గమనమే గమ్యం-12

 

olgaకాలం నెమ్మదిగా నడుస్తోందనిపించింది శారదకు. దేశం కూడా నెమ్మదించింది. అక్కడక్కడా ప్రదర్శనలూ , జండా ఎగరెయ్యటాలు  తప్ప పెద్దగా జరుగుతున్నదేమీ లేదు.

అన్నపూర్ణ, దుర్గ జైలు నుంచి విడుదలయ్యారు. అన్నపూర్ణ గుంటూరు చేరింది. దుర్గ కాకినాడ చేరింది. రామక్రిష్ణ జైలు నుంచి విడుదలై మళ్ళీ చదువు మొదలుపెట్టాడు. సత్యాగ్రహం మీద ఆశలు  పెట్టుకున్న వారందరూ నిరాశలో పడ్డారు. అన్నపూర్ణ కూతుర్ని కన్నది. స్వరాజ్యం అని పేరు పెట్టుకుంది.

సుదర్శనం, మూర్తీ, శారదా తరచు కలుస్తున్నారు.

మూర్తి తన ధోరణి ఏ మాత్రం మార్చుకోలేదు. శారద మీద అదే చనువు అదే అధికారం. మూర్తితో ఆ విషయం స్పష్టంగా మాట్లాడాలనుకుంటూనే జాప్యం చేస్తోంది శారద.

ఏదో బలహీనత తనలోనూ ఉందా అనుకుంటోంది.

కానీ శారద తనను కలుసుకోకుండా దూరంగా ఉంచుతోందని మూర్తికి అర్థమైంది. ఇంటికి వెళితే ఆహ్వానిస్తూ నవ్వుతుంది గానీ ఆ నవ్వులో జీవం ఉండదు. యాంత్రికంగా నవ్వుతున్నట్లు తెలుస్తూనే ఉంది. మిగిలిన యువకులందరూ మామూలుగానే ఉంటున్నారు  గానీ రామక్రిష్ణయ్య ముభావంగా ఉంటున్నాడు. మూర్తికి ఈ మార్పు ఎందువల్ల  వచ్చిందో అర్థమయింది. దాని గురించి శారదతో మాట్లాడటం తన బాధ్యత అనుకున్నాడు. కానీ శారదతో ఏకాంతం దొరకటం లేదు. ఎప్పుడూ ఎవరో ఒకరు శారదనంటిపెట్టుకుని ఉంటున్నారు .

ఒక ఆదివారం నాడు శారద తమ ఇంట అందరికీ విందు చేయబోతున్నానని  ప్రకటించింది. కారణం అందరికీ తెలిసిందే. రామక్రిష్ణయ్య మద్రాసు ఒదిలి బెంగుళూరు వెళ్తున్నాడు. అక్కడ ఇంటర్‌ పూర్తి చెయ్యాలని సంకల్పం . రామక్రిష్ణయ్య , శారద మధ్య అనుబంధం అందిరికీ తెలుసు. అక్కా అని అతను పిలిచే  పిలుపు లో  రక్తసంబంధాన్ని మించిన సోదర భావం పలుకుతుందేది . ‘రా మూ’ ‘రా మయ్యా’ అంటూ శారద తన అభిమానాన్ని కురిపించేది. ఇద్దరూ కలిసి చదివే పుస్తకాలు , చేసే  చర్చలు , వాదోపవాదాలు  వారిని మరింత దగ్గర చేస్తాయి. రామక్రిష్ణయ్య ఒకోసారి  చాల నిరుత్సాహ పడేవాడు. ఈ దేశం ఎప్పటికి స్వతంత్రమయ్యేను? ఏది మార్గం? నేనేం చెయ్యాలి? రైతు, కూలీలు , పేదరికం, అంటరానితనం   –  ఒక్కసారి వీటన్నిటితో తలపడటం ఎట్లా? అసలు  గమ్యమేమిటి? స్వతంత్ర సాధనేనా  ? ఈ ప్రశ్నలను మధించి, మధించి, విసిగి వేసారి పోయేవాడు.

‘‘ఇక నా వల్ల కాదక్కా’’ అంటూ శారద దగ్గరకు వచ్చేవాడు. శారదకు నిరుత్సాహం  అంటే తెలియదు. సమస్యలు  వచ్చిన కొద్దీ సముద్రంలో తరంగాలు  వస్తుంటే చూసినంత ఆనందం. రామక్రిష్ణయ్య ఏది గమ్యం అని తల పట్టుకుంటే `

‘‘ప్రతి అడుగూ గమ్యమే. అమ్మయ్యా గమ్యం చేరామని కూర్చుందామని ఆశపడుతున్నావా  ? లేదు. నువ్వు చేరిన తర్వాత చూస్తె  ముందు మరో గొప్ప ఆశయం కనపడుతుంది. ఆయాసం తీర్చుకునే వ్యవధి కూడా ఇవ్వదు. వెంటనే అటువైపు అడుగు వేస్తాం మనం. వెయ్యకపోతే ఇక మన జీవితానికి అర్థమేముంది? నడుస్తూనే ఉంటాం జీవితం చాలదు. తరువాత వాళ్ళు  అందుకుంటారు – ఆ నడక అలా సాగుతూనే ఉంటుంది’’.

ఒకోసారి రామక్రిష్ణయ్య  శారద మాటల్ని కాదనేవాడు.

‘‘గమ్యం ఉండాలి. లేకపోతే నడవటానికి  ప్రేరణ  ఎలా వస్తుంది?’’

‘‘గమ్యం స్థిరం కాదని చెప్తున్నాను గానీ అసలు లేదనటం లేదు. మనం ఒకచోట గమ్యం సాధించామని ఆగకూడదని అంటున్నాను. ఆగామా – ఇక నిలవనీటి చందమే –  నాలుగు దిక్కులూ  ప్రవహించాలి మనం’’.

రామక్రిష్ణయ్య ముఖంలో వెలుగు కనిపించేంత వరకూ శారద మాట్లాడుతూనే ఉండేది.

