గమనమే గమ్యం-2

 

Volga-1కృష్ణానదీ తీరంలో గుంటూరుకు దగ్గరగా ఉన్న పెద్ద గ్రామంలో స్థితిమంతుల కుటుంబం రామారావుది. నాలుగైదొందల ఇళ్ళున్న ఆ గ్రామంలో మాగాణి భూములు బంగారం పండుతాయి. అన్ని వసతులూ ఉన్న గ్రామం. బ్రాహ్మణ కుటుంబాలు ముప్ఫై, నలభై మధ్యలో ఉన్నాయి. మిగిలినవి రైతు కుటుంబాలు, చేతి వృత్తుల వారి కుటుంబాలు. ఊరి చివర ఓ వంద గుడిశల మాలపల్లి ఉంది. మంచి బడి, పెద్ద గుడి ఉన్న గ్రామం.

గుంటూరికి, బెజవాడకూ దగ్గరగా ఉండటంతో పట్టణ పోకడలను తొందరగా అందిపుచ్చుకునే అవకాశం ఉన్న గ్రామం. రామారావు తండ్రి చిన్నప్పుడే పోయాడు. తల్లి అన్ని బాధ్యతలూ మోసి పెంచింది. అక్క శారదాంబ తమ్ముడిని అమితంగా ప్రేమించేది. పెళ్ళయి తను పట్నంలో కాపురం పెడుతూ తనతో పాటు తమ్ముడినీ తీసుకెళ్ళి కాలేజీ చదువు వరకూ తనే బాధ్యత తీసుకుంది. తమ్ముడి పెళ్ళి చేసిన రెండేళ్ళకే ఆమె మరణించింది. రామారావు అక్క మరణం నుంచి కోలుకోటానికే రెండేళ్ళు పట్టింది. చిన్న శారదాంబ పుట్టిన తర్వాత ఆయన మళ్ళీ మనిషై తనకు ఆసక్తి ఉన్న సాహిత్యం, చరిత్ర విషయాల మీద పని చేస్తున్నాడు.

నెలకు పదిరోజులు పైగా రామారావు మద్రాసు, విశాఖపట్నం, గుంటూరు, బెజవాడలు వెళ్ళటం ఇంట్లో వాళ్ళకి అలవాటే. ఇంటి పనులూ, పొలం పనులు అన్నీ తల్లి నరసమ్మే చూసుకుంటుంది. ఆవిడ చాలా సమర్థురాలు. ఇల్లూ, పొలం రెండూ ఆవిడ ఆదేశాల ప్రకారమే నడుస్తాయి. అన్ని పనులూ ఆవిడ మీద ఒదిలేసి రామారావు తన శాస్త్ర, సాహిత్య విషయాల్లో  మునిగిపోయే వీలుంది గాబట్టి ఎవరికీ ఏ ఇబ్బందీ లేకుండా గడిచిపోతోంది. శారదాంబ పెంపకం, ఇంటిపని, వంటపని రామారావు భార్య సుబ్బమ్మ అతి తేలిగ్గా చేసేస్తుంది. పాతికెకరాల సేద్యం. మామిడి తోటలున్నాయి. ఆర్థికంగా లోటు లేకపోవడంతో ఆయన జీవితం గురించి ఆలోచించే అవసరం లేకుండా ఇతర విషయాల మీద శ్రద్ధ పెట్టగలుగుతున్నాడు. పండితులతో స్నేహం, చర్చలు, సంఘం గురించిన ఆలోచనలు సామాన్య జనం గురించి, వారికి, విద్య, సాహిత్య, శాస్త్ర విషయాలు అందుబాటులోకి తేవటం గురించి ఆయనకు ఆసక్తి ఎక్కువ. ఆ పని ఏ ఆటంకమూ లేకుండా చేసుకోవటానికి పెద్ద అండగా తల్లి నరసమ్మ ఉంది.

శారదాంబ అంటే ఇంట్లో అందరికీ ప్రాణం. నరసమ్మ, సుబ్బమ్మలు ఆమెను కింద నడవనివ్వరు. చనిపోయిన కూతురు మళ్ళీ పుట్టిందని నరసమ్మ నమ్మకం. కంటిపాపలా చూసుకుంటుంది. ఆ ఊళ్ళో ఉన్న బడిలో ఎనిమిదో తరగతి వరకూ చదువు చెప్తారు. శారదాంబను ఆ బడికి పంపటానికి రామారావు తల్లితో చిన్నపాటి యుద్ధమే చేయాల్సి వచ్చింది. ఇంట్లోనే చదువు చెప్పించమని తల్లి, బైటి బడికి వెళ్ళి నలుగురితోపాటు చదువుకోవాలని రామారావు, చివరికి శారద బడికి వెళ్తానని పట్టుబట్టటంతో నాయనమ్మ లంగిరాక తప్పలేదు. బడికి వెళ్ళేనాటికే శారదాంబకు రాయటం, చదవటం బాగావచ్చు. ఏడో ఏట మూడో తరగతిలో చేరింది శారదాంబ.

