తృప్తి ఫలం

Mythili

 

అనగనగా ఒకావిడకి ఇద్దరు  కూతుళ్ళు…రోలీ, పోలీ. వాళ్ళకి తండ్రి లేడు.   చూసేందుకు బాగానే ఉండేవారు కాని దురుసు గా, స్వార్థంగా  ప్రవర్తించేవారు. వాళ్ళు తనలాగే ఉంటారు కనుకే ఏమో, తల్లికి వాళ్ళంటే ఎక్కువ ఇష్టంగా ఉండేది. తండ్రి బ్రతికి ఉండగా తన చెల్లెలు చనిపోతే ఆమె కూతురిని తెచ్చి వీళ్ళతో పెంచాడు. ఆయన పోయాక ఆ అమ్మాయి అక్కడే ఉంటుండేది. ఆమె పేరు క్రిస్టీన్. తనని చూస్తే ఎర్రగా పండిన ఆపిల్ పళ్ళూ విరబూసిన రోజాపూలూ గుర్తొచ్చేవి. అందం, మంచి స్వభావం  ఆమెలో పోటీ పడుతుండేవి. ఊర్లో అందరూ మెచ్చుకునేవారు. అందుకని వాళ్ళ అత్తకి తనని చూస్తే చిరాకుగా ఉండేది. ఇంటి పనంతా  క్రిస్టీన్ చేయవలసి వచ్చేది.   ఆ తర్వాత ఎండలో తిరుగుతూ బాతులని కాస్తుండేది. ఆమె బట్టలు వెలిసిపోయి, చిరిగిపోయి ఉండేవి. రోలీ పోలీ మాత్రం చక్కటి సిల్క్ బట్టలలో  ముస్తాబై ఊరికే కూర్చునేవారు.

రోలీ , పోలీ లకి మెత్తని రొట్టె, గుడ్లు, చిక్కటి పాలు. క్రిస్టీన్ కి ఎండు రొట్టెలూ నీళ్ళ పాలు. ఆకలి తీరేదే కాదు.

ఒక రోజు క్రిస్టీన్ ఎప్పటిలాగే బాతులని మేపేందుకు కొండ మీది గడ్డి మైదానానికి బయలుదేరింది. చలికాలం రాబోతూ ఉంది. రోలీ పోలీ కి  టోపీల కోసం ఊలు అల్లేందుకు  దాన్నీ అక్కడికి తీసుకుపోతోంది. దోవలో చిన్న సెలయేరు ఉంది. దానీద చిన్న వంతెన. అక్కడొక చెట్టు కొమ్మకి ఊగుతూ  ఎర్రటి టోపీ ఒకటి కనిపించింది. దాని చివర్న ఒక వెండి గంట వేలాడుతోంది. అది చాలా ముద్దుగా ఉంది. క్రిస్టీన్ కాసేపు చుట్టూ చూసింది. అక్కడ ఎవరూ లేరు, అది ఎవరిదీ అయినట్లు లేదు. ఉండబట్టలేక దాన్ని తీసుకుని జేబులోపెట్టుకుంది. ఎవరైనా అడిగితే ఇచ్చేయవచ్చులే అనుకుంది. కొంచెం దూరం నడిచిందో లేదో, వెనక నుంచి తనని ఎవరో పిలవటం వినబడింది.

చూస్తే చాలా పొట్టిగా , సన్నగా ఉన్న ముసలివాడు. టోపీ తనది, ఇచ్చేయమన్నాడు.

image1

క్రిస్టీన్ కి అతన్ని చూస్తే ఎందుకో సరదా వేసింది. ” మరి , అంత ఎత్తుగా ఉన్న కొమ్మ మీద ఎలా ఉంది నీ టోపీ ? చెప్పు, ఇస్తాను ” అంది.

” అదిగో, అక్కడ నేను చేపలు పట్టుకుంటూ కూర్చుంటే, సుడిగాలి వచ్చి ఎగరేసుకుపోయింది . ఇచ్చేయమ్మా, నీకు అయిదు వెండి నాణాలు ఇస్తాగా ”

క్రిస్టీన్ ఆలోచనలో పడింది. తన టోపీ తను తీసుకునేందుకు అతనెందుకు డబ్బు ఇస్తానంటున్నాడు ?

”ఊహూ. చాలదు. దీనికి వెండి గంట కూడా ఉంది కదా ” అంది, ఏమవుతుందో చూద్దామని.

” నూరు నాణాలు ఇస్తాను అయితే ” అతను అన్నాడు.

క్రిస్టీన్ కి అనుమానం ఎక్కువైంది. ” డబ్బు వద్దు నాకు. నేనేం చేసుకుంటాను ! ” – పెదవి విరిచింది.

” ఇది ఇస్తాను తీసుకో అయితే ” అని బొగ్గులాగా నల్లగా ఉన్న   గింజను చూపించాడు ముసలివాడు.

