మర్నాడు మధ్యాహ్నం శారద భోజనం చేసి ‘‘యంగ్ ఇండియా’’ పత్రిక పట్టుకుని చదువుతుండగా ఆమె స్నేహితులొచ్చారని వంటావిడ వచ్చి చెప్పింది.
శారద ఆశ్చర్యంగా వెళ్ళి వాళ్ళను కావలించుకుంది. ముగ్గురూ కూర్చున్న తర్వాత వెరోనికా అంది.
‘‘మేం కాలేజీకి వెళ్ళి దరాఖాస్తు ఫారాు ఇచ్చి వచ్చాం. నువ్వు ఇచ్చే ఉంటావులే’’ అని `
శారద వాళ్ళవంక జాలిగా చూస్తూ
‘‘మీరు కళాశాలో చేరుతున్నారా? నేను బహిష్కరిస్తున్నాను’’ అంది.
‘‘అదేమిటి? బహిష్కరించటం ఏమిటి? ఎందుకు? చదవవా?’’ వాళ్ళిద్దరూ కంగారుగా అడిగారు.
శారద వివరంగా ఉద్యమం గురించి, గాంధీగారి పిలుపు గురించి ఎంతమందో చదువు మాని ఉద్యమంలోకి దూకటం గురించీ, వాళ్ళూ చదువు మానెయ్యాల్సిన కర్తవ్యం గురించి ఆవేశంతో చెప్పింది. వాళ్ళను మార్చి కళాశాలకు వెళ్ళకుండా చెయ్యటమే తన కర్తవ్యమన్నట్లు చెప్పింది.
అంతా విని వెరోనికా, థెరిసా లేచి నిబడి ‘‘ఇక వెళ్ళొస్తాం’’ అన్నారు. శారద అర్థం కానట్లు చూసి.
‘కూర్చోండి. నా మాటలన్నీ విని మాట్లాడకుండా వెళ్ళిపోతామంటారేం ఏదో ఒకటి చెప్పండి. నేనన్న మాటల్లో తప్పేముంది?’’ అంటూ వాళ్ళను కూర్చోబెట్టింది.
‘‘తప్పు, ఒప్పు కాదు శారదా. మేం చదువు మానం. నువ్వు చదువు మానినా నీకేం నష్టం లేదు డబ్బుంది. పెళ్ళి చేసుకుంటావు. హాయిగా బతుకుతావు. నీకు ఇష్టమైన పనులు చేసుకుంటావు. మేం ఈ చదువు మానితే ఏముంది? మా వాడల్లో గౌరవం లేకుండా దుర్భరమైన బతుకు బతకాలి’’ థెరిసా మాటకు అడ్డం వచ్చింది వెరోనికా.
‘‘శారదా! ఈ చదువు లేకపోతే నీతో స్నేహం చెయ్యగలిగేవాళ్ళమా? అసు మాతో నువ్వు మాట్లాడేదానివా? మీ ఇంటికి వచ్చి నీ పక్కన కూర్చోగలిగే వాళ్ళమా? అట్లాంటి చదువు మానమంటున్నావా? నీకు చదువు ఉన్నా లేకపోయినా ఒకటే . డబ్బు, గౌరవం, ఆనందం అన్నీ ఉంటాయి. నిన్నెవరూ అవమానించరు. కానీ మాకు చదువు తప్ప ఇంకో ఆధారం ఏదీ లేదు. ఉన్న ఒక్క ఆధారం ఒదులుకోమంటావా? మేం చదువుకోటానికి ఎంతెంత త్యాగాలు చేశారో మా కుటుంబాలవాళ్ళు, అవి చాలు . ఇంక మేం త్యాగం చెయ్యనవసరం లేదు’’.
శారదకు చాలా కష్టమనిపించింది. దు:ఖం వచ్చింది.
‘‘గాంధీ గారు ’’
‘‘ఆయనంటే మాకు గౌరవం ఉంది. కానీ ఆయనగానీ, మరెవరైనా గానీ మా కులం వాళ్ళ బతుకు బాగుచెయ్యగలరని నమ్మకం లేదు. మా చదువే మమ్మల్ని ఉద్ధరిస్తుంది. మేం చదువుకుని మా వాళ్ళకు చదువు చెబుతాం. సేవ చేస్తాం. అది కూడా దేశసేవే ! రాట్నం ఒడకటం, వందేమాతరం అని అరవటం మాత్రమే దేశసేవ కాదు’’ అంది థెరిసా.
‘‘మేం దీని గురించి ఆలోచించలేదనుకోకు శారదా . మేం మతం మార్చుకున్నాం కాబట్టి మమ్మల్ని కొంతవరకైనా మనుషుల్లా చూస్తున్నారు. తెల్లవాళ్ళ మీద నీకున్నంత కోపం మాకు లేదు. అసలు కోపమే లేదు. మనకు చదువు చెప్పే అమ్మగార్లు ఎంత మంచివాళ్ళు. వాళ్ళు వచ్చి మా మతం మార్చి మమ్మల్ని చదువుల్లో పెట్టకపోతే ఏమయ్యేవాళ్ళం. మీ వాళ్ళు మమ్మల్ని అంటుకోరే ? మమ్మల్ని వెలివేశారే ? మీరు మమ్మల్ని చూసినట్లు తెల్లవాళ్ళు మిమ్మల్ని చూస్తే మీరు భరించలేకపోతున్నారు. మేం ఎట్లా భరిస్తాం’’.
‘‘గాంధీగారు హరిజనుల కోసం కూడా … ’’
‘‘అది మాకు చాలదు. గాంధీ గారు వచ్చినపుడు మా ఇళ్ళకు వచ్చిన మీవాళ్ళుఆ తర్వాత స్నానాలు చేస్తారు. మమ్మల్ని ఇంట్లోకి రానిచ్చి ఆ ఇల్లంతా శుద్ధి చేసుకుంటారు. మీ వాళ్ళు మారరు. మా బతుకులూ మారవు. చదువు మాత్రమే కొంతైనా మారుస్తుంది. ఆ చదువు మేం ఒదలం. అది ఒదిలితే ఇంక బతికున్న శవాలమే. నువ్వు కూడా మానొద్దు. మీ వాళ్ళల్లో మాత్రం ఎంతమంది ఆడవాళ్ళను చదవనిస్తున్నారు? నువ్వు డాక్టరువై ఎంతో సేవ చేస్తానని చెప్పేదానివి. అది మాత్రం సేవ కాదా?’’
థెరిసా, వెరోనికా మాటకు శారద సమాధానం చెప్పలేకపోయింది.
‘‘ఊళ్ళో మా వాడల్లోకి కూడా రాట్నాలు వచ్చాయి. మా వాళ్ళూ చేయగలిగింది చేస్తున్నారు. మాకు మాత్రం వాటి మీద నమ్మకం లేదు.’’
ఇంతలో సుబ్బమ్మ గారు వాళ్ళ కోసం ఫలహారాలు తెచ్చారు.
‘‘నమస్కారమండీ. ఎప్పుడొచ్చినా మంచి మంచి ఫలహారాలు పెడతారు.’’ అంటూ వాటిని తినే పనిలో పడ్డారు వెరోనికా, థెరిసాలు.
