గమనమే గమ్యం -25

 

img549

 

 

బెంగాల్‌ కరువు గురించి చిన్నగా మొదలైన వార్తలు  కొన్ని రోజుల్లోనే దేశాన్ని ఒణికించేంత పెద్దవయ్యాయి. బెంగాల్‌ ప్రజలకు సహాయం చెయ్యాలనే ప్రచారంతో ప్రజలను చైతన్యపరుస్తున్నారు కమ్యూనిస్టు యువతీ యువకులు. వారిలో కొందరు పాటలు రాశారు. మరికొందరు నాటకాు తయారు చేశారు. కొందరు ఒక బృందంగా  ఏర్పడి బెంగాల్‌ వెళ్ళి కరువుని స్వయంగా అధ్యయనం చేయాలనీ, దానితో పాటు వాలంటీర్లుగా అక్కడ పని చేయాలనీ నిశ్చయించుకున్నారు. ఆ బృందం లో  కామేశ్వరం వు ఉన్నాడని  తెలిసి శారదకు ఆందోళనగా ఉంది.

కామేశ్వరరావు శారదకు మంచి స్నేహితుడు. మేధావి. బాగా చదువుతాడు. శారదతో దీటుగా చర్చలు  చేయగల  సామర్థ్యం ఉన్న వాడు. కానీ అతి సున్నిత హృదయుడు. ఎదుటివారు బాధపడుతుంటే చూడలేడు. వారి కళ్ళు తడి  కాకముందే ఇతని చెంపలు  కన్నీటితో తడిసిపోత యి. అలాగే హటాత్‌ నిర్ణయాలు  తీసుకుంటాడు. కొన్ని రోజులు  ఎవరికీ కనపడకుండా ఎటో వెళ్ళిపోతాడు. ఇలాంటివాడు ఆ కరువు దృశ్యాలు  చూసి భరించగలడా అని శారదకు భయం వేసింది. వార్తల్లో చదువుతుంటేనే ఒళ్ళు జలదరించి, అన్నం సహించటం లేదు. కామేశ్వరావు అవన్నీ చూసి మనిషిలా తిరిగి రాగలడా అనిపించింది. కానీ ఏం లాభం ఎవరు చెప్పినా  వినే మనిషి కాదు. ఈ బృందంతో వెళ్ళకుండా బలవంతంగా ఆపినా  ఒక్కడే ఏదో ఒకరోజు కలకత్తా రైలు  ఎక్కేయగల  సమర్థుడు. దానికంటే పదిమందితో కలిసి వెళ్ళటమే నయం అనుకుని ఆందోళన అణుచుకుంది.

olgaఅణుచుకోలేని సమయంలో మూర్తితో చెబితే ‘‘నువ్వు ఇన్ని విషయాలు  ఎందుకు పట్టించుకుంటావు. ఒకవైపు ప్రజాయుద్ధ ప్రచారం. మహిళా సంఘం సభ్యులు . నీ హాస్పిటలు , పార్టీ సమావేశాలు  వీటన్నిటితో మళ్ళీ కామేశ్వరరావు ఏమవుతాడు? సోమేశ్వరరావు  ఏమవుతాడు అని ఒక్కొక్కరి గురించి పట్టించుకుంటే నీ ఆరోగ్యం ఏమవుతుంది. ఒక మనిషి చేసే  పనులేనా  నువ్వు చేసేది? అందరి బాధ్యతలూ  నువ్వేనా  మోసేది? కామేశ్వరరావు సంగతి తరువాత,  కాస్త నటాషా గురించి కూడా ఆలోచించు’’ అని మనసులో కోపమంత వెళ్ళగక్కి వెళ్ళాడు.

శారద ఈ ఉరుములేని పిడుగుల  జడి కి ఆశ్చర్యపోయింది? ఏమయింది మూర్తికి? ఏదో జరిగింది. లేకపోతే ఇంత ఉద్రేకపడడు అనుకుని మేడమీది నుంచి కిందకు దిగింది. కింద సుబ్బమ్మ నటాషాని ఎత్తుకుని నిలబడి ఉంది.

