మాతృగర్భం నుండి మహా శూన్యంలోకి మట్టిఘోష వినడానికీ అహోరాత్రం ప్రయాణం చేస్తూ, జననమరణాలు ఎందుకు? ఈ సృష్టి ఎలా వుంది?-అనే తాత్విక చింతనతో కాలగర్భంలో బందీ అయిపోయీ బయటపడటానికి నిరీక్షణ చేస్తూ జీవప్రమిదెలు వెలగడానికీ ఊపిరి పొస్తూ కాలకుసుమాలు పూయించడానికీ సంకల్పం చెప్పుకొంటూ అప్రయత్నయత్నం తో విశ్వరూపంను డర్శించి ఆదర్శనంతో నేనుగా మిగిలిపొయాను-అనే తాత్విక విచారాన్ని చేస్తున్న ఉత్తమ కవి డాక్టర్ దీర్ఘాశి విజయ భాస్కర్ గారు.
ఎన్నో పర్యాయాల పఠానానంతరం విమర్శకున్నో,విశ్లేషకున్నో కాకపోయినా కవిత్వపు వొడిలో వొరిగిపోయే ఐంద్రికున్నవ్వటం వల్ల వో నాలుగు మాటలు రాయాలనిపించింది.
భారతీయ తత్వచింతనతో, జననమరణాల గవేషణ గూర్చిన ఆలోచనతో, విశ్వరూప రహస్యాల శోధన చేస్తూ వాటిని పారదర్శక చీకటి పొరల్లా మహాశూన్యం లో కవి పాఠకునిముందుంచుతాడు. ఆనాటి భారతీయ తత్వచర్చ అంతా భావవాద,భౌతివాదాల ఘర్షణే. భావవాదానికీ కేంద్రబిందువు దైవ భావన. భౌతికవాదానికీ ఆధారం ప్రకృతిశక్తులు. ఈ రెండింటి సమన్వయ ప్రయత్నమే ఈ కావ్య రచనేమో?
ఏ కవైనా ముందు కవిత్వ రచన చేసి పరిపక్వత సాధించిన పిదప నాటక రచనకు పూనుకొంటాడు. కానీ డాక్టర్. దీర్ఘాశీ విజయభాస్కర్ గారు చాల గొప్ప నాటకాల రచన చేసింతరువాత మహాశూన్యం రచించాడు. ఆ కారణంగానేమో ఈ కవిత్వంలో గాధత, సాంద్రత, చిక్కదనం ఆవరించాయి.
లోకాయతం, సాంఖ్యం,న్యాయం, యోగం, బౌద్దం, జైనం, పూర్వమీమాంస, వేదాంతం మున్నగు దర్శానాల ఙానం “మహాశూన్యం”లో అంతర్లీనంగా అంతరగంగలా కవిత్వపొరల్లో ప్రవహించడం పరిశీలిస్తే ద్యోతకమవుతుంది. ఈ కావ్యాన్ని కవి అనుభావ కావ్యమన్నాడు. అనుభావమంటే “నిగూఢమైన తాత్విక భావనల్ని, అందులోని సున్నితమైన పొరల్ని అనుభవించి అనుభవింపజేసేది”- అని కవే తెలియచేశాడు.కన్ ఫ్యూషియస్ భావనలో అనుభవం కూడా వొక ఙానమే.ఈ ఙాన సముపార్జన కష్టమైంది చేదైంది.దీన్ని స్వానుభవంతో మాత్రమే సాదించుకోగలుగుతారు.