శారదకు చాలా గందరగోళంగా అనిపించింది. ఫలహారం రుచించలా. అన్యమనస్కంగానే వాళ్ళకు వీడ్కోలు చెప్పింది. అన్నపూర్ణకు ఉత్తరం రాసినప్పటి ఉత్సాహం ఇప్పుడు లేదు. ఎంత వెనక్కు నెట్టినా ఆగకుండా ప్రశ్నలు వస్తున్నాయి. చదువుమానటం అనేది అందరికీ సాధ్యమయ్యే పనికాదు. ఆ పని చెయ్యని వాళ్ళను తక్కువగా చూడటం సరికాదు. అంటే చదువు మానేసి తను గొప్ప నాయకురాలై పోదు. అలా అవుతాననుకుంటే వెరోనికా, థెరిసా లను అవమానించినట్లే . కానీ హరిజనుల సంగతేమో కాని వేలమంది చదువులు మానుతున్నారు.
కానీ విదేశీ విద్య లేకపోతే ఆడవాళ్ళకు, హరిజనులకు ఇట్లా బైటికొచ్చి ఇంతమంచి చదువు చదివే అవకాశం ఉండేదా ? అదంతా తరవాత, గాంధీగారు ఆలోచించకుండా ఈ కార్యక్రమం ఇవ్వరు గదా ! దీని ప్రయోజనం తర్వాత తోస్తుంది. ఇంతమంది పెద్దలు కళాశాలల్ని, కోర్టుల్ని, ఉద్యోగాలను ఒదిలేస్తుంటే అది మంచి పని కాకుండా ఎలా ఉంటుంది.?
శారదకు ఆ రాత్రంతా నిద్రలేదు. తండ్రినడగటానికి సంకోచం. చివరికి తన పరిస్ధితి తన స్నేహితుల పరిస్థితీ ఒకటి కాదు గాబట్టి వాళ్ళ నిర్ణయమూ, తన నిర్ణయమూ కూడా సరైనవనే ఆలోచనను మనసులో స్థిరపరుచుకుని కొంత శాంతి పొందింది.
రెండు రోజుల తర్వాత హరిగారు వచ్చేసరికి శారద ఆయనను ఉత్సాహంగానే ఆహ్వానించింది. నిజానికి ఆయననుతానే వెళ్ళి కలిసి మాట్లాడానుకుంటున్నదేమో, ఆయనే వచ్చేసరికి హడావుడిగా అతిథి మర్యాదలు చేసి ఆయన ముందు విద్యార్థిలా కూచుంది. హరిగారు ఏమీ తెలియనట్లుగా
‘‘ఏ కాలేజీలో చేరుతున్నావమ్మా’’ అని అడిగారు.
‘‘ఏ కాలేజీలోనూ చేరదల్చుకోలేదండి’’ అంది శారద ఒక రకమైన గర్వంతో `
‘‘అదేమిటి ? ఎందుకు?’’ హరిగారు శారదను పరిశీలనగా చూస్తూ అడిగాడు.
‘‘నేనిక ఈ చదువు చదవదల్చుకోలేదు. స్వదేశీ ఉద్యమంలో చేరి పని చేయాలనుకుంటున్నాను’’.
హరిగారు నవ్వారు.
‘‘అలాగైతే సంతోషమే. ఏం పనిచేస్తావమ్మా’’
‘‘రాట్నం తిప్పుతాను. ఇంకా మీలాంటి వారు ఏం చెయ్యమంటే అది చేస్తాను. అసలు నేనే మీ దగ్గరకు వచ్చి మాట్లాడానుకున్నాను’’.
శారద ఉత్సాహం చూస్తుంటే హరిగారికి జాలివేసింది.
‘‘నేను చేసే పనులు రాయటమూ, ప్రజలను సమీకరించటమూ. ఆ రెండు పనులకూ నీకింకా వయసూ, అనుభవం కావాలి’’.
ఆయన మాటలు అర్థం కానట్లు చూసింది శారద.
‘‘రాజకీయాల గురించి రాయటానికి నువ్వింకా చదవాలి. ప్రజలను సమీకరించటానికి నీ వయసు చాలదు’’ మళ్ళీ నొక్కి చెప్పాడు.
‘‘నేనేం చెయ్యలేనంటారా?’’ ఆవేశంగా అడిగింది శారద.
‘‘జండా ఎగరేసి జైలుకి పోవచ్చు’’.
‘‘వెళ్తాను’’. దానికి తిరుగులేదనట్లు చెప్పింది శారద.
‘‘నువ్వు జైలుకి వెళ్ళి వచ్చేసరికి దేశంలో ఎన్ని మార్పులొస్తాయో. శారదా. నువ్వింకా చిన్నదానివి. మాకే ఈ ఉద్యమం సరిగా అర్థం కావటం లేదు. నువ్వు తొందర పడవద్దు. చదువుకుని తగిన వయసు వచ్చాక ఉద్యమం లోతుపాతు అర్థం చేసుకుని చేరితే బాగా పనిచేయగలుగుతావు.’’శారద అనుమానంగా, కాస్త అసహనంగా అన్నది ‘‘నాన్న నాతో ఇలా చెప్పమన్నారా?’’ అని.
‘‘చెప్పమంటే మాత్రం తప్పేముంది తల్లీ. మీ నాన్న ఆశలు నీకూ, నాకూ కూడా తెలియనివి కావు. నీకు ఏ పదో యేటనో పెళ్ళి చేస్తానని మీ నాన్న తలపెట్టి ఉంటే నేను అడ్డుచెప్పేవాడినా? సందేహమే! వచ్చి అక్షింతులు వేసి ఆశీర్వదించి వెళ్ళేవాడినేమో. నా ఆలోచన ఆడవాళ్ళ విషయంలో మీ నాన్న బుద్ధిలాగా పనిచేయదనుకుంటాను. మీ నాన్న నా ఆలోచనను ఎంతో మార్చాడు. ఆడవాళ్ళు చదువుకుంటే తప్ప దేశం బాగుపడదని అన్నాడు. మేమంతా ఒప్పుకున్నాం. మారాం. నా కూతురికి బాల్య వివాహం చెయ్యననీ చదివిస్తానని ప్రమాణం చేసుకున్నాను. అంతగా మారాను. నిన్ను చదివించటానికి మీ నాన్నమ్మను ఒదులుకున్నాడు. ఎందుకు? పట్టుదలకా? పంతానికా? కాదు. దేశం కోసమే. నీ చదువు నీ కోసమో, మీ నాన్న కోసమో, నా కోసమో కాదమ్మా. దేశం కోసం. దేశం డాక్టర్లయిన స్త్రీ కోసం ఎదురు చూస్తోంది. నీలాంటి వాళ్ళు దేశానికి అవసరం. రాట్నం తిప్పేవాళ్ళు చాలామంది ఉంటారు. కానీ డాక్టర్ చదివే అవకాశం, ఆసక్తి, వాళ్ళలో లక్షకి ఒకళ్ళకి కూడా ఉండదు. ఆ అవకాశం నీకుంది. నాకీ ఉద్యమం లోతుపాతులు బాగా తెలుసు. తెలిసిన వాడిగా చెబుతున్నాను. నీకు చదువే మంచిదనిపిస్తోంది. దేశంకోసం నువ్వీత్యాగం చెయ్యక తప్పదమ్మా.’’
