పూల రాణి కూతురు

MythiliScaled

అనగా అనగా ఒక రాజకుమారుడు. ఒక రోజు ఉదయాన ఉల్లాసంగా గుర్రం మీద షికారు వెళ్ళాడు. పోగా పోగా  పెద్ద మైదానం వచ్చింది. దాని మధ్యనొక బావి. అందులోంచి ఎవరో ఏడుస్తూ పిలుస్తున్నట్లు వినబడింది. చూస్తే లోపల ఒక ముసలావిడ పడిపోయి ఉంది. రాజకుమారుడు గబ గబా ఆమెని పైకి లాగాడు. ఆమె ఎక్కడిదో ఏమిటో అడిగాడు.

” నాయనా, నీ దయ వల్ల బతికాను. లేదంటే ఇక్కడే చచ్చిపోయిఉండేదాన్ని . మా ఊరు ఇక్కడికి దూరం. ఈ పక్కన  పట్టణం లో పొద్దున్నే సంత జరుగుతుంది. అందులో గుడ్లు అమ్ముకునేందుకని చీకటితో బయల్దేరి చూపు ఆనక ఇలా పడిపోయాను, ఇంక వెళ్ళొస్తాను ” – ఆమె చెప్పింది.

రాజకుమారుడు  – ” అవ్వా, నువ్వు నడిచే పరిస్థితిలో ఎక్కడున్నావు, ఉండు, నిన్ను దిగబెడతాను ” అని ఆమెని ఎత్తి గుర్రం మీద కూర్చోబెట్టుకుని బయల్దేరాడు. అడవి అంచున ఉన్న ఆమె గుడిసెకి ఇద్దరూ వెళ్ళారు. దిగి లోపలికి వెళ్ళబోతూ ముసలావిడ ” ఒక్క నిమిషం ఆగు, నీకొకటి ఇస్తాను ” అని , ఒక చిన్న గంటను తీసుకొచ్చి ఇచ్చింది అతనికి. ” బాబూ, నువ్వు వీరుడివి, అంతకు మించి ఎంతో దయగలవాడివి.  పూలరాణి కూతురు అందం లోనూ, మంచితనం లోనూ నీకు తగిన భార్య. ఆమె నాగేంద్రుడి కోటలో బందీగా ఉంది. విడిపించి పెళ్ళి చేసుకో. ఈ గంట ని ఒకసారి మోగిస్తే గండ భేరుండాల రాజు వచ్చి నీకు సాయం చేస్తాడు. రెండు సార్లు మోగిస్తే నక్కల రాజూ, మూడు సార్లు మోగిస్తే చేపల రాజూ వచ్చి నీ కష్టం తీరుస్తారు. వెళ్ళిరా, నీకు శుభం జరుగుతుంది ” అని మాయమైంది, గుడిసె తో సహా.

అప్పటికి రాజకుమారుడికి ఆమె ఎవరో దేవకన్య అని అర్థమైంది. గంటని భద్రంగా దుస్తులలో దాచుకుని కోటకి వెళ్ళాడు. వాళ్ళ నాన్నకి అంతా చెప్పి పూలరాణి కుమార్తెని వెతికేందుకు మరుసటి రోజున ప్రయాణమయాడు. ఏడాది పొడుగునా తెలిసిన ఊళ్ళూ తెలియనివీ గాలించాడు. పూలరాణి కూతురు ఆచూకీ ఎక్కడా తెలిసిందే కాదు. బాగా అలిసిపోయాడు. చివరికి ఒక రోజు ఒక చిన్న ఇంటి ముందర చాలా ముసలిగా కనిపించే ఒకతన్ని చూసి అడిగాడు – ” తాతా, నాగేంద్రుడు ఎత్తుకుపోయిన పూల రాణి కూతురు ఎక్కడుంది ? ”

flower queens daughter 2

” నాకైతే తెలీదుగాని, ఈ దారమ్మటే, అటూ, ఇటూ చూడకుండా   ఒక సంవత్సరం వెళ్ళావా, ఇటువంటి ఇల్లే ఇంకొకటి వస్తుంది. అది మా నాన్నది. ఆయనకి  తెలిసి ఉండచ్చు, బహుశా ” ముసలివాడు జవాబు చెప్పాడు. రాజకుమారుడు అలాగే వెళ్ళాడు .  ముసలివాడి తండ్రి , ఇంకా ముసలివాడు – కనిపించాడు. కాని అతనికీ సమాచారం తెలీదు. అతని సలహా ప్రకారం ఇంకొక ఏడు అదే దారి వెంట ప్రయాణించి అతని తండ్రి ఇంటికి చేరాడు రాజకుమారుడు. ఈ ముసలితాత మాత్రం చెప్పాడు – ” అవును, ఆ నాగేంద్రుడి కోట ఆ కనబడే కొండ మీదేగా ఉంది ! ఇవాళే ఆయన నిద్ర మొదలెడతాడు, ఈ ఏడంతా నిద్ర పోయి వచ్చే ఏడంతా మేలుకుంటాడు. అయితే, ఆ పక్కన కొండ మీద నాగేంద్రుడి తల్లి ఉంటోంది. రోజూ  రాత్రి విందు చేస్తుంది ఆవిడ, పూలరాణి కూతురు ప్రతి రాత్రీ  అక్కడికి వెళుతుంది ” .

రాజకుమారుడు తాతకి కృతజ్ఞతలు చెప్పుకుని రెండో కొండ ఎక్కి నాగేంద్రుడి తల్లి కోటకి వెళ్ళాడు. అది బంగారపు కోట, కిటికీ లకి వజ్రవైఢూర్యాలు తాపడం చేసి ఉన్నాయి. తలుపు తెరిచి లోపలికి వెళ్ళేలోపు ఏడు సర్పాలు వచ్చి అతన్ని అడ్డగించాయి. రాజకుమారుడు యుక్తిగా జవాబు చెప్పాడు – ” నాగ రాణి ఎంతో అందమైనదనీ పెద్ద మనుసున్నదనీ విన్నాను. ఆవిడ దగ్గర కొలువు చేసేందుకని వచ్చాను ” . సర్పాలు ఆ మాటలకి సంతోషించాయి, రాజకుమారుడిని వెంటబెట్టుకుని నాగరాణి దగ్గరికి తీసుకు వెళ్ళాయి.

రత్నాలు చెక్కిన సిం హాసనం మీద నాగరాణి కూర్చుని ఉంది. ఆమె నిజంగానే చాలా అందంగా, కాని భయం పుట్టించేట్లుగా ఉంది… ” ఎందుకొచ్చావు ? ” రాజకుమారుడిని అడిగింది. అతను తడబడకుండా మళ్ళీ చెప్పాడు – ” మీ సౌందర్యం గురించీ  గొప్పతనం గురించీ,  కథలు కథలుగా విని, మీ దగ్గర పని చేసేందుకు వచ్చాను ”

 

నాగరాణి – ” సరే, చూద్దాం. ఇదుగో, నా గుర్రాన్ని ఆ కనిపించే మైదానం లో కి వరసగా మూడు రోజులు మేతకి తీసుకుపోయి  భద్రంగా వెనక్కి తేగలిగితే, అప్పుడు పనిలో చేరచ్చు. లేదంటే నా నౌకర్లు నిన్ను చంపి తినేస్తారు ” అంది.

రాజకుమారుడు ఒప్పుకుని నాగరాణి గుర్రాన్ని మేతకి తీసుకువెళ్ళాడు. కానీ ఆ మైదానం లో అడుగు పెట్టగానే గుర్రం  కనిపించకుండా పోయింది. ఎంత వెతికినా  దొరకనేలేదు.  రాజకుమారుడు దిగాలుగా అక్కడొక బండరాయి మీద కూర్చుండి పోయాడు.  పైకి చూస్తే  ఆకాశం లో పెద్ద గద్ద ఎగురుతోంది. అతనికి వెంటనే దేవకన్య ఇచ్చిన గంట సంగతి గుర్తొచ్చింది. అప్పటివరకూ దాని సాయాన్ని ఉపయోగించుకోవాలని అతనికి అనిపించనేలేదు. జేబు లోంచి తీసి మోగించాడు. మరుక్షణం లో రెపరెపమని రెక్కల శబ్దం. గండ భేరుండాల రాజు ప్రత్యక్షమై రాజకుమారుడికి మోకరిల్లాడు. ” నీకేం కావాలో నాకు తెలుసు. తప్పిపోయిన గుర్రాన్ని నా అనుచరులని పంపి తెప్పిస్తాను,  అది మబ్బుల్లో దాక్కుని ఉంటుంది ” అని హామీ ఇచ్చి వెళ్ళిపోయాడు. రాజకుమారుడు అక్కడే, అలాగే  ఉండి పోయాడు. సాయంత్రమవుతూండగా గుంపులు గుంపులుగా పెద్ద గద్దలు ఎగిరి వచ్చాయి, వాటి ముక్కులతో పట్టుకుని గుర్రాన్ని తీసుకొచ్చాయి. రాజకుమారుడు దాన్ని నాగరాణికి అప్పగించాడు. ఆమె ఆశ్చర్యపోయింది.

” ఈ రోజు నువ్వు ఈ పని పూర్తిచేసినందుకు నిన్ను బహూకరిస్తాను ” అని ఒక రాగి కవచాన్ని అతనికి ఇచ్చి తొడుక్కోమంది. విందుజరుగుతున్న సభకి రాజకుమారుడిని తీసుకువెళ్ళింది.  నాగ కన్యలూ నాగ కుమారులూ జంటలు జంటలుగా అక్కడ నృత్యం చేస్తున్నారు. వాళ్ళ  ఆకారాలూ దుస్తులూ అతి పల్చగా, వింత వింత రంగులలో కదులుతున్నాయి. వాళ్ళలో నాగరాణి కూతురు కూడా ఉంది. తల్లిలాగే ఆమె కూడా అందంగా ఉంది,  క్రూరంగానూ ఉంది. రాజకుమారుడిని చూసి బావున్నాడని అనుకుంది గాని అతను ఆమె వైపు చూడనేలేదు. అందరికన్నా వేరుగా   పూల రాణి కూతురు కనబడింది. మల్లెపూవులూ గులాబీలూ కలిపినట్లు  సుకుమారంగా  వెలిగిపోతోంది . ఆమె దుస్తులు అరుదైన పూల రేకులతో అల్లినవి. ఆమె నర్తిస్తుంటే పూల వనాలు పరిమళిస్తున్నట్లుంది.  ఆమెతో నర్తించే అవకాశం, కాసేపటికి రాజకుమారుడికి వచ్చింది . రహస్యంగా ఆమె చెవిలో  – ” నిన్ను రక్షించేందుకు వచ్చాను ” అని చెప్పాడు. ఆమె అతి మెల్లగా అంది – ” మూడో రోజున నువ్వు గుర్రాన్ని వెనక్కి తెచ్చి ఇచ్చినప్పుడు ఆ గుర్రపు పిల్లని బహుమతిగా నాగరాణిని అడుగు ”

వాళ్ళిద్దరూ ఒకరినొకరు చూస్తూనే ఇష్టపడ్డారు. విందు అర్థరాత్రి దాటే దాకా సాగి, ముగిసింది.

తెల్లవారాక మళ్ళీ గుర్రాన్ని మైదానం లోకి తీసుకు వెళితే అది ఎప్పటిలాగే మాయమైంది. ఈ సారి గంట మోగిస్తే నక్కల రాజు వచ్చి అడవిలో  దాక్కున్న గుర్రాన్ని తెచ్చిపెట్టాడు. ఆ రాత్రి నాగరాణి వెండికవచం ఇచ్చి అతను తొడుక్కున్నాక విందుకు తీసుకు వెళ్ళింది.  నాట్యం జరుగుతుండగా పూలరాణి కూతురు ” రేపు కూడా నువ్వు గెలిస్తే , గుర్రపు పిల్లతో మైదానం లోనే వేచి ఉండు. విందు పూర్త యేలోపున ఇద్దరం ఎగిరి వెళ్ళిపోదాం ” అంది.

మూడో రోజునా గుర్రం అదృశ్యమైంది. గంట మోగితే చేపలరాజు వచ్చి నదిలో దాక్కున్న గుర్రాన్ని పట్టుకొచ్చి ఇ చ్చా డు. నాగరాణి రాజకుమారుడిని మెచ్చుకుని, తన అంగరక్షకుడుగా నియమించుకుంటాననీ , ముందుగా ఏదైనా కోరుకుంటే ఇస్తాననీ చెప్పింది. రాజకుమారుడు ఆ గుర్రం పిల్లను ఇమ్మని అడిగాడు. నాగరాణి ఇచ్చింది. ఆ రాత్రి బంగారు కవచం తొడిగించి విందుకి తీసుకు వెళ్ళింది. నాగరాణి తన కూతురితో రాజకుమారుడికి పెళ్ళి చేసి దగ్గర ఉంచుకుందామని ,  విందు ముగిసిన తర్వాత ఇద్దరికీ పెళ్ళి చేసే ప్రకటన చేద్దామని, అనుకుంది.  అతను ఆవిడ కి అంతగా నచ్చేశాడు. అతను ఒప్పుకుంటాడో లేదోనన్న అనుమానం కూడా నాగరాణికి రాలేదు. అయితే విందు పూర్తయేదాకా రాజకుమారుడు ఆగలేదు. ఎవరూ చూడకుండా తప్పించుకుని గుర్రపుసాలలో పిల్లగుర్రాన్ని ఎక్కి మైదానం లో వేచి ఉన్నాడు. అది పేరుకే పిల్లగానీ బలంగా భారీగా ఉంది . త్వరలోనే పూలరాణి కూతురు వచ్చేసింది. ఇద్దరూ కలిసి  గాలి కన్న వేగంగా పూల రాణి కోట వైపుకి ఎగిరి వెళ్ళారు.

Girl with Flowers Painting by Hans Zatzka; Girl with Flowers Art Print for sale

ఈ లోపల  నాగేంద్రుడి సేవకులు వీళ్ళు వెళ్ళిపోవటం చూసి నాగేంద్రుడిని నిద్ర లేపారు. అతను చాలా కోపంగా, ఆవేశంగా ఆమెను మళ్ళీ ఎత్తుకువచ్చేందుకు వెళ్ళాడు. ఇప్పుడు ఏ దివ్య శక్తులూ తనదగ్గర లేకపోయినా   రాజకుమారుడు అతన్నిధైర్యంగా  ఎదుర్కొన్నాడు.  పూలరాణి తన తుమ్మెదల సైన్యాన్ని నాగేంద్రుడి మీదికి పంపింది .  యుద్ధంలో నాగేంద్రుడు ఓడిపోయి వెళ్ళి పోవలసి వచ్చింది.

పూలరాణి తన కూతురి ఇష్టం తెలుసుకుని రాజకుమారుడితో – ” మీ ఇద్దరికీ అలాగే పెళ్ళి చేస్తాను. కాని నా కూతురిని ఇంతకాలమూ వదిలి ఉన్నాను కదా…పూర్తిగా నీకే ఇచ్చేయలేను. ప్రతి ఏడూ చలికాలం లో, మంచు కప్పిన రోజులు మొత్తం ఆమె నా దగ్గర ఉండాలి. మళ్ళీ వసంతం రాగానే నీ దగ్గరికి వస్తుంది ” అని షరతు పెట్టింది. రాజకుమారుడు పూలరాణి కోరికలో న్యాయం ఉందని అనుకుని సరేనన్నాడు. ఇద్దరికీ మాలతి పూల పందిళ్ళ కింద పెళ్ళి అయింది.  రకరకాల పూల తేనె లతో విందులు జరిగాయి.  అవి వసంతపు రోజులే కనుక భార్యను తీసుకుని  రాజకుమారుడు తన రాజ్యానికి వెళ్ళాడు. అతని జీవితం ఆనందం తో నిండింది.

పూల రాణి కూతురు అక్కడ కాలు పెడుతూనే ప్రజలందరికీ మనసులు తేలికగా హాయిగా అయిపోయాయి.  అక్కడ పూసిన పూలు వాడేవే కావు. శీతాకాలం ఆమె లేనప్పుడు మాత్రం జనం దిగులు పడేవారు,  ఆమె తిరిగి రాగానే తెప్పరిల్లేవారు.

  • Bukovinan fairy tale కి స్వేచ్ఛానువాదం. సేకరణ-  Dr Heinrich von Wlislocki , Andrew Lang

 

 

మంచును కరిగించిన పాపాయి

MythiliScaled

ఒకానొకప్పుడు బల్గేరియా లో, ఒక ఊర్లో – ఎక్కడ చూసినా మంచు పేరుకుపోయింది. శీతాకాలం ఎప్పటికీ అయిపోయేట్లు లేదు, వసంతం వచ్చేటట్లు లేదు.ఒక రోజైతే, పొద్దున్నే లేచేప్పటికి ఇళ్ళన్నీ మంచు లో కూరుకుపోయి ఉన్నాయి. వాకిలి తలుపులు తెరవటమే కష్టమైపోయింది. అలాగే మంచుని తవ్వుకుని తలుపులు తీసి, ఇళ్ళ మధ్యన మంచు కిందన సొరంగాల లాగా దారి చేసుకుని, అందరూ ఊరి మధ్యన ఉన్న చర్చ్ లో కలుసుకున్నారు. ఇప్పట్లో పరిస్థితి మారకపోతే ఏం చేయాలనేది చర్చించారు. రకరకాల అభిప్రాయాలు వచ్చాయి కానీ ఏదీ తేల్చుకోలేకపోయారు. ఆ ఘోరమైన చలీ మంచు కురవటమూ అలాగే ఉంటే ఇహ ఆ యేడు పంటలేవీ పండించుకోలేరు. నెగళ్ళు వేసుకుందుకు అడవిలోంచి కట్టెలు తెచ్చుకోవటం కూడా వీలు పడదు. బతకటమే కష్టమైపోతుంది.

little girl 1” ఎవరో ఒకరు మంచు దేవుడి   దగ్గరికి వెళ్ళి మన బాధలు చెప్పి వేడుకోవాలి. ఆయన ఆజ్ఞాపిస్తేనే గాని చలిగాలులు వెనక్కి వెళ్ళవు ” అన్నాడొక పెద్దాయన. అక్కడికి దూరంగా ఎత్తైన కొండ మీద ఉంటాడు మంచు దేవుడు. ఆ దట్టమైన మంచు కిందన అంత దూరం సొరంగం తవ్వి ఎవరు అక్కడికి వెళ్ళగలరు ? అదే అన్నారు అంతా. పెద్దాయన అన్నాడు – ” అలా అక్కర్లేదు, మన ఊరంటే లోయలో ఉంది కనుక ఇంత దట్టమైన మంచు. ఎలాగో అలా ఊరి చివరి వరకూ సొరంగం తవ్వితే చాలు, అక్కడినుంచీ కొండల వరస మొదలవుతుంది. ఎత్తు పెరిగే కొద్దీ గాలులు బలంగా వీస్తాయి కాబట్టి మంచు పల్చగానే ఉంటుంది, సులువుగా చెదరగొట్టచ్చు ” అని.

అక్కడ చేరిన మగవాళ్ళంతా ఒకరి మొహాలొకరు చూసుకున్నారు. ఎవరికి వారికి పక్కవారెవరైనా వెళ్తే బావుండునని ఉంది. ప్రతివారూ ఏదో ఒక వంక చెప్పారు . చివరికి ఎవరూ మిగల్లేదు. సిగ్గుతో తలలు దించుకున్నారు గాని అప్పటికైనా ఒకరు ముందుకు రాలేదు.

పెద్దాయన అన్నాడు – ” ఇహ నేనే మిగిలినట్లున్నాను. ఒక ఇరవై ఏళ్ళ కింద అయితే ఈ పని ఇట్టే పూర్తి చేసి ఉండేవాడిని. ఇప్పుడు నా వల్ల అవుతుందో లేదో ! అయినా బయల్దేరతాను లెండి ” అని.

little girl 2

” అక్కర్లేదు తాతా. నేను వెళ్తానుగా ” అందొక చిన్న పిల్ల. ఆమెని పసిపిల్లగా ఉన్నప్పుడే అమ్మా నాన్నా పోతే , పెద్దాయన పెంచుకుంటున్నాడు.

” వద్దు వద్దు ” అన్నారు అంతా జాలిగా. ఆమెకి సరైన కోటు అయినా లేదు. వెచ్చటి ఉన్ని టోపీ గాని, శాలువా గాని, చేతి తొడుగులు గానీ- ఏవీ లేవు .పాప తల నిమురుతూ తాత అన్నాడు – ” వద్దు తల్లీ. చిన్న పిల్లవి, అంత దూరం వెళ్ళలేవు ” అని.

” నాకస్సలు భయం లేదు తాతా ” పాప అంది. ” నా కాళ్ళకి చాలా బలం ఉంది. మంచు గొర్రెలంత వేగం గా పరిగెట్టగలను కూడా ”

” చలికి గడ్డకట్టుకు పోతావమ్మా , దారిలో ఎక్కడా తలదాచుకునేందుకేమీ ఉండదు ”

” అందరికీ మంచి జరగాలి కదా తాతా మరి ? నాకేమంత చలి ఉండదు తెలుసా ? ”

తాత ఆలోచించాడు. తనకా శక్తి లేదు, దారి మధ్యలో ఆగిపోయినా తనకేమైనా జరిగినా ఏమీ లాభం ఉండదు. ఇంకెవరూ వెళ్ళేలా లేరు. పాప చిన్నదైనా ధైర్యం గలది, ఆరోగ్యం ఉన్నది. చివరికి ఒప్పుకున్నాడు-” నీ గుండె నిండా ప్రేమ ఉందమ్మా ! అదే నీకు వెచ్చదనం ఇస్తుంది. వెళ్ళిరా ”

అంతా ఒక్కసారి ఊపిరి పీల్చుకున్నారు. ఒకరు కోటూ, ఒకరు టోపీ, ఒకరు శాలువా, ఇంకొకరు బూట్లూ చేతి తొడుగులూ – ఇలా తమ దగ్గర ఉన్న వెచ్చటి దుస్తులని, పాపకి సరిపోయేవాటిని – తెచ్చి ఇచ్చారు. మగవాళ్ళంతా కలిసి ఊరి చివరి కొండవాలు దాకా సొరంగం తవ్వారు. అందరూ పాపని దీవించి జాగ్రత్తలు చెప్పారు. పాప బయలుదేరింది. ఇంతా అయేసరికి ఇంచుమించు సాయంత్రమైంది. మొదటి కొండ చేరే సరికే చీకటి పడిపోయింది. అయితే కాసేపటికి చందమామ వచ్చాడు. పౌర్ణమి రోజులేమో, వెన్నెల బాగా  వెలుతురు ఇచ్చింది. పాప రాత్రంతా నడుస్తూనే ఉంది, ఎక్కడా ఆగకుండా. వీలైనంత తొందరగా మంచు దేవుడి దగ్గరికి చేరాలని ఆమె ఆరాటం.

కాని మంచుగాలులు పాపని చూసి – ” ఎంత ధైర్యం ఈమెకి ! ఈమె పని చెబుదాం ఉండండి. గట్టిగా వీద్దాం , పడదోద్దాం ఆమెని. ఎందుకోసం వచ్చిందో మర్చిపోయేంత ఇబ్బంది పెడదాం ” అని కూడబలుక్కున్నాయి. చాలా విసురుగా, దుమారం లాగా వీచటం మొదలెట్టాయి. పాప   తొణకలేదు, బెణకలేదు. నడుస్తూనే ఉంది.

గాలులకి కోపం వచ్చింది. ఇంకా, ఇంకా విసిరి విసిరి వీచాయి, ఆయాసం వచ్చి ఆగాయి. ” ఏం పిల్ల ! మనకి అలుపు వస్తోందేగానీ ఆమెకేమీ లెక్కలేదే ” అని ఆశ్చర్యపోయాయి .

” ఇలా వదిలేస్తే లాభం లేదు. మనల్నెప్పుడైనా ఏ మనిషైనా గెలిచాడా ? ఇంత చిన్న పిల్ల ముందు ఓడిపోతామా ? మళ్ళీ మొదలెట్టండి ” రొప్పుతూ అంది   వాటిలో ఒకటి.

” నీకు ఓపిక ఉంటే నువ్వు మొదలెట్టు. ఇంక నావల్ల కాదు . ఒకరోజంతా పడుకుంటే గాని కదల్లేను ” అంది ఇంకొకటి.

” మేమూ అంతే, మా వల్లా అవదు ” ఒప్పుకున్నాయి తక్కినవి. మొదటిది అంది – ” అయితే మన అన్నయ్య ఉన్నాడు కదా మంచు తుఫాన్ … వాడు మనకన్న బలవంతులు. వాడిని పిలిచి పురమాయిద్దాం. ఈ పిల్లని మాత్రం వదిలేది

లేదు ‘’

అలాగే అన్నీ కలిసి మంచు తుఫాన్ ని పిలిచారు. అతను గబగబా వచ్చాడు. జరిగిందంతా విన్నాడు. ఆ సరికి పాప దూరంగా చివరి కొండ ఎక్కబోతూ కనిపించింది. తుఫాన్ ద్వేషం తో రుసరుసలాడిపోయాడు. ఎడాపెడా చేతులు జాడించాడు. అదేమి వింతో, పాప తుఫాన్ ని కూడా లెక్క పెట్టలేదు, ఆమెకేమీ కాలేదు.

” సిగ్గు సిగ్గు ” అనుకున్నాడు తుఫాన్. ” కోపమూ ద్వేషమూ ఈమెనేమీ చేయలేకుండా ఉన్నాయి. అటు వైపునుంచి ప్రయత్నిద్దాం ” అన్నాడు అతను.

ఒక చెల్లెలు వెటకారం చేసింది- ” ఎత్తుకుని కొండ మీద దించుతావా ఏమిటి ? ”

” కాదులే. మన అక్కయ్యని పిల్లుద్దాం. ఆమెని ఎవరూ ఎదిరించలేరు. తెలియకుండా వచ్చేసి ఎవరినైనా లోబరచుకుంటుంది ” అన్నాడు అతను. ఆ అక్కయ్య చలిరాక్షసి . మనుషుల ఒళ్ళు బిగుసుకుపోయి చచ్చిపోయేలా చేస్తుంది. ఆ దుష్టురాలు వీళ్ళు పిలవగానే వచ్చింది. ఆమెకి రూపం లేదు, కాని ఎలా కావాలంటే అలా మనుషులకి కనిపించగలదు. ఎప్పుడో చనిపోయిన పాప తల్లి రూపం ధరించి వచ్చి పాప కోసం తల్లి పాడే లాలిపాట పాడింది.

పాప నడక వేగం తగ్గించి, వింది, దూరం నుంచి చూసింది . ” ఇదేమిటి..అమ్మ మొహం, అమ్మ గొంతు, అమ్మ పాట … కాసేపు ఇక్కడ కూర్చుని వింటాను, అమ్మ దగ్గరికి వస్తుందేమో. దగ్గరికి వచ్చేశాను కదా , మంచు దేవుడి భవనం కనిపిస్తూనే ఉంది ” – కూర్చుండిపోయింది. పాట వింటూంటే పాపకి కళ్ళు మూసుకుపోతున్నాయి. మెల్లిగా నిద్రపోయింది. చలి రాక్షసి పళ్ళు బయట పెట్టి ఇకిలిస్తూ తమ్ముడికీ చెల్లెళ్ళకీ తన ఘనకార్యాన్ని చెప్పేందుకు వెళ్ళింది. అమ్మ కలలో కనిపిస్తుంటే పాప నిద్రలో నవ్వుకుంటోంది. కాని మొహం రంగు మారిపోతోంది, గులాబి రంగులోంచి నీలంగా అయిపోయింది.. తర్వాత పాలిపోయిన పసుపు పచ్చ రంగులోకి మారింది.. పాప బిగిసిపోతోంది. ఇంకెవరూ కాపాడేందుకు లేనట్లే ఉంది.

little girl 3

అప్పుడొక చిన్న శబ్దం, కీచుమని. పక్కన ఉన్న కలుగులోంచి చిట్టెలుక ఒకటి బయటికి వచ్చి తన చిన్న చిన్న కళ్ళతో పాప పరిస్థితి చూసింది. ” అయ్యో పాపం ” అనుకుని తోటి ఎలుకలని పిలిచింది. అవన్నీ పరుగెట్టుకొచ్చి పాప చేతులూ కాళ్ళూ రుద్ది వేడి పుట్టించే ప్రయత్నం చేశాయి. అవి చాలా చిన్నవి కనుక ఆ పని త్వరగా జరగటం లేదు పాపం, స్నేహితులని పిలిచాయి. బొరియల్లోంచి కుందేళ్ళు వచ్చాయి. మంచు కప్పిన పైన్ చెట్ల మీదినుంచి ఉడతలు కిందికి దూకాయి. పాప ఒంటిమీదికి ఎక్కి తమ బొచ్చుతో వెచ్చదనం పుట్టించాయి. పాప బుగ్గలు మెల్లి మెల్లిగా గులాబి రంగులోకి మారాయి. కళ్ళు విప్పబోయింది… రెప్పల మీద రెండు కన్నీటి బొట్లు గడ్డకట్టి ఉన్నాయి. ఒక చిట్టి ఉడత తోకతో వాటిని విదిలించింది. పాప కళ్ళు తెరిచింది. జంతువులకి గొప్ప సంతోషం వేసింది. పాప వాటికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుని తనెందుకు వచ్చిందో వివరించింది.

” మేమూ వస్తాం నీతో ” అన్నాయి అవి. ” ఈ చలికి మేమూ తట్టుకోలేకపోతున్నాం ”

అంతా కలిసి మంచుదేవుడి భవనం చేరారు. వాకిలి మూసి ఉంది. పాప గట్టిగా కేక పెట్టి పిలిచింది. ఎవరూ పలకలేదు. చిన్న ఎలుకలూ ఉడతలూ ప్రతి కిటికీ దగ్గరికీ వెళ్ళి చూశాయి. ఒక కిటికీ మటుకు కొద్దిగా తెరుచుకుని ఉంది. అందులోంచి దూరి లోపలికి వెళ్ళి అవి తలుపు గడియ తీశాయి. గాజు  పలకల నడవాలగుండా నడిచి మంచు దేవుడి సభ కి వెళ్ళారు. అక్కడి సింహాసనం మలిచి స్ఫటికం తో మలిచి ఉంది. అందులో కూర్చుని మంచు దేవుడు – గాఢంగా నిద్రపోతున్నాడు. జంతువులు ఆయన ఒళ్ళోకీ భుజాల మీదికీ గెంతాయి. ఒక ఉడుత తన చిన్న తోకతో ఆయన ముక్కుని రాసింది. ఆయన తుమ్మాడు, మె లకువ వచ్చింది. నీలి రంగు కళ్ళతో వీళ్ళని చూసి నవ్వాడు.

” రండి, రండి. ఎందుకు వచ్చారు మీరు ? ” అడిగాడు.

పాప సంగతి అంతా చెప్పింది.

” అయితే మీరు లేపేవరకూ నేను నిద్ర పోతున్నానా ఏమిటి ? ”

” అవునండి ”

” ఇది నా సేవకులు, అదే మంచు గాలులూ మంచు తుఫాన్ లూ- వాళ్ళ పనే అయిఉంటుంది . మామూలు గా నేనింత మొద్దు నిద్ర పోనే పోను. ఈ పాటికి వాళ్ళందరినీ గదుల్లో పెట్టి తాళం వేసి ఉండేవాడిని, వసంతం వచ్చేసేది. వాళ్ళు ఎప్పటికీ అధికారం చలాయించాలని నన్ను నిద్ర పుచ్చినట్లున్నారు. ఎలా ? అవును, గుర్తొచ్చింది. నాకేదో కొత్తరకం టీ అని ఇచ్చారు. తాగుతుంటే నాకేదో అనుమానం గానే ఉండింది. మధ్యాహ్నం పడుకుని రాత్రికి లేవవలసినవాణ్ణి వారాల తరబడి నిద్రపోయాను. ఉండండి, అంతా చక్కబెడతాగా ”

little girl 4

చేతిలో ఉన్న వెండి ఈలని ఊదాడు. సేవకులంతా గజ గజా వణుకుతూ వచ్చి నిలుచున్నారు. వాళ్ళలో ఏ తప్పు చేయని వాళ్ళకి తలా ఒక టూత్ బ్రష్ ఇచ్చి,  వెళ్ళిఆకురాలే కాలం ముగిసేదాకా హాయిగా నిద్ర పొమ్మని చెప్పాడు. తప్పు చేసినవాళ్ళకి మాత్రం శిక్ష వేశాడు- వేడి వేడి మంటలు ఉన్న గదుల్లో వారం రోజులు గడి పేలా.

జంతువులకీ పాపకీ మంచి ఐస్ క్రీం తెప్పించి పెట్టాడు. పాప ధైర్యసాహసాలని మెచ్చుకుని ప్రత్యేకంగా సన్నటి వెండి గొలుసు కానుక ఇచ్చాడు. దానికి హృదయం ఆకారం లో ఉన్న స్ఫటికం వేలాడుతోంది. నిజం ఏదో మోసం ఏదో కనిపెట్టే శక్తిని ఆ స్ఫటికం ఇస్తుంది.

తలుపులు తెరుచుకుని బయటికి వచ్చేసరికి చెట్లన్నీ చిగిర్చి ఉన్నాయి. పూలు విచ్చుకుంటున్నాయి, పిట్టలు కువకువమంటున్నాయి….వసంతం వచ్చేసింది.

తిరుగు ప్రయాణం సులభంగా, సుఖంగా సాగింది. మళ్ళీ కలుసుకుందామని చెప్పుకుంటూ స్నేహితులు విడిపోయారు.

ఊర్లో అందరూ పాపని దేవతలాగా చూశారు. ఆమెని ఏ లోటూ లేకుండా పెంచేందుకు వాళ్ళ తాతకి అన్నీ ఇచ్చారు. చలికాలం ముగిసినందుకు వారం రోజుల పాటు ఉత్సవాలు చేసుకున్నారు .

  • బల్గేరియన్ జానపద గాథ
  • mythili

నూరేళ్ళ రజని: పాట ఆయన ఎగరేసిన పావురం!

2001_photo

” లలిత సంగీతం అనే పేరు ఎలా వచ్చింది ? ” అన్న నా ప్రశ్నని కొంత మార్చి ” లలిత సంగీతం ఎలా వచ్చింది ? ” అని నవ్వుతూ అడిగారు ఆయన కుమారులు బాలాంత్రపు హేమచంద్ర గారు.

” నా లోంచి ” – వంద గండుతుమ్మెదలు పలికాయి గొంతులో. ఆ చెప్పుకోవటం లోనూ పాటే ఉంది … విడిగా ఆయన ఉనికి లేదు ఇప్పుడు. బహుశా ఎప్పుడూ ఉండి ఉండదేమో కాని, ఈ శైశవ మౌగ్ధ్యం లో అసలు తెలియటం లేదు. కళా దేవి తన ప్రేమికులను యౌవనం నుంచి, ప్రౌఢత్వం నుంచి వృద్ధులను చేయక ఇలాగ పసివారిని చేస్తుందేమో.

అలా అని వారికి ఏవీ పట్టటం లేదనేమీ కాదు, మాకు అతిథిమర్యాదలూ పర్యవేక్షిస్తూనే ఉన్నారొక కంట.
‘’ Her whole life became a poem and a song ‘’ అని సరోజినీ నాయుడు గారి గురించి అన్నారని తెలుసు, ఇక్కడ దాన్ని దర్శించే వీలు కలిగింది. ఆ పాట కేవలం కలల్లో మ్రోగి ఊరుకునేది కాదు, పరిసరాలనూ పరిచయస్తులనూ ఆప్తులనూ సేవకులనూ తడిపి స్వచ్ఛం చేయగలిగినది.

ఈ 31 వ తేదీకి అధికమాసాలతో కలిపి వారికి నూరు సంవత్సరాలు పూర్తవుతాయట. ఆంగ్లమానం ప్రకారం తొంభై ఆరు. కొద్దిపాటి శారీరక అశక్తత లకు సాయం చేసేందుకు ఒక యువకుడు ఉన్నారు వారితో. అతను ప్రేమగా అడుగుతున్నాడు ” అది పాడండి, ఇది పాడండి ” అని.
ఇంటికివచ్చినవారి దగ్గర బిడ్డను పద్యాలు చెప్పమన్నట్లు ఉంది ఆ అడగటం. అతని మనసులో అంత మెత్తదనాన్ని మేల్కొలిపిన ఈయన ఆర్ద్రత ఎంతదో కదా..హాయిగా అనిపించింది చూస్తుంటే.
తెలుగు సాహిత్యపు సుకృతాలలో ఒకటి వేంకటపార్వతీశ్వర కవుల సాహిత్యం. ఆ జంట లో ఒకరి, బాలాంత్రపు వేంకటరావు గారి – పుత్రులు రజనీకాంతరావు గారు. వేంకటరావు గారి సేవకు సంతుష్ట అయిన సరస్వతి , తన మరొక కారుణ్యాన్ని, సంగీతాన్ని – వారి బిడ్డ పైన వరంగా కురిపించింది. ఆ గులాబీ నీటి జడి ఇంచుమించు అరవై ఏళ్ళ పాటు ఆంధ్రదేశాన్ని ముంచెత్తింది, ఇప్పటి శాంతపు విశ్రాంతి లోనూ ఆ సౌరభం స్ఫురిస్తూనే ఉంది.

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

రజని అంటే ఒక ఉత్సాహం, ఒక ఉత్సవం, ఒక జీవన సందేశం. ముదిమి లేని కౌముది.. (ఫోటో: దాసరి అమరేంద్ర)

” ఆయన వినికిడి అంత బాగాలేదు, ముఖాముఖీ వంటిదేమీ సాధ్యం కాదేమో ” నని వారి అబ్బాయి ముందే హెచ్చరించి ఉన్నారు. ఊరికే చూసేందుకు వస్తామని చెప్పాను. నా జీవన కాలం రజనీకాంతరావు గారి కాలాన్ని స్పర్శించగలగటమే గొప్ప సంగతి, మరింకేదైనా అదనమే. మేము వెళ్ళేసరికి చక్కగా, ఒక కేంద్రప్రభుత్వపు ఉన్నతోద్యోగి ఎలా ఉండాలో అలా, తయారై హాల్ లో కూర్చుని ఉన్నారు.

”ఏమైనా పాడతారా, వీళ్ళకోసం ? ” -వారి అబ్బాయి అడిగారు.
నేను ధైర్యం చేసి ” స్వైరిణీ అన్నారు నన్ను శ్యామసుందరా ” కోరుకున్నాను. లత గారి మోహనవంశీ మొదటి పుటలో ‘ theme song ‘ గా నాకు పరిచయమై, వెంటాడిన పాట అది. ఆయన ముఖం వెలిగింది, ” మీకు మంచి పాటలు తెలుసూ ” అని కితాబు ఇచ్చారు. పాడారు. ఇంతలో వారి కోడలు ప్రసూన వచ్చేశారు. ” ఆవిడ అడిగితే బోలెడు విషయాలు చెబుతారు, పాడతారు ”-అట. ఎదురుగా కూర్చుని లాలనగా వారి మోకాలి పైన అరచేయివాల్చి మృదువుగా ఆజ్ఞాపిస్తున్నారు ఆమె.

‘ ఓంకార పరివృత్తం విశ్వం ‘ పాడండి
పాడారు.
‘ ఓ విభావరీ ‘ పాడండి..
పాడారు.
‘కొండవాలులో ‘ పాడండి..
పాడారు.
‘ ప్రతిశ్రుతి ‘ … ఆ పాట ఎలా రాశారు ?
” మా పిఠాపురం లో బడికి వెళ్ళేప్పుడు ఒక వీధిలో అలా ప్రతిధ్వనులు వినిపించేవి , దాని గురించి రాశాను ”
‘’ మధువనస్వప్నం లోవి పాడండి. పాడారు.
” Puck,అదే, Robin good felow గుర్తున్నాడా ? ” నన్ను ప్రశ్నించారు.
” గుర్తున్నాడండీ ”
” అతను పాడతాడు ఇది ” – వివరించారు.

మనుమడు బాలాంత్రపు తేజతో ....

మనుమడు బాలాంత్రపు తేజతో ….

Shakespeare నాటకం ‘ Midsummer night’s dream ‘ ని సంగీతరూపకంగా మలచి పాటలు రాసి, స్వరపరచారు. అదొకటే కాదు, ‘ ఉమర్ ఖయాం ‘ , ‘ అవంతిసుందరి ‘[దశకుమార చరిత్ర నుంచి ] , ‘ దేవదాస్ ‘ , ‘ సిద్ధేంద్రయోగి ‘ , రవీంద్రుల ‘ చిత్ర ‘ , ‘ లైలా మజ్ఞు ‘, ‘ చండీదాస్ ‘ , ‘ శిలప్పదిగారం’ , ‘ కులీకుతుబ్ షా’ …లెక్కలేనన్ని రూపకాలు . వసంత , గ్రీష్మ, వర్ష, శరత్, హేమంత , శిశిరాలా పత్రాలుగా అలవోకగా రాలిన పాటలు. సాహిత్యం పట్ల గాఢమైన అభినివేశం ఉన్నవారు సంగీతరసజ్ఞులైతేఎటువంటి కళాకృతులు రాగలవన్నదానికి తార్కాణాలు అవన్నీ . వారి లోని కవిని సంగీతకారుడు కొన్ని సార్లు అధిగమించారనిపించినా, మెట్లవరుసలు వంటి గేయాలలో ఏ ఉత్తమ ఆధునిక కవికీ తీసిపోని ప్రతిభ కనిపిస్తుంది.

”గగనసీమలు కాలపరిధులు
గడచిపోయే మెట్లవరుసలు
జీవితమునకు మరణమునకూ
ఈవలావల కదలు వరుసలు
కుడిఎడమలే కానరాని
తుదిమొదళ్ళే తోచబోని –మెట్లవరుసలు
స్వప్నమధువుల జడులలోపల
స్వాంతమున జ్ఞాపకపు పొరలు
పొరలలోపల తెరలు తెరలుగ
పూర్వజన్మల ప్రేమకథలు- మెట్లవరుసలు..

పిఠాపురం రాజా వారి కళాశాలలో చదువు అయాక ఎం.ఏ కి ఆంధ్ర విశ్వవిద్యాలయం తోబాటు శాంతినికేతన్ కి కూడా దరఖాస్తు చేశారట. రెండు చోట్లా సీట్ వచ్చింది.

” వెళ్ళలేదేం మరి ? ” హేమచంద్ర గారు అడిగారు.
” అంధ్రా లో వచ్చిందిగా, దగ్గర గా ” – ఆరాటం లేదన్నమాట, హెచ్చేమో అనిపించే సౌందర్యం కోసం కూడా. అనవసర తాపత్రయాలు లేని జీవనం, అలాగని క్రియాశూన్యమైనది కాదు. అటువంటి తూకం ఉండటం అంత మేధావినీ pervert కాకుండా ఆపిందనిపించింది. సాటిలేని ప్రతిభ కారణంగా తోటివారు ఈర్ష్యాసూయలు చూపెట్టినా అవి వారిని తాకలేదు ఏనాడూ. చిన్నప్పుడు అన్నగారు నళినీ మోహన రావు గారు మంచి స్పోర్ట్స్ పర్సన్ గా ఉండేవారట. వీరూ ఆ పనేదో మొదలెడదామని ఒకనాడు పరుగుపందెం లో పాల్గొనబోయారట. మాస్టర్ విజిల్ వేసినా పరిగెత్తాలని తోస్తే కద, అక్కడే ఉండిపోయారు. తమకు అది సరిపడదని తెలుసుకున్నారట… ఆ తర్వాతెప్పుడూ ఏ పరుగు మీదా ప్రీతి లేదు , దారిప్రక్కన గులాబీలను ఆఘ్రాణిస్తూ హాయిగా నడిచారు, గమ్యం కోసం కాదు. ఆ నిశ్చింత వారికి ఆయుష్షునూ ఆరోగ్యాన్నీ ప్రసాదించింది.

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

కొడుకు హేమచంద్ర , కోడలు ప్రసూనతో

సంగమేశ్వర శాస్త్రి గారి శిష్యులు మండా కృష్ణమూర్తి గారి దగ్గర సంగీతం నేర్చుకున్నారు.బాల్యంలో పాటలు కట్టుకుంటున్నప్పుడే స్వరాలు వచ్చేసేవి, ఒక రాగపు ఛాయలో ఒదిగేవి. ఇరవై ఏళ్ళు దాటుతుండగా, 1937-40 మధ్యలో పూర్తి స్థాయి వాగ్గేయకారుడైనారు. తమ అభిరుచికి తగిన ఉద్యోగం లో ప్రవేశించారు. అలాగ కుదరటం ఎవరికోగాని పట్టని అదృష్టం. ఆచంట జానకిరాం, అయ్యగారి వీరభద్రరావు వంటి భావుకులూ ఉద్దండులూ అయినవారి దగ్గర రేడియో మాధ్యమాన్ని అవగాహన చేసుకున్నారు. గొప్ప సాహిత్యాన్నంతటినీ రేడియో ద్వారా వినిపించే పనిని ఆయన తానుగా మీద వేసుకున్నారు, ఆ క్రమం లో రెండు తరాల అభిరుచిని ఉన్నతం చేశారు. ఆ ఘనతేదో తామొక్కరికే దక్కాలని అనుకోనూలేదు. ఫలితంగా రేడియో కి ఒక సామూహిక నిత్యోత్సవంగా పేరు వచ్చింది.

తెలుగు లో శాస్త్రీయానికి మార్దవాన్ని జోడిస్తూ సుగమమైన సంగీతం మొదలైన కాలం అది-రజనీకాంతరావు గారు , ఎస్.రాజేశ్వర రావు గారు, రావు బాలసరస్వతి గారు, సీతా అనసూయ గార్లు- వీరంతా ఆ వైతాళికులు. ఇందరిలో వాగ్గేయకారులు రజని గారొక్కరే. ఆ తర్వాతి కాలం లో కొన్ని సినిమాలకు పనిచేస్తూ, ప్రభుత్వోద్యోగపు నిబంధనల వల్ల అన్నగారి పేరనా, బావ మరిది బుద్ధవరపు నాగరాజు గారి పేరనా పాటలు చేస్తూ పోయారు. బహిరంగరహస్యం ఒకటి – కృష్ణశాస్త్రి గారి ‘ జమీందారీ బద్ధకం ‘ కారణం గా పాటలు అందించలేకపోతే రజనిగారు రాసేసేవారు.

అలా కృష్ణశాస్త్రి గారి పేర చలామణీ అయిన పాటలలో ముఖ్యమైనది ‘ కొలువైతివా రంగశాయి ‘. పాట వారిది అంటే నూటికి తొంభైతొమ్మిది సార్లు రచన, వరస రెండూ అనే అర్థం. బి.ఎన్.రెడ్డి గారు, గోపీచంద్ గారు – వీరి సినిమాలలో రజని గారు తప్పకపనిచేయవలసిందే. రాజమకుటం లో ‘ ఊరేది పేరేది ‘ రజని గారి అద్భుతాలలో ఒకటి. గోపీచంద్ గారి ‘ మానవతి ‘ లో ‘ తన పంతమే ‘ , అరుదైనరాగం రసాళి లో చేశారు. బాలసరస్వతి పాడారు. అది వి.ఎ.కె. గారికి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెప్పారు. ఆ పాటను రజని గారి పేరన ప్రస్తావించనందుకు బాలసరస్వతి గారి పైన వి.ఎ.కె. గారికి కొంచెం కోపం కూడానట.

1950 తర్వాతి కాలం లో మీర్జాపురం రాజావారి సినిమా కి పనిచేస్తున్నప్పుడు ఎదురైన ఇబ్బంది వల్ల ఆయన సినిమాల్లోంచి తప్పుకున్నారు. అక్కడా వారి ‘ మట్టసం ‘ కనిపిస్తుంది, తమకు తగనిదేదో తెలుసుకొనే స్పష్టత. రేడియో లో ఉండిపోవటం ఎంతో స్థిమితాన్ని ఇచ్చింది, కీర్తితోబాటు. ఇక్కడ తమ పేరు ని దాచుకొనే అవసరం లేకపోయింది. తమ పాటలు మరొకరి పేర ఉంటే వారికి పట్టదు కాని, తమది కానిది తమది అనటాన్ని వెంటనే ఖండిస్తారు. చలం గారి మ్యూజింగ్స్ లో ‘ ఆ తోట లోనొకటి ఆరాధనాలయము ‘ పాట ను మెచ్చుకుంటూ అది రాశారు కనుక రజని అప్పటిదాకా రాసిన దేశభక్తి గేయాలన్నిటినీ క్షమించవచ్చు అంటారు. ఆ మాటలు అంతా చెప్పుకుంటారు. ఇంతకూ అది రాసినవారు ఎస్.రాజేశ్వర రావు గారి తండ్రి సన్యాసి రాజు గారు. మేము ఉండగా హేమచంద్ర గారు రజని గారిని సరదాగా మళ్ళీ అడిగారు ” ఆ తోటలోనొకటి పాట ఎవరు రాశారు ? ” అని.
” నేను కాదు ” ఖచ్చితంగా, చిన్న ఉక్రోషం తో బదులిచ్చారు రజని గారు.

1947 ఆగస్ట్ పదిహేను న ఉమ్మడి[14 వ తేదీ అర్థరాత్రి ] మద్రాస్ రాష్ట్రపు రేడియో కేంద్రం నుంచి ప్రసారమైన పాటలలో మొదటిది పట్టమ్మాళ్ గారు పాడినది. రెండవది టంగుటూరి సూర్యకుమారి గారు పాడిన రజని గారి పాట – ‘ మ్రోయింపుము జయభేరి ‘ . పెద్ద సంతోషం ,ఆ విషయం వింటూంటే అంతకన్న ప్రసిద్ధమైనది- ” మాదీ స్వతంత్ర దేశం , మాది స్వతంత్ర జాతి ‘ ఇవాళ విన్నా ఒళ్ళు జలదరిస్తుంది. ముఖ్యంగా ప్రారంభం లో వచ్చే trumpet ధ్వనులు. ఆ పాట 1948 ఆగస్ట్ పదిహేనున ప్రసారమైందట.

చిన్నపిల్లల కోసం ‘ జేజిమామయ్య పాటలు ‘ బోలెడన్ని కూర్చారు. .. ‘ దిబ్బరొట్టె అబ్బాయి ‘ వంటివి. 1961 లో రవీంద్రుల శతజయంతి. మొత్తం రవీంద్రసంగీతాన్నంతా తెలుగులోకి తెచ్చేశారు రజని. బెంగాలీ లో ఇంతకన్న బావుంటాయనిపించదు నాకు. అదొక ఆనంద సం రంభం ఆకాశవాణిలో. అపురూపమైన పాటలు అవి..కృష్ణనీ గోదావరినీ దాటించి సరాసరి పద్మానది తీరానికి ప్రయాణం చేయిస్తాయి. [వేంకటపార్వతీశ్వర కవులు చాలా బెంగాలీ నవలలని తెలుగులోకి అనువదించారు. వేంకటరావు గారి తమ్ముడు కలకత్తా విశ్వవిద్యాలయం లో చదువుకుంటూ బెంగాలీ పుస్తకాలు ఇంటికి తెచ్చేవారు. వీరు భాష నేర్చేసుకున్నారు. వారి ద్వారా రజని గారికి బెంగాలీ వచ్చిఉండటం గొప్ప మేలు చేసింది శ్రోతలకి]

ఆయన దిద్దినవారూ అంతేవాసులూ అనంతరకాలం లో ప్రసిద్ధులైనారు . బాలమురళీకృష్ణ గారు రజని గారిని గురుసమానులుగా చూసేవారిలో ఒకరు అంటే ఆశ్చర్యంగా ఉండవచ్చు, కాని అది నిజం. శ్రీరంగం గోపాలరత్నం గారితో కలిసి బాలమురళి గారు పాడిన రజని గేయం ‘ మనప్రేమ ‘ ఈ మధ్య , తిరిగి ఫేస్ బుక్ లోఆహ్లాద విహారం చేసింది. రజని గారి గేయాల సంపుటి ‘ శతపత్రసుందరి ‘ కి బాలమురళి గారు వినయంగా రాసిన ముందుమాట ఉంది .ఘంటసాల గారు ఎదుగుతూన్న దశ లో రజని గారి ఊత ను అందుకున్నారు.
1972 లో చలం గారిని చేసిన ఇంటర్ వ్యూ రజని గారి గొప్ప achievements లో ఒకటి. చలం గారి పరంగా రజని ఆప్తత, అధ్యయనం, గౌరవం కనిపిస్తాయి అందులో. వీటితోబాటు [అభిమానులని మినహాయిస్తే ] లోకం చలం గారిని చూసే చూపు రజని గారికి తెలుసు, చూడవలసిన చూపు ఎలా ఉండాలో కూడా.

కృష్ణశాస్త్రి గారితో రజని గారి అనుబంధం అతి ప్రత్యేకమైనది. అది ఇరుగుపొరుగుల ఆత్మీయతగా మొదలై ఇద్దరూ కలిసి కూర్చుని పాటలు చేసేవరకూ విస్తరించింది. ‘కృష్ణ రజని ‘ అని తమ గేయాల సంపుటికి పేరు ఉంచారు కృష్ణశాస్త్రి గారు.

ఆకాశవాణిలో సీనియర్ అధికారిగా ఆంధ్రప్రదేశ్ కు బయట కూడా పనిచేశారట. ఆ ఇతర రాష్ట్రాలలో ఏమి చేసి ఉంటారు ? బెంగళూరు కేంద్రం లో పనిచేస్తూ కన్నడం నేర్చేసుకున్నారు, కన్నడం లో పాటలు రాసేటంతగా. వాణీ జయరాం గారు పాడిన ఒక పాట ఆవిడకి చాలా ఇష్టమని హేమచంద్ర గారు చెబుతూండగానే ఆ పాట అందుకుని పాడేశారు రజని. డార్జిలింగ్ దగ్గరి కేంద్రం లో పనిచేస్తూ జయదేవుడి అష్టపదులను కొత్తగా పాడి, పాడించి రికార్డ్ చేశారట. ‘ శతపత్రసుందరి ‘ సంపుటం లో డార్జిలింగ్ చుట్టు పక్కల ప్రకృతి గురించి రాసిన రమ్యమైన గేయం ఉంది.

