‘ఖేల్’ … ఒక ‘యోగిని’ విషాదం ..

ఒక ఫాల్గుణ మాసపు మధ్యాన్నం ..  విశాఖపట్నం దగ్గర..  ఆకుపచ్చని కొండని మేలిముసుగులా ధరించినట్టున్న తలుపులమ్మ లోవ గుడిలో,  పూజారితో “ఈ దేవతకు పులిహోర, రవ్వ లడ్డూ మాత్రమె నైవేద్యం పెడుతున్నారా లేక మాంసం కూడానా?” అని అడిగాను. “తల్లికి మాంసం నైవేద్యవెడతానండి. అమ్మకేది కావాలో అదే పెట్టాలి కదా! బ్రాహ్మణ పూజారిని గవర్నమెంటు పెట్టింది కానండి, ఆయన పూజలు ఆయనవి” అన్నాడాయన.

తిరుపతి  పెద గంగమ్మ గుడిలో పూజారిణి, తరాలుగా దేవతను పూజిస్తున్న తనను ఆ పదవినుంచి తప్పించి, మగ పూజారిని పెట్టటానికి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలను వివరిస్తుంది.

ఆదిలాబాద్ దగ్గరలోని ఒక గోండు గ్రామం వెలుపల, చెట్ల మధ్య చిన్న చిన్న హిందూ దేవతల విగ్రహాలను పెట్టారు. “గోండు దేవతల రాజ్యంలో వీళ్ళు ఎక్కడినుంచి వచ్చారా?” అనుకున్నాను.

పాత దేవుళ్ళ ప్రభ తగ్గుతూ, కొత్త దేవుళ్ళు వెలుస్తూ, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకం పూజలూ, పద్ధతులది పైచేయి అవుతుండటం ముక్కోటి దేవుళ్ళూ, ఎంతో వైవిధ్యమూ ఉన్న హిందూ మతంలో సాధారణమే కానీ….

కొన్ని రకాల పూజా పద్ధతులూ, ఆచారాలూ … ముఖ్యంగా స్త్రీ దేవతల విషయంలో చాలా మార్పులు చెందిపోతూ వస్తున్నాయి.  ఏ సమాజంలో స్త్రీ ఎలా ఉండాలని అనుకుంటారో అదే పద్ధతిలో దేవతల మూసలూ తయారు చేసుకుంటుందా ఆ సమాజం?  ఎప్పుడైనా ఒక వింత ఆకర్షణతోనూ, భయంతోనూ,  అడ్డూ అదుపూ లేని స్త్రీ శక్తిని పూజించే రోజులు కొంతకాలంపాటు వచ్చినా, మళ్ళీ వెంటనే తేరుకుని దేవతను అదుపు చేస్తుందా పురుష స్వామ్యం?

*****

*

సబా దివాన్                                             రాహుల్ రాయ్

స్త్రీ శక్తి , పురుష దేవతల ఛాయగా ఎలా మారిపోయిందో, అదే ప్రక్రియ సమాజంలోనూ ఎలా కనిపిస్తోందో వివరించే ఒక డాక్యుమెంటరీ చిత్రం ‘ఖేల్’  ……

 సబా దివాన్, రాహుల్ రాయ్ అనే డాక్యుమెంటరీ చిత్ర దర్శకులు 1994 లో ఈ చిత్రాన్ని నిర్మించారు.

బ్రాహ్మణ వాద మూసలోని స్త్రీత్వం కంటే భిన్నమైన స్త్రీ తత్వాన్ని వెదికే ఒక అన్వేషణగా ఈ చిత్రం మొదలవుతుంది. స్త్రీ శక్తి ఏ అడ్డంకులూ లేకుండా ప్రవహించే ఒక చోటు కోసం వెదుకులాట.  అచ్చంగా ఆడదానికి మాత్రమే పరిమితమైన ఆది భౌతికత కోసం చూడటం…

మహా యోగినిగా స్త్రీని చూడటం కోసం వారు బుందేల్ ఖండ్ తిరిగి, యోగిని గుడుల గురించి ఆరా తీసారు. బాందా జిల్లా లోని లోఖ్డీ గ్రామం దగ్గర ఒక కొండ మీద ఏ పూజలూ లేని గుడి వారికి కనిపించింది.  పెద్ద వృత్తాకారంలో కనిపించే స్థలంలో ఎటు చూసినా విరిగిపడిన స్త్రీ విగ్రహాలే. వృత్తం.. ఒక సామాన్యత లో ఒక పరిపూర్ణత.  ఆ పరిపూర్ణతను మేము  ఒప్పుకోమంటూ చేసిన విధ్వంసం భీభత్సంగా కనిపిస్తుంది. విరిగిన విగ్రహాల దగ్గర ఇప్పుడు భైరవుడు ఉన్నాడు. చాలా విగ్రహాలను దొంగలు పట్టుకు పోయారు.   అటువంటి వృత్తం మరోచోట కూడా వీరికి శిధిలావస్థలో కనిపించింది. ఆ స్థలంలో ఇంతకుముందు  ఏముండేదని వీరు అడిగితే,   స్థానికులు ఒక అఖాడా (వ్యాయామశాల) అని  చెప్తారు.

(తాంత్రిక విద్యల్లో ఆరితేరిన స్త్రీలు ఒకప్పుడు  ఉండేవారు. హఠయోగాన్ని నేర్చుకున్న వీరిని, యోగినులు అనేవారు. ఇవి రహస్య విద్యలవటం వల్ల, ఆ సమూహంలో ఉండేవారికి తప్ప, బయటి సమాజానికి వారిగురించి పెద్దగా తెలియదు. విచిత్రంగా, అన్నిటా మగవారి పెత్తనమే ఉండే కాలంలో… ఎనిమిది నుంఛీ  పదకొండో శతాబ్దం వరకూ ఉత్తర భారత దేశంలో యోగిని గుడుల నిర్మాణం జరిగింది. పురాణాలలో సప్త మాతృకలు అని చెప్పబడేవారు (బ్రాహ్మి, మాహేశ్వరి, వైష్ణవి, కౌమారి, వారాహి, ఇంద్రాణి, చాముండి) (చండిక,మహాలక్ష్మి లతో కలిపి వీరిని నవ మాతృకలు అని కూడా అంటారు) దుర్గాదేవి శరీరం నుంచి పుట్టి, దుష్ట శక్తులతో ఆమె చేసిన యుద్ధంలో ఆమెకు సహాయం చేసిన సైన్యం.  ప్రతి మాతృకా ఒక యోగిని. వీరికి మళ్ళీ కొంతమంది యోగినులు అనుయాయులు.  మొత్తంగా వీరి సంఖ్య మాతృకలతో కలిసి, 64, లేదా 81 ఉంటుంది. ఇప్పటికీ ఈ యోగిని గుడులు ఒడిషాలో రెండు, మధ్య ప్రదేశ్ లో రెండు ఉన్నాయి. ఇంకా ఎక్కడెక్కడ ఉన్నాయో ఆ ప్రాంతాల వారికే సరిగ్గా తెలియదు.)

విరిగిన విగ్రహాల మధ్య ఒక యోగిని. (లోఖ్డీ వద్ద).

ఈ డాక్యుమెంటరీ ఫిల్మ్ లోకి వెళ్తే..  ఇంకా అక్కడి అడవి ప్రాంతాల అన్వేషణలో చిత్ర దర్శకులకు  అరుదైన ‘జోగినుల’ గురించి తెలిసింది.. ఇక ఎన్ని కథలో. ‘కోల్’ తెగవారు నివసించే బుందేల్ ఖండ్ అడవుల్లో ఈ ‘జోగిని’ ఒక గొప్ప కల్పన,. మాయ. అద్భుతం.. నిజం..

పుల్లలూ, ఆకులూ ఏరుకుంటూ ఈ అడవుల్లో ఎక్కువగా తిరిగే ‘కోల్’ స్త్రీలకు జోగినులు ఎప్పుడూ కనిపిస్తూనే ఉంటారట. సంస్కత కావ్య వర్ణనలలో యోగినిగా మారిన మహారాణి,  ఒక రాజకుమారుడిని చిలుకగా మార్చి, తనకు కావలసినప్పుడు అతన్ని మనిషి రూపం లోకి తెచ్చి ప్రేమించే యోగిని… వంటివి ఉంటే, అడవుల్లో చిన్న అందమైన బాలునిగా కనిపించి, చేతుల్లోకి తీసుకోగానే మాయమయ్యే జోగిని, చిన్ని బాలుని రూపంలో కనిపించి, చూస్తుండగానే పెద్ద మగవానిలా మారే మాయా జోగిని… ‘కోల్’ స్త్రీల సామూహిక అంతచ్చేతనలో సజీవంగా ఉన్నారు. మండు వేసవి మధ్యాన్నాల్లో జోగినులు పాటలు పాడుతూ, ఆటలు ఆడుతూ తమకు కనిపిస్తారని, పక్కింటివాళ్ళ గురించి చెప్పినంత సులువుగా వీరు చెప్తారు ఈ చిత్రంలో.  ఒక మగవాడు నది ఒడ్డున జోగిని మాయలో పడి, తోటివారు పిలుస్తున్నా పట్టించుకోకుండా నిలబడిపోతే, తమ కులదేవత వచ్చి చెంపదెబ్బ కొట్టి, అతన్ని రక్షించిందట.  స్త్రీల మాయాశక్తి గురించిన ఇలాంటి కథలు మనమంతా ఎప్పుడో ఒకప్పుడు వినే ఉంటాం కదా!

సబా దివాన్ ఈ  ‘కోల్’ స్త్రీలను యోగినుల గురించి అడిగితే తమకు అదేమీ తెలియదని చెప్తారు. వారికి తెలిసిన జోగిని అడవినేలుతుంది.  క్రూర మృగాలను అదుపులో పెడుతుంది.   కలల్లో కనిపిస్తుంది. ఆవహిస్తుంది.

.

 

ఉత్తరప్రదేశ్ లో మాయమై, ఈ మధ్యనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి తిరిగి వచ్చిన పదవ శతాబ్దపు యోగిని విగ్రహం.

వృత్తాకారపు యోగిని గుడుల్లోని మాయ, అడవుల్లో తిరిగే ఈ జోగినీ మాయ ఒకటేనా? తాంత్రిక యోగిని, అడవి తెగల్లోని జోగిని ఒకటే ఎందుకు కాకూడదు? సప్త మాతృకల వలె జోగినులనూ ఏడుగురు అక్క చెల్లెళ్లుగా చెప్తున్నారు.

కాళిదాసు, భవభూతి వర్ణించిన  మహా యోగినుల జాడలు ఎక్కడ? ఈ అడవుల్లోనా? స్థల, కాల, సంస్కృతులనూ, కులాన్నీ, వర్గాన్నీ అధిగమించిన సామూహిక జ్ఞాపకాలు ఇవేనా? … ఇదీ సబా దివాన్ ఆలోచన.

‘ఖేల్’ లో ….

రామ్ కలీ, శివ కుమారి ..  అనే ఇద్దరు స్త్రీలు.

రామ్ కలీ .. దేవతకు అంకితమైన స్త్రీ.  పొయ్యి మంట వెలుగులో అలసిన మొహం, చెదిరిన జుట్టుతో నెమ్మదిగా ఎన్నో మాట్లాడుతుంది. యవ్వనంలో ఉన్నప్పుడు భూస్వామి తనను చెరచబోతే, అతన్ని చంపేసి పోలీస్ స్టేషన్ లో నింపాదిగా ఆ విషయం తెలియచేసిన చరిత్ర ఈమెకు ఉందట.  పుట్టిన మూడు రోజులకే ఈమెను దేవత ఎత్తుకుపోయిందని చెపుతుంది. ఎంత వెదికినా పిల్ల దొరకక, ఆమె తండ్రి అమ్మవారి గుడికి వెళ్లి అడిగితే, దేవత కనిపించి, తాను కాళి నని, ఏడుగురు అక్కచెల్లెళ్ళలో మొదటిదానిననీ చెప్పి, తనకు గుడి కట్టిస్తే ఈ పిల్లను తిరిగి ఇస్తానని చెప్పిందట.  పన్నెండేళ్ళ పాటు ఈ పిల్ల పెళ్ళీ, సంసారం లేకుండా తనకు సేవ చెయ్యాలని చెప్పిందట. ఆ మాట పట్టించుకోకుండా తండ్రి తనకు పెళ్లి చేస్తే,  దేవత అక్కడికి వచ్చి తన అత్తవారింట్లో అందరినీ నాశనం చేసిందని చెప్తుంది. ఊరంతా భయపడే ఒక పురుష శక్తి అడవిలో ఆకులు ఏరుకునేటప్పుడు తనను భయపెట్టాలని చూస్తే, తను ఏ మాత్రం భయపడక అతడిని తన మంత్రాలతో కట్టేసి ఊరికి తెచ్చానని చెప్తుంది.  కష్టపడి వంటలు చేసి, ఇదంతా దేవతకు పెట్టాలనీ, ఆమె సేవ చెయ్యకపోతే తను జబ్బు పడిపోతాననీ అంటుంది.

శివకుమారి .. అడవిలో కట్టెలు కొడుతూ, బక్క పల్చని శరీరంతో, విచారమూ, బతుకు భారమూ కలగలిసి ముఖాన్ని అద్దుకున్నట్టు కనిపిస్తుంది. దేవత ఆవహించి మూడు నెలల పాటు అడవిలోనే ఉండిపోయాననీ, పిల్లలని కూడా తన తోనే ఉంచుకుంటే, దేవత వారికి పళ్ళు సమకూర్చి వారి ఆకలి తీర్చిందనీ చెప్తుంది. దేవత ఆవహించినప్పుడు నెలల తరబడి తిండీ, నీరూ లేకుండా, ముళ్ళూ, రాళ్ళలో తిరిగానని చెప్తుంది. అదంతా ఒక నరకం లాగా ఉండేదని చెప్తుంది. సిగ్గూ, లజ్జా పోయాయంటుంది. ఇప్పుడు దేవత తనను వదలకుండా, తన సేవ కోసమే నువ్వు పుట్టావని అంటుందని చెప్తుంది.

వీళ్ళిద్దరూ దేవి ఆవహించినప్పుడు  జబ్బులు బాగుచేస్తామని చెప్తారు.

రామ్ కలీ, శివకుమారి .. వీరిద్దరూ కలుసుకునే సందర్భం కూడా ఈ చిత్రంలో ఒక చోట వస్తుంది. ఇద్దరు శక్తిమంతులైన స్త్రీలు.. ఇద్దరు న్యురోటిక్ స్త్రీలు.. సమాజపు అడుగుపొర లో బ్రతికే వీళ్ళు .. దేవత సాయంతో మగవారిని ధిక్కరించి, ఆజ్ఞాపించే వీళ్ళు.. కలిసిన సందర్భం అపురూపం. శివకుమారి వణికే చేతిని తన చేతిలోకి తీసుకుని, ఆమె బేలతనాన్నీ, న్యురోసిస్ నంతా పోగొట్టేలా మెత్తగా మాట్లాడుతూ, ఒక తల్లి తన బిడ్డను లాలించినట్టు దగ్గరికి తీసుకుంటుంది రామ్ కలీ.

శివకుమారి                        శివకుమారి, రామ్ కలీ

శాంతి

ఈ చిత్ర దర్శకులతో మాట్లాడటానికే ఇష్టపడని స్త్రీ .. శాంతి. ఒకసారి మాట్లాడటం మొదలు పెట్టాక, ప్రవాహంలా చెప్పుకు పోతుంది.  కొండమీద ఉన్న గుడిలో పూజలూ, గుడి గంటల ధ్వనుల మధ్య ఆమె బాల్యం. ఎప్పుడూ దైవ సన్నిధానమే. పెరిగి పెద్దదౌతున్న కొద్దీ ఆంక్షలు. గుడికి వెళ్ళకుండా ఉండలేని ఆమె యాతన. తనకు బలవంతాన పెళ్లి చేసినా, తను మాత్రం   ఎనిమిదేళ్ళ పాటు  భర్త  నీడ కూడా తనమీద పడనివ్వలేదంటుంది.

 ఇక్కడ కథ మనల్ని బేడా ఘాట్ (మధ్యప్రదేశ్, జబల్పూరు దగ్గర) యోగిని గుడికి తీసుకుపోతుంది.  పూర్ణ వృత్తాన్ని  ఎనభై ఒక్క భాగాలుగా చేసి, విగ్రహాలను ప్రతిష్టించిన యోగిని గుడి.. కొన్ని విగ్రహాలకు మృగాల తలలూ, స్త్రీ శరీరాలూ ఉంటాయి. ఆది శక్తి వివిధ రూపాల్లో యధేచ్చగా ప్రవహించిన చోటు.. నేలంతా చదునుగా పరచిన నాప రాళ్ళు. చుట్టూ వేప చెట్లు.  గాలీ, వెలుతురూ నిండి ప్రకాశించే చోటు. యోగిని గుడులను అప్పటి మిగతా గుడుల వాస్తు సంప్రదాయానికి విరుద్ధంగా నిర్మించారు. చుట్టూ వలయంగా విగ్రహాలు. మధ్యలో ఖాళీ స్థలం. ఇదీ యోగిని ఆలయ నిర్మాణ శైలి. తాంత్రిక ఆరాధనా వ్యవస్థకు గొప్ప చిహ్నం.

బేడా ఘాట్

మహా భాగవత పురాణంలోని అంతగా ప్రాచుర్యం లేని ఒక శాక్తేయ వర్ణన ప్రకారం సతి, కాళి నీడగా మారి మంటలు రేపి, తన యోగిని అనుయాయులతో కలిసి, దక్ష యజ్ఞాన్ని భగ్నం చేస్తుందట.  తనను దక్ష యజ్ఞానికి వెళ్ళవద్దని చెప్పిన శంకరునిపై అలిగిన సతి, జుట్టు విరబోసుకుని, దిగంబరురాలై, నాలుక వేలాడేసుకుని, చెమటలతో తడిసి, ప్రచండంగా తన తల్లిని చేరుకుంటుంది. తల్లి ప్రసూతి ఈ దాక్షాయణిని దగ్గరకు తీసుకుని, చెంగుతో ముఖాన్ని తుదిచి, గుండెలకు హత్తుకుంటుంది.  దక్షుడు సతిని నిందిస్తాడు. అప్పుడామె భీభత్సంగా మారి, యోగినులతో కలిసి మదిరా పాన మత్తురాలై నాట్యంచేసి, యజ్ఞాన్ని భంగం చేస్తుంది. శంకరుడు వచ్చాక, ఆ చితి మంటలు మళ్ళీ రగిలి అతడు తన వంతు పూర్తి చేస్తాడట.  బేడా ఘాట్ యోగిని విగ్రహాలను చిత్రిస్తూ, స్తోత్రం వినిపిస్తూ, మధ్యలో ఈ కథను చెప్తుంది సబా దివాన్.

బేడా ఘాట్ గుడిలో చాలా విగ్రహాలు అంగాలు విరిగి కనిపిస్తాయి.  ఈ ఫిల్మ్ లో, ఆ విగ్రహాలతో అత్తవారింటిలో శాంతి పడిన అవస్తనూ, హింసనూ పోల్చి చూపిస్తుంటే, ఆ అణచివేత మనల్ని ఒక తీవ్రమైన ఆవేదనకు గురి చేస్తుంది. తన వంటిలో ఏ భాగాన్నీ వదలకుండా ఎలా కొట్టి హింసించారో ఆమె చెప్తుంటే, చేతులూ, కాళ్ళూ, స్తనాలూ విరిగిన విగ్రహాలు కనిపిస్తూ ఎంతో బాధిస్తాయి.  యుగాలుగా స్త్రీ శక్తిని, మార్మికతనూ చూసి ఆకర్షితులౌతూనే, భయంతో మళ్ళీ దాన్ని అదుపులో పెట్టాలని ప్రయత్నించే పురుషస్వామ్యపు  విశ్వరూపం కళ్ళకు కడుతుంది.

