దేవి నట్టింట్లో వేసి వున్న కుక్కి మంచం మీద పడుకుని వుంది . . ఆమె చూపు ఇంటి చూరుకి అంటుకుని వుంది . విపరీతమైన నీరసం వారం నుండీ , దగ్గు .. దగ్గి దగ్గి లుంగ చుట్టుకుని పోతుంది . ఈ మధ్యనంతా ఆమె చూపు ఇంటి చూరుని అంటుకుని వుంటుంది . దాదాపు నెల నెలన్నర క్రితం వాళ్ళ ఇంటికి వచ్చిందో పిచుకుల జంట . అన్యోన్యంగా పుల్లా పుడకా ఏరుకుని వచ్చి బూజు వేళ్ళాడుతున్న వాళ్ళ ఇంటి చూరులో గూడు కట్టుకున్నాయి . వీళ్ళకే తిండి లేదు మనమెందుకు భారమనుకున్నాయో ఏమిటో ఎప్పుడూ ఇంట్లో మేత కోసం వెతకవు . ఎప్పుడైనా మగ పిచుక ఏదో పని వున్నట్లు దేవీ వాళ్ళ అమ్మ గెంజి వార్చిన గిన్నె దగ్గర కిచ కిచ మంటూ గెంతుతుంది .
Archives for January 2015
పిచ్చుకలు
శిశిరానికేం తొందర?
నా తోటకి హేమంతం వచ్చేసింది
నిన్నటిదాకా హరితఛత్రాన్ని ధరించిన
నా ఆశల తరువులన్నీ
పసుపుదుప్పటీ కప్పుకుంటున్నాయి,
రేపో మాపో ఆకురాల్చడం మొదలైపోతుంది
నా తోటంతా రక్తమాంసాలు కోల్పోయిన
అస్థిపంజరంలా కళావిహీనమవుతుంది!
ఓ కాలమా, తొందర పడకు!
నా సుందర వనాన్ని వివస్త్రను చెయ్యకు!
ఋతుధర్మాన్ని పాటించక తప్పదంటావా?
ఐతే, ఇదిగో, మా మనుషులం తీసుకొనే
అలసత్వపు మందు!
కొంచెం సేవించి రోజుకో ఆకుని మాత్రం రాల్చు!
ఎందుకంటే,
ఈ పత్రసంచయమంతా నా ఆశలకు ప్రతీకలు!
వాటి ఉనికే నా సాఫల్యానికి ఆయువుపట్టు
నిత్యవసంతాన్నే కోరుకుంటూ
నా చెట్లకిందే నేనెన్నో కలల ఇంద్రధనుస్సులపైకెక్కి
నాట్యంచేస్తుంటాను!
నా స్వప్నాలని శీర్ణంచేసే శిశిరాన్ని
నా తోటకి ఆవలే
ప్రతీక్షచేయమను!
-శివరామకృష్ణ
విక్రమ్ బేతాళ్!
మనకేం హక్కుంటుంది, ఒకరి మీద ఫిర్యాదు చేయడానికి?
సమాధానం కాలేనివారికి ప్రశ్నగా మారే సందర్భమెలా
చిక్కుతుంది?
అడుగులన్నీ జాడల్ని మిగిల్చేవి కావు. ప్రయాణాలన్నీ
జ్ఞాపకాల్ని రాల్చేవి అయ్యుండాల్సిన అవసరం లేదు. తీవ్రమైన
కొన్నిక్షణాల్లో తీరినదాహానికే జీవితం దాసోహం అనదు.
మలుపు తిరగనిది దారే కాదు. మరపుకు రానిది
మాటే అవదు. క్షణక్షణానికీ రంగులు మారే కాలలోకంలో
అమాయకత్వానికి తావు లేదు.
సిద్ధమైన రంగం మీద స్థిరబిందువుగా వుండడం
అనౌచిత్యం. రంగరించుకున్న అనుభవాల్లోంచి కొత్తగా
ఎగరేసుకోవాల్సిన అనివార్యతలకు మనమెవ్వరం
అతీతులం కాము.
మనం కప్పుకున్న దుప్పటినే తెల్లారేవరకూ అధీనంలో
వుంచుకోలేనివాళ్ళం. మెలకువ వచ్చేసరికి బారెడు పొద్దెక్కిందని
ఆకాశాన్నెలా నిందించగలం?!
-మోహన్ రుషి
“ఆ శ్రీశ్రీ పద్యంలో ఉన్నది నేనే అనిపించేది”
“శ్రీశ్రీగురించి ఎందుకు రాయాలనుకుంటున్నావు?”
“అడిగారు కనక”.
“ఎందరో రాయమన్నవి నువ్వు రాయలేనన్నావు గతంలో. ఇప్పుడు?”.
“శ్రీశ్రీ కనక. దాదాపు ఎన్నడూ రాయలేదు కనక.”
“ఆయనగురించి అనేకమంది రాసారు. ఆయన కవిత్వం పట్టుకున్నవారు కవిత్వం గురించి రాసారు. వారిలో వ్యక్తిగతంగా దగ్గరైన వారు తమ సాన్నిహిత్యాన్నిచెప్పుకున్నారు, వ్యక్తిగా శ్రీశ్రీ గురించీ చెప్పారు. ఇంతమంది చెప్పాక నువ్వు కొత్తగా చెప్పటానికేముంది? ”
“రోజూ తిన్న అన్నమే తినుట ఏల? అందరూ పూజించు రామచంద్రమూర్తినే పూజించుట ఏల? అన్న ధోరణిలో విశ్వనాధవారు రామాయణ కల్పవృక్షం రాయటానికి కారణం చెప్పారు. 1910లో పుట్టి 1940ల నాటికి తన కవిత్వానికీ తనకీ ఆరాధకులను తయారు చేసుకున్నారు శ్రీశ్రీ. ప్రతి ఇరవై సంవత్సరాలకు ఒక తరం అనుకుంటే దాదాపు నాలుగు తరాల యువకులను ఆయన కవిత్వం పట్టుకుంది. కమ్యూనిజం వైపు వారిని నెట్టింది. ఇంతమందిలో నేనొకడిని. నా అనుభూతులని కూడా చెప్పుకోటం కన్న ఏం చెపుతాను.”
“అంటే నీగురించి నువ్వు చెప్పుకుంటావన్నమాట. ”
“ఒక విధంగా అంతే. ఏ వ్యక్తిగత అనుభవంలోనన్నా, అనుభూతిలోనన్నా సామాజిక అంశ కొంత ఉంటుంది. దానిమీద నేను దృష్టిపెట్టి, చదువరుల దృష్టిపడేలా ప్రయత్నిస్తాను. పోతే- శ్రీశ్రీ నాకేమిటి అన్నదానికి జవాబివ్వటానికి ప్రయత్నిస్తాను.”
“ప్రయత్నించు”.
“ఒక పాఠకునికీ, కవికీ ఉండే సంబంధం అర్ధమయేలా చెప్పాలంటే ధార్మిక నమ్మకాలలో ముఖ్యమైన ఆత్మ అన్న భావనని నేను ఉపయోగిస్తున్నాను. ఆత్మపై నాకున్న విశ్వాస అవిశ్వాసాలను పక్కనుంచి, ఆ భావనను ఉపయోగించుకొంటేనే నాకు సరిగ్గా చెప్పానన్న తృప్తి కలుగుతుంది. ఆత్మ శరీరాన్ని ఆశ్రయించుకుని ఉండి, దానికి చైతన్యం అవుతుంది. శ్రీశ్రీ కవిత్వం అదే మాదిరి నా సమస్త స్పందనలనూ జీవంతో, చైతన్యంతో, కదలికతో నింపుతున్నదని అనుకుంటున్నాను. అందుకే శ్రీశ్రీ నాకు స్వాత్మ్యం.”
“నిన్ను నువ్వు తార్కికుడు అనుకుంటావు గదా?”
“నేను తార్కికుడినే. అయినా కేవలం కవిత్వంతో హృదయం తర్కాతీతమైన అనుభూతిని పొందగలదన్నది నాకు అనుభవమే. అంతకుమించి ఆ అనుభూతికి నేను ఇతర విలువలు ఆపాదించలేను, అర్ధాలు చెప్పను. అలాగే అటువంటి అనుభూతి ఒక మూఢత్వానికీ, పూర్తి దాసోహానికీ దారితీసి పాఠకుడిని క్రియాశీలుడిని చేయటం కూడా కాదనలేని వాస్తవం. అదీ నాకు అనుభవమే. శ్రీశ్రీ కవిత్వంతో క్రియాశీలులు అయిన ఎందరో చేసిన పనులతో తూచితే నేను చేసినది పూర్తిగా వీగిపోతుందనీ నాకు తెలుసు.”
“తార్కికుడు ఒక కవిత్వపు విలువను నిర్ణయించవలసి వస్తే కొన్ని ప్రమాణాలను ఏర్పరుచుకుంటాడు. ఆ ప్రమాణాలకు నిలిచేవీ, నిలవనివీ ఆ కవి కవిత్వ సృజనలోనుంచి గుర్తు పడతాడు. వేరు చేస్తాడు. తరతమాలను నిర్ణయిస్తాడు. ఒకే కాలానికి చెందిన, ఒకే భావజాలానికి చెందిన కవులను బేరీజు వేసేటపుడు అతడు తన ప్రమాణాలకే కట్టుబడతాడు. తనను ప్రభావితం చేసిన మహా కవుల, మహా రచయితల సాహితీ సృజన జాతికి అందించినదేమిటో చెప్పేటపుడు అందులో సమస్త మానవజాతికి కలిగించిన చిరు నష్టాన్నైనా ఉంటే చూడగలుగుతాడు, చూపగలుగుతాడు. ఎక్కిన ఎత్తులను గణించేటపుడు ఎక్కలేకపోయిన ఎత్తులనూ గుణించుతాడు. దిగిన లోతులకు దిగేటపుడు దిగలేకపోయిన లోతులకు కూడా తార్కికుడు దిగుతాడు. అవునా?”
“నిజమే. ఈ నా వ్యాసం పరిధి అంత సమగ్రమైనది కాదు. నేను అంత నిజాయితీగానూ, నిష్పక్షపాతంగానూ ఉండగలిగినా నాకున్న శక్తి చాలా పరిమితమైనది.”
2
“నేను 48లో పుట్టాను. మా కుటుంబంలో ఎవరికీ సాహిత్య వాసన లేదు. మా నాన్నగారు పుస్తకాలు చదివేవారు. 64 నాటికి చాలా పుస్తకాలు చదివాను. ప్రబంధాలు మొదలుకుని అదీ ఇదీ అని లేకుండా చదివాను. వాటిలో సాహిత్యం, చరిత్ర, జనవిజ్ఞానం నాకు ప్రధాన ఆసక్తులు. ఈ చదువులో ఏ సంవత్సరం. ఏ తేదీన శ్రీశ్రీ నాకు తటస్థపడ్డాడో, పడ్డపుడు నా తొలి స్పందనలేమిటో నేను చెప్పలేను. శ్రీమూర్తి అన్నమిత్రునితో నాకు స్పర్ధ ఉండేది. అతను కృష్ణశాస్త్రిని ఆరాధించేవాడు. నేను వేదులని ఆరాధించాను. దీపావళి అప్పట్లో నోటికి వచ్చేది. ..నాకు తలంపు లేదు లలనాజనతాకబరీ భరైక భూషాకలనన్.. అనటం వేదుల సమాజం చింతనగా, దేవులపల్లి మనసారగా ఏడ్వనీరు నన్ను అనటం సమాజ నిరాకరణగా అనిపించే అవకాశం ఉంది. 67 నాటికి చదువు పూర్తయింది. నిరుద్యోగం మొదలయింది. ప్రేమ అన్నది ఉందని, కనక ప్రేమించాలని చదువు చెప్తే, అదంతా కేవలం ఒక భావుక స్వభావం మాత్రమే, అలాంటిది ఉన్నా ఆకలి ముందు నిలవదని నా తర్కం చెప్పేది. ఈ ఘర్షణకీ, శ్రీశ్రీ ప్రభావానికీ సంబంధముందా అని ఇప్పుడు ఆలోచిస్తే లేదనే అనిపిస్తోంది. నాలోని ఈ ఘర్షణ నా జీవుడిని (మౌలిక స్వభావాన్ని) తెలియబరుస్తుంది. ఈ జీవునికి ఖచ్చితంగా అమరిన కవి శ్రీశ్రీ. లోకంలోని ఆకలిని ఒక వాస్తవంగా చూసాడు నా కవి. అదే సమయంలో తీవ్రమైన ఉద్వేగానికి లోనై ఆ ఉద్వేగం అంతా తన పాఠకునిలో నింపగలిగాడు. నిజానికి ఆకలికీ, అనుభూతి తీవ్రతకీ చుక్కెదురు. నాదీ అదే పరిస్తితి. నాలో రెండూ ఉన్నాయి. అందుకే శ్రీశ్రీని నా స్వాత్మ్యం అనాలనిపిస్తోంది. మరికొంచెం ఆలోచిస్తే ఒక ప్రశ్న ఎదురవుతుంది”.
“ఏమిటది?”
“రాతిని కూడా గానం కరిగించగలదని అంటారు గాని అది సాధ్యమా? ఆ ఊహ కమ్మగా ఉంటుంది. అది గానం యొక్క గొప్పతనాన్ని అందంగా చెపుతుంది. కరగటానికి కరిగే లక్షణం కూడా అవసరం.”
“అది నీ ప్రత్యేక లక్షణమంటావు.”
“నాది అనుకోను. అది మానవజాతిలో సర్వే సర్వత్రా కనిపిస్తుంది.”
“శ్రీశ్రీతో నీకు విభేదం లేదంటావు”.
“అనను. ఇది విభేదం అనీ అనలేను. దీనికి చాలా వివరణ అవసరం. కవిత్వానికి ఛందస్సు, మాత్ర, లయ ఉంటాయి. కవులు ఓ లయను అనుసరిస్తున్నపుడు అది ఓ ఛందస్సును – అంటే కొన్ని గణ నియమాలనూ, కొన్ని వాక్య నియమాలనూ – అనుసరిస్తుంది. అలా ఆది కవులు స్వయంగా ఏర్పరుచుకున్న నియమాలను వర్గీకరణ చేసి, అవి తర్వాతి కవుల ఉపయోగం కోసం అందుబాటులోకి తేగా అది ఛందస్సు అనీ, అలాగే రాయాలని కవులు కానివారు పట్టుబట్టటం జరిగింది. ఇది భావప్రవాహాన్ని అడ్డుకుంటుందంటని శ్రీశ్రీ గొప్ప కవితావేశంలో కవితా ఓ కవితాలో అన్నారు. 68లోనే అని గుర్తు. పస్తులు, నిరుద్యోగాల మధ్య ఓ రాత్రి నేను వృత్త పద్యాలు రాయటం మొదలయింది. ఆ ఆవేశంలో రోజుల తరబడి పద్యాలు. కడుపు చేతబట్టుకుని ఇల్లు వదలి వెళ్లిపోయినపుడు నా దగ్గర ఉన్నది ఈ పద్యాలు, ప్రేమ-ఆకలి మధ్య సంఘర్షణ, శ్రీశ్రీ కవిత్వం.
ఈ బాటసారి పద్యంలో ఉన్నది నేనే అనిపించేది. కలకత్తా ఫుట్పాతులూ, బీహారు- ఒరిస్సా సరిహద్దులలోని గ్రామాలు తిరిగి జబ్బుపడి, చనిపోకుండా ఇంటికి రాగలిగాను. పోతన మీద ఒక మూడొంతుల కావ్యం, వామపక్ష భావాలతో కపోత సందేశం వృత్తాలలో రాసాను. పోతన కావ్యానికి ముందు మాటలుగా ఛందస్సును శృంఖలాలుగా భావించిన శ్రీశ్రీ అనుభవం గురించి చాలా ఆలోచన నడిచింది. ఛందస్సు వల్ల భావం ఉధృతి(force)ని కోల్పోతుందా పొందుతుందా అన్న చర్చ అనేక పుటలలో సాగింది. హృదయంలో భావాన్ని కవి అక్షరబద్ధం చేస్తాడు. ఈ భావంలో అవేశముంటే అది ఛందస్సు అనే పిచికారీ వల్ల మరింత ఉధృతితో పాఠకుడిని తాకుతుంది అన్నది ఆనాటి నా చర్చ ప్రధానాంశం. అక్షరంలో శబ్దం ఉంటుంది. అక్షరాల కూర్పులో శబ్ద విన్యాసం ఉంటుంది. అది భావావేశాన్ని మరింత గట్టిగా పఠితనూ, శ్రోతనూ కదిలిస్తుందన్నది మరో అంశం. ఇది మన పూర్వకవులు పలికి చూపించారు. కవి శక్తిహీనుడైతే వచన పద్యాలలోనైనా కవిత్వం పలుకుతుందా? ఉధృతి వస్తుందా? అది మరో ఆలోచన.”
“నువ్వు రాసిన పద్యాలలో అలాంటి కవిత్వం, ఉధృతి ఉన్నాయంటావా? ”
” మారుమూల వృత్తాలు, గర్భకవిత్వం(పద్యంలో పద్యం) వంటి సర్కసు పద్యాలతో సహా అన్ని వృత్తాలూ, ఉదాహరణకి కవిరాజ విరాజితం, స్రగ్ధర, మహాస్రగ్ధర, మాలిని వంటి ఎన్నో, రాసాను. కోకిల రామాయణం పేరుతో మత్తకోకిల, తరళాలతో ఫోతన చెప్పినట్లు రామాయణం రాసాను. గోదావరి జిల్లా యాసలో సీసపద్యాలతో ముసురు అన్నపేరిట వ్యవసాయం గురించి కొన్ని రాసాను. ఇలా నేను రాసినవి పద్యాలేగాని కవిత్వమని ఎన్నడూ అనిపించలేదు. వచన పద్యాలు కూడా రాసాను. వాటిల్లో ఏదో కొంత తృప్తి ఉండేది.”
“శ్రీశ్రీ అభిప్రాయంతో ఏకీభవించానంటావు?”
“చెప్పలేను. వస్తువు పట్ల ఆవేశం, అభివ్యక్తి ఉన్నవారికి ఛందో నియమాలు వదిలెయ్యటం వల్ల కొంత వెసులుబాటు కలిగిన మాట వాస్తవం. మన నిచ్చెన మెట్ల సమాజంలో దేనికీ స్వచ్ఛత లేదు. స్పష్టత లేదు. కవిత్వం తీరికవర్గాల విలాసాలకు, వినోదాలకు ఎక్కువగా వినియోగపడింది. అంతేగాక, అది సామాన్య జనానికి అందని ఏదో పూర్వజన్మ సంస్కారఫలంగా, కవులు అసాధారణ వ్యక్తులుగా అనేక ఊహలు, వదంతులు చెలామణీలో ఉండేవి. “హయమట సీత” అంటూ ఆరింట త అక్షరం ఉంచి పద్యం చెపితే శత్రువు చనిపోయాడు వంటి కథలు ఉండేవి. ఈ రహస్యమయ అసాధారణ స్థానం నుంచి కవిత్వాన్ని అందరికీ అందేదిగా చేసిన గురజాడ, శ్రీశ్రీలను అంగీకరించకుండా ఎలా ఉండగలం? అదే సమయంలో పొట్టి, పొడుగు వాక్యాలతో, ఏ ఆవేశంగాని, వైచిత్రిగాని, రామణీయకత గాని లేని రాతలను పద్యాలుగా, అందులో కవిత్వం ఉందని నమ్మించజూచే వత్తాసు వ్యాసాలతో తెలుగు భాషలో ఒకప్పటి పేరుతో చెట్టుపేరుజెప్పి కాయలు అమ్ముకునే లబ్ద ప్రతిష్టులూ, అమాయకులూ, సరైన మార్గదర్శకత్వం లేని కుర్రవాళ్లూ రాసేవి కంటబడినపుడు శ్రీశ్రీ పొరపడ్డాడా అనిపిస్తూనే ఉంటుంది.”
“మహాప్రస్థానంలో నీకు ఇష్టమైన కవిత?”
“రాత్రింబవళ్లు శ్రీశ్రీ, మనసు బాగుంటే శ్రీశ్రీ, ఓగుంటే శ్రీశ్రీ అన్నట్లు ఉండేది. కర్తవ్యం గురించి ఆలోచిస్తే జయభేరి, కవిత్వం గురించి ఆలోచిస్తే కవితా ఓ కవితా, కమ్యూనిజం గురించి ఆలోచిస్తే మహాప్రస్థానం, జీవిత మౌలిక లక్ష్యాలగురించి వెదుకుతుంటే శైశవగీతి, మానవజాతి గురించి ఆలోచిస్తుంటే మానవుడా ఇలా అనేకం నన్ను నడిపించాయి.”
“శ్రీశ్రీతో వ్యక్తిగత పరిచయం ఉందా?”
“దాని గురించి చెప్పేముందు నా రచనలతో శ్రీశ్రీ గురించి చెపుతాను. ఋక్కులు తొమ్మిది పేర్లతో వారం పదిరోజులలో కథలు రాసాను. అందులో ఓ కథ రొట్టెముక్క. దానిని నా భార్య సాఫుచేసి పంపటం అది బహుమతి పొంది ప్రదురించబడటంతో నాకు తెలిసి నా ప్రచురణ పర్వం మొదలయింది. ఆ తొమ్మిది కథలూ వివిధ పత్రికలలో రావటం నాకు వ్యక్తిగతంగా గొప్ప సంతోషం కలిగింది. ఆ తర్వాత కవిత్వమెక తీరని దాహం(ప్రచురణకి ప్రయత్నించలేదు), ప్రపంచమొక పద్మవ్యూహం కూడా రాసాను. కాక కధలకు పేర్లు వెతుక్కోటానికి మహాప్రస్థానం ఆశ్రయించేవాడిని. ఇంక వ్యక్తిగత జీవితం. నా బిడ్డలకు నిద్రపుచ్చటానికి మహాప్రస్థానం పాడేవాడిని. వాళ్లు బడులలో పాడిన పాటలు శ్రీశ్రీవి. వంగపండు ప్రసాదరావూ, నేనూ షిప్ యార్డ్ లో కలిసి పనిచేసాం. అతని పాటలూ నా పిల్లలు పాడుతుండేవారు. మిత్రుడు అనంతుడు నా సహోద్యోగి. విశాఖ సాహితీ ప్రపంచంతో వ్యక్తిగత పరిచయానికి కారకుడు. వేణుగారు, కృష్ణక్క, ప్రసాద్ గార్ల ఇల్లు విశాఖ మేధోప్రపంచానికి కేంద్రం. దానిలో ప్రవేశమే నాకు అనేకమందిని వ్యక్తిగతంగా కలిసే అవకాశం కలిగించింది. కాని నాకు పూనుకుని మాటలాడటం పూసుకుని తిరగటం అన్న భావన హెచ్చు. ఫొటోలకు ఎగబడటం అయిష్టం. అడిగితే చెప్పటం, చెప్పిన పని చేతనైన మేరకు చెయ్యటం నా పద్దతి. కవులు, రచయితల సృజనతో పొందే స్ఫూర్తి మీదనే నాకు ఆసక్తి ఉండేది. ఇలాంటి కారణాల వల్ల శ్రీశ్రీని కలిసిన సందర్భాలున్నా చెప్పుకోదగ్గ విషయాలు మాటలాడిన గుర్తులు లేవు. నాకు ఇష్టమైన జ్ఞాపకాలలో గురజాడ కళా మందిరంలో 74 లో జరిగిన సభ. నా ప్రధమ సంతానం వీరారుణకవితకి ఎనిమిదో నెల. దానిని తీసుకుని నడుచుకుంటూ వెళ్లటం, వంగపండు పాటలు, శ్రీశ్రీ ఉపన్యాసం, ఆ రాత్రివేళ ఆ ఇసుకలో కూర్చుని శ్రీశ్రీ, కాళీపట్నం రామారావులు సభంతా తిరుగుతూ చందాలు వసూలు చేస్తుంటే దగ్గరగా వారిని చూడటం, సభానంతరం మళ్లీ నడుచుకుంటూ రామంతో కలిసి ఆ అనుభూతిని పంచుకోటం… ఒకమారు శ్రీశ్రీని స్టేషనుకి వెళ్లి తీసుకుని వస్తుంటే కారులో ఆయన పక్కనే కూర్చుంటే కారు తలుపులో నా చెయ్యి పడింది. అయ్యో అంటూ నా చెయ్యిని పట్టుకుని ఊదారు. ఇలాంటి చిన్ని చిన్ని సంఘటనలు వ్యక్తిగత పరిచయం కిందకి వస్తే ఉన్నట్టే అని చెప్పాలి”
“ఇంకా చెప్పుకోవలసినది ఏమైనా ఉందా?”
“ఉంది. అది నా ఆలోచనా ప్రపంచంలో శ్రీశ్రీ. కవిత్వమంటే ఏమిటి అన్నది చాలా చిక్కు ప్రశ్న. ఈ ప్రశ్న కలిగిన సందర్భాలన్నీ శ్రీశ్రీని చదివినపుడే కలిగాయి. జవాబు ఇచ్చుకోవాలనిపించినపుడు ఉదాహరణలు అన్నీ మహాప్రస్థానం నుంచే వెదుక్కున్నాను. ఈ ప్రశ్నకి శతాబ్దాలుగా జవాబివ్వటానికి మానవజాతి ప్రయత్నించింది. క్రిస్టఫర్ కాడ్వెల్ చేసిన చర్చ నాకు తృప్తి కలిగించింది. అతని చర్చ మానవ జాతి ప్రస్థానంలో కవిత్వం పుట్టుక చుట్టూ తిరుగుతుంది. అయితే కవిత్వ నిర్వచనానికి అది అంతగా సహాయపడదు.”
“ఆ నిర్వచన మేదో నీకు లభించిందా?”
“లేదు. కవిత్వ సృజన ఒక ప్రత్యేక శక్తి అనీ, అలాగే కవితాస్వాదన కూడా వ్యక్తి ప్రత్యేక శక్తి అనీ ఒక భావన ప్రముఖంగా ఉంది. రెంటికీ సాధన, అభ్యాసం అవసరమన్న ఊహ కూడా ఉంది. అంటే వ్యక్తులకు ఉండే ఒక ప్రత్యేక శక్తి గానో, ఆసక్తి గానో ఒక వివరణ ఉంది. ఈ శక్తులని మన సాంప్రదాయ భావనలలో రససిద్ధీ, సహృదయ భావనలతో వివరించవచ్చు. అయితే ఈ వివరణ అటుతిరిగీ, ఇటుతిరిగీ భగవద్దత్తంగా, జన్మ సంస్కార ఫలంగా, ఒక మానవాతీత వ్యవహారంగా కవిత్వాన్నీ, కవిత్వాస్వాదననూ విస్తరించటం గమనించినపుడు దీనిని నేను అంగీకరించలేను. జనచైతన్యానికి కవి నిలవాలని, కవిత్వం నిలుస్తుందనీ సంఘాభ్యుదయ కాముకులు అంటారు. సమాజం పరిపక్వమౌతున్న దశలో, అంటే మార్పులకు సిద్ధమౌతున్న దశలో, అది “కవి” రూపంలో “కవిత్వం”గా తనను తను ఆవిష్కరించుకుంటుందనేది వారి వివరణ. ఇది కవిని సమూహంలో భాగంగా, కవిత్వాన్ని సమూహ వ్యక్తీకరణ రూపంగా చూస్తుంది. ఈ వివరణతో నాకు చాలావరకూ ఏకీభావం ఉంది. అయితే ఈ వివరణ కూడా కవిత్వాన్ని కొంతవరకూ ఒక ప్రత్యేక వ్యవహారంగానే చూస్తుంది. కవితాస్వాదకులు ప్రత్యేక వ్యక్తులుగా వారి వినియోగానికి మాత్రమే కవిత్వం అన్న నిర్ణయానికి చేర్చే వాదనను నేను ఒప్పుకోలేను. అలాంటి ప్రత్యేక శక్తి నాకు ఏమాత్రం లేదు. బహుశా అందువల్ల కవిత్వ నిర్వచనం నాకు దొరకలేదు.”
“నీకింకా కవిత్వ నిర్వచనం మీద అన్వేషణ ఉంది.”
“ఉంది. కవిత్వంలో ఆధునిక దశపై కొన్ని ఆలోచనలు ఈ అన్వేషణలో కలిగాయి. కవిలో “అసంకల్పితంగా” ఉన్న సామాజిక బాధ్యత “సంకల్పితం” కావటం ఈ దశకి ఆరంభం. జంటపక్షుల వియోగం వాల్మీకిని కదలించి రామాయణానికి కారణం అయిందట. కవి బాహిర ప్రపంచంలోని ఒక ఘటన అతని అంతఃప్రపంచాన్ని కుదిపివేసినపుడు, ఆ కుదుపుని అతను బాహిరప్రపంచంతో పంచుకోజూస్తాడు. ఇందులో ఆ కుదుపు, ఆ వియోగం కలిగించిన దఃఖం, దాన్ని పంచుకోవాలన్న ఆవేశం అన్న మూడు దశలు కనిపిస్తాయి. ఈ మూడూ “అసంకల్పితం” కావటం మనం గమనించవచ్చు. ఆధునిక కవిత్వ దశలోనూ ఈ మూడు దశలూ ఉంటాయి. అయితే కవి చైతన్యం పూర్తిగా అతని అంతఃనిర్మాణానికి పరిమితమైనది కాదు. బాహిర ప్రపంచ ఘటనలు కవి వశంలో ఎన్నడూ ఉండవు. అయితే ఆతని స్పందనలు ఆతని చైతన్యం మీద, ఎఱుక మీదా ఆధారపడే అవకాశం ఉంది. పక్షులు విడిపోవటం బాధాకరం కాటానికి అది బాధాకరమన్న ఎఱుక అవసరం లేకపోవచ్చు. పేదరికం, అసమానత అన్నవి బాధాకరం కాటానికి పట్టణంలో బ్రతుకుదామని వెళ్లిన బాటసారికి కలిగిన కష్టం దైవకృతం కాదని, మానవ కృతమేనన్న ఎఱుక అవసరం. అలసిన కన్నులు కాంచేదేమిటో కాంచటానికి ఆ ఎఱుక అవసరం. ఆధునిక దశ బీజాలు ఈ తరహా ఎఱుక పుట్టుకలో ఉన్నాయి. భావ కవిత్వపు వెల్లువకి భగవంతుడిని స్త్రీగా భావించి ఆరాధించే సూఫీతత్వం కన్న స్త్రీ సాంఘిక స్థితి పట్ల సమాజంలో ఉన్న అసమ్మతి ఎక్కువ దోహదపడిందని గమనించవచ్చు. వేమన, గురజాడలకు శ్రీశ్రీ ఇచ్చిన ప్రాధాన్యతను గమనించినపుడు మాత్రమే అతని కవిత్వంలోని మూడు దశలలో రెండవ, మూడవ దశలలోని “సంకల్ప” “అసంకల్ప” అంశాలను విడదీసి చూడవచ్చు. కవి consious, subconsious అవస్తలూ, ఆధునిక కవిత్వ లక్షణాలూ అర్ధం చేసుకోవచ్చు.”
“………..”
“ఆధునిక కవిత్వం అనగానే పాతనంతా – రూపంలో, వస్తువులో – విసర్జించాలన్నది చాలామంది ఆశించే విషయం. ఈ ఆశ ఎంతవరకూ సబబైనది అన్న విషయాన్ని పక్కనుంచి ఎంతవరకూ సాధ్యం అని నేను ఆలోచించాను. కొత్త ఆలోచనలు వ్యక్తి చైతన్య సంబంధి. చటులాలంకారపు మటుమాయల నటనలలో నీరూపం కనరానందున… అంటాడు శ్రీశ్రీ. అలంకారాల ప్రగల్భాలను చూడగలిగాడు కనక ఆ చైతన్యంతో వాటిని తొలగించుకోవాలన్న సంకల్పం సాధ్యం. వ్యాకరణాలను సంకెళ్లుగా, ఛందస్సులను సర్ప పరిష్వంగాలుగా, నిఘంటువులను శ్మశానాలుగా చూడగలిగినపుడు వాటిని వదిలించుకొనే ప్రయత్నం చేయగలుగుతాడు. ఈ సంకెళ్లు అతని బాహిర ప్రపంచం వేసినవి. ఇవేకాక మరికొన్ని సంకెళ్లు లేదా మరికొంత పాత ఉండే ఉండవచ్చు. ఉదాహరణకు నరక లోకపు జాగిలమ్ములు, యముని మహిషపు లోహఘంటలు ధార్మిక కల్పనలు. వీటిని పాత కవులెవరూ శ్రీశ్రీ వాడిన ఉద్దేశ్యంలో వాడే అవకాశం లేదు. అయినా ఇవి పాతను సూచిస్తాయి. ఎవరినైనా తూచాలనుకున్నపుడు ఆ కవి తెంచుకున్న సంకెళ్లను లెక్కించాలా తెంచుకోలేకపోయిన సంకెళ్లను లెక్కించాలా అన్నది నా ప్రశ్న. అలాగే రాసిన అంశాలను చర్చించాలా? రాయని అంశాలను లిస్టించాలా? ఓ కవి అభ్యుదయతను, ఆధునికతనూ, సామాజిక స్పందనలనూ తూచటానికి కూర్చున్నపుడు అతని కవిత్వంలో ఉన్న అంశాలను ఆధారం చేసుకోవాలా? లేని అంశాలను – అవి అప్పటికే బాహిర ప్రపంచంలో ఉన్నాయి గనుక – పరిగణనలోకి తీసుకోవాలా? ప్రజాస్వామిక దృక్పధంతో అన్నీ తీసుకోవచ్చు. కాని అభిశంసన కోసం కూర్చున్నపుడు జరిగేదేమిటో మనకు తెలుసు. ఆ అభిశంసనకి కారణం కవి పట్ల విముఖత, ఆ విముఖతకి కారణం ఆ కవి నిలబడిన విలువల పట్ల అసమ్మతి, అతడు స్వప్నించే మరో ప్రపంచం పట్ల అసహనం అన్నది గమనించవచ్చు. అలాంటపుడు సాధ్యతకి సంబంధించిన ప్రశ్న పుట్టదు. శ్రీశ్రీ గురించి తలెత్తిన వివాదాలను పరిశీలనాత్మకంగా చూసినపుడు ఆయనకి ముందు వేమన, గురజాడ వేసిన కాలిబాటలు ఉండవచ్చు. వాటిని ప్రధాన రాచమార్గాలుగా మలచటంలో శ్రీశ్రీ కవిత్వం వహించిన పాత్ర ఒక యుగకవిగా ఆయనను నిలబెడుతుంది. కవిత్వ నిర్వచన అన్వేషణలో ఇవీ నేను గట్టిగా ఆలోచించిన విషయాలు.”
“చివరగా?”
“విశ్వమానవ భావన తెలుగు సాహిత్యానికి శ్రీశ్రీ అందించిన మహత్తర కానుక. అది తెలుగు సాహిత్యం మానవ జాతి సాహిత్యం కావటానికి దోవలు తెరిచింది. తానొక అణువునన్న గుర్తింపు మానపుడిని ఏకం చేసి అనంత విశ్వంలో భాగం చేస్తుంది. నామటుకు నాకు ఈ పెను సత్యం రవ్వంతైనా అందటానికి కారకుడు శ్రీశ్రీ.”
-వివిన మూర్తి
స్మృతి
అక్కడున్నాడా… నిజంగానా… ఎప్పుడొచ్చాడో… అయితే వెళ్ళాల… చూసి తీరాలి… ఎంత గొప్ప అవకాశం, ఎన్నాళ్ళ కల… పదా పదా… నడూ నడూ… పరిగెత్తూ… ఆయన్ను చూస్తున్నాననుకుంటేనే ఎంత శక్తి వచ్చేసిందో గదా… గాల్లో తేలినట్లు… ఆగమేఘాల విూద వాలిపోయి చేరిపోయినట్లు… నిజంగానే గాల్లో తేలిపోతున్నానా… ఆశ్చర్యం!
చుట్టూ పొగమేఘాలు ఆవరించినట్లు రంగు రంగుల ఆకారాల్లో అతని బొమ్మలు… అతని కాన్వాస్ విూద నుండీ లేచొచ్చి చుట్టూ నర్తిస్తున్న అతని బొమ్మల్లోని పాత్రలు… ఎగిరే రెక్కలున్న గుర్రం… విల్లంబులు చేతిలో పట్టుకొని కేరింతల తుళ్ళింతలతో అల్లరిగా ఎగురుతున్న పిల్లలూ… ఎన్నో భావాలు పలికించే ముఖాకృతులూ… చిత్రవిచిత్రమైన ఆకారాలు… రంగురంగుల సీతాకోక చిలుకలు… చెప్పనలవి కాని అందాలతో హొయలొలికే కాంతలూ… అన్నీ రంగుల ప్రపంచంలో సంచరించే ఆకృతులన్నీ… అన్నింటినీ మించి, అతనికి ఘనకీర్తిని తెచ్చిన ‘రెక్కలున్న నేలలు’… చుట్టూ తేలియాడుతూన్న దృశ్యం…
అన్నీ పరుగులు పెడుతూ … యింకెంత దూరం… దగ్గరే అన్నారే… ఎదురుగా రంగు రంగుల మేఘాలు కదలాడుతున్న ఆ షెడ్లో నేనా… అందులో దిగింటాడంటావా… వుండకూడదా… చాలా సాదాసీదాగా వుంటాడట కదా… కాళ్ళకు చెప్పులు కూడా వేసుకోడట… అక్కడే అందులోనే వుండుంటాడు… పదా… పదా వచ్చేసాం… జీవితసాఫల్యాన్ని చేరుకోవడానికి… కళాకారుడంటే అతను కదా…
అతనిమునివేళ్ళను చూడాలని ఎంతకోరికా… ఆ మునివేళ్ళు యెంత అద్భుతమైనవో కదా… కుంచెను పట్టే… కాన్వాస్ను తాకే ఆ చేతులు ఎంత మహాద్భుతమైనవో కదా… వాటిని చూడాలనీ, ఆ చిత్రాలను దర్శించి సృష్టించే ఆ కళ్ళను చూడాలనీ… తపించి తపించి ఎన్ని పరుగులు పెట్టానూ… యిన్నాళ్ళకు చేరువైందీ లక్ష్యం… తొయ్ తలుపులు… నాతో వస్తూన్న అతని సమస్త చిత్ర ప్రపంచం… ఏదీ ఎక్కడా… అన్నీ ఎక్కడికెళ్ళి పోయాయి అరే అడుగులు జారిపోతున్నాయే… అరే పక్కడికో పడిపోతున్నానే… పట్టుకుందామంటే యేదీ అందకుండా వుందే… ఏయ్… య్… ఏదీ రంగుల ప్రపంచం… ఎక్కడా రంగుల మనిషి… ఆనందప్రసాద్… ఆ.ప్ర… ఆ.ప్ర… ఏయ్…య్…
కాళ్ళూ చేతులూ గాల్లో ఆడిస్తూ… దబ్బున పడ్డాడు మనోహర్.
‘‘అబ్బా…’’
‘‘ఏయ్ మనూ… ఏయ్మనూ… అట్లా పడ్డావేంది స్వావిూ…’’ హారిక అరుపులకు కలలో నుండీ మెలుకువలోకొచ్చాడు. బెడ్ అంచు నేల విూద వున్నాడు పక్కటెముకలు నొప్పి… తలంతా గజిబిజి.
‘కలలో కూడా కనిపించడా ఆయనా… ఆ షెడ్… ఉమామహేశ్వర్ వాళ్ళ కార్షెడ్ కాదూ… ఆ షెడ్లో ఎందుకున్నట్లబ్బా… యీ కలకు ఏమిటీ లింక్’ అనుకుంటున్నాడు.
‘‘ఏమి స్వావిూ పక్కటెముకలు భద్రమేనా, లేదా నన్నేమన్నా యించమంటావా… ఏ బొమ్మ కలలోకొచ్చి నిన్ను దొర్లించినదీ…’’
నాటకీయంగా అడుగుతోంది హారిక.
అయోమయంగా మొఖంపెట్టి యింకా కలలోనే వున్నట్లు భ్రమింపజేయాలని
‘‘ఎవ్వతెవీవు భీతహరినేక్షణా…’’ అనే పద్యమెత్తుకున్నాడు.
‘‘ప్రవరా… ఓ మనోహరా… నే దిండూధినిని, దిండుతో నాలుగు మొత్తు దానిని…’’ అని దిండుతో నాలుగు బాదింది.
‘‘నీ సరదాకూలా… ఆగూ… ఆ.ప్ర కలలో కన్పించింటే నీతో తన్నులు తింటున్నందుకు ఆనందంగా వుండు…’’ బెడ్విూదెక్కి, విషాదంగా చెంపకు చేయి ఆన్చుకొన్నాడు.
‘‘ఓహో యిది ఆనందప్రసాద్ స్ట్రోకా… ఆ తోపుకు పడ్డావా… ఆ బ్రష్ష్ స్ట్రోక్ చాలా స్ట్రాంగప్పా…’’ యీ సరదాకు మనోహర్ మూడ్ మారదని అర్థమై…
‘‘కన్పించలేదా… సరే ఏం చేద్దాం… నెక్ట్స్టైం బెస్ట్ ఆఫ్లక్… పడుకో రెండుగంటలైంది… నిన్నట్నుంచీ హైద్రాబాద్లో చూసొచ్చిన ఆ పెయింటింగ్ గురించి మాట్లాడుతున్నావే… ఆ ప్రభావమే యీ కల… పడుకో…’’
‘‘చాలా దిగులుగుంది హారికా… యిక కన్పించడు కదా అనుకునేకి మనసు రావట్లేదు…’’
‘‘ఆనందప్రసాద్… ఆ.ప్ర. ఒక వ్యవస్థ… ఒక అస్తిత్వ వ్యవస్థ… అది తన్ను తాను రద్దు చేసుకుంటున్నానని, ప్రకటించుకున్నాక… యిక ఎవరైనా చేసేదేముంది… తన్నుతాను రద్దు చేసుకోవడమనే ట్రెండ్ ఆయన పైటింగ్స్లో ముందు నుంచీ వున్నిందే కదా… దాని గురించి దిగులెందుకు… దీన్ని నువ్వు జీర్ణించుకోవాల్సిందే మనోహర్…’’
ఆ మాటలేవిూ మనోహర్ విూద పని చేయలా… అది గ్రహించి, యిది ఆ.ప్ర (ఆనందప్రసాద్) మాయ, ఆ.ప్ర లేనితనాన్ని ఎప్పుడు జీర్ణించుకుంటాడో అనుకుంటూ నిద్రలోకి జారుకుంది హారిక.
‘యింకేం నిద్రొస్తుంది’ అనుకుంటూ స్టడీరూంలోకి వెళ్ళాడు మనోహర్.
˜ ˜
ఆనందప్రసాద్ (ఆ.ప్ర) పేరెన్నికగన్న చిత్రకళాకారుడు.