శారద కంటి వెంట నీళ్ళు ధారగా కారుతున్నాయి. వాటిని ఆపుతూ అడిగింది శారద ` ‘‘మీరీమాట చదువు మానుతున్న యువకులందరితో ఇలాగే చెప్పగరా?’’
‘‘చెప్పను. చెప్పలేను. ఎవరి పరిస్థితులు వారికుంటాయి. కొందరు అత్యవసరంగా ఉద్యమానికి కావాలి. కొందరు నిదానంగా రావొచ్చు.’’
శారద కన్నీళ్ళు తుడిచారు హరిగారు.
‘‘నువ్వు చదువుకుంటూ కూడా చేయగలిగిన పనులు ఉన్నాయి. చాలా ఉన్నాయి. నేను నీ చేత ఆ పనులు చేయిస్తాను. ఉద్యమంలో భాగమయ్యావనే తృప్తి నీకు కలిగించే బాధ్యత నాది. రాట్నం ఒడకటమేనా? ఇంకా ఎన్నో పనులు చేయిస్తా నీ చేత.’’
శారద మనసు కుంగిపోయింది. మెదడు మండిపోతోంది.
చదువంటే శారదకూ ఇష్టమే. నెలరోజు ముందు వరకూ శారదకు చదువే సర్వస్వం. అలాంటి చదువును దేశం కోసం త్యాగం చేస్తే ఎంతో ఆనందంగా, తృప్తిగా, గర్వంగా ఉంటుంది. కానీ వీళ్ళంతా చదువు మానేసి చేయగలిగింది లేదని, చదవటమే మంచిదనీ చెప్తుంటే శారదకు నమ్మబుద్ధి కావటం లేదు.
నిరుత్సాహంతో, నిరాశతో వాడిన శారద ముఖం చూసి జాలి వేసింది హరిగారికి. కానీ శారద చదువు మానేసి చేసే పని కంటే డాక్టర్ కావటమే ఎక్కువ ప్రయోజనమని ఆయనకూ అనిపించింది.
‘‘నువ్వు విద్యావంతురాలిగా, మనుషుల ప్రాణాలు కాపాడగలిగే డాక్టర్గా ఆదర్శంగా నిబడాలమ్మా. నిన్ను చూసి ఎందరో ఆడపిల్లలు డాక్టర్లు కావాలి. ఆడపిల్లల తల్లిదండ్రులు నిన్ను చూసి వాళ్ళ పిల్లలకు పెళ్ళి చేయటం కాకుండా చదివించటం మంచిదనుకోవాలి. ఆడవాళ్ళు విద్యావంతులైతే దేశానికి జరిగే మేలు అంతా ఇంతా కాదు. నీ ఆవేశం తాత్కాలికం. నీ ఆదర్శం శాశ్వతం. నా మాట నమ్ము తల్లీ’’.
శారదను బుజ్జగిస్తూ, కన్నీరు తుడుస్తూ ప్రేమగా హరిగారు చెబుతున్న మాటల్లో నిజముందని అనిపిస్తున్నా, వాటిని అంగీకరించటానికి శారద మనసు సుతరామూ అంగీకరించటం లేదు.
రామారావు కూడా అవే మాటలు మళ్ళీ మళ్ళీ చెప్పాడు. చివరకు ప్రకాశం పంతులు గారు కూడా ‘‘దేశ సేవకు ఇంకా సమయం ఉంది. నీకింకా మైనారిటీ కూడా వెళ్ళలేదు. పదిహేనేళ్ళు దాటకుండా నువ్వు చెయ్యగలిగిన పనులు చాలా పరిమితం. కనీసం ఇంటర్ చదువు పూర్తిచెయ్యి. తర్వాత నేను నిన్ను నాతోపాటు తీసుకెళ్తాను’’ అని చెప్పారు.
కళాశాలలో దరాఖాస్తు చేయటానికి చివరి రోజున శారద ఎర్రగా ఉబ్బిన కళ్ళతో వెళ్ళి కాగితాలు ఇచ్చి వచ్చింది. కళాశాల తెరిచిన రోజున బలవంతంగా వెళ్ళినట్టు వెళ్ళింది.
నెలలు గడిచి పోతున్నాయి. ఉద్యమంలోకి ప్రజలు వరదలా వచ్చిపడుతున్నారు. అన్నపూర్ణ, అబ్బయ్యతో కలిసి గుంటూర్లో కాపురం పెట్టింది. వారికి ఇరు కుటుంబాల వారూ ఆర్థికంగా అండగా నిబడ్డారు. ఉన్నవ లక్ష్మీనారాయణగారితో కలిసి పన్నుల నిరాకరణోద్యమంలో పని చేస్తున్నామని అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివిన రోజు శారద పుస్తకం ముట్టుకోలేదు. అన్నం తినలేదు. తనుకూడా అన్నపూర్ణతో కలిసి గుంటూర్లో ఉండాని ఆ పిల్ల మనసు కొట్టుకుంది. రామారావు కూతురి పరిస్థితి గమనించి అనేక విధాలుగా నచ్చచెప్పాడు. రెండిరటికీ చెడవద్దని మొదటిసారి కూతురితో తీవ్రస్వరంతో మాట్లాడి కన్నీళ్ళు పెట్టుకున్న రామారావుని చూసి సుబ్బమ్మ కూడా శారదను కోప్పడింది.
తల్లిదండ్రుల బాధ చూసి శారద మనసును స్థిరంగా చదువు మీదే నిలపాలని నిర్ణయం తీసుకుంది. రెండేళ్ళపాటు ఊగిసలాటలో పడకూడదని స్నేహితురాలి అనుభవాలు పంచుకోవటంతో తృప్తిపడాలని గట్టిగా అనుకుంది.
పత్రికలో పెదనందిపాడులో జరిగిన మిలటరీ మార్చ్ గురించి, పోలీసులు రైతులను పెట్టిన హింస గురించి, వస్తున్నవార్తలు తనను ఉద్రిక్త పరుస్తున్నా నివరించుకుంటోంది. అబ్బయ్యకు కూడా లాఠీఛార్జిలో దెబ్బలు తగిలాయని, ఆస్పత్రిలో చేరి చికిత్స చేయించుకున్నాడనీ, నయమయిందనీ అన్నపూర్ణ రాసిన ఉత్తరం చదివి కన్నీరు కార్చింది. రోజులు ఎంత వేగంగా గడిచి పోతున్నాయంటే శారద మొదటి సంవత్సరం పరీక్షు రాసి శలవల్లో చదవవలసిన ఇతర పుస్తకాల జాబితా తయారుచేయటం మొదుపెట్టింది. రామారావుగారికి ఆరోగ్యం బాగుండటం లేదు. శలవల్లో తండ్రి చెబుతుంటే తను రాసిపెడతానని చెప్పింది. ఆయన ఆనందంగా ఒప్పుకున్నాడు. కానీ ఆయన ఇంట్లో ఉండే రోజులే తక్కువ. సభలు, సమావేశాలని ఆంధ్రదేశమంతా చేసే పర్యటనలే ఎక్కువ.