వ్యక్తిగా ఆయన గొప్పగా విజయవంతమైన వారని ఆ సాయంత్రం అర్థమైంది. కోడలు ప్రసూన గారి తల్లి దూబగుంట ఇందుమతి గారు అక్కడే ఉన్నారు. ఎంతో ఆప్యాయం గా చెబుతున్నారు వారి గురించి, తెల్లారగట్లే లేచి పాడుకుంటారని. ” మీరు ముందే బంధువులా ? ”- అడిగాను. ” లేదు, వీళ్ళ పెళ్ళి అయాకే ” ఆవిడ చెప్పారు. రజని గారి మానవసంబంధాలు అందమైనవి, అవ్యాజమైనవి.మనవలు ఇద్దరూ ఉన్నారు, తాతగారిని ముద్దుగా చూసుకుంటున్నారు. సంక్రాంతి పండగ కోసం బంధువులు వచ్చి ఉన్నారు. వారిలో ఒక అమ్మాయికి రజని గారే పేరు పెట్టారట ‘ తన్వి ‘ అని. మేఘదూతంలో నాయికను అలా సంబోధిస్తారట. అందుకని ఆ పేరు. పరమసౌందర్యవతి అయిన యువతిని వర్ణిస్తూ ‘ తన్వీ శ్యామా ‘ అని మొదలయే ఆ శ్లోకం స్పష్టంగా, పూర్తిగా ఉచ్ఛరించారు రజని. ‘’ యా తత్రస్తయత్ద్యువతి విషయే సృష్టిరాద్యేవ ధాతుః ” అన్న చివరి పాదాన్ని తన్మయంగా నొక్కి చెబుతూ.

నా తరపున ప్రసూన గారు అడుగుతున్నారు- ” మీకు ఇష్టమైన కవి ? ”
” ఏ భాషలో ?”
” ఒక్కొక్క భాషలో చెప్పండి, తెలుగులో ? ”
” శ్రీనాథుడు ” [ వారి తండ్రి గారు బాలాంత్రపు వేంకట రావుగారికీ శ్రీనాథుడు ఇష్టమట ] ” ఇంగ్లీష్ లో ?”
” షెల్లీ, కీట్స్ ”
” సంస్కృతం లో ? ”
” కాళిదాసు .కాళిదాసును మరచిపోతే నేను పనికిరాను ” రెట్టించి చెప్పారు. శాకుంతలం లోని ప్రఖ్యాత శ్లోకం” రమ్యాణి వీక్ష్య ” ను ప్రియమారా తెనిగించి స్వరపరచారు.

” బెంగాలీ లో ?”
” టాగూర్ ”
” ఒకరి పేరే చెప్పాలంటే ?”
అనుమానం లేకుండా చెప్పేశారు – ” టాగూర్ ” అని. కాళిదాసును తనలో ఒదిగించుకున్న కవి ఏమో, టాగూర్.

రాత్రి కొంత గడిచింది, ఆయన విశ్రాంతి తీసుకునే సమయమైంది. ఆయన కోసం ఇంటి ఎదురుగా అందమైన కుటీరం వంటిది నిర్మించి ఉంది , అందులోకి నిష్క్రమించారు. ఆయన గ్రంథాలయమంతా అక్కడ ఉంది. పాడనప్పుడంతా చదువుకుంటూనే ఉంటారట. కాసేపటికి , మేము వెళ్ళేందుకని బయటికి వస్తూ ఉంటే వెన్నెట్లో పూలమొక్కల మీదినుంచి తిరిగి ఆయన కంఠం వినబడుతూ ఉంది. ఆయన నిద్రపోయేదాకా పాడుకునే పాటలు కాబోలు అవి. రజని గారు వర్ధిల్లుతూన్న మధువనస్వప్నం .

-మైథిలి అబ్బరాజు

కొన్ని పాటలు 

[ఓ విభావరీ ]

 

[మన ప్రేమ – బాలమురళికృష్ణ , శ్రీరంగం గోపాలరత్నం ]

https://www.youtube.com/watch?v=GEq9MlJERvU

[ రవీంద్ర సంగీతం ]

https://www.youtube.com/watch?v=IYNUQPsRqn0

[చలం గారి తో ఇంటర్వ్యూ ]

బొమ్మను ప్రేమించిన అమ్మాయి

MythiliScaled

 

అనగనగా ఇటలీ లో ఒక ధనవంతుడైన వర్తకుడు. అతనికి బెట్టా అని ఒక్కతే కూతురు. ఆమెకి పెళ్ళి వయసు వచ్చింది. తండ్రి ఎన్ని సంబంధాలు చూసినా తనకి ఒక్కటీ నచ్చలేదు. ఇలా అన్నిటినీ వద్దనుకుంటూ పోతే ఇక తనకి పెళ్ళి కాదేమోనని వర్తకుడు దిగులుపడిపోయాడు, కాని కూతురిని బలవంతపెట్టాలని అనుకోలేదు.

ఒక రోజు అతను నగరం లో జరగబోయే పెద్ద సంతకి బయల్దేరుతున్నాడు. అక్కడినుచి ఏమైనా కావాలా అని కూతుర్ని అడిగాడు. బెట్టా అంది- ” నాన్నా ! ఒక బస్తా మేలిరకం చక్కెర , రెండు బస్తాల తీపి బాదం పప్పు, నాలుగైదు సీసాల పన్నీరు, కొంచెం కస్తూరి, ఇంకొంచెం సాంబ్రాణి, నలభై ముత్యాలు, రెండు ఇంద్రనీలమణులు, గుప్పెడేసి కెంపులూ పుష్యరాగాలూ , బంగారుజరీ దారపు చుట్ట, వీటన్నిటితోబాటు ఒక పెద్ద వెండి గిన్నే చిన్న వెండి తాపీ- ఇవన్నీ కావాలి ” .ఇవన్నీ ఎందుకా అని తండ్రికి ఆశ్చర్యం వేసింది. అన్నీ కలిపితే చాలా ఖరీదవుతాయి కూడా. అయినా , మారుమాట్లాడకుండా వచ్చేప్పుడు వాటన్నిటినీ పట్టుకొచ్చి కూతురికి ఇచ్చాడు.

pinto 1

బెట్టా అన్నీ తీసుకుపోయి తన గదిలో గడియ వేసుకుంది. బాదం పప్పుల పొడిలో చక్కెర , కస్తూరి, సాంబ్రాణి -వెండిగిన్నెలో కలిపి పన్నీరు పోసి ముద్ద చేసి దానితో అపురూపమైన అందం గల యువకుడి నిలువెత్తు బొమ్మని తయారు చేసింది. వెండి తాపీతో ముఖాన్ని తీర్చిదిద్దింది . తెల్లటి పుష్యరాగాలూ ఇంద్రనీలాలూ కళ్ళుగానూ, కెంపులను పెదవులుగానూ ముత్యాలను పలువరుసగానూ అమర్చింది. బంగారు జరీదారాన్ని మెత్తని చిక్కని పోగులుగా పేని జుట్టుగా పెట్టింది. ప్రాణం ఒకటీ లేదేగాని అద్భుతంగా ఉన్నాడు . బెట్టా ఆ బొమ్మయువకుడిని ప్రేమించింది. అతను మనిషిగా మారితే బావుండుననుకుంది.ఒకప్పుడు సైప్రస్ రాజు ప్రార్థిస్తే బొమ్మకి దేవతలు ప్రాణం పోశారని వినిఉంది. ప్రేమ దేవతని భక్తిగా శ్రద్ధగా వేడుకుంది, కొన్ని రోజులపాటు. దేవత కరుణించింది- బొమ్మ యువకుడు మెల్లిగా ఊపిరి తీసుకుని వదలటం మొదలుపెట్టాడు. ఆ తర్వాత పెదవులు కదిపి బెట్టా ని పలకరించాడు. చివరిగా కాళ్ళూ చేతులూ విదిలించి కదిలించి నడిచేశాడు కూడా. బెట్టాని చూస్తూనే అతనికిచాలా ఇష్టం వచ్చింది. అతనికోసమే అప్పటిదాకా బ్రతికిఉన్నానని బెట్టాకి అనిపించింది .

సంతోషంగా యువకుడి చేయిపట్టుకుని తండ్రి దగ్గరికి తీసుకువెళ్ళి – ” నాన్నా, నాకు పెళ్ళి చేయాలనే కదా మీ కోరిక ? ఇడుగో, ఇతన్ని ఎంచుకున్నాను ” అని చెప్పింది. కూతురి గదిలోకి ఎవరూ వెళ్ళలేదు, ఇతను ఎలా బయటికి వచ్చాడో తండ్రికి అర్థం కాలేదు. కాని ఎవరూ ఎప్పుడూ ఎక్కడా చూసిఉండనంత అందం గా ఉన్న ఆ యువకుడిని చూసి చాలా ఆనందించాడు.యువకుడికి పింటో స్మాల్టో అని పేరుపెట్టారు.   త్వరలోనే వాళ్ళిద్దరికీ పెళ్ళి ఏర్పాటైంది. పెద్ద విందు చేసి ముఖ్యమైన వాళ్ళందరినీ పిలిచారు. వాళ్ళలో ఒక దూరరాజ్యపు రాణి కూడా ఉంది. ఆ ఊళ్ళో ఆమె బంధువులు ఉన్నారు, వాళ్ళని బెట్టా తండ్రి విందుకి పిలిచాడు. ఆమె కూడా వాళ్ళతో అక్కడికి వచ్చింది. ఆమెకి పింటో చాలా చాలా నచ్చేశాడు అతని పెళ్ళి విందుకి వచ్చింది కాస్తా అతన్ని తనే పెళ్ళిచేసుకోవాలనుకుంది.పింటో కొత్తగా ప్రపంచం లోకి వచ్చాడు కనుక ఎవరితో ఎలా ప్రవర్తించాలో బెట్టా అతనికి చెప్పి నేర్పించింది. అయితే అతను పసిపాప అంత నిర్మలమైనవాడు, రాణి చెడుబుద్ధి అతనికి తెలియలేదు. అందరికీ ఇచ్చినట్లే రాణికీ వీడ్కోలు చెప్పేందుకు ఆమె కూడా వెళ్ళాడు. బెట్టా తక్కిన అతిథులతో ఇంటిలోపలే ఉండిపోయింది . రాణి అతని చేయి పట్టుకుని తన రథం లో ఎక్కించుకుని తన రాజ్యానికి ప్రయాణమైంది. ఆ రథానికి కట్టిన గుర్రాలు చాలా వేగంగా పరుగెత్తగలవు – అందుకని కన్నుమూసి తెరిచేలోపు రథం   వెళ్ళిపోయింది.

pinto 2

పింటో కోసం బెట్టా చాలాసేపు చూసింది. ఎవరితోనైనా మాట్లాడుతూ ఉండిపోయాడేమో నని కాసేపు, చల్లగాలికి బయటికి వెళ్ళాడేమోనని కాసేపు అనుకుని ఊరుకుంది. వచ్చినవాళ్ళంతా ఒక్కొక్కరూ వెళ్ళిపోయారు. చివరికి వెళ్ళి చుట్టుపక్కలంతా వెదికింది. ఎక్కడా లేడు పింటో. అతన్ని ఎవరో ఎత్తుకుపోయిఉంటారని అప్పటికి బెట్టాకి అర్థమైంది. వర్తకుడు సేవకులని పిలిచి అందినంతమేరా గాలించమని ఆజ్ఞాపించాడు. ఏమీ లాభం లేకపోయింది. బెట్టా ఏడ్చి ఏడ్చి చివరికి ఒకరోజున ధైర్యం తెచ్చుకుని తనే పింటో ని వెతుక్కోవాలని నిర్ణయించుకుంది. తండ్రికి తెలియకుండా , పేదపిల్లలాగా వేషం వేసుకుని, కావలసినవి తీసుకుని బయల్దేరింది.అన్ని ఊళ్ళూ తిరుగుతూ   కొన్ని నెలలపాటు వెతుకుతూనే ఉంది. అప్పుడు ఒక ఊళ్ళో ఒక పెద్దావిడ కలిసింది. ఆవిడ చాలా దయగలది. బెట్టా కథ అంతా విని జాలిపడింది. బెట్టా కి మూడు మంత్రాల వంటివి నేర్పింది. మొదటిది- ” ట్రిషే వర్లాషే – ఇల్లు కురుస్తోంది ” రెండోది – ” అనోలా ట్రనోలా – ఏరు పొంగుతోంది ” మూడోది – ” స్కటోలా మటోలా – సూర్యుడు వెలుగుతున్నాడు ”. బెట్టా కి ఏదైనా కష్టం వచ్చినప్పుడు ఈ మాటలు మూడుసార్లుగా పలికితే మేలు జరుగుతుందని హామీ ఇచ్చింది.

బెట్టాకి పెద్దగా నమ్మకమేమీ కలగలేదు. సరే, గుర్తుంచుకుంటే పోయేదేముందనుకుని పెద్దావిడకి ధన్యవాదాలు చెప్పి మళ్ళీ తనదారిన తను వెళ్తూ ఉంది. పోగా పోగా రౌండ్ మౌంట్ అనే నగరం వచ్చింది. మధ్యలో పెద్ద రాజభవనం. బెట్టా కి ఎందుకో పింటో అక్కడే ఉంటాడనిపించింది. దొడ్డిదారిన వెళ్ళి అక్కడి గుర్రపుసాలలో ఆ రాత్రికి తలదాచుకునేందుకు చోటు అడిగింది. గుర్రాలసాల ను చూసుకునేది ఒక ముసలివాడు. అతను చాలా మంచివాడు. బెట్టాని చూస్తే తన కూతురులాగా అనిపించి సాల పక్కనే ఉన్న తన చిన్న ఇంట్లో ఉండచ్చు, రమ్మని ఆహ్వానించాడు. బెట్టా అనుకున్నట్లే మరుసటి రోజే పింటో రాజభవనపు తోటలోదూరం నుంచి కనిపించాడు. ఏదో కలలో నడుస్తున్నట్లు దేన్నీ పట్టించుకోకుండా ఉన్నాడు అతను . జరిగిందేమిటంటే, పింటో నీ తీసుకొచ్చేశాక రాణి అతన్ని పెళ్ళిచేసుకోమని అడిగింది. పింటో తనకి పెళ్ళైపోయిందనీ బెట్టా దగ్గరికి వెళ్ళిపోతాననీ మొండికేశాడు.

అతన్ని ఒప్పించలేక రాణి ఒక మంత్రగత్తె ని సలహా అడిగింది. ఆమె ఒక మూలిక ఇచ్చి సంవత్సరం పాటు రోజూ అతనికి ఇస్తే జరిగిన దం తా మరచిపోతాడంది. రోజూ పింటోకి ఇచ్చే ఆహారం లో రాణి ఆ మూలిక కలుపుతూ వస్తోంది. పింటో జ్ఞాపకశక్తి చాలావరకు పోయింది. ఇంకా రాణిని పెళ్ళాడేందుకు ఒప్పుకోవటం లేదుకాని, కొద్ది రోజుల్లో సంవత్సరం పూర్తయిపోతుంది. పింటో తన ఇష్టం ప్రకారం అక్కడ ఉండిఉండడని బెట్టా కి తెలుసు, ఎలా అతన్ని అక్కడనుంచి తప్పించాలో తెలియలేదు. పెద్దావిడ చెప్పిన మొదటి మంత్రాన్ని మూడుసార్లు పైకి పలికింది. ” టిషే వర్లాషే- ఇల్లు కురుస్తోంది ” ఆ వెంటనే అక్కడొక చిన్న బంగారురథం ప్రత్యక్షమైంది. దాని మీదంతా రత్నాలు పొదిగి ఉన్నాయి. రథం దానంతట అదే ఆ తోట చుట్టూ ఉన్న కాలిబాట లో తిరగటం మొదలుపెట్టింది.

pinto3చూసినవాళ్ళంతా ఆశ్చర్యపడిపోయారు. అందరూ చూశాక బెట్టా దాన్ని పట్టుకుపోయి తన గదిలో పెట్టేసుకుంది. ఈ సంగతి రాణికి తెలిసింది.రాణికి అందమైన వస్తువులమీద చాలా వ్యామోహం, అవి ఎవరివైనా సరే. గుర్రాలసాల అతని ఇంటికి, బెట్టా గదిలోకి వచ్చి – ఆ బంగారు రథాన్ని తనకు అమ్మమని అడిగింది. బెట్టా అంది ” నేను బీదదాన్నేనండీ, కాని ఎంత డబ్బూ బంగారమూ ఇచ్చినా దీన్ని అమ్మను. ఒకటే కావాలి నాకు – ఇందాక ఒక అందమైన అబ్బాయి మీ భవనం లోకి వెళ్ళటం చూశాను, అతని గది తలుపు ముందు ఒక రాత్రంతా నన్ను గడపనిస్తే మీకిది ఇచ్చేస్తాను ” . ఈ పేదపిల్ల డబ్బూ బంగారమూ వద్దని ఇలా అడిగిందేమిటా అని రాణి విస్తుపోయింది . ” ఉట్టినే ఆ గదిముందు పడుకుంటాననే కదా అడిగింది.. అయినా పింటో ని పలకరిస్తుందో ఏమో, అతనికి నిద్రపోయే మందు ఇచ్చి పడుకోబెట్టేస్తే సరి, ఈమె ఎంత పిలిచినా జవాబు ఇవ్వడు ” అని పథకం వేసుకుంది.

 

రాత్రయింది. నక్షత్రాలు ఆకాశం మీదికీ మిణుగురులు నేల మీదికీ వచ్చాయి. రాణి రోజూ ఇచ్చే మూలికతోబాటు ,ఘాటైన నిద్రమందుని పాలలో కలిపి పింటో చేత తాగించింది. అతను పక్క మీద వాలగానే ఒళ్ళెరగకుండా నిద్రపోయాడు. అప్పుడు బెట్టా ఆ గదిముందుకు వచ్చింది. అతన్ని పిలిచింది, గట్టిగా అరిచింది, ఏడ్చింది- తన బాధనంతా వివరించి చెప్పుకుంది. అతను మాత్రం కళ్ళు విప్పనేలేదు . చూస్తుండగానే తెల్లారిపోయింది. రాణి వచ్చి బెట్టా ని రెక్క పట్టుకు లేపి ” చాలు కదా, ఇక వెళ్ళు ” అని పంపించేసింది. బెట్టా కోపంగా గొణుక్కుంది – ” నీకూ ఎప్పటికీ ఇదే చాలు, పింటో నిన్ను ప్రేమించనే ప్రేమించడు ”- అప్పటికిక చేసేదేమీలేక వెళ్ళిపోయింది.

 

మరుసటిరోజు బెట్టా రెండో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” అనోలా ట్రనోలా- ఏరు పొంగింది ” . ఈసారి మణులు చెక్కిన బంగారుపంజరం లో ముద్దొచ్చే పక్షి ఒకటి ప్రత్యక్షమైంది. అది కోయిలకన్నా తీయగా పాడుతోంది. విషయం తెలుసుకున్న రాణి మళ్ళీ వచ్చి బెట్టా ని పక్షిని అమ్మమని అడిగింది. బెట్టా నిన్నటిలాగే కోరింది. ఇవాళైనా పింటో కి తన మాటలు వినిపించవా అని ఆమె ఆశ. రాణికి ఇంకాస్త అనుమానం వచ్చింది. పింటోకి రెట్టింపు మోతాదులో నిద్రమందు ఇచ్చింది. ఆ తర్వాత కథంతా నిన్నటిలాగే జరిగింది. అయితే, ఆ గది పక్కనే ఉన్న వసారాలో దర్జీ అతనొకడు పనిచేసుకుంటున్నాడు. అతను ఎవరూలేని ఒంటరివాడు . సంవత్సరం పూర్తవుతూనేజరగబోయే తమ పెళ్ళిబట్టలు కుట్టటం కోసం రాణి అతన్ని అక్కడే ఉంచి రాత్రింబవళ్ళు పనిచేయిస్తోంది. అతను బెట్టా మాటలన్నీ విన్నాడు. పూర్తిగా అర్థం కాకపోయినా బెట్టా కీ పింటోకీ పెళ్ళయిందనీ అతను భార్యని వదిలేసివచ్చాడనీ తెలిసింది. రాణి మీద దర్జీ అతనికి మంచి అభిప్రాయమేమీ అదివరకే లేదు, ఇప్పుడు ఈ సంగతి తెలిసి కోపం కూడా వచ్చింది.

pinto4

 

మూడోరోజు పొద్దునే పింటో కి కుట్టే బట్టలకోసం కొలతలు తీసుకోవాలని కబురు చేశాడు. కొలతలు సరిగ్గా రావాలంటే పింటో తనని ఒంటరిగా కలవాలనీ చెప్పి పంపాడు. రాణి ఒప్పుకుని పింటోని పంపింది. దర్జీ తను విన్నదంతా పింటోకి చెప్పేశాడు. పింటోకి అంతా గుర్తొచ్చీ రానట్లుంది. ఎప్పటినుంచీ ఆపుకోలేనంత నిద్రవస్తోందో అడిగి తెలుసుకున్న దర్జీ ఆ రాత్రి పాలు తాగకుండా ఉండమని సలహా ఇచ్చాడు.

 

బెట్టా ఆ రోజున ఆఖరిప్రయత్నం చేయాలనుకుంది. మూడో మంత్రాన్ని మూడుసార్లు పలికింది – ” స్కటోలా మటోలా-సూర్యుడు వెలుగుతున్నాడు ”. ఈసారి చిన్న బంగారపు ఉగ్గుగిన్నె వచ్చింది. అందులోంచి రంగురంగుల , సుతిమెత్తని పట్టుబట్టలు, సన్ననిముత్యాలు కుట్టినవి బయటికి వచ్చాయి. వాటిని మడిస్తే అన్నీ ఆ ఉగ్గుగిన్నెలో పట్టేస్తున్నాయి, అంత పల్చటివి. రాణి అవీ కావాలంది, బెట్టా ఇదివరకులాగే అడిగింది. రెండు రాత్రులూ ఏమి కాలేదు కదా, ఇప్పుడింకేం ముంచుకొస్తుందిలెమ్మని రాణి సరేనంది. ఆ రాత్రి రాణి ఇచ్చిన పాలని పింటో ఆమె చూడకుండా పారబోశాడు. బెట్టా వచ్చి గదివాకిలిలో కూర్చుంది. ఆమెకేమీ ఆశ మిగల్లేదు. పింటోకి చెబుతున్నట్లు కాకుండా గడిచిందంతా తలుచుకుంటోంది. ”అద్భుతమైనవన్నీ కలిపి అత్యద్భుతమైన అతన్ని మలిచాను. ప్రేమదేవిని అడిగి ప్రాణం తెచ్చాను. అంతా అయాక కోల్పోయాను, అతను తిరిగి కనబడినా నా మాటలు వినబడటం లేదు…ఇదే చివరి రాత్రి   ” మేలుకునే ఉన్న పింటోకి అంతా వినిపించింది, గుర్తొచ్చింది.గబగబావెళ్ళి , బెట్టా ని కలుసుకున్నాడు. ఇద్దరూ ఒకర్నొకరు చూసుకుని ఆనందం పట్టలేక ఏడ్చారు. రాణి , బెట్టా నుంచి సంపాదించిన వస్తువులు తీసేసుకుని ఇద్దరూ రాత్రికి   రాత్రి బయల్దేరి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయారు. దర్జీ ని కూడా లేపి తమతో తీసుకుపోయారు. వీళ్ళని చూసి , బెట్టా తండ్రి సంతోషంతో చిన్నపిల్లవాడిలాగా గంతులు వేశాడు. అంతా సుఖంగా ఉన్నారు.

 

  • ఇటాలియన్ జానపదకథ , by Giambattista Baile      
  •  
  •                                                            [ from Pentamerone ]

తృప్తి ఫలం

Mythili

 

అనగనగా ఒకావిడకి ఇద్దరు  కూతుళ్ళు…రోలీ, పోలీ. వాళ్ళకి తండ్రి లేడు.   చూసేందుకు బాగానే ఉండేవారు కాని దురుసు గా, స్వార్థంగా  ప్రవర్తించేవారు. వాళ్ళు తనలాగే ఉంటారు కనుకే ఏమో, తల్లికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. తండ్రి బ్రతికి ఉండగా తన చెల్లెలు చనిపోతే ఆమె కూతురిని తెచ్చి వీళ్ళతో పెంచాడు. ఆయన పోయాక ఆ అమ్మాయి అక్కడే ఉంటుండేది. ఆమె పేరు క్రిస్టీన్. తనని చూస్తే ఎర్రగా పండిన ఆపిల్ పళ్ళూ విరబూసిన రోజాపూలూ గుర్తొచ్చేవి. అందం, మంచి స్వభావం  ఆమెలో పోటీ పడుతుండేవి. ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. అందుకని వాళ్ళ అత్తకి తనని చూస్తే చిరాకుగా ఉండేది. ఇంటి పనంతా  క్రిస్టీన్ చేయవలసి వచ్చేది.   ఆ తర్వాత ఎండలో తిరుగుతూ బాతులని కాస్తుండేది. ఆమె బట్టలు వెలిసిపోయి, చిరిగిపోయి ఉండేవి. రోలీ పోలీ మాత్రం చక్కటి సిల్క్ బట్టలలో  ముస్తాబై ఊరికే కూర్చునేవారు.

రోలీ , పోలీ లకి మెత్తని రొట్టె, గుడ్లు, చిక్కటి పాలు. క్రిస్టీన్ కి ఎండు రొట్టెలూ నీళ్ళ పాలు. ఆకలి తీరేదే కాదు.

ఒక రోజు క్రిస్టీన్ ఎప్పటిలాగే బాతులని మేపేందుకు కొండ మీది గడ్డి మైదానానికి బయలుదేరింది. చలికాలం రాబోతూ ఉంది. రోలీ పోలీ కి  టోపీల కోసం ఊలు అల్లేందుకు  దాన్నీ అక్కడికి తీసుకుపోతోంది. దోవలో చిన్న సెలయేరు ఉంది. దానీద చిన్న వంతెన. అక్కడొక చెట్టు కొమ్మకి ఊగుతూ  ఎర్రటి టోపీ ఒకటి కనిపించింది. దాని చివర్న ఒక వెండి గంట వేలాడుతోంది. అది చాలా ముద్దుగా ఉంది. క్రిస్టీన్ కాసేపు చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ లేరు, అది ఎవరిదీ అయినట్లు లేదు. ఉండబట్టలేక దాన్ని తీసుకుని జేబులోపెట్టుకుంది. ఎవరైనా అడిగితే ఇచ్చేయవచ్చులే అనుకుంది. కొంచెం దూరం నడిచిందో లేదో, వెనక నుంచి తనని ఎవరో పిలవటం వినబడింది.

చూస్తే చాలా పొట్టిగా , సన్నగా ఉన్న ముసలివాడు. టోపీ తనది, ఇచ్చేయమన్నాడు.

image1

క్రిస్టీన్ కి అతన్ని చూస్తే ఎందుకో సరదా వేసింది. ” మరి , అంత ఎత్తుగా ఉన్న కొమ్మ మీద ఎలా ఉంది నీ టోపీ ? చెప్పు, ఇస్తాను ” అంది.

” అదిగో, అక్కడ నేను చేపలు పట్టుకుంటూ కూర్చుంటే, సుడిగాలి వచ్చి ఎగరేసుకుపోయింది . ఇచ్చేయమ్మా, నీకు అయిదు వెండి నాణాలు ఇస్తాగా ”

క్రిస్టీన్ ఆలోచనలో పడింది. తన టోపీ తను తీసుకునేందుకు అతనెందుకు డబ్బు ఇస్తానంటున్నాడు ?

”ఊహూ. చాలదు. దీనికి వెండి గంట కూడా ఉంది కదా ” అంది, ఏమవుతుందో చూద్దామని.

” నూరు నాణాలు ఇస్తాను అయితే ” అతను అన్నాడు.

క్రిస్టీన్ కి అనుమానం ఎక్కువైంది. ” డబ్బు వద్దు నాకు. నేనేం చేసుకుంటాను ! ” – పెదవి విరిచింది.

” ఇది ఇస్తాను తీసుకో అయితే ” అని బొగ్గులాగా నల్లగా ఉన్న   గింజను చూపించాడు ముసలివాడు.

” ఇదెందుకు నాకు ? ”

” ఇది తృప్తినిచ్చే ఆపిల్  విత్తనం. దీన్ని నేలలో పాతితే ఆపిల్ చెట్టు మొలిచి ఒకే ఆపిల్ పండుని కాస్తుంది. అది అందరికీ కావాలనిపిస్తుంది, కాని నువ్వొక్కదానివే పండుని చెట్టునుంచి కోయగలవు. నీకు ఆకలి వేసినప్పుడు ఆహారమూ చలి వేస్తే వెచ్చ దనమూ ఆ పండు ఇస్తుంది. ఒక పండు కోయగానే ఇంకొకటి కాస్తుంది. చాలా ? నా టోపీ ఇచ్చేయి మరి ”

image2

క్రిస్టీన్ కి అంతకన్న ఏం కావాలి ! సంతోషంగా టోపీ ఇచ్చేసి గింజని తీసుకుంది. ముసలివాడు టోపీ తీసుకుని తలమీద పెట్టుకుని చటుక్కున మాయమై పోయాడు, కొవ్వొత్తి మంట  ఊదగానే   ఆరిపోయినట్లు.

ఇంటికి వెళ్ళాక క్రిస్టీన్ గింజని తన గది కిటికీ పక్కన పాతింది. మర్నాడు పొద్దునే బయటికి చూస్తే అక్కడ పెద్ద చెట్టు మొలిచి ఉంది. దానికి ఒకే ఒక ఆపిల్ పండు. సూర్యకాంతిలో బంగారం లాగా మెరుస్తోంది. వెళ్ళి దాన్ని కోసింది. చాలా తేలికగా ఊడి వచ్చింది అది. వెంటనే మరొక పండు వచ్చింది . క్రిస్టీన్ కి ఆకలిగా ఉండి పండు తినేసింది. అది చెప్పలేనంత రుచిగా ఉంది. ఆకలి పూర్తిగా తీరిపోయింది కూడా.

ఇంతలో ఇంట్లోంచి రోలీ వచ్చి చెట్టుకేసీ పండు కేసీ ఎగాదిగా చూసింది. విసురుగా చెట్టునుంచి తెంపబోయింది. అది అందకుండా పైపైకి వెళ్ళిపోయింది. అందుకునేందుకు రోలీ చెట్టు ఎక్కుతూనే ఉంది, చిటారు కొమ్మ దాకా. ఎంతకీ అది ఆమె చేతికి రాలేదు. అలిసిపోయి దిగిపోయింది. ఆమెకి విపరీతంగా కోపం వచ్చింది.

అప్పుడు పోలీ వచ్చింది. ఆమె కూడా అలాగే పండు కోసుకునే ప్రయత్నం చేసింది. తన పనీ అలాగే అయింది. ఊర్లో వాళ్ళు చాలా మంది కోయబోయారు, భంగపడ్డారు. ఎవరికీ ఆ తృప్తినిచ్చే ఆపిల్ అందలేదు. క్రిస్టీన్  మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోగలిగేది. ఆకలీ దాహమూ అలసటా తీరటమే కాక తను వేసుకున్న అతుకుల బట్టలే చాలా వెచ్చగా సుఖంగా అనిపించేవి. ఇక ఆ చుట్టు పక్క ఊర్లన్నిటిలోనూ క్రిస్టీన్ అంత సంతృప్తిగా ఎవరూ లేరు. ఊరికే  వచ్చే ఆ పళ్ళు తింటూండటం వల్ల క్రిస్టీన్ తిండికి అయే ఖర్చు తగ్గుతోంది కదా అని ఇంట్లోవాళ్ళు సరిపెట్టుకుని ఊరుకున్నారు .

ఒక రోజు ఆ దేశపు రాజు అటువైపు వచ్చాడు. ఈ ఆపిల్ చెట్టు చూశాడు. ఆయన ప్రజల నుంచి ఏదీ ఉచితంగా తీసుకోకూడదని అనుకునేవాడు. భటులని పిలిచి ఎంత డబ్బు అయినా , కుండెడు బంగారమైనా సరే, ఇచ్చి ఆ పండు తీసుకు రమ్మని చెప్పాడు.

వాళ్ళు వెళ్ళి ఇంటి తలుపు తట్టారు.

రోలీ పోలీ ల తల్లి తలుపు తీసి ఏం కావాలని అడిగింది.

” మా రాజు గారికి ఆ పండు కావాలి . డబ్బు ఇస్తారు, కావలిస్తే ”

ఆ చెట్టు మీద తనకేమీ హక్కు లేదని చెప్పకుండా,  ఆమె అంది – ” అబ్బో, అది చాలా ఖరీదుగా. ఎంత ఇస్తారేమిటి ? ”

భటులలో చిన్నవాడు చెప్పాడు- ” ఎంతయితే అంత. ఓ కుండెడు బంగారం సరిపోతుందా ? ‘’

” సరే. ఆ కుండెడూ బంగారమూ అక్కడ పెట్టి  వెళ్ళి కోసుకోండి ”

భటులు అలాగే ఇచ్చి పండు కోయబోయారు.

యథాప్రకారం ఆ పని ఎవరివల్లా కాలేదు. వెళ్ళి రాజుకి చెప్పారు- ఆ ఇంటావిడ పండు అమ్మనైతే అమ్మిందిగాని అది చేతిలోకి రావటం లేదని- ” మహారాజా, చుక్కలూ చందమామా అయినా అందుతాయేమోగాని అది మాత్రం అందటం లేదు’’

రాజు తన సేనాధిపతిని పంపాడు. అతను చాలా పొడుగ్గా , దృఢంగా ఉంటాడు. అయినా వట్టి చేతులతోనే వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.

అప్పుడు రాజు తనే వెళ్ళాడు. తను తప్పకుండా కోయగలననే ఆయన ధీమా. పొద్దుపోయేవరకూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.చేతులకంతా ఆపిల్ సువాసన అంటిందే కాని ఇంకేమీ జరగలేదు. ఇంక చాలించి కోటకి వెళ్ళిపోవలసి వచ్చింది.

అప్పుడు కూడా పండు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నిద్రలో దాని గురించే కలగన్నాడు. అందరు మనుషులలాగే ఆయనకీ ఆ వస్తు వు ఎంతగా అందకపోతే అంతగా కావాలనిపించింది. దిగులుపడిపోయాడు. కొలువు లో బాగా జ్ఞానం ఉన్న ఒకాయన ని పిలిచి రాజు  సలహా అడిగాడు.

ఆయన చెప్పాడు – ” ఆ చెట్టు ఎవరి సొంతమో వారికే ఆ పండు అందుతుంది మహారాజా! ఆ ఇంటావిడని అసలు సంగతి కనుక్కోండి ”

రాజు అప్పటికప్పుడు గుర్రమెక్కి అక్కడికి బయల్దేరి వెళ్ళాడు. ఇంటావిడా, రోలీ, పోలీ ఉన్నారు ఇంట్లో. క్రిస్టీన్ బాతులని మేపేందుకు వెళ్ళి ఉంది.

రాజు మర్యాదగా వాళ్ళని ఆ చెట్టు సొంతదారు ఎవరని అడిగాడు.

” ఇదిగో, మా పెద్దమ్మాయిదే ఆ చెట్టు ” అని రోలీని వాళ్ళ అమ్మ ముందుకి తోసింది.

” అలాగా ! వెంటనే ఆపిల్ కోసి నాకు ఇవ్వమనండి. ఆమెని పెళ్ళాడి ఈ రాజ్యానికి రాణిని చేస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయద్దు ”

ఇంటావిడ అంది ” అలా ఎలా మహారాజా ! వయసులో ఉన్న ఆడపిల్ల కదా, మీ ముందు తను చెట్టెలా ఎక్కుతుంది ? మీరు కోటకి వెళ్ళండి, తను పండు కోసి తెస్తుంది ”

సరే, త్వరగా పండు తెమ్మని హెచ్చరించి రాజు వెళ్ళిపోయాడు.

క్రిస్టీన్ కి కబురు పెట్టి, ఆమె  ఇంటికి రాగానే ఆ పండు వెంటనే కోసి ఇచ్చేయమనీ లేకపోతే తనని బావిలోకి తోసేస్తామనీ వాళ్ళు బెదిరించారు. చేసేదిలేక క్రిస్టీన్ ఆపిల్ కోసి ఇచ్చింది. రోలీ ఆ పండుని అందమైన రుమాలులో భద్రంగా చుట్టి కోటకి వెళ్ళి తలుపు తట్టింది. విషయం చెప్పగానే కాపలావాళ్ళు లోపలికి వెళ్ళనిచ్చారు. రాజు రుమాలు విప్పి చూస్తే ఏముంది…పండు ఉండవలసిన చోట గుండ్రటి రాయి ఉంది.

రాజు సేనాధిపతిని వాళ్ళ ఇంటికి పంపి, నిజంగా ఆ చెట్టు ఎవరిదో గట్టిగా గద్దించి అడగమన్నాడు.

ఈసారి ఇంటావిడ – ” తప్పైందండీ. అసలు ఆ చెట్టు మా చిన్నమ్మాయిది. పెద్దది కదా అని దాని పేరు చెప్పాను. మీరు వెళ్ళండి, అది పండు తెస్తుంది ” అని బుకాయించింది.

క్రిస్టీన్ ని మళ్ళీ భయపెట్టి పండు సంపాదించారు. పోలీ పెద్ద శాలువాలో దాన్ని చుట్టి పట్టుకెళ్ళింది. కోటకి చేరుతూనే

పండు కాస్తా చెక్కముక్కగా మారిపోయింది. రాజు చెడామడా తిట్టాడు. ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.

సేనాధిపతి వచ్చి నిజం చెప్పకపోతే అందరినీ చం పేయాల్సివస్తుందన్నాడు.

అప్పటికి ఇంటావిడ- ” ఆ, ఉందిలెండి, ఎందుకూ పనికిరాని ఒక పిల్ల. దాని దరిద్రపు మొహం రాజుగారికి చూపించటమెందుకులే అనుకున్నాను ” అంది.

” ఎవరయి తేనేం ? ఆమెని వెంటనే పంపి తీరాలి. ముందు నేను చూడాలి ” సేనాధిపతి అన్నాడు. ఇక తప్పక క్రిస్టీన్ ని పిలిపించారు. ఆమె పాతబట్టలలో ఉన్నా కూడా తన చక్కని రూపం, మొహం లో వివేకం, మంచితనం – సేనాధిపతికి కనిపించాయి. చప్పున వంగి నమస్కరించి విషయం చెప్పాడు.

image3

ఆపిల్ కోసుకుని క్రిస్టీన్ అతనితోబాటు బయల్దేరింది. ఆ  బీద అమ్మాయితో సేనాధిపతి వెళుతూండటం కోట చుట్టు పక్కల జనానికి వింతగా తోచింది. కొందరు పైకే నవ్వేశారు కూడా. అతను అదేమీ పట్టించుకోలేదు. రాజు కోరిక ఇప్పుడు తీరబోతోందని అతనికి నిశ్చయంగా తెలుస్తోంది.

” నువేనా చెట్టు సొంతదారువి ? ” రాజు అపనమ్మకంతో  అడిగాడు.

జవాబుగా క్రిస్టీన్ ఆయనకి ఆపిల్ ఇచ్చింది. రాజు  నోట్లోపెట్టుకుని కొరికాడు. వెంటనే ఆయనకి ఎంతో హాయిగా, సుఖంగా అనిపించింది. కోటలో వాతావరణం, మనుషులు- ఎవరి లోనూ ఏ వంకా లేదనిపించింది. ఎదురుగా ఉన్న  క్రిస్టీన్ ఆయనని బలంగా ఆకర్షించింది. ఆమెలాంటి దాన్ని అంతవరకూ చూడనేలేదని, ఆమె తనని పెళ్ళాడితే ఇంకేమీ అక్కర్లేదని , అనుకున్నాడు. క్రిస్టీన్ నిజంగానే అందమైనదీ మంచి దీ అయినా,  తృప్తి ఇచ్చే ఆపిల్ పండు తినటం వల్లనే రాజుకి ఆ విషయం తెలిసివచ్చింది. క్రిస్టీన్ రాజుని పెళ్ళాడేందుకు ఆనందంగా ఒప్పుకుంది.

త్వర లోనే వాళ్ళ పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి విందుకి రోలీ, పోలీ, వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. రాజు ముందు వద్దని అన్నా, క్రిస్టీన్ పెద్దమనసుతో వాళ్ళని రమ్మని పిలిచింది. ఆపిల్ చెట్టు ఇకమీదట తమకే సొంతమవుతుందని వాళ్ళు ఆశ పడ్డారు. అయితే అలా ఏమీ కుదరలేదు వాళ్ళకి. తెల్లా రేసరికి ఆపిల్ చెట్టు, కోటలో క్రిస్టీన్ గది బయట ప్రత్యక్షమైంది. అది ఆమెకి మాత్రమే దొరికిన వరం . ఆమె భర్త కనుక రాజుకీ అది అదృష్టమైంది , అందరిలాగే ఆయనకీ ఆ తృప్తినిచ్చే పండుని అప్పుడప్పుడూ రుచి చూడటం అవసరం కదా.

                                           సేకరణ – Howard Pyle

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ?

ఆప్తులని పోగొట్టుకున్న దుఃఖం కలిగించే దిగులు ఏ ఇద్దరిలోనూ ఒకేలాగా ఉండదు. మనకి తెలియకుండానే మనం సిద్ధపరచబడి ఉంటాము. జన్యులక్షణాలకి తోడు , ‘ ఈ స్థితికి ఇది, ఇంత, ఇన్ని రోజులు ‘ అనే లెక్క మనసులో పనిచేస్తూ ఉంటుంది. స్త్రీ పురుషుల మధ్య సామాజికభేదాలు ఇక్కడా వర్తిస్తూ ఉంటాయి. మగవాడు ఏడవకూడదు, దళసరి చర్మం తో ఉండాలి, వీలైనంత త్వరగా రోజువారీ పనులలో పడిపోవాలి అని ఆశించబడుతుంది. [ ఎవరి చేత ? తెలియదు. ] ఒకప్పుడు మగవాడు మాత్రమే సంపాదించి ఇల్లు గడపాలి కనుక, ఉమ్మడి సంసారాలలో స్త్రీ ఏడుస్తూ కూర్చున్నా ఎవరో ఒకరు ఆమె చేయవలసిన పనులు చేసిపెడతారు గనుక – దీనికి కొంత అర్థం ఉందేమో. ఇద్దరే ఉన్నప్పుడు అది సంక్లిష్టం . బిడ్డ పోతుంది- ఆ బిడ్డ ఇద్దరిదీ, దిగులు మాత్రం ఎవరిది వారిదే. అంతే అవకుండా – అవతలివారు ఇట్టే మామూలయిపోయారే అన్న బాధ, నింద ఉంటే ? అనిపిస్తున్నది సరిగా చెప్పగలిగే నేర్పు లేనప్పుడు ? అప్పుడెలా ?   దిగులుకి కొలతలూ గీటురాళ్ళూ ఏవి? ఎవరు నిర్ణయిస్తారు ?

ఇదే దుఃఖం, వాస్తవ ప్రపంచం లో-   అప్పటిదాకా సయోధ్య లేని రెండు జంటలలో -ఇద్దరిని విడదీయటం నాకు తెలుసు, మరో ఇద్దరిని దగ్గర చేయటమూ తెలుసు.

Robert Frost వి Stopping by woods on a snowy evening, The road not taken వంటి పద్యాలే నాకు తెలుసు అదివరకు, సంపుటమేమీ దొరకలేదు . అంతర్జాలం తెలిసిన కొత్తలో చదివిన ఈ పద్యం వెంటపడుతూనే ఉంది. దీన్ని అనువాదం చేయటం లేదు, నిజానికి ఇందులో అర్థం కానిదేమీ లేదు. నాకు అర్థమైనట్లుగా చెబుతున్నానంతే.

కవి తన జీవితం లో అటువంటి దుఃఖాన్ని, పుత్రశోకాన్ని- అనుభవించి ఉన్నారు, ఆ విషయానికి ప్రాధాన్యం ఉందో లేదో నాకు తెలియదు

దారుణమైన Communication gap ని ఇంత తక్కువ మాటలలో చెప్పటం కష్టం- కవి అనాయాసంగా చెప్పినట్లు అనిపిస్తుందే కానీ…

ఈ వేదనా మయమైన పద్యం సంభాషణలతో , కదలికలతో- ఒక నాటిక లాగా నడుస్తుంది. శోకం నుంచి బయటికి రాలేని, రాదలచుకోని భార్య- ఆ దుస్సంఘటన జరిగిన నాడు కూడా తన మనసుని ఏవో లోకసహజమైన మాటల్లో దాచి మటుకే చెప్పగలిగిన భర్త- ఇందులో. అతను ఆమెకి అర్థం కాడు, నచ్చడు. ఆమె అతనికి అర్థమవుతుంది, నచ్చజెప్పలేడు. అనాలనుకోనివి అంటాడు, అనకూడనివి కూడా, అప్రయత్నంగా, అవివేకంతో. ఆమె పోనీలే అని సహించదు , నిరంతరమైన దుఃఖపు జాతరని విడిచి కాస్త పక్కకి రాదు.   ఈ ద్వంద్వం పద్యం చివరలో కూడా విడిపోదు, వాళ్ళిద్దరూ ఒకటి కారు. పద్యానికి ఉంచిన శీర్షిక వారి బంధాన్ని కూడా ఉద్దేశించినదా అని గుండె గుబుక్కుమంటుంది. కాకూడదు, కాకపోతే బావుండును.

ఆమె ఒంటరిగా నిలుచుని మేడ మీది కిటికీ లోంచి చూస్తూ అతనికి కనిపిస్తుంది.ఏదో భీతి ఆమె ముఖం లో. ఆమెది గతాన్ని ఎట్టయెదుట చూడలేని భీతి, చూపు మరల్చుకోలేని యాతన.    ఆమె అలా చూస్తూండటాన్ని అతను తరచు చూస్తూనే ఉన్నా, ఆ రోజువరకూ దేన్నో ఎందుకో అడగాలని స్ఫురించదు. అది అతని స్వభావం – మామూలు మాటలలోకి రానిది ఏదైనా అతన్ని ఇబ్బంది పెడుతుంది. అడుగుతాడు, ఆమె చెప్పదు. తనూ చూస్తాడు. ” ఆమె చూడనిచ్చింది అతన్ని- గుడ్డివాడిని ” అంటారు కవి. నిజం గానే మొదట ఏమీ కనిపించదు అతనికి. మెల్లగా తెలుస్తుంది- అది వాళ్ళ కుటుంబపు స్మశానవాటిక- ఇంటి ఆవరణ లోనే. ఇక్కడా అతను వేరే ఎవరివో సమాధుల గురించి ముందు మాట్లాడతాడు, చివరన తమ చనిపోయినబిడ్డ ని దాచుకున్న మట్టిదిబ్బ గురించి.

images

దీన్ని మూడు విధాలుగా అర్థం చేసుకోవచ్చు- మొదట అతను నిజంగానే చలనం తక్కువ మనిషి కావచ్చునని, అందుకనే ఆ దృశ్యపు స్థూలమైన స్వరూపమే ముందు కనబడిందని.

రెండోది బిడ్డ సమాధి కనిపించినా ముందే దాని గురించి చెప్పేందుకు నోరు రాలేదని

మూడోది- అతను మనసుని ఎంత సమాధానపరచుకున్నాడంటే , చనిపోయిన బిడ్డ స్మృతి ని ప్రయత్నపూర్వకంగా వెనక్కి నెట్టి ఉంచే అలవాటు చేసుకున్నాడని. అతనితో కవి అనిపించిన మాటలు ” అలవాటైపోయింది, అందుకని గమనించలేదు ” అని.

ఎందుకైనా గానీ, అది ఆమెకి సరిపోదు. ” చెప్పకు, వద్దు ” అనేస్తుంది.

” ఏం ? పోయిన బిడ్డ గురించి ఒక మగవాడు తలచుకోనేకూడదా ? ” అంటాడు అతను. ఈ ప్రశ్న ఆమెనే కాదు, మగవాడు తన మనసు రాయి చేసుకోవాలని బోధించినవారినీ   అడుగుతున్నాడేమో. ఆ  సాధారణీకరణే ఆమెకి నచ్చనిది.

‘’ ఊపిరాడటం లేదు, వెళ్ళిపోతాను ఇక్కడినుంచి ‘’ – బయలుదేరుతుంది .

” వెళ్ళకు- ఈసారి మరొకరి దగ్గరికి ” అంటాడు అతను. ఎవరో పరాయివారి దగ్గర బాధను వెళ్ళబోసుకుంటూ ఉంటుంద న్నమాట.ఆమె వేదనని సరిగ్గా గుర్తు పట్టే ప్రయత్నం లో – నిన్నొకటి అడుగుతాను చెప్పమంటాడు. నీకెలా అడగాలో తెలిస్తే కదా అంటుంది ఆమె.

”తెలియకపోతే చెప్పచ్చు కదా ? ”

ఆమె ఏమీ మాట్లాడదు, పట్టించుకోదు.

” నీతో ఏమన్నా తప్పే. నీకు నచ్చేలా మాట్లాడటం నాకు చేతకాదు. కాని చెబితే నేర్చుకుంటాను కదా ? ” – ఎంతో సాదాగా, పరిచితం గా ఉన్నాయి కదా ఈ మాటలు…మన నాన్నల, అన్నల, భర్తల నుంచి విన్నవి- ఈ పద్యం అందు కూ పట్టి లాగుతుంది.

‘’ A man must partly give up being a man with women-folk. ‘’

ఈ మాటలను మరొకలా చెప్పటం అసాధ్యం.

” మనమొక ఒప్పందానికి వద్దాం- నీకు ఏ విషయం అపురూపమో నేను దాని జోలికి రాను, సరేనా ?

కాని ప్రేమ గల ఏ ఇద్దరూ అలాగ జీవించరాదు

ప్రేమ లేని చోట అలాగే బతకాలి, తప్పదు

ప్రేమే ఉంటే- ఆ అరమరికలు వద్దు-[ఈ మాటలు కవివి కూడా]

నీ దుఃఖం లోకి నన్ను రానీయవూ ? ఈ లోకానికి సంబంధిం చినదే అయితే – నాతో చెప్పకూడదూ ?”

అలౌకికమైనదైతే తన అనుభూతిలోకి రాదనే అతని అనుమానం. మరింకొకరితో మాత్రం పంచుకోవద్దని మళ్ళీ అర్థిస్తాడు.

‘’ వాళ్ళు అయినదేమిటి, నేను కానిదేమిటి ? ‘’

అంటూనే – ” నువు కాస్త అతి చేస్తావనిపిస్తుంది అప్పుడప్పుడు ” అని నోరు జారతాడు

” నువ్విలా కుమిలిపోతూ ఉంటే – ఏ లోకాన ఉన్నాడో గానీ, వాడికేమి మేలు, చెప్పు ? ” అని తర్కిస్తాడు.

దుఃఖం ఏనాడయినా తర్కం తో శమించిందా !

ఆమె ముఖం లో తిరస్కారం.   అతనికి కోపం వస్తుంది.

”ఏమి ఆడదానివి నువ్వు ? పోయిన నా బిడ్డ ని నేను తలచుకుంటే- ఇంత రాద్ధాంతమా? ”

” నీకు తలచుకోవటం వచ్చా ? ఏ మాత్రం సున్నితం ఉన్నా నీ చేతులతో నువ్వే వాడిని పాతిపెట్టే గొయ్యి తవ్వుతావా ? నేను చూస్తూనే ఉన్నాను, ఈ కిటికీ లోనుంచే- ఎంత బలంగా తవ్వావు అప్పుడు ! గులక రాళ్ళు గాలిలో కి ఎగిరెగిరి పడేలాగా…అది నువ్వని గుర్తే పట్టలేదు నేను ”

ఆమె దూషించిన ఆ చర్యే- భగ్నతతో, నిస్సహాయమైన క్రోధం తో జరిగిఉండవచ్చని ఆమెకి తట్టదు. అతనికీ వివరణ, సమర్థన తెలియవు .

” తడిబూట్లతోనే లోపలికి వచ్చావు, ఆ మట్టిని ఇంట్లోకి తేగలిగావు . అప్పటి నీ మాటలు బాగా గుర్తు నాకు ” ఆమె అంది, అతనికీ గుర్తున్నట్లే ఉంది. ” దౌర్భాగ్యుడిని నేను దేవుడా, నవ్వొస్తోంది నాకు- దరిద్రపు నవ్వు ” అని నొచ్చుకున్నాడు .

ఆమె అదే ధోరణిలో – ” ఏమన్నావు నువ్వు ? మూడు రాత్రులు మంచు కురిస్తే, ఒక రాత్రి వర్షం వస్తే – మనిషి వేయగలిగిన ఏ కంచె అయినా కుళ్ళిపోతుందనలేదూ ? అవన్నీ మాట్లాడేందుకు అదా సమయం ? ” -ఆరోపించింది.

ఆ మాటలు బిడ్డ విషయం లో మానవప్రయత్నం అంతా వృధా అవటాన్ని సూచించాయని ఆమె అనుకోదు, అతనూ చెప్పడు- నమ్మదేమో అనా ? కవి చెప్పరు.

ఆమె అంటూనే ఉంది ” పోయినవారితో అంత దూరమూ ఎవరూ పోలేరు నిజమే, కాని మరీ అంత కొద్ది దూరమే అయితే అసలు వెళ్ళనే అక్కర్లేదు. అంత తొందర్లోనే బతికిన మనుషుల వైపుకి, తెలిసిన సంగతులలోకి, ఎవరి ప్రపంచం లోకి వాళ్ళువెళ్ళాలనుకుంటారు కదా, మృత్యువెంత ఒంటరిది ! లోకమెంత చెడ్డది…మార్చలేను కదా దీన్ని ”

అతనికి జాలేసింది – ” పోనీలే, అనాలనుకున్నవన్నీ అనేశావుగా, కొంచెం తేలికపడి ఉంటావు. ఏడుస్తూనే ఉన్నావు, వెళ్ళకు ఎక్కడికీ ‘’

” నీకలాగే ఉంటుంది. అంతటితో తీరుతుందా ..నీకేం చెప్పలేను అసలు- ఉండలేను, వెళతాను ”

ఆమె తలుపు తీస్తోంది…అతను కేక పెట్టాడు, వదులుకోలేక – ” ఎక్కడికి ? చెప్పి వెళ్ళు…నువ్వెక్కడికి వెళ్ళినా నీ వెనకే వస్తాను, వెనక్కి తెస్తాను- బలవంతంగా ”

పద్యం ముగిసింది.

http://www.poetryfoundation.org/poem/238120

He saw her from the bottom of the stairs

Before she saw him. She was starting down,

Looking back over her shoulder at some fear.

She took a doubtful step and then undid it

To raise herself and look again. He spoke

Advancing toward her: ‘What is it you see

From up there always—for I want to know.’

She turned and sank upon her skirts at that,

And her face changed from terrified to dull.

He said to gain time: ‘What is it you see,’

Mounting until she cowered under him.

‘I will find out now—you must tell me, dear.’

She, in her place, refused him any help

With the least stiffening of her neck and silence.

She let him look, sure that he wouldn’t see,

Blind creature; and awhile he didn’t see.

But at last he murmured, ‘Oh,’ and again, ‘Oh.’

 

‘What is it—what?’ she said.

 

‘Just that I see.’

 

‘You don’t,’ she challenged. ‘Tell me what it is.’

 

‘The wonder is I didn’t see at once.

I never noticed it from here before.

I must be wonted to it—that’s the reason.

The little graveyard where my people are!

So small the window frames the whole of it.

Not so much larger than a bedroom, is it?

