-ఓల్గా
~
ఆ రోజు సాయంత్రం పని ముగించుకుని డాక్టర్ రంగనాయకమ్మ గారి హాస్పిటల్కు వెళ్ళింది శారద. ఆమె దగ్గర ఎప్పుడూ ఒకరిద్దరు అనాథ స్త్రీలు నర్సుగా శిక్షణ పొందుతూ బతుకుతుంటారు. ఎవరినైన తన దగ్గరకు పంపితే వాళ్ళు కాస్త తెలివైన వాళ్ళయితే సుభద్ర లేని లోటు తీరుతుంది. లేకపోతే తనకు హాస్పిటల్లో చాలా కష్టమవుతుంది.
రంగనాయకమ్మ గారికి కాన్పు కేసు ఉండి లేబర్ రూంలో ఉండటంతో. శారద చనువుగా ఇంట్లోకి వెళ్ళింది. చలంగారు, పద్మావతిగారు, ఇంకొంతమంది కూర్చుని ఉన్నారు.
శారదను పద్మావతి గుర్తుపట్టి లేచి వచ్చింది.
‘‘బాగున్నారా డాక్టర్’’ అంటూ కావలించుకుంది. మద్రాసులో రెండు కుటుంబాల మధ్యా స్నేహం ఉండేది. శారదను ‘అక్కా’ అని పిల్చేది పద్మావతి.
‘‘నువ్వెంత బాగున్నావు పద్మా – చాలా అందంగా ఉన్నావు” అంది శారద.
‘‘అందుకే సినిమావాళ్ళు వెంటపడుతున్నారు’’ చలంగారు చురక వేశారు.
‘‘మీ స్నేహితురాలుండేది – ఏం పేరు? గుర్తురావటం లేదు. వాళ్ళమ్మ ఇంకో అమ్మాయిని చేరదీసింది. రాజ్యం అని. ఆ పిల్ల ఇపుడు సినిమా ప్రపంచానికి రాణి . చాలా అందమైనదిలే. నటన కూడా తెలుసు. మీ స్నహితురాలేం చేస్తోంది’’.
‘‘డిల్లీలో ఉందనుకుంటా. మంచి ఉద్యోగం, భర్త,పిల్లలు , సంసారంలో పడి పోయింది’’.
‘‘మంచి పని చేసింది. నాకు ఇల్లు, నాటక కళా రెండూ కావాలని కష్టపడుతున్నాను. నువ్వు రాజకీయాలు , వైద్యం, ఇల్లు ఎట్లా చూసుకుంటున్నావక్కా ? ’’
‘‘రాజకీయాు ఆయన చూసిపెడతాడు. ఇల్లు వాళ్ళమ్మ చూసిపెడుతుంది. వైద్యం మాత్రం ఆమే చూసుకుంటుంది. మన వొయ్యి లాగానే’’ అన్నారు చలం .
డాక్టర్ రంగనాయకమ్మను కుటుంబంలో అందరూ వొయ్యి అంటారు.
శారద ఆశ్చర్యంగా ఆయన వంక చూసింది. ఆయన అన్ని మాటలు తన గురించి మాట్లాడటం అదే మొదటిసారి.
శారదకు ఒక్కక్షణం ఆయనకు తన బాధ చెబుదామా అనిపించింది. మరుక్షణంలో ఆ ఆలోచనని తుడిచేసింది. తన సమస్య తనే పరిష్కరించుకోవాలి. మరెవరికీ ఆ శక్తి ఉండదు. తను సమర్థురాలని ముందు తను నమ్మాలి. ‘‘నా రాజకీయాలు నేనే చూసుకుంటాను. నా పనులు నావే. ఇల్లంటావా ? ఇల్లు ఇంకా ఫ్యూడల్ దశలోనే ఉంది కాబట్టి మా అమ్మ దానిని పట్టుకుని ఒదటం లేదు. ఒదిలిన రోజు దానిని నేననుకున్నట్లు ఒక సామాజిక ప్రదేశంగా చేసేస్తాను. వైద్యం నేనే చేస్తానని మీరే ఒప్పుకున్నారు. గాబట్టి పేచీ లేదు’’ అని గలగలా నవ్వింది శారద.
