్టింది? మనుషుల సమాజం మారుతూ ఉంటే మతం లో ఎలాంటి మార్పులు వచ్చాయి? మనకి తెలిసిన మతాల కంటే పూర్వం ఎలాంటి మతాలు ఉండేవి? వాటి స్వరూపం ఎలా ఉండేది? వాటిలో దేవుడి రూపం ఎలా ఉండేది?

“మతము”, “దేవుడు” అనే భావన మనిషికి ఎప్పుడు కలిగింది? మతం పుట్టుక ఆటవిక యుగం మధ్య దశ లోనే (సు. 1,20,000 – 60,000 సం|| పూర్వం) జరిగి ఉంటుంది అని అంచనా వెయ్యవచ్చు. మతం యొక్క పుట్టుకకి ఆధారాలేమిటి? చనిపోయిన వారిని ఉద్దేశపూర్వకంగా భూమిలో సమాధి చెయ్యడం, ఆ చనిపోయిన వ్యక్తితో పాటు అతని వస్తువులని సమాధిలో ఉంచడాన్ని మత ఆచారంగా గుర్తించవచ్చు. పురావస్తు తవ్వకాల్లో బయటపడిన ప్రాచీన సమాధులలో అత్యంత పురాతనమయినది Israel లోని Qafzeh గుహలలో దొరికింది. అది సుమారు లక్ష సంవత్సరాల క్రితంది. (లక్ష సంవత్సరాలు – Imagine that figure !!). అందులోని ఎముకలకి ఎరుపు రంగు పూసి ఉంది. ఆ అస్థిపంజరం చేతిలో అడివి పంది దవడ ఎముక పెట్టి ఉంది. ఆ ప్రదేశంలో దొరికిన సమాధులు అన్నిటిలో ఇలాగే ఉంది. ఇది యాదృచ్చికంగా జరిగే విషయం కాదు. ఇలా చెయ్యడం ఆ కాలం నాటి ఆచారాలలో ఒకటి అయ్యి ఉండాలి. చనిపోయిన వ్యక్తుల శరీరాలకి ఒక క్రమ పద్ధతిలో అంత్యక్రియలు చెయ్యడం ఈనాటికీ ముఖ్యమయిన మత ఆచారం. దాని బీజాలు ఆటవిక యుగం మధ్య దశలోనే ఉన్నాయి అన్నమాట.

ఆ నాటి మతాలు చాలా అస్పష్టమయినవి. ఆ మతాలలో ఒక నిర్దిష్టమయిన దేవుడు ఉండే అవకాశం లేదు. ఆహారం కోసం, రక్షణ కోసం, ఉనికి కోసం ప్రకృతి మీద ఆధారపడిన ఆటవిక మానవులకి ఆ ప్రకృతిని ప్రసన్నం చేసుకోవడం అవసరం. అందుకోసం ప్రకృతి శక్తులకి పూజలు చేసారు. జంతువులని, చెట్లని ఆరాధించారు. తాము పూజిస్తున్న ప్రకృతి శక్తులకి ఒక మానవ రూపాన్ని ఆపాదించడం ఆనాటి మానవుల ఊహకి అందని విషయం.

ఇలా జంతువులకి, వస్తువులకి, దేవతలకి (మనుషులు కాని వాటికి) మనుషుల గుణాల్ని ఆపాదించడాన్ని “Anthropomorphism” అంటారు. ఉదాహరణకి “రాజుగారి ఏడుగురు కొడుకుల” కథలో చీమ మాట్లాడుతుంది. మాట్లాడటం అనేది మనుషుల లక్షణం. దానిని చీమకి ఆపాదించడం ఇక్కడ గమనించాల్సిన విషయం. గుండ్రంగా ఉండే సూర్యుడికి మనిషి ఆకారాన్ని ఇచ్చి, ఏడు గుర్రాల రధాన్ని ఆపాదించడం ఇంకొక ఉదాహరణ. కేవలం రూపాన్ని మాత్రమే కాదు. మానవ సహజమైన ఉద్వేగాలని కూడా దేవతలకి ఆపాదించడం జరుగుతుంది. “శివుడు ముక్కోపి”. కోపం మానవ లక్షణం. దాన్ని శివుడు అనే దేవునికి ఆపాదించారు. వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి కూడా తమకి ఉన్నట్టుగానే భావోద్వేగాలు ఉంటాయనే భ్రమ చాలా సహజంగా కలుగుతుంది. కానీ అవే వస్తువులకి, జంతువులకి, ప్రకృతి శక్తులకి వాటి సహజ రూపాన్ని కాక మానవరూపాన్ని ఇవ్వడానికి కొంత ఊహాశక్తి అవసరం. ఆ ఊహ ఎవరైనా చెయ్యగలిగినా, దాన్ని వర్ణించి చెప్పాలంటే తగినంత భాష కావాలి, బొమ్మ గీసి చూపించడానికి చిత్ర కళ కావాలి, శిల్పం చెక్కి చూపించడానికి శిల్పకళ (చెక్కడానికి కావలిసిన పనిముట్లు కూడా) కావాలి. ఇవన్నీ అప్పటికి ఇంకా శైశవ దశలోనే (initial stages) ఉన్నాయి.