There are three stones of slate and one of marble,

Broad-shouldered little slabs there in the sunlight

On the sidehill. We haven’t to mind those.

But I understand: it is not the stones,

But the child’s mound—’

 

‘Don’t, don’t, don’t, don’t,’ she cried.

 

She withdrew shrinking from beneath his arm

That rested on the banister, and slid downstairs;

And turned on him with such a daunting look,

He said twice over before he knew himself:

‘Can’t a man speak of his own child he’s lost?’

 

‘Not you! Oh, where’s my hat? Oh, I don’t need it!

I must get out of here. I must get air.

I don’t know rightly whether any man can.’

 

‘Amy! Don’t go to someone else this time.

Listen to me. I won’t come down the stairs.’

He sat and fixed his chin between his fists.

‘There’s something I should like to ask you, dear.’

 

‘You don’t know how to ask it.’

 

‘Help me, then.’

 

Her fingers moved the latch for all reply.

 

‘My words are nearly always an offense.

I don’t know how to speak of anything

So as to please you. But I might be taught

I should suppose. I can’t say I see how.

A man must partly give up being a man

With women-folk. We could have some arrangement

By which I’d bind myself to keep hands off

Anything special you’re a-mind to name.

Though I don’t like such things ’twixt those that love.

Two that don’t love can’t live together without them.

But two that do can’t live together with them.’

She moved the latch a little. ‘Don’t—don’t go.

Don’t carry it to someone else this time.

Tell me about it if it’s something human.

Let me into your grief. I’m not so much

Unlike other folks as your standing there

Apart would make me out. Give me my chance.

I do think, though, you overdo it a little.

What was it brought you up to think it the thing

To take your mother-loss of a first child

So inconsolably—in the face of love.

You’d think his memory might be satisfied—’

 

‘There you go sneering now!’

 

‘I’m not, I’m not!

You make me angry. I’ll come down to you.

God, what a woman! And it’s come to this,

A man can’t speak of his own child that’s dead.’

 

‘You can’t because you don’t know how to speak.

If you had any feelings, you that dug

With your own hand—how could you?—his little grave;

I saw you from that very window there,

Making the gravel leap and leap in air,

Leap up, like that, like that, and land so lightly

And roll back down the mound beside the hole.

I thought, Who is that man? I didn’t know you.

And I crept down the stairs and up the stairs

To look again, and still your spade kept lifting.

Then you came in. I heard your rumbling voice

Out in the kitchen, and I don’t know why,

But I went near to see with my own eyes.

You could sit there with the stains on your shoes

Of the fresh earth from your own baby’s grave

And talk about your everyday concerns.

You had stood the spade up against the wall

Outside there in the entry, for I saw it.’

 

‘I shall laugh the worst laugh I ever laughed.

I’m cursed. God, if I don’t believe I’m cursed.’

 

‘I can repeat the very words you were saying:

“Three foggy mornings and one rainy day

Will rot the best birch fence a man can build.”

Think of it, talk like that at such a time!

What had how long it takes a birch to rot

To do with what was in the darkened parlor?

You couldn’t care! The nearest friends can go

With anyone to death, comes so far short

They might as well not try to go at all.

No, from the time when one is sick to death,

One is alone, and he dies more alone.

Friends make pretense of following to the grave,

But before one is in it, their minds are turned

And making the best of their way back to life

And living people, and things they understand.

But the world’s evil. I won’t have grief so

If I can change it. Oh, I won’t, I won’t!’

 

‘There, you have said it all and you feel better.

You won’t go now. You’re crying. Close the door.

The heart’s gone out of it: why keep it up.

Amy! There’s someone coming down the road!’

 

You—oh, you think the talk is all. I must go—

Somewhere out of this house. How can I make you—’

 

‘If—you—do!’ She was opening the door wider.

‘Where do you mean to go?  First tell me that.

I’ll follow and bring you back by force.  I will!—’

mythili

 

 

భగవంతుడి స్నేహితుడు

MythiliScaled

అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు . కొండల మీదంతా చక్కని పళ్ళతోటలు- వాటిలో పీచ్, మల్ బెర్రీ , ద్రాక్ష లాంటి పళ్ళు విరగకాసేవి.

కరీం ఒక ధనవంతు డి పొలం లో పని చేసేవాడు. అతనికీ కుటుంబానికీ సరిపడా తిండీ బట్టా తప్పించి అతనికి డబ్బుగా జీతమేమీ వచ్చేది కాదు.డబ్బు పేరు వినటమేగాని ఎన్నడూ చూసి ఎరగడు.

ఇలా ఉండగా ఒక రోజున యజమాని కి కరీం చేసేపని బాగా నచ్చి పది రియాల్ లు [ వెండి నాణాలు ] అతని చేతికి ఇచ్చాడు. ఎలా కావలిస్తే అలాగ ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పాడు.కరీం కి అది చాలా ఎక్కువ డబ్బు అని తోచింది. ఇంటికి వెళుతూనే ఆ నాణాలని భోజనాల బల్ల మీద పరిచి- ” జెబా, చూడు ! నిధి దొరికింది మనకి ” అని సంతోషంగా అరిచాడు. భార్యా పిల్లలూ చాలా మురిసిపోయారు. కరీం వాళ్ళతో అన్నాడు – ” చెప్పండి మరి, వీటితో ఏం చేద్దాం ?   మషాద్ నగరం ఇక్కడికి ఇరవై మైళ్ళే కదా, అక్కడి ఇమాం రజా సమాధి మీద రెండు నాణాలు సమర్పించి ఆ తర్వాత బజారుకి వెళతాను. అక్కడ మీకేంకావాలంటే అది కొనుక్కొస్తాను ”

” నాకొక పట్టుతాను కావాలి, కొత్త దుస్తుల కోసం ” – భార్య అడిగింది.

” నాకొక మంచి గుర్రమూ కత్తీ ” యూసఫ్ అడిగాడు. అతను బాగా చిన్నపిల్లవాడు .

” నాకొక కాశ్మీరు శాలువా, జలతారు చెప్పులు ” వయసు వస్తూన్న కూతురు ఫాతిమా అడిగింది.

” ఓ.తప్పకుండా. రేపు రాత్రికల్లా మీరు కోరినవన్నీ వచ్చేస్తాయి ” అని ధీమాగా చెప్పేసి కరీం నగరానికి బయలుదేరాడు.

కొండలు దిగి మైదానం లోంచి నడిచి అతను మషాద్ నగరం చేరాడు. ఆ నగరపు వైభవాన్నీ , ఎత్తైన భవనాలనీ , ధగధగమనే మసీదుల గోపురాలనీ చూసి బోలెడంత ఆశ్చర్యం వేసింది అతనికి. ముందు ఇమాం రజా సమాధి ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. వాకిట్లో ఉన్న పెద్దాయనని ” నేను లోపలికి వెళ్ళచ్చా ?” అని అడిగాడు. ” అలాగే , వెళ్ళునాయనా ! నీకు ఉన్నదానిలోంచి ఇవ్వగలిగినంత అక్కడ అర్పించు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు ” అని బదులిచ్చాడు ఆయన.కరీం లోపలికి వెళ్ళాడు. ఆసియా ఖండం మొత్తం నుంచీ అక్కడికి భక్తులు వస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలతో ఆ క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. బంగారు, వెండి నగలూ పాత్రలూ ఖరీదైన తివాసీలూ కుప్పలు పోసి ఉన్నాయి అక్కడ. కరీం అవన్నీ నోరు తెరుచుకుని చూసి, రెండు వెండి నాణాలని బెరుకు బెరుకుగా సమాధి మీద ఉంచి వెనక్కి తిరిగాడు. ఇప్పుడు అతని దగ్గర ఎనిమిది నాణాలు మటుకే ఉన్నాయి.

La_civilització_del_califat_de_Còrdova_en_temps_d'Abd-al-Rahman_III

చాలా రద్దీగా, హడావిడిగా ఉన్నాయి అక్కడి బజార్లు. ఒక్కొక్క వస్తువు అమ్మేందుకుఒక ప్రత్యేకమైన బజారు ఉంది. పళ్ళకి ఒకటి, పాత్రలకి ఒకటి, నగలకి ఒకటి, రొట్టెలకి ఒకటి – ఇలాగ. అన్నీ దాటుకుని చివరికి పట్టు వస్త్రాలు అమ్మే చోటికి వచ్చాడు.

ఒక దుకాణం లో ప్రవేశించి అవీ ఇవీ తిరగేసి ఆఖర్న జరీ పని చేసిన వంగపండు రంగు పట్టు తానుని ఎంచుకున్నాడు. ” ఇది తీసుకుంటాను, వెల ఎంత ? ” అని దుకాణదారుని అడిగాడు.

” మామూలుగా నాలుగు వందల వెండినాణాలు అండీ. మీరు కొత్తగా ఇక్కడ అడుగుపెట్టారు కనుక మీకు రెండువందలకే ఇస్తాను, తీసుకోండి ” దుకాణం అతను చెప్పాడు.

” ఏమిటీ, రెండు వందలా? మీరేదో పొరబడినట్లున్నారు. చూడండి- ఇటువంటి నాణాలేనా, రెండు వందలు ? ” తన దగ్గర ఉన్న రియాల్ ని చూపించి అడిగాడు కరీం.

” ఆ, కాక ఇంకేమిటనుకుంటున్నారు ? రెండువందలు దీనికి చాలా సరసమైన ధర ” అని దుకాణం అతను జవాబు ఇచ్చాడు. కరీం దగ్గర ఎనిమిది నాణాలే ఉన్నాయనీ వాటితోనే అతను పట్టు తానూ కత్తీ గుర్రమూ కాశ్మీరు శాలువా జరీచెప్పులూ అన్నిటినీ కొనదలచుకున్నాడనీ విని కరీం ని బయటికి గెంటాడు. ” అడ్డమైన ప్రతివాడూ వచ్చి నా పట్టు తానులు ముట్టుకునేవాడే ” అని తిట్టాడు.

(c) Wellcome Library; Supplied by The Public Catalogue Foundation

నిరాశ తో ఈసారి గుర్రాలు అమ్మే చోటికి వెళ్ళాడు కరీం. బాగా చవకైన గుర్రానికి రెండువందల యాభై నాణాలు ఇవ్వాలని తెలిసింది. కరీం దగ్గర ఉన్న డబ్బు ఎంతో విన్న అక్కడివాళ్ళు దానికి గాడిదలో పదహారోవంతు కూడా రాదని వెక్కిరించారు. కత్తి ధర కనీసం ముప్ఫై నాణాలు, జరీ చెప్పులది యాభై , కాశ్మీరు శాలువాలలో బాగా నాసిరకం దానికి పన్నెండు నాణాలు చెల్లించాలి.

దేన్నీ కొనలేనన్న బాధతో, అలసటగా , కరీం ఊరికి ప్రయాణం అయాడు. దారిలో ఒక బిచ్చగాడు ఎదురై ” అయ్యా, ధర్మం చేయండి. రేపు శుక్ర వారం, పవిత్రమైన రోజు. బీదవాడికి ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్లే, అల్లా మీకు వందరెట్లు వెనక్కి ఇస్తాడు ” అని అడుక్కుంటున్నాడు.

కరీం కి ఆపాటికి డబ్బు మీద విసుగుపుట్టి ఉంది. ” నా దగ్గర ఉన్నదాంతో తృప్తి పడగలవాడివి నువ్వొక్కడివే ” అని బిచ్చగాడితో అంటూ తన ఎనిమిది నాణాలనీ అతనికి ఇచ్చే సి వట్టి చేతులతో వెనక్కి వెళ్ళాడు

వాళ్ళ ఇంటి ముంగిట్లోనే ఎదురు చూస్తూ ఉన్న కొడుకు యూసఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి ” నాన్నా, కత్తీ గుర్రమూ ఏవీ ? ” అని అడిగాడు. ఆ వెంటనే వచ్చిన భార్యా కూతురూ కూడా తమ వస్తువుల కోసం అడిగారు. అంతా విన్నాక భార్య జెబా మండిపడింది. ఎనిమిది నాణాలు బిచ్చగాడికి ఇచ్చాడని యజమానికి ఫిర్యాదు చేసింది.

యజమానికీ చాలా కోపం వచ్చింది. కరీం ని పిలిచి తెగ చీవాట్లు పెట్టాడు. ” నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావోయ్ ? పెద్ద జమీందారువా నువ్వు ? బిచ్చగాడికి నేనే ఒక్క రాగినాణెం ఇస్తుంటాను , నువ్వు ఎనిమిది వెండినాణాలు ఇవ్వవచ్చావా ? ” అని కోప్పడి, శిక్షగా అక్కడికి కొంతదూరం లో ఉన్న ఎడారికి పొమ్మన్నాడు. అందులో యజమానికి కొంత భూమి ఉంది . అక్కడ మండుటెండలో పనిచేసి , నీళ్ళు పడేదాకా   తవ్వి అప్పుడు తిరిగి రమ్మన్నాడు.

కరీం   అలాగే వెళ్ళి రోజులతరబడి తవ్వుతూ పోయాడు. చివరికి నీరు పడింది, దాంతోబాటు ఒక ఇత్తడి బిందె కూడా దొరికింది. దాని మీదంతా నగిషీలు చెక్కి ఉన్నాయి. నిండుగా వజ్రాలూ వైఢూర్యాలూ. అవేమిటో కరీం కి తెలియలేదు. కాని మషాద్ నగరపు బజార్లలో అటువంటివి అమ్మటం చూసిఉన్నాడు. వీలు కుదరగానే వెళ్ళి తనూ అమ్మగలిగితే కాస్త డబ్బు వచ్చి భార్య కోపం తగ్గుతుందని అనుకున్నాడు.

ఎడారిలో నీరు పడటం వల్ల యజమానికి ఆనందం కలిగింది. కరీం కష్టానికి జాలిపడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నాడు. మరుసటిరోజు కరీం జేబునిండా వజ్రాలు నింపుకుని నగరానికి వెళ్ళాడు. ఒక నగలదుకాణం లో అద్దాల కిటికీ లో అటువంటి రాళ్ళు ఉండటం గమనించి వెళ్ళి దుకాణదారుని అడిగాడు ” ఇటువంటి రాళ్ళు అమ్మితే కొంటారా ? ”

కరీం ని చూస్తే వజ్రాలు అమ్మగలిగేవాడు గా కనిపించలేదు. దుకాణం అతను వెటకారంగా ” ఏం ఉన్నాయేమిటి నీ దగ్గర ? ” అన్నాడు.

” ఇదిగో ” అని ఒకటి చూపించాడు కరీం. ” నా జేబునిండా ఉన్నాయి తెలుసా ” అనీ చెప్పేశాడు.

దుకాణం అతను ఆశ్చర్యపోయాడు. కరీం వాటిని దొంగిలించి ఉంటాడని నిర్ణయించుకుని అతన్ని మాటల్లో పెట్టి , నౌకరుతో రక్షక భటులకి కబురు చేశాడు. వాళ్ళు అడిగితే కరీం అంతా చెప్పుకొచ్చాడు. భూమిలో దొరికిన సొత్తు ఏదైనా సుల్తాన్ కి చెందుతుంది కనుక కరీం మీద నేరాన్ని మోపి అతన్నీ కుటుంబాన్నీ చెరలో పెట్టి ఇత్తడిబిందెను స్వాధీనం చేసుకుని ఖజానాకి పంపారు. కరీం కి ఆ బిందె సుల్తాన్ ది అవుతుందనే సంగతి తెలియదు.

Art Painting (45)

ఇదంతా జరిగిపోవటం సుల్తాన్ వరకూ వెళ్ళలేదు. కాని అతనికి ఒకే కల పదే పదే రావటం మొదలైంది. కలలో ఒక గొంతు ” అల్లా స్నేహితుడిని విడిపించు ” అంటూ ఉంది. ముందు పట్టించుకోకపోయినా, ఒక రాత్రి కలలోనే సుల్తాన్ ఎవరినని అడిగాడు. ఎంతో పేదవాడై ఉండీ తనకున్నదానిలో అయిదోవంతు ను పుణ్యక్షేత్రానికీ మిగిలినది బిచ్చగాడికీ ఇచ్చేసిన కరీం అల్లా కి స్నేహితుడని ఆ గొంతు చెప్పింది. అతన్ని చెరలో పెట్టిన వివరం కూడా రాజుకి తెలియజేసింది.

తెల్లవారుతూనే సుల్తాన్ ఆఘమేఘాల మీద చెరసాలకి వెళ్ళాడు. కరీం ని కలుసుకుని అతని సంకెళ్ళు తన చేతులతో స్వయంగా విడిపించాడు. కరీం చెంపల మీద కన్నీళ్ళు కారిపోతూ, ” నన్ను బంధించండి, వాళ్ళని విడిపించండి. వాళ్ళకి ఏ పాపమూ తెలియదు ” అని భార్యనీ పిల్లలనీ చూపించి వేడుకున్నాడు. ” అందరినీ విడిపిస్తాను ” అని సుల్తా న్ ధైర్యం చెప్పాడు. ” మీరంతా రాజభవనం లో భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నాకు అల్లా పంపిన అతిథులు మీరు ” అని వాళ్ళని గౌరవించి ఆ ఇత్తడిబిందెలో దొరికిన వజ్రాల విలువ మొత్తమూ వెండినాణాలుగా కరీం కి ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో కరీం కి ఇప్పుడు తెలుసు గనుక యూసఫ్ తో కలిసి బజారుకి వెళ్ళి ఇదివరకు కొనలేనివన్నీ ఇప్పుడు భార్యకీ పిల్లలకీ కొనిపెట్టాడు. తక్కినదానితో ఏం చేయాలో అతని ఊహకి అందలేదు. భార్య జెబా ఆ బాధ్యత తీసుకుని యజమాని సాయం తో వాళ్ళ ఊర్లో చాలా పొలం కొని, మంచి ఇల్లు కట్టింది. కరీం బీదవాళ్ళకి దానం చేస్తూ ఉండేందుకూ , మసీదులో ఇచ్చుకునేందుకూ అతని జేబులో రోజూ కొన్ని నాణాలు పెట్టేది .

అలా తను ధర్మం చేసినది ఎన్నో వందలరెట్లుగా తిరిగి వచ్చింది. అయితే అదేమీ కరీం మనసుకి పట్టలేదు. భార్యా పిల్లలూ సంతోషంగా ఉండటం అతనికీ సంతోషాన్ని ఇచ్చింది.

islamic-art-paintings

  • పర్షియన్ జానపదకథ

ముడి

MythiliScaled

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘ తోడేలు జమీందారు ‘ అనేవారు. అతని భార్య మాత్రం చాలా మంచిది. భర్త వల్ల కలిగే కష్టాలనీ నష్టాలనీ తగ్గించేందుకు రహస్యంగా తన ప్రయత్నం తను చేస్తూ ఉండేది. అతనూ భార్య అంటే ఏ కాస్తో గౌరవం ఉన్నట్లుగా చూసీ చూడనట్లు ఊరుకునేవాడు – జనాన్ని హింసించటం మాత్రం కట్టిపెట్టేవాడు కాదు.

dyck-self-portrait

ఒక రోజు వేటకి వెళ్ళి వస్తుండగా అడవి అంచున ఒక చిన్న ఇంటి ముంగిట్లో చక్కని అమ్మాయి నార వడుకుతూ కనిపించింది.

” నీ పేరేమిటి ? ” అడిగాడు

” రెనెల్డ్, అయ్యా ! ”

” ఇక్కడ ఏ సందడీ లేదులా ఉందే- అస్తమానమూ ఇక్కడే ఉంటే విసుగు పుట్టదూ నీకు ?”

” లేదయ్యా , అలవాటైపోయింది ”

” అలా కాదులే. నాతోబాటు కోటకి రాకూడదూ ? అమ్మగారికి చెలికత్తెగా ఉండిపోవచ్చు ”

” కుదరదదయ్యా. మా అమ్మమ్మ పెద్దదైపోయింది.ఆమెని నేనే చూసుకోవాలి ”

” ఆ వంకలేం చెప్పకు. సాయంత్రానికల్లా అక్కడికి వచ్చేయి ”

కాని రెనెల్డ్ వెళ్ళలేదు. ఆమెకి గిల్బర్ట్ అనే కట్టెలుకొట్టే యువకుడితో పెళ్ళి కుదిరిఉంది కూడా.

మూడురోజులయాక జమీందారు మళ్ళీ ఆ వైపు వచ్చాడు.

” ఏం అమ్మాయ్ , రాలేదేం ? ”

” చెప్పాను కదయ్యా, వీలుకాదని ”

ఇలా రెండు మూడు సార్లు ఆమెని కోటకి చెలికత్తెగా రమ్మని అడిగి, ఆమె రాకపోయేసరికి ఒకరోజు ” నువ్వు వస్తే అమ్మగారిని వదిలేసి నిన్నే పెళ్ళాడతాను ” అనేశాడు జమీందారు.

రెనెల్డ్ కి అతని దుర్బుద్ధికి అసహ్యం వేసింది. రెండేళ్ళ కిందట ఆమె తల్లి పోయినప్పుడు జమీందారిణి వాళ్ళని ఎంతగానో ఆదుకుంది. ఆవిడకి హాని చేసేపనిని రెనెల్డ్ కలలో కూడా తలపెట్టలేదు.

John Faed The Spinningwheel

అలా కొన్ని వారాలు గడిచాయి. అతని పీడ వదిలిందని రెనెల్డ్ అనుకుంది. కాని ఆ రోజు చేతిలో తుపాకీ పట్టుకుని అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి రెనెల్డ్ నార బదులు నూలు వడుకుతోంది.

” ఏమిటి చేస్తున్నావు ? ”

” నా పెళ్ళి గౌన్ కోసం అయ్యా ”

” నీకు పెళ్ళా ఏమిటి, అయితే ? ”

” అవునయ్యా. మీరు అనుమతి ఇస్తే ”

ఆ రోజులలో ప్రజల్లో ఎవరు పెళ్ళి చేసుకోవాలన్నా జమీందారు ఒప్పుకోవలసి ఉండేది. సామాన్యంగా ఒప్పుకోకపోవటమేమీ ఉండేది కాదు.

అయితే ఈ దుర్మార్గుడు ఇలా అన్నాడు ” ఆ. ఒప్పుకుంటాలే. అదిగో, ఆ దురదగొండి పొదలు లేవూ ? వాటిపీచులోంచి బట్ట నేసి ఉంచు. నీ పెళ్ళి గౌన్ కీ, నేను చచ్చిపోయినప్పుడు కప్పే గుడ్డకీ- రెంటికీ సరిపోవాలి అది . ఎందుకంటే నన్ను పాతిపెట్టే రోజునే నీకు పెళ్ళి ! ” చెప్పేసి వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు జమీందారు.

రెనెల్డ్ వణికిపోయింది. దురదగొండి పీచునుంచి దారం తీయటం కనీ వినీ ఎరగని సంగతి. ఇక బట్టని నేయటమా ? అసలు చేతులకి తగిలితేనే దురదా మంటా పెడతాయి కదా.

పైగా జమీందారుకి నడివయసు దాటలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. అతను పోయాక తన పెళ్ళి ఏమిటి- ఆమె ఇంక ఆలోచించలేక పోయింది.

ప్రతిసాయంత్రమూ గిల్బర్ట్ వాళ్ళింటికి వస్తుండేవాడు. ఆరోజు అతనికి జరిగినదంతా రెనెల్డ్ చెప్పింది. అతనికి చాలా కోపం వచ్చింది – ” ఈ గొడ్డలి తో వాడి బుర్ర బద్దలు కొడితే శని  వదిలిపోతుంది ” అన్నాడు.

రెనెల్డ్ వద్దంది. శుభమా అని పెళ్ళి చేసుకోబోయేముందు- ఎవర్నైనా సరే, చంపటం మంచిది కాదంది. జమీందారిణి తమ పట్ల చాలా దయగా ఉండటాన్ని గుర్తు చేసి ఆమె భర్తని చంపటం ధర్మం కాదని చెప్పింది.

ప్రయత్నించి చూద్దామనుకుని మర్నాడు ఆ పొదల నుంచి పీచుని లాగి వడికింది. ఆశ్చర్యకరంగా ఏ దురదా పెట్టకపోగా మెత్తగా తేలికగా బలంగా ఉన్న దారం తీయటం వీలయింది. త్వరలోనే తన పెళ్ళి గౌన్ కోసం బట్టని నేసి కుట్టేయగలిగింది. అయితే జమీందారు తన శవం మీద కప్పే బట్ట అన్నాడు కదా, దాన్ని మాత్రం నేయటం మొదలుపెట్టలేదు. అందుకు ఆమెకి మనసు రాలేదు. ఎలాగో తన గౌన్ ని తయారుచేయగలిగింది కనుక జమీందారు ఆ రెండో బట్ట సంగతి ఎత్తడులే అని ఆశ పడింది.

జమీందారు వచ్చాడు. తెల్లగా మృదువుగా ఉన్న పెళ్ళి గౌన్ ని చూపించింది.

అతనువెలవెలబోయాడు . ” సరేలే. రెండోది కూడా కానీ మరి ” కరుగ్గా అని వెళ్ళిపోయాడు. ఆమె నేయటం మొదలు పెట్టింది. జమీందారు కోటకి వెళ్ళేలోపే అతనికి నలతగా అనిపించింది. కాసేపటికి జ్వరం తగిలింది. అన్నం తినలేకపోయాడు, నిద్రపట్టలేదు. మరుసటిరోజు పక్కమీదినుంచి లేవలేకపోయాడు. ఆ జబ్బు తగ్గేటట్లుగా అనిపించలేదు. ఇదంతా రెనెల్డ్ నేస్తున్న బట్ట వల్లనేనని అతనికి అర్థమైంది. దాన్ని వాడాలంటే చనిపోవాలి కదా.

వెంటనే ఆ నేయటాన్ని మానేయమని ఆమెకి కబురు చేశాడు. రెనెల్డ్ మానేసింది, ఆ పని ఆమెకే ఇష్టం లేదు.

ఆ సాయంత్రం గిల్బర్ట్ వచ్చాడు. ” జమీందారు మన పెళ్ళికి అనుమతి ఇచ్చాడా మరి ? ” అడిగాడు. ” లేదు ” రెనెల్డ్ చెప్పింది. ” అయితే నేయటం మానేయకు. ఇంక వేరే ఎలాగూ అతను ఒప్పుకునేటట్లు లేడు ” గిల్బర్ట్ అన్నాడు.

సరే, ఆ తర్వాతి రోజు మళ్ళీ ఆమె మగ్గం ముందు కూర్చుంది. రెండు గంటలు గడిచేలోపు జమీందారు సైనికులు వచ్చి ఆమె చేతులూ కాళ్ళూ కట్టేసి నది లోకి విసిరేసి ఆమె మునిగిపోవటం చూసి వెళ్ళిపోయారు. వర్షాలు పడి నది పొంగిపొర్లుతూ ఉంది. రెనెల్డ్ కి ఈత రాదు. కాని ఆమె నీళ్ళ మీద తేలింది, ఒడ్డుకీ చేరింది.

ఆ వెంటనె ఆమె ఇంటికి వెళ్ళి నేయటం మొదలుపెట్టింది. ఈసారి సైనికులు ఆమె మెడకొక బండరాయికట్టి మరీ నదిలోకి విసిరారు. వాళ్ళు అటు తిరగగానే ఆ రాయి ఊడిపోయింది, మళ్ళీ ఆమె తప్పించుకుంది. నేస్తూనే ఉంది. జమీందారు జబ్బు ఎక్కువైంది. తుపాకీ తో కాల్చాడు, ఆమెకి గుండు తగల్లేదు. మగ్గాన్ని విరగగొట్టారు, దానంతట అదే బాగయింది. చెరలో పెట్టారు, ఆమె ముందు మగ్గమూ దారమూ ప్రత్యక్షమయాయి. చేతులు కట్టేస్తే వెంటనే విడిపోతున్నాయి. ఆమెని చంపేసే ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. ఇంక చేసేది లేక జమీందారు చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

wassilij-maximowitsch-maximow-kranker-mann-06299

 

భర్త పరిస్థితి చూసి జమీందారిణి దిగులుపడింది. జబ్బుకి కారణం తెలుసుకుని అతనికి మంచిమాటలు చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవాలని అతనికి అనిపించలేదు. అంత అహంకారం. అప్పుడు అతనికి తెలియకుండా ఆమె రెనెల్డ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఆ బట్టని నేయవద్దని వేడుకుంది. అంత పెద్దావిడ వచ్చి అడిగేసరికి రెనెల్డ్ కాదనలేకపోయింది, అలాగేనని మాట ఇచ్చింది.

ఆమె నేయకపోవటం గిల్బర్ట్ గమనించాడు – ” అయితే మన పెళ్ళికి అనుమతి వచ్చిందా ? ” అడిగాడు. ” లేదు ”

” మరి ? ”

” అమ్మగారికి మాట ఇచ్చాను, మానేస్తానని ”

‘’ అతను చచ్చిపోతే మనకేమిటి ? ”

” అయ్యో, అమ్మగారు ఏమనుకుంటారు ! కొన్ని రోజులు వేచి ఉందాం. అతని మనసు కరుగుతుందేమో ” రెనెల్డ్ అంది.

వాళ్ళు రోజులూ వారాలూ నెలలూ ఎదురు చూశారు. జమీందారు రెనెల్డ్ ని వేధించటం మానుకున్నాడు గానీ పెళ్ళికి అనుమతి ఇవ్వనేలేదు. రెనెల్డ్ మళ్ళీ నేయటం మొదలుపెట్టలేదు. గిల్బర్ట్ కి చిరాకు, కోపం వచ్చాయి. ” ఇంక చాలు ” అన్నాడు. ” ఇంకొద్ది రోజులు చూద్దాం ” అంది ఆమె. గిల్బర్ట్ కి విసుగు పుట్టింది, రావటం మానేశాడు. రెనెల్డ్ చాలా ఏడ్చింది, కాని మళ్ళీ ఆ బట్టని నేయలేదు.

ఒకరోజు జమీందారు ఆమెకి ఎదురు పడ్డాడు. ఇప్పుడతని ఆరోగ్యం బావుంది.

ఆమె చేతులు జోడించి అడిగింది- ” అయ్యా, దయ చూపండి ” అని. అతను తల తిప్పేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికీ ఆమె ఇచ్చినమాట నిలబెట్టుకోవాలనే అనుకుంది. గిల్బర్ట్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పనైనాలేదు. ఆమె కుమిలిపోయింది.

ఇంకొక ఏడాది గడిచింది. జమీందారు మళ్ళీ జబ్బు పడ్డాడు. జమీందారిణి రెనెల్డ్ ఇంటికి వెళ్ళి చూసింది, కాని ఆమె నేయటం లేదు. ఈసారి జబ్బుకి కారణం ఆమె కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ జబ్బు ఇక కుదిరేది కాదని వైద్యులు చెప్పేశారు. విపరీతమైన బాధగా ఉండేది. మృత్యువు వస్తే బావుండునని జమీందారు అనుకున్నాడు. కాని అతను చనిపోలేదు. ఎంతకాలం గడిచినా అతని స్థితిలో మార్పు రాలేదు. బతకనూ లేడు, చావనూ లేడు.

అప్పటికి తెలిసివచ్చింది అతనికి. తన మీద కప్పబోయే బట్టని రెనెల్డ్ నేసి ఇస్తేనేగాని తను చనిపోలేడు. ఇదీ ఆమె చేతిలోనే ఉంది. పిలిపించాడు. ఆమె వచ్చి మంచం పక్కన నిలుచుంది. మళ్ళీ నేత మొదలుపెట్టమని అజ్ఞాపించాడు. ఆమె జమీందారిణి వైపు చూసి తలదించుకుంది. జమీందారిణి భర్తతో అంది – ” అంతకన్న వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని చూడకూడదా ? ” అతనికి మొదట నచ్చలేదు. చావనైనా చావాలిగానీ తన నోటితో తను ఆమె పెళ్ళికి ఒప్పుకోకూడదని అతని పట్టుదల. భార్య పదే పదే బ్రతిమాలింది. ఆమెని తను ఏనాడూ సంతోషంగా ఉంచలేదు కదా అని అతనికి స్ఫురించింది. చేతిసైగ తో సరేనన్నాడు . రోజు రోజుకీ అతని శరీరం తేలికవుతూ వచ్చింది. రాయిలాంటి మనసు మారింది. పశ్చాత్తాపం వచ్చింది. ఆమెని క్షమించమని అడిగాడు. రెనెల్డ్ గడిచినదేదీ మనసులో పెట్టుకోకుండా అతన్ని క్షమించింది. ఆ ఊర్లో వాళ్ళంతా రెనెల్డ్ కి చాలా మహిమ ఉందని అనుకున్నారు. రెనెల్డ్ మాత్రం ఆకాశం వైపు తిరిగి దణ్ణం పెట్టింది. దేవుడిచ్చిన అవకాశాన్ని అందుకుని జమీందారు ఉత్తముడుగా మారాడు.

గిల్బర్ట్ ఆమెని మరిచిపోలేదు. ఆమె మీద అతనికి ప్రేమ పోలేదు. జమీందారు   తమ పెళ్ళికి ఒప్పుకున్న సంగతి తెలియకుండానే , వారం గడిచేసరికి తిరిగి వచ్చాడు. మొదటినుంచీ , మొత్తం రెండేళ్ళు పూర్తయాక అప్పుడు వాళ్ళకి పెళ్ళి జరిగింది. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా బ్రతికారు .

Flemish_Wedding_17th_century

  • ఫ్లెమిష్ జానపద కథ
  • సేకరణ- Charles Deulin, Andrew Lang

 

 

నీలిపూల రహస్యం

MythiliScaled

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి జంతువుల చర్మాలతో దుస్తులు కుట్టేది. అవి అందంగానూ మెత్తగానూ ఉండేవి. అమ్మాయి చిన్నపాపగా ఉన్నప్పుడు పొద్దున్నే పాలుపట్టి వాళ్ళ అమ్మ చెట్టుకొమ్మకి వేసిన ఉయ్యాలలో వెచ్చగా కప్పి పడుకోబెట్టేది. పాప నిద్రపోయేది. లేచేసరికి ఉయ్యాల చుట్టూ చిట్టి చిట్టి ఉడతలు మూగి ఆడుతూ ఉండేవి. ఆకుల్లో పాకే సాలీళ్ళని పాప ఆసక్తిగా గమనించేది.అవి పట్టుదారాలు అల్లి గూళ్ళు కట్టుకోవటం ఎంత సేపు చూసినా బావుండేది. వాళ్ళ నాన్న నిపుణుడైన వేటగాడు. అవసరం కొద్దీ  వేటాడే నేర్పుతోబాటు పట్టుబడిన మూగజీవులని దయగా కాపాడటం కూడా అతను పిల్లలకి అలవరచాడు. అలా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పులిపిల్లలూ తోడేలు పిల్లలూ అడవి పిల్లిపిల్లలూ పెరుగుతుండేవి. వాటి పోషణ అంతా పాప పెద్దదయాక తనే చూసేది, వాటితో ఆడుకునేది. అవి  క్రూరజంతువులు కనుక ఎదిగేకొద్దీ చెల్లెలికి ఏమైనా హాని చేస్తాయేమోనని అన్నలు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే ఆమె కి ఆ భయమే లేకపోయేది- అవీ ఎంతో స్నేహంగా మసలుకునేవి, ఆమె కళ్ళెర్రజేస్తే భయపడిపోయేవి కూడా.

చక్కటి  ముఖం, దృఢమైన శరీరం- వీటికితోడు తల్లి తయారు చేసే సొగసైన గౌన్ లు- ఆమె ఒక రాజకుమారిలాగా కనిపించేది. వేసవికి తేలికగా రంగు రంగుల ఈకలతో ఆ దుస్తులు ఉండేవి. జుట్టులో సువాసన వేసే  అడవిపూలు  పెట్టుకునేది. చలికాలానికి కోట్ లూ, టోపీలూ చేతితొడుగులూ – ఇవన్నీ తెల్లని చర్మాలతోనే తల్లి కుట్టేది. మెరిసే నల్లని కళ్ళూ గులాబిరంగు బుగ్గలూ తప్పించి ఆమె మంచులోం చే  పుట్టినట్లు ఉండేది. ఉత్తరపుదిక్కున ఉల్ రుం భూమిలో ఉండే  మంచు దేవుడి కూతురే అలా వచ్చిందని అనుకునేవారు. ఆమె పేరు డ్రి-ఫా [ అంటే మంచులాగా తెల్లనిది అని ].

1aba3658d6313642da4d32068e1a43a1

ఆ ప్రాంతాలలో ఎవరికీ లేని అందం, సంపద ఉన్నా ఎందుకో ఆమెకి తృప్తిగా ఉండేది కాదు. చాలా మంది యువకులు పెళ్ళి చేసుకుంటామని అడిగినా ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది తాము వేటాడి సంపాదించిన ఉన్ని చర్మాలను, చాలా మేలైనవాటిని – బహుమతిగా ఇవ్వబోయేవారు. ఇంకొందరు తమ బలాన్నీ చాకచక్యాన్నీ ప్రదర్శించేవారు. ఫెయిరీ ల తో స్నేహం చే సీ , కబౌటర్ [ డచ్ దేశం లో పొట్టిపిశాచాల వంటివి ] లను మెప్పించీ తెచ్చిన వజ్రాలనూ  విలువగల లోహాలనూ ,మరికొందరు,  డ్రి-ఫా ప్రేమను పొందేందుకు చూపించేవారు. దూరసముద్రతీరాల లో దొరికిన సాంబ్రాణినీ రత్నాలనూ తీసుకొచ్చిన వారూ ఉన్నారు. ఒకరైతే ఏకంగా పెద్ద ముత్యాలహారాన్నే కానుక చేయబోయారు. ఆ శీతల అరణ్యాలలో ముత్యాలు చూడటమే ఒక అద్భుతం. కాని ఏదీ డ్రి-ఫా ని సంతోషపెట్టనేలేదు. వచ్చినవారంతా అదే దారిని తిరిగి వెళ్ళిపోయేవారు.

 

అందరి కంటే చివరన సాలీడులాగా కనిపించే వింతమనిషి వచ్చాడు. తన పేరు స్పిన్ హెడ్ అని చెప్పాడు. మణిమాణిక్యాలకన్న, బంగారం కన్న, ఉన్ని కన్న విలువైన రహస్యం తనదగ్గర ఉందని చెప్పాడు. డ్రి-ఫా తల్లికి అతన్ని చూస్తే చిరాకు వేసి పంపించేసింది.

 

కొన్నేళ్ళు గడిచాయి. ఇక డ్రి- ఫా కి పెళ్ళి కాదేమోనని తల్లిదండ్రులు దిగులుపడేవారు. ఒకరోజు ఆమె అడవిలో తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగిన ఓక్ చెట్టుకింద పచార్లు చేస్తోంది . అప్పటికి వాళ్ళ ఇల్లు అక్కడికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుకొమ్మలలోంచి ఒక సాలీడు వచ్చి  పక్కనే కూర్చుంది. అది మాట్లాడింది కూడా.

ఇలా –   ‘’ డ్రి-ఫా ! నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ సంగతే చెప్పేందుకు వచ్చాను. నువ్వేమీ ఇప్పుడే నన్ను పెళ్ళాడనక్కర్లేదు. నీ గది లో నన్నొక గూడు అల్లుకోనీ. అక్కడే నీ కనుచూపుమేరలో ఉంటాను. నీకు చాలా మంచి జరుగుతుంది, కాదనకు ” ఆశ్చర్యపోయి, తనకొక గది ఎక్కడుందా అని ఆలోచిస్తూ, డ్రి- ఫా సరేనంది.

వెంటనే పెద్ద గాలిదుమారం వచ్చి ఓక్ చెట్టు కూలిపోయింది. అక్కడ పెద్ద భవంతి వెలిసింది. పక్కనే విశాలమైన తోట. డ్రి-ఫా అందులో అడుగు పెడుతూనే  ఆమె పాదాల దగ్గర ఒక నీలి పూల చెట్టు మొలిచింది. సాలీడు అంది ” ఈ ఇంట్లో నీకు బాగా నచ్చిన గదిని ఎంచుకో. నూరు రోజులపాటు  నన్ను బాగా చూసుకుంటే ఈ నీలిపూవు రహస్యం నీకు చెబుతాను ”

బాగా సూర్యకాంతి పడే గదిని డ్రి-ఫా ఎంచుకుంది. ఆ గది కిటికీ పైనుంచి కప్పు వరకూ సాలీడుకి కేటాయించింది.

వెంటనే అది తళతళమనే దారాల అల్లిక మొదలుపెట్టింది. చీకటిపడేదాకా దాకా అల్లుతూనే ఉంది. డ్రి-ఫా తనకి కూడా ఆ నాజూకైన అల్లిక చేతనయితే బావుండుననుకుంది. ఏదో రహస్యం అంది కదా సాలీడు, అది దీనికి సంబధించినదేమోననే అనుమానమూ ఆమెకి వచ్చింది. రాత్రయింది. ఇంటికి వెళ్ళటం కష్టం. కాని అక్కడే తన గదిలో నిద్రపోయేందుకు పరుపులూ దుప్పట్లూ  ఏమీ లేవు.

Bronx_Zoo_Spider_Web

” నీకు మంచి పక్క వేస్తాను చూడు ” అంది సాలీడు. ఆ గొంతు ఒక యువకుడిది లాగా ఉంది ఇప్పుడు. డ్రి-ఫా విస్తుపోయిందికానీ ఏమీ అనలేదు. చూస్తుండగానే అతి మెత్తటి, వెచ్చటి పక్క దానంట అదే వచ్చింది. ఇంట్లో కంటే కూడా సుఖంగా , సౌకర్యంగా  ఆమె నిద్రపోయింది.

ఆమెకొక కల వచ్చింది. అప్పటివరకూ ఎవరూ చూసిఉండని తెల్లని వింత  వస్త్రాన్ని ధరించి ఉంది ఆ కలలో. జంతువు చర్మం లాగా దట్టంగా లేదు అది, చాలా పల్చగా, తేలికగా ఉంది . పొద్దుటి వెలుతురులో పచ్చిక మీద సాలెగూడు మెరిసినట్లు మెరుస్తోంది, గడ్డిపరకల మీది మంచుబిందువులలాగా కూడా.

 

నూరు రోజులు గడిచాయి. డ్రి-ఫా ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రివరకూ ఉండేది. . ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. సాలీడు దారాలు అల్లుతూనే ఉండేది. డ్రి-ఫా ఆ రహస్యం ఎప్పుడు తెలుస్తుందా అని ఎదురు చూసేది. ఏమైనా సరే, తొందరపడి అడిగేయకూడదని , సాలీడు చెప్పెదాకా ఆగాలని ఆమె నిశ్చయించుకుంది.

 

నూరు రోజులు పూర్తవబోతున్నాయి. శిశిరఋతువు వచ్చింది. డ్రి-ఫా తోటలో తిరుగుతోంది. చలిగాలులు వీస్తున్నాయి, పండిపోయిన ఆకులు రాలుతున్నాయి. ఆ నీలిపూవు కూడా ఎప్పుడో రాలిపోయింది. నల్లటి గట్టి కాడ మాత్రమే మిగిలింది. ” ఏముంటుంది ఇక  ఇందులో అద్భుతం ?” అనిపించింది డ్రి-ఫా కి. ఉన్నట్లుండి చాలా బెంగ వచ్చింది . ఉన్నట్లుండి హోరుమని ఈదురుగా లి – అన్ని ఆకులూ రాలి నేలని పసుపచ్చగా కప్పేశాయి. కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అంతలోనే అంతా నిశ్శబ్దంగా అయింది. డ్రి- ఫా పక్కన ఒక యువకుడు ఉన్నాడు. తన అన్నలకంటే, తనను పెళ్ళాడమని అడిగినవారందరి కంటే- తను చూసిన ఎవరికంటే కూడా అందంగా ఉన్నాడు. సొగసైన తెల్లని దుస్తులు వేసుకున్నాడు. ఆ బట్ట మెత్తగా తను కలలో చూసినదానిలాగే ఉంది. అతని చేతిలో ఆ నీలిపూవు కాడ ఉంది.

” నేనే స్పిన్ హెడ్ ని. నూరు రోజులూ అయిపోయాయి, నా శాపం తీరింది. ఇదిగో నా కానుక నీకు ” అని ఆ పూవుకాడని చూపించాడు. సాలీడు అతనుగా మారినందుకు ఎంతో ఆనందించింది డ్రి-ఫా. అయితే ఆ ఎండిపోయిన కాడ , గొప్ప కానుక ఎలా అవుతుందో ఆమెకి తెలియలేదు. ‘ దాన్ని చీల్చి చూడు ” యువకుడు చెప్పాడు. అలాగే చేసింది ఆమె. లోపల సన్నటి పొడుగాటి నాజూకైన పోగులు, సా లెపురుగు గూటివి లాగా. ఉత్సాహంగా బయటికి లాగింది.

” ఈ విత్తనం నాటితే లక్షల పూలు పూస్తాయి. ఆ కాడల్లోంచి తీసినదారాలతో- ఇదిగో, దీన్ని తయారు చేయచ్చు ” అని చక చకా తెల్లటి బట్టని నేశాడు .అదే లినెన్.

డ్రి-ఫా సంతోషంగా చప్పట్లు కొట్టింది.

1251810-bigthumbnail

” నీ పెళ్ళి గౌన్ కోసం ఇది- పెళ్ళి చేసుకుంటావా నన్ను ? ”

ఆమె సిగ్గుపడింది, అయినా ” ఓ, అలాగే ” అంది.

” నీకు మేలిముసుగుని తయారు చేస్తాను ఉండు ”

మళ్ళీ అతని వేళ్ళు అద్భుతంగా కదిలాయి. ఇంకా సున్నితమైన వస్త్రాన్ని , గజాల కొద్దీ నేశాడు. దాన్ని గాలిలో ఎగరేశాడు, పక్షిలాగా తేలింది అది. అప్పుడు ఆమె మీదికి జార్చాడు. ఆమె ముఖాన్ని కప్పి వీపు మీదినుంచి జీరాడింది. అది  లేస్.

వాళ్ళు పెళ్ళి చేసుకుని  నీలిపూవులు పూయించారు. అవి ఆ నేలకి కొత్త ఆకాశంగా మారాయి. మనుషులు కష్టపడి పని చేశారు.   నగరాలు కళకళలాడాయి. లినెన్ నుంచి బెల్జిక్ ప్రాంతాలకి [ ఇప్పటి నెదర్ లాండ్స్, బెల్జియం, లక్సెం బర్గ్ ] ఐశ్వర్యం వచ్చింది.

linen_history_img_1_blue_flowering_flax

  • డచ్ జానపదకథ
  • అనువాదం: మైథిలి అబ్బరాజు
  • mythili

 

 

 

ప్రేమతో…

MythiliScaled
చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది. అమ్మాయి విచ్చుకునే రోజా మొగ్గ అంత ముద్దుగా ఉండేది. అడవిలో జలజలమనే వాగు గుసగుసల అంత తియ్యగా ఉండేది ఆమె గొంతుక.

ఆ గుడిసె పెద్దపెద్ద చెట్టుకొమ్మలతో అల్లిన తేనెతుట్టెలాగా ఉండేది. అందులో ఎప్పుడూ ఆరిపోని నెగడు ఉండేది. దాన్ని ఎవరూ వెలిగించకుండానే, పుల్లలు వేయకుండానే అది అలాగ మండుతూ ఉండేది. చలికాలం లో వెచ్చగా వేసవిలో చల్లగా ఉండేది దాని వెలుతురు. నెగడు కీ గోడకీ మధ్యని రెండు మంచాలు. ఒకటి సాదా కొయ్యతో చేసినది, దాని మీద ముసలమ్మ పడుకునేది. రెండోది మాత్రం మంచి ఓక్ కొయ్యతో చేసినది. మొహం కనిపించేంత నున్నగా చిత్రిక పట్టారు దాన్ని. దాని మీద లతలూ పూవులూ పక్షులూ చెక్కారు కూడా. ఒక రాజకుమారి మంచం లాగా ఉండేది, దాని మీద అమ్మాయి పడుకునేది. తన పేరు ఫినోలా- నిజానికి తనొక రాజకుమారే, ఆ సంగతి ఆమెకే గుర్తు లేదు.
గుడిసె బయట ఎటు చూసినా చెట్టూ చేమా లేని బీడు . మరొక మనిషి పొడైనా- చివరికి ఒక పిట్టైనా పురుగైనా, లేదు – ఏ అలికిడీ వినబడేది కాదు. తూర్పు వైపున పెద్ద కొండ. పగటిపూట నీలంగానూ , పొద్దు కుంకేవేళ వంద వింత రంగులతోనూ కనబడేది. దాన్ని చూస్తుండటం తప్పించి ఫినోలా కి ఏ ఉల్లాసమూ లేదు. కొండ అవతలినుంచి వీచే తుఫాను గాలి కూడా ఈ మైదానం లోకి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయేది. తనతో తనే మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఫినోలా కాలం గడిపేది.
నెలకి ఒక్కసారి మాత్రం ఒక మరుగుజ్జు మనిషి కుంటి గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు. ముసలమ్మకీ ఫినోలాకీ నెలకి సరిపడా గోధుమలు బస్తాలో తెచ్చి ఇచ్చేవాడు. అదేమిటోకానీ అతనికీ మాటలు రావు. కాని ఫినోలా అంటే అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది, ఆమె కోసం ఏమైనా చేయగలననీ చేయాలనీ అతనికి అనిపించేది. ఫినోలాకీ అతను రాగానే ప్రాణం లేచొచ్చినట్లుండేది. తనే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని అతని కోసం దాచి ఉంచేది.
ఒకరోజు అతను వచ్చినప్పుడు ఫినోలా ఎప్పటిలాగా ఎదురు రాలేదు. ముసలమ్మని సైగ లతో అడిగాడు ఏమైందని. ఉత్తిపుణ్యానికే ముసలమ్మకి కోపం వచ్చి కర్ర పుచ్చుకు కొట్టబోయింది. ఆమెని తప్పించుకుని గుర్రం ఎక్కుతున్న అతనికి గుడిసె వెనకవైపున కూర్చుని ఏడుస్తున్న ఫినోలా కనబడింది. ఎందుకో తనకి ఆవేళ పెద్ద దిగులు వచ్చేసింది. అది చూసి మరుగుజ్జుకి చాలా బాధేసింది. ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా కొండ అవతలి అడవిలోంచి వెళుతున్నాడు. అంతలో ఎక్కడినుంచో మాటలు వినిపించాయి
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” అని.
మరుగుజ్జు ఎదురుగా కొండవాలులో అతనిలో సగం ఎత్తున్న మనిషి కనిపించాడు. ఇత్తడి గుండీలు ఉన్న ఆకుపచ్చని అంగరఖా తొడుక్కుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతనొక గంధర్వుడు.
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” గంధర్వుడు మళ్ళీ అన్నాడు. ” నీకు స్వాగతం. గుర్రం దిగి నాతో రా. నీ పెదవులకి మంత్రదండం తాకించి నీకు మాటలు రప్పిస్తాను. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది ”
అలాగే మరుగుజ్జు అతని వెంట వెళ్ళాడు. కొండ అడుగున చిన్న బిలం లోంచి ఇద్దరూ లోపలికి దిగారు. ఆ దారి మరుగుజ్జుకే చాలా ఇరుకుగా అనిపించింది. కొన్ని మెట్లు దిగి పెద్ద చావడిలోకి ప్రవేశించారు. అక్కడ బంగారు స్తంభాల మీద వెండి రేకుల కప్పుతో ఒక మంటపం. కప్పు మీదా స్తంభాలమీదా మిలమిల మెరిసే వజ్రాలు పొదిగి ఉన్నాయి. వేరే దీపాలు అక్కర్లేనంత కాంతి వాటిలోంచే వస్తోంది. చావడి మధ్యగా ఒక బల్ల వేసిఉంది. దాని పైన మళ్ళీ బంగారు పళ్ళాలూ వెండి చెం చాలు. అటూ ఇటూ రెండు చిన్న కుర్చీలు, వాటిలో నీలిరంగు పట్టుదిండ్లు. ఆ పక్కనే పెద్ద కంచుగంట.

