Archives for June 2014

గుల్ మొహర్ రాగం

21673_2582063767599_324095649_n
వేసవి మిట్టమధ్యాహ్నపు
మండుటెండ
నిర్మానుష్యపు నిశ్శబ్దంలా
ఎర్ర తురాయి పూల గుఛ్ఛాలు
సడిలేని గాలి నీడల
ఙ్నాపకాలు
ఆకులులేని చెట్టుకి
పూలవ్యాపకం
చెరువునీళ్ళలో తేలుతున్న రెక్కలా
మెల్ల మెల్లగా రంగులుమార్చుకుంటున్న
ఆకాశం
గట్టు మీద ఎరుపు రంగుల తివాచీలకి
నింగి తెలుపు
చెమికీల్లా అద్దుకుంటున్న
కొంగలు
అప్పుడే స్నానం చేసివచ్చినామె
మల్లెల తలపాపిడిలో
గుల్ మొహర్
సింధూరం
చుక్క చుక్కగా రాలుతూ
రాత్రయ్యే వేళ
గడపెదుట
ముంగిట్లో రాలిన
కుంకుమ బిందువుల పై
అడుగులో అడుగేసుకుంటూ
నేను లోనికి ప్రవేశిస్తా
మళ్ళీ ఉషోదయం
మంచు గాలి బద్దకాన్ని తరిమే
పక్షి గీతం
తురాయి చెట్టు నుండి
తలుపు తడుతుంది
– జి. సత్యశ్రీనివాస్

చిన్ననాటి మిత్రురాల్ని చూసేక

కె. గీత

కె. గీత

 

చిన్ననాటి మిత్రురాల్ని

ఇన్నేళ్లకి చూసేక

ఏ బరువూ, బాదరబందీ లేని

తూనీగ రోజులు జ్ఞాపకం వచ్చాయి

నచ్చినప్పుడు హాయిగా ముసుగుతన్ని

నిద్రపోగలిగిన, నిద్రపోయిన రోజులు

జ్ఞాపకం వచ్చాయి

చిన్ననాటి చిక్కుడు పాదు

గులాబీ మొక్కలు

సన్నజాజి పందిరి

కళ్లకు కట్టాయి

అక్కడే ఎక్కడో

పుస్తకాల అరల్లో చిక్కుకున్న

మా అలిబిల్లి ఉత్తరాలు

పుస్తకాల అట్టలో

పిల్లలు పెడుతుందనుకున్న

నెమలీక

మనసు నుండి వద్దన్నా

చెరగకున్నాయి

మేం కోతులమై వీర విహారం చేసిన జాంచెట్టు

అందని ఎత్తుకెదిగి పోయిన కొబ్బరి చెట్టు

మమ్మల్ని చూసి

అలానే భయపడుతున్నాయి

నీళ్ల బిందెనెత్తేసిన చెరువు మెట్లు

గొబ్బి పూల పొదల్లో గుచ్చుకున్న ముళ్లు

అలానే పరిహసిస్తూ ఉన్నాయి

పుట్టిన రోజు నాడు

నెచ్చెలి కట్టి తెచ్చిన

కనకాంబరం మాలని

గీతాంజలి మొదటి పేజీలోని

తన ముత్యాల చేతి రాతని

ఇన్నేళ్లు భద్రంగా దాచిన

మా ఇనుప బీరువా ప్రశంసపు చూపు

నేస్తం చెమ్మగిల్లిన చూపయ్యింది

ఇంట్లో పోయాయని అబద్ధం చెప్పి

తెలిసో తెలీకో

చెలికి బహుమతిచ్చేసిన

ఇత్తడి జడగంటలు

ఇప్పటికీ మురిపెంగా దాచుకున్న

తన వస్తువుల పెట్టె కిర్రుమన్న శబ్దం

నా గుండె చప్పుడయ్యింది

జాబిల్లి వెన్నెట్లో డాబా మీద చెప్పుకున్న కబుర్లు

జాజిమల్లెలు చెరిసగం తలల్లో తురుముకున్న క్షణాలు

10502193_607503336032256_2773154159787632762_n

ఇళ్ల వాకిళ్లలో కలిసి వేసిన కళ్లాపి ముగ్గు

పెరటి నూతి గట్టు కింద నమిలి ఊసిన చెరుకు తుక్కు

అన్నీఅన్నీ…విచిత్రంగా

మేం నడుస్తున్న ప్రతీ చోటా

ప్రత్యక్షమవుతూ ఉన్నాయి

అదేమిటో ఎప్పుడూ జ్ఞాపకం రాని నా వయస్సు

ఈ పుట్టిన రోజు నాడు

చిన్ననాటి మిత్రురాల్ని చూసేక జ్ఞాపకం వచ్చింది

ఆరిందాల్లా కబుర్లు చెప్తూ

సరి కొత్త యౌవనం దాల్చి

మమ్మల్ని మేం అద్దం లో చూసుకున్నట్లు

అచ్చం ఒకప్పటి మాలా

చెంగున గెంతుతున్న నేస్తం కూతుళ్ళని చూసేక జ్ఞాపకం వచ్చింది

రంగెయ్యని తన  జుట్టుని

జీవిత పర్యంతం కాయకష్టం

ముడుతలు వార్చిన  తన చెంపల్ని చూసేక

నా వయస్సేమిటో జ్ఞాపకం వచ్చింది.

-కె.గీత

painting: Anupam Pal (India)

వీలునామా – 40 వ భాగం

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

లిల్లీ మనశ్శాంతి

 

లిల్లీ ఫిలిప్స్ చెప్పా పెట్టకుండా ఇంట్లో కొచ్చిన బ్రాండన్ ని చూసి తత్తరపడింది. ఇంట్లో ఎల్సీ లేదనీ, పైగా మిసెస్ పెక్ తో కలిసి బయటికెళ్ళిందనీ తెలిస్తే ఏమంటాడో నన్న భయం ఆమెది. ఏమీ అనకున్నా తప్పక స్టాన్లీ తో చెప్తాడు. స్టాన్లీ కోపాన్ని తలచుకుని ఆమె కళ్ళల్లో నీళ్ళు తిరిగాయి. పైగా వచ్చీ రావడమే “ఎల్సీ ఏది?” అంటూ అడిగాడు. ఏదైనా అబధ్ధం చెప్పి తప్పించుకోవాలనీ అనుకుంది కూడా.
అయితే, నిజానికి లిల్లీ అమాయకురాలు, కల్లా కపటం తెలీని మనిషి. తన తల్లికి మల్లే అప్పటికప్పుడు నోటి కొచ్చిన కథలల్లే సామర్థ్యం ఆమెకి కొంచెం కూడా అబ్బలేదు. దాంతో ఏం చేయాలో తేల్చుకోలేకపోయింది కాసేపు. ఎలాగైనా మిసెస్ పెక్ బ్రాండన్ కళ్ళ పడకుండా చేయగలిగితే తర్వాత ఎల్సీని ప్రాథేయపడితే సరిపోతుంది, అనుకుంది లిల్లీ.

“బ్రాండన్! నాకోసం ఒక చిన్న పనిచేసి పెడతారా? కొంచెం రిచ్ మండ్ దాకా వెళ్ళి రావాలి, చిన్న పని,” అని మొహమాటంగా అడిగింది. ఆశ్చర్యపోయాడు బ్రాండన్. ఇలా ఆమె ఎప్పుడూ అడగలేదు. ఇంతా చేస్తే ఆమె తెచ్చి పెట్టమన్నది ఒక పూల దండ. పూల దండ కిప్పుడంత తొందరేమొచ్చింది?

ఏదో అనుమానం మొలకెత్తింది బ్రాండన్ మనసులో. అయితే అతను అనుమానించిన విషయం వేరు. అప్పుడప్పుడూ లిల్లీ ఎల్సీ పట్ల మొరటుగా ప్రవర్తిస్తూందని అతనికొక అనుమానం. ఇవాళ కూడ ఎల్సీని అలాగే ఏదో మొరటుగా బరువులెత్తే పని మీద దుకాణానికి పంపి వుంటుంది. అందుకే ఎల్సీ వచ్చేసరికి నేనింట్లో వుండకుండా బయటికి పంపిస్తూంది, లేకపోతే ఇప్పుడు పూల దండతో పనేమిటి, అనుకున్నాడు బ్రాండన్. ఆమె అందీ పొందని సమాధానాలూ, పాలిపోయినట్టున్న మొహం, ఎంత సేపు కూర్చున్నా బయటకి రాని ఎల్సీ, అన్నీ కలిసి అతని అనుమానాన్ని బలపర్చాయి.

‘సరే పూల దండ తీసుకొస్తా’నని బయటపడ్డాడు బ్రాండన్. అయితే ఆమె అడిగినట్టు రిచ్ మండ్ కాకుండా ఇంకో వైపు వెళ్ళాడు, ఒకవేళ లిల్లీ ఎల్సీ ని ఏదైనా పనికి బయటికి పంపి వుంటే, ఇటు వైపే పంపి వుండాలి అనుకుంటూ. అదృష్టవశాత్తూ అతను సరిగ్గా ఎల్సీ మిసెస్ పెక్ తో కలిసి వస్తున్న దార్లోనే వెళ్ళి వాళ్ళకి ఎదురయ్యాడు. దూరం నించి వాళ్ళిద్దరినీ చూసి,
“ఆ అమ్మాయినెక్కడో చూసినట్టుందే” అనుకుంటూ దగ్గరకొచ్చాడు.

***

veelunama11

ఎల్సీతో కలిసి ఇంటికొస్తూన్న బ్రాండన్ చూసి లిల్లీ ఇంకా బెంబేలెత్తి పోయింది. ఇంట్లోకొస్తూనే ఏమీ మాట్లాడకుండా ఎల్సీ లోపలికెళ్ళిపోయింది. లిల్లీ ఒంటరిగా బ్రాండన్ తో నిలబడిపోయింది. ఆమె అనుకున్నట్టే బ్రాండన్,
“మిసెస్ పెక్ లాటి ఆవిడతో ఎల్సీ లాటి అమాయకురాల్ని పంపుతావా? ఆ అమ్మాయికేదైనా అయితే వాళ్ళ అక్కయ్యకేం జవాబు చెప్తావు?” అని అడిగాడు కోపంగా. బావురుమంది లిల్లీ.

“నాకు తెలుసు బ్రాండన్. కానీ ఆమెకి ఎదురాడలేను నేను. ఆమెని ఇంట్లోకి రానిచ్చానని తెలుస్తే స్టాన్లీ మండిపడతాడు. ఆమెని ఆపడానికి ఎంత ప్రయత్నించానో చెప్పలేను. కానీ ఆమె నా తల్లి! నిర్దాక్షిణ్యంగా వెళ్ళిపొమ్మని చెప్పలేకపోయాను. నా ఖర్మకి ఆమెకెందుకో ఎల్సీతో ఎడతెగని కబుర్లు. స్టాన్లీకీ సంగతి తెలిస్తే నేను బ్రతకలేను.”
ఆమె దుఃఖం చూసి బ్రాండన్ కరిగిపోయాడు.
“పోన్లే లిల్లీ! బాధ పడకు. కానీ నువ్వామెకి భయపడడం మానేయాలి. తిన్న ఇంటి వాసాలు లెక్కపెట్టే అలాటి ఆడవాళ్ళు ఇంటికి రావడం ఏ మగవాడికీ ఇష్టం వుండదు. స్టాన్లీ చాలా మంచి వాడు. నువ్వు భయపడకు,” ఆమెకి సర్ది చెప్పాడు.
“నేనెప్పుడూ స్టాన్లీ నించి ఏదీ దాచను. స్టాన్లీ కాకపోతే ఈ ప్రపంచం లో నాకింకెవ్వరున్నారు? అసలు ఎప్పుడు స్టాన్లీ నన్నొదిలి ప్రయాణాలకెళ్ళినా నాకేదో ఆపద చుట్టుకుంటుంది. అందుకే నాకు స్టాన్లీ పక్కన లేకపోతే భయం నాకు. ఆయన మాట విని విరివాల్టా వెళ్ళిపోయినా ఈవిడ పీడ తప్పేది నాకు.”

లిల్లీ ఆవేదన చూసి బ్రాండన్ ఆశ్చర్యపోయాడు. అతనింకా లిల్లీకి భర్త పట్ల అంత ప్రేమా అభిమానాలూ వున్నట్టు ఊహించలేకపోయాడు. నిజానికి బ్రాండన్ కి లిల్లీని చూస్తే అంత ఇష్టం వుండేది కాదు. స్టాన్లీ లాటి మంచి మనిషికీ, కష్టపడే మనస్తత్వానికీ ఆమె సోమరితనమూ, నిర్లక్ష్యమూ ఏవీ సరిపడవని అతననుకుంటూ వచ్చాడు. స్టాన్లీ లాటి భర్త లభించడం తన అదృష్టమన్న గుర్తింపు లిల్లీకి ఏమాత్రమూ లేదని అనుకుంటూ వచ్చాడతను. నిజంగా లిల్లీ మనసులో స్టాన్లీ కున్న విలువ చూసి ఆశ్చర్యపోయాడు.

అసలెప్పుడూ లిల్లీ తన మనసులోని మాటలని పొందికగా చెప్పగలిగేదీ కాదు. అయితే మిసెస్ పెక్ లాటీ అపభ్రంశపు తల్లి చేతుల్లో పెరిగిన ఆడకూతురుకి అంత కంటే ఎక్కువ సంస్కారం ఎలా అలవడుతుంది, అనుకున్నాడు. కొంతవరకూ అ విషయం నిజమే అయినా తన తల్లిని చూసినప్పణ్ణించీ లిల్లీకి కొంచెం అవగాహన పెరిగింది. తనకన్ని సుఖాలూ సౌకర్యాలూ కల్పిస్తూ తనని కంటికి రెప్పలా కాపాడుకుంటూ తన పెంకితనాన్నీ, చిన్న పిల్లల మనస్తత్వాన్నీ ఓపికగా భరిస్తున్న భర్తనీ, ఇంకా తననించి ఏదైనా లాభం వస్తే పొందుదామని ఎదురు చూస్తున్న తల్లినీ అప్రయత్నంగానే బేరీజు వేసిందామె మనసు. భర్త మీదా ప్రేమా గౌరవమూ రెట్టింపయ్యాయి! తన తల్లినించి రక్షించగలిగే ఒకే ఒక నీడ లా అనిపిస్తున్నాడామె భర్తకి. ఇప్పటికిప్పుడు స్టాన్లీ ఇక్కడికొచ్చి నన్ను ఇక్కణ్ణించి తీసికెళ్ళిపోతే బాగుండనుకుంది ఆమె. కన్నీళ్ళు తుడుచుకుంది.
ఆమె మనసు మళ్ళించాలనుకున్నాడు బ్రాండన్.

“అదంతా వొదిలెయ్యి లిల్లీ! అసలు నేను పెళ్ళాడబోయే అమ్మాయిని దుకాణాలవెంట తిప్పడానికి నీకెంత ధైర్యం!” నవ్వుతూ అన్నాడు.
“నువ్వు పెళ్ళాడ బోయే అమ్మాయి?” అయోమయంగా చూసింది లిల్లీ! అంతలోనే అర్థమయి సంతోషంతో కెవ్వుమంది.

“అమ్మ దొంగా! మరి చెప్పవేం ఇంతసేపూ? అబ్బ! ఎంత చక్కటి వార్త చెప్పావు బ్రాండన్! ఎల్సీ చాలా మంచి పిల్ల. నీకు అన్నివిధాలా తగిన భార్యా! హేరియట్ లాటి గర్విష్టి తో ఎలా సర్దుకుంటావో నని అప్పుడప్పుడూ బెంగ పడ్డాననుకో! పన్లో పని, జేన్ టీచర్ క్కూడా పెళ్ళి కుదిరితే బాగుండు. ఆ అమ్మాయిని చూసి మగవాళ్ళందరూ బెదిరి పోతారెందుకో! హేరియట్ ఎటూ డాక్టరు గ్రాంట్ ని పెళ్ళాడే టట్టుంది,” నవ్వింది లిల్లీ.
“అవునట. నేనూ విన్నా. అందుకే ఆ అమ్మాయిని అన్యాయం చేస్తున్నానేమో నన్న భయం కూడా లేకుండ హాయిగా ఎల్సీని అడిగాను.”
” అయితే ఒక్క మాట! డాక్టరుని పెళ్ళాడతానని హేరియట్ నాతో ఒక్క మాట కూడ అనలేదు. ఇద్దరూ కలిసి ఎడ తెగని కబుర్లు చెప్పుకునేవారంతే. కాబట్టి ఏ సంగతీ జాగ్రత్తగా కనుక్కోవడం మంచిది.”

“అదే నేను చూడు! పెళ్ళాడాలన్న నిర్ణయానికొచ్చిన అరగంటలో నికే ముందుగా చెప్పేసాను.”
“మంచి పని చేసావు. ఎల్సీ లేకపోతే నాకు చేయి విరిగినట్టుంటుందనుకో. ఇంతకీ పెళ్ళెప్పుడు?”
“ఎల్సీ ఎప్పుడంటే అప్పుడే!”
“తోడు పెళ్ళి కూతురు మాత్రం మా ఎమిలీ నే! అది ఎప్పణ్ణించో నీ పెళ్ళి కోసం ఎదురు చూస్తోందందుకనే”
నవ్వాడు బ్రాండన్. “ఆహా అలాగే! అది సరే కానీ, లిల్లీ, మిసెస్ పెక్ మీ అమ్మ అన్న సంగతి నేను ఎల్సీతో చెప్పలేదు. నువ్వు చెప్తావా నేను చెప్పనా?”
“నేనే చెప్తాలే. ఇప్పుడే లోపలికెళ్ళి తనతో మాట్లాడి వొస్తా. అప్పడిదాకా ఇక్కడే వుండు,” లేచి నిలబడింది లిల్లీ.
లోపలికెళ్ళి ఎల్సీని గట్టిగా కౌగలించుకుంది సంతోషంగా!
“ఎల్సీ! బ్రాండన్ సంగతంతా చెప్పాడు. భలే సంతోషంగా వుంది నాకు. స్టాన్లీ కూడా సంతోషిస్తాడు. అది సరే కానీ, ఎల్సీ, నీకొక రహస్యం చెప్పాలి.మిసెస్ పెక్ మా అమ్మ! అందుకే ఆవిడకి గట్టిగా ఎదురాడలేకపోయాను. ఆవిడ మనింటికొచ్చిన సంగతి తెలిస్తే స్టాన్లీ మండి పడతాడు. నువ్వీ విషయం దయచేసి నీలోనే దాచుకో. మీ అక్కయ్యకి కూడా చెప్పొద్దు!”
ఆశ్చర్యపోయింది ఎల్సీ.
“అవునా? అదన్నమాట సంగతి. పోన్లెండి, జరిగిందేదో జరిగిపోయింది. నేను ఎవ్వరికీ చెప్పకుండా దాచుకుంటాను,” లిల్లీని సమాధాన పరచింది ఎల్సీ.
“ఇంత మంచి విషయం తెలిసాక నాకిక్కడ కాలు నిలవడం లేదు. హాయిగా మన ఎస్టేటు కెళ్ళిపోదాం. ఎల్సీ, నేను నిన్నెప్పుడైనా నొప్పించి వుంటే అదంతా ఎమీ మనసులో పెట్టుకోవు కదా?” అమాయకంగా అడిగింది లిల్లీ.
“అదేం లేదండీ! అదంతా గతం, మర్చిపొండి,” అనునయంగా అంది ఎల్సీ.
“అబ్బ, పెళ్ళంటే ఎన్ని పనులో! ముందు ఎమిలీకీ పిల్లలకీ మంచి బట్టలు కొని కుట్టించాలి. ఇందాకే బ్రాండన్ తో కూడా చెప్పాను, మా ఎమిలీ యే తోడు పెళ్ళికూతురు! ఇప్పణ్ణించే మొదలుపెడితే కానీ పన్లన్నీ కావు. ఇంతకీ పెళ్ళెప్పుడనుకుంటున్నారు?”
సిగ్గుతో నవ్వేసింది ఎల్సీ.
“ఏదీ, ఇంకా ఏమీ అనుకోందే! అసలు నేను నమ్మలేకుండా వున్నాను, నాకు పెళ్ళి నిశ్చయమైందంటే!”
“అన్నట్టు చెప్పడమే మర్చి పోయాను. ఏదో ముఖ్యమైన విషయం మాట్లాడాలంటూ బ్రాండన్ ముందు గదిలోకి రమ్మన్నాను. వెళ్ళు, వెళ్ళు! వెళ్ళి పెళ్ళి ఎప్పుడన్నది నిశ్చయించుకుని నాకొచ్చి చెప్పు!” హడావిడి పడింది లిల్లీ.

అయితే బ్రాండన్ పిలిచింది పెళ్ళి గురించి మాట్లాడడానికి కాదు. మెల్బోర్న్ విడిచి తన ఎస్టేటుకెళ్ళే ముందే పెళ్ళాడేయాలన్నది అతని అభిమతమే అయినా, అంతకంటే ముందు మాట్లాడుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయతనికి.

ముందుగా మావయ్య వీలునామా గురించి. అందులో అక్షరం పొల్లు పోకుండా తనకి గుర్తుందన్నది ఎల్సీ. తర్వాత మిసెస్ పెక్ ని పట్టుకోవడం. ఇంకా తమ భవిష్యత్తు గురించి చర్చలు! అన్ని కబుర్లూ అయి గడియారం చూసుకుని ఉలిక్కిపడ్డాడు బ్రాండన్. తను ఆ ఇంట్లో దాదాపు రెండు గంటలపైగా కూర్చున్నాడు. మళ్ళీ మర్నాడు కలుద్దామని చెప్పి వెళ్ళిపోయాడు.

***
(సశేషం)

లైఫ్- స్టడీ

drushya drushyam 38reality
art.

అప్రమత్తత
సంసిద్ధత

చప్పున ఒకటి కనిపిస్తుంది.
చిత్రీకరించకపో్తే అ స్థితి జారిపోతుంది.
ఈ గ్లాసులే తీసుకుంటే. అవి ఉన్నవి. క్షణంలో తీసుకెళతారు. వాటిని మళ్లీ అమర్చి చిత్రీకరిస్తే అది చిత్రలేఖనం.
ఉన్నది ఉన్నట్టు, ఉన్న కాడనే… మన కాళ్లు కదపకుండానే.. అట్లే చిత్రించి వదిలితే అది ఛాయా చిత్రణం.

అరేంజ్ చేసేది ఏదైనా ‘లైఫ్ స్టడీ’.
మనం ‘స్టడీ’గా ఉండి దృశ్యమానం చేసేది లైఫ్.

మేలుకుని పలవరించడం చిత్రలేఖనం.
అదమరచి కలవరించడం ఛాయా చిత్రణం.

-ఫొటోగ్రఫీ తాలూకు లైఫ్ లైన్ ఇదే.

ఒకటి సంసిద్ధత
రెండోది అప్రమత్తత

+++

చిత్రాలే.

జీవితానికి చిత్తూబొత్తూ వలే కళా-నిజం. వన్ బై టూ.

లైఫ్ స్టడీలో రెండూనూ.
జీవితాన్ని దూరంగా నిలబడి పరికించే మెలుకువ ఒకటి – అది చిత్రలేఖనం.
జీవితమే మనల్ని లీనం చేసి మెలుకునేలోగా తప్పుకునేది చిత్రం- అది ఛాయ.రెండూ చిత్రాలే.
కానీ భిన్నం.

ఒక్క మాటలో…క్షణభంగుర జీవితానికి తెరిచిన డయాఫ్రం. ఒడిసిపట్టుకున్నస్పీడ్. తన చిత్రం. ఛాయా చిత్రణం.
అది ఛాయా చిత్రకారుడికి!
తీరుబడితో జీవితాన్ని కళాత్మకం చేయగలిగి ఓర్పు నేర్పు.
అది చిత్రకారుడిది!

ఇంకా.

తడి ఆరని ముద్దు వంటిది ఛాయా చిత్రలేఖనం.
గాఢ ఆలింగనం వంటిది చిత్రలేఖనం.

ఇంకా నగరంలో రాంనగర్ లో.
అందలి ఆంధ్రా హోటల్. వైన్ బై టూ. నేనూ నా మిత్రులు చంద్రశేఖర్ సారూ.

చాయ తాగి ఆడ పెట్టగానే అయిపోలేదు.  కాళీ సీసాలు మాదిరి మళ్లీ ఊరిస్తది.
ముఖ్యంగా ఆ గ్లాసులు…చీకట్లో కందిలి మాదిరి వెలుగుతున్నయి.
స్నేహితాన్ని అందలి బాంధవ్యాన్ని సామీప్యాన్ని మళ్లీ గుర్తు చేస్తున్నయి.
కెమెరా గుండా ఆ అనుభూతిని, ఆ వెచ్చటి సాయంత్రాన్ని మళ్లీ కాచుకుని తాగవచ్చును, చాయగ. ఛాయలో.
ఛాయా చిత్రణంలో. అందుకే ఈ లైఫ్ స్టడీ భిన్నమైందంటూ కొన్ని ముచ్చట్లు.. ఒక రకంగా కొన్ని ముందు మాటలు.

+++

అది ఫలమో పుష్ఫమో మనిషో ఏదైనా సరే. దాని పొజిషన్ ను, కాంపోజిషన్ గమనంలోకి తీసుకుని తాము ఎంతో నైపుణ్యంగా రూపకల్పన చేసే కళాఖండం లైఫ్ స్టడీ.
ఇది చిత్రకారుడి విషయం.

తాను ఎంతో నిశిత పరిశీలనతో, మరెంతో ఓపికతో అవతలి జీవితం ఇవతలికి… అంటే తాను మాధ్యమంగా ఎంచుకున్న దాని మీదికి తెచ్చి చూపడం అతని ఒక వరం. ఒక గొప్ప కళ. కానుక. కాకపోతే, ఆయా చిత్రకారులు దేన్నయితే చిత్రీకరించదలిచారో దాన్ని తమ ముందు వుంచుకుంటరు లేదా ముందున్నదాన్ని చిత్రీకరించి పెడతారు. కంటి చూపుతోనే ముందు దాని కొలతలు తీసుకుంటరు. మనసులోనే బాహ్యరేఖలన్నీ గీసేసుకుంటరు.
ఎలా వర్ణచిత్రం చేయాలో యోచిస్తరు. క్రమక్రమంగా పలు దశల్లో చిత్రం పూర్తవుతుంది.

ఇదంతా ఒక పరిశ్రమ. తమ ముందున్న వస్తువును దృశ్యంగా మలచడానికి వారు ఎంతో పరిశ్రమిస్తరు. ఇంకా చాలా ఆలోచనలు చేస్తరు. వెలుగు నీడల పట్ల అంచనాకు వస్తారు. వాడవలసిన వర్ణాల గురించిన ఆలోచన చేస్తరు. రంగుల సమ్మేళనం గురించీ మథన పడుతరు. ముందూ వెనకాలు… ఏమైనా… వారిలో ఒక కల్పన జరుగుతుంది. ఆ తర్వాతే ఆ వస్తువు కళగా మన ముందు సాక్షాత్కరిస్తది.

కానీ ఛాయా చిత్రకారుడికి జీవితమే కల్పన.
ఊహా ప్రపంచంలోకి వెళ్లడానికి లేదు. తన కళకు కసరత్తు లేదు అందుకే అది నిజం.

చిత్రకారుడు మాత్రం ఫలానా వస్తువు తాలూకు అందానికి ముగ్డుడై చిత్రీకరణలోకి దిగవచ్చు. లేదా ఆయా వస్తువుల గుణాన్ని చెప్పదల్చుకుని సిద్ధపడవచ్చు. లేదా మరేదో పారవశ్యంతో ఆ పనిలో నిమగ్నం కావచ్చును.
అయితే ఆ పనితనంలో తనదైన సాంకేతికత కూడా ఒకటుంటుంది. దాని నుంచి కూడా ఆ చిత్రం వన్నెలు పోతుంది. అంతేకాదు, తన నైఫుణ్యానికి, సాంకేతిక ప్రతిభకు తోడు నిర్ణయాత్మకత కూడా అవశ్యం. వస్తువును ఏంత మేరకు గ్రహించాలి. దాన్ని ఎంత విస్తీర్ణంలో రచించాలి. ఎంత గాఢంగా చిత్రీకరించాలి, ఇన్ని విదాలా ఆలోచనలు సాగుతై.
నిజానికి ఇవన్నీ గడిస్తేగానీ చిత్రం.

ఇంకో విచిత్రం, ఒక చిత్రం గీయాలనుకోవడానికీ… పూర్తవడానికీ పట్టే సమయం కూడా చిత్రాన్ని నిర్ణయిస్తుంది.
అంతా కలిస్తే లైఫ్ స్టడీ.

కానీ, ఛాయాచిత్రకారుడికి అంత పని కుదరదు. ఉండదు. పట్టదు.
అదొక సఫలత. స్పాంటానిటీ.

కనిపించగానే క్లిక్ మనిపించాలి.
కనిపిస్తుండగానే ఆ వస్తువే చెబుతుంది, దించమని. దింపమని. దించరా అని.

కాలయాపన చేశాడా లైఫ్ తన స్టడీ నుంచి తప్పుకుంటుంది.
అదొక చిత్రం.

ఇక తాను విఫల మనస్కుడవడం, వగచడంవల్ల ఏ ఫాయిదా లేదు.
అయితే ఛాయా చిత్రకారుడికీ చిత్రకారుడికీ మధ్యన ఇంకొక మంచి తేడా ఉన్నది. చిత్రకారుడి విషయంలో తాను గీసిన వస్తువు చివరకు తాను చిత్రీకరించిన వస్తువు ఒకటే అని మనం అనుకోలేం. కానీ ఛాయా చిత్రకారుడు మాత్రం ఖచ్చితంగా తాను చూసిందానికన్నా నిజమైన వస్తువును పట్టుకుంటడు. తాను ఊహించనైనా లేని వాస్తవాలన్నీ తన చిత్రంలోకి వచ్చి చేరడాన్ని గమనించి విచిత్రపోతడు.

అట్లా తన అనుభవాన్ని మించిన చిత్రం ‘ఛాయా చిత్రం’ కాగా, తాను చూసిన నిజాన్ని దాటిన కల్పన ‘చిత్రం’ అవుతుంది.
ఇట్లా చిత్రకారుడూ ఛాయా చిత్రకారుడూ ఇద్దరూ భిన్నం. వాళ్ల జీవనశైలులు చాలా ఎడం.

ఇంకా ఇంకా రాణించే జీవితం చిత్రకారుడిదైతే, జీవితాన్ని యధాతథంగా ఒడిసి పట్టే పని ఛాయాచిత్రకారుడిది.

+++

నిజం.
ఎంత లేదన్నా ఫొటోగ్రఫీ నిజంగా భిన్నం. నిజ వస్తువును చూపే నిజమైన మాధ్యమం. అవును, ఛాయా చిత్రణం అన్నది ‘ఉన్నది ఉన్నట్టు’ చూపడంలో అత్యంత నిబద్దతను చూపే మాధ్యమం.

చూడండి. వెలుగునీడలు. రంగులు ప్రతిఫలణాలు.
వస్తువుతో పాటు సమయం, స్థలం అన్నీ కూడా గోచరం అవుతుంటాయి.

+++

నిజానికి ఒకనాడు చిత్రకళ ద్వారా ఉన్నది ఉన్నట్టు చూపించే పరిస్థితి ఉండేది. తర్వాత అది వ్యక్తిగత ప్రతిభా పాటవాలను ప్రతిఫలించేదిగా మారింది. కానీ ఇప్పటికీ, మ్యాన్యువల్ నుంచి డిజిటల్ దాకా ప్రయాణించినా ఫొటోగ్రఫి మాత్రం జీవితంలోనే ఉన్నది. ఇంకానూ లైఫ్ స్టడీకి ఉత్తమమైన ఉదాహరణగా, సదవకాశంగా నిలుస్తునే ఉన్నది.

అందుకే జీవితం అంటే కళ కాదు, నిజం. ఫోటోగ్రఫిలో.
వన్ బై టూ ఛాయ తాగి తెలుసుకున్న నిజం కూడా.
ఈ చిత్రం అదే.
మామూలు చాయ గిలాసలే. కానీ ఒక పాతదనం. నాస్టాల్జియా. సరికొత్తగా. గాజు వలే కొత్తగా.

రంగు, రుచి, పరిమళం యధాతధంగా.
అదే లైఫ్.
కనీకనిపించకుండా చిత్రంలోనే ఉన్న ఈగతో సహా!
నిజం. ఇదే లైఫ్ స్డడీ.

దృశ్యాదృశ్యం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

 

” ఫ్రిజ్ లో ప్రేమ ” అనువాద నాటకం – 4 వ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

దృశ్యం-4

(రంగస్థలం మీద దీపాలు వెలిగేప్పటికి ప్రసన్న గాఢ నిద్రలో ఉంటాడు. చంద్ర సూర్యులు అతని ముందు కొంతదూరంలో కూర్చుని ఉంటారు. ముఖాల్లో శాంతి, బుద్ధిస్టు మాంక్ లాగా.)

(మోనాస్ట్రీలలోని కర్ర గంటలు అదేపనిగా మోగుతుంటాయి)

 

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోరాదు.

 

చంద్ర: మధ్యలో ఎక్కడో…

 

సూర్య: మధ్యలో ఎక్కడో?…

 

చంద్ర: మారాలి.

 

సూర్య: పరివర్తనం

 

చంద్ర: కొత్త యుగం.

 

సూర్య: నాకు స్వేఛ్చ

 

చంద్ర: నాకుమల్లే

 

సూర్య: అధికారం మారుతుంది.

 

చంద్ర: ఆ… తెలుస్తోంది.

 

సూర్య: ఇది సమ్మతమేనా?

 

చంద్ర: ఇదో సంభ్రమం.

 

సూర్య: కారణం.

 

చంద్ర: ప్రామాణికత, యాజమాని పట్ల విశ్వాసం.

 

సూర్య: ఎవరు, ఎప్పుడు నిర్ణయించారు?

 

చంద్ర: యుగయుగాలుగా మనుషులు మన గురించి ఇదే చెప్తూ వస్తున్నారు.

 

సూర్య: మన ప్రామాణికతని మనుష్యులు నిర్ణయిస్తారన్నమాట… మనం కాదు! … మనుష్యులు వాళ్ళు చేయలేని పనులకు ఇంకొకళ్ళకి అప్పగిస్తారు.

 

చంద్ర: ఏమంటున్నావ్!

 

సూర్య: యోగ్యమైనదే.

 

చంద్ర సూర్యులు: (విజయఘోష) ఏక పక్షం తీసుకోవచ్చు. తీసుకోవచ్చు.

(కర్ర గంట)

 

సూర్య: పార్వతిబాయి…

 

చంద్ర: జై. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి.

 

సూర్య: పార్వతిబాయి…

 

చంద్ర: జై.. ఒక సుందర శబ్దాన్ని ఉచ్చరించండి. జీవన అంతిమ సత్యం.. ఒక సుందర శబ్దం.. జీవన అంతిమ సత్యం..

 

సూర్య: (రెండు కుక్కలూ గట్టిగా మొరగడం మొదలుపెడతాయి.)

 

(ప్రసన్న నిద్ర నుండి లేస్తాడు. నోటి నుండి కార్తున్న చొంగ తుడ్చుకుని, చిన్నపిల్లాడిలాగా కాళ్ళు చాపి గట్టిగా ఏడవడం మొదలుపెడతాడు).

 

జీవించడం కోసం పరిమళించు!

Krish.psd

అశోకారోడ్ నుంచి ఫెరోజ్‌షా రోడ్‌లోకి ప్రవేశించి, మండీహౌజ్ వద్ద సాహిత్య అకాడమీ భవనం వద్ద దుమ్ముపట్టిన పుష్కిన్ విగ్రహం చూస్తూ సర్కిల్ తిరుగుతున్నప్పుడు గుర్తుకు వచ్చింది.. కేదార్ నాథ్ సింగ్‌కు జ్ఞానపీఠ్ అవార్డు ప్రకటించారని. ఒక కవికి ఏదో ఒక అవార్డు లభిస్తే కవిత్వం అంటే ప్రేమించే నాకెందుకు మనసులో ఏదో ఒక మూల కదలిక రావాలి? జర్నలిస్టుగా ఎన్నికల ముందంటే ఏదో ఒక బిజీ. ఎన్నికలై, కొత్త సర్కార్లు ఏర్పడ్డ తర్వాత కూడా పని ఒత్తిడి తగ్గిన తర్వాత కూడా మనసు విప్పి రాయాలంటే ఎందుకు మనస్కరించడం లేదు? ప్రపంచం ఎప్పుడూ మనం అనుకున్నట్లు ఉండదు. మనం అనుకున్నట్లు ఉండేందుకు చేసిన ప్రయత్నాలేవీ పెద్దగా లేవు. ప్రయత్నాలు, పోరాటాలు, ఉద్యమాలు చేసిన వారే ఏమీ సాధించినట్లు కనపడడం లేదు. అంతా మళ్లీ మొదలైనట్లు, ఏదీ ప్రారంభం కానట్లు అనిపిస్తోంది. మరి ఎందుకింత అసంతోషం? ఎందుకింత నిర్లిప్తత? ఏదో రాయాలనుకుని ఏదీ రాయలేని నిస్సహాయత ఎందుకు? ఎవరిమీద ఈ కోపం? ఎవరిమీద ఈ అసహనం? నీ స్తబ్ధతకు కారణమేమిటో ఎవరికీ ఎందుకు చెప్పుకోలేకపోతున్నాం? ఎందుకు కన్నీళ్లు ఘనీభవిస్తున్నాయి? ఎందుకు రక్తం నరనరాల్లో నిదానంగా చల్లగా ప్రవహిస్తోంది? పాదాలు ఎందుకు ప్రయాణించడానికి మొరాయిస్తున్నాయి? నేనే ఇలా ఉంటే ఉన్నచోటే ఉంటూ స్తంభించిపోయి, ఆకులు రాలుస్తూ, చిగురుస్తూ వసంతాలు, గ్రీష్మాలు అనుభవిస్తూ జనాల్ని నిర్లిప్తంగా చూసే ఈ చెట్లు ఏమి ఆలోచిస్తున్నాయో?

ఐటీఓ క్రాస్ రోడ్‌లో రెడ్‌లైట్ వద్ద మల్లెపూల వాసన గుప్పున చుట్టుముట్టింది. ఇద్దరో ముగ్గులో తమిళ మహిళలు కార్ల కిటీకీల వద్దకు పరుగిడితూ మల్లెపూల దండలు కొనమని బతిమిలాడుతున్నారు. ఫుట్‌పాత్‌పై మరికొందరు మాలలు కడుతున్నారు. ప్రక్కనే నేలపై కాళ్లూ చేతులూ ఊపుతున్న పాప నోట్లో పాలపీక. అప్పుడు మళ్లీ గుర్తొచ్చాడు కేదార్ నాథ్ సింగ్. ఒకటా, రెండా.. దాదాపు ఆరు దశాబ్దాలుగా కవిత్వం రాస్తున్నారాయన. ఎలా రాయగలుగుతున్నారాయన? ఎప్పుడూ ఆయన నాలా నిరాశలో , నిస్సహాయతలో కూరుకుపోలేదా? కవిత్వం రాసేందుకు ఆయన చేయి ఎప్పుడూ మొరాయించలేదా? ‘ఒక్క మల్లె దండ కొనండి సార్..’  అని చిన్న పిల్ల పదోసారి నన్ను బతిమిలాడింది. నాలాంటి దుర్భర జీవికి మల్లెపూలెందుకు? ఏం చేసుకుంటాను? అయినా.. ఆలోచనల్ని ప్రక్కన పెట్టి తల ఊపి జేబులోంచి డబ్బులు తీసి ఇచ్చి ఒక మల్లెపూదండ కొని కారులో ఒక మూల పడేశాను.కారంతా పరిమళం అలుముకుంది. ఆ పిల్ల ముఖంలో ఏదో సాధించినట్లు పరిమళం లాంటి ద రహాసం. అప్పుడర్థమైంది కేదార్ నాథ్ ఇన్నేళ్లుగా కవిత్వం ఎలా రాస్తున్నారో.. అవును. జీవితం ఆయనతో కవిత్వం రాయిస్తోంది. 


1934లో ఉత్తరప్రదేశ్‌లోని ఒక మారుమూల గ్రామంలో జన్మించిన కేదార్ నాథ్ సింగ్ వారణాసి,గోరఖ్‌పూర్, దేవరియా, పాడ్రానా లాంటి పలు ప్రాంతాల్లో అధ్యాపకుడుగా పనిచేస్తూ చివరకు ఢిల్లీలోని జెఎన్‌యులో ప్రొఫెసర్‌గా చేరి 23 ఏళ్ల బోధన తర్వాత 99లో పదవీవిరమణ చేశారు. దాదాపు 16 ఏళ్ల వయస్సులో ఆయన తొలి కవిత రాశారు. కాని 1954లో ఫ్రెంచ్ కవి పాల్ ఎలార్డ్ కవితను అనువదించడం కేదార్ జీవితంలో కేదారం సస్యశ్యామలమైనట్లనిపించింది. ఎలార్డ్ ఆయనకు కవిత్వంలోని జీవన్మరణ రహస్యాలను విప్పిచెప్పారు. అంతే కేదార్ కవిగా అవతరించారు. ప్రముఖ కవి ఆజ్ఞేయ తన సాహిత్య పత్రికలో కేదార్ కవితలనెన్నిటినో ప్రచురించారు. 1960లో కేదార్ తన తొలి కవితా సంకలనం ‘అభీ బిల్కుల్ అభీ’ ప్రచురించారు. 

విచిత్రమేమంటే ఆ తర్వాత 1980లో కాని కేదార్ రెండో సంకలనం ‘జమీన్ పఖ్ రహీహై’  రాలేదు. ఈ సుదీర్ఘ విరామానికి ఆయనే జవాబు చెప్పారు. ‘ఇది నన్ను నేను లోతుగా ఆత్మపరిశీలన చేసుకుంటున్న కాలం. పెద్దగా ధ్వనించకుండా నా ప్రతిఘటనను ఎలా చిత్రించాలో అన్వేషిస్తున్న సమయం అది..’ అని ఆయన అన్నారు. ఆ తర్వాత ఆయన వెనక్కు తిరిగి చూడలేదు. వందలాది కవితలను పుంఖానుపుంఖాలుగా రాస్తూ పోయారు. ఏ అవార్డూ ఆయన దాహార్తిని తీర్చలేకపోయింది. 

కేదార్ నాథ్ కవితల్ని మనం బయటినుంచి అలవోకగా పేజీలు తిప్పుతూ అర్థం చేసుకోలేం. కవితల్లోకి మనం ప్రవేశించాలి. మనల్ని మనం ఆయన కవితల్లోకి ఒంపుకోవాలి. ఆయన నడిపించిన దారుల్లో నడవాలి. అదొక అద్భుత ప్రపంచం. పాడుపడిన కోట గోడల మధ్య, గంగానదీ ప్రవాహాల మధ్య, దట్టమైన అరణ్యాల మధ్య, నిశ్శబ్దనదిపై ప్రతిఫలిస్తున్న వెన్నెల కాంతి మధ్య, కడుపులో దహించుకుపోయే ఆకలి మధ్య, చితిమంటల మధ్య ఆయన మనను మెల్లగా నడిపించుకుని తీసుకువెళతారు. 

‘ఈ నగరంలో వసంతం ఉన్నట్లుండి వస్తుంది.’అని ఆయన వారణాసి గురించి రాసిన కవిత మనం ఆ నగరంలో నడిచినట్లే అనిపిస్తుంది. ‘సంతం ఖాళీ పాత్రల్లో దిగి రావడం నీవెప్పుడైనా గమనించావా? ఈ నగరంలో దుమ్ము మెల్లగా ఎగురుతుంది, జనం మెల్లగా నడుస్తారు, గుడిగంటలు మెల్లగా మోగుతాయి. పొద్దు వాలుతుంది మెల్లగా.. ఇదొక సామూహిక లయ. ఈ నగరంలో ఉదయమో, సాయంత్రమో ప్రవేశించు ప్రకటించకుండా.. హారతి వెలుగుల్లో అద్భుత నగరాన్ని చూడు. అది సగం నీళ్లల్లో, సగం మంత్రాల్లో, సగం పూలల్లో, సగం శవంలో, సగం నిద్రలో, సగం శ ంఖంలో.. జాగ్రత్తగా చూడు.. సగమే కనబడుతుంది. మిగతా సగం ఉండదు. కనపడిన సగానికే ఊతం అవసరం. మిగతా సగానికి అండ బూడిద, కాంతి, అగ్ని, నీరు, పొగ, పరిమళం, ఎత్తిన మాన హస్తాల స్తంభాలు..’ అంటారు కేదార్ నాథ్. 

‘నేను ఆమె చేయిని నా చేతుల్లోకి తీసుకున్నప్పుడు ప్రపంచం ఆమె చేయిలా వెచ్చగా, అందంగా ఉండాల్సిందేననుకున్నా.’ అన్న ఒక చిన్న కవిత్వంలో ఒక ఆహ్లాదకరమైన అనుభవాన్ని వర్ణించగల కేదార్ ‘అక్షరాలు చలితో మరణించవు.. అవి ధైర్యం లేక మరణిస్తాయి.. ఉక్కబోసే వాతావరణంలోనే అక్షరాలు తరుచూ నశిస్తాయి… అని రాయగలరు. ‘నెత్తుటితో తడిసిన చిన్నారి అక్షరం తనను ఇంటికి తీసుకువెళతానని పిలుస్తోంది..’ అని రాస్తారాయన. 

‘ఖాళీ కాగితంపై ఉదయమూ ఉండదు, అస్తమయమూ ఉండదు.. అక్షరాలు మనకెప్పుడూ ఖాళీ కాగితాన్ని వదిలిపెడతాయి..’ అనే కేదార్ నాథ్ అక్షరాలతో అలవోకగా ఆడుకోగలరు. ‘సూ ర్యకాంతి, ఆకుల సంభాషణ మధ్య ఒక కవితా వాక్యం అణిచివేతకు గురైంది.. ఈ రోజుల్లో వీధుల్లో ఎవరూ మరొకరి సమకాలీనులు కాలేరు..’ అని ఆయన తప్ప ఎవరనగలరు? 

కవిత్వం అంటే ఏమిటి? అన్న ప్రశ్నకు కేదార్ నాథ్ చాలా సులభంగా సమాధానం చెబుతారు. ‘కవిత్వం అంటే ఏమిటి? ఒక చేయి మరో చేయిని అందుకోవడం. ఒక ఆత్మ దేహంవైపు మొగ్గడం. కళ్లు మృత్యు దిశగా చూడడం, కవిత్వం అంటే ఏమిటి? అదొక దాడి. దాడి తర్వాత నెత్తుటితో తడిసిన పాదరక్షలు తమను ధరించేందుకు పాదాలకోసం అన్వేషించడం. ఒక వీరుడి మౌనం.. ఒక విదూషకుడి ఆర్తనాదం..’

290025541_640
ఈ కవిత్వం చూడండి.. ‘కేదార్ నాథ్ సింగ్, నీకు నూర్ మియా గుర్తుండా? గోధుమ ముఖం నూర్ మియా, చిన్న నూర్ మియా.. రామ్‌ఘర్ బజార్ నుంచి సుర్మా అమ్మినవాడు..చివరగా తిరిగొచ్చిన వాడు,ఆ నూర్‌మియా గురించి ఏమైనా గుర్తుందా కేదార్ నాథ్‌సింగ్..ఆ స్కూలు గుర్తుందా..చింత చెట్టు, ఇమాంబరా,19వ ఎక్కంవరకూ మొదట్నుంచీ చెప్పగలవా,నీ మరిచిపోయిన పలకపై కూడికలు, లెక్కలు 
చేయగలవా..ఒకరోజు ఉన్నట్లుండి నూర్‌మియా మీ గల్లీని వదిలి వెళ్లిపోయాడో చెప్పగలవా, అతడెక్కడున్నాడు? ఢాకాలోనా, ముల్తాన్ లోనా.. పాకిస్తాన్‌లో ప్రతి ఏడాది ఎన్ని ఆకులు రాలుతాయో చెప్పగలవా..ఎందుకు మౌనంగా ఉన్నావ్?కేదార్ నాథ్ సింగ్, నీకు లెక్కలతో సమస్యేమైనా ఉందా చెప్పు? ‘ – ఈ కవిత శీర్షిక ‘1947ను గుర్తు చేసుకుంటూ..’

మరో కవిత- ‘హిమాలయం  ఎక్కడుంది? స్కూలు బయట గాలిపటం ఎగురవేస్తున్న ఆ బాలుడిని అడిగా. అదిగో.. అదిగో అక్కడుంది.. అని వాడు ఆ గాలిపటం ఎగురుతున్న వైపు చూపించాడు. ఒప్పుకున్నా. నాకు మొదటి సారి తెలిసింది. .హిమాలయం ఎక్కడుందో.. ‘


నల్ల నేల. అన్న కవితలో ఆయన నల్లదనం ఈ యుగం దృశ్యం అయిందని వాపోతారు. ‘నల్ల న్యాయం, నల్ల చర్చలు.. నల్ల అక్షరాలు. నల్ల రాత్రి.. నల్ల జనం.. నల్ల ఆగ్రహం..’అని రాస్తారు. 

కేదార్‌నాథ్ గురించి, ఆయన అక్షరాల గురించీ. ఆయన సాహిత్య విమర్శ గురించీ చెప్పాలంటే సుదీర్ఘం అవుతుంది. ‘మేరే సమయ్, మేరే శబ్ద్’ అన్న వ్యాస సంకలనంలో ఎజ్రాపౌండ్, రిల్కే, రెనె చార్ లాంటి కవుల గురించే కాక, భారతీయ కవులు, కవితోద్యమాల గురించి రాశారు. ఆయన ప్రజాస్వామిక ఆకాంక్షలను, సృజనాత్మకతను అర్థం చేసుకోవాలంటే ‘ఖబరిస్తాన్ మే పంచాయత్’అన్న సంకలనాన్ని చదవాల్సిందే. 

కేదార్‌నాథ్ ఎక్కడా వాస్తవిక రేఖల్ని దాటిపోలేదు. ‘ముక్తీకా జబ్ కోయా రాస్తా నహీ మిలా.. మై లిఖ్‌నా చాహుతాహు.. యహ్ జాన్‌తా హు కీ లిఖ్‌నే సే కుచ్ నహీ హోతా. మై లిఖ్‌నా చాహ్‌తా హూ.. (ముక్తి మార్గం ఎక్కడా దొరకకపోతే నేను రాయాలనుకుంటాను… రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసి కూడా నేను రాయాలనుకుంటాను)..’ అని ఆయన ఒక కవితలో రాశారు. 

అవును. రాయడం వల్ల ఏదీ జరగదని తెలిసినా రాస్తూనే ఉండాలి. ఏదైనా జరిగేంతవరకూ రాయాలి.. జ్ఞానపీఠ్ అవార్డు నాకు కేదార్‌నాథ్, శివారెడ్డి లాంటి అక్షరాల్నే జీవితంగా మార్చుకున్న వారిని గుర్తుకు తెచ్చింది. క్రాస్ రోడ్ వద్ద మల్లెపూలు అమ్మిన తమిళ బాలిక నాకు జీవిత పరిమళాన్ని ఆఘ్రాణింపచేసింది. ఏది జరిగినా, ఏది జరగ కపోయినా శవం మాత్రం కాకూడదు. ఇదే తాజాగా నేను నేర్చుకున్న గుణపాఠం. 


కృష్ణుడు

మీడియా మాటున భేడియాలు

sangisetti- bharath bhushan photo
    తెలంగాణ ప్రజాప్రతినిధుల, వాళ్లను ఎన్నుకున్న ప్రజల గుండెల్ని కోసి కారంబెట్టి ఇప్పుడు ఉఫ్‌ ఉఫ్‌ అంటూ మంటల్ని సల్లార్పెతందుకు పక్షపాత మీడియా ‘సారీ’ చెబుతోంది. (ఉఫ్‌ ఉఫ్‌ అని ఊదుకుంటనే మంటను ఎక్కువ జేస్తుండ్రనే ప్రచారం కూడా ఉంది) హేయమైన తమ చర్యలను సమర్ధించుకోవడం కోసం వందిమాగధులైన జర్నలిస్టు, రాజకీయ నాయకుల మద్ధతు తీసుకుంటుండ్రు. ఫాసిస్టు చర్య, అప్రజాస్వామికం అంటూ తప్పుంటే చట్టప్రకారం చర్య తీసుకోండి అని నీతులు చెబుతున్నారు.

అయితే వాళ్లు తమ అప్రజస్వామికతను, వివక్షను, దురహంకారపు దాడిని తమ  అవసరానుగుణంగా మరిచి పోతున్నరు. ప్రభుత్వాలను ప్రశ్నిస్తే ప్రసారాలను ఆపేస్తారా? ‘ప్రజాస్వామ్య తెలంగాణ ఇదేనా?’ అంటూ ‘అక్షరాన్ని ఆయుధం’గా మార్చి కేసీఆర్‌పైకి, నవజాత శిశువు తెలంగాణపై సంధించిండ్రు. ‘మెరుగైన సమాజం’ నిర్మించే వాళ్లు ఇప్పుడు తమ తెలంగాణ ఉద్యోగుల్ని రాయబేరాలకు పంపుతున్నరు. మీడియా మాటున భేడియాలుగా (తోడేళ్ళు) ప్రవర్తిస్తుండ్రు. మీడియా ముసుగేసుకొని ఏం చేసినా, ఎట్ల చేసిన చెల్లుతుంది అనుకునే వారికి ఎమ్మెస్‌వోలు షాక్‌ ఇచ్చిండ్రు. నిజానికి ఇది తెలంగాణ ప్రజల ఆకాంక్ష కూడా!
టీవి9, ఎబిఎన్‌ల ప్రసారాలు ఆపింది ఎమ్మెస్‌వోలు. కానీ ‘కొత్తపలుకు’ ఆయన మాత్రం ఎమ్మెస్‌వోలకు ఆదేశం ఇచ్చిందెవరు? ఎవరి వ్యక్తిగత విద్వేషం ఇందుకు దారి తీసింది? ఆంధ్రజ్యోతి సంస్థలపై విషం చిమ్మిన కేసీఆర్‌! అని చులుకన పలుకులు చెబుతుండు. బట్టగాల్శి మీదేసుడంటే గిదే! వ్యక్తిత్వ హననం అంటే ఇదే! రైతుల రుణమాఫీపై గందరగోళాన్ని సృష్టించి వారిని ఆత్మహత్యలకు పురిగొల్పడమే గాకుండా ‘ఏపీ నుంచా ఏసెయ్‌ పన్ను’ అని హెడ్డింగ్‌లు పెడ్తిరి. ‘మా అక్షరం మీ ఆయుధం’ అంటివి. కానీ ఈ ఆయుధాలన్నీ తెలంగాణ బిడ్డలపైనే ఎందుకు  ప్రయోగించబడుతున్నవో అర్థంగాదు. గాలి వార్తలు అచ్చేసి గాయి గాయి చేస్తూ ఇది అసమర్ధ ప్రభుత్వం అని ముద్రవేయాలని ప్రయత్నించిండ్రు.

ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు అని గగ్గోలు పెట్టే ఈ మీడియా నిండు అసెంబ్లీలో కిరణ్‌కుమార్‌ రెడ్డి తెలంగాణకు ఒక్క రూపాయి కూడా ఇవ్వం ఏంజేసుకుంటరో చేస్కోండి అన్నప్పుడు అది అప్రజాస్వామికమని అనిపించలేదు. పత్రిక పేరే ‘‘ఆంధ్ర’జ్యోతి’. తెలంగాణకు చీకటి, ఆంధ్రకు వెలుగులు పంచే ఈ పత్రిక ‘మీడియా స్వేచ్ఛ’ పేరిట తాము ఏది చెప్పినా, రాసినా ఇన్నేండ్ల మాదిరిగానే ‘తెలంగాణ రాష్ట్రం’లో కూడా చెల్లాలని మొండిగా వాదిస్తోంది. తమ ఆధిపత్యాన్ని తెలంగాణలో అప్రతిహతంగా కొనసాగించడమే గాకుండా తమ సామాజిక వర్గం వారి నేతృత్వంలో సీమాంధ్రలో ఏర్పడే ప్రభుత్వాన్ని హీరోగా నిలబెట్టడం దీని ఉద్దేశ్యం. తెలంగాణతో పోల్చి ‘ఆంధ్ర ప్రభుత్వమే బేషుగ్గా పనిచేస్తోంది’ అనే ఒక అభిప్రాయాన్ని కూడగట్టడానికి ‘స్టోరీ’లు రాసింది. దీంతో పత్రిక ఎవరి ప్రయోజనాల కోసం, ఎవరిని అప్రతిష్టపాల్జేసేందుకు పనిజేస్తుందో తెలంగాణ ప్రజలు తెలుసుకున్నరు. అందుకే ‘వి రిపోర్ట్‌ యూ డిసైడ్‌’ అని మీరు చెప్పినట్లుగానే నిర్ణయం తీసుకుండ్రు. ఇప్పుడు ఎమ్మెస్‌వోలకు ప్రజలు బాసటగా నిలిచిండ్రు. ఒక సామాజిక వర్గం ఆధిపత్యాన్ని కూలగొట్టేందుకు సిద్ధమయ్యిండ్రు.
‘కులం అడ్డు గోడలు కూలగొట్టండి’ అని బాకాలూదే ఈ మీడియాకూ కులముంది. ప్రాంతము కూడా ఉంది. వీటన్నింటికి అతీతంగా, నిష్పక్షపాతంగా భిన్న ప్రజాభిప్రాయాల వేదికగా నిలువాల్సిన మీడియా ఇవ్వాళ ‘కమ్మోళ్ల’ ప్రయోజనాలు కాపాడే, పెంపొందించే వాహికగా మారింది. డెల్టాంధ్ర పెట్టుబడిదారుల కొమ్ముగాసే తాబేదారుగా రూపాంతరం చెందింది. అలా కానట్లయితే ‘నేను తెలంగాణలో పుట్టిన’ ‘నన్ను ఆంధ్రోడు’ అని అంటుండ్రు అంటూ వాపోయే వేమూరి రాధాకృష్ణ ఇక్కడి ప్రజల పక్షాన ఎన్నడైనా నిలబడ్డారా? ఆయన ఆత్మపరిశీలన చేసుకోవాలె. నల్లగొండ ఫ్లోరైడ్‌ బాధితులకోసం వీళ్లు ఏ నిధులు సేకరించలేదు. కనీసం తాను పుట్టాను అని చెప్పుకుంటున్న నిజామాబాద్‌ నుంచి గల్ఫ్‌కు వలసెల్లిన వారి కోసంగానీ, అక్కడి బీడీ కార్మికుల కోసం గానీ ఏ నిధిని, ట్రస్ట్‌ని ఏర్పాటు చేయలేదు. తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్న బిడ్డల కుటుంబాలను ఆదుకుందామనే ఆలోచన కూడా ఆయనకు రాలేదు. ఇదీ ఆయన ప్రాంతీయ నిబద్ధత. అయితే ఆంధ్రప్రదేశ్‌ కొత్త రాజధాని కోసం నిధులు సేకరించడానికి నడుం కట్టాడు. లైవ్‌షోలు పెట్టిండు. దీని వెనుక పూర్తిగా కులం, ప్రాంతము తప్ప మరేమి లేదు. రాజధాని అనే కన్నా దీన్ని ‘క్యాపిటల్‌’ అనడమే సబబు. కేవలం పెట్టుబడిదారులకు అండగా నిలబడేందుకే ఈ ‘రాజధాని విరాళాలు’. రాజధాని కృష్ణా`గుంటూరు మధ్యలో గాకుండా రెడ్ల ప్రాబల్యం ఉండే ప్రకాశం జిల్లాలో వస్తదంటే ఈ విరాళాల ప్రచారం చేపట్టేవారే కాదు. ఈ ‘క్యాపిటల్‌’ పెట్టుబడిదారులు అంతా కమ్మ సామాజిక వర్గం వారే కావడం యాధృచ్ఛికం గాదు.
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రెండు రాష్ట్రాల్లో కలిపి, ఎంత లిబరల్‌గా లెక్కేసినా ‘కమ్మోళ్ల’ జనాభా ఐదు శాతం మించదు. అయితే కృష్ణా, గుంటూరు జిల్లాల్లో వీరి జనాభా దాదాపు 20శాతం ఉంటది. అంతేగాదు ఆ రెండు జిల్లాల్లోని సాగునీటి వసతి ఉన్న సారవంతమైన వ్యవసాయ భూముల్లో 80శాతం ‘కమ్మోళ్ల’ చేతుల్లోనే ఉన్నయి. వీరి ప్రయోజనం కోసమే ‘క్యాపిటల్‌’ నిర్మాణానికి ఈయన ముగ్గు పోస్తుండు. ఇంకా చెప్పాలంటే వీరికి రాయలసీమ, ఉత్తరాంధ్ర రెండూ పరాయి ప్రాంతాలే!
మీడియాకు ముఖ్యంగా తెలుగు మీడియాకు కులముంది. మీడియాలో దృశ్యం, శ్రవణం, అక్షరం మూడూ వస్తాయి. సినిమాల్లో 95శాతం కమ్మసామాజిక వర్గమే రాజ్యమేలుతోంది. నిర్మాణం గానీ, థియేటర్లు గానీ, హీరోలు, డైరెక్టర్లు అంతా వాళ్లే. ఇక తెలుగులో దాదాపు ఒక వంద ఛానళ్ళు పనిజేస్తే అందులో 90 ఛానళ్ళ యాజమాన్యం కమ్మసామాజిక వర్గం వారిదే! న్యూస్‌ ఛానళ్లలో ఇదే పరిస్థితి. ఎఫ్‌ఎం రేడియోల పరిస్థితి దీనికి భిన్నంగా ఏమీ లేదు. పత్రికలు కూడా దాదాపు అన్నీ వారివే! అందుకే వారు ఆడిరది ఆటగా పాడిరది పాటగా ఇన్నాళ్లు చలామణి అయింది. అహంకారానికి, అధికారం తోడు కావడంతో కనీస మీడియా విలువలు కూడా పాటించకుండా తమకు ఎదురులేదని విర్రవీగిండ్రు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడడంతో దానికి గండి పడిరది. తెలంగాణపై వీరి దాడి ఇవ్వాళ కొత్తగా షురువయ్యింది కాదు. ఎనుకటి నుంచి ఇదే తంతు. ఇక్కడ కొంత చరిత్ర చెప్పుకోవాలె!
తెలంగాణలో మొట్టమొదటి ప్రాంతేతర పత్రిక ‘తెలుగుదేశం’. హైదరాబాద్‌పై పోలీసు చర్య అనంతరం 1949లో సూర్యదేవర రాజ్యలక్ష్మీదేవి (1914-2010) ఈ పత్రికను ప్రారంభించారు. బాపట్లకు చెందిన ఈమె ఆ తర్వాతి కాలంలో హైదరాబాద్‌ అసెంబ్లీకి కూడా ఎన్నికయింది. కమ్మసామాజిక వర్గం వారు తెలంగాణ పత్రికారంగంలో అలా అడుగు పెట్టిండ్రు. ఆ తరువాత రాజ్యలక్ష్మితో కలిసి వల్లూరి బసవరాజు తదితరులు ఆంధ్రజనత దిన పత్రికను 1955 ఆ ప్రాంతంలో ప్రారంభించారు. దీంతో ఆంధ్రప్రాంతం నుంచి జర్నలిస్టుల రాక ముమ్మరమైంది. ఆంధ్రప్రదేశ్‌ అవతరణ అనంతరం ఆ ప్రభుత్వం పక్షపాత, కక్షపూరిత వైఖరి మూలంగా ‘గోలకొండ’ పత్రిక 1966లో మూతపడిరది. నలభై యేండ్లు తెలంగాణ సమాజానికి ఎనలేని సేవ చేసిన గోలకొండ పత్రికకు అడ్వర్టయిజ్‌మెంట్లు ఇవ్వడంలోనూ, న్యూస్‌ప్రింట్‌ కేటాయింపులోనూ అన్యాయం జరిగింది. అలాగే 1938లో స్థాపించబడ్డ ‘దక్కన్‌ క్రానికల్‌’ పత్రికను 1976లో ‘తిక్కవరపు’ కుటుంబం కొనుగోలు చేసింది.