ఆ.ప్ర పేరుతో తెలుగు నేలంతా, తెలుగువాళ్ళున్న చోటంతా ప్రసిద్ధుడు. పక్కడో పురాతన తెలుగు స్థావరమైన హొసూరు మారుమూల పల్లెల్లో వున్నాయి అతని మూలాలు. అతని పూర్వీకులు చాలా మంది గొప్ప కళాకారులుగా సంగీతకారులుగా ప్రసిద్ధులు. అతని తండ్రి ఆనంద శంకరస్వామి ప్రసిద్ధ సంగీతకారుడు, అతని తల్లి కుసుమ పరాగవతి పెద్ద నాట్యగత్తె.
రక్తంలో తెలుగు సంస్కృతీ మెరుపులు నింపుకొని ఆ.ప్ర మద్రాసును వదిలేసి తెలుగునేల మూలమూలలా తిరిగాడు, కొన కొనకూ వ్యాపించాడు. వ్యక్తిగా ప్రారంభమై తన కళతో అన్ని వర్గాల వారినీ ఆకట్టుకొన్న అస్తిత్వశక్తిగా ఎదిగాడు. తన బొమ్మల్లో ఎంత సరళత్వముంటుందో అంతే సంక్లిష్టతా వుంటుంది. అందుకే పెద్దలు మొదలుకొని పిల్లలదాకా అతని అభిమానులే. పిల్లల కోసమే ఆ.ప్ర ఎన్నో బొమ్మల్ని గీసాడు. మనోహర్తరం పిల్లలందరూ తెలుగునేల విూద ఆ.ప్ర రంగుల ప్రపంచంలో తేలియాడిన వాళ్ళే.
మనోహర్ వాళ్ళ నాన్న వెంకటనాగన్న, స్కూల్ టీచర్, ఆయన అభిరుచి మేరకు సాహిత్య పత్రికలు తెప్పించుకునేవాడు. అందులో వచ్చే బొమ్మల్లో ఆ.ప్ర బొమ్మల్ని మనోహర్ అనుకరించేవాడు. కొడుకులోని ఆసక్తిని తండ్రి ప్రోత్సహిస్తూ ఎక్కడెక్కడి నుండో ఆ.ప్ర కార్టూన్లూ, రంగుల చిత్రాలూ తెప్పించేవాడు. అట్లా మనోహర్ ఆంతరంగిక ప్రపంచంలో ఆ.ప్ర ఒక భాగమయ్యాడు.
ఆ.ప్ర బొమ్మలూ, ఆ రంగుల కలయికా పంతో వివాదాస్పదమైనవి. వాటివిూద ఎంతో చర్చ నడిచేది. ఆయన బొమ్మలన్నీ కొన్ని భాగాల కలయికగా వుండేవి. ఆయా భాగాల కలయిక విూద పంతో వివాదముండేది. కలపకూడని భాగాలను కలుపుతాడనీ, ఒక ప్రాంతానికెప్పుడూ ఒక రంగే వాడుతాడనీ, యింకొన్ని భాగాల్ని ఎప్పుడూ ఎడారి రంగులనే అద్దుతాడనీ, నెర్రులు చీలిన ఆ భూశకలాలు అతన్నెప్పుడూ ప్రశ్నించవా అని తలపండిన మేధావులు అడుగుతుండేవారు.
ప్రవహించే నీటిజాడలను ఆధిపత్యానికి చిహ్నాలుగా వాడటం, కాలువల వెంట పారే నీళ్ళకు వాడే రంగులు, ఆక్రమణ చిహ్నాలుగా చూపడం, ఆ నీళ్ళవల్ల మొలకెత్తే సంపదను అహంకారంగా చూపడం వంటివాటిపై యింకోవైపు నుండీ పెద్ద పెద్ద దుమారాలు రేగేవి. ప్రతి వివాదానికీ ఆ.ప్ర మౌనంగా వుండేవాడు. తనపని తాను చేసుకుపోయేవాడు. ప్రతిసారీ ఔత్సాహికుల్లో తన రంగుల ప్రపంచంతో, తన చిత్రిక విన్యాసంతో కొత్త కలలూ, కొత్త ఆశలూ రేకెత్తించేవాడు.
మనోహర్ బాల్యంలో యీ చర్చలేవీ తెలియకుండానే ఆ.ప్ర మత్తులో పడ్డాడు. వాళ్ళ నాన్నకు కొంతవరకూ తెలుసుగానీ, ప్రజల్లో గొప్ప ఆశనూ, ఆసక్తినీ రేకెత్తిస్తున్న చిత్రాల విూద కొడుకు యిష్టపడటం చాలా మంచి పరిణామం అనుకొని, దాన్నో మురిపెంగా భావించి కొడుకులో ఆ ఆసక్తి చివరిదాకా కొనసాగాలని కోరుకున్నాడు. అందుకే ఏవిూ తెలియని వయసులో కొడుకుని, చెక్కిలిపై ముద్దు పెట్టుకొని-
‘‘ఆ.ప్ర లాగా గొప్పవాడివి కావాలి నాన్నా…’’ అని నూరిపోసాడు
ఆ తడిఆరని ముద్దు మనోహర్ మనసులో శాశ్వతంగా నిలిచిపోయింది.
1970ల్లో మనోహర్కు ఆరేండ్ల వయసులో ఆ.ప్రను చూపిద్దామని వెంకటనాగన్న కొడుకును తీసుకొని విజయవాడ వెళ్ళాడు. అప్పుడు ఆ.ప్ర గీసిన ‘ఉపాధుల హద్దులు’ అనే బొమ్మ విూద పెద్ద వివాదం నడుస్తుండేది. ఆయన బొమ్మల్లో సహజంగా వుండే భౌగోళికత వివాదాస్పదంగా తయారై పెద్ద వుద్యమం నడిచింది. ఆ గలాటాల్లో కొడుకుతో పాటు వెనక్కు రావడానికి వెంకటనాగన్న చాలా యిబ్బందులు పడ్డాడు. ఆ.ప్ర నేమో విజయవాడను వదలి హైదరాబాద్కు వెళ్ళిపోయారు. అట్లా మొదటి ప్రయత్నమే, ఎంతో మురిపెంగా గొప్ప కళాకారుణ్ణి చూపిద్దామనుకున్న ప్రయత్నం నెరవేరలేదు. అప్పటి నుండీ మనోహర్కు ఆ.ప్రను చూడాలనే ఆకాంక్ష, అది నేరవేరని నిరాశా వెంటాడాయి.
అయితే ఆ.ప్ర మాత్రం ‘1970’ల వివాదం తర్వాత ముఫ్పై యేళ్ళపాటు హైదరాబాద్తో పాటు పదిగాడు. అంతర్జాతీయంగా తన కళాసృజనతో పేరు తెచ్చుకున్నాడు. ఆ కాలంలో ఆయన తీసిన ఆర్ట్ డాక్యుమెంటరీలైతేనేవిూ, గీసిన బొమ్మలైతేనేవిూ తెలుగు సంస్కృతిని విశ్వవిపణిలో నిలబెట్టాయి. అతని అంతర్జాతీయ విమర్శకులు ఆ బొమ్మల్ని చూసి, ఆంధ్రుల వ్యాపారాత్మకత ఎక్కువ అదే యీ బొమ్మల్లో కన్పిస్తుందనేవారు. అతని అంతర్గత విమర్శకులేమో, హైదరాబాద్ మూలమూలల్నీ తన బొమ్మల్లో అలంకరించినంతగా తెలంగాణా పల్లెసొగసుల్ని పట్టుకోలేదని విమర్శించేవాళ్ళు. దాన్ని ప్రశంసగా తీసుకొని ఆ.ప్ర ‘‘హైదరాబాద్ నా ఆత్మ’’ అనేవాడు. అందుకే మనోహర్ తరం ఆ.ప్ర అభిమానులకు హైదరాబాద్ చిత్రాలంటే వేలంవెర్రిగా వుండేది.
˜ ˜
‘‘ఈ ఆర్ట్ ఎగ్జిబిషన్ ఎంత కళాత్మకంగా వుందో మనోహర్… నువ్వూ నీ గురువులా ప్రొఫెషనల్ పైంటర్ అయ్యుంటే నీది కూడా ఆర్ట్ పగ్జిబిషన్ ఏర్పాటు చేసేదాన్ని…’’ హారికా అంటోంది.
‘‘వ్యంగ్యయేవిూ వద్దుగానీ… యీ బొమ్మ చూడూ ‘వంటావార్పూ’ దీని టైటిల్. కట్టెలు మండుతున్నాయి ఒక యాంగిల్లో, పాత్రలు ఎక్కడున్నాయో చూడూ, ఆ పాత్రలు మనుషుల్లా లేరూ… బ్యాక్డ్రాపంతా రోడ్డే కదా… ఆ బ్రష్ విన్యాసంలో ఏదో మెలికె వుంది, లేదంటావా… ఏం చెబుతున్నాడూ… మంటలై మండుతూ బాటన పడతారు… భుక్తికీ, విముక్తికీ అనా…’’
‘‘నిజమే మనూ, యీయన చిత్రాల్లో స్త్రీలు విచిత్రంగా కన్పిస్తారు. చీరల కోసం, ఆచ్ఛాదనకోసం, ఆయనెంచుకునే రంగుల వుద్దేశ్యం, భారతీయత కోసమేనా… లేదా దాన్ని తిరస్కరించడం కోసమా… అవయవాల అమరికలో ఒక డిస్ప్లేస్మెంట్ చూపిస్తాడే, ఏం కారణమో కదా…’’
‘‘లేదు హారికా యీయన మొదట్నుంచీ తన బొమ్మల్లో విడి విడితనాన్ని సింబలైజ్ చేస్తున్నాడు… అది అస్తిత్వవాదానికి గుర్తు అనుకుంటా… ఆ.ప్రలో కొట్టొచ్చినట్లు కనిపించేది ఆ లక్షణమే… యీ బొమ్మ చూడూ ‘డైవర్సిటీ`యూనైట్’ థీమాటిక్ పైంటింగ్… యిదే ఆ.ప్ర సారం…’’
‘‘నిజంగా యీరోజు పక్కడికొస్తాడంటావా… యీ నిర్వాహకుల ప్రకటన చూసి, పనులన్నీ వదిలేసి పరిగెత్తుకొచ్చామే…’’
‘‘నిరాశపడొద్దు… హారికా నన్నూ నిరాశపర్చొద్దూ… తప్పకవస్తాడు, నువ్వూ నేనూ అతన్ని చూస్తాం… ‘యిక యిదే ఆఖరి ఎక్స్బిషన్ యిక నా పైటింగ్స్నూ నన్నూ రద్దు చేసుకుంటానని’ ప్రకటించాడు గదా… ఆఖరి దర్శనం తప్పక దొరుకుతుంది…’’
అట్లాంటి ఆశతో మనోహర్ ఎంతగానో ఎదురుచూసాడు గానీ, సాయంత్రానికి, ‘‘ఆ.ప్ర రావట్లేదనీ, ఆత్యవసర పని విూద అమెరికా వెళ్ళాడనీ, క్షమించమని’ ప్రకటించారు నిర్వాహకులు.
‘‘…విఫలమైన నా కోరికలా…’’ విషాదభరితమైన పాట వొకటి వినిపిస్తోంది. హారికా మనోహర్లు ఆర్ట్ పక్సిబిషన్ నుంచీ నేరుగా వూరికి బయల్దేరారు… కార్ పక్కినప్పటి నుండీ కలత నిద్రపోతున్నాడు మనోహర్. అతని నుదిటిపై చేయివేసింది హారిక. వులిక్కిపడ్డాడు. బలహీనంగా,
‘‘వచ్చేసామా…’’ అన్నాడు.
‘‘దగ్గర్లో వున్నాం… కృష్ణను దాటేశాం… తుంగభద్ర రాబోతోంది…’’
‘‘పక్కడున్నా ఆపమంటావా… కాస్తా కాఫీ తాగుదువు, విూ ఆర్ఎమ్యు మార్క్ కాఫీ… కాఫీ నురగ విూద కాఫీపొడి చల్లుకొని తాగేది…’’ కాస్తా నవ్విద్దామని ప్రయత్నించింది. మామూలుగా వుంటే, యింత ప్రయాణంలో మనోహర్ ఎన్ని పంచ్ డైలాగ్స్ పేల్చిండేవాడో.
‘‘లేదులే… నీకు తాగాలనుంటే ఆపుకో…’’ తుంచేసాడు.
‘‘ఇలా అయితేఎలా… పెళ్ళైనప్పట్నుంచీ యిదే వరుస. చూడాలనుకోవడం చూళ్ళేకపోవడం. ఈ ద్వంద్వం గురించి కాస్తా తాత్వికంగా ఆలోచించూ… చూళ్ళేకపోవడంలో చూడ్డం వుంది గదా… ఆ సమయమంతా ఆ ధ్యానంలో, ఆరాధనలో వుండటమే గదా… అసలు ఆ.ప్ర తనను తాను రద్దు చేసుకుంటుంటే, యిట్లా విూరు ఆయన అభిమానులు ఆయన అస్తిత్వాన్ని నిలపాలనుకోవడంలో అర్థం వుందా…’’
నిజమేననిపించింది మనోహర్కు. తాము చూడాలనుకుంటున్న ఆ.ప్ర భౌతికత, కాలవశాన తనంతకుతానే రద్దయిపోతుంటే… యీ వేదన ఏమిటీ… అసలెందుకూ… అనుకొని తేలికపడ్డాడు.
మనోహర్ ఆ.ప్రను ఆరాధించినంత మాత్రాన, తానేవిూ పైంటర్ కాలేదు. బాల్యం నుంచీ ఆ బొమ్మలు చూస్తూ, చూస్తూ లైబ్రరీకి అలవాడు పడ్డాడు. లైబ్రరీకి వెళ్తూ వెళ్తూ పుస్తకాలకు అలవాటు పడ్డాడు. చదువులో మెరుగుపడి సైన్స్లో యూనివర్సిటీ ప్రొఫెసర్ అయ్యాడు. ఆనందప్రసాద్ ప్రభావంతో బొమ్మలపై అనురక్తి ఏర్పడి యిప్పటికీ తాను కళాకారుడిగా మిగిలాడు. ఆ.ప్రను చూడ్డం మనోహర్కు జీవన్మరణ సమస్య కాకున్నా ఆ.ప్ర గురించి ఆలోచించడం, అతని చిత్రాలు రగిల్చే మంటల్లో కాలడం ఒకవ్యసనంగా మారింది. అది తెరలు తెరలుగా అతన్ని సోకుతూ వుంటుంది.
˜ ˜
‘‘జగదీశ్వర్కు తెలిసిన ఒక ఎడిటర్కు, ఆ.ప్ర గారు బాగా దగ్గరట. ఆయన ద్వారా యీసారి ప్లేస్, టైమ్ ఫిక్స్ చేస్తా దిగులు పడొద్దు’’ అన్నాడు ఉమామహేశ్వర్.
‘నేనూ నువ్వూ జగదీశ్వర్తో పాటు శేషసాయి గారిని కలిసి వెళ్దాం… శేషశాయి గారికి పర్సనల్ పని వుందట. కలసి తీరుతారట. ఆయన్తో పాటు మనం… యీసారికి తిరుగులేదు’ అని భరోసా యిచ్చాడు.
ఆ.ప్ర వైభవం తెలుగు నేల విూద కన్నా, తెలుగువాళ్ళు జీవిస్తున్న అమెరికాలోనే పక్కువ. ఈ మధ్యా కొన్నేళ్ళుగా అక్కడే వుంటున్నాడు. తన ‘విభజనరేఖలు’ చిత్రం దుమారం రేపిన తర్వాత, భౌగోళిక విభజన కన్నా, భౌద్ధిక అంతరాలకు, అగాథాలకూ ముందస్తు సూచిగా, ఆయన ‘బొమ్మ’ రూపు కట్టాకా, తెలుగునేల అల్లకల్లోలమై పోయింది.
ఆ తర్వాత ఒక ప్రముఖ సాహిత్య పత్రికకు యిచ్చిన యింటర్వ్యూలో ఆ.ప్ర తనిక భౌతికంగా తెలుగునేలపై వుండననీ, తన బొమ్మలు యిప్పుడు గతంలో కలసిపోయిన యితివృత్తాలనీ, ప్రకటించడం, విమర్శకుల్ని ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత అమెరికా వెళ్ళిపోయాడు. ఇదిగో ఎప్పుడో యిలాంటి వ్యక్తిగత పనుల విూద మిత్రుల కోసం మాత్రమే హైదరాబాద్ వచ్చి ఓ నాలుగు రోజులుండీ మాయమవుతాడు.
‘‘హైదరాబాద్ పప్పుడొచ్చినా యిక్కడే వుంటాడు. యిక్కడే తన ఆఖరి బొమ్మగా ప్రచారం అయిన ‘స్మృతి’ గీసాడు’’ శేషశాయి గారు చెప్తూంటే మనోహర్కు ఒక్కసారిగా రోమాలు నిక్కబొడుచుకున్నాయి. ఆ.ప్ర నడయాడిన ఆ నేలనూ, ఆ గోడల్నీ తాకి కళ్ళకద్దుకుందామనుకున్నాడు. స్మృతి ` ఆ.ప్రకు గొప్ప సృజనాత్మక కొనసాగింపని పేరు పొందింది. అసలు నేలలు తమ అస్తిత్వాల కోసం రెక్కలు తగిలించుకొని పగిరిపోవడమనే దాన్ని మొదలు పెట్టిందే ఆ.ప్ర దాన్ని యిన్నేండ్లలో గడిచిన తాత్వికతతో దట్టించి ‘స్మృతి’ని గీసాడు. అతన్ని వ్యతిరేకించే వాళ్ళు కూడ మెచ్చుకున్నారు. అతని కాన్సెప్ట్లోని అనివార్యత ముందు ఓడిపోయిన వాళ్ళే అందరూ…
మనోహర్కు అంతా కలలా వుంది. నిజంగా యీ రోజు ఆ.ప్ర ను చూస్తానా… లేక యీ నేలకు దూరమైపోయిన ఆనందప్రసాద్ను విస్మృతిలోకి నెట్టే పనికి యీ రోజు నుంచే మొదలుపెడతానా అనుకుంటున్నాడు. ఆ మాట ముందే హారికకు చెప్పే వచ్చాడు. ఆ.ప్రను చూడ్డం, చూడకపోవడం అనేవి యిప్పుడు మనోహర్ లక్ష్యాలు కావు. ఒక స్మృతి రద్దయిపోవడం, దానికి తాను పదుర్కోవాల్సిన రిహార్సల్ ముఖ్యమనకున్నాడు. ఆ.ప్ర గురించి లోపల పేరుకుపోయిన ఒక్కో దృశ్యాన్ని రద్దు చేసుకోవడం పలా అనే ఆలోచిస్తున్నాడు. ఇందుకు స్ఫూర్తి కూడా తిరిగి ఆనంద ప్రసాదే.
ఇంతలో ‘వస్తున్నాడు వస్తున్నాడు’ అనే శబ్దాలు వినిపించాయి. వాతావరణం నిశ్శబ్దమయ్యింది. చూస్తూనే ఏమని మాట్లాడిరచాలా, పలా పరిచయం చేసుకోవాలని మనోహర్ సతమతమవుతున్నాడు.
‘సార్ నేను విూ డెడ్లీఫాన్… విూ వేళ్ళకొసలను కళ్ళకద్దుకుంటాను అనుగ్రహిస్తారా…’
‘విూ బొమ్మల చుట్టూ నా జీవితాన్ని పెనవేసుకున్నాను. విూ సారాన్ని పీల్చి మనిషిగా మారాను… విూ పాదాలను తాకనిస్తారా…’
‘చరిత్రలో కనుమరుగైన భూముల్లాగా, వాటి అస్తిత్వాల్లాగా విూరూ విూ బొమ్మలూ గతజల సేతుబంధనాలు… అప్పటి గాల్లో కలసిన సువాసనల్లో నన్నూ ఓ శ్వాస కానిస్తారా…’
యిన్ని ఆలోచనల్లో మనోహర్ వుండగా, రావాల్సిన వ్యక్తి రానేవచ్చాడు. మనోహర్ గుడ్లప్పగించి చూసేంతలో…
శేషశాయి గారి నమస్కారానికి ప్రతినమస్కారం చేసాడు. మిగతావాళ్ళవి గాల్లోనే స్వీకరించాడూ, అందర్నీ అలా చూసి, అందరూ సంభ్రమంలో వుండగా
‘కూర్చోండి’ అని చాలా మృదువుగా అన్నాడు. శేషశాయి గారు ఒకవైపు కూర్చుంటే, ఉమా మహేశ్వర్ యింకోవైపు కూర్చోగలిగాడు. మనోహర్ నిలబడే వుండి పోయాడు.
ఆ.ప్ర కాళ్ళ దగ్గర కూర్చోగలను అవకాశమొస్తుందా? అన్నట్లున్నాడు.
‘విూ స్మతి చాలా పాపులర్ అవుతోంది సార్… చాలా మంది క్రిటిక్స్ దాన్ని గురించి రాస్తున్నారూ… మాట్లాడుతున్నారు’ శేషశాయి గారు అంటుంటే,
‘నా ‘విభజనలో’ విూరు జీవిస్తారు’ అన్నాడు ధీరగంభీరంగా అని చివ్వున లేచి నిలబడ్డాడు. శేషశాయి గారు ఆత్రంగా కాస్తా పెద్దకవరొకటి అందించి,
‘విూరడిగింది సార్’ అన్నాడు.
‘సరే…’ అని సర్రున కారులో మాయమయ్యాడు.
మనోహర్ కళ్ళు తెరుచుకునేలోగా, కలలోలాగా మాయమయ్యాడు.
ఇది కలా నిజమా అనుకొంటూ, మనోహర్ చేతిని పట్టుకొని గట్టిగా గిల్లాడు.
‘‘ఏయ్ మనూ నన్ను గిచ్చుతావేందబ్బా నువ్వూ… నన్ను నిద్రపోనివ్వవా…’’
హారిక అరుపుతో కళ్ళు తెరిచాడు.
-జి. వెంకట కృష్ణ
కారుణ్యం
దుఃఖమూ కరుణా మనలోపలి ఉద్వేగభరితమైన కవలల్లా కనిపిస్తాయి నాకు.
దుఃఖం ఎలా అయినా రావచ్చు కదా, నిరాశలోనో వేదనలోనో ఏదో వొక రూపంలో.
అలాగే, కరుణ కూడా సహానుభూతి రూపంలోనో, అపారమైన దయ రూపంలోనో రావచ్చు.
మనల్ని మనం పూర్తిగా నిండుగా దుఃఖంలోకి తీసుకువెళ్ళడానికి ఎంత ధైర్యం కావాలో, ఆనక, మనల్ని మనం పూర్తిగా క్షమించుకోగలిగే అంత స్థైర్యమూ వుండాలి.
నిజమైన కరుణ వొక సంపూర్ణమైన లోచూపు వల్ల వస్తుంది.
ఇక్కడ నీటి బిందువులున్నాయి కదా, అవి దుఃఖపు మనఃస్థితిని చెప్తాయి.
ఆ వెనక వున్న తెలుపు అంతా క్రమంగా ఆ దుఃఖాన్ని పీల్చుకునే కారుణ్య సీమ, ఓదార్పు లాంటి భూమిక.
ఇక ఆ తరవాత మన ముందున్న ఖాళీ పుటని రంగులతో నింపడమే!
-మమత వేగుంట
అక్షరం ఆత్మహత్య చేసుకోదు
కోసంబి అన్వేషణలో వెలుగు దివ్వె…
దామోదర్ ధర్మానంద్ కోసంబి రాసిన ‘యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ’ ఇంగ్లిషులో వెలువడిన ఆరు దశాబ్దాలకు తెలుగులోకి వస్తున్నది. తెలుగు సమాజానికీ, తెలుగు మేధో ప్రపంచానికీ అత్యంత అవసరమైన ఈ పుస్తకాన్ని ఇంత ఆలస్యంగానైనా తెలుగు చేసే అవకాశం రావడం వ్యక్తిగతంగా నాకు గొప్ప సంతోషం. ఈ పుస్తకాన్ని మాత్రమే కాక, ఎన్నో ప్రామాణిక గ్రంథాలను భారతీయ భాషలన్నిటిలోకీ అనువదింపజేసే మహత్తర బాధ్యతను తలకెత్తుకున్న నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్, ఆ బాధ్యతను తెలుగులో పంచుకుంటున్న హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ఈ గ్రంథానువాదానికి నన్ను ఎంపిక చేసినందుకు హృదయపూర్వక కృతజ్ఞతలు.
భారత చరిత్రకు సంబంధించి నిశితమైన ఆలోచనలు చేసి, మూడు పుస్తకాలు, దాదాపు వంద వ్యాసాలు రాసినప్పటికీ దామోదర్ ధర్మానంద్ కోసంబి (31 జూలై 1907 – 29 జూన్ 1966) ప్రాథమికంగా చరిత్రకారుడు కాదు. ఆయన అనేక శాస్త్రశాఖలతో సంబంధం ఉన్న అరుదైన మేధావి. గణితశాస్త్ర అధ్యయనం దగ్గర ప్రారంభించి ఆయన ఎన్ని శాస్త్రాలలో ప్రవేశించారో, ఎన్ని శాస్త్రాలలో మౌలిక ఆలోచనలు చేశారో చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. గణిత శాస్త్రం, సంఖ్యాశాస్త్రం, జన్యుశాస్త్రం, రేఖాగణితం, నాణాల్ని బట్టి చరిత్రను కనుకొనే పణశాస్త్రం, సాహిత్య విమర్శ, పురాతత్వశాస్త్రం, భారత అధ్యయన శాస్త్రం, రాజకీయార్థిక శాస్త్రం, చరిత్ర వంటి అనేక శాస్త్రాలలో ఆయన చెరగని ముద్ర వేశారు. మాతృభాష కొంకణితో పాటు మరాఠీ, హిందీ, ఇంగ్లిష్, సంస్కృతం, పాళీ, ప్రాకృతం, లాటిన్, గ్రీకు, ఫ్రెంచి, ఇటాలియన్, జర్మన్ భాషల్లో మూల రచనలు చదివేంత, రచనలు చేసేంత ప్రావీణ్యం సంపాదించారు.
ఆయన తండ్రి ఆచార్య ధర్మానంద్ దామోదర్ కోసంబి బౌద్ధ అధ్యయనాలలో, పాళీ భాషలో నిష్ణాతుడుగా పూనాలోని ఫెర్గూసన్ కాలేజిలో అధ్యాపకుడిగా ఉండేవారు. హార్వర్డ్ విశ్వవిద్యాలయం ఆయనను అతిథి అధ్యాపకుడిగా, ప్రత్యేక ప్రణాళికల సభ్యుడిగా మూడు వేరువేరు సందర్భాలలో ఆహ్వానించింది. అలా తండ్రి రెండవసారి హార్వర్డ్ వెళ్లినప్పుడు ఆయన వెంట దామోదర్ కోసంబి తన పదకొండో ఏట హార్వర్డ్ కు వెళ్లి ఉన్నత పాఠశాల విద్య అక్కడే అభ్యసించారు. తర్వాత తండ్రి భారతదేశానికి వచ్చినప్పటికీ దామోదర్ కోసంబి కళాశాల విద్య కోసం అక్కడే ఉండిపోయారు. ఈ క్రమంలోనే ఆయన గ్రీకు, లాటిన్, ఫ్రెంచి, జర్మన్, ఇటాలియన్ భాషలు నేర్చుకున్నారు. గణితశాస్త్రంలో ఉన్నత విద్య పూర్తి చేసుకుని 1929లో భారతదేశానికి తిరిగివచ్చి మొదట బనారస్ హిందూ విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు, తర్వాత అలీఘర్ ముస్లిం విశ్వవిద్యాలయంలో రెండు సంవత్సరాలు అధ్యాపకుడిగా పని చేశారు. తన తండ్రి పనిచేసిన పూనా ఫెర్గూసన్ కాలేజిలో గణితశాస్త్ర అధ్యాపకుడిగా 1933లో చేరి, పద్నాలుగు సంవత్సరాలు అక్కడే ఉన్నారు. ఆతర్వాత, 1946లో అప్పుడే ప్రారంభించిన టాటా ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఫండమెంటల్ రిసర్చ్ వ్యవస్థాపకుడు, ప్రఖ్యాత శాస్త్రవేత్త హోమి భాభా ఆహ్వానంతో అక్కడ శాస్త్రవేత్తగా చేరారు గాని అణుశక్తి వంటి శాస్త్ర విషయాలలోనూ, నెహ్రూ విధానాల వంటి రాజకీయాంశాలలోనూ భాభాతో విభేదాల వల్ల 1962లో ఆ పదవి వదులుకున్నారు. కౌన్సిల్ ఫర్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రిసర్చ్ 1964లో ఇచ్చిన సైంటిస్ట్ ఎమెరిటస్ గుర్తింపుతో పూనాలో తానే స్వయంగా మహారాష్ట్ర అసోసియేషన్ ఫర్ ది కల్టివేషన్ ఆఫ్ సైన్స్ ప్రారంభించారు. ఖడక్ వస్లా లోని నేషనల్ డిఫెన్స్ అకాడమీలో శిక్షణ పొందే విద్యార్థుల కోసం ఆర్కియలాజికల్ సొసైటీ స్థాపించారు. యాభైతొమ్మిదో ఏట, 1966 జూన్ 29న హఠాత్తుగా మరణించారు. దాదాపు 1920ల నుంచీ రచనలు చేస్తూ అనేక రంగాలలో వందలాది వ్యాసాలు రాసినప్పటికీ ఆయన జీవితకాలంలో ప్రచురితమైనవి చరిత్ర మీద రెండు పుస్తకాలు మాత్రమే.
కోసంబి మేధో పరిణామం, ఆయన ఒక్కొక్క శాస్త్రంలోకీ విస్తరించిన తీరు, చివరిదాకా ఆయనలో సాగిన అన్వేషణా తపన ఆశ్చర్యపరుస్తాయి. స్టెప్స్ ఇన్ సైన్స్ అనే పాక్షిక ఆత్మకథాత్మక వ్యాసంలో తాను ఏయే శాస్త్ర రంగాలలోకి ఎలా ప్రవేశించవలసి వచ్చిందో ఆయనే చెప్పుకున్నారు. అది చూస్తే యూరప్ లో పునరుజ్జీవన యుగంలో సకల శాస్త్రాలలో ప్రవేశించిన వ్యక్తులు, ‘సమస్త జ్ఞానాన్నీ నా పరిధిలోకి తీసుకున్నాను’ అని ఫ్రాన్సిస్ బేకన్ అన్నట్టు అనగల వ్యక్తులు గుర్తుకొస్తారు. “కోసంబిని చాల తరచుగా మహామేధావిగా, ‘పునరుజ్జీవన యుగపు వ్యక్తి’ గా, అసాధారణమైన మేధో మూర్తిగా వర్ణిస్తూ ఉంటారు. ఆయనను సన్నిహితంగా చూసి ఉండకపోతే అటువంటి మనిషి ఉండగలడని నేను నమ్మేదాన్ని కాదు” అని ఆయన కూతురు మీరా కోసంబి ఆయన శతజయంతి సందర్భంగా ఆయన వ్యక్తిగత, సామాజిక, మేధో జీవితం గురించి రాసిన వివరమైన వ్యాసంలో అన్నారు.
గణితశాస్త్రం కచ్చితమైన శాస్త్రమనీ, అది ప్రకృతి భాష అనీ, తనను అది సమ్మోహపరిచిందనీ ఆయనే చెప్పుకున్నారు. ఆయన తొలి ఆలోచనలు, పరిశోధనలు, రచనలు గణితశాస్త్రంలో, ప్రత్యేకించి టెన్సర్ అనాలిసిస్ పాథ్ జామెట్రీ వంటి రంగాలలో సాగాయి. ఆ క్రమంలోనే ఆయన 1943లో జన్యు శాస్త్రంలో ప్రవేశించి క్రోమోజోమ్ మాపింగ్ మీద ఒక రచన చేసి, అంతర్జాతీయ గుర్తింపు పొందిన ‘కోసంబి సూత్రం’ అనేదాన్ని తయారుచేశారు. గణితశాస్త్రం నుంచి సహజమైన కొనసాగింపుగా సంఖ్యాశాస్త్రంలో ప్రవేశించి 1944లో ప్రాపర్ ఆర్థోగొనల్ డికాంపోజిషన్ అనే విశిష్ట సాంకేతిక పద్ధతిని కనిపెట్టారు. ఆ క్రమంలో నాణాల పరిశోధన ప్రారంభించారు. ఏడువేల నాణాలను తాను స్వయంగా తూచానని ఆయనే చెప్పుకున్నారు. ఆ నాణాల తూకం మార్పుల గురించి చేసిన ఆలోచనలతో ఆయన పణశాస్త్రానికి శాస్త్రీయమైన పునాది వేశారు. నాణాలను అవి ముద్రించిన రాజుల కోసమో, వాటి లోహాల కోసమో కాక, వాటి మీద సంతకం చేసిన సమకాలీన సమాజం కోసం అధ్యయనం చేయాలని ఆయన అన్నారు. ఈ నాణాల అధ్యయన క్రమంలోనే ఆయనకు ప్రాచీన చరిత్ర పట్ల, మొత్తంగా చరిత్ర పట్ల ఆసక్తి కలిగింది. అదే మరొకవైపు ప్రాచీన సంస్కృత, పాళీ సాహిత్య అధ్యయనానికీ, పరిష్కరణకూ, సాహిత్య విమర్శకూ దారి తీసింది. చరిత్ర రచనకు గతకాలపు ఆధారాలు ఎంత కీలకమో, ‘భారతదేశం అనేది ఒక సుదీర్ఘ అవశేషాల దేశం’ అనే అవగాహనతో వర్తమానంలో జీవిస్తున్న గతాన్ని అధ్యయనం చేయడమూ అంతే ముఖ్యమని ఆయన అనుకున్నారు. అందువల్ల పురాతత్వ శాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చారో, ఇంకా ఆదిమ తెగ జీవితం గడుపుతున్న సమూహాలకూ, ఆధునికులమనుకుంటున్నవారిలోని ఆదిమ ఆచారాలకూ అంతే ప్రాధాన్యమిచ్చారు. ఆ రకంగా కోసంబి అసాధారణమైన చరిత్రకారుడిగా, పురాతత్వవేత్తగా ఎదిగారు.
కోసంబి మరణం తర్వాత అర్ధశతాబ్ది గడిచాక ఆయన మేధో జీవితం నుంచి మాత్రమే కాదు, సామాజిక జీవితం నుంచి కూడ గ్రహించవలసినవి ఉన్నాయి. ఆయన తనది చారిత్రక భౌతికవాద దృక్పథమని, అంటే మార్క్సిజమని స్పష్టంగానే ప్రకటించుకున్నారు. అయితే తాను చూస్తున్న భారత కమ్యూనిస్టు ఉద్యమ నాయకులు కొందరు అనుసరిస్తున్న మార్క్సిజం నుంచి తనను తాను వేరు చేసి కూడ చూపుకున్నారు. వారికి అధికార మార్క్సిస్టులు (అఫీషియల్ మార్క్సిస్టులు) అని పేరు పెట్టి, ఆ ఇంగ్లిషు మాట పొడి అక్షరాలలో ఒ ఎం – ఓం – అవుతుంది గనుక అలా వ్యంగ్యంగా కూడ పిలిచారు.
“రాజకీయ అనివార్యతో కోసమో, పార్టీ సంఘీభావం కోసమో అయినా సరే, మార్క్సిజాన్ని ణితశాస్త్రం లాగ మొరటు రూపవాదానికి కుదించగూడదు. అలాగే దాన్ని ఒక ఆటోమాటిక్ కోతయంత్రం మీద పని వంటి ప్రామాణిక సాంకేతిక పరిజ్ఞానంగానూ చూడడానికి వీలులేదు. మానవసమాజం అనే దానిలో ఉన్న పదార్థానికి అనంతమైన వైవిధ్యం ఉంది. పరిశీలకుడు తాను కూడ పరిశోధిస్తున్న జనాభాలో భాగమే. పరిశీలకుడు పరిశీలిస్తున్న జనాభాతో బలంగానూ, పరస్పరంగానూ చర్య-ప్రతిచర్యలో ఉంటాడు. అంటే అర్థం సిద్ధాంతాన్ని విజయవంతంగా అన్వయించాలంటే విశ్లేషణాశక్తి అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఒక నిర్దిష్ట స్థితిలో కీలక అంశాలేవో వెలికితీయగల సామర్థ్యం అభివృద్ధి చెందవలసిన అవసరం ఉంది. ఇది కేవలం పుస్తకాల ద్వారా నేర్చుకునే విషయం కాదు. దాన్ని నేర్చుకోవాలంటే ప్రజానీకంలోని ప్రధాన భాగాలతో నిరంతర సంబంధంలో ఉండాలి. ఒక మేధావి విషయంలో, దాని అర్థం, కొన్ని నెలలైనా శారీరక శ్రమలో గడపడం, శ్రామిక వర్గంలో ఒకరిగా తన జీవనోపాధి సంపాదించుకోవడం. ఏదో ఉన్నతవ్యక్తిలాగనో, సంస్కరణవాదిలాగనో, మురికివాడలను సందర్శించే సున్నితమనస్కుడైన “ప్రగతిశీల” వ్యక్తిగానో కాదు” అని ఆయన రాసిన మాటలు గుర్తుంచుకోదగ్గవి.
ఈ దృక్పథంతోనే ఆయన శాంతి ఉద్యమంలో పనిచేశారు. యన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీని భారత – సోవియట్ మైత్రికి అంకితం చేశారు. చైనా ప్రభుత్వానికి ప్రణాళికా రచనలో సలహాదారుగా పనిచేశారు. భారత ప్రభుత్వం కొత్తొక వింత అన్నట్టుగా ప్రమాదకరమైన అణుశక్తి వైపు చూస్తున్నదనీ, నిజానికి భారత దేశం సౌరశక్తి అభివృద్ధి మీద శ్రద్ధ పెట్టాలనీ అన్నారు.
“…యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ ని మళ్లీ చదవడం ఒక గొప్ప అనుభవమని రుజువవుతుంది. అది అపారమైన ప్రతిభతో మాత్రమే కాదు, హేతువాదపు బలోపేతమైన నిర్ధారణతో ముఖాముఖీ కూడ…. ఆ అధ్యయనంలో పాథకులు కోసంబిలోని మరొక మౌలికమైన అంశాన్ని కూడ గుర్తించగలరు. అది నిజమైన మార్క్సిస్టు చరిత్ర అధ్యయనం ప్రయత్నాలన్నిటికీ ఉమ్మడి అంశం. అదేమంటే గతాన్ని వర్తమానంతోనూ, (భవిష్యత్తు తోనూ) కూడ అనుసంధానించడం. అణచివేతకూ దోపిడీకీ గురవుతున్నవారి విముక్తి సాధించాలనే మౌలిక నిబద్ధత” అని ఇర్ఫాన్ హబీబ్ అన్నారు.
సరిగ్గా అరవై సంవత్సరాల కింద 1954లో, న్యూయార్క్ నుంచి వెలువడే మాసపత్రిక ‘మంత్లీ రివ్యూ’ లో ‘ఆన్ ది క్లాస్ స్ట్రక్చర్ ఇన్ ఇండియా’ అనే వ్యాసంలో “భారత దేశానికి పరిష్కారం సోషలిజమే. అది మాత్రమే పెరుగుతున్న సరఫరాకు తగిన గిరాకీని సృష్టించగలదు. అటువంటి పరిష్కారాన్ని ఉపయోగించుకోగలిగినది అభివృద్ధి చెందిన దేశాలు మాత్రమే కాదనీ, వెనుబడిన దేశాలు కూడ ఉపయోగించుకోగలవనీ చైనా చూపుతున్నది. అటువంటిది లేకపోతే ప్రణాళికా విధానం నిష్ప్రయోజకమవుతుంది. అయితే, భారత బూర్జువావర్గం ఉత్పత్తి కోసం ఆధునిక విదేశీ యంత్రాలను దిగుమతి చేసుకున్నట్టే, మిగిలిన పరిష్కారాలన్నీ విఫలమైనప్పుడు, రాజకీయాలలో తాజా పెట్టుబడిదారీ పరిణామాలను కూడ దిగుమతి చేసుకుంటుంది. అంటే సోషలిజానికి దీర్ఘకాలికంగా ఏకైక ప్రత్యామ్నాయమైన ఫాసిజాన్ని దిగుమతి చేసుకోవడం అని అర్థం. ఇప్పటికే ‘ఉక్కు మనిషి’ కావాలి అనే మాట అభిజ్ఞవర్గాలలో వినబడుతున్నది. అందుకు నమూనాలు కూడ అందుబాటులో ఉన్నాయి” అని డి డి కోసంబి రాశారు.
ఆ మాటలకు ప్రాధాన్యత పెరిగిన రోజుల్లో ఈ తెలుగు అనువాదం వెలుగు చూస్తున్నందుకు సంతోషంగా ఉంది.
**
డి డి కోసంబి రచనలతో నా పరిచయం 1978 మొదట్లో జరిగిందని గుర్తు. ‘సంస్కృత సాహిత్యం – వర్గ పరిణామాల ప్రతిబింబం’ అనే కోసంబి వ్యాసాన్ని సృజన మార్చ్ 1978 సంచికలో అచ్చువేశాం. ఆ వ్యాసానికి రచయితగా కోసంబి పేరు ఉంది గాని అది కోసంబి రాసిన వ్యాసానికి పరిచయ వ్యాసమే. పరిచయకర్త పేరు అచ్చు కాలేదు గాని బహుశా అంతకుముందు ఎమర్జెన్సీ సమయంలో జైలులో నడిపిన లిఖిత పత్రికలలో కె వి రమణారెడ్డి రాసిన వ్యాసం అనుకుంటాను. ఆ వ్యాసం చదివిన నాటి నుంచీ కోసంబి గురించి వింటూ ఆయన రాసిన పుస్తకాలు సంపాదించాలని ప్రయత్నిస్తూ ఉండగా మూడు నాలుగేళ్ల తర్వాత బెజవాడలో ఈ పుస్తకం నాచేతికి దొరికింది. ఏలూరు రోడ్డులో నవోదయ బుక్ హౌజ్ లో ముందు రెండు పెద్ద గదుల్లో పుస్తకాలు కాక రామమోహనరావు గారు కూచునే వెనుక గదిలో చరిత్ర, అర్థశాస్త్రం పుస్తకాల బీరువా ఉండేది. అక్కడ ఈ యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకం మొదటిసారి చూశాను. ఇప్పటికి ఎన్నోసార్లు చదివి తోలులా మారిపోయిన ఆ పుస్తకం మీద సంతకాన్ని బట్టి దాన్ని 1982 ఏప్రిల్ 17న కొన్నాను. అప్పుడది ఇరవై ఎనిమిది రూపాయల పుస్తకం. ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ పుస్తకం నా కాపీ 1984 ఏప్రిల్ 19న మద్రాస్ మూర్ మార్కెట్ లో కొన్నానని సంతకం ఉంది. అలాగే మిగిలిన పుస్తకాలన్నీ సంపాదించి చదవడం, కోసంబికి అభిమానిగా మారడం జరిగాయి. కోసంబి ఆలోచనల్లో, సూత్రీకరణల్లో కొన్ని మారవలసిన అవసరం ఉన్నదని తెలిసినా ఆయన తీసుకున్న మౌలిక దృక్పథం వల్ల, విస్తారమైన పరిజ్ఞానాన్ని అలవోకగా అందించే ఆయన పద్ధతి వల్ల ఆ అభిమానం తగ్గలేదు. ఇరవై సంవత్సరాల కింద ఒక ఔత్సాహిక ప్రచురణకర్త ఈ పుస్తకాన్ని అనువదించమని అడిగితే వెంటనే అంగీకరించాను, కారణాంతరాలవల్ల ఆ ప్రచురణ ప్రతిపాదనే వెనక్కిపోయి, ఇప్పుడిది మాత్రం వెలుగు చూస్తోంది.