ఆటవిక మతాల స్వరూపం

లక్ష సంవత్సరాల క్రితం ఉన్న మతాలు కచ్చితంగా ఇవ్వాళ మనం చూస్తున్న మతాల లాగా ఉండి ఉండవు. వాటి స్వరూపం, స్వభావం చాలా వేరుగా ఉండి ఉండాలి. ఆనాటికి మనిషి దేవుడు అనే భావనని కల్పించుకోగలిగాడా? ఒకవేళ కల్పించుకుని ఉంటే ఆ దేవుని రూపం ఎలా ఉండేది?

ఆటవిక యుగం మధ్య దశలో మానవులు ఇంకా అరణ్యాలలో, కొండ గుహలలో నివసిస్తున్న వారే. ఇళ్ళు కట్టుకోవడం అప్పటికి ఇంకా వారికి తెలియదు. వారిది గుంపు జీవితం. పదుల సంఖ్యలో జనాభా ఉండే చిన్న చిన్న గుంపులుగా (Bands) జీవించేవారు. ఏ గుంపు ఆచారాలు దానివే. ఏ గుంపు నమ్మకాలు దానివే. ఈ ఆచారాలు, నమ్మకాలు అన్నిటిని కలిపి ఆ గుంపు యొక్క మతం అనవచ్చు. భౌగోళికంగా (Geographically) దగ్గరి ప్రదేశాలలో ఉండే గుంపుల మతాలలో కొన్ని సారూప్యతలు (similarities) ఉండవచ్చు.

vinod1

ఆటవిక యుగం ఎగువ దశ నాటి మానవులు – ఊహా చిత్రం

ఇలా ఏ గుంపు మతం ఆ గుంపులోనే ఒక తరం నుంచి ఇంకొక తరానికి అందివ్వబడుతూ సజీవంగా ఉంటుంది. భౌతిక పరిస్థితులలో (Physical conditions) చెప్పుకోదగిన మార్పులు రానంతవరకూ ఎన్ని వేల సంవత్సరాలయినా ఇది ఇలాగే కొనసాగుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి ఒక case study కావాలి.

 Andamanese Case Study

 తూర్పు బంగాళాఖాతంలోని అండమాన్ దీవులలో ఉండే “అండమానీస్” ఆటవిక జాతులు మన అధ్యయనానికి చాలా చక్కటి Case Study. వాళ్ళు ఇంకా ఆటవిక యుగంలోనే ఉన్నారు.

కొన్ని వేల సంవత్సరాల పాటు బయట ప్రపంచంతో సంబంధాలు లేకుండా ఉండటం వలన వారు ఇప్పటికీ సహజమయిన పరిణామ క్రమంలో, తమ స్వంత అనుభవాలతో, చాలా నెమ్మదిగా అభివృద్ధి చెందుతూ వస్తున్నారు.

vinod3

 

1789లో మొదటి సారి అండమాన్ లో బ్రిటీష్ కాలనీ ఏర్పాటు చేసినప్పుడు, అండమాన్ దీవులలో మొత్తం నాలుగు ఆటవిక జాతులు ఉన్నాయి. ఉత్తరం వైపు ఉన్న 200 పైగా దీవులలో “గ్రేట్ అండమానీస్”, మధ్య భాగంలో “జరవ”, దక్షిణాన ఉన్న ద్వీపంలో “ఒంగీ”, పశ్చిమాన దూరంగా ఉన్న ద్వీపంలో “సెంటినిలీస్” ఉన్నారు.

