రెండు పదుల దక్కనీ ఘోష!

Siddharta Book Coverసిద్దార్థ 1994 లో “దీపశిల” తో తెలుగు సాహితీలోకానికి వచ్చి “దీపశిల సిద్దార్థ” గా పేరు తెచ్చుకొన్నారు. ఇప్పుడు తన ఇరవై సంవత్సరాల కవిత్వాన్ని ఒకచోటకు చేర్చి ‘బొమ్మలబాయి’ పేరుతో సంపుటిని తెచ్చారు. సిద్దార్ధ కవిత్వంలో – గొప్పజీవన కాంక్ష, ఆదిమ సౌందర్యం, వలస దుఃఖం, గ్రామ్యజీవనం వివిధ కోణాలలో దర్శనమిస్తుంది. ఇప్పుడు వస్తున్న కవిత్వ తీరులకు పూర్తి భిన్నంగా ఉంటూ చదువరులకు సరికొత్త పఠనానుభవాన్ని కలిగిస్తుంది.

ప్రముఖ మళయాలి కవి సచ్చిదానందన్ “కవిత్వానికి సమాంతర భాష కావాలి” అంటారు. అంటే – కవిత్వంలో వాడే పదాలు తమ మామూలు అర్థాల్ని వదిలి వేరే విశిష్టార్థాల్ని ధ్వనించాలని, వాక్యాలు ఒట్టి వాచ్యంగా ఉండకుండా భిన్న పొరలలో ఒక అనుభవాన్ని దర్శింపచేయాలని ఆయన ఉద్దేశం. అలాంటి కవిత్వంలో పదాల అర్ధాలు క్రమక్రమంగా అదృశ్యమై మనోద్వేగం (Emotion) మాత్రమే మిగుల్తుంది. పదాలు అర్ధాల్ని వీడి ఉద్వేగాన్ని తొడుక్కొంటాయి. ఏ ఉద్వేగానికి కవి లోనై ఆ కవితను సృజించాడో అది యధాతధంగా స్పష్టంగా దర్శనమిస్తుంది. “సమాంతర బాష” అని సచ్చిదానందన్ అన్నది అలాంటి కవిత్వభాష గురించే. ఇది ఉత్తమోత్తమ కవిత్వాభివ్యక్తి.

తెలుగు సాహిత్యలోకంలో సమాంతరభాషలో కవిత్వం వ్రాసే అతికొద్దిమందిలో సిద్దార్థ ఒకరు.

కురిసిన వానలన్ని ఏమయిపొయ్యాయి
పక్కటెముకల ఎద్దూ ఆకాశమూ
ముచ్చటించుకొంటున్నాయి
భూమిపొరల్లో దొరికిన వొకడి అస్థిపంజరం గురించి
అందులో పడుకుని నిద్రిస్తూన్న
పచ్చచిలుక దేహం గురించి—- “వానలు సిప్తల వనాలు” అనే కవిత ఒక భయంకరమైన కరువును సమాంతర భాషలో దృశ్యమానం చేస్తుంది. ఆ అస్థిపంజరం రైతుది కావొచ్చు, అతనిలో నిద్రిస్తున్న పచ్చచిలుక అంటే అతను జీవితకాలమంతా ఎదురుచూసిన పచ్చదనం అవ్వొచ్చు. ఇక్కడ పదాల అర్ధాలు అదృశ్యమై వాక్యాలు కరువుకాలపు ఉద్వేగాల్ని ఆవిష్కరిస్తాయి.