కోసంబి రచనల ప్రభావం తెలుగు మేధోప్రపంచం మీద గత ఆరు దశాబ్దాలుగా విస్తృతంగానే ఉన్నప్పటికీ, ఆయన రచనలలో ప్రధానమైన ఈ పుస్తకం ఇంతవరకూ తెలుగులోకి రాకపోవడం ఆశ్చర్యం కలిగిస్తుంది. మొత్తంగా కొశాంబి భారత చరిత్ర రచనలో ప్రవేశపెట్టిన కొత్తచూపును పరిచయం చేస్తూ కె. బాలగోపాల్ ‘భారత చరిత్ర – డి డి కోసంబి పరిచయం’ (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986) అనే స్వతంత్ర గ్రంథం రాశారు. దానికన్నముందే కోసంబి రచనలలో ‘భగవద్గీత – చారిత్రక పరిణామం’ ఒక్క వ్యాసమే ఒక పుస్తకంగా (హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1985) వెలువడింది. ఆ తర్వాత కోసంబి వ్యాసాల సంపుటాలు రెండు – ‘భారత చరిత్ర – పరిచయ వ్యాసాలు’ (అనువాదం: హెచ్చార్కె, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ ప్రచురణ, 1986); ‘ఆచరణలో గతితర్కం’ (ఎగ్జాస్పరేటింగ్ ఎస్సేస్ కు గొర్రెపాటి మాధవరావు అనువాదం, జంపాల చంద్రశేఖర ప్రసాద్ మెమోరియల్ ట్రస్ట్ ప్రచురణ, 1991) వెలువడ్డాయి. తర్వాత ‘ప్రాచీన భారతదేశ సంస్కృతి, నాగరికత’ (కల్చర్ అండ్ సివిలైజేషన్ ఇన్ ఏన్షియెంట్ ఇండియాకు ఆర్ వెంకటేశ్వర రావు అనువాదం, తెలుగు అకాడమి ప్రచురణ, 1998) కూడ తెలుగులోకి వచ్చింది. ఈ మధ్యలో కోసంబి శతజయంతి కూడ రావడంతో ఇంగ్లిషులో ఆయన గురించీ, ఆయన కృషి గురించీ ఎన్నో పుస్తకాలు, వ్యాసాలు వెలువడ్డాయి.
నిజానికి ఇతర పుస్తకాల కన్న, వ్యాసాల కన్న యాన్ ఇంట్రడక్షన్ టు ది స్టడీ ఆఫ్ ఇండియన్ హిస్టరీ పుస్తకంలోనే కోసంబి ఆలోచనలు లోతుగా, విస్తృతంగా పరిచయం అవుతాయి. ఈ పుస్తకం దాదాపు మూడువేల సంవత్సరాల భారత చరిత్ర మీద స్థూల అవగాహన ఇవ్వడం మాత్రమే కాదు, ఎన్నెన్నో కొత్త ఆలోచనలను ప్రేరేపిస్తుంది గనుక ఇది ఎప్పుడో తెలుగులోకి రావలసి ఉండింది. ఎందువల్లనో గతంలో జరిగిన ప్రయత్నాలు ఫలించక, చివరికి ఇది నాకోసం మిగిలిపోయింది.
దాదాపు ముప్పై సంవత్సరాలకింద రాస్తూనే కోసంబి గురించి ఇప్పుడెందుకు అనే ప్రశ్న వస్తుందని బాలగోపాల్ అనుమానించారు. నిజంగానే ఈ ఆరు దశాబ్దాలలో కోసంబి ఆలోచనలను సమర్థించే, బలపరిచే అధ్యయనాలు, పరిశోధనలు ఎన్ని జరిగాయో, ఆయన ఆలోచనల్లో కొన్నిటిని విమర్శించే, ప్రత్యామ్నాయ ప్రతిపాదనలు చేసే, పూర్వపక్షం చేసే అధ్యయనాలు అన్ని జరిగాయి.
ఈ పుస్తక అనువాదంలో నేను ఎదుర్కొన్న ఇబ్బందులు, సమస్యలు, అవరోధాలు, నేను ప్రయత్నించిన పరిష్కారాలు పాఠకులకు తెలియజేయడం నా బాధ్యత. కోసంబి రచనాశైలిలో అనువాదానికి లొంగని, అనువాదంలో ఇబ్బందికరంగా కనబడే అంశాలు కొన్ని ఉన్నాయి. ఈ పుస్తక రచనలో ఆయన అధ్యాయాల విభజన, ప్రతి అధ్యాయంలోనూ ఉప అధ్యాయాల విభజన సరిగానే చేశారు గాని పేరాగ్రాఫుల విభజన అంత సరిగా చేయలేదు. ఒక ఆలోచన, ఒక వాదన ఒక పేరాగ్రాఫులో ఉండాలనే సాధారణ ఆనవాయితీకి భిన్నంగా ఆయన ఒకే పేరాలో అనేక ఆలోచనలు, వాదనలు గుదిగుచ్చారు. అందువల్ల ఒక ఆలోచన ముగించే వాక్యం తర్వాత అదే పేరాగ్రాఫులో మరొక ఆలోచన సాగుతుంది. ఒక్కోసారి ఆ ఒక్క వాక్యమే ఒక ఆలోచన కూడ కావచ్చు. ఒక్కోసారి హఠాత్తుగా ఒక ఆలోచన ఆగిపోయి ఏదో సుదూరమైన అంశంలోకి వెళ్లడం కూడ జరుగుతుంది. రచయితకు ఉండిన విస్తారమైన భాషా పరిజ్ఞానం, విభిన్న దేశాల, చరిత్రల పరిచయం వల్ల హఠాత్తుగా ఎక్కడో సుదూరపు ఉదాహరణ, పోలిక కూడ ప్రవేశిస్తాయి. లోతుగా, మననం చేసుకుంటూ, రచయితతో పాటు ఆలోచిస్తూ చదవని పాఠకులను ఈ పద్ధతి ఇబ్బంది పెడుతుంది. ఆ సంగతి పూర్తిగా తెలిసినా నేను ఆయన రచనా శైలిని మార్చే, పేరాగ్రాఫులను మార్చే సాహసం చేయలేదు. ఇటువంటి సైద్ధాంతిక రచనలో అనువాదకులు వీలైనంత తక్కువ చేయి చేసుకోవాలనే ధోరణి నాది.
గతంలో కోసంబి గురించి తెలుగులో రాసినవారు, రచనలను అనువాదం చేసినవారు కోసంబి వాడిన పైనుంచి భూస్వామ్యం అనే మాటకు సామంత భూస్వామ్యం అనీ, కింది నుంచి భూస్వామ్యం అనే మాటకు గ్రామీణ భూస్వామ్యం అనీ వాడారు. ఆ పదప్రయోగాలు వివరణాత్మకంగా సరిపోయేవే గాని, సంపూర్ణంగా కోసంబి అవగాహనను తెలిపేవి కావని నేననుకున్నాను. అందువల్ల కోసంబి వాడినట్టుగా పైనుంచి భూస్వామ్యం, కింది నుంచి భూస్వామ్యం అనే మాటలే వాడాను. ఒక భాషా పదానికి మరొక భాషలో నిర్దిష్టమైన అర్థం ఇచ్చే పదం ఉండడం ఎంత వాస్తవమో, అనువాదంలో అటువంటి సమానార్థక పదాలను వాడాలనడం ఎంత సరైన అనువాద పద్ధతో తెలిసి కూడ, నేను ఏ పదానికైనా అది వాడిన సందర్భం ఒక అర్థం ఇస్తుందనీ, కనుక ఒక పదానికి ఒక అర్థం అనే సూత్రం ఎల్లవేళలా సరిపోదనీ భావిస్తాను. అందువల్ల పారిభాషిక పదాలు మినహా మిగిలిన పదాలకు భిన్న అర్థాలు వాడిన సందర్భాలు ఉండవచ్చు.
అనువాద పద్ధతికి సంబంధించిన నా ఈ అవగాహనతో పాటు ఈ అనువాదం గురించి చెప్పవలసిన మరొక అంశం కూడ ఉంది. నామవాచకం విశిష్టమైనదనీ, పరభాషా నామవాచకాలను మార్చగూడదనే ఆలోచనా ధోరణి నాది. ఆయా భాషల ఉచ్చారణ ఏమిటో తెలియని రోజుల్లో మనకు తోచినట్టుగా, లేదా ఆ భాషా సంప్రదాయంతో సంబంధం లేకుండా, కేవలం వర్ణక్రమాన్ని బట్టి మన ఇష్టం వచ్చినట్టుగా ఎన్నో నామవాచకాలను తెలుగీకరించి ఉన్నాం. అది తప్పు అని నా అభిప్రాయం. మరీ ముఖ్యంగా సంస్కృత నామవాచకాలను కూడ తెలుగీకరించి చివర డు, ము, వు, లు చేర్చిన సంప్రదాయం మనది. ఇది ఎన్నో దశాబ్దాలుగా జరిగిపోయింది గనుక ఇప్పుడు దాన్ని సవరించడమూ ఎబ్బెట్టుగానే ఉంటుందని యథాతథంగా ఉంచాను.
కోసంబి తాను ఉటంకించిన వనరులన్నిటికీ – అవి పుస్తకాల పేర్లయినా, రచయితల పేర్లయినా – అబ్రివియేషన్స్ (పొడి అక్షరాలు) వాడారు. తెలుగులో అటువంటి పొడి అక్షరాలు పంటికింద రాళ్ల లాగ ఉంటాయి గనుక నేను పూర్తి పేరు, సంక్షిప్తం చేసిన పేరు వాడాను. ఉపయుక్త గ్రంథసూచి ఇంగ్లిషులోనే ఇచ్చాను. అలాగే ఇంగ్లిషులో ఒక్క పేజీ నుంచి ఉటంకిస్తే పి. అనీ, ఒకటి కన్న ఎక్కువ పేజీల నుంచి ఉటంకిస్తే పిపి. అనీ రాసే సంప్రదాయం ఉంది. తెలుగులో అది లేదు గనుక అన్నిటికీ పే. అనే వాడాను. ఒక ఉటంకింపు తర్వాత మరొక ఉటంకింపు అదే వనరు నుంచి అయితే ఇంగ్లిషులో ఇబిడ్ అనే సంప్రదాయం ఉంది. తెలుగులో పై.ఉ. (పైన ఉదహరించినది), అ.పు. (అదే పుస్తకం) అని వాడుతున్నారు గాని, మరొకసారి పుస్తకం పేరో, రచయిత పేరో రాయడమే మంచిదని నాకనిపించింది. ఇంగ్లిషులో వేరువేరుగా గుర్తించదగిన అనేక రకాల ఖతులు (ఫాంట్లు), ప్రతి ఫాంట్ లోనూ మళ్లీ పెద్ద అక్షరాలు (కాపిటల్స్) ముద్ద (బోల్డ్), ఏటవాలు (ఇటాలిక్) అక్షరాల సంప్రదాయం ఉండగా, తెలుగులో అన్ని రకాల అచ్చు అక్షరాలూ లేవు, వాలిన అక్షరాలు స్పష్టంగా, పోల్చుకునేటట్టుగానూ ఉండవు. అందువల్ల మూలంలో అట్లా ప్రత్యేకంగా చూపిన అంశాలను తెలుగు అనువాదంలో చూపించలేకపోతున్నాం. అలాగే ఇంగ్లిష్ మూలంలో కోసంబి ప్రచురించిన ఫొటోలను కూడ, వాటి నాణ్యత దృష్ట్యా తెలుగులో పునర్ముద్రించడం సాధ్యం కాలేదు. వాటి వివరణలు మాత్రం యథాతథంగా ఉంచాం.
నేషనల్ ట్రాన్స్ లేషన్ మిషన్ మాజీ డైరెక్టర్ ప్రొ. అదితి ముఖర్జీ, ప్రస్తుత డైరెక్టర్ ప్రొ. వి. శరత్ చంద్రన్ నాయర్, అక్కడ తెలుగు విభాగపు బాధ్యుడు డా. ప్రత్తిపాటి మాథ్యూ, హైదరాబాద్ బుక్ ట్రస్ట్ నిర్వాహకురాలు గీతా రామస్వామి, మొదట ఈ అనువాదపు నమూనా పేజీలనూ, ఆ తర్వాత మొత్తం అనువాదాన్నీ పరిశీలించి విలువైన సూచనలు చేసిన అజ్ఞాత పరిశీలకులు, మొత్తం అనువాదాన్ని జాగ్రత్తగా చదివి, ఎన్నో సూచనలు చేసిన మోతుకూరి నరహరి, ఈ అనువాదాన్ని చెపుతుండగా టైప్ చేసిన రాజశేఖర్ చిమ్మన్, కట్టా కవిత, అనువాదానికి మామూలు కన్న ఎక్కువ సమయం పట్టినా ఆ కాలమంతా నా పనులను పంచుకుని, చికాకు భరించిన వై రామచంద్రం, సి వెంకటేశ్, ఎ మల్లేష్ లకు కృతజ్ఞతలు. నా జీవితంలో అవిభాజ్య భాగాలైన వనజ, విభాతలు ఈ కృషిలో కూడ భాగం పంచుకున్నట్టే.
(కోసంబి పుస్తకానికి అనువాదకుడిగా వేణు ముందు మాట ఇది)
– ఎన్ వేణుగోపాల్
బోయవాడి నూకలు
కానీ అవి ఎప్పుడూ మెరుస్తూనే ఉంటాయట!
మిణుక్కు మిణుక్కు…
అదొక ఊహ. భావన. అనుభూతి.
అదే దృశ్యంగా జ్ఞాపకాల్లో ఉండిపోవడం చిత్రమే.
నిజం. చీకటి విశాలాకాశంలో ఆ కాంతి ఒకటి నిశ్చలంగా వెలుగుతూ ఉంటుందని మాత్రం అనుకోం.
అనుకోకుండానే ఒక జ్ఞాపకం – నక్షత్రం ఒక దృశ్యమై ఒక వెలుతురును మిణుక్కు మిణుక్కు మనిపిస్తుంది.
ఈ చిత్రమూ అటువంటిదే.
ఇందులో కనిపించేవన్నీ పిట్టలు. పిచ్చుకలు.
నేల మీది నక్షత్రమండలం.
చిన్న స్థలమే.
అయినా…
ఇవి ఎప్పుడూ వెలుగుతూనే ఉంటై, చీకట్లో.
కానీ, ఉదయం తెలియదు.
ఒకసారి ఇలా చూశాక అవెప్పుడూ మిణుక్కు మిణుక్కు మంటూ ఇలా వెలుగుతూ ఆరుతూ ఉంటై అనుకుంటం. ఇదీ ఒక ఊహే. అధివాస్తవిక జ్ఞప్తి.
అంతే.
అవును.
అవి వెలుగులో వెలగవు.
అసలింతకీ, పిచ్చుకలు..
ప్రతి వ్యక్తి జ్ఞాపకంలో ఒక ఊరు ఉంటే గనుక ఆ ఊర్లో ఇల్లు ఉంటే గనుక ఆ ఇంట్లో దూలాల వద్దా… సూర్ల వద్ద, అక్కడ యాలాడగట్టిన వరి కంకులూ ఉంటే…అక్కడా.వాకిట్లో…కిచకి
వాటి తెలుపు. గోధుమ రంగూ. ఆ కళ్లూ, తోకా…
అంతానూ ఒక చిరు సందడి. మనసులో ఒక సంతోషాన్ని పూయించే పిట్టలవి!
ఆవి ఆడుతూ ఉంటై. పాడుతూ ఉంటై.
మన గుండెల్లో తెలియని శబ్దమై నిశ్శబ్దమై…దృశ్యమై అదృశ్యమయ్యే ఉంటయి.
మనకిప్పుఉ పట్నంలో బాల్కనీలు. అయినా ఒకట్రెండు పిట్టలు.
అయినానూ రాను రానూ అవి తగ్గిపోతున్నాయని ఆందోళన.
ఎండాకాలంలో అయితే వాటికి కాసిన్ని నీళ్లు అందుబాటులో వుంచాలని ఎస్ఎంఎస్ లూనూ…
కానీ, వాటి జ్ఞాపకం ఒకటి వాస్తవంలో ఉండనే ఉంటుంది.
ఎక్కువ పిట్టలు ఉన్న రోజులే జ్ఞాపకాలు.
సిటీ లైట్స్.
అవును. ఇది బతుకు దెరువు పిట్ట.
ఒక మిణుక్కు…మిణుక్కు..
ఒక వ్యక్తి ప్లాస్టిక్ పిచ్చుకల -బ్యాటరీ మెరుపుల – జీవన వాకిలి – ఈ చిత్రం.
అవును.
ఒకానొక చీకటైన సాయంత్రం వెలుతురైన దృశ్యం.
భాగ్యనగరంలోని రాంనగర్ చౌరస్తా చేరకముందే ఒకప్పటి ‘ఉదయం’ పత్రికా కార్యాలయం.
దాని భవనం ముందు ఒక వ్యక్తి నేలమీద ప్లాస్టిక్ పిచ్చుకలను చిచ్చుబుడ్లలా పూయిస్తున్నాడు.
ముందు అవి కనిపించలేదు.
‘ఆన్’ …”ఆఫ్’… అవుతూ… వెలిగి ఆరిపోతూ… వెలుతురు.
అవి మిణుగురులు..కాంతి పుంజాలు. ఎరుపు, ఆకుపచ్చ,.నీలం కాంతులు.
గుప్పిట ముడిచీ తెరిచినట్టు… అవి వెలుగూ… ఆరూ.
అలా-ఇలా.. ఆ వెలుతురు పక్షులు కనిపించాయి.
ముందవి పక్షులని అనిపించలేదు. బ్యాటరీ పిట్టలని తట్టనే తట్టలేదు.
బ్యాటరీతో నడిచే వెలుతురు వర్ణ రాగాలుగా తెలియరాలేదు.
దగ్గరకు వెళ్లి ఆగిచూస్తే కుతూహలం.
పిట్టను చూస్తే మనసు పొందే రెక్కల ఆనందం.
ఎగిరే కుతూహలం.
చిత్రమేమిటంటే ఒక యాభై అరవై పిచ్చుకలు.
కానీ, మరీ చిత్రమేమిటంటే అందులో అన్నీ కానరావు లేదా కొన్ని కానరావు.
ఒకసారి దృశ్యంలో కొన్ని మాయం. మరోసారి దృశ్యంలో మరికొన్ని మాయం.
కానీ, అక్కడ ఉంటై. కానరావు. కానవచ్చిన వాటి పక్కనా పైనా ఖాళీలుంటాయి.
అక్కడా వుండొచ్చు పిచ్చుక.
అదే దృశ్యాదృశ్యం.
+++
చిత్రం చేయడం ప్రారంభిస్తే ఒకటి వెలుగుతూ ఉంటే ఒకటి ఆరుతూ ఉందా అనిపించింది..
మరొకటి వెలుగుతూ ఉంటే ఇంకొకటి ఆగిపోతూ ఉందా అన్నడౌటూ వచ్చింది.
ఒక్క మాటలో దృశ్యం వెలుతురు. అదృశ్యం చీకటి.
లేదా అదృశ్యం చీకటి. దృశ్యం వెలుతురు అన్న భావనా పుట్టింది.
కానీ, వాస్తవం వేరుగా ఉన్నది.
చూస్తానికి ఎక్కువే కనిపిస్తున్నాయి.
వెలుగులో ఉన్నవే ఎక్కువ. కొన్ని మాత్రం కనిపించవు.
కానీ అక్కడ అన్నీ ఉన్నయి. అదే చిత్రం.
ఉన్నవన్నీ దృశ్యం కాదు, లేనివి అదృశ్యమూ కాదు.
అదే దృశ్యాదృశ్యం.
+++
అన్నిటికన్నా విచిత్రం – ఆ పిచ్చుకలతోపాటు ఆ బోయవాడు…లేదా ఆ చిరువ్యాపారి లేదా ఆ కథకుడు ఇరవై రూపాయలకు ఒక జత చొప్పున ఆ పిచ్చుకలను రచనల వలే అమ్ముతున్నాడు.
అమ్మేవాడికి అన్నీ వెలుగే. కొనే వాడికి మాత్రం నచ్చిందే వెలుగు.
ఒకరికి ఆకుపచ్చ నచ్చి మరొకరి నీలం నచ్చి ఇంకొకరికి ఎరుపు నచ్చి కాంతులు మారుతున్నయి. చూస్తుండగానే కొన్నివెలుతుర్లు ఖాళీ అవుతున్నయి.
ఇంతలో ‘కీ’ ఇవ్వనివి కొన్ని ఉన్నయి. అక్కడే ఉన్నయి.
అవి కనిపించడం దృశ్యాదృశ్యమే.
అంతేకాదు, ఒక సంచీ ఉంది.
అందులోంచి అతడు తీసి పెట్టాక మరికొన్ని వెలుగుతూ ఉన్నాయి.
మరి అంతదాకా ఆవి లేవా అంటే ఆ కాంతి దానిలో లేదనాలి. అంతే!
నిజమే. ఒక దృశ్యం దగ్గర ఆగినప్పుడు అదృశ్యాలు దృశ్యమైతాయి.
అదే ప్రేక్షణ. దృశ్యం అర్థమౌతూ ఉండటం.
మన పనిలో మనం ఉండగానే కొన్ని దృశ్యాలు ఇక కంటికి అంటుకొని మదిలో వెలుగుతూ ఉంటై.
అదే ప్రేక్షణ. జ్ఞాపకం వచ్చినప్పుడు ఈ పిట్టలు వెలుగుతూ ఉంటై, నక్షత్రాల్లా.
కానీ, ఇవన్నీ పట్నం పిచ్చుకలు.
బ్యాటరీ పిచ్చుకలు . ‘కీ’ ఉండే పిచ్చుకలు..
అతడు కనిపించేలా చిత్రంచలేకపోవడం ఈ చిత్రం.+++
ఉప్పల్ లో ఉంటాడట.
ఒకచోటే ఇలా పెట్టుకుని కూచోడట. ఎక్కడ వీలైతే అక్కడ ఆ పక్షులను పరుచుకుంటాడట. స్థలం కన్నా జనసమ్మర్థం ముఖ్యమట. కొంచెం జాగా ఉంటే చాలు, చీకటి అయితేనే వెలిగిస్తాడట. అవును మరి. చీకటే అతడికి కావాలి. వెలుగుతో అవి అమ్మాలి.
అదే దృశ్యాదృశ్యం అతడికి.
అవి వెలుగుతూ ఉంటే ఆగి వచ్చి కొనుక్కునే మనుషులతో అతడి ముఖం వెలుగుతూ ఉంటే చూడాలి.
పిచ్చుకలా ఉన్నాడని పిచ్చిగా అనిపించింది. ఇంత చిన్నసంతోషాలా? ఆ పిచ్చుకకు అనీ అనిపించింది!:
ఎవరూ కొనకపోతే మాడ్పు ముఖం- అంటే చీకటి. అది బాధిస్తుంది మరి!
అందుకే అల్ప సంతోషంలా పిచ్చుకలూ, ఈ మిణుక్కు మిణుక్కులూ.
+++
నచ్చిందేమిటంటే, పంచతంత్ర కథల్లో మిత్రలాభం..
అనగనగా బోయవాడి నూకలకు ఆశపడ్డ పక్షుల కథ.
ఆ పక్షులన్నీ తెలివిగా వలతో సహా లేచిపోవడమూ ఆ కథ.
ఇప్పుడు ఆ వల ఏదో పక్షులతో సహా వచ్చి వాలినట్టయింది నాకు.
అది దృశ్యం.
కానీ బోయవాడు నగరంలో విసిరిన ఒక వల.
అది అదృశ్యం.
మొత్తానికి, భాగ్యనగరంలో. రాం నగర్లో.
ఒక చిరువ్యాపారి కూటికోసం, తన కుటుంబం కోసం పక్షి ఎర.
పిచ్చుక ఒక అస్త్రం.
ఆ నూకలను ఒకటి కాదు, పది చిత్రాలు చేశాను. ఎలా తీయాలో తెలియడం లేదు.
చూస్తుంటే అవి నేల మీది నక్షత్రాల్లా కనిపిస్తున్నాయి.
మిణుక్కు మిణుక్కు.
బాగుంది.
– కందుకూరి రమేష్ బాబు
గదులు ఖాళీగా లేవు!
ప్రపంచంలో అత్యంగా భయంకరమైంది, అత్యంత క్రూరమైంది పేదరికం లేక దారిద్ర్యం.
దారిద్ర్యం మనిషిని నిలువునా క్రుంగదీస్తుంది.
దారిద్ర్యం మనిషిని అసమర్ధుడిగా చేస్తుంది. ఆత్మ విశ్వాసాన్ని లేకుండా చేస్తుంది.
దరిద్రుడికి ఆకలి, అనారోగ్యం, అవసరాలు తప్ప స్నేహితులు, బంధువులు ఎవరూ ఉండరు.
దరిద్రుడ్ని చూస్తే అంతా తప్పుకు తిరుగుతారు.
మాటలు, చూపులు, బాడీ లాంగ్వేజ్ ను బట్టి దరిద్రుడ్ని సులభంగానే గుర్తించవచ్చు.
ఎంతటి ప్రతిభ వున్నా దరిద్రుడు ప్రకాశించలేడు.
ప్రతిభ వున్న దరిద్రుడు మబ్బుపట్టిన సూర్యుడిలా అణగిపోవాల్సిందే. – ఇవన్నీ నూకరాజుకు తెలుసు. అతని బాల్యం, బాల్యంలో జరిగిన సంఘటనలు, పోటీల్లో చూపిన ప్రతిభ ఇవేవి అతనికి గుర్తింపు తెచ్చి పెట్టలేకపోయాయి. నూకరాజు పుట్టింది పూరి గుడిసెలలోనే. కానీ అతడికి పెంకుటింటివాళ్ళు, భవనాల మనుషులతో పరిచయాలు, స్నేహాలు వున్నాయి. చదువు సగంలో ఆగినా ఈ యేడో, వచ్చే యేడో మెట్రిక్ పరీక్షకు కూచోపోతున్నాడు. అతడికొక ఫాక్టరీలో, చిన్నదే అయినా మంచి ఉద్యోగం వుంది. దేశమాత పేరు చెబితే అతడికి ఒళ్ళు పులకరించేది. అంతలో పాకిస్థాన్ దాడి వచ్చింది. హోమ్ గార్డుల్లో చేరాక దేశభక్తి పట్ల అతని అభిప్రాయాలు మారతాయి. అన్ని ఖర్చులు మానుకుని ట్యుటోరియల్ కాలేజీలో చదవాలని కోరిక. వీటన్నింటిని మించిన కోరిక ఒకటే. కొత్తగా పెళ్ళి చేసుకున్న భార్యతో ఏకాంతంగా ఒక విశాలమైన గదిలో గడపాలని. కుటుంబసభ్యులతో కిక్కిరిసి వున్న ఇరుకు గుడిసె లోనుండి దూరంగా, అంటే ఏదో ఒక లాడ్జిలో – ఖరీదైనది కాకపోయినా, పరిశుభ్రంగా వుండే ఒక లాడ్జిలో, భార్యతో సుఖంగా గడపాలనే కోరిక తొలిచివేస్తుంటుంది. తన అవసరాలన్నీ చంపుకుని డబ్బు కూడబెట్టుకుని భార్యకు నచ్చచెప్పి పెద్దలను అంగీకరింపచేసి దూరంగా వున్న లాడ్జి హౌస్ కు వస్తాడు. కానీ లాడ్జి గుమాస్తా నూకరాజు వాలకం చూసి లాడ్జి ఇవ్వడం ఇష్టం లేక ‘నో రూమ్’ అని వెళ్ళగొడతాడు.
ఆ హాస్టల్ గుమాస్తా సహాయకుడిగా పని చేస్తున్న దేవుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడతాడు. ఒకప్పుడు దేవుడు కూడా నూకరాజు లాంటి పరిస్థితినే ఎదుర్కొని వుంటాడు. పెద్ద కుటుంబంతో, ఇరుకు గుడిసెలో వుండే దేవుడికి తన అసహాయత, తన ఉక్రోశం, తన చేతకానితనాన్ని అంతా భార్యను గొడ్డును బాదినట్లు బాదడంలో చూపించేవాడు. దాంతో కుదురుకున్న నలభైయవ ఏట అతని భార్య కోరుకున్న తీరిక కూడా అదే. వాళ్ళిద్దరే ఎవరికంటాబడకుండా సుఖంగా, ఏకాంతంగా గడపాలని. కానీ ఆమె కోరిక తీరకుండానే కన్నుమూస్తుంది. అంత నిర్లిప్తంగా బతుకీడుస్తున్న దేవుడు – నూకరాజు జంటలో తనను తాను చూసుకోగలుగుతాడు. వారి మీద జాలి పడతాడు.
లాడ్జి నుండి అవమానభారంతో వచ్చిన నూకరాజుకు, సినిమాకు వెళ్దామన్నా టిక్కెట్లు దొరకవు. మంచి హోటల్ కు పోలేక కుళ్ళు కాలువ పక్కన వున్న టీ షాపులో ఫలహారం తీసుకుని భార్యతో బయటికి వస్తాడు. తను అనుకున్నది ఏదీ జరగలేదు. అన్నీ అడ్డంకులే. దాంతో ఎక్కడ లేని కోపం ముసురుకుంటుంది. ఏదో కసి, ఎవరిమీదో ఆవేశం, ఎవరినైనా చితకదన్ని తన కసిని తీర్చుకోవాలనే ఆవేశం ముంచెత్తుకొస్తుంటుంది. అలాంటి సమయంలో లాడ్జింగ్ నుండి వస్తున్న దేవుడు వాళ్ళను గుర్తుపట్టి ఆపుతాడు. నూకరాజు కోపంతో ఉన్నట్లు గమనించి అతని భార్యతో మాటలు కలపడానికి ప్రయత్నిస్తాడు. పరాకుగా ఒకదానికి బదులు ఇంకోటి మాట్లాడడంతో – నూకరాజు ఆగ్రహాన్ని, అవమానాన్ని తిరిగి రెచ్చగొట్టినట్లుగా గ్రహించలేకపోతాడు. దాని ఫలితం, నూకరాజు ఆ ముసలి దేవుడ్ని చితకబాదేస్తాడు. జనం అడ్డుకోవడంతో దేవుడు బతికిపోతాడు. భార్య సముదాయించి నూకరాజును రిక్షాలో తీసుకొనివెళుతుంది. ఏడుపును అణచుకొంటూ దెబ్బలతో దేవుడు లాడ్జింగుకు బయలుదేరుతాడు.
తనకు ప్రతికూలంగా పరిణమించిన పరిణామాలు పట్ల ఉక్రోశం, ఆవేశం, కసి కలగలిసిపోయి – తనను అవమానించిన గుమస్తాను, లాడ్జి ఓనరును చితకబాదాలనే కోపం, చివరికి అన్నెం పున్నెం ఎరగని దేవుడి మీద చూపించాల్సి వస్తుంది. తన నిస్సహాయతను, ఇంకో నిస్సహాయుని మీద తీర్చుకుంటాడు. గతంలో దేవుడు చేసిన పని మీద కూడా ఇదే. తన ఆవేశాలను, ఉద్వేగాలను భార్య మీద చూపించేవాడు. బయట తాము పడ్డ కష్టాలను, అవమానాలను తమ భార్యల మీద తీర్చుకోవడం గుడిసెవాసులకు మామూలే. ఇలా బాధలు పడింది దేవుడి పెళ్ళామే కాదు. అతని కూతురు పెద్దమ్మ అత్తారింట బాధలు పడలేక ఎందులోనో పడి చచ్చిపోతుంది.
లాడ్జిలో గదికోసం భార్యతో వచ్చిన నూకరాజు మంచిగా టక్ చేసుకొని బూట్లు వేసుకొని నీటుగానే వస్తాడు. “వేషం, గీషం అన్నీ బాగానే వున్నాయి కానీ బాగాలేంది కూడా ఏదో ఒకటి ఉండుంటుంది. రెండు కళ్ళలో ఒకటి గుడ్డిదైనా గుమస్తాగాడు సూడగానే దాన్ని పట్టేసినాడు.” అని దేవుడు సరిగానే ఊహిస్తాడు. ఇందులో గుమాస్తా తప్పేమీ లేదు. వాడు లాడ్జిని అలగా జనం నుండి దూరంగా, డబ్బున్న వాళ్ళ కోసం డబ్బులు వెదజల్లేవారికోసమే నడుపుతుంటాడు. చిల్లర జనాలు, చీప్ మనుషులు కనిపిస్తే డబ్బున్నవాడెవడూ ఆ లాడ్జికి రాడు. తన హోదాకు సరిపడే మరో లాడ్జికి వెళ్ళిపోతాడు. వాడు ఏ ముండను తెచ్చుకుని కులికినా వారికి అభ్యంతరం ఉండదు. రెంట్ కడతాడు. టిప్పులు వెదజల్లుతాడు. ఖరీదైన మనుషులు ఉంటారని తెలిసిన లాడ్జీల జోలికి పోలీసులు కూడా రారు. అందుకే ఈ లాడ్జీలన్ని అలాగా జనాన్ని దూరంగా వుంచడానికే ప్రయత్నిస్తాయి. ఈ విషయాన్ని ఆ లాడ్జిని కడుతున్నప్పుడే మేస్త్రి ఆడకూలితో “ఈ మేడే వుంది. రేపొద్దున ఇందలో లాడ్జింగ్ యెడతారట. అందరిచ్చిందాని కంటే అర్ధో, రూపాయో ఎక్కువిస్తాను; నన్నోరాత్తిరి కిందల తొంగోనియ్ అను. నా నిలువెత్తు ధనం ఇచ్చినా నువ్వు కూల్దాని గున్నంత కాలం ఇందల అడుగెట్టనియ్యరు” అని చెప్పడం గమనించ తగ్గ విషయం.
మొత్తానికి ఈ కధ – కొత్తగా పెళ్ళైయిన భార్యతో ఏకాంతంగా సుఖంగా, ఒక రోజైనా గడపాలనే కోరికతో, లాడ్జీకి వచ్చి భంగపడిన, నూకరాజు అనే యువకుడి కధ. ఇలాంటి కోరికలే వున్నా, అన్ని అణచేసుకొని నిర్లిప్తంగా బతికేస్తున్న ముసలి దేవుడు కూడా ఇందులో కనిపిస్తాడు. ప్రయత్నించి విఫలం అవుతాడు నూకరాజు. తన అశక్తతను గమనించి మిన్నకుండి పోతాడు దేవుడు. అందుకే నూకరాజు ప్రయత్నాన్ని మెచ్చుకొంటాడు. తన తరం కంటే తన తర్వాత తరం వారు అంటే ఇప్పటి వాళ్ళలో వున్న చొరవ, ధైర్యంను గమనించి సెబాసో అనుకుంటాడు.
ఎన్ని ప్రభుత్వాలు మారినా, ఎన్ని పంచవర్ష ప్రణాళికలు వచ్చినా పేదవాడికి కూడు, గుడ్డ, వసతిని సమకూర్చలేకపోతున్నాయి. ధనవంతుడు రోజు రోజుకు మరింత ధనవంతుడు అవుతున్నాడు. పేదవాళ్ళు మరింత పేదగా తయారవుతున్నారు. ఎలాంటి కష్టమెరుగనివాడికి అప్పనంగా వందలకొద్ది ఎకరాల భూమి దఖలు పడుతుంది. కష్టజీవులకు, నిరుపేదలకు జానెడు భూమి దొరకదు. ఇక్కడ ఈ కధలో రచయిత భూమి లేని నిరుపేదల గురించి చెప్పదలుచుకొన్నారు. కనీసావసరాలు కూడా తీర్చలేని నిర్భాగ్యుల గురించి చెప్పదలుచుకొన్నారు. అందులో భాగంగానే లాడ్జి హౌస్ నిర్మాణం గురించి చెబుతాడు. కూలీలు – మేస్త్రీ – కాంట్రాక్టరు కలిసి లాడ్జి కడితే కాంట్రాక్టరు లాభపడతాడని తేల్చారు. మనం కట్టిన ఈ లాడ్జిలో మనకే ప్రవేశముండదు అంటారు. ఇదంతా మాండలికంలో, వర్ణనలో చెప్పడం బాగుంది.
ఈ కధలో కొత్త జంటకు కావాల్సింది ఏకాంతం. కుటుంబసభ్యులతో కిక్కిరిసిపోయిన ఆ ఒంటి గది గుడిసెలో ఆ కొత్త దంపతుల ఆరాటాన్ని ఎవరు అర్ధం చేసుకొంటారు? అందుకే వాళ్ళు లాడ్జి వైపు చూశారని అనుకోవాలి. ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబసభ్యులే కూడబలుక్కుని వాళ్ళకు ఏకాంతం కల్పిస్తారు. లేదా ఆ దంపతులే ఏదో ఒక రకంగా ఆ గుడిసెలో ఏకాంతం వెతుక్కోవడానికి ప్రయత్నిస్తారు. అంతే తప్ప లాడ్జింగుల వైపుకు వెళ్ళే ఖరీదైన ఆలోచనలు చేయరు. ఈ కధ చదువుతుంటే రాజశ్రీ వారు తీసిన “పియా కా ఖర్” సినిమా గుర్తుకు వస్తుంది. బాంబేలో పిచ్చుక గూళ్ళు లాంటి ఇళ్ళలో కాపురాలు చేసే వారున్నారు. అందులో కూడా కిక్కిరిసిన కుటుంబ సభ్యుల మధ్య తమ ఆశలు, ఆరాటాలు తీర్చుకోవడానికి కొత్త దంపతులు లాడ్జికి వెళతారు. అక్కడ పోలీసులు రెయిడ్ చేసి వాళ్ళను వ్యభిచార నేరం క్రింద పట్టుకొంటారు. తల్లిదండ్రులు వెళ్ళి వాళ్ళు దంపతులని చెప్పి తీసుకువస్తారు. చివరకు కుటుంబ సభ్యులంతా కలిసి వాళ్ళకు ఏకాంతం కల్పించడంతో సినిమా సుఖాంతం అవుతుంది. ఈ సినిమాలో చూపించే దంపతులు మధ్య తరగతికి చెందిన వాళ్ళు. చదువుకున్న వాళ్ళు. కాబట్టి వాళ్ళ వేషభాషలను చూసి లాడ్జిలోకి అనుమతిస్తారు. నూకరాజు దంపతులను చూసి అలగాజనుల వ్యవహారమని తలచి గుమాస్తా వెళ్లగొడతాడు.
ఈ కధ వచ్చిన కొత్తల్లో చదివినప్పుడు నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. ఇందులో వున్న సమస్యలకు లాడ్జీలను పరిష్కారంగా చూపడం నవ్వు తెప్పించింది. అక్కడి గుడిసె వాసులకు వున్న లాడ్జీల పరిజ్ఞానం మాలాంటి తెలంగాణా వాళ్ళకు లేకపోవడం ఒక కారణం కావచ్చును. లేదా మా దగ్గర లాడ్జీల సంస్కృతి లేకపోవడం వల్ల మేము సరిగా అర్ధం చేసుకోలేక పోయాం అనైనా అనుకోవాలి. నిజానికి ఆ పరిస్థితుల్లో ఆ జంట ఎలా ఆలోచిస్తుందనే విషయాన్ని కూడా రచయిత సరిగా పట్టుకోలేక పోయారు. గుడిసెవాళ్ళు లేదా కష్టజీవులు లాడ్జిలకంటూ బోలెడు డబ్బు పోసే బదులు, ఆ డబ్బుతో తన భార్యకు ఇష్టమైనవి తీసుకు వచ్చి ఆమె ప్రేమను చూరగొనాలనుకొంటాడు. ముఖ్యంగా స్త్రీలు అంత డబ్బును దుబారా చేయడానికి ఇష్టపడక, తమకు లేని వస్తువులను సమకూర్చుకోవాలని ఆశిస్తారు.
ఇంకా తెలివైన వాళ్ళయితే ఆ డబ్బుతో కుటుంబసభ్యులను తీర్ధయాత్రలకు తరిమేసి ఏకాంతాన్ని పొందగలుగుతారు. లేదా కొత్త దంపతుల తీర్ధయాత్రలు, పుణ్యక్షేత్రాల సందర్శన వాళ్ళకు ఏదో విధంగా హనిమూన్ కొరతను తీర్చగలుగుతాయి. ఇలా ఇరుకు ఇళ్ళలో గడిపేవారికి ఎప్పటికైనా స్వంత ఇల్లు కట్టుకోవాలనే కోరిక కలుగుతుంది. మరింత డబ్బు సంపాదించే మార్గాలు కనుక్కుంటే మరింత విశాలమైన ఇంటిలోకి మారాలని అనుకుంటారు. ఆదాయం కొద్ది ఇల్లు సమకూరుతుంది. ఒక రోజు వ్యవహారంతో సరిపెట్టాలనుకుంటే తప్ప. ఆ విధంగా కూడా ఈ కధలో నూకరాజు ఆలోచించలేక పోతాడు. కధ చదివిన తరువాత సామాన్య పాఠకుడి ఆలోచనా ధోరణీ ఇలాగే కొనసాగుతుంది. మరి రచయిత ఉద్దేశించింది ఇదేనా? కానే కాదు. స్వాతంత్ర్యం వచ్చి ఇన్నేళ్ళవుతున్నా మనుషులకు జానెడు భూమి దొరకని పరిస్థితిని తెలియచేసారు. కనీస అవసరాలు కాదు గదా, చిన్న చిన్న సరదాలు కూడా తీర్చుకోలేని నిస్సహాయ పరిస్థితిని తెలియజేశారు. పాఠకుడు నూకరాజు పరిస్థితిని చూసి జాలి పడి పడతాడు. కానీ అంతకంటే నికృష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్న వేలాదిమంది మాటేమిటి? హోటల్ లోంచి వస్తున్న నూకరాజు ఒక చోట అరుగు మీద మనుషులు మందల్లా పడుకోవడం, ఇంకొక చోట పేవ్ మెంట్ మీద బారులు తీరి పడుకోవడం గమనిస్తాడు.
“వాళ్ళకు ఇల్లంటూ ఉండదు. ఎలా బతుకుతారో” అనుకున్నాడు నూకరాజు.
“అలానే… కుక్కల్లా”
నూకరాజు తుళ్ళిపడ్డాడు మనసులో.
