– రాణి శివశంకర శర్మ
~
ఆ మహా వ్యాపార దిగ్గజం ఎదుర్కొంటున్న అనేక సమస్యలని వొక్క దెబ్బతో ఎగరగొట్టేశాడు సిద్ధార్థ. అతనికి అంత శక్తి ఉందని డాక్టర్ కోణార్క్ కు కూడా తెలియదు. డాక్టర్ కోణార్క్ పెద్ద విద్యా వ్యాపారి. కోణార్క్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ అనే సంస్థని స్థాపించి శరవేగంతో దూసుక పోతున్న పెద్దమనిషి.
కోణార్కకు ఎదురుగా ప్రిన్సిపాల్ కూర్చొని ఉన్నాడు. “సిద్ధార్థ మంచి లెక్చరర్ కాదు. అతన్ని తీసెయ్యాలి”, అన్నాడు.
“సరే ఆ సంగతి నేను చూసుకుంటాను. వెళ్ళండి”, అన్నాడు కోణార్క్. బయటకి వెళ్తుండగా మళ్ళీ పిలిచాడు. “చూడండీ, మంచి లెక్చరర్లు చాలా మందే ఉంటారు. సిద్ధార్థ లాంటి బ్రిలియంట్స్ కొంత మందే ఉంటారు. అతడు మనకు కావలసిన వాడు. తన గురించి ఎక్కడా నెగటివ్ కామెంట్ చేయొద్దు. అలా చేస్తే నీ ఉద్యోగం ఊడుతుంది” హెచ్చరించాడు కోణార్క్.
సిద్ధార్థ అంటే అంత అభిమానం ఎందుకు కోణార్కకీ?
కోణార్క గుంటూరు జిల్లాలోని వొక కుగ్రామంలో భూస్వామిగా వెలుగొందుతున్న రోజుల్లో సిద్ధార్థ తండ్రి కోణార్కకి నమ్మిన బంటుగా వుండేవాడు. దాని వల్లే తను విద్యావ్యాపారంలో అడుగు పెట్టిన వెంటనే సిద్ధార్థకి ఉద్యోగం యిచ్చాడు. సిద్ధార్థ తన తండ్రిలాగే కోణార్కకి ఆంతరంగికునిగా మారిపోయాడు.
గిట్టని వాళ్ళ ప్రోద్భలం వల్ల ఇన్కంటాక్స్ అధికారులు కోణార్కపై దాడి మొదలు పెట్టారు. అప్పుడు సిద్ధార్థ వెంటనే ఎలర్ట్ అయ్యాడు. నల్ల ధనాన్ని కారులో డంప్ చేసి తరలించేసాడు. దాడులు ముగిసాక భద్రంగా తిరిగి అప్పజెప్పాడు.
అంతేకాదు. వొక కాలేజీలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నప్పుడు, కాలేజీ ప్రతిష్టని కాపాడాడు. నిరసన తెలుపుతున్న తల్లితండ్రులనీ, బంధువులనీ బుజ్జగించాడు. విద్యార్థి రాసిన ఉత్తరం మాయం చేసాడు.
సహజంగానే డాక్టర్ కోణార్క్ సిద్ధార్థ ప్రతిభని గుర్తించాడు. నిజానికి సిద్ధార్థ చాలా ఙ్ఞానం కలిగిన వాడు. కానీ అతని ప్రతిభ క్లాస్ రూమలకు సంబంధించినది కాదు. పౌరులు తరగతి గదుల్లో తయారవుతారు. సమాజాన్ని శాసించేవాళ్ళు క్లాస్ రూం బయట రూపొందుతారు, అనే రహస్యాన్ని గుర్తించిన ప్రతిభాశాలి సిద్ధార్థ.
