మా వాహనం శ్రీనగర్ నుండి జమ్మూ వయిపుకి హైవే లో జెట్ వేగంతో దూసుకు పోతోంది. హిమపర్వత సానువుల్లో ఒదిగి వెండి దుప్పటి కప్పుకొని మిలమిలా మెరుస్తూ ఎంతసేపైనా చూడాలనిపించే మనసును కట్టిపడేసే ఒడుదుడుకుల పర్వతశ్రేణులు, .. రాతి ద్రోణులు .. వాటిని వెన్నంటి ఉండే , హిమానీనదాలు ..స్వచ్చమైన నీటి పాయాలూ.. ఏర్లు .. సెలయేర్లు, సరస్సులు.. జలపాతాలూ ..ఆకాశాన్ని అందుకోవాలని ఉబలాట పడుతూ ఎదిగి పోతున్న దేవదారు వృక్షాలూ, అక్కడక్కడ దట్టమైన అడవులూ, వృక్షాలు, పచ్చని తివాచీ పరచినట్లు పచ్చికబయళ్ళు .. వాటిపై అక్కడక్కడ గొర్రెలమందలతో తెల్లగా బక్కగా పాల బుగ్గల
పసివాళ్ళు .. అందమైన కాశ్మీరు లోయలో పేదరికాన్ని , వెనుకబాటు తనాన్నితెలియజేస్తూ .. నా ఆలోచనల్లో నేను. ఎవరికి వారు కాశ్మీరు లోయ అందాలకి పరవశిస్తూ .. ఆ అద్భుత దృశ్యాలని మా మదిలోనూ, కెమెరాల్లో బంధిస్తూ.. ఆప్రాంతాన్ని వదిలి రావాలని లేక పోయినా తప్పదుగా ..అనుకుంటూ
‘కాశ్మీరు కొండల్లో అందాలకి .. కొత్త అందాలిచ్చారు
కాశ్మీరు వాగుల్లో పరుగులకి .. కొత్త అడుగులిచ్చారు ” మౌన రాగానికి బ్రేక్ వేస్తూ రాగం అందుకుంది మృదుల .
కాశ్మీరు లోయలో .. కన్యాకుమారిలో .. ఓ సందమామ , ఓ సందమామ ‘ పోటీగా సంగీత. ఆమెకు జత కలుస్తూ మాలిని, కవిత .
‘ప్రేమ యాత్రలకు బృందావనము, కాశ్మీరాలు ఏలనో ..’ మరో పాట అందుకుంది మృదుల
మన కవులు ఈ అందాలపై ఎన్ని పాటలు కట్టారు ..! కవితలు అల్లారు ..!
అమరనాథ యాత్ర, గుర్రాలపై ప్రయాణం, నడవ లేక డోలి ఎక్కినా వైనం, గత వారం రోజులుగా అనుభవించిన అద్భుతమైన మధురానుభూతులను నెమరు వేసుకుంటూ ..అడుగడుగునా కనిపించే సెలయేటి గలగలలు .. జలపాతాల సవ్వడులు .. పక్షుల కిలకిలలు .. ప్రకృతి అందమంతా కుప్ప పోసినట్లుగా .. తడిసి ముద్దాయి పోతూ .. మేం .
“నాకయితే ఇక్కడే ఎప్పటికీ ఉండిపోవాలనిపిస్తోంది’ ముందు సీటులో కూర్చొని భూతల స్వర్గం గురించి ఆలోచిస్తోన్న మాధురి.
‘ఆ.. నాకూను. నేను మనసులో అనుకున్నా . నువ్వు పైకి చెప్పేశావ్ ‘వంత పాడింది కవిత.
‘అబ్బ ఎంత ఆశ. మనని ఇక్కడ ఉండనిచ్చేది ఎవరట ?’ నవ్వుతూ నేను.