ఈ కుటుంబం వారు దాదాపు అదే కాలంలో నాగార్జునసాగర్‌ ప్రాజెక్టు కాంట్రాక్టర్లుగా వుండ్రిండ్రు. దక్కన్‌ క్రానికల్‌ని తిక్కవరపు చంద్రశేఖరరెడ్డి కొనుగోలు చేసిన సమయంలోనే ఈనాడు పత్రికను రామోజీరావు విశాఖపట్నంలో ప్రారంభించారు. అది తర్వాతి కాలంలో హైదరాబాద్‌ ఎడిషన్‌ కూడా ప్రారంభించింది. అయితే కొద్ది కాలంలోనే యాజమాన్యం వైఖరికి నిరసనగా తెలంగాణ జర్నలిస్టులు పాశం యాదగిరి, రత్నమాల లాంటి వారు ఉద్యమాన్ని లేవదీసిండ్రు. ఉద్వాసనకు గురయ్యిండ్రు. తెలుగుదేశం పార్టీ అవతరణ సమయంలో ‘ఈనాడు’ దాని కరపత్రంగా పనిచేసింది. ఇదే సమయంలో దాసరి నారాయణరావు తెచ్చిన ‘ఉదయం’ పత్రిక మొదట్లో కొత్త వెలుగులు ప్రసరించినా అది కూడా నెల్లూరు రెడ్ల వశమయ్యింది. సినిమా ఇండస్ట్రీ చెన్నయ్‌ నుంచి హైదరాబాద్‌ వస్తే, అప్పటి వరకు విజయవాడ నుంచి ప్రచురితమైన పత్రికలు ముఖ్యంగా ఆంధ్రజ్యోతి తమ కేంద్రాన్ని హైదరాబాద్‌కు మార్చుకుంది. ఈ రెండు మాధ్యమాలు తెలుగుదేశం పార్టీ అండతో తెలంగాణపై విషం గక్కాయి.

కారంచేడు లాంటి సంఘటనలను నిజాయితిగా, నిష్పక్షపాతంగా రిపోర్టు చేసే ధైర్యాన్ని కూడా ఈ పత్రికలు ప్రదర్శించలేక పోయాయి. అంతేగాదు వీటి ఎత్తుగడలకు, కుచ్చితాలకు 85యేండ్లు నిరంతరాయంగా నడిచిన ‘ఆంధ్రపత్రిక’ కూడా మూత పడిరది. తెలంగాణకు చెందిన కాసాని జ్ఞానేశ్వర్‌ ‘సత్య’ న్యూస్‌ ఛానల్‌ పెట్టడానికి ప్రయత్నం చేస్తే దాన్ని ఆదిలోనే చిదిమేసిండ్రు. అలాగే నూకారపు సూర్యప్రకాశరావు ‘సూర్య’ పత్రిక తెచ్చే సమయంలో ఆయనపై ఈ మీడియా ఎంత దాడి చేసిందో కూడా అందరికి తెలుసు. తాము చేస్తే ప్రజాసేవ, వేరేవాళ్లు అదే పని చేస్తే ద్రోహం అన్న విధంగా ప్రచారం చేసిండ్రు. తప్పు ఎవరు చేసినా తప్పే అనే సోయి మాత్రం వీరికి లేదు. ఏమి చేసినా ఎట్లా చేసినా తమ సామాజిక వర్గమే చేయాలనే నిశ్చితాభిప్రాయంతో ఉన్న ఈ మీడియా వర్గం తమ స్వప్రయోజనాల కోసం ఎంతకైనా దిగజారుతారు. అలా దిగజారుడుకు పరాకాష్ఠ ‘మడిశి పెట్టుకోవడం’, ‘తొక్కు పచ్చడి’ ‘తాగుబోతోళ్లు, ‘శిలుం మొకం’ మాటలు.
తమని తీరొక్క తీరుగా తిట్టినా మళ్ళీ అదే మీడియాకు ప్రజాస్వామ్యం ముసుగేసి కొంతమంది బానిసలు బాసటగా నిలుస్తుండ్రు. మీడియా స్వేచ్ఛ ముసుగులో వాళ్లు ఎన్ని యవ్వారాలు చేసినా అడ్డూ అదుపూ లేకుండా పోయింది. తెలంగాణ సంస్కృతి, చరిత్రను ‘మాకరీ’  చేస్తూ అంగట్ల సరుకులాగా అమ్మాలని చూస్తున్నా వీళ్ళు ఇంకా నిజం తెలుసుకోలేక పోతుండ్రు. బహుశా తెలిసినా తమ బానిస భావజాలాన్ని వదిలించుకోలేక పోతుండ్రు కావొచ్చు. గతంలో ఆంధ్రజ్యోతి అహంభావానికి వ్యతిరేకంగా పత్రిక కార్యాలయాన్ని ధ్వంసం చేయడమే గాకుండా ధర్నాకు దిగిన వారు సైతం ఇవ్వాళ తమ స్వప్రయోజనాలకు అనుగుణంగా వ్యవహరిస్తూ ఎమ్మెస్‌వోలను దుమ్మెత్తి పోస్తుండ్రు. ఊసరవెల్లుల మాదిరిగా రంగులు మార్చే రాజకీయ నాయకులు ఈ పనిచేస్తే అది సహజమే అని సర్దిచెప్పుకోవచ్చు. కానీ జర్నలిస్టు సంఘాల నాయకులు సైతం అప్రజాస్వామికం, ఫాసిస్టు చర్య అంటూ గొంతులు చించుకుంటుండ్రు. మీడియా విలువల వలువలూడదీసే వారికి వీరు జేజేలు పలుకుతుండ్రు.
ఈ గొంతులు చించుకునే వాళ్లు ఒక్క విషయం అర్థం చేసుకోవాలె! వాళ్లకు తెలంగాణ అనేది ఒక అంగడి సరుకు కావచ్చు. కాని నాలుగు కోట్ల మంది ప్రజలకు అది ఒక ఆత్మగౌరవ నినాదం. స్వయంపాలన ఆకాంక్ష. తెలంగాణ చరిత్రను, సంస్క ృతిని, వారసత్వాన్ని, ఔన్నత్యాన్ని పజీత పజీత చేస్తూ ఇజ్జత్‌ పుచ్చుకుంటుంటే ఇదేమని ఈ పదిహేనేండ్లల్ల ఎన్నడూ ఏ జర్నలిస్టు నాయకుడూ తప్పుపట్టలేదు. అంతెందుకు మొన్నటి సంఘటనను కూడా వాళ్లు బహిరంగంగా ఖండిరచలేదు. ‘టీ న్యూస్‌’ ఛానల్‌ ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో ప్రసారం కాదు అంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. అంతేగాదు మిగతా తెలంగాణ యాజమాన్య ఛానళ్ళని ఆంధ్రలో ఎన్నడో బ్యాన్‌ చేసిండ్రు. అయినా ఈ విషయాల గురించి జర్నలిస్టు సంఘాల నాయకులు ఎన్నడూ స్పందించలేదు. నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడ నడిబొడ్డున తగలబెడ్తుంటే ‘కోనాయి’ అన్నోడు లేడు. చంద్రబాబు ఒంటికంటి సిద్ధాంతానికి వీరి వైఖరికి పెద్దగా తేడా లేదు. మీడియా స్వేచ్ఛ ముసుగులో రెండు రాష్ట్రాల్లో తామే నాయకులుగా చలామణి కావాలనే యావ తప్ప వీరికి తెలంగాణ ఆత్మగౌరవం ప్రధానం కాదు.
ఇప్పటికే ఈటీవి`2, ఈటీవి తెలుగులో 49 శాతం వాటాను, మిగతా ఈటీవి చానళ్ళనన్నింటిని 2600ల కోట్లకు కొనుగోలు చేసిన రిలయన్స్‌ సంస్థ ఇప్పుడు సిఎన్‌ఎన్‌`ఐబిఎన్‌తో సహా అనేక ఛానళ్ళను సొంతం జేసుకుంది. పెట్టుబడిదారుల కింద పనిచేయడానికి నిరాకరించి రాజ్‌దీప్‌ సర్దేశాయి, ఆయన భార్య సాగరికా ఘోష్‌ సంస్థ నుంచి తప్పుకున్నారని వార్తలు వస్తున్నాయి. ఎంత చెడ్డా ఉత్తరాదిలో మీడియా విలువలను కొంతమేరకైనా పాటిస్తుంటే మన తెలుగువాళ్లు జర్నలిస్టు నాయకులతో సహా అందరూ యాజమాన్యాలకు గులామ్‌లుగా మారి ‘మీడియా స్వేచ్ఛ’ ముసుగులో తెలంగాణ తల్లి బొండిగె పిసికేందుకు సిద్ధమయిండ్రు.
మీడియా స్వేచ్ఛపట్ల వారికొక్కరికే పట్టింపు ఉన్నట్లుగా జర్నలిస్టులు, ఔట్‌డేటేడ్‌ రాజకీయ నాయకులు స్వీయ ప్రచారం కోసం ప్రకటనలు ఇస్తుండ్రు. ప్రజాస్వామ్యంలో ‘ఫోర్త్‌ ఎస్టేట్‌’కు గౌరవం, స్వేచ్ఛ రెండూ దక్కాల్సిందే! అయితే తప్పు చేసిన వారికి శిక్ష లేనట్లయితే తామే రాజ్యాంగ నిర్మాతలుగా వ్యవహరిస్తారు. చట్టం తమ సుట్టంగా సూస్తరు. ఇప్పటికీ మించి పోయింది లేదు. ఇప్పుడు జర్నలిస్టు సంఘాల నాయకులు రోడ్డు మీదికొచ్చి నెత్తినోరు కొట్టుకోకుండా అటు ఎమ్మెస్‌వోలను, ఇటు ఛానళ్ళ యాజమాన్యాలను కూర్చుండబెట్టి ‘అంబుడ్స్‌మన్‌’ని మధ్యవర్తిగా పెట్టుకొని సమస్యను చర్చల ద్వారా పరిష్కరించుకోవాలి.

భవిష్యత్‌లో ఇలాంటి సంఘటనలు పునరావృతం కావు అనే భరోసాను ఎమ్మెస్‌వోలకు తద్వారా తెలంగాణ ప్రజలకు కల్పించినట్లయితే సమస్య ముమ్మాటికీ పరిష్కారమయ్యే అవకాశముంది. ఇందుకు తప్పుచేసిన వాళ్లు బేషరతుగా ముందుగా క్షమాపణ చెబుతూ, అవి పునరావృతం కావు అని లిఖిత పూర్వకంగా తెలంగాణ ప్రజలకు తెలియజేయాలి. పంతాలకు, పట్టింపులకు పోయి కేంద్రం నుంచి వత్తిడి తెప్పిద్దాం అనుకుంటే ఏకు మేకై అసలుకే ఎసరొచ్చే ప్రమాదముందని గుర్తించాలి.

                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

“ఇండియా గేట్”

IMG_0384

దాదాపు అరగంట నుండీ అతను ఇండియా గేట్ దగ్గర ఎదురుచూస్తున్నాడు. సాధారణంగా ఈ పాటికి తనని రిసీవ్ చేసుకోడానికి ఎవరో ఒకరు రావాలి. ఎందుచేత ఆలస్యం అయ్యిందో అనుకుంటున్నాడు. అతను – పేరేదయితేనేం, మంచి శారీర ధారుఢ్యంతో పొడవుగా ఉంటాడు. రంగు మరీ తెలుపు కాకపోయినా చామనచాయ. ఉంగరాల జుట్టు. తీక్షణమైన అతని కళ్ళల్లో కాంతి తలతిప్పి అతనికేసే చూసేలా చేస్తుంది. జేబులోంచి సిగరెట్ ప్యాకెట్ తీసి చూసుకున్నాడు. బీనాకి అతను సిగరెట్లు కాలిస్తే ఇష్టం. దగ్గరగా మాట్లాడుతున్నప్పుడు ఆ వాసన భలే మత్తుగా ఉంటుందంటుంది. అతనికి సిగరెట్టు అలవాటు లేదు. బీనా కోసం అలవాటు చేసుకున్నాడు. బ్యాక్‌పాక్ లోంచి గూచీ స్ప్రే తీసి చొక్కా మీద జల్లుకున్నాడు. బీనాకి గూచీ స్ప్రే వాసన కూడా ఇష్టమే. ఆమెను కలవాల్సినప్పుడల్లా ఆమెకిష్టమయినవన్నీ గుర్తు పెట్టుకుంటాడు. ఇంతలో సెల్ ఫోన్ మ్రోగింది. దీప్తి నుండి ఫోన్. ఆన్ చేసి హలో చెప్పాడు.

“చెప్పానుగా డిల్లీ వచ్చాను. రావడానికి వారం పట్టచ్చు. రేపూ ఎల్లుండీ ఇక్కడ ఉండి తరువాత చండీఘడ్ వెళ్ళాలి…”

అతనికి దీప్తి ఫోన్ కట్‌చెయ్యాలని ఉంది. మాంచి టెన్షన్లో ఉన్నప్పుడే కాల్ చేస్తుందనుకున్నాడు. దీప్తి చెబుతున్నది వింటూ ఊ కొడుతున్నాడు.
“ఎన్ని సార్లు చెప్పాలి? అనసూయమ్మ గారి పని మీద వచ్చాను. ఇంకెంత వారంలో వచ్చేస్తాను. పాప జాగ్రత్త. ఏమైనా అవసరం అయితే కాల్ చెయ్యి. ఉంటాను,” అంటూ అతను ఫోన్ కట్ చేసాడు.

ఇంతలో అతను నుంచున్న చోటుకి దగ్గర్లో ఒక బి.ఎం.డ్బ్ల్యూ వేన్ వచ్చి ఆగింది. విండొ తీస్తుండగానే అతను గుర్తించాడు. నల్లటి కళ్ళద్దాలు పెట్టుకొని బీనా చెయ్యూపింది. గబగబా అతను వ్యాను ఎక్కాడు. బయట ఎండకి అతనికి ఉక్కబోతగా ఉండడంతో అతను విండో గ్లాసు తీయబోయాడు. వద్దని వారిస్తూ ఏ.సీ ఆన్ చేసింది. సీట్లో కూర్చోగానే హై ఫై ఇచ్చింది ఆమె. అతనూ నవ్వాడు. ఇద్దరూ కబుర్లలో పడ్డారు.

మధ్యలో రెండు మూడు సార్లు అతని ఫోన్ రింగయ్యింది. మొదటి రెండు సార్లూ తియ్యలేదు. మూడోసారి తీసి చూసాడు. దీప్తి పేరు స్క్రీన్ మీద కనిపించింది. అతను వేంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసేసాడు.

“ఎవరు? మాట్లాడచ్చు కదా? ఎందుకు స్విచ్ ఆఫ్ చేసావు?” బీనా ప్రశ్నకి ఏం జవాబు చెప్పాలో తెలీలేదు. ఫ్రెండని చెప్పాడు.
తనకున్న కొద్ది పరిచయంలో బీనా అతనికి కాల్ రావడం చూళ్ళేదు. సాధారణంగా బీనా ఇంటికి రాగానే అతను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసేస్తాడు. బీనాని కలవడం అతనికది నాలుగోసారి.

ఆ వ్యాను దూసుకుంటూ పటేల్ నగర్ వైపు వెళ్ళింది.

కారు దిగీ దిగగానే అతను సిగరెట్టు వెలిగించాడు. బీనాకి కారులో సిగరెట్ త్రాగడం ఇష్టం ఉండదు. కారంతా సిగరెట్ వాసన వస్తుందని అంటుంది.
వ్యాను దిగాక సరాసరి మేడమీదకి వెళ్ళాడు. బీనా ఇల్లు చాలా పెద్దది. ఆమె ఐశ్వర్యం అంతా ఆ ఇంట్లో ప్రతీ అంగుళంలోనూ కనిపిస్తుంది.
సరాసరి అతను బెడ్ రూం వైపు వెళ్ళాడు. వేంటనే షవర్ చేసుకోవడానికి బాత్‌రూమ్ వైపు వెళ్ళాడు. షవర్ అయ్యాక లుంగీ కట్టుకొని మంచమ్మీద కూర్చుని సిగరెట్ వెలిగించాడు.

ఒక్కాసారి వెనక్కాలనుండి వచ్చి బీనా అతన్ని వాటేసుకుంది. ఆమె స్పర్శ అతనికి కొత్తకాదు. అతని చేరువ బీనాకి అంతే!
కొంతసేపయ్యాక అతను మంచమ్మీద నుండి లేచి బట్టలు మార్చుకుంటూండగా బీనా అతనికి చిన్న కవరు అందిచ్చింది. బీనా కేసి చూస్తూ నవ్వాడతను . రేపూ వస్తావా అనడగింది. సరేనన్నాడు అతను.

***

హొటలుకి తిరిగొస్తూండగా మధ్యాన్నం దీప్తి ఫోన్ చేసినట్లు గుర్తొచ్చింది. వేంటనే కాల్ చేసాడు.
“వచ్చిన పని కావడానికి ఇంకా రెండ్రోజులు పైనే పట్టచ్చు, ” ఆవతల దీప్తి ప్రశ్నలకి జవాబిస్తున్నాడు.

“నే చేప్పేది విను. అనసూయమ్మ గారు పంపితేనే వచ్చాను. వాళ్ళమ్మాయి ఐష్ మాటలు నమ్మకు. అయినా నా గురించి తెలిసీ ఆ అమ్మాయి మాటలు ఎలా నమ్మగలిగావు? అయినా నేను మొన్ననగా వచ్చాను. ఐష్‌ని కలిసే చాన్సే లేదు. నువ్వేం కంగారు పడకు. ఎవరైనా అడిగితే పని మీద సొంతూరు శ్రీకాకుళం వెళ్ళానని చెప్పు. పాప జాగ్రత్త. అవసరమయితే ఫోన్ చెయ్యి,” అని దీప్తికి సర్ది చెప్పాడు.
డిన్నర్ చేసి రాత్రికి నిద్రకి ఉపక్రమిస్తూండగా రూం బెల్ మ్రోగింది. వెళ్ళి డోర్ తీసి చూసి అవాక్కయ్యాడు.
అతని ఎదురుగా యూనిఫాంలో ఓ పోలీసాఫీసర్! అతని నోట మాట రాలేదు.

***

అతన్ని ఒక గదిలో పడేసి చచ్చేలా బాదుతున్నాడా పోలీసాఫీసర్.
“సార్! నాకు ఏమీ తెలియదు. నన్ను నమ్మండి. కిట్టని వాళ్ళెవరో నా నంబరిచ్చారు,” అంటూ హిందీలో బావురుమన్నాడు.
“నా గురించి మీకు వివరాలెవరిచ్చారో తెలీదు,” అంటూ అతను హిందీలో భోరున విలపించాడు. ఆ వచ్చిన పోలీసాఫీసరుకి తెలుగు రాదు. హైద్రాబాదులో ఆటో నడపడం వల్ల అతనికి హిందీ బానే వచ్చింది.
“ఇవాళ మధ్యాన్నం నా సెల్‌కి ఒక కాల్ వచ్చింది. ఒకమ్మాయి నీ వివరాలన్నీ చెప్పింది, నువ్వొక పెద్ద రాకెట్ నడుపుతున్నావనీ చెప్పింది,” ఆ పోలీసఫీసర్ చెప్పాడు.
అతనికి ఆ అమ్మాయెవరో అర్థమయ్యింది. అనసూయమ్మ కూతురు ఐష్ అయివుంటుంది. డిల్లీకి బయల్దేరేముందు అతనితో పిచ్చిగా ప్రవర్తించింది. అతను చీకొట్టడంతో కోపంతో ఈ పని చేసుండచ్చు. అయినా తను డిల్లీలో ఉన్న సంగతి అనసూయమ్మకి తప్ప ఇంకెవరికీ తెలిసే అవకాశం లేదు. దీప్తికి అతను వెళ్ళేది డిల్లీ అని చెప్పాడంతే! దేనికో, ఎక్కడికో చెప్పలేదు. ఎప్పుడూ చెప్పే అలవాటు కూడా లేదు. అనసూయమ్మ రియల్ ఎస్టేట్ పని మీదనే ఈ టూర్లని దీప్తి నమ్మకం.

అయితే, అనసూయమ్మే చేయించిందా ఈ పని ? అతనికేమీ అర్థం కావడం లేదు.

“డోంట్ వర్రీ, నీకేమీ భయం లేదు. నువ్వు నాకు సహకరిస్తే ఈ ఈ రాకెట్ని బయట పెట్టాలి. ఈ డిల్లీలోనే మినిస్టర్ల భార్యలూ, ఆర్మీ చీఫుల పెళ్ళాలూ వీళ్ళందరూ పెద్ద రాకెట్ నడుపుతున్నారని తెలుసు. నీలాంటి యువకులు చాలామంది ఈ రాకెట్లో ఉన్నారు. దేర్ ఈజ్ సంథింగ్ ఫిష్షీ హియర్!” అని ఆలోచనలో పడ్డాడా పోలీసాఫీసర్!

ఇంతలో అతని ఫోన్ మ్రోగింది. దీప్తి అన్న పేరు సెల్ ఫోన్ మీద కనిపించింది. ఫోన్ తియ్యాలా వద్దన్నట్లు పోలీసాఫీసరు కేసి చూసాడతను. మాట్లాడమన్నట్లు తలెగరేసాడా పోలీసాఫీసరు. వెంటనే ఫోన్ అందుకున్నాడతను.

“ముందు ఏడుపు ఆపి నే చెప్పేది శ్రద్ధగా విను. అనసూయమ్మ కూతురు ఎవడితోనే పారిపోయిండచ్చు. అతనెవరూ దొరికే వరకూ అనసూయమ్మ నన్ను వాడుకుంటోంది. అందుకే మీ అందరికీ నేను లేపుకుపోయానని చెప్పుండచ్చు. ఇది తల్లీ కూతుళ్ళ నాటకం. నేనొచ్చేవరకూ నువ్వు తొందర పడద్దు, ” అంటూ చెబుతూండగానే ఫోన్ లాక్కున్నాడా పోలీసాఫీసరు. ఒక్కసారి కంగారు పడ్డాడతను.

“కౌన్ హో తుమ్? క్యా చాహియే? తుమ్హారా ఆద్మీ మేరే జాల్ మే…” అంటూ ఫోన్ కట్ చేసాడు. దీప్తికి హిందీ అంత బాగా రాదు. కానీ వేరే గొంతు వినేసరికి కంగారు పడే అవకాశం ఉందనుకొని భయపడ్డాడతను.

“ఇప్పుడు చెప్పు? నీ వెనుక ఎవరెవరున్నారు? అసలీ రాకెట్ ఏవిటి?” అంటూ ఫోన్ అడ్రసు బుక్కులో నంబరు వెతుకుతున్నాడు. ఏమీ కనిపించక పోయే సరికి చాలా చికాకు పడ్డాడు ఆ పోలీసాఫీసరు.

“ఇంతకు ముందు ఫొన్ చేసిందెవరు?” గట్టిగా లాఠీతో కాళ్ళ మీద అదిలించాడు.
ఒక్కాసారి అదిరిపడి – “నా పెళ్ళాం, సార్!” అంటూ వణికిపోయాడతను.

“సాలే! నీ బ్రతుక్కి పెళ్ళి కూడా అయ్యిందా? లేక ఎవరైనా…” అంటూ మరో సారి లాఠీ అదిలించాడు. దూరంగా కానిస్టేబుల్స్ ఇదంతా గమనిస్తూనే ఉన్నారు.
“లేదు సార్! నన్ను నమ్మండి. నాకు ఎవరి వివరాలూ తెలీవు. నేను మా ఇంటి ఓనరు అనసూయమ్మ పంపితే పని మీద వచ్చాను…” అంటూ ఏడుస్తూ చెప్పాడతను. ఆ పోలీసాఫీసర్ని చూస్తే భయమేసింది.
తనకి తెలుసున్నది చెప్పడానికి ఉపక్రమించాడతను. అతని కళ్ళ ముందు దీప్తీ, పాప మెదిలారు.

 

***

“మాది శ్రీకాకుళం దగ్గరలో వున్న ఆముదాలవలస. మా నాన్న ఒక రైసు మిల్లులో పని చేసేవాడు. నేనే ఆఖరి వాణ్ణి. నాకు ఇద్దరు అక్కలూ, ఒక అన్న. నాకు చదువంత సరిగా అబ్బలేదు. ఆముదాలవలసలో ఉంటే చెడు తిరుగుళ్ళు ఎక్కవయ్యాయని నాన్న నన్ను శ్రీకాకుళం మా అత్తయ్య ఇంట్లో పెట్టాడు. శ్రీకాకుళంలోనే కాలేజీ చదువు ప్రారంభం అయ్యింది. ఇంటరు అత్తెసరు మార్కులు వచ్చి చచ్చి పాసవ్వడంతో బీ.కాం లో జాయిన్ అయ్యాను. డిగ్రీ రెండో ఏడు చదువుతూండగా దీప్తితో పరిచయం అయ్యింది. దీప్తి వాళ్ళు ఆర్థికంగా కాస్త ఉన్నవాళ్ళు. మా పరిచయం ప్రేమగా మారింది. చాటుగా ఏడాది పాటు ప్రేమాయణం సాగించిన మేము డిగ్రీ పరీక్షల చివర్లో వాళ్ళింట్లో పట్టుబడిపోయాం. దీప్తి వాళ్ళది మావీ కులాలు వేరు. వాళ్ళ నాయనకి కులాల పట్టింపు బాగా ఉంది. పైగా డబ్బూ, పలుకుబడీ ఉన్న వాళ్ళు. మమ్మల్ని కాదన్నారు వాళ్ళు. మేం వాళ్ళని వద్దనుకున్నాం. ఎవరికీ చెప్పా పెట్టకుండా హైద్రాబాదు ఉడాయించాం. హైద్రాబాదు రాగానే జీడిమెట్లలో ఉన్న నా స్నేహితుడొకడు మాకు ఆసరా ఇచ్చాడు. కొంతకాలం వాడింట్లో ఉన్నాం. ఈలోగా నేను ఉద్యోగం వెతుక్కోడం మొదలు పెట్టాను. ఒకటి రెండు ఫాక్టరీల్లో చిన్న చిన్న పనులు చేసాను కానీ, మా ఇద్దరికీ చాలేది కాదు. సరిగ్గా అదే సమయానికి దీప్తి నెల తప్పింది. అబార్షన్ చేయించుకోమని చెప్పాను. తను మొండి కేసింది. మాకే బ్రతకడానికి చచ్చే చావులా ఉంది. ఇంకో ప్రాణాన్ని ఎలా నెట్టుకు రావడం? సరిగ్గా అదే సమయానికి నా స్నేహితుడు ఇల్లు ఖాళీ చెయ్యాల్సొచ్చింది. ఇల్లు వెతుకులాట మొదలయ్యింది. ఎక్కడా ఇంటి అద్దె భరించే స్థితిలో నేను లేను. ఉద్యోగం కూడా అంతంత మాత్రం. అనుకోకుండా మా స్నేహితుడికి తెలుసున్నాయన మా కష్టాలు విని బాలానగర్ దగ్గర్లో ఒక అపార్ట్మెంట్ గ్రౌండ్ ఫ్లోర్లో రెండు చిన్న గదుల ఇల్లు చూపించాడు. ఆ అపార్ట్మెంట్ ఓనరు అనసూయమ్మ. ఆవిడ మాగురించి తెలుసుకొని అద్దె లేకుండా మాకు ఉండడానికి ఇల్లిచ్చింది. నాకు కారు డ్రైవింగ్ వచ్చని తెలియడంతో ఆవిడ కారు డ్రైవరుగా నన్ను పెట్టుకుంది. దీప్తి అనసూయమ్మ ఇంట్లో చిన్న చిన్న పనులు చేసేది. నిజం చెప్పద్దూ, అనన్సూయమ్మ మా పాలిట దేవతలా అనిపించింది మాకు. నాకు దగ్గరుండి బ్యాంకు లోన్ ఇప్పించి ఒక ఆటో కొనిపించింది. ఆటో వచ్చాక మాకు డబ్బు కొరత కాస్త తీరింది. రోజుకి నాకు అయిదారొందలు మిగిలేవి. చూస్తూండగా దీప్తికి నెలలు నిండాయి. మా వూరు శ్రీకాకుళం వెనక్కి వెళిపోదామా అనుకున్న క్షణాలు చాలానే ఉన్నాయి. కానీ ఇద్దరకీ అభిమానం అడ్డొచ్చింది. ప్రేమించడం కంటే బ్రతకడం కష్టం అన్నది మాకు అర్థమవ్వడానికి ఎక్కువ కాలం పట్టలేదు. ఒక పక్క రోజు గడవాలి. ఆకలి తీరాలి. మరో పక్క అహం, అభిమానం. మా కాళ్ళమీద మేం బ్రతకాలన్న పౌరుషం మమ్మల్ని ఆపేసింది. దీప్తి పురుడికి అనసూయమ్మే దగ్గరుండి సాయం చేసింది. అప్పటికి నాకు ఇరవయ్యారేళ్ళు. దీప్తికి ఇరవై నాలుగు. మాకు పాప పుట్టింది. మొదటి నెల బాగానే గడిచింది. రెండో నెల వచ్చేసరికి పాపకి జబ్బు చేసింది. డాక్టరు తల్లి పాలు మానిపించి డబ్బా పాలు పట్టమన్నాడు. చూస్తూండగా ఖర్చులు పెరిగిపోయాయి. రాత్రింబవళ్ళు ఆటో నడిపినా చాలేది కాదు. పెళ్ళయ్యాక దీప్తిని సుఖపెట్టిందంటూ లేదు. తనెప్పుడూ ఒక్కసారి కూడా ఇది కావాలని అడిగేది కాదు. తను పెరిగిన వాతావరణాన్ని కూడా ఎప్పుడూ తలుచుకునేది కాదు. కానీ నాకు తెలుసు తనెంత గొప్పగా బ్రతికిందో! దీప్తి నాకోసం ఇంతలా మారిపోవడంతో నాలో నాకు తెలీని అంతర్మధనం మొదలయ్యింది. పైకి చెప్పుకోలేని ఆత్మన్యూనతా భావం బయల్దేరింది.

సరిగా అదే సమయానికి అనసూయమ్మ డబ్బు సులభంగా సంపాదించే కొత్త మార్గం చూపించింది. అనసూయమ్మ మొట్టమొదటి సారి ఆ ప్రతిపాదన చెప్పినప్పుడు ఆమెను నరికేయాలన్నంత కోపమూ, ఆవేశమూ వచ్చాయి. మా వూళ్ళొ చాలా మంది మగాళ్ళ ఇల్లీగల్ రిలేషన్స్ చూసాను. అప్పట్లో ఆడవాళ్ళనే తప్పుబట్టిన సందర్భాలున్నాయి. శృంగారానిక్కూడా హృదయమూ, ప్రేమా ముఖ్యమని నమ్మేవాణ్ణి. ఆ క్షణం మగాడిగా పుట్టినందుకు అసహ్యించుకున్నాను. మొదట్లో జుగుప్సాకరంగా అనిపించేది. “ఆమ్మాయిలు ఇటువంటి పనికి సిగ్గు పడ్డారంటే అర్థం వుంది. నేకేం పొయ్యకాలం వచ్చిందిరా? నువ్వు మగాడివి కావా?” అంటూ అనసూయమ్మ రెచ్చగొట్టేలా మాట్లాడేది. ఏం? సిగ్గూ, లజ్జా, ఏడుపూ మగాళ్ళకుండవా? అని ఆ క్షణం అయితే అడిగాను కానీ, మెల్లగా బ్రతుకు బలహీనత ఆవరించింది. ఒక్కసారి అంత మొత్తం కళ్ళ చూసాక ఒక రకమైన జస్టిఫికేసన్ మొదలయ్యింది. నెలంతా ఆటో తిప్పితే వచ్చే సొమ్ములు ఒక్క గంటలో వచ్చేస్తున్నాయి. అదీ ఏమాత్రం శ్రమ లేకుండా. మొదట రెండు మూడు సార్లు బెరుగ్గా అనిపించినా తరువాత తరువాత అలవాటయిపోయింది.

ఆ అలవాటులో భాగంగా దీప్తికి అబద్ధాలు చెప్పడం అవసరం అయ్యేది. ఏం చేసేది? డబ్బు పాపిష్టిది. ఉండి ఉన్నవాణ్ణీ, లేక లేనివాణ్ణీ హింసిస్తూ ఉంటుంది. ఎన్నో రాత్రుళ్ళు నాలో నేనే ఏడ్చేవాణ్ణి. మగాణ్ణి కదా పైకి ఏడ్చే హక్కు లేదు నాకు. దీప్తి ముందరయితే ఏమయ్యిందని ప్రశ్నిస్తుంది. అందుకే మా పాప దగ్గరే ఏడ్చేవాణ్ణి.

చెప్పద్దూ? బ్రతకడం వేరు. భరించడం వేరు. నాలో నేను చస్తూ నన్ను నేను భరిస్తున్నాను. ఎన్నోసార్లు దీప్తికి నా గురించి చెప్పేద్దామని ప్రయత్నించాను. ఆ పాపిష్టి డబ్బు నన్ను జుట్టు పట్టుకు గుంజేసేది. తలొగ్గేసేవాణ్ణి.

జూబ్లీ హిల్స్లో ఒక ఇండస్ట్రయిలిస్ట్ భార్య నా మొట్ట మొదటి కస్టమరు. మొదట్లో తెలియలేదు కానీ అనసూయమ్మకి చాలా పొలిటికల్ కనక్షన్స్ ఉన్నాయి. నేను ఈ వ్యవహారమంతా చూసి భయపడి చచ్చాను. పైగా చెప్పలేనంత సిగ్గు నన్ను అధః పాతాళానికి తోసేసింది. “ఏంట్రా? నువ్వూ ఓ మగాడివేనా? ఆడదాన్ని చూస్తె పురుగుని చూసినట్లు అలా ముడుచుకుపోతావేంటి?” అని ఓ సారి చెంప దెబ్బ కూడా వేసింది అనసూయమ్మ.
ఈ వ్యవహారమంతా చాలా విచిత్రంగా జరుగుతుంది. చాలాసార్లు మధ్యాన్నం ఇళ్ళలోనే జరుగుతాయి. వాళ్ళు కూడా చచ్చేటన్ని జాగ్రత్తలు తీసుకుంటారు. మొదటి సారి అనసూయమ్మ కూడా వచ్చింది. వెళ్ళేటప్పుడు సెల్ ఫోన్ తీసుకెళ్ళనీయరు. చాలా సీక్రెట్గా నడిపిస్తారు. వాళ్ళ ఇష్టాయిస్టాలకి అనుగుణంగా నడుచుకోవాలి. వీళ్ళల్లో కొంతమందికి తాగడం ఇష్టం. కొంతమందికి సిగరెట్ తాగడం ఇష్టం. ప్రతీ ఒక్కళ్ళకీ ఒక్కో రకమయిన పెర్ఫ్యూమ్స్ ఇష్టం ఉంటాయి. మొదట్లో అవన్నీ వాళ్ళే ఏర్పాటు చేసేవారు. రాన్రానూ నాకు అర్థమయ్యింది. చిత్రం ఏవిటంటే ఈ వ్యవాహరమంతా ఇళ్ళల్లోనే జరుగుతాయి. ఎవరూ బయటకి రారు. ఇదంతా ఒక పకడ్బందీ వ్యవహారం. మూడో కంటికి తెలియకుండా జరిగిపోతాయి. అన్నింటికన్నా నాకు నచ్చిందేవిటంటే పని అవ్వగానే డబ్బు కవర్లో ఇచ్చేస్తారు. మొదట్లో చేసే పని చాలా బాధ కలిగించేది. మొదటిసారి ఇండస్ట్రియలిస్ట్ భార్య నన్ను తాకినప్పుడు శరీరమంతా తేళ్ళూ, జెర్రులూ పాకినట్లనిపించింది. ఒక్క అరగంటలో లక్షల సార్లు చచ్చుంటాను. మనసు ఛీత్కరించుకుంది. బుద్ది డబ్బుతో నచ్చచెప్పింది.

నరమాంసపు రుచి అలవాటయిన పులి జింకల కోసం చూడదు. అలవాటు పడ్డ రుచి దహించేస్తూ ఉంటుంది. పులికి నరమాంసంలా డబ్బు నాకు కొత్త జిహ్వనీ, జీవితాన్నీ చూపించింది.

అనసూయమ్మ రాకెట్ చాలా పెద్దదని మెల్లగా అర్థమయ్యింది. పెద్ద పెద్ద సినిమా తారలూ, సాఫ్ట్ వేరు కంపెనీ మేనేజర్లూ చాలా మందే అనసూయమ్మ కస్టమర్లు. ఎప్పుడూ ఎవరి దగ్గరా ఈ ప్రస్తావన తెచ్చేది కాదు. నా దగ్గర ఎప్పుడూ ఏవీ జరగదన్నట్లే ప్రవర్తించేది. మా ఇద్దరికీ ఒక కోడ్ సైన్ ఉండేది. నా సెల్‌కి కాల్ చేసి బజార్నుండి కోక్ పట్టుకురమ్మనమనేది. అంటే ఆరోజు నాకు డబ్బులొస్తాయి.
ఒక సారి కోక్ అంటే ఏవిటని అడిగితే నవ్వుతూ చెప్పింది – “కోకో కోలా – కోక కావాలా?” అనర్థం చెప్పింది. అది తెలిసాక కోక్ త్రాగాలంటే మనసొప్పేది కాదు. దీప్తికి కోక్ అన్నా, థమ్సప్ అన్నా ఇష్టం. ఎప్పుడయినా బయటకి వెళ్ళినప్పుడు కోక్ అంటే వద్దనే వాణ్ణి.
అనసూయ్యమ్మకి కస్టమర్లు హైద్రాబాదుకే పరిమితం కాదు, డిల్లీ, కలకత్తా, ఇలా పలునగరాల్లో ఉన్నాయి. నా పెర్సనాలిటీ, వయసూ నా రేటుని పెంచేసాయి. డిల్లీ వెళ్ళినప్పుడల్లా వారంలో లక్ష రూపాయిలు దొరికేవి.

డబ్బు వస్తోందన్నది మినహాయిస్తే మానసికంగా నాకు స్థిమితమూ, శాంతీ లేదు. దీప్తిని తాకడానిక్కూడా మనస్కరించేది కాదు. చెప్పానుగా డబ్బు నన్నొక పులిలా తయారుచేసింది. మామూలు పులి కాదు, ధనమాంసపు పులి…”

***

Kadha-Saranga-2-300x268
అతని గురించి దీప్తికి తెలిసిపోయింది. తనని జైల్లో పెట్టారనీ, నానా చిత్రవధలూ పెడుతున్నారని తెలిసి జైలుకి వచ్చింది. అతను జైలు గది లోపలున్నాడు. వెలుపల ఆమె చంకలో పిల్లనెత్తుకొని ఏడుస్తూ ఉంది.
జరిగినదంతా దీప్తికి అతను చెప్పుకొచ్చాడు. “ఎందుకు చేసావ్? ఈ పాపిష్టి పనులు? నేనెప్పుడయినా డబ్బు కావాలని అడిగానా? ” ఏడుస్తూ అతని చెంప వాయించింది.
అతను దోషిలా నిలబడ్డాడు. అతను చేసిన తప్పు పనికన్నా, ఆమె ముందు దోషిగా నిలబడడం అతన్ని కృంగతీసింది. ఏడుస్తూ మౌనంగా ఉండిపోయాడు.

“దీప్తీ! నన్ను నమ్ము! ఒక పక్క నీకు మంచి జీవితాన్ని ఇవ్వలేని నా అసమర్థత. మరో వైపు మన అవసరాలు. డబ్బుకోసమే ఇదంతా చేసాను తప్ప…” అంటూ గోడకి తలకొట్టుకుంటూ ఏడ్చాడతను. దీప్తి వచ్చి వారించి అతన్ని దగ్గరకి తీసుకుంది.
అతను చెప్పింది దీప్తి నమ్మ లేదు. వివరం చెప్పేసరికి అవాక్కయ్యింది. “డబ్బున్న మగాళ్ళకి ఇలాంటివి విన్నాను. ఆడవాళ్ళు కూడా…?” అంటూ ఆశ్చర్యపోతే – “ఏం? ఆకలికీ, సెక్స్ కీ ఆడా, మగా తేడాలుండవు. ఇలా గిరి గీసుకోవడం మన తప్పు. నీకే కాదు, నాకు మొదట్లో నమ్మకం కలగలేదు,” అంటూ అతను జవాబిచ్చాడు.

అంతే దీప్తి ఒక్కసారి తల జైలు తలుపు ఇనుప కమ్మీలకి ఏడుస్తూ కొట్టుకుంది. “దీప్తీ!” అంటూ గట్టిగా అరిచాడతను.
ఒక్కసారి ఉలిక్కి పడి లేచి చుట్టూ చూసాడు. తన పక్కనా, ఎదుటా ఎవరూ లేదు. కల వచ్చిందని గ్రహించాడతను.
దూరంగా పోలీసాఫీరు మాటలు వినిపిస్తున్నాయి.

తల విదిలించి అటుగా చూసాడు. వడి వడిగా పోలీసాఫీసరు తన సెల్ వైపు వస్తున్నట్లు గమనించాడు.

వస్తూనే – “నీ మొబైల్‌కి రాత్రంతా ఒకటే ఫోన్లు. స్విచ్ ఆఫ్ చేసేసాను. ఇందాకనే మా పై ఆఫీసరుతో మాట్లాడాను. నువ్వు సహకరిస్తే ఒదిలి పెట్టేయమని చెప్పారయన. కాబట్టి నువ్వు నీకు తెలుసున్న నంబర్లు చెప్పు,” గట్టిగా అన్నాడు. ఆఫీసరు రాగానే లేచి నుంచున్నాడతను.
“సార్! చెప్పానుగా! అవసరమయితే వాళ్ళే కాల్ చేస్తారు తప్ప నాకెవరి నంబర్లూ తెలీవు. పైగా ప్రతీ సారీ వాళ్ళు ఫోన్లు మార్చేస్తారు,” అన్నాడతను.
“సార్! మీకు ఫోన్ వచ్చినప్పుడు నా గురించి చెప్పిన వాళ్ళ వివరాలు ఎందుకడగలేదు సార్?” పోలీసాఫీసర్ని ప్రశ్నించాడు.
“అడిగాను. చెప్పలేదు. తరువాత ఫోన్ పెట్టేసాక ఈ హొటల్కి కాల్ చేస్తే నీ పేరూ అవీ కరక్టుగా సరిపోయాయి. నాకు ఇలాంటివి ఇక్కడ జరుగుతున్నాయని మా డిపార్ట్మెంటుకి తెలుసు. సరే చూద్దామని హొటల్కి వస్తే నువ్వు దొరికావు…”
“మీకు ఫోన్ చేసిన అమ్మాయికి తిరిగి మీరు ఫోన్ చేసి కనుక్కోలేదా?”
“చేసాను. కానీ ఆ సెల్ నంబరు సర్వీసులో లేదని మెసేజ్ వచ్చింది. అందుకే నీ దగ్గర కూపీ లాగుతున్నాను, ” అన్నాడా పోలీసాఫీసరు.
అతను భయపడ్డాడు. “అయితే మమ్మల్ని అరెస్టు…” అంటూ మధ్యలో ఆపేసాడతను.
“నో! నిన్నేం అరెస్టు చెయ్యను. నీ పేరు బయటకి రాకుండా చూస్తాగానీ, నాకు మాత్రం వివరాలు కావాలి. నిన్న నువ్వు కలిసిన ఆవిడ ఎవరు?” ఆ పోలీసాఫీసరు అతన్ని అడిగాడు.
బీనా పేరు చెప్పాలా వద్దా అని తటపటాయించాడు. అయినా ధైర్యం చేసి ఏం జరిగితే అది జరుగుతుందని చెప్పేసాడు. అది విని అతను ఆశ్చర్యపోయాడు.
“బీనా ఎవరనుకున్నావ్? నేవీ చీఫ్ భార్య. ఇంకా ఎవరు నీ కష్టమర్లు? నువ్వు కాక ఇందులో ఇంకా ఎంత మంది యువకులున్నారు? ” అతను ప్రశ్నల శరంపర తీసాడు.
“నవనీత్ కౌర్ అని చండీఘడ్ లో ఉండే ఆవిడ తెలుసు. చెప్పానుగా, నాకు చాలా మంది పేర్లు మాత్రమే తెలుసు సార్! వాళ్ళు పనయ్యాక సెల్ ఫోన్లు మార్చేస్తారు. బానీ నంబరు ప్రతీసారీ ఒక కొత్తది ఉంటుంది. ఒట్టు సార్! నిజంగా నాకెవరున్నారన్నది తెలీదు. ప్రతీ సారీ అనసూయమ్మ ఎక్కడికెళ్ళాలో చెప్పేది. నేను కలిసిన వాళ్ళు ఒక్క మాట కూడా మాట్లాడరు. అంతా ప్యూర్ బిజినెస్! అంతకు మించి నాకు ఏవీ తెలీదు…” అంటూ అతను అతను భోరున ఏడ్చాడు.
“నీకు తెలుసున్న వివరాలు చెప్పు చాలు…”
“తెలుసున్నవన్నీ చెప్పాను సార్! హైద్రాబాదులో అనసూయమ్మకి అన్ని డిటైల్సూ తెలిసే అవకాశం ఉంది. ఎందుకంటే ఆవిడే నా కాంటాక్ట్స్ కుదురుస్తుంది…సార్! ఆకలి గా ఉంది….” అని దీనంగా చూసాడు.
అది విని కానిస్టేబుల్ చేత పంపిస్తానని అక్కడనుండి వెళిపోయాడు. కొంత సేపయ్యాక ఒక కానిస్టేబుల్ వచ్చాడు. బయట హొటల్లో ఏదైనా తినడానికి తీసుకెళ్ళడానికి. పారిపోవడానికి ప్రయత్నిస్తే చావేనని బెదిరించాడు.
బయటకు వస్తూండగా పోలీసాఫీసరు బయట ఒక కారు దగ్గర ఎవరితోనో మాట్లాడుతూ కనిపించాడు. వీళ్ళని చూసి వెనక్కి రమ్మనమని పిలిచాడు. అతను కారు సమీపించగానే కారులో ఉన్న ఒకామెను చూసాడతను. వేంటనే గుర్తు పట్టాడు. ఆమె అతన్ని గుర్తుపట్టి తల తిప్పుకుంది. ఆమె పేరు గుర్తుకు రావడం లేదు. ఫోన్లు లాగనే వీళ్ళూ పేర్లు మార్చేసుకుంటారు. వేంటనే తల తిప్పి ఆ కానిస్టేబుల్ని అనుసరించాడు.
టిఫిన్ తిన్నాక అతని ప్రాణం లేచొచ్చింది. తిరిగి వస్తూ పోలీస్టేషన్ ప్రవేశిస్తూండగా అక్కడ ఒక రూములో పోలీసాఫీసరు కనిపించాడు.
ఆయనతో మాట్లాడాలి అన్నట్లు కానిస్టేబుల్తో సైగ చేసాడతను. ఆయన రూమువైపు తీసుకెళ్ళి బయటకి వెళిపోయాడా కానిస్టేబుల్.
“సార్! మీకో విషయం చెప్పాలి. ఇందాక మీరు బయట కారులో మాట్లాడుతున్న ఆమె నాకు తెలుసు సా…ర్!” అంటూండగా ఒక్కసారి కుర్చీలోంచి లేచి సాగదీసి లెంపకాయ కొట్టాడా పోలీసాఫీసరు.
అంతే అతని నోట మాట లేదు. కానిస్టేబుల్ని గట్టిగా కేకేసాడా పోలీసాఫీసరు. అతన్ని జైలు గది వైపు లాక్కెళ్ళాడు. కసితీరా అతన్ని చావబాదాడా పోలీసాఫీసరు.

***

అంతవరకూ నానా హింసలు పెట్టినా ఆ పోలీసాఫీసరు అతను చెప్పింది విన్నకా ఏమనుకున్నాడో కారెక్కించుకొని బయటకి తీసుకెళ్ళాడు.
“సార్! మీరు ఈ డొంకతా కదిపి మీకే ముప్పు తెచ్చుకునేలా వున్నారు….” అంటూ చెప్పాడు. ఆ పోలీసాఫీసరు మొహం కందగడ్డలా మారిపోయింది.
“లేదు సార్! నేను నిజమే చెబుతున్నాను. నమ్మండి. నేను అబద్ధం చెప్పడం లేదు!”
తనొక పెద్ద ఉచ్చులో ఇరుక్కున్నానని అతనికి అప్పుడర్థమయ్యింది. పోలీసాఫీసరు సమస్య వేరు.
“ఈ క్షణం నుండి నువ్వెవరో నాకు తెలీదు. నేనెవరో నీకు పరిచయం లేదు. ఒకవేళ నోరు జారితే నువ్వూ, నీ ఫామిలీ…” అంటూ ఒక విషపు నవ్వు నవ్వాడా పోలీసాఫీసరు.
అతన్ని నేరుగా తీసుకెళ్ళి ఇండియా గేట్ వద్ద వదిలేసాడు. ఆ ఆఫీసరు వెళ్ళాక దీప్తికి కాల్ చేసాడతను.
“నాకు భయంగా ఉంది. ఆ పోలీసాఫీసరు నిన్ను పట్టుకొని జైల్లో…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది.
“అతను మన జోలికి రాడు, అతనికి మినిస్ట్రీ నుండి ఫోన్ వచ్చింది. పైగా ఇంకో విషయం…” చెప్తూ ఆపేసాడు.
దీప్తి విషయం ఏమిటని మరలా రెట్టించింది.
“ఈ ఆఫీసరు …ఇహ అతను మన జోలికి రాడు,” అని దీప్తికి ధైర్యం చెప్పాడు.
“నువ్వు వేంటనే బయల్దేరి ఇంటికొచ్చేయ్! మనకున్నది చాలు. బ్రతకడానికి చాలా దార్లున్నాయి. ఈ పాపిష్టి డబ్బు మనకొద్దు. నువ్వీ పనులు చెయ్యనని ప్రామిస్…” అంటూ ఫోనులో గట్టిగా ఏడ్చింది దీప్తి. ఆమె ఫోను పెట్టేసాక మనసు మనసులో లేదు. దీప్తికి తను మోసం చేసినా ఇంకా తననే నమ్ముకుంది.
ఇండియా గేట్ డిల్లీలో అతనికి నచ్చిన ప్రదేశం. ఎన్నో సాయంత్రాలు అక్కడ గడిపాడు. ఇదే తన పికప్ పాయింట్.
అక్కడే ఒక హొటల్లో చాట్ తిని టీ తాగాడు. రాత్రి తొమ్మిది కావస్తోంది.
మనసు పరిపరి విధాల పోతోంది. ఒక పక్క తనంటే తనకి అసహ్యం, గత్యంతరం లేని బ్రతుకు. మరొక పక్క కుటుంబం. కాలే కడుపుకి ఒక రకం ఆకలి. రగిలే డబ్బుకి మరో రకం ఆకలి. పనికి మాలిన జస్టిఫికేషన్! పరిపరి విధాల ఆలోచిస్తూ అక్కడున్న పచ్చిక మైదానంలో నడుస్తున్నాడు.
దూరంగా ఒకమ్మాయి అతన్ని చూసి నవ్వుతూ చెయ్యూపింది. మెల్లగా నడుచుకుంటూ అతని వైపే వచ్చింది.
దగ్గరకొచ్చాక ఆమెను చూసాడు. పెదాలకి ఎర్రటి లిప్స్టిక్‌తో విపరీతమైన మేకప్‌తో ఉంది.
అతనికి ఆమె ఎవరో అర్థమయ్యింది. దగ్గరకి రాగానే పెర్ఫ్యూం వాసన గుప్పున కొట్టింది.
“వాంట్ టూ హావ్ సమ్ డ్రింక్ టుగెదర్?”
వద్దన్నట్లు తలూపుతూ జేబులోంచి ఒక కవరు తీసి ఆమె చేతిలో పెట్టి వెళిపోయాడు. రెండ్రోజుల క్రితం బీనా అతనికిచ్చిందది.
ఆమె ఆ కవరు విప్పి చూసినట్లుంది, అతని వెనకాలే పరిగెత్తుకొచ్చి, చేతిలో కవరు చూపించి ఏవిటన్నట్లు సైగ చేసింది.
తీసుకో అన్నట్లు తలూపి బయల్దేరాడతను.
“హూ ఆర్ యూ? ” ఆమె అతన్ని వెనక్కి లాగి అడిగింది.
మెల్లగా ముందుకి నడుస్తూ చెప్పాడతను.
“జిగొలో!”

–సాయి బ్రహ్మానందం గొర్తి

‘నియోగ’ సంతానం…ఓ మపాసా(?) కథ…

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

చెహోవ్ తర్వాత…బహుశా చెహోవ్ తో సమానంగా… నేను (నాలా ఇంకా చాలామంది) అభిమానించే మహాకథకుడు గయ్ డి మపాసా. చాలా ఏళ్లక్రితం చదివిన ఆయన కథ ఒకటి ఇప్పటికీ గుర్తుండిపోయింది. ఆ కథ పేరు The Legacy అని ఓ బండ జ్ఞాపకం. నా దగ్గర ఉన్న మపాసా కథల పెద్ద సంపుటాలు రెండింటిలో ఆ కథ కోసం వెతికాను. ఆ పేరుతో ఏ కథా కనిపించలేదు. ఇంటర్నెట్ లో గాలించాను. అందులోనూ కనిపించలేదు. నా దగ్గర ఉన్న అన్ని పుస్తకాలనూ శోధిస్తే ఆ కథ ఉన్న సంపుటం దొరుకుంతుందేమో తెలియదు. ఇంతకీ ఆ కథ ఆయన రాసిందా, ఇంకొకళ్లు రాసిందా అన్న అనుమానం కూడా కలుగుతోంది. అయినా, ప్రస్తుత సందర్భానికి సరిపోయేమేరకు అందులోని ఇతివృత్తం గుర్తుంది కనుక ఆ వెతుకులాటను, అనుమానాన్ని కాసేపు పక్కన పెట్టి ఈ వ్యాసం ప్రారంభిస్తున్నాను…

బాగా ఆస్తిపాస్తులు ఉన్న ఒక వృద్ధ వితంతువు. ఆమెకు యుక్తవయసు వచ్చిన ఓ మనవరాలు. ఒక ఆఫీసులో గుమస్తా ఉద్యోగం చేస్తున్న ఓ యువకుడూ, ఆమే ప్రేమించుకున్నారు. ఆమె నాయనమ్మ(అమ్మమ్మ?) దగ్గర పెళ్లి మాట తెచ్చింది. ఏ కొద్దిపాటి ఆస్తీ లేని ఓ గుమస్తాకు మనవరాలిని ఇచ్చి పెళ్లి చేయడానికి ఆమె మొదట్లో ఒప్పుకోలేదు. కానీ తర్వాత తర్వాత మెత్తబడింది. వారి పెళ్ళికి ఒప్పుకుంటూనే ఒక షరతు పెట్టింది. రెండేళ్లలో(ఒక ఏడాదిలోనేనా?) తనకు పండంటి ముని మనవణ్ణి (మునిమనవరాలినా?) ఇస్తేనే నా ఆస్తి నీకు దక్కుతుందని మనవరాలితో చెప్పింది. ఆమేరకు విల్లు కూడా రాయించింది.

పెళ్లయిపోయింది. అప్పటినుంచీ ఆ అబ్బాయిలో(బహుశా అమ్మాయిలో కూడానా?) ఆస్తికి సంబంధించిన టెన్షన్ మొదలైపోయింది. గడువులోపల తాము ఆ వృద్ధురాలి షరతు నెరవేరిస్తేనే ఆస్తి దక్కుతుంది. వాళ్ళిద్దరూ కలసుకున్నప్పుడల్లా ఆస్తి గురించిన టెన్షన్ దే పై చేయి కావడం ప్రారంభించింది. ఇంకేముంది? వారిద్దరి మధ్య శారీరకమైన కలయిక అసాధ్యమైపోతూ వచ్చింది. తమ మధ్య ఆ సంబంధం కలగడానికి వారు చేయని ప్రయత్నం లేదు. హానీమూన్ కు సరే, ఎలాగూ వెడతారు. ఆ తర్వాత కూడా శృంగారోద్దీపనకు సాయపడుతుందనుకునే ప్రతి ప్రదేశానికీ వెళ్లారు. ప్రతి చిట్కానూ ఉపయోగించారు. ఫలితం శూన్యం.