ఈ నాలుగు జాతుల వారూ ఆటవిక యుగం ఎగువ దశలో ఉన్నారు. వేటాడి ఆహారాన్ని సంపాదిస్తారు. విల్లు, బాణాలని వాడతారు. ఆకులని, పీచుని గోచీలుగా కట్టుకుంటారు. ఆకులని నేల మీద పరుచుకుని నిద్రపోతారు. మొక్కలు పెంచడం తెలియదు. మట్టితో పాత్రలు చెయ్యడం తెలియదు. ఎర్రమట్టితో శరీరం మీద రంగు పూసుకోవడం మాత్రమే వారికి తెలిసిన కళ. పాటలు పాడగలరు, కథలు చెప్పగలరు. వాళ్ళలో కొన్ని గుంపులకి నిప్పు యొక్క ఉపయోగాలు తెలుసు కానీ నిప్పుని తయారు చెయ్యడం తెలియదు. పిడుగుల వల్ల తగలబడిన చెట్ల యొక్క బొగ్గుని నిప్పు ఆరకుండా చెట్టు తొర్రల్లో పెట్టి జాగ్రత్తగా కాపాడుకుంటారు. వీటిని బట్టి అభివృద్ధి క్రమంలో మిగతా ప్రపంచం కంటే వారు ఎంత వెనకపడి ఉన్నారో మనం అర్థం చేసుకోవచ్చు.

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ జాతుల మతాల గురించి కొంత చెప్పుకోవాలి. వాళ్ళ నమ్మకం ప్రకారం మనుషులు, ఆత్మలు (Spirits) కలిసి జీవిస్తారు. ఆత్మలు మనుషులతో సంబంధాలు కలిగి ఉంటాయి. చనిపోయిన వారికి రెండు దఫాలుగా అంత్యక్రియలు ఒక పధ్ధతి ప్రకారం జరగాలి. అలా జరిగితే అవి మంచి ఆత్మలయ్యి సహాయం చేస్తాయి. అలా జరగకపోతే చెడ్డ ఆత్మలయ్యి హాని చేస్తాయి. మనుషులకి వచ్చే రోగాలు ఆత్మల వల్ల వస్తాయి. చెట్లకి, జంతువులకి అన్నిటికీ ఆత్మలుంటాయి అని నమ్ముతారు.

ప్రతి గుంపులో ఒక మంత్రగాడు ఉంటాడు. అతనికి ప్రత్యేకంగా ఆత్మలతో సంభాషించే శక్తి ఉందని నమ్ముతారు. ఏదైనా అవసరం, ఆపద వచ్చినప్పుడు ఇతను ఆత్మలనీ, చనిపోయిన వ్యక్తులని ఆవాహన చేసి వారితో మాట్లాడతాడు. సాధారణంగా నిప్పుని ఆరిపోకుండా చూసే బాధ్యతా, మూలికలతో వైద్యం చేసే బాధ్యతా ఈ మంత్రగాడే నిర్వహిస్తాడు. సాధారణంగా గుంపు కి ఒకడే మంత్రగాడు ఉంటాడు. వాళ్ళ దేవుని గురించి కథలు, పాటలు, ఆచార పద్ధతులు ఈ మంత్రగాడే బట్టీ పడతాడు. అతని తరవాత మంత్రగాడయ్యే వ్యక్తికి ఇవన్నీ నేర్పిస్తాడు. ఇలా మంత్రగాడు కేంద్రంగా నడిచే మత పద్ధతిని “Shamanism” అంటారు. మతం యొక్క ప్రాచీన రూపాలలో ఇది ఒకటి. దాదాపు అన్ని ఆటవిక జాతులలో దీని ఛాయలు మనం చూడవచ్చు.

vinod2

గ్రేట్ అండమానీస్ జాతిలోనే ఒక గుంపు నమ్మకం ప్రకారం – “శాడిల్” కొండ మీద “పులుగా” అనే దేవుడు ఉంటాడు. “భూమ్మీద” జరిగేవన్నీ ఆ దేవుడి ఆజ్ఞ ప్రకారమే జరుగుతాయి. పులుగా కి ఆగ్రహం వచ్చే పని ఏదీ చెయ్యకూడదు. పులుగాకి ఒక కొడుకు, అనేక మంది ఆడ పిల్లలు ఉన్నారు. ఆగ్రహమొస్తే తన కూతుర్లైన అడవి, సముద్రాలకి చెప్పి హాని చేయిస్తాడు. సూర్యుడు చంద్రుడికి భార్య. నక్షత్రాలు వాళ్ళ పిల్లలు. అండమానీస్ మతంలో వేరే “లోకం” అంటూ ఏమీ లేదు. వారి ఊహ ఇంకా అంత ఎదగలేదు.