‘‘డాక్టరుగారి కూతురికి కాస్త ఒళ్ళు వెచ్చబడింది. డాక్టరు గారి మొగుడికి కోపం వచ్చింది’’ అన్నది తమాషాగా.

శారదకంతా అర్థమైంది. నటాషాను ఎత్తుకుని మేడమీదికి వెళ్ళి మందు తాగించి  నిద్రబుచ్చి మళ్ళీ భుజాన వేసుకుని వచ్చి తల్లికప్పగించింది.

‘‘ఇవాళ అన్నం పెట్టకమ్మా. పాలు చాలు . రేపటికి తగ్గిపోతుంది’’.

‘‘నీ కూతురి గురించి మీ ఆయనకు దిగులు . నా  కూతురి గురించి నాకు దిగులు.   మరీ పనులెక్కువవుతున్నాయి. తిండి  తినటం లేదు. నిద్ర పోవటం లేదు. ఎట్లాగమ్మా ఇట్లాగయితే’’.

‘‘ఏం ఫరవాలేదమ్మా. మా అమ్మ నా  పొట్ట మాడనివ్వదు. ఎలాగోలా నిద్రబుచ్చుతుంది’’.

సుబ్బమ్మ నవ్వి ‘‘మాటలు  చెప్తావ్‌. మూర్తి మాత్రం బాగా దిగుపడుతున్నాడు. అతను మద్రాసు నుంచి వచ్చినా  నీకు తీరిక దొరకదు. అక్కడున్నా  నీ గురించిన బెంగే కదా –  పాపం. పిల్ల కూడా నన్ను ఒదిలి తొందరగా అతని దగ్గరకు పోదు. ఈ దిగుళ్ళతో సతమతమవుతున్నాడు. తనూ ఇక్కడ కే వచ్చేస్తానంటున్నాడు.

‘‘వచ్చి ఇక్కడేం చేస్తాడు. మద్రాసు పనులు  ఎవరికి అప్పజెప్పి వస్తాడు? అతనిక్కడకి వస్తే నాకు  మాత్రం కాస్త తెరిపిగా ఉండదా? కానీ పరిస్థితులు  గందరగోళంగా ఉన్నాయమ్మా. అందరం సర్దుకుపోవాలి’’ అంటూ హాస్పిటల్‌కి వెళ్ళింది శారద.

మూర్తి బెజవాడకు వచ్చి పూర్తికాలం  ఇక్కడ పార్టీ పనులు  చూసుకోమంటున్నామని రాష్ట్ర కమిటీ నుంచి వార్త వచ్చిన రోజు శారద సంతోషించింది. ముఖ్యంగా నటాషా మూర్తి దగ్గరవుతారనీ నిశ్చింతగా అనిపించింది. ఇంట్లో వచ్చిన ఈ మార్పే కాదు బైట వాతావరణంలో కూడా మార్పు వస్తోంది.

ప్రపంచ యుద్ధంలో హిట్లరు పరాజయం  తప్పదని గట్టిగా రుజువవుతోంది. కాంగ్రెస్‌ పార్టీ క్విట్‌ ఇండియా ఉద్యమంతో ప్రజలకు దగ్గరవుతుంటే కమ్యూనిస్టులు  ప్రజాయుద్ధ పంథాతో దగ్గర అయ్యారు. అది పై తరగతి మధ్య తరగతి వర్గం లో  ఎక్కువ కనిపిస్తోంది. కృష్ణా , గుంటూరు ప్రాంతంలో చిన్న రైతులలో, కూలీలలో కూడా వారు గట్టి పట్టు సంపాదించారు. క్విట్‌ ఇండియా అంటున్న ప్రజల  మనసుల్లో కూడా సోవియట్‌ యూనియన్‌ గురించి ఆసక్తిని పెంచారు. దాని ద్వారా సోషలిజం అనే భావనను బలం గా వ్యాపింప చేయగలిగారు. శారదాంబ, ఆమె చుట్టూ ఉన్న మహిళా బృందం చేసే  పనులు  మామూలు  ప్రజలకు ఆశ్చర్యంగా ఉండేవి కానీ వారి  పట్ల విముఖత కలగలేదు. ఒకవైపు బోసు, మరొకవైపు గాంధీ నాయకత్వంలోని కాంగ్రెస్‌, ప్రజలను విపరీతంగా ప్రభావితం చేస్తున్నా, కమ్యూనిస్టు భావనలు  ప్రజలకు దగ్గరయి కమ్యూనిస్టుల  మీద గౌరవం పెరిగిందంటే అది శారద, రామకృష్ణయ్య, ఈశ్వరయ్య, వెంకట్రావు, సూర్యావతి  వంటివాళ్ళ నాయకత్వ ప్రభావమే.