రామక్రిష్ణయ్య బెంగుళూరు వెళ్తున్నాడంటే శారదకు బెంగగా ఉంది. దానిని పోగొట్టుకోటానికి ఈ విందు ఏర్పాటు చేసింది. అందరితో పాటు మూర్తికీ పిలుపు చేరింది.

రామక్రిష్ణయ్య కు  భోజనంలో కూడా ఆడంబరం గిట్టదు. అందువల్ల  సుబ్బమ్మ ప్రత్యేకం ఏమీ వండలేదు. కానీ ఆమె ఏం వండిన , వడ్డించిన , అది అమృతం తో  సమానమే ఆ యువకులకి.

పదిమంది స్నేహ బృందం  వెళ్ళి రామక్రిష్ణయ్య ను రైలెక్కించింది. రైలు  కదిలిపోతుంటే శారద ముఖంలో ఒక మబ్బుతెరలా దిగులు  వచ్చి వచ్చినంత త్వరగానూ వెళ్ళిపోయింది.

‘‘మన రామయ్య మరింత జ్ఞానం సంపాదించుకొస్తాడు. పదండి  పోదాం’’ అంటూ వెనుదిరిగింది.

స్నేహితులు  ఎవరి నెలవుకు వాళ్ళు వెళ్తామని తలోదారీ పట్టారు. శారద ట్రాము కోసం చూస్తూ నిలబడి  ఉంది. పది గజాలు  నడిచిన మూర్తి మళ్ళీ వెనక్కు వచ్చి శారద పక్కన నిలబడ్డాడు. ఏమిటన్నట్టు చూసింది శారద.

‘‘మనం కొంచెం మాట్లాడుకోవాలి. నా వైపు నుంచి నేను చెప్పుకోవల్సింది ఉంది’’.

‘‘నువ్వేం చెప్తావో నాకు  తెలుసు మూర్తీ’’

‘‘తెలిసినది మాత్రమే సర్వం అని నువ్వు కూడా అనుకుంటే ఎట్లా?’’

‘‘సర్వం అనుకోవటం లేదు. ఈ విషయంలో మరింత తెలుసుకోవాలని  మాత్రం అనుకోవటం లేదు.’’ అంది శారద నిర్లిప్తంగా.

‘‘కానీ చెప్పవసిన బాధ్యత  నాకుంది. చెప్పనంతవరకూ నాకు ఊపిరాడనట్టుగా ఉంటుంది. దయ చేసి ఒక్క గంట ` ’’ శారద మూర్తి ముఖంలోకి చూసింది. అక్కడ బాధ, నిజాయితీ తప్ప మరేమీ కనిపించలేదు.

olga title‘‘సరే – బీచ్‌కి పోదాం పద’’

మైలాపూర్‌ బీచ్‌లో సముద్రానికి కాస్త దూరంగా కూర్చున్నారిద్దరూ. సముద్రపు హోరు వాళ్ళ మనసుల్లో రేగుతున్న హోరు ముందు చిన్నదయింది. మూర్తి మాటల్ని పోగొట్టుకున్నట్టు ఆ సముద్రపు ఒడ్డున వాటిని వెతుకుతున్నట్టు చూస్తున్నాడు.

‘‘మూర్తీ – నీకు పెళ్ళయిందనే విషయం నాకు తెలిసింది. అదే నువ్వు నాకు చెప్పాలనుకుంటున్న విషయమని కూడా నాకు తెలుసు’’. శారదే మూర్తిని ఇబ్బంది నుంచి బైట పడేసింది.

‘‘కానీ శారదా – ఆ ఉదయం ఈ సముద్రపొడ్డున నిన్ను నేను చూసినపుడు నాకు పెళ్ళయిందనే విషయం నాకు గుర్తు లేదు. ఆ తరువాత  ఇంటికి వెళ్ళి ఆమెనూ, నా కొడుకూనూ చూసినా  కూడా నాకు పెళ్ళయిందన్న  విషయం నాకు గుర్తు లేదు. మర్నాడు , ఆ తరువాత  చాలా రోజులు  గుర్తురాలేదు. నేనొక ఉన్మాద  అవస్థలో పడిపోయాను. చివరికి తెలివొచ్చింది. నా  భార్య ఒక  రాత్రి గుర్తు చేసింది. నేను బిగ్గరగా ఏడ్చాను. ఆమె భయపడింది . ఆ దు:ఖం తగ్గాక ఆలోచించాను. నాకు పెళ్ళయితే ఏమైంది. నేను పెళ్ళి చేసుకున్న స్త్రీతో  ప్రేమలో పడలేదు. నాకు ఊహ తెలియక ముందే, స్త్రీ అంటే ఏమిటో,  ప్రేమంటే ఏమిటో, పెళ్ళంటే ఏమిటో తెలియకముందే  నా మీద ఆ బాధ్యత పడింది . బాధ్యత నిర్వహిస్తూ వస్తున్నాను . ఇప్పుడు నాకు   ప్రేమ  ఎదురైంది.  ప్రేమకూ పెళ్ళికి మధ్య సంబంధం ఎలాంటిదో, ఎంత వాంఛనీయమో, అవాంఛనీయమో ఆలోచిస్తుంటే మతిపోతోంది. రెండేళ్ళ క్రితం చలం  గారి శశిరేఖ నవల  చదివి ‘‘ ప్రేమ ఉంటే ఇంక పెళ్ళెందుకూ’’ అన్న శశిరేఖ మాటను పిచ్చి మాటలుగా కొట్టేశాను. అర్థం కాలేదు నాకవి. ఇవాళ నాకు  అర్థమవుతున్నాయి –  ప్రేమ లేని పెళ్ళికి అర్థం లేదు.  ప్రేమ ఉంటే పెళ్ళితో అవసరం లేదు. ఇది నాకు తెలిసొచ్చింది గానీ సంఘంలో పెళ్ళికున్న విలువ  ప్రేమకు లేదు. ఇప్పుడు నేను నిన్ను  ప్రేమిస్తున్నాను  అని చెబితే ఆ మాటకు నువ్వు విలువ  ఇవ్వవు’’.