” ఇదెందుకు నాకు ? ”

” ఇది తృప్తినిచ్చే ఆపిల్  విత్తనం. దీన్ని నేలలో పాతితే ఆపిల్ చెట్టు మొలిచి ఒకే ఆపిల్ పండుని కాస్తుంది. అది అందరికీ కావాలనిపిస్తుంది, కాని నువ్వొక్కదానివే పండుని చెట్టునుంచి కోయగలవు. నీకు ఆకలి వేసినప్పుడు ఆహారమూ చలి వేస్తే వెచ్చ దనమూ ఆ పండు ఇస్తుంది. ఒక పండు కోయగానే ఇంకొకటి కాస్తుంది. చాలా ? నా టోపీ ఇచ్చేయి మరి ”

image2

క్రిస్టీన్ కి అంతకన్న ఏం కావాలి ! సంతోషంగా టోపీ ఇచ్చేసి గింజని తీసుకుంది. ముసలివాడు టోపీ తీసుకుని తలమీద పెట్టుకుని చటుక్కున మాయమై పోయాడు, కొవ్వొత్తి మంట  ఊదగానే   ఆరిపోయినట్లు.

ఇంటికి వెళ్ళాక క్రిస్టీన్ గింజని తన గది కిటికీ పక్కన పాతింది. మర్నాడు పొద్దునే బయటికి చూస్తే అక్కడ పెద్ద చెట్టు మొలిచి ఉంది. దానికి ఒకే ఒక ఆపిల్ పండు. సూర్యకాంతిలో బంగారం లాగా మెరుస్తోంది. వెళ్ళి దాన్ని కోసింది. చాలా తేలికగా ఊడి వచ్చింది అది. వెంటనే మరొక పండు వచ్చింది . క్రిస్టీన్ కి ఆకలిగా ఉండి పండు తినేసింది. అది చెప్పలేనంత రుచిగా ఉంది. ఆకలి పూర్తిగా తీరిపోయింది కూడా.

ఇంతలో ఇంట్లోంచి రోలీ వచ్చి చెట్టుకేసీ పండు కేసీ ఎగాదిగా చూసింది. విసురుగా చెట్టునుంచి తెంపబోయింది. అది అందకుండా పైపైకి వెళ్ళిపోయింది. అందుకునేందుకు రోలీ చెట్టు ఎక్కుతూనే ఉంది, చిటారు కొమ్మ దాకా. ఎంతకీ అది ఆమె చేతికి రాలేదు. అలిసిపోయి దిగిపోయింది. ఆమెకి విపరీతంగా కోపం వచ్చింది.

అప్పుడు పోలీ వచ్చింది. ఆమె కూడా అలాగే పండు కోసుకునే ప్రయత్నం చేసింది. తన పనీ అలాగే అయింది. ఊర్లో వాళ్ళు చాలా మంది కోయబోయారు, భంగపడ్డారు. ఎవరికీ ఆ తృప్తినిచ్చే ఆపిల్ అందలేదు. క్రిస్టీన్  మాత్రం ఎప్పుడు కావాలంటే అప్పుడు కోసుకోగలిగేది. ఆకలీ దాహమూ అలసటా తీరటమే కాక తను వేసుకున్న అతుకుల బట్టలే చాలా వెచ్చగా సుఖంగా అనిపించేవి. ఇక ఆ చుట్టు పక్క ఊర్లన్నిటిలోనూ క్రిస్టీన్ అంత సంతృప్తిగా ఎవరూ లేరు. ఊరికే  వచ్చే ఆ పళ్ళు తింటూండటం వల్ల క్రిస్టీన్ తిండికి అయే ఖర్చు తగ్గుతోంది కదా అని ఇంట్లోవాళ్ళు సరిపెట్టుకుని ఊరుకున్నారు .

ఒక రోజు ఆ దేశపు రాజు అటువైపు వచ్చాడు. ఈ ఆపిల్ చెట్టు చూశాడు. ఆయన ప్రజల నుంచి ఏదీ ఉచితంగా తీసుకోకూడదని అనుకునేవాడు. భటులని పిలిచి ఎంత డబ్బు అయినా , కుండెడు బంగారమైనా సరే, ఇచ్చి ఆ పండు తీసుకు రమ్మని చెప్పాడు.

వాళ్ళు వెళ్ళి ఇంటి తలుపు తట్టారు.

రోలీ పోలీ ల తల్లి తలుపు తీసి ఏం కావాలని అడిగింది.

” మా రాజు గారికి ఆ పండు కావాలి . డబ్బు ఇస్తారు, కావలిస్తే ”

ఆ చెట్టు మీద తనకేమీ హక్కు లేదని చెప్పకుండా,  ఆమె అంది – ” అబ్బో, అది చాలా ఖరీదుగా. ఎంత ఇస్తారేమిటి ? ”

భటులలో చిన్నవాడు చెప్పాడు- ” ఎంతయితే అంత. ఓ కుండెడు బంగారం సరిపోతుందా ? ‘’

” సరే. ఆ కుండెడూ బంగారమూ అక్కడ పెట్టి  వెళ్ళి కోసుకోండి ”

భటులు అలాగే ఇచ్చి పండు కోయబోయారు.