చాలా సేపు బేడా ఘాట్ విగ్రహాలను అర్ధ వృత్తంగానే చిత్రీకరించి, మనల్ని మరో లోకం లోకి తీసుకెళ్తూ, ఒక్క సారిగా ఆ వృత్తపు మధ్య భాగాన్ని చూపిస్తారు.  ఒక షాక్.  ఆ మధ్యలో ఒక శివాలయం. దీన్ని తరువాతి కాలంలో ఎప్పుడు కట్టేసారో !  నిరాఘాటంగా స్త్రీ శక్తి ప్రవహించే చోటుని, ఆ మండలాన్ని ఛేదిస్తూ, సాంప్రదాయక శివాలయం…  ఇక్కడ పార్వతి శివుడి పక్కన అనుయాయి.  ఈ శివాలయ నిర్మాణంతో శక్తి మండలాన్ని విచ్చిన్నం చేసారంటుంది సబా దివాన్.  అలాగే మధ్య ప్రదేశ్ లోని మతౌళి దగ్గర ఇంకో వృత్తాకారపు గుడినీ చిత్రీకరించారు. అక్కడ స్త్రీ విగ్రహాలని తొలగించి, శివ లింగాలను ప్రతిష్టించారు. తాంత్రిక యోగినీ వ్యవస్థ గురించి మనకు తెలియకుండా చేసే ఈ ప్రయత్నాలూ, శాంతి వంటి స్త్రీల స్వేచ్చకు వేసే సంకెళ్ళూ ఒకలాంటివే

.

బేడా ఘాట్ యోగిని విగ్రహం       యోగిని స్థానం లో శివలింగం (మతౌళి)     వృత్తం మధ్య శివుని మంటపం (మతౌళి)

‘కోల్’ తెగ వారు జరుపుకునే నవరాత్రి పండుగలో ఒక రోజు దాక్షాయణి (సతి) తన తల్లిని కలుసుకొనే పండుగ జరుగుతుంది. కానీ ఈ ఉత్సవాల్లో స్త్రీలంతా ముసుగులు వేసుకుని కూర్చుంటే, మగవాళ్ళదే ‘ఖేల్’ అంతా! దేవత  భక్తురాలు శివకుమారి కూడా నిర్వికారంగా చూస్తూ కూర్చుంటుంది.

 

చివరిగా, శాంతి ఇంట్లో ఆమె కూతురు కేశ్ కలీ కనిపిస్తుంది.  అత్తవారింటి నుంచి వచ్చేసింది ఈమె.  వాళ్ళింట్లో అత్త తనను సరిగా పని చేయటం లేదని తిడుతూ, కొడుతూ ఉంటుందట. ఇక తను తల్లి దగ్గరే ఉంటానంటుంది.  ‘ఈ పిల్లను అత్త ఇంటికి పంపవా?’ అని శాంతిని అడిగితే, ‘తనకు ఇష్టమైతే వెళుతుంది. లేదా ఇక్కడే ఉంటుంది’ అని చెప్తుంది. తాను అనుభవించిన బాధ తన బిడ్డకు వద్దనుకొనే తల్లి మనసు శాంతిది. ఈ ‘సతి’ తన తల్లి దగ్గర ఊరట పొందుతోంది.

సతీ దేవి తన తల్లి దగ్గర చేరటం, శివకుమారి రామ్ కలీ దగ్గర ఊరట పొందటం, కేశ్ కలీ  తన తల్లి శాంతి దగ్గర ఉండిపోవటం… ఆడదాన్ని ఆడదే అర్ధం చేసుకోగలదనే భావాన్నీ, బిడ్డలను లాలించే దేవత కారుణ్యాన్నీ  సూచిస్తుంది. కథా చిత్రం కాకుండా ఒక డాక్యుమెంటరీ చిత్రంలో ఇంత హృద్యంగా ఇది చెప్పటానికి కుదరటం అనేది ఈ చిత్ర దర్శకులకు దొరికిన అరుదైన అవకాశం.

శుభా ముద్గల్ సంగీతం, గానం..  ముఖ్యంగా అడవుల్లో జోగినుల మార్మికతను మనమూ అనుభూతి చెందేలా తీసిన కొన్ని షాట్లు మనల్ని వెంటాడుతూ ఉంటాయి. యోగిని గుడుల చిత్రీకరణ సరేసరి.

మనకు కలిగే  బాధ,  యుగాలుగా   స్త్రీలందరికీ

కేవలం యోగిని ఆరాధనా వ్యవస్థ గురించే అయివుంటే ఈ ఫిల్మ్ ఒక సంస్కృతిని మాత్రమె వివరించే డాక్యుమెంటరీ అయివుండేది. ఇది కల్పిత సినిమా కథా కాదు. ఇందులోని స్త్రీలు పాత్రలూ కావు.  ఒక anthropological/ ethnographic  డాక్యుమెంటరీలో రక్త మాంసాలతో అదే ప్రదేశంలో తిరుగాడే ఒక తెగ స్త్రీలూ, వారి భిన్నత్వం, తెగువ, మార్మికత, పేదరికం, బాధలు.. అన్నీ కలిపి చూస్తున్నప్పుడు

చెందిన సామూహిక అస్తిత్వ వేదన.

 

****

హిందూ సమాజంలో, పంటలనూ, బిడ్డలనూ కాపాడుతూ వుండే గ్రామదేవతలకున్న ఒక ప్రత్యేక స్థానం కొన్నాళ్ళకు అంతరించిపోతుందేమో అని అనుమానం వచ్చేంతగా బ్రాహ్మణీకరణ జరుగుతోంది. జాతరలు చేసి, బలులు ఇచ్చి, ఊరంతా సంబరాలు జరుపుకోవటం అనేది, సామూహికంగా స్త్రీ శక్తిని ఆరాధించే ఒక తంతు.  ఆదిమ పురుషుడికి స్త్రీత్వం, మాతృత్వం,  అద్భుతాల్లా కనిపించేయి. వ్యావసాయిక సమాజాల్లో పంటలనిచ్చే భూములనూ, పిల్లలనిచ్చే తల్లులనూ పోల్చి చూసుకుని, స్త్రీని దేవత రూపంలో కొలిచారు. పంటలూ, పిల్లలూ పదిలంగా ఉండాలంటే అమ్మ శక్తిని సంతృప్తి పరచాలని భావించారు. వీరిని పూజించటం లో భయం, భక్తీ .. రెండిటినీ ప్రదర్శించారు.  సాలగ్రామ పూజలు చేసే బ్రాహ్మణులూ కూడా గ్రామ దేవత పూజల్లో పాల్గొనటానికి మినహాయింపు కాదు.  బ్రాహ్మణ స్త్రీలు గ్రామ దేవతకు పెరుగన్నంతో చల్లని నైవేద్యం పెడతారు.  పసుపూ, కుంకం, చీరలూ సమర్పించుకుంటారు. మరి ఇప్పుడు గ్రామాలను మొత్తంగా పట్టణాలకు తరలించే పని పెట్టుకున్న ప్రభుత్వాలు మనవి. అదే అభివృద్ధి అంటున్నారు. ఈ వెల్లువలో కొట్టుకుపోతున్నవి ఊళ్ళలోని వృత్తులూ, వ్యవసాయమే కాదు. ఒక సంస్కృతి కూడా.

స్త్రీల శరీరాలే కాదు వారి గర్భాశయాలు కూడా అంగట్లో అద్దెకు దొరుకుతున్న ఈ రోజుల్లో స్త్రీ శక్తికి విలువేముంది? ఉగ్ర రూప గ్రామ దేవతలు కూడా సాత్విక వైష్ణవ అమ్మవార్లయిపోతున్నారు.  అన్ని రకాల దేవతల వైవిధ్యం నశించి, వారంతా సంస్కృత మంత్రాలూ, రాముడూ, సీతా, ఆంజనేయుడూ… వీటిలో హింద్వైక్యం చెందుతున్నారు. ఉగ్ర, ధైర్య, స్థైర్య, కారుణ్య రూపాలలో ఊరినీ, బిడ్డలనూ, పంటలనూ కాపాడే అమ్మ శక్తిని రాను రానూ సాత్వికతకు మాత్రమే ప్రతీకగా ఉండే ఒక నమూనాగా చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి.  కొన్నాళ్ళకు కలకత్తా కాళి కూడా రూపం మారి, సీత లాగా ముసుగు వేసుకుంటుందేమో!

ఒకపక్క స్త్రీలను పూజిస్తామంటూనే మరో పక్క మానభంగాలూ, ఆడ పిండాల హత్యలూ జరిగి పోతున్న సమాజాల్లో స్త్రీ దేవతల సాత్విక పరిణామం కూడా ఒక ‘ఖేల్’.

lalitha parnandi—  ల.లి.త.

“బాగున్నవా తమ్మి?” ఇక వినిపించదు ఆ పలకరింపు!

Sri hari - EPS

రియల్ స్టార్ శ్రీహరి నిజంగానే రియల్ స్టార్ .  అయన లేకపోయారు అంటే నమ్మలేక పోతున్నా ఇంకా ..   ఎప్పుడు ఫోన్ చేసినా అరె తమ్ముడు ఎట్లున్నావు అని ఆప్యాయంగా పిలిచే శ్రీహరి ఇంకా లేరు అంటే ఎలా నమ్మేది ?
శ్రీహరి గారిని మొదట చూసింది పరశురాం షూటింగ్ లో .

అప్పట్లో చిరంజీవి అంజి సినిమా షూటింగ్ అన్నపూర్ణ స్టూడియో లో ఒక ఫ్లోర్ లో రెగ్యులర్ గా జరుగుతూ ఉండేది .  (అది దాదాపు గా ఆరేళ్ళు తీసారు ) నేను ఖాళీగా ఉన్నప్పుడు ఆ సినిమా ప్రొడ్యూసర్ శ్యాం గారి ని కలవడానికి అన్నపూర్ణ కి వెళ్తూ ఉండేవాడిని .

అలా ఒక రోజు వెళుతూ ఉంటె , అన్నపూర్ణ స్టూడియో పక్కన ఉన్న భవంతి దగ్గర గోల గోల గా ఉండి చాల మంది గుమిగూడి ఉండటం చూసి బండి పక్కన పెట్టి చూడటానికి వెళ్తే , అక్కడ కనిపించారు శ్రీహరి .

అలా  చూస్తూ ఉండగానే చక చక ఆ భవంతి పైకి ఎక్కి రెండు గొడుగులు పట్టుకుని అకస్మాత్తుగా కిందకి దూకారు, ఒక్క క్షణం అంతటా నిశ్శబ్దం , ఆ తరవాత చప్పట్లతో మారు మోగిపోయింది ఆ ప్రదేశం .

నాకు ఆయనతో పరిచయం లేకపోవడం వల్ల నేను కూడా అందరితో పాటు చప్పట్లు కొట్టి అక్కడ నుంచి వచ్చేసాను .
తరవాత కొన్ని రోజులకి రచయితా / దర్శకుడు / నిర్మాత / నటుడు   పోసాని కృష్ణ మురళి గారిని ఒక స్నేహితుడి ఇంట్లో కలిసినప్పుడు ఆయన చెప్పారు శ్రీహరి గారు ఆయనా ఒకే అపార్ట్ మెంట్ బిల్డింగ్ లో ఉంటున్నారు అని.  నేను కృష్ణమురళి గారి ఇంటికి వెళ్ళినప్పుడు అయన నన్ను శ్రీహరి గారి ఇంటికి తీసుకెళ్ళి పరిచయం చేసారు . అలా శ్రీహరి గారిని మొదటి సరి కలవడం జరిగింది .  కాని అప్పుడు ఇంటర్వ్యూ లాంటిది ఏమి చెయ్యలేదు ఇద్దరికీ సమయం సరిగ్గా కుదరక .
ఆ తరవాత నేను అమెరికా వచ్చాక అప్పుడప్పుడు ఫోన్ లో మాట్లాడుతూ ఉండేవాళ్ళం . మహానంది సినిమా విడుదల కి ముందు ఆయన్ని ఇంటర్వ్యూ చేసాను .  తరవాత అక్షర (శ్రీహరి గారి అమ్మాయి బాగా చిన్న వయసు లో పోయింది ) పేరు మీద తను గ్రామాన్ని దత్తత చేసుకున్నపుడు అభినందించడానికి ఫోన్ చేశాను .  ఆ తరవాత అంతగా ఫోన్ చెయ్యలెదు. ఈరోజు పొద్దున్నే ఫోన్ తో మెలకువ వచ్చి మెసేజ్ చూస్తె శ్రీహరి గారు లేరు అని వార్త .  కొంచం సేపు ఇది నిజం కాకపోతే ఎంత బాగుండును అన్న భావన .. అసలు నిజమే కాదేమో అన్న ఫీలింగ్ … ఈ లోపల ఫేస్ బుక్ లో ఫ్రెండ్స్ న్యూస్.
ఎప్పుడు ఫోన్ చేసినా బాగున్నావా తమ్మి అని పిలిచే ఆ గొంతు మూగ పోయింది అంటే ఎలా నమ్మేది . ఒక భద్రాచలం, ఒక షేర్ ఖాన్ (మగధీర) , ఒక ప్రతినాయకుడు, ఒక రియల్ ఫైటర్ , ఒక మంచి మనిషి , ఒక మంచి స్నేహితుడు , వివాదాలు లేని వ్యక్తీ ,  అన్నిటికి మంచి ఒక మంచి మానవతావాది శ్రీహరి గారు . వారి ఆత్మకు శాంతి కలగాలని , వారి కుటుంబానికి ఈ తీర్చలేని లోటు నుండి తట్టుకునే ఆత్మ స్తైర్న్యాన్ని ఇవ్వమని ఆ భగవంతుని ప్రార్దిస్తూ .

– శ్రీ అట్లూరి

ఒక నడి వయసు ప్రేమ కథ: లిజన్.. అమాయా!

జ్ఞాపకాలే జీవితం కాదు.. జీవితంలో ఒక భాగం మాత్రమే జ్ఞాపకాలు… ఎంత సత్యం! ఇట్స్ ఎ ప్రాక్టికల్ ట్రూత్! ఆ విషయాన్నే చెపుతుంది లిజన్.. అమాయా!

జిందగీ న మిలేగీ దొబారా…ఎవరన్నారు బాస్? జిందగీ మిలేగీ దొబారా! జీవితం మొదలుపెట్టిన కొన్నాళ్లకే జీరోకి చేరితే.. అంతా అయిపోదు. మళ్లీ ఒకటి, రెండు, మూడు అంకెలుంటాయి! పాత జ్ఞాపకాలను, అనుభవాలను ఓ భాగం చేసుకుంటూ కొత్తగా మొదలుపెట్టొచ్చు! దాన్నే చూపిస్తుంది లిజన్.. అమాయా! అమాయా.. అంటే రాత్రికల! బతుకు రాత్రి కలలాగే మిగిలిపోకూడదు!  జీవితం ఇలాగే ఉండాలనే ఫ్రేమ్‌లో మనసున్న వాళ్లెవరూ ఇమడలేరు! ఈ ప్రయాణంలో అనుభవమయ్యే ప్రతిమలుపునూ స్వీకరించడం..ఆస్వాదించడమే! విధివింతల్లో భాగస్వామ్యులవడమే!

ఇవన్నీ స్త్రీ, పురుషులిద్దరికీ సమానమే అయినా  స్త్రీ విషయానికొచ్చేసరికే ఎక్కడలేని సంఘర్షణ! ప్రేమ, సహచర్యం విషయంలో మరీ! ఆమెకు జిందగీ నమిలేగి దొబారా! ఒకవేళ కోల్పోయిన జీవితాన్ని మళ్లీ పొందాలనే ఆశపుడితే కట్టుబాట్ల నుంచి కన్న పిల్లల దాకా అందరికీ శత్రువు అవుతుంది!  కట్టుబాట్లనెదిరించే ధైర్యం చూపినా పిల్లలను కన్విన్స్‌చేసే సాహసం చేయలేదు ! అసలు ఆమెకు ప్రేమించే హక్కేలేనప్పుడు జీవితంలో మలిప్రేమ ఊపిరిగురించి ఊసా? అదీ మధ్యవయసులో! ఆ చర్చనే తల్లీకూతుళ్ల మధ్య సున్నితంగా లేవనెత్తుతుంది లిజన్ అమాయా..!

రమా సరస్వతి

రమా సరస్వతి

చలం రాజేశ్వరి చేసిన ధైర్యం లిజన్ అమాయాలో లీలా చేస్తుందా? రాజేశ్వరికి లోకం ప్రేమ మయం! పిల్లల బంధాలు, బంధనాలు లేవ్! కాని  లీల అలాకాదు! షి ఈజ్ ఎ అర్బన్ లేడి! మెచ్యూర్డ్ అండ్ మోడర్న్‌డాటర్‌కి సింగిల్ పేరెంట్! భర్త చనిపోతే అన్నీ తానై, తనకు కూతురే లోకమై బిడ్డను పెంచి పెద్ద చేస్తుంది. సినిమా కథలో మనకు కనిపించే లీల..ఢిల్లీలో బుక్ ఎ కాఫీ పేరుతో కెఫ్తీరియా నడుపుకొంటూ జీవిస్తున్న మిడిల్‌ఏజ్డ్ ఉమన్! ఆ కెఫ్తీరియాలోనే పరిచయం అవుతాడు ఫోటో జర్నలిస్ట్ జయంత్! అతని భార్యా, పాప ఓ కార్ యాక్సిడెంట్‌లో చనిపోతారు. నడివయసు దాకా ఒంటరిగానే ఈదాడు! లీలతో పరిచయం స్నేహంగా మారుతుంది! ఎంతలా అంటే కెఫ్తీరియాకి వచ్చిన అపరిచితులు జయంత్, లీలను భార్యాభర్తలు అనుకునేంతగా!
లీల కూతురు అమాయా.. ఔత్సాహిక రచయిత! జయంత్‌తో చాలా చనువుగా ఉంటుంది. తన కెరీర్‌కి సంబంధించి ఎన్నో సలహాలు తీసుకుంటుంది. ఆయన్ని ఓ ఫ్రెండ్‌లా, గైడ్‌లా భావిస్తుంది!
లీలా  వయసొచ్చిన తన బిడ్డను ఓ స్నేహితురాలిలా చూస్తుంది. అన్నీ పంచుకుంటుంది. కూతురూ తనతో అన్నీ పంచుకునే స్వేచ్ఛనిస్తుంది. తామిద్దరం ఒకరినొకరం బాగా అర్థం చేసుకుంటున్నాం అనే భావనలో ఉంటుంది లీల. కాని తర్వాత తెలస్తుంది తనది వట్టి భ్రమేనని!