అతడు పేరుకే లెక్చరర్. రాష్ట్రమంతా వ్యాపించిన కోణార్క్ విద్యా సంస్థలలో యెటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా అక్కడ వాలుతాడు. విషయాన్ని బయటకు పొక్కనీయడు. సమస్యని లోపల్లోపలే ఖతం చేస్తాడు. వొక విద్యార్థినిపై లెక్చరర్లే అత్యాచ్వారం చేసారు. ఆ సంఘటనని బయటకి పొక్కకుండా , చివరకు మీడియాకి కూడా చిక్కకుండా చేయడంలో సిద్ధార్థ చూపిన ప్రతిభకి కోణార్క్ ఆశ్చర్యపోయాడు. అతని భుజాల మీద తడుతూ అన్నాడు, “యు ఆర్ ఇంటిలిజెంట్ దేన్ ఐనిస్టీన్”.
’ఇతనికి ఐనిస్టీన్కీ పోలికా?” అని చెవులు కొరుక్కున్నారు ఉత్తమ పౌరులైన ఉపాధ్యాయులు. అలా పోల్చడానికి కారణం ఉంది. సిద్ధార్థ ప్రతీదీ సాపేక్షకం అంటాడు. విలువలేమీ లేవంటాడు. ప్రతీదీ అనేక కోణాలలోంచీ ఆలోచించాలి అంటాడు. విద్యార్థినిపై అత్యాచారం జరిగినప్పుడు, రెండు చేతులూ కలిసినప్పుడే కదా చప్పట్లూ అని వాదించిన ఘనుడు సిద్ధార్థ. యిప్పుడు అమ్మాయిలు వేసుకునే దుస్తులూ, వాళ్ళ ప్రవర్తన కూడా బాగుండడం లేదన్నాడు.

Art: Rafi Haque
యిలా అనేక కోణాలని దుమ్ములా రేగగొట్టి సమస్యని చల్లార్చేయ్యడంలో అతడు నిపుణుడు.
అతడు చాలా చదివిన వాడు, చాలా విఙ్ఞానం కలవాడు. మంచి అభిరుచులు కలవాడు కూడా. అది కోణార్కకీ బాగా తెలుసు. వొక సారి కోణార్కకీ జపాన్ దర్శకుడు కురసోవా తీసిన రషోమన సినిమాను చూపించాడు సిద్ధార్థ. ఆ సినిమాలో ఒక హత్యని గురించి నలుగురూ నాలుగు రకాలుగా వ్యాఖ్యానిస్తారు. వారి వారి నేపథ్యాలని బట్టి అలా వ్యాఖానిస్తారు. వొకరి వ్యాఖానానికీ మరొకరి వ్యాఖ్యానానికీ పొంతన ఉండదు. సినిమా అయ్యాక సిద్ధార్థ అన్నాడు. “కోణాలు విభిన్న కోణాలు అంతే. సత్యం అంటూ ఏమీ లేదు. కనుక మనకు కావలసిన సత్యాన్ని మనం సృష్టించుకోవచ్చు. అవసరమైన లాభసాటియైన సత్యాన్ని మనమే క్రియేట్ చెయ్యచ్చు. అల్లచ్చు”.
“సిద్ధార్థా! ఆ అమ్మాయిపై అత్యాచారం సంగతి ……? ”
“ఊరుకోండి సార్, అది నిన్నే సద్దు మణిగి పోయింది”, అన్నాడు సిద్ధార్థ.
“అసలు ఏమి జరిగింది?”
“అసలు ఏమీ జరగలేదు. వట్టి పుకారుగా తేల్చేసాను. మీరు హాయిగా యింటికి వెళ్ళి ఫేమిలీతో గడపండి. యీ రొచ్చంతా మీకెందుకు”, అన్నాడు సిద్ధార్థ.
నిజమే, కోణార్క చాలా స్వచ్చంగా కనిపిస్తాడు. అతనికి యే చిన్న మచ్చయినా అంటగలదా అన్నంత తెల్లగా, తెల్లని దుస్తుల్లో ధవళ హాసంతో తాపీగా ఉంటాడు. తను కోణార్క సూర్యాలయాన్ని దర్శించి వచ్చిన వెంటనే పుట్టాడట. అందుకే అంత అరుదైన పేరును పెట్టారు. ఆయన ఏం చదివాడో యెవరికీ తెలియదు. ప్రపంచాన్ని చదివాను అని చెప్పుకుంటాడు. ఆయన నడుపుతున్న సంస్ఠలన్నీ యింగ్లీషు మీడియంవే.