ఈలోపల రోజులు, మాసాలూ గడిచిపోతున్నాయి. టెన్షన్ ఇంకా ఇంకా పెరిగిపోతోంది. అలా ఉండగా ఒక రోజున వారి ఇంటికి ఓ అతిథి వచ్చాడు. ఏం జరిగిందో తెలియదు. ఆమె గర్భవతి అయింది. మగపిల్లవాడిని(లేక ఆడపిల్లనా?) ప్రసవించింది. ఉయ్యాలలో వేసినప్పుడో, నామకరణం చేసినప్పుడో గుర్తులేదు కానీ స్నేహితులను, బంధువులనూ పిలిచి వేడుక జరుపుకున్నారు.

అయితే పసివాడిలో(లేదా పసిదానిలో) తండ్రి పోలికలు మచ్చుకైనా కనిపించడం లేదని వచ్చినవాళ్లు గుస గుసలాడుకున్నారు.

ఆ దంపతులలో మాత్రం కొండంత బరువు దిగిపోయినట్టు పెద్ద రిలీఫ్. మొత్తానికి గడువులోపల తాము వృద్ధురాలి కోరిక తీర్చారు. అంతకంటే ముఖ్యంగా, ఆస్తి దక్కింది!

ప్రేమ గొప్పదే, అంతకన్నా డబ్బు గొప్పదని చెప్పడం కథకుడి ఉద్దేశమైనట్టు తెలిసిపోతూనే ఉంది. కథనం ఎంతో హాస్యాన్ని, ఉత్కంఠనూ పండిస్తూ సాగిపోతుంది. దానిని అలా ఉంచుదాం. ఇందులో మనకు కావలసిన ఒక ముఖ్యమైన వివరం ఉంది: అది, మన పురాణ, ఇతిహాస, ధర్మశాస్త్ర ప్రసిద్ధమైన ‘నియోగం’! ఇక్కడ మనవరాలు, ఆమె భర్తా కలసి సంతానం కన్నది ‘నియోగ పద్ధతి’లోనే. కాకపోతే అది రహస్య నియోగం. అది కూడా ఆస్తి కోసం.

1951

తన కోడళ్ళు అంబిక, అంబాలికలకు నియోగపద్దతిలో సంతానం ఇవ్వమని సత్యవతి తన కొడుకైన వ్యాసుణ్ణి పురమాయించడం మనకు తెలుసు. అలాగే, నియోగ పద్ధతిలో తనను సంతానవంతుణ్ణి చేయమని పాండురాజు తన పెద్ద భార్య అయిన కుంతిని ప్రార్థించాడు. ఇలా నియోగ పద్ధతిలో సంతానం కనమనో, లేదా ఇవ్వమనో కోరిన ఉదాహరణలు మహాభారతంలో ఇంకా ఉన్నాయి.

‘నాకు కొడుకులను ఇవ్వు’ అని కుంతిని పాండురాజు చేతులు జోడించి మరీ ప్రార్థించేముందు వారిద్దరి మధ్యా కొంత సంభాషణ జరుగుతుంది. అందులో కూడా దేవధర్మమూ, పురాచరిత్ర రూపంలోని మనుష్యధర్మమూ కలగలసి కనిపిస్తాయి. అందులోకి వెళ్ళే ముందు అసలు ఏం జరిగిందో ఒకింత ముందునుంచీ చెప్పుకుందాం:

అన్న ధృతరాష్ట్రుడు రాజ్యం చేస్తున్నాడు. తమ్ముడు పాండురాజు దండయాత్రలు చేసి, రాజులను జయించి, గొప్ప గొప్ప ధనరాశులు తెచ్చి అన్నగారికి ఇచ్చాడు. అయితే, తండ్రి విచిత్రవీర్యుడిలానే పాండురాజుకు స్త్రీ లోలత్వం ఎక్కువ. దానికి తోడు వేట వ్యసనం. భార్యలు కుంతి, మాద్రులతో కలసి అతను వనవాసం చేస్తూ వేటతో వినోదిస్తూ ఉండేవాడు. తమ్ముడికి అవసరమైన సంభారాలన్నీ ధృతరాష్ట్రుడు అడవికే పంపిస్తూ ఉండేవాడు.

అలా ఉండగా ఓ రోజున పాండురాజు యథావిధిగా వేటకు వెళ్ళాడు. ఒక్క మృగమూ కనిపించలేదు. దాంతో అతనికి కోపం వచ్చింది. అంతలో ఒక లేడి జంట మన్మథవాంఛతో క్రీడిస్తూ కనిపించింది. పాండురాజు కఠినహృదయంతో వాటి మీద బాణాలు ప్రయోగించాడు. అవి కుప్ప కూలిపోయాయి.

వాటిలో కొనప్రాణంతో ఉన్న మగమృగం పాండురాజుతో మనిషిలా మాట్లాడుతూ,’నేను కిందముడనే మునిని. ఈమె నా భార్య. ఈ కీకారణ్యంలో మేమిద్దరం మృగరూపం ధరించి రతిసౌఖ్యాన్ని అనుభవిస్తుండగా మామీద బాణాలు ప్రయోగించావు. వేట రాజుల కర్తవ్యం కనుక మృగరూపంలో ఉన్న మమ్మల్ని నువ్వు చంపడంలో తప్పులేదు. అయితే చూశావూ… కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా రతిక్రీడలో ఉండి పరుగెత్తలేని స్థితిలో ఉన్నమృగాలనూ, ప్రసవించే మృగాలనూ, రోగంతో బాధపడే మృగాలనూ చంపరు. అలాంటిది, ధర్మం తప్పరని పేరు పొందిన భరతాది రాజుల వంశంలో పుట్టి కూడా ఈ అధర్మాన్ని నువ్వు ఎలా చేశావు?’ అన్నాడు.

ఆ మాటతో పాండురాజుకు కోపం వచ్చింది. ‘శత్రువుల నైనా క్షమించి విడిచిపెడతారు కానీ, మృగాలు కనిపిస్తే రాజులు చంపకుండా వదలరు. నమ్మించి చంపినా, మాయాబలంతో చంపినా తప్పవుతుంది కానీ; ఇలా చంపడం తప్పుకాదు. పూర్వం అగస్త్యముని మృగమాంసంతో నిత్యశ్రాద్ధం చేస్తూ, మృగాలను చంపడం రాజులకు దోషం కాదని నిర్ణయించాడు. ఇందుకు నన్ను ఎలా నిందిస్తావు?’ అన్నాడు.

బాణపు నొప్పితో గిల గిల లాడిపోతున్న ఆ మృగం,సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో నిరపరాధులమైన మమ్మల్ని చంపావు కనుక, నువ్వు కూడా ఇలాగే నీ భార్యతో సంగమించేటప్పుడు మరణిస్తావు. నీ భార్య కూడా నిన్ను అనుసరిస్తుంది’ అని శపించాడు. ఆ తర్వాత ఆ మృగదంపతులు కన్ను మూశారు.

ఇక్కడ రెండు కారణాల చేత కథకుడికి చేతులెత్తి మొక్కుతున్నాను. మొదటిది, రతిసౌఖ్యాన్ని అనుభవిస్తున్న, ప్రసవిస్తున్న, రోగంతో బాధపడుతున్న మృగాలను; కేవలం ఆహారం కోసమే వేటాడే ఎరుకలు కూడా చంపరని అనడం. రాజులకు వేట కర్తవ్యం అంటూనే కథకుడు ఎరుకలను వారికంటే ఉన్నతులుగా చూపిస్తున్నాడు. కేవలం వినోదం కోసం వేటాడే రాజుల తీరును గర్హిస్తున్నాడు. తిరుమల రామచంద్రగారు ‘హంపీ నుంచి హరప్పా దాక’ అనే స్వీయచరిత్రలో వినోదం కోసం జంతువులను చిత్రహింస పెట్టడంలోని అమానుషత్వాన్ని ప్రత్యక్షసాక్ష్యంతో చిత్రిస్తారు.

ఇక రెండవది, అంతకంటే ఆశ్చర్యచకితం చేసేది,‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన రతిసుఖాన్ని అనుభవిస్తున్న సమయంలో…(సర్వప్రాణులకు సాధారణంబయి ఇష్టంబగు సుఖావసరంబున నున్న మమ్ము…) అనే మాట మృగంతో అనిపించడం! విశేషమేమిటంటే, ఇదే మాటను కథకుడు మరి కొన్ని సందర్భాలలో మరికొందరి నోట అనిపిస్తాడు. తనకు కొడుకులను ఇమ్మని కుంతిని అడిగిన సందర్భంలోనే పాండురాజు ధర్మబద్ధమైన ఒక పురాణ కథ చెబుతాను విన మంటూ,‘పూర్వం స్త్రీలు పురుషుని అధీనంలో ఉండకుండా స్వతంత్రంగా సంచరిస్తూ అఖిల ప్రాణి సాధారణంబైన ధర్మంబున తమ తమ వర్ణాలలో ఋతుకాలం తప్పకుండా స్వపురుషులతోనూ, పరపురుషులతోనూ సంబంధం పెట్టుకునే వారని అంటాడు. ఆ తర్వాత దానిని ఎలా నిషేధించారో వివరిస్తూ ఒక కథ చెబుతాడు.

అదేమిటంటే, ఉద్దాలకుడనే ముని ఉండేవాడు. అతని భార్య గొప్ప సాధ్వి. వారికి శ్వేతకేతు డనే కొడుకు. అతను తపస్సంపన్నుడు. అలా ఉండగా, అతని తల్లి ఋతుమతి అయింది. అప్పుడు ఒక వృద్ధవిప్రుడు వారింటికి అతిథిగా వచ్చాడు. కొడుకులు లేని ఆ విప్రుడు కొడుకుకోసం ఉద్దాలకుని భార్య పొందు కోరాడు. దాంతో శ్వేతకేతుకు కోపం వచ్చింది. ఇది ధర్మవిరుద్ధమనీ, ఇకనుంచీ స్త్రీలు పరపురుషులతో సంబంధం పెట్టుకోడానికి వీల్లేదనీ, పెట్టుకుంటే సకలపాపాలూ చుట్టుకుంటాయనీ, మనుషులందరికీ ఈ విధమైన కట్టడి చేస్తున్నాననీ ప్రకటించాడు.

మరో సందర్భం చూద్దాం. తన కొడుకు విచిత్రవీర్యుడు మరణించిన తర్వాత కురువంశానికి నువ్వు ఒక్కడివే మిగిలావు కనుక రాజ్యపాలన చేపట్టి, వివాహం చేసుకుని, సంతానం కనమని భీష్ముడితో సత్యవతి అంటుంది. అందుకు నిరాకరించిన భీష్ముడు,‘దేవరన్యాయం’తో, అంటే నియోగ పద్ధతిలో విచిత్రవీర్యుని భార్యలకు సంతానం కలిగించే మార్గం ఉందని అంటూ దీర్ఘతముడనే ముని గురించి చెబుతాడు.

మమత అనే స్త్రీకి ఉతథ్యుడనే ముని వల్ల కలిగినవాడు దీర్ఘతముడు. అతను తల్లి కడుపులో ఉన్నప్పుడు బృహస్పతి వారి ఇంటికి అతిథిగా వచ్చాడు. అతడు ‘దేవరన్యాయం’తో మమత పొందు కోరాడు. కడుపులో ఉన్న దీర్ఘతముడు కోపించి, ఇది ధర్మవిరుద్ధమంటూ అడ్డుచెప్పాడు. అందుకు ఆగ్రహించిన బృహస్పతి ‘సర్వభూతేప్సితమైన’ ఈ కార్యంలో నాకు అడ్డు చెప్పావు కనుక పుట్టుగుడ్డివి కమ్మని శపించాడు. అందుకే అతనికి దీర్ఘతముడనే పేరు వచ్చింది.

విచిత్రం ఏమిటంటే, తన తల్లిని బృహస్పతి కాంక్షించడం ధర్మవిరుద్ధమని అడ్డుచెప్పిన ఈ దీర్ఘతముడే సంతానం లేని బలి అనే రాజు కోరిన మీదట అతని భార్యకు ‘దేవరన్యాయం’తో సంతానం ఇస్తాడు. సరే, అది వేరే కథ. ‘మామతేయుడు’, అంటే మమత కుమారుడు అనిపించుకున్న దీర్ఘతముడు మాతృస్వామ్య వారసత్వానికి ప్రాతినిధ్యం వహిస్తూ ఉండచ్చని కోశాంబీ అంటారు.

ప్రకృతి సహజమైన లైంగిక సుఖాన్ని ‘సర్వప్రాణులకు సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణంబైన ధర్మం’గా,‘సర్వభూతేప్సితమైన’, అంటే అన్ని ప్రాణులూ ఇష్టపడే కార్యంగా మహాభారత కథకుడు చెప్పడం నాకు ఎంతో అపురూపంగానూ, ఊహల్లో ఒకవిధమైన తాజాదనాన్ని నింపేదిగానూ అనిపిస్తుంది. ఈ చిత్రణ ప్రకృతి అంత సహజంగానూ, సూక్ష్మంగానూ ఉంది. మన పూర్వులు మనిషి సహజాతాలుగా ఆహార, నిద్రా, భయాలతో కలిపి మైథునాన్ని కూడా చెప్పడంలోనూ ఈ ప్రకృతిసహజత్వమే ఉన్నట్టుంది. కాలగతిలో జరిగింది ఏమిటంటే, లైంగిక సుఖాన్ని ఒక అవసరమైన సుఖంగా, సర్వప్రాణిధర్మంగా గుర్తించడం కూడా మరచిపోయే స్థాయికి ఆ మాట నిషిద్ధపదాల జాబితాలో అట్టడుగుకు చేరిపోవడం. సమాజం, కట్టుబాటు, నీతి, న్యాయం లాంటి అనేకానేక పొరల మాటున ‘లైంగిక సుఖం’ గురించిన మౌలిక భావన మటుమాయమైపోయింది. లైంగిక సుఖం అనే మాట చుట్టూ రకరకాల మందమైన పొరలు చుట్టుకుంటూ పోయిన అనుభవంనుంచి చూసినప్పుడు;‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’గా,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’గా,‘సర్వభూతేప్సిత కార్యం’గా చెబుతున్న మన పూర్వులు లైంగిక సుఖాన్ని ప్రకృతికి అతి దగ్గరగా, ప్రకృతిలో భాగంగా; ఎటువంటి ఆచ్ఛాదనలూ లేని ఒక వినిర్మల, స్వచ్ఛ, పవిత్రధర్మంగా చూశారా అనిపిస్తుంది.

లైంగికవాంఛ విషయంలో ఒక కట్టడి, ఒక పరిమితి, ఒక హద్దు తప్పనిసరిగా ఉండవలసిందే. ఇక్కడ విషయం అది కాదు. పెండ్యులం ఒకవైపునుంచి, పూర్తిగా దానికి వ్యతిరేకమైన దిశకు తిరిగిపోవడం. అంటే సమతూకం లోపించడం. లైంగికత్వాన్ని కేవలం ప్రకృతిధర్మంగా అర్థం చేసుకోవడమనే పురాకాలపు ఒక పరాకాష్ట(extreme)నుంచి, లైంగికత్వాన్ని కేవలం ఒక సామాజిక నియతిలో భాగంగా చూసే మరో పరాకాష్టకు పయనించడం. ఆవిధంగా ప్రకృతిధర్మానికి, సామాజికధర్మానికి మధ్య తూకం తప్పిపోయింది. దీని పర్యవసానాలను మనం ఇప్పుడు బహుముఖంగా చూస్తున్నాం.

స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం, లైంగికతల విషయంలో మన పూర్వులు నేటి మన ఊహకు అందని, విచిత్రంగా కూడా అనిపించే సువిశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారని అన్నది అందుకే.

ప్రస్తుతానికి వస్తే,‘సర్వప్రాణి సాధారణమైన, ఇష్టమైన సుఖావసరం’,‘అఖిలప్రాణి సాధారణ ధర్మం’,‘సర్వభూతేప్సిత కార్యం’ అనడంలో కథకుడు లైంగికతకు చెందిన పురాచరిత్రను కూడా చెబుతున్నాడు. కుంతి-పాండురాజు సంభాషణలో అది మరింత స్పష్టంగా కనిపిస్తుంది.

***

చనిపోయిన ఆ మృగదంపతులను చూసి పాండురాజు బాధపడ్డాడు. అతనిలో పశ్చాత్తాపంతోపాటు వైరాగ్యమూ కలిగింది. ఎంత గొప్ప కులంలో పుట్టినా కర్మఫలం అనుభవించక తప్పదనుకున్నాడు. ఇక అన్ని బంధాలనూ విడిచిపెట్టి మునివృత్తిని స్వీకరించి, అన్ని ప్రాణులనూ సమబుద్ధితో చూస్తూ, హింసకు దూరంగా శేషజీవితాన్ని గడపాలనుకున్నాడు. కుంతి, మాద్రులకు తన నిర్ణయాన్ని చెప్పి, వారిని హస్తినాపురానికి వెళ్లిపొమ్మని కోరాడు. మేము చావనైనా చస్తాము కానీ మిమ్మల్ని విడిచి వెళ్ళమని వారు చెప్పారు. అయితే నాతోనే ఉండండని వారికి చెప్పి, తమ దగ్గర ఉన్న అమూల్య మణిహారాలను, ఏనుగులను, గుర్రాలను, గోవులను, ధనధాన్యాలను బ్రాహ్మణులకు దానం చేశాడు. ఇంకా మిగిలినవాటిని ధృతరాష్ట్రునికి పంపేశాడు.

ఆ తర్వాత, తనలానే తపస్వులుగా మారిన భార్యలిద్దరితో కలసి ఉత్తరదిశగా ప్రయాణం ప్రారంభించాడు. హిమాలయాలను కూడా దాటి, దేవతలు, సిద్ధులు నివసించే గంధమాదన పర్వతం మీద కొంత కాలం ఉండి, అక్కడినుంచి మరింత ముందుకు వెళ్ళి శతశృంగం అనే ప్రదేశానికి చేరుకుని తపస్సు ప్రారంభించాడు.

ఆ శతశృంగం కూడా ఎందరో దేవతలు, సిద్ధులు, యక్షులు నివసించే ప్రదేశం. స్వర్గానికి వెళ్ళే మార్గం అక్కడికి దగ్గరలోనే ఉంది. దివ్యవిమానం మీద వచ్చిపోయే దేవగణాలతో ఆ మార్గం కోలాహలంగా ఉంటుంది. అక్కడి ఉత్తరభాగంలో పాండురాజు తపస్సు చేసుకుంటూ ఉండగా ఓ రోజున వేలాదిమంది మునులు ఆ స్వర్గమార్గంలో పై లోకాలకు వెడుతూ కనిపించారు.

‘ఎక్కడికి వెడుతున్నా’రని పాండురాజు వారిని అడిగాడు.

‘ఈ రోజు అమావాస్య. ఎక్కడెక్కడి ఋషిగణాలు, పితృదేవతలు బ్రహ్మను సేవించుకోడానికి ఈ రోజున బ్రహ్మలోకానికి వెడుతుంటారు. మేము కూడా అక్కడికే వెడుతున్నా’మని వారు చెప్పారు.

అప్పుడు భార్యలిద్దరితో కలసి పాండురాజు వారి వెనక బయలుదేరాడు. మిట్టపల్లాలతో నిండిన ఆ మార్గంలో వాళ్ళు అతి కష్టం మీద నడుస్తున్నారు. మునులు వెనుదిరిగి చూశారు. కుంతి, మాద్రుల కష్టాన్ని గమనించారు.

‘వీళ్ళు అతి కోమలులు. కొండలు, గుహలతో నిండిన ఈ క్లిష్టమైన మార్గంలో వీళ్ళు రాలేరు. కనుక ఇక్కడ ఆగిపొండి. పైగా ఇవి దేవతలు వెళ్ళే దారులు’ అని పాండురాజుకు చెప్పారు.

‘మునులైనా సరే, సంతానం లేనివారు స్వర్గద్వారాన్ని చేరుకోలేరని విన్నాను. పుత్రులు లేని వారికి స్వర్గం లభించదని వేదం చెబుతోంది. నేను కొడుకులు లేని వాణ్ణి. ఏం చేయగలను?’ అని పాండురాజు మునులతో నిస్పృహగా అన్నాడు.

మునులకు అతని మీద జాలి కలిగింది. యోగదృష్టితో జరగబోయేది చూశారు. ‘నువ్వు పుత్రులు లేనివాడివి కావు. దైవకారణంతో నీకు యమ, వాయు, ఇంద్ర, అశ్వినీ దేవతల వరం వల్ల కొడుకులు కలుగుతారు. నీకు అక్షయలోకాలు సిద్ధిస్తాయి. కనుక సంతానం కోసం ప్రయత్నించు’ అని ముందుకు సాగిపోయారు.

ఆగిపోయిన పాండురాజు ఆలోచనలో పడ్డాడు. ‘మనిషి పుడుతూనే దేవ, ఋషి, పితృ, మనుష్యరుణాలనే నాలుగు రుణాలతో పుడతాడు. ఆ రుణాలను తీర్చుకుంటే తప్ప పుణ్యలోకాలు లభించవు. నేను మొదటి మూడు రుణాలనుంచీ బయటపడ్డాను. చనిపోతే అన్ని రుణాలూ తీరిపోతాయి కానీ; శ్రాద్ధాలతోనూ, సంతానంతోనూ తీరే పితృరుణం చనిపోయినా తీరదు. అదెలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు. మృగశాపం వల్ల నాకు సంతానం కలిగే అవకాశం లేదు’ అనుకుని దుఃఖించాడు.

ఒక రోజున కుంతితో ఏకాంతంగా మాట్లాడుతూ తన బాధంతా చెప్పి,‘ఇతరమైనవేవీ ఆలోచించకుండా ధర్మబద్ధంగా నాకు సంతానం ఇచ్చే వేరొక మార్గం చూడ’ మని కోరాడు. పన్నెండు రకాల పుత్రుల గురించి చెప్పుకుంటూ వచ్చాడు:

  1. ఔరసుడు: తన వర్ణానికే చెందిన భార్య వల్ల తనకు కలిగిన కొడుకు ఔరసుడు. 2. క్షేత్రజుడు: తనకు సంతానం లేనప్పుడు నియోగ పద్ధతిలో అర్హుడైన వేరొక పురుషుని ద్వారా తన భార్యకు కలిగే కొడుకు క్షేత్రజుడు. 3. దత్తుడు: వేరొకరి కొడుకును శాస్త్రోక్తంగా దత్తత చేసుకుంటే అతడు దత్తుడు. 4. కృత్రిముడు: తల్లిదండ్రులు లేని అనాధను చేరదీస్తే అతడు కృత్రిముడు. 5. గూఢజుడు: తన భార్యకు పరపురుషుని వల్ల రహస్యంగా కలిగిన కొడుకు గూఢజుడు. 6. అపవిద్ధుడు: తల్లిదండ్రులు విడిచి పెట్టేసినప్పుడు దగ్గరకు తీసి పెంచితే అతడు అపవిద్ధుడు. 7. కానీనుడు: పుట్టింట్లో ఉన్నప్పుడు పెళ్లి కాకుండా కొడుకును కంటే అతడు కానీనుడు.8. సహోఢుఢు: గర్భవతి అని తెలిసో తెలియకో ఒకామెను పెళ్లి చేసుకున్నప్పుడు ఆమెకు కలిగే కొడుకు భర్తకు సహోఢుఢు. 9. క్రీతుడు: ఇంకొకరి కొడుకును కొనుక్కుంటే అతడు క్రీతుడు. 10. పౌనర్భవుడు: భార్యా, భర్తలు విడిపోయినప్పుడు; లేదా భర్త మరణించినప్పుడు భార్యకు ఆ తర్వాత మరొకరి సంబంధంవల్ల కొడుకు పుడితే అతడు ఆమె అసలు భర్తకు పౌనర్భవుడు. 11. స్వయందత్తుడు: తల్లిదండ్రులు లేనివాడు, లేదా తల్లిదండ్రులు వదిలేసినవాడు తనంతట తాను ఇంకొకరికి అమ్ముడుపోతే అతడు స్వయందత్తుడు. 12. జ్ఞాతుడు: అన్నకో, తమ్ముడికో పుట్టినవాడు వరసకు తనకు కూడా కొడుకే. అటువంటివాడు జ్ఞాతుడు.

పన్నెండో రకం పుత్రుడి విషయంలో తేడాలున్నట్టున్నాయి. వర్ణసాంకర్యం వల్ల కలిగిన కొడుకును పారశవుడిగా, పన్నెండో పుత్రుడిగా మనుధర్మశాస్త్రం చెబుతోంది. మొదటి ఆరు రకాల పుత్రులూ బంధువులు, దాయాదులూ అవుతారనీ; చివరి ఆరు రకాల పుత్రులూ బంధువులు మాత్రమే అవుతారనీ పాండురాజు అంటాడు. దాయాదులకు ఆస్తిలో వాటా ఉంటుంది. పాండురాజు ఇంకో మాట కూడా అంటాడు…బంధువులు, దాయాదులు అయిన కొడుకులందరూ ఔరసునికి ఏమాత్రం తక్కువ కారు. వాళ్లలో క్షేత్రజుడు మరింత శ్రేష్ఠుడు. అందులోనూ దేవరన్యాయంతో పుట్టినవాడు ఇంకా శ్రేష్ఠుడు. కనుక నా నియోగంతో ధర్మమార్గంలో క్షేత్రజులను కనవలసిందని కుంతిని కోరాడు.

మిగతా వచ్చేవారం…

 

 

 

 

 

కలలూ కన్నీళ్ళూ కలిసే కూడలిలో..!

myspace

నా అమెరికా ప్రయాణాలు – 1

 

ప్రయాణాల అవసరం గురించి బహుశా రాహుల్ సాంకృత్యాయన్ అంత గొప్పగా ఎవరూ చెప్పివుండరు. “యువకుల్లారా, తిరగండి. ప్రపంచాన్ని చూడండి. మీ తల్లుల తిట్లూ, శాపనార్ధాలూ నాకు తగిలితే తగాలనివ్వండి, కానీ మీరు తిరగండి,” అని అన్నాడు. ప్రపంచ భాషల మూలాల్ని అర్ధం చేసుకున్నవాడు, కాసేపు అవతలి వాళ్ళు మాట్లాడింది విని వాళ్ళతో ఆ భాషలో మాట్లాడగలిగిన మేధావి.

ఉద్యోగంలో భాగంగా చాలసార్లు విదేశాలు తిరిగినా ఎప్పుడూ ట్రావెలాగ్ రాయలేదు. రాయాలనిపించలేదు కూడ. తిరగడం, చూడడం, ఆస్వాదించడం మనసుకు సంబంధించినవి అనుకుని కావచ్చు. లేకపోతే, ఎప్పుడో ఒకసారి చూసి ఓ దేశం గురించి, ప్రాంతం గురించి అక్కడి ప్రజల గురించి ఏం రాస్తాంలే అని కావచ్చు. అందుకే, ఏడేళ్లుగా తిరుగుతున్నా ఒక్కసారి కూడా ట్రావెలాగ్ రాయలేదు, ఆఫీసు అవసరాల మేరకు రాసిన ఒకటో రెండో ఫీచర్స్ తప్ప.

ఈ నెలలో ఆఫీసు పని మీద సియాటిల్ వెళ్ళేను. ఇది అమెరికా పశ్చిమ తీరంలో కెనడాకి దిగువున వున్న వాషింగ్టన్ రాష్ట్రంలో (అమెరికా రాజధాని వాషింగ్టన్ కాదు) వుంది. నా పని రెడ్ మండ్ లో. ఇది సియాటిల్ కి ఓ గంట దూరంలో వుంటుంది. బస బెల్ వ్యూ లో. సియాటిల్ కి, రెడ్ మండ్ కి మధ్యలో వుంటుంది. చక్కటి వాతావరణం వుంటుంది. ఎన్నడూ విపరీత వాతావరణం వుండదని టాక్సీ డ్రైవర్ చెప్పేడు. చెట్లమీద ఆకులు ఎంత ఆరోగ్యంగా వున్నాయంటే చిదిమితే నీళ్ళో, నూనో కారుతుందేమో అన్నంత! అయితే వానలు, లేకపోతే ఆహ్లాదకరమైన వాతావరణమని అక్కడి మిత్రుడొకరు అన్నారు.

అమెరికాలోని తూర్పు, పశ్చిమ, దక్షిణ, ఉత్తర, మధ్య ప్రాంతాల్లోని ఓ పది పెద్ద పట్టణాలు, మధ్య రాష్ట్రాల్లోని వ్యవసాయ ప్రాంతాలు చూశాను ఆరేళ్ళలో.

ఆర్ధికంగా, సాంకేతికంగా మనకన్నా కనీసం ఓ వందేళ్ల ముందున్న దేశం కాబట్టి సహజంగానే అన్ని చోట్లా మనకు భారీతనం, రిచ్ నెస్ కనిపిస్తుంది. ఓ పావు కిలోమీటర్ పొడవున్న, పూర్తి ఎయిర్-కండిషన్ చేసిన షాపింగ్ మాల్స్, విశాలమైన నీట్ గా వున్న రోడ్లు, పాదచారులు ఆపరేట్ చేసుకోగల ట్రాఫిక్ సిగ్నల్స్, రోడ్డు దాటే వాళ్ళకోసం తప్పని సరిగా ఆగే వాహనాలు, వినపడని కారు హార్న్స్ – ఒకటేమిటి మనకి కల్చరల్ షాక్ అనదగ్గ ఎన్నో విషయాలు మనకి చాలా కనిపిస్తాయి.

చరిత్ర సృష్టించిన సిటీ లైట్స్ పుస్తకాల షాపు

చరిత్ర సృష్టించిన సిటీ లైట్స్ పుస్తకాల షాపు

టూరిస్టుగా వెళ్ళినవాళ్ళకి, చుట్టపు చూపుగా వెళ్ళేవాళ్ళకి ఎలా కనిపిస్తుందో తెలీదుగాని, అమెరికా అంటే పుట్టు-వ్యతిరేకికి, ఓ జర్నలిస్టుకి ఎలా కనిపిస్తుంది అమెరికా అనే ఓ enigma? ఒకసారికి తెలీక పోవచ్చుగాని, నాలుగుసార్లో, పది సార్లో చూస్తే ఖచ్చితంగా మనకి ఓ pattern కనిపిస్తుంది. ప్రపంచంలోని సమస్త వనరుల్ని – మానవ వనరుల్ని – ఏ మొహమాటమూ లేకుండా వాడుకుంటున్న ఓ బ్రహ్మాండమైన యంత్రంలా కనిపిస్తుంది. డాలర్లు ఖర్చు పెట్టగలవారిని అక్కున చేర్చుకుని, మిగతా వాళ్ళని చెత్తడబ్బాల్లో చేతులు పెట్టి వెతుక్కునే వాళ్ళుగా వదిలేసే ఒక ruthless వ్యవస్థలా అనిపిస్తుంది. జుగుప్సాకరమైన, విచ్చలవిడి సంస్కృతి లాస్ వెగాస్ లాటి నగర వీధుల్లో ఊరేగుతుంది.

తాగే గ్లాసుల దగ్గరనుంచి, వాహనాల నుంచి, రోడ్లనుంచి, పెద్ద పెద్ద భవనాల వరకూ – ప్రతీ దాంట్లో మేమే మేటి అన్న ఒక అమెరికన్ దర్పం, అహం కనిపిస్తుంది. ప్రపంచానికి ఇంధన ఆదా గురించి, పర్యావరణ రక్షణగురించి ఉద్బోధ చేసే అమెరికా చేసే వనరుల దుర్వినియోగం బహుశా మిగతా ప్రపంచం మొత్తం కూడా చెయ్యదేమో. బాత్ రూముల్లో, వాష్ బేసిన్లదగ్గర దగ్గర, భోజనం టేబుళ్ల దగ్గర వాడే పేపర్ వల్ల రోజుకి ఎన్ని వేల ఎకరాల్లో చెట్లు కూలుతున్నాయో తెలీదు. భోజనాలదగ్గర చేసే దూబరాలకైతే లెక్కే లేదు.

నిన్ను ప్రతిక్షణం కనిపెట్టుకునే కన్ను ఒకటి వుంటుంది. నీకది ప్రత్యక్షంగా కనిపించకపోయినా దాని నీడ నీకు ఏళ్ల వేళలా తాకుతూ వుంటుంది. ఏదో ఓ కెమెరా, లేదా కెమెరాలు నిన్ను చూస్తుంటాయి. నువ్వెళ్లిన ప్రతీ చోటూ నువ్వో ఎలక్ట్రానిక్ పాదముద్రని వదిలేస్తుంటావు. లేదా, వదిలే వెళ్ళేలా చేస్తారు. జాక్ లండన్ వర్ణించిన వీధులు కదా అని ఓ సారి శాన్ ఫ్రాన్సిస్కో లోని మార్కెట్ స్ట్రీట్ లో నడుచుకుంటూ వెళ్తూ వుంటే I was stalked. మనకి చాలా భయం వేస్తుంది కూడ. Vulgar richness ఓ వైపు, దుర్భరమైన పేదరికం ఓ వైపు. మనకి స్పష్టంగా కనిపిస్తూనే వుంటుంది వాళ్ళ కళ్లలోని contempt. మైకుల్లాంటి గొంతులతో ఏదో తిడుతూవుంటారు, పాడుతూ వుంటారు. పాత పైంట్ డబ్బాలపై దరువులు వేస్తూ గెంతుతూ అడుక్కుంటూ వుంటారు.

పిల్లలతో పాటు వలసొచ్చిన షూలు (ఎల్లిస్ ఐలాండ్)

పిల్లలతో పాటు వలసొచ్చిన షూలు (ఎల్లిస్ ఐలాండ్)

వెయ్యి ఎకరాలున్న రైతు అక్కడ పేద రైతుకింద లెక్క. ఆరుగాలం కుటుంబం మొత్తం (ఆ ఒక్క కుటుంబమే వెయ్యి ఎకరాల్నీసాగుచేస్తుంది) పనిచేస్తే ఎకరాకి గిట్టుబాటయ్యేది కేవలం వంద డాలర్లు మాత్రమే. ఇక్కడి లాగే అక్కడ కూడా చిన్న రైతుల్ని కబళించడానికి బహుళజాతి కంపెనీల, బడా వ్యవసాయదార్లు కాపు కాచుకు కూచున్నారని ఓ రైతు నాతో అన్నాడు. ఇక్కడి లాగే అక్కడ కూడా కొత్త తరం వాళ్ళు వ్యవసాయం చెయ్యడానికి సిద్ధంగా లేరు. ఇక్కడి లాగే, అక్కడ కూడా, చిన్న రైతులు అంతరించిపోతున్న జాతి

పౌరసత్వం కోసం ఏటా ఈ సాంస్కృతిక ఆందోళనలు...

పౌరసత్వం కోసం ఏటా ఈ సాంస్కృతిక ఆందోళనలు…

.

పైకి చూస్తే అంతా సవ్యంగా వున్నట్టే వుంటుంది. కానీ ఏదో ఉక్కపోత ఊపిరి ఆడనీయదు. లేదా, నీకలా అనిపిస్తుంది. ఎక్కడా, ఒక్క పోలీసు కూడా కనిపించడు. ట్రాఫిక్ ఎక్కువగా వున్న చోట్లలో కూడా ట్రాఫిక్ పోలీసులు కనిపించరు. కానీ, ఏదైనా తప్పు జరిగిన మరుక్షణం ప్రత్యక్షమై పోతారు. చాలా కటువుగా వుండే నియమాల పట్ల భయంవల్లనో, నియమాలు పాటించాలన్న క్రమశిక్షణతోనో, అనాగరికులు అనుకుంటారన్న బెరుకుతోనో రోడ్డు మీద అంతా సాఫీగానే సాగిపోతుంటుంది.

అక్కడ వున్న వాళ్ళకు ఎలా వుంటుందో ఎవరినీ అడగలేదు. బహుశా, మొత్తం ప్రపంచంపైనే నిఘా పెట్టినవాడు కాబట్టి బయటినుంచి వెళ్ళిన వాళ్ళకు అలా అనిపిస్తుంది కావచ్చు.

 (ఇంకా వుంది)

  -కూర్మనాథ్

 

 

ఆమె అంతరంగం, అతని కథనం!

nadustunna katha

 మే నెల కథలు

మే నెలలో కథల సంఖ్య బాగా పెరిగింది.ఈ వ్యాసం రాస్తున్న ముగ్గురం కలిపి సుమారు 200 కథలు చదివాము. ఒక నెలలో ఇన్ని తెలుగు కథలు వస్తున్నాయా అన్న ఆశ్చర్యం, ఆనందం కథల నాణ్యత విషయంలో కలగటం లేదు. కొన్ని పత్రికలలో వార్తలు, వ్యాసాలు కథలుగా చలామణీ కాగలగడం సంపాదకుల అభిరుచిలేమిని సూచిస్తోందా లేక రచయితలలో అవగాహనాలేమిని సూచిస్తోందా అని బాధపడాల్సిన పరిస్థితి. మొత్తం మీద మొదటి వడపోతలో 26 కథలను ఎన్నుకోని, వాటి గురించి మేము ముగ్గురం కలిసి చర్చించాము. ఆ చర్చల పర్యవసానమే ఈ వ్యాసం. (మా దృష్టికి రాని మంచి కథ ఏదైనా వుంటే సూచించండి. ఈ నెల (జూన్) కథల గురించి మేము జరుపబోయే చర్చలో పాల్గొనాలనుకునేవారికి, సాదర ఆహ్వానం. ఫేస్ బుక్ ద్వారా మమ్మల్ని సంప్రదించండి)

మే నెలలో కొన్ని చిత్రాలు జరిగాయి. కొంత మంది పురుష రచయితలు స్త్రీల సమస్యను కథాంశంగా ఎన్నుకోని కథలు రాశారు. కాండ్రేగుల శ్రీనివాసరావు “జీవన మాధుర్యం” అన్న కథలో వక్షోజాల కేన్సర్ గురించి రాస్తే, కె. వి. నరేందర్ “డబ్బుసంచీ” అన్న కథలో గర్భసంచి తొలగింపు గురించి రాశారు. “మరుగు” కథలో కూడా స్త్రీల సమస్యనే ప్రస్తావించారు వాణిశ్రీ. అలాగే డా. వి. ఆర్. రాసాని “తృతీయ వర్గం” గురించి కూడా రాయడం గమనింఛవచ్చు.

గత మాసం (ఏప్రిల్ 2014) ప్రముఖ రచయితలు పాత్రలుగా రెండు కథలు వచ్చిన సంగతి ప్రస్తావించాము. ఈ నెల కూడా అలాంటి కథ ఒకటి వచ్చింది. భగవంతం రాసిన “గోధుమరంగు ఆట” కథలో త్రిపుర ఒక కనిపించని పాత్రధారి.

ఇక ఈ నెల కథల్లోకి వెళ్దాం –

సాక్షి: శిరంశెట్టి కాంతారావు

టెక్నాలజీ పెరిగిపోతున్న కారణంగా, సాంప్రదాయక వృత్తుల వాళ్ళు పనులు కోల్పోవడం గత కొన్నేళ్లుగా జరుగుతూ వస్తోంది. అలా వృత్తిని కోల్పోయి, అప్పులు మాత్రం మిగుల్చుకున్న ఓ కాటికాపరి కథ ఇది. ఇలాంటి కథాంశాలపైన గతంలో ఎన్నో కథలు వచ్చినా ఇంతకు ముందూ ఏ రచయితా ఎన్నుకోని కులవృత్తిని ఎన్నుకోవటం వల్ల ఈ కథ కొంతవరకు ప్రత్యేకంగా మారింది. మంచి కథనం, ఇతివృత్తానికి అనుగుణమైన మాండలికం మరింత బలాన్ని ఇచ్చింది. అయితే అవసరాన్ని మించి నిడివి వున్నట్లనిపించింది.

 

మరుగు: వాణిశ్రీ

బలాత్కారం నుంచి తప్పించుకుందో అమ్మాయి. ఆ విషయం పంచాయితీకి వచ్చినప్పుడు అవతలి పక్షం రాజీ కోరారు. దెబ్బతిన్న ఆత్మగౌరవానికి వ్యక్తిగత స్థాయిలో వెల కట్టడం ఎలా? ఈ కథలో సీతారత్నం పాత్ర అలా వ్యక్తిస్థాయిలో ఆలోచించలేదు. ఇలాంటి అవాంఛనీయ సంఘటనలు ఎందుకు జరుగుతున్నాయో ఆ కారణాల్లోకి వెళ్ళింది. వెళ్ళి, అందరికీ పనికివచ్చే పరిష్కారాల అమలు తనకు చెల్లించాల్సిన మూల్యం అని స్పష్టం చేస్తుంది. వ్యక్తిగత స్థాయిలో జరిగిన అన్యాయానికి సామాజిక స్థాయిలో పరిష్కారాన్ని కోరడమనే కొత్త పరిహారాన్ని చూపించిన కారణంగా, ఇది నలుగురూ చదవాల్సిన కథ అయ్యింది. మంచి ఎత్తుగడ, ముగింపు, సామాజిక స్పృహ, ఇతివృత్తంలో సమకాలీనత, క్లుప్తత. చదివించే కథనం. అందరూ చదవదగ్గ కథ.

 

జీవన మాధుర్యం: కాండ్రేగుల శ్రీనివాసరావు

బ్రెస్ట్ కాన్సర్ కారణంగా ఒక వక్షోజాన్ని తొలగించడంతో వకుళలో అంతర్మథనం మొదలౌతుంది. ఈ అసమగ్ర రూపంలో భర్త తనను ఎలా చూస్తాడు అన్నది ఆమెని వేధించే ప్రశ్న. అయితే, భార్య పోగొట్టుకున్న భౌతికమైన విషయాన్ని లెక్కచేయనంత విశాలహృదయం భర్తకి ఉంది కాబట్టి కథ సుఖాంతంగా ముగుస్తుంది. దానిలో సంభావ్యతే ప్రశ్నార్ధకం. కథలో చూపించినది ఆదర్శవంతమైన పరిష్కారమే అయినా, అలా కాకపోతే ఎమౌతుందీ అన్న కోణం ఎవరికి వారు ఆలోచించుకోవచ్చు. ఒక వినూత్నమైన అంశాన్ని, ఇంకో సున్నితమైన అసంతృప్తి కోణంతో ముడిపెట్టి రాసిన మంచి కథ. వాస్తవికతని కొంచెం హద్దులు దాటించి శృంగారపరమైన అంశాలు స్పృశించడంతో వస్తువులో ఉన్న గాంభీర్యం కొంత చెదిరిపోవడం ఈ కథలో మనం గమనించవచ్చు.

 

సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్: సాయి బ్రహ్మానందం గొర్తి

భాషకీ మతానికీ సంబంధం లేదని ఒక వైపు చెపుతూనే – మతం శాశ్వత అనుబంధాల ఏర్పాటుకు ఎలా ఆటంకమవుతుందో చెప్పటానికి ప్రయత్నించిన కథ. ఇస్మాయిల్ అనే ముస్లిం కుర్రవాడు తెలుగుకంటే సంస్కృతమే నయమని విశ్వం మాస్టారి దగ్గర చేరి సంస్కృతం భాషాజ్ఞానమే కాకుండా ఆయన ప్రేమాభిమానాలనీ సంపాదించి చివరకు సంస్కృతంలో ఉన్నత విద్యాభ్యాసం చేస్తాడు. విశ్వం మాస్టారికి ఇస్మాయిల్ అంటే ఎంత అభిమానం అంటే, చివరికి తన మనవడికి ‘ఇస్మాయిల్’ అనే పేరు పెడతారు. అయితే ఈ మనవడు, ఇస్మాయిల్ కూతుర్ని ప్రేమించడంతో మాస్టారు ‘నానా యాగీ’ చేసి శిష్యుణ్ణి దూరం పెడతారు. ఇరుమతాల మధ్యన ప్రేమ, అభిమానాలు ఉండగలిగిన అవకాశాలు ఉన్నా, మతం అనే సరిహద్దు దగ్గర అవన్నీ కనుమరుగైపోతాయన్న కుదుపు లాంటి వాస్తవికతని కథ పాఠకుడికి స్ఫురింపజేస్తుంది. ఈ వాస్తవికతని పట్టుకురావడమే కథలోని మంచి విషయం అనుకుంటూ ఉండగా, కథ ఒక ‘కొసమెరుపు’ లాంటి ఒక అందమైన విషయంతో ముగుస్తుంది. వాస్తవికత వేరు, ప్రేమాభిమానాలు వేరు అని పాఠకుణ్ణి రెండోసారి కుదుపుతుంది. మంచి కథాంశం, వాస్తవిక కథనం. మొదలు ముగింపులలో రచయిత చాకచక్యం గమనించతగ్గవి..

 

డబ్బు సంచీ: కె వి నరేందర్        

కడుపునొప్పికి పరిష్కారంగా గర్భసంచీని తొలగించాలని డాక్టర్లు మాధవికి చెప్పారు. మిత్రురాలి సలహా మీద ఓ ఆయుర్వేద వైద్యుణ్ణి సంప్రదిస్తే, ముందు కొంత వైద్యం చేసి చూద్దాం అంటాడాయన. ఇలా వైద్యం చేద్దామన్న ధోరణి లేకపోగా, సమస్య ఉన్న ప్రతివాళ్ళకీ గర్భసంచీలు తొలగించడం వెనకాల కుట్ర ఏదైనా ఉందా? ఆరోగ్యశ్రీ పథకాలు ఇలా అమలవుతున్నాయా? మరికొంత సమాచారం తెలుసుకున్న మాధవి, దీన్ని రిపోర్ట్ చేసి దర్యాప్తు చేయించాలనుకుంటుంది. శరీరంలోని సమస్యలని వ్యవస్థలోని లొసుగులతో ముడిపెట్టి, సామాజికమైన పరిష్కారం వైపుగా మాధవి ఆలోచించడం బావుంది. కానీ, కథలో కొంత భాగం వ్యాస రూపం సంతరించుకుంది. ఒక వార్త ఆధారం చేసుకుని కొన్ని గణాంకాలను దృష్టిలో పెట్టుకుని రాయడం వల్ల ఈ కథ కొన్ని కథా లక్షణాలను కోల్పోనట్లైంది. ఆ గణాంకాలలో కూడా శస్త్రచికిత్సల సంఖ్యే చెప్పారు తప్ప అవసరం లేకుండా చేసినవెన్ని అనే ముఖ్యమైన విషయంపై దృష్టి పెట్టకపోవడం మరో లోపం.వస్తువు పరంగా ఆలోచింపజేసే కథ అయినా, రూపం విషయంలో మరింత శ్రద్ధ వహించి ఉంటే, కథ స్థాయి చాలా పెరిగి ఉండేది.

 

దో దివానే దో షెహర్ మే: పూర్ణిమ తమ్మిరెడ్డి

మధ్యతరగతి భారతీయుడి సొంతింటి కల! ఆ కల సాధారణ స్థాయిలో ఉన్నా, ఉన్నదానికీ కొనవలసినదానికీ ఉండే గాప్ ఉండనే ఉంటుంది. ఆ కల స్థాయి పెరిగే కొద్దీ ఈ గాప్ పెరుగుతూ ఉంటుంది. అలాంటి ఓ పెద్ద కల కన్న నేటి తరం భార్యాభర్తలు, పెళ్లి అయ్యీ అవగానే, లోన్ వాయిదాలు కట్టడానికి మరింత సంపాదన కావాలి కాబట్టి అలా సంపాదించడం కోసం చెరో దేశంలో ఉంటారు. ప్రేమించి పెళ్ళిచేసుకున్న ఆ జంట మధ్య దూరం తెచ్చిన వ్యధ, కన్నీళ్ళు మిగతా కథ. కథనం చాలా గొప్పగా ఉన్నా, భార్యాభర్తలు స్కైప్ ద్వారా మాట్లాడుకుంటున్నట్లు సృష్టించడం వల్ల, కథంతా ఆ మూసలో ఒదిగే క్రమంలో క్లుప్తత లోపించినట్లుగా అనిపిస్తుంది. కథాంశంలో ఉన్న సంక్లిష్టత స్థాయికి తగ్గట్టుగా కథ నిడివి కూడా వుండి వుండుంటే బాగుండేది.

 

అమ్మ కడుపు చల్లగా: విజయ కర్రా

ఈ కథ గురించి మాట్లేడే ముందు, ఈ కథ వెనుక కథని కూడా తెలుసుకోవడం అవసరం. ఒక రచయిత ఇచ్చిన ఆలోచన ఆధారంగా మరో రచయిత సృష్టించిన కథ ఇది. ప్రక్రియపరంగా కొత్తగానూ, క్లిష్టంగానూ వున్నా విజయ కర్రా ఈ కథని సమర్థవంతంగా చెప్పడమే కాకుండా, మరో రచయిత ఇచ్చిన సమస్యకి ఆశావహమైన, సార్వజనీయమైన పరిష్కారాన్ని ఇవ్వగలిగారు. ఈ ప్రక్రియ ఫేస్ బుక్ లోని “కథ” గ్రూప్ లో జరిగింది.

 

ఓ చిన్న సమస్య మనసులో దూరి, మనసుని తొలుస్తూ మెలిపెడుతూ – మానవత్వపు ప్రాథమిక విలువలని గురించి ప్రశ్నిస్తూ వేధిస్తుంటే? ఓ తాతకి రెండు రూపాయలు దానం చేయలేని రాజుకి పట్టుకున్న సమస్య ఇది. సమస్య పెరిగి పెద్దదైపోయి పెనుభూతమైపోయి, జ్వరం తెచ్చుకొని కలవరించేదాకా వస్తుంది పరిస్థితి. ఈ సమస్య గురించి భార్య తెలుసుకొని, దానికి పరిష్కారం చూపించడం కథాంశం. ఇవ్వకపోవడానికి లక్ష కారణాలుండవచ్చు గానీ, ఇవ్వదలచుకుంటే ఇవ్వాలనే ఒక్క కారణం చాలు అన్న అంశాన్ని చాలా సున్నితంగా చెప్పిన కథ ఇది. కథకి మూల కారణం వృద్ధుడు – కానీ రచయిత్రి అతడి గతం గురించి ఒక్క పేరా మాత్రమే రాస్తుంది. కారణం కథకి వృద్ధుడి వర్తమానం ముఖ్యం. గతం కాదు. అది రచయిత్రి గ్రహించటం, అంతవరకే రాసి వదిలేయటం ఆ పాత్ర చిత్రీకరణంలో ఆమె చూపించిన జాగ్రత్తకి నిదర్శనం. అదే జాగ్రత్త – చంద్రంలో జాలిగుణం, అతడిలో సంఘర్షణ, దాని పట్ల భార్య సహానుభూతి – ఒక పద్ధతి ప్రకారం మోతాదు మించకుండా చిత్రించటంలో కనపడుతుంది. ‘అత్తత్తత్తా అని పగలంతా (చిన్నపిల్లవాడి) ఒకటే పాట, రాత్రేమో తాత.. తాత.. అని నీ కలవరింతలు’ లాంటి సందర్భోచితమైన వాక్యాల కథనం కథకి సరీగ్గా జతపడింది. కథలో చూపించిన పరిష్కారం, జీవితాల్లో చాలా విషయాలకి అన్వయించుకోదగ్గది కావడం వల్ల మంచి కథలని గుర్తుపెట్టుకొనే వాళ్ళ మనసుల్లో కొన్నాళ్ళపాటు ఈ కథ నిలిచి ఉంటుంది.

 

ఇరుకు పదును: బి పి కరుణాకర్

మరణించిన స్నేహితుడి భార్య అంటే రచయితకి ఒక సాఫ్ట్ కార్నర్. కానీ ఆమెకి తన భర్త మీద సదభిప్రాయం ఉండదు. భర్త ప్రవర్తన మీద రకరకాల అనుమానాలతో, కొన్ని ఆధారాలు తెచ్చి భర్త వ్యక్తిత్వం గురించి రచయిత దగ్గర కూపీలు లాగటానికి ప్రయత్నిస్తుంది. తమ స్నేహం కారణంగానో, లేక స్నేహితుడితో సంబంధం వున్న మరో మనిషి పక్కనే వుండటం వల్లో రచయిత ఆ విషయాలు చెప్పడు. కానీ కథ జరుగుతూ ఉండగా స్నేహితుడి భార్య పట్ల రచయిత అభిప్రాయం మారటం చూచాయగా పాఠకుడికి తెలుస్తుంది. ఇన్ని రకాల మానసిక కోణాలకి కథనం తావు ఇచ్చినా ఒక్క కోణం కూడా రచయిత నేరుగా పాఠకుడికి చెప్పకపోవటం కథలో ప్రత్యేకత.

 

చిన్న కథలో రచయిత ప్రతిభావంతంగా చొప్పించిన ప్రశ్నలను గమనించిండి.

 

అత్యంత విషాదకరమైన సన్నివేశంలో ఓ వ్యక్తిని చూసి, మనస్సులో ఎక్కడో ఏర్పరచుకున్న సానుభూతి – ఆ తరువాత ఎప్పుడో ఆ మనిషితో సంభాషించే క్రమంలో ఆవిరైపోతూ ఉండటం ఎలా ఉంటుంది? చనిపోయిన మనిషి గురించి సాక్షాత్తూ ఆ వ్యక్తి భార్యే నిందిస్తూ మాట్లాడుతూ ఉంటే దాన్ని స్వీకరించడం ఎలా ఉంటుంది? చనిపోయిన వ్యక్తితో సంబంధం ఉన్న మరో మహిళ ఇవన్నీ అక్కడే కూచుని వినడం ఎలా ఉంటుంది? అసలు ఇన్ని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆ చనిపోయిన వ్యక్తి నిజంగా చేసిన తప్పులేవిటి? ఇప్పుడు అన్నీ అయిపోయాక, ఏది తప్పు, ఏది ఒప్పు? మనుషుల్ని మనం చూసే దృష్టికోణాలు రియల్ టైమ్ లో డైనమిక్ గా మారిపోవడం ఎలా ఉంటుంది? ఇలాంటి ప్రశ్నలకీ; ముగింపు వ్యూహాత్మకంగా, పాఠకుడికి ఊహాత్మకంగా వదిలివేసినందువల్ల ఉత్పన్నమయ్యే మరిన్ని ప్రశ్నలకి ఈ కథలో పాఠకుడే జవాబులు వెతుక్కోవాలి. అది రచయిత, పాఠకుడి తెలివితేటల మీద ఉంచిన నమ్మకం!

 

ఇవి కాక వస్తుపరంగానో, శైలి పరంగానో ప్రస్తావించదగ్గవిగా మేము భావించిన కథలు కొన్ని –

 

24.05.14 త్రిపుర వర్ధంతి సందర్భంగా భగవంతం రాసిన కథ “గోధుమరంగు ఆట”. రచయిత పేరు త్రిపుర పాత్రల్లో ఒకటి కావటం – రచయిత పై త్రిపుర ప్రభావం ఎంతగా ఉందో చెప్పకనే చెపుతుంది. అది అబద్ధం కాదన్నట్లు ఈ కథ పోకడ రుజువు చేస్తుంది. గొప్ప కథనం. అందుకనే కథలో ఇతివృత్తం ఏంటో (అసలు ఉందా?) కథనం తెలియనివ్వదు. ఇది కథకి బలమా?కాదా? అన్న మీమాంస వదిలేస్తే మంచి అనుభూతిని కలగచేసిన ప్రయత్నం. త్రిపుర కథల స్ఫూర్తితో, ‘భగవంతం కోసం‘ కథ ధోరణిలో రాయబడ్డ కథ. త్రిపుర స్మృతికి అంకితం చేయబడ్డ కథ. “ఆకాశంలో నక్షత్రపు జల్లు. భగవంతం రాడు. అట్నుంచి ఏడో నంబర్లోనూ రాడు, ఇట్నుంచి పదమూడో నంబర్లోనూ రాడు. నా పిచ్చి గాని.” అన్న నిరాశతో ముగిసిన ఆనాటి కథ, ఇవాళ రూపాంతరం చెంది “.. కానీ బయట ఆకాశం కింద ఒక అనంతమైన కాల్పనిక వేడుక నాకోసం ఎదురుచూస్తూ ఉంటే – మాటల్తో కాలాన్నెందుకు వృధా చేయడం అనుకుని – హోటల్లోంచి బయటకొచ్చేశాను” అనే నవీన స్ఫూర్తితో ముగియడం ఒక విశేషం!

 

ఈ నెలలోనే వచ్చిన మరో రెండు కథలను కథాప్రేమికులు పరిశీలించాలి. ఈ రెండు కథలు ప్రతీకాత్మకంగా రాసినవి కావటం మాత్రమే ఈ రెండింటి మధ్య వున్న సామీప్యం. వివిన మూర్తి రాసిన “జ్ఞానం కనిపించటం లేదు” కథ సామాజిక పరిస్థితుల మీద చేసిన వ్యాఖ్య అయితే, పూర్ణిమ తమ్మిరెడ్డి రాసిన “ఏనాడు విడిపోని ముడివేసెనే” కథ భార్యాభర్తల మధ్య పల్చబడే అనుబంధం గురించి వివరిస్తుంది.

 

ప్రతీకలతో కథ నడపడం కత్తి మీద సాములాంటిదని ఈ రెండు కథలు చెప్పకనే చెబుతున్నాయి. కత్తి మీద సాము ఎందుకంటే – జటిలంగా ఉన్న ప్రతీకలు సంక్లిష్టమైన పజిల్ లా తయారై, కథ పాఠకుడికి దూరం అవుతుంది. సులభంగా ఊహించగల ప్రతీకలు కథ మీద పాఠకుడికి ఉన్న ఉత్సాహాన్ని నీరుకారుస్తాయి. ప్రతి అంశానికీ ఒక ప్రతీక చొప్పున వాడుకుంటూ పోవడం వల్ల మొత్తం ప్రక్రియ పలుచబారే ప్రమాదం ఉంది. ప్రతీకలతో వున్న మరో సమస్య ఆ ప్రతీకలకు లేని అర్థాన్ని ఆపాదించే ప్రయత్నం. చిత్రకళ నుంచి సాహిత్యంలోకి వచ్చిన ఈ ప్రక్రియలో కొన్ని కొన్ని విషయాలకు ప్రతీకలు దాదాపు నిర్థారితంగా వున్నాయి. వాటిని వేరే అర్థంలో వాడటం వల్ల తెలివిడి కలిగిన పాఠకులకు కూడా కథ కొరుకుడు పడకపోయే సమస్య వుంటుంది. శిల్పంలో విభిన్నమైన ప్రక్రియగా వీటిని వాడటం ముదావహమే గానీ, కథలని ఇంత అస్పష్టంగా చెప్పడం వల్ల ప్రయోజనం ఏముంటుందన్నది పెద్ద ప్రశ్న. (ఏది ఏమైనా ఈ కథలను పాఠకులు చదివి, వారికి స్ఫురించినంత మేర సారాన్ని గ్రహించే అవకాశం వుంది కాబట్టి ఈ కథలు చదివి/చదివిన వారు తమ అభిప్రాయాలను వ్యాఖ్యల రూపంలో చెప్పాలని మనవి)

 

ఈ నెల ఉత్తమ కథ

ఇద్దరి మనుషుల సంభాషణల్లో – వ్యక్తం అయ్యే అంశాలు, అవ్యక్తంగా ఉంచబడ్డ విషయాల మధ్య ఓ సున్నితమైన గాప్ వస్తుంది. ఈ గాప్ ఆ సన్నివేశంలో ఉన్న వ్యక్తులకి అవగాహనలోకి వస్తే, ఆ సంభాషణల్లో ఓ ఇబ్బంది వచ్చిచేరుతుంది. ఇదీ ఈ కథలోని ప్రాథమిక చిత్రం. ఆ సన్నివేశంలో ఇంకో వ్యక్తి కూడా ఉంటేనూ, మరో వ్యక్తి కనబడకుండా ఉంటేనూ ఆ ఇబ్బంది స్థాయి ఇబ్బడిముబ్బడిగా పెరిగిపోతుంది. ముఖ్యంగా – ఆ నలుగురు వ్యక్తుల మధ్యనా కొన్ని సంబంధాలో బాంధవ్యాలో మరోటో ఉన్నప్పుడు. ఇదొక సంక్లిష్టమైన చిత్రం. కథగా చెప్పడం కష్టం, చెప్పి ఒప్పించడం ఇంకా కష్టం. అలాంటి బాధ్యతని ప్రతిభావంతంగా నెరవేర్చారు బి పి కరుణాకర్ గారు ‘ఇరుకు పదును’ కథలో. ఎంతవరకూ చెప్పాలో దానికి కొంచెం తక్కువగానే చెప్పి, ఈ కథలో కరుణాకర్ గారు అటు క్లుప్తతనీ ఇటు అనుభూతి ఐక్యతనీ ఏకకాలంలో సాధించగలిగారు. అందువల్లా, పైన చెప్పిన ఇతర కారణాల వల్లా ఈ నెల వచ్చిన కథలలో “ఇరుకు పదును” ఉత్తమకథగా మేము భావించడం జరిగింది.