1005330_10200530760220688_1798645539_n
రాఘవ.. అమాయా ఫ్రెండ్! ఆత్మవిశ్వాసం అమాయా రూపు తొడుక్కుందా అన్నట్టున్న ఆ పిల్లను చూసి ప్రేమలో పడ్తాడు. ఆమె మనసు గెలుచుకోవడానికి నానా తంటాలు పడ్తుంటాడు. అందులో భాగమే కెఫ్తీరియాలో లీలకు సహాయం చేస్తుండడం! ఓపెన్ మైండ్.. మోడర్న్ థింకింగ్ ఉన్నట్టు కనిపించే అమాయాతో సహచర్యం చేయాలని తపిస్తుంటాడు!
కాని తనపట్ల తల్లికి, రాఘవకున్న అభిప్రాయలు అబద్ధాలని తేల్చేస్తుంది అమాయా ..ఈ వయసులో తోడు కావాలనుకుంటున్నావ్ ఆఫ్టర్‌ ఆల్ ఫర్ సెక్స్? అన్న ఒకేఒక మాటతో!
ఖంగుతింటుంది లీల! మనిద్దరం ఒకరికొకరం చాలా అర్థమయ్యాం అనుకునేదాన్ని. కాని అపరిచితులం అని ఇప్పుడు అర్థమైంది అని బాధపడ్తుంది లీల. నా కూతురైతే చెంప చెళ్లుమనిపించే వాడిని అంటాడు జయంత్! ఓపెన్‌మైండ్ అండ్ మోడర్న్ గర్ల్‌గా ఉన్నట్టు నటిస్తావ్.. ఇదేనా నీ ఓపెన్‌నెస్? మీ అమ్మ విషయంలో నీ మాటతో నన్ను చాలా డిస్‌అప్పాయింట్ చేశావ్ అమాయా.. అంటాడు రాఘవ!
అమాయా కరుకు ప్రవర్తనకు, ఘర్షణకు కారణం.. వాళ్లమ్మ జయంత్‌తో ప్రేమలో పడడం. ఆ ఇద్దరు ఆ వయసులో పెళ్లితో ఒకటికావాలనుకోవడమే! ఆ నిర్ణయంతో అమాయా ప్రవర్తనలో మార్పువస్తుంది. తండ్రి అంటే అమాయాకు వల్లమాలిన ప్రేమ! తండ్రిపోయినా ఆ జ్ఞాపకాల్తో తను బతుకుతున్నట్లే తల్లీ బతకాలనుకుంటుంది. తన తండ్రి స్థానంలో ఇంకో పురుషుడిని తల్లి పక్కన ఊహించలేదు! ఆ సంఘర్షణతో మానసికంగా తల్లికి దూరమవుతూ ఉంటుంది. విచక్షణ కోల్పోతుంది. తండ్రి స్థానం ఆక్రమించుకుంటున్నట్టుగా ఊహించుకొని జయంత్‌నూ శత్రువుగా చూస్తుంది.
నిజానికి జయంత్ అమాయా అభిప్రాయాలను చాలా గౌరవిస్తుంటాడు. ఆమె తండ్రి స్థానాన్ని అతను కోరుకోడు. లీలను తనకు తోడుగా, తను ఆమెకు తోడుగా మాత్రమే కోరుకుంటాడు. తమ ఇద్దరి అనుబంధం గురించి అమాయాతో మాట్లాడమని లీల అడిగినా.. ఆమే అర్థంచేసుకోవాలికాని మనం కన్విన్స్‌చేసి ఒప్పించాల్సిన విషయంకాదంటాడు జయంత్!
అన్నట్టుగానే బోలెడంత మానసిక వేదన తర్వాత తల్లికోణంలోంచి ఆలోచించడం మొదలుపెడుతుంది అమాయా. నెమ్మదిగా లీల, జయంత్‌ల మధ్య ఉన్న ప్రేమను అర్థంచేసుకుంటుంది.
ఆధునికత అంటే మారిన టెక్నాలజీని మాత్రమే అడాప్ట్ చేసుకోవడం కాదు స్త్రీ, పురుష సంబంధాలను అవగతం చేసుకోవడం… ప్రేమ విషయంలో స్త్రీ స్వేచ్ఛను అంగీకరించడం… ఆమె మనసును అర్థంచేసుకోవడం.. ఆమె అవసరాన్నీ గుర్తించడం అని రుజువు చేస్తుంది లిజన్.. అమాయా!
నడివయసు.. ప్రేమలు అసహజం కావు! ఆ మాటకొస్తే తోడు కావాలనిపించేది ఆ వయసులోనే కదా. అయితే అమాయా అపోహ పడ్డట్టు నాట్ ఫర్ సెక్స్! మనిషి తాలూకు జ్ఞాపకాలు మనసు నిస్తేజం కాకుండా చూస్తాయేమో కాని జీవితాన్ని నడిపించలేవ్! పాత బంధాలను కలిపి ఉంచేది కచ్చితంగా పిల్లలే కాదనడంలేదు! అంతమాత్రాన ఒంటరైన తల్లో, తండ్రో ఇంకో తోడు కోరుకుంటే ముందు బంధానికి వచ్చిన ముప్పూలేదు! అసలామాటొకొస్తే ఈ రెండిటినీ పోల్చాల్సిన అవసరమూ లేదు! ప్రాక్టికల్‌గా అసాధ్యం కూడా! అవి వర్ణించుకోవడానికి బాగుంటాయంతే! పురుషుడు ఇంకో తోడు కావాలంటే సమాజం ఇలాంటివన్నీ కన్వీనియెంట్‌గా పక్కనపెట్టడంలేదా? ఆ స్వేచ్ఛ స్త్రీకి ఎందుకు లేదు? ఈ చర్చలన్నిటికీ లిజన్.. అమాయా మంచి డయాస్!

1360787547-listen_amaya_20130211
ప్రకతిలో ఇన్ని రంగులున్నా జీవితంలో రెండే రంగులు..బ్లాక్ అండ్ వైట్! ఇది ఈ సినిమాలో మాటే! ఈ నిజాన్ని గ్రహిస్తే మానవసంబంధాల్లోని మంచి, చెడులు కాదు సుఖదుఃఖాలు మాత్రమే తెలుస్తాయి! స్త్రీ ప్రేమించే హక్కుకు పూసిన నలుపు తెలుపుగా కనపడుతుంది! ప్రేమ అనంతం… ఎప్పుడైనా.. ఎక్కడైనా.. ఎలాగైనా పుట్టొచ్చు..దాన్ని అంగీకరించడం, వ్యతిరేకించడం కేవలం వ్యక్తిగతం! ఇది అర్థమైతే చాలు దాన్ని మోయాల్సిన బరువును సమాజం తప్పించుకున్నట్టే!
you dont always have to be  right.. you have to be happy అనే ట్యాగ్‌లైన్‌తో వచ్చిన లిజన్.. అమాయా సున్నితంగా మనసును తట్టి.. కళ్లను తడిచేసే అద్భుతప్రయోగం! ఈ చిన్న సినిమాను చూశాక పెద్ద ఆలోచన చేయకపోరు!
తన మొదటి సినిమానే ఓ ప్రయోగంగా మలచుకున్న దర్శకుడు అవినాశ్‌కుమార్ సింగ్ సాహసానికి హ్యాట్సాఫ్! అతని ఎక్స్‌పరిమెంట్ హండ్రెడ్ పర్సెంట్ సక్సెస్! గీతాసింగ్ కథకు మంచి న్యాయమే జరిగింది. అయితే అవినాశ్ క్రెడిట్‌లో సింహభాగం  సీనియర్ యాక్టర్స్ దీప్తినావల్, ఫరూఖ్ షేక్‌లదే! వాళ్లు నటించలేదు ఆ పాత్రల్లో బతికారు! అమాయాగా స్వరాభాస్కర్ సింప్లీ సూపర్బ్!

మొన్న ఫిబ్రవరిలో విడుదలైన ఈ సినిమా థియేటర్లలో కనిపించే అవకాశంలేదు! కాబట్టి డివీడీ దొరికితే డోంట్ మిస్సిట్! బాలీవుడ్‌లో కనిపించే ఇలాంటి ప్రయత్నాలు తెలుగుకి రావడానికి ఇంకో తరమైనా పట్టొచ్చు! అప్పటిదాకా కనీసం రచయితలైనా ఇలాంటి అంశాల మీద కథలు, నవలలు రాస్తే చర్చకు ఆస్కారం ఉంటుంది!

– సరస్వతి

తోపుకాడ (In a Grove)

akira-kurosava_500x330

పరిచయం: రషోమన్ సినిమా గురించి  పాఠకులకు పరిచయం అవసరం లేదనుకుంటా. ప్రఖ్యాత జపనీస్ దర్శకుడు అకిరా కురసోవా దర్శకత్వం వహించిన ఈ సినిమా వచ్చి యాభై ఏళ్ళు దాటినప్పటికీ నేటికీ ప్రపంచ సినీ ప్రేమకులు ఈ సినిమా చూసి విశ్లేషిస్తూనే వుంటారు. ఈ సినిమా Ryūnosuke Akutagawa రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించబడింది. ఇందులో మొదటి కథ పేరు రషోమన్. ఈ కథ లోని అంశాన్ని దాదాపు పూర్తిగా వదిలేసి కేవలం సెట్టింగ్ మాత్రమే ఉపయోగించుకున్నారు కురొసావా. ఇక రెండొ కథ ‘In a Grove’. రషోమన్ సినిమా మొత్తం దాదాపుగా ఈ కథ ఆధారంగానే నడుస్తుంది. ఇక్కడ ప్రత్యేకించి చెప్పుకోవాల్సిన విషయం ఏంటంటే కేవలం పది పేజీల కథను పూర్తి నిడివి చిత్రంగా మలిచిన కురొసావా ప్రతిభ అపూర్వం. ఇక ’నిజం’ అనే అంశాన్ని ’In a Grove’ లఘు కథలో అకుతగవా ప్రస్తావించిన తీరు అమోఘం. రషోమన్ సినిమాకి ఆధారమైన ’In a Grove’ కథకు తెలుగు అనువాదం ఇది.

******

న్యాయాధికారి ఎదుట కట్టెలుగొట్టువాని దృష్టాంతము

అవునయ్యా! ఆ శవం కనుక్కొంది ఖచ్చితంగా నేనే.

పొద్దుకాల, ఎప్పట్లాగే, కట్టెలు కొట్టుకొద్దామని అడవిలోకి పోయినా. అడివిలోకి కొంచెం దూరం పోంగానే పొదల్లో కనిపించింది సారూ శవం.

ఏడంటారా?

యమషినా రోడ్డుకి వంద గజాల దూరంలో వుందయ్యా ఆ చోటు. ఎదురు మొక్కలు, దేవదారు చెట్లతో నిండిపోయుంటాది ఆ చుట్టూతా.

నేను చూసే పాటికి శవం ఎల్లికల పడుందయ్యా. బులుగు రంగు సిలుకు బట్ట్టలు యేసుకుని వున్నాడా చచ్చిపోయినాయన! గుండెల్ని చీల్చిన కగ్గం గాయం వుండాది శవం పైన. చుట్టూ ఎదురు మొక్కల్నుండి రాలిన ఆకులు రకతం మరకలతో పడుండాయి.

లేదయ్యా నేను చూసేపాటికి రకతం కారటంలేదయ్యా!గాయం ఎండిపోయినాదనుకుంటా.

….ఆ అన్నట్టు మరిచిపోయినా, నేనొచ్చినాననిగూడా లెక్కచేయకుండా ఒక జోరీగ ఆడనే తిరుగుతావుండాది.

కగ్గం గానీ అట్లాంటి ఆయిధాలేమైనా ఆడసూసానా అని అడుగుతున్నారా అయ్యా?

లేదయ్యా.అట్టాంటిదేది లేదు. ఒక తాడు మాత్రం సెట్టుకిందపడివుండాది. ఆ….ఆ తాడు పక్కనే ఒక దువ్వెన కూడా పడివుండాది. అంతే, అయ్యి తప్ప నాకింకేమీ కనబడలే. సూస్తుంటే ఆయన సచ్చిపోయేముందుపెద్ద యుద్ధమే చేసినట్టున్నాడు. ఎందుకంటే అక్కడ గడ్డీ ఆకులు చెల్లాచెదరుగా పడివుండాయి.

గుర్రమా?

లేదయ్యా, ఆ పొదల్లోకి మనుషులు పోవడమే బహుకష్టం. ఇంక గుర్రమెట్టాపోద్ది?

న్యాయాధికారి ఎదుట బౌద్ధసన్యాసి దృష్టాంతము.

సమయమా?

ఖచ్చితంగా మిట్టమధ్యాహ్నం వేళ అయ్యుండవచ్చును. ఆ దురదృష్టవంతుడు సెకియామా నుండి యమషినా వెళ్ళేరోడ్డులో పయనిస్తున్నాడు. గుర్రంపై ఒక యువతిని కూర్చుండబెట్టి ఆయన సెకియామా వైపుగా నడకసాగించడం చూశాను. పరదా కప్పబడివుండడంచే ఆ యువతి మోమునైతే చూడలేకపోతిని గానీ ఆమె ధరించిన బట్టలు మాత్రం ఊదా రంగులో వుండడం గమనించితిని. ఆమె స్వారీ చేస్తున్న గుర్రం మాత్రం అతి సుందర కీసరము తో మేలైన జాతికి చెందినదైనట్టుగా వున్నది.

ఆ యువతి ఒడ్డుపొడుగులా?

నాలుగడుగులు దాటి ఐదంగుళాలుండొచ్చు. బౌద్ధసన్యాసిని కావడంచే ఆమెను అంతగా గమనించియుండలేదు. కానీ, అతను మాత్రం ఒక ఖడ్గం తో పాటు విల్లుబాణాలనూ ధరించివున్నాడు. పొదిలో ఇరవైదాకా బాణాలు కూడా వుండడం నాకు గుర్తుంది.

ఆ వ్యక్తికి ఇటువంటి దుర్గతి పడుతుందని అనుకోలేదు. వేకువవేళ మంచు బిందువులా, తలుక్కున మెరిసి మాయమయ్యే మెరుపులా మానవుని జీవితం కూడా అశాశ్వతమే. ఆతనిపై నా సానుభూతి చూపించుటకు నాకు నోటమాట వచ్చుటయే కష్టముగానున్నది.

*****

images

న్యాయాధికారి ఎదుట పోలీసువాని దృష్టాంతము.

నేను బంధించినవాడా?

వాడు తజొమరు అనబడే ఒక గజదొంగ. నేను బంధించేసమయానికి వాడు గుర్రముపైనుండి కిందపడి అవతగుచి వంతెన వద్ద మూలుగుతూ వున్నాడు.

సమయమా?

పోయిన రాత్రి వేకువజాము అయ్యుండొచ్చు. వీడిని గతంలో కూడా ఒక సారి బంధించే ప్రయత్నం చేసాను. కానీ తప్పించుకున్నాడు. నేను బంధించే సమయానికి బులుగు రంగు బట్టలు ధరించి వున్నాడు. ఇక వీడి దగ్గర వున్న విల్లు బాణాలు మీరు చూసేవున్నారు.

ఈ విల్లు బాణాలు ఆ మరణించిన వ్యక్తివి వలే వున్నాయని మీకూ అనిపించిందా?

అయితే ఖచ్చితంగా హంతకుడు వీడే!

ఇతని దగ్గర దొరికిన – తోలు తో చుట్టబడిన విల్లు, నల్లటి లక్కతో చేయబడిన పొది మరియు డేగ ఈకలతో చేయబడిన పదిహేడు బాణాలు – ఆ మరణించిన వ్యక్తివే అయ్యుంటాయని నా నమ్మకం.

గుర్రం గురించి మీరన్నది నిజమే!

అది జేగురు రంగులో మేలైన కీసరం తో ఉన్నది. పగ్గాలతో కట్టివేయబడని ఆ గుర్రం రాతి వంతెనకు కొంచెం దూరంలోనే గడ్డి మేస్తూ నాకు కనిపించింది. ఆ గుర్రం పై నుండి వీడు కిందపడి నా కంట బడడం తప్పకుండా విధి విధానమే!

ఈ క్యోటో ప్రాంతంలో ఎంతో మంది దొంగలు తిరుగుతున్నారు కానీ ఈ తజొమరు లాగా ఎవరూ మహిళలను వేదనకు గురి చేయటం లేదు. పోయిన ఏడాది పిండోరా పర్వత ప్రాంతంలో వున్న తొరిబె దేవాలయం సందర్శించడానికి వచ్చిన ఒక మహిళ, ఆవిడతో పాటే వున్న ఒక చిన్న పిల్ల హత్యకు గురికాబడ్డారు. ఆ హత్యల వెనుక కూడా తజొమరు హస్తం వుందని భోగట్టా!

మగవాడినే హత్య చేసిన వీడు ఆయన భార్యను ఏం చేసివుంటాడో అర్థం కావటం లేదు. దయచేసి ఆ విషయం గురించి కూడా మీరు విచారణ జరపాలని కొరుకుంటున్నాను.

******

న్యాయాధికారి ఎదుట వృద్ధురాలి దృష్టాంతము.

అవునయ్యా, ఆ శవం నా కూతుర్ని పెళ్ళాడిన వాడిదే.

ఆయన ఈ క్యోటో ప్రాంతానికి చెందిన వాడు కాదు. వకాసా రాజ్యంలోని కొకుఫూ పట్టణంలో సమురాయ్ గా వుండేవాడు. ఆయన పేరు కనాజవా నో టకెహికో,వయసు ఇరవై ఆరు. ఆయన చాలా నెమ్మదస్థుడు, ఇతరులకు కోపం తెప్పించేలా ప్రవర్తించి వుండడని నాకు గట్టి నమ్మకం.

నా కూతురా?

ఆమె పేరు మసాగో, వయసు పంతొమ్మిది. అదో చిలిపి చిచ్చుబుడ్డే కానీ టకెహికోని తప్పితే పరాయి పురుషులతో పరిచయమే లేదామెకి. దానిది చిన్నటి గుండ్రటి మొహం. ఎడమ కన్ను చివర్లో ఒక పుట్టుమచ్చ కూడా వుంటుంది.

నిన్న నా కూతురితో కలిసి వకాసాకి బయల్దేరాడు టకెహికో. ఇంతలోనే వారినిలా దురదృష్టం వెంటాడింది.

నా కూతురు ఏమయిందని అడుగుతున్నారా?

నా అల్లుడు చనిపోయాడని ఒప్పుకోక తప్పకపోయినా నా కూతురు ఎక్కడుందో ఎలా వుందో తలుచుకుంటేనే బాధేస్తుంది. ఆమె ఏమైపోయిందో ఎలానైనా తెలుసుకోండి. ఈ గజదొంగ తజోమరు పేరు తలవడానికే అసహ్యంగా వుంది. నా అల్లుడినే కాదు, కూతురిని కూడా వీడేమైనా…….(ఆపై ఆమెకు మాటలు పెగలక భోరున ఏడ్చేసింది).

******

images1

తజోమరు ఒప్పుకోలు

అతన్ని నేనే చంపాను; కానీ ఆమెను నేను చంపలేదు.

ఆమెక్కడికెళ్ళిందా?

ఏమో నాకు తెలియదు.

అయ్యో, ఒక్క నిమిషం ఆగండి.

నన్నెంత చిత్ర హింసకు గురిచేసినా నాకు తెలియని విషయం గురించి నన్నొప్పించలేరు. అయినా విషయం ఇంతవరకూ వచ్చింది కాబట్టి, అంతా ఉన్నదున్నట్టే చెప్పేస్తాను.

నిన్న మధ్యాహ్నం పూట వాళ్లని నేను మొదటి సారి చూసాను. అప్పుడే వీచిన చిరుగాలికి ఆమె మేలిముసుగు కొద్దిగా తప్పుకోవడంతో ఆమె మొహం ఒక క్షణం పాటు నా కంటపడి ఇంతలోనే ముసుగులోకి మాయమయింది. అందుకేనేమో ఆ క్షణంలో నాకామె బోధిసత్వునిలా అనిపించింది. ఆమెతో వున్న ఆ వ్యక్తిని చంపైనా సరే ఆమెను చెరబట్టాలని ఆ క్షణమే నిర్ణయించుకున్నాను.

