పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం

 పి.మోహన్

రాజారవివర్మ.. పరిచయం అక్కర్లేని వర్ణసంరంభం. రాజులకు, జమీందార్లకే పరిమితమైన తన వర్ణచిత్రాలను లితోగ్రాఫులతో జనసామాన్యానికి చేరువ చేసిన అతనంటే మన తెలుగువాళ్లకు విపరీతమైన అభిమానం. అందుకు నూటాపదేళ్ల కిందట వచ్చిన ఈ వ్యాసం ఉదాహరణ. బాలాంత్రఫు నీలాచలం రాసిన ఈ వ్యాసం 1906 అక్టోబర్లో.. అంటే రవివర్మ చనిపోయిన మాసంలోనే ‘సువర్ణలేఖ’ పత్రికలో వచ్చింది. 1910-40లమధ్య తెలుగువాళ్లకు బాగా తెలిసి, ఇప్పుడు తెలియకుండా పోయిన మరో  తెలుగు కవికి కూడా రవివర్మ అంటే విపరీతమైన అభిమానం. రవివర్మ వేసిన ఒక్కో చిత్రంపై పాతికలైన్ల పద్యాలు రాసి, వాటిని పుస్తకంగా అచ్చేసేంత ప్రేమ.  సారంగ పాఠకుల కోసం ఆ పద్యాలను రవివర్మ చిత్రాలతో జతచేసి వచ్చేవారం నుంచి అందిస్తున్నాం.. ఇక నీలాచలం వ్యాసంలోకి వెళ్లండి

         

రాజారవివర్మ

ప్రసిద్ధికెక్కిన చిత్రలేఖరియగు రవివర్మ తిరువాన్కూరు రాజవంశముతో సమీపబంధుత్వము కలిగియున్న క్షత్రియవంశములోనివాడు. తిరివెందరమున కుత్తరముగా నిరువదినాలుగు మైళ్లదూరములోనున్న కలిమనూరు గ్రామమందు 1848 సంవత్సరము, ఏప్రియలు నెల ది 29 తేదీ నాతఁడు జననమందెను. ఒకప్పుడు తిరువాన్కూరు ప్రభువులను శత్రువులనుంచి కాపాడినందుకుగాను రవివర్మయొక్క పూర్వులకీ కలిమనగరము జాగీరుగా నీయఁబడెను. రాజారవివర్మయొక్క తల్లి ‘‘ఉమాంబాయి’’. ఈమె పండితురాలు. సృష్టియందలి వైచిత్రములను బరికించి యానందించు కుశాగ్రబుద్ధికలది. తన గానవిద్యాకౌశలమునకునఁదోడు సహజమాధుర్యమగు కంఠస్వరముకలది. ఈమె ‘‘పార్వతీపరిణయమ’’ను గ్రంథమును తన దేశభాషలో రచియించి కవిత్వమందసమానురాలని యాదేశజనులచేఁ గొనియాడఁబడెను. ఇట్టి విదుషీమణి గర్భమును ఫలింపఁజేసిన రవివర్మ సామాన్యుఁడగునా? ఈతనికిఁ  జిన్నతనమున రాజవంశములోని పద్ధతిప్రకార మింటియొద్దనేయొక సంస్కృతపండితుని గురువుగా నియమించి చదువు నేర్పించుచుండిరి. రవివర్మ తన పాఠములను వల్లించుటకు వినియోగించుకాలముకంటె నెక్కుడు కాలము గోడలమీఁదను, దలుపులమీఁదను, మసిబొగ్గుతోనూ, సీమసుద్దతోనూ బొమ్మలువేయుటయందు వినియోగించెడువాడు.