యథాప్రకారం ఆ పని ఎవరివల్లా కాలేదు. వెళ్ళి రాజుకి చెప్పారు- ఆ ఇంటావిడ పండు అమ్మనైతే అమ్మిందిగాని అది చేతిలోకి రావటం లేదని- ” మహారాజా, చుక్కలూ చందమామా అయినా అందుతాయేమోగాని అది మాత్రం అందటం లేదు’’

రాజు తన సేనాధిపతిని పంపాడు. అతను చాలా పొడుగ్గా , దృఢంగా ఉంటాడు. అయినా వట్టి చేతులతోనే వెనక్కి వెళ్ళవలసి వచ్చింది.

అప్పుడు రాజు తనే వెళ్ళాడు. తను తప్పకుండా కోయగలననే ఆయన ధీమా. పొద్దుపోయేవరకూ ప్రయత్నిస్తూనే ఉన్నాడు.చేతులకంతా ఆపిల్ సువాసన అంటిందే కాని ఇంకేమీ జరగలేదు. ఇంక చాలించి కోటకి వెళ్ళిపోవలసి వచ్చింది.

అప్పుడు కూడా పండు గురించే ఆలోచిస్తూ ఉన్నాడు. నిద్రలో దాని గురించే కలగన్నాడు. అందరు మనుషులలాగే ఆయనకీ ఆ వస్తు వు ఎంతగా అందకపోతే అంతగా కావాలనిపించింది. దిగులుపడిపోయాడు. కొలువు లో బాగా జ్ఞానం ఉన్న ఒకాయన ని పిలిచి రాజు  సలహా అడిగాడు.

ఆయన చెప్పాడు – ” ఆ చెట్టు ఎవరి సొంతమో వారికే ఆ పండు అందుతుంది మహారాజా! ఆ ఇంటావిడని అసలు సంగతి కనుక్కోండి ”

రాజు అప్పటికప్పుడు గుర్రమెక్కి అక్కడికి బయల్దేరి వెళ్ళాడు. ఇంటావిడా, రోలీ, పోలీ ఉన్నారు ఇంట్లో. క్రిస్టీన్ బాతులని మేపేందుకు వెళ్ళి ఉంది.

రాజు మర్యాదగా వాళ్ళని ఆ చెట్టు సొంతదారు ఎవరని అడిగాడు.

” ఇదిగో, మా పెద్దమ్మాయిదే ఆ చెట్టు ” అని రోలీని వాళ్ళ అమ్మ ముందుకి తోసింది.

” అలాగా ! వెంటనే ఆపిల్ కోసి నాకు ఇవ్వమనండి. ఆమెని పెళ్ళాడి ఈ రాజ్యానికి రాణిని చేస్తాను. ఎంత మాత్రం ఆలస్యం చేయద్దు ”

ఇంటావిడ అంది ” అలా ఎలా మహారాజా ! వయసులో ఉన్న ఆడపిల్ల కదా, మీ ముందు తను చెట్టెలా ఎక్కుతుంది ? మీరు కోటకి వెళ్ళండి, తను పండు కోసి తెస్తుంది ”

సరే, త్వరగా పండు తెమ్మని హెచ్చరించి రాజు వెళ్ళిపోయాడు.

క్రిస్టీన్ కి కబురు పెట్టి, ఆమె  ఇంటికి రాగానే ఆ పండు వెంటనే కోసి ఇచ్చేయమనీ లేకపోతే తనని బావిలోకి తోసేస్తామనీ వాళ్ళు బెదిరించారు. చేసేదిలేక క్రిస్టీన్ ఆపిల్ కోసి ఇచ్చింది. రోలీ ఆ పండుని అందమైన రుమాలులో భద్రంగా చుట్టి కోటకి వెళ్ళి తలుపు తట్టింది. విషయం చెప్పగానే కాపలావాళ్ళు లోపలికి వెళ్ళనిచ్చారు. రాజు రుమాలు విప్పి చూస్తే ఏముంది…పండు ఉండవలసిన చోట గుండ్రటి రాయి ఉంది.

రాజు సేనాధిపతిని వాళ్ళ ఇంటికి పంపి, నిజంగా ఆ చెట్టు ఎవరిదో గట్టిగా గద్దించి అడగమన్నాడు.

ఈసారి ఇంటావిడ – ” తప్పైందండీ. అసలు ఆ చెట్టు మా చిన్నమ్మాయిది. పెద్దది కదా అని దాని పేరు చెప్పాను. మీరు వెళ్ళండి, అది పండు తెస్తుంది ” అని బుకాయించింది.

క్రిస్టీన్ ని మళ్ళీ భయపెట్టి పండు సంపాదించారు. పోలీ పెద్ద శాలువాలో దాన్ని చుట్టి పట్టుకెళ్ళింది. కోటకి చేరుతూనే

పండు కాస్తా చెక్కముక్కగా మారిపోయింది. రాజు చెడామడా తిట్టాడు. ఆమె ఏడ్చుకుంటూ ఇంటికి వచ్చింది.