 

story1
” ఇలా కూర్చో ” అని తనొక కుర్చీలో కూర్చుని మరొక కుర్చీ చూపాడు గంధర్వుడు- ” ముందు నీకు మాటలు రావాలి కదూ ” – కంచుగంట ని మోగించాడు. ఇంకొక మనిషి, మరుగుజ్జు చూపుడువేలంత అంత ఉన్నవాడు , వచ్చాడు.
” మాటలొచ్చే మంత్రదండం తీసుకురా ” అజ్ఞాపించాడు . వేలెడంత వాడు వినయం

గా వంగి వెనక్కి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చాడు. అదొక నల్లటి కర్ర. దాని చివరన ఎర్రగా మెరిసే కెంపు ఉంది. మరుగుజ్జు మొహం ముందు మూడుసార్లు దాన్ని ఆడించి, ఆ భుజమూ ఈ భుజమూ తట్టి- కెంపుని అతని పెదవులకి తాకించాడు గంధర్వుడు.
తర్వాత
” మాట్లాడు ” అన్నాడు. మరుగుజ్జుకి గొంతు పెగలింది. తన గొంతు ని తాను విని ఆనందం తో గంతులు వేశాడు.
” నువ్వు ఎవరో చెప్పు ?” అడిగాడు గంధర్వుడు.
” నువ్వెవరో చెప్పు ముందు ” మరుగుజ్జు అన్నాడు – ” మాటలు తర్వాత, బాగా ఆకలేస్తోంది ”

story2

సరే, ఇద్దరూ పళ్ళాల ముందు కూర్చున్నారు. గంధర్వుడు మళ్ళీ కంచుగంట మోగించాడు. వేలెడంతవాడు వచ్చి మూడు నాలుగు సార్లుగా రుచి గల రొట్టెలూ కూరలూ తీపి పదార్ధాలూ తెచ్చిపెట్టాడు. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. తర్వాత పళ్ళరసాలు తాగారు.
అప్పుడు మరుగుజ్జు చెప్పాడు ” మంచి విందు చేశావు, చాలా సంతోషం. నన్ను అడిగావు కదా నేనెవరని- ఇంతకీ నేనెవరో నాకు తెలియదు ! ”
” అసలు నీ గురించి నీకేమి తెలుసో చెప్పు ” అడిగాడు గంధర్వుడు.
” ఒక రోజున లిఫే నగరం లో రాజు గారి భవనం ముందు ఉన్నాను. అక్కడెవరో గారడీ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఆట అయాక రాజు నన్ను పిలిచి నా పేరేమిటో ఎక్కడనుంచి వచ్చానో అడిగాడు. జవాబు చెప్పటానికి నాకు మాటలు రాలేదు సరిగదా, అంతకుముందరి సంగతులన్నీ మర్చిపోయాను. రాజు నన్ను కొలువులో చేర్చుకుని పని అప్పగించాడు. నెలకొకసారి మైదానం మధ్యని గుడిసెకి గోధుమలు తీసుకుపోవటం , అంతే ” అని మరుగుజ్జు సమాధానం చెప్పాడు.
” అయితే అక్కడి అమ్మాయితో ప్రేమలో పడ్డావు కదూ ? ” గంధర్వుడు అడిగాడు.
మరుగుజ్జు ఒప్పుకుందుకు మొహమాటపడ్డాడు.
” మరేం పర్వాలేదు, నాకు తెలుసులే . ఆ అమ్మాయి ఒక రాజకుమారి. తనకొక శాపం ఉంది. దాన్ని పోగొట్టేందుకు ఏమైనా చేయగలవా మరి ? ”
” నా ప్రాణమైనా ఇస్తాను ”
” సరే అయితే, విను. ఈ రాజ్యం వాళ్ళదే అసలు. నువ్వు పనిచేస్తున్నావే ఒక రాజు కింద, అతను ఈ అమ్మాయి తండ్రిని ఓడించి చపేశాడు. రాజకుమారిని మాత్రం చంపకూడదనీ అలా చేస్తే తనూ చచ్చిపోతాడనీ జ్యోతిష్కులు చెప్పారట. రాజుకి ఒక మంత్రగత్తె తెలుసు. ఆమె నిద్రపోయే రాజకుమారిని మంచం తో సహా అక్కడికి చేర్చింది. ఒక మూగ ముసలమ్మని కాపలా పెట్టింది, మైదానాన్నంతా మంత్రించి నిశ్శబ్దం చేసింది. ఆమె ఉనికి ఎవరికీ తెలియకూడదని ఆ జాగ్రత్త అంతా. రాజకుమారి గతం మర్చిపోయేటట్లు, మైదానం దాటి వెళ్ళలేనట్లు కూడా చేసింది మంత్రగత్తె. ఇంక వాళ్ళకి ఆహారం ఇచ్చేందుకు రాజకుమారి విషయమే తెలియనివారు కావాలి, చూసినది ఎవరికీ చెప్పలేకుండా ఉండాలి. నిన్ను మూగవాడిని చేసి అందుకోసం నియమించారు ” – వివరించాడు గంధర్వుడు.
మరుగుజ్జు అడిగాడు – ” నీకింత తెలుసు కదా, నేనెవరో ఏమిటో చెప్పలేవా ?”
” నెమ్మదిమీద నీకే తెలుస్తుంది. నీకు మాటలైతే రప్పించగలిగాను, తర్వాతి సంగతి నువే చూసుకోగలవు. ఇంతకూ రాజకుమారి శాపం విడిపించే పని మొదలుపెడతావా ? ”
” ఓ ! తప్పకుండా !!! ”
” అందుకోసం దేన్నైనా సరే వదులుకోగలవా ?”
” చెప్పాను కదా, ప్రాణమైనా ఇస్తానని , అసలేం చేయాలో చెప్పు ”
” నువ్వు సరైన ఆయుధాలు సంపాదించుకోవాలి ”
” ఏమిటవి ? ఎక్కడ దొరుకుతాయి ?”

story3 (2)
” ఒక కంచు డాలు , రాగి కత్తి, ఇనప బల్లెం- ఈ మూడూ కావాలి. ఏవి పడితే అవి పనిచేయవు. పశ్చిమసముద్రం లో ఒక దీవి ఉంది. అందులో రహస్య సరస్సు ఉంటుంది. దాని అవతలి ఒడ్డున మాత్రమే ఇవి దొరుకుతాయి. సాహసం గలవారు మటుకే వాటిని సంపాదించగలరు. మైదానం లోకి తెచ్చి ఆ డాలు మీద కత్తితో మూడుసార్లూ బల్లెంతో మూడుసార్లూ కొట్టావా, అక్కడి నిశ్శబ్దం విచ్చిపోతుంది. శాపం తీరి రాజకుమారికి స్వేచ్ఛ వస్తుంది ”
” ఇప్పుడే బయల్దేరుతాను ” దిగ్గున లేచాడు మరుగుజ్జు.
” మళ్ళీ అడుగుతున్నాను, దేన్నైనా సరే త్యాగం చేయగలవు కదా ?”
” నిస్సందేహంగా ! ”
”ఇదిగో, నీ గుర్రం చెవిలో దారి చెబుతున్నాను . అది ఎలా తీసుకువెళితే అలా వెళ్ళు. సరాసరి పశ్చిమసముద్రపు తీరానికి చేరతావు. గుర్రం మీదే నువ్వు సముద్రం దాటి దీవికి చేరుకోవాలి. ఆ సముద్రం లో భయంకరమైన నీటి గుర్రాలు ఉంటాయి. అవి నిన్ను ఆపుతాయి. అవి అడిగినది ఇస్తేగానీ నిన్ను వెళ్ళనివ్వవు. పొరబాటున వాటిని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవాలనుకోకు, నిన్ను చీల్చి చెండాడతాయి. దీవి లో కాలుపెట్టిన తర్వాత రహస్య సరస్సు లో నీళ్ళు ఎర్రగా మారేదాకా వేచిఉండాలి. ఇక్కడ క్రూరమైన నీటి పక్షులు ఉంటాయి. అవి అడిగినది ఇచ్చాకే అవతలి ఒడ్డుకి వెళ్ళనిస్తాయి. వాటిని తప్పించుకు పోవాలని చూసినా చాలా ప్రమాదం. అంతా సవ్యంగా చేయగలిగితే ఆ ఒడ్డున ఉన్న డాలూ కత్తీ బల్లెం – నీకు దొరుకుతాయి ”

గంధర్వుడికి కి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని మరుగుజ్జు బయల్దేరాడు. కోనలు దాటీ లోయలు దాటీ కనుమలలోంచి వెళ్ళీ వెళ్ళీ పశ్చిమసముద్రతీరం చేరేసరికి పొద్దు వాలుతోంది. చూస్తుండగానే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి అలముకుంది. అలసటగా గుర్రమూ తనూ అక్కడే నిద్రపోయారు.
తెల్లారి లేచి చూస్తే సముద్రం లో ఎక్కడా నీటిగుర్రాలు లేవు. వేరే ఇంకొక చోటి కి వచ్చానా అని మరుగుజ్జు ఆదుర్దా పడ్డాడు. అంతలో సముద్రపు అలలు విసురుగా విరిగి పడటం మొదలైంది. భీబత్సంగా సకిలిస్తూ చాలా నీటిగుర్రాలు అక్కడికి ఈదుకుంటూ వచ్చాయి. వాటి ముఖాలు భీకరంగా ఉన్నాయి. మింగేస్తాయా అనిపించి మరుగుజ్జు వణికిపోయాడు. తిరిగివెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడు ఎక్కడినుంచో శ్రావ్యమైన హార్ప్ ధ్వని వినిపించింది. కొండ దిగువన గంధర్వుడు అక్కడ ప్రత్యక్షమ యా డు. అతని చేతిలోనే హార్ప్ ఉంది. వింటూనే మరుగుజ్జుకి ధైర్యం వచ్చింది.
” త్యాగం చేస్తావా ? ” మూడుసార్లు అడిగాడు అతను.
అన్నిసార్లూ సరేనన్నాడు మరుగుజ్జు.
” వెనక్కి మరలండి ” నీటిగుర్రాలకి ఆజ్ఞ ఇచ్చాడు గంధర్వుడు. అవి అలాగే చేశాయి.
” ఏమి వదలాలి ?”
” నీ కుడి కంటిని ”
మరుగుజ్జుకి భయం వేసింది. కాని ఫినోలాని తలచుకుని ఆమె కోసం ఒప్పుకున్నాడు. వెంటనే కుడి కంటిలో భరించలేనంత నొప్పి పెట్టింది. చూపు పోయింది. గంధర్వుడు కొత్త పాట హార్ప్ మీద వాయించాడు. వినగా వినగా మరుగుజ్జుకి నొప్పి తగ్గింది. నీటిగుర్రాలు మాయమైనాయి.
” ఇప్పుడు దాటు ” చెప్పాడు గంధర్వుడు.
గుర్రం తో సహా సముద్రం దాటి దీవిలోకి వెళ్ళాడు మరుగుజ్జు. పచ్చటి చెట్లతో సువాసనలు చిమ్మే పూలతో దీవి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెలికలు తిరిగే సన్నటి బాటలవెంట దౌడు తీసి , గుర్రం ఒక సరస్సు ఒడ్డుకి చేరి ఆగిపోయింది. అదే రహస్య సరస్సు. ఏ కదలికా లేకుండా , సూర్యకాంతిలో అద్దంలాగా ప్రకాశిస్తోంది సరస్సు. మరుగుజ్జు గుండె ఎందుకనో వేగంగా కొట్టుకుంది. చాలాసేపటి తర్వాత గుర్రం దిగి ఒడ్డు న ఉన్న పచ్చికలో నడుము వాల్చాడు . ఎంత సేపు చూసినా నీళ్ళు ఎర్రబడనే లేదు.

మధ్యాహ్నం అవుతుండగా ఆకాశం లో పెద్ద నల్లటి మేఘం సరస్సు మీదికి వాలుతున్నట్లు కనిపించింది. పరీక్షగా చూస్తే అది బ్రహ్మాండమైన పక్షుల గుంపు. ఒక్కొక్క పక్షీ గుర్రానికి రెండు రెట్లు పెద్దగా ఉంది. పక్షుల న్నీ ముక్కు ల తో గుమ్మడికాయలంత పళ్ళు తెచ్చాయి. వాటిని తిని గింజలను సరస్సులోకి వదిలాయి. ఒక్కొక్క గింజా పడుతూనే నీళ్ళు ఎర్రగా మారటం మొదలైంది. కాసేపటికి అంతా ఎర్రటి నీళ్ళే. తర్వాత అన్ని పక్షులూ వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. మరుగుజ్జు సరస్సు దాటాలని అడుగు ముందుకువేశాడు. మూడు పక్షులు ఎక్కడినుంచో వికృతంగా అరుస్తూ అడ్డు పడ్డాయి. అవి అడిగినది ఇవ్వకుండా సరస్సుని దాటటం కుదరదని గంధర్వుడు చెప్పినమాట గుర్తొచ్చి ఆగాడు. ఏం అడుగుతాయోనని భయం వేసి , వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు. మళ్ళీ హార్ప్ ధ్వని చెవుల్లో అమృతం పోస్తూ వినిపించింది.
గంధర్వుడు ప్రత్యక్షమై ఫినోలా పేరు పలికాడు. ఎలాగైనా ఆమె శాపాన్ని పోగొట్టాలని మరుగుజ్జుకి బలంగా అనిపించింది. ముందుకి కదిలాడు.
” ఏమి ఇవ్వాలి ? ”
” నీ ఎడమ కంటిని ”
గుండె చిక్కబట్టుకుని ఒప్పుకున్నాడు. చూపు మొత్తమూ పోయి నొప్పితో మూర్చపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది.
గంధర్వుడు చెప్పాడు ” గుర్రం మెడ గట్టిగా పట్టుకో. దాన్ని నేను నీటిలోకి నడిపిస్తాను. ఏమీ భయపడకుండా సరస్సులో మునుగు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది ”
తెగించి మరుగుజ్జు గుర్రం తో సహా మునిగాడు. కాళ్ళు తేలిపోతున్నాయి. ఊపిరి ఆడలేదు. మెల్లిగా నీటి అడుగున వెలుతురు. పైకి తేలి వస్తూనే చూపు తిరిగివచ్చిందని తెలుసుకున్నాడు. విపరీతమైన సంతోషం వేసింది. అవతలి ఒడ్డుకి వెళ్ళాక గుర్రంలో మార్పు వచ్చింది. కుంటితనం పోయి గొప్ప జాతిదానిలాగా బలంగా అందంగా అయింది. తన చేతులూ కాళ్ళలో ఏదో కదలిక తెలిసింది అతనికి. ఊహించని శక్తి వచ్చింది. తనని తాను చూసుకున్నాడు- ఇప్పుడు మరుగుజ్జుగా లేడు, పొడుగ్గా దృఢంగా తయారయాడు. కంచుడాలూ బల్లెమూ కత్తీ కనిపించాయి. గబగబా వెళ్ళి మెరుస్తున్న డాలులో మొహం చూసుకున్నాడు. చాలా చక్కగా ఉన్నానని అర్థమైంది. మెల్లిగా అంతా జ్ఞాపకం వచ్చింది.

తనొక పెద్ద రాజ్యానికి యువరాజు. దేశాటన చేస్తూ వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు మాయలో పడ్డాడు. ఫినోలా మీద ప్రేమతో ఈ సాహసం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడో ఏమో. మూడు వస్తువులూ తీసుకుని తేలికైన మనసుతో వెనక్కి బయల్దేరాడు. ఈ తిరుగు ప్రయాణం లో ఏ అడ్డంకీ రాలేదు. క్రూరమైన పక్షులూ నీటి గుర్రాలకి బదులు సొగసైన హం సలు శాంతంగా ఈదుతున్నాయి.
త్వరలోనే మైదానం మధ్యని గుడిసెకి చేరాడు. కంచుడాలు ని మూడుసార్లు రాగికత్తితో, మూడుసార్లు ఇనపబల్లెం తో కొట్టాడు. గుడిసె మాయమైంది. ఫినోలా నవ్వుతూ అతని ఎదురుగా నిలుచుంది. బీడులో పచ్చిక మొలిచింది, చెట్లు పెరిగాయి, పూవులు పూశాయి, పిట్టలు పాడాయి. ఫినోలాని గుర్రం మీద ఎక్కించుకుని అతను ఉత్తరంగా ఉన్న తన రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు.

ఐరిష్ జానపద కథ , సేకరణ – Edmund Leamy .

విధి కన్న బలమైనది

The-prince-of-egypt 1

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు . అలా జరగకుండా ముందుగాఏమీ చేయలేమని కూడాతేల్చారు .   రాజూ రాణీ చాలా దిగులుపడిపోయారు. తమ బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. బాగా ఎత్తైన కొండ మీద కోట కట్టి చుట్టూ సైనికులని కాపలా పెట్టి అందులో రాజకుమారుడిని ఉంచారు. బొమ్మలు, పుస్తకాలు, ఆటవస్తువులు – కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడూ వెళ్ళి చూసివస్తూ ఉండేవారు.

 

ఒక రోజు రాజకుమారుడు కోట పైకెక్కి ఆడుకుంటూ కింద వెళుతున్న చిన్న కుక్కపిల్లని చూశాడు. అది అతనికి ముద్దొచ్చింది. తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కుక్కలే లేకుండా కట్టుదిట్టం చేసి ఉంచారు , అది ఎలా వచ్చిందో సేవకులకి అర్థం కాలేదు. గాభరా పడుతూ వెళ్ళి రాజుకి విషయం చెప్పారు. రాజకుమారుడి కోరిక ఏదీ అప్పటివరకూ వాళ్ళ అమ్మా నాన్నా కాదనలేదు. ఇప్పుడు కుక్కపిల్ల వద్దని నచ్చజెప్పాలని చూశారు. అతను వినలేదు. చేసేది లేక వాళ్ళు ఒప్పుకున్నారు. తొందర్లోనే రాజకుమారుడికి కుక్కపిల్ల బాగా మచ్చిక అయింది. దానికి మంచి తర్ఫీదు ఇచ్చి అతన్ని రక్షిస్తూ ఉండేలాగా తయారు చేశారు.

రాజకుమారుడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి. ఆ నోటా ఆ నోటా తన జాతకం గురించి అతనికి తెలిసింది. అస్తమానం కోట లోనే గడపటం అతనికి విసుగు పుట్టించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి ” నేను ప్రపంచం తిరిగి చూడాలనుకుంటున్నాను. నా క్షేమం గురించి ఆదుర్దా పడకండి, నా కుక్కపిల్ల నన్ను కాపాడుతుంది ” అన్నాడు. ఇదివరకులాగే తండ్రి వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. కొడుకు పట్టుదల వదల్లేదు. అయేదేదో అవుతుందని గుండె రాయి చేసుకుని సరేనన్నాడు . ఓడ లో అతన్నీ కుక్కపిల్లనీ నైల్ నది దాటించారు. అక్కడ సిద్ధంగా ఉంచిన మంచి గుర్రాన్ని ఎక్కి రాజకుమారుడు బయలుదేరాడు. బయటి ప్రపంచాన్ని చూడటం అతనికి చాలా సరదాగా సంతోషంగా ఉంది.

అలా  ప్రయాణిస్తూ ఒక గొప్ప రాజ్యం చేరాడు. అక్కడి రాజు అతనికి ఆతిథ్యం ఇచ్చి తన కూతురిని పరిచయం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ” నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ నా విధి ప్రకారం కుక్క కారణంగానో , మొసలి వల్లో పాము వల్లోనాకు ప్రమాదాలు వస్తాయట. బతుకుతానో లేదో తెలియదు ” అని ఆమెకి చెప్పేశాడు.

‘’ అయితే ఆ కుక్క ఎందుకు నీతో ? వదిలేయరాదా ? ” అని ఆమె అడిగింది.

” ఇంకా నయం ” అన్నాడు అతను.

ఆమె ” సరేలే . ఏమీ పర్వాలేదు. మనం విధిని ఎదిరిద్దాం. నిజమైన ప్రేమ దేన్నయినా గెలుస్తుంది ” అని ధైర్యం చెప్పింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళ తర్వాత తండ్రికి జబ్బుగా ఉందని రాజకుమారుడికి వార్త అందింది. భార్యతో కలిసి ప్రయాణమయాడు. మధ్యలో ఒక నది ఒడ్డున బస చేశారు. ఒక రాత్రి వేళ రాజకుమారి లేచి చూస్తే వాళ్ళ గుడారం లో ఒక మూల చాలా పెద్ద పాము కనిపించింది. వెంటనే భర్త ప్రమాదాల గురించి గుర్తొచ్చింది. మెల్లిగా వెళ్ళి పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పెట్టింది. అవన్నీ తాగేసి పాము మత్తుగా పడుకున్నప్పుడు సేవకులని పిలిచి దాన్ని దూరంగా పారేయించింది. జ్యోతిష్కు లను అడిగితే రాజకుమారుడికి పాము వల్ల రాగల  గండం తప్పిందని అన్నారు .

The-prince-of-egypt 2

వీళ్ళు వెనక్కి వెళ్ళిన కాసేపటికే రాజు మరణించాడు. రాజకుమారుడికి పట్టాభిషేకం చేశారు. ఒక రోజు కుక్క తో కలిసి అతను అడవిలో వేటకి వెళ్ళాడు. కాలికేదో తగిలి తట్టుకుని కిందపడ్డాడు. చూస్తే అదొక మొసలి. చిత్రంగా ఎక్కడినుంచో మాటలు వినిపించాయి- ” ఈ మొసలి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడున్నా పట్టుకోగలదు. ఇసక లో పెద్ద గొయ్యి తవ్వి నీళ్ళు నింపి ఒక రోజంతా అందులో దాక్కుంటే మటుకే నీకు క్షేమం. రేపటివరకే గడువు ” .

అప్పటికెందుకో ఏమీ చేయకుండా మొసలి వెళ్ళిపోయింది.

ఇసక గోతిలో నీళ్ళు నింపటం ఎలా ? పీల్చేసుకుంటుంది కదా. రాజకుమారి ఆలోచించింది. దూరంగా ఉన్న ఎడారిలో నాలుగే ఆకులున్న మొక్క ఒకటి ఉందనీ అది నీళ్ళు ఇసకలో ఇంకిపోకుండా ఉంచగలదనీ ఆమె వినిఉంది. వెంటనే అక్కడికి తన తెల్లటి గాడిదను ఎక్కి బయలుదేరింది. ప్రయాణం చాలా శ్రమగా ఉండింది. ఇసక తుఫాను లు, వేడి, దాహం.ఆమె   గాడిదను జాగ్రత్తగా చూసుకుంటూ దానితో ప్రేమగా మాట్లాడుతూ చివరికి ఒక కొండ దగ్గరికి చేరింది. దాని నీడన చల్లగా ఉంది. నాలుగాకుల మొక్క కొండ శిఖరం మీద పెరుగుతోంది. కాని కొండ చుట్టూ లోతైన , వెడల్పైన అగడ్త , దాని నిండా నీళ్ళు. తనతో తెచ్చుకున్న తాడు ని ముడి వేసి రాజకుమారి బలంగా కొండ మీదికి విసిరింది. అదృష్టవశాత్తూ అది ఉచ్చుగా ఒక చెట్టుకొమ్మకి తగులుకుంది. దాని ఆధారంతో ఆమె పైకి పాకటం మొదలుపెట్టింది. అది అంత సులువైన పనేమీ కాదు. అయినా పట్టువదలకుండా నిబ్బరంగా చివరికంటా వెళ్ళి మొక్కని సంపాదించింది. హుటాహుటిన ఆమె తిరిగి వచ్చేసరికి రాజకుమారుడు ఇసకలో తవ్వించిన పెద్ద గోతిలో నిలుచుని ఉన్నాడు. కొద్ది దూరం లోనే మొసలి పళ్ళు బయట పెట్టి చూస్తూ ఉంది. ” నీళ్ళు నింపండి ” అని కేక పెట్టింది ఆమె. ఆ గోతిలోకి మొక్కని విసిరీంది. నీళ్ళు ఇంకిపోలేదు, నిలిచి ఉన్నాయి. ఆ రోజంతా అతనికి ధైర్యం చెబుతూ, ఆహారం ఇస్తూ రాజకుమారి భర్త పక్కనే ఉంది. ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. మొసలి చూసి చూసి కోపంగా నిరాశగా నదిలోకి వెళ్ళిపోయింది. జ్యోతిష్కులు ఈ గండం కూడా గడిచిందని చెప్పారు. రాజకుమారుడికి భార్యను పొగిడేందుకు ఎన్ని మాటలూ సరిపోలేదు. ఆమె దొరకటం తన పుణ్యమని అనుకున్నాడు.

prince of egypt 3

ఇంకొన్ని రోజులు గడిచాక కుక్కతో ఇద్దరూ ఆ నది ఒడ్డునే షికారుకి వెళ్ళారు. అడవి బాతునొకదాన్ని వెంటాడుతూ కుక్క అతని కాళ్ళ మధ్యలోంచి పరుగెత్తబోయింది. కాలు జారి   అతను కుక్కతో సహా అక్కడి ఊబిలోకి పడిపోయాడు. వేగంగా కూరుకుపోతున్నాడు. రాజకుమారి చప్పున అక్కడికి వచ్చి తన మీద వేసుకున్న బట్టను అందించింది. అతనూ కుక్కా బయటపడ్డారు.

ఇలా కుక్క వల్ల రాగల మూడో గండమూ గడిచింది.

అతను అన్నాడు ” నా విధి కన్న నీ ప్రేమ గొప్పది ” అని.

ఆమె ఆనందంగా అవునంది.

ఇద్దరూ చాలా కాలం పాటు సుఖంగా ఉన్నారు.

  • ఈజిప్షియన్ జానపద కథ

[   ఈ కథను కొంత మార్చి ‘ మూడుగండాలు ‘ పేరుతో 1971 లో కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామలో భేతాళకథగా వేశారు. వడ్డాది పాపయ్య గారు బొమ్మలు గీసిన కొద్ది కథలలో (ఆయన ముఖచిత్రాలు, ప్రత్యేక రచనలకు బొమ్మలు వేసేవారు ) ఇది ఒకటి. చందమామ లో ( కొన్నిసార్లు చెప్పి, కొన్నిసార్లు చెప్పకుండా ) ప్రపంచ జానపద సాహిత్యం లోని చాలా కథలు కొత్త రూపం తో వచ్చాయి. వాటిని తిరగరాసినదీ లోట్లు దిద్దినదీ కుటుంబరావు గారే. ఇంటర్ నెట్, గ్లోబలైజేషన్ లేని రోజులలో మద్రాస్ నగరం లోని ఏ లైబ్రరీలలో ఆ కథలన్నీ దొరికాయో ! ఏ మెప్పు కోసమూ ఎదురు చూడకుండా ఆ మహానుభావుడు బాల సాహిత్యానికి ఎంత చేశారు !!! ]

–మైథిలీ అబ్బరాజు

 

జాగ్రత్త లేనివాడు

MythiliScaled

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ ! మహారాజుల దగ్గర కూడా ఉండనంత ఐశ్వర్యాన్ని సంపాదించాను. అదంతా అనుభవిస్తూ నా వ్యాపారం కొనసాగించు. పొరబాటున కూడా టిఫ్లిస్ నగరానికి మాత్రం వెళ్ళకు ” అని హెచ్చరించాడు.

తర్వాత భార్యని పిలిచి తన గది  తాళం చెవి ఇచ్చి ” మన అబ్బాయి అబ్దల్   ఒకవేళ డబ్బంతా పోగొట్టుకుని బీదవాడైతే నా రహస్యాలని అతనికి చెప్పు ” అని చనిపోయాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి  అబ్దల్ నలభై ఒంటెల మీద  సరుకులు వేసుకుని వర్తకం కోసం బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విడిది చేసి ఉండగా ఇద్దరు మనుషులు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని అటువైపుగా వచ్చారు. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అబ్దల్ కి జాలేసి వాళ్ళని పిలిచి భోజనం పెట్టించి  కొత్త బట్టలు ఇచ్చి ఏమైందని అడిగాడు.

” అయ్యా ! అది చెప్పకూడదు ” అన్నారు వాళ్ళు. అబ్దల్ చెప్పమని బలవంతం చేశాడు.

చివరికి వాళ్ళు ఇలా అన్నారు ” మాది కపన్ నగరం .మేమూ నీవంటి వర్తకులమే. మా దగ్గరా చాలా ధనం ఉండేది. కొన్ని రోజుల క్రితం మేము టిఫ్లిస్ నగరానికి వెళ్ళాం. ఆ రాజుగారి కూతురు జగదేక సుందరి అని విని ఆమెని చూడాలనుకున్నాం. ఒకసారి ఆమెని గాజు అద్దాలలోంచి చూడటానికి నలభై బంగారు నాణాలు ఇవ్వాలట. అలాగే ఇచ్చి ఒకసారి చూశాం. మళ్ళీ మళ్ళీ , ప్రతిరోజూ చూడాలనిపించేది. అలా రోజూ మా దగ్గర ఉన్న  సరుకంతా రాజుకే ఇచ్చేస్తూ రోజూ ఆమెని చూసేవాళ్ళం.

ఒకసారి చూశాక తిరిగి చూడాలనుకోకుండా ఉండటం మానవమాత్రులెవరికీ అయే పని కాదు. ఆమె అందం అంతగా ఆకర్షిస్తుంది.

ఎనభై ఒంటెల మీద తీసుకెళ్ళినదంతా ఖర్చయిపోయి, ఇదిగో, ఇలా అయిపోయాం. నువ్వు మంచివాడివిలా ఉన్నావు. మేము నీకు ఎదురు పడకుండా ఉంటే బావుండేది. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు, టిఫ్లిస్ కి మటుకు వెళ్ళకు ”

 

అంతా విని అబ్దల్ ఏమీ అనలేదు. మర్నాడు వాళ్ళిద్దరికీ గుప్పెడు బంగారునాణాలు ఇచ్చి పంపేశాడు. ఎంత వద్దనుకున్నా ఆ నగరానికి వెళ్ళాలనే అతనికి గట్టిగా అనిపించింది. ఒకసారి చూసి వచ్చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. వెళ్ళనే వెళ్ళాడు.

 

మొదటిసారి జగదేకసుందరిని చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. ఆమెని పలకరించాలనీ , ఒప్పించి పెళ్ళాడాలనీ రోజూ వెళ్ళి తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆమెకి తన మాటలు వినిపించినట్లే  లేదు. ఆ అద్దానికి అటువైపునుంచి  ఎవరూ కనిపించరని అతనికి తెలియలేదు.

ఇక చేసేదేమీ లేక యెరెవాన్ కి తిరిగి వెళ్ళి తల్లితో జరిగిందంతా చెప్పాడు. తండ్రిమాట పెడచెవిని పెట్టి అక్కడికి వెళ్ళినందుకు ఆమె కొడుకుని చెడామడా తిట్టింది. అబ్దల్ క్షమించమనీ మరి ఇంకెప్పుడూ వెళ్ళననీ బతిమాలుకున్నాడు. మళ్ళీ వ్యాపారం చేసి తండ్రి పేరు నిలబెట్టేందుకు పెట్టుబడి కావాలి కదా ! అందుకని తండ్రి తనకు ఇచ్చిన తాళం చెవితో ఆ రహస్యపు గది తలుపు తెరిచి  ఒక చిన్న సంచీని పట్టుకొచ్చింది.

story1

” అబ్దల్ ! ఇదిగో, ఇందులో నువ్వు నలభై రాగినాణాలు పెడితే తెల్లారేసరికి అవన్నీ బంగారు నాణాలుఅవుతాయి

. జాగ్రత్తగా వాడుకో ” అని అతనికి ఇచ్చింది.

పదిరోజులు అలా చేసేసరికి నాలుగు వందల బంగారు నాణాలు పోగయాయి. వాటితో కొత్తగా సరుకులు కొని అబ్దల్ మళ్ళీ వ్యాపారం చేస్తానని బయలుదేరాడు. అయితే కొన్నాళ్ళకే తల్లికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. టిఫ్లిస్ నగరానికే వెళ్ళాడు. రోజూ నలభై బంగారు నాణాలు ఇచ్చి రాజకుమారిని చూస్తూనే ఉన్నాడు. ఆ రాజు అతని డబ్బు ఎంతకీ అయిపోకపోవటం కనిపెట్టి ఒక రోజు అతన్ని పిలిచి కబుర్లలో పెట్టాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అబ్దల్ అడిగాడు.

” ఓ ! దానికేం ! తప్పకుండా …నీ తరగని ధనం రహస్యం ఏమిటో చెబితే అలాగే ఆమెతో నీ పెళ్ళి జరిపిస్తాను ” అని టక్కరి రాజు చెప్పేసరికి అబ్దల్ నమ్మి సంచి సంగతి చెప్పేశాడు. మాయమాటలతో సంచీ తీసేసుకుని రాజు అబ్దల్ ని వెళ్ళగొట్టాడు. అబ్దల్ కి చాలా ఏడుపు వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ” బుద్ధొచ్చిందమ్మా ! నాన్న ఇచ్చింది ఇంకేమీ లేదా నీ దగ్గర ? ఇస్తే బాగుపడతాను ఈ సారి ” అని వేడుకున్నాడు. ఈ సారి తల్లికి కోపం అంత తొందరగా తగ్గలేదు. పెట్టిందేదో తిని ఇంట్లోనే పడిఉండమంది. రెండు మూడు నెలలయినా అబ్దల్ ఆమెను బతిమాలుతూనే ఉన్నాడు. చివరికి కరిగి, తల్లి ఈ సారి ఒక టోపీ తెచ్చి ఇచ్చి

” ఇది తలమీద పెట్టుకుంటే ఎవరికీ కనబడవు. పోయినదాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ” అని గట్టిగా చెప్పి పంపించింది.

story2

ఇకనేం ! అతను ఆ టోపీ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. రాజభవనం కనుక భోజనానికి కొరత లేదు, ఎక్కడో ఒక చోట నిద్ర. అయినా కొంతకాలానికి ఎవరో అదృశ్యంగా అక్కడ ఉంటున్నారని చెలికత్తె లు కనిపెట్టి రాజుకు చెప్పారు. రాజుకి ఇది అతనేనేమోనని అనుమానం వచ్చి ” నువ్వెవరో తెలిస్తే కదా, నా కూతురితో పెళ్ళి చేయటానికి ” అని ఆశ పెట్టాడు. అబ్దల్ టోపీ తీసి ప్రత్యక్షమయ్యాడు. రాజు ” నువ్వు వెళ్ళినదగ్గర్నుంచీ తప్పు చేశానని నా కూతురు నా మీద కోపంగా ఉంది. నీ కోసం వెతికిస్తూనే ఉన్నాను. రేపే మీ పెళ్ళి ! ‘’ అని నమ్మించాడు . పెద్ద విందు ఏర్పాటు చేశారు. అబ్దల్ భోజనం లో మత్తు మందు కలిపి తినిపించారు.   స్పృహ పోగానే టోపీ తీసేసుకుని సేవకులతో అతన్ని ఊరవతల పడేయించారు. రాజకుమారికి ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు. తనని అబ్దల్ నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థమై తనూ అతన్ని ప్రేమించింది. కానీ తండ్రి చేసే పనులని అరికట్టటం ఆమె వల్ల కాలేదు.

మర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అబ్దల్ కి అంతా అల్లకల్లోలంగా అనిపించింది. రాజు మాటలు ఎలా నమ్మగలిగాడో తనకే అర్థం కాలేదు. ఇంటికి వెళితే తల్లి ఏమంటుందోననే భయం తో వెళ్ళలేకపోయాడు. వేలికి ఉన్న ఉంగరం అమ్మి కొన్నాళ్ళు గడిపాడు. ఆ డబ్బు ఖర్చయిపోయాక చివరికి వెళ్ళక తప్పలేదు. కొడుకు తెలివి తక్కువ తనానికీ దురదృష్టానికీ ఆమెకి దుఃఖం వచ్చింది. ఇక ఏమన్నా లాభం ఉండదనుకుందో ఏమో, అబ్దల్ ని పెద్దగా కోప్పడలేదు.

నాలుగు రోజులు పోయాక  తనే ఒక కొమ్ము బూరా తెచ్చి ఇచ్చి ” ఇదే మిగిలింది. దీన్నీ పోగొట్టు కున్నావంటే మనం బిచ్చమెత్తుకోవలసి వస్తుంది , మన మొహాన దేవుడు అదే రాస్తే తప్పించలేం. కానీ ప్రయత్నించు ” అని కొడుకుతో అంది.

ఆమె చెప్పినట్లు ఇద్దరూ ఊరి బయటి కొండ మీదికి ఎక్కిన తర్వాత  అబ్దల్ దాన్ని ఊదాడు. జెమాజెట్టీ ల లాంటి సైనికులు  లెక్కలేనంతమంది ఎక్కడినుంచో వచ్చేశారు. ” దొరా ! ఏమి సెలవు ? ” అని అబ్దల్ ను అడిగారు. ప్రస్తుతానికి ఏం అక్కర్లేదని   ఇంకో వైపునుచి  బూరా ఊదితే వాళ్ళు మాయమైపోయారు.

 

” వీళ్ళకి అసాధ్యమైనదేమీ లేదు, నీకు అన్నీ చేసిపెడతారు. ఆ టిఫ్లిస్  నగరాన్ని కూడా  జయించగలరు. ఆ పని చేయి ” అని తల్లి చెప్పి పంపించింది.

అబ్దల్ వెళ్ళి  టిఫ్లిస్ నగరం బయట కొమ్ము బూరా ఊదాడు. సైనికులకి  నగరాన్ని  ముట్టడించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే జరిగింది. నగరం లో ప్రజలు భయపడిపోయి రాజుకి మొర పెట్టుకున్నారు. రాజు దూతలని పంపి ఏం కావాలని అడిగించాడు.

” యుద్ధం ! యుద్ధానికి వచ్చాను ” అని గర్జించాడు అబ్దల్.

రాజు అక్కడికి  వెళ్ళి  ” ఇదిగో ! ఇప్పుడే నా కూతుర్ని తీసుకుపోయి పెళ్ళి చేసుకో ” అని ఆమెని అక్కడికి రప్పించాడు. అబ్దల్ రెండో వైపునుంచి ఊది సైన్యాన్ని పంపించేశాడు. బూరా జేబులోనే పెట్టుకున్నాడు. అయితే పెళ్ళి కోసమని స్నానం చేసేందుకు దుస్తులు పక్కన పెట్టవలసి వచ్చింది. అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న రాజు గూఢచారి చటుక్కున దాన్ని దొంగిలించి రాజుకి తెచ్చి ఇచ్చాడు. తర్వాతి కథ మామూలే. ఈ సారీ ఓడిపోయిన అబ్దల్ కి ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. తండ్రి దాచిఉంచినవన్నీ అయిపోయాయి. తల్లికి మొహం చూపించలేడు.

 

అక్కడికి దగ్గరలో సముద్రపు రేవు ఉంది. ఒక ఓడ దూరదేశాలకి బయలుదేరబోతూ ఉంది. అబ్దల్ అందులో పనివాడుగా చేరాడు. ఓడ ప్రయాణిస్తూ ఉండగా తుఫాన్ లో చిక్కుకుని  ముక్కలైపోయింది. అదృష్టవశాత్తూ అబ్దల్ కి ఏమీ కాలేదు. ఈదుకుంటూ  ఒక ఒడ్డుకి చెరాడు. అదొక దీవి. మనుషులెవరూ లేరుగానీ పుష్కలంగా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటితో ఆకలి తీర్చుకుంటూ కొంతకాలం గడిపాడు. ఒక రోజున రెండు ఆపిల్ చెట్లు పక్కపక్కనే కనిపించాయి. ఒక చెట్టు పండు కోసి తిన్నాడు. కాసేపటికి గాడిదగా మారిపోయాడు. ” ఓహో, నా దురదృష్టం ఇంకా పూర్తి కాలేదన్నమాట ” అన్న దిగులు లో మునిగిపోయాడు. కడుపునింపుకోవటం తప్పదు కనుక గడ్డి మేస్తూ బతకవలసి వచ్చింది. అలా ఇంకొక రోజున  అక్కడే రాలిపడిన ఇంకొక ఆపిల్ తిన్నాడు. మళ్ళీ మనిషి రూపం వచ్చేసింది.

” ఎందుకైనా పనికొస్తాయి ” అనుకుని రెండు రకాల పళ్ళూ కోసి విడి విడిగా దాచిపెట్టాడు. చివరికి ఒకనాడు దూరంగా ఒక ఓడ వెళుతూ కనిపించింది. అబ్దల్ చేతులు ఊపుతూ అరుస్తూ , ఆ ఓడలో వాళ్ళకి తను అక్కడ ఉన్నానని తెలిసేలా చేశాడు. ఓడ అక్కడికి వచ్చి అతన్ని ఎక్కించుకుంది. నావికులు అబ్దల్ కథ  విని జాలిపడి అతను కోరినట్లుగా  టిఫ్లిస్ నగరపు రేవు లో దించారు.

 

పళ్ళు అమ్మేవాడిలాగా మారువేషం వేసుకుని రాజభవనం దగ్గరికి వెళ్ళాడు. రాజకుమారి అతని దగ్గర మొదటి రకం ఆపిల్ పళ్ళు కొంది. ఆమె తినేలోపునే అతను తప్పించుకున్నాడు. తిన్నవెంటనే  వెంటనే జగదేకసుందరి కాస్తా గాడిదగా మారిపోయింది. అంతా గగ్గోలు పెట్టారు.

రాజు ఎంత చెడ్డవాడైనా కూతురి మీద అతనికి చాలా మమకారం. ఎక్కడెక్కడి వైద్యులనీ మంత్రగాళ్ళనీ పిలిపించి ఆమెని మామూలుగా చేయించటానికి ప్రయత్నించాడు. ఎవరూ చేయలేకపోయారు. రాజుకి ఆందోళన ఎక్కువైపోయింది. ఆఖర్న వైద్యుడి వేషం వేసుకుని అబ్దల్ వెళ్ళాడు.

 

” నేను మీ అమ్మాయిని ఎప్పటిలాగా చేయగలను. అయితే రెండు షరతులు. మొదటిది ఆమెని నాకిచ్చి పెళ్ళి చేయాలి. రెండోది నేను అడిగిన వస్తువులన్నీ నాకు ఇచ్చేయాలి, అవి మీ దగ్గర ఉన్నవే ”

 

నగరం లో పెద్ద మనుషులని పిలిపించి ముందే ఒప్పందం రాసుకున్నారు.

story3

 

” ముందుగా కపన్ నగరం వర్తకులనుంచి మీరు తీసుకున్న ఎనభై ఒంటెల మీది సరుకులు. తర్వాత  యెరెవాన్ యువకుడి నుంచి దొంగిలించిన డబ్బు సంచీ, టోపీ, కొమ్ము బూరా. ఇంకా అతని ఆస్తి- నలభై ఒంటెల మీది సరుకులు ”

 

రాజుకి అవన్నీ ఇచ్చేయటానికి ఎంతమాత్రం మనసొప్పలేదు. కానీ తప్పలేదు. తన కూతురు మనిషిగా మారాక మాత్రమే అవన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు. అన్నిటినీ తెప్పించి ఉంచమన్నాడు అబ్దల్.

 

రెండో రకం ఆపిల్ తినగానే రాజకుమారి మనిషిగా అయిపోయింది.

” నన్ను పెళ్ళాడటం నీకిష్టమేనా ? ” అని అసలు రూపం తో కనబడి అడిగాడు అబ్దల్. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. రాజు తెప్పించి ఉంచినవన్నీ అప్పటికప్పుడు తీసేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా యెరెవాన్ కి బయల్దేరి వెళ్ళాడు.గొప్ప వైభవం తో ఇంటికి వెళ్ళి

 

” అమ్మా ! పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాను. అదనంగా ఈమెని నీ కోడలిగా తెచ్చాను ” అని తల్లికి అన్నీ చూపించాడు. ఆమె అప్పటికే అబ్దల్ మళ్ళీ ఓడిపోయి ఉంటాడనీ ఇక తనకి కనబడడనీ నిరాశ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కబురు చేసి వర్తకులిద్దరినీ పిలిపించి అబ్దల్ వాళ్ళ ఆస్తిని వాళ్ళకి అప్పగించాడు. అంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. త్వరలోనే అబ్దల్ కీ జగదేకసుందరికీ పెళ్ళి జరిగింది. వాళ్ళు చాలాకాలం సుఖంగా జీవించారు.

రాజకుమారి ఎప్పుడైనా తండ్రిని చూసేందుకు టిఫ్లిస్ నగరానికి వెళ్ళేది కానీ అబ్దల్ మళ్ళీ అక్కడ అడుగు పెట్టలేదు.

  • ఆర్మీనియన్ జానపదకథ

[టర్కిష్  లో అబ్దల్ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు అని అర్థం. ఈ మాటను అరబిక్ లో సాధువులకి కూడా ఉపయోగిస్తారు]

గాజు కొండ మీద

MythiliScaled

అనగనగా ఒక గాజు కొండ. దాని మీద బంగారపు కోట. కోట ముంగిట్లో ఒక ఆపిల్ చెట్టు. దానికి బంగారు రంగులో  ఆపిల్ పళ్ళు కాసేవి.   కోట లోపల ఒక  వెండి గది. దాని గోడలకి ఆనించి పెద్ద పెద్ద భోషాణాలు, వాటినిండా  వెలలేని వజ్ర వైఢూర్యాలు. అలాంటి గదులు కోటలో చాలా ఉన్నాయిగాని ఈ గదిలో మాత్రం ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా చాలా అందంగా ఉండేది. నేలమాళిగలనిండా బంగారు కాసులు రాసులు పోసి ఉండేవి. ఒక మాంత్రికుడు ఆమె తండ్రిమీద కోపంతో రాజకుమారిని అక్కడ బంధించి ఉంచాడు. గాజు కొండ పైకి ఎక్కి ఆపిల్  పండు ఒకటి కోసి పట్టుకెళితేనేగాని  కోట తలుపులు తెరుచుకోవని అతను శపించాడు. కోటలోకి ప్రవేశించి రాజకుమారిని పెళ్ళాడి ఆ సంపదనంతా సంపాదించుకోవాలని ఎందరో వీరులు ప్రయత్నించారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎంత గట్టి పట్టు ఉన్న నాడాలని గుర్రాల కాలి గిట్టలకి తొడిగినా అవి  పైదాకా ఎక్కలేకపోయేవి. నున్నటి గాజుమీద వెనక్కి  జారిపోయి లోతైన లోయలో పడిపోతూ ఉండేవి. ఒక్క వీరుడు కూడా బతికి తిరిగి రాలేదు.

కిటికీ దగ్గరే కూర్చుని ఉండే రాజకుమారికి ఇదంతా కనిపించేది. ఎవరైనా కొత్తగా కొండ ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆమెకి విడుదలవుతానని ఆశ పుట్టేది. ఆ వీరులకీ ఆమెని చూస్తే ఉత్సాహం వచ్చేది. అయితే ఏమీ లాభం లేకపోయింది. అలా ఏడు సంవత్సరాలు ఆమె అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఏడేళ్ళ తర్వాత ఇక ఆమె బయటికి రాలేదు, ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి.

ఇంకొక మూడు రోజులలో ఏడేళ్ళూ పూర్తి అవుతాయనగా ఆ రోజున బంగారు కవచమూ శిరస్త్రాణమూ ధరించిన ఒక యువకుడు కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. అతని గుర్రం బలంగా, చురుకుగా ఉంది. జారిపోకుండా ఉండేందుకు దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నాడాలు తొడిగారు. సగం దూరం ఎక్కింది కానీ మరి చేతకాలేదు. అయితే జారకుండా జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఆగింది. రెండో రోజు ఇంకా తొందరగా , నేర్పుగా ఇంచుమించు పైదాకా వెళ్ళింది. నాలుగు అడుగులు వేస్తే గుర్రం మీది యువకుడికి ఆపిల్ పళ్ళు అందేలా ఉన్నాయి. సరిగ్గా అప్పుడు ఎక్కడినుంచో భయంకరమైన రాబందు  ఒకటి ఎగిరి వచ్చింది. అది ఏనుగంత పెద్దగా ఉంది. రెక్కలతో చటుక్కున గుర్రం కళ్ళ మీద కొట్టింది. బాధతో గట్టిగా సకిలించి గుర్రం, ముందు కాళ్ళ మీద పైకి లేచింది. అంతే ! వెనకకాళ్ళకి పట్టు జారిపోయింది. గుర్రమూ దాని మీది యువకుడూ ఇద్దరూ గాజు మీద జారిపోయి లోయలోకి పడిపోయారు. చూస్తూ ఉన్న రాజకుమారి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎలాగూ తనకి విముక్తి లేదు, తనకోసం ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నందుకు ఆమెకి దుఃఖం ఆగలేదు.

glass mountain 1

ఆఖరి రోజున ఒక కుర్రవాడు వచ్చాడు. హుషారుగా సరదాగా ఉన్నాడు. చిన్నపిల్లవాడికిలాగా మొహం లేతగా ఉంది , కానీ బాగా పొడుగ్గా దృఢంగా ఉన్నాడు. అంతమందీ  ఏమీచే యలేకపోయారనీ చచ్చిపోయారనీ అతనికి తెలుసు. అయినా ధైర్యంగా తనవంతు ప్రయత్నం చేద్దామనే అనుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో కమ్మరి చేత కాలివేళ్ళకీ చేతివేళ్ళకీ ఇనప గోళ్ళు తయారు చేయించుకున్నాడు. వాటిని తగిలించుకుని చాలా కొండలు ఎక్కి సాధన చేశాడు. అవన్నీ నిట్టనిలువుగా ఉన్న కొండలు, ఎక్కడా పట్టు దొరకనివి. గాజువి అయితే కావు, ఇటువంటి కొండ ఇదొక్కటే.

అతను ఎక్కటం మొదలుపెట్టాడు. ఓపికగా కాస్త కాస్తగా పైకి వెళుతున్నాడు. చూస్తుండగానే పొద్దుకుంకింది. బాగా అలిసిపోయాడు. దాహంతో గొంతు ఎండిపోతూ ఉంది. కాళ్ళకి ఇనపగోళ్ళు గుచ్చుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. చేతులతో మాత్రమే పాకగలుగుతున్నాడు. కొండ మీది ఆపిల్ చెట్టు కనబడుతుందేమోనని పైకి చూశాడు. కనిపించలేదు. కిందికి చూశాడు, అగాథమైన లోయ. తన కంటే ముందు వచ్చినవారంతా అందులోకే పడిపోయారని అతనికి తట్టింది, భయం వేసింది. చేతి గోళ్ళ పట్టు మాత్రం వదిలిపెట్టలేదు. మెల్లిగా చీకటి పడింది. బడలిక వల్ల అలాగే అక్కడే  నిద్రపోయాడు.glass mountain 2

 

అంతకుముందు రోజు యువకుడి గుర్రాన్ని కిందపడేసిన రాబందు అటువైపుగా వచ్చింది. అది మామూలు రాబందు  కాదు , పిశాచపక్షి. ఎవరూ చివరివరకూ రాకుండా  దాన్ని మాంత్రికుడే ఏర్పాటు చేశాడు. రోజూ రాత్రి వేళల్లో అది కొండ చుట్టూ చక్కర్లు కొడుతూ కాపలా కాస్తుంటుంది. ఈ నిద్రపోయే కుర్రవాడిని చూసి చచ్చిపోయాడని అనుకుంది. తినేందుకు దగ్గరికి వచ్చి ముక్కుతో పొడిచింది. అతనికి మెలకువ వచ్చింది, వస్తూనే ఒక ఉపాయం తట్టింది. రాబందు పొడుస్తున్న చోట విపరీతమైన నొప్పిగా ఉన్నా ఓర్చుకున్నాడు. దాని రెండుకాళ్ళూ గట్టిగా పట్టుకున్నాడు. అది బెదిరి పైకి ఎగిరింది. దానితోపాటు అతనూ గాలిలోకి లేచాడు. కొండ పైకంటా ఎగిరి గాలిలో గుండ్రంగా తిరుగుతోంది. అతను కళ్ళు తెరిచి చూస్తే కిందన బంగారుకోట పెద్ద దీపంలాగా కనిపిస్తోంది. రాబందు ఎగరటం లో ఒకసారి ఆపిల్ చెట్టుకి దగ్గరగా వచ్చింది. అతను తటాలున కిందికి దూకాడు. దూకబోయేముందు ఇనపగోళ్ళతో దాన్ని బలంగా కొట్టాడు. అది వికృతంగా అరుస్తూ లోయలోకి పడిపోయింది. కుర్రవాడు ఆపిల్ చెట్టు కొమ్మల్లోకి పడ్డాడు. పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. ఆకలేసి రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. చేతులకి ఆ రసం అంటిన చోట గాయాలు మాయమైపోయాయి. ఇంకొక పండుకోసి ఒంటిమీద దెబ్బలు తగిలినచోటల్లా రుద్దుకున్నాడు. అన్నీ నయమైపోయాయి. బోలెడంత శక్తి వచ్చింది. మరికొన్ని పళ్ళు కోసి చేత్తో పట్టుకుని కోట దగ్గరికి వెళ్ళాడు.

glass mountain 3

 

కోట గడప  దగ్గర ఒక డ్రాగన్ పహరా కాస్తోంది. ఆపిల్ ని దానిమీదికి విసరగానే అది మాయమైంది. తలుపులు తెరుచుకున్నాయి. రంగురంగుల  పూల మొక్కలు, పళ్ళ చెట్ల మధ్యలోంచి రాజకుమారి నడిచివచ్చింది. ఆమె వెంట తల్లి, తండ్రి, పరివారం- అంతా ఉన్నారు. వాళ్ళందరికీ అప్పుడే శాపం తీరింది.ఆ కొండ మీదే వాళ్ళ రాజ్యం- చాలా పెద్దది.  చేతిలో ఉన్న పూలమాలని కుర్రవాడి మెడలో వేసింది. అతనికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. రాజకుమారి ఎంత అందమైనదో అంత మంచిది కూడా. ఆమెతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.

 

మరుసటి  రోజు  వాళ్ళిద్దరూ తోటలో తిరుగుతుండగా గాజు కొండ కింద పెద్ద కలకలం వినబడింది. ఆ రాజ్యం లో వానకోయిలలు అన్ని చోట్లకీ ఎగిరి వెళ్ళి వచ్చి  వార్తలు చెబుతూ ఉంటాయి. కుర్రవాడు ఈల వేసి ఒక వానకోయిలని పిలిచి సంగతి ఏమిటో కనుక్కురమ్మన్నాడు.

 

అది వచ్చి చెప్పింది- ” రాబందు లోయలోకి పడినప్పుడు దాని రక్తపు చుక్కలు చనిపోయిన వీరులందరిమీదా పడ్డాయి. వాళ్ళు వాళ్ళ గుర్రాలతో సహా ఒక్కొక్కరే బతికి లేస్తున్నారు. ఆశ్చర్యంగా, ఆనందంగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరుతున్నారు. అదీ ఆ హడావిడి . ”

                                                                                               [  పోలండ్ జానపద కథ]

                                                                         సేకరణ- Hermann Kletke, Andrew Lang

 

 

ఆశ – దురాశ

MythiliScaled

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి దొరకటమే కష్టమయిపోయింది. అన్న దగ్గరికి వెళ్ళి , సంగతి చెప్పి, కొంచెం డబ్బు- అప్పుగానైనా సరే, ఇమ్మని అడిగాడు. హాన్స్ ససేమిరా వీల్లేదన్నాడు.

 

” నేనేమీ రాసులు పోసుకు కూర్చోలేదు ఊరికే ఇవ్వటానికి. నీకు అప్పు ఇస్తే వెనక్కి వస్తుందా ! ఎక్కడో  కాసులు బఠాణీ గింజల్లాగా దొర్లుతున్నాయట, వెళ్ళి వెతుక్కో ”

సరేననుకుని  క్లాస్ బయలుదేరాడు. వెళ్ళే ముందర దగ్గర్లో ఉన్న అడవిలో ఒక హేజెల్ చెట్టు కొమ్మని విరిచి చేతికర్రగా తయారు చేసుకున్నాడు. ఆ చెట్టు నిజానికి మంత్రపు చెట్టు. ఆ కర్ర ఎక్కడెక్కడ నిధులూ నిక్షేపాలూ ఉన్నాయో చూపించగలదు. అదేమీ క్లాస్ కి తెలియనే తెలియదు.

అతను ఏ కష్టమూ లేనట్లే కులాసాగా ఈలవేసుకుంటూ ప్రయాణించి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడి సంతలో పని కావలసినవాళ్ళంతా బార్లు తీరి ఉన్నారు. వాళ్ళతోబాటు తను కూడా నాలుగు ఎండు గడ్డి పోచలు నములుతూ నిలుచున్నాడు. అలా గడ్డి నోట్లో పెట్టుకుని ఉంటే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అక్కడి అర్థం.

అంతలో అక్కడికి ఒక వంగిపోయిన ముసలివాడు వచ్చాడు. పైకి అలా కనిపించడు కానీ చాలా విషయాలు తెలుసు అతనికి, ముఖ్యంగా మంత్రాలూ తంత్రాలూ. క్లాస్ చేతి కర్రకి మహిమ ఉందని చూసీ చూడగానే కనిపెట్టాడు. కాసేపు అటూ ఇటూ తచ్చాడి క్లాస్ దగ్గరికి వచ్చాడు .

” అయితే, పనిలో చేరాలనుకుంటున్నావా ? ” అడిగాడు.

క్లాస్ ” మరే. లేకపోతే ఇలా గడ్డి నములుతూ ఎందుకుంటానూ ?”