“జనన మరణాలు అభేధమని / అవిభాజ్యమని తెలుసుకొని/ఙ్ఞానినయ్యాను/నేనే ఙ్ఞానమయ్యాను”-అని కవి అనటంలోనే కావ్యాస్వభావం స్థూలంగా తెలుస్తుంది. అనుభవించి అనుభవింపచేసె అంశాలు అనేకం ఈ కావ్యమంతా అల్లుకొని దీన్నొక కవిత్వతాత్వికమార్మిక కావ్యంగా రూపొందించాయి.పాథకుల మేధోచిత్త సంస్కారాన్ని బట్టి ఈ కావ్యం కొందరికి కవిత్వపరిమళం అలదికొన్నదిగా, మరి కొందరికి తాత్విక చింతనాత్మకతను సంతరించుకొన్నదిగా, ఇంకొందరికి సంవేదన, సంశయాత్మక మార్మికత కూడుకొన్నదిగా స్ఫురిస్తుంది. ఇలాంటి కావ్యాలు అరుదుగా సౄజించబడుతుంటాయి.
మహాశూన్యంలో”అంతా వుండి అంతటానిండి వున్నసమస్తం లోని శూన్యం నుంచి చైతన్యం ఎలా అంకురిస్తుందో,అంతటా వుండే శూన్యం,అంతా తానై ఎలా రూపాన్నిపొందుతుందో సృష్టి,స్థితి లయలను ఎలా క్రమబద్దం చేస్తుందో ఈ కావ్యంలో ముకురంలో బింబంలా దర్శనమిస్తుంది. ఏమీ లేని తనం నుండి ప్రారంభించబడి విశ్వాంతరాళానికీ ఎగబ్రాకీ, కాలస్పర్శతో అంతర్ముఖమై తనలోకి తాను గతించే పదార్థంయొక్క నిరంతరగమనశీలతను కవి ఈ కావ్యంలో ఆవిష్కరించాడు.
మానవుడు నిరంతర అన్వేషణాసక్తుడు.అంతేకాదు తమకంతోఅన్నింటిని అవగతం చేసుకోడానికి ప్రయత్నిస్తాడు. ఈ లక్షణం కవిలో పుష్కలంగా వుంది.కాల స్వభావాన్నీ తెలుసుకోవాలనే తన గాఢ వాంఛను పాఠకుడి గుండెకు తగిలేలా కవిత్వం చేసి గురి తప్పని బాణంలా సంధించాడు.
“కాల గర్భంలో క్షణాల కణాల్లా దూసుకొస్తున్నాయి”, “కాలం ఏక ముఖి” , “కాలం హాలాహలం”, “కాలం త్రినేత్రి”-ఇలా ఎన్నో కాల సంబంధి అంశాలు కవిత్వమంతా పరచుకొని పఠిత మనసుని కాలంతోపాటు కవితలవెంట పరుగెత్తిస్తాయి.కాల గర్భంలొ దాక్కున్న కాలాన్ని కవి “అది అంతరిక్ష విశేష కల్పన “అని ” స్వయంభువు అయిన చైతన్యం వల్లనే సృష్టి మొత్తం ఏర్పడిందని తీర్మానిస్తూ కాలం మాటలన్నీ మనిషికిచ్చి తాను మాత్రం మౌనం మిగుల్చుకొని ఆ మౌనంలో చావు పుట్టుకల్ని దాచుకుందంటాడు. కాలం విశ్వమంతా వ్యాపించి సృష్టినంతా ఆక్రమించి పంచభూతాలకు ఆధారభూతమైన ఆద్యంత హేతువైందని కవి భావిస్తున్నాడు. ఏంచేసినా…ఏంచేయించినా కాలమే చేసేది చేయించేది. అయితే కాలం దేన్ని తనదిగా చేసుకోదు-అని కవి కాలస్వభావాన్ని మార్మికంగా వ్యాఖ్యానిస్తాడు ఈ కావ్యంలో. కాలం ఈ సంపుటిలో వొక అంతస్సూత్రంగా అల్లుకపోయింది.