 

కథా రచయిత బి.పి. కరుణాకర్ గారికి అభినందనలు!! కరుణాకర్ గారితో “ఇరుకు పదును” గురించి సంభాషణ వచ్చేవారం.

 

ఈ వ్యాసంలో ప్రస్తావించిన కథలు:

సం. కథ రచయిత (త్రి) పత్రిక లింక్
1 అమ్మ కడుపు చల్లగా విజయ కర్రా ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 4 http://goo.gl/3oY7up
2 ఇరుకు పదును బి. పి. కరుణాకర్ ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 18 http://goo.gl/xxUKc5
3 ఏ నాడు విడిపోని ముడి వేసెనే పూర్ణిమ తమ్మిరెడ్డి ఈమాట – మే/జూన్ http://goo.gl/CPe5p6
4 గోధుమరంగు ఆట భగవంతం ఆదివారం ఆంధ్రజ్యోతి, మే 25 http://goo.gl/Adb8oF
5 జీవన మాధుర్యం కాండ్రేగుల శ్రీనివాసరావు నవ్య, మే 14 http://goo.gl/ixJHPR
6 జ్ఞానం కనిపించటంలేదు వివినమూర్తి అరుణతార, మే
7 డబ్బు సంచి కె. వి. నరేందర్ నమస్తే తెలంగాణ, మే 4 http://goo.gl/nsCq6P
8 తృతీయ వర్గం డా. ఆర్. వి. రాసాని నవ్య, మే 21 http://goo.gl/ZZ2TfQ
9 దో దీవానే దో షహర్ మే పూర్ణిమ తమ్మిరెడ్డి కినిగే పత్రిక, మే http://goo.gl/XZ1EpG
10 మరుగు వాణిశ్రీ నవ్య, మే 7 http://goo.gl/LJHBxF
11 సంస్కృతం మాష్టారు ఇస్మాయిల్ సాయిబ్రహ్మానందం గొర్తి ఈమాట, మే/జూన్ http://goo.gl/E5AuQy
12 సాక్షి శిరంశెట్టి కాంతారావు కౌముది, మే http://goo.gl/xiLhrE

– అరిపిరాల సత్యప్రసాద్, ఎ.వి. రమణమూర్తి, టి. చంద్రశేఖర రెడ్డి

aripirala02. T Chandra Sekhara Reddy01. Ramana Murthy

” ఫ్రిజ్ లో ప్రేమ” అనువాద నాటకం – మూడవ భాగం

friz

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

దృశ్యం-3

             (ప్రసన్న బద్దకంగా అటు ఇటు పొర్లుతుంటాడు. ఈల వేస్తాడు. ప్రక్కన ఓ పెద్ద గంగాళం. అందులోంచి ప్రేమ తింటుంటాడు. అతనికి ఏదో మంచి విషయం తడ్తుంది. లేచి కూర్చుని కాగితం వెదికి రాయడం మొదలుపెడతాడు. జేబులో నుండి తాళంచెవి తీసి కళ్ళముందు ఆడిస్తాడు.

 సంతోషపడి మళ్ళీ జేబులో పెట్టేసుకుంటాడు.)

(ఇంతలో బయటనుండి అతి ప్రసన్న ఇంట్లోకొచ్చి పడతాడు. పాకుతూ ప్రసన్న దగ్గరికి వస్తాడు. రక్తసిక్తమయిన బట్టలు, ఒళ్ళంతా గీరుకుపోయి ఉంటుంది.)

ప్రసన్న: అతి ప్రసన్నా… నువ్వా?

అతిప్రసన్న: అవును ప్రసన్నా.. నేను. నేనే. ఉత్తరం చేరగానే పరుగున వచ్చేసాను. ఎలా ఉన్నావు మిత్రమా?

ప్రసన్న: నేను… నేను బాలేను... అతి ప్రసన్నా…

(అతడి దగ్గరికెళ్ళి ఏడుస్తుంటాడు)

అతిప్రసన్న: ఇన్నేళ్ళుగా ఎక్కడున్నావ్? నీ గురించి మాకెవరికీ ఏమీ తెలియలేదు. అసలేం చేసావ్ ప్రసన్నా?

ప్రసన్న: అతి ప్రసన్న… నీకెన్ని దెబ్బలు తగిలాయి… ఎంత రక్తం పోయిందో! నిన్నా కుక్క కరిచిందా ఏమిటీ? ఇలా రా… నా దగ్గర కూర్చో రా..

(ప్రసన్న అతి ప్రసన్నని నేలమీద కూర్చోబెడతాడు. తను రాసుకునే కాగితాలని ఉండగా చుట్టి మెల్లగా రక్తాన్ని తుడుస్తాడు.

అతిప్రసన్న: మీ ఇంటి నాలుగు ప్రక్కల్లో ఈ వీధి కుక్కలే వందలకొద్దీ. నీకు కుక్కలంటే భయం కదా రాజా, చిన్నప్పట్నుండీ? మరెలా.. ఇక్కడెలా బ్రతుకుతావురా ? ఈ ఇంటి నుండి బయట ఎలా పడతావ్ ?

ప్రసన్న: (ఆగకుండా కన్నీరుమున్నీరుగా ఏడుస్తుంటాడు) గడిచిన ఎన్నో ఏళ్ళుగా నేనీ ఇంటి బయట అడుగుపెట్టింది లేదు. ఇక్కడికి ఎవరూ రారు. ఈ కుక్కలు రాత్రంతా ఒకదాంతో ఒకటి కొట్లాడుతుంటాయి. కరుచుకుంటాయి. నాకు నిద్రరాదు. ఎన్నేళ్ళగానో ఇంట్లో వాళ్ళెవరినీ నేను కలవలేదు. స్నేహితుల మొహం చూసి ఎరుగను.

అతిప్రసన్న: అయితే ప్రసన్నా, ఫోనయినా ఎందుకు చేయలేదు? నేనొచ్చేవాడిని కాదా నిన్ను తీసికెళ్ళడానికి ?

ప్రసన్న: నేనంతా సరిగ్గా చెప్పగలనా? నాకు విశ్వాసం కలగడం లేదు. కాస్త కాస్తగా చెపుతాను. ఈ మధ్య నాకు కేవలం రాయడం మాత్రమే తెలుసు. ఇరవైనాలుగు గంటలూ కాగితాల గుట్టముందు కూర్చుని రాస్తూ కూర్చుంటాను.

అతిప్రసన్న: (ఒక్కో ప్రతిని కళ్ళ దగ్గరగా తీసుకొని చూస్తాడు) రాగిరంగు… కుంకుమ పువ్వు రంగు.. పసుపు… వంకాయరంగు .. అన్ని రంగులూ రాస్తావు కదా నువ్వు? ఇదేంటో వేరుగా ఉంది. నీకు గుర్తుందా, కాలేజ్ లో ఉండగా రాత్రి రాత్రంతా జాగారం చేస్తూ ఏమేం రాసేవాడివో! అంతా ఆకాశంలా నీలమయం. ఓసారి ఏదో రాస్తూ కూర్చున్నావ్. మధ్యరాత్రి కాగితాలు అయిపోయాయి. నువ్వయితే టేబిల్, నేల, గోడలు, బట్టలు, అద్దం లాంటి వాటిమీద రాస్తూపోయావ్. నేను మరోరోజు నీ రూముకొచ్చి చూద్దును గదా, అంతా నీలమే.

ప్రసన్న: మనుషుల ప్రవృత్తి మారుతుంది. దానంతటదే..

అతిప్రసన్న: ఇంత పెద్ద మార్పా?

(ప్రసన్న తలవంచుకొని తల ఊపుతాడు.)

అతిప్రసన్న: బయటికి పద. బయట బాగుంటుంది. గత అయిదారేళ్ళలో లోకం చాలా మారిపోయింది.

ప్రసన్న: అంటే, ఏమయింది? చెప్పు సరిగ్గా.

అతిప్రసన్న: ఒకలాగే… దానంతటదే జరిగింది.

ప్రసన్న: దాన్లో గొప్పదనమేముందని?

అతిప్రసన్న: అంతా దాగుడు మూతలాట. ఒకళ్ళు బయటికి వెళితే మరొకరు లోపలికెళతారు.

ప్రసన్న: మన కాలేజ్ ప్రక్కనుండే ఆ పెద్ద గడిలాంటి ఇల్లు.

అతిప్రసన్న: అది పడిపోయింది.

ప్రసన్న: ఇంటి ముందటి నది ?

అతిప్రసన్న: అది ఎండిపోయింది.

ప్రసన్న: మరేముంది అంటున్నావ్?

అతిప్రసన్న: మనుష్యులు! బయట మనుషులున్నారు ప్రసన్నా. వివిధ రకాలు. వేరు వేరు తరహాలలో. తమదైన పధ్ధతిలో బ్రతికేవాళ్ళు. ఇంకొకళ్ళని బ్రతకనిచ్చే వాళ్ళు. ఈ కుక్కలకన్న నయమైన వాళ్ళు. పద… ఉన్నపళంగా.. నేను తీసికెళ్తాను నిన్ని బయటికి.

ప్రసన్న: లేదు. అది సాధ్యం కాదు. ఇన్ని కుక్కలు ఇంటి చుట్టూ ఉండగా నేను కిటికీ నుండి బయటికి తొంగికూడా చూడలేను.

అతిప్రసన్న: మీ ఇంట్లోవాళ్ళకి నీ భాష అర్థమవుతుంది కదా?

ప్రసన్న: కావొచ్చు.

అతిప్రసన్న: ఏదేమైనా నీకు నేనున్నానని గుర్తుంటుంది కదా ?

(ప్రసన్న ఏడుస్తూ తల ఊపుతాడు.)

(అతిప్రసన్న అతడిని దగ్గరికి తీసుకుంటాడు.)

ప్రసన్న: చాలా రోజుల తర్వాత బాగాన్పించింది. అడక్కుండా చాలా దొరికింది.

అతిప్రసన్న: అడక్కుండా? ప్రేమ ఏమయినా ఇచ్చే వస్తువూ, అడిగే వస్తువా ఏమిటి ? ప్రేమ ఉంటుంది. అదో ప్రవాహం. ఒక వైపునుండి మరోవైపుకి దానంతటదే ప్రవహిస్తూ ఉంటుంది. ప్రేమనెవ్వరూ ఆపలేరు. నిలువ  ఉంచలేరు.

(ప్రసన్న నవ్వుతూ జేబులో నుండి తాళంచెవి తీస్తాడు. పడేస్తాడు. అంతలో సూర్య వచ్చి ఆ తాళం చెవిని మింగేస్తాడు. ప్రసన్న, అతిప్రసన్నల దృష్టికి రాదిది. సూర్య గప్ చుప్ గా పారిపోతాడు.)

అతిప్రసన్న: నువ్వు బయటపడే అవకాశం, గురివింద గింజంత అవకాశం వచ్చినా నన్ను పిలువు. ఫోన్ చెయ్. ఉత్తరం రాస్తూ కూర్చోకు. ఆ ఫోన్ ఎత్తి ఈ నెంబర్ నొక్కెయ్. నేనీ కాగితం మీద రాసి ఇక్కడ పెడ్తున్నాను. ఇది చూసుకో. ఈ నెంబర్ కలిపి ‘అతిప్రసన్న, వచ్చెయ్’ అను. నేను వెంటనే వచ్చేస్తాను.

ప్రసన్న: ఫోనులో నువ్వు నాకెంత కావాలో, ఎలా కావాలో తెలుస్తుందా నీకు? సమాచారం అంతా అందుతుందా?

అతిప్రసన్న: నీ పిలుపులో నాకంతా అందుతుంది. ఉత్తరం మాత్రం రాస్తూ కూర్చోకు.

ప్రసన్న: సరే.

( అతి ప్రసన్న గబుక్కున లేచి వెళ్ళిపోతాడు.)

( ప్రసన్న ఏడుస్తుంటాడు. కాగితాలని జరిపి అక్కడే నిద్రపోతాడు.)

( ప్రసన్న నిద్రపోతుండగానే పార్వతీబాయి వస్తుంది. చేతిలో పూలదండ. వెనకనుండి సూర్య పరిగెత్తుకుని వచ్చి ఆవిడ కాళ్ళు నాకడం మొదలెడుతుంది.)

పార్వతీబాయి: ఇవ్వు!

(సూర్య నోట్లో నుండి తాళంచెవి ఆవిడ ముందు పడేస్తాడు. ఆవిడ అత్యంత ఆనందంతో ఆ తాళం చెవిని తీసుకుంటుంది. ఆనందంతో చుట్టూ తిరుగుతూ పాట పాడుతుంటుంది.)

పార్వతీబాయి: ప్రేమలో పడేవాళ్ళూ…

ప్రేమలో పడేట్టు చేసేవాళ్ళూ..

ప్రేమలో మునిగితేలే వాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

తలక్రిందులుగా కాళ్ళు పైకిగా

భేటీ కార్డ్ అచ్చేసుకొనేవాళ్ళూ..

ఆత్మహత్యలు చేసుకునేవాళ్ళూ..

సైటు కొట్టేవాళ్ళు…

నా చేతిలో ఏముందో తెల్సా ?

వేడిపాలపైన మెత్తమెత్తని మీగడ

కండోమ్ అమ్మేవాళ్ళూ…

ప్రసవం చేసేవాళ్ళూ…

అమ్మాయిని లేవదీసుకు వెళ్ళేవాళ్ళూ..

నా చేతిలో ఏముందో తెల్సా ?

సుధృడమైన కామధేను…

వీధి కుక్కల మేడం గార్లూ…

బద్దకించిన రచయితల్లారా..

నా చేతిలో ఏముందో తెల్సా ?

W , X మరియు Y

(కర్ణకఠోరంగా పకపకలుగా నవ్వుతుండగా దీపం ఆరిపోయింది.)

(సశేషం)

మరాఠీ మూలం : సచిన్ కుండల్కర్
తెలుగు అనువాదం

గూడూరు మనోజ

గూడూరు మనోజ

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

లోపలిదేహం

 734305_498249500226884_2100290286_n

సుడులు తిరిగే తుపానులాగానో

వలయాల సునామీలాగానో

దు:ఖఖండికల్లోని పాదాల్లాగానో

సుఖసాగర అలల తరగలలాగానో

కదులుతూ గతస్మృతులేవో లోపలిదేహంలో!

కొన్నింటికి లేదు భాష్యం

భాష్యంకొన్నింటికిమూలాధారం

చీకటిగుహలూ

ఉషోసరస్సులక్కడ

ఎండాకాలపు సెగలూ

చిరుగాలుల చల్లటి నాట్యమక్కడ

ఎడారి ఏకాంతం

పూలపానుపుపై ప్రియురాలి విరహపు కదలికలక్కడ

స్నేహలతలకు అల్లుకున్న మల్లెపూలపరిమళాలక్కడ

శతృవైరుధ్యాల వేదికపై అగ్నిపూలయుద్ధాలక్కడ

దు:ఖ

ఆనందడోలికల్లోమోమునుముంచితీసేవాళ్ళూ

కష్టసుఖాలసమాంతరజాడలక్కడ

ఎవరివోభావాలుమనవై

మనభావాల విహంగాలెగురుతాయి పరాయి ఆకాశాలపై

ఒంటరితనంలో విరహం కోరుకునేతోడు

సమూహానందంలో నవ్వుకోరుకునే ఒంటరితనం

ఒకదాని తర్వాత ఇంకోటి

తపనల తీరని అన్వేషణలక్కడ

అన్వేషణల తండ్లాట లోపల మొదలై

బహిరంగ విన్యాసమయ్యే విశాలశాఖల చైతన్యం

స్మృతి అదృశ్యదేహం, దేహం లోపలిదేహం!

ఎన్ని స్మృతులు లోపలికింకితే నువ్వునువ్వు

ఎన్నిస్మృతులు కన్నీళ్ళ సముద్రాలైతే ఒక నీ నవ్వు

ఎన్నికాలగతాలూ, ఎన్నెన్ని స్వగతాలు నీలో అంతరంగమై నీవో నడిచేమనిషివి

అలుపెరగని, అలుపు తీరని సమరగీతాలవి

సజీవజీవనయానంలో నీకై పోరాడుతూ విడిచిన ప్రాణాలప్రతిమలవి

ప్రాణంలోనే పోరాటం నింపుకున్న ప్రజాసమూహాలవి

స్మృతులు ఎండిపోని రుధిరవనాలు

మరణంలేని మహాకావ్యాలు.

మహమూద్

 

ఒక కవిత – రెండు భాగాలు

DSCN2822

మూడేండ్ల మనుమరాలు
మూడు రోజుల కోసం
ఎండకాలం వానలా వచ్చిపోయింది

ఆ మూడు రోజులు
ఇల్లంతా సీతాకోకచిలుకల సందడి
రామచిలుకల పలుకులు

మనుమరాలు లేని ఇల్లు
ఇప్పుడు పచ్చని చెట్టును కోల్పోయిన
దిక్కులేని పక్షి అయ్యింది

2
ఎప్పుడూ లేంది
వేసవి సెలవుల కోసం
మల్లె మనసుతో ఇంటికి వచ్చాడు

అయితే ‘పొగో’ ఛానల్‌
లేకుంటే ‘కామెడీ’ ఛానల్‌
చూస్తూ తనలో తానే నవ్వుతాడు
మరొకసారి చప్పట్లు కొడతాడు

సాయంత్రం
వాన మొగులైంది
ఉరుములు మెరుపులు గాలి దుమారం
కరెంటు పోయింది

ఆకాశం జల ఖజానా నుంచి
దయతో వాన కురుస్తుంది

మా మనుమడు వారించినా
వర్షంలో బుద్ధితీరా తడుస్తూ
అలౌకికంగా కేరింతలు కొడుతున్నాడు

వాన నన్ను ఖైదీని చేస్తే
మనుమనికి గొప్ప స్వేచ్ఛనిచ్చింది
సాన్పు తడుపుకు
వాతావరణమంతా
అద్భుతంగా వాన వాసనతో నిండిపోయింది

         -జూకంటి జగన్నాథం

09-jukanti-300

పిచ్చేశ్వరరావు ప్రియస్మృతిలో…..

                ఒక రచయితకు అర్హతకు మించిన గుర్తింపు లభిస్తుంది. మరొక రచయితకు అర్హతకు తగిన గుర్తింపు కూడా రాదు. మొదటి దానికంతగా విచారించనక్కర్లేదు. కానీ, రెండో దానికి అనివార్యంగా విచారం కలుగుతుంది. ఎందుకంటే, అర్హతకు మించిన గుర్తింపు రావడం వల్ల ఆ రచయితకు కొంత ప్రయోజనం కలిగినా, అందువల్ల సాహిత్యానికీ, సమాజానీకీ కలిగే నష్టం అంతగా వుండదు. అంతేగాదు, అర్హతకు మించిన గుర్తింపు అట్టే కాలం నిలిచివుండదు. రచయిత అర్హతకు తగిన గుర్తింపు రాకపోతే మాత్రం సాహిత్యానికీ, సమాజానికీ ఎంతో కొంత నష్టం జరిగితీరుతుంది. గుర్తింపుకు రాని రచయిత తన సాహిత్యం ద్వారా ఏం చెప్పిందీ, ఏ విలువల కోసం పోరాడిందీ తెలీక పోవడం వల్ల, అటువంటి నష్టం కలుగుతుంది. అట్లూరి పిచ్చేశ్వరరావు విషయంలో అలా జరిగిందనిపిస్తుంది. పిచ్చేశ్వరరావుకు గుర్తింపే రాలేదనికాదు, అర్హతకు తగిన గుర్తింపు రాలేదనే చెబుతున్నది. అందుకు కారణాలున్నాయి. వాటిని తర్వాత చెప్పుకుందాం.

ఎవరీ పిచ్చేశ్వరరావు?

ఈ ప్రశ్నకు నేనైతే, ‘‘పిచ్చేశ్వరరావు మా పెద్దమ్మ కొడుకు, మా పులపర్రువాడు, పిచ్చేశ్వరరావు లేకుండా వుండివుంటే, ఈ అట్లూరి రాధాకృష్ణ కూడా లేకుండా వుండేవాడు, ఉండినా ఇలా వుండేవాడు కాడు, ఇంకెలాగో వుండేవాడు’’ అంటాను. అంటే, పిచ్చేశ్వరరావు ప్రభావం నావిూద అంతలా వుందనీ, ఈ నేను రూపొందిందే ఆ ప్రభావంతోననీ అనడమన్నమాట. నా ద్వారా పిచ్చేశ్వరరావును చూపించడం కన్నా, పిచ్చేశ్వరరావును పిచ్చేశ్వరరావు ద్వారానే చూపించడం సరైన పద్ధతి. అందువల్ల, నాకు పిచ్చేశ్వరరావుకూ వున్న సంబంధం గురించీ, అనుబంధం గురించి అవకాశాన్ని బట్టి మరోసారి చెబుతానని, హామీ ఇస్తున్నాను. ఇప్పుడు పిచ్చేశ్వరరావును గురించి కొడవటిగంటి కుటుంబరావు ఏం చెప్పారో చెబితే, గౌరవ ప్రదంగా వుంటుంది కదా!

‘విశాలాంధ్ర పబ్లిషింగ్‌హౌస్‌’’ వారు 1967 నవంబర్‌లో మొదట ‘పిచ్చేశ్వరరావుకథలు’ ప్రచురించారు. దానికి కుటుంబరావు ‘కథకుడుగా పిచ్చేశ్వరరావు’ అంటూ, ముందుమాట రాసారు. ముందుమాటలో మొదటి మాటగా ఇలా అన్నారాయన. ‘‘అతను చనిపోయాడంటే నేను నమ్మలేను. అతను ఇంకా నాకళ్ళకు కట్టినట్టు కనపడుతూనే వున్నాడు’’ ఈమాటలు ఒక కథలో పిచ్చేశ్వరరావు అన్నవి. ఈ మాటల్నీ పిచ్చేశ్వరరావును గురించి కుటుంబరావూ అన్నారు. అంతేనా? ఇంకా ఇలా అన్నారు. ‘‘ఒక మనిషి చావు అవాస్తవం అనిపించడానికి కారణం ఏమిటని ఆలోచించాను. ఆ మనిషిమీద ప్రేమాభిమానాలే అందుకు కారణంకాదు. మనిషితోపాటు పోకుండా సజీవంగా మిగిలిపోయేదేదో వుంటుంది. అదే ఆ మనిషి చావును నమ్మశక్యం కాకుండా చేస్తుంది’’ గొప్ప విశ్లేషణ కదూ! పిచ్చేశ్వరరావులో మిగిలిపోయిన సజీవతను గుర్తించిన కుటుంబరావు ఆయనకథ ‘చిరంజీవి’ని మెచ్చుకోకుండా ఎలా వుంటారు?

Atluri_Pitcheswara_Rao_Apr12_1924_to_Sept26_1966_Atluri_Anil_

‘‘నిజానికి పిచ్చేశ్వరరావును బాగా ఎరిగినాక, అతని సజీవ భావ చైతన్యాన్ని గుర్తించకుండా వుండడం సాధ్యంకాదు. చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని సాధ్యమైనంత గోప్యంగా దోచుకున్నాడు’’ కుటుంబరావు పిచ్చేశ్వరరావును గురించి ‘బాగా ఎరిగిన’ వారుకనుకనే, ఈ సంగతి కనిపెట్టగలిగారు. ఆ సంకలనంలో వున్న 22 కథల్లోనూ చాలా వాటిని పేర్కొని, వ్యాఖ్యానించి మెచ్చుకున్నారు. చివరగా, ‘‘నేనెరిగినంతలో అతని కథలు నాలుగైదు ఉత్తమ తెలుగు కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ కలిగినవిగా వున్నాయి’’ అనీ ప్రకటించారు. కుటుంబరావు అన్ని కథల్ని ప్రస్తావించడమూ, ఆ చివరి అభిప్రాయమూ ఆశ్చర్యం కలిగించేవే.

KoKu

ఆ తర్వాత, 1994 జులైలో ‘పిచ్చేశ్వరరావు కథలు’ ద్వితీయ ముద్రణగా వచ్చాయి. దానికి ‘ధ్యేయం’ అన్న పేరిట ఆరుద్ర ముందుమాట రాసారు. అందులో ఆయన ‘‘కుటుంబరావు వంటి నిర్మొహమాట విమర్శకుడు అభిప్రాయం వెలిబుచ్చాక, ఈ సంపుటికి ఇంకొకరు ముందుమాట రాసి పిచ్చేశ్వరరావును ప్రశంసించనక్కర్లేదు’’ అన్నారు. ‘‘ఉత్తమ సాహిత్యం బ్రతుకు మీద మమతను పెంచాలి. పిచ్చేశ్వరరావు ఆ ధ్యేయంతో కథలు రాసాడు. అందుకు ఈ సంపుటిసాక్ష్యం’’ అంటూ ఆరుద్ర సాక్ష్యం ఇచ్చారు.

ఇద్దరు సాహితీ ప్రముఖులు ఈ విధంగా ప్రశంసించినప్పుడు పిచ్చేశ్వరరావుకు తగిన గుర్తింపు రాలేదనడమేమిటి… అనడగవచ్చు… గుర్తింపు రావడంమంటే, కుటుంబరావు, ఆరుద్ర స్థాయిలో గుర్తింపు రావడమని కాదు. ఉత్తమ సాహిత్యాన్ని గుర్తించగలిగిన పాఠకుల స్థాయిలో సైతం గుర్తింపు రావాలన్న కోరిక. అందుకు కారణాలున్నాయనీ, వాటిని తర్వాత చెప్పుకుందామనీ అన్నాను. అయితే, నేను చెప్పనవసరం లేకుండా ఆ ఇద్దరు ప్రముఖులే అవీ చెప్పారు. ఎలా చెప్పారో, ఏం చెప్పారో చెప్పుకుంటేచాలు.

‘‘అతను చాలా సామర్ధ్యాలు కలవాడు. కానీ వాటిని గోప్యంగా దాచుకున్నాడు. వాటిని దుకాణంలో పెట్టలేదు. ప్రదర్శించి కీర్తి తెచ్చుకోడానికి మొదలే ప్రయత్నించ లేదు. హిందీ, ఇంగ్లీషు, తెలుగూ బాగావచ్చు. బెంగాలీ కూడా వచ్చుననుకుంటాను. శాస్త్రీయ దృక్పథం వుంది. కథలు రాసాడు, విమర్శలు రాసాడు, అనువాదాలు చేసాడు, సినిమాలకు సంభాషణలు రాసాడు. ఏదిరాసినా, విశిష్టంగా తన వ్యక్తిత్వం ఉట్టిపడేట్టుగా రాసాడు’’ (కుటుంబరావు)

అదిగో… ఆ వ్యక్తిత్వమే తనని తాను ప్రదర్శించుకోనీకుండా చేసింది. ఏది రాసినా తన వ్యక్తిత్వం చూపెట్టేందుకు రాసాడు కానీ, తన ప్రతిభను చూపెట్టేందుకు రాయలేదు. గొప్పకథలు రాయాలన్న కోరికతో, తపనతో కాకుండా, క్లుప్తంగా, గుప్తంగా రాసినా, ఉత్తమ కథా సాహిత్యంలో శాశ్వతంగా నిలువ గలిగినవీ రాసాడు! ఆశ్చర్యంగా లేదూ? ఆశ్చర్యమెందుకు? అది కూడా పిచ్చేశ్వరరావు వ్యక్తిత్వంలో, ధ్యేయంలో భాగమే.

ప్రజలలో చాలామంది చావంటే వున్న భయంతో బ్రతుకుతున్నారనీ బ్రతకుమీద మమతను పెంచేకథలు రాసాడని, ఆరుద్ర అన్నారు. చావంటే వున్న భయంతో చాలా కాలం బ్రతకడం ఇష్టంలేకనేమో, బ్రతుకుమీద మమతతో స్వల్ప కాలం బ్రతికినా చాలని చాటడానికేమో, పిచ్చేశ్వరరావు 41 సంవత్సరాల వయస్సులోనే మరణించాడు. ఆయనకంటే చిన్నవాడినీ, ఆయన చేత ‘కృష్ణా’ అని ఆప్యాయంగా పిలిపించుకున్నవాడినీ, అయిన నేను ఎనభై ఏళ్ళు పై బడినా ఇంకా ‘బ్రతికివున్నాడ జీవచ్ఛవంబువోలె’ ఇదంతా చెప్పడమెందుకంటే, పిచ్చేశ్వరరావు అన్నట్టూ, నాతో సహా చాలా మంది చావు భయంతో బ్రతుకుతున్నవాళ్ళమే అనడానికి.

ఇంతకూ, పిచ్చేశ్వరరావుకు అర్హతకు తగిన గుర్తింపు రాలేదన్న బాధ కలుగుతుందేకానీ, అసలా మనిషి తన అర్హతను పూర్తిగా చూపించిందెప్పుడని, ఆ అర్హతను గుర్తించే అవకాశం ఈ ‘ప్రదర్శన యుగం’లో ఇతరులకెలా వస్తుంది?

 

‘‘మహాసముద్రంలాంటి సినిమా రంగంలో కూడా తన వ్యక్తిత్వాన్ని నిలబెట్టుకున్నాడు’’ (కుటుంబరావు) చూడండి, సముద్రంలో ఉన్నప్పుడు ఆ అలల మీద అలా అలా జాలీగా కొట్టుకుపోతారుకానీ, వ్యక్తిత్వాన్ని పట్టుకొని కూచుంటారా? ఒక్కమాటలో చెప్పాలంటే, పిచ్చేశ్వరరావును ‘బ్రతకడం తెలియనివాడు’ అనాలి. పాపారావును అందరూ అన్నట్టే పిచ్చేశ్వరరావును నేను అలా అంటాను. పాపారావు ఎవరో తెలీదా?

అతను పిచ్చేశ్వరరావేనండీ.

ప్రజలలో చాలామంది చావు భయంతో బ్రతకుతున్నారే కానీ, బ్రతుకుమీద మమతతో కాదని, పిచ్చేశ్వరరావు ఒక భయానక సత్యం చెప్పింది. ఆ ‘బ్రతకడం తెలియనివాడు’ కథలోనే. కుటుంబరావు, ఆరుద్రల మాదిరిగా నేనూ ఓ మేధావిగా పిచ్చేశ్వరరావు రాసిన కొన్ని కథల్ని గురించి చెబుదామనుకున్నాను. కానీ, అనవసరం తన ఆశయాలతో, జీవితంతో, వ్యక్తిత్వంతో ప్రత్యక్షంగా పిచ్చేశ్వరరావే పాపారావులో కనిపిస్తున్నప్పుడు, ఆ ఒక్క కథ గురించి చెబితే చాలదా? అది పిచ్చేశ్వరరావు అర్హతనూ, నా అర్హతనూ చెబుతుంది కనుక, ఆ కథ గురించీ పలికేది రెండు మూడు గాథలు పలుకగనేలా?

‘‘నీకు బ్రతకడం తెలియదురా’’ అన్నారు అందరూ పాపారావు ముఖం మీదనే. పాపారావు ముఖం చిరునవ్వు నవ్వింది కానీ నోరు తెరిచి మాట్లాడలేదు. పాపయ్య అన్న తాత పేరు మనవడి తరానికి పాపారావు అయింది. అయితే, తాత లక్షణాలేవీ మనవడికి లేవు. తాత లక్షణాలేకాదు, తండ్రికున్న తెలివితేటలూలేవు. పాపారావు తండ్రి సంఘ సంస్కర్త, హరిజనులతో దేవాలయ ప్రవేశం చేయించాడు, వాళ్ళతో పంక్తిభోజనాలు చేసాడు. తన ఇంట్లో మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకునే ఏర్పాటు చేసాడు. అటువంటి సంస్కర్తకూ ఒక సమస్య వచ్చిపడిరది. వెట్టివెంకడు తన కొడుకు పాపారావును ‘‘చిన్న దొరగారూ!’’ అని పిలుస్తూంటే, వాడి కొడుకు సుబ్బడు ‘‘పాపారావ్‌, గోళీలు ఆడుకుందాం రావోయ్‌’’ అని పిలవడం ఆ సంస్కర్తకు మింగుడుపడటం లేదు. కొడుకు గోళీలు ఆడుకోవచ్చు, కానీ ఆ వెట్టివెంకడి కొడుకుతోనా అదీ ‘వోయ్‌’ అని పిల్చేవాడితోనా? ఆ సుబ్బడిని తిడదామనో, తందామనో అంటే, తన సంస్కర్తతనం గాల్లో కలుస్తుంది. ఇప్పటికీ ఆ పక్కింటి బ్రహ్మయ్య చూపు ఎలావుంది?

‘‘మాలవాళ్ళతో మంచినీళ్ళు తెప్పించుకుంటున్నానంటే వాళ్ళమీద ప్రేమతోనా? అరమైలుదూరంలో వున్న చెరువు నుంచీ రోజూ పది కావిళ్ళ మంచినీళ్ళు కావాలి కదా! వాళ్ళ మీద ప్రేమవుంటే, మాలపాలేరుకు పదిసోలలవడ్లు ఎక్కువ ఇస్తున్నావా? పోనీ సెలవులైనా ఇస్తున్నావా? ఎందుకయ్యా ఈ సంస్కర్త వేషమా, మోసమూ’’ అన్నట్టుంటుంది. అనడు, అన్నట్టు కనిపిస్తుంటాడు.

ఒకసారి ఆగ్రహం పట్టలేక, ‘‘ఆ లంజాకొడుకు తో సావాసం మానకుంటే గొంతు కోస్తాను, అని అంటే కొడుకు అదిరాడా, బెదిరాడా? పైగా ఇంట్లో నుంచీ కత్తి పీట పట్టుకొచ్చి ‘‘ఇదిగో… కొయ్యి గొంతు’ అన్నాడు! అలాంటి వాణ్ణి ఎవరేం చేస్తారు? చదివిస్తే, స్నేహాలు మాని మారతాడేమోనని స్కూల్లో చేర్పిస్తే, అక్కడా అంతే! మాలవాణ్ణి లోపలికి రానివ్వలేదని హోటల్‌ వాడితోనూ జీతం కట్టనందుకు విద్యార్థిని బెంచీ ఎక్కించిన మాస్టారితోనూ పోట్లాటే. పోనీ, స్కూలూ మాన్పిద్దామంటే ఎప్పుడూ ఫస్టు మార్కులే! అలాంటి వాడిని గొడ్లకాడికి ఎలా పంపాలి?

PitcheswaraRaoKathalu_kathaasaagaraMFrontCoverPubByDesiApril1954

వయస్సు పెరిగే కొద్దీ మారతాడేమో అనుకుంటే, ఇంకా ముదిరాడే. కాలేజీ చదువు పనికి రాదనీ, సమాజం గురించి చదవాలనే దశకి ఎదిగాడు. ఇంకిలా కాదని, ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, ‘‘నీ ఇష్టం నాన్నా’’ అని వెళ్ళిపోయాడు. అప్పుడూ అదరలేదు, బెదరలేదు. ఆ తర్వాత కూడా పాపారావు రైతులతో ఆందోళనలు చేయించీ, ఉద్యోగులతో సమ్మెలు చేయించీ, కొంత ప్రయోజనాలు పొందేలా చేసాడు. ఈ లోపల సమాజం మరీ పురోగమించింది. రౌడీయిజం పెరిగింది. గూండాయిజం చేతులు చాపింది. దౌర్జన్యాలకు తలవంచే ప్రజలను చూస్తే పాపారావుకు చిరాకేసింది. జనంలో ఎక్కువమంది చావు భయంతో బ్రతుకుతున్న వాళ్ళే కానీ, బ్రతుకు మీద కోర్కెతో బ్రతుకుతున్నవాళ్ళు కాదనిపించింది. ప్రజలకు బ్రతుకుమీద కాంక్ష పెంచాలని నిర్ణయించుకున్నాడు. తుపాకులు పేల్చేవాళ్ళమీద ఎదురు నిలబడి తనూ తుపాకి పేల్చాడు. ఆ పోరాటంలో పాపారావు మరణించాడు. పాపారావు తుపాకీ పట్టడం తప్పు అన్నవాళ్ళు వున్నారుకానీ, అప్పటికే తుపాకీ పేల్చేవాళ్ళమీద తుపాకీ పేల్చేందుకు చాలామందీ తయారయ్యారు. వాళ్ళంతా, బ్రతికితే పాపారావులా బ్రతకాలని నమ్ముతున్నవాళ్ళే.

ఇది పిచ్చేశ్వరరావు రాసిన ‘బ్రతకడం తెలియనివాడు’ అనే కథ. ఇది నూటికి తొంభైపాళ్ళు పిచ్చేశ్వరరావు జీవిత కథే. తండ్రి ఇంట్లో నుంచీ వెళ్ళి పొమ్మంటే, వెళ్ళిపోయింది పిచ్చేశ్వరరావే. అతను రాసిన చాలా కథల్లాగే, నవల కావలసిన ఇతివృత్తాన్ని చిన్న కథగా కుదించాడు. కథేకాదు, తనను తాను కుదించి చూపడం కూడా పిచ్చేశ్వర తత్వమే. రౌడీలతో, గూండాలతో పోరాడటమనేది ఒకప్పుడు కమ్యూనిస్టులు అరాచక శక్తులతో పోరాడిన నేపథ్యం కావచ్చు. అలాగే సంస్కర్తలనిపించుకోవడానికి కొందరు చేసిన ప్రయత్నాలు కూడా అప్పటివే. పాపారావు తండ్రి, పక్కింటి బ్రహ్మయ్య చూపులో వున్నట్టు అనుకుంటున్నది, అతని అంతరాత్మ అన్నదీ! పోతే, పాపారావు తుపాకి పట్టడం అన్నది, అప్పటికి పిచ్చేశ్వరరావు మనసులో వున్న ఆలోచన కావచ్చు. పాపారావు తుపాకి పట్టడం తప్పు అన్నది, మనం ఇప్పుడు వింటున్నదే.

అంతవరకూ, ‘బ్రతకడం తెలియనివాడు’ గా కనిపించిన పాపారావు, తుపాకిపట్టి ప్రాణాలర్పించిన తర్వాత, బ్రతికితే పాపారావులా బ్రతకాలి అన్న ఆదర్శమయ్యాడు. అంతే కాదు. బ్రతకడం తెలిస్తే అది బ్రతుకుకాదనీ, బ్రతకడం తెలియకపోతేనే నిజమైన బ్రతుకు అనీ అన్యాపదేశంగా ఈ కథ తెలియజేస్తోంది. చావంటే తెలీనివాళ్ళకు బ్రతకడమంటే కూడా తెలీకపోవచ్చని ఇది తెలియజేసింది.

ఈ ఒక్క కథ చాలదా కథా సాహిత్యంలో పిచ్చేశ్వరరావుకు శాశ్వత స్థానం వుందనీ, వుంటుందనీ తెలియ జేసేందుకు…

 

-కృష్ణ

Krishna

సాహిత్యం- సాహిత్తెం

 

 

కలలు చమత్కారంగా ఉంటవి. దెయ్యాలూ భూతాలు కలలోకి వచ్చినా మర్నాడు లేచాక మనకి కనిపించవు కదా? మంచి కలలొస్తే మంచి జరుగుతుందనీ, పాడు కల వస్తే చెడు జరుగుతుందనీ ఎక్కడైనా ఉందా? కల వచ్చిన మర్నాడు పొద్దున్నే కొంత సుఖమో కష్టమో అనిపించవచ్చు గానీ తర్వాత రోజూ పనుల్లో పడి ఇవన్నీ మర్చిపోతూంటాము కదా? కానీ నా కొచ్చిన కల వింతగా ఉంది.

 

లేకపోతే ఇది చూడండి. రాత్రి పడుకున్నానన్న మాటే గానీ ఎప్పటికో గాని నిద్రలేదు. అప్పుడొచ్చిన కలలో నేనూ, బిల్ గేట్సూ, వంగూరి చిట్టెన్ రాజు గారూ కలిసి నడుస్తున్నాం. ఇప్పుడు మనమో విమానం ఎక్కాలి అన్నారు బిల్ గేట్స్. “ఎక్కడికండి మనం వెళ్ళేది? ఇండియాకేనా?” అని ఎంతో ఉత్సాహంగా అడిగేను. సమాధానం లేదు. నాకేమో ఒళ్ళు జలదరిస్తోంది వీళ్ళతో వెళ్ళడానికి. వాళ్ళేమో సమాధానం చెప్పరు. విమానం వచ్చింది. ఎక్కాక పైలట్ కూర్చుని ఏవో మీటలన్నీ నొక్కుతున్నాడు. “బోయ్” మని చప్పుడు. విమానం తూర్పు కేసి ఎగురుతోంది అని నేనంటే వీళ్ళు “ఇండియాకి కాదు వెళ్ళేది ఆఫ్రికాకి” అనడం.

 

గేట్స్ గారితో వెళ్ళడం అంటే ఏ ఫస్టు క్లాసులోనో వెళ్ళచ్చేమో, వైన్ అదీ తాగి, పీక దాకా తినేసి, సీటు నూట ఎనభై డిగ్రీలు వచ్చేదాకా కాళ్ళు తన్ని పడుకోవచ్చు అనుకున్నాను కానీ వీళ్ళు నన్ను ఎకానమీలో ఎక్కించారని ఎక్కేదాకా తెలీలేదు. తీరా ఎక్కిన తర్వాత దాహంతో నోరు పిడచగట్టుకుపోతూంటే, ఓ కోక్ ఇమ్మన్నా, కాసిని మంచినీళ్ళిమ్మన్నా గంటు మొహం పెట్టుకుని ఏదో ముష్టి పారేసినట్టు తెచ్చి మొహం మీద విసరడం.

 

ఇంక ఎలాగా తప్పదు కదా? వాళ్ళు పెట్టిన గడ్డీ గాదం (అవే లెండి, ఆంగ్లంలో సలాడ్లు అంటారు కదా) తిని ఓ కునుకు తీసి లేచేసరికి సీటు బెల్ట్ పెట్టుకోమని ఆర్డర్. అప్పటికే రాజు గారూ, గేట్స్ గారూ రడీగా ఉన్నారు. నేనే లేటుగా లేచింది. కిందకి దిగి “ఇది హైద్రాబాదులా లేదే, ఇదే ఊరండి రాజు గారు?” అనడిగాను. సమాధానం లేదు.

 

కాస్త ముందుకెళ్ళాం. ఇక్కడకెందుకొచ్చామో నాకర్ధం కాలేదు. చుట్టూ చూసాను. మమ్మల్ని దింపిన విమానం వెళ్ళిపోతోంది మళ్ళీ. కార్లూ అవీ ఉన్నట్టులేదు. ఇండియా అయితే ఎడ్లబండో, ఏనుగో కనపడాలి కదా విమానం దిగిన పదినిముషాల్లో? రాజుగారి కేసి ప్రశ్నార్ధకంగా చూస్తే ఆయనే చెప్పేరు ఈ సారి – “ఇది ఆఫ్రికా, మనం ఇక్కడ చూడాల్సినవి కొన్ని ఉన్నాయి.”

 

“మరి బిల్ గేట్స్ గారేరీ?” అన్నాను ఆయన మాతో లేకపోవడం గమనించి.

 

“ఆయనకి వేరే పనులున్నాయి, పోలియో, మలేరియా మందులు ఇప్పించడానికీ, దానికీను. ఆయనరారు మనకి తప్పదు.” చెప్పేరు రాజు గారు.

 

“మనకి ఎందుకు తప్పదు?”

 

“నేను కధలు రాస్తాను. నువ్వు నాకన్నా బాగా రాస్తావు; అందుకని” వెర్రి వెధవని కాకపోతే రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

ఎదురుగా “విలియం ఎండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ లైబ్రరీ” అని పెద్ద పెద్ద అక్షరాలతో పెద్ద భవనం కనిపించింది. “మనమే ఎం.బి.ఏ చేసుంటే నేను ఏ వాల్ స్ట్రీట్ లోనో లక్ష డాలర్లు సంపాదించేవాడిని, నువ్వు ఏ కోటి డాలర్లో తెచ్చేవాడివి గేట్స్ గారిలానే.” నేను ఆ బిల్డింగ్ బోర్డు చూసి నోరు వెళ్ళబెట్టగానే చెప్పేరు రాజుగారు.

 

ఏమైనా నేను కోటి డాలర్లు తెస్తున్నట్టే అనిపించింది. మీరు ఎందుకు ఎం. బి. ఏ చేయలేదని రాజుగార్ని అడుగుదామనుకున్నాను కానీ ఊరుకున్నాను.  జేబులన్నీ వెతికి తుపాకులూ అవీ ఉన్నాయా అనే చూసి, ఏమీలేవని నిర్ధారించుకున్నాక లైబ్రరీ లోపలకి వదిలేరు.

 

పుస్తకాలు కుప్పలకొద్దీ బీరువాల్లో దాచి ఉంచారు. చూస్తూ పోయేసరికి ఓ చోట తెలుగు సాహిత్యం అని ఉంది. కనుబొమ్మలు పైకెత్తి రాజు గారు కేసి చూసాను ఆశ్చర్యంతో.

 

“ఇప్పుడర్థం అయిందా?” అన్నట్టూ నవ్వుతున్నారు ఆయన. ఆయన పబ్లిష్ చేసిన పుస్తకాలూ, అందులో నేను అప్పుడప్పుడూ రాసిన కధలూ అన్నీ ఉన్నట్టున్నాయి.

 

“ఇక్కడకి తెలుగు సాహిత్యం ఎలా వచ్చిందో?” అని నేననుకునేలోపల రాజుగారే చెప్పారు, “తెలుగు వాడు లేని నేల ఎక్కడుందోయ్ ఈ భూమ్మీద?”

 

“ఇక్కడ ఆఫ్రికాలో ఎవరు చదువుతారండీ ఇవి?” అడిగేను ఆయన్ని.

 

“ఎవరో చదువుతారని కాదు, ప్రపంచం నాలుగు మూలలా మువ్వన్నెల తెలుగు సాహిత్య పతాకం ఎగరవల్సిందే,”

 

మళ్ళీ నడవడం మొదలు పెట్టాం. “ఇక్కడ్నుంచి, రచయితల సెక్షన్” అని రాసి ఉంది.

 

మొదటి చోట కొంతమంది తెలుగు వాళ్ళు కాయితాలు ముందేసుకుని ఏవో రాస్తున్నారు. మేము రావడం చూసారు కానీ ఏమీ పట్టించుకున్నట్టు లేదు. కాయితానికి రెండంటే రెండే లైన్లు రాసి పారేస్తున్నారు పక్కన. కాయితాలు ఖరాబు చేస్తున్నట్టు అనిపించి ఏదో అనబోయేను కానీ రాజు గారు నా నోటి మీద చెయ్యేసి నొక్కేసి అక్కడ్నుంచి దూరంగా తీసుకెళ్ళి చెప్పేరు, “వీళ్ళు రాసేవి నానీలు. నోరెత్తావా, పెన్నుతో పొడిచి చంపేస్తారు.”

 

ఒళ్ళు జలదరించింది.  కాస్త ముందుకెళ్తే కొంత మంది కాయితాల మీదే రాసుకుంటూ కనిపించేరు. దగ్గిరకెళ్ళి చూద్దుం కదా, వాళ్ళు రాసేవి సమస్యా పూరణాలు. ఓక్కో చోట ప్రాసకోసం “గూగిలించుచో” అనో, “యాహూలించుచో” అనో “బింగులించుచో” అని రాసేస్తున్నారు. “ఇదేమిటండీ రాజుగారు ఇవి అంతర్జాలంలో ఉండేవి కదా, అవి తెలుగు పదాలు ఎలా అవుతై?” అనడిగేను. రాజుగారు సమాధానం చెప్పేలోపుల అక్కడే ఉన్న ఒకాయన చెప్పేడు, “కొత్త కొత్త పదాలు మనం సృష్టించపోతే బాష ఎలా ఇంప్రూవ్ అవుద్దోయ్ చెవలాయ్?” మొహం గంటు పెట్టుకుని రాజు గారి కేసి  చూస్తే ఆయన “ఊరుకో, ఊరుకో తెలుగు పద్యాల్లో కాసినేనా తెలుగు పదాలున్నాయని సంతోషపడు” అని చెప్పి ముందుకి లాక్కేళ్ళేరు.

 

ఇంకాముందుకి వెళ్లేసరికి అక్కడంతా కలగా పులగంగా ఉంది వాదోపవాదనలతో. నేను అడిగేలోపులే రాజుగారు చెప్పేరు, “వీళ్ళందరూ ఎడిటర్లు, మనం రాసేది ఎలా తీసిపారేద్దామా అని చూస్తూ ఉంటారు. ఓ రకంగా డాక్టర్ల లాంటి వాళ్ళు, అంగవ్రాతములో చికిత్సకుడు దుష్టాంగమ్ము ఖంఢించి.. లాంటి వాళ్ళనుకో”.

 

“అదేమిటండోయ్, డాక్టర్లకీ ఎడిటర్లకీ పోలిక?” వెర్రిమొహం వేసి అడిగాను.

 

“అదంతే. ఎవడికి ఎప్పుడు రోగం వస్తుందా, ఎప్పుడు పేషంట్ మన దగ్గిరకి వస్తాడా అని డాక్టర్లు చూస్తూ ఉంటారు. అలాగే ఎవడు ఏమి రాసి రచయిత అవుదామా అని చూస్తూ ఎడిటర్లకి పంపిస్తే వాళ్ళు ఏ కారణం చూపించి రాసినది అవతల పారేద్దామా అని వీళ్ళు చూస్తూ ఉంటారు.” విడమర్చి చెప్పేరు రాజు గారు.

 

“ఛా, అలా అంటారేంటండీ? నాకు అలా అవలేదే? నేనేం రాసినా వేసుకుంటున్నారు ఎడిటర్లు.”

 

“చెప్పేనుగా నువ్వు నాకన్న మంచి కధలు రాస్తావని?” గుంభనంగా నవ్వుతున్నారు రాజు గారు. మట్టిబుర్ర కాకపోతే ఈ పాటికైనా రాజుగారు నన్ను వెక్కిరిస్తున్నారని తెలియలేదు.

 

మళ్ళీ ముందుకి నడిచాం.  అందరూ కంప్యూటర్లమీద చక చకా ఏదో టైప్ చేస్తున్నారు. కాయితం లేదు, కలం లేదు. ఏదో రాయడం, పబ్లిష్ చేయడం వెంట వెంటనే జరిగిపోతున్నాయి. ఆశ్చర్యంగా చూద్దును కదా, రాజుగారు నన్ను వెనక్కి లాగి చెప్పేరు, “వీళ్ళు బ్లాగు రైటర్లు. అలా చూడకూడదు, అవి పబ్లిష్ అయ్యేదాకా”.

 

“ఇక్కడ చూడకపోతే పబ్లిష్ అయ్యేక ఎలా చూస్తామండి?”

 

“అవి పబ్లిష్ అయ్యేక, మాలిక అనీ కూడలి అనీ బ్లాగుల సమాహారాల్లో వస్తాయి. అక్కడ్నుంచి చూసి కామెంట వచ్చు.”

 

“కామెంటడం అంటే?” కామెర్లు అంటే తెలుసు, కామేశ్వరీ తెలుసు. కామెంటడం అంటే తెలియక అడిగేను సిగ్గు పడుతూ.

 

“వాళ్ళు రాసి పారేసాక మన అభిప్రాయం కామెంట్ రూపంలో పెట్టడాన్ని కామెంటడం అన్నారు. అలాగే ధన్యవాదాలు చెప్పడాన్ని నెనర్లు అనీ, ఈకలనీ ఏవోవో పేర్లు. పక్కనున్న సెక్షన్లో ఇందాకే చెప్పేడు కదా ఒక మహామహుడు, కొత్త పదాలు సృష్టించకపోతే తెలుగు ఎలా నిలబడుద్దో చెవలాయ్ అనీ? అయినా ఇన్ని ప్రశ్నలు అడక్కూడదు.”

 

“రాసేసినవి ఎడిటర్లకి పంపొచ్చు కదా? బ్లాగులో రాసుకోడం ఎందుకో?” నా మనసులో సందేహం అనుకోకుండా నోట్లోంచి బయటకొచ్చేసింది.

 

“చెప్పాను కదా, పాతిక కధలు పంపిస్తే ఎడిటర్లు ఒకటో రెండో వేసుకుంటారు. మిగతావి చెత్తబుట్టలోకే. వాళ్ళు పబ్లిష్ చేయకపోతే నిరుత్సాహ పడిపోకుండా, ఈ బ్లాగుల్లో మనకి మనవే పబ్లిష్ చేసుకోవచ్చు. ఎడిటర్లు నీ రచన బావోలేదు అంటే, నీ సలహా ఎవడిక్కావాలోయ్ ఇదిగో నేనే పబ్లిష్ చేసుకోగలను అని వీళ్ళు ఇలా రాస్తారు.”

 

“అలా ఏది పడితే అది రాసేయొచ్చా బ్లాగులో?”

 

“ఆ, మన ఇష్టం. ఆ తర్వాత ఏదైనా తేడాలొస్తే దాంతో తంటాలు పడాల్సింది కూడా మనమే.”

 

కంప్యూటర్ల దగ్గిర కూచున్నవాళ్ళు మమ్మల్నీ, రాజు గారి చేతిలో ప్రింట్ పుస్తకాలనీ చూసి నవ్వడం. ఈ రోజుల్లో పుస్తకాలెవడు చదువుతాడోయ్ చెవలాయ్ అనడమూను. రాజు గారు పబ్లిషర్ అని చెప్తే ఇంకా నవ్వులు.

 

తెలుగు సాహిత్యం ఎంత పైపైకి పోతోందో, నేనెంత వెనకబడి ఉన్నానో ఇదంతా చూసేసరికి అర్ధమైంది. కళ్ళు తిరిగేయి గిర్రున.  రాజుగారు నా చేయి పట్టుకుని బయటకి నడిపించుకొచ్చేరు. దారిలో తత్త్వ బోధ చేస్తున్నట్టూ చెప్పేరు రాజుగారే, “చూసావా తెలుగు సాహిత్తెపు మువ్వెన్నల  జండా ఎంత గొప్పగా పైపైకి పోతోందో?”

 

“సాహిత్యం అనకుండా సాహిత్తెం అన్నారేమిటబ్బా?”

 

“మన కవులు రాసినదీ సాహిత్యం. ఇప్పుడొచ్చేది సాహిత్తెం. అంతే తేడా”

 

ఇంతట్లో మేడూరు వచ్చి ఉయ్యూరు మీద పడిందన్నట్టూ ఎవరికో నేను కధలు రాస్తానని తెల్సింది. నాకేసి వేలెత్తి చూపించి చెప్పేడు, “జాగ్రత్త, నువ్వు మా గురించి రాసావా, మరి చూస్కో!” అన్నాడు.

 

“ఏం చేస్తారేం?” అని ఇంకేదో అడగబోతుండగా రాజుగారు వారించి నన్ను బయటకి తీసుకొచ్చేరు. లోపలకి వెళ్ళిన దారి వేరూ, బయటకొచ్చిన దారి వేరూను. బయటకి రాగానే తలుపు దగ్గిరే జీరాఫీ, చిరుతపులీ కనిపించేయి.

 

ఇది ఇండియా అయితే జిరాఫీ ఉండదే, చిరుతపులి ఇండియాలో ఉంటే దాన్ని చంపేసి చర్మం అమ్ముకోరూ ఈపాటికి అనుకుంటూంటే వెనకనుంచి చింపాంజీ అరుపు వినిపించింది. భయపడి పక్కనే ఉన్న రాజు గారి చెయ్యి పట్టుకున్నాను.

 

“చూసావా, నేచెప్పలే? ఇది ఆఫ్రికా” అని మృదువుగా చేయి విడిపించుకుని భుజం తట్టేరు రాజు గారు. బుర్ర పక్కకి తిప్పిచూస్తే ఏదో జలపాతం. చల్లని నీళ్ళు మొహం మీద పడ్డాయి. చటుక్కున మెలుకువొచ్చింది.

 

పగటి కలలకి పాటి లేదు. అరచేతి మీద “శ్రీరామ” అని రాసి కళ్ళకద్దుకున్నాను. అంతే!

 

[ఉపసంహారపు చివరితోక:  తెలుగు వారి గోల్డ్ నిబ్బు, విశ్వనాథ గారి ‘జూ’ కధ గుర్తొచ్చిందా? అది చదివాక రాసినదే ఈ కధ. ఆయన కాలిగోరుక్కూడా పనికిరాని వాణ్ణి కనక ఇవే చిట్టెన్ రాజుగారికీ , విశ్వనాథగారికిచ్చే క్షమాపణలు]

 

– ఆర్. శర్మ దంతుర్తి

ఇంకేం చెప్పనూ!

bhuvanachandra (5)

షౌలింగర్ .. దాన్నే’ఘటికాచలం’ అని కూడా అంటారు. మద్రాసు నించి కార్లో ఓ మూడుగంటల ప్రయాణం.. ప్రస్తుత రద్దీలో. మధ్యలో ‘తిరువళ్లూరు’లో ఆగి వీరరాఘవస్వామి దర్శనం కూడా చేసుకోవచ్చు. వీర రాఘవస్వామిని దర్శించడం ఓ అద్భుతమైన అనుభవం. ఆ ఆనందం అనుభవించాల్సిందే కానీ మాటలలో వివరించేది కాదు. పెళ్లికాని వాళ్లు మొక్కుకుంటే పెళ్లవుతుంది. అందుకే ఇక్కడ చిన్న ‘వరుడు’, ‘వధువు’ బొమ్మలు అమ్ముతారు.

షౌలింగర్ లేక షోలింగర్లో రెండు కొండలున్నై. ఒకటి నరసింహస్వామి గుడి, రెండోది ఆంజనేయస్వామిది. నరసింహస్వామిని దర్శించిన తరవాతే ఆంజనేయస్వామిని దర్శించాలి. కోతులకీ,కొండముచ్చులకీ లెక్కలేదు. ఆడవాళ్లు తలలో పువ్వులు పెట్టుకుంటే కోతులు ఆ పువ్వుల్ని లాగేస్తాయ్. అందుకే కొండ ఎక్కేప్పుడు ఓ కర్రని కూడా దుకాణదారులు ఇస్తారు.

నరసింహస్వామి గర్భగుడిలోకి వెళ్ళగానే బ్రాహ్మణులు ఓ పెద్ద ఉద్ధరిణతో మన మొహం మీద తటాల్న నీళ్లు కొడతారు. కొంతమంది భయపడితే కొంతమంది ఉలిక్కిపడతారు. ‘దృష్టిదోషం’ పోతుందిట. ఆ నీరు మన మీద పడితే.

ఇక్కడి ఆంజనేయస్వామికి చాలా ప్రత్యేకతలున్నాయి. ఒకటి.. ఎక్కడా లేని విధంగా యీ ఆంజనేయస్వామికి నాలుగు చేతులు. రెండు అభయహస్తాలతో దీవిస్తుంటారు. ఇంకోటి సాలిగ్రామ మాల ధరించియోగముద్రలో ఉంటారు.