‘ ఉండనిచ్చేది ఏమిటి ఉండాలనిపిస్తే ఉండడమే .’ మాలిని
‘అలా ఇక్కడ ఉండకూడదు.’ నొక్కిచేప్పా
‘అదేంటి? ఎందుకు ఉండకూడదు? మనం భారతీయులం . ఈ దేశంలో ఎక్కడైనా ఉండవచ్చు’ తెలిసినట్లుగా మాలిని.
‘ఆ పప్పులేవి ఇక్కడ వుడకవమ్మ ‘ ఉడికిస్తూ నేను
‘ఆ ఎందుకనీ .. ‘ రవిత్రేయిని చేతిలో ఉన్న తమ జమాఖర్చుల పుస్తకాన్ని మూసి మాలిని చేతిలో పెడుతూ.
‘ఏం వీసా కావాలా.. ‘ మృదుల గాలికి రివ్వున ఎగురి మొహాన్ని కమ్మేస్తున్నముంగురుల్ని సవరించుకుంటూ.
‘వీసా తీసుకుని అమెరికా లాంటి దేశాల్లో పౌరసత్వం తీసుకొని స్థిరనివాసం ఏర్పరచుకోవచ్చు. కానీ కాశ్మీరులో మాత్రం కుదరదు. శ్రీనగర్లో మనం ఉన్నాం చుడండి అలాంటి బోటు హౌస్ లే గతి మనలాంటి వాళ్లకి . ఇక్కడి చట్టాల ప్రకారం కాశ్మీరు ప్రాంతేతరులు ఇక్కడ భూమి కొనలేరట. బోట్ హౌస్ లో మాత్రం ఉండవచ్చట.’ ఈ యాత్ర కి వచ్చేముందు వికిపీడియా లో చుసిన విషయం చెప్పా.
‘అవునా! ‘ రవిత్రేయిని ఆశ్చర్యంగా
‘బోట్ హౌస్ అయితేనేమి..? ఎంచక్కా స్వచ్చమైన నీటిలో తేలియాడుతూ ఊయలలూగే ఇల్లు.. ఆనందించక’ కవిత కంచు కంఠంతో కరచినట్లుగా
‘పర్యాటక లోకాన్ని రా రమ్మని పిలుస్తోన్న సుందర కాశ్మీరంలో ఈ అల్లకల్లోలం ఏంటో .. ‘ తమ రాకకి కొద్దిగా ముందు బారాముల్లా లో జరిగిన అల్లర్లు .. శ్రీనగర్లో కర్ఫ్యూ గుర్తొచ్చిన రవిత్రేయిని .
‘కాశ్మీరులో జరిగే అల్లర్ల గురించి మేం పుట్టినప్పటి నుండి వింటున్నాం. అసలు కారణం ఏమిటి ‘ డ్రైవర్ని అడిగింది మాధురి.
అంతా ఏమి చెబుతాడోనని ఆసక్తిగా అతని కేసి చూస్తూ .. కొద్ది క్షణాలు ఆలోచించి ‘దేశ విభజన సమయంలో కాశ్మీరు సంస్థానం మహారాజ హరిసింగ్ సారధ్యంలో భారత దేశంలో విలీనం అయింది. అయితే, అప్పట్లో కాశ్మీరు భూభాగం ఒక ప్రత్యేక స్థానాన్ని పొంది ఉండేది. మహారాజ హరిసింగ్ భారత దేశంలో చేరే విధంగా పావులు కదపడం గిట్టని బ్రిటిష్ వారే పాకిస్తాన్ ను కాశ్మీరు దురాక్రమణకు ప్రేరేపించారట మేడం. అంతేకాదు మేడం, పాకిస్తాన్ తరపున భారత దేశానికి వ్యతిరేకంగా పోరాటం చేశారట. అలా తెల్లవాళ్ళ సాయంతో 1948లో కాశ్మీరులో కొంత భాగాన్ని పాకిస్తాన్ ఆక్రమించుకొందట. అప్పటినుండే మాకు ప్రశాంతత లేకుండా పోయిందని మా తాతలు అంటుండేవారు మేడం’ మాధురి ప్రశ్నకి జవాబు గా తనకు తెలిసింది చెప్పాడు డ్రైవర్.