‘‘ఇస్తాను’’ గంభీరంగా అన్న శారద మాటకు ఆశ్చర్యపోయి చూశాడు మూర్తి. సముద్రం స్తంభించినట్లనిపించింది ఒక్క క్షణం.

‘‘మూర్తీ. మనం ఎప్పుడూ మనసు విప్పి ఒకరి మీద ఒకరికున్న  ప్రేమను చెప్పుకోలేదు.  ప్రేమ కలిగిన మాట వాస్తవం. దానిని నిరాకరించి ఆత్మవంచన చేసుకోవటం ఎందుకు? నీకు పెళ్ళయిందని తెలిసి నేను తల్లడిల్లిపోయిన మాటా వాస్తవమే. నీలాగే నేనూ  ప్రేమ, పెళ్ళి, వీటి పరస్పర సంబంధం, స్త్రీ పురుష సంబంధాలూ  మారుతూ వచ్చిన తీరూ, వీటి గురించి ఆలోచిస్తున్నాను. చదువుతున్నాను. సమాధానాలు  దొరుకుతున్నట్లే ఉంటున్నాయి గానీ ఆచరించే మానసిక స్తిమితం రావటం లేదు. నా ప్రేమ  నిజమై నీది విలువలేనిదవుతుందా? కానీ విలువ  వల్ల ఉన్న పరిస్థితి మారదు. మనం స్నేహితుల్లా ఉందాం.  ప్రేమ బంధం, భార్యాభర్తల  బంధం, పెళ్ళి తంతు వీటి గురించి మర్చిపోదాం. అక్కడ నీ జీవితం నిర్ణయమైపోయింది అంతే. అది మారదు. మార్చాలనుకోకు’’.

శారద మాటకు ఏం సమాధానం చెప్పాలో మూర్తికి తెలియదు.. ‘‘థాంక్స్‌ శారదా ` నన్ను స్నేహితుడుగా అంగీకరించావు. అది చాలు .  నన్ను దూరం చేస్తావేమో, అని భయపడ్డాను’’.

‘‘ఎందుకు దూరం చేస్తాను మూర్తీ. నువ్వేం నేరం చేశావని? నన్ను  ప్రేమించడం నేరం అనుకోమంటావా ? మరి నేనూ నిన్ను  ప్రేమించాను. నా ప్రేమ  నేరం కాకుండా నీ  ప్రేమ నేరమవుతుందా? కేవలం నీకు పెళ్ళయినందువల్ల  అది నేరమవుతుందా? –  పెళ్ళి ఒక సామాజిక బంధం. వ్యక్తి స్వేచ్ఛ అంటూ ఒకటుందిగా –  ఆ రెండింటికీ యుద్ధం జరుగుతుంది ఈ కాలంలో. బహుశా అన్ని కాలాల్లోనూ జరుగుతుందేమో మనకిప్పుడు తెలిసి వచ్చింది. మనం ఆ యుద్ధ రంగంలో ఉన్నాం . యుద్ధం చెయ్యాలని లేదు. ఉంది.  ప్రేమ అనే ఆయుధం ఉంది. చూద్దాం. ఆ ఆయుధానికి పదును పెట్టాల్సిన అవసరం వస్తుందేమో.’’

శారద మాటను మంత్రముగ్ధుడిలా వింటున్నాడు మూర్తి. చీకట్లు ముసురుకుంటున్నాయి. ఇద్దరికీ అక్కడనించి కదలాలని లేదు. సముద్రాన్ని చూస్తూ మౌనంగా కూర్చున్నాడు. తమ అంతరంగాలను చూసుకుంటున్నట్టే ఉంది. విరుచుకుపడే అలలు. అగాధమైన లోతు. అవతలి తీరం కనపడనంత దూరం. వెన్నెల తరకు, చీకటి నీడలు. అంతులేని సౌందర్యం. భయం గొలిపే  అద్భుతం.

లోకంతో పనిలేనట్టు, లోకమేమైనా  తనకేం పట్టనట్టూ ముందుకు విరుచుకు పడుతూ, భళ్ళున బద్దలై వెనక్కు తోసుకు పోతూ ఆ సముద్రం. ఆ సముద్రం తామే అన్నంత వివశంగా వాళ్ళిద్దరూ.

***

చదువు సాగుతోంది. ఉద్యమం చల్లబడినట్లుంది. యువమిత్రులు  తమ చదువుల్లో, పనుల్లో పడిపోయారు. ఒకటి రెండేళ్ళ కిందటి పరిస్థితికీ ఇప్పటికీ పోలికే లేదు. శారద సోషలిస్టు సాహిత్యం సంపాదించి చదువుతోంది. ఆ పుస్తకాలు  కలలను అందిస్తున్నాయి. ఆ కలలు నిజమవుతాయా? ఏదో నిరాశ. సందిగ్ధత.

ఈ నిరాశనుంచి, సందిగ్దత నుంచీ బైటపడటానికి శారదకు ఈ మధ్య వడిమేలు ఆలంబన అయ్యాడు.

వడిమేలు  నడిపే పత్రిక శారద తప్పనిసరిగా చదివేది. ఒకసారి సుదర్శనం తెచ్చిచ్చాడు. అంతే. శారద వడిమేలు  పత్రిక అచ్చయ్యే చోటికి వెతుక్కుంటూ వెళ్ళింది.

మద్రాసు నగరంలో ఇటువంటి ప్రదేశాలు  కూడా ఉన్నాయా అని సంపన్నులు  ఆశ్చర్యపడే మురికివాడలోని ఒక గది ముందు ఆగింది.

తలుపు ఓరగా తీసే ఉంది.

‘‘లోపలికి రావచ్చాండీ’’ అని కాస్త గట్టిగానే తమిళంలో అడిగింది. లోపల్నించి సన్నగా నల్లగా ఉన్న ఒకాయన లేచి బైటికి వచ్చాడు. ఎవరన్నట్టు చూశాడు శారద వంక.

‘‘నా పేరు శారద. డాక్టర్‌ కోర్సు చదువుతున్నాను. చాలా మంచి పత్రిక నడుపుతున్నారు. మిమ్మల్ని చూడాలని వచ్చాను’’.