జర్మనీ ఓడిపోయిన రోజున పెద్ద పండగలా ప్రజలో ఉత్సాహం  నింపగలిగారు.

olga title

రెండవ ప్రపంచ యుద్ధం ముగిసిన తర్వాత  మొదలైంది అసలు  సమస్య. ప్రజలలోకి ఎట్లా వెళ్ళాలి. ప్రజాయుద్ధ పంథా తర్వాత  ఆంధ్రప్రాంతంలో కార్యక్రమం ఏమిటి? ఈ చర్చలు  జరుగుతుండగానే ఒకవైపు ఎన్నికలు , ఇంకోవైపు తెలంగాణాలో నైజాం వ్యతిరేక పోరాటం లో  పెరుగుతున్న కమ్యూనిస్టు పార్టీ ప్రాబ్యల్యం , బెంగాల్‌లో కరువు గురించి పట్టించుకుని పని చేయాలనే నిర్ణయం, వీటన్నిటికీ తోడు కళా సాహిత్య రంగాల  ద్వారా  ప్రజల కు దగ్గరయ్యే కార్యక్రమాలు , రచయిత సంఘాల  ఏర్పాట్లు , నాటకాలు  –  ఒకటి కాదు ఆలోచించుకునే వ్యవధానం లేకుండా పనులు  వచ్చి మీద పడుతున్నాయి.

మూర్తి మద్రాసు నుంచి బెజవాడకు వచ్చేసిన రెండు నెలలకు అప్పటివరకూ శారద చూస్తున్న కృష్ణాజిల్లా బాధ్యతలు  మూర్తికి అప్పగించింది పార్టీ.

శారదకు ఆ మార్పెందుకో అర్థం కాలేదు.

‘‘నువ్వు కొత్తగా వచ్చావు. ఇక్కడ పరిస్థితుల  గురించి అవగాహన లేదు. పార్టీ నిన్ను గౌరవించటానికన్నట్లు, నీకో పని చూపటానికన్నట్లు ఈ బాధ్యత ఇచ్చిందనుకో -నువ్వెట్లా ఒప్పుకున్నావు? నా  వల్ల  కాదని ఎందుకు చెప్పలేకపోయావు?’’

శారద ప్రశ్నకు మూర్తి దగ్గర సమాధానం సిద్ధంగానే ఉంది.

‘‘నువ్వు చాల  అలిసిపోతున్నావు శారదా –  ఒకవైపు నీ ప్రాక్టీసు. ఇంకో వైపు మహిళా ఉద్యమం. ఇప్పుడు తల్లివయ్యావు. వీటన్నిటితో జిల్లా అంతటినీ నీ భుజాల కెత్తుకోవటం కష్టం. నా భుజాలు  ఖాళీగానే ఉన్నాయి. ఇక్కడ విషయాలు  నీ ద్వారా నాకు చాలా వరకు తెలుసు. తెలియనివి తెలుసుకుంటాను. పార్టీ నిర్ణయం వెనక కూడా ఇవన్నీ ఉన్నాయి’’.

‘‘గృహిణి ` భార్య, తల్లి ఈ పదాలు  నాకు నప్పవు. నచ్చవు. నువ్వు నా  జీవితంలోకి వచ్చినందువల్ల నా  జీవితం ఏమీ మారదు. మారనవసరం లేదు’’. విసుగ్గా అంది.