‘‘నీ నవ్వు వల్ల నీ మాటలు నమ్ముతున్నాను’’. అన్నారు చలం శారదను మెచ్చుకోలుగా చూస్తూ
‘‘శారద గురించి నీకు తెలిసింది తక్కువ. ఎక్కువ మాట్లాడొద్దు. ఆమెలాంటి మనుషులుండరు’’ అంది పద్మావతి.
‘‘తక్కువ కాదు. అసలు మాట్లాడను’’ అంటూ మౌనంలోకి వెళ్ళిపోయారాయాన. పద్మావతి సుబ్బమ్మ గారెలా ఉన్నారని అడిగింది.
‘‘ఒకసారి ఒచ్చి చూడరాదూ ` అమ్మ సంతోషిస్తుంది. నీ గురించి ఎప్పుడూ తల్చుకుంటుంది. మీరు వేసిన నాటకాలు వంటివి పద్మావతి కూడా వేయరాదా అని గొణుగుతుంటుంది’’.
పద్మావతి నవ్వేసింది ‘‘ఏదో ఒక నాటకాలు వెయ్యమనే అమ్మ ఉంది నీకు. అదృష్టవంతురాలివి .
‘‘మీ ఆయనేమంటున్నారు? ఎలా ఉన్నాడు?’’
‘‘ఎప్పుడూ అనేదే. కొత్త ఏముంది. ఆయన సహకారం లేనిదే నా కళారాధన కుదురుతుందా?’’
శారద నవ్వుతూ ‘‘వెళ్ళేలోగా మా ఇంటికొక్కసారి రండి ’’ అంటుండగా రంగనాయకమ్మ ఒచ్చింది.
‘‘ఏంటి శారదా ? నీకు మా ఇంటికొచ్చేంత తీరికెలా దొరికింది’’
‘‘తీరికుండి కాదు. పనుండి వచ్చాను’’.
శారద తనొచ్చినదెందుకో చెప్పింది. రంగనాయకమ్మ లేచి ‘‘రా హాస్పిటల్కి వెళ్దాం. ఒకమ్మాయిని చూపిస్తా. నీకు నచ్చితే తీసుకుపోదువు గానీ ` ’’ ఇద్దరూ లేచి హాస్పిటల్కు వెళ్ళారు.
శారదకు క్ష్మిల బాగా నచ్చింది. అంత బాగా నచ్చకపోయినా తీసుకునేదే. రంగనాయకమ్మకు థాంక్స్ చెప్పి లక్ష్మిని రెండు రోజుల్లో తన దగ్గరకు రమ్మని చెప్పింది. క్ష్మిల కొత్తచోటు ఎలా ఉంటుందోనని భయపడుతుంటే ‘‘ఈ దేశంలోనే ఆమెకంటే మంచి మనిషి ఉండదు. హాయిగా వెళ్ళు. మళ్ళీ నేనిటు రమ్మన్నా రానంటావు “అంది రంగనాయకమ్మ.
క్ష్మిల ఆశ్చర్యంగా చూస్తుంటే ‘‘నే చెప్పింది నిజమే. ఆమెలాంటివాళ్ళు చాలా తక్కువమంది ఉంటారు. నీ జీవితానికి మంచి దారి చూపిస్తుంది’’ అన్నది. క్ష్మిల భర్తనొదిలేసి వచ్చి రంగనాయకమ్మని ఆశ్రయించింది. ఆమె పడ్డ బాధలన్నీ విని డాక్టర్గా అన్ని రకాలు వైద్యాలు చేసి, తన దగ్గరే ఉంచుకుంది. అలా వాళ్ళింట్లో ఎప్పుడూ నలుగురైదుగురు ఉండేవారు. కొందరు పిల్లలని డాక్టర్ గారి దగ్గర ఒదిలేసేవారు. వాళ్ళు ఆ ఇంట్లో పిల్లలతో పాటు పెరిగే వారు. డాక్టర్గా ఆమెవారిని చేరదీస్తే , చలం తన పిల్లలతో పాటు వారికీ ప్రేమాభిమానాలు పంచేవాడు. అదొక సామాజిక కుటుంబంగా చూసే వారికి కొత్తగా, వింతగా, కొందరికి రోతగా అనిపించేది.