  రాజారవివర్మ

రాజారవివర్మ

స్వభావముగా జనియించు నాచిన్నతనపుచేష్టలను గూర్చి యప్పుడప్పుడు పెద్దవారిచేనతఁడు మందలింపఁబడుచుండెను. కాని యతని మేనమామయును, మాతయును, నీబాలుని బుద్ధిసూక్ష్మతనుబట్టి, భవిష్యచ్ఛిత్రకారచిహ్నము లీతనియందుఁగనిపెట్టి, బొమ్మలువేయుటలో నుత్సాహపఱచుచుండిరి. రవివర్మ మేనమామ రాజా రాజవర్మ. అతఁడు చిత్రలేఖనమందు మంచి సమర్థుడు. ఆ కాలమున బొమ్మలు వ్రాయుపని గొప్పకుటుంబమువారిచే నిరసనగాఁజూడఁబడుచుండుటచే, ఆయన విలాసార్థమే చిత్తరువులను వ్రాయుచుండెడివాఁడు. చిత్రలేఖనముయొక్క ప్రధాననోద్దేశము గ్రహించక దేవతావిగ్రహలు వ్రాయుటయందే తమకాలము వెచ్చపెట్టెడు సామాన్య చిత్రలేఖరులవలెఁగాక, రాజవర్మ స్వభావమును జక్కగాఁగ్రహించి యట్టియందములొప్పునట్లుగాఁ జిత్రపటములను వ్రాయుచుండెను. ఆయనచే వ్రాయఁబడిన చిత్తరువులు జీవకళయుట్టిపడునట్లగపడుచుండెను. మేనల్లుడగు రవివర్మయెడల నాయనకుఁ బ్రేమమెండు. రవివర్మ యెప్పుడును తన మేనమామ చిత్తరవు వ్రాయుచుండ విరామములేకుండఁ జూచుచుండెడివాడు. ఒకనాఁడతని మేనమామ యొక చిత్తరువును సగము వ్రాసి యెచ్చటికో యేగెను. అతఁడింటలేనితఱిఁజూచి రవివర్మ యాచిత్తరవుపై నొకపక్షిని వ్రాసి యెప్పటియట్లయుంచెను. దానినాతఁడు మరల వచ్చిచూచి యానేరస్థునిబట్టుకొనఁ బ్రయత్నింపఁగా రవివర్మయొక్క దొంగతనము బయలుపడెను. ఏమిచేసిపోవునోయని భయపడుచున్న యాచిన్నవానికిఁ దాననుకొనినయట్లు తనమేనమామచేఁ జీవాట్లకు మారుగఁ జక్కని బహుమానమొకటి లభించెను. ఆనాటినుండి యాతఁడు మేనమామకుఁ బ్రియశిష్యుఁడై యాతనియొద్ద చిత్తరవుపని నేర్చుకొనుచుండెను.

రవివర్మ చిత్తరవులు వ్రాయుటయందును నీటితోఁ గలిపిన  రంగులు వేయుటయందును శీఘ్రకాలములోనె విశేషాభివృద్ధినిగాంచెను. రాజవర్మ మేనల్లుని దిరువనంతపురము తీసుకొనివెళ్లి మహారాజునకుఁగనపఱచి యాతనిచే వ్రాయఁబడిన చిత్తరవులను గూడఁ జూపెను. అప్పటికి రవివర్మకుఁ బదునాలుగు సంవత్సరముల ప్రాయము. మహారాజును నింతటి చిఱుతప్రాయమునఁ జిత్రలేఖనముందు విశేషబుద్ధిచాతుర్యమును గనపఱచిన రవివర్మనుజూచి పరమానందభరితుఁడై వాని తెలివితేటలభివృద్ధినొందుటకనేక విధములఁబ్రోత్సాహము గావించెను. రవివర్మ పదునేఁడేఁడులవాడఁగునప్పటికి తిరువాన్కూరు రాణీగారి సోదరీమణిని 1866 సంవత్సరనఁ బరిణయముగావించిరి.