ఆ రోజు బడంతా పండగ వాతావరణం. పిల్లలకు లడ్లు, బూంది పంచి పెట్టారు. శారదాంబ తరగతిలో అంతకుముందే ఇద్దరాడపిల్లలు ఉన్నారు. విశాలాక్షి, ధనలక్ష్మి. విశాలాక్షి దేవదాసి కుటుంబం నుంచి వచ్చింది. ధనలక్ష్మి వాళ్ళు బ్రాహ్మణులు తండ్రి పౌరోహిత్యం చేస్తాడు. పెద్ద కుటుంబం. ఇంట్లో ఏటా పిల్లలు. ఊళ్లో పెరిగే అప్పులు. భారంగా కుటుంబాన్ని లాగుతున్నాడు. శారదాంబ చేరిన నాలుగు రోజులకు అన్నపూర్ణ అనే రైతు కుటుంబపు అమ్మాయి చేరింది. నలుగురమ్మాయిలకూ మంచి స్నేహం కుదిరింది. రోజూ కలిసి బడికి రావటం, పోవటం మొదలైంది. విశాలాక్షి బ్రాహ్మణ వీధికొస్తే ధనలక్ష్మి కలుస్తుంది. ఇద్దరూ కలిసి శారదాంబ ఇంటికి చేరేసరికి ఆ అమ్మాయి వీధి వాకిట్లో వీళ్ళ కోసం ఎదురు చూస్తుంటుంది. ముగ్గురూ కలిసి తూర్పు వీధిలోకి వెళ్తే అన్నపూర్ణ ఎదురొస్తుంది.

నలుగురూ కలిసి బడికి వెళ్తుంటే దారిలో ఇళ్ళ వాళ్ళంతా విడ్డూరంగా చూసేవారు. చదువు కోసం ఆడపిల్లలు బడికి వెళ్ళటం ఆ ఊళ్ళో అదే మొదలు. శారదాంబ తండ్రి రామారావుకి ఇంగ్లీషు చదువుల పిచ్చి ఉందని తెలుసు. పైగా వాళ్ళు స్థితిమంతులు. ఏం చేసినా చెల్లిపోతుంది. విశాలాక్షి గురించి ఎవరికీ పట్టింపు లేదు. ధనలక్ష్మి బడికి పోవటం ఊళ్ళో బ్రాహ్మణులెవ్వరికీ ఇష్టం లేదు. మూతులు విరుచుకుంటూ, ధనలక్ష్మి తల్లిని సూటిపోటి మాటలంటూ అక్కసు తీర్చుకునేవారు. అన్నపూర్ణ గురించి గొణుక్కునేవారు. నలుగురాడపిల్లలూ బడికి వెళ్ళి హెడ్‌మాస్టారు గదిలో కూర్చుంటారు. గంట కొట్టిన తర్వాత, మగపిల్లలందరూ క్లాసుల్లో కూర్చున్న తర్వాత తమ క్లాసు టీచరు వెనకాల నడుచుకుంటూ క్లాసులోకి వెళ్ళి ఓ పక్కన కూచుంటారు.

మగపిల్లలకీ వీళ్ళకీ మధ్య చాలా దూరం. పాఠాలు జాగ్రత్తగా విని పంతులుగారి వెనకాలే హెడ్‌మాస్టారు గారి గదిలోకి వచ్చి, మగపిల్లలంతా వెళ్ళిపోయాక నలుగురూ ఒక కట్టగా బయల్దేరతారు. మొదటి రెండేళ్ళూ ఎవరిళ్ళకు వాళ్ళు వెళ్ళిపోయేవాళ్ళు. ఐదో తరగతిలోకి వచ్చాక అందరూ సాయంత్రం ఒక గంట శారదాంబ ఇంట్లో ఆగి ఆడుకుని, కబుర్లు చెప్పుకుని ఇళ్ళకు వెళ్ళటం అలవాటయింది. శారదాంబ వాళ్ళది పెద్ద దొడ్డి. జామ, మామిడి, సపోటా చెట్లతో అందంగా ఉంటుంది. బోలెడు పూల మొక్కలు. పిల్లలు ఆడుకున్నంత సేపు ఆడుకుని సన్నజాజి మొగ్గలు కోసుకుని మాలకడతారు. అన్నపూర్ణ వెతికి వెతికి సంపెంగ పూలు కోసుకుంటుంది. సుబ్బమ్మ అందరికీ శనగపప్పు, బెల్లం, అటుకులు, కాల్చిన అప్పడాలు, ఉప్పుడు పిండి రోజుకో రకం తింటానికి పెడుతుంది. అవి తిని ఎవరింటికి వాళ్ళు వెళ్తారు. మళ్ళీ ఎప్పుడు తెల్లారుతుందా ఎప్పుడు కలుస్తామా అనుకుంటూ నిద్రపోతారు.

Image (13) (1)

చిత్రం: పార్వతి

శారదాంబ నరసమ్మ పక్కలోనే పడుకుంటుంది. ఆమె ఏవో పాటలు పాడుతుంది. రామాయణం, భారతం కథలుగా చెబుతుంది. విశాలాక్షికి కూడా తల్లి కోటేశ్వరి కీర్తనలు నేర్పుతుంది. కథలూ చెబుతుంది. ధనలక్ష్మి తల్లికి అంత తీరికుండదు. అన్నపూర్ణకూ ఇంట్లో చెప్పే వాళ్ళు లేరు. విశాలాక్షి శారదాంబ చెప్పే కథలూ, పాడే పాటలు కళ్ళూ చెవులూ అప్పగించి వింటారు. పాటలు నేర్చుకుంటారు. శారదాంబది మంచి కంఠం. ఆ పిల్ల గొంతెత్తి పాడితే ఎంతో బాగుంటుందని నలుగురూ చేరతారు.