మాటలు మొదలయ్యాయి. అటూ ఇటూ బేరాలు సాగి సాగి చివరికి వారానికి ఏడు పెన్నీల జీతానికి క్లాస్ ముసలివాడి దగ్గర పనిచేసేందుకు ఖరారైంది. క్లాస్ ని వెంటబెట్టుకుని కొంత దూరం నడిచాక ముసలివాడు ఆ కర్ర ఎక్కడనుంచి తెచ్చుకున్నావని అడిగాడు.

” ఎక్కడోలెండి ” అన్నాడు క్లాస్.

pepper-and-salt

 

” ఎక్కడో గుర్తు చేసుకోగలవా ?” ముసలివాడు అడిగాడు.

 

” అబ్బే, కష్టం ” క్లాస్ పెదవి విరిచాడు.

 

” ఇదిగో, ఒక వెండినాణెం. ఇప్పుడు ?”

 

” ఊ..సరేలెండి. గుర్తొస్తున్నట్టే ఉంది ”

 

ముసలివాడు పసుపచ్చని నీళ్ళు ఉన్న ఒక సీసాని తెచ్చి క్లాస్ తో అన్నాడు ” ఆ  కొమ్మ ఎక్కడ విరిచావో  ఆ మొదట్లో ఇదిగో, దీన్ని  ఒంపెయ్యి. అక్కడినుంచి ఏడు ఆకుపచ్చటి పాములు వస్తాయి. నిన్ను ఏమీ చేయవు, వాటిదారిన వాటిని పోనీ. ఆ తర్వాత ఆ విరిగిన  కొమ్మ నుంచి కొత్త ఆకులు మొలుస్తాయి. ఒక్కటీ వదలకుండా అన్నీ కోసి ఈ సీసాలో వేసుకురా. అప్పుడు నీకు ఇంకో వెండినాణెం ఇస్తాను ”

అదేమంత బరువుపనిగా తోచలేదు క్లాస్ కి. ఇంత అన్నం పెడితే తినేసి బయల్దేరిపోయాడు.

ఆ హేజెల్ చెట్టు పెద్ద శ్రమ లేకుండానే దొరికింది. ముసలివాడు చెప్పినట్లే చేశాడు. అలాగే ఆకుపచ్చపాములు వచ్చి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మొలుచుకొచ్చిన ఆకులు మటుకు   విడ్డూరంగా ఉన్నాయి. అంచుల్లో వెండిలాగా మెరుస్తున్న అటువంటి ఆకులని అదివరకు  ఏ చెట్టు మీదా అలాంటివాటిని క్లాస్ చూసిఉండలేదు

 

అవి మంత్రపు ఆకులు. వాటిని నిళ్ళలో మరిగించి ఆ కషాయం తాగితే పక్షులూ జంతువులు అన్నిటి మాటలూ అర్థమవుతాయి. అన్నీ కోసి సీసాలో వేసుకుని ముసలివాడి దగ్గరికి తెచ్చాడు. అతను చెప్పినట్లు చితుకులు పోగు చేసి పొయ్యి వెలిగించాడు. బాగా పెద్ద మంట వచ్చాక దానిమీద కుండ లో నీళ్ళు పెట్టి అవి తెర్లుతూ ఉన్నప్పుడు ఆకులన్నీ ఒకేసారి వేశాడు. ఈ లోపు ముసలివాడికోసం ఎవరో వచ్చారు. కుండలోంచి చాలా మంచి వాసనలు వచ్చాయి. క్లాస్ కి నోరూరి ఒక చెంచా అందులో ముంచి నోట్లో వేసుకున్నాడు. గొప్ప రుచిగా ఉంది కషాయం.   కషాయం లో మహిమ అంతా  క్లాస్ ముంచిన చెంచా కి అంటుకుని క్లాస్ నోట్లోకి వెళ్ళిపోయింది. ముసలివాడికి గదిలోకి వస్తూనే ఆ విషయం తెలిసిపోయింది. క్లాస్ ని తెగతిట్టాడు. క్లాస్ కి ఏమీ అర్థం కాలేదు. పొరబాటున ఆ కాస్తా రుచి చూశాననీ క్షమించమనీ  వేడుకున్నాడు. ముసలివాడి కోపం అంతకంతకూ ఎక్కువైపోయింది.

 

” అది తాగావుగా. ఇదీ తీసుకో ” అని క్లాస్  మీదికి వేడి కషాయాన్ని విసిరికొట్టాడు. క్లాస్ చటుక్కున వెనక్కి తప్పుకుని మొహం కాలిపోకుండా కాపాడుకోగలిగాడు. ఇక అక్కడుంటే ముసలివాడు ఏం చేస్తాడోనని భయపడి వీధిలోకి పారిపోయాడు. అక్కడ ఒక కోడిపెట్టా కోడిపుంజూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. క్లాస్ కి అవన్నీ తెలిసిపోతున్నాయి. అతను రావటం చూసి

కోడి పెట్ట ” ఇడుగో, కొత్త నౌకరు వెళ్ళిపోతున్నాడు ”

కోడి పుంజు ” వెళ్తే వెళ్ళాడు గానీ అసలైనదాన్ని వెనకాలే వదిలేశాడే ”

 

” దేన్ని ?”

” ఆ హేజెల్ కర్రని. ”

 

” అవునవును. రత్నాలని రాళ్ళనుకుని పారేసుకుంటూ ఉంటారు ”

 

క్లాస్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా ముసలివాడి ఇంట్లో దూరి  ఆ కర్ర ని తెచ్చేసుకున్నాడు. అది ఎందుకు పనికొస్తుందో తెలియకపోయినా భద్రంగా పట్టు కున్నాడు. ఒక చెట్టుకింద  నిద్రపోయేముందర చొక్కాలో దూర్చుకుని పడుకున్నాడు.

 

నిద్ర పట్టబోతుండగా చెట్టు మీదినుంచి రెండు గుడ్లగూబలు మాట్లాడు మాట్లాడుకుంటున్నాయి.

 

” ఆ హేజెల్ కొమ్మ తో ఏం చేయచ్చో క్లాస్ కి తెలీదు కదా పాపం ”

 

” ఏం చేయచ్చు ?”

” వాళ్ళ ఊళ్ళో హార్ ఆక్సెల్ అనే అతని ఇల్లు ఉంది కదా , ఆ వెనక కొండమీద  మూడు నిలువుల ఎత్తున పెద్ద బండ రాయి ఉంది. ఆ కర్ర తో దాని మీద కొడితే బోలెడంత వెండీ బంగారమూ దొరుకుతా యి ”

 

” ఓహో ” అనుకుని క్లాస్ అప్పటికప్పుడు ఇంటిదారి పట్టాడు.

 

హాన్స్ చూశాడు. ” మళ్ళీ వచ్చావేం ? డబ్బు గడించావా ?” అని వెటకారం చేశాడు. క్లాస్ పట్టించుకోలేదు.

కాస్త చీకటి పడనిచ్చి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. గుడ్లగూబలు చెప్పినట్లే ఆ కొండ మీద మూడు నిలువుల ఎత్తు  బండరాయి ఉంది. కర్రతో దానిమీద కొట్టేసరికి అది తలుపులాగా తెరుచుకుంది. మెట్లుదిగితే కింద పెద్ద చావడి [ హాల్ ]ఉంది. దాని గోడలకి పేర్చి ధాన్యం  బస్తాల లాగా  చాలా ఉన్నాయి. . దగ్గరికి వెళ్ళి చూస్తే నిండా వెండి బంగారాలు.

 

ఆ చావడి చివరన  రాతి అరుగు మీద హుక్కా తాగుతూ  ఒక మరుగుజ్జు మనిషి కూర్చుని ఉన్నాడు. అతని గడ్డం పొడుగ్గా నేల మీద జీరాడుతూ ఉంది.

” ఎలా వచ్చావు క్లాస్ ఇక్కడికి ” అని అతన్ని పేరుపెట్టి పిలిచి ఏం కావాలని అడిగాడు.

క్లాస్ బెరుగ్గా, వినయంగా ” కొంచెం డబ్బు తీసుకోవచ్చా అండీ ? ” అని అడిగాడు.

‘ నీకు కావలసినంత తీసుకో.అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అన్నాడు మరుగుజ్జు మనిషి.

క్లాస్ జేబుల నిండుగా వెండీ బంగారు నాణాలు నింపుకుని మరుగుజ్జు మనిషికి కృతజ్ఞతలు చెప్పుకుని మూసిన తలుపు మీద కర్రతో కొడితే అది తెరుచుకుంది. ఇవతలికి వచ్చేశాడు.కర్రని జాగ్రత్తగా తెచ్చేసుకున్నాడు. బండరాయి ఎప్పటిలా మూసుకుపోయింది.

 

ఆ తర్వాత  అప్పుడప్పుడూ కొండ దగ్గరికి వెళ్ళి జేబుల్లో నాణాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. సంచి పట్టుకెళ్ళి నింపుకోవచ్చునని అతనికి తట్టలేదు. క్లాస్ పెద్దగా పనేమీ చేయకపోయినా అతనికి బాగా జరిగిపోతూ ఉండటం హాన్స్ కి ఆశ్చర్యం కలిగించింది .

 

ఒక రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళి గుచ్చి గుచ్చి అడిగాడు. ముందు ఏమీ చెప్పదలచుకోకపోయినా అన్నకి సాయం చేద్దామని క్లాస్ కి అనిపించింది. అంతా వివరంగా చెప్పాడు. తనకున్నది ఇద్దరమూ పంచుకుందామని అన్నాడు. అయితే హాన్స్ అలా తృప్తి పడే రకం కాదు. మోయగలిగినన్ని సంచులూ హేజెల్ కర్రా తీసుకుని బయల్దేరాడు.

 

మరుగుజ్జు మనిషి ఏం కావాలని అడిగితే ఆ సంచుల నిండుగా బంగారం కావాలన్నాడు.

 

” సరే, నీ ఇష్టం. అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అని హెచ్చరించాడు.

 

ఆత్రంగా సంచులన్నీ నింపి ఒక్కొక్కటే తలుపు దగ్గరికి చేరవేశాడు. హేజెల్ కర్రని అక్కడే వదిలేశాడు. ఎంత నెట్టినా  తలుపు తెరుచుకోకపోతే అప్పుడు హాన్స్ కి కర్ర సంగతి గుర్తొచ్చింది. మరుగుజ్జు అప్పటికి దాన్ని తీసేసుకున్నాడు.

 

” నువ్వు ఎంత అడిగినా దీన్ని ఇవ్వను. నువ్వూ ఇక్కడే పడిఉండాల్సిందే ” అన్నాడు మరుగుజ్జు. అక్కడ తిండీ నీళ్ళూ ఉండవని కూడా చెప్పాడు.

 

హాన్స్ భయపడిపోయి పదే పదే  బ్రతిమాలాక అతను మాత్రం బయటికి వెళ్ళేందుకు మరుగుజ్జు తలుపు తెరిచాడు. బంగారునాణాల సంచులు ఒక్కటి కూడా తీసుకెళ్ళటానికి మరుగుజ్జు ఒప్పుకోలేదు. ప్రాణం దక్కిందే చాలనుకుని హాన్స్ బయటపడ్డాడు.

 

తమ్ముడి దగ్గరికి వెళ్ళి కర్రని పోగొట్టినందుకు క్షమించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. క్లాస్ ముందు కొంచెం బాధపడినా కావలసినంత సంపద ఉంది కనుక అన్నని ఓదార్చాడు. క్లాస్ తన దగ్గరి డబ్బులో సగం ఇస్తానని అన్నా హాన్స్ కి సిగ్గనిపించి  తీసుకోలేదు. తనకున్నది చాలన్నాడు.

ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బ్రతికినంతకాలం అన్యోన్యంగా జీవించారు.

 

[ Howard Pyle సేకరించి,తిరగరాసి, బొమ్మలు గీసి ప్రచురించిన fairy tales  సంకలనం Pepper and Salt నుంచి                   స్వేచ్ఛానువాదం: మైథిలి అబ్బరాజు  ]

mythili

 

 

 

 

.

రోజ్ మేరీ

MythiliScaled

ఒకానొకప్పుడు ఒక తండ్రీ కూతురూ ఉండేవారు. వాళ్ళకి కొంచెం పొలం ఉండేది. అమ్మాయి కి రోజ్ మేరీ మొక్క  సువాసన చాలా ఇష్టం. తన గౌన్ లో ఎప్పుడూ  ఆ రెమ్మలు దాచుకునేది. అవి వాడిపోతే మళ్ళీ తెచ్చుకునేది. అసలు పేరు ఏదో కాని అంతా తనని అదే పేరు తో పిలిచేవారు. కష్టపడి ఇంటి పని అంతా చేసేది. ఒక సాయంత్రం పని ముగిసిన తర్వాత తండ్రి ఆమెని అడవి లోకి వెళ్ళి చితుకులు ఏరుకు రమ్మని పంపించాడు, మర్నాడు పొయ్యిలో పెట్టటానికని. తను వెళ్ళి కట్టె పుల్లలు ఏరి పెద్ద మోపుగా కట్టింది. పక్కనే  రోజ్ మేరీ మొక్క కనిపించింది. దాన్ని పెకలించి ఇంటికి తీసుకువెళదామనుకుంటే  అది అంత తేలికగా  రాలేదు. బాగా బలంగా లాగేసరికి ఊడి వచ్చింది.

ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ” నా కట్టెలు  దొంగిలిస్తున్నావెందుకు ? ” అని గద్దించి అడిగాడు.

అమ్మాయికి భయం వేసింది. వాళ్ళ నాన్న తెమ్మన్నాడని మెల్లిగా గొణిగింది.

రోజ్ మేరీ మొక్క ఉన్న చోట భూమిలో ఒక సొరంగం ఏర్పడింది. ” సరే అయితే. నాతో రా ఇలాగ ” అని యువకుడు పిలిచాడు. అమ్మాయి భయం భయంగా అతని వెంట వెళ్ళింది. సొరంగం లోకి దిగి  చాలా దూరం నడిచాక ఒక  గొప్ప భవంతి  వచ్చింది. లోపల చాలా వైభవంగా ఉంది.  చుట్టూ అందమైన తోట. ఇద్దరూ లోపలికి వెళ్ళాక అతను ” నీ అంత సొగసైనదాన్ని ఎప్పుడూ చూడనేలేదు. నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోతావా ? ” అని అడిగాడు.

తనకీ అతను నచ్చాడు. ఆనందంగా ఒప్పుకుంది. వాళ్ళు పెళ్ళి చేసుకుని అక్కడ కొంతకాలం హాయిగా ఉన్నారు.

 

moon

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది

ఆ ఇంటి బాగోగులు చూసేందుకు ఒక పెద్దావిడ ఉంది. ఆవిడ పెద్ద తాళం చెవుల గుత్తిని రోజ్ మేరీ కి ఇచ్చింది. వాటిలో ఒక్క తాళం చెవిని మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదనీ అలా చేస్తే ఆ భవనం కూలిపోతుందనీ  తన భర్త తనని మరచిపోతాడనీ హెచ్చరించింది. రోజ్ మేరీ సరేనంది. కాని ఆ మాటలని అంతగా నమ్మలేదు

ఏ పని చేయకూడంటారో అదే చేయబుద్ధి వేస్తూ ఉంటుంది. ఆ తాళం చెవి దేనికి సంబంధించినదా అని వెతికితే అదొక పెద్ద భోషాణానిది అని తెలిసింది.అందులో ఏముందా అని ఆరాటం. ఒక రోజు తోచీ తోచకుండా ఉండి ఆ భోషాణాన్ని ఆమె తెరవనే తెరిచింది. లోపల  ఏమీ లేదు. కాని ఆ వెంటనే తన కాళ్ళ కిందన  నేల దడదడలాడింది .భవనం ఒక్కసారిగా మాయమైంది. ఏమవుతోందో తెలిసేసరికి ఒక పొలం మధ్యలో నిలబడి ఉంది. ఎక్కడుందో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆమె పెద్ద పెట్టున ఏడ్చింది- తప్పు చేశానని, తను ఎంతో ప్రేమించే భర్త కనిపించడని.

కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

rosemary

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

” మా యజమాని చంద్రుడు. ఆయనకి చెబుతాను ఉండు ” అని ముసలావిడ చంద్రుడిని పిలుచుకొచ్చింది. చంద్రుడికీ ఆమె భర్త సంగతి తెలియదు. అతనూ ఇంకొక కాయని ఆమెకి ఇచ్చి ఆపద కలిగినప్పుడు బద్దలు కొట్టమన్నాడు. అది తెల్లగా పాలరాయిలా ఉంది.

ధన్యవాదాలు చెప్పుకుని ఆమె మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సారి గాలి దేవుడు ఉండే కోటకి చేరుకుంది. గాలి దేవుడు  తనకీ ఆమె భర్త ఆచూకీ తెలియదనే అన్నాడు. మట్టి రంగులో ఉన్న  అక్రూట్ కాయని ఇచ్చి సూర్యుడూ చంద్రుడూ చెప్పినట్లే చెప్పాడు.

అయితే ఈ సారి ఆమె కదలలేదు. విపరీతంగా అలిసిపోయి ఉంది. పైగా పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఆ కోట మెట్ల దగ్గరే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

గాలి దేవుడికి పాపం అనిపించింది. ” భయపడకు. ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి అంతా వెతుకుతాను. ” అని పెద్ద శబ్దం చేసుకుంటూ తేలి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు.

” తెలిసిందమ్మా అంతను ఎక్కడున్నాడో. ఒక రాజు గారి దగ్గర బంధించి ఉంచారు. ఆ రాజు కూతురికి ఇతను నచ్చాడట. ఇతను వద్దన్నా బలవంతంగారేపు పెళ్ళి చేయబోతున్నారు

” అని ఆ రాజ్యం ఎక్కడో చెప్పాడు.

అమ్మాయికి చాలా నిరాశ. ధైర్యం తెచ్చుకుని గాలి దేవుడిని అడిగింది ” ఒక్క రెండు మూడు రోజులు ఆ పెళ్ళిని ఆపగలరా ? నేను అక్కడికి వెళ్ళేందుకు అంత సమయం పడుతుంది కదా ‘’

” ఓ. అదెంత పని ! ” అని గాలి వెళ్ళాడు.

పెళ్ళికూతురు బట్టలు కుట్టే పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి మహా విసురుగా వీచాడు. ఆ గౌన్ ల లేస్ లూ అంచులకి కుట్టే  ముత్యాలూ రత్నాలూ చెల్లా చెదురై పోయాయి- చెట్ల మీదికి, నది లోకి, పొలాల్లోకి. కుట్టుపనివాళ్ళు హడావిడిగా వాటిని పట్టుకునేందుకు ఎంతగా  కిందా మీదా పడ్డా ఏమీ లాభం లేకపోయింది. లేస్ లు చిరిగి  పోయాయి. పట్టు బట్టలన్నీ బురద కొట్టుకు పోయాయి. ముత్యాలూ రత్నాలూ గుప్పెడు  కూడా దొరకలేదు. మళ్ళీ బజారుకు వెళ్ళి కొత్తవి కొనుక్కు రావాలి అంతే. రాజు చిరాకు పడ్డాడు.” ఏదయితే అదే అయింది. ఆ గౌన్ లోనే అలంకరించండి ” అని ఉత్తరువు ఇచ్చాడు. దర్జీ లు కూర్చుని  ఏదో కుట్టారు. కాని కూతురిని ఆ చిరిగి మాసికలు వేసిన , మాసిపోయిన  గౌన్ లో చూసేసరికి ” బాగాలేదు, వద్దులే ” అనిపించింది రాజుకి.

కొద్ది గంటలలో అంతా మళ్ళీ సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు గడిచిపోయింది.

చాలా వేగంగా నడిచిన  రోజ్ మేరీ తెల్లారేసరికి రాజభవనం వాకిట్లోకి వచ్చింది.

సూర్యుడు ఇచ్చిన కాయని  పగలగొట్టింది . అందులోంచి తళతళలాడుతూ లాడుతూ తెల్లటి పొడుగాటి శాలువా  వచ్చింది. దాన్ని పెళ్ళప్పుడు భుజాల మీదినుంచి వెనక్కి జారేటట్లు వేస్తారు.

అది తీసుకుని రాకుమారి చెలికత్తెలకి చూపించి ” మీ రాకుమారికి ఇది కావాలా ? ఆమె పెళ్ళి ట కదా ? ” అని అడిగింది.

రాకుమారి కి విషయం తెలిసి బయటికి వచ్చింది. పిడికెడు బంగారు కాసులు ఇచ్చి ఆ శాలువా కొనుక్కుంది. రాకుమారి అటు తిరగగానే చంద్రుడు ఇచ్చిన పాలరాయి కాయని రోజ్ మేరీ  పగలగొట్టింది. ఈ సారి  మిలమిలలాడుతూ వజ్రాలు  కుట్టిన మేలి ముసుగు వచ్చింది.  రాకుమారి ఇంకా ఎక్కువ బంగారం ఇచ్చి దాన్నీ  కొనుక్కుంది. రెండుసార్లూ ఇచ్చిన బంగారు కాసులని రోజ్ మేరీ జాగ్రత్త గా దాచుకుంది .

మెట్లుదిగి పక్కకి వెళ్ళి రోజ్ మేరీ అక్రూట్ కాయని కూడా బద్దలు కొట్టింది. పొరలు పొరలుగా ,గాలి అలల లాగా కదిలే చక్కని పెళ్ళి గౌన్ వచ్చింది.రాకుమారి అదీ కావాలంది. దర్జీలు కొత్త గౌన్ ని ఇప్పట్లో తయారు చేయలేరని ఆమెకి తెలుసు.

ఈ సారి రోజ్ మేరీ బంగారం వద్దంది. ” ఒక్కసారి నేను పెళ్ళికొడుకుని చూడాలి. అలా అయితేనే ఈ గౌన్ ఇస్తాను మీకు ”

ఇది రాకుమారికి పెద్ద నచ్చలేదు. అయినా చూసినంత మాత్రాన ఏం మునిగిపోతుందిలే అని ఒప్పుకుంది.

రోజ్ మేరీ ని ఆమె భర్త ఉన్న చోటికి తీసుకు వెళ్ళారు. అతను ఆమెని గుర్తు పట్టలేదు.  ఆమె దగ్గరగా వెళ్ళి తన దగ్గర ఉన్న రోజ్ మేరీ రెమ్మ తో అతన్ని తాకింది. అతనికి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కళ్ళనీళ్ళతో తన తప్పుకి  క్షమాపణ అడిగింది. అతను ” కలుసుకున్నాము గా. ఏమీ పర్వాలేదు ” అని ఓదార్చాడు.

అక్కడికి వచ్చిన  రాజుతో ” నాకు ఇదివరకే పెళ్ళైంది. ఈమె నా భార్య. నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేను ” అని చెప్పాడు. రాజుకి కోపం వచ్చి ఆమె ని చంపేయాలనుకుని బంధించబోయాడు.

ఈ లోపు గాలి దేవుడు భార్యా భర్తలిద్దరినీ ఆకాశం లోకి ఎగరేసి రోజ్ మేరీ ఇంటికి చేర్చాడు. వాళ్ళ నాన్న ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు దుస్తులు అమ్మితే వచ్చిన బంగారు కాసులతో ఇంకొంత పొలం కొనుక్కుని, ఇల్లు బాగు చేసుకున్నారు. ఇదివరకులా వైభవంగా కాకపోయినా  వాళ్ళిద్దరూ  జీవితాంతం సుఖంగా గడిపారు.

[ రోజ్ మేరీ అనేది మూలిక వంటి మొక్క. వంటలలో, సుగంధద్రవ్యం గా, వైద్యం లో దీన్ని ఉపయోగిస్తారు.  Shakespeare రచించిన Hamlet నాటకం లో Ophelia కి మతి స్థిరంగా లేనప్పుడు ఆమె అన్న“There’s rosemary, that’s for remembrance; pray, love, remember.” ’’ అంటాడు. “Rosemary for remembrance’’ .అనేది నానుడిగా ఉండిపోయింది. జ్ఞాపకశక్తిని రోజ్ మేరీ నిజంగానే మెరుగు పరుస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది]

 

     స్పానిష్ జానపద కథ. సేకరణ -Dr. D. Francisco de S. Maspons y Labros , Andrew Lang

 అనువాదం: మైథిలీ సుబ్బరాజు

అడవిలో ఇల్లు

MythiliScaled

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున చిన్న  గుడిసెలో  ఒక కట్టెలుకొట్టుకునేవాడు  తన భార్యా ముగ్గురు కూతుళ్ళతో ఉంటుండేవాడు. ఒక రోజు పొద్దున్నే  అతను అడవిలో ఎక్కువ దూరం ఎండుకట్టెల కోసం వెళ్ళాల్సివచ్చింది. వెళ్తూ వెళ్తూ భార్యతో చెప్పాడు ” ఇవాళ మన పెద్దమ్మాయితో నాకు భోజనం పంపించు. తను దారి తప్పకుండా గుప్పెడు జొన్నలు తీసుకుని దోవంతా జల్లుకుంటూ వెళతాను ”

బాగా ఎండెక్కాక అలాగే ఆ అమ్మాయి తండ్రికి భోజనం తీసుకుని బయల్దేరింది. అయితే వాళ్ళ నాన్న జల్లిన జొన్నలన్నీ పిట్టలు తినేశాయి. దారి తెలియలేదు. అలా అడవిలో నడుచుకుని పోగా పోగా చీకటి పడిపోయింది, చలేస్తోంది. అమ్మాయికి భయం వేసింది. అంతలో చెట్లమధ్యలోంచి  మినుకు మినుకు మంటూ  దూరంగా ఒక దీపం వెలుతురు కనిపించింది. తనకి ప్రాణం లేచివచ్చి అటువైపు పరుగెత్తింది. నిజంగానే అక్కడొక పాత పెంకుటిల్లు , కిటికీలనిండా దీపాలు. తలుపు తట్టింది ” లోపలికి రా ” ఒక బొంగురుగొంతు పలికింది. వెళ్తే అక్కడ ఒక బల్ల మీద  చేతుల్లో మొహం దాచుకుని  ముసలివాడు ఒకడు . అతని జుట్టంతా నెరిసిపోయింది. పొడుగాటి  గడ్డం నేలదాకా పాకుతోంది. వెచ్చగా ఉన్న పొయ్యి పక్కనే ఒక కోడి పెట్ట, కోడిపుంజు, ఒక మచ్చల  ఆవు.

అమ్మాయి తన కథంతా చెప్పి ఆ రాత్రికి ఉండనిమ్మని అడిగింది. అతను ఆ మూడు ప్రాణులనీ అడిగాడు ” ఏం చేద్దాం ? ” అని. అవి అన్నాయి కదా, ” మాకిష్టమే ” అని. అతను చెప్పాడు , ” సరేనమ్మాయ్. వెనకాలే  వంటిల్లుంది. నిండుగా సరుకులున్నాయి ”

ఆమె చక్కగా వంట చేసి రెండు కంచాలలో ముసలివాడికీ తనకూ వడ్డించింది. మూడు ప్రాణుల గురించి ఆలోచించనేలేదు. ఆకలి తీరేవరకూ తినేసి ” ఎక్కడ పడుకోను ? ” అని అడిగింది. అతను ” మేడమీద పడక గది ఉంది. ఆ మంచాన్ని బాగా కదిపి ఉతికిన దుప్పట్లు వేసుకో, నిద్రపో ” అన్నాడు. అమ్మాయి అలాగే చేసింది. ఆమె నిద్రపోయాక ముసలివాడు ఒక కొవ్వొత్తి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వెలుగులో ఆమె మొహం ఒకసారి చూశాడు. ” ఊహూ ” అనుకుని మంచం కింద రహస్యంగా అమర్చిన తలుపు తెరిచాడు. ఆమె మంచంతో సహా నేలమాళిగలోకి పడిపోయింది.

ఇక్కడ కట్టెలుకొట్టేవాడు బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చి తనకి రోజంతా తిండి లేనందుకు భార్యని చీవాట్లు పెట్టాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. ఇంకా  అమ్మాయి ఇంటికి రాలేదే అని ఇద్దరూ కాసేపు బాధపడి ” అడవిలో దారి తప్పి ఉంటుంది , తెల్లారగానే వచ్చేస్తుందిలే ” అనుకున్నారు.

images

తెల్లారింది. ఈసారి రెండో కూతురుని పంపించమనీ, దోవంతా కందిపప్పు జల్లుతూ వెళాతాననీ తండ్రి చెప్పాడు. రెండో పిల్ల బయల్దేరేసరికి ముందురోజులానే పప్పులన్నీ పిట్టలు తినేశాయి. తనూ దారి తప్పి అదే ఇంటికి వచ్చింది. అలాగే రాత్రికి ఉంటానని అడిగింది. ముసలివాడు మూడు ప్రాణులనీ అడిగి అలాగేనన్నాడు. తన అక్కలాగే తనూ ప్రాణుల గురించి పట్టించుకోలేదు. వంటా, భోజనం, పడకా- ఆ తర్వాత అతను ఈ పిల్లనీ నేలమాళిగలోకి పడేశాడు.

ఇద్దరు పిల్లలూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయినా వాళ్ళ నాన్న మూడోరోజున ఆఖరి కూతురుతో అన్నం పంపించమనే చెప్పాడు . తక్కిన ఇద్దరూ ఇంటికి రాకపోయినా తండ్రి మూడో అమ్మాయిని ఎందుకు పంపించమన్నాడో అతనికే తెలియాలి. ఆమె అక్కలిద్దరినీ  వెనక్కి తీసుకు రాగలదని నమ్మకమో ఏమో. వాళ్ళ అమ్మ ఏడ్చింది ” అయ్యో, నా ముద్దులతల్లినీ పోగొట్టుకోవాలా ? ” అని

తండ్రి అన్నాడు ” భయపడకు. ఇది చాలా తెలివిగలది, దారి తప్పదు. ఈసారి బఠానీ గింజలు జల్లుకుంటూ వెళతాను. అవి పెద్దగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి ” అయినా లాభం లేకపోయింది. మూడో పిల్ల వెళ్ళేసరికి అక్కడ ఒక్క బఠానీ గింజా మిగలకుండా పిట్టలు ఖాళీ చేశాయి. ఎంత తెలివిగలదైతే మాత్రం ఎటువెళ్ళాలో ఎలా తెలుస్తుంది ? అక్కలలాగే తనూ రాత్రయేసరికి అడవి మధ్య ఇంటికే చేరింది. మూడు ప్రాణులూ ఇదివరకులాగే  ముసలివాడు అడగగానే ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. అమ్మాయికి సంతోషం వేసింది. కోడి పెట్టనీ కోడిపుంజునీ వీపు రాసి ముద్దు చేసి ఆవుని గంగడోలు మీద నిమిరింది. వంటింట్లో ఎప్పటిలాగే బోలెడంత ఆహారం. ఆమె వంట చేస్తూ అనుకుంది ” నా కడుపు నిండితే చాలా ? వాటికీ ఆకలేయదూ పాపం ” దోసిళ్ళనిండా బియ్యపుగింజలు పట్టుకెళ్ళి కోడిపెట్టకీ కోడిపుంజుకీ పెట్టింది. ఆ పక్కనే ఉన్న మోపు విప్పి నుంచి ఆవుకి తాజాగా ఉన్న పచ్చగడ్డి తినిపించింది. అవి తృప్తిగా తిన్నాక వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్ళు నింపి ఉంచింది. అవన్నీ ముక్కులూ మూతులు ముంచి  హాయిగా  తాగాయి.

అప్పుడు ముసలివాడూ తనూ కలిసి భోజనం ముగించారు.

” ఎక్కడ పడుకోను ? ” అని అడిగితే మూడు ప్రాణులూ  ఒకే గొంతుతో ” మమ్మల్ని బాగా చూసుకున్నావమ్మా. కమ్మగా నిద్రపో ” అన్నాయి.

ఆమె మేడ మీదికి వెళ్ళి పక్కవేసుకుని అర్థరాత్రిదాకా కలత లేకుండా నిద్ర పోయింది. అప్పుడు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇల్లంతా కూలిపోయేంతగా ఊగిపోయింది. కోళ్ళూ ఆవూ నిద్రలేచి బెదిరిపోయి గోడకేసి తలలు గుద్దుకున్నాయి. కాసే పటికి అంతా సద్దుమణిగింది. అమ్మాయి సర్దుకుని మళ్ళీ నిద్రపోయింది.

20110411_Korzukhin

ఆమెకి మెలకువ వచ్చేసరికి ఆ గది గొప్ప వైభవంగా కనిపించింది. పాలరాతి గోడలంతా బంగారుపూలు చెక్కి ఉన్నాయి. తను పడుకున్న మంచం వెండితో చేసి ఉంది. మెత్తటి పట్టు దుప్పటి పరచి ఉంది. కిందని ఒక చిన్న పీట మీద ముత్యాలు పొదిగిన చెప్పులు. ఖచ్చితంగా అదంతా కలేననుకుంది తను. చాలా మంచి బట్టలు వేసుకుని ముగ్గురు వచ్చారు ” ఏమి ఆజ్ఞ ? ” అని అడిగారు. ” నాకేమీ వద్దు. వెళ్ళండి, వెళ్ళండి. నేను లేచి వంట చేసి పెద్దాయనకి తినిపించాలి. కోళ్ళకీ ఆవుకీ మేత వేయాలి ” అని హడావిడిగా జవాబు ఇచ్చింది ఆమె.

అంతలో ఇంకో వైపు  తలుపు తెరుచుకుని ఒక అందమైన యువకుడు వచ్చి  అన్నాడు ” నేనొక రాకుమారుడిని. ఈ అడవి మధ్య ఒక సరస్సూ దాని చుట్టూ ఉన్న పచ్చిక  మైదానమూ ఒక ఫెయిరీవి. ఆమె సరదాకి జంతువుల రూపాలను ధరించి తిరుగుతూ ఉండేది. ఇదంతా నాకు అప్పుడు తెలియదు.

ఒక రోజు వేటాడుతూ దూరంగా గడ్డి మేస్తూన్న జింక ను బాణం తో కొట్టబోయాను.నా బాణం తగలకపోగా ఆ జింక ధగ ధగా మెరిసిపోయే అమ్మాయిగా యి ఇలా అంది-

” నువ్వు ఆకలితో, ఆహారం కోసం నన్ను చంపబోలేదు, నేను క్రూరమృగాన్ని కాదు…నీకు ఏ హానీ చేయలేదు, నా చిన్న పొట్టని నింపుకుంటూ ఉన్నాను అంతే ”

నన్నూ నా అనుచరులనూ శపించింది.     ముసలివాడుగా అయిపోయాను .    అడవిలో నా విశ్రాంతి భవనం ఇది – నువ్వు చూసిన ఇల్లుగా మారిపోయింది. నాతోబాటు ఉన్న  ముగ్గురు సేవకులూ శాపం వల్లే  కోడిపెట్ట, పుంజు, మచ్చలావు గా నాకు ఇన్ని రోజులూ తోడున్నారు. మనుషులమీద  ఉన్నంత దయనీ పశువుల, పక్షుల పట్ల చూపగల అమ్మాయి మాత్రమే మా శాపాన్ని పోగొట్టగలదు. నువ్వే ఆ అమ్మాయివి. మధ్యరాత్రిలో మాకు విముక్తి దొరికింది. నన్ను పెళ్ళి చేసుకుంటావా ? ”

అమ్మాయి ఆనందంగా ఒప్పుకుంది. అంతా రాజధానికి వెళ్ళారు. రాజూ రాణీ కొడుకుని చూసి సంతోషం లో తలమునకలయారు. అతని శాపం విడిపించిన అమ్మాయిని ఆప్యాయంగా చూశారు. సేవకులు వెళ్ళి పిలుచుకొస్తే  అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళి విందుకి వచ్చారు. ” మరి మా అక్కల సంగతి ? ”

” ఇక్కడి పశువులశాలలో, కోళ్ళగూటిలో  వాళ్ళు కొన్నాళ్ళు పనిచేయాలి . వాటన్నిటికీ తిండిపెట్టాకే తినాలి. జంతువులకీ ఆకలి వేస్తుందని వాళ్ళకి అర్థం కావాలి కదా . త్వరలో తెలిసివస్తుందిలే. అప్పుడు కనబడదాం ‘’

                                                           -జర్మన్ జానపద కథ కి స్వేచ్ఛానువాదం , సేకరణ – Andrew Lang

 అనువాదం: మైథిలి అబ్బరాజు

 

అన్నదమ్ములు

Three_Brothers_1828
ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు ఎవరికి వచ్చేలా చేయాలో తేల్చుకోలేకపోయాడు. అమ్మేసి డబ్బుని సమంగా పంచవచ్చు, అయితే కొన్ని తరాలనుంచీ తమ కుటుంబానికి చెందినది కాబట్టి ఇంటిని అమ్మేందుకు ఆయనకి ఇష్టం లేదు. చివరికి ఒకరోజు ముగ్గురినీ పిలిచి ఆయన ఇలా అన్నాడు
” మీరు బయటి ప్రపంచం లోకి వెళ్ళి తలా ఏదో ఒక విద్యో, వృత్తో, వ్యాపారమో నేర్చుకోండి. మూడేళ్ళ తర్వాత ఎవరు వాళ్ళు నేర్చుకున్నదానిలో ఎక్కువ ప్రావీణ్యం సాధిస్తారో వారికి ఇల్లు రాసి ఇస్తాను ”
కొడుకులకి ఆ ఆలోచన నచ్చింది. పెద్దవాడు కమ్మరి పని నేర్చుకుందామనుకున్నాడు. రెండోవాడు మంగలి అవాలనుకున్నాడు. మూడోవాడు కత్తిసాము నేర్చుకుందామని. అందరూ బయలుదేరి వెళ్ళారు.

MythiliScaled
అదృష్టం కొద్దీ ముగ్గురికీ మంచి గురువులు దొరికారు. ఎవరికి వారు ఆ విద్యలు చివరంటా నేర్చుకుని మంచి పనితనం సంపాదించారు. ఎంతో నిపుణుడు కావటాన కమ్మరికి రాజు గారి గుర్రాలకి నాడాలు తొడిగే అవకాశం వచ్చింది. ” ఇల్లు నాకే వస్తుంది. సందేహం లేదు ” అనుకుంటుండేవాడు.
మంగలి దేశంలో గొప్ప సంపన్నులకీ పెద్ద అధికారులకీ క్షవరం చేయగలిగేవాడు. అతనూ తనే పోటీలో నెగ్గుతాననే అనుకున్నాడు. కత్తి సాము నేర్వబోయినవాడికి గట్టి దెబ్బలే తగిలేవి. అయితే వాటిని ఓర్చుకునేవాడు . ” ఈ దెబ్బకి భయపడిపోతే ఇల్లు ఎలా దక్కుతుంది ? ” అని తనకి తాను చెప్పుకుంటూ ఉండేవాడు.
feature_1.jpg2
అలా మూడేళ్ళూ గడిచాయి. ముగ్గురూ ఇంటికి తిరిగి వెళ్ళి తీరిగ్గా కూర్చుని తమ విద్యలని ఎలా చూపెడదామా అని మాట్లాడుకుంటున్నారు. అంతలో దూరం నుంచి ఒక కుందేలు వస్తూ కనిపించింది ”మంచి సమయానికి వచ్చావు ” అని మంగలి సబ్బూ నీళ్ళూ సిద్ధంగా పెట్టుకుని ఆ కుందేలు పరుగున వాళ్ళని దాటి వెళ్ళే లోగా దాని మీసాలని పూర్తిగాగొరిగేశాడు. దాని ఒంటి మీద ఒక్క గాటు పడలేదు, ఒక్క వెంట్రుక చెదరలేదు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది.
” భేష్ ! చాలా బాగా చేశావు నాయనా ! తక్కిన ఇద్దరూ నిన్ను మించకపోతే ఇల్లు నీదే ” అని తండ్రి అన్నాడు.
కాసేపటికి ఆ దారి వెంట ఒకరు వేగంగా రథాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ” నాన్నా, చూడు. ఏం చే స్తానో ” అంటూ కమ్మరి ఆ రథం వెనకాల పరుగెత్తాడు. నాలుగు గుర్రాల గిట్టలకీ ఉన్న నాడాలు తొలగించి, రథం వేగం ఏ మాత్రం తగ్గకుండానే మళ్ళీ నాలుగు గుర్రాల పదహారు కాళ్ళ గిట్టలకీ కొత్త నాడా లు తొడిగేశాడు. నడిపేవాడికి ఇదంతా జరిగిందనే తెలియలేదు.
grand12
” చాలా తెలివిగలవాడివిరా నువ్వు. నీ తమ్ముడికి తెలిసినంతా నీ విద్య నీకూ తెలుసు. ఎవరు గొప్పవారో చెప్పలేకపోతున్నాను ” అన్నాడు తండ్రి.
మూడోవాడు ” నేనూ కాస్త చూపించనీ నాన్నా ” అంటుండగానే వాన కురవటం మొదలైంది. అతను కత్తి దూసివిసవిసా తన తలమీద తిప్పటం మొదలుపెట్టాడు. అది ఎంత వేగంగా చేయగలిగాడంటే ఒక్క చినుకు కూడా అతని మీద పడలేదు. వాన అంతకంతకూ పెద్దదయింది. చివరికి తగ్గుముఖం పట్టింది. అంతసేపూ అతను ఇంకా ఇంకా వేగంగా కత్తి తిప్పుతూనే ఉన్నాడు. వాన వెలిశాక, అప్పటిదాకా ఇంట్లో ఉంటే ఎంత పొడిగా ఉండవచ్చో అంత పొడిగా ఉన్నాడు.
అబ్బురంగా చూస్తూ ఉన్న తండ్రి అన్నాడు ” నువ్వే ముగ్గురిలో గొప్ప విద్య చూపావు. ఇల్లు నీకే ఇస్తున్నాను ”
అన్నలిద్దరూ కూడా అతని నేర్పు ఎక్కువదని ఒప్పుకున్నారు. అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. అంతకుముందువరకూ ఏది జరగాలని కోరుకున్నాడో తీరా అది జరిగాక మూడోవాడికి అంత బాగా అనిపించలేదు. . అతను చెప్పాడు ” అన్నయ్యలూ, మీరు ఎక్కడికీ వెళ్ళద్దు. అందరం ఇక్కడే ఉందాం ”
వాళ్ళు ఉండిపోయారు. తమ వృత్తులలో చాలా నైపుణ్యం ఉన్నవారు కనుక ముగ్గురూ చాలా డబ్బు గడించగలిగారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపా కలిగాక ఆ ఇంటిమీదే మరో రెండు అంతస్థులు వేసుకుని జీవితాంతం సుఖసంతోషాలతో గడిపారు.

జర్మన్ జానపద కథ
సేకరణ -Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

అక్కా చెల్లెళ్ళు

The-Two-Princesses-glass-mask-topeng-kaca-22689515-493-519
ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా అయితే రాకుమారికి ఎవరూ దిక్కు ఉండరని భయపడి రాజు కొన్నాళ్ళకి ఒక మధ్యవయసు వితంతువుని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే. ఆమెకీ కాథరీన్ అని ఒక కూతురు ఉంది.ఇద్దరు అమ్మాయిలూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని రాజు ఆశపడ్డాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.
అయితే కొత్త రాణి బుద్ధి మాత్రం మంచిది కాదు. వెల్వెట్ చీక్ ఎదిగే కొద్దీ ఎంతో అందంగా తయరయింది. తన కూతురుకన్న ఆమె అందంగా ఉందనీ ఆమెకి గొప్ప సంబంధం వస్తుందనీ రాణి అసూయపడింది. ఆ అందాన్ని ఎలాగయినా పాడు చేయాలనుకుంది. ఒక రోజు చీకటి పడేవేళ దుప్పటి ముసుగు వేసుకుని కోళ్ళని పెంచే ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆమె కి మంత్రాలూ మాయలూ వచ్చని రాణి వంటి కొందరికే తెలుసు. అంతా విని మంత్రగత్తె ” పొద్దున్నే ఏమీ తినకుండా రాకుమారిని నా దగ్గరికి పంపించు . పని జరుగుతుంది ” అని మంత్రగత్తె చెప్పింది. మర్నాడు పొద్దునే వెల్వెట్ చీక్ ని పిలిచి ఫలానా ఆవిడ దగ్గర్నుంచి కోడిగుడ్లు తీసుకురమ్మని అడిగింది. ” ఏమీ తినకుండా ఉదయపు గాలిలో తిరిగితే ఆడపిల్లల బుగ్గలు ఎఱ్ఱగా అవుతాయి , కాబట్టి అలాగే వెళ్ళు ” అనిసలహా ఇచ్చింది. కానీ ఎందుకు అలా చెప్పిందా అని అనుమానం వచ్చీ ఆకలేసీ వెల్వెట్ చీక్ ఒక పెద్ద కేక్ ముక్క తిన్నాకే బయల్దేరింది. వెళ్ళి గుడ్లు కావాలని ముసలావిడని అడిగింది. ” అదిగో, ఆ కుండ మీద మూత తీస్తే ఉన్నాయమ్మా, తీసుకో ” అంది ఆమె. అలాగే కుండ మూత తీసి గుడ్లు పట్టుకువెళ్ళింది వెల్వెట్ చీక్. ఆమెకి ఏమీ కానందుకు మంత్రగత్తె ఆశ్చర్యపడింది , రాణి కి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు వంటిల్లు తాళం పెట్టించి ఏ ఆహారమూ వెల్వెట్ చీక్ కి అందకుండా చేసింది. ఖాళీ కడుపుతో వెళ్ళిన రాకుమారికి దారివెంట బఠాణీ లు కోస్తున్న పల్లెజనం కనిపించారు. ఆకలికి ఆగలేక గుప్పెడు గింజలు అడిగి తినేసింది. ఈ సారి కూడా మంత్రగత్తె మాయ పనిచేయలేదు.
ఇలా కాదనుకుని మూడో రోజు రాణి తనే సవతి కూతురుని తీసుకువెళ్ళింది. ఏమీ తినే అవకాశమే రాకుమారికి దొరకలేదు. ఈ సారి కోడిగుడ్లు ఉన్న కుండ మూత తీసేసరికి వెల్వెట్ చీక్ చక్కటి ముఖం మాయమై గొర్రె తల వచ్చేసింది. రాణి అతి సంతోషంతో అంతఃపురానికి వెళ్ళిపోయింది. రాకుమారి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ముఖాన్ని జేబురుమాలుతో కప్పుకుని వెళ్ళింది. ఆమెని చూసి కాథరీన్ కి విపరీతంగా బాధేసింది. తన సొంత తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ” మనం ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండద్దు . మా అమ్మ నిన్నింకేం చేస్తుందో ఏమో ” అని వెల్వెట్ చీక్ ని గబగబా బయల్దేరదీసింది.ఆమె గొర్రె ముఖాన్ని పట్టు శాలువాతో కప్పి ఆమె చేయిపట్టుకుని కాథరీన్ రాజధాని నుంచి బయటపడింది . కొన్ని రోజులకి సరిపడా ఆహారం మూట కట్టుకున్నారు. ఎవరూ చూడని చోట్ల ఏ గడ్డివాముల లోనో రాత్రులు నిద్ర పోయేవారు
నడిచి నడిచి రెండు రాజ్యాల అవతల ఉన్న పట్టణానికి వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒక పెంకుటింటి ముందు ఆగారు. ” ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వమ నీ, కాస్త భోజనం పెట్టమ నీ అడుగుదాం. రేపు ఏదైనా పని చూసుకోవచ్చు ” అని కాథరీన్ అంది. వెల్వెట్ చీక్ ” నా ముఖాన్ని చూసి ఇంట్లోవాళ్ళు భయపడరా ? నా చెల్లెలివని నిన్నూ దూరంగా ఉంచాలనే చూస్తారేమో ” అంది.
” నీ ముఖం అలా ఉంటుందని ఎవరికి తెలుస్తుందేమిటి ? నువ్వు మాట్లాడకు. ఆ శాలువా గట్టిగా బిగించుకో. అంతా నేను చూసుకుంటాను ” అని ధైర్యం గల కాథరీన్ జవాబు ఇచ్చింది.అలాగే తలుపు తట్టి వెళ్ళి తన అక్కకి జబ్బుగా ఉందనీ , తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందనీ ఆ రాత్రికి తల దాచుకోనివ్వమనీ అడిగింది. ఆ ఇల్లు ఒక పేదరాసి పెద్దమ్మది. కాథరీన్ నెమ్మదిగా ఉండటం, మృదువుగా మాట్లాడటం గమనించి
” అయితే ఒంట్లో బాగాలేని వాళ్ళని చూసుకోవటం నీకు బాగా తెలుసా ? ” అనిపేదరాసి పెద్దమ్మ అడిగింది. ” ఓ , బాగా తెలుసుగా ” అని కాథరీన్ బొంకింది.
విషయం ఏమిటంటే ఆ రాజ్యపు రాజు గారి పెద్ద కొడుకు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని మతి సరిగా ఉండటం లేదు. రాత్రి వేళల్లో మరీ అలజడిగా ఉంటాడు. అతన్ని ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సి వస్తూంది. ఎవరూ ఆ పనిని సక్రమంగా చేయలేకపోతున్నారు. రాజకుమారుడు పొద్దున లేచేసరికి దెబ్బలు తగిలించుకుని ఉంటున్నాడు.
The-Two-Sisters-xx-James-Sant
పేదరాసి పెద్దమ్మకి కాథరీన్ సమర్థురాలిగా అనిపించి మర్నాడు పొద్దున్నే రాజుకి ఆ మాట చేరవేసింది. ఆయనా కాథరీన్ తో మాట్లాడి తృప్తి పడి ఆ పనిని అప్పజెప్పాడు. రాజకుమారుడు క్షేమంగా ఉంటే సంచీడు వెండి నాణాలు బహుమతి ఇస్తానని చెప్పాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా విడిగా ఒక గదిని అడిగి తీసుకుని అక్కని అందులో ఉంచి అని కాథరీన్ రాజకుమారుడి గదికి వెళ్ళింది.
రాజకుమారుడు చూసేందుకు చాలా బావున్నాడు. ఏదో జ్వరం తగిలినవాడిలాగా ఉద్రేకంగా కనిపించాడు. అర్థరాత్రి పన్నెండు గంటలకి కాథరీన్ కి కునుకు పట్టబోతుండగా , ఉన్నట్లుండి అతను లేచి మంచి బట్టలు వేసుకుని మెట్లు దిగి వెళ్తున్నాడు. ఆమె అతన్ని వెంబడించింది. అతను సరాసరి గుర్రాల సాలలోకి వెళ్ళి ఒక గుర్రానికి కళ్ళెం తగిలించి ఎక్కగానే ఆమె కూడా చప్పుడు చేయకుండా వెనక ఎక్కి కూర్చుంది. అడవిలోంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా చుట్టూ విరగకాసిన హేజెల్ నట్ చెట్లు ఉన్నాయి. చేతికి అందినన్ని కాయలు కోసి గౌన్ జేబులలో దాచుకుంది కాథరీన్. పోగా పోగా ఒక విశాలమైన మైదానం వచ్చింది. మధ్యలో ఒక చిన్న కొండ. అక్కడ రాకుమారుడు గుర్రం దిగి, ” తెరుచుకో, ద్వారమా. రాకుమారుడినీ అతని గుర్రాన్నీ లోపలికి వెళ్ళనీ ” అని చిన్న గొంతుతో మంత్రం చదువుతున్నట్లు అన్నాడు.” ఆ వెనకే నన్ను కూడా ” అని గొణిగింది కాథరీన్. సరిగ్గా వాళ్ళు పట్టేంతగా కొండలో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే మూసుకుపోయింది.
ఆ లోపల ఒక పెద్ద చావడి. రంగు రంగుల కొవ్వొత్తుల తో వెలిగిపోతోంది. మధ్యలో అద్భుత సౌందర్యవతులు కొందరు నాట్యపు దుస్తు లలో ముస్తాబయి ఉన్నారు. జుట్టులో వెల్వెట్ పూల, గులాబీల కిరీటాలు పెట్టుకున్నారు. అదే వయసుగల అందమైన యువకులు కూడా చుట్టూ ఉన్నారు. వింతయిన సంగీతం వినిపిస్తోంది. వాళ్ళంతా ఎల్ఫ్ లు, దేవతలలో ఒక జాతి అది . రాజకుమారుడినిచూడగానే వాళ్ళలో ఒక యువతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చింది. ఒక్కసారిగా అతని బద్ధకం, మగత , మాయమైనాయి. ఉత్సాహంగా నవ్వుతూ ఆమెతో అతను నాట్యం చేశాడు. అందరూ జంటలుగా నర్తించటం మొదలుపెట్టారు. ఒక మూలగా మసక చీకటిలో దాక్కున్న కాథరీన్ ని ఎవరూ గమనించినట్లు లేదు. అంతలో ఒక చిన్న పాప ఒక బంగారు బెత్తం తో ఆడుకుంటూ ఆమె ఉన్న చోటికి వచ్చింది. కాథరీన్ కి ముద్దొచ్చి పలకరించబోయింది. ఆ పక్కగా నాట్యం చేస్తూ వెళుతున్న ఒక అమ్మాయి తనతో ఉన్న అబ్బాయితో ఇలా అంది ” ఆ బెత్తంతో మూడుసార్లు తడితే కాథరీన్ అక్క ముఖం మామూలుగా అయిపోతుంది ” కాథరీన్ కి గొప్ప సంతోషం, ఆదుర్దా. మెల్లిగా తన జేబుల్లోంచి హేజెల్ నట్ కాయలు తీసి ఆ పాప ఉన్న వైపుకి దొర్లించింది. పాపకి ఆసక్తి పుట్టి చేతిలో బంగారు బెత్తాన్ని పక్కనపెట్టి కాయలు తీసుకుంది. నింపాదిగా కొద్ది కొద్ది నట్స్ ని అక్కడ వదుల్తూ పాప దృష్టి మరలించి కాథరీన్ బెత్తాన్ని అందుకుని జేబులో దాచుకుంది. సరిగ్గా అప్పుడే నాట్యం ముగిసింది. రాకుమారుడు తప్ప అంతా మాయమయ్యారు. అతను హడావిడిగా వెనక్కి మరలాడు. కాథరీన్ జాగ్రత్తగా వెనకాల ఎక్కి కూర్చుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అతని గదిలోకి ప్రవేశించారు.తెలతెలవారేదాకా అక్కడే ఉండి కాథరీన్ అక్క ఉన్న చోటికి వెళ్ళింది. పాపం, గొర్రె మొహం వేసుకుని వెల్వెట్ చీక్ నిద్రపోతోంది. బంగారు బెత్తం తో మూడుసార్లు తట్టేసరికి ఆమె ఎప్పటిలా అందంగా అయిపోయింది. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
fairy ball
రాజు, ముఖ్య సేవికా రాజకుమారుడు రాత్రి ఎలా గడిపాడని కాథరీన్ ని అడిగారు. ” చాలా బాగా గడిపారు ” అని చెప్పింది ఆమె. కొండలోపలి ఎల్ఫ్ యువతులు అతన్ని మంత్రించారనీ దాని సంగతేదో చూడాలనీ మనసులో అనుకుంది . అప్పుడే అక్కడికి తన తలనొప్పి తగ్గిందని అంటూ వెల్వెట్ చీక్ వచ్చింది. రాజు కాథరీన్ మాటలకి చాలా సంతోషించి ఆమె ఖచ్చితంగా నమ్మదగినదని అనుకున్నాడు. వెల్వెట్ చీక్ రూపాన్ని కూడా ఆయన మెచ్చుకుని ఆమె అక్కడే ఉండి పూలు కట్టటం లాంటి సున్నితమైన పనేదో ఒకటి చేయచ్చునని సూచించాడు. రెండో రోజు రాత్రి కూడా కాథరీన్ రాకుమారుడిని కనిపెట్టుకుని ఉంది. అంతా మొదటి రోజు జరిగినట్లే జరిగింది. నాట్యం జరుగుతూ ఉండగా నిన్నటిలాగే ఇంకొక చిన్న పాప వచ్చింది. తన చేతిలో చిన్న కేక్ ఉంది. మళ్ళీ ఒక ఎల్ఫ్ యువతి ఆ పక్కనుంచీ వెళుతూ ” ఆ కేక్ ని మూడు సార్లుగా తింటే రాజకుమారుడి శాపం పోతుంది ” అని తన జతగాడితో చెప్పింది. ఈ పాపనీ హేజెల్ నట్ లతో ఆకర్షించి తను కేక్ ని పక్కన పెట్టగానే తీసుకుని దాచుకుంది. నాట్యం పూర్తయింది.
రాజ భవనానికి తిరిగి వెళ్ళాక రాకుమారుడు ఎప్పటిలా పక్క మీద పడుకున్నాడు. అయితే కాథరీన్ చేతిలో కేక్ ని అతను గమనించాడు. ” నాకు అది తినాలని ఉంది ” అని మత్తుగా అన్నాడు. ఒక్క ముక్క పెట్టేసరికి ముఖం తేటగా అయింది. . ” ఇంకొకసారి ” అడిగాడు. ఈ సారి తినేసరికి లేచి కూర్చోగలిగాడు. మూడో ముక్క తింటూనే లేచి నడిచి తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళాడు. రాజు ఆనందం లో మునిగిపోయి కాథరీన్ కి పదే పదే ధన్యవాదాలు చెప్పాడు. ఈ పెద్దకొడుకే తన తర్వాత రాజు అవుతాడు. తన కొడుకుని అంత బాగా చూసుకున్న ఆమె రాబోయే కాలం లో మంచి రాణిగా ప్రజలని కాపాడగలదని ఆయనకి అనిపించింది. ఇద్దరినీ వాళ్ళ ఇష్టం అడిగి పెళ్ళి ఏర్పాటు చేశాడు.
ఆ ముందురోజే, రాజుగారి చిన్న కొడుకు వెల్వెట్ చీక్ ని చూసీ చూడగానే ప్రేమించాడు. వాళ్ళిద్దరి పెళ్ళీ కుదిరిపోయింది. అప్పుడు అమ్మాయిలు ఇద్దరూ వాళ్ళ అసలు కథ చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళికి వచ్చారు. వాళ్ళ నాన్న వెల్వెట్ చీక్ ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషించి కాథరీన్ ని దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు.. ఆయన అనుకున్నట్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు.
ఈ రాజ్యం వాళ్ళ రాజ్యం కంటే చాలా పెద్దది. ఈ రాజుగారు ఇంకా ధనవంతుడు. అందుకని కాథరీన్ కి పట్టిన అదృష్టానికి వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వెల్వెట్ చీక్ మీద ద్వేషాన్ని మరచిపోయి ఆమెని క్షమించమని అడిగింది. వెంటనే కాదుగానీ, కాలక్రమాన ఆమెని ఇద్దరు కూతుళ్ళూ మన్నించారు. అందరూ సుఖంగా ఉన్నారు.
స్కాట్లండ్ జానపదకథ , By Elizabeth Grierson

ఒకరికొకరు

MythiliScaled
అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ రెండు కుటుంబాలకీ చాలా కాలం కిందట ఏదో దెబ్బలాట అయింది. అది ఎందుకో కూడా ఎవరికీ గుర్తు లేకపోయినా అదొక అలవాటుగా వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరితో ఇంకొకరు మాట్లాడుకునేవారు కాదు. కానీ జాక్, జోకోసా లకి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం. గొర్రెలని కాస్తూ ఒకే పెద్ద మైదానం లోకి ఇద్దరి మందలనీ నడిపించి అలిసిపోయేదాకా ఆడుకుని అప్పుడు చెట్ల నీడలలో నిద్రపోయేవారు.