ఆయన ముఖంలో ఆ ప్రశంసకు ఎలాంటి సంతోషమూ కనపడలేదు. సరిగదా కనుబొమ్మలు ముడివేసి.

‘‘పత్రిక చదవండి. నన్ను చూడటం ఎందుకు?’’ అన్నాడు.

‘మీ పత్రికకు సహాయం చెయ్యానుకుంటున్నా’’ పర్సు తీసి మూడు పదులు వడిమేకు ఇచ్చింది.

ఇప్పుడాయన ముఖంలో ముడి కాస్త వీడింది.

‘‘పత్రిక అమ్మి పెడితే ఇంకా పెద్ద సహాయం అవుతుంది’’.

‘‘తప్పకుండా అమ్ముతాను. కాపీలుంటే ఇప్పుడే ఇవ్వండి’’.

వడిమేలు  ప్రసన్నుడై ‘‘లోపలికి రామ్మా’’ అని తను నడిచాడు. లోపలికి వెళ్ళింది శారద. ఆఫీసు, ఇల్లు, ప్రెస్సు అన్నీ ఆ చిన్న గదిలోనే. పది కాపీలు  తీసి ఇచ్చాడు.

‘‘నాది బ్రాహ్మణ కులం. కానీ మీరు రాసే బ్రాహ్మణ వ్యతిరేక వ్యాసాలు బాగా నచ్చుతాయి. బ్రాహ్మణ తత్త్వం పోతేగాని దేశం బాగుపడదు’’. వడిమేలు నవ్వాడు. శారద తలమీద చేయిపెట్టి దువ్వాడు.

‘‘కమ్యూనిజం వస్తేగాని దేశం బాగుపడదు’’ అన్నాడు.

శారద ఉలిక్కిపడిరది. ఈ బలహీనుడైన వ్యక్తి కమ్యూనిస్టా?

ఆశ్చర్యంగా అడిగింది ‘‘మీరు కమ్యూనిస్టా?’’

‘‘ఏమో నాకు సరిగా తెలియదు. కానీ కమ్యూనిస్టునని చెప్పుకోవాలని ఉంది. దానికేం చెయ్యాలో తెలియదు’’.

‘‘ఏముంది? చెప్పుకోవటమే. ఈ రోజునుంచీ నేనూ కమ్యూనిస్టునని చెప్పుకుంటాను. ఇద్దరు కమ్యూనిస్టులుంటే మంచిదే గదా?’’ వడిమేలు మనసారా నవ్వాడు.

‘‘నీలాంటివాళ్ళే ఈ దేశానికి కావాలమ్మా’’ అన్నాడు.

శారద కాసేపు అక్కడ కూచుని వచ్చేసింది. ఆరోజు నుంచీ అప్పుడప్పుడూ వడిమేలుని చూడటానికి వెళ్ళేది. వట్టి చేతుల్తో ఎప్పుడూ వెళ్ళేది కాదు. ఏదో ఒకటి తినటానికి తీసుకెళ్ళేది. ఇద్దరూ కలిసి అవి తింటూ బ్రాహ్మణులను, వారి ఆచారాలనూ, బ్రిటీష్‌వాళ్ళను, వాళ్ళ దోపిడినీ తిట్టుకుంటూ కూచునేవారు. వడిమేలు పనిలో తను చేయగలిగిన చిన్న సాయమైనా చేసేది.

వడివేలంటే ఎంతో గౌరవం శారదకు. ఆ పేదరికంలో, ఆబలహీనతతో, అతి తక్కువ వనరులతో ఆయన ఎలాంటి పని చేస్తున్నాడో చూస్తే తనెంతెంత పనులు చెయ్యాలో గదా అనుకునేది.

ఎలాంటి మనుషున్నారు దేశంలో `

తను వడిమేలుని కలిసిన సంగతి సుదర్శనంతో, మూర్తితో చెప్పింది.

‘‘అక్కడికెందుకెళ్ళావు. పోలీసులు చూస్తే ప్రమాదం’’ అన్నారు ఇద్దరూ కూడబుక్కున్నట్టు.

‘‘పోనీలే, ఒక్క ప్రమాదకరమైన పనైనా చేశానని తృప్తి పడనీయండి’’ అని నవ్వేసింది శారద.

మూర్తి గురించి అతని సమక్షంలో శారదకు ఏ ఆలోచనలూ  రావు. మిగిలిన స్నేహితులతో ఎలా ఉంటుందో అలాగే ఉంటుంది. కానీ ఏ రాత్రి పూటో ఒంటరిగాఉన్నపుడు మూర్తి గురించిన ఆలోచనలు చుట్టు ముట్టి అలజడి చేస్తుంటాయి. నియంత్రించబోతే శరీరం, మనసూ కూడా సహకరించవు.

ఏదో పనిమీద పరశువాకం వెళ్ళిన శారదకు వడిమేలుని చూడానిపించింది. చాలారోజులే అయింది అతనిని కలిసి. ఆలోచన వస్తే ఇక శారద ఒక్క క్షణం తటపటాయించదు. వెంటనే ఆచరణలో పెట్టేస్తుంది. ట్రాము దిగి సందుగొందులు తిరుగుతూ ఉత్సాహంగా వడిమేలు  గదిలోకి వెళ్ళింది.

ఆయన హడావుడిగా ఏదో పని చేసుకుంటున్నాడు. శారదను చూడగానే ఒక్కసారి ఆగి ముఖంనిండా నవ్వాడు. కూర్చోమని కూడా అనకుండా పత్రిక కాపీ కట్టను శారద చేతిలో పెట్టి.

‘‘ఇంక ఈ పేరుతో పత్రిక రాదు. ఇదే చివరిది’’ అన్నాడు.

శారద ఆందోళనగా ‘‘ఏమైంది. పోలీసులు వచ్చారా?’’ అని అడిగింది.

‘‘పోలీసులు కాదు. కమ్యూనిస్టులే వచ్చారు’’ అన్నాడు వడిమేలు.

‘‘కమ్యూనిస్టులా? మనిద్దరం కాక కమ్యూనిస్టులింకా ఉన్నారా?’’ తేలిగ్గా నవ్వుతూ అడిగింది శారద.

