మాలతీ చందూర్ ౩౦ వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమయిన అర్థంలోనయినా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం. వ్యక్తికీ, వ్యక్తి కోరికలకూ, ఆకాంక్షలకూ ప్రాధాన్యత పెరగటం, స్త్రీపురుషులిద్దరికీ వ్యక్తులుగా గౌరవం, హుందాతనం దొరకాలనే భావాలు ఏర్పడటం, స్వేచ్చ, స్వతంత్రతల గురించి, హక్కుల గురించి స్పృహ కలగటం, మానవుల బాధలు కేవలం వారి నుదుటి రాతలు, కర్మలే కాదనీ, ఆ బాధలను కొన్ని ప్రక్రియల ద్వారా తొలగించుకునే అవకాశాలున్నాయనే గ్రహింపు, హేతుబద్ధతకు విలువనివ్వటం, విశాలార్థంలో మానవులంతా సమానమనే భావన, ఈ భావనలకు అడ్డు వచ్చే సంప్రదాయాలను, ఆచారాలను నిరసించటం, ధిక్కరించటం వీటన్నిటినీ స్థూలంగా ఆధునికతగా చెప్పుకోవచ్చు.
1947 వ సంవత్సరం, అంటే భారతదేశం స్వతంత్రమయ్యే నాటికి ఏలూరులో స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మాలతి 50 లలో మద్రాసు వచ్చారు. అప్పటి నుంచీ ఆమె సాహిత్య జీవితం ఆరంభమయింది. అప్పుడు మద్రాసు తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్రం గా వుంది. ఆకాశవాణి అక్కడే వుంది. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, పటాభి, బాపు, ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి మొదలయిన రచయితలంతా అక్కడే వున్నారు. ఇంకో వేపు స్త్రీల పరిస్తితి గురించి, అభివృద్ధి గురించి దేశమంతా ఆలోచిస్తున్న కాలం.
మాలతి మంచి పాఠకురాలు. పుస్తక పఠనం ఆమెకు వ్యసనం. ఆ వ్యసనం ఎంత తారాస్థాయిలో ఆమెకు వంట బట్టిందంటే మొత్తం తెలుగు వారందరికీ ఆ వ్యసనాన్ని అంటించాలని ప్రయత్నిచిందావిడ. తాగండి, తాగండి, ఈ సాహిత్యామృతాన్ని. అనేక జీవితానుభవాలను పిండి, ఫర్మంట్ చేసి వడగట్టిన జీవనామృతం ఇది. ఒక్క సారి తాగితే ఒదిలిపెట్టరు –అంటూ ఆ రుచిని పరిచయం చెయ్యటానికి మాలతి నడుం కట్టుకున్నది. ఆ ప్రపంచ సాహిత్య పఠనం ఆమెలోని రచయిత్రికి తొలి పాఠాలు నేర్పింది.
50 లలో దేశం స్వతంత్రమయ్యాక కొత్త తరంలో ఎన్నో ఆశలూ, ఆధునికతకు ఎన్నో నిర్వచనాలూ, జీవితాలను మార్చుకోవాలని, తీర్చి దిద్దుకోవాలని తపనలూ, నగరాలలో కొత్త పరిసరాలలో వచ్చే వైరుధ్యాలను పరిష్కరించుకోవటమెట్లా, తమని తాము కొత్త పద్ధతులలో సంస్కరించుకోవటమెట్లా అని సతమతమయ్యే యువతరానికి ఒక మంచి సలహాదారు, కౌన్సిలరు, తమకు దూరంగా ఉంటూ తమ జీవితాల్లో కొద్దిగా తొంగిచూచి మంచి మాట చెప్పే పెద్దదిక్కు కావలసి వచ్చింది. సమష్టి కుటుంబాల్లో పెద్దల మాటలూ సలహాలూ క్రమంగా పోతున్నాయి. సమస్యలు, సందేహాలు పెరుగుతున్నాయి. ఎవరితోనయినా పంచుకోకపోతే అవి వాళ్ళని నిలవనీవు. ఆ స్థితిలో ‘ప్రమదావనం’ శీర్షిక అందుకే అంత విజయవంతమయింది. మాలతి చందూర్ కి అంత కీర్తి వచ్చింది. సినిమా తారలకు సమానమయిన గ్లామర్ ఆవిడ సంపాదించటానికి ఆ శీర్షిక కారణమయింది.
ఓల్గా
మద్య తరగతి జీవులకు ఆమె ఒక గైడ్, పిలాసఫెర్- ఇంకా చెప్పలంటే సాయి బాబా లాంటి ఒక సాములోరు కూడా!
బాగుంది మేడం గారు ఆమెను పరిచయం చేసినతీరు.