శారద తండ్రి పుస్తకాలు సర్దుతూ ఉంది ఆ రోజు. ఆయన చదువుతున్న పుస్తకాలు, చేయవలసిన పని అర్థమవుతున్న కొద్దీ శారదకు ఆయన మీద గౌరవం పెరుగుతోంది. తన తండ్రి కేవలం తనకు తండ్రి మాత్రమే కాదనీ, ఆంధ్రదేశపు చరిత్ర నిర్మించే ప్రముఖ వ్యక్తని తోస్తున్న కొద్దీ శారద తండ్రిని తన కోరికలు తీర్చే మనిషిగా కాక వేరుగా గుర్తించటం మొదలుపెట్టింది. తండ్రి గురించిన ఆలోచనలతో ఆయన పుస్తకాలతో ఉన్న శారదకు హాల్లో ఎవరివో మాటలు, నవ్వులూ వినిపించాయి. సుబ్బమ్మ ఎవరినో ‘‘ఎన్నాళ్ళకు కనపడ్డావమ్మా! రా! రా!’’ అంటూ ఆహ్వానించటం విని ‘ఎవరొచ్చారా’ అనుకుంది. అవతలి వ్యక్తి నవ్వూ, సమాధానమూ వినగానే ఒక్క పరుగున హాల్లోకి వచ్చి అన్నపూర్ణను కావలించుకుంది.
‘‘ఎప్పుడొచ్చావు? ఎలా వచ్చావు?’’ అని పక్కకు చూస్తే అబ్బయ్య కూడా ఉన్నాడు. శారద సంతోషానికి మితిలేకుండా పోయింది. వారిద్దరినీ కుశల ప్రశ్నతో ముంచెత్తింది.
అతిథులెవరు ఎప్పుడు ఆ ఇంటికి వచ్చినా ఆ ఇంట్లో ఎవరూ చెప్పకుండానే అన్ని మర్యాదలూ జరిగిపోయే ఏర్పాట్లున్నాయి. ఐనా అన్నపూర్ణ, అబ్బయ్యు స్నానాలు ముగించి, ఫలహారాు చేసే వరకూ శారద నిలిచిన చోట నిలవకుండా హడావుడి పడింది.
అంతా విశ్రాంతిగా కూర్చోగానే ‘‘చెప్పండి. సత్యాగ్రహం ఎలా నడుస్తోంది? పన్నుల నిరాకరణ గురించి ఇవాళ మీరు నాకు అన్ని వివరాలు చెప్పాలి.’’
అబ్బయ్య, అన్నపూర్ణ ఒకరి వంక ఒకరు చూసుకున్నారు. శారద చెప్పమన్నట్లు చూస్తుంటే `
‘‘అయిపోయింది శారదా. ముగించేస్తున్నారు’’ అంది అన్నపూర్ణ నిరుత్సాహంగా.
‘‘అదేంటి. ముగించటం ఏంటి?’’
‘‘రైతులు ప్రభుత్వాన్ని ఎదిరించారు. పన్ను చెల్లించేది లేదని గట్టిగా నిలబడ్డారు. ఐతే బ్రిటీష్ ప్రభుత్వం ఎంత హింసించింది వాళ్ళని . రైతుల కుటుంబాలు ఎన్నాళ్ళని ఈ హింసలు పడతారు. కొందరు రైతుల్ని కాల్చేశారు తెలుసుగా ? ఈ ఒక్క ప్రాంతంలో జరిగితే ప్రయోజనం ఏముంది? ఈ ప్రేరణతో దేశమంతా అన్ని వర్గాల వాళ్ళూ పన్ను కట్టకుండా ఉంటే అపుడే ప్రభుత్వం భయపడుతుందేమో ? ఇపుడది ప్రజల్ని భయపెడుతోంది. ఇలా ఎంత కాలం? అసలు గాంధీగారు ఈ ఉద్యమాన్ని మొదలుపెట్టనే వద్దన్నారట. ఇక్కడ మనవాళ్ళు చేయలగమని మొదలుపెట్టారు. సరే మొదలు పెట్టినందుకు నాలుగు నెలలు ప్రజలు ఎంతో ధైర్యంగా నిలబడ్డారు. ప్రభుత్వం హింసకు దిగింది. ఇక దీనికి అంతం ఏమిటి? ఇంకే ప్రాంతంలోనూ ఇలాంటి ఉద్యమం రాలేదు. ఒక్కచోట ప్రజలు ఎంతకాలమని చేస్తారు. అందుకని విరమించేస్తున్నారు. రేపో, మాపో ప్రకటన వస్తుంది. ప్రకాశంగారు వచ్చి ఉన్నవవారితో, వెంకటప్పయ్య గారితో మాట్లాడారు. అంతా నిశ్చయం అయింది’’.
అబ్బయ్య చెబుతుంటే శారద నివ్వెరపోయి విన్నది.
‘‘ప్రజల త్యాగాలు వృథా కావాల్సిందేనా? నాలుగు నెలల్లో ఏం సాధించాం?’’ ఆవేశపడింది.
‘‘లేదు శారద గారూ, ప్రజలకు తమ మీద ఎంత కోపం ఉందో, ఎలా తిరగబడగలరో ప్రభుత్వానికి తెలిసింది. ప్రభుత్వం ఎంత క్రూరమైందో ప్రజలకీతెలిసింది. దీనిని కొనసాగించటం కష్టం. స్వరాజ్యం వచ్చేంత వరకూ పన్ను చెల్లించకుండా ప్రభుత్వానికి ఎదురుతిరిగి నిలబడటం చాలా కష్టం. ఒక్క ప్రాంతంవల్ల ప్రయోజనం లేదు. మిగతా ప్రాంతాల్లో ఈ అగ్ని రాజుకోలేదు.’’
అబ్బయ్య, అన్నపూర్ణ ఉద్యమం గురించి చాలాసేపు మాట్లాడారు. చివరికి అబ్బయ్య అన్నాడు.
‘‘నేను మళ్ళీ కాలేజీలో చేరి పరీక్షలు రాద్దామనుకుంటున్నాను. కాలేజీవాళ్ళు ఒప్పుకుంటారో లేదో తెలియదు. ఇప్పుడే మాట్లాడి కాలేజీలు తెరిచే సమయానికి రావాలని అనుకున్నాం. అవసరమైతే మీ నాన్నగారి సాయం తీసుకుందామని వచ్చాం’’. అబ్బయ్య మాటలు శారదను అయోమయంలో పడేశాయి.
‘‘మళ్ళీ కాలేజీలో చేరతారా?’’
‘‘దేశానికి చదువుకున్న వాళ్ళు, ఏదో ఒక రంగంలోన నిష్ణాతులైనవాళ్ళూ అవసరమేననిపిస్తోంది. ఈ చివరి పరీక్ష రాస్తే ఎమ్మెస్సీ పట్టా చేతికొస్తుంది. ఏ కాలేజీలోనైనా ఉద్యోగం చేస్తూ విద్యార్థులలో జాతీయ భావాలు వ్యాపింపజేయవచ్చు’’
శారద మరేం మాట్లాడలేకపోయింది. అబ్బయ్య భోజనం చేసి కాలేజీకి వెళ్ళి స్నేహితులను కలుసుకుని వస్తానని వెళ్ళాడు.
అన్నపూర్ణ, శారద అంతు లేకుండా కబుర్లు చెప్పుకున్నారు.