‘‘ఉన్నారు. మనలాంటి వాళ్ళు కాదు. నిజం కమ్యూనిస్టు. ఒకతను రష్యా నుంచి వచ్చాడు. త్వరలో మనలాంటి వాళ్ళందరం అతనితో కలిసికూర్చోని మాట్లాడదాం. కమ్యూనిస్టు పార్టీ పెడదాం. మేం కమ్యూనిస్టులమని చెప్పుకుందాం’’ వడిమేలు  ఆపకుండా ఉత్సాహంగా మాట్లాడుతున్నాడు.

శారదకు శరీరం మీద పులకలు  వచ్చాయి.

‘రష్యా నుంచి కమ్యూనిస్టు వచ్చాడు. తను కమ్యూనిస్టు . కమ్యూనిస్టు పార్టీ సభ్యురాలు ’ ఏదో తన్మయత్వంలో పడి తేరుకుంటూ ‘‘నాకంతా చెప్పండి. ఇదంతా ఎప్పుడు జరిగింది?’’

‘‘నాకిప్పుడు సమయం లేదు. త్వరలో సమావేశం జరుగుతుంది. అంతా తెలుస్తుంది’’.

వడిమేలు  పని తెమిలేలా లేదు. శారదను పట్టించుకునే తీరిక లేకుండా కాగితాలతో కుస్తీ పడుతున్నాడు.

శారదకు అక్కడినుంచి కదలకతప్పలేదు.

ఇంటికి వెళ్ళానిపించలేదు ఇదంతా ` ఈ ఉద్వేగానుభూతినంతా వెంటనే ఎవరితోనైనా పంచుకోకపోతే ఊపిరాడేలా లేదు. పొంగుతున్న ఉత్సాహం ఎవరితోనైనా చెప్పందే నిలవనిచ్చేలా లేదు.

మూర్తి తప్ప ఎవరూ దీనిని, తను అర్థం చేసుకున్నట్టు అర్థం చేసుకోలేరు. మూర్తిని చూడాలి. ఈ సమయంలో మూర్తి ఎక్కడుంటాడు. ఇంటి దగ్గరకు వెళ్ళిచూస్తే ` ఏమవుతుంది? ఏమీ కాదు.

శారద చకచకా ముందుకి నడిచి ట్రాము ఎక్కేసింది.

ట్రాము దిగి నాలుగు ఫర్లాంగులు  నడిస్తే గాని మూర్తి ఇల్లు  రాదు.

మూర్తి ఇల్లు తలుపు  తడుతుంటే గుండె దడదడలాడిరది.

మూర్తే వచ్చి తలుపు  తీశాడు. శారదను చూసి కంగారు పడ్డాడు.

‘ఏమైంది? ఎందుకొచ్చావ్‌?’’ హడావుడిగా అడిగాడు.

‘‘రాకూడదా?’’ నవ్వింది శారద.

శారద నవ్వుచూసి స్థిమితపడి ‘‘ఎందుకు రాకూడదు? ఇంతకు ముందెప్పుడూ రాలేదుగా’’ అని లోపలికి తీసికెళ్ళాడు.

ఇల్లంతా  నిశ్శబ్ధంగా ఉంది. మనుషులున్న అలికిడే లేదు.

‘‘ఎవరూ లేరా?’’

‘‘లేరు. బంధువులింట్లో పెళ్ళయితే వెళ్ళారు. నాకు ఆ పెళ్ళిళ్ళకు వెళ్ళటం విసుగు. ఇంటికి కాపలా ఉండిపోయాను. ఉన్నందుకు చూశావా ఎంత అదృష్టం కలిసొచ్చిందో’’.

శారద గలగలా నవ్వింది.

‘‘శారదా ` నువ్వు నవ్వుతుంటే ప్రాణాలు ఇచ్చెయ్యాలనిపిస్తుంది’’

‘‘మూర్తీ ` మనిద్దరం ప్రాణాలు అర్పించాల్సిన గొప్ప విషయం ఒకటుంది’’

‘‘ఏమిటది’’ ఆశ్చర్యంగా అడిగాడు మూర్తి.

‘‘కమ్యూనిజం. మూర్తీ ,  నేను కమ్యూనిస్టుని. నువ్వూ కమ్యూనిస్టువే. కదూ ` ’’శారద ఆనందంగా కళ్ళనీళ్ళతో అడిగింది. మూర్తి ఆశ్చర్యానికంతు లేదు.

‘‘శారదా ,కమ్యూనిస్టేమిటి ? ఇంత ఆనందంగా ఉన్నావు. ఏం జరిగింది?’’.

olga title

‘‘కమ్యూనిజం అంటే నీకు తెలియదా? దేశంలో ఆకలి, దరిద్రం, బీదా గొప్ప తేడాలు  లేకుండా చేసేస్తుంది. అందరూ సమానులే . స్వంత ఆస్తి ఉండదు. అందరూ ఒళ్ళు వొంచి పని చేస్తారు. కావలసినంత తింటారు. చదువుకుంటారు. దేనికీ లోటుండని స్వర్గం. ఆ స్వర్గాన్ని నిర్మించేవాళ్ళు కమ్యూనిస్టులు’’

‘ఇదంతా నీకెలా తెలుసు?’

‘‘ఈ మధ్యే కమ్యూనిస్టు మానిఫెస్టో చదివాను. మూర్తీ! అది చదువుతుంటే నా రక్తం ఎలా ఉప్పొంగిందనుకున్నావు. ఎలా పోటెత్తిందనుకున్నావు. శరీరమంతా తేలిపోయింది. నరాలన్నీ మీటటానికి సిద్ధంగా ఉన్న వీణ తీగల్లా అయిపోయాయి. జలపాత స్నానానుభూతి. గొప్ప సౌందర్యం నా కళ్ళముందు. దానికి రూపం లేదు. రూపం లేని సౌందర్యం, సవ్వడి లేని సంగీతం, బ్రహ్మానందమంటారే అదేదో నాకు అనుభవంలోకి వచ్చినట్లయింది. ఇప్పటికీ కమ్యూనిజాన్ని తల్చుకున్నంత మాత్రాన ఒళ్ళంతా పులకరిస్తుంది. ఇది నా తొలి వలపులా ఉంది. నేను కమ్యూనిస్టుని. నేనూ కమ్యూనిజం వేరు కాదు. ఒకటే . అద్వైతం ఇదే కదూ ` ’’ .