ఎవరైతే ” ఎవనిస్వరూపం తుదిలేని మహాశూన్యమని భావిస్తారో, ఎవరైతే ప్రతి మట్టి రవ్వ,నీటి బొట్టు, గాలి రెబ్బ సమిధలవుతున్నాయి అంతశ్శక్తి మళ్ళీ మళ్ళీ అవతరించాడానికీ అని నమ్ముతారో, ఎవరైతే మనం మరో లొకంలో వున్న రూపాలకు నీడలమని తలపోస్తారో, ఎవరైతే మట్టిలొ పడింది మరుగుపడినా మెరుగుపడే బయటికొస్తుంది మృత్యుఘాతంతోనని విశ్వసిస్తారో, ఎవరైతే దేహికి మట్టి మళ్ళీ మళ్ళీ దేహాన్ని సిద్ధం చేస్తుందని భావిస్తారో, అలాంటి కవులకు వ్యక్తులకు మరో జన్మ మీద, కాలాన్ని నడిపిస్తున్న శక్తి మీద విశ్వాసం వుండే అవకాశం వుంది.
బౌద్దమత పరిచయ జ్ఞానంతోనో, అంబేత్కర్ ఆలోచన విధాన అనురక్తుడైన ఈకవి తన కావ్యానికి బౌద్ద తత్వవేత్త నాగార్జనుడు ప్రతిపాదించిన శూన్యవాదానికీ దగ్గరగా వున్న” మహాశూన్యం”-అనే పదాన్ని కావ్య శీర్షికగా చేసుకొన్నాడు. మనిషి జీవితం కూడా కాల ప్రవాహంలో నిరంతరం కృశిస్తూ సాగిపోయే వొకజనానంతరయానమని బౌద్దమతవిశ్వాసం. బౌద్ద జాతక కథలు బోధిసత్వుడు అనేకలెత్తిన అంశాన్ని చెబుతాయి. ఈ ప్రభావం వల్లనేమో దీర్ఘాశి విజయభాస్కర్ గారు అనంత కాలంలోకోట్లాది మనసుల్లో మెదిలిన ప్రశ్న,ఎన్నో మెదల్లను వెధించిన ప్రశ్న,ఎందరో మహర్షులు,తత్వవేత్తలు శోధించి సంధించిన ప్రశ్న ఒకటే అది మరుజన్మ. మరణానంతరం మనిషి ఏమవుతాడు అన్న సంశయం. ఈ ప్రశ్నకు సంశయానికి సమాధానంగా”ఆత్మక్రతువు”అనే కవితలో కవి ఇలా అంటాడు “అందుకే ఇక్కడ పాతవారెవరూ వుండరు/కొత్తవారెవరురారు/ప్రతి వ్యక్తి సనాతన విశ్వచేతనకు ఓ అధునాతన ” అభివ్యక్తి”-అని. అయితే ఈ సంశయానికీ బైరాగి ఇలా సమాధనం చెబుతాడు వొకచోట.”ఏదీ చావదు ఇచట/ద్రవ్యంలోంచి రూపంలోకి/రూపంలోంచి భావంలోకి/ఓజంలోంచి భావంలోకిరూపం మారుతున్నది ఒకే శక్తి/రాలుటాకు సెజ్జలోంచి క్రొంజిగురులు లేచినట్లు”-అని బైరాగి తాత్వికంగా వ్యాఖ్యానిస్తాడు. ఇలా అనేకులు అనేక విధాలుగా మరోజన్మ గురించి ఆలోచనలు చేశారు.
పోషణ శోషణ డైవం నుంచి ప్రకృతికీ మారినప్పుడు ఈ విశ్వమంతాప్రళయతరంగాలలో కూడిన సముద్రంలో ప్రయాణించే నావికుడు లేని నావగా కవి పోలుస్తాడు.ఆ నావలోని ప్రయాణికులు భయంతో ఎవరికీ వారు తీరాన్ని చేరడానికీ వారంతా అన్నివైపులకు తెడ్డు వేసీ ఆనావను నడ్ఫిపించే ప్రయత్నం చేస్తే దానికీ కదలిక వుంటుది కాని గమనం వుండదు.అంటే ఈ సమస్త విశ్వసృష్టిని ఎవరికీ వారు వారివారి ధోరణుల్లో ఆలోచించుకుంటూ వ్యాఖ్యానించుకుంటూ పోతే అసలు సత్యం,ఙ్ఞానం మున్నగు గమ్యాలను ఈ మానావళి అందుకోలేక పోయిందనే భావనను కవి మహశూన్యంలో ఆవిష్కరిస్తాడు.