తిరువాన్కూరు రాజకుటుంబములో మనకు వింతగానగపడు నాచారాములు కొన్నిగలవు.  అవి చదువరుల మనంబులనాకర్షింపకపోవను నభిప్రాయమున నిక్కడఁ గొంతవఱకు వ్రాయుచున్నాఁడను. ఆ రాజ్యమునకు స్త్రీలే వారసులు. వారికి సంతతి లేనిచో స్త్రీలనేపెంచుకొందురు. ఆయాచారముచొప్పునఁ దిరువాన్కూరు రాజకుటుంబముచేఁ బ్రకృతమునఁ బెంచుకొనఁబడుచుండిన చిన్నరాణులు రవివర్మ కూఁతురు బిడ్డలు.

రెండు సంవత్సరములకుఁ దరువాత జరిగిన, రవివర్మ యొక్క భావికాలపుసుప్రసిద్ధికి హేతుభూతంబగు నొక విషయమును గూర్చి ముచ్చటించవలసియున్నది. 1868 సంవత్సరమున చిత్రలేఖనమునందు విశేషబుద్ధిచాతుర్యమును సామర్థ్యమునుగల ‘‘త్యోడరుజాన్ సన్’’ అను నాంగ్లేయుఁడు తిరువాన్కూరు సంస్థానమునకు విచ్చేసి మహారాజుయొక్కయుఁ దక్కినవారియొక్కయుఁ జిత్తరవులను నూనెతోఁ గలిపిన రంగులతో నేర్పరితనము మెఱయ వ్రాసెను. మహారాజుగారి యనుజ్ఞచొప్పున నాయాంగ్లేయచిత్రలేఖరి రవివర్మను దగ్గరనుంచుకొనియే పటములనుజిత్రించెను. నూనెరంగులతోఁ బటములను వ్రాయుట కదివఱకలవాటులేని రవివర్మ యాయాంగ్లేయలేఖరియొక్క పనితనమున కాశ్చర్యమునొంది తానను రంగులు వేయవలసివచ్చినప్పుడు నూనెతోఁగలిపిన రంగులే వాడుకచేయుటకు నిశ్చయించుకొనెను. కాని వానినుపయోగించువిధమును రవివర్మ తెలిసికొనుటకు పూర్వమె ‘‘జాన్ సన్’’ తిరువాన్కూరునుండి వెళ్లుట తటస్థించినది.

నూనెరంగులెట్లుపయోగించ వలయునో నేర్చుకొనని మన రవివర్మ కొద్దికాలములోనే తన బుద్ధిసూక్ష్మతచేతను బ్రయత్నములచేతను నట్టిరంగులు వేయుటయందుఁగూడ విజయమునుబొందెను. అతఁడిటీవల వ్రాసిన తిరువాన్కూరు మహారాజుయొక్క రాణీయొక్కయుఁ జిత్తరవులు నానాటికభివృద్ధిఁజెందుచున్నయాతని యోచనాశక్తిని బుద్ధికౌశలమును వెల్లడించకమానవు. చూపఱుల మనంబులు వ్యామోహజలధి మునుంగునట్లుగ నసమానసౌందర్యవిలాసతంగ్రాలు నాయరు స్త్రీలపటములీ రవివర్మచేఁ జిత్రింబఁడెను. మొదటినుండియునితఁడు స్త్రీవిగ్రహములు వ్రాయుటలోఁ దన నేర్పరితనమును వెల్లడించుచుండెను.

1873 సంవత్సరము చెన్నపురిలో జరుపఁబడిన శిల్పశాస్త్రవస్తుప్రదర్శనము(Fine Arts Exhibition)లో మల్లెపూవులదఁడను సిగయందలంకరించుకొనిన యొక యువతీమణిరూపమును వ్రాసిన పటమువలన రవివర్మ యొక బంగారుపతకమును గవర్నరుగారిచే బహుమానముగాబడసెను. ఆ పటమునందని చిత్రమును గూర్చి మిగుల సంతసించి గవర్నరుగారు రవివర్మను మిగులనభినందించిరి. అమఱుచటి సంవత్సరము తిరుగఁ చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో నొక ద్రావిడస్త్రీపటమును వ్రాసి మఱియొక బంగారుపతకమునుబడసెను. 1875 సంవత్సరమున మన యెడ్వర్డు చక్రవర్తిగారు హిందూదేశమును సందర్శించుటకు వచ్చినప్పుడు తిరువాన్కూరు మహారాజుగారాయనకీ ద్రావిడస్త్రీపటమును మఱికొన్ని పటములతోఁగానుకనొసంగిరి. పశ్చిమదేశచిత్రకారులయొద్ద నభ్యసింపకయె మిగుల ప్రావీణ్యముతో వ్రాసిన రవివర్మ నేర్పరితనమునుగాంచి చక్రవర్తిగారద్భుత ప్రమోదములనొందిరి.