రామారావు ఇంటిపట్టున ఉన్నపుడు శారదకు ఎన్నో విషయాలు చెప్పేవాడు . సైన్సు, చరిత్ర గురించి తండ్రి చెప్పే మాటలు అర్థమైనా, కాకపోయినా నోరు తెరుచుకు వినేది శారదాంబ. విన్నది విన్నట్లు అక్షరం పొల్లు పోకుండా స్నేహితురాళ్ళకు చెప్పేది. వాళ్ళు విని అడిగే ప్రశ్నలకు శారదాంబ దగ్గర సమాధానం ఉండేది కాదు. ‘‘మా నాన్నగారి నడిగి చెప్తాననేది’’. మళ్ళీ రామారావు మద్రాసు నుంచి వచ్చేసరికి కొత్త సంగతులు ఎన్నో ఉండేవి.

‘‘మా నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తాడు.’’ ఈ మాట ప్రతిరోజు ఒక రోజన్నా శారదాంబ తన స్నేహితులకు చెప్పవల్సిందే.

ధనలక్ష్మి శారదాంబ వంక భక్తిగా చూసేది. తను కూడా డాక్టరైతే అన్న కోరిక లీలగా ఎక్కడో ఆ అమ్మాయి కళ్ళల్లో కనిపించేది. ఎప్పుడన్నా ఆపుకోలేని రోజు ‘‘నేనూ డాక్టరైతే బాగుంటుంది కదూ’’ అనేది.

‘‘మనందరం డాక్టర్లమైతే’’ శారదాంబ మిగిలిన ఇద్దరివంకా చూసిందోనాడు. విశాలాక్ష్మి భయంగా ‘‘అమ్మో ` నేను డాక్టరవను. నాకు భయం. నేను హాయిగా ఆడుకుంటూ, పాడుకుంటూ ఉంటా. ఆ రోగాలూ నొప్పులూ నా కొద్దు’’ అంది.

అన్నపూర్ణ కూడా ముఖం చిట్లించింది.

శారదాంబ నిరుత్సాహ పడకుండా ‘‘పోన్లేవే ` మేమిద్దరం డాక్టర్లమవుతాం. మీకు మందిలిస్తాం’’ అన్నది.

నలుగురూ నవ్వుకుని కాసేపు డాక్టరు, రోగి ఆట ఆడుకున్నారు.

ఇంకో నాలుగు నెలలకు ఐదో తరగతి పూర్తయి ఆరో క్లాసులోకి వస్తారనగా ఓ రోజు ధనలక్ష్మి బడికి రాలేదు. ముగ్గురు స్నేహితురాళ్ళకూ ఏమీ తోచలేదు. బడి వదలగానే శారదాంబ ఇంటికి వెళ్ళకుండా ధనలక్ష్మి ఇంటికి వెళ్ళారు. అన్నపూర్ణకు, విశాలాక్షికి ధనలక్ష్మి ఇంట్లోకి ప్రవేశం లేదు. శారదాంబ లోపలికి వెళ్ళి ధనలక్ష్మిని పిల్చుకొచ్చింది.

వాళ్ళ వెనకే ధనలక్ష్మి వాళ్ళమ్మ కోటమ్మ వస్తూ

‘‘మీ సావాసగత్తె పెళ్ళి కుదిరింది. ఇంక మీ ఆటలు కుదరవు’’ అంది నవ్వుతూ. ముగ్గురూ ధనలక్ష్మి వంక ఆశ్యర్యంగా చూశారు.

‘‘నన్ను చూసుకోటానికి పెళ్ళివారొచ్చారు. అందుకే బడికి రాలా’’ అంది ధనలక్ష్మి సిగ్గుపడుతూ.

‘‘పెళ్ళికొడుకు బాగున్నాడా?’’ విశాలాక్షి ఆత్రంగా అడిగింది.

‘‘పెళ్ళికొడుకు రాలేదుగా’’ అమాయకంగా చెప్పింది ధనలక్ష్మి.

‘‘ఐతే నువ్వింక బడికి రావా?’’ శారదాంబ అనుమానంగా అడిగింది.

‘‘పెళ్ళయితే ఎట్లా వస్తాను? మీరు మాత్రం వస్తారా?’’

ధనలక్ష్మి ప్రశ్నకు ముగ్గురూ ముఖముఖాలు చూసుకున్నారు

‘‘మరి నువ్వు డాక్టర్‌ చదువుతానన్నావు’’ ధనలక్ష్మి ఏదో ఆడినమాట తప్పి తనకు ద్రోహం చేస్తున్నట్లు అడిగింది శారదాంబ.

‘‘పెళ్ళయితే ఇంక చదువెలా కుదురుతుంది? నువ్వయినా పెళ్ళి చేసుకోకుండా డాక్టరెలా చదువుతావు?’’

నెమ్మదిగా అడిగిన ధనలక్ష్మి మాటలకు రోషం వచ్చింది.

‘‘నేను అసలు పెళ్ళి చేసుకోను. డాక్టర్‌నవుతా?’’

ముగ్గురూ శారదాంబ వంక ఆశ్చర్యంగా చూశారు. ధనలక్ష్మి ఆలోచనలో పడిరది. కాసేపు నిశ్శబ్దం తర్వాత ధనలక్ష్మి మెల్లిగా చెప్పింది.