ఈ ఇద్దరు దేవుళ్ల ఫోటోలు ఎక్కడా దొరకవు. కేవలం దర్శించి తరించాల్సిందే . నృసింహస్వామి కొండ దూరం నించి చూస్తే సింహంలాగా కనిపిస్తుంది. ఇక్కడ 1400 మెట్లు. ఆంజనేయస్వామి గుడికి 400 మెట్లు. మెట్లు ఎక్కలేని వాళ్లకోసం ‘డోలీ’ ఏర్పాట్లు కూడ వున్నాయి. ఓ పాతికేళ్ల క్రితం వెళ్ళినప్పుడు ముందు ‘రిక్వెస్ట్’ చేస్తే గానీ ఉదయం ఇడ్లీ కూడా దొరికేది కాదు. ఇప్పుడు చాలా హోటళ్లు వెలిశాయి ( గుడి, కొండల దగ్గర.. ఊళ్ళో అంతకు ముందు హోటళ్లు వున్నై) ఆ రోజుల్లో ‘బస’ సత్రాల్లోనే. ఇపుడు ఏ.సి సౌకర్యాలతో సహా అన్ని హంగులతోనూ ఉండొచ్చు.

మానసిక జబ్బుల్తో బాధపడేవాళ్లని ఇక్కడికి తీసుకొచ్చి మూడు రాత్రులుంచితే ఖచ్చితంగా జబ్బు తగ్గుతుందని ఓ నమ్మకం. చాలా మందికి తగ్గిందని వాళ్ల నోటితోనే విన్నాను.

అక్కడి వాతావరణం చాలా హాయిగా వుంటుంది. శని,ఆదివారాలూ, మంగళవారమూ చాలా రద్దీగా ఉంటూంది. మిగతా రోజులు ప్రశాంతంగా వుంటుందక్కడ. దర్శనం ఉదయం తొమ్మిదింటినించి సాయంత్రం అయిదుగంటలవరకు మాత్రమే..

Image (9) - Copy

కొన్నేళ్ళ క్రితం ఆంజనేయస్వామి కొండ మొదట్లో వున్న ‘ఆర్య వైశ్య సత్రం’ దగ్గర ఓ చిన్న నిట్టాడి పాకలో ‘తాయమ్మ’ కు కనిపించాడంట. తాయి అంటే తమిళంలో ‘అమ్మ’ అని అర్ధం. మన తెలుగులో తాయమ్మ అంటే సుమారుగా అమ్మమ్మ అనుకోవచ్చేమో. మనిషి నలుపేగానీ అద్భుతమైన ‘కళ’. కళ్లు, పలువరుసా మెరుస్తూ మనల్ని ఇట్టే ఆకర్షిస్తాయి.. నవ్వు మొహం.

అప్పట్లో టిఫిన్ కావాలన్నా, ‘ఏర్పాటు’ చేసుకుంటే కానీ దొరికేది కాదని విన్నవించా. మేము అంటే నేనూ, శ్రీ గుత్తా రామ్ సురేష్‌గారి కుటుంబం షోలింగర్ చేరేసరికి చీకటి పడింది. ఆంజనేయస్వామి మెట్లదగ్గర వున్న ఓ చిన్న సత్రం (గుడికి సంబంధించిందే)లో రెండు గదులు తీసుకున్నాం. చాపలు వున్నై. దుప్పట్లూ అవీ మేము తీసికెళ్ళినవే. భోజనం కూడా మేం మద్రాసులోనే ‘పేక్’ చేసుకున్నాం. రాత్రిపూటకి.. చేరగానే ‘పెద్దమర్రి’ కింద వున్న ఓ చిన్న షాపులో ఇడ్లీలు రేపటికి ఏర్పాటు చేయగలవా’? అని ఓనర్ని అడిగితే చేస్తానన్నాడు.

పొద్దున్న లేవగానే నేను ఆ షాపుకి వచ్చాను. షాపు ఓనరు చెప్పాడు. “ఆ పాకలో వుండే ‘తాయమ్మ’ మీకు ఎప్పుడు కావాలంటే అప్పుడు వేడి వేడిగా ఇడ్లీలు, చెట్నీ ఇస్తుంది. వెళ్లి నేను చెప్పానని చెప్పండి” అని.

అక్కడ వున్నది తాయమ్మ పేరు మీద చలామణీ అవుతున్న స్వర్ణకుమారి. నన్ను చూడగానే “రండి! ఇప్పుడు ఇడ్లీ వేసి ఇమ్మంటారా?” అన్నది నవ్వుతూ, అసలు స్వర్ణకుమారిగారు అక్కడుంటుందని నేను ఊహించలేదు. “మిమ్మల్ని నేను గుర్తుపట్టాను. మీరు నన్ను గుర్తుపట్టారా?” అన్నాను. “మీతో పరిచయం చాలా తక్కువ. నిజం చెబితే ఒక్కసారే మీతో మాట్లాడింది. సురేష్‌గారు పరిచయమే.. వారి కుటుంబం కూడా తెల్సు. రామినీడుగారి సినిమాల్లో వేషం కూడా వేసానుగా!” నవ్వింది. ఆ నవ్వులో అదే ‘వెలుగు’.

“మీరు.”అడగబోయి ఆగిపోయా.

“ముందు కూర్చోండి..! చిన్న ప్లాస్టిక్ స్టూలు వేసింది. కూర్చున్నా. అయిదు నిముషాల్లో వొత్తుల స్టౌ(విక్ స్టౌ) మీద పాలు వేడి చేసి ‘ఫిల్టర్’ కాఫీ ఓ కప్పు నాకిచ్చి తనో కప్పు తీసుకుంది. ఆలోగా చుట్టూ చూశా. చిన్న పాక. పొందిగ్గా, పరిశుభ్రంగా వుంది. కాఫీ చాలా బాగుంది. ‘ఫిల్టర్’ కాఫీ రుచి చూడాలంటే మద్రాసులోనే… అది అలవాటు అయ్యాక మరే కాఫీ తాగలేము.

“నా గురించి మీకేం తెలుసూ?” నవ్వి అన్నది.

“సారంగపాణి స్ట్రీట్‌లో మిమ్మల్ని మీ ఇంటినీ చూడ్డమే తప్ప పెద్దగా ‘తరవాతి’ విషయాలు తెలీవు. మీరొక మంచి నటి అని తెలుసు. చాలా సినిమాలు చూశాను మీవి. తరవాత కృష్ణ గానసభలో మీరు శాస్త్రీయ సంగీతం పాడటం తెలుసు. ఇంతమంచి గాయని అయ్యుండీ సినిమాల్లో ఎందుకు పాడలేదా అని అనుకునే వాడిని” చెప్పాను.

“శాస్త్రీయ సంగీతం మా అమ్మ నేర్పితే, నృత్యం మా మేనత్త రాజరాజేశ్వరి నేర్పింది..!”

“రాజరాజేశ్వరి అంటే అలనాటి…?”

“అవును.. గొప్ప స్టేజ్ ఆర్టిస్టు. సినిమాలు కూడా చేశారు.”

“ఓహ్! యీ విషయం ఇప్పటిదాకా నాకు తెలీదు..”

“అన్ని విషయాలూ అందరికీ తెలీదుగా.. అయినా.. ఎవరి జీవితాల్లో వారు బిజీగా వుంటారు. ఇప్పుడు మరీ వేగం.. మీరందరూ మెట్ల దగ్గర దిగినప్పుడు చూశాను. రాత్రి మీరు టిఫిన్ గురించి అడిగారని షాపు శెట్టి చెప్పారు. సరేనన్నాను.” మళ్లీ నవ్వుల వెలుగు.

“ఇక్కడ మీరు..?”

“ఎందుకో అందరి మీదా అన్నిటి మీదా విరక్తి కలిగింది. నా కోసం “కొన్ని క్షణాలైనా” నేను మిగుల్చు కోవాలనిపించింది. అందుకే ఓ రోజు నా నగలు కొన్ని అమ్మేసి ఎవరికీ చెప్పకుండా మద్రాసు విడిచి పెట్టేశాను. చాలా వూళ్లు తిరిగాను. ఇక్కడ ఎందుకో బాగుందనిపించింది. యీ పాక ఉండే చోటులో ఓ ముసలమ్మ వుండేది. చాలా ఏళ్ళనించి ఇక్కడే ఉంటోంది గనక యీ స్థలాన్ని ఆమెకి ఇచ్చారు. నేను వచ్చినప్పుడు నాకు వండి పెట్టింది ఆవిడే. మిగిలినవాళ్లకి నన్ను చుట్టంగా పరిచయం చేసింది. దానితో ఆమె చనిపోయాక దేవుడి వారసత్వంగా యీ చోటు నాకు దక్కింది. (నవ్వు)..”

“మద్రాస్ టీ నగర్‌లో మీ ఇల్లూ, ఇంటిముందు గార్డెనూ ఇవన్నీ..?”

“వాటన్నిటికంటే ఇదే నాకు బాగుంది. విశాలమైన ఇల్లు అక్కర్లేదండీ. విశాలమైన మనసుండలి. నేనెవరో ఈ ఇంటి ముసలమ్మకి తెలీదు. కానీ, తన దగ్గర వుండమని నన్నడిగింది. సరే అన్నాను. నిజంగా నన్ను ఓ తల్లిలా ప్రేమించింది… చాలా ప్రశాంతంగా నా వొళ్ళోనే కళ్లు మూసింది…!” ఆగింది. ఆమె చూపులు కింద పెట్టిన కాఫీ కప్పు మీదున్నా.. మనసక్కడ లేదని క్షణంలో తెలిసిపోయింది. బహుశా మనోనయనాల్తో ఆ వృద్ధురాల్ని చూస్తూ వుండొచ్చు. ముఖంలో నిర్వికారం వున్నది. కొన్ని క్షణాలు గడిచాయి.

“సారీ! ఏవో జ్ఞాపకాల్లోకి జారిపోయాను. సరేలెండి.. ఇంతకీ మీరు టిఫెన్ సంగతి చెప్పలేదు కదూ. వాళ్లు ముగ్గురూ. మీరూ .. ఇంకా డ్రైవరూ.. అంతేగా..!”

“అవును. కానీ వాళ్లని కనుక్కోవాలి. టిఫిన్ దైవదర్శనానికి ముందా, తరవాతా అనే విషయం. ఇంకా టైముందిగా. వాళ్ల స్నానాలవీ కానిచ్చాకే నే స్నానిద్దామనుకుంటున్నాను. మీరు ఏమీ అనుకోకపోతే మరో కప్పు కాఫీ మీరిస్తే తాగాలని వుంది..” అన్నాను.

సమయం ఆరున్నర అంతే.. కొండమీద గనక కొంచం చలి ఉంది. ఆ చిరుచలిలో వేడివేడి ఫిల్టర్ కాఫీ తాగటం ఎంత హాయిగా ఉంటుందో..

“తప్పకుండా . ఇక్కడ దొరికినంత చిక్కని స్వచ్చమైన పాలు మద్రాసులో దొరకవు తెలుసా.. కారణం ఇక్కడి ఆవులు, గేదెలూ మేసేది సహజమైన కొండగడ్డిని. యీ కొండంతా ఔషధ మొక్కలమయం అంటారు. అందుకేనేమో పాల రుచి అద్భుతం..!” మాట్లాడుతూనే వేడిపాలని మళ్ళీ వేడి చేసింది.

“మద్రాసు యిల్లు?” అడిగాను.. “మీకు అభ్యంతరం లేకపోతేనే చెప్పండి సుమా..”

“చెప్తానుగానీ యీ విషయాలు మళ్లీ మీరు సురేష్‌గారికీ, వాళ్ల వాళ్లకీ చెప్పకూడదు..”

“టిఫిన్‌కి వచ్చినప్పుడు వాళ్లు వస్తారుగా.. గుర్తుపట్టి మిమ్మల్ని అడిగితే?”

“అసలు మీరు వొస్తారని నేను వూహించలా. ఊహిస్తే ఆ శేటుతో ముందే చెప్పేదాన్ని. అతన్నే వొచ్చి కాఫీ టిఫెన్లు పట్టికెళ్ళమని. మొత్తానికి మీరు వచ్చేసారు. సరే మాట్లాడుకుంటున్నాం. టిఫిన్ కాఫీలు వాళ్ల దగ్గర చేర్చడం ఇప్పుడు మీ బాధ్యత. మీరు తీసికెళ్ళొచ్చు లేదా శేటుతో చెబితే వాళ్ళబ్బాయికిచ్చి సత్రానికే పంపుతాడు..” నవ్వింది.

“సరేసరే.. ఎవరికీ చెప్పను..” కాఫీ కప్పు మళ్లీ అందుకుంటూ అన్నాను.

“మా అమ్మ ఏనాడూ ‘కులం’ గురించి ఎత్తేది కాదు గనక మాది ఏ కులమో నాకు తెలీదు. ఓ జమీందారుగారు తనని గాంధర్వ వివాహం చేసుకున్నారని ఆ ఇల్లు వారిదేనని మాత్రం చెప్పేది. ఆయన పేరు.. నాయుడుగారు. చాలా పెద్ద జమీందార్. ఆయనకి భార్యా పిల్లలూ వున్నారుట. మా తమ్ముడు పుట్టిన రెండేళ్ళకే ఆయన చనిపోయారు. ఆయన మొహం అంటే మా నాన్నగారి మొహం చాలా కొద్దిగా గుర్తుంది. ఆయన పోయిన తరవాత చాలా గొడవలు జరిగాయి. అవన్నీ అప్పుడు వివరంగా తెలీదు గానీ తరవాత తెలిసింది. మా నాన్నగారి మొదటి భార్యా పిల్లలూ మద్రాసులో ఇంటిని స్వాధీనపరుచుకోవడానికి వచ్చారుట. అప్పుడు రాజరాజేశ్వరిగారి భర్త చాలా సహాయం చేసారని మా అమ్మ చెప్పేది. చనిపోకముందే మద్రాసులో ఇల్లు మా నాన్నగారు అమ్మ పేరిట రాయించి రిజిస్టరు చేయించారట. దాంతో తలదాచుకోవడానికి ఇబ్బంది లేకుండా పోయింది. మా అమ్మ సంగీతం నేర్పుతూ నన్నూ తమ్ముడ్నీ చదివించింది”

“ఎంతవరకు చదివారూ?”

“నేను ఎనిమిదో తరగతిలో వుండగా ‘స్కూలు పిల్ల’లాగా వేయమని ఒక ఆఫరు వచ్చింది. రాజరాజేశ్వరిగారి భర్త మా అమ్మగార్ని ఒప్పించారు. ఆ సినిమాలో నా వేషానికి చాలా పేరొచ్చింది. అది తమిళ సినిమా. ఆ తరవాత వరసగా అలాంటి రోల్సే వచ్చాయి. ‘వద్దు’ అనే పరిస్థితి కాదు మాది. ఇల్లుంది. చాలా పెద్దది. కానీ దాన్ని మెయింటెన్ చెయ్యాలిగా? అదీగాక ఆరోజుల్లో సంగీతం నేర్పినా భోజనం వరకూ ఫరవాలేదుగానీ చదువులకి చాలదుగా..”

“అద్దెకివ్వొచ్చుగా?”

“వచ్చినవాళ్లు ఖాళీ చెయ్యం” అని ఆక్రమిస్తే? రాజరాజేశ్వరిగారి భర్త కుమరేశన్ గారే అద్దెకివ్వొద్దన్నారు. నాకు పద్నాలుగేళ్ళప్పుడు ఆయన రాజరాజేశ్వరిగార్ని పెళ్లి చేసుకుని మా ఇంట్లోనే ఒక పోర్షన్‌కి వచ్చేశారు. అప్పట్నించీ ఆవిడ్ని ‘అత్తా’ అనే పిలిచేదాన్ని. మేనత్తగానే భావించాను. కుమరేశన్‌ని దేవుడిచ్చిన అన్నగా అమ్మ అనుకునేది గనక ఆయన్ని ‘మామా’ అని పిల్చేదాన్ని.

“అలాగా! ఓహ్… తరవాత?”

“తమిళ, తెలుగు, కన్నడ, మళయాళ భాషల్లో సుమారు వంద సినిమాలు నటించా. రాజరాజేశ్వరి అదే అత్త మొదట్లో తెలుగు, తమిళ నాటకాల్లో నటించింది. నేను బిజీ అవడంతో ఆమె సినిమాలు మానేసి నన్ను చూసుకునేది. రోజులు చాలా బాగా నడిచేవి. సడన్‌గా అమ్మ చనిపోయింది. ‘హార్ట్ఎటాక్’ వల్ల అన్నారు. మొత్తం భారం అంతా ఇంటి ఖర్చూ, తమ్ముడి చదువు ఖర్చు నా మీద పడింది. అదృష్టం ఏమంటే నాకు మంచి మంచి వేషాలు.. అంటే ఎక్కువ సిస్టర్ కేరక్టర్లూ, సెకండ్ హీరోయిన్ కేరక్టర్లూ వరసగా వచ్చాయి. దాంతో తమ్ముడి చదువుకి ఇబ్బంది కలగలేదు… నా ఐరవై మూడో ఏట కొంచెం ప్రేమలో కూడా పడ్డాను. అదో మత్తు. అప్పటివరకూ చక్కగా నా పని నేను చూసుకునేదాన్ని కాస్తా ప్రేమలో పడగానే కళ్లు బైర్లు కమ్మాయి. ఇంట్లోంచి వెళ్లిపోయి ఓనాడు నేను ప్రేమించిన మళయాళ నటుడ్ని పెళ్ళాడేశాను గుళ్ళో…! ” మళ్లీ నవ్వు.. ఆ నవ్వులో ఏ భావమూ లేదు..

అన్ని రోడ్లూ రోముకే అన్నట్టు.. సినిమా హీరోయిన్ల ‘ప్రేమ’లన్నీ గుళ్ళో పెళ్ళిళ్ళకే.. కాంటాక్ట్ (లైసెన్స్డ్) పెళ్లిళ్లకే..

“ఆ తరవాత?”

“మీతో వచ్చినవాళ్లు స్నానాలూ అవీ అయిపోయి వుంటై గనక మీరు సత్రానికి పోవటం మంచిది. ఓ పాతిక ఇడ్లీలూ, చెట్నీ, కారప్పొడీ, నెయ్యి ఆ శేటు కొడుక్కిచ్చి పంపిస్తాను. హాయిగా తినేసి దర్శనాలయ్యి సాయంత్రం వరకూ యీ వూళ్లో వుండేటట్లయితే రండి. అప్పుడు చెప్పుకుందాం…”

“మరి.. టిఫిన్లకి..”

“ఓహ్.. డబ్బు సంగతా? నేను ఎవరైనా టిఫిన్లు కావాలని అడిగితే, వారికోసం తయారు చేసి పెట్టేదాన్నే కానీ.. హోటల్ పెట్టినదాన్ని కాదు.. నా దగ్గర ఇంకా కొంత సొమ్ముంది. అదీ అయిపోతే బహుశా హోటల్ పెట్టాల్సి వస్తుందేమో.. ప్రస్తుతానికి కాఫీ టిఫెన్ల వరకూ ఉచితమే…!” పకపకా నవ్వింది. సన్నటి బంగారు గొలుసు తప్ప వేరే ఆభరణాలు ఏమీ కనిపించలేదు. చీర కూడా ఖరీదైనది కాదు. చక్కగా ఉతికిన కాటన్ చీర. అగరువత్తులు వెలుగుతున్నాయి గనక నేను ఇక్కడికి రాకముందే అంటే.. తెల్లవారు ఝామునే స్నానం చేసి వుండాలి. నేను లేచాను. కానీ కథ మధ్యలో ఆగిందన్న చింత వుంది.

“అన్నట్టు రెండు గుళ్లల్లోనూ ప్రసాదాలు దండిగా వుంటాయి గనక దాన్నే మద్యాహ్న భోజనం అనుకోండి. రెండుసార్లు అడిగినా పెడతారు. లడ్డూలూ, అరిసెలూ కొనుక్కుని ఇంటికి తీసికెళ్లొచ్చు” చెప్పిందామె..

శేటుతో చెప్పి సత్రానికి వెళ్లాను. నిజమే.. వాళ్లంతా సిద్ధం. గబగబా స్నానం చేసి నృసింహస్వామిని చూసి, కిందకి దిగేసరికి ఒంటిగంట. కారణం సురేష్‌గారు ప్రత్యేకంగా ‘పూజలు’ చేయించడం.

ప్రసాదాలు గిన్నెల్లో పెట్టేసాం. కిందకి వచ్చి శేఠ్ దగ్గర ఆగాము. ఇడ్లీలు, చెట్నీ, నెయ్యీ, కారప్పొడి రెండు మూడు గిన్నెల కేరేజీల్లో వున్నాయి. ‘రుబ్బి’న పిండేమో.. టిఫిన్ అద్భుతంగా వుంది. వేడి లేకపోయినా..

“వేడివేడిగా పెట్టారండి ఆవిడ. ఎంత బాగున్నాయో.. పది ఇడ్లీలు తిన్నాను..” మాతో కొండపైకి రాని డ్రైవర్ సంబరంగా చెప్పాడు. మేము తింటూ వుంటే..

పాక తలుపు గొళ్ళెం పెట్టి వుంది. అంటే ఆవిడ లేదన్నమాట. ఆంజనేయస్వామి గుడి దర్శించుకుని కింద కొచ్చేసరికి నాలుగు. “ఇవాళ రాత్రి ఇక్కడే వుండిపోతే బాగుంటుంది కదూ..!” అన్నాను. “ఒక నిద్ర చేస్తే చాలు అండీ…” అయినా ప్రిపేర్డ్‌గా రాలేదుగా. మళ్లీ వచ్చే నెల్లో వద్దాం….!” సామాన్లు, అంటే మా దిళ్లూ, దుప్పట్లూ మడతపెడుతూ అన్నారు సురేష్‌గారు.

వాళ్లతో వచ్చినప్పుడు వారి ఇష్టప్రకారమే మనమూ నడుచుకోవాలి గదా.. కార్లో వచ్చేటప్పుడు చూసినా పాక తలుపు మూసే ఉంది.

మద్రాసు చేరేవరకు నా మనసు మనసులో లేదు. కథ మధ్యలో ఆగింది. ఆమెకి విరక్తి కలిగేంతగా అక్కడ ఏమి జరిగి వుండాలీ? మరుసటి రోజునే ఓ కారు మాట్లాడుకుని షోలింగర్ వెళ్లాలని స్థిరంగా నిర్ణయించుకున్నాను.

పొద్దున్నే ‘విజయబాపినీడు’గారింటినించి ఫోను. అర్జంటుగా వచ్చెయ్యమని. నాకు మొట్టమొదట అవకాశం ఇచ్చి ప్రోత్సహించింది శ్రీ విజయబాపినీడుగారే. ‘నాకూ పెళ్ళాం కావాలి” నా మొదటి సినిమా. నన్ను ఆయన దగ్గరకు తీసికెళ్లి పరిచయం చేసింది గుత్తా రామ్ సురేష్‌గారు. గుత్తా రామ్ సురేష్‌గారు నాకు ‘డాక్టరు’గారి దగ్గర పరిచయమయ్యారు. (‘డాక్టరు’గారి ‘కథ’ ఫోటొలతో సహా త్వరలో వ్రాయబోతున్నాను) V.B. దగ్గరకు వెళ్ళాకే తెలిసింది. ‘గ్యాంగ్ లీడర్’ సినిమా సిట్టింగ్‌లో కూర్చోవాలని.

(పాటల రచయితకి స్టోరీ సిటింగ్స్‌తో పెద్దగా సంబంధం ఉండదు. పాట రాసేటప్పుడు పాట ఏ సందర్భంలో వస్తుందో అంతవరకే చెబుతారు. కానీ విజయబాపినీడుగారు ‘నన్ను స్టోరీ సిటింగ్స్‌లో కూడా కూర్చోబెట్టుకునేవారు. నాకు ఎక్కడ సందేహం వచ్చినా, సీను బాగా లేదని అనిపించినా నిర్మొహమాటంగా చెప్పేవాడ్ని. ఒకోసారి ఎలా యితే బాగుంటుందో కూడా నా ఆలోచన చెప్పేవాడ్ని. కఠంతా తెలియడం వల్ల పాటలు కథలో కలిసిపోయేట్టు వ్రాయడానికి వీలయ్యేది. మా యింటి మహారాజూ, ఖైదీ 786, గ్యాంగ్ లీడర్, దొంగ కోళ్లు. ఇంకా ‘బిగ్ బాస్’ , కొడుకులు, ఫ్యామిలీ సినిమా వరకూ అన్నీ కథాచర్చల్లో నేనూ పాల్గొన్నా)

ఆ సిటింగ్స్ జరుగుతూ వుండగానే మా అమ్మగారికి ‘సీరియస్’ అని టెలిగ్రాం వచ్చింది. విజయవాడ చేరేసరికి భయంకరమైన తుఫాను. మొత్తానికి ఎలాగోలా రాజమండ్రి (హాస్పిటల్‌కి) చేరడం, మళ్లీ మద్రాస్ వచ్చిన రోజుకే మా అమ్మగారు ‘పరమపదించడం’ జరగడంతో ‘స్వర్ణకుమారిగారి కథ’ మనసులోనే సమాధి అయిపోయింది. అంటే అసలు గుర్తు రాలేదు. దానికి తోడు గ్యాంగ్ లీడర్ తరవాత ‘బిజీయెస్ట్’ రైటర్నయ్యాను.

ఆ తరవాత ‘ఘరానా మొగుడు’తో రోజుకి పద్ధెనిమిది గంటలు పని చెయ్యాల్సి వచ్చేది. సరే అది వేరే కథ.

నాలుగైదేళ్ల తరవాత మళ్లీ షోలింగర్ వెళ్లాం. అప్పుడు గుర్తొచ్చింది స్వర్ణకుమారిగారు. తీరా వెడితే ఆ పాక స్థానంలో ‘రెస్టారెంట్’ కట్టబడి వుంది. శేట్‌ని అడిగితే ‘తాయమ్మ’ని ఖాళీ చేయించడంతో (ఇల్లు) ఆమె వూరు వదిలి వెళ్ళిపోయిందని చెప్పాడు. నా మనసులో ఒక శూన్యం.

చెన్నై తిరిగి వెళ్లాక సారంగపాణి స్ట్రీట్‌కి వెళ్లాను. నాకు బాగా పరిచయమూ, స్నేహమూ వున్న ఓ ప్రొడక్షన్ మేనేజర్‌తో స్వర్ణకుమారిగారి ఇల్లు ‘కుమరేశన్’గారు ఓ కన్నడ ప్రొడ్యూసర్‌గారికి అమ్మేశాడని తెలిసింది. నాకు షాక్. స్వర్ణకుమారి ఆస్థిని పోనీ స్వర్ణకుమారి వాళ్ల తమ్ముడి ఆస్థిని కుమరేశన్ ఎలా అమ్మాడూ?? అతనికి ఏం అధికారం వుందీ?

‘కుమరేశన్’గురించి ఎంక్వైరీ చేస్తే అతను కుంభకోణం దగ్గర వుండే వాళ్ల స్వంత వూరికి వెళ్లిపోయాడని అతి కష్టం మీద తెలిసింది. స్వర్ణకుమారి తమ్ముడేమయ్యాడో తెలీదు. కనీసం అతని పేరు కూడా నాకు తెలీదు. కనుక్కునేదెట్టా? కొన్నేళ్ళు గడిచాయి.

చాలా మార్పులు.. చలన చిత్ర పరిశ్రమ హైదరాబాదుకి తరలింది. నేను హైద్రాబాదు, చెన్నైల మధ్య తిరుగుతున్నాను. ఇ.వి.వి.గారి ‘కన్యాదానం’ సినిమాకి పాట వ్రాయడానికి హైద్రాబాద్ వెళ్లాల్సి వచ్చింది. బేగంపేట ఏర్‌పోర్ట్‌లో దిగాక నన్ను లోకేషన్‌కి తీసికెళ్లారు. అక్కడినించి నా ‘బస’కి చేరాను. అదో గెస్ట్ హౌసు. పాట ఫస్టు వెర్షను పూర్తి చేసి గేప్ ఇవ్వాలనుకుని కాసేపు బైటికొచ్చి తిరుగుతుంటే శ్రీమూర్తి కనిపించాడు. అతను నాకు చెన్నైలో పరిచయం. టి.నగర్‌లో వుండేవాడు.

“గురూగారూ… బాగున్నారా? హైద్రాబాదు షిఫ్ట్ కాకుండా మంచి పని చేశారండి..!” అన్నాడు. ఆ రోజుల్లో మద్రాసు నించి హైద్రాబాద్ పని మీద వెళ్లినవాళ్లలో అక్కడికి ఆల్రెడీ షిఫ్ట్ అయినవాళ్లు అలాగే అనేవాళ్ళూ.

“మీరేం చేస్తున్నారూ? ఎక్కడుంటున్నారూ?” అడిగాను.

“అక్కడయితే బాగా ‘కింగ్’లా వుండేవాడ్నండి. అదేనండి. స్వర్ణకుమారిగారి దగ్గర. ఇక్కడికొచ్చాక రోజుకి ఒకళ్ల దగ్గర..”నిట్టూర్చాడు.

“స్వర్ణకుమారిగారి దగ్గరా?”ఆశ్చర్యంగా అడిగాను. వాళింటి ముందునించి వెళ్తూ వుండటమేగానీ ఆ రోజుల్లో శ్రీమూర్తిని అక్కడ చూడలేదు.

“అవునండీ! ఆవిడ ఫీల్డులోకి వచ్చినప్పట్నించీ ‘టచప్’ (Touch-up)బాయ్‌గా మొదలెట్టి మేకప్‌మేన్‌గా ఆవిడ దగ్గర ఎదిగానండి. భద్రయ్యగారు నేర్పారండి..” గొప్పగా అన్నాడు. భద్రయ్యగారి శిష్యులకి ఆ గర్వం వుండటం అసహజమేమీ కాదు.

“అసలావిడ ఎక్కడికెళ్లారూ? ఎందుకెళ్లిపోయారూ?” అడిగాను. స్వర్ణకుమారిని చూసినట్టు చెప్పలేదు.

“అదో పెద్ద కథండి. కసాయివాడ్ని గొర్రె నమ్మినట్టు ఆ కుమరేశంగాడ్ని స్వర్ణకుమారి అమ్మగారు నమ్మారండి. కుమరేశన్, జమిందారుగారి దగ్గర మేనేజర్‌గా కాదు గానీ పనివాడుగా, అంటే చనువున్న పనివాడుగా వుండేవాడండి. నేనప్పుడు భద్రయ్యగారి ఇంటిదగ్గరే వుండేవాడ్నండి. జమిందారుగారు పోయాక, స్వర్ణమ్మగారి అమ్మగారికి సహాయం చేస్తున్నట్టుగా వుండేవాడండి. ఆవిడ ఉత్త వెర్రిబాగుల్దండి. ఆవిడా, ఆవిడ పిల్లలూ సంగీతమూ తప్ప ఏదీ పట్టించుకునేది గాదండి. ఆ పిల్ల చదువుకునేటప్పుడు తల్లి హార్ట్ ఎటాక్‌తో చచ్చిపోయిందన్నారండి. నాకైతే నమ్మకం లేదండి. కుమరేశన్ అంతకు రెండు మూడేళ్ళ ముందే రాజరాజేశ్వరి అనే ఆవిడ్ని పెళ్లి చేసుకుని, స్వర్ణమ్మగారింట్ళోనే ఓ పోర్షన్‌లోనే దిగాడండి. ఆ రాజమ్మగారూ మంచి మనిషేనండి. స్వర్ణమ్మగారు బిజీ అయ్యాక రాజమ్మగారు సినిమాలు మానేసి ఇంట్ళో వుండేదండి. స్వర్ణమ్మ దగ్గర నన్ను టచ్చప్‌గా పెట్టిందీ, మేకప్ మేన్నీ చేసిందీ భద్రయ్యగారేనండి..!”

“ఆ తరవాత?” అడిగాను.

“తమ్ముడు బియ్యే చదువైతుండగా, ఆ స్వర్ణమ్మగారు ప్రేమలో పడిందండీ. అయితే కుమరేశన్‌గారు చాలా తెలివిగా ‘వెళ్లిపో’ కానీ, నీ ఆస్తి మాత్రం మీ తమ్ముడి పేరు మీద రాసి వెళ్ళు.. ఎందుకంటే ఒకవేళ ఆ మళయాళంగాడు నిన్ను తన్ని తగలేసినా కనీసం మీ అమ్మ ఆస్తి నీకు బతకడానికి ఊపయోగపడుతుందీ అని చెప్పాడండి. ఆ రోజుల్లో మేమందరం కుమరేశన్ దేవుడిలాంటోడు అనుకునేవాళ్ళమండి. ఆయన చెప్పింది సబబుగానే అప్పుడూ అనిపించిందండి. స్వర్ణమ్మకూడ మాట్లాడకుండా ఎక్కడ సంతకం పెట్టమంటే అక్కడ సంతకం పెట్టిందండి. స్వర్ణమ్మగారి తమ్ముడి పేరు ‘ధనుంజయ’ అండీ. డిగ్రీ కాగానే పాపం ఆ పిల్లాడికి తన చుట్టాన్నే ఎక్కడ్నించో తీసుకొచ్చి పెళ్లి చేశాడండీ… కుమరేశన్..!” ఆగాడు శ్రీమూర్తి.

ఏవో మబ్బులు విడిపోయి మళ్ళీ ముసురుకుంటున్నట్లనిపించింది..

“స్వర్ణమ్మ వెనక్కి రాలేదా?”

” ఆ విషయం మాత్రం అసలు తెలీదండి. అది కుమరేశన్ గాడికే తెలియాలండి. పిల్లాడి పెళ్లయిన మూడ్నెల్లకే రాజేశ్వరమ్మకి ‘క్షయ’ జబ్బు వచ్చిందండి. ఆవిడ్ని రాయవెల్లూరులో చేర్చారండి…!!”

” ఊ తరవాత?”

“నిజం నాకు తెలీదండి. అబద్ధం చెబితే పాపం వస్తాదంటారు కదండీ…”

“నిజం చెప్పండి మూర్తీ..”

” ఆ కుర్రాడు ఎక్కడికెళ్లాడో ఎవరికీ తెలీదండి. ఆ పిల్లాడికిచ్చి చేసిన అమ్మాయికీ కుమరేశన్‌కీ సంబంధం వుండటం చూసి ఆ పిల్లాడు ఇల్లొదిలి పోయాడని పనిమనిషి ఓ రోజున నాతో అన్నదండీ..”

సైలెంటైపోయాను.

“మరి ఆస్తి?”

“స్వర్ణమ్మ చేతే నీతులు చెబుతూ నమ్మించి సంతకాలు పెట్టించిన వాడికి, ఆ కుర్రోడి చేత సంతకాలు పెట్టించుకోవడం ఎంతసేపండీ? వాడు ఆ యిల్లు ఓ కన్నడపు ఆయనకి అమ్మడం నాకు తెలుసండీ…!” వివరించాడు శ్రీమూర్తి.

” ఆ తరవాత?”

“నాకు ఏమె తెలీదండి. ఆ అమ్మాయి ఏమయిందో, ఆ బాబు ఏమైపోయాడో ఏమీ తెలీదు. కుమరేశన్‌గాడు మాత్రం లక్షలు దండుకున్నాడండీ ఆ ఇల్లు అమ్మి.. నాకు తెల్సింది అంతేనండి..!”

ఓ నిట్టూర్పు ఒకేసారి వెలువడింది. ఇద్దర్ని దగ్గర్నించీ..

డిసెంబరు (2013)లో విజయవాడలో రెండు రోజులు వున్నాను. శ్రీశ్రీ ప్రింటర్స్ విశ్వేశ్వర్రావు (నాకు 35 సంవత్సరాలనుంచి స్నేహితులు)గార్ని కలిసి, అక్కడే జలదం ప్రభాకర్ (నది .. ఎడిటర్)గార్ని కలిసి చాలా సేపు ఖబుర్లు చెప్పుకుని మళ్లీ నా హోటల్‌కి బయలుదేరుతూ మధ్యలో ఒక చోట ఆగాను… ఓ చిన్న పనుండి..

విజయవాడలో లెక్కకి మించిన స్నేహితులున్నారు. ఒకతనికి వొంట్లో కొంచెం సుస్తీగా వుందని తెలిసి చూడ్డానికి వెళ్ళానన్నమాట. చూసి వస్తుండగా పరిచయమైన ‘గొంతు’ వినిపించింది. ఆ గొంతే.. స్వర్ణకుమారిగారిది.

ఆ పాత పెంకుటింటి ముందు ఆగి.. “తాయమ్మా” అని పిలిచినాను. ఆమె బయటికొచ్చింది. వయసు తెచ్చిన చిన్న చిన్న మార్పులే తప్ప పెద్ద మార్పులేం లేవు. “ఆఖరికి వచ్చారన్నమాట…!” నవ్వింది. అదే నవ్వు… అంతే మధురంగా “గుర్తుపట్టారా?” అన్నాను.

“మిమ్మల్ని ఆ మధ్య లిటిల్ చాంప్స్. అదే జీ తెలుగు చానల్లో ప్రతీవారమూ చూశాను గనక గుర్తుపట్టకేం. అదీగాక మీది మరిచిపోయే పేరా?” మళ్లీ నవ్వింది.

‘నవ్వడం దేవుడు మనిషికి ఇచ్చిన వరం’ అని మరిచిపోయిన వాళ్లకి, స్వర్ణకుమారిని పరిచయం చెయ్యాలనిపించింది. లోకంలో కొందరు ‘నిరాశా అగరుబత్తీలు’ ఉంటారు. ఎప్పుడూ నిట్టూరుస్తూ ప్రపంచంలోని బాధలన్నింటినీ భరిస్తూ భారంగా జీవితాన్ని లాగుతూ వుంటారు. మనిషి కనపడంగానే వాళ్ల బాధని వెళ్లగక్కేస్తారు. చెప్పినవాడు బాగానే వుంటాడు గానీ, విన్నావాడికి ఉత్సాహం చచ్చిపోయి నిరాశలో మునిగిపోతాడు. కొందరు ఎంత బాధలో వున్నా సరే అది బయటపడనివ్వక ‘ఆశ’నీ, సంతోషాన్నీ పంచేవారైతే, కొందరు నిరంతరం నిరాశని మాత్రమే వెళ్లగక్కే జీవులు.

స్వర్ణకుమారి నిజంగా ‘ఆశా బ్రాండ్ అగర్‌బత్తీ’. ఆశల సువాసనని వెదజలుతూ వుండే నిజమైన మనిషి.

“లోపలికి రానివ్వరా?” నవ్వి అడిగాను.

“బాధపడతారు..!”

“పడను..!”

“అయితే రండి..!” పక్కకి తప్పుకుంది. లోపలికి అడుగుపెట్టాను. అంతా శుభ్రంగా వుంది. కానీ మంచం మీద ఒకామె శరీరం తొడిగిన అస్థిపంజరంలా వుంది.

“ఈమె రాజరాజేశ్వరి. నా మేనత్త. కొంచెం సుస్తీగా వుంది. త్వరలోనే కోలుకుంటుందని డాక్టర్సు అన్నారు. చంద్రగారూ, ఈమె నాకు నృత్యం నేర్పిన గురువు,.. మంచి నటి కూడా..!” పరిచయం చేసింది. కళ్లు చెమర్చాయి. ఆవిడ కష్టం మీద రెండు చేతులూ ఎత్తింది. నేనూ చేతులు జోడించాను.

“ఫిల్టర్ కాఫీ ఇద్దునుగానీ .. ఇది సమయం కాదు.. సరే.. కొంచెం బయటకు వెళ్లాల్సిన పని వుంది. కూడా వస్తారా..!! ” అంటూ బయటికొచ్చింది.

నేనూ మరోసారి రాజేశ్వరిగారికి నమస్కారం చేసి బయటికొచ్చాను.

“ఏమీ లేదు.. మీరేమో గతాన్ని గురించి ప్రశ్నిస్తే తను ‘భోరు’మంటుందని బయటికి లాక్కొచ్చాను.” అన్నది.

“ఏం చేస్తున్నారూ?”

“నేను టైలర్నయ్యానండోయ్.. అదీ సూపర్ టైలర్ని. జాకెట్టుకి నూటయాగ్భై తీసుకుంటున్నాను. షాపు కూడా పెట్టాలెండి..” పకపకా నవ్వింది.

“రాజరాజేశ్వరిగార్ని…”

“ప్రస్తుతం నేనే చూసుకుంటున్నాను. గతాన్ని నేను మర్చిపోయినా పాపం తను మర్చిపోలేకపోతోంది… సరే.. గతాన్ని భోంచెయ్యడం ఎందుకూ? ప్రస్తుతం ఆమె “షుగర్’తో నీరసించిపోయింది. బతుకుతుందనే నమ్మకం నాకు వుంది. మనిషి ఆశాజీవి కదా…! ఒకవేళ బతకలేదనుకోండి..”సరే ఆమెకి అన్ని బంధాలనించీ ‘విముక్తి’ లభిస్తుంది. ఏదైతేనేం..” నిశ్చలమైన మనస్సుతో అన్నది స్వర్ణకుమారి.

“మీరేమీ అనుకోకపోతే ఒక్క కాఫీ తాగుదామా!” అడిగాను.

“దానికేం భాగ్యం…!”

“రోడ్డుపక్కనే వున్న ఓ ఫాస్టు ఫుడ్ సెంటర్ దగ్గర ఆగి అక్కడున్న ప్లాస్టిక్ స్టూల్స్ మీద కూర్చుని కాఫీ తాగాము.

ఏ ప్రశ్నా అడగాలనిపించలేదు. ప్రశ్నలు లేవు. మనసు చాలా ప్రశాంతంగా అనిపించింది.

“చంద్రగారూ. మీరోసారి లిటిల్ చాంప్స్‌లో అన్నారు. “వై కలెక్ట్ వెన్ యూ కెనాట్ కేరీ” అని! నాకా మాట చాలా నచ్చింది. ఏం తీసుకుపోతామని పోగు చేసుకోవాలీ? ఆఖరికి అనుభవాలతో సహా…!” నా వంక చూస్తూ నవ్వింది.

ఇంకేం చెప్పనూ!

 

‘స్వర్ణకుమారి’ కథ రాస్తున్నంతసేపూ ఒళ్ళు పులకరిస్తూనే వుంది. లోకంలో జీవితాన్ని ఎలా జీవించాలో నేర్పేవాళ్లూ ఉంటారని తెలీటం లేదూ…!

 

శుభాకాంక్షలతో

భువనచంద్ర

అత్తా-కోడళ్ళ వారసత్వం

Kalluri Bhaskaram-pic-a.prabhakar rao (5)

ఇంకో కోణం నుంచి చూద్దాం…

ద్రౌపది పాండవులు అయిదుగురినీ పెళ్లి చేసుకోవాలా, వద్దా అనేది నిర్ణయించవలసింది ఎవరు?

స్వయంవరంలో ద్రౌపది వరించిన అర్జునుడా? కాదు. పాండవ జ్యేష్ఠుడు ధర్మరాజా? కాదు. ద్రౌపది తండ్రి ద్రుపదుడా? కాదు. వ్యాసుడా? కానే కాదు…

ఆ నిర్ణయం తీసుకోవలసింది నిజానికి ఇటు కుంతి! అటు ద్రౌపది!

కథకుడు ఏంచేస్తున్నాడంటే, నిజంగా నిర్ణయాధికారం ఉన్న వీరిద్దరినీ పక్కకు తప్పిస్తున్నాడు. మౌనమూర్తులుగా నిలబెడుతున్నాడు. ఏవిధంగానూ నిర్ణయాధికారం లేని పాత్రల చేతికి ఆ అధికారాన్ని అప్పగిస్తున్నాడు. అందుకు సంబంధించిన ధర్మమీమాంసలో వారిని భాగస్వాములను చేస్తున్నాడు. ఈ వివాహానికి వారిచేత ఆమోదముద్ర వేయిస్తున్నాడు. ఇంకొంచెం స్పష్టంగా చెప్పాలంటే, స్త్రీ చేతిలో ఉన్న అధికారాన్ని పురుషుడికి అప్పజెబుతున్నాడు. అనగా, వ్యవస్థనే ఉద్దేశపూర్వకంగానూ, వ్యూహాత్మకంగానూ తలకిందులు చేస్తున్నాడు.

అయితే, ఇంతకుముందు అనేకసార్లు చెప్పుకున్నట్టు వ్యవస్థను తలకిందులు చేయడం అనే ఈ పనిని అతడు రాతితో గోడకట్టినట్టుగా చేయడం లేదు. వదులు వదులుగా చేస్తున్నాడు. తను వ్యవస్థను తలకిందులు చేస్తున్న సంగతి తెలిసిపోయేలా మధ్య మధ్య క్లూలు విడిచిపెడుతూ చేస్తున్నాడు. అది కథానిర్మాణ దక్షత పలచబారడం వల్ల కావచ్చు, లేదా వెనకటి వ్యవస్థ గురించిన అవశేషాలను సూచించడం అనివార్యమయ్యీ కావచ్చు…

అసలు ‘స్వయంవరం’ అనే మాటే చూడండి. ఆ మాటను వాస్తవికార్థంలో తీసుకుంటే ఒక స్త్రీ, పురుషుణ్ణి తనకు తానుగా వరించడం గురించి చెబుతుంది. అంటే, ఎవరిని భర్తగా వరించాలన్నది స్త్రీకి గల సంపూర్ణ స్వయంనిర్ణయాధికారం. ఇందులో ఇతర పురుషులకు ఎలాంటి పాత్రా లేదు. మనం ఇంతకుముందు ఒకసారి చెప్పుకున్న ఐరిష్ కథలో ఈ స్వయంవర లక్షణం మరింత స్పష్టార్థంలో కనిపిస్తుంది. ఆ కథలో మీవే అనే రాచకూతురు అయిలిల్ అనే రాకుమారుని స్వయంవరంలో తనే వరించింది తప్ప అతడు ఆమెను వరించలేదు. ఆ విషయం మీవే అతనితో స్పష్టంగా అంటుంది కూడా. అంతేకాదు, ఇంకా అనేక విషయాలలో మీవే తన మాతృస్వామిక హక్కును, స్వేచ్ఛను నొక్కి చెబుతుంది.

అయితే, ప్రస్తుత సందర్భంలో కథకుడు ‘స్వయంవరం’ అంటూనే ద్రౌపదిని ఒక మరబొమ్మగా మార్చిన సంగతి తెలిసిపోతూనే ఉంది. ఆమెతో అర్జునుని మెడలో దండవేయించి, ఆ తర్వాత ఆమె పాత్ర ఏమీ లేనట్టు పక్కన పెట్టేశాడు. అలాగే, పాండవులు అయిదుగురినీ పెళ్లాడాలా వద్దా అనే విషయంలో ఆమెకు గల నిర్ణయాధికారాన్ని కాస్తా తీసుకెళ్లి ధర్మరాజు, ద్రుపదుడు, వ్యాసుల చేతుల్లో పెట్టాడు.

ఈరోజున మనకు బాగా అర్థమయ్యే ఒక పోలికతో ఈ పరిస్థితిని చెప్పుకుందాం. నేటి ప్రజాస్వామిక భారత రాజ్యాంగం ఎన్నికలలో దళితుల వంటి బలహీనవర్గాలకు, స్త్రీలకు కొన్ని స్థానాలు రిజర్వు చేసింది. ఒక మహిళ, గ్రామ సర్పంచి కావచ్చు; ఎమ్మెల్యేగానో, ఎంపీగానో ఎన్నిక కావచ్చు; మంత్రిగా నియమితురాలు కావచ్చు. అయితే ఈ పదవులూ, నియామకాలు చాలా సందర్భాలలో కేవలం సాంకేతికంగా మారి, వారు ఉత్సవవిగ్రహాలుగా మిగిలిపోతారు. గ్రామంలోని మోతుబరులో, ఇతర సందర్భాలలో భర్తో ఆమెను కీలుబొమ్మగా మార్చి వ్యవహారాలను తామే చక్కబెడుతూ ఉంటారు.

ద్రౌపది విషయంలో కూడా మనకు ఇదే కనిపిస్తుంది. స్వయంవరం అనేది వెనకటి వ్యవస్థకు చెందిన ఒక ప్రక్రియ. ఒక దశలో అది లాంఛనంగా మారిపోయింది. కనుక ఆ లాంఛనాన్ని పాటిస్తూ ద్రౌపదికి స్వయంవర హక్కును, అంటే, తన వివాహం విషయంలో స్వయం నిర్ణయాధికారాన్ని ఇచ్చినట్టే ఇవ్వాలి, మళ్ళీ ఆ హక్కును ఆమె నుంచి తీసేసుకుని పురుషుడికి అప్పగించాలి!

ఇక్కడ కథకుడు చేసింది అదే.

కుంతి విషయానికి వద్దాం. తన కొడుకులు అయిదుగురూ ద్రౌపదిని పెళ్లి చేసుకోవాలా, వద్దా అనే విషయంలో సంపూర్ణ నిర్ణయాధికారం ఆమెదే! అది ఆమె అత్తగారు అంబాలిక(పాండురాజు తల్లి)నుంచి, తన అత్తకు అత్త అయిన సత్యవతి నుంచి సంక్రమించిన మాతృస్వామిక హక్కు. ద్రౌపదికి అత్తగా తనూ, కోడలిగా ద్రౌపదీ కూడబలుక్కుని అమలు చేయవలసిన స్త్రీహక్కు. ఇందులో పాండవులకు, ద్రుపదుడికి, వ్యాసుడికి ఎలాంటి నిర్ణయాధికారమూ లేదు.

mbx_xtra_draupadi_by_nisachar-d56baz1

సత్యవతి తన మాతృస్వామిక హక్కును కోడళ్ళు అయిన అంబిక, అంబాలికాలతో ఎలా అమలు చేయించిందో తెలిసినదే. కొడుకైన విచిత్రవీర్యుడు చనిపోయి, కురువంశం నిర్వంశమయ్యే పరిస్థితిలో ఆమె తన మాతృస్వామిక నిర్ణయాధికారాన్ని పూర్తిగా తన చేతుల్లోకి తీసుకుంది. అప్పుడే, తమ్ముడి భార్యలైన అంబిక, అంబాలికలను చేపట్టి వారితో సంతానం కనమని తన సవతి కొడుకు భీష్మునితో చెప్పింది. భీష్ముడు నిరాకరించడంతో పరాశరునివల్ల తనకు కలిగిన వ్యాసుని అందుకు నియోగించింది. ఆ సందర్భంలో,‘కొడుకును ఆదేశించే అధికారం తండ్రికి ఎలా ఉంటుందో తల్లికీ అలాగే ఉంటుం’దని కూడా నొక్కి చెప్పి తన హక్కును స్థాపించుకోడానికి ప్రయత్నించింది.

సత్యవతి…అంబిక, అంబాలిక…కుంతి…ద్రౌపది..! ఇదీ వరుసక్రమం!

ఈ అత్తా-కోడళ్ళ క్రమాన్ని ఒకసారి కళ్ళముందు నిలుపుకుని చూడండి. చూసినప్పుడు వీరి మధ్య మీకు ఎన్నో సారూప్యాలు, సమానధర్మాలు కనిపిస్తాయి. ఒక స్పష్టమైన, తమవైన హక్కులు కలిగిన ఒక అత్తా-కోడళ్ళ వారసత్వక్రమం కనిపిస్తుంది. ఒక అవిచ్ఛిన్న మాతృస్వామిక వారసత్వానికి వీరు ప్రాతినిధ్యం వహిస్తున్న సంగతి అర్థమవుతుంది. అయితే అలా అర్థమవడం కథకుని ప్రయోజనాలకు పనికొచ్చేది కాదు. కనుక ఈ వారసత్వ క్రమంవైపు మన చూపు మళ్ళకుండా అతడు యథాశక్తి ప్రయత్నిస్తాడు. వీరిమధ్య పురుషస్వామ్యం తాలూకు విలువలను, పురుషుల పాత్రలను తెచ్చిపెట్టి, చర్చను వాళ్ళ మధ్యనే కేంద్రీకృతం చేసి విషయాన్ని కలగాపులగం చేస్తాడు. గంద్రగోళం సృష్టిస్తాడు. మన కళ్ళముందు గారడీ చేస్తాడు. అయితే, విచిత్రం, అది తగినంత శిక్షణ లోపించిన గారడీగా పరిణమిస్తుంది.

పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడే విషయంలో నిర్ణయాధికారం కుంతిదేననీ ఒకవైపు కథకుడు సూచిస్తూనే ఉన్నాడు. భిక్ష తెచ్చామని భీమార్జునులు అనగానే, దానిని అయిదుగురూ ఉపయోగించుకోండని కుంతి ఏమాత్రం తడుముకోకుండా వెంటనే అనేసింది. అంటే అప్పటికప్పుడు తన నిర్ణయాన్ని ప్రకటించేసిందన్నమాట.

ఆ తర్వాత, అంతమంది పురుషులూ కలసి ధర్మనిర్ణయం పేరుతో తలబద్దలు కొట్టుకోవలసిన అవసరమే లేదు. కానీ కథకుడు ఆ విధంగా మాతృస్వామిక అవశేషమైన ఆ నిర్ణయాన్ని కుంతి నోటితో ప్రకటింపజేస్తూనే, ఆ తర్వాత తన పని మొదలుపెడుతున్నాడు. అదేమిటంటే, కుంతి మాటల్లో కనిపిస్తున్న మాతృస్వామ్య అవశేషం మన దృష్టికి రాకుండా చేయడం, ద్రౌపది వివాహాన్ని పురుషస్వామ్యానికి అనుకూలంగా మలచడం! ఆ ప్రయత్నంలో భాగంగానే, భీమార్జునులు ద్రౌపదిని తెచ్చిన సంగతి తెలియక, రోజూలానే ఆహారాన్ని యాచించి తెచ్చారనుకుని పొరబడి కుంతి అలా అన్నట్టు చిత్రిస్తున్నాడు. ఆ చిత్రణ ఇసుకగూడులా ఎలా పరిణమించిందో ఇంతకు ముందు చెప్పుకున్నాం.

కిందటి వ్యాసంలో ఇంకో ముఖ్యమైన వివరం నా చూపుల్ని తప్పించుకుంది. పాండవులు ద్రౌపది స్వయమవరానికి వెడతారనే కాదు, ఆ అయిదుగురూ ద్రౌపదిని పెళ్లాడతారని కూడా కుంతికి తెలుసు. వ్యాసుడు పాండవులకు ఎదురై చెప్పిన ద్రౌపది జన్మవృత్తాంతంలో ఆ సూచన ఉంది, చూడండి.

భీమార్జునులు ద్రౌపది అనే భిక్ష తెచ్చామని అనగానే కుంతి అయిదుగురినీ ఉపయోగించుకోమని అందంటే, ఊరికే అనలేదు. ఈ మాటను కేవలం తల్లి మాటను కొడుకులు గౌరవించాలనే సాధారణార్థంలో తీసుకోకూడదు. వాస్తవంగా ఈ మాట ద్వారా కుంతి కొడుకులను ఆదేశించే తన మాతృస్వామిక అధికారాన్ని చెలాయిస్తోంది. ఇది శాస్త్రనిబంధన లాంటిదే. ఎందుకంటే, పాండవులకు కుంతి తల్లి మాత్రమే కాదు, యజమానురాలు కూడా. తండ్రి కుటుంబానికి ఎలా యజమానో అలా అన్నమాట. తండ్రి మాటను కొడుకులు ఎలా పాటించాలో ఇక్కడ తల్లి మాటను అలాగే పాటించితీరవలసిందే.

ఒక ఉదాహరణ చూడండి…ఏకచక్రపురంలోని తమ ఇంటికి వచ్చిన బ్రాహ్మణుడు ద్రౌపది స్వయంవరం గురించి చెప్పినప్పుడు, ద్రుపదనగరానికి వెళ్లాలన్న నిర్ణయాన్ని పెద్దకొడుకుగా ధర్మరాజు తీసుకోలేదు. కొడుకుల అభిప్రాయాన్ని గమనించి, ద్రుపదనగరానికి వెడదామని కుంతే అంది. అప్పుడు ‘నువ్వు ఆదేశించినట్టే చేద్దా’మని పాండవులు అని తల్లితో కలసి ద్రుపదనగరానికి బయలుదేరారు. భిక్ష తెచ్చామని అనగానే అయిదుగురినీ ఉపయోగించుకోమని అనడం కూడా అలాంటిదే. ఆ తర్వాత ద్రౌపది వివాహంపై ద్రుపద, వ్యాసులతో జరిగిన చర్చలో ‘గురువులలోనే పరమ గురువు అయిన మా తల్లి చెప్పింది కనుక’ ద్రౌపదిని మేము అయిదుగురమూ పెళ్లాడవలసిందే’ నని ధర్మరాజు నొక్కి చెప్పాడు.

కనుక ఆ ఇంటికి యజమాని ధర్మరాజు కాదు, కుంతి! ద్రౌపది వివాహాన్ని ఎంతగా పురుషస్వామ్యానికి నప్పించడానికి ప్రయత్నించినా, కుంతే ఆ కుటుంబానికి యజమానురాలన్న మాతృస్వామిక ధర్మాన్ని కథకుడు దాచలేకపోయాడు. ఇక్కడ తల్లీ-కొడుకుల సంబంధాన్ని సాధారణార్థంలో(తల్లి పెద్దరికం, పూజనీయత వగైరా) తీసుకున్నారంటే పొరబడినట్టే. ఎందుకంటే, ఆ కుటుంబానికి ధర్మరాజు యజమాని కాకపోవడం, కుంతి యజమానురాలు కావడం పైకి కనిపించేటంత ఆషామాషీ విషయం కాదు. అది ఒకవిధంగా శాస్త్రసంబంధమైన నిష్కర్ష!

కుటుంబ సంబంధాలు గీత గీసినట్టు సప్రామాణికంగా ఉండవలసిన ఆనాటి దశ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. వాటిలో ఆషామాషీని, అమాయకత్వాన్ని ఊహించడమే అసాధ్యం. కుటుంబ యాజమాన్యంపై తల్లీ-కొడుకుల మధ్య పోటీ ముగిసి, యాజమాన్యం కొడుకుకి బదిలీ అయిన పురుషస్వామ్యం తాలూకు నిబంధనలనుంచి చూస్తే ఈ విషయం మనకు బాగా అర్థమవుతుంది. పురుషస్వామ్యాన్ని నొక్కి చెప్పడమే ఒకానొక ముఖ్య లక్ష్యంగా అవతరించిన రామాయణాన్నే తీసుకోండి. యాజమాన్య కోణం నుంచే చూసినప్పుడు, రామాయణ కథ మొత్తానికి ‘పితృవాక్య పరిపాలనే’ కీలకం. అలాగే, తండ్రి తర్వాత పెద్ద కొడుకే యజమాని. రాముడు-ఆయన సోదరుల సంబంధంలో అదే కనిపిస్తుంది.

అంటే ఏమిటన్న మాట? మాతృస్వామిక వ్యవస్థలో యజమానురాలైన కుంతి ఆదేశాన్ని శిరసావహించి పాండవులు అయిదుగురూ ద్రౌపదిని వివాహమాడారు! పితృస్వామిక వ్యవస్థలో యజమాని అయిన తండ్రి దశరథుని ఆదేశాన్ని శిరసావహించి రాముడు అడవికి వెళ్ళాడు! ఈ రెండు ఉదాహరణాలూ వ్యవస్థలు ఎలా తలకిందులయ్యాయో సూత్రప్రాయంగా చెబుతాయి.

ఇంకా కావాలంటే పితృస్వామిక వ్యవస్థలో స్త్రీ స్థానం ఏమిటో సందేహాతీతంగా చెబుతున్న మనుస్మృతిలోని మాటలే చూడండి. మనుస్మృతిలోని పంచమాధ్యాయంలో ‘స్త్రీధర్మములు’ అనే శీర్షిక కింద ఉన్న రెండు శ్లోకాలు ఇలా చెబుతున్నాయి:

బాలయా వా యువత్యా వా వృద్ధయా వాzపి యోషితా

న స్వాతంత్ర్యేణ కర్తవ్యం కించిత్కార్యం గృహేష్వపి

బాల అయినా, యువతి అయినా, వృద్ధ అయినా స్త్రీ యింటిలో స్వతంత్రంగా ఏ కార్యాన్నీ చేయతగదు.