వాళ్ళ నమ్మకాలు వాళ్ళ జీవితంలో ఎంతలా మమేకమయిపోయాయంటే వాళ్ళు తమ మతానికి ఒక పేరు కూడా పెట్టుకోలేదు. వాళ్లకి “మతం” అనే పదానికి అర్థం కూడా తెలియదు. వాళ్ళు నమ్ముతున్నవన్నీ నిజాలే అని అనుకుంటారు. వాళ్ళ నమ్మకాలకీ వాస్తవ ప్రపంచానికీ ఉన్న తేడా వాళ్లింకా గుర్తించలేదు.

ఒక బయట వ్యక్తిగా గమనిస్తే మనకి ఆ ఆటవికుల అమాయకత్వం (అజ్ఞానం) చాలా సులభంగా అర్థమవుతుంది. ప్రకృతిని అర్థం చేసుకునే క్రమంలో వారికి ఏర్పడిన భ్రమలని నిజం అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళ నమ్మకాల్లోనే వాళ్ళు అడవి, సముద్రాల నుంచి ఎంత భయపడుతున్నారో అర్థమవుతుంది. అందుకని పులుగా కి కోపం తెప్పించకుండా ఉంటారు. “పులుగా ఆజ్ఞ ప్రకారమే భూమ్మీద అన్నీ జరుగుతాయి” అని నమ్ముతారు. వారికి తెలిసిన భూమి ఎంత? ఆ నాలుగు ద్వీపాలు, సముద్రమే వాళ్లకి తెలిసిన భూమి!! ఆటవికులుగా వారి అజ్ఞానాన్ని మనం అర్థం చేసుకోవచ్చు.

ఇంకోవైపు అభివృద్ధి క్రమంలో అండమాన్ ఆటవికుల కంటే మిగతా ప్రపంచం దాదాపు 60,000 సంవత్సరాల ఎగువన ఉంది. ఇన్ని వేల సంవత్సరాల అభివృద్ధి తరవాత కూడా నేటి మతాలు ప్రచారం చేసేవి ఇలాంటి నమ్మకాలనే ! “దేవుడు ఫలానా కొండ మీద ఉంటాడు”, “ఫలానా దేవుడి ఆజ్ఞ ప్రకారం భూమ్మీద అన్నీ జరుగుతాయి”, “ఆత్మలు, శక్తులు, వగైరాలు”, “దేవుడికి ఆగ్రహం తెప్పిస్తే కీడు జరుగుతుంది” ఇలాంటి నమ్మకాలు ఈనాటికీ ప్రజల్లో బలంగా ఉన్నాయి. మతపరంగా మానవ జాతి ఆటవికుల స్థాయి కంటే ఏం ఎదిగినట్టు? ఇది ఇంకా లోతుగా అధ్యయనం చెయ్యాల్సిన విషయం.

అండమాన్ లోని నాలుగు జాతుల వారికీ నాలుగు విభిన్నమయిన భాషలున్నాయి. ఏ జాతి వారికీ ఇంకొక జాతి వారి భాష తెలియదు. “సెంటినిలీస్” గురించి సామాచారం లేదు కానీ మిగతా మూడు జాతులకీ వారి వారి సొంత ఆచారాలు, నమ్మకాలు ఉన్నాయి.

ఆ దీవులకి మానవులు షుమారు 70,000 సంవత్సరాల క్రితం చేరుకున్నారు అని అంచనా. మొదట్లో ఈ నాలుగు జాతులూ ఒకే మూల జాతి నుంచి వేరుపడి వేరు వేరు ప్రదేశాలలో స్థిరపడి ఉండవచ్చు. కాల క్రమేణా ఇతర జాతులతో సంబంధాలు తెగిపోయి దేనికవే ఒక కొత్త జాతి లాగా రూపు తీసుకుని ఉంటాయి. ప్రతి జాతికీ దాని స్వంత భాషలు అభివృద్ధి చెందాయి. అన్ని వేల సంవత్సరాలుగా దగ్గరి దగ్గరి ద్వీపాలలో ఉంటున్నా ఆ జాతుల మధ్య మళ్ళీ కనీస సంబంధాలు కూడా ఏర్పడలేదు. కారణం?

ఆటవికులకు వేటే జీవనాధారం. వాళ్లకి ఆహారాన్ని భద్రపరుచుకునే పద్ధతులు తెలియవు. కాబట్టి ఏ రోజుకు ఆ రోజు వేటాడి తెచ్చుకోవాల్సిందే. వాళ్లకి నివసించడానికి ఇళ్ళు కూడా ఉండవు, వేటలో జరిగే జన నష్టం, ఎండలు, వానలు, రోగాల వల్ల కలిగే ప్రాణ నష్టాలని తట్టుకుంటూ జనాభాని కాపాడుకోవడానికి నిరంతరం ప్రకృతితో పోరాడాల్సి వస్తుంది.