‘‘మా నాన్న నన్ను చదివించలేడు. ఈ పెళ్ళివారు నేనంటే ఇష్టపడి చేసుకుంటున్నారట. కట్నం ఇవ్వక్కర్లేదు. ఖర్చులన్నీ వాళ్ళే పెట్టుకుంటారట. ఈ సంబంధం చేసుకుంటే మా అన్నయ్యకు ఏదో ఉద్యోగం కూడా ఇప్పిస్తారంట. అందుకని నేను పెళ్ళి చేసుకోవాలి. తప్పదు. ఐనా నేను సంతోషంగానే ఉన్నా’’.

ధనలక్ష్మి తన ముఖంలోకి రాబోతున్న నీలినీడలను తరిమి చిన్నగా నవ్వింది.

కోటమ్మ వచ్చి నలుగురి చేతుల్లో నాలుగు బెల్లం ముక్కలు పెట్టింది. నలుగురూ అవి నోట్లో వేసుకుని ఆ తీపి మింగుతూ దిగులు మర్చిపోయారు.

***

‘‘నాన్నమ్మా ! నాన్నమ్మా! ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’ పుస్తకాలు ఓ పక్కన పెట్టి నాన్నమ్మ మీదికి దూకబోయింది శారద.

‘‘ముందు కాళ్ళూ, చేతులూ కడుక్కుని ఆ కిరస్తానం గుడ్డలు విప్పి శుభ్రమైన బట్టలు కట్టుకుని రా’’ కసిరింది నరసమ్మ.

శారద రోజూ అలాగే చేసేది. ఆ రోజు ధనలక్ష్మి పెళ్ళి కబురు ఎప్పుడెప్పుడు అమ్మకూ, నాన్నమ్మకూ చెబుదామా అనే హడావుడిలో మర్చిపోయింది.

గబగబా స్నానాల దొడ్లోకి వెళ్ళి నాన్నమ్మ చెప్పినట్లు చేసి వచ్చింది.

నరసమ్మ అప్పటిదాకా చేసిన వత్తులన్నీ తీసి వత్తుల పెట్టెలో పెట్టి లేవబోతోంది. శారద వచ్చి నాన్నమ్మ ఒళ్ళో ఎక్కి కూచుంది. నరసమ్మ శారద నెత్తిన ముద్దుపెట్టి గట్టిగా తనకేసి లాక్కుంది.

‘‘నాన్నమ్మా ధనలక్ష్మి పెళ్ళి తెలుసా?’’

‘‘తెలుసులేవే. వాళ్ళ నాన్న వచ్చి చెప్పాడు నిన్ననే. ఐనా స్నేహితురాలి పెళ్ళికే ఇంత హడావుడి పడుతున్నావు. నీ పెళ్ళి కుదిరితే ఇహ గంతులేస్తావా?’’

శారద నవ్వింది.

‘‘నాన్నమ్మా, నీకు తెలియదా? నేను పెళ్ళి చేసుకోనుగా. డాక్టర్‌ చదవాలిగా. పెళ్ళెలా చేసుకుంటాను?’’

‘‘డాక్టరమ్మవవుతావూ? నయమే. నా బంగారు తల్లి ఎప్పుడు పెళ్ళి కూతురవుతుందా అని నేను చూస్తుంటే.’’

శారద నాన్నమ్మ ఒడినే ఉయ్యాల చేసుకుని ఊగుతూ.

‘‘నాన్నమ్మా, నిజంగా నేను పెళ్ళి చేసుకోను. కావాలంటే నాన్ననడుగు. నాన్న నన్ను డాక్టర్‌ చదివిస్తానన్నాడు. నా చిన్నప్పుడు మేం రాజమండ్రి వెళ్ళాం. అక్కడా అమ్మమ్మ చెప్పింది. గుంటూర్లో పెద్దమ్మ కూడా చెప్పింది. నేను డాక్టర్నవ్వాలట. నాన్న వాళ్ళందరికీ చెప్పేశాడు. నన్ను ఇంగ్గండ్‌ కూడా పంపుతాడు. నీకు ఇంగ్లండ్‌ అంటే తెలుసా?’’

కూతురు ముద్దు మాటలను మురిపెంగా వింటున్న సుబ్బమ్మను చూసింది నరసమ్మ. కోడలంటే ఆమెకు ఇష్టమే. కానీ కొడుకు ఏ మాటంటే ఆ మాటకు గంగిరెద్దులా తలూపుతుందనే కోపం కూడా ఉంది. ఇప్పుడు శారద మాటలకు చిరాకు పడకుండా సంతోష పడుతున్న కోడలిని చూస్తే కోపం ముంచుకొచ్చింది.

‘‘చిన్న పిల్లలకు ఈ మాటలేనా నేర్పించేది. అసలు బడికి పంపొద్దంటే వినకుండా పంపుతున్నారు. డాక్టరు చదివిస్తాడేం. ముందు మంచి సంబంధం చూసి పెళ్ళి చేసి ఆ తర్వాత ఏం చేసుకుంటాడో చేసుకోమను. వాడంటే మగాడు. పది ఊళ్ళు తిరుగుతున్నాడు. కిరస్తానీ స్నేహాలు పట్టి అటూ ఇటూ ఊగుతున్నాడు. తల్లివి. నువ్వు పిల్లకు బుద్ధులు నేర్పుకోవద్దూ. కట్టుకున్నవాడు ఎట్లా ఆడమంటే అట్లా ఆడటమేనా? మొగుడికి బాధ్యతలు గుర్తు చెయ్యొద్దూ. అయ్యోరాత! చక్కగా ముస్తాబు చేసుకుని కూచోటం తప్ప నీకింకేం చేత కాదు. అన్నీ నేనే సమర్థించుకు రావాలి’’.