సిద్ధార్థ సలహాతో తెలుగు భాషా వుద్ధరణ కోసం వొక సంస్థని స్థాపించాడు. పత్రిక నడుపుతున్నాడు. అవార్డులు యిప్పిస్తున్నాడు. అందువల్ల వొక విశ్వవియాలయం వాళ్ళు ఆయన పేరుకి డాక్టర్ తగిలించారు. సిద్ధార్థ నవ్వుతూ అన్నాడు. ” చూసారా నా సలహా యెంత మేలు చేసిందో. మనం అన్ని కోణాలలో ఆలోచించాలి”.
“మనం డబ్బు కోసం కొన్ని పనులు చెయ్యాలి. అధికారం కోసం మరికొన్ని. దాంతోపాటూ సమాజసేవ, పేరు, కీర్తి ప్రతిష్టలు అన్నీ అవసరమే కదా? అవి మీ అధికారానికీ, డబ్బుకీ మరింత వన్నె తెస్తాయి. మీ తెల్లని దుస్తుల్లాంటివే అవీ”, అన్నాడు సిద్ధార్థ.
మాతృ భాషాదినోత్సవం జరపడానికి పెద్ద ఎత్తున ఏర్పాటు చేసాడు కోణార్క. అదే సమయంలో సిద్ధార్థని వొక ప్రశ్న అడిగాడు. “విద్యార్థుల ఆత్మహత్యలు పెరిగిపోయాయి. నువ్వెలాగో మేనేజ్ చేస్తున్నావు సరే, అసలు వీటిని ఆపలేమా?”
“ఎందుకు ఆపడం?”
“వీటి వల్ల మనకి ఎప్పుటికైనా చెడ్డపేరే కదా? అని ప్రశ్నించాడు కోణార్క.
“బహుశా పేరెంట్స్ కూడా ఇటువంటి వ్యవస్థనే కోరుకుంటూన్నారేమో. యిది మాసోచిజం కావొచ్చు. అంటే తమని తాము స్వయంగా హింసించుకోవడం. ఆధిపత్యాన్ని ఆరాధిస్తారు వీళ్ళు. తెలియని యే తీవ్ర శక్తులో నడిపిస్తే నడిచే మనుషులు”, అన్నాడు సిద్ధార్థ తాపీగా.
సిద్ధార్థ అన్న మాటే నిజమైంది. ఆత్మహత్యలే కాదు. విద్యాసంస్థలు కూడా మరింత విస్తరించాయి. బలపడ్డాయి. యితర విద్యా సంస్థలు వీటిలో విలీనమై పోయాయి.
సిద్ధార్థలో గొప్ప దార్శనికుడు కనిపించాడు కోణార్కకి. అనేక కోణాలని ఏక కాలంలో దర్శించగల మేధావి సిద్ధార్థ అనుకున్నాడు ఆయన. రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు కూడా పెరిగిపోయాయి. కోణార్కకి ప్రభుత్వంలో మంచి పరపతి. అతని బంధువులు మంత్రులుగా వున్నారు. ఉన్నత పదవుల్లోనూ ఉన్నారు. యీ క్లిష్ట సమయంలో ప్రతిపక్షం నోరు మూయించగల మేధావి కావాలన్నారు. సిద్ధార్థని పంపించాడు కోణార్క.
సిద్ధార్థ ఒకటే మాట అన్నాడు. “రైతుల ఆత్మహత్యల వెనుక ఉన్న అనేక కోణాలని లాగండి. వాళ్లకి గల మానసిక వైకల్యాలు, ప్రేమ సమస్యలు, సెక్స్ సమస్యలు, వాళ్ళ బాల్యం, తల్లితండ్రుల కలహాలు, వాళ్ళ పునర్జన్మ, జాతకం… యిలా అన్ని కోణాల గురించీ రకరకాల నిపుణుల చేతా, నిపుణుల్లా ఫోజు యిచ్చే వారి చేతా మీడియాలో చర్చలు చేయించండి. రకరకాల కోణాల్ని దుమ్ము లేపండి. ఆ గందరగోళంలో అసలు కోణాలు కప్పడిపోయేలా చేయండి”. ఆ ప్రాజెక్టుని సిద్ధార్థకే అప్పగించింది ప్రభుత్వం. దాంతో అతని పరపతి వొక్కసారిగా పెరిగిపోయింది.