3nayaru pilla pushpalankarana

నాయరుపిల్ల పుష్పాలంకరణ

 

1876 సంవత్సరము మూడవసారి చెన్నపురిలో జరుపఁబడిన ప్రదర్శనములో ‘‘శకుంతలపత్రలేఖనము’’ అను పటమునకు రవివర్మయప్పటి గవర్నరుగారగు ‘‘బకింగుహామ్’’  ప్రభువుగారివలన నొకబంగారుపతకమునుబడసెను. స్వభావానుగుణముగ జీవకళయుట్టిపడ వ్రాసిన యాచిత్తరవునుదిలకించి గవర్నరుగారానందాబుంధిమగ్నులయి వెంటనే యాపటమును క్రయమునకుఁదీసికొనిరి.  తరువాత రెండు సంవత్సరములకు ‘‘బకింగుహామ్’’  ప్రభువు జ్ఞాపకార్థమై యాయనవిగ్రహమును దొరతనమువారి మందిరమననుంచుటకు మహాజనులచే నిశ్చయింబడెను. ఆప్రకారమాప్రభువువారి రూపమును రవివర్మచే వ్రాయఁబడియెను. తరువాత ‘‘బకింగుహామ్’’  ప్రభువువారు రూపవతులైన తనయిరువురి కుమార్తెల రూపములను రవివర్మచే వ్రాయించుకొనెను.

మదరాసునుండి రవివర్మ తిరువాన్కూరు చేరుసరికాయన కిదివఱకుఁ జేయూతగానుండి తగిన ప్రోత్సాహమును కలిగించుచుండిన తిరువాన్కూరు మహారాజు పరలోకగతుఁడగుట తటస్థించెను. తరువాత వచ్చిన మహారాజును నీతనియెడ మిక్కిలి ప్రియమునే కనపఱచుచుండెను. ఈ మహారాజు మిక్కిలి విద్యావంతుఁడు. శిల్పము, చిత్రలేఖనము, మొదలగు విద్యలందిష్టము కలవాఁడు. ఈ మహారాజు ప్రోత్సాహము చేతనే రవివర్మ ‘‘సీత అఘోరప్రమాణము’’ అను చిత్రపటమును లిఖియించెను. ఈ చిత్తరవు వ్రాయుట బహుదుర్లభము. ‘‘సీతయొక్క పాతివ్రత్యమును గూర్చి రాముఁడనుమానించినపుడు సీత వేడుకొనఁగా భూదేవి యామెనుతనలోనికిఁ దీసికొనుపోవుట’’ అను విషయమును జిత్తరవునందు కనపఱచుటకెట్టి బుద్ధిసూక్ష్మతయు నేర్పరితనముండవలయునో చదువరులే యూహించుకొందురుగాక. ఈ చిత్తరవును బరోడా రాజ్యమునకప్పటికి దివానుగారగు సర్. టి. మాధవరావుగారు తమ యజమానియగు మహారాజుగారి కొఱకు వెలయిచ్చిపుచ్చుకొనిరి.