నాన్నమ్మ అమ్మని ఎందుకు కేకలేస్తోందో శారదకు అర్థం కాలేదు. మొత్తానికి నాన్నమ్మకు తను డాక్టరవటం ఇష్టం లేదని మాత్రం అర్థమైంది.

‘‘నాన్నమ్మ! అమ్మనేం అనకు. నన్ను డాక్టర్‌ చేసేది నాన్న’’

‘‘సరేలే సంబరం. పద. దీపాలు వెలిగించే వేళయింది. ఎక్కడి పనులు అక్కడే

ఉన్నాయి’’. మనుమరాలిని ఒళ్ళోంచి కిందికి దించి విసురుగా లోపలికి వెళ్ళింది.

నాన్నమ్మ కోపం చూసి శారద బిక్క ముఖంతో నుంచుంది. సుబ్బమ్మ శారదను దగ్గరకు తీసుకుని

‘‘నాన్నమ్మ అంతేలేమ్మా. నాన్న వస్తే నాన్నమ్మ కోపం పోగొడతారు. నువ్వు చదువుకో’’ అని ఆమె కూడా వంటింటి వైపు నడిచింది.

***

విశాలాక్షి కూడా ఇంటికి వెళ్ళగానే తల్లితో ఇదే విషయం హడావుడిగా చెప్పేసింది. కోటేశ్వరి పెద్ద ఆసక్తి చూపకుండా ‘అలాగా’ అని తన పని తను చూసుకుంటూ

ఉండిపోయింది. ఐతే ఆమె మనసు మాత్రం విశాలాక్షికి ఎప్పటికైనా తను పెళ్ళి చేయగలదా అనే ఆలోచనతో కొంత దిగులు నింపుకుంది.

కోటేశ్వరిది దేవదాసి కులం. ఆ ఊళ్ళోని వేణుగోపాల స్వామి ఆలయం చాలా పెద్దది. ఆ దేవుడి మాన్యం కూడా చాలా ఉంది. దాన్లో కొంత ఆదాయం కోటేశ్వరికి వస్తుంది. దానిని కోటేశ్వరి బెజవాడలో ఉంటూ వృత్తి చేసుకుంటున్న ఇద్దరక్కలకూకొంత కొంత పంచి తను కొంత వాడుకుంటుంది. ఉత్సవాల రోజుల్లో ఆలయంలో నృత్యం చేస్తుంది. పక్క ఊళ్ళోని ధనిక రైతు రంగయ్య గారు వీళ్ళ ఇంటికి వస్తూ పోతూ ఉంటాడు. ఆయనే విశాలాక్షి తండ్రి. కోటేశ్వరి ఆయననే నమ్ముకుంది. ఊళ్ళో కూడా కోటేశ్వరి అంటే అందరికీ ఆదరమే ఉంది. తిండికి, బట్టకు లోటు లేదు. అన్ని అవసరాలూ రంగయ్యగారు చూస్తాడు. విశాలాక్షి అంటే ఆయనకు చాలా ప్రేమ. కూతుర్ని బాగా చదివించాలని అంటుంటాడు. పరిస్థితులు అనుకూలిస్తే అమ్మాయిని సీమ పంపించి చదివిద్దాం అంటాడు. ఐతే కోటేశ్వరి కూతురికి ఎలాంటి ఆశలూ పెట్టలేదు. సంగీతం, నాట్యం నేర్పటం మానలేదు. ఎటుపోయి ఎటు వచ్చినా కులవృత్తే కూడు పెడుతుందని ఆమె నమ్మకం. కానీ దేవదాసి వృత్తి మీద లోకానికి చిన్నచూపు ఏర్పడుతోందని, రాబోయే కాలంలో అసలు దేవదాసీలే ఉండకుండా చట్టాలు తెస్తారని రంగయ్య చెబుతుంటే కోటేశ్వరి గుండె దడదడలాడేది. నాట్యం చేయటం, పాటలు పాడటం, ఓ పెద్ద దిక్కుని అండగా చూసుకుని నమ్ముకోవటం తప్పెందుకవుతుందో కోటేశ్వరికి అర్థమయ్యేది కాదు ` ఆమె పూర్వీకులు అలాగే బతికారు. గౌరవంగానే బతికారు. దేవుడి దయవల్ల తనకీ ఓ అండ దొరికింది, ఓ కూతురు పుట్టింది. అంతా సవ్యంగానే ఉందనుకుంటుంది. కానీ ఆమెకీ తెలుస్తూనే ఉంది. గుళ్ళో ఉత్సవాలలో ఆర్భాటం తగ్గుతోంది. నాట్యాన్ని ఇంతకు ముందులా ఆనందించే వారు తగ్గుతున్నారు. తన కులానికి గౌరవం తగ్గుతోంది. నిజమే ` తన కులంలో అవినీతి పరులూ, దురాశాపరులు ఉన్నారు. కానీ అలాంటి వాళ్ళు ఏ కులంలో లేరు? మోసం చేసి బతికేవారు అన్ని కులాల్లోనూ ఉంటారు. ఎవరి వృత్తి వారు న్యాయంగా, ధర్మంగా చేసి కట్టు తప్పకుండా బతికేవారు, ఎప్పుడూ వేళ్ళమీద లెక్కపెట్టేంతమందే ఉంటారు. పైగా ఆర్థికంగా కటకటలాడే రోజుల్లో మోసాలు జరగక ఆగుతాయా?