‘‘శారదా, ఉండు. నన్ను ఊపిరి పీల్చుకోనివ్వు. ఇవాళేమైంది? ఎక్కడి నుంచి వస్తున్నావు. అది చెప్పు’’.

శారద మెల్లిగా వాస్తవ ప్రపంచంలోకి వస్తున్నట్టుగా చెప్పింది.

‘‘ఇవాళ వడిమేలుగారి దగ్గరికెళ్ళాను. ఆయన కూడా కమ్యూనిస్టే తెలుసా? ఇవాళ ఆయనే చెప్పాడు. రష్యానుంచి కమ్యూనిస్టుపార్టీ సభ్యుడు వచ్చాడట . మద్రాసులో మనలాంటి వాళ్ళందరం కలుస్తాం. పార్టీని నిర్మిస్తాం. మూర్తీ !మనం , మనం కమ్యూనిస్టు పార్టీని నిర్మిస్తాం. ఇది అద్భుతంగా లేదూ?’’

మూర్తి చేతులు పట్టుకు ఊపేసింది శారద.

‘‘పరమాద్భుతంగా ఉంది. శారద ! నేనూ సుదర్శనం కూడా కమ్యూనిజం గురించి మాట్లాడుకున్నాం. నువ్వు గాంధీ భక్తురాలివి గదా కమ్యూనిస్టువి కావేమో అనుకున్నా . ’’

‘‘మూర్తీ! ఇవాళ నా మనసులో ఇంకే సందేహాలు  లేవు. నేను కమ్యూనిస్టుని ` ఐఆమ్‌ ఏ కమ్యూనిస్టు’’.

సంతోషం ఆపుకోలేక గలగలా నవ్వింది శారద.

‘‘నేనూ ` నేను కూడా’’ శారదను ప్రేమగా దగ్గరకు తీసుకున్నాడు.

శారదకాక్షణంలో ఏ సంశయాూ, సందేహాలూ  లేవు.

‘‘మూర్తీ! ఎంత గొప్పగా ఉందీ భావన’’.

కమ్యూనిస్టు కావటమంటే ఏమిటో తెలుసా? ఒక గొప్ప సత్యాన్ని  తెలుసుకోవటం ` జ్ఞానాన్ని సంపాదించటం — బుద్ధునిలా.

మొట్టమొదటి వాక్యమే సూర్యోదయంలా అద్భుతంగా ఉంది. ఏమంటున్నారో విను! ‘ఇంతవరకూ నడచిన సమాజపు చరిత్ర అంత వర్గ పోరాటాల  చరిత్రే’. ‘‘మూర్తీ –  అంతా  తేటతెల్లమైపోవటం లేదూ? ప్రపంచమంతటినీ పట్టి చూసినట్టు లేదూ? ఆ వాక్యం చదివినప్పుడు నా ఎదుట ఒక మహా విశ్వరూప సందర్శనం జరిగినట్లు అనిపించింది.

నిజంగా — ఈ సమాజపు నగ్న స్వరూపం కూడా చూశాను కమ్యూనిస్టు ప్రణాళికలో బూర్జువ వర్గం మనిషికి మనిషికి మధ్య నగ్నమైన స్వలాభం తప్ప కిరాతకమైన డబ్బు లావాదేవీలు  తప్ప ఇక ఏ సంబంధాన్నీ మిగలనివ్వలేదు. ఇంకా మార్క్స్‌ రాస్తాడిలా –అది మనిషి విలువను రూపాయల్లోకి మార్చేసిందనీ, వైద్యులనూ, న్యాయవాడులనూ , కవులనూ, శాస్త్రవేత్తలనూ అది తనకింద కూలికి పనిచే సేవకులు గా  మార్చేసిందనీ — ఎలాంటి మాటలివి ?  ఎంత అచ్చమైన, స్వచ్ఛమైన, సత్యమైన మాటలివి. అబ్బా మూర్తీ! ఈ బ్రిటీష్‌ సామ్రాజ్యం ఎలా కూలిపోతుందో నా  కళ్ళకు కట్టినట్లు కనిపించింది. ఈ ఆర్థిక సంక్షోభం, ఈ దరిద్రం, ఈ పీడన అంత బ్రిటీష్‌ సామ్రాజ్యం తన నెత్తిమీదకు తానూ  తెచ్చుకున్నదే – ఇదుగో నే చెప్తా విను’’ ` శారద గలగలా నవ్వింది.

నవ్వుతూ  నవ్వుతూ చెప్తోంది. పొంగుతున్న సంతోషంతో మాటలు  ఆగుతూ ఆగుతూ వస్తున్నాయి.

‘‘ఈ బూర్జువా సమాజం తన మంత్ర శక్తితో  సృష్టించిన భూతాలను  తాను  అదుపు చేసుకోలేక వాటి చేతిలో మంత్రగాడిలా చస్తుంది’’ ఆ నవ్వులో కసి కోపం కలగలిసి ఉన్నాయి. ‘‘మూర్తీ – మనిద్దరం చదువుదాం. మళ్ళీమళ్ళీ చదువుదాం. అర్థం చేసుకోవాలి  ఇంకా – ఇవాళ రామకృష్ణ ఎంత గుర్తొస్తన్నాడో. మేం చాల  పుస్తకాలు కలిసే  చదివాం. ‘ఆడవాళ్ళను సమాజం ఎప్పుడూ సమిష్టి ఆస్తిగా ఉంచిందన్నారు’ కమ్యూనిష్టు మేనిఫెస్టోలో. ఆ చరిత్రంతా తెలుసుకోవాలి.