రైతుల ఆత్మహత్యల వెనుక గల కారణాలను సర్వే చేయించడం మొదలు పెట్టింది ప్రభుత్వం. చాలా చావులకి వ్యక్తిగత సమస్యలే కారణాలుగా తేల్చేసింది. దాంతో ప్రభుత్వానికి నష్ట పరిహారం చెల్లించాల్సిన బాధ్యత తప్పింది. దానికి బదులుగా, తమకు అనుకూలంగా మాట్లాడినందుకు సైకాలజిష్టులకీ, ఆధ్యాత్మిక వేత్తలకీ డబ్బు చెల్లించింది.
ఈలోగా గ్లోబలైజేషన్ యుగం విజృంభించింది. వ్యక్తికి ప్రాధాన్యం పెరిగిపోయింది. ఎవడి బతుక్కీ, ఎవడి చావుకీ వాడే కారణం అన్న భావన బలపడింది. రైతులు వ్యవసాయాన్ని నమ్ముకోవడం మానేసారు. తమ పిల్లల్ని ప్రయోజకులు చేయాలనుకున్నారు. కోణార్క్ విద్యా సంస్థల్నే నమ్ముకున్నారు. రియల్ ఎస్టేట్ని కూడా విశ్వసించారు. లాభపడిన వాళ్ళు లాభపడ్డారు.
యీ పరిస్థితుల్లో కోణార్కని సిద్ధార్థ కలిసాడు. కోణార్క సిద్ధార్థ ముందు ఒక నివేదిక ఉంచాడు. “యిది చూసారా, యీ నెల రోజుల్లో ఆరుగురు విద్యార్థులు ఆత్మహత్య చేసుకున్నారు. వొక విద్యార్థి తోటి విద్యార్థిని హత్య చేసాడు. యిప్పుడు ఆత్మహత్యలకి హత్యలు కూడా తోడయ్యాయి మన సంస్థల్లో. మనమేమైనా అమెరికాలో ఉన్నామా? అక్కడ తోచుబడి కాక బోర్డమ్ వల్ల తోటీ విద్యార్థుల్ని తుపాకితో కాల్చి చంపేసిన వార్తలు చదివి విస్తుపోతుంటాం”, కోపంగా అన్నాడు కోణార్క.
“మనం కూడా అభివృద్ధి చెందుతున్నాం, అంతే” , అన్నాడు కూల్గా సిద్దార్థ.
“ఏమంటున్నావ్ నువ్వు?”, గద్దించాడు కోణార్క.
“నేను అన్నది మీరు సరిగానే విన్నారు. మన విద్యాసంస్థలు తామర తంపరగా పెరిగిపోతూ ఉన్నాయి. ప్రపంచం కూడా వేగంగా మారిపోతోంది. టెక్నాలజీ పెరుగుతోంది. సెక్సూ, క్రైమూ రంగుల దృశ్యాలుగా ముందుకొస్తున్నాయి. దాంతో పాటూ డబ్బు విలువ, సంపాదన కోసం పరుగు వొక ఐదు సంవత్సరాల కంటే బాగా పెరిగింది. వెలుగు వెనుక నీడ ఉంటుంది. తప్పదు,” అన్నాడు సిద్ధార్థ.
“మరి మనమేమి చేయాలి?”
సమస్యలు ఉంటాయి. ఉండనీండీ. వాటి నుంచీ దృష్టి మరల్చాలి.” అన్నాడు టీవీ ఆన్ చేస్తూ సిద్ధార్థ.
“నిజానికి విద్యార్థులందరినీ ఉద్ధరించడం మన పని కాదు. యికపైన బాగా చదివే విద్యార్థులని ఏరదాం. వాళ్ళని ఒక గ్రూపుగా చేద్దాం. యిలా వర్గీకరిస్తూ పోదాం. బాగా చదివే వాళ్ళకి మంచి లెక్చరర్లని నియమిద్దాం. మంచి జీతాలనిద్దాం. మిగిలిన వాళ్ళకి తక్కువ జీతాల లెక్చరర్లని నియమిద్దాం. కానీ అందరినీ వొకే రకంగా టెన్షన్లో వుంచుదాం.”