వీరేశలింగం గారు తమ కులం గురించి మాట్లాడే మాటలు రంగయ్యగారు చెబుతుంటే కోటేశ్వరికి ఆగ్రహం వచ్చేది.

‘‘మా కులం గోల ఆయనకెందుకు? ఆయన కులాన్ని ఆయన్ని ఉద్ధరించు కోమనండి’’ అనేది.

రంగయ్య కాసేపు ఆయన్ని సమర్థించేవాడు. కాసేపు విమర్శించేవాడు.

‘‘నా కూతురు మాత్రం చదువుకుని తగినవాడిని పెళ్ళాడాల్సిందే’’ అనేవాడు. కోటేశ్వరి మనసు చివుక్కుమన్నా కన్నతండ్రి అలాగే అనుకుంటాడని ఊరుకునేది.

‘‘మీ కులవృత్తి మీద ఇంగ్లీషు వాళ్ళ కన్ను పడిరది. వాళ్ళ కన్నుపడిన ఏ కులవృత్తి సజావుగా నడిచింది? నేతపనివారు నాశనమయ్యారు. రైతులూ కటకటలాడుతున్నారు. ఒక్కో వృత్తిని నాశనం చెయ్యటమే పనిగా పెట్టుకున్నారు’’ అనేవాడు. కోటేశ్వరికి భయం పుట్టుకొచ్చేది. తనకు దేవుడి మాన్యం నుండి వచ్చే ఆదాయం లేకపోతే ఇద్దరక్కలూ వీధిన పడతారు. రంగయ్యగారు తనను చూసుకున్నా అక్కలిద్దరూ నిరాధారంగా నిలబడాలి. రంగయ్యగారు చెప్పినట్టు విశాలాక్షిని చదివించటమే మేలని అనుకుంది. విశాలాక్షి పెళ్ళి జరగటం అంత తేలిక కాదని కోటేశ్వరికి తెలుసు. కానీ చక్కని పిల్ల. ఎవరో ఒకరు చేరదీస్తారనే నమ్మకమూ ఉండేది. ఈ ఆలోచనలన్నీ ఒక్కసారి చుట్టుముట్టి ఆమె ధనలక్ష్మి పెళ్ళి గురించి సంతోషించనూ లేదు. విచారించనూ లేదు. విశాలాక్షి రోజూలాగే సంగీతం పాడుకుంటూ కూచుంది.

అన్నపూర్ణ ఇంట్లో మాత్రం ధనలక్ష్మి పెళ్ళి వార్త సందడి రేకెత్తించింది. అన్నపూర్ణ పెళ్ళి ఎప్పుడు చెయ్యాలి, ఎలాంటి సంబంధం తేవాలి అని తల్లిదండ్రులు వాదించుకున్నారు. తండ్రి చదువుకున్నవాడినే చూస్తానంటాడు. ఆస్తిపరుడు కావాలని తల్లి, నాయనమ్మా వాదించారు. అన్నపూర్ణ వాళ్ళ మాటలన్నీ వింటూ కూచుంది.

చదువు, పొలం రెండూ ఉన్నవాడు ఉండడా? అలాంటి వాడిని చూడొచ్చుగా ఎందుకిలా తగువుపడుతున్నారనే విసుగొచ్చేదాక వాళ్ళ మాటలు విని ఆ తర్వాత పుస్తకాలు తీసుకుని దీపం ముందు చేరింది?

***

ఉదయాన్నే చల్ల చిలికే చప్పుడికి నిద్ర లేస్తుంది శారద. అప్పటికే దాసి వచ్చి ఇంటి ముందంతా ఒత్తుగా పేడ కళ్ళాపి చల్లేస్తుంది. ఈ మధ్యనే నరసమ్మ శారదకు ముగ్గులు వేయటం నేర్పింది. ధనలక్ష్మి కూడా చాలా నేర్పింది. శారదా వాళ్ళింటి ముందున్నంత చోటు ఎవరింటి ముందూ లేదు. ఆ చోటంతా ముగ్గులు పెట్టటంలో అమిత శ్రద్ధ శారదకు. గంటకు పైగా తదేక దీక్షతో ముగ్గులలో మునిగిపోతుంది.

ఆ రోజు కూడా వాకిటి నిండా ముగ్గేసి అరుగు మీద కూచుని ఆనందంగా చూస్తుంటే ఊరినుంచి రామారావు వచ్చాడు.

శారద ఒక్క పరుగున వెళ్ళి తండ్రి చేతిలో సంచీ అందుకుంది.

‘‘నీకోసం బోలెడు పుస్తకాలు తెచ్చా’’నన్నాడు శారదను ఎత్తుకుని ముద్దాడి దించుతూ`

శారద ముఖం వికసించింది.

‘మిఠాయిలు కూడా తెచ్చాలే’’ అంటూ ఇంట్లోకి నడిచాడు. నరసమ్మ, సుబ్బమ్మ చేతిలోని పనులు వదిలేసి వచ్చారు. యోగక్షేమాలడిగి, ముఖ్యమైన సమాచారాలు చెప్పుకున్నాక రామారావు స్నానానికి వెళ్ళాడు. అత్తాకోడళ్ళు ఎవరి పనుల్లో వాళ్ళు మునిగారు. శారద స్కూలుకి తయారయింది. విశాలాక్షి వస్తుందని చూస్తోంది. తండ్రి తెచ్చిన కొత్త పుస్తకాలు స్నేహితులకు చూపించేదాకా నిలవలేకుండా ఉంది.