ఆ మైదానం లో ఒక ఫెయిరీ ఉంటుండేది. వీళ్ళిద్దరినీ చిన్నప్పటినుంచీ గమనించేది. వాళ్ళ ముద్దు ముఖాలూ మంచి పద్ధతులూ ఆమెకి నచ్చేవి. వాళ్ళిద్దరినీ కాపాడే బాధ్యత తీసుకుని అప్పుడప్పుడూ కేక్ లు, రుచి అయిన ఆహారం , అందేలా చేసేది. వాటిని చూసి వాళ్ళిద్దరూ తినేయకుండా అవతలివారికి ఇచ్చేసేవారు. అంత ప్రేమ ఇద్దరిదీ.

munier_1886_05_one_more_please_wm

వాళ్ళు పెరిగి పెద్దయాక ఒక మధ్యాహ్నం విరగబూసిన ఆపిల్ చెట్టు కింద ఫెయిరీ వాళ్ళకి మొదటిసారి కనిపించింది. ఆకు పచ్చని దుస్తులు వేసుకుని పూల కిరీటం పెట్టుకుని సన్నగా పొడుగ్గా చక్కగా ఉన్న ఆమెని చూసి ముందు ఇద్దరూ విస్తుపోయారు. అయితే ఆమె తీయగా మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్ళ భయం పోయింది. వాళ్ళిద్దరూ తనకి ఎంతో నచ్చుతారనీ కనబడకుండా వాళ్ళకి తినుబండారాలు ఇచ్చినది తనే అనీ ఆమె చెప్పాక ఇద్దరూ ధన్యవాదాలు చెప్పారు. ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫెయిరీ వెళ్ళబోతూ ” మళ్ళీ కనిపిస్తాను ” అని చెప్పి, ” నన్ను మీరు చూడలేనప్పుడు కూడా మీతోనే ఉంటాను ” అని కూడా హామీ ఇచ్చింది. తనని చూసిన సంగతి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించింది.

fairy cottage
ఆ తర్వాతి రోజులలో తరచు ఆమె వాళ్ళని కలుసుకునేది. చాలా విషయాలు నేర్పేది. తన లోకపు అద్భుతాలని తెచ్చి చూపేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె అంది- ” నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాను కదా. బదులుగా నాకొక చిన్న పని చేసిపెట్టండి. నాకు బాగా ఇష్టమైన నీటి ధార ఉంది, తెలుసు కదా. రోజూ తెల్లవారక ముందే లేచి మీరిద్దరూ దాని చుట్టూ చప్టాని శుభ్రం చేయండి. నీరు ప్రవహించటానికి గులక రాళ్ళు అడ్డు పడితే తీసేయండి. ఎండుటాకులో తీగలో ఉంటే ఏరివేయండి. మీరు ఈ పనిని ఆలస్యం లేకుండా, అశ్రద్ధ చేయకుండా చేస్తే అది మీరు నాకు చెప్పే కృతజ్ఞతగా అనుకుంటాను. ఈ మైదానం లోకల్లా ఆ జలధార లో నీరు స్వచ్ఛంగా , తీయగా ఉన్నంతకాలమూ మీరిద్దరూ ఒకటిగా ఉంటారు, విడిపోరు ”

ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఫెయిరీ వాళ్ళకి చేసినదానికీ, చేయబోయేదానికీ బదులుగా ఇది చాలా చిన్న విషయమని అనుకున్నారు. అలా చాలా కాలం పాటు నీటి ధారని జాగ్రత్తగా కాపాడారు. అందులో నీరు ఎప్పుడూ తేటగానే ఉండేది. ఒక రోజు పొద్దు పొడవకుండానే ఇద్దరూ చెరొక వైపునుంచి నీటిధార దగ్గరికి వస్తూ ఉంటే నేలమీద ఏవో తళతళమన్నాయి. . చూస్తే విలువైన రాళ్ళలాగా అనిపించాయి . రెండు మూడు తీసుకునేలోగా కొంత దూరం లో అలాంటివే రంగురంగులవి . ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు అనుకుంటూ వాటి వెంట ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏరుకుని జేబుల్లో నింపుకుంటూ ఉన్నారు. సమయం మించిపోయింది. చటుక్కున సూర్యుడు ఉదయించాడు, ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఇద్దరూబరువెక్కిన జేబులతో వీలైనంత తొందరగా నీటిధార దగ్గరికి పరుగెత్తారు.

కానీ నెమ్మదిగా చల్లగా పారే నీటిజల పెద్ద ప్రవాహం లాగా మారిపోయింది. చూస్తుండగానే ఇద్దరి మధ్యా దాటలేనంత వెడల్పుగా , వేగంగా ప్రవహించింది. ఒక్క కేక పెట్టి తెచ్చిన రత్నాలని అవతలివారికి ఎత్తి చూపటం మటుకే వీలయింది. జాక్ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి చేరాలని కనీసం ఇరవైసార్లు ప్రయత్నించాడు. అన్నిసార్లూ నీరు ఊపుగా అతన్ని వెనక్కి నెట్టేసింది. ఎండుకొమ్మలు నదిలో కొట్టుకు వస్తూంటే వాటి మీద ఎక్కి అటువైపుకి వెళ్ళాలని జోకోసా ఎంత ప్రయత్నించినా కుదరనేలేదు. బరువెక్కిన గుండెలతో గట్ల వెంట వాళ్ళు నడిచారు. పోను పోను ఒకరి ముఖం ఇంకొకరికి కనిపించటమే కష్టమైపోయింది.

ఎన్నో రాత్రులూ పగళ్ళూ గడిచాయి. కొండలు ఎక్కారు, లోయల్లో దిగారు. చలిలో ఎండలో , అలసటతో ఆకలితో ఇద్దరూ కష్టాలు పడ్డారు. దాచిన రత్నాలని ఎప్పుడో అవతల పారేశారు .మళ్ళీ కలుసుకుంటామన్న ఒకే ఒక్క ఆశతో మూడేళ్ళు గడిపారు. నది దాటేందుకు ఎక్కడా ఒక్క వంతెన అయినా లేదు. చివరికి ఆ నది సముద్రం లో కలిసే చోట చెరొక వైపునా ఎత్తైన కొండ కొమ్ముల మీద నిలిచారు. ఎప్పటికన్నా కూడా ఒకరికొకరు దూరంగా అనిపించారు.

కలుసుకోగలమన్న ధైర్యం పోయింది. నురగలు కక్కుతున్న నీటిలోకి దూకేశారు. అయితే ఒక్క క్షణం అయినా ఏమరకుండా వాళ్ళని కనిపెడుతూ ఉన్న ఫెయిరీకి వాళ్ళు చచ్చిపోవాలని అసలు లేదు. కంగారుగా తన మంత్రదండం ఒకసారి ఆడించింది. వెంటనే ఇద్దరూ ఒడ్డు మీద , బంగారురంగు ఇసుక తిన్నెల మీద, పక్కపక్కనే తేలారు. వాళ్ళిద్దరి సంతోషాన్నీ చెప్పేందుకు ఏ మాటలూ సరిపోవు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నారు. ఎంతో మాట్లాడవలసి ఉంది, అయితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియలేదు. ఫెయిరీ చెప్పినట్లు నీటిధారని కాపాడే పనిలో నిర్లక్ష్యంగా ఉన్నామని ఎవరిని వారి తిట్టుకున్నారు.

fairies
అప్పుడు ఫెయిరీ ప్రత్యక్షమైంది. ఇద్దరూ ఆమె పాదాలమీద పడి క్షమించమని అడిగారు. ఫెయిరీ వాళ్ళని లేవనెత్తి శిక్ష పూర్తయిందనీ తను ఎప్పటికీ వాళ్ళతో స్నేహంగానే ఉంటాననీ చెప్పింది. తన రథాన్ని అక్కడికి పిలిచింది. దాన్ని ఆకుపచ్చటి తీగలతో అల్లారు. మంచుబిందువులతో అలంకరించారు. ఆరు చిన్న కుందేళ్ళు లాగుతున్న ఆ రథాన్ని ఎక్కి కొద్ది సేపట్లోనే నీటిధార మొదలైన మైదానం లోకి వెళ్ళారు. ఆ తెలిసిన చోటినీ దూరంగా కనిపించే వాళ్ళ ఇళ్ళనీ చూస్తే ఇద్దరికీ ప్రాణాలు లేచివచ్చాయి. వారి సంతోషం కోసం ఫెయిరీ ఆ మూడేళ్ళలో రెండు కుటుంబాల మధ్యా తగాదా తీర్చి స్నేహాన్ని పెంచింది. వాళ్ళ తల్లిదండ్రులు జాక్, జోకోసా లు పెళ్ళి చేసుకోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు.

మళ్ళీ నెమ్మదిగా , శాంతంగా ప్రవహించే ఆ నీటిధారకు కనుచూపుమేరలో చిన్న కుటీరాన్ని ఫెయిరీ కట్టి ఉంచింది. చుట్టూ చిన్న పూలతోట, ఆ పక్కనే పళ్ళ తోట, కొంచెం పొలం. ఇద్దరికీ అంతకన్న కావలసిందేమీ లేదని తెలిసింది. వాళ్ళ ఉల్లాసాన్ని చూసి ఫెయిరీ కూడా ఆనందించింది. అంతా తిరిగి చూసుకుని , మెచ్చుకుని బడలికగా ఇద్దరూ గులాబీ లతలు అల్లించిన వరండా లో కూర్చున్నారు.

ఫెయిరీ అప్పుడు ఇద్దరికీ చెప్పింది ” ఇంతకన్నా వైభవంగా కనిపించేవాటికన్న ఈ కుటీరం, ఈ పరిసరాలూ తృప్తినీ శాంతినీ ఇస్తాయి మీకు. ఈ పొలాలలో సేద్యం చేసుకోండి, మీ గొర్రెల మందలని కాచుకోండి. ఏ కొరతా ఉండదు. రోజు రోజుకీ మీ సంతోషం పెరుగుతూనే ఉంటుంది . ”
పెళ్ళి చేసుకుని , ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరూ ఆ కుటీరంలో చిరకాలం హాయిగా బ్రతికారు.

ఫ్రెంచ్ జానపద కథ [by Kelley Morrow] సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

మేలు మరవనివాడు

1950-189

నులివెచ్చటి వసంతకాలపు ఉదయం. స్కాట్లండ్ లో ఒక జమీందారు తనకోట బయట ఆకుపచ్చని మైదానం లో పచార్లు చేస్తున్నాడు . ఆయన అసలు పేరు కొల్జియాన్ జమీందారు. అయితే స్కాట్లండ్ లోని ఆరీషైర్ ప్రాంతం లో అందరూ కో జమీందారు అనే పిలుస్తారు [ వాళ్ళ భాషలో ‘ కో ‘ అంటే సముద్రపు గుహ అని అర్థం. ] కొన్ని ఎకరాల వైశాల్యంగల పెద్ద రాతిమీద ఆ కోటని కట్టారు. దిగువన సముద్రం ఆ రాతిలో గుహలని తొలిచింది.

ఆయన చాలా దయగలవాడు, పెద్దమనిషి. పొరుగువాళ్ళ కష్టాలు విని కదిలిపోయేవాడు. ఎవరికి ఏ సాయం చేయాలన్నా ముందుండేవాడు.

అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. వాడు ఒక చేత్తో పొడుగాటి గిన్నెని పట్టుకుని ఇంకో చేత్తో మొహం మీద పడే జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఉన్నాడు. జమీందారు ముద్దుగా పిల్లాడి తల నిమిరి ఏం కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ జబ్బు పడి కోలుకుంటోందనీ ఆ గిన్నె నిండా ద్రాక్షరసం ఇప్పిస్తారా అనీ వాడు జమీందారుని అడిగాడు. చలిదేశాలలో ఆరోగ్యం కోసం నిలవ చేసిన ద్రాక్షరసాన్ని తాగుతారు. జమీందారు తన సేవకుడిని పిలిచి అన్నిటికన్నా మంచి ద్రాక్షరసాన్ని గిన్నె నిండా ఇచ్చి పంపమని చెప్పాడు.

సేవకుడూ చిన్నపిల్లాడూ నేలమాళిగలో ద్రాక్షరసం నిలవ ఉంచిన చోటికి వెళ్ళారు. యజమాని ఇష్టంగా తాగే మేలైన ద్రాక్షరసం , ఒక పీపాలో సగానికి పైగానే ఉంది. ఆ సగంలోంచి తీసి పోసేస్తే సరిపోతుందని సేవకుడు అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా పీపా ఖాళీ అయేంతగా పోసినా ఆ చిన్న గిన్నె నిండనేలేదు. సేవకుడికి అనుమానం వచ్చి కిందని ద్రాక్షరసం పొర్లిపోయిందా అని చూశాడు. నేలంతా అద్దంలాగా శుభ్రంగానే ఉంది.

” అమ్మో, ఇదేదో మంత్రపు గిన్నె లాగా ఉందే ! ” అని సేవకుడికి భయం వేసింది. ” ఇంకో పీపా అయితే తెరవను . సగం నిండిందిగా నీ గిన్నె, తీసుకువెళ్ళిపో. ఇంకెంత కావాలేమిటి ? ఎంత ఖరీదో తెలుసా నీకు? నీ బతుక్కి ఇదే చాలా ఎక్కువ ”

MythiliScaled

చిన్నపిల్లాడు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. జమీందారు మాట ఇచ్చాడు, గిన్నె నిండాల్సిందే నని పట్టుబట్టాడు. సేవకుడికి కోపం వచ్చి తిట్టటం మొదలుపెట్టాడు. పిల్లాడు మొండికేశాడు.

అప్పుడు సేవకుడు వెళ్ళి జమీందారుకి సంగతి అంతా చెప్పాడు. ” అది మాయదారి గిన్నె అయ్యగారూ. ఎంతకీ నిండటం లేదు. ఇలా అయితే ఎలా ? మీరే వచ్చి పిల్లాడిని వెళ్ళిపొమ్మని చెప్పండి ”జమీందారు ” అలా వీల్లేదు. నా మాటంటే మాటే. వాడి గిన్నె ని నింపే తీరాలి , నా ద్రాక్షరసం పీపాలన్నీ ఖాళీ అయిపోయినా సరే. వెళ్ళి ఇంకొక పీపా మూత తెరువు ” అని అజ్ఞాపించాడు. చేసేది లేక సేవకుడు ఇంకొక పీపా తెరిచి గిన్నెలోకి వొంపాడు.

ఇదివరకు ఆశ్చర్యానికి రెట్టింపు ఆశ్చర్యం ఇప్పుడు. నాలుగు చుక్కలు పడేసరికే పిల్లాడి గిన్నె పూర్తిగా నిండిపోయింది. పిల్లాడు సేవకుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. అంతకుముందు అతను తనను తిట్టిపోసిన సంగతే పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత సేవకుడు ఎంతమందిని కనుక్కున్నా ఆ పిల్లాడి సంగతిగాని, వాడి తల్లి సంగతిగాని ఎవరికీ తెలియనే తెలియదన్నారు.

ఏళ్ళు గడిచిపోయాయి. జమీందారు తన రాజు తరపున యుద్ధం చేసేందుకు వెళ్ళి శత్రువులకి పట్టుబడ్డాడు. ఆయనని చెరసాలలో బంధించి మరణశిక్ష విధించారు. అది పరాయి దేశం, స్నేహితులెవరూ లేరు. తప్పించుకునే దారి లేదు.

మరుసటి రోజు ఉరితీస్తారనగా ఆ రాత్రి ఒంటరిగా తన గదిలో ఆయన తన భార్యనీ పిల్లలనీ తలచుకుని కుమిలిపోతున్నాడు. ఇక మళ్ళీ వాళ్ళు తనకి కనబడరు. బ్రహ్మాండమైన తన కోట, ఆ దిగువ సముద్రం, వాకిట్లో డైసీ పూలు – అన్నీ గుర్తొచ్చాయి. ద్రాక్షరసం కోసం వచ్చిన చిన్న పిల్లాడు ఉన్నట్లుండి కళ్ళముందు అగుపించాడు. వాడి సంగతి ఆయన ఏనాడో మరచిపోయాడు. అదంతా నిజంగా అప్పుడు జరుగుతున్నట్లు అనిపించి గట్టిగా కళ్ళు నులుముకున్నాడు.

Deep_jail_by_ChrisRosewarne

రేపు మరణించబోతూ ఉంటే దేవుడిని ధ్యానించుకోవాలి కదా అనుకున్నాడు. ఆయన అలా తలచుకున్నాడో లేదో , చెరసాల గది తలుపు మెల్లిగా తెరుచుకుంది. ఆ గడప మీద అప్పటి పిల్లాడు. అలాగే ఉన్నాడు, ఒక్క ఏడాది కూడా వయసు పెరిగినట్లు లేడు. ఏదో రహస్యం చెప్పబోయేవాడిలాగా నవ్వుతూ మాట్లాడవద్దని పెదవుల మీద వేలు ఆనించాడు.

” కో జమీందారు గారూ, లేవండి, బయల్దేరండి ” అని గుసగుసగా చెప్పాడు. తన వెంట రమ్మని సైగ చేశాడు. జమీందారు ఏ ప్రశ్నా అడిగే పరిస్థితిలో లేడు. అంతగా నిర్ఘాంతపోయాడు. పొడుగాటి చెరసాల నడవాల గుండా పిల్లాడు కదిలాడు, ఆ వెనకే జమీందారు. తాళం వేసిన తలుపులు ఎదురైతే పిల్లాడు తాకగానే అవి తెరుచుకున్నాయి. వాళ్ళు బయటపడ్డారు.

ఆనందం తో తలమునకలైన జమీందారు తన చిన్న రక్షకుడికి ఆపకుండా కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాడు. ” ఆగండి. ఈ దేశం దాటితేగాని మీకు క్షేమం కాదు. నా వీపు మీద ఎక్కండి ” పిల్లాడు ఆజ్ఞాపించాడు. మారుమాట్లాడకుండా జమీందారు అలాగే చేశాడు. పిల్లాడు ఆయన బరువుని అవలీలగా ఎత్తుకున్నాడు. రెప్పపాటులో భూమిమీదా సముద్రం మీదా ప్రయాణించి జమీందారుని దించాడు . తెలతెలవారుతూ ఉంది. తన కోటముందర, పచ్చగడ్డి, డైసీ పూలు. మొదటిసారి చిన్నపిల్లాడిని ఎక్కడ కలుసుకున్నాడో అక్కడ దిగాడు జమీందారు. పిల్లాడు తన చిన్న చేతిని జమీందారు చేతిమీద ఆనించాడు.

” మంచి చేశారు, మంచి జరిగింది. మా అమ్మ మీద దయ చూపినందుకు ధన్యవాదాలు ” అని మాయమయ్యాడు. ఆ రోజునుంచీ వాడిని చూసినవారు లేరు.

 

– స్కాట్లండ్ జానపద కథ. By Elizabeth Grierson

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

అడగవలసిన వరం

MythiliScaled

అనగనగా ఒక పెద్ద తోట. తోట నిండా రంగురంగుల పూలమొక్కలూ నీడ ఇచ్చే పళ్ళ చెట్లూ – చల్లటి జలయంత్రాలు, కలువలు విచ్చే కొలనులు. తోట మధ్యలో చక్కటివిశాలమైన ఇల్లు. అందులో ఒక ఫెయిరీ ఉండేది. చాలా దయ గలది, సరదాగానూ ఉండేది. అప్పటి పద్ధతి ప్రకారం చుట్టు పక్కల రాజ్యాలనుంచి రాకుమారులనీ రాకుమార్తెలనీ వాళ్ళు ఇంకా బాగా చిన్నవాళ్ళుగా ఉండగానే ఆమె దగ్గరికి పంపించేవారు. వాళ్ళందరికీ తన పక్కన ఉండటమే ఎంతో బావుండేది. హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ వాళ్ళు పెరిగి పెద్దయేవారు. బయటి ప్రపంచం లోకి వాళ్ళు వెళ్ళే ముందర ఆ ఫెయిరీ ఒక్కొక్కరికీ వాళ్ళు అడిగినవరాన్ని ఇచ్చేది.

వాళ్ళలో సిల్వియా అనే రాకుమారి మంచి చురుకైన పిల్ల. పైకి చెప్పకపోయినా ఫెయిరీకి మనసులో సిల్వియా అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. సిల్వియా వాళ్ళ రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చింది. ఈ లోపు , ఇదివరకు తనతో ఉండి వెళ్ళిన రాకుమార్తెలు కొందరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఫెయిరీకి అనిపించింది. ఆమె సిల్వియా తో అంది-” ఐరిస్ అని ఒక రాకుమారి ఉంది. తన దగ్గర రెండు నెలలు ఉండు. నిన్ను ఆమె బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చి తన గురించి ఏమనిపించిందో నాకు చెప్పు ”

సిల్వియా కి వెళ్ళటం ఏమంత ఇష్టం లేదు , కానీ ఫెయిరీ అడిగింది కదా అని ఒప్పుకుంది. రెండు నెలలు గడిచాక ఫెయిరీ ఒక సీతాకోకచిలకల రథాన్ని ఐరిస్ రాజ్యానికి పంపింది. సిల్వియా ” అమ్మయ్య ” అనుకుని అందులోకి దూకి వచ్చేసింది. ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు చెప్పు మరి, ఏమనుకుంటున్నావు నువ్వు ? ”

” ఐరిస్ రాకుమారికి మిరుమిట్లుగొలిపే అందాన్ని మీరు వరంగా ఇచ్చారు. తను మీ గురించి మంచిగానే చెబుతూ ఉంటుంది కానీ అంత అందం మీ వల్లనే వచ్చిందని ఎక్కడా ఎవరికీ చెప్పనే చెప్పదు. ముందు ఆమెని చూసి నాకూ కళ్ళు చెదిరిపోయాయి . కానీ – అందంగా కనిపిస్తే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదని అనుకుంటోందని అర్థమైంది. సంగీతం, పుస్తకాలు , స్నేహితులు – ఎవరూ అక్కర్లేదు, తనని తను అద్దం లో చూసుకుంటూ రోజంతా గడిపేస్తుంది. పాపం ! నేను అక్కడ ఉండగానే ఆమెకి తీవ్రంగా జబ్బు చేసింది. పూర్తిగా కోలుకుంది గానీ ఇదివరకటి అందం లేదు. తనని తనే అసహ్యించుకునేంత దిగులుపడిపోయింది. దయచేసి తన అందాన్ని తిరిగి ఇప్పించమని మీకు నన్ను చెప్పమంది. నాకూ నిజంగా అది అవసరమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే అందంగా ఉన్నప్పుడు తన ప్రవర్తన బాగానే అనిపించేది. మనసుని , తెలివిని అసలు ఉపయోగించటం ఇన్నాళ్ళూ మానేసింది కదా, ఆమె లోపాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించి – ఎవరూ భరించలేకపోతున్నారు . తనకి ఇదంతా అర్థమైనట్లే ఉంది. అందుకే మీ సహాయం అడుగుతోంది. మళ్ళీ తనని ఇదివరకులా చేసేయచ్చు కదా ”

ఫెయిరీ అంది ” అనుకుంటూనే ఉన్నాను ఇలా అవుతుందని. కాని ఏమీ చేయలేనమ్మా, నా వరం ఒక్కసారే పనిచేస్తుంది ”

కొంతకాలం సిల్వియాకి తోటలో, ఇంట్లో ,సంతోషంగా గడిచిపోయింది. అప్పుడు మళ్ళీ ఫెయిరీ సిల్వియాని డాఫ్నె అనే ఇంకొక రాకుమారి దగ్గరికి సీతాకోకచిలకల రథం మీద పంపించింది . వెళ్ళి ఎన్నో రోజులు కాకముందే సిల్వియా వెనక్కి వచ్చేస్తానని కబురు చేసింది. అటుగా ఎగురుతున్న ఒక తూనీగని బ్రతిమాలి చెప్పి పంపింది. ఫెయిరీకి జాలేసి సరే , రమ్మంది. ” అబ్బబ్బా..ఎలాంటి చోటికి పంపారండీ నన్నూ ” అని నసపెట్టింది సిల్వియా.

” ఏం? ఎందుకు అలా ? డాఫ్నె కి నేను మాటకారితనాన్ని వరంగా ఇచ్చానని జ్ఞాపకం. అవునా ?”

2the_fairies_vale

” అవునండీ, అవును. ఆమె బాగా మాట్లాడుతుంది, ఆ మాటయితే నిజమే. భాషని నేర్పుగా ఉపయోగిస్తుంది. మరి , ఆ మాటలు కాసేపైనా ఆపితేనా ? ముందర వినటానికి బాగానే ఉంటుంది కాని వినీ వినీ అలిసిపోతాం . అందరినీ ఒకచోట చేర్చి రోజుకి నాలుగుసార్లు ఉపన్యాసాలు ఇస్తుంది ఒక్కోసారీ రెండు గంటలు. రాకుమారి కాబట్టి అప్పటికి దొరికిపోయినవాళ్ళంతా కిమ్మనకుండా వింటూ ఉంటారు ఆ సమావేశాలు అవుతూనే మళ్ళీ ఏదో ఒకదాని గురించి చెప్పటం మొదలు. చెప్పేందుకు అసలేమీ లేనప్పుడూ అంతే. అక్కడనుంచి వచ్చేస్తుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను అసలు ! ”

సిల్వియా చిరాకు కి ఫెయిరీకి నవ్వొచ్చింది. కొద్ది రోజులు కోలుకోనిచ్చి మళ్ళీ పంపింది. ఈ సారి సింథియా అనే రాకుమారి దగ్గరికి. మూడు నెలలు అక్కడ ఉండి ఈసారి కొంచెం నయంగానే తిరిగి వచ్చింది సిల్వియా. ఆ రాకుమారికి ఎవరినైనా సరే ఆనందంగా ఉంచగల వరాన్ని ఫెయిరీ ఇచ్చి ఉంది.

సిల్వియా ఇలా అంది ” ముందు నేను అనుకున్నానూ, ఆమె చాలా సంతోషంగా ఉందని. ఏవైపుకి వెళ్ళినా తనని అంతా ఇష్టపడుతున్నారు. తనకేం కావాలంటే అది ఇస్తున్నారు. నాకూ అలాంటి వరమే మీరు ఇస్తే బావుంటుందనుకున్నాను కూడా ” ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు నీ మనసు మార్చుకున్నావా ఏమిటి ?”

సిల్వియా ” అవునండీ. సింథియా తో ఉండే కొద్దీ తను నిజానికి అంత సంతోషంగా లేదేమోననిపించింది. అందరినీ మెప్పించాలని ప్రయత్నించటం లో నిజాయితీగా ఉండటం మర్చిపోయినట్లుంది. తన ప్రవర్తన నిజమో అబద్ధమో తనకే తెలియదనుకుంటాను. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా, ఎలాంటివాళ్ళైనా ఒకేలాగా ఉంటుంది. తనని నిజంగా ప్రేమించినవాళ్ళకి నిరుత్సాహంగా ఉంటోంది ” అని జవాబు ఇచ్చింది.

uh51577157-1

ఫెయిరీ అంది ” బాగా కనిపెట్టావు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో ”
తనకేం కావాలని అడగాలో సిల్వియా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళ సొంత రాజ్యానికి తనూ త్వరలో వెళ్ళిపోవాలి.

చివరిసారిగా ఫిలిడా రాకుమారి దగ్గరికి పంపింది ఫెయిరీ. సిల్వియా అభిప్రాయం గురించి కుతూహలంగా ఎదురు చూసింది. అది ఇలా ఉంది .

” ఫిలిడా నన్ను ఆప్యాయంగా పలకరించింది. . తనకి మీరు అందరినీ నవ్వించగల శక్తిని ఇచ్చారు కదా. నాకూ ఆ హాస్యం తెగ నచ్చేసింది. ఆమెతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అంతకన్న ఇంకేం కావాలీ అనిపించింది. కానీ అందరినీ సంతోషపెట్టగలగటం లాగే ఇది కూడా పూర్తిగా తృప్తి ఇవ్వదని తోచింది. అస్తమానమూ హాస్యం ఉట్టిపడేలా మాట్లాడటం అయ్యే పని కాదు . అందుకేనో ఏమో, .ఫిలిడా ఒక్కోసారి ఎవరైనా ఏడుస్తున్నా బాధపడుతున్నా కూడా వాళ్ళని వెటకారం చేసి పక్కవాళ్ళని నవ్వించటానికి చూస్తుంది. తప్పు కదండీ ! ”

ఫెయిరీ సిల్వియా చెప్పింది నిజమేనని ఒప్పుకుంది. ఆమెని బాగా పెంచానని మనసులో సంతోషించింది.

చివరికి సిల్వియా తనకి కావలసిన వరాన్ని అడిగే రోజు వచ్చింది. స్నేహితులూ స్నేహితురాళ్ళూ అంతా గుమిగూడారు. ఏం కోరుకుంటావూ అని ఫెయిరీ ప్రశ్న వేసింది.
సిల్వియా ఒక్క క్షణం ఆలోచించి అడిగింది- ” ప్రశాంతమైన హృదయం ! ” .

” అలాగే, ఇచ్చాను. ” అంది ఫెయిరీ.

అది నిజంగా అపురూపమైన వరం. సిల్వియాకి తృప్తినీ సుఖాన్నీ తెచ్చిపెట్టింది. చిన్న చిన్న కష్టాలు అందరికిలాగే తనకీ వచ్చాయి. కాని వాటినుంచి త్వరగా తేరుకోగలిగేది. తనతో ఉన్నవాళ్ళకి కూడా తేలికగా, శాంతంగా అనిపించేది. తగిన రాకుమారుడిని పెళ్ళాడి సిల్వియా చాలా కాలం నిశ్చింతగా జీవించింది.

 

 French fairy tale , by the Comte de Caylus (1692–1765).
సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

పన్నెండు రూపాల ప్రేమ!

Mythili
ఒకానొకప్పుడు ఫెయిరీల రాణిని ఎన్నుకోవటానికని పోటీ పెట్టారు. సుక్రాంటైన్, పరిడైమీ ఇని ఇద్దరు ఫెయిరీలు అన్ని విషయాలలో గొప్పవాళ్ళని తేలింది. వాళ్ళలో ఏ ఒక్కరిని రాణిగా చేసినా రెండోవారికి అన్యాయం జరిగేంత సమానం గా ఉన్నారు. అందుకని అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. చలికాలం లో మామిడి పళ్ళు కాయించటం, వానచినుకులకి మల్లెపూల వాసన తెప్పించటం…ఇలాంటి మామూలు ఇంద్రజాలాలు కాకుండా , ఇప్పటివరకూ లేని ప్రత్యేకమైన వింతని సృష్టించాలి. ఎవరి వింత ఎక్కువ విడ్డూరంగా ఉంటే వాళ్ళు రాణి అవుతారు. ఎంత కాలం పట్టినా సరే, చేసి చూపించాలి. ఈ లోపు నలుగురు ముసలి ఫెయిరీలు కలిసి రాజ్యం బాగోగులు చూసే ఏర్పాటు చేశారు.

సుక్రాంటైన్ ఒక రాజకుమారుడిని పెంచుతుంది. అతనికి ఎప్పుడూ ఎందులోనూ కుదురు అన్నదే ఉండకూడదు. పరిడైమీ ఒక రాజకుమారిని పెంచుతుంది. ఆమెను చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడిపోవలసిందే. ఇవీ వాళ్ళు చేసి చూపాలనుకున్నవి. రాజకుమారిని చూసి ప్రేమలో పడని వారెవరైనా ఉంటే పరిడైమీ ఓడిపోయినట్లు. రాజకుమారుడికి కుదురు వచ్చిందా, సుక్రాంటైన్ ఓడిపోయినట్లు పరిడైమీ ఒక రాజూ రాణీ లతో పరిచయం పెంచుకుంది. రాజు బార్డండన్ చాలా మంచివాడు. తన ప్రజలని ఎంతో బాగా చూసుకునేవాడు. రాణి బాలనీస్ కూడా అంతే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గొప్ప ఇష్టం. వాళ్ళకి చిన్న కూతురు ఉంది. తన బుగ్గ మీద చిట్టి రోజా పువ్వు లాంటి పుట్టుమచ్చ ఉండటం తో ఆ పాపని ‘ రోజానెల్లా ‘ అని పిలిచేవారు. తను ఎంత చురుకైనదంటే, ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే రాజసభలో అందరికీ ఆమె మాటలు కంఠతా వచ్చేవి.

ఒక అర్ధరాత్రి రాణి ఉలిక్కిపడి నిద్ర లేచింది. తన చిట్టి పాప గులాబీపూలగుత్తి గా మారిపోయినట్లూ ఒక పక్షి దాన్ని తన్నుకుపోయినట్లూ ఆమెకి పీడకల వచ్చింది. వెళ్ళి చూస్తే రోజానెల్లా నిజంగానే మాయమైంది. ఎంత వెతికినా కనిపించనే లేదు.రాణి ని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. రాజు త్వరగా బయటపడే మనిషి కాదుగానీ ఆయనా దిగులుపడిపోయాడు. రాజధానిని వదిలి ఒక పల్లెటూళ్ళో ఉన్న ఇంటికి వెళ్ళారు ఇద్దరూ , కొంతకాలం ఉందామని.
ఒక చల్లటి సాయంకాలం చెట్లనీడలో కూర్చుని ఉన్నారు అక్కడ. ఆ ప్రదేశం పన్నెండు కోణాల నక్షత్రం ఆకారం లో ఉంది. ప్రతి కోణం లోనూ ఒక కాలిబాట.

ఒక్కొక్క బాట లోంచి ఒక యువతి, నవ్వు మొహంతో నడుచుకుంటూ వచ్చింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లికబుట్ట తో వచ్చారు. ” రాణీ ! మీ పాప కనబడటం లేదు కదా, ఈ పాపను పెంచుకోండి ” అని వాటన్నిటినీ ఆమెకి ఇచ్చారు. మాయమైన రాజకుమారి వయసే ఉన్న పాపలు ఉన్నారు ఆ బుట్టలలో. చూడగానే ముందర రాణి రోజానెల్లా కోసం బెంగ పడింది. మెల్ల మెల్లగా ఆ పాపలు ఆమెకి ముద్దొచ్చారు. ఉయ్యాలలూ వాటిని ఊపేవాళ్ళూ , బోలెడన్ని బొమ్మలూ ఆడించేవాళ్ళూ , రుచి అయిన తినుబండారాలూ తినిపించేవాళ్ళూ ,ఎత్తుకు తిప్పేవాళ్ళూ ఇలా అన్నిటినీ , అందరినీ రాణి పురమాయించింది. ఆ హడావిడిలో ఆమె తన బాధ మరిచిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ పన్నెండు మంది పాపలకీ బుగ్గ మీద రోజా పూవు ఆకారంలో పుట్టుమచ్చ ఉంది. అందరూ ఒక చోట ఉన్నప్పుడు పెద్ద పూలగుత్తిలాగానే కనిపించేవారు. ఒక్కొక్కరికీ ఒక రంగు పేరు పెట్టుకుంది రాణి. వాళ్ళు అందరూ తెలివైనవారే.

అందరూ బాగా చదువుకునేవారు. అయితే అందరూ మంచిపిల్లలే కానీ ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉండేది. అదివరకు వాళ్ళని ” పాటలీ , ఇంద్రనీలా, శ్వేతా ” అని పిలుచుకునే రాణి ఇప్పుడు వాళ్ళు ఎదిగేకొద్దీ స్వభావాన్ని బట్టి ” ఆనందినీ, మధురిమా, సాంత్వనా ” ఇలా పిలవటం మొదలుపెట్టింది. అందరూ పెరిగి పెద్దయి సొగసైన అమ్మాయిలు అయారు. ఆ నోటా ఈనోటా వాళ్ళ కబుర్లు విని వాళ్ళని పెళ్ళాడేదుకు దేశదేశాలనుంచి రాకుమారులు వచ్చేవారు. అమ్మాయిలని కలుసుకుని పొగిడి ఒప్పించాలని చూసేవారు. వీళ్ళు మాత్రం ఎవరినీ ప్రేమించలేదు, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటుండేవారు.

draft_lens18387266module152630148photo_1314117728andrew_lang_fairy_books.j
రాజు బార్డండన్ కి మేనత్త కొడుకు ఇంకొక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు, అతని పేరు మిర్లిఫ్లోర్. రెండో ఫెయిరీ సుక్రాంటైన్ ఈ రాజకుమారుడిని కుదురు లేనివాడిగా చేయాలని నిర్ణయించుకుంది. అందం, ఆరోగ్యం, తెలివి తేటలు, మంచితనం అన్నీ అప్పటికే ఉన్న ఆ అబ్బాయిని చాలా చాలా ఆకర్షణీయమైనవాడిగా తయారుచేసింది. అతను కోపంగా ఉన్నా శాంతంగా ఉన్నా, అలంకరించుకున్నా సాదాసీదా గా ఉన్నా, గంభీరంగా ఉన్నా సరదాగా ఉన్నా – ఎప్పుడూ అందరినీ ఆకట్టుకోగలిగేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కుదురు ఒకటి తప్ప. పద్దెనిమిదేళ్ళు నిండేసరికి రాజ్యం లోని అందరు అమ్మాయిలకీ అతను నచ్చటం, వాళ్ళు ఇతనికి మొహం మొత్తటం కూడా అయిపోయాయి. సరిగ్గా అప్పుడు బార్డండన్ రాజ్యానికి రమ్మని అతన్ని ఆహ్వానించారు.

ఒక్కసారిగా పన్నెండు మంది అపురూపమైన అమ్మాయిలు కనబడ్డారు. అతను ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అందరూ అతనికి నచ్చేశారు, వాళ్ళందరికీ ఇతనూ అంతగానూ నచ్చాడు. అందరూ ఒకే చోట లేకపోతే అతనికి తోచేది కాదు. ఒకరి మాటలు విని నవ్వేవాడు, ఒకరితో తను ముచ్చట్లు చెప్పేవాడు . ఇంకొకరి తో కలిసి కవిత్వం చదివేవాడు, మరొకరితో మౌనంగా ఉండేవాడు. ఒకరితో సంగీతం , ఇంకొకరితోపువ్వులూ పిట్టలు , మరొకరితో ఆకాశం, నీటి మబ్బులు. . గుబులుగా అనిపిస్తే ఒకరు ఊరట, అల్లరి చేసేందుకు ఒకరు తోడు. తన జీవితంలో అతను మొదటిసారి ప్రేమలో పడ్డాడు. అయితే అది ఒక్కరితో కాదు, పన్నెండు మందితో. అతన్ని మార్చిన ఫెయిరీ సుక్రాంటైన్ అనుకుంది, ఇంతకన్న కుదురు లేకపోవటం ఏముంటుందని. పరిడైమీ మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు.

రాజకుమారుడు మిర్లిఫ్లోర్ వాళ్ళ నాన్న అతన్ని ఇంటికి రమ్మని ఎన్నో సార్లు కబురు చెశాడు. ఏవేవో పెళ్ళిసంబంధాల సంగతులు వచ్చిపడుతున్నా మిర్లిఫ్లోర్ తనని కట్టిపడేసిన ఈ పన్నెండుమంది మంత్రగత్తెలని వదిలి వెళ్ళనేలేకపోయాడు.

ఇంతలో ఒక పండగనాడు రాణి ఉద్యానవనం లో విందు ఏర్పాటు చేసింది. అతిథులంతా వచ్చారు. ఆ తోటలో యథాప్రకారం మిర్లిఫ్లోర్ తన సఖులందరితోనూ ఉన్నప్పుడు జుమ్మని తేనెటీగల శబ్దం వినిపించింది. పన్నెండుమంది అమ్మాయిలూ రోజా పూవులో ఏమో , భయపడి దూరంగా పరుగెత్తారు. తేనెటీగలు వెంటపడ్డాయి. చూస్తుండగానే అవి ఇంతింత పెద్దవై రోజా కన్యలని ఎత్తుకు వెళ్ళిపోయాయి. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. అంతా నిర్ఘాంత పోయారు.

మిర్లిఫ్లోర్ ముందు విపరీతంగా దుఃఖ పడ్డాడు, ఆ తర్వాత ఏమీ పట్టకుండా , ప్రపంచం లో లేనట్లుగా అయిపోయాడు. ఏదో ఒకటి అతన్ని కదిలించకపోతే అసలు బ్రతుకుతాడా అనిపించింది. ఫెయిరీ సుక్రాంటైన్ ఓదార్చే ప్రయత్నం ఎంతో చేసింది. సుందరులైన రాజకుమార్తెల చిత్తరువులు తెచ్చి చూపించింది. అతను చీదరించుకున్నాడు. ఫెయిరీకి ఏం చేయాలో తోచలేదు ఇంక.

ఒక రోజు పిచ్చివాడిలాగా అతను అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద కలకలం చెలరేగింది. సూర్యకాంతిలో తళతళ మెరుస్తూ స్ఫటికపు రథం ఒకటి పైనుంచి దిగి వస్తోంది. రెక్కలున్న చక్కటి అమ్మాయిలు ఆరుగురు రోజా రంగు పట్టుతాళ్ళతో ఆ రథాన్ని లాగుతున్నారు. ఇంకా ఎందరో అందగత్తెలు పొడుగాటి పూల హారాలు పట్టుకుని ఆ పైనంతా రంగుల పందిరి వేసేశారు. ఆ రథం లో ఫెయిరీ పరిడైమీ కూర్చుని ఉంది, ఆ పక్కనే ఒక అత్యంత సౌందర్యవతి అయిన రాజకుమారి ఉంది. సరాసరి రాణి బాలనీస్ మేడకి వెళ్ళారు వాళ్ళిద్దరూ, ఆ వెనకే అబ్బురపడే జనం అందరూ.

” మహారాణీ , ఇదిగో మీ అమ్మాయి రోజానెల్లా ” అంది పరిడైమీ.
ఊహించనిది జరిగిన సంతోషం లో రాణి మునిగిపోయింది. అంతలోనే అడిగింది-
” మరి నా పన్నెండు మంది బంగారు తల్లులూ ఏరీ ? ఇంక నాకు కనిపించరా ? ”
పరిడైమీ ఒకే మాట అంది ” త్వరలోనే వాళ్ళందరినీ నువ్వు మరచిపోతావు ”
ఆ అనటం నన్ను ఇంకేమీ అడగవద్దు అన్నట్లుంది. తన రథం ఎక్కి సుక్రాంటైన్ వెళ్ళిపోయింది.

image185
చిన్నప్పుడే తప్పిపోయిన రాజకుమారి తిరిగి వచ్చిందని మిర్లిఫ్లోర్ కి తెలిసింది. ఆమెను చూడాలనే ఆసక్తి ఏమీ అతనికి లేనే లేదు. తప్పనిసరిఅయి, మర్యాద కోసం, ఆమెని కలవటానికి వెళ్ళాడు. ఆమెతో అయిదు నిమిషాలు ఉండగానే అతనికి తాను పోగొట్టుకున్న పన్నెండుమంది లక్షణాలూ ఆమెలో కనిపించటం మొదలెట్టాయి . కాసేపట్లోనే ఒళ్ళు తెలియనంత సంతోషం లో కూరుకుపోయాడు. తనని పెళ్ళాడమని రాజకుమారిని అడిగాడు.

సరిగ్గా అప్పుడే పరిడైమీ ప్రత్యక్షమయింది. విజయగర్వం తో వెలిగిపోతోంది . తను పెంచిన రాజకుమారిని చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడాలి, మిర్లిఫ్లోర్ అలాగే అయాడు. పరిడైమీ తను రోజానెల్లా ని ఎలా ఎత్తుకువెళ్ళిందీ, ఆమె ను పన్నెండుగా విడగొట్టి ఒక్కొక్కరితోనూ మిర్లిఫ్లోర్ ప్రేమలో పడేలా ఎలా చేసిందీ , కథ అంతా చెప్పుకొచ్చింది. పన్నెండుగురూ ఒకటి అయిన రోజానెల్లా ను ఇప్పుడు మిర్లిఫ్లోర్ ప్రేమిస్తున్నాడు, ఆమె పన్నెండు గుణాలకీ విడి విడిగా. అన్నీ ఆమె లోనే ఉన్నాయి కనుక అతనికి మరెవరూ అక్కర్లేదు. సుక్రాంటైన్ కుదురు లేకుండా చేద్దామనుకుంది, ఇతను ఈ రకంగా కుదురుగా అయిపోయాడు, ఆమె ఓడిపోయింది.

అయినా రోజానెల్లా ను ఇష్టపడకుండా సుక్రాంటైన్ ఉండలేకపోయింది. ఆ రాజకుమారి అంత అద్భుతమైనది. మిర్లిఫ్లోర్, రోజానెల్లా ల పెళ్ళివిందుకు సుక్రాంటైన్ హాజరైంది. అందమైన కానుక కూడా ఇచ్చింది. పన్నెండు రూపాలలో తను అతన్ని ప్రేమించిన ప్రేమనంతా రోజానెల్లా , మిర్లిఫ్లోర్ మీద కురిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా , శాంతంగా చిరకాలం జీవించారు.

 

ఫ్రెంచ్ జానపద కథ [ by Comte de Caylus , early 17 th century ] సేకరణ – Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

లోగో: మహీ బెజవాడ

గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము : జలంధర

Jalandhara Garu

 

   ఉదాత్తత అన్నదానికి నిర్వచనం చెప్పే రచనలు ఆమెవి.   70 ల నుంచీ  రాస్తూ   కూడా ఎంతో కాలం’ లో  ప్రొఫైల్   ‘ లో  ఉన్న రచయిత్రి జలంధర గారు.కథలలో, వ్యాసాలలో,  నవలలలో ,-అన్యాపదేశంగా ఆమె అన్న మాటలు జీవన సూత్రాలుగా నిలుపుకొని ఎదుగుతూ వచ్చిన అభిమానులూ ఆప్తులూ ఎక్కువ  మందే ఉన్నా, మొదటి కథల సంపుటి 2003 లో గాని వెలువడలేదు.  చాలా రచనలు ఇప్పటికీ పుస్తక రూపం లో రానేలేదు. తన రచనల గురించి శ్రద్ధే లేని ఈ రచయిత్రి గొప్ప చదువరి.  సాహితీ లోకం లో సజీవ స్త్రీ మూర్తులు అని ఒకప్పుడు ‘ వనిత ‘ పత్రిక లో మొదలైన వ్యాసాల పరంపర వెబ్ మాగజైన్ లు వచ్చిన కాలం లో తిరిగి కొనసాగింది. ఆ ప్రసిద్ధ రచయితల, రచయిత్రుల పాత్రలని విశ్లేషించేటప్పుడువిశ్వనాథ వారి చెలియలికట్ట లో రత్నావళి దగ్గరనుంచి చండీదాస్ గారి హిమజ్వాలలో గీతా దేవి వరకు  ఆమె చూపిన ఆప్తత,  విశాలత్వం ఎన్నదగినవి, అరుదైనవి .

2(1) 2013 లో వచ్చిన ‘ పున్నాగ పూలు ‘ నవల ద్వారా అధిక సంఖ్యాకులకి తెలిశారు, అతి అవసరమైన సమయం లో వెలువడిన రచన అది. ఆలోచించటమూ దిద్దుకోవటమూ ఇలా ఉంటాయని, ఉండాలని పాఠాలు చెప్పినట్లు నేర్పించిన నవల. ఆ నేపథ్యం లో ఒక్కసారిగా ఆమె కౌన్సిలర్ గా మారవలసీ వచ్చింది. ఆమె రచయిత్రిగా  ఒకప్పుడు అన్వేషి, ఆ పైన తాత్వికురాలు, దార్శనికురాలు. తెలుసుకున్నదాన్ని ఇప్పుడు తను మాత్రమే చెప్పగలిగిన తీరులో చెప్పి చేయగలిగినంతా చేస్తూ ఉన్నారు.  రెట్టించి అడిగితే మాత్రం  ‘ నా మొహం ‘ అని నవ్వేస్తారు .   

      ఇంట్లో అల్మైరా లకి తాళాలు వేసుకుంటే సాటి మనుషులని అవమానించినట్లే అనే సత్యకాలపు తండ్రి డాక్టర్ గాలి బాల సుందర రావు గారు. మద్రాస్ లో పేరు మోసిన వైద్యులు, అప్పటి సాహిత్య కారులందరికీ దగ్గరి వారు.  మేనత్త ‘ లత ‘ గారు కొన్ని దశాబ్దాల సేపు  తెలుగు సాహిత్యాన్ని ఊపిన ప్రభంజనం. చాలా తక్కువ మందికి దొరికే  అద్భుతమైన ‘ ఎక్స్ పోజర్ ‘  జలంధర గారికి  అందింది. బహుశా దాన్ని పూర్తిగా, సక్రమంగా ఉపయోగించుకోవటం వల్లనే ఆవిడ మొదటి రచనలు కూడా  ప్రత్యేకమైన పరిమళంతో ఉంటాయి.

ఆ  పుష్య మాసపు  మధ్యాహ్నం లో  మద్రాస్ కూడా చల్లగానే ఉంది . కోడంబాకం లో వారి ఇల్లు వెతుక్కుంటున్నప్పుడు అడుగడుక్కీ ఫోన్ చేసి సూచనలు ఇస్తూనే ఉన్నారు. తీరా వెళ్లేసరికి అక్షరాలా వీధి లో నిలుచుని ఉన్నారు మా కోసం. అడవి బాదం, మామిడి చెట్లు గుబురుగా పెరిగిన ఆవరణ హాయిగా ఉంది. ఎగువ మధ్య తరగతి లో కొంత సంపన్నులయినవారిది  లాగా ఉంటుంది ఆ ఇల్లు, ఒక ఫిలిం స్టార్ నివాసమని అనిపించదు. [ఆమె భర్త ప్రసిద్ధ సినీ నటులు చంద్రమోహన్ గారు ]

 అతిథి మర్యాదలూ యోగక్షేమాలు తెలుసుకోవటమూ అయిపోయాక ఆవిడ అనర్గళంగా మాట్లాడారు. సాహిత్యం,  అందులోంచి నేర్చుకుని జీవితానికి అన్వయించుకోవటం, పక్క మనిషి కి చూపవలసిన అక్కర, ఆ కాస్తా  లేక మూసుకుపోతున్న ద్వారాలు…ఇంకా చాలా చాలా.