వేలకు వేలు జనం బతుకుతున్నారు ఆ నగరంలో. చెట్ల కింద సంసారాలు, గట్ల మీద వంటలు, వడ్డనలు. వానొస్తే, వరదోస్తే కనబడ్డ అరుగులు ఎక్కుతారు. కరకర ఎముకలు కొరికే చలిలో, జరజర వర్షంలా కురిసే మంచులో, భగభగ మండి మసి చేసే ఎండలో, నీడంటూ లేని బ్రతుకులు. వెళ్ళు, వెళ్ళండి .. లే లే .. ఇక్కడ కాదు అంటూ కుక్కల్ని తరిమినట్టు తరుముతారు. బురదలో, రొచ్చులో, దీపాల్లేని బ్రతుకులు. దుప్పట్ల ముసుగు. పక్కవాళ్ళ రెప్పల బరువులు తప్ప మరుగుల్లేని చీకటి కాపురాలు.
జాలి కలగడానికి బదులు కోపం వస్తున్నది నూకరాజుకి. ఏదో సినిమాలో, ఎక్కడో ఎవరో జనం రోతకి, అన్యాయానికి, హింసకు విరగబడి తిరగబడ్డం చూసేరు. ఈ జనం మాత్రం ఎన్నాళ్ళయినా ఇంతే.
జనానికి నిజమైన అనుభవాలు అందవు. అందాలనే కోర్కెలు, ఊహలు కలిగినా ప్రమాదమే.
వాళ్ళను ఊహాలలో విహరింపజేయడానికి సినిమాలు బాగా పనికివస్తాయి. తెరమీద చూపిస్తున్నదే మాయ. ఆ మాయను కూడా మాయగా చూపిస్తారు మాయవెధవలు.
పెద్దవాళ్ళు పిల్లల్ని ఉత్తుత్త కబుర్లతో మభ్యపెట్టినట్లు, ప్రజలని ప్రభువులు మాయా వాగ్దానాలతో మోసగిస్తున్నట్లు, కొందరు మాయగాళ్ళు జనంను మాయానుభవాలతో మోసగిస్తున్నారు. జనం మోసపోవడానికి సిద్దంగా ఉన్నారు. అందుకు ముడుపులు కూడా చెల్లిస్తున్నారు. ఆ ముడుపులు బ్లాక్ రేట్లలో చెల్లించడానికి కూడా వారు సిద్దం. మోసగిస్తున్నారంటే వాళ్ళది తప్పు కాదేమో.
కుక్కల్లా పందుల్లా బతుకుతున్న జనాలకు తామెందుకు ఆ పరిస్థితుల్లో బతుకుతున్నారో ఆలోచించలేక అలాగే అడ్జెస్ట్ అయితున్నందుకు కోపం. వాళ్ళను ఆలోచించకుండా కలల స్వర్గంలో విహరింప చేస్తున్న మాయా ప్రపంచం అనే సినిమాల మీద కోపం. ఆ కోపం, ఈ కోపం అంతా కలిసి గట్టు తెగిన వరదలా దేవుడి మీద చూపించాల్సి వస్తుంది.
‘నో రూమ్’ లో ముగ్గురి కధలున్నాయి. లాడ్జి కట్టిన మేస్త్రీకి, దాన్ని మెయింటైన్ చేస్తున్న దేవుడికి, అందులో డబ్బుతోనైనా ఒక్క రాత్రి సుఖాన్ని పొందాలనుకునే నూక రాజుకి అది అందుబాటులో లేదనే విషయం ముగ్గురి కధనాల ద్వారా తెలియచేసారు. ఇందులో మేస్త్రీ దోపిడి స్వభావాన్ని చక్కగా గుర్తించి విశ్లేషిస్తారు. కానీ తన అవసరాల దృష్ట్యా దాంతో అడ్జెస్ట్ అయిపోతారు. ఏమి చేయలేని స్థితిలో దేవుడు నైరాశ్యంలో, నిర్లిప్తంగా బతుకు వెళ్ళదీస్తుంటాడు. నూకరాజులో పొడసూపిన తిరుగుబాటు చైతన్యాన్ని, అతని నిస్సహాయతలోంచి పెల్లుబకడాన్ని చక్కగా చిత్రీకరించారు. మొత్తానికి – స్వాతంత్ర్యానికి పూర్వం దేవుడికి, తర్వాత నూకరాజుకి గూడు కల్పించలేని సమాజం మీద విసురుగా ఈ కధని గుర్తించాలని ప్రముఖ విమర్శకులు ఎ.కె. ప్రభాకర్ అభిప్రాయాలు ఆలోచించదగినవే.
– కె.పి. అశోక్ కుమార్
కె.పి అశోక్ కుమార్ జననం, ప్రాధమిక విద్యాభ్యాసం సికిందరాబాద్ లోని మచ్చబొల్లారంలో జరిగింది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఆర్కియాలజీ, ఆంధ్ర సారస్వత పరిషత్ లో తెలుగు సాహిత్యం, అనంతపూర్ శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీలో గ్రంధాలయ సమాచార శాస్త్రంలో పోస్టు గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు. వీరు హైదారాబాద్ లో గ్రంధపాలకుడిగా పని చేస్తూ ఇటీవలనే పదవీవిరమణ చేశారు. ‘హాలీవుడ్ సినిమాలు’, ‘కధావలోకనం’, ‘తెలుగులో మారుపేరు రచయితలు’ పుస్తకాలు వెలువరించారు. నాలుగు పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. ప్రస్తుతం పాలపిట్ట వర్కింగ్ ఎడిటర్ గా ఉన్నారు.
(వచ్చే వారం ఈ శీర్షికలో చివరి వ్యాసం: వరవరరావు ‘కాళీపట్నం రామారావు కధలు, రాజకీయ అవగాహన’)
“నో రూమ్” కథ ఇక్కడ:
నిర్దిష్టత నుంచి నిర్దిష్టత లోకి . . .హరికిషన్ ప్రయాణం!
సీమ సాహిత్యమే సీమ జీవితం – సీమ వెతలే సీమ కతలు : ఇదొక నానుడిగా చెలామణి అవుతున్న రోజుల్లో కర్నూలు కథని ప్రత్యేకంగా యెత్తి చూపిన రచయిత డా. హరికిషన్. నిర్దిష్టంగా కర్నూలు జీవితాన్నీ కథల్నీ అర్థం చేసుకోడానికి 2005 లో హరికిషన్ సంకలనం చేసిన ‘కర్నూలు కథ’ యెంతగానో తోడ్పడింది. ఆ సంకలనం ద్వారానే గొప్ప తవ్వకం పనిమంతుడుగా హరికిషన్ తో నాకు తొలి పరిచయం. రాయలసీమలో మరీ ముఖ్యంగా కర్నూలు ప్రాంతలో కొత్తగా ‘పరుగులు తీస్తున్న పెట్టుబడుల పదఘట్టనల కిందపడి నలుగుతున్న సామాన్యుడి జీవితాన్ని’ గురించి ఆ సంకలనం ముందుమాటలో ప్రస్తావించిన అంశాలు నన్నెంతగానో ఆలోచింపజేయడమే గాక హరికిషన్ సాహిత్య వ్యక్తిత్వాన్నీ ప్రాపంచిక దృక్పథాన్నీ యెరుకపరిచాయి.
నిజానికి హరికిషన్ కథారచనాప్రస్థానం తొలి అడుగుద్వారానే (పడగ నీడ – 1997) అతను పయనించబోయే తోవా నడక తీరూ అవగతమయ్యాయి. సీమ నేలని పట్టి పీడించే ఫ్యాక్షనిజం బహుముఖ పార్శ్వాల్ని అతను ఆ కథలో ఆవిష్కరించగలిగాడు. పార్టీ రాజకీయాలూ కులాధిపత్యపోరాటాలూ సారా వ్యాపారాలూ రియల్ ఎస్టేట్ దందాలూ చోటా బడా కాంట్రాక్టులూ భూగర్భ వనరుల దోపిడీ అటవీ సంపద అక్రమ తరలింపు . . . ఇవన్నీ ఫ్యాక్షనిజం పెంచుకొన్న కోరలేనని తెలియజేసాడు. అంతేకాదు వీటికి ప్రత్యామ్నాయంగా మొగ్గతొడుగుతోన్న భూపోరాటాల్ని ప్రస్తావించాడు. పల్లెల్లో విస్తరిస్తోన్న బి.సి.ల , దళితుల చైతన్యాన్ని ( ఎబిసిడి ల వర్గీకరణతో సహా ) గుర్తిస్తూనే పాలక వర్గాలు దాన్ని తమ స్వార్థ ప్రయోజనాల కోసం వాడుకొంటున్న వైనాన్ని సైతం వ్యాఖ్యానించాడు. వీటన్నిటినీ – నీళ్ళు లేక పంటల్లేక పనుల్లేక రోడ్లులేక … ఎడారులై పోతున్న బీళ్ళతో… బీళ్ళవుతున్న పచ్చిక బయళ్ళతో … హత్యలు ఆత్మహత్యలు వలసలతో కునారిల్లుతున్న రాయలసీమ నిర్దిష్టత లోంచే అతను విశ్లేషించాడు. స్వీయ జీవితానుభవానికే అక్షర రూపంలా కనిపించినప్పటికీ తన నేల మీద బలంగా కాళ్ళూని హరికిషన్ నిలబడ్డాడని ‘పడగ నీడ’ నిరూపించింది. ఈ నిర్దిష్టత రాను రానూ అతనిలో మరింత పదునుదేరిందని యీ కొత్త కథల సంపుటి ‘కందనవోలు కథలు’ స్పష్టం చేస్తుంది. హరికిషన్ యిటీవల (2012–13ల్లో) రాసిన ‘జై తెలంగాణ’ , ‘కొత్త కల’ కథలు అందుకు నిలువెత్తు సాక్ష్యాలు.
సీమ సాహిత్యకారుల్లో యింతకుముందు కన్పించిన ప్రాంతీయ స్పృహ తెలంగాణ రాష్ట్రోద్యమం నేపథ్యంలో రాజకీయ ఆర్ధిక రంగాల్లో ప్రాంతీయ అస్తిత్వ చైతన్యంగా పరిణమించాల్సిన అవసరాన్ని యీ కథలు నిర్దేశిస్తున్నాయి. ఈ చైతన్యం సీమలోని తక్కిన జిల్లాల్లో కంటే ముందుగా కర్నూలు ప్రాంతంలోనే మొదలు కావడం యాదృచ్ఛికం కాదు; అదొక సామాజిక యథార్థత. ఆ యథార్థాన్ని ‘కర్నూలు సాహితీ మిత్రులు’ లో వొకడిగా డా. హరికిషన్ గుండె గొంతుకలోకి తెచ్చుకొని బలంగా వినిపిస్తున్నాడు. కృష్ణా నికర జలాల పంపిణీలో న్యాయబద్ధమైన వాటా గురించి డిమాండ్ చేయడం దగ్గరో హైదరాబాద్ ని స్విస్ బ్యాంక్ గా మార్చుకొన్న సీమ ఫ్యాక్షనిష్టుల వరకో యీ రచయిత ఆగిపోవడం లేదు. ‘శ్రీబాగ్ ఒడంబడికను చిత్తుకాగితంగా మార్చిన పెద్దమనుషులతో కలసి నడవడం’ గురించి , ‘నాలుగు కాసుల కోసం భాషను సంస్కృతిని రాక్షసంగా మార్చి వెక్కిరించిన వారితో – పదవులు విసిరి ప్రాజెక్టులు కొల్లగొట్టిన పెద్దన్నలతో సహజీవనం చేయడం’ గురించి ‘మీసాల మీద నిమ్మకాయలు నిలబెట్టడం మాని గంజి మెతుకుల కోసం గలం విప్పి ప్రశ్నిద్దాం’ (ఒక ఆలింగనం కోసం) అని హెచ్చరిస్తున్నాడు. కోస్తా వలస ఆధిపత్యాలకి తలుపులు తెరచి వాళ్ళు విసిరిన అదనపు పెట్టుబడులకు అమ్ముడుపోయిన అన్ని రాజకీయ నాయకత్వాల ద్రోహాల్నీ (అప్పటి నీలం సంజీవరెడ్డి దగ్గర్నుంచి నిన్నటి నల్లారి కిరణ్ కుమార్ రెడ్డి వరకూ – మధ్యలో సందుకో వైన్ షాపు తెరిపించి , ఇటీవలే బెల్ట్ షాపుల రద్దుకి ‘మూడో సంతకం’ చేసిన చంద్రబాబు నాయుణ్ణి కలుపుకొని ) హరికిషన్ ప్రశ్నిస్తున్నాడు. అయితే అతనీ ప్రశ్నల్ని కేవలం రాయలసీమ చైతన్యం నుంచే అడగడం లేదు; మరింత నిర్దిష్టంగా కర్నూలు గడ్డని కేంద్రంగా చేసుకొని బైరాపురం కాలువ కింద నీరందక యెండిపోయి నెర్రెలిచ్చిన పొలాల జాడల్లోంచీ , కొండారెడ్డి బురుజు సాక్షిగా నడచిన బూటకపు ‘సమైక్య ఉద్యమాల’ నీడల్లోంచీ సంధిస్తున్నాడు. ద్రోహాల చరిత్రని తవ్వితీసి – మరోసారి మోసపోవద్దనీ తెలంగాణ వుద్యమం నుంచీ స్ఫూర్తి పొందమనీ యెండు డొక్కల సీమప్రజలకు వుద్బోధిస్తున్నాడు. ఛిద్రమైన రాయలసీమ ముఖచిత్రాన్నీ శిధిలమైన బతుకుల్నీ సామాజిక ఆర్ధిక రాజకీయ కోణాలనుంచి అధ్యయనం చేయడంవల్ల మాత్రమే అతనీ కథలు రాయగలిగాడని నేను నమ్ముతున్నాను. నా నమ్మకానికి బలమైన ఆధారాలు యీ సంపుటిలోనే ‘బతుకు యుద్ధం’ కథలో కనిపిస్తాయి.
‘బతుకు యుద్ధం’ రాసింది కూడా 2013 లోనే. సీమ కరువు వెతలు కథలుగావడం కొత్త కాదు గానీ దాన్ని సమస్త విలువల్నీ నాశనం చేసే కఠోర వాస్తవికతగా అభివర్ణిస్తూ యింతకుముందు పి.రామకృష్ణారెడ్డి ‘కరువు పీల్చిన మనుషుల్ని’ హృదయవిదారకంగా సాక్షాత్కరింప జేశారు. కరువులో బతుకులు బుగ్గైన వ్యక్తుల నైతిక పతనాన్నే మరో రూపంలో చూపిన కథ ‘బతుకు యుద్ధం’. వరస కరువుల్తో ‘అప్పు కట్టలేక , అవమానం తట్టుకోలేక ఆఖరికి పొలంలోనే చింతచెట్టుకి వురేసుకొన్న’ బోయగేరి శంకరప్ప, ‘యవసాయం చేసేదానికన్నా కూలిపనికి పోవడమే మేలు’ అనుకొనే రైతు సుంకన్న , ఆ పనికూడా లేక ‘సూస్తూ సూస్తూ పస్తులతో సావలేక – నాలుగు వేళ్ళు నోట్లోకి పోవాలంటే ఏదో ఒగటి సెయ్యాల ‘ గాబట్టి ఫ్యాక్షనిష్టు రాజారెడ్డి కింద పనిచేస్తూ వ్యసనాల పాలైన సుంకన్న పెద్దకొడుకు వీరేష్ , వూరి బైట కొత్తగా వచ్చిన ఫ్యాక్టరీ కింద భూమిని కోల్పోయి వచ్చిన దుడ్లు కరిగిపోయి ‘పుట్టినూళ్ళో గంజినీళ్ళు గూడా పుట్టక’ వూరుగాని వూరుపోయి దారిదొంగగా మారిన బలిజగేరి గోవిందయ్య … యీ కథలో వీళ్ళంతా బతకడమే యుద్ధమైన చోట మంచీ చెడుల గురించి నీతీ న్యాయాల గురించి ధర్మాధర్మాల గురించి లేవనెత్తే ప్రశ్నలకు జవాబులిమ్మంటారు.
‘పల్లెలన్నీ ప్లాట్లుగా , సెజ్జులుగా మారిపోయాక గ్రామాల్లోని సాలు సక్కగ వచ్చేటట్లు గొర్రు పట్టి విత్తనమేసే మొనగాళ్ళు , వంచిన నడుం ఎత్తకుండా చక చక నాట్లు వేసే పనిగత్తెలు , కొడవలి పడితే చాలు ఒక్కరోజే ఎకరాలకు ఎకరాలు పంటకోసే పాలెగాళ్ళు , గడ్డివాముల్ని ఎంతటి గాలివానకైనా చెక్కు చెదరకుండా నిర్మించే నేర్పరిగాళ్ళు’ మాయమైపోతున్నారనికూడా యీ కథలోనే రచయిత వాపోతాడు. అయితే యీ పరిస్థితి కేవలం రాయలసీమకే పరిమితం కాదు; కానీ వర్ణించిన భౌతిక/భౌగోళిక వాస్తవికత మాత్రం ఆ ప్రాంతానిదే. ఆళ్లగడ్డ దున్నపాడు గూళ్యం బైరాపురం ఆలంపూర్ తర్తూరు గాజులదిన్నె కొండారెడ్డి బురుజు కాల్వబుగ్గ యస్ టి బి సి కాలేజి కండేరి బండిమిట్ట సి క్యాంప్ … యీ ప్రాంతాలన్నీ కథల్లో అత్యంత సహజంగా వొదిగిపోయి ఆ వాస్తవికత సాధిస్తాయి. రాయలసీమ అనగానే గుర్తొచ్చే అనావృష్టి పరిస్థితులకు భిన్నంగా తుంగభద్ర వరదల్లో కర్నూలు ప్రాంతం ముంపుకి గురికావడానికి కారణమైన పాలకుల నిర్లక్ష్య వైఖరిని పచ్చి కరువు (2004) వరద (2009) కథల్లో నిశితంగా విమర్శించినప్పుడు గానీ , పల్లెల్లో కులం బలంతో ఫ్యూడల్ న్యాయాన్నే అమలుపరుస్తోన్న రెడ్డి దొరతనానికి యెదురొడ్డి నిలవాలని మానసిక ప్రతిన తీసుకొన్న బోయ వెంకటేశ్వర్లు ( చిచ్చు – 2006 ) తెంపరితనాన్నివర్ణించినప్పుడు గానీ , ప్రాణాలకు తెగించి బ్రిటిష్ రాజ్ నెదిరించి కొండారెడ్డి బురుజు మీద మువ్వన్నెల జెండా యెగరేసి జైలు పాలైన విశ్వనాథం వంటి వారి త్యాగభరితమైన పోరాట చైతన్యాన్నీ , వారు సాధించిన స్వాతంత్ర్యం దాని ఫలాలు అవినీతిపరులు హంతకులూ అయిన ఫ్యాక్షనిస్టు రాజకీయ నాయకుల చేతిలో అపహాస్యం అవుతున్న ప్రస్తుత సందర్భాన్నీ బేరీజు వేసినప్పుడు గానీ ( గాయపడ్డ నమ్మకం – 2014 ) , ప్రజల్లో పాతుకు పోయిన మూధవిశ్వాసాల్ని అడ్డం పెట్టుకొని భూదురాక్రమణకు పాల్పడే పెదరెడ్డి కుతంత్రాలకు గురైన ఉలిగమ్మ దైన్యానికి పరిష్కారం చూపేందుకు ప్రయత్నించినప్పుడు గానీ ( బసివిరాలు బరితెగించింది – 2014 ) కర్నూలు స్థానీయతని వొక పరిమళంలా అద్దాడు హరికిషన్.
రచయిత సమకూర్చిన స్థానీయతా నేపథ్యమే యీ కథలని ‘కందనవోలు కథలు’ గా తీర్చిదిద్దదానికి ముఖ్యమైన వనరుగా తోడ్పడింది . కథల్లో సందర్భోచితంగా వాడిన కర్నూలు ప్రాంత మాండలికం కూడా అందుకు అదనపు హంగుని జోడించింది. సూక్ష్మంగా పరిశీలించినపుడు రాయలసీమ నాలుగు జిల్లాల్లోనూ వొకే విధమైన జీవితం లేదనీ సమస్యల స్వభావం వేరనీ వాటిని పరిష్కరించుకోడానికి దారులు తీసే చైతన్య భూమిక ప్రత్యేకమైనదనీ వొకే కాలంలో ఆర్ధిక రాజకీయ సామాజిక రంగాల్లో చలనం భిన్నంగా ఉందనీ గతి తార్కికంగా నిరూపించడానికి యీ కథల సంపుటి వొక ఆకర గ్రంథంగా వుపయోగపడుతుంది. రాయలసీమ జీవితాన్ని యథాతథంగా చిత్రించడం దగ్గర ఆగిపోకుండా ఆ జీవితం అలా వుండడానికి కారణమైన ఆర్ధిక భౌతిక సామాజిక రాజకీయ శక్తుల్ని దృశ్యమానం చేయడానికి ప్రయత్నించడంవల్ల మాత్రమే అది సాధ్యమైంది.
ఉన్నత విద్యనభ్యసించిన వుపాధ్యాయుడిగా స్వీయ అనుభవాల్నీ, సామాజిక అవగాహననీ కథలుగా మలిచే సందర్భాల్లో సైతం హరికిషన్ తన నేల వాసనని వదులుకోలేదు. మన విద్యా వ్యవస్థలో రోజురోజుకీ పెరిగిపోతున్న అసమానతల్నీ జడలు విచ్చుకొన్న అమానవీయతనీ పాతుకుపోయిన అవినీతినీ అసంబద్ధమైన పోటీనీ దగ్గరగా చూస్తూ అందులో యిమడలేని వూపిరాడనితనంలోంచీ తీవ్రమైన ఆవేదనకి లోనై అతనురాసిన కథలు వొక డజను వరకూ వున్నాయి. ‘బాల్యంలోనే యుద్ధ ఖైదీలై చదువుల బోనుకు బందీలై’ శిక్షలు అనుభవించే పిల్లల్ని ప్రేమించేవాళ్ళ కోసమే’ ప్రచురించిన ‘ఒక చల్లని మేఘం’ కథల సంపుటి (2008) ద్వారా లోపలి వ్యక్తిగా హరికిషన్ నేటి విద్యా వ్యవస్థలోని సమస్త అస్తవ్యస్త పరిస్థితుల్నీ నిశితంగా చర్చకు పెట్టాడు. చాలామంది వుపాధ్యాయ – రచయితలు చేయని పనిని వొక సామాజిక ఆచరణలో భాగంగా నిర్వర్తిస్తున్నందుకు డా. హరికిషన్ ని నావరకు నేను బహుధా అభినందిస్తున్నాను. ఈ సంపుటిలోకి యెక్కిన ‘సదవకురా చెడేవు’ (2001) ‘ఒక చల్లని మేఘం’ (2002) ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ (2005) విద్యారంగానికి చెందిన భిన్నపార్శ్వాలను విమర్శకు పెట్టిన కథలు.
‘సదవకురా చెడేవు’ బహుముఖీన కథ. పరీక్ష హాల్లో యిన్విజిలేటర్ గా పనిచేసే వుపాద్యాయుడి అంతరంగంలో చెలరేగే సంఘర్షణకి అక్షర రూపమైన యీ కథలో ప్రభుత్వ విద్యా విధానాలు కార్పోరేట్ చదువులు పట్టణ గ్రామీణ విద్యార్థుల విద్యా ప్రమాణాల్లో అనివార్యంగా చోటు చేసుకొనే వ్యత్యాసాలు – వాటికి కారణాలు ప్రైవేటీకరణలో పేద దళిత విద్యార్థులు యెదుర్కొనే నిరుద్యోగ సమస్యలు రిజర్వేషన్ పాలసీలు మాతృభాషోద్ధరణ వాదాలు సినిమాల్లో సీమ ఫ్యాక్షనిజం . . . వంటి సవాలక్ష విషయాలు వొడ్డును కోసే వరద ప్రవాహ వేగంతో కదులుతూ వుంటాయి. పది వ్యాసాల పెట్టు యీ కథ. చైతన్య స్రవంతికి దగ్గరగా వుండే టెక్నిక్ ని ఆశ్రయించడంవల్ల యెన్నో విరుద్ధ అంశాలు కథలోకి యెక్కాయి. తానూ బోధించే చదువుల పరమార్థం తన చేతి నుంచి జారిపోయిన కారణంగా కల్గిన వొక విధమైన కసి యీ కథలోని వుపాద్యాయుడి ప్రవర్తనలో చూస్తాం , కానీ నిజానికి ఆశక్తతలోంచీ పుట్టిన దుర్భరమైన ఆవేదన అది. పోటీ చదువుల్తో బాల్యానికీ ప్రకృతికీ దూరమౌతోన్న పిల్లలపట్ల అపారమైన ప్రేమతో రాసిన కథ ‘ఒక చల్లని మేఘం’. అనివార్యంగా కంట తడి పెట్టించే కథ యిది. పేదలకి విద్యనందకుడా చేసే మైనార్టీ గుట్టుని ‘ఒక మైనార్టీ కాలేజి కథ’ రట్టు చేస్తే , ‘నాలుగో స్తంభం’ కథ విద్యని లాభసాటి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీగా మార్చిన కార్పోరేట్ కాలేజీల మధ్య నెలకొన్నఅనారోగ్యకరమైన పోటీనీ , పెట్టుబడులకు పెంపుడు జంతువైన మీడియా క్రూర దౌష్ట్యాన్నీ యేకకాలంలో యెండగట్టింది. ఇదంతా మన చదువుల కుట్ర. దాన్ని ఛేదించడానికి పూనికతో కథనొక సాధనంగా యెన్నుకొన్న రచయిత హరికిషన్. ఇప్పుడు కావల్సింది సంస్కరణలు కాదు – సమూలమైన మార్పు అని యీ కథలు చదివాకా అనుకోకుండా వుండలేం.
ఈ సంపుటిలో స్త్రీల ముఖత: వినిపించిన రెండు అద్భుతమైన మౌఖిక కథనాలు ( నిశ్శబ్ద ఆర్తనాదం – 2000 , పొద్దుపోని పంచాయితీ – 2010 ) నన్ను కట్టిపడేశాయి. వాటిలో గుక్కతప్పుకోకుండా పలికిన సాంద్ర దు:ఖ – క్రోధ భాష గుండెను బలంగా తాకుతుంది. కుటుంబ హింస , జెండర్ రాజకీయాల వస్తువా – వర్గ ప్రాంతీయ భాషా – మోనోలాగ్ శిల్పమా యేది ఆకట్టుకుంటుందో నేను చెప్పేకన్నా మీరే స్వయంగా చూసి తెలుసుకోండి. వస్తు శైలీ శిల్పాల మేలు కలయికకి అవి అమోఘమైన సాక్ష్యాలు అని తప్పక అంగీకరిస్తారు.
ప్రపంచీకరణ ద్వారా మనం కోల్పోతున్నదాన్నీ కాపాడుకోవాల్సిన వాటిని కూడా హరికిషన్ స్పష్టంగా గుర్తించాడు. గ్లోబల్ సందర్భంలో సాంస్కృతిక పరాయీకరణ అతణ్ణి ఎక్కువగా బాధించింది. రోజుల తరబడి మహా కథనాల్ని గానం చేసి సాంస్కృతిక వారసత్వ సంపదని కాపాడుకొస్తున్న వుపకులాలకు చెందిన కళాకారులు తమ కళకి దూరమై పూట గడవక బిచ్చగాళ్ళుగా మారిపోగా, టీవీ పెట్టెలకి అతుక్కుపోయి వొక మత్తులో కూరుకుపోయి చివరికి వూకుడు కథలు చెప్పేవాళ్ళూ కరువై మన పాటా కథా నశించిపోతున్న సందర్భాన్ని మాయమైన గానం(2006), ఒక్క కథ(2010) ల్లో హరికిషన్ రికార్డు చేసాడు. అందుకే అతను రాయల సీమ పల్లె పట్టుల్లో లభించే జానపద గేయాల్నీ కథల్నీ పిల్లలకోసం సేకరించి ప్రచురిస్తున్నాడు. మనదైన అచ్చమైన దేశీయ సాహిత్య సంపదని కాపాడే లక్ష్యంతో చేస్తున్న ఆ పని చొచ్చుకొస్తున్న సాంస్కృతిక సామ్రాజ్య వాద ఆధిపత్యాన్ని ఎదుర్కొనే సాధనంగానే భావించాలి. మౌఖిక కథనాల్ని యథాతథంగా అందించడం వల్ల ఆ సాహిత్యలో వినిపించే కర్నూలు మాండలిక భాషా విశేషాలు అట్టడుగు కులాల సామాజిక చరిత్రని తెలుసుకోడానికి సైతం దోహదపడతాయి.
‘హిందూ ముస్లిం – భాయ్ భాయ్’ (2005) కథ నిచ్చెన మెట్ల సమాజంలో అట్టడుగున వున్న దళితులు వున్నతీకరణని కోరుకొన్నప్పుడు వారిని అణగదొక్కడానికి మత విద్వేషంతో వొకరిపై మరొకరు కత్తులు నూరే హిందూ ముస్లింలు వొకటౌతారన్న చేదు వాస్తవాన్ని విప్పి చెబుతుంది. ఏ మాత్రం అజాగ్రత్తగా వున్నా చేజారిపోయే సంక్లిష్టమైన వస్తువుని హరికిషన్ యెంతో సంయమనంతో నిర్వహించాడు. ఇదే జాగ్రత్త ‘జవా’ నిర్వహణలో కూడా చూస్తాం. ఇనాయతుల్లా దాదా హయాత్ షరీఫ్ లాంటి ఇన్ సైడర్స్ మాత్రమే రాయగల కథ యీ కథ ముస్లిం మతం లోపల ముల్లాల ఆధిపత్యాన్ని ప్రశ్నిస్తుంది.
కులం – మతం – ప్రాంతం – జెండర్ నిర్దిష్టతల్లోంచి వస్తు వైవిధ్యంతో తీర్చిదిద్దిన యీ కథలకి ప్రాణభూతమైన అంతస్సూత్రం (యాంకరింగ్ పాయింట్) మాత్రం వొక్కటే – వ్యవస్థీ కృతమైన అసమానతలపై తీవ్రమైన క్రోధం , సమస్త ఆధిపత్యాలపై నిరసన. అదే రచయితగా హరికిషన్ ప్రాపంచిక దృక్పథం. ఆ దృక్పథం వల్లే అతను ఐక్యత – సంఘర్షణ సూత్రాన్ని అన్వయించుకొంటూ అనేక నిర్దిష్టతల్లోంచీ సాధారణీకరణం వైపు పయనిస్తూ గడ్డిపరకల్తో తాడు పేనుతున్నాడు.
సంపుటిలోని కథలన్నీ తడమలేని అశక్తుణ్ని. చివరిగా వొక్క ముచ్చట చెప్పి మాత్రం ముగిస్తా –
మంచి కథలో పాత్రలు పాఠకుల్ని వెంటాడతాయి – లోపలా బయటా సంఘర్షణ ప్రధానంగా నడిచే కథల్లోని పాత్రలే పదికాలాలు గుర్తుంటాయి. బహుముఖీన (మల్టీ లేయర్డ్) కథల్లో పాత్రలు పాఠకుడిని వూపిరి తీసుకోనివ్వవు – సుఖంగా నిద్రపోనివ్వవు. అటువంటి బలమైన పాత్రల్ని కథల్లోకి తీసుకురావడానికి అనువైన సమాజమే మన చుట్టూ వుంది . హరికిషన్ కథల్లో యెక్కువ భాగం సింగిల్ పాయింట్ కథలు కావడం వల్ల పాత్రల వ్యక్తిత్వంలోని అనేక పొరలు ఆవిష్కారమవడానికి ఆస్కారం తక్కువ; అయినప్పటికీ ‘బతుకు యుద్ధం’లో గోవిందయ్య ,‘చూపు’లో ‘నేను’ , ‘ఒక చల్లని మేఘం’ లో హరి , ‘రాజమ్మ’లో రాజమ్మ , ‘బసివిరాలు బరితెగించింది’లో ఉలిగమ్మ , కోటయ్య వంటి గుర్తుండే పాత్రల్ని మనముందు సాక్షాత్కారింపజేయగలిగాడు. బాధ్యతనెరిగిన రచయితగా సమాజంలోని సంక్లిష్టతల్నీ సంక్షోభాల్నీ సాహిత్యీకరించే ఆచరణలో ముందువరసలో నడుస్తున్నాడు కాబట్టి హరికిషన్ నుంచి ముందు ముందు మల్టీ లేయర్డ్ కథలూ పాత్రలూ తయారవుతాయని యీ సంపుటి భరోసానిస్తుంది. కథానిర్మాణం పై అతను తీసుకొనే శ్రద్ధ ముచ్చటగొలుపుతుంది.
నిరాడంబర శైలీ , ముక్కుసూటి కథనం , వస్తు వైవిధ్యం , శిల్పం పేరున ప్రయోగాలు చేయకపోవడం , పాత్రోచితమైన భాషాప్రయోగం చేస్తూనే కథనంలో సైతం తనదైన ప్రాంతీయ ముద్రని చూపే నైపుణ్యం , తనచుట్టూ వున్న సమాజం లోని గతిశీలతని భిన్నపార్శ్వాలనుంచి విశ్లేషించగల యెరుక , స్వీయ జీవితానుభావాలను ప్రగతిశీల ప్రాపంచిక దృక్పథం నుంచి వ్యాఖ్యానించే నేర్పు , స్థానీయతకి పెద్దపీట వేసి వొక వాతావరణాన్ని నిర్మించే జాగరూకత, మానవీయ స్పందనల్ని- వుద్వేగాల్ని నిర్దిష్ట సామాజిక సందర్భం నుంచి చూడగల సంయమనం , ‘కథా సమయం’ వంటి సంస్థలద్వారా పెంచుకొన్న సదసద్వివేచనా రచయితగా హరికిషన్ కూడగట్టుకొన్న బలాలు. ఇవి భవిష్యత్తులో మరింత పదునెక్కుతాయని ఆశంస.
కర్నూలు జిల్లా చరిత్ర కారుడిగా , బాల సాహిత్య కర్తగా , జానపద సాహిత్య సేకర్తగా – పున: స్రష్టగా , కథా రచయితగా తనకంటూ వొక గుర్తింపు తెచ్చుకొన్న డా. హరికిషన్ నుంచి కర్నూలు ప్రాంత సమగ్ర సామాజిక చరిత్రకి అద్దం పట్టే మంచి నవలని ఆశించడం తప్పు కాదేమో! సీమ నవల అనకుండా కర్నూలు నవల అనటానికి కారణం – కర్నూలు నుంచి హరికిషన్ ని విడదీయలేకపోవడమేనని నివేదిస్తూ … కందనవోలు కథలకు సాదర స్వాగతం పలుకుతూ . . . సెలవ్.
-ఎ.కె.ప్రభాకర్
నూరేళ్ళ రజని: పాట ఆయన ఎగరేసిన పావురం!
” లలిత సంగీతం అనే పేరు ఎలా వచ్చింది ? ” అన్న నా ప్రశ్నని కొంత మార్చి ” లలిత సంగీతం ఎలా వచ్చింది ? ” అని నవ్వుతూ అడిగారు ఆయన కుమారులు బాలాంత్రపు హేమచంద్ర గారు.
” నా లోంచి ” – వంద గండుతుమ్మెదలు పలికాయి గొంతులో. ఆ చెప్పుకోవటం లోనూ పాటే ఉంది … విడిగా ఆయన ఉనికి లేదు ఇప్పుడు. బహుశా ఎప్పుడూ ఉండి ఉండదేమో కాని, ఈ శైశవ మౌగ్ధ్యం లో అసలు తెలియటం లేదు. కళా దేవి తన ప్రేమికులను యౌవనం నుంచి, ప్రౌఢత్వం నుంచి వృద్ధులను చేయక ఇలాగ పసివారిని చేస్తుందేమో.
అలా అని వారికి ఏవీ పట్టటం లేదనేమీ కాదు, మాకు అతిథిమర్యాదలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారొక కంట.
‘’ Her whole life became a poem and a song ‘’ అని సరోజినీ నాయుడు గారి గురించి అన్నారని తెలుసు, ఇక్కడ దాన్ని దర్శించే వీలు కలిగింది. ఆ పాట కేవలం కలల్లో మ్రోగి ఊరుకునేది కాదు, పరిసరాలనూ పరిచయస్తులనూ ఆప్తులనూ సేవకులనూ తడిపి స్వచ్ఛం చేయగలిగినది.
ఈ 31 వ తేదీకి అధికమాసాలతో కలిపి వారికి నూరు సంవత్సరాలు పూర్తవుతాయట. ఆంగ్లమానం ప్రకారం తొంభై ఆరు. కొద్దిపాటి శారీరక అశక్తత లకు సాయం చేసేందుకు ఒక యువకుడు ఉన్నారు వారితో. అతను ప్రేమగా అడుగుతున్నాడు ” అది పాడండి, ఇది పాడండి ” అని.
ఇంటికివచ్చినవారి దగ్గర బిడ్డను పద్యాలు చెప్పమన్నట్లు ఉంది ఆ అడగటం. అతని మనసులో అంత మెత్తదనాన్ని మేల్కొలిపిన ఈయన ఆర్ద్రత ఎంతదో కదా..హాయిగా అనిపించింది చూస్తుంటే.
తెలుగు సాహిత్యపు సుకృతాలలో ఒకటి వేంకటపార్వతీశ్వర కవుల సాహిత్యం. ఆ జంట లో ఒకరి, బాలాంత్రపు వేంకటరావు గారి – పుత్రులు రజనీకాంతరావు గారు. వేంకటరావు గారి సేవకు సంతుష్ట అయిన సరస్వతి , తన మరొక కారుణ్యాన్ని, సంగీతాన్ని – వారి బిడ్డ పైన వరంగా కురిపించింది. ఆ గులాబీ నీటి జడి ఇంచుమించు అరవై ఏళ్ళ పాటు ఆంధ్రదేశాన్ని ముంచెత్తింది, ఇప్పటి శాంతపు విశ్రాంతి లోనూ ఆ సౌరభం స్ఫురిస్తూనే ఉంది.
” ఆయన వినికిడి అంత బాగాలేదు, ముఖాముఖీ వంటిదేమీ సాధ్యం కాదేమో ” నని వారి అబ్బాయి ముందే హెచ్చరించి ఉన్నారు. ఊరికే చూసేందుకు వస్తామని చెప్పాను. నా జీవన కాలం రజనీకాంతరావు గారి కాలాన్ని స్పర్శించగలగటమే గొప్ప సంగతి, మరింకేదైనా అదనమే. మేము వెళ్ళేసరికి చక్కగా, ఒక కేంద్రప్రభుత్వపు ఉన్నతోద్యోగి ఎలా ఉండాలో అలా, తయారై హాల్ లో కూర్చుని ఉన్నారు.
”ఏమైనా పాడతారా, వీళ్ళకోసం ? ” -వారి అబ్బాయి అడిగారు.
నేను ధైర్యం చేసి ” స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా ” కోరుకున్నాను. లత గారి మోహనవంశీ మొదటి పుటలో ‘ theme song ‘ గా నాకు పరిచయమై, వెంటాడిన పాట అది. ఆయన ముఖం వెలిగింది, ” మీకు మంచి పాటలు తెలుసూ ” అని కితాబు ఇచ్చారు. పాడారు. ఇంతలో వారి కోడలు ప్రసూన వచ్చేశారు. ” ఆవిడ అడిగితే బోలెడు విషయాలు చెబుతారు, పాడతారు ”-అట. ఎదురుగా కూర్చుని లాలనగా వారి మోకాలి పైన అరచేయివాల్చి మృదువుగా ఆజ్ఞాపిస్తున్నారు ఆమె.
‘ ఓంకార పరివృత్తం విశ్వం ‘ పాడండి
పాడారు.
‘ ఓ విభావరీ ‘ పాడండి..
పాడారు.
‘కొండవాలులో ‘ పాడండి..
పాడారు.
‘ ప్రతిశ్రుతి ‘ … ఆ పాట ఎలా రాశారు ?
” మా పిఠాపురం లో బడికి వెళ్ళేప్పుడు ఒక వీధిలో అలా ప్రతిధ్వనులు వినిపించేవి , దాని గురించి రాశాను ”
‘’ మధువనస్వప్నం లోవి పాడండి. పాడారు.
” Puck,అదే, Robin good felow గుర్తున్నాడా ? ” నన్ను ప్రశ్నించారు.
” గుర్తున్నాడండీ ”
” అతను పాడతాడు ఇది ” – వివరించారు.
Shakespeare నాటకం ‘ Midsummer night’s dream ‘ ని సంగీతరూపకంగా మలచి పాటలు రాసి, స్వరపరచారు. అదొకటే కాదు, ‘ ఉమర్ ఖయాం ‘ , ‘ అవంతిసుందరి ‘[దశకుమార చరిత్ర నుంచి ] , ‘ దేవదాస్ ‘ , ‘ సిద్ధేంద్రయోగి ‘ , రవీంద్రుల ‘ చిత్ర ‘ , ‘ లైలా మజ్ఞు ‘, ‘ చండీదాస్ ‘ , ‘ శిలప్పదిగారం’ , ‘ కులీకుతుబ్ షా’ …లెక్కలేనన్ని రూపకాలు . వసంత , గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత , శిశిరాలా పత్రాలుగా అలవోకగా రాలిన పాటలు. సాహిత్యం పట్ల గాఢమైన అభినివేశం ఉన్నవారు సంగీతరసజ్ఞులైతేఎటువంటి కళాకృతులు రాగలవన్నదానికి తార్కాణాలు అవన్నీ . వారి లోని కవిని సంగీతకారుడు కొన్ని సార్లు అధిగమించారనిపించినా, మెట్లవరుసలు వంటి గేయాలలో ఏ ఉత్తమ ఆధునిక కవికీ తీసిపోని ప్రతిభ కనిపిస్తుంది.
”గగనసీమలు కాలపరిధులు
గడచిపోయే మెట్లవరుసలు
జీవితమునకు మరణమునకూ
ఈవలావల కదలు వరుసలు
కుడిఎడమలే కానరాని
తుదిమొదళ్ళే తోచబోని –మెట్లవరుసలు
స్వప్నమధువుల జడులలోపల
స్వాంతమున జ్ఞాపకపు పొరలు
పొరలలోపల తెరలు తెరలుగ
పూర్వజన్మల ప్రేమకథలు- మెట్లవరుసలు..
పిఠాపురం రాజా వారి కళాశాలలో చదువు అయాక ఎం.ఏ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం తోబాటు శాంతినికేతన్ కి కూడా దరఖాస్తు చేశారట. రెండు చోట్లా సీట్ వచ్చింది.
” వెళ్ళలేదేం మరి ? ” హేమచంద్ర గారు అడిగారు.