ఆమహారాజీపటమునుజూచి యానందించి రవివర్మను తనయాస్థానమునకుఁ బిలిపించుకొని తమ కుటుంబమును వ్రాయించుకొనెను. ఆసంవత్సరమే పూనానగరమున జరుపఁబడిన ప్రదర్శనములో నాయరు కన్యకరూపమును వ్రాయఁబడిన పటమువలన రవివర్మ బరోడా మహారాజుగారిచే బంగారుపతకమును బహుమానముగాఁ బడసెను. ఆపటమును సర్. టి. మాధవరావుగారు వెలయిచ్చికొనిరి. అప్పటి బొంబాయి గవర్నరుగారగు ‘‘ఫెర్గూసన్’’ దొరవారాపటముయొక్క ప్రతిమను దమనిమిత్తమై తిరుగవ్రాయించుకొనిరి. ఈప్రకారమాప్రతిమకనేక ప్రతిమలు తీయఁబడి విక్రయింపఁబడెను. ఈచిత్తరవు రవివర్మచే వ్రాయఁబడిన యందమగు చిత్తరవులలోనొకటి.

రవివర్మ బరోడా సంస్థానమునఁ దానుండిన నాలుగు మాసములలో మహారాజుయొక్కయు, రాణీయొక్కయు, సర్. టి. మాధవరావుగారియొక్కయు, రెసిడెంటుగారియొక్కయు చిత్తరవులను వ్రాసెను. అక్కడినుండి భువనగిరి వెళ్లి యారాజుగారి కోరిక ప్రకారము వారికొరకనేక చిత్రములను వ్రాసెను. 1885 సంవత్సరము రాజధానికళాశాల ప్రధానోపాధ్యాయుఁ(Principal)డగు ‘‘ధామ్ సన్’’ దొరవారియొక్కయు వెనుకటి మైసూరు మహారాజుగారి కార్యదర్శులగు ‘‘పోర్టరు’’ దొరివారియొక్కయు చిత్రములను వ్రాసెను. ‘‘పోర్టరు’’ దొరివారి కాలమున మైసూరు మహారాజుగారి స్నేహమునుగాంచి మైసూరు నగరమునకువెళ్లి యచ్చట మహారాజుగారి నిమిత్తము రవివర్మయనేక చిత్రములను వ్రాసెను.

4sakuntala patralekhanam

శకుంతల పత్రలేఖనం

 

‘‘గ్రాంటుడఫ్’’ దొరవారు పుదుక్కోట సంస్థానమును సందర్శించు సమయమున రవివర్మ యచ్చటికేగి దర్బారుపటమును చిత్రించెను. తరువాత నాతడిఁలు చేరినపిమ్మట నాతనిమాతయగు ‘‘నుమాంబాబాయి’’ స్వర్గస్థురాలై యాతనికిఁ దీరనిదుఃఖమును గలుగఁజేసెను. 1888 సంవత్సరమీచిత్రకారుఁడు తన తమ్ముఁడైన రాజా రాజవర్మతోఁ గలసి యుదకమండలమునకేగినప్పుడు బరోడా మహారాజువారు తాము నూతనముగాఁ గట్టించిన రాజమందిరముకొఱకు జనసామాన్యముచేఁగొనియాడఁబడు పురాణకథపట్లను చిత్రపటములుగ వ్రాసి యూయవలసినదని జాబు వ్రాసెను. ఆ యుత్తరమునుగ్రహించి ఆయాకథలు జరిగిన స్థలములకేగి యందలివిశేషములను దెలిసికొనుచు స్థలములయాకారములను గుఱ్తించుకొనుచు నుత్తరయిండియాయంతయునుఁ దమ్ముడితో రవివర్మ తిరిగెను.

సోదరులిరువును నింటికిఁజేరిన పిమ్మట రెండు సంవత్సరములకాపనినంతనుఁ బూర్తిచేసికొని పదునాలుగుపటములను వ్రాసి బరోడాకేగి మహారాజునకు వానినర్పించిరి. బొంబాయి రాజధాని నలువంకల నుంచి బరోడా మహారాజుగారి నూతనమందిరమునలంకరించిన చిత్రపటములను గన్నులారఁగాంచి యానందించుటకు వేలకొలది పురుషులును స్త్రీలును బిడ్డలును విచ్చేసి పట్టణమెల్లెడ సందడిగావించిరి. ఆపటములనుండి తీయఁబడిన ఫొటోగ్రాఫులు వేలకొలది విక్రయింపఁబడెను. అందువలన నాసేతుహిమాచలము పర్యంతము రవివర్మయొక్క కీర్తి ప్రకాశించెను.