ఎందుకా?

మీరనుకుంటున్నట్టు చంపడం అనేది నాకు గొప్ప పరిణామమేమీ కాదు.

ఒక యువతిని చెరబట్టాల్సివచ్చిననప్పుడు ఆమె తో వున్న మగవాడిని ఎలాగూ చంపాల్సిందే. ఇదిగో నాతో పాటు ఎప్పుడూ వుండే ఈ కత్తితోనే నేను హత్యలు చేసేది.

అయినా ప్రజలని చంపేది నెనొక్కడినేనా?

మీరు మీ కత్తులు ఉపయోగించి చంపకపోవచ్చు. మీ అధికారంతో ప్రజల్ని చంపుతారు. మీ డబ్బుతో ప్రజల్ని చంపుతారు. ఒక్కోసారి వారికి మంచి చేస్తున్నామనే సాకుతో వారిని చంపుతారు. నిజమే మీ హత్యల్లో రక్తపాతముండకపోవచ్చు. మీరు చంపిన వాళ్ళు కనబడడానికి బాగానే ఆరోగ్యంగానే వుంటారు కానీ శవాలైపోయాక ఏం లాభం. మనిద్దరిలో పెద్ద హంతకుడు ఎవరో తేల్చడం కష్టమే .(హేళనగా నవ్వుతూ)

కానీ మగవాడిని చంపకుండానే అతని ఆడదాన్ని చెరబట్టగలిగితే బాగానే వుంటుంది. అందుకే అతన్ని చంపకుండానే ఆమెను నా దాన్ని చేసుకుందామనే నేను నిర్ణయించుకున్నాను. కానీ అలా చేయడం యమషినా రోడ్డులో సాధ్యం కాదు. అందుకే ఆ జంటను కొండల్లోకి పయనించేలా ప్రలోభపెట్టదలచాను.

అది చాలా సులభంగా జరిగిపోయింది.

కొండల్లో ఒక తోపు దగ్గర ఖడ్గాలు, దర్పణాలతో కూడిన ఒక నిధి గురించి వాళ్ళకి చెప్పాను. నాతో పాటే వచ్చిన వారికి అతి కొద్ది సొమ్ముకే ఆ నిధిని అమ్ముతానని నమ్మబలికాను.

మరి….మీరే చెప్పండి, ఆశకు హద్దుంటుందా?

నేను చెప్పడం ముగించేలోపే అతను నా మాటలను నమ్మేశాడు. నేను వాళ్ళను కలిసిన అరగంట లోపే గుర్రంపై నాతో పాటే కొండల్లోకి ప్రయాణం సాగించారు.

కాసేపట్లోనే నేను చెప్పిన వెదురు తోపు దగ్గరకు చేరుకున్నాము.

నాతో పాటే వచ్చి ఆ నిధిని చూడమన్నాను. అత్యాశతో కళ్ళు మూసుకుపోయిన ఆ వ్యక్తి సరే అని ముందుకు కదిలాడు. కానీ ఆ యువతి మాత్రం గుర్రం తో పాటు అక్కడే ఎదురుచూస్తానంది.

అక్కడ పొదలు పొదలుగా ఎదిగిన వెదురు తోపుని చూసి భయపడి ఆమె అలా అనడం సహజమే అనిపించింది.

నిజానికి, అప్పటివరకూ నేను పన్నిన పథకం సజావుగానే సాగింది.

ఆమెనక్కడే వదిలేసి మేమిద్దరం ముందుకు సాగాం. వెదురు పొదలతో కప్పబడిన త్రోవలో కొంచెం సేపు ముందుకు నడిచాక చుట్టూ దేవదారు వృక్షాలతో కూడిన ఒక చదునైన ప్రదేశం చేరుకున్నాము. నా పథకం అమలు పరచడానికి అదే అనువైన ప్రదేశం అని నిర్థారించుకుని, నేను చెప్పిన నిథి ఆ చెట్లకింద పొదల్లో పాతిపెట్టివుందని అబద్ధం చెప్పాను. నా మాట వినగానే నన్ను తోసుకుంటూ ఆక్కడికి పరిగెట్టాడా వ్యక్తి. అతనక్కడికి చేరుకోగానే వెనకమాలుగా అతన్ని బంధించాను. అతను బలిష్టుడు, కత్తి పట్టిన వీరుడూ కావడంతో కొంచెం కష్టపడాల్సి వచ్చింది. నేను చేసిన పనికి అతను డంగైపోయాడు. వెంటనే నేనతన్ని ఒక దేవదారు వృక్షానికి కట్టిపడేసాను.

నా దగ్గర సమయంలో తాడెక్కడిదనా మీ అనుమానం?

దేవుడి దయవల్ల దొంగని కావడంతో ఏ సమయంలో ఏ గోడ దూకాల్సి వస్తుందోనని ఒక తాడు నాదగ్గర ఎప్పుడూ వుంటుంది. అలాగే అరిచి కేకలు పెట్టకుండా అక్కడున్న ఎండుటాకులతో అతని నోరు మూసేశాను.

అతన్నక్కడే వదిలేసి ఆమె వున్న ప్రదేశానికి చేరుకున్నాను. ఆమె భర్త అకస్మాత్తుగా ఏదో రోగాన పడ్డాడని అబద్ధం చెప్పి ఆమెను నాతో రమ్మన్నాను.

ఈ పథకం కూడా పారిందని మరోసారి చెప్పక్కర్లేదనుకుంటా.

ఆ యువతి తన మేలి ముసుగు తొలిగించి నా వెంట నడిచింది.

ఆమె చెయ్యిపట్టి నేను పొదల్లోకి దారితీశాను. కట్టివేయబడ్డ తన భర్తను చూడగానే ఆమె తన వద్ద వున్న బాకుతో నాపై తిరగబడింది. అంతటి తీవ్ర ఆగ్రహం కలిగిన ఆడదాన్ని నేను జీవితంలో చూడలేదు. నేను అప్రమత్తంగా వున్నాను కాబట్టి సరిపోయింది కానీ లేదంటే నా డొక్కలో పొడిచివుండేది. నేను తప్పించుకుంటూనే వున్నా, ఆమె మాత్రం నాపై దాడి చేస్తూనే వుంది. ఇంకొకరైతే ఆమె చేతిలో చావడమో లేదా తీవ్రంగా గాయపడడమో జరిగి వుండేది.

కానీ నేను తజోమరుని!

నా ఖడ్గం దుయ్యకుండానే ఆమె బాకుని నేలరాల్చాను. ఎంతటి ధైర్యవంతురాలయిన మహిళ అయినా, ఆయుధం లేకపోవడంతో డీలాపడిపోయింది. మొత్తానికి ఆమె భర్తను చంపకుండానే అమె పై నా వాంఛను తీర్చుకొన్నాను.

అవును….అతన్ని చంపకుండానే!

అతన్ని చంపాలనే కోరిక నాకస్సలు లేదు.

దు:ఖసాగరంలో మునిగివున్న ఆమెనక్కడ వదిలి, నేను తోపుదగ్గర్నుంచి పారిపోవాలనుకుంటుండగా, అమె పిచ్చిపట్టిన దానివలే నా చేతులు గట్టిగా పట్టుకుంది. తడబడే మాటలతో తన భర్తో లేదా నేనో ఎవరో ఒకరు చచ్చిపోవాలంది. ఇద్దరి లో ఎవరు బతికుంటారో వాళ్ళకే తను భార్యగా మిగుల్తానని ఒగర్చింది. దాంతో అతన్ని చంపాలనుకునే ఆవేశం నన్నావరించింది. (విషాదంతో కూడిన ఉద్వేగం)

ఇలా చెప్పడం వల్ల, మీకంటే నేనే క్రూరమైన వాడినని మీకనిపించడంలో అనుమానం లేదు.

కానీ ఆ సమయంలో మీరామె కళ్ళు చూసుండాల్సింది.

ముఖ్యంగా ఆ క్షణంలో జ్వలించే ఆమె కళ్ళల్లోకి చూస్తూ, నా పై పిడుగుపడ్డా సరే, ఆమెను నా భార్యను చేసుకోవాలనుకొని నిర్ణయించుకున్నాను. ’ఎలా అయినా అమెను నా భార్యను చేసుకోవాలి’…….ఆ కోరిక నా మదిని ఆవరించింది.

అది కేవలం కామం అని మీరనుకోవచ్చు. ఆ సమయంలో నాకు కామం తప్ప మరో ఆపేక్ష లేనట్టయితే, అమెనక్కడే తోసేసి పారిపోయేవాడిని. అప్పుడు నా కరవాలానికి రక్తపు మరకలంటి వుండేవి కావు. కానీ ఆ తోపు దగ్గర మసక వెలుతురులో ఆమె మొహం చూసిన క్షణమే, అతన్ని చంపకుండా అక్కడ్నుంచి కదలకూడదని, నిర్ణయించుకున్నాను.

కానీ అన్యాయంగా అతన్ని చంపడానికి నేను పాల్పడలేదు.అతని కట్లు విప్పి నాతో కత్తి దూయమని చెప్పాను.(అప్పుడు నేనక్కడ పడేసినదే దేవదారు చెట్టు కింద దొరికిన తాడు)

కోపంతో మండిపడి అతను తన ఖడ్గాన్ని బయటకి తీశాడు. ఒక్క మాటైనా మాట్లాడకుండా, అలోచనకంటే వేగంగా, నన్ను పొడవడానికొచ్చాడు.

మా ఇద్దరి మధ్య జరిగిన పోరాటం యొక్క పరిణామం మీకు చెప్పక్కర్లేదనుకుంటా!

ఇరవై మూడవ వేటు!

దయచేసి గుర్తుంచుకోండి.

ఈ విషయం నన్నిప్పటికీ నిర్ఘాంతపరుస్తుంది. ఈ భూమ్మీద ఇరవై మూడు సార్లు నా మీద కత్తి దూసిన వారెవ్వరూ లేరు.(హుషారు గా నవ్వుతూ)

అతను నేల రాలాక, రక్తం అంటిన నా ఖడ్గాన్ని నేలకు దించి, ఆమె వైపు తిరిగాను.కానీ ఆమెక్కడ లేకపోవడం చూసి విస్తుపోయాను.ఆమె ఎక్కడికి వెళ్ళిందో అని ఆశ్చర్యపోయాను. అక్కడున్న పొదల్లో ఆమె కోసం వెతికి చూశాను. ఎక్కడైనా అలికిడవుతుందేమోనని నిక్కబొడిచి విన్నాను;చావుబతుకుల్లో ఉన్న ఆ వ్యక్తి మూలుగులు తప్ప మరే శబ్దమూ వినరాలేదు.

మేము కత్తులు దూసినప్పుడే, సహాయం కూడగట్టడంకోసం ఆమె తోపులోపడి పారిపోయుండొచ్చు.

అలా ఆలోచించగానే అది నా చావు బతుకుల సమస్యగా నిర్ణయించుకుని, అతని ఖడ్గం తో పాటు విల్లు బాణాలూ అపహరించి కొండమార్గం గుండా కిందికి చేరుకున్నాను.

అక్కడే ప్రశాంతంగా గడ్డి మేస్తున్న వారి గుర్రం కనిపించింది.

ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పడం అనవసర శ్రమ అనుకుంటా!

కానీ నగరంలోకి ప్రవేశించకముందే అతని ఖడ్గాన్ని వదిలించుకున్నాను.

ఇదే నా ఒప్పుకోలు!

నా తలను ఎలాగూ ఇనుప గొలుసుకెక్కిస్తారని తెలిసే చెప్తున్నాను, నన్ను కఠినంగా శిక్షించండి!(అవిధేయమైన దృక్పథం తో)

*****

rashomon3

షిమిజూ దేవాలయాన్ని సందర్శిచవచ్చిన ఒక యువతి ఒప్పుకోలు

నీలం రంగు కిమోనో ధరించిన ఆ వ్యక్తి, నన్ను తన వశం కమ్మని బలవంతం చేస్తూ, అక్కడ కట్టివేయబడిన నా భర్త వైపు చూస్తూ వెకిలిగా నవ్వసాగాడు. నా భర్త ఎంతటి దిగ్భ్రమకు గురైవుంటాడో! బలం పెట్టి కట్లు తెంపుకోడానికి ఎంత యాతనపడ్డా కూడా తాడు ఆయన్ని మరింత బిగువుగా కట్టేసింది. నా గురించి మర్చిపోయి నా భర్త వైపుకు పరిగెట్టాను. లేదా పరిగెడ్దామని ప్రయత్నించాను, కానీ ఆ వ్యక్తి నేనక్కడకు చేరకముందే నన్ను కిందపడేశాడు.సరిగ్గా అప్పుడే నా భర్త కళ్ళల్లో వర్ణించనలివి గాని వెలుగును చూశాను. అది మాటల్లో వ్యక్తీకరించలేనిది….అతని కళ్ళు ఇప్పుడు తలుచుకున్నా నా ఒళ్ళు జలదరిస్తుంది. ఆ క్షణంలో నా భర్త విసిరిన చూపుతో, ఒక్క మాటయినా మాట్లాడకుండానే, అతని హృదయాన్ని నాముందుంచాడు. ఆయన కళ్ళల్లోని ఆ వెలుగు – అటు కోపమూ కాదు, ఇటు బాధా కాదు – ఒక విచిత్రమైన వెలుగు; రోతతో నిండిన ఒక చూపు! ఆ దొంగ చేసిన ఘాతుకం కంటే నా భర్త చూపు చేసిన విఘాతం తట్టుకోలేక గట్టిగా అరుస్తూ స్పృహ కోల్పోయాను.

నాకు మెలుకువ వచ్చేసరికి నీలం రంగు బట్టలు ధరించిన వ్యక్తి అక్కడ్నుంచి వెళ్ళిపోయాడు. నా భర్త మాత్రం ఇంకా దేవాదరు వృక్షానికి కట్టివేయబడివుండడం చూశాను. వెదురు ఆకులను తొలగించుకుంటూ ఎలాగో కష్టపడిలేచి నా భర్త మొహంలోకి చూశాను;కానీ ఆయన కళ్ళల్లో ఇదివరకటి భావమే తొణికిసలాడింది.

అవజ్ఞత నిండిన ఆయన కళ్ళ వెనుక విపరీతమైన ఏవగింపు నిండివుంది.లజ్జ, అంతర్వేదన, కోపం….అప్పుడు నేననుభవించినది ఇప్పుడు వర్ణించలేకపోతున్నాను. తడబడుతున్న అడుగులతో, నా భర్తను చేరుకున్నాను.

టకెజిరో! విషయం ఇంతవరకూ వచ్చాక ఇక నేను నీతో బతకలేను.నేను చనిపోవాలని నిర్ణయించుకున్నాను…కానీ నువ్వు కూడా చనిపోవాలి. నువ్వు నా అధోముఖాన్ని చూశావు. నువ్వున్న పరిస్థితుల్లో నీవు బతికుండడం భరించలేను” అన్నాను.

అంతకంటే మరోమాట మాట్లాడలేకపోయాను. అప్పటికీ ఏవగింపు మరియు జుగుప్స నిండిన కళ్ళతో ఆయన నన్ను చూడసాగాడు. ముక్కలయిన హృదయంతో, ఆయన ఖడ్గం కోసం వెతికాను. అది ఆ దొంగ తీసుకెళ్ళుండవచ్చు. ఆయన ఖడ్గం కానీ, విల్లుబాణాలు కానీ ఆ తోపు పరిసరాల్లో కనిపించలేదు. కానీ అదృష్టం కొద్దీ నా బాకు నా కాళ్ళ దగ్గరే పడివుంది. దానిని తల వద్దకు ఎత్తిపెట్టి “మీ ప్రాణాలు నాకర్పించండి. తక్షణమే నేనూ మీ వెంటనే నడుస్తాను” అన్నాను.

ఈ మాటలు వినగానే ఆయన అతికష్టం మీద పెదవులు కదిపాడు. ఆకులతో కుక్కబడిన ఆయన నోటివెంట వెలువడ్డ మాటలు సరిగ్గా వినబడలేదు కానీ ఆయన మాటలు నాకు వెను వెంటనే అర్థమయ్యాయి.ఏవగింపు నిండిన అతని కళ్ళు “నన్ను చంపెయ్” మన్నట్టుగా చూశాయి. స్పృహలోనూ లేక ఆదమరచీ ఉండని ఒక స్థితిలో, నా బాకును ఊదారంగు కిమోనో ధరించిన ఆయన గుండెల్లో దింపాను.

ఈ సమయంలో నేను తిరిగి స్పృహ కోల్పోయివుండొచ్చు.

తిరిగి నేను కళ్ళు తెరిచే సరికి, తాడుతో బంధింపబడివుండగానే-ఆయన తన చివరి శ్వాస వదిలిపోయాడు. దట్టమయిన దేవదారు మరియు వెదురు ఆకుల సందుల్లోంచి వస్తున్న ఒక సూర్య కిరణం వివర్ణమయినా ఆయన మొహం పై పడి మెరిసింది. పెల్లుబుకుతున్న దు:ఖాన్ని దిగమింగుకుని ఆయన శవాన్ని చుట్టివున్న ఆ తాడు ఊడదీశాను.

ఆ తర్వాత….ఆ తర్వాత ఏం జరిగిందో చెప్పే శక్తి నాలో ఇంకా మిగిలిలేదు.

నాకు చనిపోయే శక్తి కూడా మిగల్లేదని మాత్రం చెప్పగలను. నా దగ్గరున్న బాకుతో గొంతు కోసుకున్నాను, అక్కడే వున్న సరస్సులో దూకాను, ఇంకా చాలా విధాలా ప్రయత్నించాను.నా జీవితం ముగించలేక అప్రతిష్టతో ఇలా జీవితం కొనసాగిస్తున్నాను. (వివిక్తంగా నవ్వుతూ) అత్యంత దయార్ద్ర అవలోకితేశ్వరులు కూడా దయచూపించలేని అప్రాచ్యురాలినై వుంటాను.

నా భర్తను నా చేతులారా చంపాను. ఆ దోపిడి దొంగ చే చెరచబడ్డాను. ఇప్పుడు నేనింకేం చెయ్యగలను? ఇంక నేనేం…నేను….(వెక్కి వెక్కి ఏడవసాగింది.)

*****

సోదిగత్తె ద్వారా హత్యగావించబడ్డ వ్యక్తి చెప్పిన కథనం

నా భార్యను చెరిచిన తర్వాత ఆ దోపిడీదారు అక్కడే కూర్చుని ఆమెతో ఓదార్పు మాటలు మొదలుపెట్టాడు. నేను ఒక్కమాటైనా మాట్లాడలేకపోయాను. నేను దేవదారు వృక్షానికి గట్టిగా కట్టివేయబడి వున్నాను. అప్పటికీ ఆమెకేసి చూస్తూ “ఆ దగాకోరు మాటలు నమ్మొద్దు” అని కనుసైగల ద్వారా తెలియచేసే ప్రయత్నం చేశాను. అలా ఎన్నో సార్లు ఆమెకు ఈ విషయం తెలియచెప్పాలని చూశాను. కానీ అప్రసన్నురాలై వెదురు ఆకులపై కూర్చున్న నా భార్య వంచిన తలయెత్తకుండా, చూపులు ఒడిలోనే కేంద్రీకరించింది. ఆమె వాలకం చూస్తే, అతని మాటలు వింటున్నట్టే అనిపించింది. అసూయతో కలతచెందాను. ఈ లోగా ఆ దగాకోరు తెలివిగా ఆ మాటా ఈ మాటా ప్రస్తావిస్తూ వచ్చాడు. చివరికి ఆ దోపిడిదారు తెగించి “ఒకసారి నీ శీలానికి కలంకం కలిగాక, నీ భర్తతో ఎలాగూ సరిగ్గా మెలగలేవు. అందుకే నా భార్యవు కారాదూ? నేనీ అఘాయిత్యానికి తలపడడానికి కారణం నీమీద నాకున్న ప్రేమే”, అని సిగ్గువిడిచి అడిగేశాడు.