ఆ రాత్రి రామారావు వచ్చాక అబ్బయ్య సంగతి తెలుసుకుని తను చేయగలిగిన సహాయం చేస్తానన్నాడు. మర్నాడే వెళ్ళి కొందరు ప్రొఫెసర్లను కలిసేందుకు నిర్ణయించుకున్నారు. అబ్బయ్య మళ్ళీ చదువుతాననేసరికి రామారావుకి కొండంత బలం వచ్చింది. ‘‘శారదను బలవంతంగా కాలేజీలో చేర్పించానా? తన గురించి శారద ఏమనుకుంటుంది? తనామె స్వాతంత్రాన్ని హరించాడా’’ అనే సందేహాలు రామారావుని అపుడపుడు బాధిస్తూ ఉండేవి.ఇపుడు అబ్బయ్య రాకతో ఆ సందేహాలు కాస్త ఉపశమించాయి. చదువుకోవటం అవసరమని శారద గ్రహిస్తుందనే కొత్త ధైర్యం వచ్చింది. అబ్బయ్యను అతి కష్టం మీద మళ్ళీ కాలేజీలో చేర్పించారు. ఆ పది రోజు శారదకు పది క్షణాల్లా గడిచాయి. అన్నపూర్ణకు మద్రాసంతా చూపించారు అబ్బయ్య శారదా కలిసి.
అబ్బయ్య ఉద్యమం గురించి నాయకుల గురించి ఎన్నో సంగతులు చెప్పాడు. నాయకులలో విభేదాలు, వారి అహంకారాలు, తీరుతెన్నులు, పంతాలు, పట్టింపులు, వాటికోసం ఉద్యమానికి నష్టం కలిగినా పట్టించుకోని తత్త్వం, లేనట్టు కనిపిస్తూనే ఉన్న కులతత్త్వం అన్నిటి గురించీ అబ్బయ్య చెప్తుంటే శారదకు కొత్త ప్రపంచమొకటి పరిచయమైనట్లు అనిపించింది.
‘‘చాలా కష్టం రాజకీయాలో నెగ్గుకురావటం. నాలాంటివాడికి అవి సరిపడవని అర్థమైంది. నేను ప్రత్యక్షంగా దిగి పని చేయలేను. నాకు చేతనైన పని నేనూ విడిగా చేస్తా’’.
‘‘కానీ మరి ఎలా? అందరూ మీలా అనుకుంటే ` ’’
‘‘అనుకోరు. నాయకులు అనుకోరు. వారి అనుచరులు వారికుంటారు. నేను ఎవరికీ అనుచరుడిగా ఉండలేను. నా చేతనైన పనేదో నేను చేసుకుపోతాను. అంతే ` ’’
అబ్బయ్య మాటలు శారదను ఆలోచనలో పడేశాయి. తను ప్రత్యక్షంగా పాల్గొంటే తప్ప తెలియదనుకుంది శారద.
ఈసారి కాలేజీ తెరిచేసరికి శారద మనసు పూర్తిగా చదువుమీద లగ్నం అయింది. దేశ వాతావరణం కూడా తాత్కాలికంగా చల్లబడింది.
శారద ఇంటర్ పూర్తి చేస్తుండగా రామారావు జబ్బుపడ్డాడు. ఆయన చేసే పనికి ఆయనకున్న ఓపికకు పొంతన లేకుండా పోయింది. అది నేరుగా గుండె మీద పని చేసింది. ఆరోగ్యం పాడవుతున్నదని తెలిశాక రామారావు తన పనులను మరింత పెంచుకున్నాడు. తనకున్న సమయం అతి తక్కువని ఆయనకు అర్థమైంది. దాంతో ఆ తక్కువ సమయాన్ని పరిశోధన కోసం ఖర్చు చెయ్యటం అత్యవసరమనుకున్నాడు. చివరికో రోజు మంచంలోంచి లేవలేని పరిస్థితి వచ్చింది.
సుబ్బమ్మకు అంతకుముందు నుంచే అనుమానంగా ఉంది. ఆ రోజు రూఢీ అయింది. శారద ఆ రోజు చాలా కంగారు పడింది. మద్రాసులో పేరున్న వైద్యులందరూ వచ్చారు. అందరు చెప్పిందీ ఒకటే మాట. ఆయన చేస్తున్న పనులన్నీ మానేసి విశ్రాంతిగా కనీసం ఆరునెలలు గడపాలి. తర్వాతనే మందుల పని. విశ్రాంతే ఆయనకు మందు. విపరీతంగా అలసిపోయాడు. శారద తండ్రిని కదలనీయకుండా, చదవనీయకుండా రాయకుండా చూస్తానని అందరితో చెప్పింది. అది కష్టమైనపని అని కూడా శారద అనుకోలేదు.
కానీ ఒక్కరోజు మాత్రమే శారద ఆ పని చేయగలిగింది. రెండోరోజు రాత్రి పన్నెండు గంటలకు తండ్రిని ఒకసారి చూద్దామనిఆయన గదిలోకి వెళ్ళిన శారద నిర్ఘాంతపోయింది. ఆయన మంచం నిండా పుస్తకాలు. మంచం మీద దిండు, గట్టి అట్ట ఒళ్ళో పెట్టుకుని ఆయన రాసుకుంటున్నాడు. శారదకు కోపం వచ్చింది ఏం మాట్లాడకుండా వెళ్ళి మంచంనిండా పరిచి ఉన్న పుస్తకాలు తీయటం మొదలుపెట్టింది. రామారావు అది కూడా గమనించనంతగా పనిలో నిమగ్నమయ్యాడు. అన్ని పుస్తకాలు తీసేసి చివరికి తండ్రి చేతిలో కలం తీసుకుంటున్నపుడు ఆయన స్పృహలోకి వచ్చాడు. అంత రాత్రివేళ శారద నిద్రపోకుండా తన గదిలోకి వచ్చినందుకు ఆయనకు కోపం వచ్చింది.
శారద ముఖం చూస్తే ఆమెకూ కోపంగానే ఉన్నట్టుంది. అందుకే శారద ఒళ్ళోనుంచి అట్ట తీసి పక్కనబెట్టి, దిండు తల దగ్గర వేసి, రెండు భుజాల మీదా చేతులు వేసి ఆయనను పడుకోబెడుతుంటే మాట్లాడకుండా పడుకున్నాడు. ఓ గంట తండ్రి పక్కనే కూచుని ఆయన నిద్రపోయాడని నమ్మి శారద వెళ్ళి పడుకుంది.
శారద వెళ్ళి పడుకుందని నమ్మకం కలగగానే ఆయన దొంగతనం చేసే వాడిలా వెళ్ళి దీపం వెలిగించుకుని పుస్తకాలు, కాగితాలు, కలం అన్నీ తీసుకుని రాసుకునే బల్ల దగ్గరకు నడిచాడు.
మర్నాడు శారద ఉదయాన్నే తండ్రికి కాఫీ తీసుకొచ్చేసరికి తండ్రి బల్లమీద ఒంగి చదువుతూ ఉన్నాడు. రాత్రంతా ఆయనలాగే కూచున్నాడని శారదకు అర్థమైంది.
కాపీకప్పు బల్ల మీద పెట్టి శారద పెద్దగా ఏడ్చేసింది. రామారావు బిత్తర పోయి లేచాడు.
‘‘శారదా ! ఏమైందమ్మా’’ అని శారదను పట్టుకున్నాడు.