” అంధ్రా లో వచ్చిందిగా, దగ్గర గా ” – ఆరాటం లేదన్నమాట, హెచ్చేమో అనిపించే సౌందర్యం కోసం కూడా. అనవసర తాపత్రయాలు లేని జీవనం, అలాగని క్రియాశూన్యమైనది కాదు. అటువంటి తూకం ఉండటం అంత మేధావినీ pervert కాకుండా ఆపిందనిపించింది. సాటిలేని ప్రతిభ కారణంగా తోటివారు ఈర్ష్యాసూయలు చూపెట్టినా అవి వారిని తాకలేదు ఏనాడూ. చిన్నప్పుడు అన్నగారు నళినీ మోహన రావు గారు మంచి స్పోర్ట్స్ పర్సన్ గా ఉండేవారట. వీరూ ఆ పనేదో మొదలెడదామని ఒకనాడు పరుగుపందెం లో పాల్గొనబోయారట. మాస్టర్ విజిల్ వేసినా పరిగెత్తాలని తోస్తే కద, అక్కడే ఉండిపోయారు. తమకు అది సరిపడదని తెలుసుకున్నారట… ఆ తర్వాతెప్పుడూ ఏ పరుగు మీదా ప్రీతి లేదు , దారిప్రక్కన గులాబీలను ఆఘ్రాణిస్తూ హాయిగా నడిచారు, గమ్యం కోసం కాదు. ఆ నిశ్చింత వారికి ఆయుష్షునూ ఆరోగ్యాన్నీ ప్రసాదించింది.
సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు మండా కృష్ణమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.బాల్యంలో పాటలు కట్టుకుంటున్నప్పుడే స్వరాలు వచ్చేసేవి, ఒక రాగపు ఛాయలో ఒదిగేవి. ఇరవై ఏళ్ళు దాటుతుండగా, 1937-40 మధ్యలో పూర్తి స్థాయి వాగ్గేయకారుడైనారు. తమ అభిరుచికి తగిన ఉద్యోగం లో ప్రవేశించారు. అలాగ కుదరటం ఎవరికోగాని పట్టని అదృష్టం. ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు వంటి భావుకులూ ఉద్దండులూ అయినవారి దగ్గర రేడియో మాధ్యమాన్ని అవగాహన చేసుకున్నారు. గొప్ప సాహిత్యాన్నంతటినీ రేడియో ద్వారా వినిపించే పనిని ఆయన తానుగా మీద వేసుకున్నారు, ఆ క్రమం లో రెండు తరాల అభిరుచిని ఉన్నతం చేశారు. ఆ ఘనతేదో తామొక్కరికే దక్కాలని అనుకోనూలేదు. ఫలితంగా రేడియో కి ఒక సామూహిక నిత్యోత్సవంగా పేరు వచ్చింది.
తెలుగు లో శాస్త్రీయానికి మార్దవాన్ని జోడిస్తూ సుగమమైన సంగీతం మొదలైన కాలం అది-రజనీకాంతరావు గారు , ఎస్.రాజేశ్వర రావు గారు, రావు బాలసరస్వతి గారు, సీతా అనసూయ గార్లు- వీరంతా ఆ వైతాళికులు. ఇందరిలో వాగ్గేయకారులు రజని గారొక్కరే. ఆ తర్వాతి కాలం లో కొన్ని సినిమాలకు పనిచేస్తూ, ప్రభుత్వోద్యోగపు నిబంధనల వల్ల అన్నగారి పేరనా, బావ మరిది బుద్ధవరపు నాగరాజు గారి పేరనా పాటలు చేస్తూ పోయారు. బహిరంగరహస్యం ఒకటి – కృష్ణశాస్త్రి గారి ‘ జమీందారీ బద్ధకం ‘ కారణం గా పాటలు అందించలేకపోతే రజనిగారు రాసేసేవారు.
అలా కృష్ణశాస్త్రి గారి పేర చలామణీ అయిన పాటలలో ముఖ్యమైనది ‘ కొలువైతివా రంగశాయి ‘. పాట వారిది అంటే నూటికి తొంభైతొమ్మిది సార్లు రచన, వరస రెండూ అనే అర్థం. బి.ఎన్.రెడ్డి గారు, గోపీచంద్ గారు – వీరి సినిమాలలో రజని గారు తప్పకపనిచేయవలసిందే. రాజమకుటం లో ‘ ఊరేది పేరేది ‘ రజని గారి అద్భుతాలలో ఒకటి. గోపీచంద్ గారి ‘ మానవతి ‘ లో ‘ తన పంతమే ‘ , అరుదైనరాగం రసాళి లో చేశారు. బాలసరస్వతి పాడారు. అది వి.ఎ.కె. గారికి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెప్పారు. ఆ పాటను రజని గారి పేరన ప్రస్తావించనందుకు బాలసరస్వతి గారి పైన వి.ఎ.కె. గారికి కొంచెం కోపం కూడానట.
1950 తర్వాతి కాలం లో మీర్జాపురం రాజావారి సినిమా కి పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బంది వల్ల ఆయన సినిమాల్లోంచి తప్పుకున్నారు. అక్కడా వారి ‘ మట్టసం ‘ కనిపిస్తుంది, తమకు తగనిదేదో తెలుసుకొనే స్పష్టత. రేడియో లో ఉండిపోవటం ఎంతో స్థిమితాన్ని ఇచ్చింది, కీర్తితోబాటు. ఇక్కడ తమ పేరు ని దాచుకొనే అవసరం లేకపోయింది. తమ పాటలు మరొకరి పేర ఉంటే వారికి పట్టదు కాని, తమది కానిది తమది అనటాన్ని వెంటనే ఖండిస్తారు. చలం గారి మ్యూజింగ్స్ లో ‘ ఆ తోట లోనొకటి ఆరాధనాలయము ‘ పాట ను మెచ్చుకుంటూ అది రాశారు కనుక రజని అప్పటిదాకా రాసిన దేశభక్తి గేయాలన్నిటినీ క్షమించవచ్చు అంటారు. ఆ మాటలు అంతా చెప్పుకుంటారు. ఇంతకూ అది రాసినవారు ఎస్.రాజేశ్వర రావు గారి తండ్రి సన్యాసి రాజు గారు. మేము ఉండగా హేమచంద్ర గారు రజని గారిని సరదాగా మళ్ళీ అడిగారు ” ఆ తోటలోనొకటి పాట ఎవరు రాశారు ? ” అని.
” నేను కాదు ” ఖచ్చితంగా, చిన్న ఉక్రోషం తో బదులిచ్చారు రజని గారు.
1947 ఆగస్ట్ పదిహేను న ఉమ్మడి[14 వ తేదీ అర్థరాత్రి ] మద్రాస్ రాష్ట్రపు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన పాటలలో మొదటిది పట్టమ్మాళ్ గారు పాడినది. రెండవది టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన రజని గారి పాట – ‘ మ్రోయింపుము జయభేరి ‘ . పెద్ద సంతోషం ,ఆ విషయం వింటూంటే అంతకన్న ప్రసిద్ధమైనది- ” మాదీ స్వతంత్ర దేశం , మాది స్వతంత్ర జాతి ‘ ఇవాళ విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. ముఖ్యంగా ప్రారంభం లో వచ్చే trumpet ధ్వనులు. ఆ పాట 1948 ఆగస్ట్ పదిహేనున ప్రసారమైందట.
చిన్నపిల్లల కోసం ‘ జేజిమామయ్య పాటలు ‘ బోలెడన్ని కూర్చారు. .. ‘ దిబ్బరొట్టె అబ్బాయి ‘ వంటివి. 1961 లో రవీంద్రుల శతజయంతి. మొత్తం రవీంద్రసంగీతాన్నంతా తెలుగులోకి తెచ్చేశారు రజని. బెంగాలీ లో ఇంతకన్న బావుంటాయనిపించదు నాకు. అదొక ఆనంద సం రంభం ఆకాశవాణిలో. అపురూపమైన పాటలు అవి..కృష్ణనీ గోదావరినీ దాటించి సరాసరి పద్మానది తీరానికి ప్రయాణం చేయిస్తాయి. [వేంకటపార్వతీశ్వర కవులు చాలా బెంగాలీ నవలలని తెలుగులోకి అనువదించారు. వేంకటరావు గారి తమ్ముడు కలకత్తా విశ్వవిద్యాలయం లో చదువుకుంటూ బెంగాలీ పుస్తకాలు ఇంటికి తెచ్చేవారు. వీరు భాష నేర్చేసుకున్నారు. వారి ద్వారా రజని గారికి బెంగాలీ వచ్చిఉండటం గొప్ప మేలు చేసింది శ్రోతలకి]
ఆయన దిద్దినవారూ అంతేవాసులూ అనంతరకాలం లో ప్రసిద్ధులైనారు . బాలమురళీకృష్ణ గారు రజని గారిని గురుసమానులుగా చూసేవారిలో ఒకరు అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు, కాని అది నిజం. శ్రీరంగం గోపాలరత్నం గారితో కలిసి బాలమురళి గారు పాడిన రజని గేయం ‘ మనప్రేమ ‘ ఈ మధ్య , తిరిగి ఫేస్ బుక్ లోఆహ్లాద విహారం చేసింది. రజని గారి గేయాల సంపుటి ‘ శతపత్రసుందరి ‘ కి బాలమురళి గారు వినయంగా రాసిన ముందుమాట ఉంది .ఘంటసాల గారు ఎదుగుతూన్న దశ లో రజని గారి ఊత ను అందుకున్నారు.
1972 లో చలం గారిని చేసిన ఇంటర్ వ్యూ రజని గారి గొప్ప achievements లో ఒకటి. చలం గారి పరంగా రజని ఆప్తత, అధ్యయనం, గౌరవం కనిపిస్తాయి అందులో. వీటితోబాటు [అభిమానులని మినహాయిస్తే ] లోకం చలం గారిని చూసే చూపు రజని గారికి తెలుసు, చూడవలసిన చూపు ఎలా ఉండాలో కూడా.
కృష్ణశాస్త్రి గారితో రజని గారి అనుబంధం అతి ప్రత్యేకమైనది. అది ఇరుగుపొరుగుల ఆత్మీయతగా మొదలై ఇద్దరూ కలిసి కూర్చుని పాటలు చేసేవరకూ విస్తరించింది. ‘కృష్ణ రజని ‘ అని తమ గేయాల సంపుటికి పేరు ఉంచారు కృష్ణశాస్త్రి గారు.
ఆకాశవాణిలో సీనియర్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కు బయట కూడా పనిచేశారట. ఆ ఇతర రాష్ట్రాలలో ఏమి చేసి ఉంటారు ? బెంగళూరు కేంద్రం లో పనిచేస్తూ కన్నడం నేర్చేసుకున్నారు, కన్నడం లో పాటలు రాసేటంతగా. వాణీ జయరాం గారు పాడిన ఒక పాట ఆవిడకి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెబుతూండగానే ఆ పాట అందుకుని పాడేశారు రజని. డార్జిలింగ్ దగ్గరి కేంద్రం లో పనిచేస్తూ జయదేవుడి అష్టపదులను కొత్తగా పాడి, పాడించి రికార్డ్ చేశారట. ‘ శతపత్రసుందరి ‘ సంపుటం లో డార్జిలింగ్ చుట్టు పక్కల ప్రకృతి గురించి రాసిన రమ్యమైన గేయం ఉంది.
వ్యక్తిగా ఆయన గొప్పగా విజయవంతమైన వారని ఆ సాయంత్రం అర్థమైంది. కోడలు ప్రసూన గారి తల్లి దూబగుంట ఇందుమతి గారు అక్కడే ఉన్నారు. ఎంతో ఆప్యాయం గా చెబుతున్నారు వారి గురించి, తెల్లారగట్లే లేచి పాడుకుంటారని. ” మీరు ముందే బంధువులా ? ”- అడిగాను. ” లేదు, వీళ్ళ పెళ్ళి అయాకే ” ఆవిడ చెప్పారు. రజని గారి మానవసంబంధాలు అందమైనవి, అవ్యాజమైనవి.మనవలు ఇద్దరూ ఉన్నారు, తాతగారిని ముద్దుగా చూసుకుంటున్నారు. సంక్రాంతి పండగ కోసం బంధువులు వచ్చి ఉన్నారు. వారిలో ఒక అమ్మాయికి రజని గారే పేరు పెట్టారట ‘ తన్వి ‘ అని. మేఘదూతంలో నాయికను అలా సంబోధిస్తారట. అందుకని ఆ పేరు. పరమసౌందర్యవతి అయిన యువతిని వర్ణిస్తూ ‘ తన్వీ శ్యామా ‘ అని మొదలయే ఆ శ్లోకం స్పష్టంగా, పూర్తిగా ఉచ్ఛరించారు రజని. ‘’ యా తత్రస్తయత్ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః ” అన్న చివరి పాదాన్ని తన్మయంగా నొక్కి చెబుతూ.
నా తరపున ప్రసూన గారు అడుగుతున్నారు- ” మీకు ఇష్టమైన కవి ? ”
” ఏ భాషలో ?”
” ఒక్కొక్క భాషలో చెప్పండి, తెలుగులో ? ”
” శ్రీనాథుడు ” [ వారి తండ్రి గారు బాలాంత్రపు వేంకట రావుగారికీ శ్రీనాథుడు ఇష్టమట ]
” ఇంగ్లీష్ లో ?”
” షెల్లీ, కీట్స్ ”
” సంస్కృతం లో ? ”
” కాళిదాసు .కాళిదాసును మరచిపోతే నేను పనికిరాను ” రెట్టించి చెప్పారు. శాకుంతలం లోని ప్రఖ్యాత శ్లోకం” రమ్యాణి వీక్ష్య ” ను ప్రియమారా తెనిగించి స్వరపరచారు.
” బెంగాలీ లో ?”
” టాగూర్ ”
” ఒకరి పేరే చెప్పాలంటే ?”
అనుమానం లేకుండా చెప్పేశారు – ” టాగూర్ ” అని. కాళిదాసును తనలో ఒదిగించుకున్న కవి ఏమో, టాగూర్.
రాత్రి కొంత గడిచింది, ఆయన విశ్రాంతి తీసుకునే సమయమైంది. ఆయన కోసం ఇంటి ఎదురుగా అందమైన కుటీరం వంటిది నిర్మించి ఉంది , అందులోకి నిష్క్రమించారు. ఆయన గ్రంథాలయమంతా అక్కడ ఉంది. పాడనప్పుడంతా చదువుకుంటూనే ఉంటారట. కాసేపటికి , మేము వెళ్ళేందుకని బయటికి వస్తూ ఉంటే వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది. ఆయన నిద్రపోయేదాకా పాడుకునే పాటలు కాబోలు అవి. రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం .
-మైథిలి అబ్బరాజు
కొన్ని పాటలు
[ఓ విభావరీ ]
[మన ప్రేమ – బాలమురళికృష్ణ , శ్రీరంగం గోపాలరత్నం ]
https://www.youtube.com/watch?
[ రవీంద్ర సంగీతం ]
https://www.youtube.com/watch?
[చలం గారి తో ఇంటర్వ్యూ ]
“చూడుమా చందమామా…అటు చూడుమా…”
నేను విజయవాడ, సత్యనారాయణపురం, ఆంధ్రకేసరి టంగుటూరు ప్రకాశం పంతులు మునిసిపల్ హైస్కూలులో చదువుకునేటప్పుడు ఇంగ్లీషు, లెక్కలు బోధించే బీఈడీ మాస్టారు ఒకాయన ఉండేవారు. తొమ్మిది, పది తరగతుల్లో ఆయన మా క్లాస్ టీచర్ కూడా. ఆయన పూర్తిపేరు పి. సుబ్బిరామిరెడ్డి అని జ్ఞాపకం. రెడ్డిగారనే చిన్నపేరుతోనే ఆయన మాకు తెలుసు. ఆయన నటులు కూడా. విజయవాడలో ఆరోజుల్లో ర.స.న. సమాఖ్య అనే ప్రసిద్ధ నాటక సంస్థ ఉండేది. రెడ్డిగారే కాక ఎందరో ప్రసిద్ధనటులు అందులో సభ్యులుగా ఉండేవారు. నటులు కనుక రెడ్డిగారు మాటలో, నడకలో, ఆహార్యంలో మంచి స్టైల్ గా ఉండేవారు.
విషయమేమిటంటే, రెడ్డిగారి క్లాసు చాలా సరదాగా, నవ్వులు, తుళ్ళింతలతో సాగిపోయేది. కౌమారదశకదా… మగ, ఆడపిల్లల్ని గిలిగింతలు పెడుతూ సిగ్గుల దొంతర్లలో ముంచెత్తే సరసమైన జోకులు అప్రయత్నంగా ఆయన నోట జాలువారుతూ ఉండేవి. మధ్య మధ్య సినిమాల ముచ్చట్లూ దొర్లేవి. ఆయన అప్పుడు అన్న ఒక మాట నాకు ఇప్పటికీ గుర్తుండిపోయింది. “మీరు ఏ సినిమా చూడండి…చందమామ ఒక్కసారైనా కనిపించకుండా ఉండడు” అనేవారాయన. అప్పటినుంచి ఏ సినిమా చూస్తున్నా పనిగట్టుకుని చందమామ ఉన్నాడా లేదా అన్నది చూడడం నాకు పరిపాటి అయిపోయింది. ప్రతిసారీ, రెడ్డిగారు చెప్పింది నిజమే సుమా అనుకుని ఆశ్చర్యపోయేవాణ్ణి.
ఆకాశమూ, చంద్రుడు, తారలు, వెన్నెల, పువ్వులు సినీ జగత్తుకే కాక కావ్యజగత్తుకూ తప్పనిసరి నేపథ్యాలు. కవిసమయాలుగా అలంకారశాస్త్రాలలో చోటుచేసుకున్నవి కూడా. కావ్యాలు, ప్రబంధాలలో ప్రకృతివర్ణనలు, విరహంలో ఉన్న ప్రేయసీప్రియులు చంద్రోపాలంభన పేరిట చంద్రుని ఆడిపోసుకోవడాలు సర్వసాధారణం. చాలా సినిమాల్లో చంద్రుని ఉద్దేశించిన పాటలు ఎన్నో ఉన్నాయి. ప్రేయసీప్రియులు ఒకరిపై ఒకరి అనురక్తిని, కోపతాపాలను, ఫిర్యాదులను చెప్పుకోడానికి చంద్రుడే దిక్కవుతూ ఉంటాడు.
ఈ సందర్భంలో నాకు ఎంతో ఇష్టమైన రెండు పాటలు గుర్తొస్తున్నాయి. మొదటిది, ‘సువర్ణసుందరి’ సినిమాలోది. ఆ పాట సముద్రాల పేరుతో ఉన్నా, మల్లాది రామకృష్ణశాస్త్రిగారు రాసారంటారు. “హాయి హాయిగా ఆమని సాగే” అనేది ఈ పాట పల్లవి. అందులో ఒక చరణంలో “చూడుమా చందమామా, అటు చూడుమా చందమామా” అని ప్రేయసి అంటుంది. “కనుమా వయారి శారదయామిని కవ్వించే ప్రేమా” అని ప్రియుడు అంటాడు. “వగల తూలే విరహిణుల మనసున మోహము రేపు నగవుల ఊగిపోవు మది ఉయ్యాలగా జంపాలగా” అని ప్రేయసి అంటుంది. “కనుగవ తనియగా ప్రియతమా కలువలు విరిసెనుగా” అని ప్రియుడు అంటాడు. చంద్రుడు, శారదయామిని(శరత్కాలపు వెన్నెల రాత్రి) విరహిణులు, మోహము, చంద్రోదయంతో కలువలు విరియడం-ఇలా కవితా సామగ్రి అంతా ఇందులో అమిరింది.
రెండో పాట ‘వాగ్దానం’ సినిమాలోది. దాశరథిగారు రాసిందనుకుంటాను. “నా కంటిపాపలో నిలిచిపోరా, నీ వెంట లోకాలు గెలువనీరా’ అని ప్రేయసి కోరడం ఈ పాట పల్లవి. “ఈనాటి పున్నమి ఏనాటి పున్నెమో, జాబిలి వెలిగేను మనకోసమే” నని ప్రేయసి అంటుంది. “ఆ చందమామలో ఆనందసీమలో వెన్నెల స్నానాలు చేయుదమా” అని ప్రియుడు అంటాడు. “మేఘాలలో వలపు రాగాలలో దూరదూరాల స్వర్గాలు చేరుదమా” అని ప్రేయసి అంటుంది. ఆ తర్వాత తనే “ఈ పూలదారులూ ఆ నీలితారలూ తీయని స్వప్నాల తేలించగా” అంటుంది.
కేవలం ఈ రెండు పాటలను ఉదహరించి కవితాజగత్తులో చంద్రుడికి, తారలకు, పూవులకు, వెన్నెలకు ఉన్న ప్రాముఖ్యానికి పూర్తి న్యాయం చేయలేనని నాకు తెలుసు. ఇక్కడ అసలు సంగతేమిటంటే, జార్జి థాంప్సన్ ను, జోసెఫ్ క్యాంప్ బెల్ ను చదివిన అనుభవం నుంచి ఇలాంటి పాటలు వింటున్నప్పుడు, కావ్యాలలోని చంద్రోదయ, చంద్రోపాలంభనలతో సహా ప్రకృతివర్ణనలు గుర్తొచ్చినప్పుడు వీటి మూలాలు ఏ ఆదిమ అస్తిత్వంలోకి వ్యాపించి ఉన్నాయో, వాటి పురాచరిత్ర ఎలాంటిదో, వాటి విశ్వజనీన స్వభావం ఎలాంటిదో స్ఫురించి విచిత్రమైన రహస్యానుభూతికి లోనవుతుంటాను.
ఒక్క మాటలో చెప్పాలంటే, చంద్రుడికి, పువ్వులకు, వెన్నెలకు కావ్యజగత్తులో ఎంత ప్రాధాన్యం ఉందో పురామానవ పరిణామ చరిత్రలోనూ అంతే ప్రాధాన్యం ఉంది. ఆ ప్రాధాన్యం బహుశా పురామానవఅస్తిత్వ చరిత్రనుంచే కావ్యజగత్తుకు విస్తరించింది.
ఈ మాటలు రాస్తున్నప్పుడు ఉన్నపళంగా జార్జి థాంప్సన్ అనే సముద్రంలోకి లంఘించాలని నాకు అనిపిస్తోంది కానీ, నాకు ఎంతో అపురూపం అనిపించే ఆ విషయంలోకి పూర్తిస్థాయిలో వెడితే ఇప్పట్లో పైకి తేలడం కష్టం కనుక వాయిదా వేస్తాను.
***
నలదమయంతులు/ఓడిసస్ కథల నేపథ్యంలో జోసెఫ్ క్యాంప్ బెల్ పేర్కొన్న female principle గురించి ఇంతకు ముందు ప్రస్తావించుకున్నాం. దానిని ‘స్త్రీ సూత్రం’గా తర్జుమా చేసుకుందామని కూడా అనుకున్నాం. ఈ స్త్రీ సూత్రంలో భాగంగానే స్త్రీల మార్మిక లేదా మాంత్రిక ప్రపంచం గురించీ; ఆ ప్రపంచంలో చంద్రుడికీ, సర్పానికీ, పంటకీ ఉన్న ప్రాముఖ్యం గురించీ చెప్పుకున్నాం. అందులోకి ఇప్పుడు ఇంకొంచెం లోతుగా వెడదాం:
ఆదిమ, పురాతన, ప్రాచ్య పురాణగాథలన్నీ ప్రధానంగా దేవత గురించే చెబుతాయి. దేవతతో ముడిపడి ఉన్న ఒక ప్రధాన ఆరాధనారూపం, సర్పం. దేవతకు సర్పం భర్త కూడా. ఇప్పుడు సైప్రస్, ఇజ్రాయిల్, సిరియా, జోర్డాన్, లెబనాన్, పాలస్తీనాలు ఉన్న ప్రాంతాన్ని ‘లెవంట్’ అని పిలుస్తారు. ఇప్పటికి పదివేల సంవత్సరాల క్రితమే లెవంట్ లో నాగదేవతను పూజించేవారు. పారిస్ లోని లౌరే మ్యూజియంలో సబ్బు రాయితో చేసిన ఒక ఆకుపచ్చని కలశం ఉంది. సుమేరులోని లగాష్ అనే నగరరాజ్యాన్ని పాలించే గుడియా అనే రాజు క్రీ.పూ. 2౦25 లో దేవత భర్త అయిన సర్పానికి ఈ కలశాన్ని సమర్పించాడు. దాని మీద ఒక చిత్రం ఉంది. అందులో మధ్యలో ఒకదానితో ఒకటి పెనవేసుకుని ఉన్న రెండు పాములు ఒక దండాన్ని చుట్టుకుని ఉంటాయి. డానికి అటూ, ఇటూ రెక్కలున్న జంతురూప రాక్షసులు నిలబడి ఉంటారు. పెనవేసుకున్న పాములు గ్రీకు దేవుడు హెర్మెస్ చేతిలోని దండాన్ని లేదా పాశాన్ని పోలి ఉంటాయి. హెర్మెస్ మార్మిక జ్ఞానానికి, పునర్జన్మకు చెందిన దేవుడు. ఓడిసస్ కథలో హెర్మెస్ ప్రస్తావన వచ్చింది. ఇతడు ఓడిసస్ కు అనుకూల దేవుడు.
సర్పానికి పాతచర్మం వదిలేసి కొత్త చర్మం ధరించడం ద్వారా తిరిగి నవ యవ్వనాన్ని సంతరించుకునే అద్భుత సామర్థ్యం ఉందని చెప్పుకున్నాం. ఆ విధంగా సర్పం పునర్జన్మకు, మృత్యువు మీద గెలుపుకు ప్రతీకగా ప్రపంచమంతటా గుర్తింపు పొందింది. వృద్ధి, క్షయాల రూపంలో ఇలాంటి సర్పలక్షణమే చంద్రుడికీ ఉంది. చంద్రుడు నీడ లేదా చీకటి అనే పాతచర్మం వదిలేసి, వెన్నెల అనే కొత్త చర్మాన్ని ధరిస్తూ ఉంటాడు. స్త్రీ ఋతుక్రమానికీ, జీవిని పుట్టించే స్త్రీ గర్భానికీ తద్వారా కాలానికీ చంద్రుడు అధిష్టాన దైవం, కొలమానం కూడా. కాలంలోనే పుట్టుక, మరణం సంభవిస్తూ ఉంటాయి. ఆ విధంగా చంద్రుడు చావు-పుట్టుకల రహస్యానికి అధిదైవం. నిజానికి చావు-పుట్టుకలనేవి ఒకే నాణేనికి బొమ్మా-బొరుసు లాంటివి. చంద్రుడు సముద్రపు ఆటుపోట్లకు; పైరుపంటలకు కారణమైన రాత్రి కురిసే మంచుబిందువులకు కూడా ప్రభువు.
ఇక సర్పం జలాధిదేవత. అది నీటిలోనూ, భూమి మీదా కూడా ఉంటుంది. నీటి మీద అలల్లా అది పయనిస్తుంది, చెట్టు కొమ్మల మీంచి వేలాడుతూ ఉంటుంది. అప్పుడది మృత్యుఫలంలా కనిపిస్తుంది. సర్పం ఆకారం స్త్రీ(నోరు) పురుష(మిగతా శరీరం)జననేంద్రియాలను రెంటినీ గుర్తుచేస్తుంది. అలాగే, పాము కాటు అగ్నికీ, నీటికీ సూచన.
సుమేరియాలో అక్కాడియన్ల కాలానికి (క్రీ.పూ. 2350-2150) చెందిన ఒక సీలు మీద ఒక పురుషదేవుడు సింహాసనం మీద కూర్చుని ఉంటాడు. అతని ముందు అగ్నివేదిక ఉంటుంది. అతని చేతిలో అమరత్వాన్ని సూచించే ఒక పాత్ర ఉంటుంది. దాని పైన చంద్రవంక ఉంటుంది. ఆ దేవుడి వెనక పాములు పెనవేసుకున్న చిత్రం ఉంటుంది. ఆ దేవుడి ముందు కిరీటం ధరించిన భక్తుడు నిలబడి ఉంటాడు. అతనే ఆ సీలు జారీ చేసినవాడు. అతని వెనక తల మీదనుంచి పాము వేలాడుతున్న వ్యక్తి ఉన్నాడు. అతని చేతిలో ఒక పాత్ర ఉంది, అతను ఆ దేవుడి ద్వారపాలకుడు.
The Garden of Immortality అనే మరో చిత్రంలో అందరూ స్త్రీలే ఉన్నారు. ఇది కూడా సుమేరియాకు చెందిన చిత్రం. ఇందులో చంద్రవంక, దాని కింద నైవేద్యంగా సమర్పించే ఒక ఫలమూ, చెట్టు ఉన్నాయి. ఓ పండ్ల కొమ్మను పట్టుకుని ఆ ఫలాన్ని స్వీకరిస్తున్న భక్తురాలు ఉంది. మిగిలిన ఇద్దరు స్త్రీలు అధోజగత్తులో ఉండే గుల-బావు అనే దేవత ద్వంద్వఅంశలు. వీరే అనంతరకాలానికి చెందిన గ్రీకు ఐతిహాసిక యుగంలో డిమీటర్, పెరెస్పోన్ అనే దేవతలయ్యారు.
కొన్ని ముఖ్యమైన సూచనలు చేయడానికి జోసెఫ్ క్యాంప్ బెల్ ఈ చిత్రాలను ఉదహరించారు. అవేమిటంటే, ఈ చిత్రాలు సమీప ప్రాచ్యా(Near East)నికి చెందిన ఆదిమ పౌరాణిక వ్యవస్థకు సంబంధించినవి. వీటిలో పురుషదేవుడు, స్త్రీ దేవతా కూడా ఉన్నారు. అయితే ఈ దేవతలు నామరూపాలకు అతీతమైన ఒక సూత్రానికి లేదా తాత్వికతకు ముసుగులు మాత్రమే. ఇక్కడ ఆ తాత్వికతే ప్రధానం,
బైబిల్ దగ్గరికి వచ్చేసరికి ఇది ఎలా తలకిందు లయిందో క్యాంప్ బెల్ వివరిస్తారు. పైన చెప్పిన వాటి ప్రతిరూపాలు అన్నీ బైబిల్ లోనూ కనిపిస్తాయి. అయితే, అవి పురాతన విశ్వాసాలకు భిన్నమైన వాదాన్ని ముందుకు తెస్తాయి. ఉదాహరణకు ఈవ్ కు సంబంధించిన చెట్టు సన్నివేశంలో కూడా ఒక సర్పం ఈవ్ తో సంభాషిస్తుంది. కానీ ఆ సర్పం అప్పటికి వేల సంవత్సరాలుగా పూజ లందుకుంటున్న దేవత అనే సూచన అందులో ఉండదు. పైగా ఈడెన్ తోటలోని చెట్టుకు వేలాడుతున్న జ్ఞానఫలాన్ని ఆదాము తిన్నట్టు తెలిసాక యెహోవా సర్పాన్ని శపిస్తాడు. ఆ తర్వాత ఆదామును తోటనుంచి బహిష్కరించి నేల దున్నుకుని బతకమని చెబుతాడు. ఈడెన్ తోటలోని జీవవృక్షానికి రక్షణగా, రెక్కలున్న పక్షి రూపంలోని సింహాలను, మంటలు చిమ్ముతూ అన్ని వైపులకూ తిరిగే కరవాలాన్ని తోటకు తూర్పున ప్రతిష్టిస్తాడు.
అంటే, పై చిత్రాలు అద్దంపట్టే ఆదిమపౌరాణిక వ్యవస్థలో లేని తప్పు, దైవాగ్రహం, ప్రమాదం, తోటనుంచి బహిష్కరణ, జీవవృక్షానికి కాపలా అనేవి బైబిల్ లో ప్రవేశించాయన్నమాట. ఆదిమ పౌరాణిక వ్యవస్థలో అపరాధభావన అనేది లేకపోవడమేకాక, జ్ఞానవృక్షఫలాన్ని ఎవరైనా అందుకోవచ్చు. అయితే అందుకు తగిన సంకల్పం, సంసిద్ధత ఉండాలి.
The Goddess of the Tree అనే చిత్రంలో ఒక సర్పము, దానికి ముందు ఒక స్త్రీ, ఆ స్త్రీ ఎదురుగా చంద్రవంకరూపంలో కొమ్ము కిరీటాన్ని ధరించిన ఒక పురుషుడు కనిపిస్తారు. వారి మధ్యలో ఒక ఖర్జూరపు చెట్టు, దానికి రెండు ఫలాలు కనిపిస్తాయి. ఆ స్త్రీ సుమేరియన్ దేవత గుల-బావు; ఆ పురుషుడు ఆమె కొడుకు-భర్త అయిన దుముజి. ఆ ఫలాలలో ఒకటి జ్ఞానఫలం, రెండోది, అమరత్వఫలం. ఇది కంచు యుగానికి చెందిన చిత్రం. ప్రయత్నించి ఎవరైనా ఆ రెండు ఫలాలు పొందవచ్చు. బైబిల్ కథలో ఉన్నట్టు ఇందులో ఎలాంటి తప్పు, నిషేధమూ లేవు. ఇది బైబిల్ కు పూర్వపు చిత్రం.
దీనితో పోల్చగల గ్రీసు-రోమన్ చిత్రాలూ కనిపిస్తాయి. Demeter అనే చిత్రంలో కనిపించే ఈ స్త్రీ ఎల్యూసీనియన్ రహస్యాల దేవత అయిన డిమీటర్. ఆమె ఎదురుగా ఉన్న బాలుడు ఆమె కొడుకు ప్లుటూస్. ఒక సూచన ప్రకారం ప్లుటూస్ భూసంపదకు ప్రతిరూపం. ఇంకో విస్తృతార్థంలో నిగూఢత్వ దైవమైన డయోనిసస్ కు ప్రతిరూపం. ఆదిమ పౌరాణికతలోనూ, ప్రాచ్య పౌరాణికతలోనూ ఇటువంటి దేవుళ్ళు చాలామంది కనిపిస్తారు. వీరు విశ్వదేవత(The Great Goddess of the Universe) భర్తలు, కొడుకులు కూడా అవుతారు. చావు రూపంలోనో, లేదా మరో కల్పన ప్రకారం, వివాహ రూపంలోనో వీరు దేవత అక్కున చేరుతూ ఉంటారు. చంద్రుడి వృద్ధి క్షయాలలా, సర్పం పాతచర్మాన్ని విడిచేసి కొత్త చర్మాన్ని ధరించినట్టుగా వీరు చావు-పుట్టుకల చక్రంలో తిరుగుతూ ఉంటారు. ఇందుకు సంబంధించిన దీక్షా తంతులో భాగంగా ఈ మాతృ దేవత ఆరాధకులు తమ ఐహిక జీవితానికి చెందిన కష్ట సుఖాల నుంచి నిర్లిప్తత చెంది రహస్యాధిదేవత అయిన ఆ దేవతను ధ్యానిస్తారు. అనేక జీవుల రూపాలలో మళ్ళీ మళ్ళీ జన్మించే మూల జీవం ఏదైతే ఉందో దానితో మమేకం కావడానికి ప్రయత్నిస్తారు. శోకమూ, మృత్యువూ మాత్రమే తాండవించే ఈ లౌకిక ప్రపంచంలో సమాధిస్థితిని అమరత్వ ప్రతీకగా గుర్తిస్తారు.
స్పష్టత కోసం పైన చెప్పుకున్న వాటి సారాంశాన్ని ఇలా క్రోడీకరిస్తాను:
- చంద్రుడు, సర్పము, చెట్టు, ఫలాలు మొదలైనవి ఆదిమ పౌరాణికతకు చెందిన తాత్వికతలో ముఖ్యమైన ప్రతీకలు. ఇవి స్త్రీ సూత్రానికి చెందినవి.
- తర్వాత రూపొందిన బైబిల్ కూడా వీటిలో కొన్ని ప్రతీకలను స్వీకరించింది. అయితే ఆదిమ పౌరాణికతకు భిన్నమైన అర్థంలో వాటిని చిత్రించింది. ఆదిమ పౌరాణికతలో లేని తప్పు, నిషేధమూ, శిక్ష ఇందులో అడుగుపెట్టాయి.
- ఆదిమ పౌరాణికతకు చెందిన ప్రతీకలు, తాత్వికత తర్వాతి కాలపు గ్రీసు-రోమన్ చిత్రాలలోకి కూడా విస్తరించాయి. అయితే దేవతల పేర్లు మారాయి. ఇవే ప్రాచ్య పౌరాణికతలో కూడా కనిపిస్తాయి. ఇందులో స్త్రీ సూత్రం ఉంది. Demeter చిత్రం గురించిన వివరణలో మనదేశంలో నేటికీ ఉన్న అమ్మవారి ఆరాధన లక్షణాలను గమనించవచ్చు.
క్యాంప్ బెల్ ప్రకారం చారిత్రకంగా జరిగింది ఏమిటంటే, క్రీ.పూ. ప్రథమ సహస్రాబ్ది నాటికి, మాతృస్వామ్యానికి చెందిన నూతన శిలా యుగ, కంచు యుగ నాగరికతలు వర్ధిల్లుతున్న భూముల్ని ఇనప యుగానికి చెందిన పితృస్వామిక హిబ్రూలు ఆక్రమించుకున్నారు. వారు మాతృస్వామిక పురాణగాథల్నే తీసుకుని వాటిపై పితృస్వామికతను ఆపాదిస్తూ తలకిందులు చేశారు. అందుకే వాటికి ఎంత గట్టిగా పితృస్వామికతను అన్వయించి చెప్పినా, బైబిల్ లోని మౌలిక ప్రతీకల అన్వయంలో అంతర్గతంగా ఉన్న అస్పష్టత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. చిత్రరూపంలో అవి హృదయానికి ఒక అర్థాన్ని అందిస్తుంటే, వాక్య రూపంలో మెదడుకు సరిగ్గా దానికి వ్యతిరేకమైన అర్థాన్ని అందిస్తుంటాయి. క్రైస్తవం, ఇస్లాం, జుడాయిజం మూడూ పాత నిబంధన వారసత్వాన్ని పంచుకుంటున్నవే కనుక మూడింటిలోనూ ఈ లక్షణం కనిపిస్తుందని క్యాంప్ బెల్ అంటారు.
ఒక్క బైబిల్ లోనే కాదు, ఇలా అర్థం తలకిందులు కావడం గ్రీసు పౌరాణికతలోనూ కనిపిస్తుందంటారాయన. బహుశా ఈ ఛాయలు మన దగ్గరా కనిపిస్తాయి.
మరికొన్ని విశేషాలు తర్వాత…
-కల్లూరి భాస్కరం
వేటూరి కిలికించితాలు!
(జనవరి 29: వేటూరి పుట్టిన రోజు )
సినిమాల్లో, నాటకాల్లో దృశ్యరూపంలోనో, సంభాషణల్లోనో చెప్పలేని గాఢమైన భావాలను పాటల రూపంలో చెప్పేవారు. కాబట్టి పాటలో కథ సందర్భమూ, పాత్రలూ, కథ పోకడని బట్టి సాహిత్యం రాసిచ్చేవారు. కాలక్రమేణా కథల్లో సారం తగ్గిపోయి పాటలయొక్క అవసరంలేకపోయినా పూర్వం ఉన్న ఆచారాన్ని ఉల్లంఘించే సాహసం చెయ్యలేక కొనసాగించారు. పాటలకోసం ఐదారు సందర్భాలు సృష్టించడం మొదలైంది. సహజమైన సన్నివేశాలకు రాసేరోజుల్లో కవికి కథే ప్రేరణనిచ్చేది. కథలోని బలాన్ని బట్టి సన్నివేశానికి అమరేలా కవి తన ప్రతిభను చూపిస్తూ సాహిత్యం అందించేవాడు. కవి రాసిన సాహిత్యానికి సంగీత దర్శకులు బాణీకట్టేవారు.
సృష్టించిన సన్నివేశాలు కవినెలా ప్రేరేపిస్తాయి? మెల్లమెల్లగా సంగీత దర్శకుల ఆధిక్యత మొదలైంది. మ్యూజిక్ డైరెక్టర్ లు ట్యూన్ లు (బాణీలు) ఇచ్చేవారు కవులు దానికి తగినట్టు పదాలు కూర్చేవారు. ఛందోబద్దంగా పద్యాలల్లే ప్రతిభ ఉన్నా సంగీత దర్శకులిచ్చే గజిబిజి ట్యూన్స్-లో పదాల్ని అమర్చడం అందరికీ సాధ్యంకాలేదు. చతురత ఉన్న కొందరు కవులు తమ సొంత ప్రతిభనూ, చెయ్యదలచిన ప్రయోగాలనూ, చమత్కారాల్నూ ఆ ట్యూన్-లో ఇమిడ్చేవాళ్ళు. బలమైన కథలున్న రోజుల్లో సినిమాలకి పాటలు రాసిన కొందరు భాషా ప్రవీణులు కథలు నీరసపడిపోయే రోజులకల్లా నీరుగారిపోయి పాటలు రాయడం మానుకున్నారు.
వేటూరి సుందరరామమూర్తి సినిమాల్లోకి ప్రవేశించినది ఆ సంధి కాలంలో. సరైన సన్నివేశం వస్తే ఒకపక్క సారవంతంగా రాసిస్తూనే మరో పక్క అర్థంపర్థంలేని సన్నివేశాలకు తన చమత్కారాన్నీ, భాషా ప్రావీణ్యాన్ని పాటల్లో నింపుతూ సినిమా పాటల్ని కొత్త మార్గంలోకి నడిపాడు. ఆ కాలంలో ఈ మార్పు ఒక్క తెలుగు సినిమా పాటలకే కాదు, మిగిలిన భాషల సినీ సాహిత్యానికీ వర్తించింది.
ఎలాంటి ట్యూన్ ఇచ్చినా ఆశువుగా, అతివేగంగా, కొత్తగా, చమత్కారంగా, చిలిపిగా రాయగలిగినందువలనేమో వేటూరికి 1970లలో ఇబ్బడిముబ్బడిగా అవకాశాలొచ్చాయి. వేటూరి ఒక ట్రెండ్ సెట్టర్ అయ్యాడు!
అట్లాంటి రోజుల్లో, లోతైన కవిత్వాన్నీ, భాషా ప్రతిభనీ ప్రదర్శించే అవకాశం కల్గిన ఓ అరుదైన సన్నివేశం ఇది. ఆదిత్యా 369 సినిమాలోని ఆ సందర్భం ఏమంటే, “హీరో, హీరోయిన్ లు టైమ్ మెషిన్ ఎక్కి వెనక్కి ప్రయాణిస్తారు. వాళ్ళు కృష్ణదేవరాయలు పరిపాలించిన పదహారో శతాబ్దానికి చేరుకుంటారు. విజయనగర సామ్రాజ్యపు ఆస్థాన నర్తకి నాయకుడి మీద మనసుపడుతుంది. వశపరుచుకుని మోజు తీర్చుకునే ప్రయత్నం చేస్తుంది. ఆ ప్రయత్నాన్ని చూసిన హీరోయిన్ అపార్థం చేసుకుని ఉడికిపోతుంది. నర్తకిని వదిలించుకుని జరిగింది చెప్పి హీరోయిన్ కోపాన్ని తీర్చాలి”. ఈ సన్నివేశానికి పాట రాయడంలో రచయితకు ఏం సవాలు ఉంటుంది అనుకోవచ్చు! కథ నడుస్తున్నది పదహారవ శతాబ్దం.