సేనాధిపతి వచ్చి నిజం చెప్పకపోతే అందరినీ చం పేయాల్సివస్తుందన్నాడు.

అప్పటికి ఇంటావిడ- ” ఆ, ఉందిలెండి, ఎందుకూ పనికిరాని ఒక పిల్ల. దాని దరిద్రపు మొహం రాజుగారికి చూపించటమెందుకులే అనుకున్నాను ” అంది.

” ఎవరయి తేనేం ? ఆమెని వెంటనే పంపి తీరాలి. ముందు నేను చూడాలి ” సేనాధిపతి అన్నాడు. ఇక తప్పక క్రిస్టీన్ ని పిలిపించారు. ఆమె పాతబట్టలలో ఉన్నా కూడా తన చక్కని రూపం, మొహం లో వివేకం, మంచితనం – సేనాధిపతికి కనిపించాయి. చప్పున వంగి నమస్కరించి విషయం చెప్పాడు.

image3

ఆపిల్ కోసుకుని క్రిస్టీన్ అతనితోబాటు బయల్దేరింది. ఆ  బీద అమ్మాయితో సేనాధిపతి వెళుతూండటం కోట చుట్టు పక్కల జనానికి వింతగా తోచింది. కొందరు పైకే నవ్వేశారు కూడా. అతను అదేమీ పట్టించుకోలేదు. రాజు కోరిక ఇప్పుడు తీరబోతోందని అతనికి నిశ్చయంగా తెలుస్తోంది.

” నువేనా చెట్టు సొంతదారువి ? ” రాజు అపనమ్మకంతో  అడిగాడు.

జవాబుగా క్రిస్టీన్ ఆయనకి ఆపిల్ ఇచ్చింది. రాజు  నోట్లోపెట్టుకుని కొరికాడు. వెంటనే ఆయనకి ఎంతో హాయిగా, సుఖంగా అనిపించింది. కోటలో వాతావరణం, మనుషులు- ఎవరి లోనూ ఏ వంకా లేదనిపించింది. ఎదురుగా ఉన్న  క్రిస్టీన్ ఆయనని బలంగా ఆకర్షించింది. ఆమెలాంటి దాన్ని అంతవరకూ చూడనేలేదని, ఆమె తనని పెళ్ళాడితే ఇంకేమీ అక్కర్లేదని , అనుకున్నాడు. క్రిస్టీన్ నిజంగానే అందమైనదీ మంచి దీ అయినా,  తృప్తి ఇచ్చే ఆపిల్ పండు తినటం వల్లనే రాజుకి ఆ విషయం తెలిసివచ్చింది. క్రిస్టీన్ రాజుని పెళ్ళాడేందుకు ఆనందంగా ఒప్పుకుంది.

త్వర లోనే వాళ్ళ పెళ్ళి వైభవంగా జరిగింది. పెళ్ళి విందుకి రోలీ, పోలీ, వాళ్ళ అమ్మ కూడా వచ్చారు. రాజు ముందు వద్దని అన్నా, క్రిస్టీన్ పెద్దమనసుతో వాళ్ళని రమ్మని పిలిచింది. ఆపిల్ చెట్టు ఇకమీదట తమకే సొంతమవుతుందని వాళ్ళు ఆశ పడ్డారు. అయితే అలా ఏమీ కుదరలేదు వాళ్ళకి. తెల్లా రేసరికి ఆపిల్ చెట్టు, కోటలో క్రిస్టీన్ గది బయట ప్రత్యక్షమైంది. అది ఆమెకి మాత్రమే దొరికిన వరం . ఆమె భర్త కనుక రాజుకీ అది అదృష్టమైంది , అందరిలాగే ఆయనకీ ఆ తృప్తినిచ్చే పండుని అప్పుడప్పుడూ రుచి చూడటం అవసరం కదా.

                                           సేకరణ – Howard Pyle

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

భగవంతుడి స్నేహితుడు

MythiliScaled

అనగనగా పర్షియా దేశం లో అబ్దుల్ కరీం అనే పేదవాడు ఉండేవాడు. అతనికి జెబా అనే భార్య, యూసఫ్, ఫాతిమా అని ఇద్దరు పిల్లలు. కొండలమధ్యన ఉన్న లోయలో వాళ్ళ పల్లెటూరు . కొండల మీదంతా చక్కని పళ్ళతోటలు- వాటిలో పీచ్, మల్ బెర్రీ , ద్రాక్ష లాంటి పళ్ళు విరగకాసేవి.

కరీం ఒక ధనవంతు డి పొలం లో పని చేసేవాడు. అతనికీ కుటుంబానికీ సరిపడా తిండీ బట్టా తప్పించి అతనికి డబ్బుగా జీతమేమీ వచ్చేది కాదు.డబ్బు పేరు వినటమేగాని ఎన్నడూ చూసి ఎరగడు.

