images not found
సాహిత్య సభల్ని ఏదో ‘నామ’ మాత్రంగానో, ఒక తంతులాగానో కాకుండా- స్పష్టమయిన ఉద్దేశంతో, చిత్తశుద్ధి తో చేస్తే అవి ‘సక్సెస్’ అయి తీరుతాయని నిరూపించారు నాట్స్ సాహిత్య కమిటీ నిర్వాహకులు. చిత్తశుద్ధితో పాటు కొంత ప్రయోగాత్మక దృష్టి తోడయితే, సాహిత్య సభలకి పదీ పాతిక మంది మాత్రమే హాజరయ్యే దుస్థితి కూడా తొలగిపోతుందని ‘నాట్స్’ నిరూపించింది. మూడు రోజులు ఒక మహాసందడిగా జరిగిన నాట్స్ సభల్లో రెండు రోజుల సాహిత్య సభలు ఒక హైలైట్ గా నిలిచాయంటే అతిశయోక్తి కాదు, కేవలం సాహిత్య అభిమానిగా చెప్తున్న మాట కాదు. “ ” సాహిత్య సభలకి నేను- బాబోయి -ఆమడ దూరంలో ఉంటా. అలాంటిది, వూరికే అలా వచ్చి ఇలా చూసిపోదామని వచ్చి, ఇక్కడ సెటిలై పోయా,” అన్న వాళ్ళు వున్నారు.
శుక్రవారం అమెరికాలో పనివారమే. ఆ రోజు మొదలయిన సాహిత్య సభ మొదట్లో పలచగా వున్నా, నెమ్మదిగా హాలు నిండిపోయింది. “రండి…కూర్చోండి,” అని బతిమాలుకునే అవస్థ నిర్వాహకులకు పట్టకుండానే, మొదటి సభకి వచ్చిన వాళ్ళంతా చివరి కార్యక్రమం దాకా అంటే – వొంటి గంటకి మొదలై, ఆరు గంటల దాకా- వోపికగా కూర్చోడం ఆశ్చర్యంగా అనిపించింది. సాధారణంగా సభల్లో ఎవరో సినిమా వాళ్ళు వుంటే వాళ్ళ పాటలో, మాటలో విని అక్కడినించి వెళ్ళిపోవడం చాలా సందర్భాల్లో జరుగుతుంది. కాని, నాట్స్ సాహిత్య సభల్లో అలాంటి స్థితి కనిపించలేదు.
మొదటి రోజు సాహిత్య సభలు
తెలుగు భాష గురించి చర్చ అంతా ఒక ఎత్తు. ఇప్పుడు తెలుగు సాహిత్యంలో స్థానికత/ ప్రాంతీయత గురించి చర్చలు వేడెక్కుతున్న సమయంలో మాండలికం మీద చర్చకి తెర తీయడం- అదీ నాట్స్ లాంటి వేదికల మీద- నిజంగా సాహసం. గిడుగు రామమూర్తి పంతులుకి అంకితం చేసిన ఈ సభా వేదికకి అది సందర్భోచితమే. ప్రసిద్ధ విమర్శకులు కె. శ్రీనివాస్ కీలకోపన్యాసంతో మొదలయిన చర్చలో ఆధునిక తెలుగు భాషలో మాండలికాలకు సంబంధించిన భిన్న కోణాలని సినిమా సాహిత్య భాష గురించి కోన వెంకట్, చంద్రబోసు, భాషా సాహిత్య కోణం నించి అఫ్సర్, సరిహద్దు భాషల మాండలికం గురించి గాలి గుణశేఖర్, స్త్రీల రచనల్లో మాండలికం గురించి కల్పనా రెంటాల మాట్లాడారు. అనంత మల్లవరపు సభా సంధాతగా వ్యవహరించారు. మాండలికంవేపు సాహిత్యం సాగిస్తున్న ప్రయాణంలోని మైలురాళ్ళని గుర్తు చేయడంతో పాటు, ముందుకు సాగవలసిన దారిని ఈ చర్చ సూచించింది.