మూర్తీ — చివరిగా పరమాద్భుతమైన మహాసత్యం చెప్పారు. అది చదువుతూ నేనేమయ్యానో నాకే తెలియదు. అదో విశ్వ రహస్యాన్ని కనుగొన్న, చూసిన గొప్ప అనుభవం. ‘కార్మికులు  పోగొట్టుకునేదేమీ లేదు. తమ సంకెళ్ళు తప్ప –  వారికి గెలవ వలసిన ప్రపంచం ఉంది.’’ ప్రపంచమంత ఒకటే – మనదే మూర్తీ –  మనదే – ఎలా ఉంది?

‘‘శారదా. నేను ఎన్నడూ అనుకోలేదు నా  కింత అదృష్టం పడుతుందని. నీ కలలు  నాతో ఇంత ఆత్మీయంగా, నువ్వే నేనన్నట్టు పంచుకుంటావని’’ శారదను మరింతగా హత్తుకున్నాడు.

శారద అతన్నించి విడిబడి నవ్వింది.

‘‘అదంతా తర్వాత ` మూర్తీ ` మనం నిజంగా మార్చేస్తాం కదూ దేశాన్ని. దించేస్తాం కదూ స్వర్గాన్ని’’.

‘‘తప్పకుండా. కానీ అదంత తేలిక కాదు’’.

‘‘తేలికో. కష్టమో. ప్రాణాలు  పోతాయో. ఏమవుతుందో. కానీ ఇవాళ నాకు ఆకాశాన్నందుకున్నట్టు ఉంది. ఈ ప్రపంచంలోని ప్రతి ప్రాణిని కావలించుకున్నట్టుగా ఉంది. ఎంత తొందరగా ఆ సమావేశం జరుగుతుందా అని చూస్తున్నా’’.

శారద ముఖం వేయి సూర్యుల  కాంతితో జ్వలిస్తోంది. మూర్తికి ఒక క్షణం భయం వేసింది ఆ ప్రకాశ తీవ్రతను చూసి.

శారదే ఆపకుండా మాట్లాడింది. కమ్యూనిస్టు మేనిఫెస్టో గురించి.

శారద గొంతులోంచి జలపాతంలా దూకుతున్న ఆ మాట జడిలో తడిసి ముద్దయిపోయిన మూర్తికి ప్రపంచంలో ఈ క్షణం తప్ప మరింక ఏదీ వాస్తవం కాదనిపించింది.

ఇద్దరూ ఆదర్శ లోకాలలో విహరించటంలోని అత్యున్నత ఆనందాన్ని మనసారా అనుభవించారు.

రాత్రి పొద్దుబోయాక శారదను ఇంటి దగ్గర దించి వస్తున్న మూర్తికి తన పక్కన శారద ఉన్నట్టే ఉంది. ఇంట్లో మంచం మీద పడుకున్న శారదకు తన పక్కన మూర్తి ఉన్నట్లే అనిపించింది. ప్రపంచం మీద, ప్రపంచంలోని దీనులు , పేదల  మీద ప్రేమఒకరి హృదయంలోంచి ఇంకొకరి హృదయంలోకి ప్రవహించిన క్షణాల  బలం  ఎలాంటిదో ఇద్దరికీ అనుభవమైంది. ఆ బలం  వారిద్దరి స్నేహానికీ అంతులేని శక్తినిచ్చింది.

***

‘‘విశాలాక్షి స్వయంగా వచ్చి పిలిచింది. వెళ్ళక తప్పదు’’ అనుకుని చదువుతున్న పుస్తకాన్ని పక్కనపెట్టి నాటకానికి వెళ్ళేందుకు తయారవ్వాలని లేచింది శారద.

విశాలాక్షికి ఆ సంవత్సరం ఎమ్‌.ఏ లో చేరేందుకు సీటు దొరకలేదు. నాటకాల్లో వేషాలు  వేయటమూ తప్పలేదు. కొత్త నాటకం వేస్తుంటే శారదను పిలిచేది. శారద ఒకసారి మూర్తిని, సుదర్శనాన్ని కూడా తీసికెళ్ళింది. ఆ నాటకాలు  పెద్ద బావుంటాయని కాదుగానీ విశాలాక్షి కోసం, కోటేశ్వరి కోసం వెళ్ళేది.

ఇప్పుడేదో సాంఘిక నాటకమని చెప్పింది.

శారద ముందుగా విశాలాక్షి ఇంటికి వెళ్ళింది. ఇద్దరూ కలిసే థియేటర్‌కి వెళ్ళారు. వాళ్ళంతా వేషాలు  వేసుకుంటుంటే శారద విశాలాక్షికి సాయం చేస్తూ కబుర్లు చెబుతోంది. ఇంకో పావుగంటలో నాటకం మొదలవుతుండగా విశాలాక్షి తల్లి కోటేశ్వరి సంతోషంగా వచ్చింది.

‘‘విశాలా. నీ అదృష్టం బాగుందే. బళ్ళారి రాఘవరావు గారు మన నాటకం చూడటానికి వస్తున్నారు’’.

‘‘ఎవరొస్తే మనకేమిటమ్మా. మన నాటకం మనం ఆడాలి. తప్పదుగా’’

‘‘తిండి పెట్టేది అవి. ఆ నాటకాల  గురించి ఎందుకట్టా మాట్టాడతావు. పెద్దాయన వస్తున్నాడు. నువ్వు వినయంగా నమస్కారం చెయ్యి. ఆయన తల్చుకుంటే నిన్ను మహానటిని చేస్తాడు.’’

olga title‘‘మహానటిని కావాని నాకేం కోరికలేదు. ఐనా మహానటులు  ఎవరికి వారు కావాల్సిందే. ఇంకొకరు చేయలేరు. ‘‘దురుసుగా అంది విశాలాక్షి.

‘‘నా మాటలన్నీ నీకు తప్పుగానే వినపడతాయి. చూడు శారదమ్మా, నీ స్నేహితురాలి వరస’’ అంటూ పక్కకు వెళ్లింది .

‘‘ఎందుకే. మీ అమ్మనట్లా బాధపెడతావు’’ జాలిగా అంది శారద.