ఇలా ఉండగా ఒక రోజున యజమాని కి కరీం చేసేపని బాగా నచ్చి పది రియాల్ లు [ వెండి నాణాలు ] అతని చేతికి ఇచ్చాడు. ఎలా కావలిస్తే అలాగ ఖర్చు పెట్టుకోవచ్చని చెప్పాడు.కరీం కి అది చాలా ఎక్కువ డబ్బు అని తోచింది. ఇంటికి వెళుతూనే ఆ నాణాలని భోజనాల బల్ల మీద పరిచి- ” జెబా, చూడు ! నిధి దొరికింది మనకి ” అని సంతోషంగా అరిచాడు. భార్యా పిల్లలూ చాలా మురిసిపోయారు. కరీం వాళ్ళతో అన్నాడు – ” చెప్పండి మరి, వీటితో ఏం చేద్దాం ?   మషాద్ నగరం ఇక్కడికి ఇరవై మైళ్ళే కదా, అక్కడి ఇమాం రజా సమాధి మీద రెండు నాణాలు సమర్పించి ఆ తర్వాత బజారుకి వెళతాను. అక్కడ మీకేంకావాలంటే అది కొనుక్కొస్తాను ”

” నాకొక పట్టుతాను కావాలి, కొత్త దుస్తుల కోసం ” – భార్య అడిగింది.

” నాకొక మంచి గుర్రమూ కత్తీ ” యూసఫ్ అడిగాడు. అతను బాగా చిన్నపిల్లవాడు .

” నాకొక కాశ్మీరు శాలువా, జలతారు చెప్పులు ” వయసు వస్తూన్న కూతురు ఫాతిమా అడిగింది.

” ఓ.తప్పకుండా. రేపు రాత్రికల్లా మీరు కోరినవన్నీ వచ్చేస్తాయి ” అని ధీమాగా చెప్పేసి కరీం నగరానికి బయలుదేరాడు.

కొండలు దిగి మైదానం లోంచి నడిచి అతను మషాద్ నగరం చేరాడు. ఆ నగరపు వైభవాన్నీ , ఎత్తైన భవనాలనీ , ధగధగమనే మసీదుల గోపురాలనీ చూసి బోలెడంత ఆశ్చర్యం వేసింది అతనికి. ముందు ఇమాం రజా సమాధి ఉన్న పుణ్యక్షేత్రానికి వెళ్ళాడు. వాకిట్లో ఉన్న పెద్దాయనని ” నేను లోపలికి వెళ్ళచ్చా ?” అని అడిగాడు. ” అలాగే , వెళ్ళునాయనా ! నీకు ఉన్నదానిలోంచి ఇవ్వగలిగినంత అక్కడ అర్పించు. అల్లా నిన్ను చల్లగా చూస్తాడు ” అని బదులిచ్చాడు ఆయన.కరీం లోపలికి వెళ్ళాడు. ఆసియా ఖండం మొత్తం నుంచీ అక్కడికి భక్తులు వస్తుంటారు. వాళ్ళు ఇచ్చిన కానుకలతో ఆ క్షేత్రం కళకళలాడుతూ ఉంటుంది. బంగారు, వెండి నగలూ పాత్రలూ ఖరీదైన తివాసీలూ కుప్పలు పోసి ఉన్నాయి అక్కడ. కరీం అవన్నీ నోరు తెరుచుకుని చూసి, రెండు వెండి నాణాలని బెరుకు బెరుకుగా సమాధి మీద ఉంచి వెనక్కి తిరిగాడు. ఇప్పుడు అతని దగ్గర ఎనిమిది నాణాలు మటుకే ఉన్నాయి.

La_civilització_del_califat_de_Còrdova_en_temps_d'Abd-al-Rahman_III

చాలా రద్దీగా, హడావిడిగా ఉన్నాయి అక్కడి బజార్లు. ఒక్కొక్క వస్తువు అమ్మేందుకుఒక ప్రత్యేకమైన బజారు ఉంది. పళ్ళకి ఒకటి, పాత్రలకి ఒకటి, నగలకి ఒకటి, రొట్టెలకి ఒకటి – ఇలాగ. అన్నీ దాటుకుని చివరికి పట్టు వస్త్రాలు అమ్మే చోటికి వచ్చాడు.

ఒక దుకాణం లో ప్రవేశించి అవీ ఇవీ తిరగేసి ఆఖర్న జరీ పని చేసిన వంగపండు రంగు పట్టు తానుని ఎంచుకున్నాడు. ” ఇది తీసుకుంటాను, వెల ఎంత ? ” అని దుకాణదారుని అడిగాడు.

” మామూలుగా నాలుగు వందల వెండినాణాలు అండీ. మీరు కొత్తగా ఇక్కడ అడుగుపెట్టారు కనుక మీకు రెండువందలకే ఇస్తాను, తీసుకోండి ” దుకాణం అతను చెప్పాడు.

” ఏమిటీ, రెండు వందలా? మీరేదో పొరబడినట్లున్నారు. చూడండి- ఇటువంటి నాణాలేనా, రెండు వందలు ? ” తన దగ్గర ఉన్న రియాల్ ని చూపించి అడిగాడు కరీం.