ఆ పాతకుడలా చెప్తుండగా, వివశత్వంతో తలెత్తింది. ఆ క్షణంలో కనిపించినంత అందంగా ఆమె మరెప్పుడూ కనిపించలేదు. నేనక్కడ చెట్టుకు కట్టివేయబడివుండగా అందగత్తె అయిన నా భార్య వాడికేమని సమాధానం చెప్పిందో? నేనిప్పుడు ఈ శూన్యంలో కలిసిపోయుండవచ్చు, కానీ ఇప్పటికీ ఆమె సమాధానం తలచుకుంటే కోపం అసూయలతో నిండా రగిలిపోతుంటాను. “నువ్వెక్కెడికెళ్తే నన్నూ నీ వెంట తీసుకెళ్ళ” మని ఆమె చెప్పింది.

ఆమె పాపం ఇది మాత్రమే కాదు.అది మాత్రమే అయ్యుంటే ఈ చీకటిలో నేనింత బాధింపబడివుండేవాడిని కాదు. ఆ రోజు కలలోలాగా వాడితో చేతిలో చెయ్యేసుకుని తోపు లోనుంచి నడిచివెళ్తూన్న ఆమె మొహం ఒక్కసారిగా వివర్ణమయింది. నా వైపు చూపించి “వాడ్ని చంపు.వాడు బతికున్నంతవరకూ నేను నిన్ని పెళ్ళి చేసుకోలేను” అని అంది. “వాడ్ని చంపు”, అంటూ పిచ్చెక్కిన దాని వలె అరిచింది. ఇప్పటికీ ఆ అరుపులు నా చెవులో మ్రోగి నన్ను అధ:పాతాళానికి చేరుస్తాయి. ఇంతకంటే ఏహ్యమైన మాటలు మరే మానవమాత్రుల నోటి నుంచైనా గతంలో వెలువడివుంటాయా? ఇంతకుమించిన శాపనార్థాలు మరే మానవమాత్రుడైనా వినివుంటాడా? ఎప్పుడైనా ఎవరైనా ఇలాంటి…..(జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) అప్పుడామెన్న మాటలకు ఆ బందిపోటు కూడా వివర్ణుడైనాడు. అతని చేతులు పట్టుకుని “వాడ్ని చంపెయ్” అంటూ ఏడ్చింది. ఆమె వైపు కఠినంగా చూస్తూ అతను కాదనలేదు, అవుననలేదు….ఏం చెప్తాడా అని ఆలోచన కూడా నాలో మొదలవ్వకముందే ఆమెను వెదురు కొమ్మలపైకి నెట్టాడు.(మరో సారి జుగుప్సతో నిండిన కేక పెడ్తూ.) మౌనంగా చేతులు కట్టుకొని అతడు నా వైపు చూసి “మీరయితే ఆమెనేం చేసుండేవారు? చంపడమా వదిలేయడమా? మీరు తలూపండి చాలు. ఆమెను చంపెయ్యనా?” అనడిగాడు. కేవలం ఈ మాటల కోసమే నేనతని నేరాన్ని క్షమించగలను.

నేనేం చెప్పాలో తడబడుతుండగా, ఆమె కెవ్వుమని అరుస్తూ తోపు లోకి పారిపోయింది. ఆమెను ఒడిసి పట్టుకోడానికి ఆ దొంగ ప్రయత్నించాడు కానీ అప్పటికే ఆమె అతని చేజారిపోయింది.

ఆమె పారిపోయాక అతను నా ఖడ్గం తో పాటు నా విల్లు బాణాలు తస్కరించి ఒక్క వేటుతో నన్ను బంధించిన తాడు కట్లు తెంపుతూ, “ఇప్పుడు ఇక నా రాత ఎలా రాసుందో” అని గొణుక్కుంటూ అక్కడ్నుంచి మాయమయ్యాడు. ఆ తర్వాత అక్కడంతా నిశ్శబ్దం. లేదు, ఎవరిదో ఏడుపు వినిపించింది. మిగిలివున్న నా కట్లు విప్పుకుంటూ చెవులు రిక్కించి విన్నాను. ఆ ఏడుపు నాలోనుంచే వస్తుందని గ్రహించాను. (చాలా సేపు మౌనం.)

అలసిపోయిన నా శరీరాన్ని దేవదారు వృక్షపు మొదలు నుంచి లేవదీసాను.నా ఎదురుగా నా భార్య వదిలి వెళ్ళిన ఆమె బాకు మెరుస్తూ కనిపించింది. అది తీసుకొని నా రొమ్ములో పొడుచుకొన్నాను. ఒక రక్తపు ముద్ద నా గొంతులోనుంచి ఎగబాకినా కూడా నాకు నొప్పి తెలియలేదు.కాసేపటికి నా రొమ్ము చల్లబడ్డాక అక్కడ శ్మశాన నిశ్శబ్దం నెలకొంది.  పర్వతాల నడుమ ఉన్న ఈ సమాధి పై ఎగురుతూన్న ఒక చిన్న పక్షి అరుపు కూడా లేక అక్కడ గాఢమైన నిశ్శబ్దం తాండవించింది. కేవలం ఒక ఒంటరి కిరణం దేవదారు వృక్షాలపై మెరుస్తూ కొండలపై చేరింది. క్రమంగా ఆ వెలుగు మాయమవ్వసాగింది; దాంతోపాటే దేవదారు మరియు వెదురు వృక్షాలు నా చూపునుంచి దూరమయ్యాయి. నేనక్కడ పడుకొని వుండగా నిశ్శబ్దం దుప్పటిలా నన్నావరించింది.

ఇంతలో ఎవరో నాపైకి ఎగబ్రాకారు. ఎవరో చూద్దామని ప్రయత్నించాను. కానీ అప్పటికే చీకటి నన్ను చుట్టుముట్టేసింది. ఆ వచ్చిన వారెవరో….ఎవరో కానీ నా రొమ్మున గుచ్చుకొన్న బాకును నెమ్మదిగా అక్కడనుంచి తొలగించారు.అప్పుడు మరోసారి రక్తం నా నోట్లోకి ఎగబాకింది. అప్పుడు నేను శాశ్వతాంధకారంలో మునిగిపోయాను.

-అయిపోయింది-

                                                                                                                అనువాదం: వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

వెంకట్ శిద్దారెడ్డి

 

మనం వెతుక్కుంటూ వెళ్ళాల్సిన ‘మల్లెల తీరం’!

చలం రచించిన ‘సావిత్రి’ లో సావిత్రి, సత్యవంతుడిని చూసి “మనస్సులు ఎప్పుడో కలిసాయి, మరణం ఒక్కటే మిగిలివుంది” అని అంటుంది. ఈ మాటల స్ఫూర్తితోనేismail“మల్లెలతీరంలో సిరిమల్లెపూవు” అనే సినిమా తీసాను అని ఒక ఇంటర్వ్యూలో అంటాడు ఈ చిత్ర దర్శకుడు జి.వి.రామరాజు.  చాలా కాలం నుంచీ ఫేస్ బుక్ లో ఈ సినిమా గురించి కొంతమంది నోట వింటూ వస్తున్నాను. దాదాపు అందరూ ఈ సినిమాని ఆకాశానికి ఎత్తేసే విధంగా మాట్లాడుతూ ఉంటే ఈ సినిమా అంత బాగుందా అనుకొనేవాణ్ణి. ఈ మధ్యన డాలస్ వెళ్లినప్పుడు పనికట్టుకొని మరీ చూసి వచ్చానీ చిత్రాన్ని. మొదట ఈ సినిమా పేరు “మల్లెలతీరం” మాత్రమే, కానీ “సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు” సినిమా వచ్చాక పేరు మార్పుకు గురైంది. అలా అన్నా ఈ సినిమా పేరు కొద్దిగా ప్రజల నోళ్లలో నాని, సినిమా చూసేందుకు వస్తారని చిత్ర యూనిట్ ఊహ కాబోలు. కానీ నా వరకైతే ఈ సినిమా టైటిల్ “మల్లెలతీరమే” బాగుంది.
ఇక సినిమా కథ విషయానికి  వస్తే, “ఓ అందమైన అమ్మాయి, అంతకన్నా అందమైన మనస్సున్న అబ్బాయి, డబ్బే ప్రాధాన్యం అనుకొనే ఆ అమ్మాయి భర్త వీరి ముగ్గురి నడుమ జరిగిన కథే ఈ చిత్ర కథ.” ప్రతి అమ్మాయికి ఉన్నట్లే కలల రాకుమారుడు ఈ అమ్మాయికీ ఉన్నాడు. కానీ ప్రతీ కల నిజం కాదు. జీవితం ఎన్నెన్నో సర్దుబాట్లు నేర్పుతుంది. కానీ అందగాడు, తెలివైన వాడు, డబ్బు బాగా సంపాదించేవాడు అయిన భర్త దొరికితే ఏ ఆడపిల్లయినా సంతోషంతో పొంగిపోతుంది. ఇది మన సమాజం గిరిగీసి పెట్టుకొన్న నియమాల్లో ఒకటి. మరి ఇవన్నీ ఉన్నా తనకు కావాల్సినది లేని పెళ్లిలో ఆ అమ్మాయి ఎలా సర్దుకుపోవాలి? లేదా తన వ్యక్తిగత స్వేచ్చకు ప్రాధాన్యం ఇవ్వాలా? ఇలాంటి ప్రశ్నలకు జవాబివ్వాలనే ప్రయత్నమే ఈ సినిమా. అలా అని ఇదే సరైన సమాధానం అని ఎవరూ అనుకోక్కర్లేదు. కథ కన్నా కథనం, అంతకన్నా తాత్విక దృష్టి కలిగిన సంభాషణలు, మృదువైన సంగీతం, అందులో పాలు నీళ్లులా కలసిపోయిన సాహిత్యం, వీటన్నిటినీ ఓ దృశ్యకావ్యంలా తీసిన ఛాయాగ్రహణం…ఈ సినిమాని ఓ కళాఖండంగా నిలబెట్టాయి.
సగటు తెలుగు సినీ ప్రేక్షకుడు ఈ సినిమా చూస్తే చాలా నిదానంగా, ఏ మాత్రం వినోదం లేకుండా, ట్విస్టులు-బ్యాంగులు-ఐటం సాంగులు లేని చప్పిడి కూడులా అనిపించవచ్చు. కొద్దో గొప్పో ఈ తరహా సినిమాలు ఇష్టపడే  ప్రేక్షకులు కూడా కథనం సాగదీసినట్లు ఉందని కొన్ని కొన్ని సన్నివేశాల్లో అనుకొనే ప్రమాదమూ ఉంది. కానీ నావరకు ఈ సినిమాలో నన్ను కట్టిపడేసిన అంశాల్లో మొదటిది అమ్మాయి అందం కన్నా, తన ఆహార్యం. తను కట్టుకొన్న చీరలు, ఆ-కట్టుకొన్న విధానం, పొందిగ్గా ఉన్న జడ, సింపుల్గా ఓ జత గాజులూ, మెడలో ఓ నల్లపూసల గొలుసూ అంతకన్నా ముఖాన తాండవించే అందమైన నవ్వు, సమ్మోహనపరిచే మార్దవమైన మాటలు…ఏ కృష్ణశాస్త్రి పుస్తకంలో నుంచో నడచివచ్చిన కావ్యకన్యకలా ఉంది శ్రీదివ్య.
భర్తగా నటించిన జార్జి తన పాత్రకు తగ్గట్టు నటించాడు. లేనితనంలో అనుభవించిన కష్టాల వల్లో, మనకు తెలియని (ఈ సినిమా కథానాయిక పరంగానే సాగుతుంది) అనుభవాల వల్లో తనకు సంబంధించి రెండే ముఖ్య విషయాలు 1.నేను 2. డబ్బు. తను బాగుండాలి, సాధ్యమైనంత డబ్బు సంపాదించాలి. కట్టుకొన్న భార్య ఈ ఈక్వేషన్లో లేకపోవడం తనకు మైనస్సో, ప్లస్సో తేలీనంత బిజీలో జీవితం గడుపుతుంటాడు. అతన్ని ఇచ్చి పెళ్ళి చేసిన అమ్మాయి తండ్రి దృష్టిలోనూ, సమాజం దృష్టిలోనూ అతను ఆదర్శ భర్తే కానీ కాపురం చేయాల్సిన భార్య దృష్టిలో కాదు.
ఇక ఓ పాటల రచయితగా, భావుకత్వం నిండిన ఓ యువకుడిగా క్రాంతి చాలా చక్కగా నటించాడు. కానీ తను ఎక్కువ సేపు ఆ అమ్మాయి ఏం చెప్పితే దానికి తలూపే వ్యక్తిగానే ఈ సినిమాలో కనబడతాడు. (ఇది కథలో నాకు నచ్చని అతికొద్ది విషయాల్లో ఒకటి. మనలోమన మాట, అమ్మాయి ఏం చెబితే దానికి తలూపే అబ్బాయి ఉంటే ఏ అమ్మాయికి మాత్రం నచ్చడేంటీ;-)  ఈ అబ్బాయి ఆ అమ్మాయి స్నేహితురాలింట పరిచయమౌతాడు. ఆ స్నేహం ఒకరితో ఒకరు గంటల తరబడి మాట్లాడుకొనే దాకా వస్తుంది. సినిమా మొత్తం మీద ఇద్దరు ఎన్ని సార్లు ఒంటరిగా కలుసుకొన్నా ఎవరి హద్దుల్లో వారుంటారు.
ఇద్దరి భావాలు ఒక్కటే అవడంతో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, నచ్చిన పాటలు పాడుకోవడం, ఒకరి విషయాలు మరొకరితో పంచుకోవడం ఇలా సాగిపోతూ ఉంటుంది. అది ఎప్పుడు స్నేహం నుంచీ ప్రేమగా మారిందో ఇద్దరికీ తెలియకుండానే అందులో మునిగిపోతారు. ఇందులో అమ్మాయి ఓసారి తన స్నేహితురాలితో అంటుంది “నేను ఏ అందమైన మనిషిని కలిసినా నాకు తోడుగా ఓ పాటుంటుంది, కానీ తనని చూసినప్పుడల్లా ప్రపంచమే పాటగా అనిపిస్తుంది.” మళ్లీ ఒకసారి ఆ అబ్బాయితో అంటుంది,”నిన్ను కలసినప్పుడు నాకు ఏ పాటా గుర్తుకు రాలేదు” అని. “అలా ఏం?” అని ఆ అబ్బాయి అడిగితే “నేనే నువ్వైనప్పుడు నాకు పాటెలా గుర్తొస్తుంది” అని అంటుంది. ఇలా వారిద్దరి మధ్య ప్రేమను అద్వైతంలా చిత్రీకరిస్తాడు దర్శకుడు.
ఇంట్లో భర్తతో సంసారబంధం లేకపోగా, (నీకు నచ్చకపోతే నిన్ను తాకనైనా తాకను అనే మంచి విలన్(?) ఆమె భర్త) ఫారిన్ ట్రిప్పులు, కొత్త వ్యాపారావకాశాలతో వీరిద్దరి మధ్య ఉన్న అగాధం మరింత పెరుగుతుంది. అది ఆమె విడాకులు కోరేవరకు వెళుతుంది. అప్పుడు ఆ భర్త తీసుకొనే నిర్ణయం ఏంటి? ఆమె ఆ నిర్ణయానికి ఒప్పుకొందా? వారిద్దరి ప్రేమ ఎలా ముగిసింది? ఇవన్నీ తెలియాలంటే మిగతా కథ మీరు తెరపై చూడాలి.
mallela
ఇందులోని కొన్ని ఆలోచింపచేసే మాటలు:
‘నాకు తెలిసి ఈ ప్రపంచంలో మనసు కన్నా అందమైనది ఏదీ లేదు. ఆ మనసుని వెతుక్కుంటూ వెళ్తే ఎన్నో తీరాలు కనిపిస్తాయి. వాటిల్లో మల్లెల తీరం ఒకటి” (హీరోయిన్‌తో క్రాంతి)
‘ప్రేమ, మనసు, ఆకాశం -వీటిని నచ్చిన విధంగా వర్ణించుకోవచ్చు కానీ, హద్దులు గీయలేం’(హీరోయిన్‌తో క్రాంతి)
‘సంపాదించు…కానీ లైఫ్‌ను బిజినెస్‌చేయకు’ (భర్తతో కథానాయిక)
‘భార్యగా అవడం వేరు. భార్యగా బతకడం వేరు’’ (కథానాయిక)
‘కోపం కూడా ఒక ఫీలింగే.. నాకు తన మీద అది కూడా లేదు’’ (భర్త గురించి నాయిక)
‘మానవ సంబంధాలు గ్యారంటీలతో రావు, మనమే పోషించుకోవాలి’’ (హీరోయిన్‌తో క్రాంతి)
ఇక పాటల వరకూ ఎంతో ఆహ్లాదమైన సంగీతం, సున్నితమైన సాహిత్యం బంగారానికి తావి అబ్బినట్లు అమిరాయి.
1. నీ నీడనా.. ఇలా నడవనా…
2. మబ్బులు కురిసే..మొగ్గలు విరిసే…
3. అలా చందమామనై..ఇలా చేతికందనా…
4. మాటకందని పాటలా మనమిద్దరూ కలిశాముగా…
5. పిల్లగాలుల పల్లకిలో..మల్లె వధువై నీలో చేరి…
మొత్తానికి ఓ మంచి సినిమా చూసిన అనుభూతి కలిగినా, ఈ సినిమా కథ కొని ప్రశ్నలను మిగిలిస్తుంది. ఒక సమీక్షకుడన్నట్లు -“పురుషుడు ఏ స్వేచ్ఛనైతే తన హక్కుగా భావిస్తాడో, ఆ స్వేచ్ఛను స్త్రీకి ఇస్తే చాలు. అంతకు మించి స్త్రీ ఏమీ ఆశించదు’ అన్నది ఈ చిత్ర ఇతివృత్తం. ఆ అంశాన్ని తన ఈ తొలి చిత్రం ద్వారా చెప్పదలుచుకున్నారు దర్శకుడు రామరాజు.”- కానీ ఇదే కథ కొద్దిగా మార్చి భర్త భావుకుడిగా, భార్య ఇవన్నీ పట్టించుకోని ప్రాక్టికల్ మనిషిగా ఉంటే, ఆ భర్తకే తన ఫ్రీక్వెన్సీ మ్యాచ్ అయ్యే అమ్మాయి పరిచయమైతే …???
mallela teeram(1)
అలాగే ఈ సినిమాపై ఎన్ని సమీక్షలు వచ్చినా, కొన్ని అర్థవంతమైన ప్రశ్నలు మితృడు, ఛాయాగ్రాహకుడు అయిన ‘చక్రధరరావు’ లేవనెత్తారు-
“ప్రేమించే మనిషి దొరికేవరకూ పెళ్ళి చేసుకోవద్దా? 
లేక పెళ్ళి చేసుకొని బతికేస్తూ ప్రేమించేమనిషి తారసపడితే పెళ్ళిని వదిలిపోవాలా?? 
లేక పెళ్లిలో ఉంటూనే ప్రేమని కొనసాగించాలా? 
ప్రేమించిన మనిషిని తప్పక పెళ్ళి చేసుకొని తీరాలా ?? 
అసలు ఫలాన వ్యక్తి తప్ప ప్రపంచంలో నాకేమీ వద్దు అనే మానసికస్థాయి అదే సినిమాలో చెప్పిన అద్వైత స్థితి మనుషులకెప్పుడయినా కలుగుతుందా ?
అది కలగాలంటే ఎలా ప్రాక్టీసు చేయాలి ? 
పోనీ ఫలానా వ్యక్తిని ప్రేమించామే అనుకో.. వాళ్ళూ మనని ప్రేమించాలిగా ?
లేకుంటే అలా రెసొనెన్స్ కలిగేవరకూ వెతుక్కుంటూ పోవాలా , ఈ లోపు పుణ్యకాలం గడిస్తే ?? 
ఒకసారి ఆ ‘అద్వైత స్థితి’ కలిగితే అది ఎల్ల కాలం అలాగే ఉంటుందా ! అంటే ఒకసారి ఒకరి మీద ప్రేమ కలిగాక అది ఎప్పుడూ అలాగే ఉంటుందా వాళ్ల తదుపరి ప్రవర్తన వల్ల తరుగుదల/ఎదుగుదల ఉండదా ? ఉంటుందా?”
వీటికి సమాధానాలు ఎవరికి వారే వెతుక్కోవాలి!