మనుషులు ఆహారం కోసం వేట మీద ఆధారపడకుండా స్వంతంగా ఆహారాన్ని ఉత్పత్తి చేసుకుని (వ్యవసాయం ద్వారా, జంతువులని మచ్చిక చేసుకోవడం ద్వారా), దాన్ని నిలవ చేసుకునే పరిజ్ఞానం సంపాదించుకున్నాక పరిస్థితుల్లో మార్పు వస్తుంది. ఆహారం పుష్కలంగా దొరుకుతుంటే జనాభా వృద్ధి అవుతుంది, పెరుగుతున్న జనాభా కోసం ఎక్కువ ప్రదేశం కావాలి. బయటి ప్రదేశాలకి విస్తరించాల్సిన అవసరం వస్తుంది. ఈ విస్తరణ క్రమంలో కొత్త జాతులతో సంబంధాలు ఏర్పడతాయి.

vinod4

జరవ ఆటవిక జాతి ప్రజలు

అండమాన్ దీవులలో దట్టమయిన అడవులు ఉన్నాయి. అక్కడ మచ్చిక చేసుకోగల జంతువులు పెద్దగా లేవు. పంటలు పండించేందుకు అనువైన భూమి కూడా పెద్దగా లేదు. ఇంకో మాటలో చెప్పాలంటే అభివృద్ధికి అవసరమయిన భౌతిక పరిస్థితులు (physical conditions) అక్కడ లేవు. ఇన్ని ప్రతిబంధకాల వల్ల ఆ జాతుల వాళ్ళు ఇంకా ప్రకృతితో పోరాడుతూ ఆటవిక యుగంలోనే ఉండిపోయారు. వారి జనాభా కూడా ఎప్పుడూ అంతంత మాత్రంగానే ఉండింది. కాబట్టి అక్కడి జాతులకి వాళ్ళ ప్రాంతాలు దాటి బయట ప్రదేశాలకి విస్తరించాల్సిన అవకాశం కలగలేదు అని చెప్పవచ్చు. అందువల్ల ఆ నాలుగు జాతులు ఒకరితో ఒకరికి సంబంధాలు లేకుండానే జీవిస్తున్నాయి.

ఏవైనా తాత్కాలిక అవసరాల కోసం సంబంధాలు ఏర్పడినా భాషలు వేరు వేరుగా ఉండటం వలన అవి ఎక్కువ కాలం నిలబడవు. భాష ఇంకొక ప్రధాన ప్రతిబంధకం. సంబంధాలు ఏర్పడలేదు కాబట్టి ఒక జాతి యొక్క మతం ఇంకొక జాతిలోకి ప్రవేశించే అవకాశం లేదు. ఇలా కొన్ని వేల సంవత్సరాల పాటు ఏ జాతి మతం ఆ జాతికే పరిమితమయిపోయింది. అలాగే ఉండనిస్తే ఇంకా అనేక వేల సంవత్సరాల పాటు అలాగే ఉంటుంది.

అండమాన్ దీవులలోనే “జంగిల్” అనే జాతి ఆటవికులు కూడా ఉండేవారు. వారికి కూడా ప్రత్యేకమయిన భాష, మతము, దైవం ఉండేవి. 1920 నాటికి జంగిల్ జాతి పూర్తిగా అంతరించిపోయింది. వారితో పాటే వాళ్ళ మతం, వాళ్ళ దేవుడు కూడా అంతరించిపోయాడు.

Andamanese Case study ని బట్టి మనం ఒక విషయం అర్థం చేసుకోవచ్చు. మతం, దేవుడు అనే భావనలు మనుషులు ప్రకృతి ని అర్థం చేసుకునే క్రమంలో మనుషులు కల్పించుకున్న భావనలు. వాటి పెరుగుదల, తరుగుదల, వాటిలో వస్తున్న మార్పులూ, అన్నీ మాన సమాజంలోని భౌతిక పరిస్థితుల మీద ఆధారపడి ఉంటాయి.

వచ్చే వారం వ్యాసంలో మతము, దేవుడు అనే భావనల అభివృద్ధి మీద ఎలాంటి భౌతిక పరిస్థితుల ప్రభావం ఉంటుంది, వాటి ప్రభావం వల్ల మతం లో వచ్చే మార్పులు ఏమిటి అనేవి చర్చిద్దాం.

*

మీ మాటలు

*