‘‘నాన్నా !నువ్వు లేకుండా నేను బతకలేను. నా కోసం నువ్వు క్షేమంగా ఉండాలి నాన్నా’’ అని వెక్కిళ్ళు పెట్టింది శారద.
‘‘నాకేమయిందమ్మా? బాగానే ఉన్నా’’
‘‘డాక్టర్లందరూ నిన్ను విశ్రాంతిగా ఉండమన్నారు. నువ్వేమో రాత్రింబగళ్ళూ పనిచేస్తున్నావు’’.
‘‘శారదా ` నీతో నేనెప్పుడు అబద్ధం ఆడలేదమ్మా. ఇప్పుడూ ఆడను. చదవకుండా, రాసుకోకుండా నేనుండలేను. మంచం మీద పడుకుంటే నిద్రరాదు. తలనిండా ఆలోచలను. నేను పరిష్కరించాల్సిన శాసనాలు ఉన్నాయి. అధ్యయనం చెయ్యాల్సిన చరిత్ర ఉంది. అదంతా చేస్తూ రాయవలసిందెంతో ఉంది. అదంతా మానేసి మంచంలో కళ్ళు మూసుకుపడుకోవటం నావల్ల కాదమ్మా’’.
శారదకు తనముందున్నదెంత పెద్ద సమస్యో అర్థమై కాళ్ళూ చేతులు ఒణికాయి.
‘‘నాన్నా నీకేదయినా అయితే నేను తట్టుకోలేను’’.
‘‘నాకేం కాదమ్మా’’ బలహీనంగా పలికిన ఆయన గొంతుమీద ఆయనకే నమ్మకం కలగలేదు.
‘‘నా మాట వినక తప్పదు’’ అని తండ్రిని అక్కడి నుంచి లేపి స్నానాదులు అయ్యాక తనే దగ్గర కూచుని ఈ మాటా, ఆ మాటా చెప్తూ ఉంది. కళాశాలకు శలవవటంతో నాలుగు రోజు ఆయనను అంటిపెట్టుకుని ఉండి ఆయనను పుస్తకాల బారినుంచి రక్షించింది.
ఐతే శారదకు పరీక్షలు తరుముకొస్తున్నాయి. ఆమె చదువుకుంటూ తల్లికి ఈ బాధ్యత అప్పగించక తప్పలేదు.
శారద పరీక్షలు మొదలవకముందే రామారావు పరిస్థితి క్షీణించింది. వైద్యులు ఆయనను మద్రాసు నుంచి ఇంకెక్కడికైనా, పుస్తకాలు బొత్తిగా దొరకని చోటికి, పంపిస్తే తప్ప పరిస్థితి చక్కబడదన్నారు.
రామారావు తానెక్కడికీ వెళ్ళనన్నాడు గానీ శారద ఊరుకోలేదు. తండ్రిని తీసుకుని స్వంత ఊరు వెళ్ళటానికి ఏర్పాట్లు చేయటంలో పడింది.
ఆ రోజు రాత్రి సుబ్బమ్మ శారద దగ్గరకు వచ్చింది. రామారావు అనారోగ్యం పెరుగుతున్నకొద్దీ వాళ్ళిద్దరూ మాట్లాడుకోడం ఎందుకో తగ్గిపోయింది. ఒకరిని చూడటానికి ఒకరు భయపడుతున్నట్లుగా ఉన్నారు.
తల్లి తన దగ్గరకు రావటంతో శారద తల్లికి ధైర్యం చెప్పాలనుకుంది.
‘‘అమ్మా నువ్వేం భయపడకు. నాన్నకు తగ్గిపోతుంది.’’
సుబ్బమ్మ ఆ మాటలు విననట్టుగా ‘‘మీ నాయనమ్మకు వెంటనే ఉత్తరం రాయి. ఉన్న విషయం ఉన్నట్టుగా రాయి’’ అంది.
శారద నోటమాట రాలేదు.
‘‘మీ నాయనమ్మ కాశీనుంచి రావాలనుకుంటే తగిన సమయం ఇవ్వాలి గదా శారదా ` తీరా ఆవిడ’’ అంటూ కొంగు నోట్లో కుక్కుకుంది. శారదకు ఆ మాట సారాంశం అర్థమయ్యేసరికి తల తిరిగిపోయింది. తండ్రిని రక్షించుకోగలననే ఆలోచన తప్ప ఆయనకేమైనా అవుతుందనే ఊహ లేదు శారదకు.
‘‘నువ్వు వెంటనే ఉత్తరం రాయి. లేదా టెలిగ్రామో ఏదో అంటారుగా అదైనా ఇవ్వు ` మీ నాన్న జబ్బు ఆవిడకు తెలియాలి’’.
స్థిరంగా చెప్పి అక్కడినుంచి వెళ్ళిపోయింది.
శారద రాత్రంతా అలాగే కూచుని ఉంది. ఆ అమ్మాయి మెదడులో ఏ ఆలోచనా లేదు. అంతా శూన్యం.
తెల్లవారిన తర్వాత ఎవరో బలవంతంగా చేయిస్తున్నట్లు పనులు చేసుకుని టెలిగ్రాం ఇవ్వటానికి వెళ్ళింది.
నరసమ్మ కాశీ వెళ్ళిన కొత్తలో ఉత్తరాలు ఎక్కువగానే రెండువైపు నుంచీ నడిచేవి. రెండు మూడేళ్ళలో అవి క్రమంగా తగ్గాయి. క్షేమంగా ఉన్నానంటూ క్లుప్తంగా ఒక కార్డు మాత్రం వచ్చేది. రామారావు గారు క్రమం తప్పకుండా తల్లికి కావలసిన డబ్బు పంపుతుండేవాడు. మధ్యలో ఒకరిద్దరు స్నేహితులు కాశీ వెళ్ళొచ్చినవాళ్ళు నరసమ్మను చూశామనీ, ఆవిడ పూర్తిగా కాశీ మనిషై పోయిందనీ చెప్పేవాళ్ళు. గంగా స్నానం, ఈశ్వర దర్శనం, పురాణ పఠనం ఇవి తప్ప ఆవిడకు మరో ధ్యాస లేదనీ, అక్కడ తెలుగు వాళ్ళందరికీ మంచీ చెడ్డా చెబుతుంటుదనీ, ఆవిడ చాలా ఆనందంగా ఉందనీ, ముఖంలో తేజస్సు పెరిగిందని, రుషిలాగా ఉంది గానీ మామూలు మనిషిలా లేదని చెప్పారు. సుబ్బమ్మ ఆశ్చర్యంగా వినేది.
‘‘అత్తయ్య మనందరికీ దూరంగా అంత ఆనందంగా ఎలా ఉన్నార’’ని రామారావు నడిగేది.
‘‘మనస్సు ఒకే విషయం మీద లగ్నమైనపుడు, ఇతర విషయాలు అంటనపుడు, ఆ లగ్నమైన విషయం మీద చేసే పనికి ఆటంకం రానపుడు మనుషులకు ఆనందం కుగుతుంది. అదృష్టవశాత్తు మా అమ్మకు పరమేశ్వరుడి మీద మనసు అంత ఏకాగ్రతతో లగ్నమైనట్లుంది. చీకూ చింతా లేకుండా బతుకుతోంది. ఆవిడా అదృష్టవంతురాు. మనమూ అదృష్టవంతులం’’ అనేవాడు.