స్నానం ముగించి, పూజ చేసుకుని వచ్చిన తండ్రిని చూసేసరికి క్రితం రోజు జరిగినదంతా గుర్తొచ్చింది శారదకు.

‘‘నాన్నా. ధనలక్ష్మి పెళ్ళి కుదిరింది. ఇంక బడికి రాదట’’ అని తండ్రితో రహస్యం చెప్పినట్లు చెప్పింది.

రామారావు ‘‘అయ్యో’’ అన్నాడు.

‘‘నాన్నమ్మ నాకూ పెళ్ళి చేస్తుందట. నేనూ చదువు మానెయ్యాలట. నేను డాక్టర్‌ చదువుతానంటే నాన్నమ్మకు కోపం వచ్చి బాగా అరిచింది. అమ్మ ఏమీ అనకపోయినా అమ్మమీద కూడా అరిచింది’’. రామారావు ముఖం గంభీరమైంది. శారద పెళ్ళి విషయంలో తల్లితో గొడవ పడాల్సి వస్తుందని ఆయనకు తెలుసు. ఎంత గొడవవుతుంతోననే భయమూ ఉంది. ఎంత గొడవైనా సరే తల్లి మాట వినకూడదని మనసులో గట్టి నిర్ణయం చేసుకున్నాడు. కానీ తల్లిని ఎదుర్కోవాల్సిన గడ్డుకాలం దగ్గరపడిరదని ఆయనకు అర్థమైంది. మరో నాలుగు నెలల్లో శారదకు పదేళ్ళు నిండుతాయి. తల్లి ఊరుకోదు. ఏం చెయ్యాలి?  ఆయన మనసులో ఆందోళన ముఖంలో కనపడిరది. శారదకు తండ్రి ఆలోచన అర్థమయ్యి అవనట్లు ఉంది. ఇంతలో విశాలాక్షి పిలుపు విని ఒక్క పరుగు తీసింది.

రామారావు ఫలహారం చేసి బైటికి వెళ్ళేందుకు సిద్ధమవుతుండగా నరసమ్మ వచ్చి పొలం పనులూ, వ్యవహారాలు చెప్పటం మొదలుపెట్టింది.

‘‘ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావమ్మా. నువ్వు చూసుకుంటే చాలు’’ అన్నాడు.

‘‘నేను ఎన్నాళ్ళు చూసుకుంటానురా. అన్నీ నీకు అప్పజెప్పి నేను హాయిగా భగవన్నామ స్మరణ చేసుకుంటూ కూర్చుంటాను. నువ్వు ఈ తిరుగుళ్ళు మాని ఇంటిపట్టున ఎప్పుడుంటావో చెప్పు’’ అంది నిష్టూరంగా.

‘‘అమ్మా. నేను చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి. అక్క రాసిన పుస్తకం అచ్చు అవుతోంది. ఇంకా ఎన్నో పుస్తకాలు అచ్చు వెయ్యాలి. మన తెలుగు వారి చరిత్రంతా రాయించి ముద్రించాలి. ఆ పనులు నావి. ఇంటి వ్యవహారాలన్నీ నీవి.’’

నరసమ్మ కొడుకు భరోసాకు నవ్వింది.

‘‘సరేరా ా ఇంటి వ్యవహారాలన్నీ నేనున్నంత కాలం నే చూస్తా ా కానీ నీ కూతురి పెళ్ళన్నా నువ్వు చెయ్యవా? నాలుగూళ్ళూ తిరుగుతున్నావు. పెద్ద పెద్ద వాళ్ళతో స్నేహాలు చేస్తున్నావు. మంచి సంబంధం చూసి శారద పెళ్ళి చేశావంటే ఇక నువ్వు ఎక్కడ తిరిగినా మాకు బెంగ ఉండదు. ఆ ఒక్క పనీ చెయ్యి నాయనా’’.

రామారావు గుండె దడదడలాడిరది. కానీ తేల్చి చెప్పాల్సిన సమయమూ ఇదేననుకున్నాడు.

‘‘శారద పెళ్ళికి తొందరలేదులే అమ్మా’’ అన్నాడు ప్రశాంతంగా. నరసమ్మకు ఆ మాటతో ఎక్కడ లేని ఆవేశం వచ్చింది.

‘‘తొందర లేదా? పదేళ్ళు నిండుతున్నాయి. పెద్దపిల్లయిందంటే ఎంత అప్రదిష్ట. ఎంత అనాచారం. పిల్ల పుష్పవతి కాకుండానే పెళ్ళి చెయ్యాలిరా’’.

‘‘అమ్మా అది జరిగే పని కాదు. శారదని చదివించాలి’’.

‘‘ముందు పెళ్ళి చెయ్యి. మొగుడికిష్టమైతే చదివించు. లేదా చదివించుకుంటానన్న మొగుడ్నే తీసుకురా!’’

‘‘అలా కాదులే అమ్మా! అంత చిన్నపిల్లకు పెళ్ళి మంచిది కాదు.’’

‘‘మంచిది కాదని నువ్వంటే సరిపోయిందా?’’ అష్టా వర్షేత్‌ భవేత్‌ కన్యా’’ అన్నారు. అదెలాగూ చెయ్యలేదు. పిల్ల ఈడేరకుండా పెళ్ళి చెయ్యాలని శాస్త్రాలన్నీ చెబుతున్నాయి. పెద్దలంతా అలాగే చేశారు. వాళ్ళందరికంటే నీకెక్కువ తెలుసా?’’