ఇచ్చిన ట్యూన్ కి ఆ నాటి భాషలోనూ నేటి భాషలోనూ పాట రాయాలి. ఒక పల్లవి, రెండు చరణాలు. పల్లవి మూడుసార్లొస్తుంది. మొదటిసారి ఆస్థాన నర్తకి పాడుతుంది, రెండోసారి హీరో పాడుతాడు, మూడోసారి హీరోయిన్ ఒకలైను, హీరో ఒకలైను పాడుతారు. ఒకే పల్లవి లింగభేదంలేకుండ, ముగ్గురికీ సరిపోవాలి. భావపరంగానూ, భాషాపరంగానూ పల్లవికి న్యాయం చెయ్యాలి. మొదటి చరణం పదహారవ శతాబ్దానికి తగినట్టుగానూ, రెండో చరణం ఇరవయ్యో శతాబ్దానికి చెందిన నాయకుడి భాషలోనూ ఉండాలి.
పల్లవి
నెర జాణవులే వరవీణవులే కిలికించితాలలో
జాణవులే మృదుపాణివిలే మధుసంతకాలలో
కన్నులలో సరసపు వెన్నెలలే
సన్నలలో గుసగుస తెమ్మెరలే
మోవిగని మొగ్గగని మోజు పడిన వేళలో
చరణం 1
మోమటు దాచి, మురిపెము పెంచే లాహిరిలో
మూగవుగానే మురళిని ఊదే వైఖరిలో
చెలి వంపులలో హంపికళా ఊగే ఉయ్యాల
చెలి పయ్యెదలో తుంగ అలా పొంగే ఈ వేళ
మరియాదకు విరిపానుపు సవరించవేమిరా
చరణం 2
చీకటి కోపం చెలిమికి లాభం, కౌగిలిలో
వెన్నెల తాపం వయసుకు ప్రాణం, ఈ చలిలో!
చెలి నా రతిలా హారతిలా నవ్వాలీవేళ
తొలి సోయగమే ఓ సగము ఇవ్వాలీవేళ
పరువానికి, పగవానికి ఒక న్యాయమింక సాగునా
కొన్నిపదాలకు అర్థాలు :
జాణ = నేర్పెరిగిన వ్యక్తి, నేర్పరి
వరవీణ = వరములు పొందిన వీణ
కిలికించితం = తెప్పరిల్లిన స్థితి; ఎదురుచూడనివేళ ప్రియుడు కౌగిలించుకుంటే ప్రియురాలు నిశ్చేష్టురాలయ్యే స్థితి
మృదుపాణి – మృదువైనచేతులుగల వ్యక్తి
సన్న = (కను) సైగలు; జాడ; సంజ్ఞ; సిగ్నల్ – (అన్నమయ్య కీర్తనల్లో విరివిగా వాడబడిన మాట ఇది)
మోవి = పెదవి
తుంగ – హంపీనగరంలో ప్రవహించే నది – మరో అర్థం : ఒకరకమైన (దుంప) గడ్డి
విరిపానుపు – పువ్వుల పడక/మంచం
జాణ అంటేనే నేర్పరి, “నెర” అని విశ్లేషణం కూడా జతచేసి చెప్తున్నాడంటే “అన్నిటా నేర్పరి” – జాణతనం తొణికిసలాడే వ్యక్తి అని. చాలా మందికి కలిగే అనుమానం “జాణ” అని మగవారిని అంటారా అని? జాణ రెండులింగాలకూ సరిపడే పదం కాబట్టి ఈ పదాన్ని చక్కగా వాడుకున్నాడు వేటూరి! పూర్వం “నరవరా కురువరా” పాటలో ఇలాంటొక సన్నివేశంలో సుముద్రాల గారు కూడా “జాణ” అన్న పదం వాడారు.
పాటలోని భావం (క్లుప్తంగా):
శృంగార చేష్టలు చేసి, వరవీణపలికే స్వరాలులాంటి తీయని మాటలు చెప్పి పులకింపజేసే నేర్పరివి. మెత్తటి చేతులుగలవాడివి / (దానవి). కన్నుల్లో సరసపు వెన్నెల కాస్తుందా అనిపించేలాంటి చూపులు, కనుసైగలలో గుసగుస సందేశాల తెమ్మెరలు! — ఈ భావం కవ్వించే నర్తకి పాడినా సరిపోతుంది, అలిగిన ప్రేయసీ, ప్రియులు పాడుకున్నా సరిపోతుంది.
నర్తకి కవ్విస్తూ పాడే చరణంలో రెండు లైన్లలో హీరో తనని ఎందుకాకర్షించాడో చెప్తుంది. తర్వాత తన అందం గురించి, తన స్థితి గురించీ చెప్తుంది. నాటి కళాసంపదకి నిలయమైన హంపికళంతా తన సొగసుల్లోనే ఉందనీ, వారి రాజ్యంలో సాగే తుంగా నది పొంగులే తన పయ్యెదలో పొంగులనీ పాడుతుంది! (ఎండు బీడునేలపైన ఒక వర్షం పడగానే మరసటి రోజుకల్లా తుంగ దుంపలు మట్టిని చీల్చుకుని పైకి మొలకెత్తుతాయి, అవి గోపురాల్లా కనిపిస్తుంటాయి). ఆడది కోరి వస్తుంటే చిరాకుపడి వెళ్ళడం మర్యాదకాదు. కనీసం ఈ పూలపానుపైనా సవరించి నాలుగు మాటలు చెప్పి వెళ్ళరాదా అని గారాలు పోతోంది. గమనిస్తే, ఇక్కడ వేటూరి వాడిన ఉపమానాలు రెండూ (హంపి కళ, తుంగ నది) విజయనగర సామ్రాజ్యానికి చెందినవే. చక్కగా సాహిత్యంలో ఒదిగేవే!.
ఇక రెండో చరణంలో అలిగిన తన ప్రేయసిని ముద్దుచేసుకుంటున్నాడు హీరో. “ఏంటి ప్రియా అలిగావా? నీకు తెలియదేమో చీకట్లో అలిగిన ప్రేయసిని బతిమాలుతూ, ప్రాధేయపడుతూ ఉంటే వలపు ఇంకాస్త రసవత్తరం అవుతుంది. వెన్నెల సొగసూ, చలి రాత్రీ కలిసి తాపాన్ని పెంచేస్తూ వయసుకు మరికాస్త ఉద్వేగాన్నిస్తుంది. ఉడుక్కోవడం ఆపి నా మన్మథ సామ్రాజ్యపు రతీదేవిలా, నా వలపు కోవెలలో హారతిలా నవ్వమని అడుగుతున్నాడు. కోపాన్ని పగవాళ్ళతో ప్రదర్శించాలిగానీ పరువంలో ఉన్న చెలికాడితో కాదు” అని అంటున్నాడు.
ఈ పదాలన్నీ ఎక్కడికక్కడ ఎంత చక్కగా నప్పాయో గమనిస్తే, వేటూరి తనకు తాను ఒక ముద్ర ఎలా ఏర్పరచుకున్నాడో తెలిసిపోతుంది.
-అవినేని భాస్కర్
మౌనం సంధించిన బాణం కామన్ మాన్: ఆర్కే లక్ష్మణ్
అప్పటికి ఆర్కే లక్ష్మణ్ గురించి నాకు తెలిసింది చాలా తక్కువ. మాల్గుడి డేస్ రచయిత ఆర్కే నారాయణ్ సోదరుడని మాత్రమే తెలుసు.. ఆదిలాబాద్ జిల్లా గ్రామీణ వాతావరణం నుండి వెళ్ళిన నేను జర్నలిజం లో చేరిన తర్వాతే హిందూస్తాన్ టైమ్స్ పత్రిక గురించి విన్నాను. మా శర్మ గారు ఇంటర్ వ్యూ చేయడానికి సిద్దం అవ్వమన్నారు. ఇంటర్వ్యూ చేయడం కూడా మాకు కొత్త. మా లైబ్రరీలో ఉన్న హిందూస్తాన్ టైమ్స్ పేపర్స్ తిరగేసి అయన కార్టూన్స్ చూసి కొంత అవగాహన చేసుకొని ఇంటర్ వ్యూ కి సిద్దమయ్యాం. జర్నలిజం అండ్ మాస్ కమ్యునికేషన్ విద్యార్థులుగా మేం చేసిన మొదటి ఇంటర్వ్యూ ఆర్కే లక్ష్మణ్ దే.
అప్పుడు మేం ఆయనతో చేసిన ముచ్చట్ల జ్ఞాపకాలు మీ కోసం ….
*కామన్ మాన్ సృష్టి కి కారణం
*ప్రతి రోజు కొత్త దనంతో ఎలా జనం ముందుకు రాగలుగుతున్నారు. అసలు అంత వైవిధ్యంతో కూడిన కార్టూన్స్ కు సరుకు ఎక్కడి నుండి వస్తుంది ?
* మీ వ్యంగ్య చిత్రాలతో ప్రముఖ నేతలందరిపై విమర్శనాస్త్రాలు సంధిస్తూ ఉంటారు కదా .. ఆ రాజకీయ నాయకుల కేరికేచర్ల వల్ల ఇబ్బందులు ఏమైనా ఎదుర్కొన్నారా ..
*మీరు హిందూస్తాన్ టైమ్స్ నుండే కార్టూనిస్టు గా జీవితం ప్రారంభించారా?
– మొదట్లో కన్నడ పత్రికకి పనిచేశాను. ( పేరు చెప్పారు. కాని నాకది గుర్తులేదు )
* మీకు స్ఫూర్తినిచ్చే కార్టూనిస్టు ఎవరు ?
– ఒక బ్రిటిష్ కార్టూనిస్ట్ ని నేను చాలా అభిమానిస్తాను.
( దాదాపు 30 ఏళ్ళ క్రితం నా జ్ఞాపకాల మడతల్లో దాగిన విషయాలు ఇప్పుడు కొన్ని తుడుచుకుపోయాయనుకుంటా … )
సామాన్యుడి కరవాలం ఆర్కే లక్ష్మణ్!
కొంతమంది కాలగర్భంలో కలిసిపోరు. కాలం చంకనెక్కి కూచుంటారు. కొన్ని తరాల పాటు బతికే ఉంటారు.
పౌరాణికాలు అంటే ఎన్టీయారు, అందమైన అమ్మాయి అంటే బాపుగారులాగే కార్టూన్ అంటే ఆర్కే లక్ష్మణే. ఇంత వయసొచ్చి, ఇంత పెద్ద పేపర్లో పని చేస్తున్నా కొన్ని సందర్భాల్లో “నేను పేపర్ కార్టూనిస్టుని” అని పరిచయం చేయగానే… “అంటే ఆర్కే లక్ష్మణ్ లాగానా.. నాకు ఆయన బాగా తెలుసు” అన్న వ్యక్తుల్ని అనేకసార్లు చూశాను. కార్టూనిస్టుకు పర్యాయపదం ఆయన. కార్టూనిస్టుకు ఉండాల్సిన అన్ని లక్షణాలు.. పరిశీలన, విషయ పరిజ్ఞానం,
వ్యంగ్యం, కరవాలం లాంటి రేఖలు… అన్నింటికీ మించి రాజకీయాల మీద, రాజకీయ నాయకుల మీద contempt (తూష్ణీభావం) పుష్కలంగా కలిగిన సంపూర్ణ వ్యంగ్య చిత్రకారుడు.
కార్టూనిస్టుగా ఆయన నా గురువు అని చెప్పను కానీ, కార్టూన్ ఎలా ఉండాలో ఆయన్ను చూసి అర్థం చేసుకున్నా. ఒకరోజు ఆలస్యంగా వచ్చే Times of Indiaలో ఆయన తాజా కార్టూన్ ను అపురూపంగా చూసుకున్న సందర్భాలు ఎన్నో.
ఇందిరాగాంధీ, రాజీవ్ గాంధీ మీద ఈ రెండు కార్టూన్లు ఒక రకంగా ఆయన ధోరణిని ప్రతిబింబిస్తాయి. ఇందిర మీద కార్టూన్ చూడండి. ఆ నిలబడ్డ ఏబ్రాసి ముఖాలు, ఇందిరా గాంధీ posture ఒక అత్యంత ప్రతిభావంతుడికి మాత్రమే సాధ్యం.
ఇప్పుడవి అనేక కార్టూన్లలో ఒకటి అనిపించొచ్చు. కానీ, అది అచ్చులో వచ్చిన సందర్భం, timing పడి పడి నవ్వించాయి.
50కి పైగా ఏళ్ళ పాటు నిరంతరంగా ఆయన చేసిన పనిని తూకం వేయడం ఇక్కడ సాధ్యం కాదు. ఆయన గురించి నాకున్న complaint.. యాభై ఏళ్ళ పాటూ ఒకే ధోరణిలో కార్టూన్లు వేయడమే. అందరి జీవితాల్లో లాగే కళాకారుడి జీవితంలో ఎత్తుపల్లాలుంటాయి. అనుభవాలు, చదువు, సమాజం కళాకారుడి కళ మీద తప్పకుండా ప్రభావం చూపిస్తాయి. వాటి తాలూకు ఎదుగుదలో, క్షీణతో కళలో కనపడి తీరుతాయి.
ఆర్కే లక్ష్మణ్ లో ఆ మార్పు దాదాపు శూన్యం. ఆయన అభిప్రాయాలు కానీ, ధోరణి కానీ మారలేదు. అందుకే ఆయనను అర్థం చేసుకోవడం కష్టం కాదు. నాకీ కార్టూన్ అర్థం కాలేదు అని ఎవరూ అన్న సందర్భమే లేదు. ఆయన బలహీనత అని నేననుకున్నదే ఆయన గొప్ప బలం. ఆయన సామాన్యుడి కార్టూనిస్టు.
-సురేన్ద్ర
పెరుమాళ్, పెరుమాళ్!
ఓ వారం అవుతోంది. పెరుమాళ్ మురుగన్ గురించి రాద్దామని. చచ్చిపోయిన పెరుమాళ్ గురించి. కానీ, ఎంతకీ పెన్ను ముందుకు కదలడం లేదు. నిస్సత్తువ వెనక్కి గుంజుతున్నది. రక్తమాంసాలతో, గుండెలో ప్రాణంతోవున్న పెరుమాళ్ బతికే వున్నాడు కావచ్చు. కానీ, రచయిత పెరుమాళ్ చనిపోయాడు. అలా అని, పెరుమాళ్ ప్రకటించి వున్నాడు. తను రాసిన పుస్తకాల్ని వెనక్కి తీసుకున్నాడు.
మనగురించి లేదా మనలాటి వాళ్ళ గురించి రాసిన ఆ రచయిత పెరుమాళ్ చనిపోలేదు. హత్యకు గురయ్యాడు. అంతకంటే దారుణం ఏంటంటే, మనం చూస్తుండగానే చంపేశారు. మనలో కొందరు పెరుమాళ్ కి మద్దతు చెప్పి వుండొచ్చు. ఇదేం అన్యాయం అని అరచి వుండవచ్చు. కానీ, మన మద్దతు మన అరుపులు హంతకుడి చేతుల్ని భయపెట్టలేక పోయాయి.
పెరుమాళ్ లాటి రచయితలకే అభద్రత ఈ సమాజంలో. ఈమధ్య కాలంలో దాడులు ఎదుర్కొన్న రచయిత ఒక్క పెరుమాళే కాదు. పుదుక్కోటై లోనే కణ్ణన్, దురై గుణ అనే ఇద్దరు రచయితలు కూడా భౌతిక దాడులకు గురయ్యారు. బూతు రచనలు చేసిన వాళ్ళు, పులిహార సాహిత్యం సృష్టిస్తున్న వాళ్ళు, జవసత్వాలు లేని, రంగూ రుచీ వాసనాలేని పుస్తకాలు రాస్తున్నవాళ్లు హాయిగా వర్ధిల్లుతున్నారు. జుగుప్సా సంస్కృతికి చెందిన సాహిత్యకారులు సత్కారాలు అందుకుంటున్నారు. విపరీతంగా డబ్బు సంపాదిస్తున్నారు. వాళ్ళకి ఎటువంటి హానీ జరగదు. వాళ్ళు గొప్ప సృజనకారులుగా చలామణీ అవుతారు. కానీ జీవితాన్ని జీవితంగా చూపించిన, అపురూమైన సంక్లిష్టమైన సంబంధాల్ని చిత్రీకరించిన, చరిత్ర నేపథ్యంలో కలలాటి నిజాన్ని చెప్పిన పెరుమాళ్ మాత్రం ఉరికంబం ఎక్కాల్సివస్తున్నది.
సత్యాన్ని చెప్పినందుకు, సృజనాత్మక వ్యక్తీకరణ వున్నందుకు హత్యకు గురైనవాళ్లు, బహిష్కరణకు గురైన వాళ్ళు, వేధింపులకు గురైన వాళ్ళు ఎంతమందిలేరు చరిత్రలో. సోయెంకా, ఎమ్ ఎఫ్ హుస్సేన్, తస్లీమా నస్రీన్, రష్దీ, చెరబండ రాజు – ఇలా ఎంతమంది లేరు రాజ్యం చేతిలో, రాజ్యం అండతో చెలరేగిపోయే మౌడ్యుల చేతిలో!
ఇంతకీ, పెరుమాళ్ రాసిందేమిటి? ‘అర్ధ నారీశ్వరుడు’ అన్న నవల. ఏదో కపోలానికి ఆదాటుగా తట్టిన ఏదో ఒక ఇతివృత్తంతో కాదు. ఓ అరవై డెబ్బై ఏళ్లక్రితం వుండిన ఓ జంట గురించి. వాళ్ళ చుట్టూ కనిపిస్తూ, కనిపించకుండా వున్న జీవితం గురించి, దాని పరిష్వంగం గురించి. పిల్లలు కలగని మహిళ ఒకానొక సమూహంలో మరొకరితో జతకట్టి సంతానం కోసం ప్రయత్నించగలిగే ఒకానొక సాంఘిక వెసులుబాటు గురించి.
ఇది నచ్చలేదు మౌడ్యులు కొందరికి. అది కూడా మతమే ప్రధానమైన ఎజెండాగా వున్న ఓ భావజాలం అధికారంలోకి వచ్చేక. పెరుమాళ్ పై వచ్చిన వత్తిడి అంతా ఇంతా కాదు. చిత్రమేమిటంటే, బ్రాహ్మిణీకల్ వ్యవస్థపై తీవ్రమైన వ్యతిరేకత కనబరిచిన తమిళనాడులో ఈ వత్తిడి రావడం. ఇక తమిళనాడులోనే ఈ పరిస్తితి వచ్చిందంటే ఇక సాంఘికంగా ఎంతో వెనుకబడిన రాష్ట్రాల్లో మత మౌఢ్యం రెచ్చిపోతుంది.
ఫ్రాన్సులో, సిరియాలో జరుగుతున్న అన్యాయాలపై ‘నేను చార్లీని’ అని తనివితీరా సాలిడారిటీని ప్రకటించే వాళ్ళు, పత్రిక స్వేచ్ఛ హననం గురించి, భావప్రకటనా హక్కు గురించి పోరాడే వాళ్ళు పెరుమాళ్ గురించి ఎందుకో పట్టించుకోరు. ఆయనెవరో, ఆయనను ఎందుకు రక్కసి మూకలు వేటాడుతున్నారో పట్టించుకోరు. లేదా, కావాలనే ఉపేక్షిస్తారు. ఎందుకంటే, పెరుమాళ్ తెల్లగా లేడు. ఆయన రాసింది ‘మన’ గురించి కాదు. ఎక్కడో సమాజపు అట్టడుగుపొరల్లో వున్నవాళ్ల గురించి రాసేడు. ఆయనపై దాడి చేస్తున్నది ‘మన’ వాళ్ళు. కాబట్టి ‘I am Charlie’ అని మనం గొంతెత్తి అరుస్తాం గానీ, అదే సమయంలో మన పెరట్లో ‘నేను చచ్చిపోతున్నా రచయితగా,” అని అరుస్తున్న, ఏడుస్తున్న, భయపడుతున్న, కలవరపడుతున్న పెరుమాళ్ మనకి కనబడడు.
మన కళ్ళు, మన చెవులు, మన మనసు, మన ఊహలు – అన్నిటిని ‘వాళ్ళు’ నియంత్రిస్తున్నారు. ఇది స్పష్టంగా రెండు విభిన్నమైన ప్రపంచాల వ్యవహారం. ఈ రెండు ప్రపంచాల అవసరాలు, విలువలు, బలాలు, ఊహలు, ప్రయోజనాలు భిన్నమైనవి. చిత్రంగా, మన ప్రపంచాలకు భిన్నమైన అవసరాల గురించి, ప్రయోజనాల గురించి, ఊహల గురించి, విలువల గురించి మనం పోరాడుతున్నాం. రెండు ప్రపంచాల్లో కేవలం ఒక ప్రపంచం దగ్గర మాత్రమే అన్ని వనరులు, సమాచార, సాంస్కృతిక ప్రసార సాధనాలు వున్నాయి. అవి కేవలం తమ ప్రపంచంలోని వారిని మాత్రమే కాక, అవతలి ప్రపంచంలో వాళ్ళను కూడా తీవ్రంగా ప్రభావితం చెయ్యగలవు.
ఫ్రెంచి పత్రిక చార్లీ హెబ్డే మీద జరిగిన ఆటవికమైన, అమానుషమైన దాడిని ప్రపంచమంతా ఖండిస్తుంది. ఖండించాలి కూడ. కానీ దురదృష్టవశాత్తూ మన ఖండన పాశ్చాత్య ప్రసార మాధ్యమాల ప్రభావం వల్లనే. గాజా పిల్లల్ని ఇజ్రాయిల్ హననం చేసినపుడు మనకి ఇంత కోపం రాలేదు. ‘I am Gaza kid’ అని ఆవేశంతో ఊగిపోలేదు. ఎందుకంటే, పాశ్చాత్య ప్రసార సాధనాలు పూనకంతో ఊగిపోలేదు. పిల్లల రక్తం కళ్ల చూసిన ఇజ్రాయిల్ ప్రధాని పారిస్ వీధుల్లో సిగ్గులేకుండా నిరసన ప్రదర్శనలోకి జొరబడితే కూడా మనకి కోపం రాదు.
పెరుమాళ్, కణ్ణన్, గుణ – మన ప్రపంచానికి చెందిన మనుషులు. మట్టి మనుషుల వేదన గురించి, నలిగిపోతున్న జీవితం గురించి, వాళ్ళు పడుతున్న హింస గురించి, వాళ్ళ సంతోషాల గురించి, అంతరించిపోతున్న వాళ్ళ చరిత్ర గురించి – అంటే మన గురించి – ఎంతో ప్రేమతో రాస్తున్నారు. అది మన సొంత ప్రపంచం గురించి.
అందుకే, పెరుమాళ్ లో చచ్చిపోయిన రచయితను మళ్ళీ బతికించుకోవాలి. పెరుమాళ్ లాటి రచయితలు చనిపోకుండా చూసుకోవాలి. మన ప్రపంచాన్ని మనం కాపాడుకోవాలి. అందుకే, I am Perumal.
*
‘స్త్రీ సిలబస్’ లో లైంగికవిద్య…
స్త్రీ ప్రపంచం రహస్యమే కాదు, మాంత్రికం కూడా!
ఈమధ్య దగ్గరి బంధువుల ఇంట్లో పెళ్లి అయినప్పుడు, అబ్బాయిని పెళ్లికొడుకును చేస్తున్నాం, రమ్మంటే వెళ్ళాను. అక్కడ జరుగుతున్న తంతూ, కనిపించిన సన్నివేశాలూ కొంచెం ఆశ్చర్యం కలిగించాయి. మామూలుగా అయితే పెళ్లికొడుకును, పెళ్లికూతురును చేయడం తంతు అబ్బాయి, అమ్మాయిల ఇళ్ళల్లో విడివిడిగా జరుగుతుంది. కానీ ఈ కార్యక్రమంలో పెళ్లికూతురు, ఆమె తరపువారు కూడా పాల్గొన్నారు.
పెళ్లికొడుకును చేయడం పూర్తయింది. ఆ తర్వాత పెళ్లికూతురును తీసుకొచ్చి అబ్బాయి పక్కన కూర్చోబెట్టారు. ఇక ఆడవాళ్ళ హడావుడి ప్రారంభమైంది. ‘చందనబ్బొమ్మ…చందనబ్బొమ్మ’ అంటూ ఓ పెద్దావిడ తొందరపెట్టింది. పెళ్లి వస్తువుల్లోంచి ఓ చెక్కబొమ్మ తీసుకొచ్చి ఇచ్చారు. కొందరు ఆడవాళ్ళు కలసి వధూవరుల ముందు ఒక చీర ఉయ్యాల కట్టారు. అందులో బొమ్మను ఉంచి పెళ్లికూతురు, పెళ్ళికొడుకు చేత ఊపించారు.
పద్ధతుల్లో తేడా ఉండచ్చు కానీ, అన్ని ప్రాంతాల పెళ్లితంతుల్లోనూ ఈ చందనబ్బొమ్మ పాత్ర తప్పనిసరిగా ఉంటుంది. శోభనం రోజున వధూవరుల మధ్య గంధర్వుడు తిష్టవేశాడని సంకేతిస్తూ ఓ చందనబ్బొమ్మను ఉంచుతారని ఇంతకుముందు ఒక వ్యాసంలో చెప్పుకున్నాం. దాని అంతరార్థాన్ని సూచించే రాంభట్ల, తిరుమల రామచంద్ర గార్ల వాక్యాలను, కొన్ని పెళ్లిమంత్రాలను ప్రస్తావించుకున్నాం. ‘చందన’బ్బొమ్మ పేరులోనే ‘గంధ’ర్వ సూచన ఉంది.
అయితే, పైన జరిపిన తంతు మరో రకం. అది పెళ్లి అయిన తర్వాత బిడ్డ పుట్టడాన్ని సూచించే తంతు. ఇక్కడ చందనబ్బొమ్మ అన్నా, దానిని ఓ కొయ్యబొమ్మగానే తీసుకుందాం. ఇందులో విచిత్రం ఏమిటంటే, పెళ్లి కాకుండానే బిడ్డ పుట్టడం తంతును జరిపించేయడం!
పెళ్లి తంతు నిజంగానే ‘తంతు’గా మిగిలిపోయిందనిపించింది, ఇది చూడగానే! పద్ధతులు, ముందు వెనకలు పాటించకపోయినా తంతు జరిపించామనిపిస్తే చాలు! చెక్కబొమ్మ అందుబాటులో లేకపోతే ప్లాస్టిక్ బొమ్మతోనే పని జరిపించేస్తున్నారు. అదలా ఉంచితే, ఏ తంతు ఎందుకు జరుపుతున్నారో, దాని చరిత్ర ఏమిటో, ఎన్ని వేల సంవత్సరాలుగా అది తరం వెంట తరానికి సంక్రమిస్తూ వస్తోందో, మనకు తెలియకుండానే దానికి మనం ఎలా వాహికలమవుతున్నామో, కనిపించని ఓ పురాతన వృక్షపు వేళ్ళలా; మానవ అస్తిత్వపు వేళ్ళు అందులో ఎంత లోతుగా పాతుకుని ఉన్నాయో-అక్కడున్నవాళ్ళలో ఎవరికైనా తెలుసా అనిపించింది.
ఒక్క మాటలో చెప్పాలంటే, ఆయా తంతుల రూపంలో మనం (ముఖ్యంగా ఆడవాళ్ళు) మనిషి అస్తిత్వ చరిత్రను అవిచ్ఛిన్నం చేస్తున్నాం. వేల సంవత్సరాల గతానికీ, వర్తమానానికీ మధ్య వారధి అవుతున్నాం. చరిత్రను అస్థిపంజర ప్రాయంగానే అయినా భద్రంగా మోసుకొస్తున్నాం. అయితే అలా మోసుకొస్తున్న విషయం మనకు తెలియదు!!
తెలియకపోగా మనం ఇంకొకటి కూడా చేస్తున్నాం. ఇలాంటి తంతు వెనుక తర్కాన్ని, హేతుబద్ధతను ప్రశ్నిస్తున్నాం. మూఢాచారాలుగా కొట్టిపారేస్తున్నాం. నవ్వుకుంటున్నాం. వయసొచ్చిన ఇద్దరు యువతీ యువకులు ఒకటవడానికి ఇంత తంతు జరపాలా అంటున్నాం. ఒక కోణం నుంచి చూస్తే, నిజమే కదా అనిపిస్తుంది.
కానీ ఇంకో కోణం నుంచి చూడండి…ఈ తంతు పూర్తిగా అదృశ్యమైపోయిన పరిస్థితిని ఊహించుకుంటే భయమూ, దిగులూ కలగచ్చు. పెళ్లి తంతు, ఆ మాటకొస్తే ఏ తంతు అయినా అదృశ్యమైపోవడమంటే ఏమిటి? దాంతోపాటు అది మోసుకొచ్చే చరిత్ర కూడా అదృశ్యమైపోవడమా? గతంతో మనకు ఉన్న ముడి అదృశ్యమైపోవడమా? వేళ్ళు తెగిన చెట్టులా మనం నిర్జీవంగా శూన్యంలో వేలాడవలసి రావడమా?…
పశ్చిమదేశాల్లో చాలావరకూ జరిగింది ఇదే. ఇప్పుడిప్పుడు కీళ్ళు సడలుతున్న లక్షణాలు కనిపిస్తున్నప్పటికీ మనదేశంలో వేళ్ళు ఎంతో కొంత పదిలంగానే ఉన్నాయి. మనదగ్గర గణవ్యవస్థ తాలూకు లక్షణాలు ఇంకా మిగిలి ఉన్నాయి. కానీ ఆ సంగతి మనకు తెలియదు!
మన తెలియనితనం ఇంకా వేనవేల రూపాల్లో వ్యక్తమవుతూ ఉండచ్చు. మనం ఆయా తంతులను మతవిశ్వాసంగా, అందులోనూ మన మతానికి మాత్రమే చెందిన విశ్వాసంగా అపోహ పడుతూ ఉంటాం. కానీ ఇలాంటి తంతులే దాదాపు ప్రపంచమంతటా ఉన్నాయి, లేదా ఉండేవి. అలాగే, మతానికి, సంస్కృతికి ఉన్న తేడా మనలో చాలామందికి తెలియదు. ఉమ్మనీటితోపాటు పసికందునూ పారబోసినట్టుగా మతవిశ్వాసంతోపాటు సంస్కృతినీ పారబోస్తున్నామా?
ఇందులో నేను వ్యక్తిగతంగా ఒక దాన్ని సమర్థించడం, ఇంకో దాన్ని వ్యతిరేకించడం అన్నది లేదు. ఇది బహిరంగంగా సాగించే ఆలోచనల కలబోత మాత్రమే. కాలంలో, ప్రకృతిలో సంభవించే ఏ పరిణామాన్నీ ఆపలేనంత చిన్నది మనిషి పిడికిలి. అందులో దేనిని బంధించాలని చూసినా అది వేళ్ళ సందుల్లోంచి తప్పించుకుంటూనే ఉంటుంది.
***
పెళ్లి తంతు ఇప్పుడొక వేడుకగా, ఆచారంగా; చందనబ్బొమ్మ ఒక బొమ్మగా కనిపించవచ్చు. కానీ పురామానవుడి విషయంలో ఆ తంతు కేవలం ఒక వేడుకా కాదు, ఆ బొమ్మ ఒక బొమ్మా కాదు. అతని జీవితంతో పూర్తిగా పెనవేసుకున్న మాంత్రికతలో అవి భాగాలు. ఆ తంతు మొత్తం మంత్రపూతమైన ప్రక్రియ. చందనబ్బొమ్మ మంత్రపూతమైన వస్తువు. ఉయ్యాలలో బొమ్మను ఉంచి వధూవరులు ఊపడం అనేది, భ్రాంతి వాస్తవికతను ప్రయోగించడం ద్వారా భౌతికవాస్తవికతను ప్రభావితం చేసి, రేపు బిడ్డ అనే ఫలితాన్ని పొందడం కోసమే. అంటే రేపటి ఫలితానికి అది రిహార్సల్. పురామానవుడి దృష్టిలో అసలుకు, రిహార్సల్ కు ఎలాంటి తేడా లేదు. ఉయ్యాల్లో ఊపిన ఆ బొమ్మ అతని దృష్టిలో ఆ క్షణంలో ఒక సజీవమైన పసిపాపే.
బొమ్మ ఒకటే కాదు; రాయి, రప్ప, కొండ, గుట్ట, చెట్టు, పుట్టతో సహా ప్రకృతిలో ప్రతిదీ పురామానవుడి దృష్టిలో మాంత్రికతకు అర్హమైనవే. అంతవరకూ ఒక రాయి అనుకున్నది హఠాత్తుగా దేవతగా మారిపోవచ్చు. అలాగే ఒక చెట్టు, ఒక పుట్ట…ఈ క్రమంలో మనిషి ఉపయోగించే శిలాసాధనాలు, లోహసాధనాలూ కూడా మాంత్రిక సామగ్రిగా మారిపోతాయి.
శిలాసాధనాలకే వస్తే, రుబ్బురోలు-పొత్రం ఒక ఉదాహరణ. రాతియుగం చివరిలో, వ్యవసాయం ప్రారంభమైన తొలినాళ్లలో వాడుకలోకి వచ్చిన సాధనాలలో ఇదొకటి. వేల సంవత్సరాలుగా కాలంతోపాటు కలసి ప్రయాణిస్తూ వచ్చిన, మన్నికైన ఆదిమ సాంకేతిక పరికరం ఇది. మనదేశంలో అన్ని తరగతులవారిలొనూ నిన్నమొన్నటివరకూ ఇది ఉపయోగంలో ఉంది. ఇప్పటికీ గ్రామ ప్రాంతాలలో, గిరిజన ప్రాంతాలలో వాడుకలో ఉంది. ఈ రుబ్బురోలు-పొత్రం గురించి కోశాంబి (AN INTRODUCTION TO THE STUDY OF INDIAN HISTORY) ఇచ్చిన సమాచారం ఆసక్తికరంగా ఉంటుంది.
రుబ్బురోలు-పొత్రం ఆనవాళ్ళు ప్రపంచమంతటా పురావస్తు తవ్వకాల్లో దొరికాయి. కాలగతిలో ఈ సాధనం భిన్నరూపాలు తీసుకుంటూ వచ్చింది.. మొదట్లో ఇది చిత్రంలో చూపిన ఆకారంలో ఉండేది. సింధులోయలో ఇలాంటివే దొరికాయి. అన్నింటి కన్నా ఆంద్ర ప్రాంతంలో ఉపయోగించే రుబ్బురోలు-పొత్రం మరింత సమర్ధమైన రూపం అంటారు కోశాంబి. పొత్రం రోట్లో దాదాపు పూర్తిగా నిండిపోతుంది. ఈ సాధనాన్ని వాడడంలో మళ్ళీ ఉన్నతవర్గాలు, నిమ్నవర్గాల తేడాలు కూడా ఉన్నాయి. ఉన్నతవర్గాలకు చెందిన ఆడవాళ్ళు ఉపయోగించే విధానం సులువుగా ఉంటే, నిమ్నవర్గాలవారు ఉపయోగించే విధానంలో శ్రమ ఎక్కువ. ఇందులో ప్రాంతాల తేడాలు కూడా ఉన్నాయి. సులువైన విధానం ఉత్తరభారతీయులది. కాస్త శ్రమతో కూడింది దక్షిణభారతీయులది. రోలు-పొత్రము దక్షిణభారతానికి తదుపరి కాలంలో పరిచయమవడం కూడా ఒక కారణం. వాడడంలో ఉన్న తేడాలను బట్టి దక్షిణభారతంలోని బ్రాహ్మణులు ఉత్తరభారతంనుంచి వచ్చారని భావించడమూ ఉంది.
అదలా ఉంచితే, ఎప్పుడో ఊహకు అందని కాలంనాటి వ్యవసాయ ప్రారంభదశకు చెందిన ఈ సాధనం ఒక తంతులో భాగమైంది. శిశువుకు బారసాల జరిగే రోజున లేదా, డానికి ముందు పొత్రానికి ఒక కొత్త బట్టను టోపీలా తొడిగి, పసుపు, కుంకుమ అద్ది, ఒక ఆభరణం అలంకరించి ఉయ్యాలలో శిశువు చుట్టూ తిప్పుతారు. ఆ తర్వాత డానిని శిశువు పాదాల దగ్గర ఉంచుతారు. ఆ పొత్రంలానే శిశువు కూడా దృఢంగా ఉండాలనీ, ఆరోగ్యంగా ఎదగాలని కోరుకోవడం ఈ తంతులోని అంతరార్ధం. అలాగే ఆ పొత్రం, డానికి చేసిన అలంకరణ అమ్మవారికి కూడా ప్రతీక. శిశువుకు అమ్మవారి ఆశీస్సులు లభించాలన్న కోరిక అందులో ఇమిడి ఉంటుంది. ప్రస్తుతం మనకు అవసరమైన ముఖ్య సమాచారం ఏమిటంటే, ఈ తంతులో కేవలం ఆడవాళ్ళు మాత్రమే పాల్గొంటారు. పిల్లలుగల ఒక ముత్తైదువ ఇందులో ప్రధానపాత్ర పోషిస్తుంది. ఇదీ, ఇంకా ఇలాంటి అనేక తంతులూ ఋషులు చెప్పినట్టు పేర్కొనే ప్రామాణిక గ్రంథాలలో ఉండవనీ, అయినాసరే బ్రాహ్మణులు కూడా వీటిని పాటిస్తారనీ కోశాంబి అంటారు.
అంటే, అజ్ఞాతకాలంనుంచీ ఆనవాయితీగా కొనసాగుతున్న ఇలాంటి తంతులను స్త్రీలే కాపాడుకుంటూ వస్తున్నారన్నమాట. మామూలుగా కాదు, అతి రహస్యంగా! ఒకే కప్పు కింద ఉంటున్నా తల్లులు కొడుకులకు తెలియకుండా కూతుళ్ళకు ఈ రహస్యవారసత్వాన్ని భద్రంగా బదిలీ చేసే తీరు ఒక అద్భుతంలా అనిపిస్తుంది. కొబ్బరికాయలోకి నీరు చేరినట్టుగా; తమను ఏమార్చి తమ కళ్ళ ముందే అక్కలు, చెల్లెళ్ళు ఈ గుప్తవారసత్వాన్ని అందుకుని ఆరిందలుగా మారిపోతుండడం మగవాణ్ణి ఎప్పుడూ ఆశ్చర్యచకితం చేస్తూనే ఉంటుంది. ఈ తంతులపై ప్రత్యేకంగా స్త్రీముద్ర ఉండడానికి కారణం ఉహించలేనిదికాదు. ఇవి వారు మార్మికప్రపంచాన్ని ఒంటిచేత్తో శాసించినరోజులనుంచీ వస్తున్న తంతులు.
ఆ తర్వాత ఆ అధికారం స్త్రీ చేతుల్లోంచి పురుషుడి చేతుల్లోకి బదిలీ అయ్యాక పురుషుడి ముద్ర గల తంతులు మొదలయ్యాయి. అవి స్త్రీముద్ర గల తంతులతో పోల్చితే మరింత అభివృద్ధి రూపాన్నీ, ప్రామాణికతనూ తెచ్చుకుంటూ వ్యవస్థీకృతం అవుతూవచ్చాయి. క్రమంగా గ్రంథరూపం ధరించడమూ ప్రారంభించాయి. స్త్రీ తంతులకు ఆ గ్రంథాలలో చోటివ్వకుండా పురుషుడు జాగ్రత్తపడ్డాడు. అయినాసరే, మౌఖికంగానే తరం వెంట తరానికి అందుతూ కాలాన్ని ప్రతిఘటించి అవి కొనసాగుతూనే ఉన్నాయి. అంటే, ఆ మేరకు పురుషుడు రాజీపడ్డాడన్నమాట.
ఇది మన అనుభవం. కానీ, పాశ్చాత్య, ఇస్లామిక్ ప్రపంచాలలో స్త్రీ మార్మిక ప్రపంచాన్ని పనిగట్టుకుని అంతమొందించినట్టు కనిపిస్తుంది, ఆ క్రమంలోనే స్త్రీ ‘మంత్రగత్తె’ అయింది.
***
మనమిప్పుడు ఓసారి జార్జి థాంప్సన్ (STUDIES IN ANCIENT GREEK SOCIETY-THE PREHISTORIC AEGEAN)ను పలకరిద్దాం. స్త్రీ మార్మిక ప్రపంచం విశ్వవ్యాప్తం అనే కాక, ఆ ప్రపంచంలో ‘బొమ్మ’లకు ఎంతో ప్రాధాన్యం ఉందంటాడాయన. ఆయన ప్రకారం:
నేటి మన పిల్లలలానే ఆటవిక దశలోని పిల్లలు కూడా బొమ్మలతో ఆడుకునేవారు. అప్పుడూ, ఇప్పుడూ కూడా బొమ్మలతో ఆడుకునేది ప్రధానంగా ఆడపిల్లలే. అలా బొమ్మలతో ఆడుకోవడం అనేది రేపు వారు పోషించబోయే అమ్మపాత్రకు రిహార్సల్ మాత్రమే. అయితే ఈ ఆట, ఆధునిక కాలంలో కంటే ఆటవిక కాలంలో మరింత గంభీరమైన వ్యవహారం. దురదృష్టవశాత్తూ దాని గురించి మనకు ఎక్కువగా తెలియదు. ఆటవిక పురుషుడు ఈ బొమ్మలాటలోకి తొంగి చూడకూడదు. చూస్తే తప్పవుతుంది.
అలాగే, పురుష మానవపరిణామ శాస్త్రవేత్త కూడా. భర్తలకు తెలియకుండా కాపాడుకుంటూ వస్తున్న తమ రహస్యాలను స్త్రీలు తెల్లతోలు యూనివర్సిటీ ప్రొఫెసర్లకు అసలే చెప్పరు. మహిళల సామాజిక స్థాయి, మానవపరిణామశాస్త్ర అధ్యయనానికి వారిని ప్రోత్సహించదు. అందుకే స్త్రీల ఆదిమజీవితం గురించిన సగం చరిత్ర నమోదు కాకుండా పోయింది. ఈ పరిస్థితిలో మిస్ ఎర్తీకి మనం ప్రత్యేక కృతజ్ఞతలు చెప్పుకోవాలి. ఆమె దక్షిణాఫ్రికా వాలెంగ్ బాలికలను అమ్మపాత్రకు సిద్ధం చేసే తంతును పూసగుచ్చినట్టు రాశారు.
ఆ ఏడాదిలో పెద్దమనుషులైన ఆడపిల్ల లందరినీ ఒకచోట చేర్చమని వసంతం ఆరంభంలో తెగ నాయకుడు చాటింపు వేయిస్తాడు. అందరినీ ఒకచోట చేర్చిన తర్వాత వారికి తర్ఫీదు ఇచ్చే తంతు నెలరోజులపాటు జరుగుతుంది. ఈ శిక్షణ తంతును ‘న్యంబుత్సి’ అని పిలిచే ఒక మహిళ పర్యవేక్షిస్తుంది. తల్లినుంచి కూతురికి సంక్రమించే హోదా అది. అలాగే ఒక ప్రత్యేకమైన బుట్ట కూడా తల్లినుంచి కూతురికి వారసత్వంగా అందుతూ ఉంటుంది. అందులో ఒక డోలు(drum), ఒక కొమ్ము(horn), స్త్రీ, పురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీ, పురుషుల కొయ్యబొమ్మలు ఉంటాయి. ఈ పరికరాలు అన్నింటికీ ఎర్రని రంగు పూస్తారు.