రెండో సభ ప్రముఖ విద్వాంసులు మీగడ రామలింగ స్వామి సంగీత నవావధానం. ఇది ప్రయోగాత్మక అవధానం. అమెరికాలో సాహిత్య సభలంటే అవధానాలే; పద్యాలు అనగానే ఎవరయినా చెవికోసుకుంటారు. కాని, మీగడ వారి సంగీత అవధానం అటు సాహిత్యమూ ఇటు సంగీతమూ కలగలిసిన శబ్ద రాగ విభావరి. ఈ సభకి అటు పండితుల నించి, ఇటు సాధారణ సాహిత్య అభిమానుల దాకా, అటు సంప్రదాయికుల నించి ఇటు ఆధునికుల దాకా అపూర్వమయిన స్పందన లభించింది. మూడు గంటల పాటు కరతాళ ధ్వనులతో సభాస్థలి మార్మోగిపోయింది.సంగీత నవావధానికి సంధాత గా రమణ జువ్వాది వ్యవహరించారు. అక్కిరాజు సుందర రామకృష్ణ, రమణ జువ్వాది, గాయని జ్యోతి, మద్దుకూరి చంద్రహాస్, మహారాజపురం రాము, తదితరులు సంగీత నవావధానం లో పృచ్ఛకులుగా వ్యవహరించారు. ఇద్దరు పిల్లలు కూడా పృచ్ఛకులుగా పాల్గొని పద్యాలు పాడటం అందరినీ ఆనందింప చేసింది. ఆశ్చర్యపరిచింది. నాట్స్ సాహిత్య కమిటీ సభ్యులు అనంత్ మల్లవరపు, శారద సింగిరెడ్డి, సతీష్ పున్నం, శ్రీనాధ్ జంద్యాల , జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, నసీం షేక్, సురేష్ కాజా తదితరులు అతిథులను సత్కరించారు.
రెండో రోజు
సభలు రెండవ రోజు ఇంకా ఘనంగా జరిగాయి. కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రి శత జయంతితో రెండవరోజు సాహితీ సభలు ప్రారంభమయ్యాయి.పాపయ్య శాస్త్రి గారి మనవడు శ్రీనాథ్ జంధ్యాల ఈ కార్యక్రమానికి సంధాతగా వ్యవహరించారు. ప్రముఖ నటులు, గాయకులు అయిన అక్కిరాజు సుందర రామకృష్ణ గారు జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి పద్యాలను చక్కగా పాడారు. ఈ ప్రపంచంలో సూర్యచంద్రులున్నంత వరకు పాపయ్య శాస్త్రి గారి పద్యాలు అందరికీ గుర్తుండి పోతాయన్నారు.ఈ సందర్భంగా అక్కిరాజు సుందర రామకృష్ణ గారిని జంధ్యాల పాపయ్య శాస్త్రి గారి మనవడు, మనవరాలు కుటుంబ సమేతంగా సత్కరించారు.
పద్య వాణీ విన్యాసం కార్యక్రమంలో సమైక్యభారతి సత్యనారాయణ, డి.ఎస్.డీక్షిత్, ప్రముఖ రంగస్థల నటులు గుమ్మడి గోపాలకృష్ణ గారు పాల్గొన్నారు. ఈ కార్యక్రమాన్ని కాజా సురేష్ గారు నిర్వహించారు. శ్రీకృష్ణ రాయబారం, శ్రీనాధుడు, సత్య హరిశ్చంద్ర నాటకాల నుండి కొన్ని పద్యాలు పాడి అందరినీ ఆకట్టుకున్నారు.
ప్రముఖ కవులయిన చంద్రబోస్, సిరా శ్రీ, రసరాజు, వడ్డేపల్లి కృష్ణ గారితో ‘మా బాణి-మీ వాణి’ శీర్షికన ఆశువుగా గేయ రచన కార్యక్రమం జువ్వాడి రమణ గారి ఆధ్వర్యంలో ప్రేక్షకుల చప్పట్లతో మారుమోగింది. మహారాజపురం రాముగారు రసరాజు గారిని పరిచయం చేస్తూ అసెంబ్లీ రౌడీ సినిమాకి వ్రాసిన “అందమయిన వెన్నెలలోనా” పాటను పాడారు. ఈ పాటకు కళాసాగర్ అవార్డు వచ్చిందని రసరాజు గారు గుర్తు చేసుకున్నారు. సిరా శ్రీ గారిని పరిచయం చేస్తూ “ఇట్స్ మై లవ్ స్టోరీ” సినిమా నుండి “నిన్నలా లేదే, మొన్నిలా లేదే” పాట పాడారు. చంద్రబోస్ గారిని పరిచయం చేస్తూ ఝుమ్మంది నాదం సినిమా నుండి దేశమంటే మతం కాదు పాట పాడారు.మగధీర సినిమాకి పంచదారా బొమ్మ,బొమ్మా పాటను గుర్తుకు తెచ్చుకుంటూ చంద్రబోస్ గారు ఆ పాట అనుభవాన్ని అందరితో పంచుకున్నారు.కన్నడ, మళయాల, తమిళ బాణీలకు వడ్డేపల్లి కృష్ణ, సిరా శ్రీ, రసరాజు చంద్ర బోస్ గారు చక్కగా తెలుగు వాణిలను వినిపించి అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. డాలస్ నుండి మద్దుకూరి చంద్రహాస్, రాయవరం భాస్కర్, దివాకర్ల మల్లిక్ గారు కూడా పల్లవి అందించి అందరి చేత “శెభాష్” అనిపించుకున్నారు. మల్లవరపు అనంత్ గారి నవ్వు మీద రసరాజుగారు ఆశువుగా పాట పాడి అనంత్ ను ఉక్కిరిబిక్కిరి చేసారు.అన్ని పాటలను మహరాజపురం రాజు గారు, డాలస్ ఆస్థాన గాయని జ్యోతి గారు పాడి వినిపించారు.