బాల్యే పితుర్వశే తిష్ఠే త్పాణిగ్రాహస్య యౌవనే

పుత్రాణాం భర్తరి ప్రేతే న భజేత్ స్త్రీ స్వతంత్రతామ్

స్త్రీ బాల్యంలో తండ్రి అధీనం లోను, యవ్వనంలో భర్త అధీనంలోను, భర్త మరణించిన తరువాత పుత్రుల అధీనంలోనూ ఉండాలి. కాని ఎప్పుడూ స్వతంత్రంగా ఉండటానికి వీలులేదు.

[మనుధర్మశాస్త్రము (మనుస్మృతి), తెలుగు రచన: కె.వై.ఎల్. నరసింహారావు]    

ఇంకా విశేషమేమిటంటే, స్త్రీ స్వాతంత్ర్యాన్ని కట్టడి చేసి, పురుషస్వామ్యాన్ని స్థాపించే ప్రయత్నం ఒక దశలో ప్రపంచ స్థాయిలో జరిగింది. కనుక మూస పోసినట్టు పురుషస్వామ్యం ప్రపంచంలో ఎక్కడైనా ఒక్కలానే ఉంటుంది. మన మనుస్మృతి లాంటి స్మృతులను ప్రపంచవ్యాప్తంగా అనేక సమాజాలు సృష్టించుకున్నాయి. మగపిల్లవాడికి ఒక వయసు వచ్చాక, అతనిని బాధ్యతాయుతుడైన కుటుంబ యజమానిగా, అంటే పురుషస్వామ్య ప్రతినిధిగా మలిచే ఒకానొక ప్రక్రియను ప్రతి సమాజమూ కల్పించుకుంది. తల్లితో సహా స్త్రీల ప్రభావం నుంచి ఉద్దేశపూర్వకంగా పక్కకు తప్పించడం అందులో భాగం. ఆ ప్రక్రియ అతనికి ‘రెండో జన్మ’ నిస్తుంది. ఆ ప్రక్రియనే మన సంప్రదాయం ఉపనయనం గానూ, ఉపనయన సంస్కారం పొందిన వాడిని ‘ద్విజన్ము’డి గానూ పేర్కొంది. పురాతనసమాజాలు అన్నిటా ఇది అందరికీ అమలు చేసిన ప్రక్రియ అయినా మన వ్యవస్థలో మాత్రం కొన్ని కులాలకే పరిమితమైంది.

ఎలెక్స్ హేలీ ‘రూట్స్’ నవలలో కథానాయకుడైన కుంటా కింటేను ‘పురుషు’డిగా మలచే ప్రక్రియ గురించి సుదీర్ఘంగా రాస్తాడు. అది నాలుగు నెలలపాటు సాగే కష్టసాధ్యమైన ప్రక్రియ. ఓ రోజున అయిదారుగురు వ్యక్తులు పెద్దగా కేకలు పెడుతూ, ఈటెలతో బెదిరిస్తూ ఊరి మీదికి వచ్చి పడతారు. ఒక్కొక్క ఇంట్లోకే చొరబడి, పది పదకొండేళ్ళ కుర్రాళ్లను బయటకు లాగి, వాళ్ళ ముఖాలకు ముసుగులు కప్పి ఒక అజ్ఞాత ప్రదేశానికి తీసుకుపోతారు. వారిలోని భయాన్ని పోగొట్టి ధైర్యాన్ని, నిబ్బరాన్ని, సమయస్ఫూర్తిని పెంచే అనేక క్లిష్టమైన శారీరక, మానసిక పరీక్షలకు గురిచేస్తారు. ఎలాంటి ప్రమాదాలనైనా ఎదుర్కోగల విధంగా వారిని తీర్చిదిద్దుతారు. ఆ పరీక్షలలో విఫలమైతే అంతకన్నా సిగ్గుచేటు ఉండదన్న అభిప్రాయాన్ని వారిలో నూరిపోస్తారు. చివరిగా వారికి ‘సుంతీ’ కూడా జరుగుతుంది. ఆ నాలుగు నెలల తర్వాతా వారు సంపూర్ణ ‘పురుషుడు’గా మారి ఇంటికి తిరిగివస్తారు. అక్కడినుంచి వారికి పూర్తిగా కొత్తజీవితం ప్రారంభమవుతుంది. ఇక వారు తల్లిదండ్రుల ఇంట్లో ఉండరు. వారికి ప్రత్యేకంగా తమదైన నివాసం ఏర్పడుతుంది. గ్రామ పెద్దలు వారికి కొద్దిపాటి పొలంతోపాటు, ఊరికి సంబంధించిన కొన్ని బాధ్యతలు అప్పజెబుతారు.

మగపిల్లవాడిని ‘ద్విజన్ము’డిగా మార్చే ఈ ప్రక్రియలో తల్లి ప్రభావాలనుంచి అతణ్ణి దూరం చేయడం, తల్లికీ, తనకూ మధ్య ఎడం పాటింపజేయడం కూడా భాగం. శిక్షణ ముగించుకుని కుంటా కింటే తిరిగి ఊళ్ళోకి అడుగుపెట్టిన ఘట్టాన్ని, తల్లి పట్ల అతని దృక్పథంలో వచ్చిన మార్పును రచయిత ఇలా చిత్రిస్తాడు:

“తెల తెల వార్తూండగా ఊళ్ళో అడుగుపెట్టిన కుర్రవాళ్ళకి జనం నవ్వుతూ, తుళ్లుతూ, నాట్యం చేస్తూ, చప్పట్లు చరుస్తూ స్వాగతమిచ్చారు. ఆడవాళ్ళు ‘ఏయ్! ఓయ్!’ అని పట్టరాని సంతోషంతో పగలబడి నవ్వుతూ కేకలు వేశారు. కుర్రవాళ్లు తెచ్చిపెట్టుకున్న హుందాతనంతో నెమ్మదిగా నడిచారు. మొట్టమొదట వాళ్ళ పెదాల మీంచి చిరునవ్వులు చిందలేదు; నోట్లోంచి మాట ముత్యాలు రాల్లేదు. గంభీరంగా ఉండిపోయారు.

తల్లి తనకేసి ఆపుకోలేని ప్రేమతో పరుగెత్తుకుని వస్తున్నప్పుడు కుంటాకి తను కూడా అట్లాగే ఆమెవైపు ఉరుకెత్తి వాటేసుకోవాలనిపించింది. కానీ నిగ్రహించుకున్నాడు. మొహం మాత్రం సంతోషంతో వెలిగిపోతోంది. బింటా కొడుకు మెడ చుట్టూ చేతులు వేసింది. చెంపల్ని చేతుల్తో తడిమింది. కళ్ళవెంట సంతోషబాష్పాలు కారుతుంటే, “కుంటా, కుంటా” అని నెమ్మదిగా గొణిగింది. కుంటాకి తనిప్పుడు పురుషుణ్ణని స్ఫురణకొచ్చి వెనక్కి తప్పుకున్నాడు. ఆమె వీపుకి వేళ్ళాడే ఉయ్యాలలో ఏడుపు మొదలెట్టిన పసిగుడ్డుని స్పష్టంగా చూసే మిషతో తల్లి నుంచి వెనక్కి తప్పుకున్నట్టు నటించాడు. ఉయ్యాల్లోకి చేతులు దోపి రెండు చేతులతో చిట్టి తమ్ముణ్ణి పైకెత్తుకున్నాడు.

……….

కుంటా తమ్ముణ్ణి ఎత్తుకుని పాకలోకి వస్తుంటే బింటా కొడుకు ప్రక్కనే నడుస్తూ మురిసిపోయింది…ఇరుగుపొరుగు అమ్మలక్కలు బింటాతో “నీ కొడుకు ఎంత కళకళలాడుతున్నాడమ్మా! మగకళ ఎంత కొట్టొచ్చినట్టు కానొస్తోందే!” అంటూ వ్యాఖ్యానాలు చేస్తోంటే కుంటా వినిపించుకోనట్లే నటించాడు. కానీ, ఆ మాటలతని చెవులకు సంగీతంలా వినిపించాయి.

….ఆనందంతో, గర్వంతో ఉప్పొంగిపోతూ బింటాకి మాటలు కరువయ్యాయి. అమ్మకోసం తను ఎంత తపించిపోయాడో, యింటికి తిరిగివస్తే ఎంత ఆనందంగా ఉందో ఆమెకు చెప్పాలనుకుంటూ ఉవ్విళ్లూరాడు. కానీ నోరు పెగల్లేదు. అమ్మతో సహా యే స్త్రీతోగానీ అటువంటి ముచ్చట్లాడ్డం పురుషలక్షణం కాదని అతనికి తెలుసు.

………

కుంటా ఆ రోజే కొత్త పాకలోకి మారాడు. బింటా కొడుక్కి కావలసిన సమస్త సామగ్రీ అమర్చిపెట్టింది. ఆఖరికి ప్రార్థన చేసుకోటానికి అవసరమైన పట్టా కూడా సమకూర్చిపెట్టింది. తల్లి “నీకిది అవసరమవుతుందిరా, అదవసరమవుతుందిరా” అంటూ రకరకాల పనిముట్లు సామాన్లు చేరుస్తుంటే కుంటా అసంతృప్తిగా గుర్రుమన్నాడు. అదొద్దు, ఇదొద్దు అంటానికి కారణాలు దొరక్క తల గోక్కున్నాడు.

“తలలో పేలు పడ్డట్టున్నై. కుక్కుతా, రారా” అంటూ బింటా ముందుకొచ్చింది.

“వొద్దు” అన్నాడు కుంటా అసహనంగా. బింటా కోపంగా నసుగుతూ వెళ్లిపోయింది.”

                                                                         [ఏడు తరాలు (ROOTS), తెలుగు: సహవాసి]

***

స్త్రీ-పురుష సంబంధాల గురించి, స్త్రీ ‘శీలం’ గురించి మనకిప్పుడు పట్టువిడుపులు లేని, మతవిశ్వాసంతో పోల్చదగిన నిశ్చితాభిప్రాయాలు ఉన్నాయి. ఆ అభిప్రాయాలకు పునాదులు వేసి, కాలగమనంలో వాటిని పటిష్టం చేసుకుంటూ వెళ్లింది మన పూర్వీకులే. అయితే, స్త్రీ-పురుష సంబంధాలు, స్త్రీ శీలం విషయంలో మన అనుభవాలూ, ఆలోచనలకీ; పూర్వీకుల అనుభవాలూ, ఆలోచనలకీ ఒక విచిత్రమైన తేడా ఉంది. వీటి విషయంలో పూర్వీకులు మనకంటే విశాలమైన, వైవిధ్యవంతమైన పరిస్థితితో తలపడ్డారు. మన దగ్గరికి వచ్చేసరికి అది ఇరుకుగానూ, వైవిధ్యరహితంగానూ మారిపోయింది. ఒక్క చిన్న పోలికతో చెప్పుకుంటే, మన పూర్వీకులు ఒక పెద్ద తానును కత్తిరించే పనిలో పడ్డారు. మన దగ్గరకు వచ్చేసరికి అది ఒక చొక్కా గుడ్డ అయింది…

మరికొంత వచ్చేవారం…

 -కల్లూరి భాస్కరం

 

 

 

 

 

రామక్క

Kadha-Saranga-2-300x268

రాకరాక మా అల్లుడొచ్చిండే

ఓ..రామ అల్లుడొచ్చిండే

ఓ…లేడి అల్లుడొచ్చిండే

అల్లునికి నెల్లూరు సారగావాలె

ఓ..రామ అల్లుడొచ్చిండే

ఓ..లేడి అల్లుడొచ్చిండే..

పాట పక్కనే పారుతున్న పాకాల ఏటి పరుగు లెక్కుంది.పాటతోపాటు సేతులు లయబద్ధంగా కదులుతూ నాటేసుకుంట ముందుకు కదులు తున్నై.పాట ఎక్కన్నుంచొస్తుందా అని సూసెటాలకు నలభైఏండ్ల సుమారుగుండే ఒకామె ఆపాట పాడుతుంది.నాటైపోయినంక అందరు ఇండ్లకు బోయెటప్పుడు అమ్మమ్మనడిగిన ఇందాక పాటబాడినామెవరని, ఓ..గదా మన రామక్క గాదుర అన్నది అమ్మమ్మ.ఆమెజూస్తె నీకంటె సిన్నగున్నది మరి నువ్వామెను అక్క అంటున్నవేందని అడిగిన దానికి అమ్మమ్మ బదులుజెప్పలేదుగాని అందరంగలిసి పొలంకాన్నించి ఇంటికి బోయినం.

తెల్లారి పొద్దుగాల రామక్క మా అమ్మమ్మోల్ల ఇంటిముంగలకెల్లి బోతుంటె ఓ..రామక్కో… అని బిల్సి ఎమ్మటే తలుపు సాటున దాక్కున్న అంతల్నె రామక్క ఎనక్కిదిరిగి ఎవడ్రా బాడుకావ్ నన్ను పేరుబెట్టి పిలిసింది.

అనుకుంట మా ఇంట్లకొచ్చి తలుపుసాటునున్న నన్నుజూసి మైసక్క గీ పోరడెవడే నన్ను పేరుబెట్టి పిలిసిండు అని అడిగింది. మా మనవడు అని జెప్పింది అమ్మమ్మ…ఓరి నువ్వు రత్తమ్మ కొడుకువా..మయ్య సక్కదనం జూడు గిన్నెపండు లెక్కున్నడు అనుకుంట నన్ను ముద్దుబెట్టుకోని బైటికి బోతాంటె యాడికిబోతన్నవే రాములు అని అమ్మమ్మ అడిగింది.కోంటింటికి బోతన్న మైసక్క అనిజెప్పి బైటికెల్లింది రామక్క. అయ్యాల్టించి రామక్క వచ్చేప్పుడు

పొయ్యేప్పుడు గలమట్ల నిలవడి ఓ..రామక్కో అని బిల్సేది.రామక్క ఎనక్కిదిరిగిసూడంగనే గోడపొంటి దాక్కునేది.

“నీ తీటపాసునిదన్న బాడుకావ్” పిలిసినోడివి మల్ల అగపడకుంట దాక్కుంటవేమోయ్ అని నవ్వుకుంట బొయ్యేది.ఒకనాడు నాకు అనుమానమొచ్చి అమ్మమ్మ నడిగిన సిన్నోల్లు పెద్దోల్లు అందరు రామక్క అనే పిలుస్తరేందని.

ఈపాలిగూడ అమ్మమ్మ సమాధానంజెప్పలే అసలు ఆమెను అందరు ఎందుకు అట్టబిలుస్తున్నరే నాకుమాత్రం ఇప్పటికి

సమజ్ గాలె.కనాడు పొద్దుగాల రామక్క గొడ్లుదోలుకోని బోతాంటె బైండ్లోల్ల ఎంకడు,బొజ్జోల్లబిచ్చం,పల్లోల్ల ఎల్లడు

అందరు జిల్లగోనె ఆడుతున్నరు ఇంతల్నె జిల్లబోయి రామక్కకు దగిలింది.ఇగజూడు రామక్కతిట్లకి అంతులేకపాయె.

సిత్తకార్తెలబుట్టిన బాడుకావులార మీనోల్లల్లనా సాడుబొయ్య అని తిట్లపురాండంఎ త్తుకునె.ఇగ తిట్లిన్నదేమో ఏందే రాములు ఎవర్నిదిడుతున్నవే అనుకుంట అమ్మమ్మ ఇంట్లకెల్లి బైటికొచ్చింది. ఇగజూడె మైసక్క ఈగాలిబాడుకావులు

ఎట్లగొట్టిండ్రో కాసైతె పానంబోతుండె వీల్లగాలి నోల్లల నా ఏరుగుదు అని మల్ల తిట్టుడు సురుజేసింది. ఇగాగె రాములు పోరగాండ్లు ఆడుతుంటె సూడకతగిలిందేమొ వాల్లుమటికి ఏంజేస్తరు.అవ్ గాని యాడికి బోతన్న జరసేపు కూసోని పోరాదె అనెటాలకు ఆ …ఇగనాబతుక్కి కూసునుడుగూడనా ఇగో గొడ్లెమ్మటిబోతుంటె గింతల్నె గీబాడుకావులు గొట్టె అబ్బ… పానమెల్లిపాయె అనుకుంట వామ్మో….గొడ్లుబాయె ఇగనీను బొయ్యొత్త అని లేవబోతుంటె యాడికిబోవులేవె జరసేపుగూసోని ముచ్చటజెప్పరాదె అని అమ్మమ్మ అనెటాలకు ఆ… ఇగనీతోని ముచ్చట్లు జెప్పుకుంటగూసుంటె నాముడ్డిపూసలిరిగినట్టె.అసలే లంజబర్లు గుదెబండ గట్టినసుత ఆగుతలేవు పటేలు పొలంలగినబడ్డయంటె పటేల్ పానందీత్తడు.అనుకుంట గోడకానిచ్చిన కర్రదీస్కోని గొడ్లెమ్మటి ఉరికింది.రామక్కబోయినంక అమ్మమ్మనడిగిన అందరిగొడ్లెమ్మడి మొగోల్లు బోతుంటె మరి వీల్ల గొడ్లెమ్మటి రామక్క బోతుందేందని అడిగిన. ఇగ అమ్మమ్మ సెప్పుడు మొదలువెట్టె.

రామక్క టికి పెద్దది ఆమెతోడ ఇద్దరు తమ్ములు ఒక సెల్లె బుట్టిండ్రు.పెద్దమనిషిగాంగనె దెగ్గరసుట్టాలని రొండోసంబందమోడైన లచ్చయ్యకిచ్చి పెండ్లిజేసిండ్రు.యాడాది రొండేండ్లు బాగనే ఉండె పురుడుబోసుకోటానికి

ఈఊరొచ్చిన రామక్కకి పురిట్లనే పిల్ల జచ్చింది. ఇగ రామక్క మల్ల మొగనితానికి బోకుండ ఈడనే ఉండబట్టె. ఇంటికి పెద్దది గాబట్టి సాగినన్నాల్లు సాగింది ఇంతల్నె తమ్ముడు పెద్దోడైండు ఆనికి పెండ్లిజేసిండ్రు ఆనిపెండ్లంగూడ మంచిదే

ఆడిబిడ్డెను ఎన్నడన్న ఒక్కమాటనెరుగదు.రోజులన్ని ఒక్కతీరుగుండయిగద తమ్మునికి నలుగురు పిల్లలైండ్రు

ఆడు ఏరువడ్డడు అయ్యున్నన్నాల్లు బాగనే ఉండె ముసలోడుజచ్చినంక సూసెటోడు లేక మల్ల తమ్ముని పంచనజేరింది.కూకోని తింటె ఎవడుబెడతడుగందుకనే గిట్ల గొడ్లెమ్మటిబోతాందని అమ్మమ్మ జెప్పంగనే నాకు శానా బా దనిపిచ్చె.ఎంతకష్టంజేసినా రామక్కమొకం ఎప్పుడు నవ్వుతనే గనపడేది.కోపంల ఎవలనన్న ఒగమాటన్నగాని ఎవ్వలుగూడ పట్టిచ్చుకునెటోల్లుగాదు.

———0——————0————-

రోణికార్తె ఎండలు సెలెమల సుక్కనీల్లు లెవ్వు ఇగమంచినీల్లకి కోండ్రోల్ల బాయొక్కటే ఆదెరువు ఊల్లె జనాలంత ఆ బాయికాడికే మంచినీల్లకి బొయ్యెటోల్లు.కోండ్రోల్లంటె మా అమ్మమ్మ తల్లిగారన్నమాట. ఒకనాడు పోరగాల్లందరం పందెంబెట్టుకోని ఎవరు ముందుబొయ్యి నీల్లు మోసుకొత్తరోనని పందెంబెట్టుకోని ఉరుకుడు మొదలుబెట్టినం ఉరుక్కుంట మోటదార్లెకెల్లి బోతాంటె ఒకముతరాసామెకు తగిలిన.ఇంతల్నె ఆమె నాదిక్కు దిరిగి ‘’ మాదిగోల్ల పోరగాండ్ల కు కండ్లు కనబడుతలేవు మనుసులకు తగులు కుంటనే బోతండ్రు”..అని అనెటాలకు అన్న్ బాయిగడ్డమీద గూసున్న రామక్క ఈ మాటిని “మాదిగోని కాడ పన్నప్పుడు లేని సుద్ది మాదిగోడు తగలంగనే వొచ్చినాది.”అనంగనే ముతరాసామె మల్ల మారుమాటలేకుండ నీళ్ళుదోడుకోని పోయింది.   ఆమె అట్లబోంగనె ఇందాక ముతరాసామెను గట్లన్నవుగదా వాల్లు ఏమనరా అని అడిగిన. ఏంది వాల్లకు దడిసేది ఉన్న మాటేఅన్న ఊల్లె లేని మాట అన్ననా ..గీ ఊల్లె ముతరాసోల్లేంది కమ్మోల్లు., రెడ్డోల్లకుగూడ దడిసేదిలేదు.తప్పుజేసినోడు దడువాలె నేనెందుకు దడుస్త అని అంటుంటె రామక్క దైర్యానికి మాకు ఆచ్చెర్యం అయ్యింది.

అయాల అమ్మమ్మోల్ల జీతగాడు రాకపోయెటాలకు నన్ను గొడ్లకాడికి బంపిన్డ్రు.గొడ్లుదోలుకోని రామక్కోల్లెమ్మటిగొడ్లుగాయబోయిన.పైటేల్లకాడ అందరు సద్దులిప్పుకోని తిన్నంక గొడ్లని సెర్లదోలి సింతకింద గూకున్నంక పొరగాండ్లందరికి ఒక ఆలొసెనెచ్చింది ఈతగొడదామనుకున్నరు సెర్ల అయితె బరిజెనిగెలుంటై వొద్దనుకోని పక్కనున్న రెడ్డోల్ల బాయిల ఈతగొడదామని అనుకున్నరు ఇంతల్నె అనుమానమొచ్చి వామ్మో రెడ్డాయనొస్తె సావదెంగుతడని ఒకడన్నడు.ఏంగాదులే ఎవడన్నోత్తె నీనుజెప్పుతగని మీరు దుంకుర్రా అని రామక్క అనెటాలకు అందరంగల్సి అంగీలూడబీకి బాయిగడ్డమీద పారేసి పందేలుగట్టుకోని బాయిలదూకి ఈతలు మొదలుబెట్టినం జరసేపయినంక ఆన్నించి ఒక ముసలోడొత్తుంటె సూసిన పోరగాండ్లు వామ్మో..! సుంకిరెడ్డి బిచ్చమయ్య వత్తుండు అనెటాలకు యాడోడాన్నె పరార్.ఇగ రెడ్డాయన బాయికాడికొచ్చి మాదిగోండ్ల పోరగాండ్లేనా ఇప్పటిదాక ఈతగొట్టిందని సెట్టుకింద గూకున్న రామక్కనడిగిండు.రామక్క అవునన్నది .మాదిగ బాడుకావులు ఈతగొడితె సూదరోల్లు మల్ల గీనీల్లనెట్ల ముట్టుకోవాలనే అని అన్నడు.ఆయనట్ల అడుగుతాలెకు “మాదిగోల్ల అంటుబట్టకుంట మీకు వంటబట్టేదేమన్నవున్నదా పటేలా”…అనెటాలకు ముసలోనికి కోపమొచ్చింది. “నీ మాదిగ పెండ్లాల దెంగ” లంజకొడులుల్లార ఇంకోసారి బాయిదిక్కొచ్చిండ్రంటె సావదెంగి సెర్లబడేత్త అని తిట్టుకుంట ఆన్నించిబోయిండు.

చిత్రరచన: ఏలే లక్ష్మణ్

చిత్రరచన: ఏలే లక్ష్మణ్

———–౦———————౦

ఓసి వీమందని గూడెందోల , నిన్ను మాదిగోడుదెంగ అని తిట్టుకుంట గొడ్లదోలక బోతాండు గొల్లోల్ల మల్లయ్య తార మాదిగ్గూడెం కాడికొచ్చినంక ఈ మాట అనెటాలకు గీ మాటలిని ఇంట్లకెల్లి బైటికొచ్చిన రామక్క నోరులేని గొడ్లను గూడెందోలేబదులు మీ పెండ్లాలని దోలరాదురి గొడ్డుమాంసందిని బాగ బలంగున్నరు మాపోరగాండ్లు . అనెటాలకు గొల్లాయనకు రొషమొచ్చింది.ఇద్దరిమద్య పెద్ద జగడమయ్యింది.గొడ్లనిదిడితె నీకేమయ్యిందని గొల్లాయన అనెటాలకు తిడితె తిట్టుకో… నాకేంది.నా కులంపేరుబెట్టి తిట్టినవు గాబట్టి నాకు కోపమొచ్చింది ఇంకొకపాలి ఈ ఊల్లె ఎవడన్న మాదిగోని పేరుబెట్టి తిడితె మర్యాద ఉండదు అని ఆయన్ని బెదిరిచ్చింది.నిజాన్ని భయంలేకుండా మాట్లాడే రామక్కంటె ఆగూడెంల అందరికీ మక్కువే. అందుకేనేమో….! అందరూ ప్రేమగ ఆమెను రామక్కా… అని పిల్సుకుంటరు.ఒక్కొక్క సారి పరేస్కానికి ఏంరా.. మీరందరు మా అయ్యకుబుట్టినార్ర.. నన్ను అక్క అని బిలుస్తరు అని నవ్వుకుంట అంటుండేది.

బడులుదెరిసె రోజులు దగ్గరబడుతున్నకొద్ది నాకెట్లనో అయితుండేది. ఈ ఊరొదిలిపెట్టి మల్ల మాఇంటికి బోవాలంటె పానంమీదికొచ్చేది. ఈ ఏడు అసలే పదోది మంచిగ సదవాలె కొడుకా అనిజెప్పి నన్ను బండెక్కించి అమ్మమ్మ ఇంటికి బోయింది.

———-*————————-*

సంవచ్చరం పరిచ్చలు రాసినంక మా దోస్తులంత ఎవరి ఇండ్లకు వాల్లు బోతాంటె నాకుగూడ ఉండబుద్దిగాలె అమ్మమ్మోల్ల ఊరికిబోదామని టేషన్ల కొచ్చి కాజిపేట బండెక్కి పొద్దుగూకేల్లకి అమ్మమ్మోల్ల ఊరికి జేరుకున్న

 

పొడల పొడల గట్లమీద నాగుమల్లే దారిలో

పొడిసిరార సందమామ నాగుమల్లే దారిలో

నీకు మామ నాకు మామ నాగు మల్లే దారిలో

లోకమేలె సందమామ   నాగు మల్లే దారిలో

పాట బాడుకుంట వడ్లు దంచుతాంది రామక్క . రమక్క బాగున్నవా,,, అనెటాలకు పాట ఆపుజేసి నాదిక్కుదిరిగి ఏమోయ్ మనవడా … బాగున్నవా .. ఎప్పుడచ్చినవ్ అమ్మగిట్ల బాగున్నదా..? అని అందర్ని అడిగినంక దమ్చిన బియ్యమెత్తుకోని వాల్లింటికి బోయింది రామక్క… గిట్లనే రోజు రామక్క వడ్లుదంచటాని కి మా అమ్మమ్మోల్లింటికి రావటం ఆమె పాడే పాటలినుడు నాకు మంచిగనిపిస్తుండె..

ఇంతల్నె పదోతరగతి పరిచ్చల పాసుపేలు తెలిపిండ్రు. నీను పదిల పేలైన ఇగ మా ఊరు బొయ్యి సేసేడిదేముందని మావోల్లు నన్ను ఈడనే ఉంచిండ్రు ..ఇగ మా తాత్ తక్కువోడా పందిరిగుంజకుగూడ పనిజెప్పుతడు. సదువుకున్న పోరడని జూడకుంట వాల్ల జీతగాన్ని బందువెట్టి నన్ను గొడ్లెమ్మటి దోలుతుండె .గొడ్లకాడికిబోయి అక్కడ రామక్క జెప్పేటి కతలింటుంటే ఒక్కొక్కనాడు మాకు బువ్వసుద్ది గూడ ఎర్కుండేదిగాదు.

సలికాలం పొద్దు సీకటితోనె లేసి పోరగాండ్లందరు గలిసి గొడ్లకు గడ్డిగోసకరాటానికి బోయెటొల్లు .. అమ్మమ్మ నీనుగూడబోతనే అని వాల్లెమ్మటిదగిలిబోయిన. తెల్లారుతుండేలకు తీగలబోటికి బోయినం అండ్ల అడుగుబెడుతుండగనే పక్కపొంటి పొదల్నించి ఏందో గసబెడుతున్నట్లినబడ్డది..ఓ…రామక్కో…….. గీడేందో గసబెడుతుందనంగనె సప్పుడుగాకుండ చ్చి పొదలకి జూసింది.

ఇంకేముంది ఓరి పోరగాండ్లు గీ పొదల గుడ్డేలుగుంది ఎవ్వలు సప్పుడు జేయకుర్రి అని జెకముక దీసి నిప్పుజేసి పొదలకిసిరింది. ఇగజూడు నిప్పుజూడంగనె అండ్లకెల్లి బైటికెల్లి గుడ్డేలుగు ఒకటే ఉరుకుడు అప్పుడు రామక్క దైర్నం జూసి నాకు నోటమాట రాలె.

ఇంటికొచ్చినంక అమ్మమ్మకి గీముచ్చెట జెప్పుతె గిదేంజూసినవ్ బిడ్ద అది దెయ్యాలకుగూడ పనిజెప్పుతది. ఏపని జేసినగూడ మొగోనితోని సమానంగ పనిజేస్తది. వాల్లయ్య బతికున్నప్పటి ముచ్చెట

వాల్లయ్య గొడ్లనిగోసెటప్పుడు గొడ్డు కాలుబట్టుకునేది . గట్ల తొడబట్టుకున్నోల్లకు తొడమాంసం బెట్టెటోల్లు.ఇప్పుడు దాని రాతగిట్లున్నదిగాని అప్పుడు మంచిగనె ఉండేది అని అంటుంటె నాకు శాన బాదనిపిస్తుండె.

———————-*———————-*——————

పదోతరగతి పరిచ్చలు మల్లబెట్టిండ్రు ఈ తడవ మంచిగనే రాసిన కొన్నిదినాలకు పాస్ పేలు తెలిపిండ్రు నీను పాసైన కాలేజి తెర్సినంక కాలేజిల చేరిన .. మాకు తెలుగు జెప్పే “రఘురాం” సారు “కక్క” అనె పుస్తకం పేరుజెప్పి గీ పుస్తకం మీ కులపాయెనె రాసిండు మంచిగుంటది సదువుమన్నడు.. ఎట్లనో తిప్పలబడి గా పుస్తకం దొర్కబట్టుకొని సదువుతుంటె అండ్ల కత మొత్తం మా అమ్మమ్మోల్ల ఊర్లె జరిగిన సంగతుల్లెక్కనే అనిపిస్తుండె. కతసదువుతుంటె రామక్క కండ్లముందున్నట్లె అనిపిచ్చేది. ఈ సారి ఊల్లెకిబోతె ఈ కత ఎట్లనన్న రామక్కకి ఇనిపియ్యలె అనుకున్న. ఇంతల్నె దసర సెలవులు ఇచ్చిండ్రు అయ్యాల మాపటి బండ్డెక్కి సీకటిబడెయాల్లకి అమ్మమ్మోల్లింటికి చేరుకున్న.

పొద్దుగాల అందరు ఎవరి పనులకు వాల్లు బోయినంక పుస్తకం దీసుకోని వడ్లోల్ల సింతకిందికిబోయి కూకున్న ఇంతల్నె గొడ్లదోలుకోని రామక్క ఆడికొచ్చింది . రామక్కో…… నీకొక కత జెప్పనా అనెటాలకు ఏంకత జెప్పుతవొయ్ అన్నది నవ్వుకుంట. ఇగో గీ బుక్కుల మంచి కతున్నది అని చెప్పిన ..కతపేరుజెప్పు అన్నది రామక్క. కత పేరు “కక్క” అనిజెప్పెటాలకు..ఓహో… బెమ్మంగారి కక్కడా ఆ కత నాకుదెల్సులేవోయ్   నువ్వు కొత్తగజెప్పెదేంది అన్నది. కక్కడంటె గా కక్కడుగాదు మన మాదిగోల్ల పోరడె …వేముల ఎల్లన్న రాసిండు. నీ అసొంటోల్ల కత మంచిగ జెప్పిండు అని నీను జెప్పంగనె గట్లయితె జల్దిజదువు నీనుగూడ ఇంట అన్నది. కతజదువుడు మొదలుబెట్టిన బువ్వమీద రోకు లేకుండ రామక్క కత ఇన్నది ..రామక్క మొకంల దిగులు కనిపిస్తున్నది రామక్కఆలోచనలు ఎక్కన్నోదిరుగుతున్నై.. ఏంది రామక్క గట్ల దిగాలుగున్నవ్ అనెటాలకు కత మంచిగున్నది బిడ్ద కతల ఆల్ల అమ్మకు మారుమానం జీసిన కొడుకసోంటోడు నాకు ఒక్కడున్నట్లయితె నా బతుకు గిట్లుండునా బిడ్డ .రామక్క మాటలకు సూటిగా ఆమె మొకం ల సూడలేక తలకాయ పక్కకు తిప్పుకున్న.. సూర్యుడుగూడ మౌనంగ   సెర్ల మునిగిండు…..

 

 -శ్రీనివాసు గద్దపాటి

పరిచయం:

srinivasu gaddapati

నేను తెలుగు, హింది, ఆంగ్లము, సైకాలజీ ల్లో ఎమ్మే చదివాను ప్రస్తుతం గ్రేడ్ వన్ హిందీ పండిట్గా పనిచేస్తున్నాను. మూసీ ,నడుస్తున్నచరిత్ర, ఆకాశిక్, కథాంజలి మొదలైన పత్రికల్లో కవితలు వ్యాసాలు వచ్చాయి. గుమ్మం, జాగో జగావో, క్విట్ తెలంగాణ, మునుం., స్వేచ్చకోసం, మార్పుకోసం,  నల్లవసంతం,  తొలిపొద్దు, తొలివెలుగు కవిసంగమం2013 మొదలైన కవితా సంకలనాల్లో కవితలు.. “స్వేచ్చకోసం” సంకలనానికి సంపాదకత్వం వహించాను ఐదుగురు మితృలతో కలిసి “పంచమస్వరం” కవితా సంకలనంవేశాను. ప్రముఖ హిందీ దళిత కవుల కవితలు దాదాపు 50 తెలుగు అనువాదం. శివసాగర్ కవితలు కొన్ని హిందీ అనువాదం చేశాను. కథ రాయటం ఇదే మొదటి ప్రయత్నం.

 

వీలునామా – 39 వ భాగం

veelunama11

స్వామి కార్యమూ-స్వకార్యమూ -II

వాల్టర్ బ్రాండన్! పెద్దపెద్దఅంగలువేసుకుంటూ తమవైపే వొస్తున్నాడు. చటుక్కున మిసెస్పె కాగితాన్ని లాక్కుని తన సంచీలో పెట్టేసుకుంది.

“ఎల్సీ! ఇక్కడేంచేస్తున్నావునువ్వు? ఈవిడతోఏంపనినీకు?” మిసెస్పెక్వంకచిరాగ్గాచూస్తూఅన్నాడుబ్రాండన్. ఎల్సీమొహంపాలిపోయింది. ఏమీమాట్లాడలేకపోయింది.

“పద, నిన్నుఇంటిదగ్గర దిగబెట్టివెళతాను. చీకటవుతోంది. ఇక్కణించినీకుదారికూడా తెలిసుండదు. ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడొద్దనితెలియదా నీకు?”

నొరుపెగుల్చుకుంది ఎల్సీ.

“బ్రాండన్! ఈమెనాతోపాటు కుట్టు పని చేస్తుంది. ఇద్దరందారాలుకొనుక్కుందామనిబయటికొచ్చాం, అంతే.”

“డబ్బుసరిగ్గా వేసాడోలేదోఅనిఇద్దరమూ బిల్లు సరిచూస్తున్నాం అంతే,” మిసెస్పెక్అనునయంగా అంది.

ఎల్సీకిఅబధ్ధాలుచెప్పడంఇష్టం వుండదు.

“బిల్లంటావేమిటి? అది బిల్లు కాదు,” ఇంకాచెప్పబోయింది.

ఆమెనిఆపాడుబ్రాండన్.

“అవన్నీ సరే! నిన్నసలు కొత్త ఊళ్ళోఈవిడతోఎలా పంపిందిలిల్లీ? ఎవరెలాటి వాళ్ళో తెలియకుండా స్నేహంచేయడం మంచిదికాదు. ఇంత అమాయకంగా వుంటేఎలా?”

అతని  మాటలకిఎల్సీకళ్ళల్లోనీళ్ళు తిరిగాయి. సంగతి తెలిస్తేతనుఆస్తిమీద ఆశతోముసలామెతోచేరికుట్రలు పన్నుతూందనుకుంటాడేమో బ్రాండన్. ఛ! ఛ! తనబుధ్ధేమయింది!

“మిసెస్ పెక్! మీరిక ఇంటికెళ్ళండి! స్టాన్లీ మిమ్మల్నిచూస్తేచాలా గొడవైపోతుంది. కుట్టుపనికథలునమ్మడానికిస్టాన్లీఎల్సీలాఅమాయకుడుకాదు. వెళ్ళండిక!”

ఆశ్చర్యపోయిందిఎల్సీ! ఆమె పేరుమిసెస్ మహోనీకాదా? ఆమెఎవరో బ్రాండన్కెలాతెలుసు?

“వెళ్తా, వెళ్తా! నాకేమన్నా భయమా? అమ్మాయ్! నాఅడ్రసు గుర్తుంచుకో!”

బ్రాండన్వంక కోపంగా చూస్తూవెళ్ళిపోయిందామె. ఆమెవెళ్ళిందాకాఆగి, ఎల్సీవైపుతిరిగాడు బ్రాండన్.

“క్షమించు ఎల్సీ! కోపంగామాట్లాడాను. ఆమె అసలుమంచిదికాదు. నాకూ స్టాన్లీకిఆమెముందే తెలుసు. ఆమెనీకేం హానితలపెడుతుందో అన్నఖంగారులోకోప్పడ్డానంతే! పదఇంటికి తీసికెళ్తా!”

“అలాగే, ఇంటికెళ్ళిపోదాం! మీరిక్కడికెలావొచ్చారు?”

“విరివాల్టా వెళ్తే నువ్విక్కడ వున్నావని జేన్ చెప్పింది. ఆఘ మేఘాల మీదబయల్దేరి  వచ్చాను. ఇవాళ నీతో మాట్లాడాలని మీ ఇంటికొచ్చాను. ఎందుకో లిల్లీ భయంగా  బెరుకుగాఅనిపించింది. నువ్వెక్కడున్నావంటేతలా తోకా లేకుండా సమాధానంచెప్పింది. నువ్వొచ్చేదాకా కూర్చుంటానన్నాను. కొంచెందుకాణానికెళ్ళిఏదోపట్టుకురమ్మనినన్ను బయటికి పంపేసింది. అదృష్టవాశాత్తూనేనూ దుకాణాల కోసంఈ వైపే వొచ్చాను. బహుశామిసెస్ పెక్నీతోకలిసిఇంటి కొస్తేనేను చూసిస్టాన్లీతోచెప్తాననిభయపడి వుంటుంది!”

“నిజమే, లిల్లీగారికిఈవిడనిచూస్తే చిరాకూ, భయమూ!”

“స్టాన్లీకేమో  కోపమూ! పోన్లే, మనమూఈ సంగతి స్టాన్లీదగ్గర ఎత్తొద్దు. అనవసరంగాఅతనికీ లిల్లీకిమధ్యలో దెబ్బలాటలోస్తాయి!”

“అలాగే! అదిసరే కానీ, బ్రాండన్, నాకుఒక చిన్నవిషయంలో మీసలహాకావాలి!”

“నాసలహానా? చెప్పు, ఏంటది?” ఆశ్చర్యంగాఅడిగాడు బ్రాండన్.

“ఇప్పుడునాతోమాట్లాడిందే, మిసెస్పెక్! ఆవిడేఫ్రాన్సిస్తల్లిఅని నా అనుమానం. అసలుఆమె నాతోపరిచయంపెంచుకొని ఈసంగతి నాతో చెప్పడానికే స్టాన్లీగారిఇంట్లోచేరివుంటూంది. ఆరహస్యమేదో తెలిస్తే ఫ్రాన్సిస్ని వెళ్ళగొట్టొచ్చంటుంది ఆమె.”

“ఇప్పుడామెకి ఏం కావాలటా?”

“నా అనుమానం ఆమెమా మావయ్యని మోసం చేసింది. ఫ్రాన్సిస్తండ్రిమామావయ్య హొగార్త్కాదు. అతనిఅసలు తండ్రెవరో నాతోచెప్తానంటుంది ఆమె. అయితేఆమె మాటలెంతవరకు నమ్మొచ్చో తెలియదనుకోండి…”

“ఆగాగు! ఫ్రాన్సిస్తండ్రిమీమావయ్యకాదు అని చెప్పినంత మాత్రానఒరిగేదేముంది? ఆ ఆస్తంతా ఆయన స్వార్జితం. ఆయన చక్కగా విల్లురాసిమరీఅంతాఫ్రాన్సిస్కిఅప్పగించాడుకదా? కాబట్టి ఈవిడ ఇప్పుడొచ్చి ఫ్రాన్సిస్తండ్రిఎవరోచెప్పినంతమాత్రానఏదీ మారదు!”

“అవును, ఆ సంగతి నాకూతెలుసు. అయితేమావయ్యవిల్లు రాసిన సంగతి ఆమెకితెలియదనుకుంటా.  ఫ్రాన్సిస్ తన కొడుకే అనిమావయ్యప్రకటించడంవల్ల, పిత్రార్జితంగాఆస్తంతా ఫ్రాన్సిస్కి దక్కింది అనుకుంటుంది.”

“ఇంతకీ, నీకేమిటీ విషయంలో ఆసక్తి?” అనుమానంగా అడిగాడు బ్రాండన్

“ అయ్యోబ్రాండన్! నువ్వింకా గుర్తించలేదా? ఫ్రాన్సిస్ మా అక్కని ప్రేమిస్తున్నాడు. ఆపాపిష్టి వీలునామా వల్లపెళ్ళాడడంలేదు. మావయ్య వీలునామావిచిత్రంగావుంటుంది. ‘ఫ్రాన్సిస్ దగ్గరబంధువులనెవరినీపెళ్ళాడరాదు, పెళ్ళాడితేఆస్తివొదులుకోవలసివొస్తుంది,’ అనిమాత్రమేవుంది. ఫ్రాన్సిస్తండ్రిమావయ్యకాదనితెలిస్తే, మేము దగ్గరబంధువులం కాదు కదా? హాయిగా ఆస్తీవొదులుకోకుండా జేన్నిపెళ్ళాడొచ్చు కదా?”

“ఫ్రాన్సిస్ నిజంగా జేన్నిఇష్టపడుతున్నాడంటావా? అయితేఆఆస్తంతాఅవతలపారేసివొచ్చి జేన్ని పెళ్ళాడొచ్చుగా? లేకపోతే, ఆస్తీ, పార్లమెంటు సీటూ అన్నిటి మీదావున్నంత ప్రేమజేన్మీదలేదేమో! నేనైతేప్రేమించిన అమ్మాయికొసం ప్రపంచాన్నైనాసరే వదిలేస్తా!” ఆమెకళ్ళల్లోకి చూస్తూఅన్నాడు బ్రాండన్.

“అదికాదు బ్రాండన్! ఈవిషయం గురించి జేన్ఎప్పుడూ నాతోమాట్లాడదు కానీ, నాఅనుమానం ఫ్రాన్సిస్కూడానీలాగేఅన్నాడు. కానీజేన్ ఒప్పుకోలేదు. తన వల్లఅతనుతనకిలభించిన మంచి జీవితాన్నీ అవకాశాలనూవొదులుకోవడం జేన్కిచచ్చినాఇష్టంవుండదు. కానీ, మేములండన్వదిలివచ్చేటప్పుడూజేన్రోజులతరబడి రాత్రుళ్ళూ ఏడుస్తూగడిపింది. అందుకేఎలాగైనాఈమె దగ్గర ఆ రహస్యంసంపాదించి వాళ్ళిద్దరినీ కలపాలనివుంది నాకు.”

“ హ్మ్మ్!! అయితే నేనుతొందరపడిపనిచెడగొట్టానన్న మాట. కానీ ఆ రాక్షసి పక్కననిన్ను చూడగానే గుండెలవిసి పోయాయంటేనమ్ము! ఆమె గురించీ, ఆమె నక్కజిత్తుల గురించీ మెల్బోర్న్ అంతా తెలుసు. అందుకేఒక్కక్షణం కూడా ఆగలేకవొచ్చేసాను. అదిసరేకానీ, ఎల్సీ, నీకుమనిద్దరం చాలారోజుల క్రితం రైల్లోమాట్లాడుకున్నసంగతి గుర్తుందా?”

ఎల్సీగుండెలుదడ దడలాడాయి.

“ఆ రోజసలుఎలామర్చిపోతాను? నాతెలివి తక్కువ తనానికిపరాకాష్ఠ ఆ రోజు. ఆతర్వాత నన్నునేను ఎంతతిట్టుకున్నానో, ఎంతపశ్చాత్తాపపడ్డానోమీరెరుగరు. మీమనసులో నామీదప్రేమంతాతుడిచి పెట్టుకు పోయిందనీ, ఇహ నా ముఖంమళ్ళీచూడరనీఅనుకున్నాను,” మనసులో మాట నిర్భయంగాచెప్పింది ఎల్సీ.

“ ప్రేమతుడిచి పెట్టుకుపోవడమా? అసంభవం! నిజానికి నేనూ తొందరపడ్డాను. పోయిపోయి ఫిలిప్స్చెల్లెల్ని పెళ్ళాడదామనుకున్నాను. మీఇద్దర్నీకలిసిచూసింతరవాతకానీఅర్థం కాలేదునాకు, నా కోసం నేనే గోతినితవ్వుకుంటున్నానని. నువ్వు నన్నుప్రేమించినా, మానినా, నా స్నేహమూ, సలహా, సహాయాలు మాత్రం నీకెప్పటికీవుంటాయి!”

“ మీరునన్నుమొహమాట పెడుతున్నారు,” సిగ్గుగాఅంది ఎల్సీ.

“ అయ్యొయ్యో! మొహ మాటమేమీ లేదు. ఇదిపార్కు కాబట్టిసరిపోయింది. లేకపోతేఅందరిలామోకాళ్ళమీదకూర్చుని ప్రాధేయపడేవాడిని. చెప్పుఎల్సీ, నీమనసులోనాపట్లస్నేహంతప్ప మరేమీలేదా?” ఆశగాఅడిగాడు బ్రాండన్.

“స్నేహమూ, ప్రేమా, రెండూఇస్తే  తీసుకోవడానికి మీకేమైనాఅభ్యంతరమా!” అదుపుతప్పికొట్టుకుంటూన్నగుండెని చిక్కబట్టుకుని అడిగింది ఎల్సీ. సంతోషంతోకెవ్వుమన్నాడు బ్రాండన్. తబ్బిబ్బైపోయి, మాటకూడా తడబడిందతనికి.

“అభ్యంతరమా, నాకా? భలేదానివే! స్నేహమూ, ప్రేమా! రెండూ! అబ్బో! అసలుఎల్సీ, నువ్వింతచమత్కారంగాఎలా మాట్లాడతావు? నామట్టి బుర్రకిఅర్థంకావడానికేకొంచెంసేపుపట్టిందే! ఈసంతోషంతోనాకు మతిపోయేలా వుంది! చెప్పు, ఇప్పుడేంచేద్దాం? పెళ్ళాడేద్దామా?”

నవ్విందిఎల్సీ!

“ అందరూమన వంకే చూస్తున్నారు. ముందుఇంటికెళ్దాం పదండి. తర్వాత, ఆవిడపేరేమిటో, అదే, మిసెస్ పెక్, ఆమెదగ్గర్నించి సమాచారం ఎలా రాబట్టాలో ఆలోచిద్దాం. ఇంతకీమీరొచ్చేసరికినేనుఒకఅగ్రిమెంటుమీద సంతకం పెట్టబోతూవున్నాను. ఆకాగితం నాలుక గీసుకోవడానిక్కూడా పనికిరాదనుకోండి, ఏదో ఆవిడతృప్తి కోసంపెడదామనుకున్నా!”

“ సరే! అయితే నేను రేపు ఆమె చెప్పిన చిరునామాకి వెళ్ళి, ఆమెనికలిసి విషయంతేల్చుకొస్తా! సరేనా?”

“అలాగే! మీరెళ్ళిచూడండి!”

ఎల్సీకి తనమీదున్న నమ్మకానికి బ్రాండన్ పొంగిపోయాడు.

“ అవునూ! నేనెంతో కష్ట పడి చెమటోడ్చిరాసిన వుత్తరం మీకందనే లేదట గదా! లండన్ నించి బయల్దేరగానే మొదలుపెట్టాను ఉత్తరం రాయడం. నెలలతరబడిరాసాను. ఏం లాభం! అంతా బూడిదలో పోసిన పన్నీరయింది!”

“మీరెళ్ళగానే జేన్ నా మీదవిరుచుకు పడింది. ఎదురుగా వున్న వజ్రాన్ని కాలదన్నుకున్నానంది! అప్పటికి నా కళ్ళు తెరుచుకున్నాయి.”

“అసలింతకీ నన్నెందుకు కాదన్నావు ముందు?” సంకోచంగా అడిగాడు బ్రాండన్.

“ మీఉత్సాహానికీ, పరిశ్రమకీ, జీవ శక్తికీనేనుసరిపోననుకున్నాను. అందులోనూ, అప్పట్లో చాలాజబ్బుగా, దిగులుగా వుండేదాన్ని. నాతోపాటు మిమ్మల్నీ నీరసంగాచేస్తానేమోననిభయపడ్డాను. పైగా, మీరు మీ మనసులో నా పట్ల వున్న జాలినిప్రేమగా భ్రమ పడుతున్నారనుకున్నాను. అప్పట్లో, నన్నెవరైనాప్రేమించగలరనీ, నేనుప్రేమించదగిన దాన్ననీ నమ్మకమే వుండేది కాదు నాకు!” వివరించిందిఎల్సీ.

“ అర్థమైంది. నా ఉత్తరంబహుశానాకే తిరిగొస్తుందేమో! నీకూ చూపిస్తా, బాగానవ్వుకోవచ్చు. నువ్వు నన్నుకాదన్నప్పుడు నీకింకెవరైనానచ్చారేమోననుకున్నా. కానీనేనుబయల్దేరే ముందుపిల్లల గదిలో నా వైపు చూసావు చూడు, అప్పుడుమళ్ళీనాలోఆశలు రేకెత్తాయి. నిన్నొదిలి ఇక్కడికి రావడమంటేనరక యాతనలాగనిపించిందంటేనమ్ము! ఇంకో విషయం, నువ్వు హేరియట్ ఫిలిప్స్ గురించిదిగులేమీ పెట్టుకోకు. ఆమెకిఅప్పుడేకోరుకున్న వరుడు దొరికాడు.”

నవ్వేసిందిఎల్సీ.

“అసలుదేవుడికి రోజూదండం పెట్టుకోవాలి ఎల్సీ! లేకపోతే ఈ పాటికినేనుహేరియట్కిమొగుణ్ణయి రోజూఆమెతో చీవాట్లూ, తిరస్కారాలూ తింటూ వుండేవాణ్ణి. ఇప్పుడునీపక్కనే! ఇహనేనుచచ్చినానామనసులోమాట దాచుకోనమ్మాయ్! నువ్వెంతపెద్దకవయిత్రివైనాసరే, నేను సిగ్గూ బిడియంలేకుండావాగుతూనేవుంటా…”

“ నా కవిత్వం గురించి ఇప్పుడెందుకు?”

“విరివాల్టా గురించినువురాసినపాట వినిపిస్తావా? అందులో నేనేనటగానాయకుణ్ణి?”

నవ్వాపుకోలేకపోయిందిఎల్సీ!

 

****

త్వరలో…”ఎగిరే పావురమా!”

egire-pavurama1

మ్యాచీస్

drushya drushyam 37..
పంచుకునే క్షణాలు.అవి మామూలు క్షణాలే కావచ్చును. అత్యంత సర్వసామాన్యమైన క్షణాలే కావచ్చును.
కానీ, విలువైన సమయాలు. ఏదైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

క్షణకాలమే కావచ్చు.
కానీ, అవి బతికిన క్షణాలు. తర్వాత మామూలే.

అవసరం ఉన్నప్పుడు మాత్రం అవి మామూలు క్షణాలు కావు.

జీవితంలో అంత ప్రాధాన్యంగా తోచని ఆయా క్షణాలను సహజంగా, అవలీలగా ఛాయా చిత్రాల్లో పదిల పరచడం నిజంగా ఒక భాగ్యం.
సంబురం. సవాల్ కూడా.

ఈ చిత్రం చూడండి.
సిగరెట్టు లేదా బీడీ కాల్చడం.
అందుకు అగ్గిపెట్ట అవసరం కావడం.
ఇద్దరు. మ్యాచీస్.
అదే ఈ చిత్రం. ఒక లఘు చిత్రం.

+++

‘మ్యాచీస్ ఉందా?’
జవాబు ఉండదు. వినిపించదు.
కానీ, క్షణం తర్వాత చేతికి అగ్గిపెట్టె అందుతుంది.
అంతే.

చిత్రం పూర్తవుతుంది.
వారిద్దరూ సినిమా విడిచి పెట్టినాక ఎవరి దోవన వారు పోయే ప్రేక్షకుల్లా మళ్లీ మాయం.
మామూలే.

ఏమీ జరగనట్టు.

నిజానికి ఇటువంటి క్షణాలను బంధించడానికి సారస్వతం బాగుండదు.
కవిత్వం ‘అతి’ అవుతుంది.
దృశ్యమే పదిలం.

అవును.
కొన్నింటి అనుభూతి మాటల్లో చెబితే తేలిపోతయ్.
అక్షరాల్లోకి అనువదిస్తే భారమైతయ్.
ఛాయాచిత్రమే మేలు. పదివేలు.

ఈ వారం అదే. మ్యాచీస్. అడగ్గానే అగ్గిపెట్టెను అందిస్తున్నప్పటి అనుభూతి.

+++

నిజానికి చాలా ఉంటై.
ఇలాంటి ఔదార్యపూరిత క్షణాలు చాలా ఉంటై.
వాటిని అలవోకగా పదిల పర్చడానికి దృశ్యమానమే మహత్తరం.

కాకపోతే సమ్మతి ఉండాలి.
ఒక అలవాటును అంగీకరించే చేవ….ఒక అనుభూతిని అర్థం చేసుకోగల సమ్మతి. సానుకూలత తప్పనిసరి.
అప్పుడు మాటలేమీ ఉండవు, అభిమానంగా పంచుకునే క్షణాలు తప్ప!.

అందుకే అనడం…
ఒక మాధ్యమంగా లేదా యానకంగా ఛాయాచిత్రలేఖనం నిజంగా బతికిన క్షణాలను పదిలపర్చే అద్భుతమైన రచన అని!

+++

మరొక్కసారి ఈ ఛాయాచిత్రం చూడండి.
ఆ కళ్లు.
చిత్రంలో మూసుకున్నకళ్లు దేనికి చిహ్నం?

మళ్లీ మళ్లీ చూడండి.
అగ్గిపెట్టె తగిలినప్పటి దృశ్యం కదూ అది!

మీరు కళ్లు మూసుకున్నా లేదా తెరిచినా
జేబులోకి చేయుంచగానే ఆ వస్తువు తగిలితే అది చూపు.
కళ్లు అక్కడ తగులుతై.
అందుకే మూసుకున్న ఆ కళ్లు వస్తువు దగ్గర తెరుచుకోవడం ఒక దృశ్యం.

గమనించి చూడండి.

దృశ్యం దగ్గర చూపు ఆగనవసరం లేదు. స్పర్శ తగిలినా అది చూపే.
అప్పుడు కళ్లు అరమోడ్పులైతయి. మూసుకుంటై.
ఆనందానికీ, విషాదానికీ స్పందిస్తయి.
అట్లే ఒక సాహచర్యం. ఒక ఔదార్యం. పంచుకోవడం.
ఆ సమయంలోనూ కళ్లు జేబులోకి వెళుతై.
అప్పటి చిత్రమే ఇది.

మ్యాచీస్.

+++

అయితే, సాధారణంగా ఇద్దరి అనుభవంలో ఉన్నదే ఇది.
అగ్గిపెట్టెను షేర్ చేసుకోవడం ఎవరికైనా తెలిసిందే.
ముఖ్యంగా స్మోకర్స్ కు.

చిత్రమేమిటంటే, అదొక అదృశ్యం.
బయటకు తెలియనే తెలయదు.
అయితే, ఇద్దరి అనుభవంలో ఉన్నదాన్ని మూడవ అనుభవంలోకి తేవడమే ‘దృశ్యాదృశ్యం’.

పంచుకోవడం. ఆ క్షణాలు.
ఏమైనా ‘పంచుకునే’ ఆ కొన్నిఘడియలు అపూర్వమైనవి.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

నాన్న అంటే…వొక ఆదర్శం, వొక వాస్తవం!

నాన్నగారి  నవల "విజయ" ఆవిష్కరణ సందర్భంగా....ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో...

నాన్నగారి నవల “విజయ” ఆవిష్కరణ సందర్భంగా….ఆయన ప్రాణ మిత్రుడు మహాలక్ష్మేశ్వర రావు గారితో…

1

ఇప్పుడెలా వుందో తెలియదు చింతకాని!

          ఖమ్మం పక్కన చిన్న వూరు చింతకాని. ఆ రోజుల్లో చింతకాని స్టేషనులో పాసింజరు రైలు దిగితే వూళ్ళో నడిచి వెళ్లడానికి అర గంట పట్టేది. ఆ స్టేషను నించి వూరి నడి బొడ్డు – పీర్ల చావిడి- దాకా వెళ్తే మధ్యలో వొక పల్లెటూరి బతుకు ఎట్లా వుంటుందో అది అంతా అద్దంలో కనిపించినట్టు కనిపించేది. ఆ ఎగుడు దిగుడు బాటలు, అక్కడక్కడా విసిరేసినట్టుండే ఇళ్ళు, అనేక ఏళ్ల చరిత్ర భారంతో వంగిపోయినట్టున్న పెద్ద పెద్ద చింత చెట్లు, రాగి చెట్లు, మధ్యలో రామయ్య బావి, సీతమ్మ దిబ్బ….అబ్బాని తలుచుకున్నప్పుడల్లా ఈ పొడుగాటి బాట గుర్తొస్తుంది. సాయంత్రం బడి నించి వచ్చాక, రోజూ ఆ స్టేషను దాకా నడుచుకుంటూ వెళ్ళే వాళ్ళం, నేనూ అబ్బా.

స్టేషనుకి చేరాక అప్పటికే ప్లాట్ ఫారం బెంచీల మీద ఇంకో ముగ్గురు నలుగురు టీచర్లు ఆయన కోసం ఎదురుచూస్తూ వుండే వాళ్ళు. అక్కడ బెంచీల మీద కూర్చోనో, ప్లాట్ ఫారం మీద నడుస్తూనో వాళ్ళు కబుర్లు చెప్పుకుంటున్నప్పుడు నేను స్టేషను ఆఫీసులో బెంజిమన్ మాస్టరు గారితో ఆయన యంత్ర సామగ్రితో ఆడుకుంటూ వుండే వాణ్ని. వొక గంటా, గంటన్నర తరవాత మేము ఇంటి ముఖం పట్టేవాళ్లం. ఈ మొత్తం దినచర్యలో నేను చాలా ప్రశ్నలు రువ్వుతూ వుండే వాణ్ని. కొన్ని మాటలు, కొంత మౌనం. కొన్ని ఆటలు, కొంత అల్లరి. కానీ, ఈ బాల్య అనుభవం వొక పునాది తరవాత నేను చేయబోయే రహస్య సాహిత్య ప్రయోగాలకు! అప్పటికే అబ్బా అనువాద నవల “కళంకిని” (1973) అచ్చయి, తెలుగు సాహిత్యలోకం ఆయన వైపు అబ్బురంగా చూడడం మొదలెట్టింది. వొక రచయిత విజయాన్ని కళ్ళారా చూడడం, చెవులారా వినడం అదే మొదలు నాకు.