‘‘మారుతుందో మారదో ఆ సంగతి ముందు ముందు తెలుస్తుంది గానీ, నీకు బాధ్యతలు  పెరిగి పోయాయి. డాక్టర్‌గా నువ్వు చెయ్యవలసినంత చెయ్యలేకపోతున్నావు. నాకు  ఈ జిల్లా పనుల గురించి తెలియజెప్పటానికి నువ్వున్నావుగా’’ శారదకు ఏదో చికాకు మనసంతా – కానీ పార్టీ నిర్ణయాన్ని కాదనటం తేలిక కాదు. తను జిల్లా పార్టీ నాయకత్వం ఒదల కూడదని కాదు – తన స్థానంలో రావటానికి అర్హులైనవారు చాలామంది ఉన్నారు . సుబ్బారావుగారే ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచీ  పైకి వచ్చిన కార్యకర్త. నిజమైన కమ్యూనిస్టు. ఊరికే మాటలు  చెప్పి తప్పించుకునే మనిషి కాదు. తన జీవితంలో ఆచరించే వ్యక్తి. మూర్తికి జిల్లా బాధ్యత అప్పగించటమంటే కేవలం  తన భర్త కాబట్టే – తమ పెళ్ళి కాకపోతే అతనిక్కడకి రానే రాడు కదా – ఇంత స్పష్టంగా కనపడుతున్న విషయానికి మూర్తి కళ్ళెందుకు మూసుకున్నాడు.

ఏదేమైన పార్టీ నిర్ణయించినపుడు తనకు ఇన్ని ఆలోచను అనవసరం అని అక్కడ తో సమాధానపడింది శారద.

***

సత్యవతి నాదెళ్ళ వారి పాలెంలో మహిళాసంఘం సభ తర్వాత  వాళ్ళన్నయ్య దాసుని కలిసింది. దాసు పార్టీ నాయకులతో మాట్లాడ ఆమెను రాజమ్మతో కలిసి పార్టీ ఆఫీసు వెనక గదిలో ఉండి మహిళా సంఘం పనులు  చేసేలా ఏర్పాటు  చేశాడు. రాజమ్మది, సత్యవతిది దాదాపు ఒకే వయసు. కాస్త రాజమ్మే పెద్దదేమో. ఇద్దరూ బాగా కలిసి పోయారు. రాజమ్మ చుట్టు పక్కల గ్రామాలన్నీ తిరిగి మహిళా సంఘ ఆశయాలు  వివరిస్తూ మహిళలను సమీకరించే పని చేస్తోంది.

సత్యవతికి బెజవాడలో మహిళా సంఘం పనులు  కొన్ని అప్పగించి రాజకీయ శిక్షణ కూడా ఇచ్చేలా ఏర్పాటు  చేశారు. చెరొక 20 రూపాయలు  నెలకు ఇచ్చేవారు. అద్దె, భోజనం, మిగిలిన ఖర్చులన్నీ అందులోనే. రాజమ్మకు గ్రామాలకు వెళ్ళినపుడు అక్కడ మంచి భోజనం దొరికేది. సత్యవతికి వంట సరిగా రాదు. మొదట్లో అవస్థ అయినా  రానురానూ  అలవాటు పడింది . పార్టీ ఆఫీసులో, మహిళా సంఘంలో చురుగ్గా పని చేస్తూ, కుదురుగా ముచ్చటగా ఉంటూ, ఎంతో సంస్కారంతో మాట్లాడే సత్యవతి పార్టీ సానుభూతిపరులైన కొందరి యువకుల మనసుల్లో కల్లోలం  రేపింది. ఆ అమ్మాయిని వివాహం చేసుకోవాలనే కోరికను పార్టీ పెద్దతో చెప్పారు. అవివాహిత బాధ్యత పెద్ద బాధ్యత అని పార్టీ భావించేది. వాళ్ళకు పెళ్ళి చేస్తే  తమ గుండె మీది బరువు తగ్గి, వాళ్ళ తిప్పలు  వాళ్ళు పడరారు అనే భావన తెలిసీ తెలియకా అందరిలో ఉండేది. దానితో సత్యవతికి ఇక్కడ కూడా సంబంధాలు రావటం మొదలైంది. సత్యవతి ప్రతి సంబంధాన్నీ తిరస్కరింఛి  పార్టీ నాయకులకు చికాకు, అనవసరమే అయినా  వచ్చింది.