” ఆ, కాక ఇంకేమిటనుకుంటున్నారు ? రెండువందలు దీనికి చాలా సరసమైన ధర ” అని దుకాణం అతను జవాబు ఇచ్చాడు. కరీం దగ్గర ఎనిమిది నాణాలే ఉన్నాయనీ వాటితోనే అతను పట్టు తానూ కత్తీ గుర్రమూ కాశ్మీరు శాలువా జరీచెప్పులూ అన్నిటినీ కొనదలచుకున్నాడనీ విని కరీం ని బయటికి గెంటాడు. ” అడ్డమైన ప్రతివాడూ వచ్చి నా పట్టు తానులు ముట్టుకునేవాడే ” అని తిట్టాడు.

(c) Wellcome Library; Supplied by The Public Catalogue Foundation

నిరాశ తో ఈసారి గుర్రాలు అమ్మే చోటికి వెళ్ళాడు కరీం. బాగా చవకైన గుర్రానికి రెండువందల యాభై నాణాలు ఇవ్వాలని తెలిసింది. కరీం దగ్గర ఉన్న డబ్బు ఎంతో విన్న అక్కడివాళ్ళు దానికి గాడిదలో పదహారోవంతు కూడా రాదని వెక్కిరించారు. కత్తి ధర కనీసం ముప్ఫై నాణాలు, జరీ చెప్పులది యాభై , కాశ్మీరు శాలువాలలో బాగా నాసిరకం దానికి పన్నెండు నాణాలు చెల్లించాలి.

దేన్నీ కొనలేనన్న బాధతో, అలసటగా , కరీం ఊరికి ప్రయాణం అయాడు. దారిలో ఒక బిచ్చగాడు ఎదురై ” అయ్యా, ధర్మం చేయండి. రేపు శుక్ర వారం, పవిత్రమైన రోజు. బీదవాడికి ఇస్తే భగవంతుడికి ఇచ్చినట్లే, అల్లా మీకు వందరెట్లు వెనక్కి ఇస్తాడు ” అని అడుక్కుంటున్నాడు.

కరీం కి ఆపాటికి డబ్బు మీద విసుగుపుట్టి ఉంది. ” నా దగ్గర ఉన్నదాంతో తృప్తి పడగలవాడివి నువ్వొక్కడివే ” అని బిచ్చగాడితో అంటూ తన ఎనిమిది నాణాలనీ అతనికి ఇచ్చే సి వట్టి చేతులతో వెనక్కి వెళ్ళాడు

వాళ్ళ ఇంటి ముంగిట్లోనే ఎదురు చూస్తూ ఉన్న కొడుకు యూసఫ్ పరిగెత్తుకుంటూ వచ్చి ” నాన్నా, కత్తీ గుర్రమూ ఏవీ ? ” అని అడిగాడు. ఆ వెంటనే వచ్చిన భార్యా కూతురూ కూడా తమ వస్తువుల కోసం అడిగారు. అంతా విన్నాక భార్య జెబా మండిపడింది. ఎనిమిది నాణాలు బిచ్చగాడికి ఇచ్చాడని యజమానికి ఫిర్యాదు చేసింది.

యజమానికీ చాలా కోపం వచ్చింది. కరీం ని పిలిచి తెగ చీవాట్లు పెట్టాడు. ” నీ గురించి నువ్వు ఏమనుకుంటున్నావోయ్ ? పెద్ద జమీందారువా నువ్వు ? బిచ్చగాడికి నేనే ఒక్క రాగినాణెం ఇస్తుంటాను , నువ్వు ఎనిమిది వెండినాణాలు ఇవ్వవచ్చావా ? ” అని కోప్పడి, శిక్షగా అక్కడికి కొంతదూరం లో ఉన్న ఎడారికి పొమ్మన్నాడు. అందులో యజమానికి కొంత భూమి ఉంది . అక్కడ మండుటెండలో పనిచేసి , నీళ్ళు పడేదాకా   తవ్వి అప్పుడు తిరిగి రమ్మన్నాడు.

కరీం   అలాగే వెళ్ళి రోజులతరబడి తవ్వుతూ పోయాడు. చివరికి నీరు పడింది, దాంతోబాటు ఒక ఇత్తడి బిందె కూడా దొరికింది. దాని మీదంతా నగిషీలు చెక్కి ఉన్నాయి. నిండుగా వజ్రాలూ వైఢూర్యాలూ. అవేమిటో కరీం కి తెలియలేదు. కాని మషాద్ నగరపు బజార్లలో అటువంటివి అమ్మటం చూసిఉన్నాడు. వీలు కుదరగానే వెళ్ళి తనూ అమ్మగలిగితే కాస్త డబ్బు వచ్చి భార్య కోపం తగ్గుతుందని అనుకున్నాడు.