అప్రయత్నయత్నం అనే ఈ కవితలో “కణం ఆధారంగా ప్రకృతి క్షణం క్షణం ఆకృతి దాల్చాలనే నిర్దేశం ఎవరిది?….సృష్టి సమస్తం పర ప్రయత్నరహితమై స్వయం భోజక రూపమై ఘటిల్లే అప్రయత్న యత్నం ఏ శక్తిహేతువుది? -అని తనకు తానుగా ప్రశ్నించు కోవడంలోనే కవ్య స్వభావం అర్థమవుతుంది.
ప్రకృతి, పదార్థం జడంగా.చైతన్యంగా అవస్థీకరించడం వల్లనే అహం, ఇహం విభజించబడ్డాయని మనిషి తనప్రవర్తనలో, నడవడిలో మహన్నొతుడిగా ఎదగకుండా మరుగుజ్జు అవుతున్నాడని కవి తాత్విక పరితాపాన్ని ప్రకటిస్తాడు. ప్రకృతి, పర్యావరణ నేఫథ్యంతో ఎంతో తాత్వికంగా మనిషిని మలిచిన మట్టి ఘోషను మనకు వినిపిస్తాడు. మానవీయ లక్షాణాల్ని అలక్ష్యం చేసి అరిషడ్వర్గాలను అక్కున చేర్చుకొని క్రోధిగా, లోభిగా, పాపిష్టిగా, భూమాత గుండె మీద పుండుగా మారిన మనిషిని మట్టిఘోషను వినమని చెబుతాడు. “భూమాత చేసే ఘర్జనలే భూకంపాలు/మనిషి జరిపే విధ్వంసం చూసీవిశ్వజనని కార్చే కన్నీరే కుంభవృష్టులు” -అనిచింతన చేస్తూ “ప్రభూ!ప్రకృతిని ప్రేమించే పుట్టించమని” నమ్రతతో నమస్కరిస్తూ, ప్రకృతిని ప్రేమించే మనిషి జనన అనివార్యతను గుర్తుకు తెస్తాడు.
పంచభూతాలు,తోకచుక్కలు,కృష్ణబిళాలు,గ్రహశకలాలు ఏవి ఎప్పుడు ఈ అవనిని ఆవగింజగా మార్చి అంతం చేస్తాయో ఎవరికీ తెలుసు-అని మనో సంశయాన్ని చెబుతూ మానవుని ఙ్ఞానావిష్కరణా పద ఘట్టనలకింద ప్రకృతి నలిగినలిగి నుజ్జునుజ్జవుతుందని ఈ సత్యం గ్రహించే సరికి మనిషి మిగలడూ భూమి వుండదని కవి వొక మార్మిక రహస్యాన్ని విప్పుతాడు.
పదార్థం దాని స్వభావాన్ని కనబరచకబోతే విలువను కోల్పోయి న్యూనతను పొందుతాయని ప్రతిపాడిస్తూ” తుఫానే లేకపోతే సముద్రమెంత చులకన? కంపించడం మరచిపోతే భూమి ఎంతలోకువ”- అంటాడు. ఈ కవే మరో చోట పదార్థం తన స్వభావాన్ని కనబరచకబోతేఆధిక్యతతో భాసిస్తాయంటాడు. “గాయపర్చే శక్తిని కోల్పోతే అస్త్రమే ఆభరణమవుతుంది నోప్పించే గుణాన్ని కోల్పోతే మాటే మంత్రమవుతుంది”- వొక అభాస వైచిత్రుల్నీ కావ్య పరిమళంలో కలిపి పఠితల్ని ఆఘ్రానింప చేస్తాడు.