ఎక్కడున్నా ఆవిడ హాయిగా ఆరోగ్యంగా ఉందని బంధువులందరూ కూడా అదో విశేషంగా చెప్పుకునేవారు. తన చదువు కారణంగా నాయనమ్మ అంత దూరాన ఒంటరిగా ఉంటుందనే దిగులు శారదకు లేకుండా సుబ్బమ్మ, రామారావు శారదతో నాయనమ్మ గురించి ఎన్నో సంగతులు చెప్పేవారు.
ఇపుడు ఈ వార్త విని నాయనమ్మ తట్టుకుంటుందా? వస్తుందా? రాకుండా అక్కడే బాధపడుతూ ఎలా ఉంటుంది?
నాయనమ్మకిలా టెలిగ్రాం ఇచ్చామని నాన్నకు చెప్పవచ్చా ? అసలు నాన్న ఆరోగ్యం ఎందుకింత పాడయింది?
ఎన్నో సందేహాలు?
మధ్యాహ్నం ‘‘అందరం కలిసి భోజనం చేద్దా’’ మన్నాడు రామారావు.
ముగ్గురూ కలిసి తింటున్నారు గానీ ఎవరికీ ముద్ద గొంతు దిగటం లేదు.
‘‘మన ఇల్లు బాగు చేయించారట నాన్నా. ఎల్లుండి మనం బయుదేరుతున్నాం’’ అంది శారద.
‘‘మనం బయలు దేరటమేమిటి? నన్ను గదా డాక్టర్లు వెళ్ళమన్నది’’ అన్నాడు రామారావు.
‘‘మీరొక్కరూ వెళ్ళి ఏం చేస్తారు?’’
‘‘ఊ ` నువ్వొచ్చి నాకు ఒండి పెడుతూ ఉంటే ఇక్కడ శారద పరీక్షలు ఎలా రాస్తుందనుకున్నావు? తన సంగతి ఎవరు చూస్తారు?’’
‘‘నేనీ సంవత్సరం పరీక్షలు రాయను నాన్నా. వచ్చే సంవత్సరం రాస్తాను’’.
‘‘ఆ మాట వింటుంటేనే నా జబ్బు పెరిగిపోతోంది. నువ్వు పరీక్షలు మానేసి నా పక్కన కూచుంటే నాకు నయమవుతుందనుకుంటున్నావా? చాలా అధ్వాన్నమవుతుంది నా పరిస్థితి’’.
‘‘మరి ఒక్కడివే ` ఎలా’’
‘‘మన ఊరమ్మా అది . ఎంతమందో ఉన్నారు. పైగా మన సోమేశ్వర రావు తెలుసు గదా ` ఆయన నాతోవస్తానన్నాడు. ఇద్దరం వెళ్ళి నాకు కాస్త నెమ్మదించగానే తిరిగి వస్తాం. నా మంచి చెడ్డా అన్నీ చూసుకోగలడు. మీఅమ్మకంటే వంట బాగా చేస్తాడు. నేను అంతా మాట్లాడాను ` ’’
తల్లీ కూతుళ్ళ ముఖాల్లో నెత్తురు చుక్క లేదు. రామారావు గారు నెమ్మదిగా చెబుతాడుగాని ఆయన ఒక నిర్ణయం తీసుకుంటే దానినుంచి ఆయనను ఎవరూ మళ్ళించలేరని వాళ్ళకు తెలిసినట్లు ఎవరికీ తెలియదు.
‘‘నేను బయల్దేరి వెళ్ళేప్పుడు మీరిద్దరూ కంటతడి పెట్టుకుంటే నేనక్కడ నిశ్చింతగా ఉండలేను. శారద ! నీకు పరీక్షల్లో మంచి మార్కు రావటం, మెడికల్ కాలేజీలో సీటు రావటం ఇవి నా ఆరోగ్యాన్ని చక్కబరుస్తాయని నీకు తెలుసు. అది జరగకపోతే నా ఆరోగ్యం బాగుపడదని చెప్పక్కర్లేదుగా. నా సంగతి నాకు ఒదిలి నువ్వు నిశ్చితంగా చదివి పరీక్షలు రాయి. నిన్ను మెడికల్ కాలేజీలో చేర్చటానికి నేను ఆరోగ్యంగా తిరిగి వస్తా’’.
రామారావు మాటలు భరించలేక సుబ్బమ్మ అక్కడినుంచి వెళ్ళిపోయింది. శారద దు:ఖాన్ని నిగ్రహించుకుంటూ అక్కడే తలదించుకు కూచుంది. మర్నాడు రామారావు గారు మద్రాసు నుంచి రెండు మూడు నెలల కోసం స్వగ్రామం వెళ్తున్నారని తెలిసి నుగురైదుగురు మిత్రులు వచ్చి చూసి వెళ్ళారు. వాళ్ళతో ఉత్సాహంగా తన పరిశోధన గురించి మాట్లాడుతున్న తండ్రిని చూసి శారదకు ధైర్యం వచ్చింది.
ధైర్యంగానే తండ్రిని రైలెక్కించి వచ్చి చదువులో మునిగింది.
సుబ్బమ్మ కూతురికి అన్నీ అమరుస్తుందే గాని లోలోపల కుంగిపోతోంది. అది శారద గమనించకుండా జాగ్రత్త పడుతోంది .
నరసమ్మ కాశీ నుంచి ఉత్తరం రాసింది. రామారావు ఆరోగ్యం జాగ్రత్త అని చెబుతూ, తాను కాశీ ఒదిలి ఎన్నటికీ రాలేననీ, తన బంధాలను విముక్తం చేసుకునే క్రమంలో ఉన్నాననీ, ఏ బంధాలు తనను గంగమ్మ నుండి విడదీయలేవనీ, తనను అర్థం చేసుకోమనీ రాసింది.
ఆ ఉత్తరం వచ్చిన రోజంతా సుబ్బమ్మ ఏడుస్తూనే ఉంది.
శారద చదువు అంత ముఖ్యమా అని మొదటిసారిగా అనిపించిందామెకు.
తల్లీ కొడుకు దూరమయ్యారు. తనకు అత్తగారి అండ లేకుండా పోయింది. ఇప్పుడు ఆ చదువు మూలంగానే తను భర్తకు సేవ చేయకుండా ఇక్కడ ఉండిపోవాల్సి వచ్చింది. కూతురంటే ప్రాణమిచ్చే తండ్రికి జబ్బుచేస్తే పక్కన లేకుండా ఆ కూతురు చదివి ఉద్ధరించాల్సిందేమిటి? ఎవర్ని? సరిగ్గా ఈ ప్రశ్నకు సమాధానమా అన్నట్లు రామారావు గ్రామం చేరుకోగానే ఒక ఉత్తరం రాశాడు.