         సోమర్సెట్ మాం  రాసిన ఒక కథ పూర్తిగా చెప్పారు ఆవిడ మా అందరికీ. ప్రేమ లోంచి వచ్చే హద్దుమీరిన  పొసెసివ్ నెస్   మనిషికి  ఎంత ప్రమాదకరమో  కత్తి వేటు లాగా చెప్పిన కథ అది. ఆయనదే ‘ థియేటర్ ‘ నవలిక గురించీ వివరంగా చెప్పుకొచ్చారు. అందులోని విషాదపు చమత్కారం విప్పుతూ నవ్విన నవ్వు మాకు చదువు నేర్పింది.. శరత్ గురించి చెబుతూ సుతి మెత్తన అయిపోయారు. పార్వతి పెళ్లి చేసుకుని వెళ్లిపోయాక దేవదాస్ కి తాగుడు బాగా అలవాటయిపోతుంది కదా. ఆ సమయం లో పుట్టింటికి వచ్చిన పార్వతి అడుగుతుంది ‘ తాగటం మానేయకూడదా ‘ అని. అతను అంటాడు ‘ ఈ రాత్రి నాతో లేచి వచ్చేస్తావా ‘ అని. ఆమె అన్నారు ‘ ఎన్నిసార్లో ప్రయత్నించాను, ఆ పేజీ దాటి ముందుకి చదవలేకపోయాను. ఎంత బాధ, కడుపు దహించుకుపోయేలా …నా వల్ల కాదు ”  దుఃఖంఆమె గొంతు నిండా. ఆ చలించిపోయే లక్షణం ఎవరికీ సుఖాన్నిఅయితే ఇవ్వదు, ఇంకేమి ఇవ్వగలదో ఆమెని చూస్తే తెలుస్తుంది.

సాంత్వన చీమలమఱ్ఱి ,   నేను  కలిసి సిద్ధం చేసుకున్న ప్రశ్నల జాబితా అలా లోపలే ఉంది. ఆఖర్న చూసుకుంటే ఒకటి రెండు తప్ప అన్నిటికీ జవాబులు వచ్చేశాయి… అదనంగా వచ్చినదెంతో కొలత లేదు.

ఆమె మాటలని రికార్డ్ చేయనూ లేదు. ” పర్వాలేదు, అమ్మకి గుర్తుంటుంది ” అన్నారు ఆమె సాంత్వన తో.

jalandhara2

Q మీ సాహిత్య నేపథ్యం గురించి చెప్పండి.

—. -ఊహ తెలిసినప్పటినుంచీ ఇంట్లో కవులూ రచయితలూ కనిపిస్తూ ఉండేవారు. కృష్ణశాస్త్రి గారు, కొడవటిగంటి కుంటుంబరావు గారుబలిజేపల్లి లక్ష్మీకాంతం గారు  , వంటివారు తెలిసేవారు కాని అందరూ కాదు. వెనక్కి చూసుకుంటే చాలా ప్రసిద్ధులైన సాహిత్య వేత్తలని  దగ్గరగా చూశానని అర్థమవుతుంది.

మా అత్తయ్య లత గారు, నాన్నగారు డా.గాలి బాలసుందర రావు గారు పుస్తకాలలో పాత్రల గురించి గంటల తరబడి వాదించుకుంటూ పోట్లాడుకుంటూ రాత్రులకి రాత్రులు గడిపేస్తూ ఉండేవారు. ఛార్లెస్ లాంబ్, మేరీ లాంబ్ ల లాగా అన్నమాట. [నవ్వు] వాళ్లకి కాఫీలు పెట్టి ఇస్తూ బజ్జీలు వేసి పెడుతూ భయం భయంగా తిరుగుతూ ఉండేదాన్ని. రాయగలనని, రాస్తానని ఎప్పుడూ అనుకోలేదు. అంత నిర్దాక్షిణ్యం గా నిగ్గు తేల్చేమా వాళ్ల   విమర్శలు వింటే ధైర్యం చాలేదికాదు.  ఒకసారయితే ఏదో రాయబోతున్న నన్ను నాన్నగారు చాలా అర్థవంతం గా హెచ్చరించారు, ముందు చెప్పదగిన విషయాలేవయినా నేను తెలుసుకుని ఉండాలని. ఎవరైనా రాయమంటేనే గాని రాయకూడదని నిర్ణయించుకున్నాను.  ఆ పద్ధతి ఇప్పటికీ ఉంది, ఎవరైనా అడిగితేనే గాని రాయను. కాలేజ్ లో లెక్చరర్ విద్యుల్లతా రెడ్డి గారి ప్రోత్సాహం తో రాసిన కథ చివరికి నీలం రాజు వెంకట శేషయ్య గారు ఎడిట్ చెస్తూ ఉన్న ఆంధ్రప్రభ లో పడింది. బల్ల మీద ఉన్న కథని చదివి పట్టుకెళ్లి వేశారు ఆయన.ఎడిటర్స్ అంటే చాలా చాలా గౌరవం నాకు. వాళ్లు లేకపోతే రచయితలు లేరు. విశాలాంధ్ర వాళ్లు వేసిన కథా సంపుటిని నా ఎడిటర్స్ అందరికీ అంకితం ఇచ్చాను.

తెలుగు లో నవలా సాహిత్యం పుష్కలంగా వస్తూండే కాలం లో కొడవటిగంటి కుటుంబరావు గారు ” నవల రాస్తే మనం చెప్పదలచుకున్నది వందల పేజీలలో ఎక్కడైనా చెప్పవచ్చు. కథ రాయటమే చాలెంజ్. కథ జీవితానికి క్రాస్ సెక్షన్. దాన్ని మైక్రోస్కోప్ కింద పెడితే సర్వం అర్థమవాలి  ” అనేవారు. ఆ మాటలు నాకు కథ పట్ల ఆకర్షణని ఇచ్చాయి. నేను రాయటం ప్రారంభించాకా ఆయన అన్నారు , ”వంద కథలు దాటితేగాని నవల రాయకూ’  అని.

కృష్ణశాస్త్రి గారు ప్రతి పదానికీ రంగు, రుచి, వాసన ఉంటాయని అనటం జ్ఞాపకం. ” నిండు వెన్నెల, పండు వెన్నెల…ఈ రెండు మాటలూ ఎంత వేరో చూడు ” అని ఒకసారి.

Q ఏ రచనలు ఇష్టం ? ఎవరివి ఎక్కువ చదివారు?

letters from a stoic చదవటమయితే ఇవీ అవీ అని లేకుండా ఎక్కువే చదివాను.  సోమర్ సెట్ మాం, ఆస్కార్ వైల్డ్, బెర్నార్డ్ షా, అయాన్ రాండ్  … బాగా ఇష్టం . శరత్ సవిత , టాగూర్ చారులత, వినోదిని . లత, చలం, విశ్వనాథ , అడివి బాపిరాజు , ఇంకా కొందరు. ఒక రచయిత నచ్చటం అంటే వారు చెప్పిన అన్నీ ఒప్పుకుంటామని కాదు. కొన్ని విషయాలు కొందరు బాగా చెప్పగలరు.

ఇటీవలి కాలం లో లూయీస్ హే రాసినవి చాలా నచ్చుతున్నాయి. ఆమె చెప్పినవి సాధన చేస్తే తప్పకుండా ప్రయోజనం ఉంటుందనిపిస్తోంది. ఇప్పుడు ‘ Letters from a stoic ‘అని Seneca   గురించిన పుస్తకం చదువుతున్నాను. చాలా బావుంది.

Q  కవిత్వం చదువుతారా?

చిన్నప్పుడు చదివేదాన్ని. వర్డ్స్ వర్త్ ‘ డాఫోడిల్స్ ‘ చాలా ఇష్టం. బైరన్ ‘ ద ఒషేన్ ‘ కూడా. ఆదూరి సత్యవతీ దేవి గారి కవిత్వం, ఎన్.గోపి గారిది, కొన్ని స్త్రీవాద కవితలు నచ్చుతాయి.

Q మీ శైలి , ఇమేజరీ చాలా అందమైనవి- ఎప్పుడూ కవిత్వం  రాసే ప్రయత్నం చేయలేదా?

లేదు. చేతకాని పనికి ఎందుకు పూనుకోవటం [ నవ్వు ] ? గొప్పగా రాసేవారు అంతమంది ఉండగా. పోయిట్రీ ని  కూడా దానినుంచి నేను ఏమి నేర్చుకోగలిగానో అందుకే ఇష్టపడతాను.

 

Q రచన ప్రయోజనం ఏమిటి? మీ రచనలు దాదాపు అన్నిటిలోనూ ముగింపు పరిష్కారం వైపు ఉంటుంది. అలాగ అవసరం అంటారా? డాటా ఇచ్చి వదిలేయచ్చా?

పరిష్కారాన్ని కనుచూపుమేరలోనయినా చూపించని రచనల పైన నమ్మకం లేదు. ఇక్కడ పరిష్కారం అంటే ఒక పాజిటివ్ ఆలోచన కూడా కావచ్చు. భావుకతలో ముంచెత్తే వాటికన్న జీవితం లో ఒక సమస్యేదో ఎదురైనప్పుడు స్ఫూర్తి అడిగి తెచ్చుకోగల సాహిత్యమంటే గౌరవం. సాహిత్యం టానిక్ లాగా పని చేయాలి, మత్తు మందులాగా కాదు. మంచి పుస్తకంఆలోచించటాన్ని నేర్పాలి.

Q సాహిత్యానికి సద్యః ప్రయోజనం ఉండాలా? కాలాంతరాలలో అక్కరకి రావాలా?

రెండు రకాలు గానూ సత్సాహిత్యం పనిచేయగలదు. ఒక్కొక్క రచన ఒక్కొక్కలాగా.

Q కొన్ని సాహిత్య ధోరణులని ఉద్దేశించి ఈ ప్రశ్న .ఆలోచనలకి  నియంత్రణ అవసరమా? నాకిలా అనిపిస్తోంది, కనుక చేయచ్చు అనటం సరయినదేనా?

మా రోజులలో కొన్ని విషయాలు ఊహకే అందేవి కావు. మమ్మల్ని మేము అలా అనుకోకుండానే నియంత్రించుకున్నాము. అన్నీ అందుబాటులో ఉన్న, ఏదయినా చేసేయగలిగిన ఈ రోజులలో వివేచన ఇంకా ఎక్కువ అవసరమేమో. ఒక పని చేస్తున్నప్పుడు దీని వలన నాకు శాంతి వస్తుందా, నాతో   భౌతికంగానో ఎమోషనల్ గానో జీవితం పెనవేసుకున్నవారిపట్ల సరిగ్గా ఉందా అని తర్కించుకోవటం అవసరం. సీత వేషం వేసి ద్రౌపది డైలాగ్ లు చెబితే నాటకం రసాభాస అవుతుంది. జీవితం కూడా అంతే.. సుఖం కోసం శాంతిని తాకట్టు పెట్టకూడదు.1(1)

Qఆ హద్దు ఎవరు నిర్ణయిస్తారు?

ఎవరికి వారే. దేశ, కాల,పాత్ర,  దేహ ధర్మాలని అనుసరించాలి. ఒక కాలంలో, ఒక దేశం లో, ఒక వ్యక్తికి తప్పు కానిది మరొకప్పుడు, మరొక చోట, మరొకరికి హాని చేయచ్చు    డివైన్ లా, నాచురల్ లా, హ్యూమన్ లా ఇలా మూడు విధాలు. ఒకరు మరొకరిని చంపేస్తే అది హత్య. నలుగురైదుగురు కలిసి చేస్తే దొమ్మీ. చాలా మంది కలిసి చేసే అదే పని ఒక ‘ కాజ్ ‘ కోసం అంటారు. ఒక జాతి మొత్తమూ అటువంటి పని చేస్తుంటే దాన్ని ‘ సివిల్ వార్ ‘ అంటున్నాం. చట్టం , న్యాయం ఇలా వేర్వేరు పరిధులలో పని చేస్తాయి. హ్యూమన్ లా ఎప్పుడూ సంఖ్యాబలం మీదే ఆధారపడుతుంది. అది మంచా చెడా అని చెప్పటం కష్టం.

Q  ధర్మం, నీతి  అనేవి సాపేక్షాలేనా ?

అవును. ఎవరి పట్లా తీర్పు ఇవ్వగలమని అనుకోవటం పొరబాటు. మన పక్కింట్లో ఎవరు ఏ బాధలు పడుతున్నారో ఒక్కొక్కసారి ఆ కుటుంబమంతా ఆత్మహత్య చేసుకున్న తర్వాత కానీ అర్థం అవటం లేదు మనకి. అంత పరాయితనం జీవితాలలో.

Q ఏమిటి మార్గం?

కమ్యూనికేషన్, సానుభూతి.  కొంచెం మనసు పెడితే వీలయే  విషయాలు అవి.

4

Q మీ ఫిలాసఫీ ఏమిటి? మీరు ఎటువైపు?

మానవత్వం తప్ప ఏ అస్తిత్వవాదం లోనూ విశ్వాసం లేదు. ఎవరు బాధలో, కష్టం లో, ఉంటే నా వాదన వారివైపు. ఒక వాదానికి కట్టుబడిపోవటం స్వేచ్ఛని పోగొట్టుకోవటమే. ఇంకొక రకంగా అవి జాతి విద్వేషం వంటివి. మనకు తెలిసిన, చాలా గొప్పగా ఉన్న మనుషులు ఒక పరిధిలో ఇరుక్కుపోయి వాళ్లు నమ్మిన సిద్ధాంతం కోసరం తప్పులు, ఒక్కొక్కప్పుడు పాపాలు చేయటం చూడగలం.  ఒక పరిస్థితి బాగా లేనప్పుడు దానికి కారణాలు వెతికే ఓపిక అవసరం. ఉదాహరణకి కొందరు మగవాళ్ల పైన  కొన్ని తరాల తరబడి  సమాజం వారికి ఇచ్చిన సజెషన్స్, ఒత్తిడులు పనిచేస్తూ వారిని కాంప్లెక్స్ లకి గురిచేస్తాయి. చెల్లుబడి కావటానికి ధాష్టీకం ప్రదర్శిస్తారు. ఒక్కొక్కప్పుడు మగవాడికి చాలా సానుభూతి చూపించవలసిన పరిస్థితి వస్తుంది. మగ, ఆడ అని ఆలోచించటం కన్న మనిషిగా ఆలోచిస్తే సమస్యలు మళ్లీ మరిన్ని సమస్యలను సృష్టించవు

Qఈ లెక్కన చూస్తే ఎవరిని నిందించగలం అసలు?

-అదే నేనూ చెబుతున్నది.ఇక్కడే కాదు,  ‘ వారి వైపునుంచి ఆలోచించటం ‘ , ఏ సందర్భం లో అయినా  చాలా కష్టం. కచ్చ లు లేకుండా చూస్తే చాలా వరకు అర్థమవుతాయి.”స్త్రీ విమోచన  కోసమే నా తపన అంతా. అయితే ఆ స్వేచ్ఛని ఏం చేసుకోవాలో తెలియని స్త్రీని,  లాలించటం మరచిపోయిన స్త్రీని పాలివ్వటం మరచిపోయే తల్లిని ,నేను గౌరవించలేను ”  అని ఎన్నో దశాబ్దాల క్రితమే ద్రష్ట అయిన చలం గారు అన్నారు. మాటలు అవే కాకపోవచ్చు, భావం అదే. స్త్రీత్వాన్ని పోగొట్టుకుంటే ఎలా?

Q స్త్రీత్వం అంటే?

ఎంతో గొప్ప సాహిత్యం చదివి, జ్ఞానం సంపాదించి పురుషుడు తెచ్చుకోగలిగిన సున్నితత్వపు గొప్పదనం స్త్రీకి పుట్టుకతో వస్తుంది. దాన్ని కోల్పోకూడదు. రాధ, యశోదల కలబోతే నిజమైన స్త్రీమూర్తి.

Qమీ రచనల లో మీకు నచ్చినవి?

నిర్మోహ దర్పణం నా కథలలో నాకు నచ్చిన కథ ఇద్దరు ఎదిగిన వ్యక్తుల విలక్షణమైన కలయిక అది..ఒక్కొక్కసారి మనం బాగా చెప్పామనే అనిపిస్తుంది, అది పాఠకులకి అందకపోవచ్చు .

. ‘ మలుపు ‘ అని ఒక కథ -సర్వసంగ పరిత్యాగంతో ఔన్నత్యం వచ్చిందనుకొని  అందరికీ బోధించే ఒకరిని మామూలుగా సంసారంలో ఉన్న స్త్రీ నిలదీస్తుంది.

Q నాకు  గుర్తుంది, ” పాల రాతి బండల మీంచి వీచే అమానుషమైన చల్లదనం ” అని ఉంటుంది అందులో.

[నవ్వు ] అవును. దాని గురించి ఎవరైనా చెబుతారేమోనని ఎంత ఎదురు చూశానో. అలా పూర్తిగా రీచ్ కాలేదేమో అనుకున్న కథలలో ‘ మహా గాయని ‘ ఒకటి.

Qలేదండీ. ఫేస్ బుక్ లో మొన్న కూడా తలచుకున్నారు ఆ కథని.

అవునా. ..

పరిసరాలలో ఇమిడీ ఇమడని ఒక మధ్యతరగతి ఇల్లాలు  కట్టుబాట్ల మధ్యనుంచి కూడా కూడా ఎన్నెన్ని చేయగలదో చెప్పాలనుకున్న ‘ పూర్ణిమ ‘ , ‘  కూడా ఇష్టం.   జీవితాన్ని ఒక ఆట లాగా తీసుకునే ఉద్యోగస్తురాలు అనుకోకుండా తారసపడినవారి వలన మలచబడిన తీరు గురించిన ‘ వియద్గంగ ‘ , తానేమిటి అనుకుంటోందో తెలియని స్థితిని దాటి తనని తను ఒప్పుకుని ఆనందం పొందిన అమ్మాయి కథ ‘ మహోత్సవం ‘ ఇవన్నీ నాకు ఇష్టమైనవి. ‘ మజిలీ ‘ కథ చాలా మందికి నచ్చింది. ఒకవారంలో 250 ఉత్తరాలు దాని గురించి. పక్క మీదనుంచి లేవలేని ఒకరు తానే రాసి తీరాలని వంకర  టింకర అక్షరాలతో రాసిన ఉత్తరం మర్చిపోలేనిది. స్మృతిచిహ్నం నవల అయాన్ రాండ్ ఆలోచనలని అనుసరించి నా పద్ధతిలో చెప్పాలని రాసినది.

 

Qమీరు రాసినవి చదివి జీవితాలను మలచుకున్నవారు నిజంగా  ఉన్నారా? నేను అడిగేది ‘ పున్నాగ పూలు ‘ కి ముందు కాలంలో?

ఉన్నారు. నా దగ్గరికి వచ్చి చెప్పారు. ఇది స్వాతిశయం తో చెప్పటం లేదు, నేను చెప్పినది మరొకరికి ఉపయోగపడిందనే తృప్తి.

Q లూయీస్ హే గురించి ‘ పున్నాగ పూలు ‘ లో చెప్పారు కదా. ఆ నవలకి ప్రేరణ ఆవిడేనా?

కాదు. మా నాన్నగారు డా.గాలి బాలసుందర రావు గారు,  నా గురువు గారు డా. గోపాలకృష్ణ గారు.

Q‘ పున్నాగ పూలు ‘ మీ ఇదివరకటి రచనల కంటె భిన్నమైనది. చాలా విశదంగా చెప్పారు మీరు.

అవును. అటువంటి  హాస్పిటల్ , అంతమంది మనుషులు, ఇంత అవకాశం ఉంది గనుక. ఇంకొక పెద్ద నవలకి సరిపడా సబ్జెక్ట్ ఉంది నా దగ్గర. రెండో భాగం కూడా రాస్తానేమో. ఎవరో అన్నారు, ” ఈ నవల రాయటానికి మీరు కనీసం రెండు వేల పేజీలు చదివి ఉంటారు ” అని. నిజమే.

Qనేను ఇంకొకటీ అడగాలి. ఎప్పుడూ లేనంత వాచ్యంగా చెప్పారు కూడా, అవునా?

చాలా మందిని చేరింది   మైథిలీ ఇలా చెప్పటం వల్ల. ఉపయోగపడాలంటే ముందు అర్థం అవాలి కదా. నా శైలి బావుందనో, చెప్పిన పద్ధతి బావుందనో అనేసి పేజీలు తిప్పేస్తే ఏమి సాధించినట్లు? రచయిత్రి గా నాకు ఎప్పుడూ రానంత తృప్తి ఇలా వచ్చింది. టాగూర్ కన్న శరత్ బాగా అర్థమవుతారు. టాగూర్ ఏం చెప్పాలనుకుంటున్నారో చప్పున తెలియదు. దానికి  ‘in between the lines ‘చదవటం తెలియాలి. పాఠకులకి నేరుగా చెప్పటం వారి శ్రమని తగ్గిస్తుంది.

 

Qశరత్ పాఠకుల కో సం రాస్తే టాగూర్ రచయితల కోసం రాశారని శరత్ స్వయంగా  ఒకసారి అన్నారు.

అవును, అన్నారు. ఇక్కడ నేను aim  చేసినదీ అదే. ‘ పున్నాగ పూలు ‘ ఎంతో మందికి చేరటం నాకు గొప్ప విజయం . హైదరాబాద్ లో కొందరు వైద్యులు, ఇతరులు కలిసి ‘ పున్నాగ పూలు ‘ ఫాన్స్ అసోసియేషన్ పెట్టారు. నిజంగా వారికేదో కనిపించి, చేయాలని అనిపించటం కదా ఇదంతా.

 

Q రచయిత్రి అనే పరిధి దాటి ఆత్మీయురాలైన కౌన్సిలర్ గా ‘ మైత్రి ‘ కాలం ద్వారా మారారు. శ్రమగా లేదా?

లేదు.  కాని  ఆ ప్రశ్నలు ఒక్కొక్కసారి చాలా పెద్ద ఉత్తరాల రూపం లో ఉంటున్నాయి. మొత్తం చదివి, వారి మర్యాదకు భంగం రాని పద్ధతిలో ఆ ప్రశ్నను పత్రిక లో ఉంచటమూ నేను చేయవలసిన పనే, అప్పుడు కొంచెం కష్టంగానే అనిపిస్తుంది. ఇంకా కొన్నిసార్లు ఆ సమస్యలు తక్షణ పరిష్కారం అవసరమయేవిగా ఉంటాయి, ఆ గడువు  లోపు  నా జవాబు వారికి అందకపోవచ్చు. ఇ మెయిల్ లో అయితే వెంటనే జవాబు ఇస్తాను. ఉత్తరం అయితే రెండు వారాలు పడుతుంది.  అందుకు బాధగా ఉన్నా చేయగలిగినదేమీ లేదు.

Q ఇంత మందికి సాయపడటం ద్వారా ఏమి పొందుతున్నారు?

నేనేదో వారి జీవితాలను మలుపులు తిప్పేస్తున్నాననీ అనుకోను. ఆ మనసులలో ఒక తలుపు తెరుచుకోవటానికి సాయం చేస్తున్నాను అంతే.  ఆ తర్వాత వెలుగులోకి నడవటం వారి చేతులలోనే ఉంటుంది.ఈ ప్రాసెస్ లో  నేనూ చాలా చాలా నేర్చుకుంటున్నాను.

Qనేటితరం మనుషులు  ముఖ్యంగా పెళ్లి విషయంలో   డిస్ హార్మొనీ ని అనుభవించటానికి కారణం ఏమిటి ?

సముద్రంలో ఉప్పు, అడవిలో ఉసిరికాయ తెచ్చి ఊరగాయ పెట్టటం వంటిది వివాహం. ఆ రెండిటికీ లేని కొత్త రుచి వస్తుంది అప్పుడు. మనం స్వేచ్ఛగా ఉండటం అవతలి వారి స్వేచ్ఛ కి ఆటంకం అవకూడదు. ఇందుకోసం ఒకరి పట్ల ఒకరికి గౌరవం ఉండాలేమో.

Qఅంటే సెల్ఫ్ సెంటర్డ్ గా ఉండకూడదంటారా?

-[నవ్వు ] ఉండాలి. మనల్ని  మనం ముందు గౌరవించుకోవాలి కదా ముందర. ‘ నేను ‘ అన్నది ఉంటేనే కద, ‘ నిన్ను ప్రేమిస్తున్నాననటం ‘ . Be selfish to be selfless అంటారు.

Qఓ. అయాన్ రాండ్! మీరు చెప్పేది చాలా కష్టం.

అసాధ్యం కాదు.సాహిత్యం ఇక్కడ సహాయం చేస్తుంది. ఒక పాత్రని విశ్లేషించి చూసే అలవాటు అవతలి మనిషి దృక్కోణాన్ని అర్థం చేసుకునే నేర్పుని ఇస్తుంది.

Qఇప్పటి యువత ఎలా ఉన్నారు?

చక్కగా ఉన్నారు. చాలా స్పష్టత ఉంది వారికి.

Q ఒక పడికట్టు ప్రశ్న…కేరీర్ ముఖ్యమా లేక కుటుంబమా?

ఆర్థికస్వాతంత్ర్యం అందరికీ అవసరం.  ఎవరి మీద వారికి గౌరవం అలా వస్తుంది. ఉద్యోగం చేయటం వల్ల పరిధులు విశాలమవుతాయి కూడా. ఒక మనిషి సంపాదించి అయిదారుగురు తినే వ్యవస్థ వల్ల, పనిలేనివాళ్ల  unproductive attitude వల్ల , negative vibrations  వల్ల ఎన్నో సంపదలు  హరించుకుపోయాయి.

Qమరి పిల్లల విషయం?

సపోర్ట్ ఉంటుంది కదా పెద్దవారినుంచి. తెచ్చుకోవాలి. లేదా మంచి ఇన్ స్టి ట్యూషన్స్ ని డెవలప్ చేయాలి. అంతేకాని పిల్లల కోసరం అని ఉద్యోగాలు మాని తమ స్వాతంత్ర్యాన్ని తాకట్టు పెట్టామనుకోవటం, ఆ పిల్లలని burden  గా ఫీల్ అవటం, ఆర్థిక సమస్యలు ఎదుర్కోవలసివచ్చినప్పుడు  పిల్లలని తిట్టుకోవటం…ఇవన్నీ ఆరోగ్యకరమైనవి కావు. ఇవాళ అతి సామాన్య సంసారం లో కూడా ఒక అమ్మాయి కడుపుతో ఉన్నదగ్గరనుంచి బిడ్డ కు ఏడాది వయసు వచ్చేదాకా రెండు లక్షలు ఖర్చు అవుతున్నాయని ఎక్కడో చదివాను- మందులు, టెస్ట్ లు , పురుటి ఖర్చులు, వేడుకలు అన్నీ కలిపి.ఎంతమంది ఈ లెక్కలన్నీ తెలిసి కంటున్నారు? అప్పుల పాలవకుండా ఉండగలుగుతున్నారు? ఇటువంటి జ్ఞానాన్ని పెంచటం చాలా అవసరం. కొడవటిగంటి కుటుంబ రావు గారు అనేవారు ” రచయిత సమాజానికి కుక్క కాపలా కాయాలని ” .

Q వ్యాపారవేత్తల వంటివారు ఎక్కువ డబ్బు సంపాదించటం వల్ల సమాజానికి తోడ్పడే అవకాశం ఎక్కువవుతుందని  అనుకుంటున్నారా?

తప్పకుండా. ఉదాహరణలు చూస్తూనే ఉన్నాము కదా.

Qడబ్బు మానవ సంబంధాలని పాడు చేయదంటారా?

లేదు. సరిగా ఉపయోగించుకుంటే వాటిని మెరుగు పరస్తుంది. తెలియాలి అంతే.

Q అత్యాచారాలు ఎందుకు పెరుగుతున్నాయని అనుకుంటున్నారు? పరిష్కారం?

అత్యాచారాలు  ఎప్పుడూ ఉన్నాయి. చాలా కుటుంబ హింసలు, చైల్డ్ అబ్యూజ్ లు బయటికి వచ్చేవి కావు. ఇప్పుడు అవేర్ నెస్ పెరిగింది. పిల్లలని, ముఖ్యంగా మగపిల్లలని సరయిన విలువలతో పెంచటం అవసరం. ఆడపిల్ల భోగ వస్తువు అనుకోవటం,  నానా రకాలైన  చిత్రహింసలకి లోబడటమే  స్త్రీత్వం అనే భావన కలిగించటం , హీరోయిజం పేరిట  అమ్మాయిలని భయపెట్టి డామినేట్ చేయటం…ఇలాంటివన్నీ ఇవాళ  సినిమా మీడియా లో  ఎక్కువ కనబడుతున్నాయి.  దయగా , బాధ్యతగా ప్రవర్తించటాన్ని  సన్మానించినట్లు చూపించటం  చాలా తక్కువ. అటువంటి పాపులర్ హీరోలని అనుకరించేవారు మన చుట్టూ  పెరుగుతున్నారు.మగపిల్లలకి విలువలు అర్థమవటానికి మనం ఏమి చేయగలుగుతున్నాము? తను మిగతా ఆడపిల్లలని చూసే పద్ధతిలో తన చెల్లెలిని వేరేవారు చూస్తారని ‘ నువ్వు బయటకి రాకు ‘ అనే అన్నలు ఉన్నారు.

Qఈ విషయం లో కాపిటల్ పనిష్ మెంట్ ని సమర్థిస్తారా?

లేదు. అసలు సమర్థించను. దానివల్ల ఉపయోగం లేదు. నలుగురు చచ్చిపోవటం వల్ల నలభై మంది బాగుపడే వ్యవస్థ కాదు మనది.

ఏవో నెగటివ్ వైబ్రేషన్ లు ఎక్కువవుతున్నాయనిపిస్తోంది. మన దేశం లోనే కాదు, అన్ని చోట్లా.   ఒక సమూహం గా మంచి థాట్స్  ని వ్యాపించేలా చేయటం ఒకటే ఈ స్థితిని మార్చగలదని అనుకుంటున్నాను . ఒక పాజిటివ్ ఆలోచనకు చాలా బలం ఉంటుంది. చాలా మందివి కలిస్తే, ఆ విషయం జరిగేందుకు అవకాశం ఎక్కువవవుతుంది

Q మీ రచనలు సరిగ్గా  అందుబాటులో ఉండవు. ఈ ఫిర్యాదు నాదే కాదు, చాలా మందిది. ఎడిటర్ ఒకరు మీ కథల పుస్తకాన్ని వ్యక్తిత్వ వికాసపు పుస్తకంగానైనా అందరి  చేతా చదివించాలన్నారు కదా. మీ రచనలు మీరే ఎందుకు ప్రచురించరు?

ఎందుకో ఆ పని చేయబుద్ధి కాదు. పాఠకులకి అవసరం అనిపిస్తే వెతుక్కుని చదువుకోగలరు అనిపిస్తుంది.

Q కాని కనీసం ఒకసారయినా ముద్రణ అంటూ జరగాలి కదా. అప్పుడు కదా తెలిసేది, మీ రచనల కోసం అడుగుతారని.

2003 ప్రాంతాలలో  విశాలాంధ్ర వాళ్లు కథల పుస్తకం వేశారు, ‘ తమసోమా జ్యోతిర్గమయ ‘ నవల అప్పుడే ఎమెస్కో వాళ్లు వేశారు

Q ఇప్పుడు కాపీలు లేవు.

పున్నాగపూలు  కాపీలు కూడా చాలా తొందరగా అయిపోయాయట. నవోదయ వాళ్లు కథలు కొన్ని మళ్లీ వేస్తామన్నారు.

Q .మరి ‘ స్మృతిచిహ్నం ‘ నవల సంగతి ?

చూద్దాం [నవ్వు ] Qఆ మధ్య ఇ బుక్ గా తెస్తామని ఒక ఆన్ లైన్ ప్రచురణ కర్త చెప్పారు, మరి?

ఆయన చిన్నప్పటినుంచీ పరిచయం ఉన్నవారే. అవును, అన్నారు. ఆ తర్వాత  ఆ ప్రసక్తి అటువైపునుంచి కొనసాగలేదు.

 

 jalandhara photo (1)

 

Qకొత్తగా తెలుగులో వస్తున్న సాహిత్యం చదువుతున్నారా? ఎలా అనిపిస్తోంది?

చూస్తాను. కొందరు బాగా రాస్తున్నారు కూడా.

Qరాయాలనుకునే వారికి ఏమయినా చెబుతారా?

అలా అనుకోను. ఆ అవసరం కూడా లేదు. హృదయం లోంచి కదా సాహిత్యం వస్తుంది,అది ఒక ఊట లాగా వెలికివస్తుంది.  ఎవరినుంచి ఏ అద్భుతాలు వస్తాయో ! ‘ ఇలా ఆలోచించు ‘ అని చెప్పటం ఎలా?

Qబాగా రాసేందుకు బాగా చదవాలని అంటారా?

నా వరకు అది నిజం.లోపల ఒక బల్బ్ ఉన్నా అది వెలిగేందుకు విద్యుత్ కావాలి .చదవటం వల్ల ఆలోచించగలం,విస్తృతి వస్తుంది. చాలా తెలు సు కుంటేగాని రాయకపోవటం ఒక పద్ధతి.  ఆర్థికంగానూ సామాజికం గానూ అన్ని రకాలైన మనుషులతో ఇంటరాక్షన్ పోకుండా చూసుకోవాలి. లేకపోతే సహానుభూతి రాదు.  చంద్రమోహన్  గారి సింప్లిసిటీ వల్ల అది నా విషయం లో సాధ్యపడింది.

నాకిలా అనిపిస్తోంది కనుక చెబుతున్నానననటం ఇంకొకటి. ఆ విధం గా ఉండవచ్చేమో, నాకయితే తెలియదు.

Qఒక సినిమా నటుడి భార్యగా మీరు సమాజాన్ని  ఓపెన్ గా చూసి అవకాశం ఎలా నిలుపుకోగలిగారు?

ఇక్కడొక సంగతి చెప్పాలి. మా పెళ్లయిన కొత్తలో భానుమతి గారు మమ్మల్ని భోజనానికి పిలిచి బట్టలు పెట్టారు.వచ్చేటప్పుడు నాతో చెప్పారు ” మీ ఆయన ఎంత సంపాదించినా సరే, ఇంట్లో మాత్రం అప్పర్ మిడిల్ క్లాస్ వాతావరణాన్ని పోగొట్టుకోవద్దు ” అని.  మా జీవితం అలాగే గడిచింది.

Q సాహిత్యకారులకి బయటి ప్రపంచం తో లయ కుదరటం సాధ్యమేనా?

తప్పకుండా. మనం చదివినదాన్నీ, సృష్టించేదాన్నీ వాస్తవ పరిస్థితులతో అన్వయించుకోగలగటం వారు చేయగలిగి ఉండాలి. బయటివారు కొట్టే చప్పట్లు కొన్నాళ్లే, అంతిమంగా ఎవరి జీవితాన్ని వారు అర్థవంతంగా, శాంతంగా జీవించే ప్రయత్నం చేయాలి. లేకపోతే మామూలు మనుషుల కన్న ఎక్కువ తెలుసుకుని లాభం ఏమిటి?

Q ఎందుకని నెగటివిటీ లో కొందరు సాహిత్యకారులు కడతేరిపోతూ ఉంటారు?

నాకు ఇక్కడ వర్జీనియా వుల్ఫ్ జీవితం గుర్తొస్తుంది. చాలా గొప్ప సాహిత్యాన్ని సృష్టించిన ఆవిడ  ఆఖరికి తెల్లటి దుస్తులలో, తెల్లటి గొడుగుతో నీళ్లలో దూకి ఆత్మహత్య చేసుకుంది అని చెబుతారు. తన బాల్యం లోని కొన్ని బాధాకరమైన పరిస్థితులు ఆమెని వెంటాడాయి. అటువంటి వారు కొన్ని విషయాలని కావాలని మరచిపోదామనుకుంటారేమో. కాని అవి అంతశ్చేతన లో ఉంటాయి. విస్తృతమైన, రాపిడి, అలజడి వల్ల ఇంకొక వైపున చాలా దూరం ప్రయాణించి అపురూపమైన సృజన చేస్తారు. తనతో తనకి శృతి కుదరకపోతే అది ఎక్కడికి దారి తీస్తుంది? ఇందుకు చాలా ఆత్మ పరిశీలన, విశ్లేషణ, శుభ్ర పరచుకోవటం అవసరం

Q ఏవో మంచివనిపించే ఆలోచనలు ఉన్నా  ఆచరణ లో పెట్టే వీలు లేని పరిస్థితులలో ఉన్నాం.  ఇన్ని సంక్లిష్టతల  మధ్య ఏమయినా చేయగలమని అంటారా?

తెలిసిందనుకున్నదాన్ని- పక్కవారు గుర్తించినా లేకపోయినా, ఆచరణలో పెట్టే ప్రయత్నం చేయాలి. అప్పుడు అందులోని విషయం మెల్ల మెల్లగా అగరు వత్తి ధూపం లాగా  చుట్టూ ప్రసరిస్తుంది. మనతో కలిసి జీవించేవారికి అనుభూతి లోకి .ఆలస్యంగా రావచ్చు. గుర్తింపు గోల పెట్టుకుంటే చేయవలసినవి చాలా చేయలేము. .ఒక్కొక్కసారి మనం రాస్తున్న, చెబు తున్న విషయాల వల్ల దూరాన ఉన్నవారెవరో ప్రభావితులవుతారు. ఆ మేరకి మనం ప్రకంపనలని మార్చగలిగినట్లే. సహాయం చేసినట్లే.

    –   మైథిలి అబ్బరాజు

భారతం విప్పని బాధలు ఈ చీకటి నాటకం!

 

DharmaveerBharatiiఇప్పుడే ధరం వీర్ భారతి హిందీ నాటకం  ‘ అంధా యుగ్ ‘ కి అశోక్ భల్లా  ఇంగ్లీష్ అనువాదం ముగించాను. యుద్ధానంతర భీభత్సం ఒకటే కాదు, చాలా సంగతులు ఉన్నాయి ఇందులో. గాంధారి దృక్కోణం ప్రధానంగా ఉంది. ఆవిడ గర్భశోకం, కృష్ణుడిని శపించటం, ఆయన దాన్ని శాంతంగా స్వీకరించటం…వీటిలో కొత్త ఏమీ లేదు. అశ్వత్థామ ఉన్మాదాన్నీ   పైశాచికత్వాన్నీ ఎక్కువ చేసి చెప్పినదీ  లేదు. పాండవ శిబిరం వాకిట రుద్రుడు ఉండటమూ నిజమే, లయాత్మక ప్రతీక గా.. అయితే అశ్వత్థామ చేసిన[ముఖ ]  స్తుతికి ఆయన పొంగిపోయాడని చెప్పటం? పాండవులు ధర్మం తప్పారు కనుక నువ్వు వెళ్లి నిద్రపోయేవారందరినీ చంపేయవచ్చునని హామీ కూడా ఇస్తాడు అశ్వత్థామకి, నాటకం లో.  

andhayug1

ఇంకొక కొత్తదనం ఏమిటంటే అశ్వత్థామ చేసిన నీచాతినీచమైన పనిని గాంధారి సమర్థించి, అందుకు  అమితంగా సంతోషించి  అతన్నీ వజ్రకాయుడుగా దీవించటం. ఆ సౌప్తిక ప్రళయాన్ని సృష్టిస్తున్న అశ్వత్థామ తల చుట్టూ దివ్యకాంతులు ఉండిఉంటాయని ఆమె తలపోస్తుంది,అతన్ని చూసేందుకు దివ్యదృష్టిని అడుగుతుంది. దుర్యోధనుడి తొడలు ఎందుకు విరిగాయో, ఎక్కడ కూర్చోమని పాంచాలిని పిలిచిన ఫలితమో చెప్పకుండా వదిలేశారు. నిజమైన ఒక మంచి విషయం చెప్పాలంటే దుర్యోధనుడు రాజ్యాన్ని  పద్ధతిగానే ఏలాడు[ఈ విషయం కురుక్షేత్ర యుద్ధం ముగిసిన తర్వాత ధృతరాష్ట్రుడికి   ప్రజా ప్రతినిధులు చెబుతారు భారతం లో ] .  ద్రౌపది  వస్త్రాలని తొలగించే ప్రయత్నం చేసి అవమానించినందుకు దుశ్శాసనుడి రొమ్ము చీలిందని కూడా నాటక కర్త మర్చిపోయినట్లు కనిపిస్తారు .[అనువాదకులు తమ ముందు మాటలో  గుర్తు చేసుకున్నారు కాని]. దుర్యోధనుడు పడిపోయినప్పుడు   బలరాముడు కృష్ణుడిని’ unprincipled rogue ‘  అని తిడతాడు, హిందీ సమానార్థకం ఏదో తెలియదు.

గాంధారి శాపాన్ని అనుభవించిన నాటికి కృష్ణుడు ఇంచుమించు వృద్ధుడైనాడు, యుగం ముగుస్తోంది. కృష్ణనిర్యాణం ఆయన అందరి భారాన్ని మోసిన ఫలితంగా చిత్రించబోయారు.  ఆయన మృత్యువుని  ఒక బలిదానంగా ఎందుకు చూపించారో తెలియదు, ఏ పోలిక కోసం చేసిన ప్రయత్నమో. ఉత్తర గర్భం లోని పరీక్షిత్ ని రక్షించటానికి కృష్ణుడు తన జీవితాన్ని ఒడ్డలేదు, అంత అవసరం రానేలేదు. ఆ పరీక్షిత్ కూడా క్రోధానికి లోబడి శాపగ్రస్తుడైన నాటికి చాలా కాలం పాలించి ఉన్నాడు. కృష్ణుడు రక్షిస్తేనేమీ, అతనూ మరణిస్తాడు అంటారు,  అసలే మరణించనివారెవరు?

andhayug2

మరీ వింతగా తోచినదేమంటే కురుక్షేత్రం ముగిసిన తర్వాత ధర్మరాజు చివరి వరకు,  నిత్య వ్యాకులత తో బాధపడ్డాడని చెప్పటం . పౌరులు ఈయనేమి రాజురా, గుడ్డివాడే నయం అనుకున్నారట.  భీముడు మందబుద్ధి, అహంకారి అని, అర్జునుడికి అకాలవ్యార్థక్యం వచ్చిందనీ జనం అనుకుంటున్నారట. భీముడు ధృతరాష్ట్రుడిని సూటిపోటి మాటలనేవాడన్నంతవరకు నిజం, యుద్ధం అంతమైనాక గాంధారీ ధృతరాష్ట్రులని  పరామర్శించేందుకు పాండవులు  వచ్చినప్పుడు ధృతరాష్ట్రుడు భీముడిని  చంపే ప్రయత్నం చేస్తాడని ఇక్కడ గుర్తు చేసుకోవలసి ఉంది.   అర్జునుడు అశ్వమేధయాగాశ్వం వెంట వెళ్లి దిగ్విజయం చేసినది కురుక్షేత్రం తర్వాతే. నకులుడు అజ్ఞాని అని[ కాదనేందుకు ఆధారం లేదు కానీ అవునని అనేందుకో ? ] , సహదేవుడు పుట్టుకతో బుద్ధిమాంద్యుడని [ ఆయన వివేకపు ప్రశంస భారతం లో చాలా సార్లు వస్తుంది ] ….

పాండవుల వైపున పోరాడిన కౌరవుడు ,  యుయుత్సుడి తల్లి గాంధారి కాదు. నాటకం లో యుద్ధం ముగిశాక ఆయన, తను  సరయిన పని  చేయ  లేదని కుమిలిపోతూ ఉంటాడు. విదురుడికి భగవంతుడిమీద సందేహాలు వస్తూ ఉంటాయి.

ద్వాపరం నాటికి అధర్మాన్ని ఎదుర్కొనే పద్ధతిలో కొంత అధర్మాన్ని వాడవలసిన పరిస్థితి వచ్చింది. దాన్ని ఆధారం చేసుకుని భారత కథని  తమకు తోచినట్లుగా  నిరూపించే  ప్రయత్నాలు చాలా జరిగాయి. వాటిలో ఇది ఒకటి. అనువాదకులు ఈ నాటకాన్ని తరగతి గది లో బోధించేటప్పుడు దాదాపు అందరు విద్యార్థులూ గాంధారి దే న్యాయం  అనటమే కాకుండా కృష్ణుడిని తీవ్రంగా ద్వేషించేవారట. ఆ పరిస్థితి ని మెరుగు పరిచేందుకు సక్రమమైన అనువాదం చేద్దామని ఆయన భావించారట. కాని అది నెరవేరినట్లేమీ లేదు.  ధృతరాష్ట్రుడి పుట్టు గుడ్డితనం ఆయన పుత్రప్రేమలోఅన్నంతవరకు మాత్రమే ఔచిత్యం కనిపించింది నాకు.

 

                                                                       – మైథిలి అబ్బరాజు

maithili

”లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో!”

మంజువాటిక

devulapalli1

” నిను కానక నిముసం మనలేను, నువు కనబడితే నిను కనలేను ” అని చిన్నప్పుడు విన్నప్పుడు ఏ  వైరుధ్యమూ తట్టలేదు. కొన్నేళ్ల తర్వాత ” నాలో నిండిన నీవే నాకుచాలు నేటికి, మోయలేని ఈ హాయిని మోయనీ, ఒక్క క్షణం ” అంటే అర్థమయినట్లే ఉండేది.

కృష్ణశాస్త్రి గారు విడిగా  కవిగా పరిచయమయేనాటికి పదమూడేళ్లు నిండాయి నాకు. ” కృష్ణపక్షమ్మొకటె నాకు మిగిలె ” …ఈ వాక్యాలు నా లోపలి దేనికో ఆకృతినిచ్చినట్లు అనిపించింది , ప్రాణస్నేహితురాలిని వదిలి ఉండటం అనే తీవ్రమైన దుఃఖం లో ఉన్నప్పుడు .అది  ఇప్పుడు తలచుకున్నా అవమానంగా ఏమీ అనిపించదు. ఆత్మీయులకి దూరం కావటం కంటె శోకమన్నది లేదని ఈ నాటికీ తోస్తుంది, విధి అనుమతించినన్నాళ్లూ  అహర్నిశలూ చూస్తూ ఉండగలగటం కన్న కోరుకోవలసిన ఆనందమేమీ  లేదు, ఎప్పటికీ.

ఈ మధ్య బుజ్జాయి  గారు రాసిన ‘ నాన్న-నేను ‘ చదివాక కృష్ణశాస్త్రి గారి దృక్పథం తెలిసింది.

” నావలె అతడున్మత్త భావమయశాలి, ఆగికోలేడు రేగు ఊహలనొకింత ! ఇంత చిరు గీతి ఎద వేగిరించునేని పాడుకొనును, తాండవనృత్యమాడుకొనును ”  ఈ మాటలు ఇంచుమించు మూడు దశాబ్దాలు నా జీవితపు టాగ్ లైన్ లు గా ఉండేవి. ఆ రెపరెపలాడిపోయేతనమే నడుపుతూ ఉండేది నన్ను, అలా గాలికి కొట్టుకుపోతూనే  ఉండేదాన్ని.నేల మీద నిలిపేందుకూ  వేరే రచయితలు  ప్రయత్నిస్తూ  ఉండేవారు, కాని  కాలు నిలిస్తేనా !

శాపగ్రస్తులమయి ఈ ప్రపంచంలోకి రావలసి వచ్చిందని అనుకోని మనో జీవులు  ఉంటారా ?   దిగిరావటం దిగిపోవటమేననే ఊహాపోహల కాలమది.

పదిహేడేళ్లు వచ్చేనాటికి అమృతవీణ, మంగళ కాహళి, వ్యాసాల సంపుటులు నాలుగూ విడుదలయాయి. ఆ వచనం ఎంత మార్దవంగా,  రుచిరార్థ  సమ్మితంగా ఉండేదని ! శ్రీశ్రీ గారు రాసిన వ్యాఖ్యానంతో వచ్చాయి అవి. ” ఇక్షుసముద్రం ఎక్కడుందో చూశారా  ” అని మొదలవుతుంది అది. ఆస్వాదానికి ఆహ్వానంతోబాటు చిన్న అవమానమూ ఉంది అక్కడ ” ఇంకా మీరు కోరుకునే ఎన్నో మసాలాలున్నాయి ” అనే మాటల వెనక. అది శ్రీ  శ్రీ ఉద్దేశించారో లేదో నాకు తెలియదు. కృష్ణశాస్త్రి గారి కవిత్వపు, సామీప్యపు ఇంద్రజాలానికి బలంగా లోనయి బయటపడినవారిలో శ్రీ శ్రీ ఒకరని అప్పటికి తెలియదు.

కవితాప్రశస్తి  వ్యాసాలలో ‘ కరుణ ‘ అనేది చాలా కాలం ఊపివేసేది. దుఃఖించేవాడి  గురించి ” అతను తెలిసిపోతాడు , అతని దగ్గర చెప్పులు వదలి తల దించుకుంటాము ” అంటారు. అంతకన్న చెప్పవలసినది లేదు.లిరిక్  శిల్పం అనే వ్యాసమూ నాకు చాలా ఇష్టం. మంత్రపుగవాక్షాల  గురించీ, ప్రమాదభరిత సాగరాల గురించీ కీట్స్ కవితా పంక్తుల  పరిచయం అక్కడే .

కవి పరంపర అనే వ్యాసాల వరసలో ” నా కంటికి తిక్కన్న గారు పొడుగ్గా ఉంటా డు ‘ లాంటి వాక్యాలతో పదచిత్రాలతో ఆయా కవుల రూపురేఖా విలాసాలని బొమ్మ కట్టి చూపటమెంతగా ఆకర్షించేదని ! మహావ్యక్తులు సంపుటం లో చిత్త రంజన్   దాస్ గారి గురించిన వ్యాసం బలంగా, లోతుగా ఉంటుంది.ఆయన రచన కి  బహుశా కృష్ణశాస్త్రి గారే చేసిన అనువాదం ” ఆశకు కూడా అతీతమయిన కష్టాలు  పడటం, రాతిరి కన్నా మృత్యువు కన్నా నల్లని అన్యాయాలను సహించటం  ” అని మొదలయే గీతం గా నన్ను పరిపాలించింది అప్పటిలో.

మన నాయనమ్మ కంటే కొన్నిసార్లు మనకి గాంధారి ఎంత బాగా తెలుస్తుందో చెబుతారు ఇంకొక చోట, ఇతిహాసాల గురించిన  ప్రస్తావనలో.

పొద్దున్నే లేవలేని నా బద్ధకానికీ పద్యం ఎప్పటికీ సమర్థింపు

” తల్లిరేయి, ఆమె చల్లని యొడిపైని నిదురపొమ్ము

నిదుర నిదుర కొక్క కల వెలుంగు పసిడి జలతారు అంచురా

మేలుకొనకు కల వేళ, తండ్రి ! ”

అమృతవీణ దినదినాహారం అప్పుడు. గుంటూరు లో అరుదుగా దొరికే సిం హాచలం  సంపంగి పూరేక్కలు దాచుకున్నాను ఆ పుటలలో, ఉన్నాయి ఇంకా. ప్రేమ లోని, అర్పణ లోని ఎన్ని మన స్స్థితులను  చెప్పారో ఆయన అందులో. ” చిన్ని పూవు పదములపై ఒకటే, కన్నీటి చుక్కలాపై రెండే ” అనే ఏకాంత దర్శనం ఒకసారి, ” తెలివిమాలి నా హృదయపు తలుపు మూసి ఉన్నఫ్ఫుడు తొలగదోసి ద్వారము , లోపలికి రావలయు ప్రభూ, మరలి వెడలిపోకుమా” అని ఏమరపాటు ని  ఎలాగ  పట్టించుకోరాదో ఇంకొకసారి, ” మాట తీసుకొని నాకు మౌనమొసగినావు, మౌనమందుకొని నీకు గానమీయమంటావు! నా కంఠము చీకటైన ఈ కృష్ణ రజని తుదిని నాకయి నీ చెయి సాచిన నా కానుక ఇంతే కద, ఈ కొంచెపు పాటే కద ” అనే నిష్టూరపు ఒప్పుదల మరి ఒకసారి.

ఆ రోజులలోనే మొదటిసారి మల్లీశ్వరి  చూడగలిగాను. ఏమో, అందరూ ఏమేమి అంటారో నాకు తెలియదు, అది కృష్ణశాస్త్రి గారి కృతి నాకు, అంతే… కనీసం ప్రధానంగా.

నల్ల కనుల నాగస్వరం మోగుతూనే ఉంది…. వెండివెన్నెల గొలుసులకు వ్రేలాడిన రేయి ఊయల ఊగుతూనే ఉంది….

స్వాప్నికలోకానికి ఈవల ఎన్నో జరిగితీరుతాయి తప్పదు, నాకూనూ. ఆ   గాటంపుకౌగిలి వదలి కనులు వేరేలా తెరచిచూడవలసిందే. నా లోపలి నన్ను పదిలపరచుకుంది వారివలన. వారే చెప్పిన మాటలు … అవకాశం దొరుకుతూనే పిల్లలని వినమనే మాటలు, జీవనసంరంభం  నడిమధ్యని నిలవలేవు,  దూరమయి నిభాయించుకోలేవు , అందుకే

” లోకానికి పొలిమేరన నీ లోకం నిలుపుకో ! ”

 

( నవంబర్ 1దేవుల పల్లి కృష్ణ శాస్త్రి జయంతి సందర్భంగా )

maithili—మైథిలి అబ్బరాజు

క్షీరసాగరం

maithili

మైథిలి కి చదవటం చాలా ఇష్టం. ఇన్ని సంవత్సరాలలో ఇది నాలుగో కథ. మొదటి రెండు  కథలు 2001,2003 లలో వార్త లో వచ్చాయి.మొదటి కథ  ‘ నియతి ‘ 2001 తెలుగు యూనివర్సిటీ కథాసంకలనం లోనూ,జగతి పత్రికలోనూ , నాటా 2013 సంచికలోనూ పునర్ముద్రితమయింది. చక్కటి చదివించే శైలి ఆమె సొంతం. –వేంపల్లె షరీఫ్

***

 

 

కనుచీకట్లలో మెడికల్ హాస్టల్ కాంపస్.  ప్రవల్లిక కోసం వెతుకుతూ ఆ వెనకాల లాన్ లోకి నడిచింది ఆముక్త. అమ్మాయిలు చదువుకోవటానికి అక్కడక్కడా దీపాలూ అరుగులూ. ఏ వెలుగూ పడని ఒక మూల కూర్చుంది ప్రవల్లిక. దగ్గరగా వెళ్తే తలెత్తిచూసిందేగాని  నవ్వలేదు. అంత త్వరగా నవ్వదు ఆమె. కఠినంగా బిగిసిఉండే ముఖరేఖలు. మెల్లగా వెళ్లి పక్కన కూర్చుంది ఆముక్త.
బహుళ పాడ్యమి కాబోలు ఆ రోజు…అప్పుడే పైకిలేస్తూ ఉంది చంద్రబింబం.  పాలజలనిధిలోని తెలిపచ్చని మీగడ ముద్దకట్టి వెలుగుతూంది.