మొదటి సారి ప్రవాస వేదిక ఎక్కిన శ్రీధర్
ఈనాడు ఇదీ సంగతి శ్రీధర్ గారితో షేక్ నసీం ముఖాముఖి సందడిగా జరిగింది. ఆంధ్రదేశంలో తెలుగు కార్టూన్ల గురించి పోచంపల్లి శ్రీధర్ గారు చక్కగా మాట్లాడారు. రాజకీయనాయకుల ఇగోని కార్టూనిస్ట్ పంక్చర్ చేస్తూ ఉంటాడు అని చెప్పారు. చిన్న, చిన్న గీతలతో కార్టూన్లు ఎలా గీయచ్చో చూపిస్తూ అందరినీ ఆకట్టుకున్నారు. వివిధ కాలాలలో తను వేసిన కొన్ని కార్టూన్లను గుర్తు తెచ్చుకున్నారు.
సాహిత్య సేవలో భారీ వదాన్యులు కార్యక్రమంలో గురవారెడ్డి, ప్రముఖ రచయిత భారవి ముఖాముఖి జరిగింది. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. సియాటిల్ నుండి వచ్చిన పద్మలత భారవి గారిని సభకు పరిచయం చేసారు. గురువాయణం పుస్తకం వ్రాసిన గురవారెడ్డిని పెనుగొండ ఇస్మాయిల్ గారు సభకు పరిచయం చేసారు. ఆహుతులు వేసిన ప్రశ్నలకు ఓపిగ్గా సమాధానాలు చెప్పారు. అమెరికాలో సాహితీ సభలకు ఇంతమంది రావడం ఎపుడూ చూడలేదని గురవారెడ్డి గారన్నారు. అతిథులని నాట్స్ సాహితీ బృందం ఘనంగా సత్కరించడంతో కార్యక్రమం ముగిసింది.
‘స్రవంతి’ వెలుగులు
భాస్కర్ రాయవరం, రవి వీరెల్లి సంపాదకత్వంలో వెలువడిన నాట్స్ సాహిత్య ప్రత్యేక సంచిక ‘స్రవంతి’ కూడా ఒక విశేష ఆకర్షణ. ఇందులో కొన్ని రచనలు ఈ నెల ‘వాకిలి’ పత్రికలో వెలువడ్డాయి. కవిత్వమూ, వచన రచనల ఎంపికలో వైవిధ్యానికి పీట వేసారు. మామూలుగా ఇలాంటి సావనీర్లలో షరా మామూలుగా కనిపించే రచయితల పేర్లు కనిపించకుండా, కొత్త తరానికి ప్రాముఖ్యమివ్వడం బాగుంది.
– శ్రీనివాసులు బసాబత్తిన
సంబరాల – అలజడి
ఎద ఎన్నో భావాల సంద్రమై ఎగసి పడుతుంది
నిర్లిప్తతో, నిరాసక్తతో నా దరికి చేరకుండా ఆరాట పడుతుంది.
అభినివేశం, ఆత్మాభిమానం మాకే సొంతం!
అసూయ, అలజడి, అలుపూ సొలుపూ క్షణభంగురం!
ఉద్వేగం, ఉన్మాదం ఊపిరి తీస్తుంది!
ఉత్తేజం, ఉత్సాహం ప్రాణం పోస్తుంది!
పొగడ్త కోసమో, తెగడ్త కోసమో చేసే పని కాదది
జీవన్మరణాల మధ్య అస్తిత్వం కోసం ఆరాటమది!
భేషజాలకు, ఇజాలకు మేము దూరం
భాషకు, భావజాలానికి, బంధాలకు బానిసలం
బహుదూరపు బాటసారులు, మీరంతా మాకు బంధువులు
ఒక్క ఆత్మీయ పలకరింత, మాకు పులకరింత
– అనంత్ మల్లవరపు
తాజా కామెంట్లు