‘‘నా లోపల , నా జీవితం గురించి ఎంత అసంతృప్తి ఉందో నీకు తెలియదు. ఎంత ఆపినా ఆగకుండా ఇలా పైకి తన్నుకొస్తుంది. అమ్మకూ నాకూ ఇది అవాటేలే ` ’’

‘‘బళ్ళారి రాఘవ అంటే నాకు చాలా ఇష్టం. ఎంతో మంచి నటుడు. నేను ఆయన నాటకాలు  చూశాను’’ ఉత్సాహపరచబోయింది శారద.

‘‘నేనూ చూశాను. గొప్ప నటులే ` కాదన్నదెవరు?’’ నిర్లిప్తత పోలేదు విశాలాక్షి గొంతులో.

ఇంతలో నాటకం మొదలవుతుందనే పిలుపు. విశాలాక్షి వెళ్ళింది. శారద పెళ్ళి ప్రేక్షకుల్లో కూర్చుంది.

అది గొప్ప నాటకం కాదు గానీ విసుగు పుట్టించలేదు.

నాటకం పూర్తయ్యాక బళ్ళారి రాఘవను స్టేజీ మీదకు పిల్చారు. ఆయన వచ్చి నాటకం గురించి నాలుగు మంచి మాటు చెప్పి, ఆంధ్రదేశంలో గొప్ప బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చి నాటకరంగంలో చరిత్ర సృష్టిస్తున్న కొమ్మూరి పద్మావతి కూడా నాటకానికి వచ్చిందనీ, ఆమె వేదిక మీదికి రావాలని కోరారు. పద్మావతి స్టేజి మీదకు వచ్చి అందరికీ నమస్కారం చేసేసరికి ప్రేక్షకుల  ఉత్సాహం రెట్టింపయింది.

ఆ సభా తతంగం అయ్యాక లోపల  మేకప్‌ రూంలోకి చాలా మందే వచ్చి అభినందించారు. రాఘవగారు, పద్మావతి గారూ నలుగురితో కలిసి వచ్చారు.

‘‘మా అమ్మాయి బి.ఎ చదివిందండి’’ అంది కోటేశ్వరి గర్వంగా.

‘‘మంచిది. చదువుకున్న వాళ్ళూ, కుటుంబ స్త్రీలు  వస్తేనే నాటకరంగ ప్రతిష్ట పెరుగుతుంది’’ అన్నారు బళ్ళారి రాఘవ.

‘‘కుటుంబ స్త్రీలంటే ఎవరండీ? కుటుంబ స్త్రీలు  కానిదెవరండి’’ చాలా కటువుగా అడిగింది విశాలాక్షి.

అందరూ నిశ్శబ్ధమైపోయారు.

బళ్ళారి రాఘవ పక్కనున్న తెల్లటి అందమైన మనిషి సన్నగా నవ్వి ‘‘తప్పు ఒప్పుకొని ఆ అమ్మాయిని క్షమాపణ అడగండి’’ అన్నాడు.

పద్మావతి కంగారుపడుతూ ‘‘మీరూరుకోండి’’ అన్నది.

‘‘అమ్మా – ఆయన తరపున నేను క్షమాపణ అడుగుతున్నాను. నా పేరు గుడిపాటివెంకట చలం. కథలూ  అవీ రాస్తుంటాను. నువ్వడిగిన ప్రశ్న చాలా సరైన ప్రశ్న’’.

బళ్ళారి రాఘవ గంభీరంగా అక్కడినుంచి వెళ్ళిపోయాడు. ఆయనతో వచ్చినవాళ్ళూ వెళ్ళిపోయారు.

చలంగారు రెండు నిమిషాలు  నిలబడి ‘‘మీ నాటకం నాకేం నచ్చలేదు గానీ నీ మాటలూ , నువ్వూ –  మర్చిపోలేను’’ అంటూ వెళ్ళిపోయారు.

శారద చలం గారిని చూసిన సంభ్రమంలో మిగిలినవన్నీ మర్చిపోయింది.

‘‘విశాలా – చలంగారు’’ అంది విశాలను కుదుపుతూ.

‘‘ఔను – అదే – చూస్తున్నా’’

కోటేశ్వరి అందరినీ గదమాయిస్తూ సామాను సర్దిస్తోంది. ఆమెకు కూతురి మీద పట్టరాని కోపంగా ఉంది. అంత పెద్ద మనిషిని పట్టుకుని అవమానించింది. బి.ఏ చదివానని పొగరు. దీన్తో ఎలా వేగాలో తెలియటం లేదు. ఆమెకి విశాలాక్షి భవిష్యత్తు గురించి బోలెడు భయం.

విశాలాక్షి ఇల్లు చేరాక తల్లితో పెద్ద యుద్ధమే చేసింది.

‘‘నేనింక నాటకాలు  వెయ్యను’’ అని ప్రకటించేసింది.

‘‘ఒకపక్క ఆ బ్రాహ్మలావిడ నాటకాల్లోకి వస్తే –  నీకు పరువు తక్కువైందా నాటకాలేస్తే’’ అని కూతుర్ని తిట్టింది కోటేశ్వరి.

‘‘ఔనమ్మా ` బ్రాహ్మలు, కుటుంబ స్త్రీలు  నాటకాలేస్తే గొప్ప. మనం ఏం చేసినా గొప్ప కాదు. వాళ్ళను చూసినట్లు మనల్ని చూడరు.’’

‘‘నీకు ఏం కావాలే ? ఇప్పుడు నీకేం తక్కువైంది?’’ అరిచింది తల్లి.

‘‘అది నీకూ తెలుసూ. నాకూ తెలుసు. మళ్ళీ నా నోటితో చెప్పాలా? “గయ్యిమంది కూతురు.

కోటేశ్వరికి మండిపోయింది.

‘‘సరే – నోర్మూసుకుని తిండితిని పడుకో. చేసే పని సంతోషంగా చెయ్యటం చేతగాని దద్దమ్మవి. నీ మీద నీకు గౌరవం లేదు. నిన్ను నువ్వు గొప్పనుకోవటం తెలియదు. ఎవరో నిన్ను గొప్ప దానివనాలా ?నీ గురించి నీకు తెలియదా?’

*

మీ మాటలు

*