“ఈ టెన్షన్కి పిల్లలు చస్తున్నారు”, అన్నాడూ విసుగ్గా కోణార్క.
“చావనీండీ, ఆసంగతి నేను చూసుకుంటాను”, అంటూ వెళ్ళిపోయాడు సిద్ధార్థ.
సిద్ధార్థ రావడంలో గానీ పోవడంలో గానీ ఎంతో ఆత్మవిశ్వాసం తొణికిసలాడుతుంటుంది. అదే కోణార్కకి నచ్చింది. అతడు సమస్యలకి భయపడడు. సమస్యలని పరిష్కరించాలని కూడా అనుకోడు. మానవ జాతి ఉన్నంత వరకూ సమస్యలు ఉంటాయి. యింకా పెరుగుతాయి. వాటిని ఎదుర్కోవడం కాదు. సమర్ధంగా మరుగు పరచడమే తెలివి అంటే. అభివృద్ధి అంటే ఇదే అని సిద్ధార్థ ఫిలాసఫి.
ఈ ఫిలాసఫీ కోణార్కకి కూడా ఇష్టమే. నిజానికి అది ఆయన తత్వమే. అసలు అనుచరులెప్పుడూ నాయకుని తత్వాన్ని ఆచరించడంలో దూకుడు ప్రదర్శించాలి. రాజుని మించిన రాజభక్తిని ప్రదర్శించాలి. సరిగ్గా అలాంటి అనుచరుడే దొరికాడు కోణార్కకి.
కోణార్క విద్యా సంస్థలో వొక విద్యార్థి మరో విద్యార్థిని చంపేసాడు. దానికి కారణం గర్ల్ ఫ్రెండ్. ఆమె పుట్టిన రోజుని వొక గొప్ప రెస్టారెంటులో జరపడం కోసం డబ్బు కావలసి వొచ్చి తోటి విద్యార్థిని చంపేసాడు. హంతకుడు చదువులో ఫస్ట్ ర్యాంకర్.
విద్యార్థుల ఆందోళనలు మొదలయ్యాయి. సిద్ధార్థ అన్నాడు.
” యీ విద్యార్థిని కేసుల నుంచీ బయట పడెయ్యాలి. అతడు మన కాలేజీకే మంచి పేరు తెస్తాడు.”
“ఎలా? బయట ఇంత గొడవగావుంటే,” ప్రశ్నించాడు కోణార్క.
డబ్బిచ్చి కొంత మందిని కొనుక్కొచ్చి కౌంటర్ యాజిటేషన్ చేయించాడు సిద్ధార్థ. అవతలి వాళ్ళు చర్చలకి సిద్ధపడ్డారు. నిజానికి ఉద్యమిస్తున్న వాళ్ళని భయభ్రాంతుల్ని చేసారు. గాయపరిచారు. గొడవలు క్రమేపీ చల్లారి పోయాయి. పోలీసులు కూడా డబ్బులు తీసుకొని మిన్నకున్నారు. పేరెంట్స్ కి కూడా కొంత డబ్బు ముట్టజెప్పారు. చనిపోయిన విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడని కేసు మూసేసారు. హంతక విద్యార్థికి ఫస్ట్ ర్యాక్ వొచ్చింది. టీవీలలో, వొత్తిడిలో కూడా రాణించిన చదువరని అతని పేరూ, విద్యా సంస్థల పేరూ మారు మోగిపోయింది.
“సమస్యలు వుంటాయి. వాటికి అనేక కోణాలు ఉంటాయి. మనకు కావలసిన కోణాన్ని మనం బయటకి లాగి ప్రొజెక్ట్ చెయ్యాలి”, అన్నాడు సిద్ధార్థ మందు తాగుతూ. అభినందనగా భుజం తట్టాడు కోణార్క.