‘‘కాలం మారుతోందమ్మా’’ పట్టుదలగా అన్నాడు రామారావు.

‘‘ఆ కబుర్లన్నీ నాకు చెప్పకురా. మగవాడివి. ఏం చేసినా నీకు చెల్లిపోతుంది. ఆడవాళ్ళం. మాకు సంప్రదాయం, కుటుంబపరువు ప్రతిష్ట ముఖ్యం. వాటిని కాపాడుకుంటూ వస్తున్నాం. శారద పెళ్ళి జరిగిపోవాల్సిందే. కావాలంటే కొడుకుని కనిచదివించుకో. నీ ఇష్టమొచ్చినట్లు చేసుకో’’

ఇక ఆ మాటలకు తిరుగులేదన్నట్లు లోపలికి వెళ్ళిపోయింది నరసమ్మ.

రామరావుకి సమస్య తననుకున్నదానికంటే పెద్దదనిపించింది. తల్లి సంగతి ఆయనకు బాగా తెలుసు. ఆవిడ పట్టు పట్టిందంటే వదిలించటం ఎవరి తరమూ కాదు. ఎంతమంచి మనిషో అంత మొండి మనిషి. ఐతే ఆ మొండితనం రామారావుకీ ఉంది. తల్లి నుంచే వచ్చింది. శారదను డాక్టర్‌ చదివించాలనే పట్టుదల ఆయనకీ గట్టిగా ఉంది. ఈ చిక్కుముడి వీడే మార్గం మాత్రం ఆయనకు తెలియటం లేదు. ఆ రోజు రాత్రి తన బాధంతా భార్యముందు వెళ్ళబోసుకున్నాడు. ‘‘అంతా ఆ భగవంతుడి మీద వేసెయ్యండి. ఎలా జరగాలో అలా జరుగుతుంది’’ అందావిడ తేలిగ్గా తీసేస్తూ.

‘‘నీలాగా ఆలోచించకుండా బతికితే భలే సుఖంగా ఉంటుందే ా నేనట్లా బతకలేను గాని ా ’’

‘‘ఆలోచించి ఏం చేస్తారు? చేసేది లేనపుడు ఆలోచించటం దేనికి?’’

‘‘శారద పెళ్ళి గురించి ఏదో ఒకటి చెయ్యాలిగా’’

‘‘పెళ్ళి చెయ్యనంటుంటిరిగదా ` పెళ్ళి చేస్తే గదా ఏదో ఒక సంబంధం చూడటం, పెళ్ళి ఏర్పాట్లు ` వీటి గురించి ఆలోచించేది. చెయ్యనప్పుడేముంది?’’

రామారావు ఆశ్చర్యపోయాడు.

‘‘అంటే  శారదకిప్పుడు పెళ్ళి చెయ్యకపోతే నీకేం అభ్యంతరం లేదుగా?’’

‘‘లేదు. శారద డాక్టరవుతుందనుకుంటే నాకిప్పట్నించే గర్వంగా ఉంది. శారద పుట్టినపుడు కుగ్లర్‌ ఆసుపత్రిలో ఆ అమ్మగారిని చూశాగా. ఎంత ఠీవి. తెలివి. చాకచక్యం. మనుషుల ప్రాణాలు కాపాడటమంటే మాటలా? నా కూతురు ఎందరికి ప్రాణం పోస్తుందో’’

ఆనందాతిశయంతో రామారావు సుబ్బమ్మను గట్టిగా కావలించుకున్నాడు. తల్లంత కాకపోయినా భార్యతో కూడా తగవు పడాల్సి వస్తుందనుకున్నాడేమో, భార్య తనకన్నా ఒకడుగు ముందుందని తెలిసేసరికి ఆనందం పట్టలేకపోయాడు.

‘‘నాకు నీ మాటల్తో ఎక్కడలేని బలం వచ్చింది సుబ్బూ’’.

‘‘తెలుస్తూనే ఉంది’’ అని అందంగా నవ్వింది సుబ్బమ్మ.

ఆ మాటతో దంపతులిద్దరి మధ్యా సంభాషణ ఆగి సరసం మొదలైంది. నాలుగు రోజులు ఊళ్ళో గడిపి మద్రాసు ప్రయాణమయ్యాడు.

‘‘ఈసారి ఒట్టి చేతుల్తో రాకు నాయనా. మంచి కుర్రాడిని చూడు. పిల్లవాడు మంచివాడైతే చాలు. ఆస్తి అంతస్తుల గురించి మనం ఆలోచించవద్దు. మనకున్నదొక్కపిల్ల. దానికి సరిపడా మనకుండనే ఉంది’’ తల్లి మాటలు వినీ విననట్లు వెళ్ళిపోయాడు రామారావు.

***

మీ మాటలు

  1. సువర్చల చింతలచెరువు says:

    శారద ని పూర్తిగా తీర్చిదిద్దే కథలోకి తెచ్చారు! చాలా బాగుంది.

  2. Kameswari durvasula says:

    మంచి కధావస్తువు , eetaram యువత చదవవలసిన నవల , olga ki అభినందనలు .

  3. Chimata Rajendra Prasad says:

    చరిత్ర తిరిగి రాస్తున్నారు. ఈ తరానికే కాదు, మన తరానికి కూడా తెలియని వ్యక్తులలోకి పరకాయ ప్రవేశం చేసి రాస్తున్నారు. కంగ్రాచ్యులేషన్స్ !!

    Sent from http://bit.ly/f02wSy

మీ మాటలు

*