కొసమెరుపు:

 

ఈ సినిమాలో సాహిత్యం, సంగీతం, భావుకతతో పాటు ఎక్కువైంది ఇంకొకటుంది…అది కెఫైన్…ఇద్దరి మధ్య మాటలు, పాటలుతో పాటు కాఫీ కూడా వరదలై పొంగుతుంది.
ఈ సినిమా ముందూ వెనకా:
 శ్రీదివ్య,డా.క్రాంతి, జార్జి, రావు రమేశ్ ప్రధాన పాత్రధారులైన ఈ చిత్రానికి నేపథ్య సంగీతం: పవన్‌కుమార్, ఛాయాగ్రహణం: బాలరెడ్డి, కూర్పు: ధర్మేంద్ర కాకరాల, సహ నిర్మాత: సూర్యనారాయణ ఆకుండి, కథ, స్క్రీన్‌ప్లే, మాటలు, దర్శకత్వం: జి.వి. రామరాజు.

ఒక విలయం తరువాత…

3Son: Do we eat humans, when we starve?

Father: We are already starving?

Son: We shouldn’t eat humans, even though we die with starvation.

Father: No, we don’t, my son.

 

మృత్యు శీతలత.

అగాధమైన ఒంటరితనం.

ఎడతెగని భయం.

……………………

ఒక విలయం తరువాత…4

వర్ణాలు, ధ్వనులు, నామాలు, సూర్యరశ్మి, వెచ్చదనం, సంతోషం, ఆశ…అన్నీ తుడిచిపెట్టుకుపోయిన భూమిపై ఒక తండ్రి(45), ఒక కొడుకు (9) మెల్లగా, విచారభరితంగా పయనిస్తున్నారు. తీరప్రాంతానికి వెళ్లాలని వారి ప్రయత్నం. అక్కడ పరిస్థితులు కాస్తంత మెరుగుగా ఉంటాయని ఆశ. కాని అక్కడ ఏముందో ఎవరికి తెలుసు? నిజంగా వారక్కడికి చేరగలరా?

“ప్రతి దినం మునుపటి రోజుకంటే నల్లనిది. ప్రపంచం మెల్లగా మరణిస్తోంది. ప్రాణులన్నీనశించాయి. పంటలు పండే అవకాశం ఇక లేదు. నేలంతా బూడిదమయం అయింది. వృక్షాలన్నీ కూలిపోయాయి. రోడ్లు సాయుధులైన మూకలతో నిండిపోయాయి. ఇంధనం, ఆహారం కోసం వేట.  శిఖరాల మీద మంటలు ఎగసాయి. కానిబాలిజం (cannibalism) విస్తరించింది. కానిబాలిజం… అది వెన్నులో వణుకుపుట్టిస్తుంది. నేను ఆహారం కోసం ఆందోళన పడుతున్నాను. అవును, ఎక్కువగా ఆహారం కోసమే, ఇంకా ఈ చలి గురించి, మా బూట్ల గురించి…” తండ్రి తనలో తాను మధనపడ్డాడు.

అంతులేకుండా బూడిద ఆకాశంలో ఎగసిపడుతోంది. నగరాలు శిథిలమై నిర్మానుష్యంగా మిగిలాయి. ఎక్కడా ఆహారం లేదు. మొక్కలు పెరుగుతాయనే ఆశాలేదు. కొద్దిమంది మనుషులు మాత్రమే భూమిపై మిగిలిఉన్న చివరి జీవులు. కాని వారిప్పుడు ఎంతమాత్రం మనుషులు కారు. ఎందుకంటే వారి primitive instincts పూర్తిగా బయటపడే సమయమిది.  మనుషుల యదార్థ స్వభావాలు వెల్లడి అయ్యే సమయమిది. మనుషుల ముసుగులు తొలగే అత్యంత సంక్లిష్ట సమయమిది. మనుషులు తోడేళ్ళుగా మారే వేళ ఇది.

ఆ తండ్రి దగ్గర ఒక రివాల్వర్, రెండు బుల్లెట్స్ ఉన్నాయి. అందులో ఒకటి కొడుకుని రక్షించేందుకు వినియోగించేసాడు. మిగిలిన ఒక బులెట్ ని అత్యంత ప్రమాదకర పరిస్థితులు సంభవించినప్పుడు, కొడుకుకి తనని తాను అంతం చేసుకోమని ఇచ్చాడు. కొడుకుని బాధాకరమైన మరణం నుండి ఆ బులెట్ రక్షిస్తుందని అతని ఆశ. వారి ప్రయాణంలో సంభవించిన సంఘటనలు, ఆ ఘటనలకు వారు స్పందించిన తీరు మన హృదయాలలో లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తుంది. భయం ఒక్కొక్కసారి మానవత్వాన్ని అణచివేస్తుంది. మరొకసారి మానవత్వం భయాన్ని జయిస్తుంది.

“ది రోడ్” చిత్రాన్నిచూసినప్పుడు భయం యొక్క విస్తృతి, లోతు మనకి అనుభూతమవుతాయి. మానవ స్వభావంలోని వైరుధ్యాలు మనలో వణుకు పుట్టిస్తాయి. భయకరమైన నైరాశ్యం. గూడు కట్టిన భయం. అరుదైన, విలక్షణమైన తాత్వికత జీవితం యొక్క నిష్ఫలతను, అదే సమయంలో జీవన సౌందర్యాన్ని ఏకకాలంలో హృదయంలో ఆవిష్కరిస్తుంది. మానవ స్వభావంలోని ఔన్నత్యం, మృగత్వం రెండూ వ్యక్తమవుతాయి. ఒక గంభీరమైన అనుభవం మన చేతనను ఆసాంతం ఆక్రమించుకుంటుంది. రోజుల తరబడి గాఢమైన విషాదం, అనూహ్యమైన వేదన మన హృదయాలను వెంటాడుతాయి.

మహా కళాకారుడైన ఆస్ట్రేలియన్ దర్శకుడు జాన్ హిల్కోట్ తన చిత్రాలలో అత్యంత లోతైన తాత్వికతను ఆవిష్కరిస్తాడు. ఆయన ప్రతి చిత్రం ఒక అలౌకిక అనుభవం. మహా నటుడు విగ్గో మార్టెన్ సెన్ తండ్రి పాత్రలో పలికించిన భావాలు మన హృదయాన్ని దిగులుతో నింపేస్తాయి. అతని దిగులు, స్వార్థం, త్యాగం, కొడుకు యొక్క మానవీయమైన ఆధిక్యతకి అతని అతడు చిన్నబోవడం_ ఇలా ప్రతి భావం ఆయన వదనంలో పలికించిన తీరు అసాధారణం. నిక్ కేవ్, వారెన్ ఎల్లెస్ ల అత్యంత సున్నితమైన సంగీతం హృదయం లోతుల్లోకి చొచ్చుకుపోతుంది. వివరించలేని తాత్వికతని హృదయంలో ఆవిష్కరిస్తుంది.

ఈ చిత్రం జీవితాంతం వెంటాడే ఒక నాణ్యమైన కవితాత్మక అనుభవాన్ని ఇస్తుంది. మానవ జీవితం పై ఒక కాంతిని ప్రసరిస్తుంది.5

_______________________

Film: The Road (2009)

Country : USA

Language:  English

Run time : 111 min

Director: John Hillcoat

Actors : Viggo Mortensen , Kodi Smit-McPhee, charlize theron, Robert Duvall  Robert Duvall

Music : nick cave and warren ellisSriram-Photograph

 

కథ అయినా, కళ అయినా…ఒక సహప్రయాణం!

Vinod AnantojuWorkingstill1 (1) అసలు కథ చెప్పాల్సిన అవసరం ఎందుకొస్తుంది ?

కథే కాదు.. మనిషికి కళ అవసరం ఎప్పుడొస్తుంది?

ఒక విషయాన్ని అవతలి వ్యక్తికి ఎన్నో విధాలుగా తెలియజెయ్యొచ్చు. మాటల ద్వారా, రాతల ద్వారా, బొమ్మల ద్వారా ఎలగైనా తెలియజెయ్యొచ్చు. ఆ విషయం తెలుసుకున్నాక ఆ వ్యక్తి ఎలా స్పందిస్తాడు అనేది మాత్రం ఆ విషయం ఎంత కళాత్మకంగా చెప్పబడింది అనేదాని మీద ఆధారపడుతుంది. అనుభూతులను, భావాలను పంచుకునే సాధనం కళ. మంచిగా మట్లాడటం కళ, బాగా రాయడం కళ, నృత్యం చేసి ఆనందపడటం, ఆనందాన్ని పంచడం కళ. మనసులో ఏదైనా సరే ఒక స్పందన కలగజేసే కథ రాయడం, సినిమా తీయడం కళ.

‘ శూన్యం’ రాయడం మొదలుపెట్టినప్పుడు చాలా ప్రశ్నలు, సందేహాలు నన్ను వేధించాయి. నేను చూస్తూ పెరిగిన సినిమాల ప్రభావం కావొచ్చు, కొన్ని రకాల కథలకే పరిమితమవ్వాలేమో అనే అలోచన ఉండేది. కాని నేను సినిమాని చూస్తున్న కోణం వేరు. సినిమా ఒక కళ. కళ కేవలం వినోదం కోసమే కాదు. దాని లక్ష్యాలు అనేకం. దాని అవసరం వేరు. మానవాభివృద్ధిలో దాని పాత్ర విడదీయరానిది. పుస్తకాలకి సినిమాకన్నా శక్తి ఎక్కువ ఉన్నప్పటికీ ప్రపంచీకరణ పుణ్యమా అని పుస్తకాలు చదివేవారి సంఖ్య రోజురోజుకీ తగ్గిపొతోంది.. నాటకం, తోలుబొమ్మలు లాంటి కళలు అంతరించిపోతున్నాయి. ప్రస్తుతం సినిమా అన్ని కళల్లోకల్లా ఆదరణ ఎక్కువ పొందుతోంది. కాని ఇప్పుడున్న సినిమా రంగం పరిస్థితి చాలా నిరాశాజనకంగా, భయంకరంగా ఉంది. ఇక్కడ మార్పు అవసరం. సినిమాని సరైన దారిలో పెట్టాలి, సమాజంలో దానికున్న పురోగామి పాత్రని దానికి గుర్తుచెయ్యాలి. ఈ విషయాన్ని మనసులో పెట్టుకునే ‘శూన్యం’ రాయడం మొదలుపెట్టాను.

“కథ”కీ “సినిమాకథ”కీ చాలా తేడా ఉంది. ఆధునిక కథ వర్తమాన జీవనశైలికీ, జీవిత సంక్లిష్టతకీ తగ్గట్టు చాలా మార్పులకి లోనయ్యింది. చాలా అభివృద్ధి చెందింది. కానీ తెలుగు సినిమాకథ ఇంకా అంత అభివృద్ధి చెందలేదు. ఇంకా పాతకాలపు “ఎత్తుగడ-సమస్య-పరిష్కారం-శుభం” పద్ధతినే అనుసరిస్తున్నారు. ఆధునిక కథ ఈ నిర్మాణాన్ని దాటి ఎప్పుడో ముందుకెళ్ళిపోయింది. కథ చదువుతున్న పాఠకుడు కథతో పాటు ప్రయాణం  చెయ్యగలిగితే చాలు. కథను ఉద్దేశపూర్వకంగా ముగించాల్సిన అవసరం లేదని నా నమ్మకం. ఎందుకంటే అంతిమంగా కథ చదవడం వల్ల కలిగిన అనుభూతే అన్నిటికన్నా ముఖ్యం. మరి ఈ విషయాలన్నీ ప్రేక్షకుడితో ఎలా చర్చించాలి? నేను రాసే కథలో ప్రేక్షకుడు నాతో పాటు కథ రాయడంలో ఉండే అన్ని అవస్థల గుండా ప్రయాణించాలి. నా అభిప్రాయాల్ని, భావాలని ప్రేక్షకుడితో పంచుకుంటూ, అతని అభిప్రాయాలకి తావు ఇస్తూ, ప్రేక్షకుడిని నా తోటి ప్రయాణికుణ్ణి చేసుకోడానికి ప్రయత్నించాను.

Workingstill1 (2)

లఘుచిత్రాలకి అనేకానేక పరిమితులు ఉంటాయి. శూన్యం సినిమాలో చెప్పినట్టు “కథ రాసేస్తే సరిపోదూ..!!” నాకున్న పరిమితులని అర్థంచేస్కుని అధిగమించాలి. నేను ఎదుర్కొన్న ముఖ్యమైన సమస్య నటులకి కథ మీద నమ్మకం కలిగించడం. కొంతమంది అయితే ఇది కథే కాదు అన్నారు. ఒక కళాకారుడిగా నేను చేస్తున్న ప్రయోగం మీద నాకు నిర్దిష్టమైన అవగాహన, నమ్మకం ఉన్నాయి. ఆ నమ్మకంతోనే నా స్నేహితులని ఒప్పించి షూటింగుకి పూనుకున్నాము. కథలో లొకేషన్స్ చాలా వరకు లైవ్ లొకేషన్స్ కావడంతో న్యాచురాలిటీ కోసం గెరిల్లా షూటింగ్ స్టైల్ ని అనుసరించాము. ఇది కొంచం రిస్కీ అయినా సినిమాకి చాలా ఉపయోగపడింది.

ఒకడు సినిమా తీస్తే, దాని ప్రభావం ప్రేక్షకుల మీద ఎంత ఉంటుందో దాన్ని తీసినవాడి మీద కుడా అంతే ఉంటుంది. శూన్యం విడుదలయ్యాక వచ్చిన స్పందనలు, అభినందనలు, విమర్శలు అప్పటిదాకా నాలో ఏ మూలో సినిమా కళ పట్ల ఉన్న అలసత్వాన్ని పూర్తిగా పోగొట్టాయి. సినిమాకి ఉన్న శక్తి సామర్ధ్యాలు తెలిసొచ్చాయి. కళ పట్ల నాకున్న బాధ్యత అర్థమైంది. ఒక నిర్మాణాత్మకమైన పద్ధతిలో సినిమాలు తీస్తూ ప్రేక్షకుల్లో, కళాకారుల్లో “సినిమా” మీద ఉన్న అవగాహనలో మార్పు తీస్కురావాలి. అలా పుట్టిన అలోచనే “వర్ణం”. మిత్రుడు స్మిజో దీన్ని ప్రతిపాదించాడు. సినిమాల పట్ల ఇలాంటి అలోచనా సరళిని వ్యాప్తి చెయ్యాలన్నా, ఇలాంటీ సినిమాలు విరివిగా తీయాలన్నా సిమిలర్ మెంటాలిటి ఉన్న టీం కావాలి. అలా “వర్ణం” అనే పేరుతో ఒక టీం తయారు చేస్తున్నాం. ఆ టీం మొదటి ప్రయత్నం “ఒక మరణం” షార్ట్ ఫిల్మ్.

కళ ఏదైనా అది జీవితంలోంచి పుట్టాలి. సామాజిక మూలాలని అన్వేషించాలి, జీవితపు సంక్లిష్టతని సులభతరం చెయ్యాలి. వ్యాపారం కోసం పుట్టేది కళ కాదు. నేను రాసే కథలు, తీసే సినిమాలు అంతిమంగా ప్రేక్షకుడి వ్యక్తిత్వాన్ని ఉన్నతీకరించేవిగా ఉండాలని అనుకుంటాను.

దారికాని దారులలో…

Sriram-Photograph“I knew a boy who tried to swim across the lake,

It’s a hell of a thing to do,

They say the lake is as big as the ocean,

I wonder if he knew about it”

-Yoko Ono (lyrics slightly modified)

నిజజీవిత కథ ఆధారంగా రూపొందించబడిన “వెల్‌కమ్” చిత్రాన్ని చూడడం ఒక హృదయవిదారకమైన అనుభవం. చూసాక, మన ప్రపంచాన్ని మనం ఇన్ని ముక్కలుగా చేసుకున్నందుకు ఎంతో సిగ్గుపడతాము. దేశాలు, మతాలు, ప్రాంతాలు, జాతులు, ధనికులు, పేదలు_ ఇన్ని విధాలుగా మనం మన ప్రపంచాన్ని విడగొట్టుకున్నందుకు మనిషిగా అవమాన భారంతో కుమిలిపోతాము. ఎల్లప్పుడూ డబ్బు, అధికారం, కీర్తి వెంబడి పరుగులు తీసే మనం, జీవిత పరమార్థం మరియు జీవితానందానికి ఆధారం అయిన మానవ సంబంధాలని ఎంతలా విస్మరిస్తాము?

“వెల్‌కమ్” చిత్రం చరిత్ర కాదు, వర్తమానం. గతంలో మనుషులు ఇంత క్రూరంగా ఉండేవారని సరిపెట్టుకొనే అవకాశాన్ని ఇది ఇవ్వదు. హిట్లర్ ఎంతో క్రూరుడు, మనం కాదు అని తప్పించుకొనే అవకాశాన్నీ ఇవ్వదు. ఇది ఇప్పటి కథ. నేటి అమానవీయ గాధ. దీనికి మనమందరం బాధ్యులం. ఈ ప్రపంచం ఇప్పుడు ఉన్నట్టుగా ఉండడానికి మనమందరం బాధ్యులం. ఈ సమాజాలు ఇంకా primitive stage కొనసాగడానికి మనమందరం బాధ్యులమే. ఎందుకంటే మనమే ఈ ప్రపంచం కాబట్టి.welcome_ver2_xlg

ఇరాక్ కు చెందిన 17 ఏళ్ల కుర్దిష్ కుర్రవాడయిన బిలాల్ కయాని ప్రియురాలు మినా కుటుంబం బ్రిటన్ కి వలసపోతుంది. మినా తండ్రి బలవంతంగా ఆమె మేనమామతో వివాహాన్ని నిశ్చయిస్తాడు. బిలాల్ కల్లోల పరిస్థితులతోనూ, నిరంతర హింసతోనూ నిండివున్న ఇరాక్ లోని ఒక పేద కుటుంబానికి చెందినవాడు. అతడు ఎలాగైనా మినా వివాహ తేదీకి ముందుగా లండన్ చేరుకోవాలని, రహస్యంగా ఆమెని వివాహం చేసుకోవాలని నిశ్చయించుకుంటాడు. కాని ఎలా? అతని వద్ద డబ్బులేదు, వీసా లేదు, పాస్ పోర్ట్ లేదు.