చింతకాని స్కూల్లో అబ్బాజాన్ “మధురవాణి” అనే వొక గోడ పత్రిక నడిపే వాళ్ళు. అది రెండు నెలలకి వొక సారి దినపత్రిక సైజులో నాలుగు పుటలుగా స్కూలు లైబ్రరీలో అతి విశాలమయిన బోర్డు మీద అందమయిన ఆయన చేతిరాతతో దర్శనమిచ్చేది. టీచర్ అంటే పాఠాలు చెప్పడం మాత్రమే కాదనీ, విద్యార్థిలో సృజనాత్మకత పెంచే బాధ్యత అని ఆయన భావించే వారు. “సార్ క్లాసులో కూర్చుంటే చాలు, వొక్క సారి వింటే అదే మెదడులో నిలిచిపోతుంది,” అని విద్యార్థులు ఆయన గురించి గర్వంగా చెప్పేవాళ్ళు. కానీ, అక్కడితో ఆగకుండా ఆయన ఎంతో కొంత భాషా ప్రేమ, సాహిత్య సంస్కారం పెంచాలన్న దృష్టితో “మధురవాణి” మొదలు పెట్టారు. ఇందులో కేవలం విద్యార్థుల రచనలు మాత్రమే వేసే వాళ్ళు. వాటిని ఆయనే కొంత ఎడిట్ చేసి, ఆ దిన పత్రిక సైజు పోస్టర్ల మీద రాసే వారు. “సారు చేతిరాత కోసమే చదువుతున్నాం ఇది,” అని విద్యార్థులు అనే వాళ్ళు. ఆలోచనలు ఎంత ముఖ్యమో, చేతిరాత అంత ముఖ్యమని ఆయనకి పట్టింపు వుండేది. విద్యార్థులని దగ్గిర కూర్చొబెట్టుకుని, వాళ్ళ దస్తూరి దిద్దబెట్టే వారు ఆయన- ఈ “మధురవాణి” పత్రిక గోడమీద పెట్టే రోజుల్లో నేను అయిదో తరగతి. ఆ పత్రికలో నా రచన కనిపించాలని నా పట్టుదల. కానీ, అబ్బా వొక పట్టాన వాటిని వొప్పుకునే వారు కాదు. చాలా సార్లు తిరగరాయించేవారు. నిర్మొహమాటంగా నిరాకరించే వారు. అక్కడ వున్న కాలంలో “మధురవాణి”లో నేను అతికష్టమ్మీద వొక గేయం, వొక కథ మాత్రమే చూసుకోగలిగాను. కానీ, రచయితగా అది నాకొక ప్రయోగ శాల అయ్యింది, చాలా ప్రయోగాలు విఫలమయినా సరే!

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

నా చింతకాని బాల్యం గురించి అన్వర్ ఊహించిన చిత్రం

ఇక ఇంటి విషయానికి వస్తే, పీర్ల చావిడి పక్కనే, మా ఇల్లు వుండేది. మా ఇల్లు అంటే కిలారు గోవింద రావు గారి ఇల్లు. ఆ రెండు గదుల ఇంట్లో తొమ్మిది మంది వుండే వాళ్ళం. దానికి తోడు, ఎప్పుడూ నాన్నగారి ఎవరో వొక సాహిత్య మిత్రుడు ఇంట్లో అతిధిగా వుండే వారు. వాళ్ళు మొదటి గదిని ఆక్రమించేస్తే, మేమంతా రెండో గదిలో ఇరుక్కుని వుండే వాళ్ళం. నేను మాత్రం మొదటి గదిలో ఆ సాహిత్య మిత్రుల సంభాషణలు వింటూ మూగిమొద్దులా కూర్చొని వుండే వాణ్ని. “ఒరే, నువ్వు కాస్త నోరు విప్పరా! నాకు భయమేస్తోంది నిన్ను చూస్తే!” అని వొక సారి దాశరథి గారు బయటికే అనేసి, నన్ను తన కుర్చీ పక్కన చేతుల్లోకి తీసుకుని, మాటల్లో దింపే ప్రయత్నం చేసే వారు. ఉర్దూ గజల్ వొకటి చెప్పి, దాన్ని నా చేత బట్టీ కొట్టించే వారు. అది నాకు ఎంతో వుత్సాహకరమయిన క్రీడ అయ్యింది. ఆ గజల్ రెండు పంక్తులూ నెమరేసుకుంటూ నేను, నా సొంత కవితలు కట్టే వాణ్ని. ముందు వాటిని పాడుకుంటూ తిరిగే వాణ్ని, నా స్నేహితులతో పాడించే వాణ్ని, ఆ తరవాత కాయితం మీద పెట్టే వాణ్ని. ఇదీ నా పాఠశాల!

ఈ మూడు భిన్న అనుభవాల కేంద్ర బిందువు అబ్బా. ఇక నిత్యనైమిత్తిక బతుక్కి వస్తే, ఆర్ధిక పరిస్తితులు బాగుండక, ఇంట్లో ఎప్పుడూ జొన్నన్నం, గోంగూర పచ్చడి మాత్రమే వుండేది. నెలకోసారి తెల్లన్నం, పావుకిలో మాంసం వండిన రోజు పండగలా వుండేది. కిలారు గోవిందరావు గారి ఇంటి నించి అప్పుడప్పుడూ కొంచెం ఎక్కువ పాలు, పెరుగు వచ్చిన రోజున అది మహాప్రసాదంలా వుండేది. కానీ, ఆర్థిక పరిస్తితులు బాగా లేవన్న బీద అరుపులు ఇంట్లో వినిపించేవి కావు. కొత్త పుస్తకాలు ఇంటికి వచ్చేవి, కొత్త కొత్త సాహిత్య మిత్రులు ఇంటికి వచ్చే వారు, చాలా కళకళలాడుతూ వుండేది ఇల్లు. “ఈ మాత్రం బర్కతు వుంది చాలు” అని తృప్తిపడేది అమ్మీ.

ఆ చిన్న వూళ్ళో మా చదువులు ఏమయిపోతాయో ఏమో అన్న బెంగతో కుటుంబాన్ని ఖమ్మం మార్చాలనుకున్నారు అబ్బా. చింతకాని, ఆ చుట్టుపక్కల వూళ్లలో ఈ విషయం తెలిసిపోయి, మా ఇల్లు వొక తీర్థ క్షేత్రమయ్యింది. ప్రతి వూరి నించీ విద్యార్థులు వాళ్ళ వాళ్ళ తల్లిదండ్రులతో ఇరవైల, పాతిక సంఖ్యలో వచ్చి, అబ్బాకి నచ్చచెప్పే ప్రయత్నాలు మొదలుపెట్టారు. వూళ్ళో పెద్ద పెద్ద రైతులు, నాయకులు ఖమ్మం జిల్లా పరిషత్తుకి వెళ్ళి అబ్బా బదిలీని ఆపడానికి ప్రయత్నించారు. కానీ, అబ్బా ఎవరి మాటా వినలేదు. చివరికి మాకు స్టేషనులో వీడ్కోలు ఇవ్వడానికి వూరంతా పెద్ద ఊరేగింపుగా స్టేషనుకు వచ్చింది, కళ్ల నీళ్ళు పెట్టుకొని!

2

“మీరు ఖిల్లాలోపల వుండాలి కౌముదీ సాబ్!”

అంటూ ఖమ్మం ముస్లిం మిత్రులు కొందరు ఖిల్లాలో చాలా చవకలో ఇల్లు చూపించారు. కానీ, అబ్బాకి అది ఇష్టం లేదు. “ఆ ఖిల్లా బంది ఖానా లా వుంది,” అనడం నాకు ఇప్పటికీ గుర్తు. కాంగ్రెస్ ఆఫీస్ వెనక ప్రసిద్ధ ఉర్దూ –తెలుగు రచయిత హీరాలాల్ మోరియా గారి ఇల్లు వుండేది. మళ్ళీ రెండు గదుల ఇల్లే, కానీ, చాలా పెద్ద ఆవరణ వుండేది. మోరియా గారు నామమాత్ర అద్దె మీద ఆ ఇల్లు మాకు ఇచ్చారు.

ఖమ్మం మా జీవితాల్లో పెద్ద కుదుపు. అబ్బా ఆలోచనల్లో కొత్త మలుపు. “సరిత” అనే టైటిల్ తో వొక సాహిత్య పత్రిక పెట్టాలని ఖమ్మంలో ఆయన “సాహితి ప్రెస్” పెట్టారు. ఖమ్మానికి ఆ ప్రెస్ అతి కొద్ది కాలంలోనే అదొక సాహిత్య కేంద్రంగా మారింది. కానీ, పత్రిక మొదటి సంచిక వచ్చే లోపలే, అబ్బా నష్టాల్లో కూరుకుపోయారు. ప్రెస్ నిండా మునిగింది, మేము అప్పుల్లో దిగడిపోయాం. ఆ తరవాత మా ఆర్థిక జీవనం మా చేతుల్లో లేకుండా పోయింది.

ఆ పరిస్థితుల్లో అబ్బా తెలుగు ప్రసంగాలు విన్న వొక క్రైస్తవ మిషనరీ ప్రచురణ సంస్థ ఆయన్ని వాళ్ళ తెలుగు విభాగం డైరెక్టరుగా ఆహ్వానించింది. మంచి జీతము, నాకు ఆస్ట్రేలియాలో కాలేజీ చదువుకి ఉపకారవేతనమూ ఆఫర్ చేసింది. “నా విశ్వాసాలకి దరిదాపుల్లో లేని ఏ పని నేను చేయలేను. పైగా, నా ఈమాన్ (faith) ని అమ్ముకోలేను,” అని అబ్బా ఖరాఖండిగా చెప్పడం నాకు గుర్తుంది. అబ్బా ఏ నిర్ణయం తీసుకున్నా దాని వెనక ఆయన చిత్తశుద్ధీ, సిద్ధాంత బలమూ కనిపించేవి. ఆయన అరబ్బీ, ఉర్దూ, ఫార్సీ బాగా చదువుకున్నారు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, సంస్కృతంతో పాటు! ఇస్లాం, వేదాలూ, మార్క్సిజం కూడా బాగా చదువుకున్నారు, ప్రాచీన ఆధునిక సిద్ధాంతాలతో పాటు! కానీ, వీటిలో వేటికీ ఆయన పూర్తిగా తలవంచలేదు. “అవన్నీ కళ్ళు తెరిపించాలి కానీ, కళ్ళు మూయకూడదు, అవన్నీ తలలో వుండాలి, కానీ అవే తల చుట్టూ రోకలి కాకూడదు,” అనే వారు. అటు అమ్మీ తరఫునా, ఇటు అబ్బా తరఫునా మా కుటుంబానికి కమ్యూనిస్టు చరిత్ర వుంది. అట్లా అని, వీళ్ళెవ్వరూ ఇస్లాం కి దూరం కాలేదు, అవి వొకే వొరలో ఎట్లా ఇముడుతాయి అని కొందరికి ఆశ్చర్యం కలిగిస్తూ.

తాతయ్య గారు నిజాం కొలువులో పనిచేశారు. దానికి భిన్నంగా నిజాంకి వ్యతిరేకంగా ఆయుధాలు దూసిన కమ్యూనిస్టుల పక్షం వహించారు అటు అమ్మీ తరఫు వాళ్ళు, ఇటు అబ్బా తరఫు వాళ్లు కూడా! పార్టీ కోసం వున్నదంతా వూడ్చిపెట్టారు, బంగారం లాంటి ఇనామ్ భూముల్ని కూడా ఖాతర్ చెయ్యలేదు. తీవ్ర ఆర్థిక కష్టానష్టాల్లో వున్నప్పుడు, బాగా కోపం వచ్చినప్పుడు అమ్మి అప్పుడపుడూ అనేది, “భూములూ ఇళ్ళు వదిలేసి, మీ అబ్బా పుస్తకాల గోనె సంచి వీపునేసుకుని, బెజవాడ వెళ్ళిపోయారు, పార్టీ కోసం!” అని. ఇంతా చేస్తే, అమ్మి కుటుంబం కూడా పార్టీ కోసం చివరి బంగారపు తునక కూడా ఇచ్చేసిన వాళ్ళే! పార్టీ రెండుగా చీలిపోయాక తమ ఇల్లే వాటాలు పడి, చీలిపోయినంత క్షోభ పడ్డారు, ఆ క్షోభ అబ్బాని చివరి దాకా వెంటాడుతూనే వుండింది, ఇలా మిగలాలా అని!

3

394925_10101015978163497_1224429015_n

“షంషుద్దీన్, నువ్వు రచనని అంతగా పట్టించుకోవడం లేదు. నువ్వు చాలా రాయగలవు. రాయాలి,”

అని అబ్బా బాల్యమిత్రులు, ఆనక బంధువులూ అయిన హనీఫ్ పెద నాన్న గారు ఎప్పుడూ అబ్బాని కోప్పడుతూ వుండే వారు. రచయితగా ఆయన ప్రయాణం అర్ధాంతరంగా ఆగిపోయిందని ఆయన మిత్రులు చాలా మంది ఇప్పటికీ అంటూ వుంటారు. ఆయన రచనలు ఇప్పుడు పెద్దగా అందుబాటులో లేకపోవడం మా దురదృష్టం. ఆయన 1960 నించి 1975 వరకూ విశాలాంధ్ర, యువజన, ప్రగతి, జనశక్తి, ఆంధ్రజ్యోతి పత్రికల్లో విస్తృతంగా సమీక్షలూ, కవిత్వం, కథలూ రాశారు, అనువాదాలు చేశారు. అభ్యుదయ రచయితల సంఘం ప్రచురించిన ప్రతి ప్రత్యేక సంకలనంలోనూ ఆయన కవిత్వం కనిపిస్తూనే వుండేది. కానీ, ఇదంతా నాకు రచయితగా వూహ తెలియని వయసు ముందే ఎక్కువగా జరిగాయి. బడి పంతులు బదిలీల బతుకులో వొక వూరంటూ స్థిరం లేకపోవడంతో చాలా రచనలు పోయాయి, ఇంట్లో అగ్ని ప్రమాదం జరిగి చాలా రచనలు దగ్ధం అయ్యాయని పెద నాన్న గారు అంటూండే వారు. ఇప్పుడు మిగిలిన కొన్ని కవితలయినా పెద నాన్నగారు తన ఇంట్లో భద్రపరచిన నోట్ పుస్తకాల నించి తీసినవి కొన్ని, కవితలు. నేను అక్కడా, ఇక్కడా తీసి దాచిపెట్టినవీ ఇంకొన్ని, ఇప్పుడు ఖాదర్ బాబాయ్ కొత్తగా సేకరిస్తున్నవి కొన్ని.

1975 తరవాత రచనకి సంబంధించి అబ్బా దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. “నాకు ఎందుకో చదవడంలో వున్న ఆనందం, రాయడంలో దొరకడం లేదు,” అనే వారు చాలా సార్లు. “అది రాయకుండా వుండడానికి వొక మిష మాత్రమే!” అని నేనొకటి రెండు సార్లు అన్నాను కూడా! కానీ, పార్టీ చీలిక ఆయన మీద గాఢమయిన ప్రభావం వేసిందని నాకు గట్టిగా అనిపించేది. అట్లా అని, పార్టీ పట్ల ఆయన నిబద్ధత ఏమీ తగ్గలేదు. ఖమ్మం వచ్చాక ఆయన అరసం సాహిత్య సమావేశాల్లో, సభల్లో నిమగ్నం అయ్యారు. అరసం అధ్యక్షుడిగా ఆయన ఖమ్మం జిల్లాలో చేసిన కృషి చిన్నదేమీ కాదు. మారుమూల పల్లెలో ఎక్కడ ఏ కవి, ఏ రచయిత దాగి వున్నా, ఖమ్మం పట్టుకొచ్చి, వేదిక ఎక్కించి, వాళ్ళ రచనల్ని తానే పత్రికలకి కూడా పంపించి, అదొక ఉద్యమంగా చేశారు. బెజవాడ, హైదారాబాద్, వైజాగ్ లాంటి సాహిత్య కేంద్రాలతో ఖమ్మంని అనుసంధానించి, ఖమ్మం జిల్లా సాహిత్య ఆవరణని పెంచారు. ఆ తీవ్రత చూస్తూ, “నువు కావ్యకర్తవి కావాలి కానీ, కార్యకర్తగా మాత్రమే మిగలకూడదు,” అని హనీఫ్ గారు గట్టిగానే మందలించే వారు.

ప్రజా నాట్య మండలి, అరసం వారసత్వ ప్రభావం వల్ల తానే వొక ఉద్యమంగా వుండడం, నిరంతరం జనంలో పని చెయ్యడం ఆయనకిష్టమయ్యింది. అక్షరదీపం కార్యక్రమం మొదటి సారి ప్రవేశపెట్టినప్పుడు, ఖమ్మం జిల్లా మారుమూల పల్లెల్లోకి ఆయన ఆ దీపాన్ని పట్టుకుని నడిచారు. రోడ్లు దిగని సర్కారీ జీపులకి సైతం పల్లె బాట చూపించారు, జీపు వెళ్లని చోటికి కాలి నడకన వెళ్ళి, తరగతులు నిర్వహించారు. నిరక్షరాస్యుల కోసం కథలూ, పాటలు రాసి, రాయించి, వాటిని పల్లెల్లో మార్మోగేట్టు చేశారు, ఆ క్రమంలో ఆయన ఆరోగ్యం దెబ్బ తినడం మొదలయ్యింది. దీనికి తోడు కుటుంబ ఆర్థిక పరిస్థితులు నానాటికీ దిగజారడం మొదలయ్యింది. నా చేతికి డిగ్రీ రాక ముందే, నేను వుద్యోగంలోకి వెళ్లాల్సి వచ్చింది. దిగువ మధ్యతరగతి కుటుంబం ఎదుర్కొనే కష్టాలన్నీ వొక్క పెట్టున దాడి చేశాయి.

పరిస్తితులు ఎటు తిరిగి ఎటు వచ్చినా, ఇంట్లో సాహిత్య వాతావరణం మాత్రం స్వచ్ఛంగా అలా మిగిలిపోయింది. అన్ని పని వొత్తిళ్ల మధ్యా, ఈతి బాధల మధ్య కూడా అబ్బా కనీసం అయిదారు గంటలు పుస్తక పఠనంలో గడిపే వారు. ముందు గదిలో పడక్కుర్చీలో అలా పుస్తకం ముందు విధేయంగా వుండే వారు. “నేను పాఠకుడిని మాత్రమే!” అని నిర్ద్వంద్వంగా చెప్పే వారు. “వొక గంట రాస్తే బాగుంటుంది” అనే వాణ్ని. కానీ, ఆయనలోని రచయితని ఉత్సాహ పరచడం అంత తేలిక కాదు. ఆయనలోని వొక పర్ఫెక్షనిస్ట్ ఎప్పుడూ ఆయనకి అడ్డంకి. “రాస్తే ఇట్లా రాయాలి,” అని కొన్ని ఉదాహరణలు చూపించేవారు. రచయితగా ఆయనకి అలాంటి ఆదర్శాలు కొన్ని వుండేవి, అవి ఎన్నడూ వాస్తవికతతో రాజీ పడేవి కాదు. ఆయన ఉదాహరించే రచయితలు అటు సంస్కృతం నించి ఇటు ఆంగ్లం వరకూ వాళ్లు తెలుగులో అనువాదాలకయినా లొంగని శక్తిమంతులే, కానీ – “నిజమే కావచ్చు, కానీ, వాళ్లెవ్వరూ మీరు మాత్రమే రాయాల్సింది రాయలేరు కదా?!” అనే వాణ్ని నేను. అదే దశలో ఆయన మళ్ళీ పత్రికా రచయితగా మారడం వల్ల రచనా వ్యాసంగం వేరే దారికి మళ్ళింది. తరవాత హిందీ ఉర్దూ నించి అనువాదాల కోసం ఎన్ని ప్రచురణ సంస్థలు అడిగినా, ఆయన వొప్పుకోలేదు. “అనువాదం అనేది వొక వ్యసనం. అలవాటు పడితే, అందులో కూరుకుపోతాం. రాయగలిగితే, ఎప్పటికయినా సొంత రచనే చెయ్యాలి. వొక బృహత్తరమయిన నవల రాయాలి,” అనే వారు. ఆ నవల రాసే రోజు రాలేదు, ఈలోపు ఆయన ఆరోగ్యం క్షీణించింది. కనీసం రెటైర్మెంట్ వయసు కూడా రాక ముందే, ఆయన కన్ను మూశారు.

ఆయన రచయితగా రాయాల్సినంత రాయలేదని మా అందరికీ అసంతృప్తి తప్ప, ఆయన మటుకు ఆయన సంతృప్తిగా జీవించారనే నాకు అనిపిస్తుంది. జీవితం మీద ఆయనకి ఫిర్యాదులు లేవు. అది తిరిగిన అన్ని మలుపులూ ఆయనకి తెలిసినవే, అవి ఆయనకి అపరిచితమయినవీ, ఆశ్చర్యకరమయినవీ కావు. అటు రచయితగా, ఇటు వ్యక్తిగా కూడా తన అర్ధాంతర నిష్క్రమణ అబ్బాకి ముందే తెలుసేమో అని చాలా సార్లు అనిపిస్తుంది నాకు. కనీసం అట్లా అనుకొని తృప్తి పడడం మినహా మేం చెయ్యగలిగిందేమీ లేక పోయింది!

*

అనువాద నాటకం ” ఫ్రిజ్ లో ప్రేమ” – రెండవ భాగం

(సచిన్ కుండల్కర్  ‘ఫ్రిజ్ మధే ఠేవ్ లేలా ప్రేమ్’ మరాఠీ నాటకానికి తెలుగు అనువాదం గూడూరు మనోజ )

friz

దృశ్యం-2 

           (ఆదివారం శుభ్రమయిన బట్టలు వేసుకుని రాసుకుంటూ ఉంటాడు ప్రసన్న. ఫ్రెష్ గా సంతోషంగా, వేగంగా కాగితాలమీద ఏదో దించుతున్నాడు.)

                                                    (పార్వతి వస్తుంది.)

 

పార్వతి: ప్రసన్నా… ప్రసన్నా, కాస్త డబ్బిస్తావా? పార్వతీబాయితో కాస్త కూరగాయలవీ తెప్పించాలి.

 

ప్రసన్న: తీసుకో.. లోపల పర్సుంది. దానికడగడమేమిటి పార్వతీ?

 

పార్వతి: భోజనంలోకి ఏం చేయమంటారు?

 

ప్రసన్న: నీచేత్తో చేసిన పనసకూర తిని చాలా రోజులయింది. చేస్తావా?

 

పార్వతి: దాన్దేముంది చేస్తాను. చాయ్ తీసుకుంటారా?

 

ప్రసన్న: చాయ్ ఇస్తానంటే నేనెప్పుడన్నా వద్దంటానా?

 

పార్వతి: విన్నారా…. ఇవాళ మధ్యాహ్నం టీ.వీ.లో షోలే సినిమా ఉంది. తొందరగా భోజనాల కార్యక్రమం ముగించుకొని ఎంచక్కా సినిమా చూసేద్దాం. సాయంత్రం టీతో పచ్చి బఠానీల గింజెలు తాలింపు చేస్తాను.

 

ప్రసన్న: పార్వతీ… ఇదే. నా కవిత…. చదువుతాను విను.

 

పార్వతి: తర్వాత, నేను కాస్త వంటింట్లో పని సవరించుకొని టీ తీసుకొస్తాను. అప్పుడు చదివి వినిపించండి.

(ఆమె తొందరతొందరగా లోపలికెళ్తుంది.)

( పార్వతి లోపలికెళ్ళి పార్వతీబాయిని స్టేజి మీదికి తోస్తుంది. పార్వతీబాయి ప్రసన్న ముందుకొచ్చి పడుతుంది.)

 

ప్రసన్న: ఏమయింది పార్వతీబాయి ?

 

పార్వతీబాయి: ఎక్కడ ఏమీ కాలేదు. ఏమయిందవడానికి? అమ్మగారు ఏమో తను ఫ్రిజ్ శుభ్రం చేసుకుంటానన్నారు. క్రిందిది పైనా, పైనది కిందా పెడుతుంటారు. నన్నేమో బయటికెళ్ళి కూర్చోమన్నారు.

 

ప్రసన్న: పార్వతీబాయి, బజారుకెళ్తున్నవా? (whisper చేస్తాడు) నేనొకటి చెప్పనా ?

 

పార్వతీబాయి: నేనో బీద-దరిద్ర-అసహాయ-అబలని, మీరు పని చెప్పేవారు నేను వినేదాన్ని.

(ప్రసన్న దాచిపెట్టిన ఓ కవరు బయటికి తీస్తాడు. కాగితాల గుట్ట నుండి ఓ కాగితం వెదికి తీస్తాడు. పార్వతి చూస్తుందాలేదా అన్నది నిర్ధారించుకుంటాడు. ఆ కాగితాన్ని కవర్లో వేసి కవరుమీద నాలికతడి తగిలించి మూసేస్తాడు. పార్వతీబాయి ఇస్తాడు.)

 

ప్రసన్న: ఈ కవర్ తీసుకో… ఎవరితో చెప్పొద్దు… మన ఇంటి సందు మూలలో ఒక చెత్తకుండి ఉంది చూసావా…

 

పార్వతీబాయి: ఎక్కడా…?

 

ప్రసన్న: ఎర్ర రంగుది. గుండ్రంగా ఉంటుంది. ముందుభాగంలో ఇలా నల్లటి మొహంలా ఉంటుందే అది.

 

పార్వతీబాయి: సరే, అయితే ?

 

ప్రసన్న: ఈ కవర్ని ఆ కుండిలో వేసెయ్. ఎవ్వరికీ చెప్పకు. కానీ ఇంకా ఆ చెత్తకుండీ అక్కడే ఉందంటావా? ఆరేళ్ళ నుండి ఈ ఇంటి బయటికి వెళ్ళింది  లేదు నేను. ఈ కుక్కల భయంమూలంగా ఎక్కడికీ వెళ్ళింది లేదు. మా దగ్గరికీ ఎవరూ రారు. ఆ కుక్కలకి పెద్ద పెద్ద కోరలుంటాయి. మన కాళ్ళల్లోకి చేతుల్లోకి దిగబడతాయి. పది పన్నెండు కల్సి మొరుగుతుంటే సాయం కోసం మనం పెట్టే కేకలు మనకే వినబడవు. కళ్ళెర్రబడ్డ పిచ్చిపట్టి అసహ్యపు బరితెగించిన కుక్కలు!

 

పార్వతీబాయి :  నేనో  బీద _ దరిద్ర -అసహాయ- అబలని. మీదీ,  నాది అదృష్టమనుకోండి. నేనీ  ఇంటికొచ్చి  పడడం.  భయపడకండి. నేనేసేస్తానీ కాగితం చెత్తకుండిలో. అన్నా నేనో బీద పేద- దరిద్ర- అసహాయ- అబలని…. చిన్ననోటితో పెద్దమాటనుకోనంటే ఒకటడిగేదా….

 

ప్రసన్న: అడుగడుగు.

 

పార్వతీబాయి: మీరు పెద్ద రచయితలు. ఇల్లుదాటకుండా కూర్చుని ఈ బరితెగించిన కుక్కల గురించి రాస్తుంటారా? ఉర్కే! నాకు చదువొచ్చు. చదువుకున్నదాన్నే. పుస్తకాలు చదువుతాను. మీ పుస్తకాలిస్తారా చదవడానికి?

 

ప్రసన్న: తప్పకుండా ఇస్తాను, పార్వతీబాయి.

 

పార్వతి: (లోపలి నుండి వస్తుంది) పార్వతీబాయి… వచ్చేసావా బజారునుండి పనసకాయ తెచ్చావా?

 

పార్వతీబాయి: తెచ్చాను. ఇప్పుడే వచ్చాను బజారు నుండి. ఇదిగోండి పనసకాయ బజారంతా ఒకటే రద్దీ.

ఆదివారం కదా ఇవాళ! కొత్త కొత్త బట్టలేసుకొని తిరుగుతున్నారు జనాలంతా.

 

పార్వతి: ఆ… ఇవాళ ఆదివారం. పార్వతీబాయి, ఇవాళ చాలా పనిచేసావ్. ఇవాళ నీకు ఒకపూట సెలవు. ఇంటికెళ్ళి విశ్రాంతి తీసుకో. ప్రసన్నా, పదిహేను నిమిషాల్లో పనసకూర చేసేస్తాను. భోంచేసి కబుర్లు చెప్పుకుందాం. నీ కొత్త రచనలు వినిపించాలి. నేనొస్తానిప్పుడే…

 

(పనసకాయ తీసికొని వెళ్తుంది.)

(పార్వతి వెళ్తూనే సూర్య, చంద్రులు పరిగెత్తుకొస్తారు. అవి అతని కాగితాలని చెల్లాచెదురు చేస్తాయి.        చంద్ర పార్వతీబాయి చేతిలోని కవర్ తెసికొని పరిగెడుతుంది.)

 

(పార్వతీబాయి తలలోని చేమంతుల దండ తీసి సూర్యచంద్రులకి వాసన చూపిస్తుంది. రెండూ ఆమె కాళ్ళు నాకుతూ మోకరిల్లుతాయి. ఆమె చంద్ర నోట్లోని కవర్ తీసికొని దాన్ని ఓ గుద్దు గుద్దుతుంది. అది కుయ్యో మొర్రోమంటుంది. ప్రసన్న ఇదంతా భయంభయంగా చూస్తుంటాడు.)

 

పార్వతీబాయి: చచ్చిందానా, మళ్ళీ ఇలాంటి అల్లరి పని చేసావంటే ఒంటిమీద కిరసనాయిలు పోసి నిప్పంటిస్తాను. నువ్వురా…. సూర్య.. మాదర్చోద్, అన్ని కాగితాలని చిందరవందర చేస్తావా? సరిగ్గా పెట్టవన్నీ

… ఒక్క దగ్గర పెట్టు… (దాన్నీ కొడుతుంది.)

 

(సూర్య వెళ్ళి కాగితాలన్నీ సరిచేస్తాడు.)

 

పార్వతీబాయి: ఇప్పుడేమంటారు?  అన్న పేద్ద రచయిత. ఇంటికాలు బయట పెట్టకుండా ఏడు సముద్రాలు తాకి వచ్చినవారు. నేనూ చదువుకున్నదాన్ని. నేనాయన పుస్తకాలు చదివాను. ఆయన్ని బాధపెట్టకూడదు. ఆ… అయితే.. నాకిప్పుడు ఓమాట చెప్పండి (పార్వతి లోపలే ఉందని నిర్ధారించుకొని) ఫ్రిజ్ లో ఏముంది?

 

ప్రసన్న: (ఒకేసారి) ఫ్రిజ్ లో ప్రేమ ఉంది.

 

పార్వతీబాయి: పద… పదండి… బయటికి పొండి.

(చంద్ర, సూర్యులు వెళ్ళిపోతారు.)

( ప్రసన్న వైపుకి తిరిగి – )

అన్నా, నేనొస్తా. ఇవాళ ఆదివారం. సగం పూట సెలవు. నేనెళ్ళి మీ పుస్తకం చదువుకుంటాను.

(తలలో పూలదండ ముడుచుకొని ఉత్తరం తీసికొని వెళ్తుంది. ప్రసన్న మెడ త్రిప్పుతూ నవ్వుతాడు.)

(పార్వతి రెండు కంచాలు తీసుకొని వస్తుంది.)

 

పార్వతి: ప్రసన్నా… నేనొచ్చేసాను. ఇదిగో, వేడి వేడి పనసకూర.

(ప్రసన్నకి ప్రేమగా ముద్దలు తినిపిస్తుంటుంది.)

 

ప్రసన్న: కూర చాలా బాగా కుదిరింది పార్వతీ, నేనో గమ్మత్తు చెప్పనా నీకు.

 

పార్వతి: అయ్యో…. నేను కూడా చెప్పాలి నీకు ఓ గమ్మత్తు.

 

ప్రసన్న: అయితే మొదట నువ్వు…

 

పార్వతి: లేదు, లేదు. ముందు నువ్వు.

 

పార్వతి: ప్లీస్, ప్లీస్.. ముందు నువ్వు.

 

పార్వతి: సరేనమ్మా…

(ఆమె ప్రసన్న చెవిలో ఏదో చెబుతుంది. ఇద్దరూ నవ్వుకుంటారు. ప్రసన్న ఆమె చెవిలో ఏదో చెపుతాడు. మళ్ళీ ఇద్దరూ నవ్వుతారు.)

(పార్వతి ఒక్కసారిగా లేచి నిల్చుంటుంది.)

(మొహం గంభీరంగా)

 

పార్వతి: సరే, పన్నెండయింది. ఆదివారం గడిచిపోయింది. సోమవారం మొదలయింది.

 

ప్రసన్న: పార్వతీ, కూర్చో పార్వతీ, ఐదు నిమిషాలు… మాత్రమే.

 

పార్వతి: కూర్చొనే సమయం లేదు బాబూ. ఇంటి నిండా అక్కడక్కడ అంతా ప్రేమ పడిపోయింది. అంతా ఒక్క దగ్గర చేర్చి ఫ్రిజ్ లో పెట్టాలి. చాలా పనులు ఉన్నాయి. ఇవాళ తెల్లవారుఝామున బయల్దేరాలి నేను. ఈ నోరులేని కుక్కల హక్కుల సంరక్షణ పరిషత్తు తరపున..

 

ప్రసన్న: ఎక్కడికి ?

 

పార్వతి: అందరమూ తిరువనంతపురంలో కలుస్తాం. ముందు లెనిన్ గ్రాడ్, తర్వాత స్టాలిన్ గ్రాడ్, ఆ తర్వాత బేల్ గ్రాడ్, ఆ… తర్వాత మాస్కో.

 

ప్రసన్న: ఓహో … అయితే ‘వాళ్ళు’ నడుపుతారా మీ సంఘటనని?

 

పార్వతి: లేదు. ముందు పూర్తిగా విను. మాస్కో నుండి వాషింగ్టన్, న్యూయార్క్, లండన్ లో కూడా ఒక పరిచర్చ ఉంది.

 

ప్రసన్న: వాళ్ళు కూడా ఉన్నారా మాలో?

 

పార్వతి: ముందు విను.. తిరిగి వచ్చే దారిలో బాగ్దాద్, తెహ్రాన్ లో కూడా పరిషత్తు సమావేశాలు ఉన్నాయి. ఈ మూగజీవుల కోసం పని చేసేవారిని దేశం, ధర్మం, రాజకీయాలు బంధించిపెట్టలేవు. బాగ్దాద్ నుండి పెద్ద సంఖ్యలో వేల కుక్కల్ని తీసికొని తిరిగి వస్తాము మేము. పండరిపురంలో చంద్రబాగానది తీరపు ఇసుక తిన్నెల్లో వాటిని వదిలివేస్తాం. వేలకొద్దీ కుక్కలవి, వేరువేరు జాతులవి, ధర్మాలవి, చంద్రభాగ ఇసుక తిన్నెలు

అదిరిపోతాయి. ఎంత బాగుంటుందో కదా ఆ దృశ్యం?

 

ప్రసన్న: అవునవును!

 

పార్వతి: నేనివాళ వెళ్ళి రేపొస్తాను. ఇల్లు జాగ్రత్త. నీమీద విశ్వాసంతో ఫ్రిజ్ తాళంచెవి నీకిచ్చి వెళ్తున్నాను. తాళంచెవి జాగ్రత్త. ప్రేమని జాగ్రత్తగా వాడు. అంతా ఖాళీ చేయకు. ఫ్రిజ్ కి మళ్ళీ జాగ్రత్తగా తాళంవెయ్. తాళం చెవి భద్రంగా దాచెయ్- ఏం?

 

ప్రసన్న: సరే… సరే. కంగారుపడకు. బేఫికరుగా వెళ్ళు.

(పార్వతి జాకెట్టులో నుండి తాళంచెవి తీసి ప్రసన్న చేతిలో పెడుతుంది. ప్రసన్న దాన్ని పిడికిట్లో పెట్టుకుంటాడు. దీపాలు ఆరిపోతాయి.)

( సశేషం )

సచిన్ కుండల్కర్

సచిన్ కుండల్కర్

మూల రచయిత : సచిన్ కుండల్కర్

అనువాదం : గూడూరు మనోజ

guduru manoja

 

 

 

 

 

తాకినపుడు

bvv

మాటలసందడిలో తటాలున ఆమెతో అంటావు
నీ నవ్వు కొండల్లో పరుగులు తీసే పలుచని గాలిలా వుంటుందని
పలుచనిగాలీ, మాటల సెలయేరూ ఉన్నట్లుండి
చిత్రపటంలోని దృశ్యంలా ఆగిపోతాయి

కవీ, ఏం మనిషివి నువ్వు
ప్రపంచాన్ని మొరటుగా వర్ణించడం మాని
రహస్యంగా, రహస్యమంత సున్నితంగా ప్రేమించటం
ఎప్పటికి నేర్చుకొంటావని నిన్ను నువ్వు నిందించుకొంటావు

తాకితేనే కాని, పదాల్లోకి ఒంపితేనే కాని
నీ చుట్టూ వున్న అందాన్నీ, ఆనందాన్నీ
అనుభవించాననిపించదు నీకు

నిజానికి, వాటిని తాకకముందటి
వివశత్వ క్షణాల్లో మాత్రమే నువు జీవించి వుంటావు
తాకుతున్నపుడల్లా నిన్ను మరికాస్త కోల్పోతావు

పసిబిడ్డల పాలనవ్వులకన్నా సరళంగా
జీవితం తననితాను ప్రకటించుకొంటూనే వుంటుంది ప్రతిక్షణం
నీకో ముఖం వుందని అద్దంచెబితే తప్ప తెలుసుకోలేని నువ్వు
లోకంలోని ప్రతిబింబాల వెంట పరుగుపెడుతూ
జీవితాన్ని తెలుసుకోవాలని చూస్తావు

ఆమె కోల్పోయిన నవ్వుని మళ్ళీ ఆమెకి ఇవ్వగలవా

-బివివి ప్రసాద్

ఇంకేమి కావాలి మనకి ?

270935_4171892938756_454406042_n
ఏకాంతమో వంటరితనమో
ప్రపంచం అంతా చుట్టూ కదులుతూ ఉన్నపుడు
కదలికలు లేని మనసులో
జ్ఞాపకాలు తమ వాటా గది ఆక్రమించేసి గడ్డ కట్టేసాక
శ్వాసలు కొవ్వోత్తులే ఆవిరయిపోయాక
వెలుతురు తడి దృశ్యం అస్పష్టంగా కళ్ళని తడుముతుంటే
మాటల గొలుసుల సంకెళ్ళ రాపిడిలో మనసులు నలుగుతుంటే
విరిగింది ఊపిర్లో పెదవులమీద నవ్వులో తేల్చుకోవటం కష్టమే కదూ ?
****
అవిశ్వాసాలు అపనమ్మకాలు చైనా వాల్ లా ద్వేషపు గోడలు అడ్డం కడుతుంటే
ఆనందానికి  బాధకి అర్ధం తెలియని కన్నీటి  ముచ్చట్లు చెంపలను ముద్దాడుతున్నపుడు
ఆత్మలకి అందనంత దూరం లో బ్రతికేస్తూ
నుదిటి రాతల్లో, డెస్టినేషన్ లేని దారుల్లో సముద్రపు ఇసుకలా కలిసిపోతూ
కళ్ళు మర్చిపోయిన కలలని కాలం తో అల్లుకుపోతూ
గుండెలుగుండె చప్పుళ్ళు పూర్తిగా వేరై శ్వాసిస్తూనే ఉన్నా బ్రతికిలేనట్టుగా
ఇత్తెఫాక్ గానే చాన్సులన్నీ  జీవితానికి పోగొట్టుకొని
ఓడి గెల్చానో
గెలుపుల్లో ఓటమికి ఓదార్పయ్యానో  తేల్చుకోవటం కష్టంగానే ఉంది
****
నిన్ను చాలాసార్లు అడగాలి అని అనుకుంటాను జీవితం
నన్నే సంపూర్తిగా సమూలం గా నీకిచ్చెసానుగా ఇంకా ఈ శోధనలెందుకు?
తీరాలు లేకుండా ప్రవహించే నీ జీవనదిలో ఎప్పుడో మునిగిపోయానే
నీకు నాకు మధ్య మొగ్గలు తొడగని తోటల్లా మిగిలిన ఈ ఖాళీలు ఎందుకు
మాటలు మనసులు  నీతో పంచుకోవాలని ఎంతగానో అనుకుంటాను
నీ నిశబ్దపు కేకలు అర్ధం చేసుకోవాలి అని ఎంతగానో ఎదురుచూస్తాను
ఆశాంతి వేదన పడే నిన్ను దూరంగా నిలబడి అయినా ఓదార్చాలి అనుకుంటాను
నీ కన్నీటికి తోడుగా  నాతో దొంగిలించి తెచ్చుకున్న నా ఆత్మని ఒక్కసారి
నీకు తోడు గా ఇవ్వాలి అన్న కోరిక ని దాచుకోలేక ,ఓర్చుకోలేక
ఇచ్చి నీ బంధనాల్లో ఇరుక్కోలేక , నీకై చావాలో నాకై బ్రతకాలో
తేల్చుకోవటం నిజంగా కష్టం గా ఉంది .
****
ఒకటి మాత్రం నిజం
వెన్నెల తడి అరచేతుల్లో మెరిసినపుడో
వేకువ వర్షాలు కళ్ళని తడుపుతూ తృప్తిగా శరీరంలోకి  ఇంకుతున్నపుడో
తెలిమంచుల్లో గాలులని బుగ్గల నిండా నింపుకొని సంబరపడ్డపుడో
నన్ను నేను మర్చిపోయి మైమరచిన ప్రతిక్షణం
నాలో లేని నిన్ను చాలా మిస్ అవుతున్నాను
****
కలవని సరళ రేఖల్లా మన ప్రయాణం ఎంత కష్టమో తెలియదు
విడిపోయిన కాంతి కిరణాల్లా ఎంత మన మధ్య ఎంత దూరమో అసలే తెలియదు
స్పందనలు ప్రతిస్పందనల న్యూటన్ ౩ర్డ్ లా విశ్వ నియమాలు ఉన్నంత  కాలం
నేను ఓడినా, నువ్వు గెలిచిన నీకు నేను తోడుగానే ఉంటాను
నా చీకటి నీడలా నువ్వెపుడు నా వెంటే ఉంటావు.
చాలదూ? ఇంకేమి కావాలి మనకి ?

-నిశీధి

చిత్ర సౌజన్యం: ఏలే లక్ష్మణ్

ఆ రోజు “గోముఖ్” ఒక మార్మిక చిత్రం…

1

బదరీనాథ్ వెళ్ళే దారిలో చమోలీ జిల్లాలో పిపల్ కోటి అనే ఓ మాదిరి ఊరుంది. అక్కడో చిన్న అందమైన హోటల్ లో మేం ఒక రాత్రి గడిపాం. విశ్రాంతిగా అందరం ముచ్చట్లు చెప్పుకుంటున్న ఆ రాత్రి వేళ దూరాన ఉన్న ఓ కొండ మీద మోదుగ పూల మాలలా మంటల చార వెలుగుతూ కనిపించింది. అంటుకున్న అడవి ఎప్పటికి చల్లారుతుందోననుకుంటూ నిద్రలోకి జారుకున్నాం.

మర్నాడు పొద్దునే మా స్నానాలకు బకెట్లతో వేడినీళ్ళు కాచి ఇచ్చేందుకు ఇద్దరు పిల్లలు అటూ ఇటూ పరుగులు పెడుతున్నారు. ఆ నీళ్ళు తెచ్చుకుందుకు మేడ మెట్లెక్కి నేనూ వెళ్లాను. హోటల్ గదులు కింద ఉన్నాయి. పైనున్న అంతస్తుతో సమానంగా ఉన్న విశాలమైన కొండ భాగం. చూస్తే అక్కడో అందమైన దృశ్యం కళ్ళ ముందు పటం కట్టింది… ఒక వెయ్యి గజాల స్థలంలో వేసుకున్న రక రకాల పంటలు… వాటిలో పసుపు, వెల్లుల్లి దగ్గర్నుంచి గోధుమ వరకూ ఉన్నాయి. చిన్న గుడిసె పక్కనే విశ్రాంతిగా నెమరేసుకుంటున్న ఆవూ, పక్కనే దూడ… ఆ పక్కనే పొయ్యిమీద వేడినీళ్ళు కాగుతున్నాయి. ఈ చక్కని చిన్న ప్రపంచాన్ని పోషిస్తున్న వ్యక్తి ఎవరా అని చూస్తే, ఓ ముప్పయ్యేళ్ళ స్త్రీ నీళ్ళు మోసుకొస్తూ ప్రత్యక్షమైంది. రాత్రి అంటుకున్న అడవి గురించి అడిగితే, ‘నిర్లక్ష్యంగా విసిరేసిన చిన్న బీడీ నిప్పు చాలు అడవిని తగలబెట్టడానికి’ అంది. ఇలా అడవి అంటుకోవటం వల్ల వాగుల్లో నీళ్ళు తగ్గిపోతాయంటుంది. నీళ్ళు లేక తన ఆ చిన్న వ్యవసాయం ఎంత కష్టంగా ఉందో వివరించింది.

2

బదరీనాథ్ ఒక పది కిలోమీటర్ల దూరం ఉందనగా దారి చాలా ఇరుగ్గా మారింది. సూదిగా ఉన్న రాతి పలకలు ఒకదానిమీద ఒకటి పేర్చినట్టుగాఉన్న కొండచరియలు ఒకవైపు, లోయల అగాధాలు మరోవైపు… ఆ మధ్య దారిలో జాగ్రత్తగా బస్సును పోనిచ్చాడు మా డ్రైవర్. చినుకులతో పాటు సన్నని చలిని అనుభవిస్తూ మాకు ఏర్పాటు అయిన బసలో చక్కని భోజనం చేస్తుంటే, మా వెనుక బస్సులో వచ్చినవాళ్ళు తమ కళ్ళ ముందే ఒక ఇన్నోవా లోయలో పడిపోయిందని చెప్పారు. నోరంతా చేదెక్కింది. ఇలా వాహనాలు లోయల్లో పడి మనుషులు ప్రాణాలు పోగొట్టుకోవటం తరచుగానే జరుగుతుందట. మా డ్రైవర్ ఈ విపరీతాలకు కారణం వివరించాడు. వీలైనంత తక్కువ సమయంలో ఈ యాత్రలు పూర్తి చేసేద్దామని అనుకుంటూ డ్రైవర్ లకు రాత్రి సరిగ్గా నిద్రపోయే అవకాశం కూడా ఇవ్వకుండా, వెళ్ళకూడని వేగంతో కొండదారుల్లో పరుగులు తీయించే వాళ్ళ వల్ల ప్రమాదాలు జరిగే అవకాశం ఎక్కువని అతను చెప్పాడు. పరుగుల జీవిత వేగాన్ని కొండల్లోని నిదానపు నడక దారుల మీద overlap చెయ్యబోతే గమ్యం ప్రతీసారీ అనుకున్నట్టుగా అందదు.

బదరీనాథ్ దగ్గర అలకనంద పరవళ్ళు తొక్కుతోంది. గుడికి వెళ్లేందుకు నది మీద కట్టిన వంతెన పైన నించుని తదేకంగా నీటి ఉరవడి చూస్తుంటే ఒక్కసారిగా అందులోకి దూకేసి సుడి తిరిగి ముక్కలైపోదామనే వింతైన భయపు కోరిక… నది ఒడ్డున పితృదేవతలకు పిండాలు పెడుతున్న తంతు నిర్విరామంగా నడుస్తోంది. ఈ ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అని కూడా అంటారు. ఇక్కడ సహజంగా ఏర్పడ్డ వేడినీటి గుండంలో మెడలోతు మునిగి చాలాసేపు చేసిన స్నానం ఒంటిని తేలికపరిచింది. ఆలయంలో బదరీనాధుడు సుందర మూర్తి .

మా తరువాతి గమ్యం గంగోత్రి వెళ్ళే దారిలో విశాలం గా పరుచుకున్న లేత గడ్డి మైదానాలూ, ఎండలో మెరిసే మేరు పర్వతం కనువిందు చేశాయి. గంగోత్రి దగ్గర గంగమ్మ పేరు భాగీరథి. భగీరథుడు ఈ ప్రాంతంలోనే గంగను భూమికి తీసుకొచ్చాడని పురాణ గాథ. సాయంత్రం వేళ నది వొడ్డున గుడిలో గంగాదేవికి ఆరతులూ పూజలూ జరిగాయి. గంగ భువికి దిగిన ఈ ప్రదేశం నుంచీ కాశీ వరకూ ‘గంగా మయ్యా’ అని గౌరవంగా పిలిపించుకుంటూ అన్నిచోట్లా సాయంత్రంవేళ ఆరతులు అందుకుంటూనే ఉంటుంది. హరిద్వార్ లో మే నెలలో గంగ దసరా అనే పెద్ద ఉత్సవం కూడా జరుగుతుంది.

3

కేదార్, బదరీ, గంగోత్రి యాత్ర అనుకున్నప్పుడే మా అన్నయ్యతో ‘గంగోత్రి వరకూ వెళ్లి గంగా నది జన్మస్థానం ‘గోముఖ్’ వెళ్ళకుండా ఎలా?’ అన్నాన్నేను. బయలుదేరిన 15 మందిలో గోముఖ్ వెళ్ళేవాళ్ళు అయిదుగురం లెక్క తేలాం. ‘సరే మీరు ఒక రోజులో గోముఖ్ వెళ్లి రండి. మిగతా వాళ్ళు గంగోత్రిలో మీ కోసం ఒక రోజు ఆగుతారు. తరువాత అందరం తిరిగి వద్దామ’ని తను ప్లాన్ చేశాడు. గంగోత్రి నుండి గోముఖ్ వెళ్లి రావటం మొత్తం 38 కిలోమీటర్ల ప్రయాణం. కొండల్లో ఎక్కేటప్పుడు గంటకు రెండు కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం వెళ్లలేము. ఒక రోజులో నడిచి వెళ్లి రాగలిగే పని కాదని అర్ధం అయింది. కానీ గంగోత్రి నుండి గోముఖ్ కు గుర్రాల మీద కూడా వెళ్ళొచ్చు. గుర్రాల మీద అయితే తెల్లారుజామునే బయలుదేరి చీకటి పడేలోగా వచ్చెయ్యగలమనే ఊహతో ముందు రోజే పర్మిట్లు తీసుకున్నాం. ఆసక్తి కలిగించే విషయం ఏమిటంటే, రోజుకు 15 గుర్రాలకూ 150 మంది వరకూ మనుషులకూ మాత్రమే గోముఖ్ వెళ్ళటానికి పర్మిట్లు ఇస్తారు. దీనికి కారణం, గోముఖ్ గ్లేసియర్ గడిచిన 70, 80 ఏళ్ళలోనే ఒక కిలోమీటరు దూరం వెనక్కు వెళ్ళిపోయిందని తెలుసుకోవటం… ఇంతకు ముందు గోముఖ్ కూడా మంచి ఆధ్యాత్మిక టూరిస్టు ప్రాంతం. జనం రాక పోకలూ, వ్యాపారాలూ, చెత్త కుప్పలతో కేదారనాథ్ లాగే ఉన్నట్టు అప్పట్లో వెళ్ళినవాళ్ళ అనుభవాల వల్ల తెలిసింది. మనుషుల దాడి తట్టుకోలేకేమో, గ్లేసియర్ బెదిరిన ఆవులా వెనక్కి అడుగులు వేస్తోందని గుర్తించాక, ప్రభుత్వం కళ్ళూ, చెవులూ తెరిచి, గోముఖ్ ప్రయాణాల మీద ఈ ఆంక్షలు పెట్టింది.

వెళ్ళే దారంతా తినటానికి ఏమీ దొరకదని తెలిశాక మరీ హాయి అనిపించింది. ముందురోజే గంగోత్రిలో రెస్టారెంట్ వాళ్ళను పొద్దున్నే మాకోసం పరాఠాలు తయారు చేసిపెట్టమని అడిగి, అవి తీసుకుని బయలుదేరాం. కొండల్లో వాతావరణాన్ని ఏమాత్రం నమ్మటానికి లేదు. ముందురోజు రాత్రే సన్నగా చినుకు మొదలై, వదలటం లేదు. అది ముసురు వాన లాగే అనిపించింది. ఎత్తుగా బలంగా ఉన్న అయిదు గుర్రాల మీద నేనూ, జయసూర్యా, శంకర్, జానకి, కాశ్యప్, మాతోపాటు గుర్రాలను నడిపించేవాళ్ళూ … అందరం తెల్లవారుజామునే బయలుదేరాం. నన్ను ఓ ఆడగుర్రం మీద ఎక్కమన్నారు. దాని పేరు భూరీ. కేదారనాథ్ దారిలో నేనెక్కిన పెంకి గుర్రాన్ని తలుచుకుంటూ, భయంగానే గుర్రం ఎక్కి కూర్చున్నాను. కాసేపటికి దాని వీపు మీద స్థిరంగా కూర్చున్నట్టు అనిపించిందో లేదో, ఒక్కసారిగా ఎత్తు రాళ్ళ మీదకు ఎగిరి, గట్టి చప్పుళ్ళతో డెక్కలు ఊని, నన్ను గాభరా పెట్టింది. భూరీని అదిలిస్తూ, అది నెమ్మదైన, తెలివైన గుర్రమేనంటూ నాకు ధైర్యం చెపుతున్నాడు భోలా.

4

వాన కాసేపు ప్రేమికుడి ప్రియవచనాల్లా మెత్తగా తాకుతోంది. కాసేపు పెద్దవాళ్ళ అదిలింపులా గుచ్చుకుంటోంది. లోపలి బట్టల్లోకి ఇంకటానికి అడ్డు పడుతున్న రెక్సిన్ జాకెట్ల మీదినుంచి అలుగుతూ బొట్లుగా జారిపోతోంది. పల్చని రెయిన్ కోట్లు ఒంటి నిండా వేసుకోవటానికి ప్రయత్నించినా ఆవంత సౌకర్యంగా అనిపించలేదు.

ఎక్కడా ఎండ పొడ వచ్చే ఆస్కారం కనిపించలేదు. ప్రకృతి నిశ్శబ్దంగా, సన్నని మబ్బుపొరలని ఆచ్చాదనగా చుట్టుకుని స్నానిస్తోంది. మేము తప్ప ఇంకెవరి అలికిడీ లేదు. చిన్నగా పడుతున్న చినుకులు గడ్డి పూలను వణికిస్తున్నాయి. సన్నని దారి దాటి పెద్ద వాగు దగ్గరికి వచ్చాం. నాకేమో గుర్రం దిగి నీటి పరవళ్ళ మీదినుంచి రాళ్ళ మీద అడుగులు వేసుకుంటూ వాగు దాటదామని అనిపిస్తోంది. నడిచి వెళ్ళే వారికోసం ఒక దుంగ కూడా నీళ్ళ మీద వేసి ఉంది. కానీ భోలా గుర్రం దిగవద్దని ఆజ్ఞాపించాడు. భూరీ ఆగిపోయి నీళ్ళ వైపు చూస్తోంది. మనం రాళ్ళమీద ఎక్కడ అడుగు వేద్దామా అని ఎలా చూసుకుంటామో సరిగ్గా అలాగే తల తిప్పుతూ అటూ ఇటూ చూసి, టక్ మని నీళ్ళలో అనువైన చోట అడుగు వేసింది. అలాగే నీటి ఉధృతిలో జాగ్రత్తగా నడుస్తూ నది దాటేసింది. భూరీని నమ్మొచ్చనుకుంటూ ఇక నిశ్చింతగా కూర్చున్నాను నేను.

‘చీడ్ వాసా’ చేరుకున్నాం. ఆ పేరుకు అర్ధం పైన్ చెట్ల అడవి అని. నిలబెట్టిన బల్లేల లాగా ఆకాశం వైపు చూస్తున్నాయి పైన్ వృక్షాలు. చుట్టూ కొండల వాలులంతా ఆవరించి ఉన్నాయి. వాటి ముదురాకుపచ్చని సూదుల్లాంటి ఆకుల్ని కూడా కమ్ముతూ మేఘాలు… ఈ రోజుకి ప్రకృతి ప్రసాదించినది ఈ monochrome చిత్రాన్నే. నలుపూ, తెలుపు వర్ణాల లోని అన్ని ఛాయలూ నింగీ నేలా మార్మికంగా పరుచుకున్నాయి. ఆ వెలుగులో, వర్షంలో అడవి నిగూఢంగా ఉంది. నిలువెత్తు ఆరోగ్యంలా కనబడుతున్న ఒక వ్యక్తి ఒక కర్ర పట్టుకుని గబా గబా నడుస్తూ పోతున్నాడు. సాయంత్రంలోగా తిరిగి వచ్చెయ్యాలంటూ మా గుర్రాలు దాటి వెళ్ళిపోయాడు.

పైపైకి పోతున్నకొద్దీ తడిసిన శరీరాలను చలి పొరలు చుట్టుకుంటున్నాయి. చినుకుల దాడి పదునెక్కింది. ‘భుజ్ వాసా’ – అంటే భూర్జ వృక్షాల (birch) అడవి మొదలైంది. భూర్జ పత్రాల మీద ప్రాచీన కవులు కావ్యాలు రాశారని మనం విన్నాం. తెల్లగా ఉండే ఈ చెట్టు కాండం నుండి సులువుగా ఊడే పొరలను కాగితంలాగా ఉపయోగించి చుట్టలుగా భద్రం చెయ్యొచ్చు. మరీ ఎత్తులేకుండా గుబురు అరణ్యంలా ఉన్న లేత చెట్లు ఎక్కువగా కనిపించాయి.

5

6

ఒకచోట ఎవరో చేసిపెట్టిన ఒంటి స్థంభపు మట్టిమేడల్లాగా పెద్ద పెద్ద స్వరూపాలు చాలా కనిపించాయి. కొన్ని ఎప్పుడైనా కూలిపోయేలా ఉన్నాయి. వానలకు కరిగి నీరుగారిన కొండల్లా ఉన్నాయి అవి. వాటి పక్కనుంచి ఇరుకైన దారి, ఒక మనిషి, లేదా ఒక గుర్రం మాత్రమే వెళ్ళేలా ఉంది. అక్కడ చరియలు విరిగి పడటం ఎక్కువేనట. Lord of the rings సినిమా లోని mood photography ని గుర్తు చేస్తోందా ప్రాంతంలోని ఆ వింత వాతావరణం.

‘భుజ్ వాసా’ చేరాక కాస్త కిందుగా ఉన్న లోయలో నది ఒడ్డున కొన్ని కట్టడాలు కనిపించాయి. లాల్ బాబా, రామ్ బాబా ఆశ్రమాలు, GMVN గెస్ట్ హౌస్ అక్కడ ఉన్నాయి. నిజానికి గోముఖ్ చూశాక అక్కడ నది ఒడ్డున ఆ రాత్రికి ఉండిపోయి మరునాడు బయలుదేరితే బాగుండేది.

అందరం గుర్రాలు దిగాం. అక్కడి నుండీ గోముఖ్ నాలుగు కిలోమీటర్లు. ఆ నాలుగు కిలోమీటర్లూ గుర్రాలు వెళ్ళటానికి అనుమతి లేదు. ఈ నియమాలు ఖచ్చితంగా ఎంత బాగా అమలు చేస్తున్నారో! ఈ ఆలోచన మిగతా కొండ ప్రాంతాల విషయంలో కూడా చేస్తే… తప్పని వాతావరణ మార్పులు ఎలాగూ తప్పవు, మన పొరపాట్ల వల్ల వచ్చే వినాశనమైనా తగ్గుతుంది కదా! గ్లేసియర్లు మననుంచి దూరం జరిగితే గానీ మనకు అర్ధం కావటం లేదు.