‘అగ్గిపెట్టెలో పట్టే చీరలంటే ఏమో అనుకునే దాన్ని . నిజంగా కాశ్మీరీ సిల్క్ చీరలు నా మనసు దోచేశాయి.’ ఆ టాపిక్ మారుస్తూ మాలిని. నిన్నసాయంత్రం శ్రీనగర్ లో చేసిన షాపింగ్ చీరలు, శాలువాలు, వాటిపై ఉన్న
కాశ్మీరీల చేతి పనితనం, స్టోల్స్, గాజులు , కుంకుమ పువ్వు , ఆప్రికాట్స్, మొఘలుల ఉద్యానవనాలు, కోటలు ఇలా మాటల గలగలలు ..సాగిపోతూ.. మేం కొన్న గాజులూ, పర్సులు అందుబాటులో ఉన్న వాటిని ఒకరికొకరం చూపుకొంటూ.. ధరలు.. బేరీజు వేసుకుంటూ..
మేం ప్రయాణిస్తున్న వాహనం స్లో అయింది. ఆగింది. ఎదురుగా వచ్చే వాహనదారులు డ్రైవర్తో ఏదో కశ్మీరీలొ మాట్లాడాడు. ఆ తర్వాత ఎవరితోనో ఫోనులో మాట్లాడాడు. ఆ తర్వాత మా వాహనం ప్రధాన రహదారి లో కాకుండా దారి మళ్ళింది. గ్రామాల్లో ఉండే కచ్చా రోడ్డులో మేం. ఆ గతుకుల కుదుపులకు ఒక్కసారిగా స్పృహలోకి వచ్చాం. అసలేం జరుగుతోంది. శ్రీనగర్ నుంచి జమ్ముకి ఉన్న హైవే లో కాకుండా మేం ఈ రోడ్డులోకి రావడమేమిటి ..? మాటల్లో పడి గమనించనే లేదు. అందరిలో తెలియని ఆందోళన.
‘భయ్యా.. ఏమిటిది ? రహదారి ఉండగా ఈ దారిలో ..? అర్దోక్తిగా హైదరాబాదీ హిందీలో మాలిని.
‘ముందు రెండు చోట్ల హర్తాల్ జరుగుతోందట’ డ్రైవర్ తల ఇసుమంతైనా కదల్చకుండా.. మా వేపు దృష్టి మరల్చకుండా
‘ఎందుకు?’ గాబరాగా సంగీత
‘మొన్న బారాముల్లా దగ్గర జరిగిన కాల్పులలో సాధారణ పౌరులేవరో చనిపోయారట. అందుకు నిరసనగా’ చెప్పాడు డ్రైవర్. అంతా ఉలిక్కి పడ్డాం.
‘ఇది నిజమేనా .. ‘ మాలిని సందేహం
‘ఏమో.. అసలే మనమంతా ఆడవాళ్ళం ‘ భయంగా సంగీత
‘ఇతని మాటలు నమ్మదగ్గట్టుగానే ఉంది అతని వాలకం’ మృదుల.
రకరకాల సందేహాలు మా మనస్సులో. అప్పటివరకూ ఉన్న ఉత్సాహం .. కబుర్ల స్థానే కలవరం.. భయం . ఏం జరగబోతోంది.. ఉత్కంట . అన్ని వైపులా తేరిపార జూస్తూ .. అప్రమత్తంగా ..
ప్రతికూల పరిస్థితుల్లో, ఉగ్రవాద బూచి ఉందంటూన్న సమయంలో ఈ ప్రయాణం అవసరమా అంటూ ఇంట్లోవాళ్ళు బయటివాళ్ళు మమ్మల్ని నీరస పర్చచూశారు. భయపెట్టారు. అయినా అవేవి లక్ష్య పెట్టక రెండునెలల క్రితమే ప్లాన్ చేసుకున్న విధంగా మా యాత్ర సాగించాం. అమరనాథుని దర్శనం చేసుకుని శ్రీనగర్ చేరాం. వైష్ణోదేవిని దర్శించాం. అంతా అనుకున్న విధంగా సవ్యంగా సాగిందన్న ఆనందంతో ఉన్న మాకు షాక్ కలిగిస్తూ..