రెండు మూడు రోజులు మూర్తి, శారద మధ్య ముభావంగా గడిచిపోయాయి. ఇద్దరికీ మాట్లాడాలని ఉంది గానీ ఎవరూ చొరవ తీసుకోలేదు. మూర్తికి ఇంతలో మద్రాసు వెళ్ళాల్సిన పనిబడింది.
‘‘నువ్వూ రారాదు ? ’’ అని అడ గాడు.
‘‘రాను . నాకు చాలా పనులున్నాయి “ . అని అక్కడ నుంచి వెళ్ళిపోయింది.
మూర్తి వెళ్ళాక ఒక రోజంతా ఆస్పత్రి పనులతో తీరిక లేకుండా గడిచింది. చాలా రోజు నుండీ చేయించాల్సిన చిన్న చిన్న రిపేర్లు – పాతబడిన వస్తువులు తీసెయ్యటం. కొత్తవి తెచ్చి సర్దటం – అందరితో కలిసి శారద కూడా పని చేసింది. సంక్రాంతి నెల. కాన్పు కోసం తప్ప ఆస్పత్రికి ఎక్కువ మంది రారు. కాస్త తీరిక దొరికింది.
మహిళా సంఘం మీటింగులతో మరో రెండు రోజులు గడచిపోయాయి. అనేక నిర్ణయాలు తీసుకున్నారు. శారద కూడా అదనపు బాధ్యతలు తీసుకోక తప్పలేదు. సుభద్రతో స్నేహంగా మాట్లాడి ఆమె బెరుకు పోగొట్టింది. రెండు రోజుల పాటు అంతమంది స్త్రీలతో గడిపి అందరి సమస్యలూ పంచుకునేసరికి శారద మనసు కూడా ఉల్లాసంగా మారింది. ముఖ్యంగా సుభద్ర తను పూర్తికాలం పార్టీ కార్యకర్త అయినందుకు పడే సంతోషం, గర్వం చూశాక, పార్టీ అంటే ఆమెకున్న అంకితభావం చూశాక శారదకు మూర్తి చేసిన పని సబబుగానే తోచింది.
‘తనతో చెప్పలేదే’ అన్నదొక్కటే కలుక్కుమంటోంది మనసులో. ఆ సాయంత్రం మీటింగు ముగిశాక అందరూ వెళ్ళిపోయారు. మెల్లీ మాత్రం మిగిలింది.
‘‘నువ్వేమిటో బాధ పడుతున్నావు చెప్ప’’ మని ఒత్తిడి చేసింది. మెల్లీ తనను అంతగా పరిశీలించి అర్థం చేసుకున్నందుకు ఆశ్చర్యపడుతూ అంతా చెప్పింది శారద.
మెల్లీ మౌనంగా విని కాసేపు ఆలోచించి –
‘‘కామేశ్వరరావు విషయం నువ్వు మూర్తితో మాట్లాడలేదు గదా. అతనికి కోపం వస్తే అది నీ నిర్ణయమన్నావు కదా ` అప్పుడు అతని గురించి నువ్వు ఆలోచించలేదు. అతను దానికి బదులు తీర్చుకున్నాడు. మీరిద్దరూ అనేక విషయాలు కలిసి నిర్ణయించుకోవాల్సి వస్తుంది.