ఎడారిలో నీరు పడటం వల్ల యజమానికి ఆనందం కలిగింది. కరీం కష్టానికి జాలిపడి కొన్ని రోజులు విశ్రాంతి తీసుకోమన్నాడు. మరుసటిరోజు కరీం జేబునిండా వజ్రాలు నింపుకుని నగరానికి వెళ్ళాడు. ఒక నగలదుకాణం లో అద్దాల కిటికీ లో అటువంటి రాళ్ళు ఉండటం గమనించి వెళ్ళి దుకాణదారుని అడిగాడు ” ఇటువంటి రాళ్ళు అమ్మితే కొంటారా ? ”

కరీం ని చూస్తే వజ్రాలు అమ్మగలిగేవాడు గా కనిపించలేదు. దుకాణం అతను వెటకారంగా ” ఏం ఉన్నాయేమిటి నీ దగ్గర ? ” అన్నాడు.

” ఇదిగో ” అని ఒకటి చూపించాడు కరీం. ” నా జేబునిండా ఉన్నాయి తెలుసా ” అనీ చెప్పేశాడు.

దుకాణం అతను ఆశ్చర్యపోయాడు. కరీం వాటిని దొంగిలించి ఉంటాడని నిర్ణయించుకుని అతన్ని మాటల్లో పెట్టి , నౌకరుతో రక్షక భటులకి కబురు చేశాడు. వాళ్ళు అడిగితే కరీం అంతా చెప్పుకొచ్చాడు. భూమిలో దొరికిన సొత్తు ఏదైనా సుల్తాన్ కి చెందుతుంది కనుక కరీం మీద నేరాన్ని మోపి అతన్నీ కుటుంబాన్నీ చెరలో పెట్టి ఇత్తడిబిందెను స్వాధీనం చేసుకుని ఖజానాకి పంపారు. కరీం కి ఆ బిందె సుల్తాన్ ది అవుతుందనే సంగతి తెలియదు.

Art Painting (45)

ఇదంతా జరిగిపోవటం సుల్తాన్ వరకూ వెళ్ళలేదు. కాని అతనికి ఒకే కల పదే పదే రావటం మొదలైంది. కలలో ఒక గొంతు ” అల్లా స్నేహితుడిని విడిపించు ” అంటూ ఉంది. ముందు పట్టించుకోకపోయినా, ఒక రాత్రి కలలోనే సుల్తాన్ ఎవరినని అడిగాడు. ఎంతో పేదవాడై ఉండీ తనకున్నదానిలో అయిదోవంతు ను పుణ్యక్షేత్రానికీ మిగిలినది బిచ్చగాడికీ ఇచ్చేసిన కరీం అల్లా కి స్నేహితుడని ఆ గొంతు చెప్పింది. అతన్ని చెరలో పెట్టిన వివరం కూడా రాజుకి తెలియజేసింది.

తెల్లవారుతూనే సుల్తాన్ ఆఘమేఘాల మీద చెరసాలకి వెళ్ళాడు. కరీం ని కలుసుకుని అతని సంకెళ్ళు తన చేతులతో స్వయంగా విడిపించాడు. కరీం చెంపల మీద కన్నీళ్ళు కారిపోతూ, ” నన్ను బంధించండి, వాళ్ళని విడిపించండి. వాళ్ళకి ఏ పాపమూ తెలియదు ” అని భార్యనీ పిల్లలనీ చూపించి వేడుకున్నాడు. ” అందరినీ విడిపిస్తాను ” అని సుల్తా న్ ధైర్యం చెప్పాడు. ” మీరంతా రాజభవనం లో భోజనం చేసి విశ్రాంతి తీసుకోండి. నాకు అల్లా పంపిన అతిథులు మీరు ” అని వాళ్ళని గౌరవించి ఆ ఇత్తడిబిందెలో దొరికిన వజ్రాల విలువ మొత్తమూ వెండినాణాలుగా కరీం కి ఇచ్చాడు. వాటిని ఎలా ఉపయోగించాలో కరీం కి ఇప్పుడు తెలుసు గనుక యూసఫ్ తో కలిసి బజారుకి వెళ్ళి ఇదివరకు కొనలేనివన్నీ ఇప్పుడు భార్యకీ పిల్లలకీ కొనిపెట్టాడు. తక్కినదానితో ఏం చేయాలో అతని ఊహకి అందలేదు. భార్య జెబా ఆ బాధ్యత తీసుకుని యజమాని సాయం తో వాళ్ళ ఊర్లో చాలా పొలం కొని, మంచి ఇల్లు కట్టింది. కరీం బీదవాళ్ళకి దానం చేస్తూ ఉండేందుకూ , మసీదులో ఇచ్చుకునేందుకూ అతని జేబులో రోజూ కొన్ని నాణాలు పెట్టేది .