పది నిముషాలు కచ్చా రోడ్లో ప్రయాణం తర్వాత ఓ చిన్న గ్రామంలో ప్రవేశించాం. వీధుల్లో కొద్ది మంది యువకులు తప్ప ఊళ్లో ఉండే సందడే లేదు. అకస్మాత్తుగా మా వాహనం ఆగింది. డ్రైవర్ దిగిపోయాడు. అతడెందుకు ఆపాడో అర్ధం కాక మేం అడిగే లోపే అతను వడివడిగా అడుగులేస్తూ .. కుడి వేపుగా ఉన్న మసీదు కేసి నడుస్తూ ..
పట్టేసిన కాళ్ళని సాగదీస్తూ మధ్యలో ఉన్న నేను, మృదుల, సంగీత దిగబోయాం. ‘ఎందుకు దిగుతున్నారు .. వద్దు. అసలీ డ్రైవర్ మనతో ఏమీ చెప్పకుండా వెళ్ళడం ఏమిటి ?’ వారిస్తూ మాలిని.
మేం దాటి వచ్చిన యువకులు మమ్మల్నే చూస్తూ ఏదో అరుస్తున్నారు .. మాకేం అర్ధం కాలేదు. ఎందుకైనా మంచిదని మేం మా వాహనం ఎక్కబోతుండగా, రోజాలో ఉన్నాడేమో నమాజ్ కోసం వెళ్లి కాళ్ళు చేతులు కడుక్కుంటున్న డ్రైవర్ కి ఏం కనిపించిందో కంగారుగా పెద్ద అరుపు ఎక్కండంటూ. అంతలోనే ఆ యువకుల గుంపు నుంచి ఓ గులక రాయి మా వయిపు దూసుకొచ్చి మాకు అతి సమీపంలో పడింది.
పట్టుకోండి .. తన్నండి .. తరమండి .. రాళ్ళ వర్షం మాకు దగ్గరవుతూ .. పరుగు పరుగున వచ్చిన డ్రైవర్ బండిని ముందుకు ఉరికించాడు. ఆ అల్లరి మూకని, రాళ్ళనీ తప్పించుకుంటూ సందులు గొందులు తిప్పి ఎలాగయితేనేం ఆ ఊరు దాటించాడు. ప్రాణాలు అర చేతిలో పెట్టుకొని మేం. ఏ ప్రమాదం ఎటు నుంచి ముంచుకొస్తుందోనన్న భయంతో.. మరో ఊరు .. మరో ప్రదేశం అక్కడా వాతావరణం తుఫాను వచ్చేముందు ప్రశాంతతలా .. కర్ఫ్యుని తలపిస్తూ .. మధ్య మధ్యలో మా వాహనం ఆపే BSF జవానులు.
ఏదో జరుగుతోంది. మా ప్రయాణం ఏ మాత్రం సురక్షితం కాదని తెలుస్తోంది. ఆపద ముంచుకొస్తోంది .. ఏం చేయాలో దిక్కు తోచని స్థితి.
‘ క్యా భయ్యా క్యా హువా ‘ రవిత్రేయిని
‘ఏమో .. ఈ బండి జమ్మూ రిజిస్ట్రేషన్ కదా .. మనం ఉన్నది కాశ్మీర్లో .. ముందుకు వెళ్ళడం కష్టమే . ఎక్కడైనా ఆగాల్సిందే . ‘ డ్రైవర్ మధ్య మధ్యలో ఎవరితోనో ఫోనులో మాట్లాడుతూనే ఉన్నాడు తమ భాషలో.