కాస్త తిని నడుద్దామని, తెచ్చుకున్న పరాఠాల పొట్లాలు విప్పి చూస్తే అవీ మా లాగే చలికి బిగుసుకుపోయి ఉన్నాయి. జయసూర్య అంత చలిలోనూ ఫోటోలు తియ్యటానికి ప్రయత్నిస్తూనే ఉన్నాడు. నేను ఓ సగం పరాఠా తిన్నాననిపించి నడక మొదలు పెట్టాను, అడుగు ముందుకు సాగటం లేదు. చలి వెన్నులోంచి వణికిస్తోంది. ఇలా లాభం లేదని గబగబా నడవబోతే, ఊపిరి అందలేదు. మిగిలిన వాళ్ళంతా ముందు వెళ్ళిపోతున్నారు. కొంతదూరం వెళ్ళాక వెనక్కి చూసి, నాకేమైందో అర్ధం కాక ఆగిపోయారు. వాళ్ళను నడవమని చెప్పి, నేను నెమ్మదిగా నడక సాగించాను. పన్నెండు వేల అడుగుల ఎత్తులో పరుగెత్తడానికి నా ఊపిరి సత్తువ సరిపోవట్లేదని అర్ధం అయింది. దారి చూపించటానికి మాతోపాటు ఒక గుర్రం యజమాని వచ్చాడు. అతను నా అవస్థ గమనించి చిన్న గుబురు పొద నుంచి ‘గంగ తులసి’ ఆకులు కోసిచ్చి, అవి నలిపి వాసన చూడమన్నాడు. ఆ ఆకుల ఘాటైన వాసన గుండెలనిండా చేరి, ఆయాసాన్ని తగ్గించింది. గుర్రాలు కూడా దారిలో ఆ ఆకులు తినటం చూశాను.

ఆవరించిన మబ్బు పొగల మధ్య ఎటు చూసినా రాళ్ళ గుట్టలే. రాళ్ళ మధ్య ఉన్న చిన్న చిన్న మొక్కలూ, చెట్ల ఆకులను తింటున్న భరల్ (కొండ మేకలు) సమూహాలు కనిపించాయి. గండశిలలు నిండిన ఆ ప్రాంతంలో నడక కష్టంగానే ఉంది. రకరకాల ఆకారాల్లో ఉన్న ఆ రాళ్ళు వింతైన రంగుల్ని చిమ్ముతున్నాయి..   కనిపిస్తూనే రాళ్ళ మలుపుల్లో మాయమౌతున్న గ్లేసియర్ మొత్తానికి దగ్గరయింది. ఆవు ముఖం లా ఒకప్పుడు కనిపించేదని అనుకునే  భాగీరథి జన్మస్థానం ఇప్పుడలా లేదు. నల్ల మట్టి చారలతో నిండిన గ్లేసియర్ నుంచి వస్తున్న నీరు ఆ మట్టిలోని ఖనిజాలనూ ఔషధ లక్షణాలనూ కూడా అందుకుంటూ ఉండవచ్చు. పసుపు పచ్చని ముక్కులున్న బలిష్టమైన కాకులు అదోరకంగా అరుస్తూ తిండి వెదుక్కుంటున్నాయి. గ్లేసియర్ వెనకనున్న శివలింగ్ మంచు పర్వతం మబ్బుల్లో పూర్తిగా దాక్కుంది. మేము కాక ఒకరిద్దరు విదేశీయులూ, సాధువులతో కలిసి మరో పదిమంది దాకా ఉన్నారక్కడ. వాళ్ళు కలలో కదిలే నీడలకు మల్లే అనిపించారు. ఓ పెద్ద కాన్వాస్ మీద ప్రకృతి గీసిన అతి పెద్ద impressionistic painting లో మేం కూడా ఒక చిన్న భాగమైనట్టుంది.

7

8

9

భాగీరథి ప్రవాహం నుంచి కాస్త నీటిని ఒక సీసాలో నింపుకుని వెనక్కు తిరిగాం. వాన మాత్రం వెనక్కు తగ్గటం లేదు. దిగుతున్నప్పుడు రాళ్ళ మీద నడక నాకు సునాయాసంగా అనిపించింది. గంగ తులసి ఆకులు గుండెకు కొత్త శక్తినిచ్చాయి. ‘భుజ్ వాసా ’ దగ్గర మా గుర్రాలున్న చోటికి చేరేసరికి, వాళ్ళంతా చిన్న చలిమంట వేసుకుని చుట్టూ కూర్చుని ఉన్నారు. అక్కడే కాళ్ళూ చేతులూ కాస్త వెచ్చ చేసుకుని మళ్ళీ గుర్రాలెక్కాం.

నా కాళ్ళ మీద నేను నిలబడటం, నడవటం అప్పుడు నాకెంత ముఖ్యమనిపించిందో ! నేర్చుకున్న వాళ్లకు గుర్రపు స్వారీ లో మజా ఉండొచ్చునేమో కానీ, గుర్రం మీద కూర్చుని కొండలెక్కటం మాత్రం కష్టమే. పోనీ ధీమాగా సోమరిగా కూడా కూర్చోలేం. పెద్ద పెద్ద రాళ్లున్నచోట గుర్రం మీద వెళ్తే, బాలన్స్ తప్పకుండా ఉండటం కోసం అది కిందకు దూకుతున్నప్పుడు మనం వెనక్కు వంగాలి. అది పైకెక్కేటప్పుడు మనం ముందుకు వంగాలి. గుర్రం కిందకు దూకేటప్పటి అదురుకు వెన్నూ, నడుమూ గట్టిగా లేనివాళ్ళకు ప్రమాదమే.

10

నిదానంగా ప్రకృతి నలుపూ తెలుపుల్లోంచి కుంచెను బయటకు తీసి, రంగుల్లో ముంచి విదిలిస్తోంది. సూర్యుడు ముదురు కాషాయ రంగులో బయట పడ్డాడు. ఒక్కసారిగా మార్మికతను వదిలించుకున్న కొండలు పచ్చటి రంగును వెదజల్లాయి. పక్షుల కూజితాలు మొదలయ్యాయి. గడ్డి పువ్వు నీటి రంగుల్లో మెరిసి ఠీవిగా తలెత్తింది. వాన పూర్తిగా వెలిసింది. భాగీరథి పర్వతం బంగారు రంగులో మెరిసింది. గుర్రాలు చిన్నగా పరుగు తీశాయి. అలసట అంతా మరిచిపోయి, ఇన్ని వన్నెచిన్నెలు చూపిస్తూ ఎన్నో రకాల మనస్థితుల్లోకి నెట్టిన ఆ ప్రకృతి దృశ్యాలను మెదడులో భద్రపరచుకుంటూ గంగోత్రికి ఉత్సాహంగా చేరుకున్నాం.

                                                                                             lalitha parnandi   ల.లి.త.

 

బానిసల్లారా సోయి తెచ్చుకోండి!

sangisetti- bharath bhushan photo

1970ల కన్నా ముందు అధికారం కేంద్రీకృతమై ఉండిది. ఇది విశ్వవ్యాప్తమైన భావన. దాన్ని కూలదోస్తే సమసమాజం ఏర్పడుతుందనే అవగాహన ఉండిది. అయితే అధికారం వికేంద్రీకృతంగా ఉంటుందనే వాస్తవాన్ని అస్తిత్వ రాజకీయ ఉద్యమాలు ముందుకు తీసుకొచ్చాయి. అది ‘బ్లాక్స్‌’ పోరాటం కావొచ్చు, ఫెమినిజమ్‌ కావొచ్చు, ప్రత్యేక తెలంగాణ ఉద్యమమూ కావొచ్చు. అస్తిత్వ ఉద్యమాలకు ఒక ‘పరిధి’ ఉంటుంది. ఆధిపత్యాన్ని, అణచివేతను ధిక్కరించేందుకు పోరాటం జరిగింది. కళ్ళముందర కనబడే శత్రువుతో ఉద్యమం కొనసాగింది. ఈ అస్తిత్వ రాజకీయాల్లో సామూహికతకు స్థానం లేదు. కానీ ఇవ్వాళ కొంతమంది భాష పేరిట, జాతి పేరిట, సమాజం పేరిట ‘సామూహికత’ను తీసుకొస్తున్నారు. దీని వల్ల తెలంగాణ వాళ్లకే గాదు సీమ, డెల్టా, ఉత్తరాంధ్రవారి ఉనికికి కూడా ప్రమాదమేర్పడనుంది.

స్వీయ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనుకునే వారెవ్వరూ పరాయి ఆధిపత్యాన్ని, అణచివేతను, నిరాకరణను సహించలేరు. అంతేగాదు దానికి వ్యతిరేకంగా ఉద్యమిస్తారు. అయితే తెలంగాణ విషయంలో ‘పరాయి’ ఎవ్వరు అని తెలుసుకునే లోపలే జరగరాని నష్టమంతా జరిగిపోయింది. 1956 నుంచీ తెలంగాణకు జరిగిన అన్యాయాన్ని లెక్కలేసుకొని చరిత్రలో రికార్డు చేయాల్సిన ప్రస్తుత తరుణంలో కొందరు భిన్నస్వరాలు వినిపిస్తున్నారు. అంతర్లీనంగా తమ కోస్తాంధ్ర బానిసభావజాలాన్ని ప్రదర్శిస్తున్నారు.
భౌగోళికంగా రెండు రాష్ట్రాలుగా విడిపోయినా తెలుగు వాళ్లమంతా ఒక్కటే, తెలుగాజాతి అంతా ఒక్కటే, ఆధిపత్యాలు లేకుంటే అంతా మళ్ళీ కలిసిపోవొచ్చు, సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు, తెలుగు ప్రజల ఐక్యత కేవలం ఒక భావనగా కాకుండా భౌతిక వాస్తవికంగా మారాలని వ్యాఖ్యానిస్తూ, భవిష్యవాణి చెబుతూ, ఆకాంక్షిస్తున్న వాళ్లలో తెలంగాణ వాదులు, బుద్ధిజీవులు, సాహిత్యకారులు కూడా ఉండడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. రెండు రాష్ట్రాల్లో తమ సంఘాలు, సంస్థలు, పార్టీలు ఉండీ, రెండు ప్రాంతాల్లో వాటి మనుగడ కోరుకునే వారు, రెండు రాష్ట్రాల్లోనూ తమకు ప్రచారం, ప్రాధాన్యత, గుర్తింపు లభించాలని  ఆశించే పచ్చి అవకాశవాదులు ఈ మాటలు మొదటి నుంచీ చెబుతుండ్రు, ఇప్పటికీ అదే అభిప్రాయంతో ఉన్నారు. వాళ్ళు అవకాశవాదులు కాబట్టి పెద్దగా పట్టించుకోనవసరం లేదు.

ఈ అవకాశవాదుల్లోనే ఇంకొందరు పెండ్లినాడే సావుడప్పుకొట్టినట్లు అవసరమైతే ‘తెలుగువాళ్ళం మళ్ళీ కలువొచ్చు’ అంటుండ్రు. పేచీ అంతా తెలంగాణవాదుల ముసుగులో రంగంమీదికి వస్తున్న ఆధిపత్యాంధ్రుల బృందగానం ఆలపించే వంధిమాగదుల తోనే! తెలంగాణ సోయితో ఎన్నడూ మెలగని వాళ్ళు రాష్ట్రమొచ్చినాక ప్రత్యేక సంచికలు తీసుకొస్తూ తాము మాత్రమే ఉద్యమంలో ముందున్నట్టు, తమ కృషితో మాత్రమే తెలంగాణ సాధ్యమయింది అనే భావన కలిగిస్తుండ్రు. తెలంగాణ గురించి కూడా ఇందులో ఆంధ్రోళ్ల తోటి రాయిస్తుండ్రు. ఇలాంటి నయా సీమాంధ్ర బానిసలు రేపు తెలంగాణలో కోకొల్లలుగా పుట్టుకొచ్చి కొట్లాడి తెచ్చుకున్న రాష్ట్రాన్ని తాము అభిమానించే ఆంధ్రాధిపత్య సాహిత్యకారుల కాళ్ల దగ్గర కట్టిపడేస్తారు. ఎందుకంటే వీళ్ళెవరూ తెలంగాణ కోసం ఎన్నడూ ఒక్క మాట మాట్లాడిరది లేదు, రాసిందీ లేదు, కనీసం సంఫీుభావంగా ఒక్క సమావేశంలో పాల్గొన్నదీ లేదు. ఇప్పుడు వలస పాలన మాత్రమే పోయింది. ఈ వలసాధిపత్యులు స్థానిక బానిసలను ప్రోత్సహించి, మెచ్చి మెడల్స్‌ ఇప్పించి తమ పెత్తనాన్ని శాశ్వతంగా కొనసాగించే ప్రమాదముంది. అందుకే అటు రాజకీయాల్లో గానీ ఇటు సాహిత్య, సాంస్క ృతిక రంగంలో బానిసల పట్ల జాగరూకతతో మెలగాలి. నిజానికి వెన్నెముఖలేని సాహిత్యకారులు ఎంతటి తెలంగాణవాది అయినా సారాంశంలో సీమాంధ్ర ప్రయోజనాలు నెరవేర్చే పనిముట్టుగానే మిగిలిపోతాడు.
రెండు ప్రాంతాల్లోనూ తమ కులం వాళ్ళు ఉండడం, ఉమ్మడి రాష్ట్రంలో తమకు దక్కిన గౌరవానికి లోటు రాకుండా చూసుకోవడానికి, రాష్ట్ర, కేంద్ర అవార్డులు నిర్ణయించడంలో తమ గుత్తాధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి తెలంగాణలోని ఆధిపత్యులు  సీమాంధ్రుల మనసెరిగి మసులుతుండ్రు. అనివార్యంగా తెలంగాణ ఉద్యమాన్ని సమర్ధించిన వీళ్ళు తమకు అవసరమనిపిస్తే తిరుపతి ప్రపంచ సభలకు వెళ్ళినట్టే ఇక్కడి ప్రజలకూ పంగనామాలు పెట్టగల సమర్ధులు. భాషకు పట్టం కట్టే పేరుతో తిరుపతికి వెళ్ళినామనే వాళ్ళు రేపటి తెలంగాణలో అదే భాష పేరిట స్థానికుల ‘హిందూత్వ’ వైఖరి అవలంభించే ప్రమాదమూ ఉంది. ఎందుకంటే వీళ్లు ఇదివరకే ఉర్దూని ముస్లిముల భాషగా ముద్రేసిండ్రు.
తెలంగాణ ఉద్యమం మొదలైన నాటి నుంచీ ఆంధ్రాధిపత్యులు, వారికి వంతపాడే తెలంగాణ వాళ్ళు ఆంధ్రప్రదేశ్‌ కేవలం తెలుగువారి రాష్ట్రంగానే పరిగణించారు. కానీ తెలంగాణ రాష్ట్రంలో కేవలం తెలుగు మాట్లాడేవారే కాదు ఉర్దూ మాతృభాషగా మాట్లాడే వాళ్ళు దాదాపు 15శాతం మంది ఉన్నారనే సోయి బుద్ధిజీవులకు లేకుండా పోయింది. తెలంగాణలో ఉర్దూమాట్లాడే ముస్లిములే గాకుండా కాయస్థులు, హిందీ మాత్రమే మాట్లాడే లోధీలతోపాటు భిన్నమైన ఇతర భాషలు మాట్లాడే రంగ్రేజ్‌, ఆరెమరాఠీలు, లంబాడీ, కోయ, గోండు, చెంచులు కూడా తెలంగాణలో భాగమనే గ్రహింపు కూడా వీరికి లేదు. తెలుగువాళ్లంతా ఒక్కటే అని కూడా టీవి చర్చల్లో అటు ఆంధ్రవాండ్లు, ఇటు తెలంగాణ వాండ్లు కూడా మాట్లాడుతున్నారు. ఆంధ్రప్రాంతంలో రెండున్నర జిల్లాల్లోని రెండున్నర కులాల వాండ్లు ఆంగ్ల విద్యార్జనతో ఒకవైపు, మరోవైపు ఆంగ్లేయుడు కట్టిన కాటన్‌ కట్టతో బాగుపడి భాష మీద అజమాయిషీ చలాయించారు. వీళ్ళే ‘రేట్‌’స్కూల్స్‌ ద్వారా పాఠశాలల్లో కొంతమేర తెలుగులో బోధన, మరికొంత పత్రికల ద్వారా తమ భాషకు ‘ప్రామాణికత’ సంపాదించిండ్రు.

సంపాదించిండ్రు అనేకన్నా ఆపాదించిండ్రు. ఇప్పటికీ అదే ప్రామాణిక తెలుగుభాషగా కొనసాగుతోంది. మిగతావన్నీ మాండలికాలు, యాసలుగానే ఉన్నాయి. భాషకు కూడా కులముంటదని బుద్ధిజీవులు గుర్తించరు. ముఖ్యంగా బీసీల్లోని దాదాపు ప్రతి కులానికి వాళ్ళు ఇంట్లో మాట్లాడుకునే భాష, అవసరాల రీత్యా మిగతా వారితో మాట్లాడుకునే భాష భిన్నంగా ఉంటుంది. స్వర్ణకారులకు వృత్తిపరంగాను, వ్యాపార పరంగానూ ప్రత్యేకమైన భాష ఉంది. అది తమ వారికి మాత్రమే అర్థమయ్యే విధంగా ఉంటుంది. ఇంకా చెప్పాలంటే తెలంగాణది పంచభాషా సంస్క ృతి. మెదక్‌, రంగారెడ్డి, మహబూబ్‌నగర్‌, నిజామాబాద్‌, ఆదిలాబాద్‌ జిల్లాలోని ప్రజలపై ఎక్కువగా కన్నడ, మరాఠీ భాషల ప్రభావం కూడా ఉంటుంది. ఆ భాషలు వారికి పరాయివి కావు. హైదరాబాద్‌లో ఇప్పటికీ పాతబస్తీకి వెళితే ఉర్దూ మాట్లాడే కాయస్థులు, తెలుగు మాట్లాడే కన్నడిగులు, కన్నడ మాట్లాడే మరాఠీల కనబడతారు. అందుకే నిజాం జమానాలో ప్రతి ఫర్మాన్‌ ఇంగ్లీషు, ఉర్దూ, తెలుగు, కన్నడ, మరాఠీ భాషల్లో వెలువడేది. ప్రభుత్వ సమాచార పౌరసంబంధాల శాఖ పత్రిక ‘హైదరాబాద్‌ సమాచారము’ ఈ అన్ని భాషల్లో ప్రచురితమయ్యేది. ఈ పంచభాష సంస్క ృతిని పక్కనబెట్టి కేవలం ఒక్క భాషనే అందరి భాషగా బలవంతంగా రుద్దడమంటే ఆ భాషలవారి హక్కుల్ని కాలరాయడమే. తమిళనాడు, కర్నాటక, ఒడిషా రాష్ట్రాలలో తెలుగు భాషని కాపాడలనే వారెవ్వరూ హైదరాబాద్‌లో తెలంగాణలో ఉర్దూని కాపాడలనీ, కన్నడను కాపాడాలని ఎన్నడూ అడుగరు.
తెలంగాణలో పాఠ్యపుస్తకాల్లో ఒకరకమైన భాష ఉంటుంది. అది బోధించే ఉపాధ్యాయుడు తనదైన భాషలో చెబుతాడు. తనదైన భాష అన్నప్పుడు అతని కులం, పుట్టి పెరిగిన ప్రాంతం ప్రభావం వల్ల అబ్బిన భాష. చదువుకునే విద్యార్థికి ఇవి రెండూ కొత్తగానే ఉంటాయి. ఇవ్వాళ ప్రభుత్వ పాఠశాలల్లో తెలుగుమీడియంలో చదువుకుంటున్నది బహుజనులు మాత్రమే. అదీ తమ తరంలో మొదటి వారు మాత్రమే! ఈ పాఠ్యపుస్తకాల్లో విషయం ఎట్లాగూ తెలంగాణకు సంబంధించినది ఉండదు. కనీసం వాటిని వ్యక్తికరీంచేందుకు తెలంగాణ నుడికారానికి కూడా చోటులేదు.

అందుకే రెండు ప్రాంతాల్లో ఉనికిలో ఉండే (అగ్ర)కులాల వాండ్లకు తప్ప తెలుగు వాళ్ళమంతా ఒక్కటే అనే భావన బహుజనుల్లో ముఖ్యంగా బీసీల్లో ఏర్పడలేదు. మెజారిటీగా 50శాతానికి పైగా ఉన్న బీసీలు (ఉర్దూ మాట్లాడే ముస్లిములను మినహాయిస్తే ఈ శాతం ఇంకా పెరుగుతది) తాము స్వతహాగా మాట్లాడుకునే భాష ఎక్కడా లేదు. తెలుగుభాషగా చలామణిలో ఉన్న భాషలో బహుజనుల నుడికారం, పదసంపద కానరాదు. అలాంటప్పుడు భాష కలిపి ఉంచే సూత్రం ఎంతమాత్రం కాదు. ఇది బలవంతంగా, కృత్రిమంగా కల్పించిన బంధం మాత్రమే. ఈ బలవంతపు బంధం విడిపోయిందంటే సంతోషపడాలి తప్ప బాధపడాల్సిన అవసరం ఎంతమాత్రం లేదు. ఈ భాష గురించి గుండెలు బాదుకుంటుంది కూడా అగ్రకులస్తులే అనే విషయాన్ని అవగాహనలో ఉంచుకోవాలి. బహుజనులు తెలుగుకన్నా ఇంగ్లీషుపై దృష్టి కేంద్రీకరించాలనేది నేటి డిమాండ్‌.
తెలుగుజాతి అంతా ఒక్కటే అనే సూత్రాన్ని కూడా ఇదివరకే కొందరు తెలంగాణవాదులు కొట్టిపారేసిండ్రు. అయినా తమ ఆధిపత్యాన్ని కొనసాగించుకోవడానికి ఇరు ప్రాంతాల్లో తమ వ్యక్తిగత ప్రయోజనాలను నెరవేర్చుకోవడానికి కొందరు, తమ పార్టీ, సంఘం ప్రయోజనాలను కాపాడడానికి కొందరు, ఇంకా చెప్పాలంటే రెండు ప్రాంతాల్లోనూ తమ ఆధిపత్యం యథాతథంగా కొనసాగాలనుకునేవారు (వీళ్లు ఇరు ప్రాంతాల్లోనూ ఉన్నారు) ఈ తెలుగు జాతి సిద్ధాంతాన్ని వల్లె వేస్తున్నారు. ఒక జాతికి తనదైన ప్రత్యేక గుర్తింపు రావాలంటే ఒకే జాతీయ నాయకులను ఆరాధించడం, ఒకే భాష, ఒకే సంస్క ృతి, ఒకే చరిత్ర కలిగి ఉండడమే గాకుండా ‘అంతా ఒక్కటే’ అనే భావన కూడా ప్రజల్లో ఉండాలి. ఇందులో ఏ ఒక్కటి తెలంగాణ, సీమాంధ్ర ప్రాంతాల వారికి లేదు.

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

ఆధునికతకి తొలి ఆనవాలు మహబూబ్ అలీ ఖాన్

తెలంగాణకు సంబంధించిన సర్వాయి పాపన్న, తుర్రెబాజ్‌ఖాన్‌, కుతుబ్‌షాహీలు, మహబూబ్‌అలీఖాన్‌, కొమురం భీమ్‌ ఎవ్వరూ కూడా ఆంధ్రప్రాంతంలో తెలిసిన వారు కాదు. వారి గురించి ఎన్నడూ వినలేదు. కనీసం పాఠ్యపుస్తకాల్లోనూ వారి గురించి పాఠాలు లేవు. ఆంధ్రప్రాంతానికి చెందిన పొట్టి శ్రీరాములు (ఈయన ఎక్కువ కాలం జీవించింది తమిళనాడులోనే) ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం కొట్లాడి ప్రాణాలు వొదిలిండు. ఈయనెవరికీ తెలంగాణలో తెలువదు. తెలంగాణవాళ్లు ఆయనతో మనకెలాంటి సంబంధం లేదు అనుకుంటారే తప్ప మనవాడు అనుకోరు. ఆయన్ని సమైక్యవాదిగా సీమాంధ్రులు ముందుకు తీసుకురావడం వల్ల కోమట్లు తమ వాడు అనే గౌరవంతో పల్లెల్లో నిలబెట్టిన ఆయన విగ్రహాలకు కష్టకాలం వచ్చి పడిరది. అలాగే ఉయ్యాలవాడ నరసింహారెడ్డి గురించి కూడా తెలంగాణ వాళ్ళకు (కొంతమంది రెడ్లు మినహాయింపు) అదే భావన ఉంది. ఈ ‘జాతి’ నాయకుల గురించి ఎన్నడూ ఎవ్వరూ అందరికీ పరిచయం చేయాలని ప్రయత్నించలేదు. రెండు ప్రాంతాల ప్రజల మధ్యన భావ సమైక్యత ఎన్నడూ కలుగలేదు. అంతెందుకు వల్లభ్‌భాయి పటేల్‌ సీమాంధ్రులకు జాతీయ నాయకుడు కావొచ్చు కానీ తెలంగాణ వాళ్ళకు ముఖ్యంగా ముస్లిములకు ఒక విలన్‌. పటేల్‌ అటు సాయుధ పోరాట యోధులను చంపించడమే గాకుండా పోలీస్‌ యాక్షన్‌ పేరిట వేలాది ముస్లిముల ప్రాణాలు తీసిండు.

అలాగే భాష ఒక్కటి కాదని పైన చర్చించుకున్నాము. ఇక సంస్క ృతి ఒక్కటి కాదనే విషయాన్ని 1969 నుంచి ఇప్పటి దాకా ప్రతి తెలంగాణ వాదీ రాసిండు.  మా పండుగలు వేరు, మా ఆచార వ్యవహారాలు ఆఖరికి మేము మొక్కే దేవతలు కూడా వేరు అని తెలంగాణ వాదులు తేల్చి చెప్పిండ్రు. నిరూపించిండు. అంతేగాదు తెలంగాణది హీన సంస్కతి అని కూడా ఆధిపత్యులు ప్రచారం చేసిండ్రు. మీరు కోడిపుంజుల కొట్లాట పెడితే మేం బతుకమ్మలు ఆడుతాం అని తెలంగాణ వాళ్ళంటే అది సంస్కతిలోని భిన్నత్వాన్ని పట్టిస్తుంది తప్ప కించపరచడం కాదని అర్థం చేసుకోవాలి. అలాగే ఆధిపత్య వాదులు తెలంగాణ సంస్క ృతిపై మరో నింద కూడా వేసిండ్రు. మీదంతా దొరలు, నవాబుల సంస్కృతి రాములమ్మ సినిమాలోని సంస్క ృతి అంటూ నిందించిండ్రు. రాములమ్మ సినిమాలోని సంఘటనలు వాస్తవ సంఘటనలు అని ప్రచారం చేసి, తెలంగాణ దొరలంతా స్త్రీలను చెరబట్టే వారిగా చూపించిండ్రు. ఇది వాస్తవం కాదు. (ఈ విషయం గురించి మరోసారి వివరంగా చర్చిద్దాం) ఇంత భిన్న సంస్క ృతి ఉన్న వాళ్ళమధ్య భావసారుప్యత రావడమనేది అసంభవం.

ఇక చరిత్ర విషయానికి వస్తే తెలంగాణ ఆధునిక చరిత్రకారుడు సుంకిరెడ్డి నారాయణరెడ్డి సంవత్సరాలను లెక్కేసి మరీ మీ చరిత్ర వేరు మా చరిత్ర వేరు అని తేల్చి చెప్పిండు. అన్ని విషయాలు భిన్నంగా ఉన్నప్పుడు జాతి ఒకటే అనే భావన ఎలా కలుగుతుంది. నిజానికి పురాణ కాలం నుండి తెలంగాణ జాతి భిన్నమైనదే! షోడశ జానపదాల్లో అశ్మక సామ్రాజ్యం ఒకటి. ఇందులో తెలంగాణ ప్రాంతాలే ఉన్నాయే తప్ప ఆంధ్రప్రాంతాలు లేవు. ఆంధ్ర అంటే నిఘంటువుల్లో అర్థాలు కూడా ఏమంత వీనుల విందుగా లేవు. అట్లాంటిది జాతి భావన పేరిట మళ్ళీ జత కట్టాలని ప్రయత్నించడమేంటే 60 యేండ్లుగా దేనికి వ్యతిరేకంగా తెలంగాణ భూమి పుత్రులు, కులాలు మతాలకు అతీతంగా కొట్లాడారో మళ్ళీ అదే పాలన, ఆధిపత్యాన్ని, ఆణచివేతను తీసుకొచ్చేందుకు చేసే కుట్రగానే భావించాలి.
ఇంకొందరు సాహిత్యకారులు ‘సాహిత్యం రెండుగా విడిపోవాలన్నా సాధ్యంకాదు’ అనే అసమంజసంగా మాట్లాడుతున్నారు. సాహిత్యం తెలంగాణ`సీమాంధ్ర మధ్యన ఎన్నడూ కలిసి లేదు. కలిసి ఉంటే అసలు తెలంగాణ అస్తిత్వ ఉద్యమమే వచ్చేది కాదు. తెలంగాణ ఉద్యమం సందర్భంగా పది జిల్లాల నుంచి పదివేలకు పైగా కవిత్వ, వ్యాస, కథా, నవలా పుస్తకాలు, సంకలనాలు, సంపుటాలు, సీడీలు వెలువడ్డాయి. ఇందులో ఏవి కూడా సీమాంధ్రలోని పుస్తకాల షాపుల్లో ఎక్కడ కూడా అందుబాటులో లేవంటే ఆశ్చర్యం కలుగక మానదు. అంతెందుకు నమస్తే తెలంగాణ ప్రతుల్ని విజయవాడలో దగ్ధం చేసిన సంగతి అందరికీ తెలిసిందే! తెలంగాణ సాహిత్యాన్ని ఆంధ్ర కొలమానాల్లో తూచి, శైలి, శిల్పం, వస్తువు, వ్యక్తీకరణ పేరిట కథల్ని, కవిత్వాన్ని అంచనా వేసి నాసిరకం అని తేల్చేస్తుండ్రు. తెలంగాణ భాషలో రాసిన కథలేవి మాకు పంపొద్దని పత్రికా సంపాదకులు నిర్ద్వందంగా తేల్చి చెబుతుండ్రు. మన ప్రతిభను అంచనాగట్టడానికి పరాయి వాళ్ళకు పెత్తనమిస్తే వాళ్లు నెత్తంతా కొరిగి పెట్టడమే తప్ప ఒరగబెట్టేదేమీ లేదు. అసలు తెలంగాణ ఉద్యమమే మాది వేరు మీది వేరు, వివక్ష, విస్మరణ, వక్రీకరణలకు వ్యతిరేకంగా జరిగింది. తెలంగాణ`సీమాంధ్ర సాహిత్యం నిట్టనిలువునా చీలి ఉన్న ప్రస్తుత సమయంలో సాహిత్యం విడిపోవాలన్నా విడిపోవడం సాధ్యంకాదు అనే తీర్పు ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని పక్కదారి పట్టించడమే!

పోరాట ప్రతీక కొమరం భీమ్

పోరాట ప్రతీక కొమరం భీమ్

ఆధిపత్యం లేకుంటే ఆంధ్రవాళ్ళతో కలిసిపోవచ్చు, తెలుగువారి ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కూడా అత్యాశే! అంతేకాదు అవాంఛనీయం కూడా! ఎవరికి వారు విడిపోయిన తర్వాత పోటీ తెలంగాణ సాహిత్యకారుల మధ్యన ఉండాలి కాని మళ్ళీ ఆంధ్రావాళ్ళతోటి, ఆంధ్రావారి సాహిత్యం తోటి పెట్టుకోవలనడం అసమంజసం. పోటీకి రూల్స్‌ని మనమే నిర్ణయిద్దాం. సీమాంధ్రుల స్థల, కాలాల కనుగుణంగా నిర్ణయించబడ్డ రూల్స్‌ని మనం పాటించాల్సిన అవసరం లేదు. ‘కలిసిపోవొచ్చు’ అనే భావన తెలంగాణవారి మనస్సులో లక్షలో ఒక వంతు కలిగిన దాన్ని తమకు అనుకూలంగా వినియోగించుకొనేందుకు సీమాంధ్రులు సిద్ధంగా ఉంటారు. రేపు తెలుగుభాషకు సాహిత్యానికి జాతీయిస్థాయిలో దక్కే అవార్డుల కోసం, గౌరవం కోసం, పద్మఅవార్డుల కోసం ఇతర గుర్తింపుల కోసం ఆంధ్రప్రదేశ్‌లోని తెలుగువారితో తెలంగాణ వాళ్ళు పోటీ పడాల్సి ఉంటది.

అలాంటప్పుడు నిర్ణేతలు ఆంధ్రప్రాంతానికి చెందిన వాళ్ళు లేదా సాంప్రదాయిక తెలంగాణవాళ్ళు ఉన్నట్లయితే అవి మళ్ళీ మళ్లీ ఆధిపత్య ఆంధ్రులకే దక్కే ప్రమాదముంది. ఈ ప్రమాదాన్ని పసిగట్టే మన సాహిత్యాన్ని అంచనాగట్టేందుకు మనమే కొత్తకొలమానాలను రూపొందించుకోవాలి. ఆధిపత్యుల చెర నుంచి తెలంగాణను రక్షించుకోవాలి. ఇక తెలుగువారి మధ్యన ఐక్యత భౌతిక వాస్తవికం కావాలనడం కన్నా భారతీయుల మధ్యన ఐక్యత కోరుకుంటే అంతా సమానమన్న భావన వస్తది. (అసలు సిద్ధాంతమయితే ప్రపంచ కార్మికులారా ఏకంకడి అనుకోండి) అయినా 60 యేండ్ల సంది తెలంగాణను నంజుకు తిన్నవారితోటి ఐక్యత ఎవరి అవసరం? కచ్చితంగా ఇది తెలంగాణ వారి మేలుని కోరేదయితే కాదు. అయితే చుండూరు బాధితుల తరపున, పోలేపల్లి నిర్వాసితుల తరపున ఇటు తెలంగాణవారు, అటు ఆంధ్రవారూ సమస్యల వారిగా సంఘటితంగా పోరాటం చేయవచ్చు.

అంతేగాని మొత్తంగా తెలుగువారి ఐక్యత అంటే మళ్ళీ ఆంధ్రాధిపత్యానికి ఇంకా చెప్పాలంటే ప్రాంతాలకతీతంగా అగ్రకులాధిపత్యానికి ఆహ్వానంగా భావించాలి. అయితే పోలవరం విషయానికొస్తే బుద్ధిజీవులు ఎవరి పక్షాన నిలబడుతారనేది వారి నిబద్ధతకు గీటురాయి. తమ సర్వస్వాన్ని సెజ్‌ల కోసం కోల్పోయే వారికి సంఫీుభావంగా ఉంటారా? సర్వం కొల్లగొట్టి తీరాంధ్రలోని బలహీనవర్గాల భుక్తిని కూడా కొల్లగొట్టే మూడోపంటకు నీరు కోరుకునే వారి పక్షాన నిలబడతారో తేల్చుకోవాలి.
కొట్లాడి తెచ్చుకున్న ప్రత్యేక తెలంగాణ కలకాలం మనగలగాలి అంటే ఈ 60 యేండ్లలో ఈ ప్రాంతంలో జరిగిన దోపిడీ, దౌర్జన్యం, హింస, ఉక్కుపాదంతో అణచివేయబడ్డ ఉద్యమాలు, కబ్జాకు గురైన చెరువులు, భూములు, రాజ్యహింసకు గురైన ప్రతి ఒక్క మనిషి చరిత్రను సాలార్జంగ్‌ మ్యూజియం కన్నా పదింతల పెద్దదయిన ప్రదర్శనశాలలో పెట్టాలి. 1969 కాలంలోనే జరిగిన బంగ్లాదేశ్‌ యుద్ధానికి సంబంధించిన చిత్రాలను, చిన్నారులను చిత్రవధ చేయడం దగ్గరి నుంచి రక్తాలోడుతున్న చిత్రాలను అక్కడి ప్రభుత్వం జాతీయ మ్యూజియంలో నిక్షిప్తం చేసింది. పాకిస్తాన్‌ మిలిటరీ పాల్పడ్డ అకృత్యాలను సజీవంగా చిత్రిక గట్టింది. అందుకే ఆ మ్యూజియం సందర్శించిన వాళ్ళు పాకిస్తాన్‌పై మరింత కసిని పెంచుకొని బైటికి వస్తారు.

అలాగే ఇవ్వాళ తెలంగాణ తాను కోల్పోయిన సహజ వనరుల్ని, విధ్వంసానికి గురైన బతుకుల్ని, ఛిధ్రమైన వారసత్వ సంపదని, నెత్తురోడిన 1969 ఉద్యమ చిత్రాల్ని, వంచనకు, హేళనకు గురైన నిన్న మెన్నటి ఉద్యమ డాక్యుమెంటరీలను, సమైక్య రాష్ట్రంలో పద్మ అవార్డులకు దూరమైన వైతాళికుల్ని, అసెంబ్లీలో తెలంగాణ పదాన్ని ఉచ్ఛరించడానికి వీలులేదు, ఒక్కపైసా ఇవ్వం ఏం జేసుకుంటారో చేసుకోండి అనే ప్రసంగ పాఠాల్ని, చిత్రాల్ని, తెలంగాణ ప్రజల్ని విలన్లుగా చూపించిన సినిమాలను ఈ మ్యూజియంలో ప్రత్యేకంగా ప్రదర్శనకు పెట్టాల్సిన అవసరముంది. లేకుంటే రేపటి తరానికి నిన్నటి తరానికి జరిగిన అన్యాయంపై అవగాహన లేకుండా పోతుంది. ఇవ్వాళ అవగాహన రాహిత్యంతో బుద్ధిజీవులు చెబుతున్న తెలుగువాళ్ళమంతా ఒక్కటే అనే భావనలో మళ్ళీ తెలుగు వాళ్ళందరూ ఒక్కటే రాష్ట్రంగా ఏర్పడాలనే ఉద్యమం చేసిన ఆశ్చర్య పోవాల్సిన అవసరం లేదు. అందుకే జరిగిన అన్యాయాన్ని, దోపిడీని, దౌర్జన్యాన్ని, హింసను కచ్చితంగా రికార్డు చేసి పెట్టాలి.
ఇన్నేండ్లు తెలంగాణ విస్మరణ, వివక్షకు, వక్రీకరణకు గురయ్యిందని చెబుతూ వచ్చాం. దానికి సాక్ష్యాలను రికార్డులను ప్రదర్శనకు పెట్టనట్లయితే మళ్ళీ మనం మోసపోయే ప్రమాదముంది. సాహిత్యంగా కన్నా రాజకీయం ఈ అవసరం ఎక్కువగా ఉంది.  మన ప్రతీకల్ని మనం నిర్మించుకోకుండా ఆధిపత్య భావజాలం నుంచి బయటపడలేము. ట్యాంక్‌బండ్‌పై మన విగ్రహాలను కొలువు దీర్చకుండా భావజాలంలో మార్పు తీసుకురాలేము. తెలంగాణ వాండ్లు ఆత్మగౌరవంతో బతకాలంటే ఇక్కడి వైతాళికులని ఒక్కొక్కరిని లెక్కగట్టి స్మరించుకోవాలి. అది తెలుగు వాళ్ళమన్న భావనలో గాకుండా తెలంగాణవాళ్లమన్న సోయితోనే సాధ్యం.

                                                                                                                                                                  -సంగిశెట్టి శ్రీనివాస్‌

ఒక పరి ఆనందమూ, ఇంకొక పరి విషాదమూ…

drushya drushyam 36

ఎందుకో తెలియదు, తీసినప్పుడు.
ఏ విచిత్రమూ గోచరించదు, చూసినప్పుడు.
కానీ, లోపల ఆనందం ఉన్నట్టే విషాదం ఉంటుంది.
ఒలుకుతుంది ఒక్క పరి, మరొక స్థితి కలవరపెడితే, ఇంకొక గతి తన్మయం చేస్తే.
కళ్లు మూసుకుని హారతిని కళ్లకు అద్దుకున్నట్టు ఛాయా చిత్రలేఖనమూ అంతే.
స్వీకారం, తెలిసీ తెలియక.
అందువల్లే అందులో అన్నీ ఉంటై. దృశ్యం అదృశ్యం జమిలిగ.

అవును, దృశ్యాదృశ్యం.

+++

దేశ రాజధాని ఢిల్లీలో, కుతుబ్ మినార్ గార్డెన్లో ఒక చోట కనిపించిన ఈ రిక్షా, అక్కడే చిగురిస్తున్నట్లు కొన్ని మొలకలు…ఒక గొప్ప రిఫ్రెషింగ్ ఫీలింగ్.
అప్పటిదాకా ఎంతోమంది మానవమాత్రులను మోసి, వారి వస్తువులను ఒక చోట చే్ర్చిన ఆ వాహనం ఇప్పుడు విగతరూపంలో ఉంది. మనిషిని వదిలిన ఆత్మలా పడి ఉన్నది. నిశ్వాసం వలే ఉన్నది.
అలా అని దిగులేమీ అవసరం లేదన్నట్టు అది ఎక్కడైతే శిథిలం అవుతున్నదో అక్కడే ఆకుపచ్చ జీవితం పుష్పం వలే చిగిరించి శోభిస్తున్నది. ఒక కల వంటి మొక్కల పుష్ఫలతలు…

చూస్తుంటే తెలియలేదుగానీ ఒక  కాల ఖండికగా తెచ్చుకున్న తర్వాత ఈ ఛాయా చిత్రాన్ని తిరిగి చూసుకుంటే ఇదొక దృశ్యాదృశ్యం.
ఒక ఆశయం. సహజాతి సహజంగా జీవితంపై నమ్మికను కలిగించే ఒక సామాన్యమైన స్థితీ గతీ.

నిజమే. ఇలా కనిపించే దృశ్యాలు తక్కువే.
కదా! జీవితమూ మరణమూ వేర్వేరు కాదనిపించే సందర్భాలు బహు తక్కువ.

అసలుకి, వెలుగూ నీడా ఒక వస్తువు తాలూకువే అయినా వెలుగు కావలిస్తే వెలుగును, నీడ కావలిస్తే నీడను ఆశ్రయించి బతకడం అలవాటు మనిషికి.
కానీ, రెండూ ఉన్నయని, రెండూ ఒకటే అని నమ్మడు. ఇష్టపడడు.. అట్లే జీవితమూ మరణమూ ఒకే ఇతివత్తం తాలూకు వస్తుగతాలు అని చెబితే ఇష్టపడడు. నమ్మడంటే నమ్మడు.
కళ్లారా చూసినప్పుడు ఒక్కొక్కసారి ఒక ఆశ కలుగుతుంది. ఆశయం అంటే సుదీర్గం కనుక అనడం. ఒక ఆశ… నాగరీకత అంత విస్తారమై ఆశయంగా చిగురిస్తుంది.
ఏమీ బాధ లేదు. ఉన్నది ఉండదుగానీ ఉండనే ఉంటది, వేరే రీతిగా.

+++

కృంగి కృషించి క్షీణిస్తున్న ఒక వస్తువునూ, మొలకలేస్తున్న ఒక చిగురునూ ఒకే చోట చూసినప్పుడు ఒక ఆశ…గొప్ప ఉపశమనం.
ఆకు పచ్చ రిక్షా ఆశ.

భీతి.
అందునా ఒక దట్టమైన నీడ వంటి ఆలంభన.

రెండూ ఉన్నయి.
కానీ, అదంతా ఒకటే జీవితం.
క్రమానుగతంగా నూతన రూపాల్ని సంతరించుకుని జీవితమై ప్రవహిస్తూనే ఉండే కాలం.
లేదా గత వర్తమాన భవిష్యత్ కాలమై విభిన్నంగా ప్రవహించే జీవితం.

అందుకే వస్తువు, ప్రదేశమూ, కాలమూ , ఈ మూడింటి సమన్వయం
లేదా కవితాభివ్యక్తి ఏదైనా ఉందీ అంటే అది దశ్యమే.

దృశ్యంలోనే అదృశ్యం నిభిడీకృతమై ఉన్నది.
చూడగా చూడగా కానవస్తుంది ఒకసారి.
టక్కున ఆగుపించి ఆశ్చర్య చకితులను చేస్తుంది మరోసారి.

ఇక్కడైతే సుస్పష్టం.
అదృశ్యమవుతున్న దృశ్యం. దృశ్యమానమవుతున్న అదృశ్యం.
వాహనమూ, మొలక.
వినిర్మాణమూ, నిర్మాణము.
మొత్తంగా పునరుజ్జీవనము.

ధన్యవాదం.

~ కందుకూరి రమేష్ బాబు

ramesh

వీలునామా – 38 వ భాగం

veelunama11

(కేథరిన్ హెలెన్ స్పెన్స్ రాసిన Mr.HOgarth’s Will కి అనుసృజన : శారద )

(కిందటి వారం తరువాయి)

స్వామికార్యమూ-స్వకార్యమూ-I

ఆ మర్నాడు మిసెస్ పెక్లిల్లీఇంటికితానుచెప్పినట్టే ఒకచిన్నచేతి సంచీలోకత్తెరా, టేపూ, సూదీదారమూ మొదలైనవితెచ్చుకునివచ్చికూర్చుంది. కాసేపులిల్లీతోపోచికోలుమాటలయ్యాకనెమ్మదిగాఎల్సీపక్కన చేరింది, “నాక్కొంచెంకుట్టుపనినేర్పమ్మాయీ,” అంటూ.

ఆమెని చూస్తున్నకొద్దీ ఎల్సీకిఆశ్చర్యం అధికమవుతూంది. కుట్టు పనినేర్చుకుంటానంటుందికానీ, ఆమెకిసూదిలోదారంఎక్కించడం కూడారాదు. పెద్దధాష్టీకంపైగా!

“నేనుఇంతవరకూనర్సు గానేపని చేసానమ్మా, అందుకేనాకీకుట్టు పనీఅలాంటివిరావు. పెద్దదాన్నయ్యాను, నర్సుపనిలో వుండే శ్రమతట్టుకోలేకుండావున్నాను. మరింకేదైనా పని నేర్చుకోకపోతేజరిగేదెట్టా? అందుకే నిన్నడుగుతున్నా. ఏదోకాస్తలిల్లీ అమ్మగారుదయతలచి నన్నురానిస్తున్నారు,” అంటూ కథలల్లేసింది.

ఆ తర్వాత పాపాయినిచూస్తున్ననర్సునిచేత కానిమనిషికిందకట్టేసిఆమెపనుల్లోతప్పులెతకసాగింది. మెల్లమెల్లగాఆ రోజుసాయంత్రానికి కుట్టు పనీవదిలేసి కేవలం కబుర్లతోనేకాలక్షేపంచేయ సాగింది. అయితే ఎల్సీ చూడ్డానికిఅమాయకంగావున్నాఅంతతెలివితక్కువదేమీకాదు. కొద్దిగంటల్లోనే ఈ ముసలామెకి ఒళ్ళొంగదనీ, ఆమె చెప్పేవన్నీఅబధ్ధాలేననీఎల్సీకనిపెట్టేసింది. అన్నిటికంటే”అమ్మగారు” అంటూ వినయంగా మాట్లాడుతూనే, లిల్లీతో అతిచనువుచూపిస్తోందంపించిందిఎల్సీకి. అయితే విచిత్రంగాలిల్లీ మాత్రంపెద్దామెని చూస్తూనే ముఖం ముడుచుకునిచిటపటలాడుతుంది. ఇదంతా వింతగా అనిపించినా, పెద్దగా పట్టించుకోలేదుఎల్సీ.

మూడో రోజు ఎప్పట్లాగే మిసెస్పెక్ ఎల్సీపక్కనచేరి కబుర్లాడసాగింది. వున్నట్టుండి,

“అది సరే కానీ, అమ్మాయీ, మీదేవూరు?” అనిఅడిగింది.

ఎల్సీ తమ వూరిపేరు చెప్పింది.

“ఆవూరా? అక్కడనాకుచాలామంది తెలుసే! అయితే అక్కడక్రాస్హాల్అనే ఎస్టేటుతెలుసా?”

“తెలుసు, నేనుపెరిగిందంతా అక్కడే,” కొంచెం ముభావంగాఅందిఎల్సీ.

“మాదీఅదేవూరు తెలుసా?”

“అవునా? నిన్ను చూస్తేస్కాట్లాండ్ స్త్రీలాఅనిపించడంలేదే!” పరిశీలనగా ఆమెనిచూస్తూ అందిఎల్సీ.

“అక్కణ్ణుంచి వచ్చేసిముఫ్ఫైనాలుగేళ్ళయిందిలే!”

“అబ్బో! అన్నాళ్ళయిందా! అందుకేనీమాటలో ఆస్ట్రేలియన్ యాసవినిపిస్తుంది కానీ, స్కాట్లాండుదికాదు.”

“అది సరేకానీ, ఆఎస్టేటు యజమానిహొగార్త్ నాకు బాగాతెలుసు. అక్కడేపెరిగానంటున్నావు, అయితే నీకూ అతనుబాగతెలిసుండాలే!”

“ఆయనమా మావయ్య!”

“అయితే నువ్వు ఆయనచెల్లెలు మేరీకూతురివన్నమాట. మరి అంత పెద్ద ఎస్టేటుయజమానిమీమావయ్యఅయితే నువ్విలా పనిచేసుకు బ్రతుకుతున్నావే?”

“మామావయ్య మాకు చదువులుచెప్పించి, మమ్మల్ని మాకాళ్ళమీదనిలబడమన్నాడు.”

“మరిఆస్తంతా ఎవరికిచ్చాడు? ఆయన కొడుకని అనుకుంటూ వుంటారు, ఫ్రాన్సిస్ అని! అతనికేనా? మీకు చాలా కష్టంగాలేదూ?”

“మొదట్లో కొంచెం కష్టం అనిపించినా, ఇప్పుడు అలవాటుఅయిపోయింది. ఆమాట కొస్తేనేనూ, మా అక్క జేన్ స్వతంత్రంగామాపొట్టలు మేమే పోషించుకుంటున్నాం, ఈప్రపంచంలో చాలామందికిలాగే!” హుందాగా అంది ఎల్సీ.

“అదిసరే! ఇప్పుడు నేను నీకు మీఆస్తంతా దొరకబుచ్చుకునేఉపాయంచెప్తాననుకో, ఏమిస్తావ్?” గుసగుసగాఅందిమిసెస్పెక్.

“ఏమిటీ? మాఆస్తిమాకు తిరిగి దొరకడమా? ఇప్పుడదిసాధ్యంకూడాకాదు కనక ఆ ప్రసక్తి అనవసరం!” చిరాగ్గా అందిఎల్సీ.

“ఆఅబ్బాయెవరికోకాక డబ్బు మీకొచ్చిందనుకో, మీరతన్ని కట్టుబట్టలతోవెళ్ళగొట్టరుగా? అతన్లాగా!”

నిజానికిఎల్సీకిఫ్రాన్సిస్తమనిఆదుకోవాలనిఎంత ఆశపడ్డాడో బాగా తెలుసు. అయితేఈపెద్దామెఅనవసరమైన విషయాల్లో కల్పించుకుంటుందన్నఅభిప్రాయంతోసంభాషణపొడిగించనీయలేదు.

కానీఆవిషయంగురించిఆలోచన మాత్రం మానలేదు. ఏమిటీ ముసలమ్మ ఉద్దేశ్యం? ఫ్రాన్సిస్ మావయ్య కొడుకు కాదని ఆమెకేమైనాతెలుసా? అయితేఫ్రాన్సిస్తలితండ్రులేవరోకూడాఈమెకితెలిసే వుండాలి. కానీ తను మామూలుగాఅడిగితేచెప్తుందా? మావయ్య ఆస్తివల్ల ఫ్రాన్సిస్ ఎంత లాభ పడ్డాడోఅంతకు రెండింతలునష్టపోయాడన్నదీతనకుతెలుసు. ఎలాగైనా ఈమె దగ్గర్నించి ఫ్రాన్సిస్ గురించిమరిన్నివివరాలురాబట్టాల్సిందే, అనుకుందిఎల్సీ!

“మీరన్నట్టుఫ్రాన్సిస్కిఆస్తిపై హక్కులేనట్టైతే, అదిమాకు చెందాల్సిందే!” అంది

మిసెస్పెక్ని నిశితంగా చూస్తూ!

“ఫ్రాన్సిస్ తలిదండ్రుల పెళ్ళీ స్కాట్ లాండు చట్టబధ్ధమైనది.”

“అవును, అతనుతన సంతానమేనని మావయ్య ప్రకటించాడుకూడా!”

“అవునా? మీ మావయ్య ఫ్రాన్సిస్తల్లిగురించి వివరాలేమైనాచెప్పాడా మరి?”

“లేదు, ఆమె మరణించిందనిమాత్రం చెప్పాడు.”

“అవునవును! మరణించింది! మనకి నచ్చని చుట్టాలనీస్నేహితులనీచచ్చిపోయారనిచెప్తే పీడా పోయె!”

“ఆ విషయంలోనిజానిజాలుఎవరికీ తెలియదు. ఒకవేళఆమె బ్రతికి వుంటే ఈ పాటికిఫ్రాన్సిస్నా కొడుకని చెప్తూముందుకొచ్చివుండేది కదా? అప్పుడుఆమెకీ ఫ్రాన్సిస్డబ్బులోవాటావచ్చేదికదా?”

“ఆహా? ఆమెవొచ్చిచెప్పినంతమాత్రాన ఆస్తిలోవాటావొచ్చేస్తుందా?అలాగైతేఈపాటికివెయ్యిమంది వొచ్చి నిలబడే వారు, వాడు నా కొడుకే అని చెప్తూ!”

“మరైతే ఆమె ఎందుకుముందుకు రానట్టో? ఆమెకేదైనా భయం వుందేమో? ఎవరైనాభయపెడుతున్నారో? ”

“అన్నిఊహాగానాలెందుకు? ఆమెనాకు బాగా తెలుసు!” ఆమాట వినగానేఎల్సీనివ్వెరపోతుందనీ, నోటమాట రాదనీ అనుకుంది మిసెస్ పెక్. అయితే ఆమెదగ్గర్నుంచి ఆ మాట కోసమే ఎదురు చూస్తున్న దానిలాఎల్సీచిరునవ్వు నవ్వింది.

ఇంతలో అక్కడికి లిల్లీవచ్చింది.

“ఎల్సీ! కొంచెం ఈరంగు గుండీలు తెచ్చిపెడతావా?” అనిఅడిగిందిఎల్సీని.

“అవునవును అమ్మాయ్! రోజంతా ఇదేగదిలో కూర్చొని విసుగు పుట్టడంలేదూ? నీకుమెల్బోర్న్కొత్తన్నావుగా? పద, నేను నీకుదుకాణాలూ అవీచూపిస్తాను, ఎలాగూ నువ్వు లేకుంటే నేనేమీ చేయలేను,” ముసలావిడలేచిబయల్దేరదీసింది. ఎల్సీతోఆవిడా బయల్దేరడం లిల్లీకెంతమాత్రమూనచ్చలేదు.

కానీ లిల్లీ పాపంచిన్నప్పణ్ణించీ తల్లి కోపానికీగొంతుకకీ వొణికి పోతూ పెరిగింది. ఇప్పుడామె ఏ మాటకి ఎదురాడాలన్నాభయమే. భార్యకున్నఈబలహీనతగమనించేస్టాన్లీఅత్తగారుతమ చుట్టు పక్కల రాకుండాకట్టుదిట్టంచేసాడు.

ఆమెతో బయటికివెళ్ళడం ఎల్సీ కెంత మాత్రమూ ఇష్టంలేదు. కానీ, ఎలాగైనా ఫ్రాన్సిస్జన్మరహస్యం తెలుసుకోవాలి. అందుకేఆమెతో కలిసిబయట కాలుపెట్టింది. బయటికెళ్ళగానే మాట్లాడే ప్రయత్నం చేసింది మిసెస్పెక్. కానీ, ఎల్సీ ఆమెనితనపనయ్యేంతవరకూ మాట్లాడనివ్వలేదు. గుండీలూ, ఇంకా రంగు రంగు దారాలూ, సూదులూఅన్నీకొనుక్కుంది. అన్ని కొట్లలో దుకాణదారులు మిసెస్పెక్నితెలిసినట్టూ, వేళాకోళంచేస్తూచనువుగామాట్లాడడంగమనించిందిఎల్సీ. అక్కణ్ణించిబయటపడిఒకపార్కులోకూర్చుందామందిమిసెపెక్. సరేనని, బొటానిక్గార్డెన్లోకెళ్ళికూర్చుందిఎల్సీ. చుట్టు పక్కలజనంపలచగాఅనిపించగానే,

“సరే! ఫ్రాన్సిస్ తల్లిగురించి నీకు తెలిసింది చెప్పు!” తొందరపెట్టిందిఎల్సీఆమెని.

“చెప్తా! కానీ, ఆ దెబ్బతో నువ్వూ మీ అక్కా ఆస్తంతాతన్నుకు పోతారు! నాకేంలాభం? నాకేమిస్తావ్?”

“ఏమిస్తావంటేనేనేం చెప్పగలను? నువ్వన్నట్టుముందు ఆస్తి మాచేతికి రానీ! నీకూఏదో బహుమానంఇవ్వకపోను!”

“అదే, ఎంత బహుమానంఇస్తావోచెప్పు?”

ఆమె చెప్పే దాంట్లోనిజంచాలాకొంచెమేఉంటుందన్నవివేకంహెచ్చరించిందిఎల్సీని.

“నువ్వరచిగీ పెట్టినా, ఇప్పుడు నాదగ్గరచిల్లికానీ లేదు! ఆస్తివొచ్చినప్పటిమాటనేనుచెప్పలేను! పైగా నేనుమా అక్కనీ స్టాన్లీగారినీసంప్రదించకుండనీకేవాగ్దానమూచేయలేను,” ఖచ్చితంగాఅంది.

“ఇప్పుడునువ్వు ఊళ్ళోఅందరినీఅడిగి చెప్తానంటేఆగడం నా వల్ల కాదు. నేను ఈవూరొదిలివెళ్ళి పోవాలి. అందుకేఆఖరుమాటచెప్తున్నాను! నేనుచెప్పే రహస్యంమూలంగానీకుఆస్తికలిసి వచ్చినట్టైతే, నువ్వూమీఅక్కా కలిసి రెండూ వేలపౌండ్లివ్వాల్సివుంటుంది!”

“రెండు వేలపౌండ్లా?” ఆవలించిందిఎల్సీ.

“క్రాస్హాల్ఎస్టేటులోజొరబడ్డాకరెండువేలపౌండ్లుపెద్ద మొత్తంకాదని నీకూతెలుసు!”

“అయితేనువ్వుచెప్పే రహస్యంకాగితం మీద చట్టబధ్ధంగారాసి సంతకంచేసిఇవ్వాలి!” షరతు విధించిందిఎల్సీ.

“సరే! కానీ నేను ఈఊరువొదిలివేళ్ళింతరువాతేఆకాగితం లాయరు చేతిలోపెట్టాలి!”

“అంతా బానేవుంది కానీ, నిజంగా నువ్వు చెప్పేరహస్యం రెండు వేలపౌండ్లవిలువచేస్తుందో నాకు తెలియదు. నువ్వునా మీదనమ్మకంవుంచిరహస్యంచెప్పాలి! ఆస్తివొచ్చింతరువాతేడబ్బిస్తాను.”

“మాటలమీదనమ్మకం కాదు. నువ్వూ నాకుకాగితం రాసివ్వాలి, ఆస్తివొస్తేడబ్బిస్తానని.”

అలాఅంటూ మిసెస్పెక్తనసంచీ లోంచి ఒక కాగితాన్ని తీసింది. దాన్లోఎస్టేటుతమకిలభించినట్టయితేతామిద్దరుఅక్కచెల్లెళ్ళూఈ స్త్రీకిరెండువేల పౌండ్లుచెల్లించగలమనిరాసివుంది.

అంతతయారుగా వున్న ఆకాగితం చూసిఎల్సీఆశ్చర్యపోయింది. ఆమెఆకాగితంచదువుతూండగానే, మిసెస్పెక్ఆమె చేతిలో ఒక పెన్ను పెట్టి,

“ఊ..! సంతకంచేయిత్వరగా!” అనితొందరపెట్టసాగింది.

సంతకంపెట్టడానికి భయపడుతూఎల్సీచుట్టూ చూసింది. ఆమెకేంచేయాలోతోచలేదు.

వున్నట్టుండి అక్కడ ఆమెకెవరోతెలిసినమొహం తన వైపే వస్తూ కనబడింది.

-అనువాదం: శారద

శారద

శారద