మొదటి రోజున న్యంబుత్సి పర్యవేక్షణలో ఆడపిల్లలందరూ డోలు వాద్యానికి అనుగుణంగా నగ్నంగా నృత్యం చేస్తారు. డోలు స్త్రీగర్భానికి ప్రతీక. మొదట్లో ఆడపిల్లలు భయంతో ఏడుపు మొదలుపెడతారు. సాయంత్రం వరకు అలా నృత్యం జరిగిన తర్వాత ‘పవిత్రమైన కొమ్ము’తో ఒక్కొక్క ఆడపిల్ల కన్నెపొర తొలగిస్తారు.
మరునాడు, లైంగికజీవితం గురించి ఒక పద్ధతిగా వారికి బోధిస్తారు. బుట్టలో ఉన్న స్త్రీపురుష జననేంద్రియాల నమూనాలు, స్త్రీపురుషుల బొమ్మలు అందుకే. తమ పూర్వీకుల ఆత్మలు ఆవహించి ఉంటాయన్న భావనతో వీటిని ఎంతో పవిత్రంగా చూస్తారు. ఈ తర్ఫీదులో భాగంగానే ఆడపిల్లలకు ఒక గుప్తభాషను బోధిస్తారు. ఒకరి వస్తువులు ఒకరు దొంగిలించమని కూడా ప్రోత్సహిస్తారు. మొదటి రోజున చేసిన నృత్యమే చివరిరోజున కూడా చేస్తారు. ఈసారి ఒంటినిండా ఎరుపురంగు పులుముకుంటారు. ఇప్పుడిక ఏ ఆడపిల్లా భయంతో ఏడవడు. చివరిసారి బుట్ట తెరచి అందులోని వస్తువులను చూపించమని న్యంబుత్సిని బతిమాలతారు. ఆమె అలాగే చేస్తుంది. ఆ వస్తువుల చుట్టూ వాళ్ళు ఆనందంతో చప్పట్లు చరుస్తూ, పాట పాడుతూ నృత్యం చేస్తారు. ఆ పాట శిశువులను ఆహ్వానిస్తున్నట్టు ఉంటుంది.
శిక్షణ అయిపోతుంది. న్యంబుత్సి తన బుట్ట సర్దుకుంటుంది. ఆడపిల్లలు ఇంటికి చేరుకుంటారు. తమ ఒంటి మీది అలంకరణలను తీసేస్తారు. తల్లి ఎంతో మురిపెంగా వాటిని తీసుకెళ్లి ఒక రహస్యప్రదేశంలో దాస్తుంది.
ఆదిమసమాజాల్లో నిర్బంధ లైంగిక విద్య ఉండేదని ఈ తంతు చెబుతోంది.
మిగతా విశేషాలు తర్వాత…
-కల్లూరి భాస్కరం
అభినందనలు
మీదపడి రక్కే సమయాల్ని
ఓపికగా విదిలించుకొంటూ,
తోడేళ్ళు సంచరించే గాలిని
ఒడుపుగా తప్పించుకొంటూ,
బాట పొడవునా
పరచుకొన్న పీడకలల్ని
జాగ్రత్తగా దాటుకొంటూ,
శీతలమేఘాలు చిమ్మే కన్నీళ్ళలో
మట్టిపెళ్ళై చిట్లీ, పొట్లీ
మళ్ళీ మళ్ళీ మొలకెత్తుతూ
చివరకు చేరుకొన్నావా!
నీకోసమే పుట్టిన
నక్షత్రాన్ని తెంపుకొని
తురాయిలో తురుముకొని
గులాబిరేకలు, మిణుగురుపిట్టలు
నిండిన విజయంలోకి
చేరుకొన్నావా మిత్రమా!
అభినందనలు.
-బొల్లోజు బాబా
that’s way..!
రాత్రి పగలుతో అన్నది
భర్తలూ భార్యలూ తరచూ గొడవపడే వీధి. పిల్లలు అస్తమానూ ఇది కొనిపెట్టమని అది కొనిపెట్టమని అరిచి గీపెట్టే వీధి. సకల షాపింగ్స్ మాల్లూ చిన్న చిన్న తోపుడు బండ్లయి వచ్చీపోయి, వారి వారి రకరకాల అరుపులతో వీథి అంతా మారుమోగే సంగీత నిలయం. గోరటి వెంకన్న పాటలా ‘గల్లి చిన్నది… గరీబోళ్ల కథ పెద్దది’ అన్న పాటలోని దృశ్యాదృశ్యాలన్నీ నిండుగ ఎక్స్ పోజ్ చేసి ఒక గొప్ప ప్రదర్శనగా పెట్టతగిన గ్యాలరీ అది. ఆ వీథిలో మా పొరుగునుంచి వినిపిస్తున్న మాటలకు నా కళ్లు ఆనలేదు. చెవులే సాగి చూడసాగాయి.చీకటి చిన్నచిన్న ముద్దలుగా వినిపిస్తోంది,.
వాటిపై కన్నీటి ఛారలు వెలుతురులా మెరిసినట్టనిపించాయి.
ఒక స్త్రీ ఎదురుగా భర్తను పెట్టుకుని స్థిరంగా అంటున్న మాటలే వినిపించసాగాయి.
+++
మాట్లాడకు.
నీతో నాకు మాట్లాడలని లేదు.
…
నవ్వకు.
నాకు నవ్వస్తలేదు.
…
సూడకు.
నీ మొఖం సూడలేను.
..
ఏం తందనాలాడుతున్నవా?
సస్త.
…
సచ్చి నీ పేరే చెబ్త.
ఏందనుకున్నవో!
నా మొగడే నా సావుకు కారణమని చెప్పి సస్త….
ఏమనుకుంటున్నవో!
నా సంగతి నీకింక తెల్వదు.
…
వద్దు.
రాకు.
మాట్లాడకు.
నవ్వకంటె…
( ఒక్క దెబ్బ)
చెంపపై వేసిందో ఎక్కడ వేసిందోగానీ తర్వాత “న్నిశ్శబ్దం’.
+++
సిగరెట్టు ఆయిపోయింది. ఇంకొకటి లేదు. ఇట్లాంటప్పుడు గుండెకు నిప్పుపెట్టుకోవడానికి ఇంట్లో ఉన్నఒక ట్రేలో వెతుకులాడుతాను. హ్యాంగర్లకు వేలాడుతున్న అన్ని ప్యాంటు జేబుల్లో వెతుకులాడి నిరాశపడతాను.
వెతుకుతుంటే నా భార్య ‘ఇంకా పండుకోలేదా?’ అంటుంది, నిద్రలోనే!
‘ఇగొ..పడుకుంట’ అనుకుంటూ మళ్లీ వెతుకులాడి నిరాశ పడతాను.
మళ్లీ బయటకు వచ్చిచూస్తే చిమ్మచీకటి.
రాత్రి ఒక్కత్తే ఉంటుంది. మాటలే…అవి మళ్లీ గుండెల్లో వినిపిస్తూ ఉంటై.
ఎగదోస్తున్న మంట ఏదో లోపల ఆ మాటల్ని ఆరిపోకుండానే లోపలంతా నిశ్శబ్దంగా చేస్తుంటే మళ్లీ అదే చిమ్మచీకటి. దృశ్యాదృశ్యం.
+++
ఆ మాటలు…
ఆ స్త్రీ ఎంత స్థిరంగా, ఎంత వేదనతో, ఎంత గంభీరంగా పలికిందంటే అవతలి వైపు అలకిడి లేదు.
చిత్రమేమిటంటే రాత్రి మాత్రమే, ఇట్లా ఏకాంతంలో మాత్రమే వినిపించే కఠిన నిజాలవి.
మెత్తని మమతలవి.అనుబంధాల ఆరోపణలవి. ఆశల హెచ్చరికలవి.
తెల్లవారిందా…మళ్లీ ఇద్దరూ ఎవరి పనిలో వారు పడతారు. రాత్రి అయ్యేదాకా మళ్లీ కానరారు.
తర్వాత ఒక రోజు నవ్వులు. ఏడ్పులు. ఎప్పుడో ఒకసారి ఇట్లా గంభీరంగా మాటలు.
చిత్రమేమిటంటే, ఆ గోడ వెనకాలి ఆ చిత్రాలేమిటో అర్థం కావు.
‘సస్తె నేను ఒకటే చెప్పి సస్తాను…’.
ఆ మాటలు అన్నప్పుడు అతడెలా ఉన్నాడు?
ఏమో!
ఈ లోకంలో విషాదం కన్నా ఆనందాలే ఎక్కువ.
విషాదాలే ఆనందాలు. బాధలే సంతోషాలు. లేకపోతే ఏం మాటలవి!
“సస్త’ అంటుంది.సస్తే వాడి పేరే చెప్పి సస్తుందట.
చచ్చి కూడా సాధిస్తుందట!నవ్వు.
నిజం.
కానీ ప్రయాస.
+++
అన్ని మాటలన్నాక, విన్నాక… తెల్లవారి ఆమె ఎట్లా ఉంటుందో చూడాలనిపిస్తుంది!
కానీ, ఆమె ఎవరో అర్థం కాదు. ఆ గల్లీలో..ఆ ఇరుకిరుకు ఇండ్లలో ఏ ఇంటినుంచి ఆ మాటలు వినవచ్చాయో అంతుపట్దదు. నా ఇంటినుంచే వచ్చాయా అనిపిస్తుంది అప్పుడప్పుడు. అంత నిజంగా ఉంటాయా మాటలు.
బహుశా అది అందరి ఇళ్లల్లోంచి వచ్చిన మాటలా? ఏమో!
రాత్రి మహిమ అది.
రాత్రి పగలుతో చెప్పిన మాటలవి.
కానీ, ఉదయం చూస్తే ఒకరు!.
ఆమె అచ్చం రాత్రివలే అనిపించింది.
ఒక రాత్రి తనను తాను పగటీలి వెలుతురుతో పంచుకున్న వేదనాలా అనిపించింది!
చూడండి. కుంకుమా పసుపూ – ఆమె.
పున్నమి అమాసా – ఆమె.
ఒక్కత్తే. రాత్రి.
– కందుకూరి రమేష్ బాబు
ఆమె చెప్పిన అతని కథ
అంతో ఇంతో చదువుకున్న ప్రతివారికీ స్టీఫెన్ హాకింగ్ పేరు తప్పక తెలుస్తుంది అతనో గొప్ప మేధావి . భౌతిక శాస్త్ర రంగంలో అతను చేసిన కృషి ,పరిశోధన అసామాన్యం . ఒక ఫిజిసిస్ట్ గానే కాక ఫిజిక్స్ ని ఎంతో సులువుగా అందరికీ అర్థమయ్యే రీతిలో వివరించిన రచయితగా కూడా ఆయన ప్రపంచానికి సుపరిచితుడు . ఆయన రచించిన ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం ఎన్నో క్లిష్టమైన సైన్స్ సిద్ధాంతాలని, సైన్స్ గురించి పెద్దగా అవగాహన లేని వారికి కూడా అర్థమయ్యేలా సరళంగా విడమర్చి వివరించడంలో ఘన విజయం సాధించింది . అటువంటి ఒక గొప్ప వ్యక్తి గురించి , అతనితో గడిపిన తన జీవితం గురించి అతని మాజీ భార్య జేన్ వైల్డ్ హాకింగ్ రాసిన మెమోయిర్ Travelling to Infinity: My Life with Stephen ఆధారంగా నిర్మించిన చిత్రం The theory of everything .
ప్రతి పురుషుడి విజయం వెనుక ఒక స్త్రీ ఉంటుందంటారు . ఆ సామెత ఉద్దేశ్యం స్త్రీకి ప్రాధాన్యత నివ్వడమో, లేక అప్పుడు కూడా ఆమెని అతని వెనకనే ఉంచడమో తెలీదు గానీ ప్రతీ విజయం వెనుక మాత్రం ఎన్నో అపజయాలుంటాయి. నిరాశ, నిస్పృహ నిండిన రోజులు , కష్టాలు, కన్నీళ్ళు ఉంటాయి . ఆ సమయంలో వెనక నిలబడి వెన్నుతట్టి ధైర్యం చెప్పే తోడు ఎటువంటి వారికైనా అవసరం . అటువంటి తోడు జీవిత భాగస్వామే అయితే అది నిజంగా అదృష్టమే . పారనోయిడ్ స్క్రిజోఫీనియాతో జీవితమంతా బాధపడిన మేధావి మేథమెటీషియన్ జాన్ నాష్ విషయంలో కూడా అతని భార్య ఎలీసా సహాయం చెప్పుకోదగ్గది .
ఇక్కడ స్టీఫెన్ హాకింగ్ వంటి జీనియస్ జీవితం కూడా అతి చిన్న వయసులోనే ముళ్ళ బాటల వైపుకి మళ్ళి పోయింది . ఇరవై యేళ్ళయినా నిండకుండానే అతి ప్రతిష్టాత్మకమైన యూనివర్సిటీల్లో(ఆక్స్ఫర్డ్ ,కేంబ్రిడ్జ్) అతని ప్రతిభ గుర్తింపు పొందుతూ ఉండగానే ఓ మహమ్మారి రోగం అతని శరీరంలోకి చొరబడింది . ALS లేదా మోటార్ న్యూట్రాన్ డిసీజ్ అని పిలవబడే ఈ వ్యాధి మెల్ల మెల్లగా శరీరంలోని ప్రతి భాగాన్నీ నిర్వీర్యం చేసి చివరికి ప్రాణాలు తీస్తుంది . మెదడునీ ఆలోచననీ మాత్రం సాధారణంగా వదిలి పెడుతుంది. వస్తూనే ఉగ్ర రూపాన్ని చూపిన ఈ వ్యాధి స్టీఫెన్లో అప్పుడప్పుడే చిగురులు తొడుగుతున్న యవ్వనాన్నీ, అది తెచ్చిన ఉత్సాహాన్నీ సమూలంగా పెకిలించి వేసింది . మరణానికీ తనకీ ఉన్న దూరం రెండేళ్ళేనని డాక్టర్ చెప్పిన మాటలు అతన్ని అంతులేని దుఖంలో పాతిపెట్టాయి .
అంతటి లోతైన నిరాశలోంచి అతన్ని ఒంటి చేత్తో బయటకి లాగి పడేస్తుంది ఆ అమ్మాయి . ఎన్నో రోజుల పరిచయం కాకపోయినా అతని మీద అనంతమైన ప్రేమని పెంచుకున్న జేన్ వైల్డ్ అతనితో జీవితాన్ని పంచుకోవడానికి సిద్ధపడుతుంది . ప్రేమికురాలి నుండి భార్య స్థానాన్నీ , కాలక్రమంలో అతని పిల్లలకి తల్లి స్థానాన్నీ సంతోషంగా స్వీకరిస్తుంది . కళ్ళముందే అతను రెండు కర్రల ఊతంతో నడవడం నుండి వీల్ చైర్ లోకి మారడాన్నీ, తనకి మాత్రమే అర్థమయ్యేంత అస్పష్టత లోకి మాటని కోల్పోవడాన్నీ ఎంతో ప్రేమతో స్వీకరిస్తుంది . అతను బ్లాక్ హోల్స్ గురించీ , విశ్వం పుట్టుక గురించి థియరీల మీద ధియరీలు ఊహిస్తుంటే ప్రాక్టికల్ గా మొత్తం కుటుంబ భారాన్ని తన భుజాల మీద వేసుకుని తన ముగ్గురి పిల్లలతో పాటుగా శారీరకంగా పసివాడిలాంటి భర్తని కూడా ఓర్పుతో సాకుతుంది .
ఓ దశలో స్టీఫెన్ పూర్తిగా మాటని కోల్పోతాడు చావుని అతి దగ్గరగా చూసి వచ్చినా ధైర్యం కోల్పోని స్టీఫెన్, స్పీచ్ సింథసైజర్ సహాయంతో రాసిన సైన్స్ పుస్తకం ఎ బ్రీఫ్ హిస్టరీ అఫ్ టైం పెద్ద సంచలనమవుతుంది . అతని గొప్పతనాన్ని ప్రపంచమంతా మరింతగా గుర్తిస్తుంది. ఇంతలో నర్స్ గా అతని జీవితంలోకి ప్రవేశించిన Elaine Mason వల్ల స్టీఫెన్ ,జేన్ ల జీవితాల్లో ఎటువంటి మార్పులు చోటు చేసుకున్నాయో , చివరికి ముప్పై ఏళ్ళ వాళ్ళ ప్రేమ కథ ఏ రకమైన మలుపు తిరిగిందో తెరమీద చూసి తెలుసుకోవాల్సిందే.
స్టీఫెన్ హాకింగ్ పాత్రధారి Eddie Redmayne నటన అద్భుతం , అతి సహజం అని చెప్పాలి . నిజంగా స్టీఫెన్ హాకింగ్ వచ్చి నటించాడా అని సందేహం కలిగేంత సహజంగా ఉంటుంది అతని నటన. మాట్లాడలేని స్థితిలో ఉన్న వ్యక్తిగా సందర్భానుసారంగా కళ్ళతోనే ప్రేమనీ, దుఃఖాన్నీ , అసహాయతనీ , చిలిపితనాన్నీ అతను అలవోకగా పలికించాడు . గొప్ప విల్ పవర్ , ప్రేమ తత్త్వం కలిగిన స్త్రీగా Felicity Jones కూడా ఎంతో సహజంగా నటించింది . చూడ్డానికి కథంతా రెండు గంటల్లో ఇమిడిపోయినా నిజానికి అంతటి సుదీర్ఘమైన సమయం పాటు, అతను అనారోగ్యంతోనూ, ఆమె క్లిష్ట పరిస్థితులతోనూ పోరాడిన వైనం చూసి ఎన్నో మంచి పాఠాలు నేర్చుకోవచ్చు . అతని ఆత్మస్థయిర్యాన్నీ , ఆమె స్థిత ప్రజ్ఞతనీ మెచ్చుకుని తీరాల్సిందే . ఒక సినిమా చూస్తున్నట్టు కాక నిజమైన జీవితాన్ని చూస్తున్న అనుభూతి కలిగేలా చెయ్యడంలో దర్శకుడు
James Marsh విజయం సాధించాడు . జేన్ దృష్టి కోణంలో నుండి చెప్పబడటం వల్ల సైన్స్ విషయాలకి పెద్దగా ప్రాధాన్యతనివ్వకుండా సున్నితమైన మానవ సంబంధాలని ఎలివేట్ చేస్తూ కథ సాగుతుంది .
కొన్ని నిజాల్ని చూపలేదన్న ఒక వాదన ఉన్నప్పటికీ స్టీఫెన్ వంటి జీనియస్ గురించీ , జేన్ వంటి ప్రేమ మూర్తి గురించీ తెలుసుకోవడం కోసం తప్పక చూడాల్సిన చిత్రం . ఐదు అకాడమీ అవార్డ్ లకి నామినేట్ కావడంతో పాటు , గోల్డెన్ గ్లోబ్ వంటి మరెన్నో ప్రతిష్టాత్మకమైన అవార్డ్ లు గెలుచుకుంది ఈ బయోగ్రఫికల్ మూవీ . ప్రస్తుతం ఈ చలన చిత్రం భారతీయ సినిమా ధియేటర్లలో విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది
ప్రశ్నల నిధి
“ఇప్పటివరకు ఎక్కడికెళ్లారు …”
“దారిలో ఫ్రెం…”
“దారిలో ఫ్రెండ్ కలిశాడు… అదేగా మీరు చెప్పేది…”
“ఆడా ? మగా ?”
“నీకు తెలుసుకదే సతీ…”
“సతీష్ అన్నయ్య కలిశాడంటారు అంతేకదా…”
“నాకు తెలుసు ఒకవేళ ఆడ అయినా మీరు మగనే చెప్తారు…”
“ఇప్పుడు నా అనుమానాన్ని నివృత్తి చేసుకోవడానికి సతీష్ అన్నయ్యకు ఫోన్ చేయమన్నా చేస్తారు కదూ…!”
“చందు ఫోను చేస్తున్నాడు.”
“వద్దులేండి మనింట్లో గొడవలు ఇప్పుడు వాళ్ళకు కూడా తెలియాలా ? అయినా ఎంత అన్నయ్యా అని పిలిచినా మీ ఫ్రెండ్ మీవైపే మాట్లాడుతాడు కానీ నావైపు మాట్లాడుతాడా? అయినా నేనడిగే ప్రశ్నలు మీకు ముందుగానే భలే తెలిసిపోతాయే..! తడబడకుండా ఎంత చక్కగా సమాధానం చెప్తారో. కొంచెం కూడా అనుమానం రాకుండా…
“సరేలేండి… ఇంతకీ కాఫీ కావాలా ? టీ కావాలా ?”
“ప్రస్తుతం ఏమీ వద్దు…”
“వద్దా? ఏంపాపం మాచేత్తో ఇస్తే గొంతులోకి దిగదా…”
“సరే , ఏదో ఒకటి తీసుకురా…”
“ఏదో ఒకటి ఏమిటి… మీకు ఏది ఇష్టమో అది చెప్పండి, అదే తీసుకొస్తాను మీ ఇష్టాలకు అనుగుణంగా ఉండటం కోసమే కదా నేను ఉన్నది…. మీరు నా ఇష్టాలకు అనుగుణంగా ఉన్నా లేకపోయినా…”
“టీ… తీసుకురా”
“టీ త్రాగుతూ కూర్చున్నాడు చందు. ఏం మాట్లాడాలన్నా భయంగా ఉంది. ఏం మాట్లాడినా సరే దానిని తనకు అనుకూలంగా మార్చుకుంటుంది కీర్తన. అలా అని కీర్తన అమాయకుయరాలు కాదు , చదువులేని అమ్మాయి అంతకన్నా కాదు. యం.యస్.సి చేసింది. తెలివిగల అమ్మాయి. మేనమాయ కూతురు. ప్రేమించి పెళ్లిచేసుకున్నారు. ఒకరంటే ఒకరికి అంతులేని ప్రేమ. కానీ కీర్తనకు ప్రేమతో పాటూ చందు మీద విపరీతమైన అనుమానం. ఎంత అనుమానమంటే కస్టమర్ కేర్ నుంచి కాల్ వస్తే , అందులో వాయస్ అమ్మాయిదయితే …. వెంటనే పెట్టేశాడా… ఇక ఆరోజు చందు పని అయిపోయినట్టే … ఎవరావిడ…? ఎందుకు వెంటనే ఫోన్ పెట్టేశావ్ …? ఆఫీస్ కి వెళితే నాకు ఫోన్ చేయడం చేతకాదు కానీ అర్ధరాత్రులు అమ్మాయిలు ఫోన్ చేస్తే రిసీవ్ చేసుకోవడం మాత్రం బాగా తెలుసు. అని ఇక ‘అనుమానపురాణం’ మొదలు పెట్టేస్తుంది. తాను ఎంత చెప్పినా తన కోణంలో నుంచి తప్ప మరో కోణం నుంచి ఆలోచించదు . మొదట్లో కాస్త ఇబ్బందిగా ఉన్నా తరువాత తరువాత అలవాటుచేసుకున్నాడు… కస్టమర్ కేర్ నుంచి కాల్స్ వస్తే లిఫ్ట్ చేయకుండా ఉండటం ….
సాధారణంగా ఇన్ బాక్స్ ఎప్పుడూ క్లియర్ చేయడు, క్లియర్ చేసిన రోజు పొరపాటున చూసిందా….
“ఏమంత ఇంపార్టెంట్ మెసేజ్ లు ఉన్నాయని ఇన్ బాక్స్ క్లియర్ చేశారు. ఎవరూ చూడకూడని మెసేజ్ లా?! మీరు మాత్రమే చూసి డిలీట్ చేయాల్సిన మెసేజ్ లా?!” …
“నా జీవితం మొత్తం ప్రశ్నలతోనే గడిచిపోతుందా? సమాధానాలు కరువైపోతున్నాయా ? ముందు ముందు మాట్లాడటానికి కూడా నాకు అవకాశం ఉండదా? చిన్నప్పటి నుంచి పరీక్షలలో నేను రాసిన ప్రతి ప్రశ్నకు బై కి బై మార్కులు వచ్చేవి, కానీ జీవిత పరీక్షలో రాస్తున్న ఈ ప్రశ్నలకు కనీసం పాస్ మార్కులు కూడా రావడం లేదు. ఏం చేయాలో తనకు అర్ధం కావడం లేదు . ఎవరికి చెప్పుకోవాలో తనకు అర్ధం కావడం లేదు. ప్రేమించుకునే రోజుల్లో తను ఇలా ఉండేది కాదు. చాలా కోపరేటివ్ గా ఉండేది. ‘సరదాకి నేను నిన్ను కాకుండా ఇంకెవరైనా అమ్మాయిని పెళ్లి చేసుకుంటే నువ్వేంచేస్తావే?!’ అని అడిగితే నీకు ఏది నచ్చితే అది చెయ్ బావా! నీ ఇష్టమే నా ఇష్టం నా దగ్గర నువ్వు సంతోషంగా, సుఖంగా ఉండలేకపోతే ఏ అమ్మాయితో అయితే నువ్వు సంతోషంగా, సుఖంగా ఉండగలవో ఆ అమ్మాయినే పెళ్లి చేసుకో, నేను మాత్రం అడ్డురాను. అని అన్న కీర్తన, ఈ రోజు నేను పెళ్లి చేసుకున్న కీర్తన ఇద్దరూ ఒకటేనా?! అనే ఒక అనుమానం తనకు కలిగి, ఆ రోజు అలా అన్నదానివి ఈ రోజు ఇలా ఎలా మాట్లాడుతున్నావే అని అడిగితే …”
“ఆ రోజు ఉన్నట్టు ఈ రోజు నువ్వు లేవు బావా? ఆ రోజులా నువ్వుoటే, ఈ రోజు నువ్వు ఎలా ఉన్నా నేను పట్టించుకునే దానిని కాను.” కీర్తన మాట్లాడుతుంటే తనకు ఏమీ అర్ధం కావడంలేదు.
“నేను ఆ రోజు ఎలా ఉన్నానో ఈ రోజు అలానే ఉన్నాను. నాలో మార్పు లేదు” అని చందు ఎంత చెప్తున్నా కీర్తన వినిపించుకోవడం లేదు.
“ఇవన్నీ అనవసరమైన మాటలు బావా చివరిగా ఒక మాట చెప్తా విను … ‘చంద్రుడిలో మార్పులు వస్తూనే ఉంటాయి. అవి తనకు తెలుసో తెలియదో నాకు తెలియదు. కానీ ఆ మార్పులు మాత్రం చూస్తున్న మనకు తెలుస్తుంది. ఆ మార్పును మనం ఆనందించవచ్చు. కానీ తనకు కూడా భార్య ఉంటే తను మాత్రం ఆనందించదు బావా?!’” అని కన్నీళ్లు పెట్టుకుంటూ లోపలికి వెళ్లిపోయింది.
ఆ సంఘటన కళ్ళల్లో కదులుతుండగా… కీర్తన కళ్ళల్లో కన్నీళ్లు అనుక్షణం తనను వెంటాడుతుండగా… ఆలోచనాలోచనల్లో మునిగితేలుతున్న చందు, తనలో ఏం మార్పు వచ్చిందా అని తనను తాను అవలోకనం చేసుకుంటున్న చందు, సైడ్ స్టాండ్ వేసి CBZ XTREME AP 16 B 8963 బండి మీద కూర్చొని వేడివేడి టీ త్రాగుతూ, వేడివేడి గా ఆలోచిస్తున్న చందు… ఆ అడ్రస్ ను వెతుక్కుంటూ ముందుకుసాగాడు…..
*****
“చందు లోపలికి వెళ్ళాడు… భయం భయంగా….”
“తనకు అద్దం ముందు నిలుచున్నట్టుంది, కాదు కాదు అద్దాల గదిలో నిలుచున్నట్టుంది. తనలాంటి వారు అక్కడ చాలా మంది ఉన్నారు. అందరూ భార్యా బాధితులే ….”
“జుట్టంతా చెదిరిపోయి … షర్టoతా చెరిగిపోయి … పిచ్చోళ్లలా కొందరు …”
“కళ్ళoతా ఎర్రబడి … ముఖమంతా నల్లబడి … ప్రేతకళతో మరికొందరు …”
“విడాకుల కాగితాలతో కొందరు … వింతైన అనుభవాలతో ఇంకొందరు …”
“చావే నయమనుకుంటున్న మరికొందరు … చావలేక బ్రతుకుతున్న వాళ్ళు ఎందరు … ?”
“ఎవర్ని కదిలించినా ఇవే కదలికలు …”
“ఇల్లు కాలి ఒకడేడుస్తుంటే చుట్టకు నిప్పడిగాడట ఒకడు” అన్నట్టు … సంసారం లో పడి మేము నిలువెల్లా దహించి పోతుంటే సరదాకి ప్రశ్నలడగడానికి వచ్చిన వాళ్ళు ఇంకొందరు… పారితోషకం ఉంది కదా!
*****
ఒక్కసారిగా నిశ్శబ్దం అలుముకుంది.
దగ్గరాదగ్గరగా అరవై సంవత్సరాలుంటాయనుకుంట ఒకావిడ మా ముందుకు వచ్చింది.
తనతో పాటు కొంతమంది యువకులు కూడా వచ్చారు . వాళ్ళంతా మాకు పేపర్స్ ఇచ్చి మీ ప్రశ్నలు , మీ సమస్యలు ఏవైనా సరే ఈ పేపర్ మీద రాయమన్నారు …
అందరం రాశాం… మేము రాసిన పేపర్స్ ని వాళ్ళు తీసుకున్నారు.
నేను ఇవన్నీ చదివి ఒక అరగంట తరువాత మళ్ళీ మిమ్మల్ని కలుస్తాను. మీకోసం స్నాక్స్ , టీ ఎదురుచూస్తున్నాయి తీసుకోమని చెప్పి ఆవిడ అక్కడి నుండి వెళ్ళిపోయారు.
*****
అరగంట గడిచింది…
ఆవిడ మళ్ళీ మాముందుకు వచ్చారు.
“నేను మీ అందరి సమస్యలు చదివాను, నవ్వుతూ… చాలా బావున్నాయి … దాదాపుగా అందరి సమస్యలూ ఒకలానే ఉన్నాయి.” అన్నారు.
“అందరూ భార్యలనే వేలెత్తి చూపారు కానీ నాలుగువేళ్లు మీవైపే చూస్తున్నాయనే సంగతి మాత్రం మరిచిపోయారు.”
అని ఆవిడ అనగానే
అంతలోనే “అంటే మీ ఉద్దేశ్యం … తప్పంతా మాదనా ?” ఆవేశంగా ఒకగొంతు వీరవిహారం చేసింది. వేదన చెందింది. “నా ఉద్దేశ్యం అదికాదు కుమారా…”
“మరి” … కాస్త ఓపికగా వింటే మీకే అర్ధమవుతుంది.
“నా కోసం ఏడవకండి మీకోసం మీబిడ్డల కోసం ఏడవండి” అని యేసూక్రీస్తు చెప్పిన మాటల్ని ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. ఏ కులానికి చెందిన వారైనా … ఏ మతానికి చెందిన వారైనా… ఏ ప్రాంతానికి చెందిన వారైనా …,
ఎందుకంటే మీరిప్పుడు నాకోసం వినకండి సావధానంగా…. సాలోచనంగా…. “మీకోసం… మీభార్యలకోసం… మీబిడ్డల కోసం… మీకుటుంబాల కోసం… మీరు నిర్మించబోయే నవభారత నిర్మాణం కోసం… వినండి” ఆవిడ మాటలు పని చేశాయి అందరూ నిశ్శబ్దంగా ఉన్నారు.
“ప్రేమించి పెళ్లిచేసుకున్నా … పెద్దలు కుదిర్చిన పెళ్లి చేసుకున్నా … భారతీయ వివాహ వ్యవస్థ చాలా ఉన్నత మైనది. దానిని కాపాడుకోవలసిన ఆవశ్యకత మన మీదనే ఆధారపడి ఉంది. మారుతున్న సమాజంలో సహజీవనాల మధ్య బ్రతుకుతున్న మనం మన స0ప్రదాయాలను, సంస్కృతులను విస్మరిస్తున్నాం, మనకు నచ్చిన విధంగా మార్చేసు కుంటున్నాం. ఏవి మారినా ఇబ్బంది లేదు కానీ వివాహం విడాకులుగా మారితే వ్యవస్థ విచ్ఛిన్నం అయిపోతుంది. కాబట్టి ఒకరినొకరు అర్ధం చేసుకొని సర్ధుకుపోతే సంసారాలలోని సారాన్ని గ్రహించిన వాళ్లమవుతాం….”
“విపరీత పరిణామాల మధ్య నలిగిపోతున్న మీరు ఈ రోజు ఇక్కడికి రాగలిగారంటే మీకు మీ భార్యలను వదిలేయాలనే కోరిక కాని, వారిని ఇబ్బంది పెట్టాలనే ఆలోచన కానీ ఎంతమాత్రమూ లేవు అనే విషయం స్పష్టంగా అర్ధ మవుతుంది. దానితో పాటే పని ఒత్తిడిలో వాళ్ళను నిర్లక్ష్యం చేస్తున్నారనే విషయం కూడా మీరు రాసిన ప్రశ్నలను బట్టి అర్ధమవుతుంది.”
ఆవిడ గొంతు గంభీరంగా ఉంది. కానీ అందులో తీయదనం ఉంది. “చిన్నపిల్లాడు తప్పు చేస్తే తల్లి ఎలా అయి తే తప్పును సరిదిద్దాడానికి ప్రయత్నిస్తుందో అలాంటి ప్రయత్నం ఆమె చేస్తున్నట్టుగా నాకు అనిపిస్తుంది….” చందు లోలోపల అనుకుంటున్నాడు…..
ఆమె మాట్లాడుతుంది… ఆమె అడుగుతుంది… ఆమె ప్రశ్నిస్తుంది…
“మీరు ఆఫీస్ కి వెళ్ళిన తరువాత ఏరోజైనా మీ భార్యకు ఫోన్ చేసి తిన్నావా ?” అని అడిగారా
“ఒకవేళ మీకు తీరిక లేక పని ఒత్తిడిలో ఫోన్ చేయలేకపోతే , తనే చేసినప్పుడు మీరు హడావుడిగా, చిరాకుగా, కోపంగా మాట్లాడకుండా ప్రశాంతంగా ఎప్పుడైనా మాట్లాడారా?”
“పోనీ పనిలో బిజీగా ఉన్నాననే విషయాన్ని, తరువాత ఫోన్ చేస్తాను లేదా చేయమనే విషయాన్ని మీరు నెమ్మదిగా చెప్పిన సందర్భాలున్నాయా ?”
“బిజీ గా ఉన్నప్పటికీ తీరిక చేసుకొని భార్య మీద ప్రేమతో మీరు మాట్లాడినా…?! మీరు మీ భార్యకు ‘ఐ లవ్ యు’ అనే పదాన్ని చెప్పగలిగారా ?” “ప్రేమించి పెళ్లి చేసుకున్న వారు పెళ్లి చేసుకున్న తరువాత ఎన్ని సార్లు ‘నేను నిన్ను ప్రేమిస్తున్నాను’ అని చెప్పిఉంటారో … ?!” నాకు చెప్పాల్సిన అవసరం లేదు ? మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి.
“ఇవన్నీ ఎందుకంటే పెళ్ళికి ముందు ప్రేమించడం గొప్ప విషయం కాదు పెళ్ళైన తరువాత కూడా ప్రేమించడం గొప్ప విషయం. ఆ ప్రేమను వ్యక్తపరచడం ఇంకా గొప్ప విషయం. కానీ ఎవ్వరూ అలా వ్యక్తపరిచే వాళ్ళు లేరు. కారణం పెళ్ళైన తరువాత నువ్వు తిట్టినా, కొట్టినా భార్యలు పడాలి, పడితీరాలి అనే ఒక మూర్ఖపు భావన …”
“భర్త పదివేలు పెట్టి పట్టుచీర తెస్తే ఆడవాళ్ళు ఎంత సంతోషపడతారో…మీ దృష్టిలో అది అంతులేని ఆనందం.. కానీ ఆవిడకు ఆ సంతోషం తాత్కాలికమే… కానీ ‘పదినిముషాలు పక్కన కూర్చొని మాట్లాడితే పరవశించి పోతారు. పది జన్మలకైనా నీకే భార్యగా పుట్టాలనుకుంటున్నాని చెప్పడానికి సిగ్గుల మొగ్గలతో పులకించిపోతారు.’ శాశ్వితంగా గుర్తుంచుకుంటారు.” పెళ్ళైన దగ్గర నుంచి నా భర్త నాకు ‘ఐ లవ్ యు’ అని చెప్పని రోజు లేదంటే మీరు నమ్ముతారా? చివరకు ఆయన చనిపోయే ముందు కూడా నాతో పలికిన చివరి పలుకులు ఏమిటో తెలుసా ‘ఐ లవ్ యు… బంగారం’
“మీరు ఏరోజైనా భార్యకు మూరెడు మల్లెపూలు తీసుకెళ్ళారా ? సరదాగా సినిమాకు తీసుకెళ్ళారా ?”
“సాయంత్రం షికారుకెళ్లి ఏ కాఫీనో, కూల్ డ్రింకో త్రాగుతూ మనసువిప్పి మాట్లాడుకున్నారా? మీ బెస్ట్ ఫ్రెండ్ కి ఇచ్చే స్థానాన్ని ఏరోజైనా మీ భార్యకివ్వగలిగారా?”
“మీ ప్రేమలేఖల్ని, మీ శుభలేఖల్ని, మీ పెళ్లి ఫోటోలని, మీ పెళ్లి వీడియోలని, మీకున్న గతవైభవ జ్ఞాపకాలని ఏరోజైన మనశ్శాంతిగా కూర్చొని చూడగలిగారా? అంత టైమ్ మీ భార్యకు మీదైనందిన జీవితంలో కేటాయించగలిగా రా ? ఆలోచించండి ”
“పొరపాటున తెలిసో, తెలియకో మాట జారినప్పుడు మూతి పగలగొట్టకుండా నా భార్యే కదా అని మనసుకు హత్తుకున్నారా?”
అన్నిటినీ మించి “అందరినీ వదిలేసి నీ కోసం వచ్చిన నీ భార్యను , నీదైపోయిన నీ భార్యను… తన వాళ్ళు గుర్తుకు రాకుండా గుండెల్లో పెట్టి చూసుకో గలుగుతున్నారా?” ఈ ప్రశ్నలకి సమాధానాలు మీకు తెలిస్తే మీ భార్య మీ పట్ల ఎందుకలా ప్రవర్తిస్తుందో మీకు అర్ధమవుతుంది.
ఇలాంటి ప్రశ్నలు ఆవిడ ఒకదాని తరువాత ఒకటి మామీద సంధిస్తూనే ఉంది. కాదు… కాదు… మా తప్పుల్ని చాలా తెలివిగా మాకే గుర్తుచేసి, తప్పుచేశామనే భావనను మాలో కలిగించి ఆ తప్పులు దిద్దుకునే విధంగా అడుగులు వేయడానికి మార్గాలు చూపుతున్నట్టుగా ఉంది.
అవును… అందరి గురించి నాకు తెలియదు కానీ, ఆవిడ చెప్పిన ప్రతి తప్పూ నేను చేస్తున్నదే … కీర్తన అన్నట్టు నేను మారాను … “ఎంతలా మారానంటే నేను మారానన్న సంగతి నేను గుర్తించడానికి సమయం లేనంతగా మారి పోయాను”. నా మార్పు నాలోనే కాదు కీర్తనలో కూడా మార్పు కలిగించింది. తన స్వరూపాన్ని, స్వభావాన్ని మార్చే టంతగా నా మార్పు తనలో పరిణామం చెందింది. ‘తనది అనుమానం కాదు బాధ.’ నేను దూరమైపోతున్నాననే బాధ. తనకు దక్కకుండా పోతాననే బాధ. తనను నిర్లక్ష్యం చేస్తున్నాననే బాధ. తనను బాధ పెడుతున్న నేను ఆ విషయాన్ని గ్రహించలేకపోతున్నాననే బాధ, తన బాధను గ్రహించకుండా తనే నన్ను తన ప్రవర్తనతో, తన మాటలతో బాధపెడు తుందని ఈ రోజు ఇలా ….
జరిగేదంతా మంచికే అన్నట్టు ఇక్కడికి రావడం మంచిదయ్యింది. నా లోపాల్ని నేను తెలుసుకున్నాను.
చందు తనలో తాను తన ప్రశ్నలకి సమాధానాలను చెప్పుకుంటున్నాడు. తన సమస్యలకు పరిష్కారాలను వెదుక్కుంటున్నాడు.
*****
“మీరు రాసిన అన్ని ప్రశ్నలూ దగ్గరాదగ్గరగా ఒకేలా ఉన్నాయి. అందరి సమస్యా ఒక్కటే… కానీ ఒక్క ప్రశ్న మాత్రం వీటన్నిటికీ భిన్నంగా కనిపిస్తోంది. అయితే నాకు తెలిసి ఆ ప్రశ్న రాసిన వ్యక్తి తనలో అంతర్లీనంగా ఉన్న సమస్యను రాయడానికి సిగ్గుపడి, భయపడి, మొహమాటపడి ఏంరాయాలో అర్ధం కాని స్థితిలో “వయసు మీద పడకుండా….”ఉండాలంటే ఏంచేయాలి..?అని రాసి ఉంటాడని నా అభిప్రాయం. కనుక ఈ ప్రశ్నకి మేము పారితోషికం ఇవ్వాలని నిర్ణయించడం జరిగింది.” అనగానే … చందూకేమీ అర్ధం కాలేదు….
ఆ ప్రశ్న రాసిన వారిని పిలుస్తున్నారు…
“ఎవరూ వెళ్ళడం లేదు. ఎందుకంటే చందు అక్కడ ఉండగా ఇంకెవరు వెళతారు…”
అంతలోనే ఎవరో లేచి… “మీరు చెప్పిన వాటికి , ఆ ప్రశ్నకూ ఎలాంటి సంబంధం లేదు కదా ఆ ప్రశ్నకు మీరెలా పారితోషికం ప్రకటించారు” అని అడగ్గానే , ఆవిడ వెంటనే
“నేను చెప్పిన ఇన్ని విషయాలను ప్రక్కన పెట్టి పారితోషికం గురించి మాట్లాడుతున్నావంటే నువ్వు సమస్యలు ఉండి రాలేదు. సమస్యలు సృష్టించే డబ్బు కోసం వచ్చావు. అయినా చెప్పాల్సిన బాధ్యత మా మీద ఉంది కనుక చెప్పాలి.”
“లైలా మజ్నూ, రోమియో జూలియట్, దేవదాసు పార్వతి….