‘అదేంటి .. నువ్వు ఈ రాష్ట్రానికి చెందిన వాడివే కదా ..’ కవిత
రంజాన్ ఉపవాసంలో ఉన్న అతను నమాజ్ చేసుకోవడానికి ఎక్కడా కుదరలేదు. చివరికి కూర్చున్న చోటే నమాజ్ కానిచ్చాడు. ఓ గ్రామంలో పరిస్థితి చెప్పి తమకి ఆశ్రయం కోరాడు. ఎవరూ ఒప్పుకోలేదు. చివరికి ఓ ఇంటి పెద్ద సరేనన్నాడు. మా వాహనం రోడ్డు మీద ఉంటే ప్రమాదమని రెండు ఇళ్ళ మధ్య ఉన్న సందులో ఎవరికీ కనపడకుండా పెట్టించాడు. మా అందరినీ తమ ఇంట్లోకి తీసుకెళ్ళి ప్రధాన ద్వారం మూసేశాడు. వీళ్ళంతా ముస్లింలు. ఇది ఏ తీవ్రవాదులకో సంబందించిన స్థలం కాదు కదా .. ! మమ్మల్ని ఇక్కడ బంధించారా .. ఏమో .. ఏ పుట్టలో ఏ పామున్నదో .. ఎవరికి తెలుసు ? అసలు నిజంగా హర్తాల్ జరుగుతోందా .. ఈ డ్రైవర్ మధ్య మధ్య ఫోన్ మాట్లాడుతూనే ఉన్నాడు. తీవ్రవాదులతో కాదు కదా .. ? ఇందాక ఈ ఇంటి యజమాని చెప్పినట్లు మేము దాటి వచ్చిన ఆ గ్రామం పాకిస్తానీ ఉగ్రవాదుల్ని కాల్చివేసిన ప్రదేశమేనా ..? మదిని తొలిచేస్తూ ..
మేం క్షేమంగా ఉన్నామా .. లేక పెనం మీద నుంచి పొయ్యిలో పడ్డామా .. అనుమానపు చూపులతో మేం. డ్రైవర్ జమ్ముకి చెందిన ముస్లిం, ఈ ఇల్లు కాశ్మీరీ ముస్లిం వ్యక్తిది. మేమంతా హిందువులం . తప్పదు .. ఇప్పుడు
ఏమనుకొని ఏమీ లాభం లేదు. ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలి. ఏది జరిగితే అది జరుగుతుంది అని మమ్మల్ని మేం సన్నద్మము చేసుకుంటూ .. ఎదురయ్యే పరిస్థితులని ఎదుర్కోవడానికి సమాయత్తమవుతూ .. గుండె దిటవు చేసుకుంటూ ..
‘ఈ ప్రాంతంలో వాళ్లకి హిందువులంటే గిట్టదట ‘ ఏదో గుర్తొచ్చినట్లు మృదుల చెవిలో గొణిగింది సంగీత.
‘చుప్’ కళ్ళతో వారిస్తూ .. మృదుల
భారత్ -పాకిస్తాన్ ల మధ్య జరిగిన మూడు యుద్దాలకు, కాశ్మీరీ లోయలో ఉగ్రవాదానికి మా ఈ విపత్కర పరిస్థితికి మేమే కాదు మాలాంటి ఎందఱో పర్యాటకుల ఇబ్బందులకు కారణం కాశ్మీరు వివాదమే. కాశ్మీరు మనదేశంలో అంతర్భాగం అని మనం అనుకుంటున్నాం. పాక్ లో ఉన్న కాశ్మీరి భూభాగాన్ని పాక్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నాం. మన లాగే పాకిస్తాన్ వాళ్ళు కాశ్మీర్ తన దంటున్నారు. భారత్ లో ఉన్న కాశ్మిరీ భూభాగాన్ని భారత్ ఆక్రమిత కాశ్మీర్ అంటున్నారు. మా ఈ స్థితికి మూలాలను వెతుకుతూ నా ఆలోచనలు