రవివర్మ తాను వ్రాసిన చిత్రపటములనుండి ప్రతులనుదీయుటకుగాను రాతియచ్చుసంబంధమైన యొక ముద్రాయంత్రశాలను బొంబాయియందు స్థాపించెను. దీని సహాయముచే మనదేశమునందలి పూర్వపు చిత్రలేఖనము పునర్జీవమువడసెను. కొంచెము విద్యనేర్చిన ప్రతివారి గృహమందును రవివర్మచే వ్రాయఁబడిన చిత్తరవులు కనఁబడుచుండెను. ఉత్తరదక్షణ హిందూస్థానములలోని మహాపురుషుల యిండ్లు రవివర్మయొక్క అసలు పటములచేతనేయలంకరింపఁబడియుండెను. ఆచిత్రలేఖరిచే వ్రాయఁబడిన చిత్రములచే హిందూదేశమంతయు  నలంకరింపఁబడియుండెను. తుదకు వీథులలోని జనులుకూడ రవివర్మయొక్క చిత్తరవులనుగాంచి యానందించు భాగ్యమునుపొందుచుండిరి. 1904 సంవత్సరమున హిందూదేశపు శిల్పిచిత్రలేఖనము మొదలగు మహాశాస్త్రములయందు రవివర్మకనపఱచిన బుద్ధిసూక్ష్మమునకు మొచ్చుకొనుచు నొక బంగారుపతక మాయనకొసంగఁబడెను.

6ravivarma rangullo atani kooturu mahaprapha

రవివర్మ రంగుల్లో అతని కూతురు మహాప్రభ

 

రవివర్మ మనహిందూదేశమునందు బహూకరింపఁబడుటయేగాక, వియానా, లండను, చికాగో మొదలగు నితరదేశముఖ్యపట్టణములలో జరుపఁబడిన ప్రదర్శనములందుఁగూడ మేలుచేయియై బంగారుపతకములను సన్నదులనుబడసెను. వంశపారంపర్య వచ్చెడి పిత్రార్జితమగు నీజ్ఞానధనమును రవివర్మతోఁబాటు, సోదరుడు, రాజారాజవర్మయు, సోదరి మంగళాబాయియు, సమానముగాఁబంచుకొనిరి. రాజవర్మ ఎలయరాజాగారితోఁగూడ నాంగ్లేయభాష నేర్చుకొనెను.

ఆతఁడు విద్యాభ్యాసము చాలించినపిమ్మట చిత్తరవులు వ్రాయుచు నాయాపట్టణములలోఁ బ్రదర్శింపఁబడిన ప్రదర్శనములకుఁ దనచిత్తరవులనుగూడఁ బంపుచు బహుమతులువడసెను. రవివర్మయు సోదరునితోఁగూడ నాంగ్లేయచిత్రలేఖరి యబ్రూగ్సదొరవారు ఇండియాకు వచ్చినపుడు వారి సాంగత్యము చేసి కొన్ని నూతన సంగతులను గ్రహించెను.

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

రవివర్మ అమ్మ ఉమా అంబాబాయి

ప్రదర్శనమునకుఁ బంపవలసివచ్చినపుడుదక్కఁ దక్కిన కాలములయందు సోదరులిరువురు కలసియే చిత్తరువులను వ్రాయుచు వచ్చరి. అట్టి భ్రాతృవాత్సల్యమునుగలిగియున్న రవివర్మను దుఃఖసముద్రమునముంచి రాజవర్మ నిరుటి సంవత్సరమునఁ గాలధర్మమునొందెను. అతఁడింకను గొంతకాలముజీవించియుండినచోఁ బ్రపంచములో స్వభావమువ్రాయు చిత్రకారులలో మేటియనిపించుకొనియుండును. రవివర్మయొక్క సోదరియగు మంగళాబాయి విశేషగానవిద్యాసంపన్నురాలు. ఆమెయుజిత్రలేఖనమందు మిక్కిలి నేర్పరురాలు. రవివర్మ మిగులదయాంతఃకరణముగలవాడు. ఔదార్యసౌశీల్యాదిసద్గుణసంపన్నుడు.