‘వల్లీ చూడు…ఎంత బావుందో ‘ …అప్రయత్నంగా అంది

. ‘ఏమిటి చూసేది…చాలాసార్లు చూశాలే…చందమామేగా. ‘

‘అది కాదు. ఏ రెండుసార్లూ ఒకేలా ఉండదు.’ మైమరపు.

‘ నీ మాటలకేంలే… వేరే ఎవరికైనా చెప్పు, నాకు కాదు.’  స్పష్టమైన తిరస్కారం.

పట్టించుకోకుండా అడిగేసింది  ‘ రేపటినుంచీ సెలవలుగా, మా ఊరు వస్తావా? ‘

‘ ఎందుకట అంత జాలి మామీద..’ చేదు ఉబికే  మాటలు.

‘ పండగ రోజుల్లో ఒక్కదానివీ ఏం చేస్తావు? మా ఇంటికి వస్తే బావుంటుందనిపించి అడిగాను. దీన్ని జాలి అనక్కర్లేదు నువ్వు ‘

కాస్త తగ్గింది ప్రవల్లిక. ‘ ఎందుకు రావాలి నేను? నేను ఉంటే ఎవరికైనా బాగుంటుందని ఎప్పుడూ అనుకోలేదే ‘ ఆముక్త జవాబు చెప్పలేదు. ‘సరేలే. వస్తాను. మంచి అమ్మాయిలా ఉండాలంటే మాత్రం నా వల్ల కాదు ‘

‘నువ్వు ఎలా ఉండగలిగితే అలాగే ఉండు. …  ‘ నవ్వేసింది.

ఎక్కడివాళ్లు అక్కడ ఆ మెడికల్ కాలేజ్ హాస్టల్ ని అప్పటికే ఖాళీ చేసేసారు. ప్రవల్లిక గడిచిన నాలుగేళ్లుగా ఎక్కడికీ వెళ్లలేదు. ఆమెకి అసలు ఎవరైనా ఉన్నారో లేదో కూడా ఎవరికీ తెలియదు. హాస్యం లేని వ్యంగ్యం ఆమె సొంతం. ఆ వెటకారానికి అడ్డూ అదుపూ ఉండవు. తన మాటలు కనపడని చోట్ల సూదులు గుచ్చినట్లుంటాయి. చెప్పకూడని నిజాలని చర్చకి పెట్టినట్లుంటాయి. ఆ బెదురుతో ఎవరూ తనకి దగ్గరగా వచ్చే సాహసమే చేయరు. ఎక్కడా పరీక్ష తప్పకుండా రాగలిగేటంత చదువుతుంది. తక్కిన సమయాల్లో ఇయర్ ఫోన్స్ పెట్టుకుని కనిపిస్తుంది. ఏమి పాటలు వింటుందో కూడా ఎవరూ అడగరు.

పరీక్షగా చూస్తే ఆ కళ్లు బంధించబడిన జంతువువిలాగా ఉంటాయి. ఆ తీరు ఎవరూ దాడిచేయకుండా రక్షించుకుంటున్నట్లుంటుంది.

ఆముక్త  వేరు. అక్షరాలా ఆనంద కర్పూర నీరాజనం ఆమె. ఉత్సాహమూ ఊరటా రెండిటినీ ఆమె సమక్షంలో గుర్తు పట్టిన కొందరు దగ్గరే ఉంటారు. అంతుపట్టని ఇంకొందరు వెంట తిరుగుతారు

ఎవరినీ తూలి ఒక మాట అనదు. పొరపాటున ఎవరయినా అంటే దెబ్బలాడదు. కష్టపడి చదువుతుంది.. ప్రసన్నమైన ముఖం. ఆమె సౌజన్యమే సౌందర్యమనిపిస్తుంది.

ksheera1

ప్రవల్లిక సడలి మాట్లాడటం కొంతకాలం క్రితం జరిగింది. హాస్టల్ వర్కర్ భార్య రెండేళ్ల బాబుని భర్త తో వదిలేసి తన బావతో వెళ్లిపోయింది. వారిద్దరి మధ్యా ఎప్పటినుంచో సయోధ్య ఉండేది కాదు. అందుకని ఎవరూ అంతగా ఆశ్చర్యపడలేదు. తేలికగా మాట్లాడుకుంటున్నారు. ఒక్కసారిగా గట్టిగా అరిచింది . ‘ బుద్ధిలేదా? మనిషి పుటక పుట్టలేదా? ఇష్టం లేకపోతే పిల్లాడిని ఎందుకు కన్నది? ఇంతమందిమి ఉన్నాము ఇక్కడ, ఎవరిని అడిగినా చెప్పేవాళ్లం కదా జాగ్రత్తలు …ఇప్పుడు వాడి గతి ఏమిటి? ‘ కోపం కాస్తా బాధగా మారి గొంతు బొంగురు పోయింది. చరచరా అక్కడనుంచి వెళ్లిపోయింది.ఆమెలో ఆ మెత్తదనాన్ని  ఆముక్తఒక్కటే పట్టించుకుంది. కాలేజ్ లో చేరినప్పటినుంచీ ప్రవల్లికకి దగ్గర అవుదామని ప్రయత్నిస్తూనే ఉంది ఎందుకనో… తనకి నచ్చే విషయాలని ప్రయత్నించి తెలుసుకుంది. ధైర్యం చేసి ప్రస్తావించింది. భగీరథప్రయత్నం కొంత ఫలించి ఏదయినా  అడిగితే జవాబు చెప్పే దశ వచ్చింది.

ఆ చుట్టూ కట్టుకున్న గోడ బద్దలు కొట్టి లోపల ఏముందో చూడాలని, కుతూహలం ఒక్కటే కాదు. ఏదో అక్కర . ఈ  పరిసరాల నుంచి  నాలుగురోజులు దూరం చేయాలని.ఎందుకూ అని తనను ప్రశ్నించుకుంది ఆముక్త. ‘ తన ఇల్లు తనకి ఇష్టం, ప్రవల్లికకి నచ్చుతుందనేమిటి? ‘

ఏమో తెలియదు, పిలిచింది అంతే.

ఆ వేసవికి చివరిఏడాది అయిపోతుంది. హౌస్ సర్జన్ లుగా అంత తీరుబాటు ఉండదు. పోస్ట్ గ్రాడ్యుయేట్  ఎంట్రన్స్ కి చదువుకోవాలి పనిచేస్తూనే. . మళ్లీ కుదురుతుందో లేదో..!

తండ్రి స్టేషన్ లోఎదురు చూస్తున్నాడు.  .. కాస్త సన్నగా దృఢంగా పొడుగ్గా హరిచందనపుతరువు  లాగా ఉన్నాడు ఆయన.   వాత్సల్యం చిందేలా నవ్వి ఆముక్తని దగ్గరకి తీసుకుని ప్రవల్లిక  చేయి పట్టుకున్నాడు . ఆ పెద్ద అరచేతిలో ఆమె చేయి ఇమిడిపోయింది, సుభద్రంగా ఉన్న స్పర్శ.

ఒక మోస్తరు పట్టణం అది.ఊరు దాటుతూనే ఇంకొక ఊరు పేరు వచ్చేసింది. జనసాంద్రత ఎక్కువ అంటే ఇదేనేమో … ఈ కొత్తఊరికి కాస్త పల్లెటూరి వాలకం ఉంది.

ఆ దారిలోంచి ఒకవైపుకి తిరిగి పెద్ద ప్రాంగణం లోకి వెళ్లారు. . డా. ఎస్.టి.పి. కులశేఖర్ ఎం.డి. అని బోర్డ్. కిటకిటలాడుతూ పల్లె జనం.

అంతా హాస్పిటల్ వాతావరణం.

దాటివెళ్తే ఇంకొక ఆవరణ. ఆలోపల వింతగా కనిపించే వాళ్ల ఇల్లు…విశాలమైన ఉద్యానం మధ్యని. కాస్త దూరంగా తులసివనం.

వాకిట్లో చుట్టూ బంతిపూలు. అరచేయి అంత పెద్దపూలు విరగబూసి గుమిగూడి ఆకులే కనిపించటం లేదు. దగ్గరికి వెళ్లి ఒక పూవులోకి ముఖం వంచింది ఆముక్త , ముద్దుపెట్టుకుంటోందా అనిపించేలా.

‘ బంతిపూలకి  మంచి వాసన ఉంటుంది తెలుసా .. ‘

ఆ ఇల్లు ఇంచుమించు గుండ్రంగా ఉంది.చుట్టూ వరండా  .  ఒక వైపుకి వాలిన మంగళూరు పెంకుల కప్పు.గోడలంతా టెరకోటా.

లోపలికి అడుగు పెడుతూనే అగరు  పరిమళం  హాయిగా ఉంది ముంగిటిలోనే పెద్ద వర్ణచిత్రం. ఒక పెద్ద దేవాలయ గోపురం  పైన నిలబడి ఏదో చెబుతున్న యతీంద్రుడు. నొసట  ఊర్ధ్వపుండ్రాలు, ముఖంలో జాలువారుతూన్న కరుణ. చేతులు జోడించి వింటున్న జనం .

తక్కిన అన్ని వైపులా పెద్దవీ చిన్నవీ పెద్దవీ తైలవర్ణచిత్రాలూ నీటిరంగులవీ. కొన్నిచోట్ల చక్కటి  చట్రాలలో ప్రత్యేకంగా కనిపిస్తున్నాయి, ఇంకొన్నినమ్రంగా  ఒదిగిపోయాయి. గులాబీరంగు గోడలు, పాలపిట్ట వన్నె  పరదాలు.

‘ నాన్న పెయింట్ చేస్తారు ‘

“ఆరా” లని గుర్తుపట్టగలవారికి అక్కడ కెంపుజలతారు వంటి,  ఇంద్ర  నీలాకాశం వంటి,మెత్తగా మెరిసిపోయే  నెమలికంఠం వంటి కాంతివలయాలు కనిపిస్తాయేమో.

ఆ తర్వాతిరోజులలో  ప్రవల్లిక అనుకునేది, ఆ ఇల్లు చేతులు చాచి తనని పిలిచిందని.

.తల్లి మొహం ఇంత చేసుకుని ఎదురువచ్చింది. ‘ రండి, రండి! ‘  చాలా చక్కగా ఉంది ఆమె. ఆముక్త  కి అమ్మా నాన్నా ఇద్దరి పోలికలూ రానట్లుంది.

.’ పాలా? ఇష్టం లేదు ‘ ముఖం చిట్లించింది.

‘ ఒకసారి రుచిచూడు ‘

పచ్చకర్పూరం, కలకండ వేసి కాచిన పాలు..ఒక్క గుక్క తాగాక మొహమాటానికయినా ఆపాలనిపించలేదు … తెలియకుండానే మనసు చల్లబడింది.

ఆ ఇంట్లో కొన్ని చోట్ల  దీపాలు లేకుండానే వెలుతురు,ఇంకొన్ని  చోట్ల ఫాన్లు తిరగకుండానే వీస్తున్న గాలి అలలు.

‘ మయసభలా ఉంది మీ ఇల్లు ‘ ఆ వెటకారంలో వంకర లేదు.

‘ అవును, అలాంటిదే. లారీ బేకర్ అనే ఆర్కిటెక్ట్ పేరు వినేఉంటావు. వీలైనంతగా ప్రకృతికి దగ్గరగా ఉండటం ఆయన ఉద్దేశ్యం. అలా కట్టటం లో ఖర్చు కూడా తక్కువని చెప్పేవారు .కేరళలో చాలా కట్టారు  ఇలాంటివి. నాన్న విని వెతుక్కుంటూ వెళ్లి పరిచయం చేసుకుని ఒప్పించారట , అప్పటికే ఆయన పెద్దవారయిపోయారు . ‘

మనుషులు ఇలా కూడా ఉంటారా? నమ్మబుద్ధి కాలేదు .

తనకి ఒక చిన్న గది ఇచ్చారొక చివరన. పసుపురంగు  గోడలు, చిన్న పసుపుపూలు ఉన్న దుప్పటి మంచం మీద. ఇక్కడి పాశ్చాత్యచిత్రంలో నిశ్చింతగా  ఆడుకుంటున్న అక్కాచెల్లెళ్లు.

స్నానం చేసి వచ్చేటప్పటికి వంటగదిలోనుంచి అంతుపట్టని సువాసనలు  ..

తను ఎన్నడూ తినని పదార్ధాలే అన్నీ.  ఎర్రగా వేయించిన పల్చటి  దొండకాయ ముక్కలు, చారులో  ఇంగువ వాసన వేసే పోపు . మెంతిపిండి వేసిన మామిడిముక్కల పచ్చడి.. ఆశ్చర్యకరంగా సయించకపోవటమేమీ లేకపోగా ఇంకాస్త ఆకలి పెరిగిందేమో కూడా.

ఒక మూల ఎక్కడో టి.వి. కనపడింది. దాన్ని ఆన్ చేసే ధోరణిలో ఎవరూ లేరు. పొందికగా అందమయిన బట్ట కప్పి ఉంది.’  ఏమిటి చేస్తారు వీళ్లు నిద్రపోయేలోపు? ‘ ప్రవల్లిక సందేహం.

సమాధానంగా తంబురా తీసుకు వచ్చింది ఆముక్త .

‘ అమ్మ బాగా పాడుతుంది . సంగీతం ఇష్టమేకదా నీకు, ఎప్పుడూ వింటూనే కనిపిస్తావు ! కాసేపు పాడుకుంటాము, ఉంటావా ?…’

‘ ఉండనీ. ‘ మందలింపుగా నవ్వింది  వసంత.

శృతిచేసుకొని  పాడటం ప్రారంభించింది. ఆమె గొంతులో ఒదుగు ప్రత్యేకంగా ఉంది.. ఆర్ద్రంగా, లోలోపలినుంచి సరాసరి భగవంతుడికే పాడుతున్నట్లు. ముక్త గొంతు కలిపింది. సింధుభైరవి రాగం అది. విషాదం, వేదన…అంతలోనే ఉపశమనం వినేవారికి. అన్నిటికీ తానూ లోనయి లీనమై ఉండిపోయింది  ప్రవల్లిక.  కులశేఖర్ వాలు కుర్చీలో కళ్లు మూసుకొని వింటున్నాడు. తాను దారితప్పి ఏపాత పుస్తకం  లోకో దూరిపోయానా అనుకుంది . .. ప్రవల్లిక వింటూనేఉంది.

ksheera2

తొందరగా నిద్రపోయారు అందరూ. తెరచి ఉన్న కిటికీ లలోంచి తోట లోపలి పూల గాలి. ఎప్పుడూ వినే భారలోహ సంగీతం కాకుండా ఏదో మూడ్ లో డౌన్ లోడ్  చేసుకున్న  బ్రాహం  లల్లబీ ని వింటూ నిద్రని కనుగొన్నది ఆమె.

పెందలాడే నిద్రపోయిందేమో, ఒక రాత్రి వేళ మెలకువ వచ్చేసింది. గడియారం  చూస్తే నాలుగయింది.  ఎక్కడినుంచో సన్నగా ఏదో అంటున్నట్లు  వినిపిస్తోంది. మెల్లగా ఆ ధ్వనినిబట్టి, కర్పూరపు సుగంధం జాడను బట్టి  వెళ్తే అక్కడ పూజ గది. కులశేఖర్  ఎర్రటి పట్టుధోవతి కట్టుకుని ఉత్తరీయం కప్పుకుని   నెమ్మదిగా చదువుకుంటున్నాడు. అది సంస్కృతమూ తెలుగూ అయితే కాదు.చేత్తో చిన్న గంటని మోగించి హారతి ఇచ్చి పక్కనపెడుతూ వెనక్కి తిరిగాడు.వెడల్పుగా ఇంత పొడవున తెల్లని రెండు నామాల మధ్య సిందూరవర్ణపు నామం, కింద చిన్న పాదం. నిద్రకళ్లేసుకుని  చూస్తున్న ఆమెని  చూస్తే ముద్దొచ్చి నవ్వాడు. బదులుగా  కాస్త నవ్వేసి వెళ్లి పడుకుంది.

తెల్లారి  బ్రేక్ ఫాస్ట్ టేబుల్ దగ్గర క్లినిక్ కి వెళ్లే డాక్టర్ దుస్తులలోనే కనిపించాడు.కడిగిన ముఖం మీద నిలువుబొట్టు లీలగా కనిపిస్తోంది. వసంత మెత్తటి ఇడ్లీలతో కొబ్బరిపచ్చడి వడ్డించింది.

‘ ఆగు. ముందు ఇది తిను ‘

కిచిడీ లాంటిదేదో పెట్టారు ప్లేట్ లో.

‘ పప్పుపొంగలి. నాన్న ధనుర్మాసం చేస్తారుగా, ప్రసాదం తయారు చేశారు. .భలే ఉంటుంది. ‘

వసంత నవ్వుతూ అంది ‘ఎందుకు బావుండదూ, బోలెడు నెయ్యి పోస్తే !’

పరాచికానికేమిగాని దివ్యంగా ఉంది పొంగలి.

‘మీ ఇళ్లలో మగవాళ్లు వంట చేస్తారా ?’

‘ఇప్పటిసంగతేమో కాని, ఒకప్పుడు మగవాళ్లకి వంట రావటం తప్పనిసరి.’

‘ధనుర్మాసం అంటే?’

‘మార్గశిరం, పుష్యమాసం రెండింటిలోని 30 రోజులని కలిపి అలా అంటారు. బ్రాహ్మీ ముహూర్తం లో తిరుప్పావై చదువుతారు. నైవేద్యాలు పెడతారు.’

‘ అంటే తమిళమా, మీ నాన్నగారు చదివింది?అర్థమవుతుందా? ’

‘ కొన్నాళ్లు పాఠం చెప్పించుకున్నారు తెలిసినవారితో. తెలుగులో కృష్ణశాస్త్రి గారూ ఇంకొందరూ అనువదించారు కదా. ’

‘ మరి హాయిగా తెలుగులోనే చదువుకోవచ్చు కదా ? ’

‘వల్లీ అది దివ్యప్రబంధంలో భాగం.ఆండాళ్ నోటివెంట వచ్చిన మాటలని అలా  పైకి తలచుకోవటమే  విష్ణుప్రీతికరమని అనుకుంటారు. ఆమె ధరించి ఇచ్చిన మాలలని తప్ప ఇష్టపడని వాడు కదా ఆయన!

ఈ శ్రీవైష్ణవ పద్ధతిలో శ్రీ ని అర్చించకుండా విష్ణువు ని పూజించకూడదంటారు. ఆ తల్లి మన ఆర్తీ యోగ్యతా చూసి తండ్రితో చెప్తుందని.

ఆ బొమ్మ చూశావు కదా…నాన్నే వేశారు. ఆయన భగవద్రామానుజులు. గురువు ఆయనకి మంత్రోపదేశం చేసి , “తరింపజేసే ద్వయమంత్రం ఇది. రహస్యం సుమా, ఎవరికయినా చెప్పావా నరకానికి పోగలవు.” అన్నారట. చరచరా వెళ్లి గోపురం  పైకి ఎక్కి అక్కడ ఉన్న జనమందరికీ బహిరంగంగా ఆ మంత్రాన్ని ఉచ్చరిస్తూ ఉపదేశించారు రామానుజులు. ఇందరు జీవులు తరిస్తూ ఉండగా నేనొక్కడినీ నరకానికి పోతే ఏమనుకున్నారట. దైవాన్ని అంతమందికీ దగ్గర చేశారు. ఆయన గతించాక, కాలం గడిచాక, విశాలమైన ఆ సంప్రదాయం కుంచించుకుపోయింది.’

ఆ ఇంట్లో వారం రోజులు నిర్విచారంగా   కదలిపోయాయి…అది నిజమయిన సంతోష చంద్రశాల. పుస్తకాలు రెండు భాషల్లోవీ కలిపి  ఒక పాటి గ్రంథాలయం అనదగినన్ని ఉన్నాయి. కర్ణాటకమూ, పాశ్చాత్య శాస్త్రీయమూ,   హిందూస్తానీ మూడు పద్ధతులలోనూ సంగీతసరస్వతి కొలువై ఉంది. . ఎక్కడయినా మొదలుపెడితే నెలలు నెలలు గడిచిపోయేలా  ఉన్నాయి. ప్రవల్లిక లోని సున్నితత్వం మెల్లగా కళ్లు తెరిచి గమనించింది అంతా.

కులశేఖర్ మాటకారి, హాస్యప్రియుడు. అతని సమక్షంలో ఎప్పుడూ నవ్వనంతగా నవ్వింది .  వసంత సౌమ్యురాలు, ఆలోచించి మాట్లాడే స్వభావం. ఎందుకో ఆమెతో ఎప్పుడూ మాట్లాడనంతగా మాట్లాడింది. ఎవరూ తనని ఇబ్బంది పెట్టే ఏ ప్రశ్నా వేయలేదని ఆ తర్వాత అర్థమయింది. తమలో ఒకదానిలాగ సహజంగా ప్రేమించారు ,  తిరిగి ప్రేమించకుండా నిలవలేకపోయింది.

పూసిన పున్నాగ చెట్టుకింద కూర్చున్న  ఒక మధ్యాహ్నం అంది .  ‘ ఆంటీ అంకుల్  అసలు పోట్లాడుకోరా? ఆంటీ చదువుకున్నట్లున్నారు కదా, ఉద్యోగం చేయనందుకు బాధ పడరా? ‘

‘వీళ్ల పెళ్లి పెద్దవాళ్లు చేశారా ప్రేమ పెళ్లా?’

‘  రెండూ అవును, రెండూ కాదు.దూరపు బంధుత్వం, దగ్గరి స్నేహం ఉందట  కుటుంబాల మధ్య .పోట్లాడుకునే ఉండి ఉంటారు, కాకపోతే నేను చూడలేదు ఎప్పుడూ. అమ్మ తెలుగు, ఇంగ్లీష్ రెండిట్లో మాస్టర్స్ చేసింది. ఉద్యోగం? ఏమో, తెలియదు మరి ‘

వసంతనే అడిగేసింది .

‘ ఉద్యోగం చేసే తీరాలని పట్టుదల లేదమ్మా . చేయకపోతే ఏమిటంటావు? ‘  సింపుల్ గా అడిగింది. ప్రవల్లిక తబ్బిబ్బయింది. నవ్వుతూ అంది వసంత ‘ ఎవరి ప్రాధాన్యతలని వారే నిర్ణయించుకోవాలనే కదా అంటున్నారు? నా జీవితం ఎవరి కొలమానాల ప్రకారమో గడవాలని అనుకోను నేను ‘  ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా ఇదీ స్త్రీత్వపు ఒక పార్శ్వ్యమేనేమోనని ప్రవల్లిక  అనుకోవలసి వచ్చింది.

ఒక చల్లటి సాయంకాలం వ్యాహ్యాళికి  వెళ్లారు.

ఆ దారి వెంట నడవటం  సుఖంగా ఉంది. దీవిస్తూన్నట్లు వంగిన మోదుగ  చెట్లమధ్యలోనుంచి రాలి పడిన ఆకులని రేపుతూ వీచే గాలి.

‘ మా స్కూల్ ఇక్కడే ‘

అక్కడా అక్కడా కట్టడాలు . ఎప్పటినుంచో పెరుగుతున్న బలమైన వృక్షాలు.

ఆ స్కూల్ లో వేరే  రాష్ట్రాలనుంచి వచ్చిన ఉపాధ్యాయులూ విద్యార్థులూ కూడా ఉంటారు. వేసవి లో తప్ప వూళ్లకి వెళ్లరు. ఇద్దరు టీచర్ లు కనిపించారు. ఆప్యాయంగా మాట్లాడారు. హాస్టల్ పిల్లలు చుట్టూ మూగారు. అప్పటి ప్రైమరీ   స్కూల్ పిల్లలు ఇప్పుడు పది, పదకొండు క్లాస్ లు చదువుతున్నారట. ఆయాలు, వాచ్ మన్ అందరూ ఇష్టంగా, చనువుగా పలకరించారు.

వెనకవైపున సరిహద్దు ఏమీ ఉన్నట్లు లేదు.జీడిమామిడి తోట అక్కడ.

‘ ఎవరిదో ఈ తోట?

‘మనదే, ఇష్టఫడటం చాలదూ సొంతం అవటానికి? ‘

ఈ లాజిక్ ఎంతమాత్రమూ అర్థం కాలేదు ప్రవల్లికకి.

ఎంతో అందమైన గుబుర్లు, క్రిందికి వాలిన కొమ్మలు.పువ్వులూ పళ్లూ లేకుండానే శోభాయమానంగా ఉన్న చెట్లు.ఆ నీడ లోకి కదలటం వృక్షపు కౌగిలిలోకి వెళ్లటం లాగా ఉంది. ఉండి ఉండి దూరం నుంచి వినపడే పిట్టల అరుపులు తప్ప ఎక్కడా ఏ శబ్దమూ లేదు, వాళ్లూ మాట్లాడుకోలేదు.  మార్మికమైన శాంతి ఏదో వెన్నెలలా పరచుకుంది. కథలలో రాసినట్లు రెండులోకాల మధ్యని సరిహద్దులాగా ఉంది, అక్కడనుంచి ఏ దేవలోకం  అడుగు పెట్టవచ్చునన్నట్లు. లోలోపలి ముడులేవో విడివడి  విప్పారుతూన్నట్లు.

చాలాసేపటికి వెనుదిరిగారు.

కాస్త తడిసిన కళ్లతో, గొంతుతో అంది , ‘ ఎంత అదృష్టవంతురాలివి ముక్తా. నీ ప్రపంచం ఇంత బావుంది! అన్నీ, అన్నీ.. ఉన్నాయి నీకు. నువ్వు ఎవరికీ అక్కర్లేకపోవటాన్ని ఊహించగలవా? నేనంతే, ఎవరూ లేరు నాకు. నా పుట్టుకే కోరుకోలేదెవరూ! అందుకు ఉంటాను ఇలాగ, నా మీద జాలి పడకూడదు ఎవరూ. భయపడాలి,పారిపోవాలి. నా మాటలే , వెక్కిరింతలే నా రక్ష, నా కవచం. ఎందుకు దాన్ని బద్దలు కొట్టాలని చూస్తున్నావు? మళ్లీ గాయపడిపోతాను, నువ్వుంటావా కాపాడటానికి ‘

‘ ఉంటాను, ఎందుకు ఉండను? నేనెవరికీ అక్కర్లేకపోవటం నాకెందుకు తెలియదు, చాలా బాగా తెలుసు. నమ్మవు కదూ? ఈ అమ్మా నాన్నా పెంచుకున్నారు నన్ను ‘

‘ ఆ. అయితే ఏమి? ఆ తర్వాత బావున్నావు కదా! నన్ను చూడు- ఇరవై ఏళ్లొచ్చాయి, నేను చచ్చిపోతే ఏడ్చేవాళ్లు లేరు తెలుసా! ‘

‘ష్..అలా అనకు.నువ్వు తలుపులన్నీ మూసేసుకుని ఊపిరి ఆడటం లేదంటున్నావు ‘

‘ మూశాను, లోకం మాటలు వినలేక! ‘

‘ మమ్మీకీ డాడీ కి  పెద్దవాళ్లే పెళ్లి చేశారు. మమ్మీకి ఇష్టంలేదట,  మరి ముందే ఎందుకు చెప్పలేదో తెలియదు. ఆమె అయిష్టం డాడీ కీ తెలిసిపోయింది. కలిసి ఎందుకు ఉన్నారో ! ఒకరిమీద ఒకరికి ద్వేషం, అయినా నేను పుట్టాను. తలచుకుంటే సిగ్గుగా ఉంటుంది . నా పేరు పెట్టటంలో మాత్రం ఇద్దరూ ఏకీభవించారట…వాళ్లకే అర్థమయిఉండదు నా పుట్టుక. కాస్త ఊహ వచ్చినప్పటినుంచీ ఆ ఇల్లు నరకానికి చిరునామా. మమ్మీ తన ప్రేమికుడితో వెళ్లిపోయేటప్పటికి నాకు ఎనిమిదేళ్లు. అంతకుముందు కూడా వాళ్లు కలుసుకుంటూనే ఉండేవారని తర్వాత తెలిసింది. డాడీ విపరీతంగా డిస్టర్బ్   అయాడు ఆమె వెళ్లటం వల్ల. అహం దెబ్బతినటం, సొసైటీ  లో తలవంపులు దానికి కారణాలేమో…మిస్ అయేటంత ప్రేమ వాళ్ల మధ్యన లేదు. రాను రాను డాడీ తన ఇష్టం వచ్చినట్లు బతకటం మొదలు పెట్టాడు. అలాంటి పరిస్థితులలో నేను తనతో ఉండకూడదని తనకే తోచిందో, ఎవరయినా చెప్పారో మరి, ఊటీ లవ్ డేల్ లో  వేశారు నన్ను. మంచి వాతావరణం, గొప్ప చరిత్ర ఉన్న స్కూల్ కదా అది. బా గానే ఉండేది. సెలవులలో  డాడీ వచ్చి చూసేవాడు…ఆ తర్వాత మమ్మీ కూడా వచ్చింది. నన్ను వదిలేసి వెళ్లినందుకు గిల్ట్ లాంటిదేమీ లేదేమో…చాలా మామూలుగా, రోజూ చూస్తున్నట్లుగానే మాట్లాడింది. నాకు రోషం, బాధ, కోపం…చివరికి ఒక ద్వేషం. తను ఎవరితో ఉండాలని వెళ్లిందో అలా ఎన్నో రోజులు లేదు. ఆ తర్వాత ఇంకొకరు, వేరొకరు. డాడీ,   మమ్మీ ఇద్దరికీ అంతే. ఆ కొత్త కొత్త స్నేహితులతో నాకు ఎలా ఉండాలో తెలిసేదే కాదు. కొందరు కొంత నచ్చేవారు, ఇంకొందరిని చూస్తే వెలపరంగా అనిపించేది.. నేను ఎవరికీ చెందను అని మాత్రం తెలిసింది. పేరెంట్స్ తో సహా అందరూ నా మీద చూపించింది ఛారిటీ  నే. చాలా ఏళ్లకి డాడీ మళ్లీ పెళ్లి చేసుకున్నాడు. డాడీ భార్యకీ నాకూ హేట్ ఎట్ ఫస్ట్ సైట్. బహుశా ఆమె ఇన్ సెక్యూరిటీ తోనేమో, డాడీ యు.ఎస్. వెళ్లిపోయాడు. మమ్మీ ఆ మధ్యే ఒక ఆశ్రమం లో చేరింది. తనని తాను తెలుసుకుంటుందట, నన్నూ రమ్మని. చచ్చినా రానన్నాను. అదీ కథ అమ్మాయీ, నాకు నేనే, ఏక్  నిరంజన్ ‘ తెలిసిపోయే ఉద్వేగం ఏదీ లేకుండా చెప్పుకొచ్చింది ప్రవల్లిక… ఆ వెనక  నిర్వేదం అలా స్పష్టమయిపోయింది.

‘ ఇదంతా , ఈ ఆలోచించటం- సబబుగానే ఉందా? ఆ తల్లిదండ్రుల ఇబ్బందులూ వారి వైపునుంచి వాదనలూ ఉంటాయి కదా?  ‘  సందేహం ఆముక్తకి. పైకి ఏమీ అనలేదు, బాధో, ఇంకా పైదో…పడినది ప్రవల్లిక గనుక.

‘ ఎందుకు నీకిదంతా చెప్పేస్తున్నానో! తర్వాత నన్ను నేను తిట్టుకుటానేమో , నీముందు బయటపడిపోయినందుకు! ‘

‘ ఊహూ.నేను అలా అనుకోను.చాలా దూరం నడిచాము, మనసులో బరువు దించుకున్నావు..అలిసిపోయి నిద్రపోతావనుకుంటున్నాను ‘

‘ నువ్వు ఇలాగే అంటావు,ఇలాగే ఉంటావు! ఎలాగో నాకు తెలీదు! ‘

‘ ఏముంది వల్లీ ! నాకు జరిగిన మంచిని ప్రతిదినమూ పండగ చేసుకుంటూనే ఉంటాను, ఎక్కడికీ మొహం మొత్తనిదే..’ నవ్వింది .

‘ నా అసలు పేరు చెప్పనా? మా నాయనమ్మ పేరు పెట్టారట. పరవస్తు చూడికుడుత్తమ్మ.’

‘ఈ ఇంటిపేరు ఎక్కడో విన్నట్లుందే ‘

‘ ఆ.గొప్పపండితుడు చిన్నయసూరి   గారి ఇంటి పేరు. నాకు తెలిసి మా వాళ్లెవరూ పండితులు కాదుగదా, పదో తరగతి కూడా పాసవలేదు.జరుగుబాటే కష్టమయిన కుటంబం మాది.చాత్తాద వైష్ణవులం మేము.’

‘ అంటే? బ్రాహ్మలు కారా ? ‘

‘ . ఊహూ.సాతాని వాళ్లంటారు కదా, అది మేము. ఎ ప్పుడో మధ్యయుగాలలో తీసుకున్న వైష్ణవ మతం. కాయగూరలు కానిదేదో తిన్నట్లే జ్ఞాపకం ‘

‘ నాకు నాలుగేళ్లున్నప్పుడు నాన్నకి హెచ్.ఐ. వి. ఉందని తెలిసిందట. సింగరేణిలో పనిచేసేవాడట , మంచివాడేనంటారు.ఆయన నీతీనియమాలని నేను ఎంచలేను కదా. అవమానం, నిరాశ. అమ్మతో సహా ఆత్మహత్యచేసుకున్నాడు. తాత అప్పటికే పెద్దవాడయిపోయాడు, ఆరోగ్యమూ బావుండేది కాదు. బాబాయిలకి ఇష్టం లేదు నేను ఉండటం, ఆజబ్బు నాకూ ఉందనుకునేవారో ఏమో. ఒకసారి తాతకి జబ్బు చేసి సింగరేణి హాస్పిటల్ లో చేరాడు. నాన్న అప్పుడు అక్కడ పనిచేసేవారు. నన్ను చూసి, నా పరిస్థితి  తెలిసి పెంచుకుంటానని అడిగారు, వాళ్లకి సంతానం కలగరని . తాత ముందు సంకోచించాడట.నాన్న  నచ్చజెప్పి తెచ్చుకున్నారు.ఏ పుణ్యం నన్ను వాళ్ల చేతుల్లో పడేసిందో ! అక్కడ ఉద్యోగం వదిలి ఇక్కడికి ప్రాక్టీస్ చేయటం కోసం వచ్చేశారు. ఇక్కడి తాతగారు అప్పటికి బ్రతికి ఉన్నారు, అభ్యంతరం చెప్పారు. నాన్న ప్రమాణాలు చూపించారు. బంధువులు ఎవరూ సమాధానపడలేదు. ఆ ఊరు మనం దిగిన స్టేషన్ కి అటువైపు ఉంటుంది.అంతా శ్రీవైష్ణవ  కుటుంబాలే ఎప్పటినుంచో. అక్కడ తనకి ఉన్నదేదో అమ్మేసి ఈ వైపుకి వచ్చేశారు నాన్న.. ఇంటినీ లోపలి సౌందర్యాన్నీ నిర్మించుకున్నారు. అమ్మ ఈ తోటనంతా పెంచింది.

శాస్త్రోక్తంగానూ, చట్టబద్ధం గానూ కూడా దత్తత చేసుకున్నారు.చూడికుడుత్తమ్మని ఆముక్తమాల్యద గా మార్చారు. రెండూ గోదాదేవి పేర్లే, అర్థం ఒకటే. సాహిత్యం చదివించారు, సంగీతం నేర్పించారు.  . వైష్ణవుల ఇళ్లలో సంగీతం ఎక్కువే ఉంటుంది. …అమ్మకి శ్రీరంగం గోపాలరత్నం గారు పెద్దమ్మ అవుతారట. మేమూ భజన కీర్తనలు పాడుకునేవాళ్లమే కదా, నేర్చేసుకున్నాను.

మెడిసిన్ లో సీట్ శ్రీమత్ తిరుమల పెద్దింట్ల ఆముక్తమాల్యద గానే వచ్చింది. ‘

అడగని సందేహానికి జవాబిచ్చింది.

‘ నాన్న  రోజుకి యాభయి , అరవై మందిని చూస్తారు. ఫీ యాభయి రూపాయలు. ఒకసారి ఇస్తే నెలవరకూ సరిపోతుంది. పరీక్ష చెశాక  ఆ డబ్బూ వెనక్కి ఇచ్చేస్తూ ఉంటారు కొంతమందికి.  అయినా కొత్తవాళ్లు వస్తూనే ఉంటారు. పేషంట్లు టెస్ట్  లు చేయించమన్నా  అవసరం లేనివి రాయరు. మందులూ అంతే. ఇందులోనుంచే అన్ని ఖర్చులూ!

‘ సరిపోతుందా మరి? ‘

‘ సరిపోవటానికి అంతు ఎక్కడుంటుంది ! నాన్న గుంటూరు స్టూడెంట్. అప్పట్లో  మహానుభావుడయిన సర్జన్ ఒకాయన ఉండేవారట శర్మ గారని. ఆయన అనేవారట ,  ఎనిమిది వేలు చాలక  పోతే ఎనభై  వేలూ చాలవు అని. ఆయన నాన్న కి, ఇంకా చాలామందికి  ఆదర్శమూర్తి. అత్యవసరమయితే ఏదో కొంత ఉందనుకుంటాను బాంక్ లో. హెల్త్ ఇన్సూరెన్స్ ఉంది మా ముగ్గురికీ ‘

‘  చాలామంది చదువుల కి సాయం  చేశారు, ఇంకా చేస్తూ ఉన్నారు..  విద్యలో, వైద్యంతో  సహాయపడటం  తప్పనిసరి అని అనుకుంటారు, ఆ పరిధిని తనకి గీసుకున్నారు.

జీవనం  సుఖంగా   సౌకర్యంగా  కొనసాగటానికి కొన్ని లెక్కలు సరిగ్గా వేయాలి, చేయాలి. ఆ తర్వాత అంతా వెసులుబాటే కదా ’

అవును, ఆ వెసులుబాటు అంతటా కనిపిస్తూనే ఉంది.  కాలం  ఇక్కడ తీరికగా ఆగినట్లుంది.

పూర్తిగా ఊపిరి ఆడుతున్నట్లుంది.

భోగి పండగ నాడు  ఆ ముక్త ఊదా రంగు  పట్టు చీర కట్టుకుంది. వంగపూవు రంగులో  అందమైన  సల్వార్ కమీజ్ ఇచ్చారు ప్రవల్లికకి. ఆ దుస్తులలో, ఆ ముక్త వెంట బడి  చేసిన అలంకారంలోతనని తాను  అద్దంలో చూసుకుంది, ఆశ్చర్యపడింది. తను కూడా బావుంటానని ఏనాడూ అనుకోనేలేదు.

భోగి పండగ రోజునే  ధనుర్మాసం ఆఖరట. కాస్త దూరంలో  కొండమీద ఉన్న అందమైన గుడికి వెళ్లారు. గోకుల పారిజాతగిరి అట అది, ఆ పేరే  కవిత్వంలాగా ఉంది. ! చాలా శాంతంగా ఉన్న పరిసరాలు. చుట్టూ ఒకే రకపు చెట్లు.

‘ ఏమిటి ఇవి? ‘

‘ పొగడచెట్లు. వకుళ అంటారు సంస్కృతంలో. శ్రీనివాసుడి తల్లి ఆమె. అందుకు ఇవి చాలా ప్రియం ఈ  దేవుడికి.’

వేయి తల్లిదనాలు రాశిపోసినంత సౌరభం  ఆపూలకి.

రాలిన పూలు గుప్పెళ్లనిండుగా ఏరుకున్నారు. ఆ కొండగాలి, ఆ శీతాకాలం, ప్రదోష వేళ ఆలయంలో వెలిగించిన దీపాలు…లోకాతీతం గా ఉంది.

తిరిగి వెళ్తూన్నప్పుడు

‘ ఇక్కడికే రా. మళ్లీ మళ్లీ రా. చదువు అయిపోయాక వచ్చేసి ఉండిపో ‘

ఆముక్త ఒక్కతే అలా అనుకుంటే సరిపోతుందా?  ..

బదులు చెప్పలేదు .

ఆ మరుసటిరోజున తిరిగి వెళ్లాలి. వసంతా కులశేఖర్ ఇద్దరూ కలిసి వచ్చేశారు ప్రవల్లిక బట్టలు సర్దుకుంటూ ఉంటే.

‘ మళ్లీ ఎప్పుడొస్తావమ్మా? ‘

కేవలం మర్యాదకి అడిగినట్లుగా లేదు…

‘ వస్తానండీ, వీలు చూసుకుని ‘

‘ అది కాదమ్మా. .’  సంకోచిస్తున్నాడు ఆయన.

వసంత అడిగేసింది ‘ నువ్వు..ఏమీ అనుకోకపోతే ప్రతి సెలవలకీ ఇక్కడికి వచ్చేయి… ‘.

ఆయన మొహమాటంగా అన్నాడు, ‘ తర్వాత కూడా…నేనూ పెద్దవాడినయిపోతున్నాను కదా, నాకు తోడుంటావా, ఆముక్తతోబాటు ?

బదులు చెప్పటానికి గొంతుకేదో  అడ్డుపడింది ప్రవల్లికకి.

‘ వస్తాను ‘

తెచ్చుకున్న పొగడపూలని సూట్ కేస్ లో దాచింది. ఆ పరిమళం చాలాకాలం అలాగే  ఉండిపోతుందట. దివ్యలక్షణం వాటిది, ఆ ఇంటిది !

— మైథిలి అబ్బరాజు

 

 

 

కౌమారపు తోటలో కొన్ని పూల గుసగుసలు!

mythiliఈ తలుపు మెల్లగా తెరుచుకుంటుంది ..రహస్యాలు గుసగుసగా వినపడుతూ వుంటాయి..

నీ అడుగు ఎక్కడ పడుతోందో గమనించుకుంటావు కదూ

‘ నా పన్నెండేళ్ల మేనగోడలికి బహుమతి ఇస్తూన్న ‘ ద సీక్రెట్ గార్డెన్ ‘ పుస్తకం మొదటి పుట లో ఈ మాటలు రాశాను.ఈ నవల శీర్షికని దాని అంతర్ధ్వని కోసం ఇష్టపడతాను..

లోపలి తలుపులూ బయటి తలుపులూ తెరుచుకుంటూ కనిపింపచేసే అందమయిన ఆరామంగా ఆ వయసు వుండాలి.అది ఆదర్శమవనీ,స్వప్నమే అవనీ..అక్కడ కొన్నాళ్లు నిలవాలి.

ఈ అమ్మాయి తెలుగు బాగా చదువుతుంది. చందమామ వాళ్లు గొప్ప దయతో ఏర్పరచిన పాత సంచికల భాండాగారాలన్నీ చదివేసుకుంది.ఎనిడ్ బ్లైటన్  పుస్తకాలన్ని అయ్యే పోయాయి. ఇప్పుడు తను తెలుగులో చదవదగిన  కథా సంకలనాలు కొన్ని వున్నా నవలలు ఎన్నో లేవు. మార్క్ ట్వేన్ ని తెలుగులోకి తెచ్చి అంతతో ఆగిపోయారు నండూరి రామమోహనరావు గారు. ముళ్లపూడి వారు భూప్రదక్షిణం ఒక్కటే అనువదించారు. టాం సాయర్ ని తెలుగు పిల్లలు ఎంతో ఇష్టపడ్డారు, ఆవరసలో రావలసిన ఇతర సాహిత్యమేదీ తెలుగులోకి రాలేదు.

బారిస్టర్ పార్వతీశం మొదటి భాగం బాగా నచ్చి తర్వాతి కథ చదవబోయిన పిల్లలకి ఆశాభంగమవటం నేను చూశాను. శ్రీ  పాద వారి వడ్లగింజలూ,మార్గదర్శీ కౌమార  సాహిత్యం లో చేర్చవచ్చు. సులోచనారాణి గారి మీనా ని కూడా నేను ఈ కోవలో చెప్తాను.mythili3

టాగూర్ అనువాదాలలో పడవ మునక సరళం గా వుంటుంది..కొంతవరకు గోరా కూడా.నాకు ఆశ్చర్యం ఎక్కడంటే టాగూర్ కథ హోం కమింగ్ ని పిల్లల సాహిత్యం లో చేర్చటం.నా చిన్నప్పుడు నేను కూడా  ఆ అతి విషాద గాథ ని చదవవలసి వచ్చింది.అది పద్నాలుగేళ్ల అబ్బాయి కథ అయినా టాగూర్ దాన్ని పెద్దవాళ్ల కోసం రాసారుగానీ పిల్లలకి కాదు.నా చిన్నప్పుడు శరత్ సాహిత్యాన్ని కూడా ఈ వయసు పిల్లల కోసం అనేవారు.నిష్కృతి ఇ,నవవిధాన,బిందుగారబ్బాయి అలాంటివే కాని అన్నీ కావు.శరత్ చాలా నవలలలో దిగులు పాళ్లు ఎక్కువ.

నేను  ఆ వయసులో వున్నప్పుడు కనపడినవన్నీ చదివేశాను..వాటిలో కొన్ని అప్పుడు చదవకుండా వుండవలసిందని తర్వాత అనిపించింది.నాకు వేరే దారి కూడా అప్పుడు లేదు..ఇన్ని ఆంగ్లపుస్తకాలు నేను గడిపిన పల్లెటూళ్లలో గ్రంథాలయాల్లో కూడా లేవు, వున్నవి చదివేటంత ఆంగ్లం నాకు వచ్చేది కాదు.

ఈ పిల్ల విషయానికి వస్తే తనది విపరీతమయిన పఠనా దాహం.నాకులాగా తనకి పుస్తకాల షాపులు కలలలో వస్తూ వుంటాయి.  తను చిన్న పిల్ల కాదు, యువతీ కాదు.కొంత తెలుసు,చాలాతెలియదు..అంతా తెలుసు అనుకునే ప్రాయం ఇది ఎంత సుకుమారమో,ఎంత సుతిమెత్తగా చూసుకోవాలో! .అదృస్టవశాత్తూ ఆంగ్లం లో ఈ వయసు పిల్లల కోసం ఎన్నో పుస్తకాలు వున్నాయి.

వాటిలో పాత శతాబ్దంలో రాసినవి అన్ని ఇంటర్నెట్ లో ఉచితంగా దొరుకుతాయి..నాకయితే Project Gutenberg ఒక అనంతమయిన నిధి నిక్షేపాల నిలయంలాగా అనిపిస్తుంది.
అభివృద్ధి చెందిన దేశాలలో పిల్లలు సాహిత్యపరంగా అదృష్టవంతులు.ప్రతి గ్రేడ్ లోనూ వాళ్లు చదివి అర్ధం చేసుకోవలసిన పుస్తకాలు వాళ్లకి కేటాయించబడుతూ వుంటాయి.బాధంతా భారత దేశంలోని 12-16 వయసున్న  పిల్లల గురించే.

వీళ్ల పాఠ్యప్రణాళిక లో సాహిత్యానికి చాలా తక్కువ చోటు వుంది. ఈమద్య దశాబ్దం నుంచి పట్టిన విద్యా విషజ్వరం  ఏ ‘ ఇతర ‘ పుస్తకాన్ని చదివే వ్యవధి ఇవ్వటం లేదు.ఆర్ధికమయిన వెసులుబాటు ఎక్కువగా వున్న తల్లిదండ్రులు ఎంచుకునే ‘ అంతర్జాతీయ ప్రమాణాలు ‘ గల పాఠశాలలు కూడా సరయిన దారిని చూపించటం లేదు.

ఏతావాతా ఈ కౌమారంలోని పిల్లలు ‘ చిక్’ లిటరేచర్  కి అలవాటు పడుతున్నారు. వీటిలో చాలా వరకు ఏ విలువలనీ పాటించాలని అనుకోరు,కొన్ని మినహాయింపులు వున్నా.ఇబ్బంది పెట్టే ‘ చెడ్డ భాష ‘ ని యధేచ్ఛ గా వుపయోగించే ఈ పుస్తకాలు ఆలోచననీ వ్యక్తీకరణనీ కూడా దెబ్బ తీస్తున్నాయి.

కొంచెం మార్గం చూపించాలి -తల్లిదండ్రులు, దగ్గరివారు,ఉపాధ్యాయులు..ఎవరయినా. మంచి వ్యక్తిత్వానికి మూలం మంచి పుస్తకాలు చదవటమే. అయితే అవి నీతివాక్యాలు ఏకరువు పెట్టినట్లు వుండనే కూడదు.ఒకటీ రెండూ మూడూ అని అంకెలతో సూత్రాలతో నేర్పేది కాదు అది.  చాలా ‘ వ్యక్తిత్వవికాసపు పుస్తకాలు ‘ ఈ పనినే చేస్తాయి.
అది కాదు.

mythili2వేర్వేరు  సందర్భాలలో వేర్వేరు  మనస్తత్వాలు ఎలా స్పందిస్తాయో -ఎలా లోబడిపోవచ్చో, ఎలా ఎదగవచ్చో -ఎలా నలుగుతారో ఎలా తెప్పరిల్లుతారో-ఈ ప్రయాణమంతా మంచి పుస్తకం అన్యాపదేశంగా మాత్రమే చెప్పాలి.ఇందుకు  ఒకే పుస్తకం సరిపోదు.చాలా,చాలా కావాలి.వాటిని వెదకాలి.

అయితే జీవితపు భయానక వాస్తవికతని ఒక్కసారిగా వీళ్లమీదకి వదలకూడదు.చీకటిని తెలియనివ్వాలి,ఆ తర్వాతి వెలుతురుని తప్పనిసరిగా చూపించాలి.తీవ్రమయిన నిరాశ,అయోమయం కలిగించే అఘాతాలు,దయలేనితనం – ఈ వయసు పిల్లలు తట్టుకోలేరు.

పరస్పరవిరుద్ఢ   భావాలని పెద్దవాళ్లు పిల్లలముందు ఎలా నియంత్రించుకుంటారో ఈ పుస్తకాలూ అలాగే వుండాలి.సంఘర్షణ వుండకుండా వీలవకపోవచ్చు,కాని అది సులభంగా అర్ధమయేలాగే వుండాలి.

ఉండదగినన్ని అనురాగపు ఛాయలు  ,అవీ నిజాయితీగా మాత్రమే వుండాలి.సంక్లిష్టమయిన ప్రేమసంబంధాలను గురించి చర్చించకపోవటం ఉత్తమం.

ఈ షరతులన్నీ వర్తించే పుస్తకాలు నా దృష్టిలోకి చాలా వచ్చాయి.సమకాలీన ఆంగ్ల సాహిత్యం లో యంగ్ అడల్ట్ విభాగం చాలా పెద్దది .అన్ని ఇ మాల్ లలోనూ ఇవి దొరుకుతాయి.చాలా మెచ్చుకోదగినవి కూడా వున్నాయి.అయితే నా దృష్టి లో గుటెంబర్గ్,క్లాసిక్ రీడర్ వంటి చోట్ల ఉచితంగా  దొరికే పుస్తకాలే వీటికన్నా  మంచివి.

వీటిని పాశ్చాత్యదేశాల్లో తొమ్మిదేళ్ల వయసునుంచే  సూచించినా ఇక్కడి పిల్లలకి పదకొండు పన్నెండేళ్ల తర్వాతే బాగుంటాయి.ఇది నా స్వానుభవం.పిల్లలని ఈ మహాతల్లుల, పెద్దమనుషుల  చేతుల్లో పెట్టి కొన్నాళ్లు నిజంగా నిశ్చింతగా వుండవచ్చు.

Frances Eliza Hodgson Burnettరాసిన పుస్తకాలని నేను మొదట వుంచుతాను.A Little Princessలో నిబ్బరం,అభిజాత్యం అబ్బురమనిపిస్తాయి.యేబ్రాసి  పిల్లMary Lennox..The Secret Garden లో ఎలా సున్నితంగా మారుతుందో ఏమెమి కనుక్కుందో ఆసక్తిగా అనిపిస్తుంది.Little Lord Fauntleroy లో చిన్న పిల్లాడు  తనకి కొత్తగా పట్టిన అదృష్టం లో ఎలా గుక్క తిప్పుకోగలిగాడో,కఠినుడయిన  తాతగారిని ఎలా మార్చుకున్నాడో చదవటం  ముచ్చటగా వుంటుంది.

తర్వాత చెప్పవలసిందిLucy Maud Montgomery  గురించి.Anneఅనే విలక్షణమయిన అమ్మాయి గురించి చాలా నవలలు వుంటాయి.ఇంచుమించు అన్నీ హాయిగా వుంటాయి.ఈవిడే రాసినEmily trilogy సూక్ష్మమయిన పరిశీలనతో  నడుస్తుంది.నేను చదివించిన పిల్లలందరూ తమని తాము చూసుకున్నారు ఈ పాత్రలో.
తర్వాతLouisa May Alcott . .ఈవిడ రాసినLittle Women ఎప్పటికీ నచ్చుతూ  వుంటారు..అసలు ఆ పేరే ఎంత బాగుందో చూడంది..ఈవిడ ఇతర రచనలు Eight Cousins,An Old Fashioned Girl,Under the Lilacs కూడా చక్కగా వుంటాయి. Eleanor H. PorterరాసినPollyanna  పుస్తకం ఎంత ప్రసిద్ఢికెక్కినదంటే  నిరంతర ఆశావాదాన్నిPollyannaism అని పిలుస్తారు.ఈ అర్ధం నిఘంటువుకెక్కింది.Pollyanna Grows Up అని దీని తర్వాతి భాగం.పాజిటివ్  థింకింగ్ ఎంతో కొంత  నేర్చుకుని తీరాలి నచ్చితేJust David అనేది  ఇంటిపేరు తెలియని  ఒక అబ్బాయి గురించి.చాలా ఉదాత్తమయిన   నవల.

Edith Nesbit మరీ చిన్నపిల్లల కోసం అనుకుంటారుగానీ ఈవిడ రాసిన అద్భుతకథలు ఈ వయసులోనూ బాగుంటాయిThe House of Arden, The Railway Children ఆరోగ్యకరమయిన రచన లు .తర్వాత Kate Douglas Wiggin రాసిన  Rebecca of Sunnybrook Farm చెప్పుకోదగినది .ఈవిడదే Mother Carey’s Chickens కూడా మంచి నవల .Jules Verne మంచి సైన్స్ ఫిక్షన్  రాసాడు .20,000 Leagues under the Sea ,The Mysterious Island  ప్రసిద్ఢి  వున్న Around the World in Eighty Day బాగున్నంతా బాగుంటాయి .

Johann David Wyss  ది The Swiss Family Robinson  ఎన్నిసార్లు చదివినా బాగుంటుంది .Robert Louis Stevenson, Thomas Hughes మొదలయినవారు ప్రత్యేకించి  అబ్బాయిలకి  నచ్చే పుస్తకాలు రాసారు.

వీళ్లు కొంతమంది మాత్రమే.ఇవి కొన్ని పుస్తకాలు మాత్రమే.ఇంకెన్నో అంతేలేదు ..

“If you look the right way, you can see that the whole world is a garden.”
― Frances Hodgson Burnett, the Secret Garden