మా బృంద సభ్యులంతా మనసులో ఏ భయాలున్నా కనిపించనీయకుండా ఆ ఇంటివాళ్ళతో మాట్లాడుతున్నారు. ఆ ఇంటి పెద్ద అబ్దుల్లా చాల స్నేహంగా ఉన్నాడు. గలగలా మాట్లాడుతున్నాడు. లోపలున్న భార్యని, కోడల్ని , కూతుర్ని పిలిచి మా విషయం చెప్పాడు. మేం హైదరాబాద్ నుండి అని చెప్పగానే చాలా ఆశ్చర్యం వారిలో. అంత దూరం నుండి చూడడానికి వచ్చారా.. అందులోనూ అంతా ఆడవాళ్ళు అని . ఇంటి యజమాని తమ్ముడు హైదరాబాదులోనే మిలిటరీ శిక్షణ తీసుకున్నాడని వచ్చేటప్పుడు చేతి గడియారాలు తెచ్చాడని చెప్పారు. వాళ్ళ మాటల్లో హైదరాబాద్ అంటే అభిమానం కనిపించింది. అంతా కుర్చోన్నాం. సుహృద్భావ
వాతావరణంలో సాగుతున్న సంభాషణల మధ్య నిశ్చలంగా ఉన్న బావిలో రాయి వేసి కంపనాలు సృష్టించినట్లు అయింది మా పని మాలిని కొద్దిగా పక్కకు వెళ్లి చేసిన ఫోన్ తో.
మాకు ఎదురైన క్లిష్ట పరిస్థితి, మేం తలదాచుకున్న విధం, మేమున్న ప్రదేశం, ఇంటి యజమాని పేరు అన్నీ వాళ్లయనకు ఫోన్ చేసి చెప్పింది. ఎందుకయినా మంచిదని. ఆ ఇంటి వారి మొహాల్లో మారిన రంగులు. భ్రుకుటి ముడుస్తూ పెద్దాయన. మమ్మల్ని అనుమానాస్పదంగా చూస్తూ .. అసహనంగా కదులుతూ . ముక్కూ మొహం తెలియని వారికి ఆశ్రయం ఇచ్చి తప్పు చేశామా అన్న భావన వారి కళ్ళలో ప్రతిఫలిస్తూ ..
సహజమే కదా .. వారిని తప్పుపట్టలేం. అప్పటివరకూ మాకు తెలిసిన హిందీలో మాట్లాడిన మా మాటలు విన్న వారికి ఒక్క సారిగా తెలుగు వినడం అది వారికి అర్ధం కానిది కావడం, మధ్య మధ్యలో వారి ఉరి పేరు, ఇంటి యజమాని పేరు రావడం అకస్మాత్తుగా వారి అనుమానానికి కారణమయ్యి ఉండొచ్చనిపించింది . పురుషులు లేకుండా మీరే వచ్చారా అని మమ్మల్ని ఆశ్చర్యంగా, అబ్బురంగా.. ఆరాధనా పూర్వకంగా చుసిన ఆ ఆడ వాళ్ళలో కన్పిస్తున్న భయం ఆందోళన… ఈ సంకట పరిస్థితినుండి ఎలా బయటికి రావాలి.. తూటాల్లా తాకుతున్న చూపులనుంచి ఎలా తప్పించు కోవాలి
‘హైదరాబాద్ లోను ఇంకా చాలా ప్రాంతాల్లోనూ ఉర్దూ మాట్లాడతారు. అదే మీతో మాట్లాడాం. మా రాష్ట్రం లో మా మాతృభాష తెలుగు. మేం ఇంట్లో మాట్లాడేది తెలుగులోనే. ఇక్కడ అలజడుల గురించి వార్తల్లో చూస్తే మా వాళ్ళు కంగారు పడతారు కదా అందుకే మేం అంతా క్షేమంగా ఉన్నాం. మా గురించి ఆందోళన వద్దు. ఓ పెద్ద మనిషి పెద్ద మనసుతో మాకు ఆశ్రయం ఇచ్చారని మాలిని వాళ్ళాయనకి చెప్పింది’ అని చెప్పాను .