సీతారాములు, శివపార్వతులు, రాధాకృష్ణులు …. వీళ్ళంతా ఇంకా మనలో బతికే ఉన్నారు. వయసు మీద పడిన వాళ్ళు ఎవరూ ఇంతకాలం బతికి ఉండరు కదా…! అనిర్వచనీయమైన ప్రేమకు , నిస్వార్ధమైన ప్రేమకు, అది ఉన్న జీవులకు “వయసుమీదపడదు”. అలాంటి ప్రేమను పంచమని, ప్రేమామయులుగా ఉండమని నేను ఇంతసేపూ చెప్పాను. అలాంటి ప్రేమను పంచిన రోజున భార్య గుండెల్లోనే కాదు… ఎక్కడైనా చిరస్థాయిగా నిలిచిపోతారు. తన సమస్యను రాయకుండా, భార్యను నలుగురిలో పెట్టకుండా తన సమస్యకు తానే పరిష్కారాన్ని వెదికేలా సంబంధంలేని ప్రశ్నను సంధించి తన సంబంధాన్ని ధృడంగా మార్చుకున్నాడు కనుకనే ఈ ప్రశ్నకు పారితోషికం ప్రకటించడం జరిగింది.”
“మీలో మార్పు వస్తే … పతనమవుతున్న విలువల్ని, విచ్ఛిన్నమవుతున్న వివాహ వ్యవస్థని, నవభారత నిర్మాణ సారధులుగా మీరు కాపాడగలిగితే నేడో, రేపో పోయే ఈ ప్రాణం మాట్లాడిన మాటలకి విలువ ఉంటుందని, నా బ్రతుకు కి ఒక అర్ధం వస్తుందని ఆశిస్తున్నాను. సెలవు….
*****
అందరూ వెళ్ళిపోయారు
చందు ఒక్కడే మిగిలిపోయాడు
ఆవిడ చందు దగ్గరకు వచ్చి “ఎందుకు నువ్వు వేదిక మీదకు వచ్చి పారితోషికం తీసుకోలేదు” అని అడిగింది.
“నాకు రావాల్సిన పారితోషికం వచ్చేసింది… అయినా, ఆ ప్రశ్న రాసింది నేనే అని మీకెలా తెలుసు” అన్నాడు
“బరువెక్కిన నీ గుండెల్లో పశ్చాత్తాపం కళ్ళల్లో నీళ్లుగా మారుతుంటే తుడుచుకోలేక వేదన పడుతున్న నీ చేతి వేళ్లు , సెలయేళ్లుగా మారిన చెక్కిళ్లు , తడిచి ముద్దైపోయిన నీ పాదాలు …” చెప్పకనే చెబుతున్నాయి నాయనా….
“ఇప్పుడు నీలో నాకు మార్పు కనిపిస్తుంది…”
“నాకు కూడా కనిపిస్తుంది అమ్మ” అనుకుంటూ చందు అక్కడినుంచి వెళ్లిపోయాడు.
*****
“కీర్తన రేపటి నుంచి వారం రోజులు సెలవు పెట్టేశాను… ఎక్కడెక్కడికి వెళ్దాం… ఎలా వెళ్దాం… అన్నీ నువ్వే ప్లాన్ చెయ్యి. ఒక అరగంటలో ఇంటికి వచ్చేస్తా. ఏదైనా సినిమాకు వెళ్ళి, అటునుంచి అటు రెస్టారెంట్ కి వెళ్ళి డిన్నర్ చేద్దాం. రెడీ గా ఉండు … ఓకేనా…
“సినిమాకి వద్దండి… ఈ రోజు శుక్రవారం కదా అమ్మవారి గుడికి వెళ్దాం. అక్కడి నుంచి రహీమ్ అన్నయ్య వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ పాపను చూసి, ఆ ఏరియాలో చర్చి ప్రారంభోత్సవం ఉందట, ప్రక్కింటి మరియా పిన్ని గారు భోజనానికి అక్కడికి రమ్మన్నారు వెళ్దాం బావా …… ప్లీజ్ … ప్లీజ్ … ప్లీజ్ …”
“అన్నిసార్లు నువ్వు ప్లీజ్ అనాల్సిన అవసరం లేదు బంగారం… నీఇష్టం.”
“లవ్ యు బంగారం…”
బాయ్… బాయ్……
-అప్పారావు పంతంగి
హాసం!
పసుపు వన్నె-
వర్ణ వలయంలో మరింత వెలుగు.
ఇక్కడ కొన్ని దరహాసాల అలలు ఎగసిపడుతున్నాయి
కొన్ని పొరలు పొరలుగా:
మృదువైన చిర్నవ్వు, విస్మయం, చిలిపిదనం,
ఇంకొన్ని పకపకలు.
నవ్వులో మునిగి తేలుతునప్పుడు
ఎంత తేలికపడి పోతాం, మనమే నమ్మలేనంతగా. కాదా?
అన్ని ప్రాపంచిక దిగుళ్ళనీ దాటుకుంటూ
కొన్ని బుడగలుగా, కొన్ని పూల రెక్కలుగా
ప్రవహిస్తూ వెళ్ళిపోతాం కదా,
ఈ సంతోషాల అలల మీంచి-
తెలంగాణలో ఇప్పుడు మౌనం కాదు, నిర్మాణాత్మక విమర్శ అవసరం!
(ఈ 23 న తెలంగాణా ఎన్నారై అసోసియేషన్ తొలిసారిగా ఇస్తున్న తెలంగాణా సాంస్కృతిక పునరుజ్జీవన అవార్డుల సందర్భంగా)
గత అరవై యేండ్లకు పైగా తెలంగాణ ప్రజల తండ్లాట తీరిపొయ్యి, పోరాటం సఫలమై, కన్న కలలు సాకారమై ప్రత్యేక రాష్ట్రం యేర్పడ్డది. ఆంధ్ర వలస పాలకుల పాలన నుండి విముక్తి కలిగింది. పరాయి పాలన ను తరిమికొట్టిన తెలంగాణ ప్రజలు, రాష్ట్రం కోసం కొట్లాడిన ఉద్యమ రాజకీయ పార్టీని యెన్నికల్లో గెలిపించిండ్రు. అధికారం కట్టబెట్టిండ్రు. ఉద్యమానికీ, రాజకీయ పార్టీ కి నాయకత్వం వహించిన వారే యిప్పుడు తెలంగాణ ప్రభుతానికీ నాయకత్వం వహిస్తున్నరు. ఇది తెలంగాణ చరిత్రలో మొత్తంగా భారతదేశ చరిత్రలో అపురూపమైన సన్నివేశం.
ఉద్యమంలో ప్రదాన భాగస్వామ్యం వహించినందుకూ, తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఆవశ్యకతా, ఆకాంక్ష వెనుకనున్న ఆరాటమూ పోరాటంగా మునుముందుకు రావడానికి కీలక పాత్ర వహించినందుకూ రాష్ట్ర యేర్పాటు తర్వాత ప్రభుత్వ పగ్గాలు చేపట్ట్డడం వల్ల, సహజంగానే నాయకత్యం పైన ప్రజలకు ఆశలూ చాల ఎక్కువగా ఉంటాయి. అట్లే తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాలా ప్రజానీకం పట్లా నాయకత్వానికి బాధ్యతా కూడా చాలా యెక్కువగానే ఉంటుంది. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో తెలంగాణ సమాజం లోని అన్ని వర్గాల, సబ్బండ వర్ణాల ప్రజలు క్రియాశీలకంగా పాల్గొని తమవైన అనేకానేక నిర్దిష్ట ఆశలనూ ఆకాంక్షలనూ యెజెండా మీదికి తెచ్చారు.
తెలంగాణ రాష్ట్రం వచ్చాక అవన్నీ నెరవేరుతాయనీ, నెరవేరాలనీ ఆశించారు, కోరుకున్నారు. విభిన్న సమూహాలకు చెందిన ప్రజలు, తమ తమ ఉమ్మడి సామాజిక కోర్కెలను, తరతరాలుగా అణచివేతకు గురైన తమ అస్తిత్వ ప్రయోజనాలనూ రంగం మీదికి తీసుకొచ్చి, ప్రత్యేక రాష్ట్రం యేర్పాటైతే అవన్నీ సాధ్యమౌతాయని బలంగా నమ్మారు. తెలంగాణ లో బలంగా ఉన్న సామాజిక ఉద్యమాల నేపథ్యం లో ముందుకొచ్చిన ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం అటువంటి నమ్మకాలకు ఆలంబన నిచ్చింది. ప్రత్యేక తెలంగాణ ఉద్యమం కేవలం ప్రత్యేక రాష్ట్రం కోసం మాత్రమే కాకుండా తెలంగాణ ప్రజల అనేకానేక సమస్యల పరిష్కారం కోసం సాగిన విస్తృత ఉద్యమమైంది. అయితే ఉద్యమం సాగుతున్న క్రమంలో యెక్కడా నాయకత్వం ఉద్యమ పరిధుల్నీ , పరిమితుల్నీ స్పష్టం చేయడం జరుగలేదు, అది అంత సులభంగా సాధ్యమయ్యే పని కాదు కూడా!
యిప్పుడు రాష్ట్రం సాకారమయ్యాక ఒక విచిత్రమైన వాతావరణం నెలకొని ఉన్నది. ప్రజలు అధికారం కట్టబెట్టిన తెలంగాణ ప్రభుత్వం తన పద్దతి లో తాను పరిపాలన కొనసాగిస్తున్నది. ప్రభుత్వ నాయకత్వం , తెలంగాణ ప్రజా సమస్యల పట్ల తనదైన దృక్పథంతో పని చేస్తూ, తాను సరైనవనుకున్న నిర్ణయాలను అమలు చేస్తూ ముందుకు సాగుతున్నది. రాష్ట్రం యేర్పడి ఆరు నెలలే ఐంది కాబట్టి, ప్రభుత్వానికి దొరికింది ఆరు నెలలే కాబట్టి, అప్పుడే అది విఫలమైందా సఫలమైందా అని తీర్పు చెప్పడం సరైంది కాదు. చేసిన ప్రకటనలూ, అమలు చేస్తున్న కార్యక్రమాలనూ బట్టి ప్రభుత్వం పనితీరుని బేరీజు వేయాల్సి ఉంటుంది. అయితే ప్రభుత్వ పనితీరు పట్ల అభిప్రాయాలూ, వైఖరీ, విమర్శా యెట్లా ఉండాలి అనే అంశాల మీద భిన్న ధోరణులు మనకు కనబడుతూ ఉన్నాయి.
తెలంగాణ సమాజం చాలా చైతన్యవంతమైన సమాజం. తెలంగాణ ప్రజలు అత్యంత సమరశీలులూ, ఆలోచనల్లో అత్యంత పరిణతి చెందినవాళ్ళూ అనడం లో యెంత మాత్రమూ సందేహం లేదు. అందుకే ప్రత్యేక రాష్ట్రం యేర్పడగానే మనం యేమి జరుగుతుందని ఊహించవచ్చో, యేమి ఆశించవచ్చో , తెలంగాణ ప్రబుత్వం యేమి చేయగలుగుతుందో, యేమి చేయలేదో, యేవి దాని పరిధి కి లోపల ఉన్నాయో యేవి బయట ఉన్నాయో, ప్రభుత్వ పరిమితులేమిటో అనే విషయాలపై అనేక భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతునాయి. ఈ అభిప్రాయాలు సమాజం లోని భిన్న దృక్పథాల ప్రజానీకం నుండి వెలువడుతున్నయి కాబట్టి సహజంగానే వాటి మధ్య అనేక వైరుధ్యాలు ఉంటాయి.
ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమ పార్టీ తో నున్న వారు రాష్ట్ర యేర్పాటు తర్వాత సహజంగానే ప్రభుత్వం తో, ప్రభుత్వం నడిపే పార్టీ తో ప్రదాన స్రవంతి రాజకీయాలతో యేకీభవి స్తూ, ఆయా కార్యక్రమాల్లో పాల్గొంటూ తెలంగాణ రాష్ట్ర పునర్నిర్మాణానికి తమకు సరైందని తోచిన పద్దతుల్లో తోడ్పడుతున్నారు. ఈ క్రమంలో అవినీతీ, స్వలాభాపేక్ష తదితర అంశాలని కొంచెం సేపు పక్కకు పెడితే, వీరికి ప్రభుత్వం పట్లా , ప్రభుత్వ కార్యక్రమాల పట్లా పద్దతుల పట్లా విమర్శనాత్మక దృక్పథం సహజంగానే ఉండదు. ప్రభుత్వం , ప్రభుత్వాన్ని నడిపిస్తున్న నాయకత్వమూ, పార్టీ అంతా సవ్యంగానే చేస్తుందని, అందులో విమర్శించడానికేమీ లేదనీ , విమర్శిస్తే మనం చేజేతులా మనం నిర్మిస్తున్న భవంతిని మనమే కూలగొట్టుకున్న వాళ్లమౌతామని బలంగా నమ్ముతారు. తెలంగాణ వాదమే ఊపిరిగా ఉన్న రాజకీయ పార్టీ తెలంగాణకు వ్యతిరేకంగా యేదీ చేయదనీ, దాన్ని విమర్శించడం అంటే తెలంగాణ వాదాన్ని విమర్శించడమే అని గట్టిగా వాదిస్తారు.
‘అయితే మీరు మా వైపు లేదా తెలంగాణ వ్యతిరేకుల వైపు’ అని నిర్దంద్వంగా వర్గీకరిస్తారు. మరో పక్క, తెలంగాణ ప్రభుత్వాన్ని నడుపుతున్న రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా ఉన్న వాళ్ళు, ప్రతిపక్ష రాజకీయ పార్టీలు కావచ్చు లేదా మరేదైనా ప్రదాన స్రవంతి రాజకీయ అభిప్రాయాలను సమర్థించే వారైనా కావచ్చు – అదే పనిగా ప్రభుత్వం మీదా, నాయకత్వం వహిస్తున్న రాజకీయ పార్టీ మీదా దుమ్మెత్తి పోస్తుంటారు. ప్రభుత్వం చేసే ప్రతి పనినీ, చేపట్టే ప్రతి కార్యక్రమాన్నీ, నాయకత్వం తీసుకునే ప్రతి నిర్ణయాన్నీ , అమలు చేయాలను కున్న ప్రతి పథకాన్నీ భూతద్దం లో చూపి , పూర్తిగా నిరాకరిస్తూ తీవ్రంగా విమర్శిస్తారు. విమర్శలో యేమాత్రం నిర్మాణాత్మకత ఉండదు. తెలంగాణ సమాజం తాత్కాలిక లేదా దీర్ఘకాలిక లక్ష్యాలకు గానీ ఉపయోగపడేది ఈషణ్మాత్రమైనా ఉండదు. యిటువంటి విమర్శ వినాశాత్మక విమర్శ. అది కేవలం తమ స్వప్రయోజనాలనాశించి, అవి యెట్లయినా సరే నిలుపుకోవాలనే పట్టుదలతో, హ్రస్వదృష్టి తో చేసే స్వార్థ పూరిత విమర్శ. యిటువంటి విమర్శ తెలంగాణ సమాజానికి చేటు కలిగిస్తుంది.
అయితే, ప్రదాన స్రవంతి రాజకీయాలకు, అధికార రాజకీయాలకు వెలుపల వాటికి భిన్నమైన అభిప్రాయాలు కలిగి, ప్రగతిశీల ఆలోచనా విధానం కలిగి ఉన్న ప్రజా సమూహాలు తెలంగాణ లో యెన్నో ఉన్నాయి. వీరంతా ప్రత్యేక రాష్ట్ర ఉద్యమంలో యెంతో ఉద్యమ స్ఫూర్తితో అత్యంత క్రియా శీలకంగా పాల్గొన్నారు. ప్రాణాలకు లెక్క చెయ్యకుండా ఉద్యమాల్లో దూకి లెక్క లేనన్ని పోలీసు కేసులు, నిర్బంధాలనూ తట్టుకున్నారు. తమదైన ఆశలతో, ఆకాంక్షలతో నిర్దిష్ట వ్యూహంతో పాల్గొన్నారు. ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు లో వీరి కృషి సామాన్యమైనది కాదు.
అయితే ఆశ్చర్యంగా, రాష్ట్రం యేర్పడ్దాక వీళ్లలో చాలా మంది ఒక రకమైన వింత మౌనాన్ని పాటిస్తున్నారు. నిర్లిప్తతను ప్రకటిస్తున్నారు. వీళ్లలో చాలా మందికి తెలంగాణ ప్రభుత్వాన్ని విమర్శించాలా వద్దా, విమర్శిస్తే తమని తెలంగాణ వ్యతిరేకులంటారా అనే సందేహాలు బలంగా ఉన్నాయి. కొంతమందికైతే, ‘ ప్రత్యేక రాష్ట్రమొస్తే యేదో జరుగుతుందని తాము కేవలం భ్రమ పడ్డామా ? యిప్పుడీ ప్రభుత్వ పని తీరు చూస్తుంటే ఆ భ్రమలన్నీ పటాపంచలయ్యాయా? ’ అనే అభిప్రాయాలు కూడా బలంగానే కలుగుతున్నాయి. అయితే దీనికి కారణం ప్రత్యేక రాష్ట్ర యేర్పాటు వల్ల తెలంగాణ లో సాధ్యమయ్యే వాటి కున్న పరిధులూ పరిమితుల పట్ల సంపూర్ణ అవగాహన లేకపోవడమన్నా కావాలి, లేదా తాము కలగన్నట్టు, తాము అనుకున్నట్టు, ఆశించినట్టు ప్రభుత్వమూ , నాయకత్వమూ ప్రవర్తించాలి అన్న అత్యాశా ఐనా కావాలి.
ముందుగా కొన్ని విషయాలని స్పష్టం చేసుకోవాలి. ప్రత్యేక తెలంగాణా రాష్ట్ర యేర్పాటు కొన్ని పరిధుల్లో పరిమితుల్లో జరిగింది అని మర్చి పోరాదు. భారత దేశ పార్లమెంటరీ విధానం లో భాగంగా రాజకీయర్థిక వ్యవస్థలో భాగంగా, భారత రాజ్యాంగానికి అనుగుణంగా, భారత చట్ట, న్యాయ వ్యవస్థలకనుగుణంగా మిగతా అన్ని రాష్ట్రాల లాగానే ఆ పరిధి లోనే ఆ పరిమితుల్లోనే జరిగింది. దీనికి భిన్నంగా ఇక్కడేదో భిన్నమైన వ్యవస్థ ఉందనీ, భిన్నమైన చట్టం , న్యాయం , రాజకీయార్థిక వ్యవస్థ అమలు చేయవచ్చనీ అనుకోవడం సరైంది కాదు. అమాయకత్వమౌతుంది. తెలంగాణ ను విముక్తి చేసి సమసమాజాన్ని యేర్పాటు చేయవచ్చని అనుకోవడం సరైంది కాదు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం లో పీడిత ప్రజలు రాజ్యంస్థాపించుకోగలరు అని ఆశ పడడమూ సరైంది కాదు. భారత రాజ్యాంగం పరిధిలో యేది సాధ్యమౌతుందో అది మాత్రమే తెలంగాణలో వీలౌతుంది. నిజానికి అత్యంత ప్రగతి శీలమైన భారత రాజ్యాంగంలో ప్రజలకు మేలు చేసే వాటన్నిటినీ అమలు చేసేలా తెలంగాణ ప్రభుత్వం పై ఒత్తిడి తేవచ్చు.
ఆ దిశగా సరికొత్త పునర్నిర్మాణ ఉద్యమం నిర్మించవచ్చు. అందుకు భిన్నంగా వ్యవహరించి ప్రజలని అణచి వేసే వైఖరికి పాల్పడితే ప్రభుత్వం విధానాలను విమర్శించవచ్చు – ఉద్యమించవచ్చు. అట్లా భారత రాజ్యాంగానికనుగుణంగా, రాజ్యాంగ పరిధిలో తెలంగాణ లో ప్రజల విముక్తి, అభివృద్ధి, వికాసం కోసం తెలంగాణ ప్రభుత్వం (యే యితర రాష్ట్రాల ప్రభుత్వాలు యిప్పటిదాకా చేయక పోయినా, చేయ నిరాకరించినా ) సృజనాత్మకంగా యేమి చేయవచ్చో యెజెండా మీదికి తీసుకురావాల్సిన అవసరమూ బాధ్యతా మనందరి పైనా ఉన్నది. అయితే తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న ప్రస్తుత పథకాలనూ , కార్యక్రమాలనూ నిర్ణయాలనూ , పనితీరునూ , ప్రత్యేక రాష్ట్ర ఉద్యమం యెజెండా మీదికి తెచ్చిన నినాదాలకు (“ మన నీళ్ళూ, మన నిధులూ, మన నియామకాలూ మన కోసమే , పరాయి వలస పాలన నుండి విముక్తి, ఆత్మగౌరవ పాలనా లక్ష్యం” ) అనుగుణంగా ఉన్నయా లేదా అనే గీటు రాయి మీద పరీక్షించాల్సి ఉంటుంది. యెక్కడైనా ప్రభుత్వం దాన్ని నడిపిస్తున్న నాయకత్వమూ దీనికి భిన్నంగా ఉందనిపించినా, మళ్ళీ ఆంధ్రా వలస పాలకులకు, దోపిడీ పెత్తందార్ల కు అడుగులకు మడుగులొత్తినట్టనిపించినా, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు ఆశలకు నష్టం కలిగించేలా వ్యతిరేకంగా ఉందనిపించినా విమర్శించాల్సిన బాధ్యత మనపైనున్నది.
అట్లే కేవలం ప్రత్యేక రాష్ట్ర ఆకాంక్షలు మాత్రమే కాకుండా ప్రజా బాహుళ్య సంక్షేమం, అట్టడుగు వర్గాల ప్రజల అభ్యున్నతి , విముక్తి, వారి కనీస జీవిత అవసరాలని తీర్చడం, అందరికీ విద్య ఆరోగ్యం, అందరికీ ఉద్యోగ ఉపాధి కల్పనా , సామాజికాభివృద్ధీ, కనీస ప్రజా స్వామిక హక్కులు లాంటి అంశాలపై ప్రభుత్వాన్ని తన కనీస బాధ్యతలని గుర్తుచేస్తూ నిర్మాణాత్మక విమర్శ చేయడం ఇప్పటి పరిస్థితుల్లో మనందరి బాధ్యత! ముఖ్యంగా ప్రధాన స్రవంతి రాజకీయాలకు బయట ఉండి, యెటువంటి స్వలాభాపేక్షా, స్వార్థ ప్రయోజనాలూ లేకుండా కేవలం సమాజం మేలు కాంక్షిస్తూ ఉద్యమ స్ఫూర్తి గల వారి పై ఈ బాధ్య త మరింత యెక్కువగా ఉన్నది. అట్లే మొత్తం ప్రత్యేక రాష్ట్ర ఉద్యమానికి ఖండాంతరాలలో ఉన్నా , తమ హృదయాలను తెలంగాణ లోనే పదిలంగా ఉంచి ఉద్యమానికీ , రాష్ట్ర యేర్పాటు తర్వాత పునర్నిర్మాణానికీ యెంతో తోడ్పడు తున్న ఎన్ ఆర్ ఐ ల పైనా ఈ బాధ్యత యెంతో ఉన్నది.
అట్లా కాకుండా మౌనాన్నీ నిర్లిప్తతనూ పాటిస్తే తీవ్రమైన నష్టాలనెదుర్కోవాల్సి వస్తుంది. మాట్లాడాల్సిన వాళ్ళు, నిర్మాణాత్మక విమర్శ చేయా ల్సిన వాళ్ళూ తమకెందుకులే అనే నిర్లిప్తత ను పాటించినా , విమర్శిస్తే యేమౌతుందో అనే సందిగ్ధం లో పడి పోయినా, ‘యింక అంతా యింతేలే ‘ అనే నైరాశ్యంలో పడిపోయినా తెలంగాణ సమాజం చాలా కోల్పోతుంది. అప్పుడు కేవలం ప్రభుత అనుకూల వ్యతిరేక అనే స్వలాభాపేక్షకలిగిన స్వార్థ పూరిత విమర్శలే తప్ప నిజాయితీ తో కూడిన నిర్మాణాత్మక విమర్శ ఉండదు. అందువల్ల తాను తెలంగాణ సమాజావసరాలను తీర్చడంలో యెక్కడ నిర్ధిష్టంగా విఫలమైందో , యెందుకు విఫలమైందో తెలుసుకునే అవకాశం తెలంగాణ ప్రభుత్వానికుండదు. అటువంటి పరిస్థితుల్లో పాలకులు తాము చేసేదే యెల్లప్పుడూ సరైంది, విమర్శించే వారంతా తెలంగాణ ద్రోహులు అనే ద్వంద్వాత్మక వర్గీకరణ (binary categorization) చేసి నియంతృత్వ పోకడలకు పోయే ప్రమాదమున్నది.
భిన్న అభిప్రాయాలకు, వాటి ఘర్షణలకు తావు లేని సమాజం ప్రగతి దిశగా ముందుకు నడవడం అసాధ్యం. అట్లాంటి పరిస్థితి తెలంగాణా సమాజానికి రాకుండా ఉండాలంటే ఆలోచనా పరులు, బుద్ధి జీవులూ, ఉద్యమ శక్తులూ స్వార్థ ప్రయోజనాలకతీతంగా తెలంగాణ ప్రభుత్వ పనితీరుపై నిర్మాణాత్మక విమర్శ చేయాల్సి ఉంది. ప్రభుత్వ కార్యక్రమాలను, అవి సరిగా లేవనుకున్నప్పుడు, విమర్శిస్తూ , సమస్యల కు నిర్దిష్టమైన ప్రత్యామ్నాయాలను సూచించాల్సి ఉన్నది. భిన్న అభిప్రాయాలకు చోటునిస్తూ ప్రజాస్వామికంగా చర్చ చేయాల్సి ఉంది. అప్పుడే తెలంగాణ సమాజం పునర్నిర్మాణం జరిగి సర్వతోముఖా భివృద్ధి దిశగా ప్రయాణిస్తుంది.
-నారాయణస్వామి వెంకటయోగి
ఖేల్ ఖతమ్
ఆ రోజు మధ్యాన్నం మిడిమేలపు ఎండ మనిద్దరి మధ్యా చిచ్చు రేపినపుడు ఎడ తెగిన యాత్ర చేస్తున్న మనిద్దరిలో నువ్వు సందు మలుపుని స్టీరింగ్ తో అదుపు చేస్తూ, ఒక మాటన్నావు. మాట నోటి నుంచి, భావం నొసటి నుంచీ దూకుతుండగా ” ఏం దొరుకుతుందని ఇలా నువ్వు తనతో! “అనేసావు. నీ ప్రతి కదలికలో పోటెత్తిన అసహనపు అలల్ని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం సమాధానం తెలుసు! నిజమే! ఏం దొరుకుతుందని ఇలా నేను తనతో? నాకయినా నీకయినా మరెవరికయినా ఎవరితోనయినా ఏం దొరుకుతుందని ఇలా మనం!
మరీ ముఖ్యంగా
నీలాంబరం పువ్వుల్ని శిరస్సున దాల్చి
నాగు పాముల్ని మెడకు చుట్టుకుని
శిధిల భస్మాన్ని మేన అలదుకుని
జీవన కాంక్షల్ని లయించే
జగమంత కుటుంబపు ఏకాకుల వద్ద, సంచారుల వద్ద
ఏం దొరుకుతుందని ఇలా తనతో నేను !
నువ్వు కాస్త తమాయించుకుని చెట్ల నీడ పక్కన కట్టు గుంజకి యాత్రని కట్టేసి ఆగిన కాలాన్ని సహనంగా నిమురుతూ చాలా సేపే ఉండిపోయావు. విచారంతో రూపు మారిన పెదాలను సాగదీస్తూ మెల్లగా వినపడీ పడనట్లు ఏవేవో అంటూ ఆగుతూ చివరికి గుండెలోంచి వాక్యాన్ని పెకలిస్తూ ” లోకం బతకనిస్తుందా నిన్ను?” అనేసావు. నీ ప్రతి కదలికలో రాలిపడిన కారుణ్యపు పుప్పొడిని కళ్ళు విప్పార్చి చూడడం తప్ప నాకేం తెలుసు సమాధానం! అయితే యుగాలను క్షణాలు చేసే మాయావులు నన్నెట్లా బతికిస్తాయో మాత్రం చెప్పాలనుకున్నాను
రైలు కిటికీ నుంచి జారి పడే
రెండు కన్నీటి చుక్కలని దోసిలి పట్టడానికి
ఒక మహా పర్వతమే దిగివచ్చి
కొత్తగా మొలిచిన కాళ్ళతో పరుగులు తీస్తుంది
కలియ వచ్చిన పరవళ్ళను
ప్రేమతో నిమిరి పంపి
గుణభద్రా..తుంగభద్రా అంటూ
ఏకాంత సంద్రం ఘోష పెడుతుంది
తన కుంభ స్థలాన్ని కొట్టిన
చిన్ని గువ్వని పైకెత్తుకుని
మనో వీధుల్లో ఊరేగిస్తూ ఒక ఏనుగు
లోకానికి నాలుగు పూలగుత్తుల్ని ఇస్తుంది
వచ్చింది వటువే కదాని
మనసా వాచా కర్మణా
మూడడుగులు ఇచ్చి ఇష్టంగా
ఆక్రమణను ఆహ్వానిస్తాడు బలి చక్రవర్తి
యక్షుడూ యక్షిణీ
చెరొక వియోగ శిఖరం మీదా కూచుని
మేఘమాలలతో జీవితమంతా
అప్పండవున్ చేయిస్తారు
లోకముతో మనకేటికి లోలాక్షీ! రా పోదమని గుప్పిట మూసి అద్భుతాలను కల గంటూ ఉంటానని కదా అనుకుంటున్నావు. జ్ఞానమూ,దంతమూ వస్తూ వస్తూ తెచ్చే నెప్పి బాధించిన అనంతరం ఇక కలలు కలయికలు విరామాలు విడిపోడాలు ఉండవు. తను, నాకు ఉండడం కాదు తనంటూ ఈ లోకంలో ఉండడమే ఒక సెలబ్రేషన్ అయినాక గుప్పిట తెరిచి చూసాను. నన్ను కమ్మేస్తూ చుట్టూ అనుభవాలే. నీకయినా నాకయినా ఎవరికయినా మరెవరితోనైనా దొరికేవి అనుభవాలే..జరిగినవి జరగబోయేవి మెచ్చినవి నచ్చనివి దీర్ఘమైనవి ఇట్టే కరిగేవి గట్టిగా పట్టుకునేవి వేధించేవి నవ్వించేవి…మాయావులు మాయా తావులు మహానేర్పరులు అనుభవాలు…ఆది మధ్యాంత రహితాలు.
– కృష్ణవల్లి
ఇల్లే మనిషికి భరోసానా?
నిజమే! మనిషికే కాదు. పశు పక్ష్యాదులకు కూడా గూడు తప్పనిసరి అవసరం. వానరుడి నుండి నరుడు చలికీ, వానకీ, ఎండకీ గుహలు వెతుక్కుంటూనే వున్నాడు. కూడు, గుడ్డ, గూడు జీవికి ఎప్పటికీ ప్రాధమిక అవసరాలే. వీటి కోసం మనుషులు వారి వారి స్థాయిలకు తగినట్టుగా కొందరు కష్టపడుతున్నారు, మరికొందరు అలవోకగా అంతస్థులు కట్టగలుగుతున్నారు.
అలా చిన్న గూడు కోసం తపనపడ్డ ఒకానొక అల్పజీవి కధే .. కాళీపట్నం రామారావుగారి “ఇల్లు”.
ఈ కధకు కేంద్రం పావనరామయ్య కావచ్చుగానీ, మనుషులు సొంతానికి ‘గూడు’ వంటిదైనా సరే చిన్న కొంప కోసం పడే యాతన ఎలా వుంటుందో చూపించారు. ఇల్లు అనేది నెత్తి మీద నీడ కోసమే కాక, మనిషికి భరోసా ఎలా కలుగుతుందో … ఆ భరోసా మనిషి ధైర్యంగా నిలబడటానికి ఎలా ఉపకరిస్తుందో చెప్పిన కధ.
పావనరామయ్య అప్పు చేసి మరీ కట్టాడు. ‘ఆ అప్పు తీరే దారీ కనబడటం లేదు. ఇంకా ఇంటికి చేయవలసిన పనులూ అట్టాగే వున్నయ్యి. వాటికీ డబ్బు లేదు. ఇంకో వైపు ఎదిగిన ఆడపిల్ల పెళ్ళికుంది. ఆ పిల్ల బాధ్యత తీరాలి, పిల్లాడింకా చేతికంది రాలేదు! అయినా ఇంటికోసమే ఆ వున్న కొద్ది మొత్తం ఖర్చు చేశాడు, – “కనీసం తులం బంగారం గానీ, సెంటు భూమి గానీ, చేరడు ఇల్లుగానీ ఉంటే నేనానాడు అంత పిరికి బ్రతుకు బ్రతిక ఉండనక్కర లేదని, ఆ రోజుల్లో నేను తరచుగా అనుకునేవాణ్ణి.” .. ఇది పావనరామయ్య లాంటి వారి ఆవేదన. ఇలాంటి వారందరికీ ఇల్లు అందుకు అవసరం, – అంతే తప్ప, విలాసానికో, సొంత ఆస్తి పెంపకానికో కాదు.
రెక్కల కష్టం తప్ప సొంతాస్తి చిల్లీ గవ్వలేని వాళ్ళకు పిల్లలే ఆస్తి. చివరి దశలో ఒక ముద్ద పెట్టి కడ తేరుస్తారని ఆశ పడతారు. ఆ ఆశ ఎంత బరువైందంటే ప్రతి క్షణం పిల్లలు ఎక్కడ దారి తప్పుతారోనని కాపలా కాసుకునే ఆందోళన అంత హింసాత్మకమైంది. – “వాడికి చెప్పించిన చదువంతా నా కోసమే చెప్పించుకున్నాను. బ్రతికి వుంటే వాడికి పెండ్లి నా శ్రేయస్సును దృష్టిలో వుంచుకుని చేసే వాణ్ణి.” .. చనిపోయిన తన పెద్ద కొడుకు మీద కుటుంబ భారం వుందని తలచి, ఆ పిల్లవాడిని క్రమశిక్షణ పేరుతో తిట్టిన తిట్లు, పెట్టిన చీవాట్లు తలుచుకుని పశ్చాత్తాప్పడతాడతను. అందుకే భార్య దుఃఖం మీద ఎవరేమన్నా అతను మాత్రం ఏమీ అనుకోడు.
శేష జీవితం కొడుకు మీద ఆధారపడి వుందన్న అభద్రత ఆయన్ను క్షోభ పెట్టింది. అది తలుచుకుంటూ, “మనిషిలోసాహసానికైతేనేమీ, బ్రతుకులో ఆనందానికైతేనేమీ మూలం భరోసా – అది లేనినాడు మనిషి జీవచ్ఛవంగా తప్ప, మనిషిగా బతకలేడు” … ఇదీ పావనరామయ్య అభిప్రాయం. అట్లా ఆయనకు జీవితంలో భద్రతనిచ్చే చిన్న పిసరు ఆశ ఏ కోశానా లేకుండా పోయింది.
అయితే బ్రతుకులో భరోసా అందరికీ వుందా? వస్తుందా? అన్న ప్రశ్న ఉండనే ఉంది. ఏదో మేరకైనా ఇల్లుగానీ, తిండిగానీ అందరికీ సమకూరే అవకాశాలు లేని చోట కొందరికైతే ఇవి సమకూర్చుకోవడం ఎప్పటికీ ఒక జీవిత కాలపు యుద్ధమే! ఆ విషయం ఈ కధలో చెప్పకనే చెప్పారు. అద్దె కొంపలు కూడా లేని వాళ్ళను గురించి ప్రస్తావిస్తూ … ‘పోనీ పూరిపాకలు వేసుకోవచ్చు గదా! నామోషి అనుకోకపోతే …’ అన్న దానికి సమాధానంగా అవైనా వేసుకుని చూస్తే తెలుస్తుందంటారు.
నాలుగు తాటాకులు వేసుకున్నవాళ్ళు, అవి పీకి పారేయకుండా మున్సిపాలిటీ వాళ్ళ నోళ్ళు మూయించడం కోసం పడే నానా తిప్పలూ, సమర్పించుకునే నజరానాలు, ఎట్లా వుంటయ్యో చెప్తారు. అదే కాదు అసలు – “మీ గుడిసెలు అంటుకుంటే మా మేడలు కాలిపోతయ్యనే’ వర్గం, … ఆ వర్గాన్ని కాపాడే పాలనా యంత్రాంగం పని మీద ఇక్కడ విమర్శ పెడతారు.
పాలనా యంత్రాంగం కాపాడేది పై వాడి మేడల్నే కాదు … కింద వాళ్ళు ఎప్పటికీ మేడ కట్టకుండా తగు జాగ్రత్తలతో కనిపెట్టి వుండే బాధ్యత కూడా దాని నెత్తి మీదనే ఉంది. దాని కోసం చట్టాలు చేస్తుంది, ఆ చట్టాలు చేసే వాళ్ళు ఎప్పుడూ పైతరగతి వాళ్ళే!
పిల్ల పెళ్ళి కన్నా, ఇల్లు కట్టడానికే నిర్ణయించుకున్నావ్?”… అన్న బావమరిది ప్రశ్నకు – “ఈ ఇల్లు కొనడమొక్కటే నేను నా జీవితంలో ఆడగల జూదం – ఇల్లు కొంటే నేను నా ముసలితనాన్ని ధైర్యంగా ఎదుర్కోగలుగుతాను. అదృష్టం బాగుండి ఇల్లు దక్కించు కోగలిగితే నా కన్నా, నా పిల్లలు గొప్ప అదృష్టవంతులు కాగలరు. దక్కించుకోలేక పోవడానికి చాలా కాలం పడుతుంది. ఈ లోగా దేవుడు హాని చేయకపోతే నేను కన్ను మూసేయకపోను”… ఇంత అంతిమ కోర్కెగా ‘ఇల్లు’ ఎట్లా రూపు దిద్దుకుందీ?
మనిషి సొంతింటిలో చనిపోవాలనే కోరికా? లేక ఇల్లుంటే పిల్లలు, తల్లిదండ్రులను కనిపెట్టి చూస్తారన్న జిజ్ఞాసా? ఏది ప్రధానం? ఇందులో ఏది ముఖ్యమో తరువాత సంగతి గానీ, ఆ ఇంటికోసం జీవిత కాలమంతా పడే ఆందోళన అంతింతా కాదు.
“పశువులకూ, పక్షులకూ కూడా తమ స్వంత గూడంటూ వుంటుంది. మనిషి చచ్చిందాకా బతికి కూడా గూడు కట్టుకోలేక పోతున్నాడు.” దీనికి ఎవరిని ఏమనాలో తెలియడం లేదు,” .. “బ్రతుకు బ్రతుకల్లా శ్రమ పడి కూడ పెట్టిందంతా ధార పోసినా కానీ ఒక గూడు రాక పోవడం చాలా అన్యాయం.”
అట్టా మిగిల్చిన ‘ఫ్రావిడెంటు ఫండే’ గాక మరి కొంత అప్పు కూడా చేసి కట్టిన ఇల్లు ఎట్లాంటిదీ? ‘బొమ్మరిల్లంత’! కొడుకు పెళ్ళయి కోడలొస్తే ఎక్కడుండటమనే సమస్య ఇంటి కొచ్చిన వాళ్ళకే అర్ధమయినంత చిన్నది. గట్టిగా లావుగా వుండే వాళ్ళు ఒకరు నిల్చుంటే, రెండో వాళ్ళు వొరిగి నడిచేటంత ఇరుకు గది. ఆ ఇంటి కోసం పావన రామయ్య జీవితమంతా తపస్సు చేసి మరీ కట్టాడు.
అంత చిన్న ఇంటి కోసం కష్టపడటం సరే! మరి అంత చిన్న కొంప అతనికి భరోసా ఎలా అయ్యిందీ? ఎలా వచ్చిందీ? అసలు ప్రశ్న ఇది. ఈ దేశంలో భూమి లేని వాళ్ళు, గుడిసె లేనివాళ్ళు, ఉద్యోగం లేని వాళ్ళు కోట్లాదిమంది వున్నారనే స్పృహ పావనరామయ్య వంటి వాళ్ళకు లేక పోవడానికి కారణం యాదృచ్ఛికం కాదు.
ఉద్యోగమొక్కటే జీవికగా ఎంచుకోవడం, ఏ పనైనా చేసి బతకగలమనే ధైర్యం లేకపోవడానికి కారణం ‘శారీరక శ్రమ’ చేయలేక పోవడం, ‘శ్రమ’ మీద నమ్మకం, విశ్వాసం లేకపోవడమే, ‘పావన రామయ్య’ పిరికితనానికి మూలం. ఇది అతని అస్థిత్వంలోనే ఉంది.
తను అలా జీవించలేదు … తన పిల్లలూ ‘శ్రమ’ మీద జీవించగలరన్న నమ్మకమూ లేక పోవడమే ఈ హింస కంతా కారణం. ఉద్యోగం లేని వాళ్ళు ఎంతమంది లేరూ? అనుకుంటాడు తప్ప … వీధిలో ‘పునుగు’ లేసుకునైనా బ్రతుకుతారులే అనే సంకల్పం పావనరామయ్యకు కలగక పోవడమే అసలు సమస్య. అందువల్లే అన్నిటా లొంగుబాటునే ప్రదర్శిస్తాడు. చివరికి దేవుడు దయదలిస్తే కన్ను మూసేయకపోను!’ అని దుఃఖంతో తన కధను వినిపిస్తాడు.
శ్రమ మీద, శ్రమశక్తి మీద ఆధారపడక, దాని మీద విశ్వాసం లేకపోవడమే. ‘ఇల్లుంటే’ భరోసా వుంటుందని ఆశ పడతాడు. అయితే ‘ఇల్లు’ నిలుపుకోవడం అంతా సులువైందా? ఆ భరోసా నిలుస్తుందా?
-నల్లూరి రుక్మిణి
1970 నుండీ విద్యార్ధీ , మహిళా, పౌరహక్కుల ఉద్యమాలతో కలిసి నడిచిన నల్లూరి రుక్మిణి తన సామాజిక కార్యక్రమాల్లో భాగంగానే సాహిత్యం వైపు మళ్ళారు. అయితే ఇప్పటికీ సామాజిక ఆచరణకే ఎక్కువ ప్రాధాన్యత నిస్తారు. నల్లూరి రుక్మిణి ‘జ్ఞానం అందరిదీ’, ‘పరామర్శ’ అనే సాహిత్య వ్యాసాలు వెలువరించారు. ‘ప్రశ్నే ప్రశ్నార్ధకమైన వేళ’ ఆమె కవిత్వం. ఇంకా ‘నర్రెంక చెట్టు కింద’, ‘ఒండ్రు మట్టి’ ఆనే నవలలు రాశారు. ‘గీతల కావల’, ‘జీవన స్పర్శ’, ‘నెగడు’ ఆమె కధా సంపుటిలు. విప్లవ రచయితల సంఘంలో సభ్యురాలైన రుక్మిణి తన రచనలు బడుగు, బలహీన వర్గాలకు అండగా వుండాలని ఆకాంక్షిస్తారు.
వచ్చే వారం ‘నో రూమ్ ‘ కధా పరిచయం కె.పి అశోక్ కుమార్
“ఇల్లు” కథ ఇక్కడ:
తాజా కామెంట్లు