ఈ సత్యవతి సంగతేమిటో తేల్చమని మహిళా సంఘ నాయకులకు ఆదేశాలిచ్చారు. అది శారద వరకూ వచ్చింది. శారద జరిగిందంతా తెలుసుకొని  నిర్ఘాంత పోయింది . ‘‘సత్యవతి పెళ్ళి తప్పించుకుని చదువుకోవాలని  వస్తే  చదువు గురించి ఆలోచించకుండా సంవత్సరంలో నాలుగైదు  పెళ్ళి సంబంధాలు  ఆమె ముందు పెట్టటం ఏమిటి? ఆ అమ్మాయి ఒద్దంటే ఈ అమ్మాయికి ఎవరూ నచ్చరేమిటని కోపగించుకుని అదొక చర్చ చేయటమేమిటని అందరినీ మందలించి – మీకు వీలైతే ఆ అమ్మాయిని బెనారెస్  మెట్రిక్‌కు తయారు చేయండి . లేదంటే జనరల్‌ పుస్తకాలు  చదువుతూ ఆ అమ్మాయి తనే తంటాలు  పడ చదువుకుంటోంది. మహిళా సంఘంలో పని చేస్తుంది కాబట్టి ధైర్యం, ఆత్మ విశ్వాసం లోకజ్ఞానం పెరుగుతాయి. ఆ పిల్లకు పదహారేళ్ళే – చిన్నపిల్ల. ఇది కూడా బాల్య  వివాహమే’’ అంటూ బాగా చికాకు పడింది .

శారద మాట్లాడిన తర్వాత  ఇక సత్యవతికి పెళ్ళి చెయ్యాలనే ఆలోచన అందరూ మానుకున్నారు. సత్యవతి నిశ్చింతగా తన పని తాను చేసుకుంటోంది. ‘కన్యాశుల్కం ‘ నాటకం, ‘‘పూర్ణమ్మ’’ గేయ రూపకం సాంస్క తిక బృందాల  ప్రదర్శనల్లో ముఖ్య భాగమైపోయాయి. పార్టీ సభ్యులు  స్వయంగా నటించి కన్యాశుల్కం  నాటకాన్ని రక్తికట్టిస్తున్నారు. సుభద్ర, సుబ్బారావు దంపతు, కోటేశ్వరమ్మకు కన్యాశుల్కం  నాటకంతో బాగా పేరొచ్చింది. అంతకు ముందొకసారి ముసలి మొగుడి ని పెళ్ళి చేసుకోమనే అర్థం వచ్చే పాటులు  పాడారని మహిళా సంఘం వాళ్ళని తిట్టి మీకు ముసలివాళ్ళు పనికిరారా  అంటూ అర్థం లేని  మాటలు  మాట్లాడిన కార్యకర్తలకు బాల్య వివాహాల   గురించి, వాటి చెడు ఫలితాల   గురించి అర్థమైంది. అలాంటి మాటలు  వినిపించటం లేదు. రచయిత సమావేశాలు  తరచు జరగటంతో ఆంధ్రా ప్రాంతం లో  ఒక చైతన్యం వ్యాపించింది . అది రాజకీయాలకు సంస్కారాన్ని జతగలపటంతో కమ్యూనిస్టులంటే సంస్కారవంతులనీ, స్త్రీలను గౌరవిస్తారనే అభిప్రాయం సామాన్య జనం  లో కూడా ఏర్పడింది.

***

 

 

 

 

 

మీ మాటలు

*