బిలాల్ యూరోప్ గుండా 4000 కి.మీ. కాలినడకన ప్రయాణించి ఫ్రాన్స్ లోని కాలియస్ పట్టణాన్ని చేరుకుంటాడు. అక్కడి ఫ్రెంచ్ ప్రభుత్వం కుర్దిష్ శరణార్థులకు స్థానికుల నుండి ఎటువంటి సహాయ సహకారాలు అందకుండా కఠిన చట్టాలను రూపొందించింది. శరణార్ధులకు దుకాణాలలో ఆహారం, వస్తువులు అమ్మకుండా నిషేధాజ్ఞలు విధించింది. ఎవరైనా స్థానికులు వారికి ఆహారం పెట్టినా, ఆశ్రయం కల్పించినా అరెస్ట్ చేయబడతారు. అలాగే స్థానిక ప్రజలు కూడా వారిని పురుగులవలె హీనంగా చూస్తుంటారు. వారిని clandestines పేరుతో అవమానకరంగా సంబోధిస్తుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో రోడ్డు మార్గం ద్వారా ఒక ట్రక్కులో అక్రమంగా ఇంగ్లాండ్ చేరాలని చేసిన ప్రయత్నంలో బిలాల్ ఫ్రెంచ్ పోలీసులకు దొరికిపోతాడు.

x85ytol2me5X4Ni9l1u1PUmSBYJనిస్పృహకులోనైన బిలాల్ గత్యంతరంలేని స్థితిలో, english channelను ఈది ఇంగ్లాండ్ చేరాలనే అసంభవమైన నిర్ణయాన్ని తీసుకుంటాడు. స్థానికుడైన సైమన్ క్లామెట్ ని ఈత పాఠాలు నేర్పించవలసిందిగా అభ్యర్ధిస్తాడు. దయతో అతడిని ఆదరించి, ఆశ్రయం కల్పించిన సైమన్ కు స్థానికుల నుండి తీవ్రమైన వ్యతిరేఖత వస్తుంది. వారు పోలీసులకు పిర్యాదు చేస్తారు. హఠాత్తుగా అర్థరాత్రి, సైమన్ ఇంటి నుండి మాయమైన బిలాల్, మైనస్ డిగ్రీల చలిలో english channelని ఈదాలని ప్రయత్నించి ఇంగ్లాండ్ తీరానికి అతిచేరువలో ఇంగ్లీష్ కోస్ట్ గార్డ్ లకు కనిపిస్తాడు. వారిని తప్పించుకొనే ప్రయత్నంలో సముద్రంలో మునిగి మరణిస్తాడు.

సైమన్ ముందు ప్లాస్టిక్ సంచిని పోలీసులు తెరుస్తారు. అందులో బిలాల్ మృతదేహం ఉంటుంది. వివాహ సమయంలో  ప్రియురాలు మినా చేతికి తొడగాలని బిలాల్ తన వెంట తెచ్చుకున్న ఉంగరాన్ని, సైమన్ ఇంగ్లాండ్ తీసుకువెళ్ళి మినాకు ఇస్తాడు. ఆ ఉంగరాన్ని దాచుకోవడానికి తనకంటూ ఈ లోకంలో ఒక చోటులేదని చెపుతూ మినా సైమన్ కు తిరిగి ఇచ్చివేస్తుంది. ఆ మరుసటి రోజే మినాకు మేనమామతో వివాహం.

8xeaGr7kEEo21yv9k2LK9vTJczk

ఈ చిత్రాన్ని చూసాక భారమైన, వ్యధాకులిత హృదయంతో ఈ క్రింది వాక్యాలు రాసుకున్నాను.

“Why do you astray

My friend?

In those unwelcoming lands,

Where no one treats you,

As a human.

I know it is for the love of your life.”

————————

Film: Welcome (2010)

Director : Philippe Lioret

Cast : Vincent Lindon, Firat Ayverdi, Audrey Dana, Olivier Rabourdin, Derya Ayverdi

Country : France

Duration : 110 min

మానవ సహజాతాలు – ఒక సన్యాసి !

Sriram-Photograph“Isn’t it strange how we fail to see the meaning of things, until it suddenly dawns on us?”
-Antonia (A character from “The Monk”)

సాహిత్య స్థాయికి సినిమా చేరలేకపోయిందని దర్శకుడు శ్యాం బెనగల్ ఒక సందర్భం లో  చెప్పారు. బహుశా  “ది మాంక్” చిత్రాన్ని చూసి ఉంటే ఆయన ఆ మాట అనగలిగేవారు కాదేమో అనిపించింది. అయితే ఆయన మాటల్ని విమర్శించడానికి ఈ వాక్యాలు నేను రాయడం లేదు. ఆయన కేవలం భారతీయ చలన చిత్రాలను దృష్టిలో పెట్టుకొని ఆ మాటలు అని ఉండవచ్చు. ఇక ఇక్కడ నేను రాయబోయేవి పూర్తిగా నా వ్యక్తిగత అభిప్రాయాలు. అయితే శ్యాం బెనగల్ సినిమాకి సాహిత్యాన్ని మించిన శక్తి ఉందనే అభిప్రాయాన్ని కూడా వ్యక్తం చేశారు.

ఆ విషయం టెరెన్స్ మలిక్, ఫెంగ్ గ్జియోగాంగ్, మజిద్ మజిదీ, ఆంద్రే తర్కోవిస్కీ, జాంగ్ ఇమో వంటి మహా దర్శకుల చిత్రాలు చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. ప్రపంచ వ్యాప్తంగా గొప్ప రచయితలు “ప్రపంచ సినిమా”కి ఎందుకంత విలువ ఇస్తారంటే, దాని పరిధి అనంతంగా విస్తృతమైంది కాబట్టి. అలాగే సాహిత్యంతో పాటూ అన్ని కళారూపాలనూ అది తనలో నిక్షిప్తం చేసుకుంది కాబట్టి సినిమాకి అంతటి శక్తి వచ్చిందని విశ్వసిస్తాను. వచనంలోనూ, కవిత్వంలోనూ చెప్పడానికి వీలుకాని అలౌకిక అనుభవాన్ని గొప్ప సినిమా దృశ్యాల ద్వారా, సంగీతం ద్వారా మన హృదయాల్లో ఆవిష్కరిస్తుంది.

ప్రపంచంలోని గొప్ప చిత్రాలను చూసే అవకాశంలేనివారు, ఒక పరధిని దాటి ఆలోచించడానికి ఇష్టపడనివారూ, లేదా జీవితంలో కొత్త విషయాలకి ద్వారాలు తెరవడానికి తగినంత ఆసక్తి, శక్తి లేనివారూ సినిమాని ద్వేషించడం గమనించాను. వారు సాహిత్యం మాత్రమే గొప్పదనే భ్రమలో ఒక గిరి గీసుకుని ఉండిపోతారు. కాని explorers, జీవితమంతా ఒకే చోట కూర్చుని ఉండడానికి ఇష్టపడనివారు కొత్త కళారూపాలని ఎప్పుడూ స్వాగతిస్తారు.

నా ఉద్దేశ్యంలో సినిమా, సాహిత్యమూ వేరు వేరు కాదు. కేవలం అవి వ్యక్తీకరించే రూపాలు వేరు. కాబట్టి నేను రెండింటినీ ప్రేమిస్తాను. సాహిత్యానికి కొన్ని పరిమితులు ఉన్నట్లే, సినిమాకీ కొన్ని పరిమితులు ఉన్నాయి. అలాగే రెండిటికీ వేటి సౌలభ్యాలు వాటికి ఉన్నాయి. సాహిత్య విలువలులేని సినిమా వ్యర్థమైనది. వ్యక్తీకరణకు కేవలం మాటల మీద మాత్రమే ఆధారపడవలసిరావడం సాహిత్యానికి ఉన్న శక్తిని పరిమితం చేస్తుంది.

నేను “ది మాంక్” చిత్రం గురించి మొదట తెలుసుకున్నప్పుడు, లియో టాల్ స్టాయ్ షార్ట్ స్టోరీ “సెయింట్ సేర్గియ్” గుర్తుకు వచ్చింది. సాహిత్యపరంగా ఆ కథ స్థాయికి ఒక చిత్రాన్ని తీసుకువెళ్ళడం అసాధ్యం అనే భావన కలిగింది. కాని ఈ చిత్రం చూసినప్పుడు నా ఊపిరి ఆగిపోయింది. ఆ అగాధమైన మార్మికత, అధ్యాత్మికత, కళ యొక్క ప్రబలమైన  శక్తి, సాహిత్యపరమైన లోతు నన్ను అచేతనుడ్ని చేసాయి. ఇటువంటి గొప్ప కళారూపాలు మన ఆత్మని కంపింపజేస్తాయి. మన నైతికతను బ్రద్దలు కొడతాయి. జాగ్రత్తగా జీవితమంతా ప్రోదిచేసుకున్నమన విశ్వాసాల్ని తల్లక్రిందులు చేస్తాయి. మన అహంకారాన్ని తుత్తునియలు చేస్తాయి.

మన గొప్పతనపు వలువల్ని వలిచి నగ్నంగా మన దేహాల్నిసూర్యరశ్మికి అభిముఖంగా నిలబెడతాయి. మనం ఏమీకామనే సత్యాన్ని హృదయంలో ఆవిష్కరిస్తాయి. అవును, మనం ఏమీకాదు,  మన గురించి మనం భావించుకున్నదేమీ మనం కాము. కాని మనం ఎవరం?

జీవితమంతా సత్యాన్వేషణకు వెచ్చించినవారు, ఆధ్యాత్మికంగా సాధారణ ప్రజల కంటే ఉన్నతులా? గొప్ప ప్రతిభాపాటవాలు, మేధస్సు, గొప్ప కళ సృజించగల నైపుణ్యం ఉన్నవారు, మామూలు మానవుల కంటే గొప్పవారా? ఏది సత్యం, ఏది అసత్యం, ఎవరు నిర్ణయిస్తారు? పాపం అని దేనిని అంటారు , దానిని ఎవరు నిర్ణయిస్తారు? ఏది ఉన్నతం, ఏది అధమం? ఇటువంటి ప్రశ్నలు మరింతగా మన హృదయాల్ని కలచివేయుగాక! ఇటువంటి కలతని మన హృదయాలలో అంతులేకుండా కలిగించేదే గొప్ప కళ అని భావిస్తాను. ఈ చిత్రం ఇటువంటి ప్రశ్నలతో మనల్ని బాధిస్తుంది.

ఒక తుఫాను రాత్రి నిర్భాగ్యురాలైన ఒక అవివాహ బాలిక తన బిడ్డను తనతో ఉంచుకోలేక, విడిచిపెట్టనూలేక, దారికానక పయనిస్తున్నప్పుడు ఆమెకి ఒక స్పానిష్ సన్యాసాశ్రమం కనిపిస్తుంది. ఆ ఆశ్రమ ద్వారం వద్ద శిశువును విడిచి ఆమె చీకటిలోకి నిర్గమిస్తుంది. ఆశ్రమవాసులు ఆ బిడ్డకు “ఆంబ్రోసియో” అనే పేరు పెట్టి, సన్యాసిగా పెంచుతారు. అసాధారణ ప్రతిభాశాలి అయిన అతను గొప్ప సన్యాసిగా, జ్ఞానిగా పేరు తెచ్చుకుంటాడు. అతని బోధనలు వినేందుకు ఎంతో దూరం నుండి ప్రజలు వస్తుంటారు. అతను తన పవిత్ర జీవితం పట్ల, ఆధ్యాత్మిక జ్ఞానం పట్ల ఎంతో నిబద్ధత, క్రమశిక్షణ కలిగిఉంటాడు.

అటువంటి వ్యక్తి జీవితం క్రమంగా తల్లక్రిందులవుతుంది. జీవితాన్ని, అతని అంతరిక సహజాతాల్ని ఎదుర్కోవలసి వచ్చినప్పుడు ఒక హంతకుని కంటే హీనమయిన వ్యక్తిగా తనముందు తాను నిలబడతాడు. అతను తన జ్ఞానంలోని, నియమబద్ద జీవితంలోని, పవిత్రతలోని బోలుతనాన్ని గుర్తించే వేళకి,  అతి క్రూరమైన అతని పతనం వెక్కిరిస్తుంది. జ్ఞానాహంకారం అతని జీవితాన్ని అథ:పాతాళానికి త్రొక్కివేస్తుంది.

పుట్టుకతో జర్మన్ అయిన ఫ్రెంచ్ దర్శకుడు డామ్నిక్ మోల్ యొక్క అసాధారణ ప్రతిభ, ఆధ్యాత్మిక జ్ఞానం, జీవితం పట్ల అవగాహన మనల్ని నివ్వెరపోయేలా చేస్తాయి. అల్బెర్టో ఇగ్లేసియా సృజించిన గంభీరమైన సంగీతం ఆత్మను ప్రకంపింపజేస్తుంది. ఈ చిత్రం ఒక అనుభవం. అది మనిషి మనిషికీ మారుతుంది, వారి అవగాహనని బట్టి.

చిత్రం: ది మాంక్ (లె మోయినె) (2012)
దర్శకత్వం : డామ్నిక్ మోల్
సంగీతం : అల్బెర్టో ఇగ్లేసియా
నిడివి: 101 నిముషాలు
భాష: ప్రెంచ్
నటులు: విన్సెంట్ కాసెల్, డెబొరా ఫ్రాన్సిస్, జోసపెయిన్ జాపే

‘ఊరిచివర ఇల్లు’ నుంచీ ‘ఎడారి వర్షం’ వరకూ…

సాహిత్Edari Varsham-2 (edited)యాన్ని సినిమాలుగా తియ్యడం అనేది కత్తి మీద సాములాంటి ప్రక్రియ. అప్పటికే పాప్యులరైన రచనగానీ, అత్యధికంగా గౌరవింపబడి ప్రేమింపబడుతున్న రచయితల సాహిత్యమైతే మరీను. ఎందుకంటే రచన అపరిమితమైన భావపరిధిలో ఉంటూ ఇమ్యాజినేషన్ పరంగా ఎల్లలులేని విధంగా ఉంటుంది. పాఠకుడికి-రచయితకూ మధ్య ఉన్న అప్రకటిత నిశ్శబ్ధ అనుబంధం లాంటి జంట సంభాషణలాగా గడిచిపోతుంది. కానీ సినిమా అలాకాదు. అదొక పరిమితమైన దృశ్య మాధ్యమం. దానికి ఫ్రేములుంటాయి. సింటాక్స్ పరిథి ఉంటుంది. ఎల్లలు చాలా ఉంటాయ్. నటీనటులు, లొకేషన్, ఎడిటింగ్, నేపథ్య సంగీతం, బడ్జెట్ ఇలా  పరిమితులు చాలా అధికంగా ఉంటాయి.

వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకుని, వీలైనంత అధిగమిస్తూ, రచయిత ఇచ్చిన కథలోంచీ ఒక అంగీకారాత్మక భాష్యాన్ని స్క్రీన్-ప్లే గా కుదించి సినిమాగా తియ్యాలి. కొన్ని కొన్ని సార్లు సినిమా కథకన్నా గొప్పగా తయారవ్వొచ్చు. ఒక్కోసారి కథకన్నా వేరేగానూ తయారు కావచ్చు. చాలా వరకూ కూసింత కథ చదివిన పాఠకుడిని, సినిమా చూసే ప్రేక్షకుడినీ నిరాశపరచొచ్చు. దీనికి గల కారణాలు మాధ్యమాల మార్పు కొంత అయితే, రచనని విజువల్ లాంగ్వేజ్ లోకి మార్చలేని ఫిల్మ్ మేకర్స్ విజన్ కొరత మరింత.

సత్యజిత్ రే లాంటి ఫిల్మ్ మేకర్ బిభూతిభూషణ్ బందోపాధ్యాయ నవలను  పథేర్ పాంచాలి గా తీసినప్పుడు “అబ్బే నవల లాగా లేదు” అన్నవాళ్ళు చాలా మందే ఉన్నారు. దానికి సమాధానంగా సత్యజిత్ రే భాషాపరమైన లేదా రచనపరమైన సింటాక్స్ కి ,సినిమాటిక్ లాంగ్వేజ్ కీ మధ్య తేడాలను ఉంటంకిస్తూ పెద్ద వ్యాసమే రాయాల్సి వచ్చింది. అయినా తిట్టేవాళ్ళు తిట్టారు, అర్థం చేసుకున్నవాళ్ళు చేసుకున్నారు. ఇప్పటికీ అటు నవల ,ఇటు సినిమా రెండూ క్లాసిక్స్ గా మనం చదువుతున్నాం, చూస్తున్నాం. అందరూ సత్యజిత్ రేలు కాకపోయినా, సాహిత్యం నుంచీ సినిమాతీసే అందరు ఫిల్మ్ మేకర్స్ ఫేస్ చేసే సమస్యే ఇది.

తెలుగు ఇండిపెండెంట్ సినిమా గ్రూప్ సాహిత్యం నుంచీ కథను ఎన్నుకుని లఘుచిత్రం చేద్దాము అనుకున్నప్పుడు మొదట ప్రతిపాదించబడ్డ కథల్లో చలం, బుచ్చిబాబు, తిలక్ కథలు ఉన్నాయి. రిసోర్సెస్ పరంగా మాకున్న లిమిటేషన్స్ దృష్టిలో పెట్టుకుని కొద్ది పాత్రలతో మానవీయ కోణాన్ని ఆ రచయిత గొప్పతనాన్ని షోకేస్ చెయ్యగల కథకోసం వెతకగా ఫైనల్ చేసిన కథ “ఊరిచివర ఇల్లు”. కథని యథాతథం గా  తీద్దామా, అడాప్ట్ చేసుకుందామా అనే ప్రశ్న అస్సలు ఉదయించలేదు. ఎందుకంటే స్క్రీన్-ప్లే అనేది అనుసరణే అవుతుంది తప్ప కథానువాదం కానేరదు. నాతోపాటూ మరో ముగ్గురు రచయితలు వారి వారి వర్షన్స్ లో స్క్రీన్-ప్లే రాశారు. గ్రూప్ గా స్క్రీన్ ప్లే మీద చర్చ జరిగినప్పుడు నా వర్షన్ ని సినిమా తియ్యడానికి ఎంచుకోవడం జరిగింది.

“ఊరిచివరి ఇల్లు” కథ జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథ.