‘బొమ్మలబాయి’ లో కనిపించే అనేక దేశీపదాలు, ప్రయోగాలు జానపద సాహిత్యరూపానికి దగ్గరగా ఉంటాయి. సమకాలీన కవిత్వరీతులతో పోల్చితే ఇది ఒక భిన్నమైన స్వరం. బండమైసమ్మ, గట్టుమైసమ్మ, ఒగ్గుకథలు, బాలసంతు, పెద్దలకు బియ్యాలివ్వటం, శివసత్తు, ప్రభలు, మల్లన్న, గండెమ్మ, జోగిని, చిందెల్లమ్మ వంటి వివిధ విషయాలు, ఒక ప్రాంత సంస్కృతికి, ఆధునీకరణ పేరుతో మార్జినలైజ్ అవుతున్న జీవనరీతులకు ప్రతీకలు. వీటిని స్మరించుకోవటం, అక్షరాలలో పదిలపరచటం నేటి కాలానికి చాలా అవసరం. సిద్దార్థ తన కవిత్వం ద్వారా ఆపని చేసినట్లు బొమ్మలబాయి నిరూపిస్తుంది.

సిద్దార్థ కవిత్వం నిండా పల్లెదనం ఉంది. అక్కడ గడిపిన బాల్యం ఉంది. ఖేదమో మోదమో అర్ధంకాని ఆధునిక జీవనముంది. తనకలలకు, జ్ఞాపకాలకు వారధిగా నిలిచి తనలోకి కవిత్వప్రవాహాల్ని ఒంపిన మహా నగరముంది.

సీమసింతకాయ నవ్వినట్టు
నల్లతుమ్మ పువ్వు పసుపై రాలినట్టు
తనకడియాల దరువులో కాలమంతా పొగిలినట్టు -(బుశ్శెడ) అంటూ పల్లె సౌందర్యాన్ని కళ్లకుకడతాడు.

సిటీ కదులుతూంటే
ఎటుతిరిగినా వొక బరువుంటుంది
నన్ను నాకుతూనే వుంటుంది
వలసపోవటం ఎంత నరకం
నా గూడుకు నేనే కిరాయి కడుతున్నాను -(సింగాడ) అంటూ నగర జీవనపు ఒరిపిడిని, వలస దుఃఖాన్ని పట్టుకొంటాడు.

బాకీ మొత్తం/అతివాస్తవం
వొక మల్టిమీడియా బ్లూ సరస్సు
దానిపైని ఫ్లైవోవరు
పేగును కొరికే కరెంటు బిల్లు
కుత్కెలోపల వంకరగా దిగిన రేగుముల్లు// -(కర్రెసామీ జంగపోడా) వాక్యాలలో నగరజీవితాన్ని నగ్నంగా మనముందు నిలుపుతాడు. ఫ్లైవోవర్లు, హైటెక్ సిటీలతో అందంగా కనిపించినా, తీర్చాల్సిన అప్పులు, కరంటుబిల్లు కట్టలేనితనం, మహాకవి కాళోజీ “ఏం తినేట్టు లేదు, ఏం తాగేట్టు లేదు” అన్నట్టు గొంతులో దిగిన ఆకలిముల్లు….. అని ఒకానొక భీభత్స దృశ్యాన్ని చూపిస్తాడు చిన్న చిన్న పదాలలో. సిద్దార్థ కవిత్వగొప్పతనం అది.

అజంతా కవిత్వంలో పదే పదే వచ్చే భయం- రాక్షసాకారం దాల్చి రక్తం పీల్చే మహానగరం పట్ల భయకంపితుడైన వ్యక్తి వైయక్తిక అనుభవంలా అనిపిస్తుంది అంటారు నున్నా నరేష్ ఒక మిసిమి పత్రికా వ్యాసంలో. ‘బొమ్మలబాయి’ లో కూడా భయం, ఒక భీతావహ వాతావరణం అనేక కవితల్లో కనిపిస్తుంది. కానీ ఇది వైయక్తిక అనుభూతిగా కాక ఒక సామాజిక ప్రకటనలా వ్యక్తమౌతుంది.