ఇవాళ ఏం కూర వండమంటారు అని మాత్రమేఅడిగే మామూలు గృహిణివి కాదు నువ్వు. నీకో కొత్త చీరె కొని నగలు చేయించి లోబరుచుకునే మామూలు భర్త కాదు అతను. మీరు మీ హద్దులు స్పష్టంగా గుర్తించాలి. ఎవరి ప్రాంతం ఏది? ఎక్కడకి ఎవరు చొచ్చుకురాకూడదు. ఎక్కడ కి ఇతరును రానీయకూడదు `- ఈ విషయాల్లో గందరగోళ పడితే చాలా బాధలొచ్చి పడతాయి. మీరు కూచుని శాంతంగా మాట్లాడుకోండి ’’.
శారద మౌనంగా ఉండి పోయింది.
‘‘శారదా – నీకు రాజకీయాలు, ఇల్లు, ఆస్పత్రి చాలా బాధ్యతలు. అంత బాధ్యతతో మూడింటినీ నడపాలి. నడుపుతున్నావు. ఆ నీ సామర్థ్యం చూసి మూర్తి భరించలేకపోతున్నాడు. మగవాళ్ళకు చాల అహం ఉంటుంది. కమ్యూనిస్టులైనంత మాత్రానా అది పోదు. వాళ్ళు మగ కమ్యనిస్టులుగానే ఉంటారు. భార్యలను భార్యలుగానే చూస్తుంటారు. వాళ్ళను మనం మార్చాలి. . దానికి చాలా ఓపిక కావాలి. మీ ఇద్దరి మధ్యా ఉన్న ప్రేమ నీకు ఆ ఓపికను ఇవ్వాలి . ఇస్తుంది’’.
మెల్లీ మాటలకు శారదాంబ మనసు కొంత కొంత మెత్త బడింది .
‘‘మీతో మూర్తి ఈ విషయాలు మాట్లాడాడా?’’
‘‘మాట్లాడాడు. ఒక మగవాడ లాగానే మాట్లాడాడు. నేను చెప్పినది విన్నాడు గానీ ఎంతవరకు అర్థం చేసుకున్నాడో అనుమానమే. ఎందుకంటే అతన్ని మార్చే శక్తి నీ దగ్గర తప్ప మరెవరి దగ్గం ఉండదు. మా అందరితో పని చేసేటపుడు అడ్డం రాని అహం నీ దగ్గరే వస్తుంది. నువ్వు భార్యవి కాబట్టి. అది చాలా సంప్రదాయ సంబంధం. దానిని మార్చాలి మనం. ఆలోచిస్తే నీకే తెలుస్తుంది. రాజీ పడొద్దు. కానీ మాట్లాడు. వివరించు. మూర్తి గ్రహించేలా చెయ్యి. ఎవరి చోటు వారు నిర్ణయించుకోండి . ఒకరి చోటునింకొకరు దురాక్రమణ చేయకండి . మొండితనం, పంతాలు ఎవరికీ మంచివి కావు. వాటిని మీ మధ్యకు రానీయకు. మాట్లాడు. అదొక్కటే మార్గం’’. మెల్లీ మాటలు మననం చేసుకుంటూ అంది శారద.
‘‘నేను అతని భార్యను కాను. సంప్రదాయం ప్రకారం అసలు కాను. నన్నతను భార్యలా చూడటం నేనూ భరించలేకపోతున్నాను’’.