ఓ చదువరులారా!

ఇంతవఱకు మీయుల్లమును బల్లవింపఁజేయు సచ్చారిత్రమునుడివితిని. సోదరవాత్సల్యముచే నామహానుభావుని చరిత్రమును వినుచు నానందవార్ధినోలలాడు మిమ్ములను పిడుగులతోనిండిన తుపానువంటిదుఃఖవార్తచే నొక్కసారి దుఃఖసముద్రనముంచి వేయుచున్నందులకు నన్నుమన్నింపఁబ్రార్థిలు. ఏమహామహుఁడుత్తమవంశసంజాతుండై చిఱుతప్రాయముననే తనబుద్ధికౌశలమునుజూపి తల్లిదండ్రులకు సంతోషదాయకుఁడయ్యెనో, ఏమహానుభావుఁడు చిఱుతప్రాయముననే తనమేనమామయొక్క యసంపూర్తి చిత్తరవును బూర్తిచేసి యాయనచేబహుమానమువడసెనో, ఏధీవిశాలుండు పిన్నవయసుననే చిత్తరవులచే రాజాధిరాజులమెప్పువడసెనో, ఏచిత్రకారోత్తముఁడు, ఆసేతుహిమాచలపర్యంతమునుగల గృహములను తన పటములచేనలంకరించి దిగంతవిశ్రాంతకీర్తిమంతుండయ్యెనో ఏమహాత్ముఁడు నిర్జీవములైపడియున్న హిందూదేశశిల్పాదిశాస్త్రకాంతలకు జీవాధారుఁడై ప్రకాశించెనో ఏవిద్యానిధి సమస్తదేశవస్తుప్రదర్శన సభలో మేలుచేయివడసి బంగారుపతకములను బహుమానముగానందెనో అట్టి ‘‘రాజారవివర్మ’’ 2 అక్టోబరు 1906న కీర్తిశేషుఁడయ్యెనని చెప్పుటకునోరాడకున్నది. ఆహా ! ! వ్రాయుటకుఁగలమాడకున్నది.

-బాలాంత్రపు నీలాచలము

 

 

మీ మాటలు

  1. కల్లూరి భాస్కరం says:

    మోహన్ గారూ…చాలా అపురూపం, ఆసక్తికరమైన వ్యాసాన్ని అందించారు. అభినందనలు. 1906 లో రాసిన ఈ వ్యాసం లోని భాష మరింత ఆశ్చర్యం కలిగించింది. నారికేళపాకంలా ఉంటుందనిపించే వీరగ్రాంథికానికి బదులు ఇందులోని భాష సరళంగా ఉంది.

  2. రాజా రవివర్మ గారి పరిశ్రమ గురించి చక్కని విషయాన్ని అందించారు ధన్యవాదాలండీ

  3. భాస్కరం, రెడ్డిగార్లకు ధన్యవాదాలు.
    తెలుగులో కళాసాహిత్యం ఇప్పుడు లేదు కానీ గత శతాబ్ది తొలి అర్ధ భాగంలో విస్తృతంగా వచ్చింది. 30,40లలొనే పికాసో గురించి, 20లలోనే క్యూబిజం గురించి రాశారు. ఇక భారతీయ కళ గురించి ఐతే లెక్క లేదు. కాస్త గ్రాంధికంలో ఉండడం తప్పిస్తే చాలా వరకు సాధికార రచనలు. రాసిన వాళ్ళు దాదాపు అందరూ చిత్రకారులే. ఆ వ్యాసాలను పరిచయం చెయ్యాలని ఉంది కానీ టైపింగ్ సమస్య. పైగా అవి రీడర్స్ కు ఎక్కవేమోనని సందేహం.

మీ మాటలు

*