అవునన్నట్లుగా తలలూపారు మిగతావాళ్ళు. మా అందరినీ నఖశిఖ పర్యంతం పరీక్షగా చూసిన ఆ ఇంటి పెద్ద, ఇతర కుటుంబ సభ్యుల మొఖాల్లో ప్రసన్నత నిదానంగా చోటు చేసుకుంటూ.. హమ్మయ్య వాళ్ళు మామూలయ్యారు అనుకున్నాం. కాసేపు మాట్లాడిన తర్వాత అత్తా కోడళ్ళు సాయంత్రపు పనిలో నిమగ్నమయ్యారు.
ఆ పెద్దాయన కాశ్మీరీల పేదరికం, పిల్లల చదువు, పాకిస్తానీ ఉగ్రవాదులు స్థానికులను ప్రేరేపించి, డబ్బుల ఎర చూపి అక్కడి యువతకి శిక్షణ ఇస్తున్నారని, ఉగ్రవాదం వైపు మళ్ళిస్తున్నారని దాదాపు 50 వేల మంది
ఉగ్రవాదం వల్ల ప్రాణాలు కోల్పోయారని చెప్పాడు. 1990 తర్వాత తీవ్ర వాదం వల్ల హిందువులపై దాడులు పెరగడంతో హిందువులు కాశ్మీరు ప్రాంతాన్ని వదిలి ప్రాణాలు గుప్పెట పట్టుకుని పోయారని, ఇప్పుడు 5% కూడా హిందువులు లేరనీ అన్నాడు. ఇప్పుడు తమ గ్రామంలోనూ ఒకే ఒక కాశ్మీరి పండిట్ కుటుంబం ఉందనీ తాము ఎంతో స్నేహంగా ఉంటామని చెప్పాడు. కాశ్మీర్ భూభాగంలో కొంత ఆక్సాయ్ చిన్ భాగం చైనా అధినంలో ఉందనీ .. పాకిస్తాన్ ఆక్రమణలో ఆజాది కాశ్మీర్ ఉందనీ, ఆ బందులు, హర్తాల్ లు.. కాశ్మీర్ లోయ దద్దరిల్లి పోవడం .. పాలకులు ప్రజల మనో భావాల్ని పట్టించుకోకపోవడం గురించి చాలా చెప్పాడు.
భారతసైన్యం వేరు, కాశ్మీరు ప్రజలు వేరు అనే స్థాయిలో పరిస్థితులు చేయిదాటిపోతున్నాయి. భద్రతా బలగాలు మా పాలిట యమకింకరులుగా తయారయ్యాయి. అత్యంత సున్నితమైన ఈ సరిహద్దు ప్రాంతంలో ప్రజల మనోభావాలను పట్టించుకోరు. మా పాలకులకి ప్రజలని సానుకూలంగా మలుచుకోవడం తెలియదు. ఉత్తర,దక్షిణ కాశ్మీరు జిల్లాల్లో మునుపెన్నడూలేని రీతిలో ప్రజలు భద్రతా బలగాలపై విరుచుకు పడుతున్నారు. మేం ఉగ్రవాదం మినహా జీవితంలో సుఖం, సంతోషం, సమైక్య జీవనం, విద్య, విజ్ఞాన వినోదాలు వంటి వాటితోపాటు సామాజిక జీవితాన్ని కోల్పోతున్నాం. రోడ్డుపై వెళ్ళే ఎవరికీ భద్రత లేదు. మా పిల్లల చదువులు కొండెక్కాయి. ప్రజలు స్వేచ్ఛ కోల్పోయారు. సాయంత్రమైతే భయంగా ఇంట్లోనే ఉండిపోవాలి. అర్థ రాత్రి తలుపులు తట్టేది ఉగ్ర వాదులో, పోలీసులో తెలియదు, ఒకరికోసం ఒకరు వెతుక్కుంటూ వస్తారు. ఇద్దరివల్లా చిత్రహింసలకు మేం గురికావల్సిందే. ఇంకా చెప్పాలంటే కాశ్మీరులో మత కలహాలు లేవు. ఉగ్రవాదులకు, భద్రతా బలగాలకే పోరు. ఎప్పుడో ఒకప్పుడు ఈ మంచుపర్వతాలు బద్దలై, ఆ మంటలు ఎప్పుడు భగ్గున భారత ప్రభుత్వాన్ని చుట్టుముడతాయా ? అని పాకిస్థాన్ కాచుకుని కూర్చుంది ఆవేదనతో చెప్పుకోచ్చాడతను.