గతవైభవ ఆలొచనలతో శాస్త్రీయతను అంగీకరించకపోవడం, ఆధునిక దృక్ఫథాల పెడసరితనంతో శాస్త్రాలను పక్కన పెట్టడం ప్రతి తరంలోను వుంది.ఆ భావనతోనే అనంత ఆత్మ తత్వాన్ని “విశ్వరూపం”-అనే కవితా ఖండికలో ఆవిష్కరించానని కవే పేర్కోన్నాడు. “కాలాన్ని వొడిసిపట్టి కాలంలో లీనమై నేనే కాలస్వరూపంగా మారాను.”-“భౌతికం నుండి బ్రహ్మంగా మారుతున్నాను. అడిగో మహాశూన్యం సాక్షాత్కరిస్తోంది.”- అ ఒటున్నాడు కవి విశ్వరూపంలో.
బ్రహ్మం అంటే ఏమిటి? ఙ్ఞాని కావడం ఏమిటి? ఙ్ఞానమై పొవడమేమిటి? ఈ ప్రశ్నలు పాఠకుల మనసును తొలుచక మానవు. ఇది మార్మిక తాత్విక కావ్యమవ్వటం వల్ల ఇలాంటి అనేక సంశయాలు కావ్యంలో పొదగబడ్డాయి. పొరలుపొరలుగా వున్న కవిత్వాన్ని విప్పుకొంటు పాఠకుడు ముందుకు పోగలిగితే కావ్య స్వరూపం మాధుర్యం మనసుకు అంది ఆలోచనామృతం అవుతుంది.
సర్వకాల సర్వాస్థలలో కాదలేనిది, లేదనడానికీ వీలులేనిది, పరిమితి, సంకుచిత తత్వం,వివాదం లేనిది, అప్రమేయమైనది, స్వతంత్రమైనది ఏదంటే ” బ్రహ్మం”. ఆ బ్రహ్మం కోసం అన్వేషణ సాగించాలంటే సూక్ష్మదృష్టి కావాలి. కళ్ళతో చూస్తున్నప్పుడు కన్పించేది వేరేగా వుంటుంది. అట్లాంటి స్థితిలో కనిపించిన దానిమీదంతా కాకుండా, అవసరమైన దానిమీదే మనసును కేంద్రీకరించ గలిగితే, అలా…అలా ఒకానొక కేంద్రానికి చేరాక,సూక్ష్మస్థితికి చేరుకొన్నాక ఆ కేంద్రబిందువు మీద మనసు నిలిపితే గోచరమయ్యేది శుద్దమైన సత్యం. అదే బ్రహ్మం. అప్పుడు ఏమి? ఏంత? ఎన్ని? అనే ప్రస్నలు ఏర్పడవు.ఎంత వున్నా కావాలనిపించేది ఏదీ వుండదు. అదే బ్రహ్మం. ఆ స్థితికీ మనిషి చేరుకోవలన్నది కవి కాంక్ష. అప్పుడే సృష్టి సమస్తం సుఖవంతం .జననమరణాలు అభేధమని, అవిభాజ్యమని తెలుసుకోవడం ఙ్ఞానం. తనను తాను తెలుసుకోవడం ఙ్ఞాని అవ్వడం.
ఇది ఎంత తాత్విక మార్మిక కావ్యమే అయినా ఆ తాత్వికమార్మికతా ఉంగరంలో కవిత్వ రత్న వాక్యాలు వొడుపుగా పొదగబడ్డాయి. కవి విజయభాస్కర్ గారి భావనా శక్తి అపారం. సముద్రం ఎట్లా ఏర్పడిందో కవి భావిస్తాడు చూడండి. సూర్యుడు,చంద్రుడు ఆకాశానికి అందాల బిడ్డలు. ఆకాశానికి పాలు పడక ఆకలితో అల్లాడే వాళ్ళకి పాలిమ్మని ఆకాశం భూమిని అడుగుతుంది. భూమి మంచు తెరల పయిటను తొలగించి పర్వత పాలిండ్లను చేపి ఆకాశపు బిడ్డల కడుపు నింపిందట. వాళ్ళు తాగుతున్నప్పుడు జారిపడ్డ పాలబొట్లే మడుగుకట్టి సముద్రమయ్యిందట. ఇలా ఊహించటమ్ ఈ కవికీ సాద్యమేమో? అలాగే రాత్రి, పగలు ఏర్పడిన విధానాన్ని కూడ అడ్భుతంగా ఊహిస్తాడు.