వొక కోణార్క విద్యాసంస్థలో విద్యార్థి ఆత్మహత్య చేసుకున్నాడు. అది మామూలే. నిజానికి అదొక వార్త కాకుండా పోవును. ఎందుకంటే కోణార్క విద్యా సంస్థలు చాలా బలపడి పోయాయి యెప్పటి కంటే. ఆత్మహత్యలు, హత్యలు, అత్యాచారాలూ యేవీ వార్తలు కాకుండా పోయాయి. అన్ని విద్యా సంస్థల కంటే ర్యాకులు ఎక్కువగా వచ్చేది అక్కడే. ర్యాంకుల స్కోరు టీవీల్లో మారుమోగి పోయేది.
విద్యార్థులకు తిండి సరిగా ఉండదు. సౌకర్యాలు సరిగా ఉండవు. కోళ్ళ ఫారాల్లా ఉంటాయి. అయినా ఆ విద్యా సంస్థలే ముందుకు దూసుక పోతున్నాయి. యింక క్రైము రేటు కూడా ఎక్కువే. ఆత్మహత్యలూ ఎక్కువే.
కానీ ఆ ఆత్మహత్య రాష్ట్రాన్ని కుదిపేసింది. సిద్ధార్థకి కునుకు లేకుండా చేసింది. సిద్ధార్థ కూడా అశక్తుడుగా మారిపోవడం వల్ల డాక్టర్ కోణార్క కుదేలు అయిపోయాడు. అసలు సమస్య ఆత్మహత్య కాదు. ఆత్మహత్యల్ని మేనేజ్ చేయడం చాలా సులభం. కానీ ఆ విద్యార్థి చస్తూ చస్తూ లేఖ రాసి పోయాడు. దాన్ని ఔత్సాహికులైన వార్తాపత్రికల వాళ్ళు ప్రచురించేసారు. కుల వివక్ష వల్లే ఆ విద్యార్థి చనిపోయాడని దేశమంతా మారుమోగిపోయింది. రాజకీయ నాయకులు కూడా దిగి పోయారు. ఇక ఏం చేయాలి?
“సిద్ధార్థ యిప్పుడేం చెయ్యాలి? నీ అనేక కోణాల ఫిలాసఫీ వొట్టిపోయిందేమీ?”అని అడిగాడు కోణార్క.
“లేదు. అదెప్పటికీ పని చేస్తుంది. కొంచెం ఆలస్యం కావొచ్చు అంతే. సైకాలజీ, ఫిలాసఫీ, వాస్తు శాస్త్రం, న్యూమరాలజీ యిలా అన్ని రంగాలలో నిపుణుల చేత టీవీల్లో చర్చలు ఏర్పాటు చేయండి. ఆ విద్యార్థి చనిపోవడానికి కారణాలను రకరకాలుగా వదరమనండి. మన వ్యాపారాలకు సంబంధించిన ప్రకటనలు ఇప్పించండి. ప్రస్తుతం ఇంతే. తర్వాత సంగతి ఆలోచిద్దాం”, అన్నాడు సిద్ధార్థ.
సైకాలజిస్టులు, అతడు బాల్యం నుంచీ కుటుంబంలో ఎదుర్కొన్న కష్టాలే చావుకు కారణం అన్నారు. ఆ లేఖలో బాల్యం ప్రసక్తి ఉందన్నారు. ఆధ్యాత్మికవేత్త వొకరు ఆ విద్యార్థి తన లేఖలో దేహం, ఆత్మ వేరు పడి పోయిందని ప్రకటించాడు. కనుక ఆధ్యాత్మిక సమస్యలే కారణమన్నాడు. న్యూమరాలజిస్టు అతనికి పేరులో అక్షరాల సంఖ్య ఆత్మహత్యకు కారణమన్నాడు. జ్యోతీష్యుడు గ్రహబలం సరిగా లేదన్నాడు. బ్రేకులూ, ఎడ్వర్టయిజ్మెంటులూ మధ్య చర్చలు సాగుతున్నాయి. కుల వివక్ష నుండీ దృష్టి మళ్ళించడానికి శాస్త్ర పాండిత్యాలన్నీ భేషుగ్గా ఉపయోగపడుతున్నాయి.