భయం తింటున్న జాతివాణ్నని
తిట్టూ తిట్టూ నాకేమీ సిగ్గులేదు//
నా భయమో పదిజిల్లాలంత వెడల్పూ
ఏడు సముద్రాలంత లోతూ. — అంటాడు (భయచరాన). ఇక్కడ పదిజిల్లాలు అనటం ద్వారా తన సమాజపు చారిత్రికనేపథ్యాన్ని ప్రతిభావంతంగా ప్రతిబింబించగలిగాడు సిద్దార్థ. ఆశ్చర్యకరమైన అంశమేమిటంటే మలిదశ తెలంగాణా పోరాట సాహిత్యం ఇంకా ఊపందుకోని కాలం లోనే (1999) సిద్దార్థ భవిష్యత్తుని దర్శించాడు. ఆ తరువాత కాలంలో విరివిగా వచ్చిన తెలంగాణ అస్థిత్వ సాహిత్యానికి సిద్దార్థ కవిత్వం చక్కని భూమికను ఏర్పరచిందనటంలో సందేహం లేదు.

సిద్దార్థ కవిత్వాన్ని ఓపికగా చదవాలి. ఏ వాక్యమూ వాచ్యంగా ఉండదు. అంతా ధ్వనిప్రధానంగా ఉంటుంది. ఆ వాక్యాన్ని మనోలోకంలో మరోసారి చదువుకొన్నప్పుడు ఏదో దృశ్యం కనిపిస్తుంది. దాన్ని అలా మనకు మనం ఏర్పరుచుకొన్నప్పుడు గొప్ప తృప్తి ఆనందం కలుగుతాయి. ఇది ఒకరకంగా డీకోడింగ్ చేసుకోవటం లాంటిదే. ఆ కాస్త ప్రయత్నం చేయని/చేయలేని వారికి సిద్దార్థ కవిత్వం జఠిలంగా కన్పించవచ్చు. కవిత్వం రాయటంలో కవి పడే తపనతో పోల్చుకొంటే, పాఠకుడు కూడా ఎంతోకొంత శ్రమించకపోతే కవిత్వప్రయోజనం ఎలా దక్కుతుందీ?

కినిగె పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో “కవిత్వం అనేది నేచర్. నేను మీడియం మాత్రమే. మన చుట్టూతా ఉండే అనేకానేక శక్తులు మన మీద దాడి చేసి, మనల్ని ఎంచుకుని, ఒక మీడియంలా వాడుకుని వదిలేస్తాయి. అప్పుడు కవిత్వం పుడుతుంది” అంటారు శ్రీ సిద్దార్థ. ఈలోకంలో చెట్టు, పుట్టా రాయి రప్పా వాగు గుట్టా వాటి పనులు నిర్వహిస్తున్నట్లే నేనూ నా పని నిర్వహిస్తున్నాను అంటూ కవిత్వాన్ని ఒక ఒక సహజమైన స్వభావంలా భావించే శ్రీ సిద్దార్థ ‘బొమ్మల బాయి’ మంచి, చిక్కని కవిత్వాన్ని ఇష్టపడేవారికి తప్పక నచ్చుతుంది. ఎందుకంటే ఇది స్పందించే హృదయమున్న కవి రెండు దశాబ్దాల జీవితపు కవితాయాత్ర.

పుస్తకం పేజీలు: 208
వెల: 150/-
ప్రతులకు: 9848015364

మీ మాటలు

  1. సూపర్బ్ అనాలసిస్

  2. ఋషి కన్నా దగ్గరగా బొమ్మలబాయిని ఎవరూ చూపించలేరు, దశాబ్దాలుగా సిద్దార్థ గారి కవిత్వాన్ని పలవరిస్తున్న అభిమాని మోహన్. చాల బాగుంది అన్నది చిన్నమాట,

  3. venu udugula says:

    సిద్ధార్థ గారికి కవిత్వాన్ని అద్భుతంగా విశ్లేషించారు ….వెరీ గుడ్ రైటప్ అన్న !

  4. Sidhrtha adhbhutamaina kavi.telangana bhatukamma sidhartha kavitvam.okokka kavitva,okkokka bonam.maa yousufguda basthi lo(krishana agar)velisina maisamma talli meni chayala merise kavitavam.

Leave a Reply to యశస్వి సతీశ్ Cancel reply

*