“వయోభారంతో విశ్వం బుద్ది మందగిస్తోంది. ఙ్ఞానభారంతో భూమి తల్లడిల్లుతోంది. అంతరిక్ష అంతరంగం గాయాలతో మూలుగుతోంది.”- కవి అన్న ఈ మాటలు ఎన్నొ సంకేతార్థాలను స్ఫురింపచేస్తాయి. గాఢతాత్వికాంశాల ప్రస్తావనలోనే సమకాలీన అంశాలను స్ఫురింప చేయడం ఈ కవి ప్రత్యకత.
మనిషి భయంకర వికృత ఆలోచనలతో ప్రకృతిని, చివరకూ గ్రహాలను కూడా వొదలకుండా దోచుకోబోతున్నాడని “గ్రహాల్లారా పారిపోండి”-అని హెచ్చరిస్తాడు. ప్రకృతిని సృజించడానికీ ముక్కోటి దేవతలు కావాలేమో కాని వినాశనానికి ఒక్క మనిషి చాలు అని లుప్తమైపొతున్న మానవ్త విలువల్ని గురించి ఆలోచింప చేస్తాడు. “భూమి గుండె గుజ్జు వొలుచుకొంటున్న గనుల గుర్తులు.సుర్యున్ని మింగేసిన అంజనీ పుత్రుడొక్కడే ఆనాడు భూమిని నమిలేస్తున్న వాయునందనులెందరో ఈనాడు”-అని అనటంలో బళ్ళరి గనులను నమిలేసిన గాలిని గుర్తుకు తెస్తాడు.
ఇలా తాత్వికతతో, మార్మికతతో, కవిత్వంతో భాసిస్తున్న మహాశూన్యం ను గూర్చి ఎంత మాట్లాడినా మిగిలిపోయే అంశమేదో వుందని అనిపిస్తుంది.ఎవరికీ వారు దీన్ని చదివి కవిత్వపు లోపలిపొరల్లోకి వెళ్ళి తమ లోపలి ప్రపంచాల్నీ ప్రక్షాళన చేసుకోవాల్సిందే.కొలకలూరి వారన్నట్లు శ్రీశ్రీ మహాప్రస్థానం చేస్తే విజయభాస్కర్ మహాశూన్యం డర్శించాడు.
ఈ కవే అన్నట్లు” మనందరి మధ్య ఏమీ తెలియని తెలిసిన తన మొకటుంది. తెలుసు కున్నవారు కూడా తెలియచెప్పలేని తెలివి తక్కువతనమది”-తెలివి తక్కువ తనంతో ఏదైనా రాసివుంటే దానికి బాధ్యత నాదే, కావ్యానిది కాదు.
-రాజారామ్ తుమ్మచర్ల
“అందుకే ఇక్కడ పాతవారెవరూ వుండరు/కొత్తవారెవరురారు/ప్రతి వ్యక్తి సనాతన విశ్వచేతనకు ఓ అధునాతన ” అభివ్యక్తి”
పునర్ జన్మ అనేది మనిషిని పట్టి పీడించే జీవితాకంక్ష. జీవితానికీడిక్టటవటం. తన ఎగ్జ్ జిస్టెన్స్ కు ఎటువంటి హాని జరగదు అనే భావాన్ని వదిలేస్తే ఇక మానవ జంమ శూన్యం. దాన్ని భరించలేకనే ఈ భావాన్ని సృష్టించుకున్నాడేమో?! అందుకే పునరపి జననం పునరపి మరణం అనే బావాన్ని వదులుకోవాడానికి మనసు ఒప్పదేమో.
కవి పరిచయం బాగుంది.
తిరుపాలు గారికీ కృతజ్ఞ్తలు .