అక్కడి వ్యవసాయం, పంటలు మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు మినహా మేం మాట్లాడింది తక్కువ. అబ్దుల్లా ద్వారా కాశ్మీర్ బాహ్య సౌందర్యమే కాదు. ఆ ప్రజల అంత; సౌందర్యమూ అర్థమయింది. కల్లోల కాశ్మీర్ ని మరో కోణంలో చూసే అవకాశం కలిగింది . దాదాపు నాలుగైదు గంటలు ఇట్టే కరిగిపోయాయి. మా అనుమానాలు, భయాలు నీలాకాశంలో ఎగిరిపోతున్న దూది పింజల్లా ఎగిరిపోయాయి. ఆ ఇంటావిడ ఇచ్చిన కాఫీ మమ్మల్ని తేలిక పరిచింది. బయటకు చూస్తే చీకటి ముసుగు వేస్తోంది.
ఈ సమయంలో మీరు ఎలాంటి ఇబ్బంది లేకుండా వెళ్ళవచ్చు. మా వాళ్ళంతా ఉపవాసంలో ఉంటారు కదా. ఉపవాసం వదిలేముందు నమాజ్ కి వెళతారు. ఆ తర్వాత భోజనం వేళ .. ఇప్పుడయితేనే మిమ్మల్ని ఎవరూ .. పట్టించుకోరు. ఎలాంటి అవరోధం కల్గించరు అని చెప్పాడు అప్పుడే వచ్చిన వాళ్ళబ్బాయి ఇంతియాజ్. దాదాపు మరో రెండున్నర గంటలు ప్రయాణం చేస్తే కాశ్మీరు లోయ వదిలి జమ్మూ ప్రాంతంలోకి అడుగు పెడతారు అని డ్రైవర్కి జాగ్రత్త గా తీసుకెల్లమని జాగ్రత్తలు జెప్పాడు అబ్దుల్లా. ఆ కుటుంబానికి ధన్యవాదాలు తెలిపి, నిన్న మేం కొన్న వాటిల్లోంచి గిఫ్ట్ ఇవ్వబోతే వద్దని వారించాడు పెద్దాయన. అయినా వినకుండా మాదగ్గర ఉన్న చాక్లెట్లు, డ్రై ఫ్రూట్స్ , గాజులు, పర్సులు ఇచ్చాం.
మా ఆదిలాబాద్ జిల్లాలోని భైంసాలో మతకల్లోలాలు జరిగినప్పుడు ఓ సాధారణ హిందూ వనిత తుల్జాబాయి దాడికిలోనైన కొందరు ముస్లింలకు ఆశ్రయం యిచ్చిన విషయం, హైదరాబాద్లో 55 ఏళ్ళ షాహీన్ సల్తానా 1980లో మత కల్లోలాల్లో జరిగిన భయంకరమైన హింసని చూసి, ఆమె మత సామరస్యం కోసం కృషి చేస్తోన్న విధం చెప్పాం.
అందరం భాయీ భాయీ గా ఉండాలనే వాదాన్ని ప్రోత్సాహిద్దాం. దేశమంతటా వ్యాపింపజేద్దాం అంటూ మరో మారు ఆ కుటుంబానికి మనస్పూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుని, వారి మానవత్వాన్ని అభినందించి బయలుదేరాం .
వి. శాంతి ప్రబోధ
మీ అనుభవాలను చక్కగా రాసారు శాంతి ప్రబోధ గారు
ధన్యవాదాలండి