‘‘సంప్రదాయం ప్రకారం భార్యవు కాదు – నిజమే. కానీ మూర్తి నిన్నలాగే చూస్తున్నాడు. నీ చుట్టూ ఉన్నవాళ్ళూ అలాగే చూస్తున్నారు. దానిని నువ్వర్థం చేసుకోవ లి. నువ్వు కోటి మందిలో ఒకతివి. కోటిమంది నిన్నర్థం చేసుకోవటం మాటలు కాదు. నువ్వు కత్తి మీద సాము చెయ్యాలని నాకు తెలుసు. కానీ తప్పదు’’
మెల్లీ మెల్లిగా శారదననునయిస్తూ మాట్లాడింది. శారద తనలోకి తను చూసుకుంటున్నట్టు మెల్లీకి చెప్పింది. ‘‘నేనూ మా ఇద్దరి సంబంధాన్నీ చాలా ఉన్నతంగా అనుకున్నాను. ‘భార్య’గా ఉండాలని నాకు లేకపోయినా లోకమంతా నన్ను మూర్తి భార్యగానే చూస్తోంది. భార్యగా కొందరూ, ఇంకో విధంగా కొందరూ మొత్తానికి మూర్తికి నా మీద మరెవరికీ లేని అధికారం ఉందని చెప్తున్నారు . నేను దానిని అంగీకరించటానికి సిద్ధంగా లేను. మూర్తితో ఆ విషయం స్పష్టంగా చెప్తాను. మేం ప్రేమికులం . కలిసి బతుకుతున్నాం. ఇద్దరు మనుషులు కలిసి బతుకుతున్నపుడు ఏవో గొడవలు, అహంకారాలు, అభిప్రాయ బేధాలు వస్తాయి. వాటి గురించి మాట్లాడి ఒకరినొకరు అర్థం చేసుకోగల పరిణితి మా మధ్యలో ఉంటేనే మా సంబంధం నిలబడుతుంది. అలా కాకుండా తరతరాలుగా భార్యాభర్తల మధ్య ఉన్న అధికార సంబంధాన్ని మా మధ్యకు మూర్తి తెచ్చాడా? ఒక్క క్షణం ఆ బంధం నిలవదు. ఆ విషయంలో రాజీ ప్రసక్తే లేదు. నన్ను నేను పోగొట్టుకోలేను.’’
శారద చేతిని తన చేతిలోకి తీసుకుని ప్రేమగా నొక్కింది మెల్లీ.
‘‘ముందు నువ్వు ఏమిటో అది తెలుసుకో’’.
శారద గలగలా నవ్వేసింది.
‘‘నేనేమిటో నాకు తెలుసు మెల్లీ – నేను ఆధునిక స్త్రీని. అనుక్షణం సమాజంతో తలపడుతూ, దానిని మార్చాలని తపనపడే ఆధునిక స్త్రీని. సమాజంలోని సకల సంబంధాలనూ మార్చే గొప్ప పూనికతో పెరిగిన ఆధునిక స్త్రీని. నాకు సంకెళ్ళు లేవని కాదు – నిరంతరం ఆ సంకెళ్ళు తెంచే పనే నాది – ఒక సంకెల తెగితే మరొకటి వచ్చి పడుతోంది. నేను పోరాడుతున్నాను . జీవిస్తున్నాను. స్త్రీగా, కమ్యూనిస్టుగా, డాక్టర్గా, కూతురిగా, తల్లిగా, ఒక పౌరురాలిగా జీవిస్తున్నాను. ఎంత ఘర్షణ మెల్లీ, ఎన్ని పరీక్షలు , ఎన్ని విజయాలు , ఎన్ని అపజయాలు ఐనా ఆనందంగా ఉంది. నేను నేనైనందుకు ఆనందంగా ఉంది. గర్వంగా ఉంది. జీవితం అంటే ఇట్లా ఉండాలనిపిస్తోంది. సవాళ్ళతో, సందిగ్ధతతో, ప్రశ్నలతో, సమాధానాలతో, ఎలాంటి సమయంలో జీవిస్తున్నామో కదా మనందరం’’
వెలుగుతున్న శారద ముఖంలోకి చూస్తూ ఉండి పోయింది మెల్లీ.
***
మేడం గారికి కేంద్ర సాహిత్య పురస్కారం రావడం
నిజంగా సంతోషం. తెలుగు సాహితీకారులందరికీ
గర్వకారణం..