“ప్రపంచం అన్న తరవాత అన్నీ ఉంటాయి. కుల వివక్షో మరో వివక్షో యెలాగూ ఉంటుంది. దాన్ని పెద్ద యిష్యూ కాకుండా యెలా అడుక్కి నెట్టాయలన్నదే మనం ఆలోచించాలి. అదే తెలివి అంటే”, అన్నాడు సిద్ధార్థ.
కానీ తాను స్వారీ చేసే పులి తననే బలి కోరినట్లైంది కోణార్క పరిస్థితి. కోణార్క కూతురునే ప్రేమలో పడేసాడు సిద్ధార్థ. “మీరే సిద్ధార్థ చాలాతెలివైన వాడని మెచ్చుకుంటారు కదా”, అని ఎదురు ప్రశ్న వేసిందా అమ్మాయి.
“యే రకంగా సరి తూగుతాడు మనతో”, అని అడిగాడు కోణార్క. అతనికి ఆస్తులు లేకపోవచ్చు. తెలివి ఉంది. అతని తెలివి వల్లే మన ఆస్తులూ, డబ్బూ ఎదుగుతూ వొచ్చాయి. అతని బుర్ర కన్నా వేరే ఆస్తేం కావాలి?” అని అడిగింది.
“బుర్రలెన్నయినా కొనొచ్చు డబ్బుంటే. కానీ కులాన్ని ఎక్కడ కొంటాం? అతని కులం నీకు తెలుసా?
“కులం అంత ముఖ్యమా?”
“కులమే ఆస్తి”
“నాన్నా, నేను అతన్నే పెళ్ళాడతాను. నిర్ణయించేసుకున్నాను”, అని కుండలు బద్దలు కొట్టింది ఆ అమ్మాయి.
కోణార్క మౌనంగా ఊరుకున్నాడు. సిద్ధార్థ చెప్పినట్లూ సమస్యలు అన్ని చోట్లా ఉంటాయి. యెప్పుడూ ఉంటాయి.
తర్వాతి రోజు సిద్ధార్థ ఉత్సాహంగా కోణార్క ఆఫీసుకొచ్చాడు.
“చాలా ఎదిగి పోయావు నువ్వు. నన్ను మించి పోతున్నావు” , అన్నాడు కోణార్క. సిద్ధార్థ చిరునవ్వు నవ్వాడు. కొద్ది సేపు ముచ్చట్ల తర్వాత బయలు దేరాడు. కోణార్క అన్నాడు, ” నువ్వు చాలా పైకి వెళ్తావు”.
ఆ రోజే సిద్ధార్థ చనిపోయాడు. అది రోడ్డు యాక్సిడెంటా, ఆత్మహత్యా లేక హత్యా? నల్లుగురూ నాలుగు రకాలుగా చెప్పుకున్నారు.కురసోవా సినిమాలాగే రకరకాల కథలు వ్యాపించాయి.
వొక రోజున కోణార్క తన కొడుక్కి హిత బోధ చేసాడు.
“నేను పెద్దవాన్ని అయిపోయాను. వ్యాపారాలన్నీ ఇక నువ్వే చూసుకోవాలి. అన్ని విషయాలనీ అన్ని కోణాలనుంచీ అర్థం చేసుకోవాలి. కానీ మనకు కావలిసిన కోణాన్నే బయట పెట్టాలి. చూడూ తెలుపులో అన్ని రంగులూ ఉంటాయి. అన్ని రంగులనూ తొక్కేసి తెలుపే తెల్లగా రాజ్యం చేస్తుంది. నలుపుని కూడా తెలుపు చేస్తుంది. ఎరుపుని కూడా తెలుపు చేసేస్తుంది. బుర్ర ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు. ఆ బుర్రల్ని అన్నింటినీ కొని ఆధిపత్యం చెలాయించగల వాడు ఒకడే ఉంటాడు. యీ వొక్క రహస్యం గుర్తుంచుకో. యీ వొక్క కోణాన్ని మరచిపోకు”
*
తాజా కామెంట్లు