తిలక్ “ఊరిచివరి ఇల్లు” కథని అడాప్ట్ చేసుకుని  రాస్తున్నప్పుడు స్క్రీన్ ప్లే రచయితగా నాకు మూడు విషయాలు పొసగలేదు. ఒకటి, రమ జగన్నాథానికి తనకు ప్రేమలో జరిగిన దురదృష్టం, ఆతర్వాత నమ్మిన పెద్దమనిషి చేసిన మోసం, ఇప్పుడు అవ్వ పంచన బ్రతుకుతున్న వైనం చెప్పేస్తే రమ ఒక వేశ్య అనే విషయం ఆల్రెడీ సజెస్ట్ అయిపోయిన భావన కలుగుతోంది. ముఖ్యంగా రమ పాత్రలోని సంశయం, మాటిమాటికీ రమ జగన్నాథం తో(సినిమాలో శేఖరం అయ్యాడు) ‘ఇంకేమీ అడక్కండీ’ అంటూ ఏడవటం చాలావరకూ ‘giving away’ ఫీలింగునే కలిగించాయి. పైగా కథాకాలం ప్రకారం చూస్తే ఆరంభంలో వచ్చే ఇంటి సెటప్ వర్ణన ‘సానెకొంప’ అనే విషయాన్ని అన్యాపదేశంగా రచయిత సజెస్ట్ చేసిన భావన కలిగింది. ఇలా రివీల్ అయిపోతే జగన్నాథం షాక్ కి విలువ తగ్గిపోతుంది. అంతేకాక దాన్ని విజువల్ గా చూపించాలంటే లాంగ్ షాట్లో వర్షం కురుస్తుండగా ఇంటిని ఎస్టాబ్లిష్ చెయ్యాలి. అది కొంచెం కష్టమే అనిపించింది.  కాబట్టి తండ్రి గురించి చెప్పే విషయాలనుంచీ పెద్దమనిషి చేసిన మోసం వరకూ కొంత కన్సీల్ చేసేస్తే సినిమా ఇంకొంచెం గ్రిప్పింగా ఉంటుందనిపించి దాన్ని తీసేశాను. షూటింగ్ సౌలభ్యం కోసం వర్షం ఎఫెక్ట్ లో ఉన్న ఇంటి ఇంటీరియర్లో ఆరంభపు సీన్ కానిచ్చేశాను.

రెండోది రమ-జగన్నాథం లు ఆ రాత్రి ప్రేమించుకున్నారా లేదా అనేది. ఇద్దరూ ఒకరంటే ఒకరు ఇష్టపడటం, ప్రేమను తెలుపుకోవడం వరకూ చాలా క్లియర్గా కథలో ఉంది. కానీ ఇద్దరిమధ్యా భౌతికమైన కలయిక జరిగినట్టు కథలో సజెస్ట్ చేశారని నాకు అనిపించిందేతప్ప జరిగినట్టు ఖచ్చితంగా చెప్పలేము. జగన్నాథం అవ్వమాటలకు అంతగా గాయపడాలన్నా, రమ తనని అంతగా మోసం చేసిందని అనుకోవాలన్నా,‘అమ్మాయి అంతగా నచ్చిందా’ అని అవ్వ ప్రశ్నించాలన్నా వీటన్నిటీకీ ఒక బలమైన ఫౌండేషన్ కావాలి. అది కేవలం ప్రేమ వెలిబుచ్చుకుంటే రాదు. ప్రేమించుకుంటేనే (through making love) వస్తుంది. తిలక్ గారు కూడా ఒక దగ్గర రమకు ఆవరించిన ఆవేశాన్ని, కమ్మిన మైకాన్ని గురించి చెబుతూ తన సెక్సువల్ అగ్రెషన్ ని చూపిస్తాడు. రమ ముద్దులు పెడుతుంటే ఊపిరాడక జగన్నాథం చేత “అబ్బ వదులు-వదులు రమా” అనిపించాడు. ఆ తరువాత రమ తయారైన తీరు గురించి వర్ణన, ఆపైన ఇద్దరి మధ్యా నడిచే రొమాన్స్ చెప్పకనే వారి కలయిక గురించి సజెస్ట్ చేస్తాయి. ముఖ్యంగా “ఆమె నిట్టూర్చి కన్నులు మూసుకుంది. మనస్సుయొక్క అగాధపు చీకటి లోయలో కాంతి మార్గం తెలుచుకుంటూన్నట్టనిపించింది. ఎర్రని ఆమె పెదవులు దేనికోసమో వెతుకుతున్నట్టు కదిలాయి. ఆమె ముఖంలో తృప్తి వెయ్యిరేకుల పద్మంలా విరిసింది” అనే వాక్యాలు ఎంత బలీయంగా సెక్సువల్ రెఫరెన్సెస్ అనిపిస్తాయి అనడం నా interpretation కి మూలం. అందుకే స్క్రీన్ ప్లే లో నేను లిబర్టీ తీసుకుని వాళ్ళమధ్య ప్రేమ జరిగినట్టు రాశాను. ఒక పాటనేపధ్యంలో వాళ్ల మధ్య రొమాన్స్ కూడా తీశాం.

తిలక్ గారి మనవరాలు నిషాంతి ఒక నటి. ఎల్.బి.డబ్లు అనే తెలుగు సినిమాలో నటించింది. రమ పాత్రను తనైతే బాగుంటుంది, పైగా తిలక్ కథలో తిలక్ మనవరాలు నటిస్తే ఇంకా బాగుంటుంది అనే ఉద్దేశంతో అడగటం, స్క్రిప్టు పంపడం, చర్చించడం జరిగింది. తను కొన్ని కారణాల వల్ల ఈ చిత్రంలో నటించలేకపోయింది. కానీ స్క్రిప్టు చదివాక తను అన్న మాట “మీరు తిలక్ కథకి చలం స్క్రీన్ ప్లే రాశారనిపించింది” అని. బహుశా అది నేను చేసిన ఈ మార్పుని ఉద్దేశించో లేక నేను చెప్పబోయే మరో మార్పు గురించో మాత్రం తెలియలేదు. కాస్త సంతోషంగా మాత్రం అనిపించింది.

అవ్వ లేనిపోని అపోహల్ని జగన్నాథం లో కల్పించడం, నిద్రపోతున్న రమకు కనీసం మాటమాత్రంగానైనా చెప్పకుండా జగన్నాథం పర్సు పరుపు మీద పడేసి వెళ్ళిపోవడం. నిద్రలేచి విషయం తెలుసుకున్న రమ పర్సుపట్టుకుని పరుగెత్తడం. కదులుతున్న ట్రైన్ లో ఉన్న జగన్నాథానికి పర్సు అందించడం. ఆ పర్సులో చూసుకున్న జగన్నాథం డబ్బులు అన్నీ ఉండి కేవలం తన ఫోటో లేకపోవడం తరువాత కథలో జరిగే పరిణామాలు. ఫోటోలేని పర్సుని చూసి జగన్నాథం రమ డబ్బుకోసం తనని మోసం చెయ్యలేదు అనే గ్రహింపుకు వస్తే, ఇమ్మీడియట్ గా చైన్ అన్నా లాగి బండిని ఆపెయ్యాలి లేదా తరువాతి స్టేషన్లో దిగన్నా రావాలి. కథలోలాగా ఆ పాయింట్లో ముగిస్తే సినిమా చాలా అసంపూర్ణంగా ఉంటుంది. పైగా, ముసలిది చెప్పిన కొన్ని అబద్ధాల్ని నమ్మి ప్రేమించానని కన్ఫెస్ చేసిన ఇతగాడు, నిద్రపోతున్న రమని లేపి కనీసం “ఎందుకిలా మోసం చేశావ్” అని ప్రశ్నించకుండా అనుమానపడి పర్సు పరుపుమీద పడేసి వెళ్ళిపోతాడు. అట్లాటోడు తిరిగొస్తేమాత్రం రమకు ఏమిటి సుఖం? ఎంతవరకూ అలాంటివాడి ప్రేమ నిలబడుతుంది అనే ఆలోచన నాకు వచ్చింది. అందుకే శేఖరం(జగన్నాథం) పాత్రని అప్రస్తుతం చేసి (కనీసం చూపించనైనా చూపించకుండా) రమ- శేఖరం కోసం ట్రెయిన్ వెంబడి పరుగులెత్తి అలసి సొలసి ప్లాట్ ఫాం మీద పడిపోవడంతో ముగించి చివరగా “జీవితంలో అన్నీ కోల్పోయిన వాళ్ళు దురదృష్టవంతులు. ఏం కోల్పోయామో ఎప్పటికీ తెలుసుకోలేని వాళ్ళు శాపగ్రస్తులు” అంటూ శేఖరం ని శాపగ్రస్తుడిని చేసి వదిలేశాను. కథను అభిమానించిన చాలా మందికి ఈ ముగింపు నచ్చలేదు. కథలో ఉన్న హెవీనెస్ ఫిల్మ్ లో రాలేదన్నారు. అలా అన్న కొందరికి నేను చెప్పిన సమాధానం “ఒక ఫెమినిస్టుగా ఆ ముగింపు నాకు నచ్చలేదు. అందుకే కొంత మార్చాను” అని.

ఛివరిగా శీర్షిక గురించి. స్క్రిప్టు మొత్తం రాసేసరికీ కథ ధృక్కోణం తిలక్ గారి కథలోలాగా కాకుండా వేరేగా కనిపించడం మొదలయ్యింది. జీవితంలో అన్నీ కోల్పోయిన ఒక రమ అనే స్త్రీకి, కోల్పోవడానికి ఏమీ లేని ఒక వాగబాండ్ జగన్నాథం అనే పురుషుడికి ఒక వర్షం రాత్రిలో కలిగే పరిచయం, ప్రేమ, అపోహ, ఎడబాటుల కథ. ఇద్దరూ ఒకరినొకరు పొందారనుకుని సంతోషపడి ఆ సంతోషం నిలవకుండానే విషాదంలో మిగిలిపోయే నిర్భాగ్యుల కథలాగా కాకుండా, వర్షం కోసం ఎదురుచూస్తున్న ఎడారిలాంటి రమ జీవితంలో శేఖర్/జగన్నాథం ఒక తొలకరిజల్లులా కురిసి కనీసం తడి ఆనవాలు కూడా లేకుండా ఇగిరిపోయి, రమను మళ్ళీ ప్రేమకోసం అలమటించేలా వదిలేసిన ఒక శాపగ్రస్తుడి కథలాగా అనిపించింది. ఇందులో జరిగిన ఘటన ప్రముఖం. రమ ప్రేమ అనిర్వచనీయం. ఉన్నతం. శేఖరం ఉనికి అంత ఉదాత్తమైన ప్రేమకు అర్హం కాని దయనీయం. అందుకే లఘుచిత్రం “ఎడారి వర్షం” అయ్యింది.

STORY

FILM
Part1

Part 2

నెత్తుటి నేలపై ప్రేమ పతాక!

Sriram-Photograph“జూలిన్ షేనబెల్ గొప్పతనం ఏమిటంటే ప్రపంచ నాయకులను చర్చలకు ప్రేరేపించేటంతటి గొప్ప కళను సృజించడం’’ — జేవియర్ బార్డెం

మీరు ఒక క్రూరమైన, ప్రబలమైన శక్తి చేత అణచివేయబడుతున్నప్పుడు, ఆ శత్రుత్వంతో నిండిన పరిస్థితులను ఎలా అర్థం చేసుకుంటారు?

ద్వేషానికి  లొంగిపోవడం ద్వారా మీలోని విచక్షణని విడిచిపెడతారా, లేక వాస్తవ  పరిస్థితుల్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నించడం ద్వారా వైరి భావాన్ని  అధిగమించడానికి ప్రయత్నిస్తారా?

గొప్ప ఆలోచనాపరులు అరుదు. దర్శకుడు  జూలిన్ షేనబెల్ గాంధీవలె గొప్ప దార్శనికుడు, ఆలోచనాపరుడు.

ఎన్నో చలన  చిత్రాలు క్రూరమైన యుద్ధాల గురించి లోతైన జ్ఞానాన్ని అందిస్తాయి. కాని  అరుదుగా “మిరల్” వంటి కొన్ని చిత్రాలు మాత్రమే మనసులోని ద్వేషం యొక్క  మూలాల్ని శోధించడానికి, అర్థం చేసుకోవడానికి సహాయం చేస్తాయి. ఆ విధంగా  ఆచరణాత్మకమైన పరిష్కారాల్ని, శాంతితో కూడిన ప్రపంచాన్ని సృష్టించుకోవడం  సాధ్యమేనన్న ఒక ఆశని మన నిస్పృహకు లొంగిపోయిన హృదయాలకు కలిగిస్తాయి. ఈ  సంక్షుభిత లోకానికి మిరల్ వంటి చిత్రాల అవసరం ఎంతో ఉంది. మానవ హృదయంలోని  బలీయమైన ప్రతీకారేచ్ఛ యొక్క తీవ్రతను చూసి తల్లడిల్లిన హృదయాలకు ఈ చిత్రం  ఓదార్పుని ఇస్తుంది.

“మిరల్” దశాబ్దాలుగా రగులుతున్న ఇజ్రాయిల్-పాలస్తీనా సమస్యపై లోతైన అవగాహనని ఇవ్వడమే కాదు, పరిష్కారాన్ని చూపించడానికి కూడా   ప్రయత్నిస్తుంది. అయితే ఈ చిత్రం ఇజ్రాయిల్ కోణం నుండి లేదా పాలస్తీనా  కోణం నుండి కాకుండా ప్రజల కోణం నుండి మాట్లాడుతుంది. ప్రజల దైన్యానికి  ఇజ్రాయిల్ ఎంత కారణమో హమాస్ కూడా అంతే కారణం అని చెబుతుంది. హింస,  తీవ్రవాదం మానవ జీవితాన్ని ఎంతటి దయనీయ స్థితికి నెడతాయో వివరిస్తుంది.  వాస్తవ ఘటనల ఆధారంగా రూపొందించబడిన ఈ చిత్రం ఎంతోమంది దయాన్విత హృదయుల  జీవితాలకు అద్దంపడుతుంది.

1948, అరబ్-ఇజ్రాయిల్ యుద్ధం సమయంలో,  దెయిర్ యాసిన్ నరమేథం తరువాత,  భీతిగొలిపే పరిస్థితుల్లో  వీధుల్లో తల్లితండ్రులు మరణించి అనాధలై భయంతో  వణికిపోతున్న 55 మంది చిన్నారుల్ని మహోన్నతురాలు హింద్  హుస్సేన్ జరేసులేం  తన ఇంటికి తీసుకువెళ్ళి వాళ్లకి ఆహారం,  ఆశ్రయం కల్పించే దయనీయమైన సన్నివేశంతో ఈ చిత్రం ప్రారంభమవుతుంది. ఆరు  నెలల్లో ఆ 55 మంది కాస్తా 2,000 అవుతారు. వారికి ఆమె ఆహారాన్ని ఎలా  సమకూరుస్తుంది  ?  అమానవీయ పరిస్థితుల నుండి రక్షణ ఎలా కల్పించగలదు ? ఆమె తన  వ్యక్తి గత జీవితాన్ని, ఆనందాన్ని వారి కోసం వదులుకొని, ప్రమాదకరమైన రాజకీయ  అనిశ్చిత పరిస్థితులకు దూరంగా వారిని సంరక్షించేందుకు దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్ ని ప్రారంభిస్తుంది.

1778లో మిరల్ అనే 5 ఏళ్ల బాలికను  ఆమె తండ్రి తన భార్య మరణించించిన కారణంగా హింద్ హుస్సేన్ కు అప్పగిస్తాడు.  సంక్షుభిత బాహ్య పరిస్థితుల ఛాయలు తెలియకుండా దర్-అల్-టిఫెల్  ఇనిస్టిట్యూట్లో మిరల్ పెరుగుతుంది. ఆమె తన 17 ఏళ్ల వయసులో ఒక శరణార్థ  శిభిరంలోని పిల్లలకి బోధించడానికి వెళ్ళినప్పుడు మొట్టమొదటిసారి పాలస్తీనా  శరణార్థుల దయనీయ పరిస్థితులను, బాహ్య ప్రపంచపు క్రూరత్వాన్నిచూస్తుంది.  తీవ్రవాది అయిన హని ప్రేమలో పడి “ఫస్ట్ ఇన్ఫిదా” విప్లవోద్యమం వైపు  ఆకర్షితమవుతుంది. విప్లవోద్యమానికి, విద్యయే శాంతికి మార్గమని నమ్మే హింద్  హుస్సేన్ ఆశయాలకి నడుమ  మిరల్  నలిగిపోతుంది.

miral-3

ప్రియుడు హనిని విప్లవకారులే  ద్రోహిగా ముద్రవేసి అనుమానించి చంపివేయడంతో హతాశురాలైన మిరల్ హింసతో నిండిన  తీవ్రవాదం సమస్యలకు పరిష్కారం చూపకపోగా ప్రజల జీవితాల్ని మరింత దుర్భర  పరిస్థితుల్లోకి నెట్టివేస్తుందని అర్థం చేసుకుంటుంది. న్యూయార్క్ లోని  ప్రజలవలె ఇజ్రాయీయులు, పాలస్తీనీయులు, అలాగే అన్ని జాతుల ప్రజలు కలిసి ఒకే  దేశంగా ఎందుకు ఉండకూడదు అని ఆలోచిస్తుంది. దశాబ్దాలుగా పాలస్తీనా భూభాగంలో  సెటిలర్స్ గా జీవిస్తున్న ఇజ్రాయిల్ ప్రజల పై హమాస్ తీవ్రవాదుల హింస కూడా  వ్యతిరేకిస్తుంది.

రాజకీయ కారణాలకు, సామాన్య జీవితాలకు ఎంతో  వ్యత్యాసం ఉంటుంది. ఎన్నటికీ గెలవలేని యుద్ధంలో తరాల ప్రజల ఆనందాన్ని ఫణంగా  పెట్టే కంటే తక్కువ శాతం భూభాగాన్ని స్వీకరించి సర్దుకోవడానికి, ఇజ్రాయిల్  తో చర్చలకు ప్రయత్నిస్తున్న మితవాదులైనవారి వైపు మొగ్గు చూపుతుంది మిరల్. ఈ  చిత్రం సామాన్య ప్రజలలో మన చుట్టూ జీవించి ఉన్న మహాత్ములను పరిచయం  చేస్తుంది.  ఉద్యమాలు ఎలా  మేధావులు, ఆలోచనపరులైన వారి చేతుల్లో నుండి  ఆవేశపరులు  , రహస్య రాజకీయ ఆశయాలు గల వారి చేతుల్లోకి వెళ్లిపోతున్నాయో,  ప్రజలు ఎలా రాజకీయ సిద్ధాంతాలకు ఉద్రేకులై హింసలో పడి తమ జీవితాల్ని నాశనం  చేసుకుంటారో సజీవంగా చూపుతుంది.

హింసతో కాకుండా సామరస్యంతో పరిష్కారం  సాధ్యం అని నమ్మే కొంతమంది ఆశకు బలాన్నిస్తుంది ఈ చిత్రం. హింసతో కూడిన  తీవ్రవాదం యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో రవీంద్రనాథ్ టాగోర్ తన “చార్  అధ్యాయ్” నవలలో వివరించడం అప్పటి అతివాద భారత స్వాతంత్ర్య ఉద్యమకారుల్ని  నిరాశ పరచింది. బ్రిటిష్ ప్రభుత్వం విప్లవోద్యమాల్ని నైతికంగా  దెబ్బతీయడానికి “చార్ అధ్యాయ్” నవలని ఉపయోగించుకొందని వారు ఆరోపించారు.  కాని మానవత్వంపై అచంచలమైన విశ్వాసం ఉన్న టాగోర్ భారత స్వాతంత్ర్య ఉద్యమంలో  గాని, మరే ఇతర ప్రపంచ విప్లవోద్యమాలలోగాని హింసను, తీవ్రవాదాన్నిగాని  సహించలేదు.

“మిరల్” చిత్రం ఒక ప్రాంతంతోగాని, ఒక దేశంతో గాని లేదా ఒక  జాతితో గాని తమని తాము identify చేసుకునేవారికి నచ్చకపోవచ్చు. కాని  మనిషిని మనిషిగా ప్రేమించేవారి హృదయాలపై బలమైన ముద్రని వేస్తుంది.

మిరల్ (2010)

నిడివి:  112 నిముషాలు భాష: ఆంగ్లం దర్శకత్వం : జూలిన్ షేనబెల్ నటులు: ఫ్రిదా  పింటో, విలియమ్ డిఫోయ్, హియం అబ్బాస్, అలెగ్జాండర్ సిద్దిక్