ప్రియమైన సుబ్బమ్మకు `
నేను క్షేమంగా చేరాను. సోమేశ్వరరావు ప్రయాణంలో నన్ను కంటికి రెప్పలా చూసుకున్నాడు. ఇక్కడ నాకు విశ్రాంతి దొరుకుతుందని వైద్యులు అనుకున్నారు. విశ్రాంతి వ్ల నా ఆరోగ్యం కుదుటపడవచ్చని అనుకున్నారు. కానీ రెండూ నిజాలు కావు. నాకు విశ్రాంతి కావసింది శరీరానికి కాదు. మనసుకి. సరిగ్గా చెప్పాంటే మెదడుకి. అది అసంభవం. నిరంతరం నా మెదడు ఆలోచిస్తూనే వుంది. చరిత్ర గురించి తేలవసిన విషయాలు ఎన్నో ఉన్నాయి. జాతికి చరిత్ర అవసరం. చరిత్ర లేని జాతి ముందుకు పోలేదు. మనకు చరిత్ర ఘనమైనది ఉండికూడా చరిత్రహీనుల్లా బ్రతకవలసి రావటం ఎంత దురదృష్టమో, అది నన్ను ఎంత బాధిస్తున్నదో నీకు అర్థంకాదు. ఆ చరిత్రను నిర్మించాలంటే ఎన్నో చిక్కు ప్రశ్నలు . ఆధారాలకోసం కీకారణ్యంలో గుప్తనిధులకోసం ఒంటరిగా వెతుకుతున్న వాడి చందంగా ఉంది నా పరిస్థితి. పరిష్కరించవసిన విషయాల నుంచి మనసుకి విశ్రాంతి దొరకటం లేదు. దానికోసం చదవవలసినవి చదవకుండా రాయవలసినవి రాయకుండా నేను జీవించలేను. ఆ పని చేస్తే నాకు నేను జీవించనని వైద్యులు చెబుతున్నారు. సత్యమేమిటంటే నేను ఎక్కువ రోజులు జీవించబోవటం లేదు. దీనిని నువ్వు జీర్ణించుకోవాలి.
ఈ ఉత్తరం చదివి నువ్వు బలహీనురాలివి కాకూడదు. బలాన్ని పొందాలి. ఎందుకంటే మనిద్దరి ప్రాణాలు మన శారదాంబ మీద పెట్టుకుని ఉన్నాం. నా ప్రాణాలు పోతే శారదాంబకు ఎలాంటి లోటూ కలగకూడదు. శారదకు నా మరణం అశనిపాతంలా తగులుతుంది. మన అమ్మాయిని దానినుంచి రక్షించుకోవలసింది నువ్వే. అందుకు నువ్వు నీ సర్వశక్తులతో సిద్ధం కావాలి. అమ్మాయి చదువు ఎట్టి పరిస్థితుల్లోనూ ఆగకూడదు. అమ్మాయి డాక్టర్ కావాలి. అది నాకు చరిత్ర రచనతో సమానమైన కోరిక అని నీకు తెలుసు. ఆ భారం, బాధ్యత నీవు ఒక్కదానివే వహించవలసి ఉంటుంది. నేను నీమీద ఇంత బరువు మోపి వెళ్ళటం అన్యాయమని నాకూ తెలుసు. కానీ నాకు వేరు గత్యంతరం లేదు. నాకు వచ్చిన జబ్బు ప్రాణాలు తీసేదే గాని, ఆశను మిగిల్చేది కాదు.
నా మరణాన్ని శారద ఎట్లా తట్టుకుంటుందనే చింతే ప్రస్తుతం నా జబ్బు కంటే ఎక్కువ నన్ను బాధిస్తుంది. శారదకేం ఫరవాలేదు నేనున్నానని నీవు హామి ఇవ్వాలి. ఇది కఠినత్వమే. కానీ జీవించే రోజు తక్కువ ఉన్న మనిషికి కఠినత్వం కవచంలా రక్షణ ఇస్తుంది. ఆ కవచం ధరించే నేనీ ఉత్తరం రాస్తున్నాను. నన్ను క్షమించు, క్షమించకపో, అది నీ ఇష్టానికి, విచక్షణకు వదిలివేస్తున్నాను. కానీ శారదను స్వేచ్ఛగా ఏ లోటూ లేకుండా పెరగనివ్వు. మంచి డాక్టర్ కావాలి నా తల్లి. ఆధునిక మహిళ కావాలి నా కూతురు. ఈ దేశం గర్వించాలి మన అమ్మాయిని చూసి. చరిత్ర నిర్మించాలి నా చిట్టితల్లి. నాలా చరిత్ర రాయటం కాదు చరిత్ర నిర్మించాలి. అర్థమైందా? ఎంత పెద్ద ఆశతో జ్వలిస్తున్నదో నా ప్రాణం. సుబ్బూ ` ఇదంతా నీ వల్లే అవుతుంది. మన అమ్మాయి తెలివి, శక్తియుక్తులు మనకు తెలియనవి కావు. తప్పకుండా నా ఆశలన్నీ ఫలిస్తాయి.
ఇక్కడ ఎన్నిరోజు ప్రాప్తముంటే అన్ని రోజులుంటాను. శారద పరీక్షలయ్యాక మీరిద్దరూ కలిసి రండి.
నీవనుకుంటూ ఉండి ఉంటావు. శారద పరీక్షలు అంత ముఖ్యమా అని ? నువ్వనుకుంటున్నదానికంటే ముఖ్యం నాకు. శారద పరీక్షలు మాని నా దగ్గర కూర్చుంటే నా అశాంతి, అనారోగ్యం పెరుగుతాయ్ కాని తరగవు. ఇంక రాయలేకపోతున్నాను. నేను రాయనివి, రాయలేనివి కూడా నీవు గ్రహించగవు.
నీ ప్రియమైన
రామారావు.
ఈ ఉత్తరం చదివి సుబ్బమ్మ గుండె రాయి చేసుకుంది. జరిగేది తొస్తూనే ఉంది జరగవసింది చూడాలి. అది కష్టమైనా సరే పళ్ళ బిగువున భరించాలి. శారద పరీక్షలు అయ్యేంతవరకూ తన ముఖంలో బాధ కనపడకూడదు. తన కంట్లో కన్నీరు ఊరకూడదు.
ఒక కఠోర తపస్సులా ఆ రెండూ చేసింది సుబ్బమ్మ.
శారదకు తండ్రి క్షేమంగా ఉన్నానని ఉత్తరాలు రాస్తున్నాడు. రెండు నెలలు సుబ్బమ్మకు రెండేళ్ళలా గడిచాయి. శారద పరీక్షలు ముగిశాయి. ఊరికి ప్రయాణమవుతున్నారు తల్లీ కూతుళ్ళు.
రామారావు మరి లేడనే వార్త ఆంధ్రదేశమంతా దావానలంలా వ్యాపించింది. శారదకు స్పృహ తప్పింది. సుబ్బమ్మ కూతురిని గురించి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటూ ఊరికి వెళ్ళి భర్త అంత్యక్రియలన్నీ బంధువులు, స్నేహితుల సహాయంతో జరిపించింది.
ఆంధ్రదేశమంతా కన్నీరు కార్చింది. సాహితీవేత్తలు , పండితులు , చరిత్ర పరిశోధకులు , స్వతంత్రోద్యమ నాయకులు ఒకరేమిటి రామారావు గారి నెరిగిన ప్రతివారూ తమ ఇంట్లో స్వంత మనిషి పోయినట్లుగా బాధపడ్డారు. జ్వరంతో మంచం పట్టిన శారదను తీసుకుని మద్రాసు వచ్చింది సుబ్బమ్మ.
***
బాలా బాగా రాస్తున్నారు. ఏడు భాగాలు చదివాను. ఈ రామారావు గారు ఎవరండి.?