అలా తను ధర్మం చేసినది ఎన్నో వందలరెట్లుగా తిరిగి వచ్చింది. అయితే అదేమీ కరీం మనసుకి పట్టలేదు. భార్యా పిల్లలూ సంతోషంగా ఉండటం అతనికీ సంతోషాన్ని ఇచ్చింది.

islamic-art-paintings

  • పర్షియన్ జానపదకథ

ముడి

MythiliScaled

చాలా కాలం కిందట ఫ్రాన్స్ , బెల్జియం సరిహద్దులో ఒక పట్టణం . అది బర్చర్డ్ అనే జమీందారు అధీనం లో ఉండేది. అతను చాలా క్రూరుడు, ప్రజలు చాటుగా అతన్ని ‘ తోడేలు జమీందారు ‘ అనేవారు. అతని భార్య మాత్రం చాలా మంచిది. భర్త వల్ల కలిగే కష్టాలనీ నష్టాలనీ తగ్గించేందుకు రహస్యంగా తన ప్రయత్నం తను చేస్తూ ఉండేది. అతనూ భార్య అంటే ఏ కాస్తో గౌరవం ఉన్నట్లుగా చూసీ చూడనట్లు ఊరుకునేవాడు – జనాన్ని హింసించటం మాత్రం కట్టిపెట్టేవాడు కాదు.

dyck-self-portrait

ఒక రోజు వేటకి వెళ్ళి వస్తుండగా అడవి అంచున ఒక చిన్న ఇంటి ముంగిట్లో చక్కని అమ్మాయి నార వడుకుతూ కనిపించింది.

” నీ పేరేమిటి ? ” అడిగాడు

” రెనెల్డ్, అయ్యా ! ”

” ఇక్కడ ఏ సందడీ లేదులా ఉందే- అస్తమానమూ ఇక్కడే ఉంటే విసుగు పుట్టదూ నీకు ?”

” లేదయ్యా , అలవాటైపోయింది ”

” అలా కాదులే. నాతోబాటు కోటకి రాకూడదూ ? అమ్మగారికి చెలికత్తెగా ఉండిపోవచ్చు ”

” కుదరదదయ్యా. మా అమ్మమ్మ పెద్దదైపోయింది.ఆమెని నేనే చూసుకోవాలి ”

” ఆ వంకలేం చెప్పకు. సాయంత్రానికల్లా అక్కడికి వచ్చేయి ”

కాని రెనెల్డ్ వెళ్ళలేదు. ఆమెకి గిల్బర్ట్ అనే కట్టెలుకొట్టే యువకుడితో పెళ్ళి కుదిరిఉంది కూడా.

మూడురోజులయాక జమీందారు మళ్ళీ ఆ వైపు వచ్చాడు.

” ఏం అమ్మాయ్ , రాలేదేం ? ”

” చెప్పాను కదయ్యా, వీలుకాదని ”

ఇలా రెండు మూడు సార్లు ఆమెని కోటకి చెలికత్తెగా రమ్మని అడిగి, ఆమె రాకపోయేసరికి ఒకరోజు ” నువ్వు వస్తే అమ్మగారిని వదిలేసి నిన్నే పెళ్ళాడతాను ” అనేశాడు జమీందారు.

రెనెల్డ్ కి అతని దుర్బుద్ధికి అసహ్యం వేసింది. రెండేళ్ళ కిందట ఆమె తల్లి పోయినప్పుడు జమీందారిణి వాళ్ళని ఎంతగానో ఆదుకుంది. ఆవిడకి హాని చేసేపనిని రెనెల్డ్ కలలో కూడా తలపెట్టలేదు.

John Faed The Spinningwheel

అలా కొన్ని వారాలు గడిచాయి. అతని పీడ వదిలిందని రెనెల్డ్ అనుకుంది. కాని ఆ రోజు చేతిలో తుపాకీ పట్టుకుని అతను మళ్ళీ వచ్చాడు. ఈసారి రెనెల్డ్ నార బదులు నూలు వడుకుతోంది.

” ఏమిటి చేస్తున్నావు ? ”

” నా పెళ్ళి గౌన్ కోసం అయ్యా ”

” నీకు పెళ్ళా ఏమిటి, అయితే ? ”

” అవునయ్యా. మీరు అనుమతి ఇస్తే ”

ఆ రోజులలో ప్రజల్లో ఎవరు పెళ్ళి చేసుకోవాలన్నా జమీందారు ఒప్పుకోవలసి ఉండేది. సామాన్యంగా ఒప్పుకోకపోవటమేమీ ఉండేది కాదు.

అయితే ఈ దుర్మార్గుడు ఇలా అన్నాడు ” ఆ. ఒప్పుకుంటాలే. అదిగో, ఆ దురదగొండి పొదలు లేవూ ? వాటిపీచులోంచి బట్ట నేసి ఉంచు. నీ పెళ్ళి గౌన్ కీ, నేను చచ్చిపోయినప్పుడు కప్పే గుడ్డకీ- రెంటికీ సరిపోవాలి అది . ఎందుకంటే నన్ను పాతిపెట్టే రోజునే నీకు పెళ్ళి ! ” చెప్పేసి వికటంగా నవ్వుతూ వెళ్ళిపోయాడు జమీందారు.

రెనెల్డ్ వణికిపోయింది. దురదగొండి పీచునుంచి దారం తీయటం కనీ వినీ ఎరగని సంగతి. ఇక బట్టని నేయటమా ? అసలు చేతులకి తగిలితేనే దురదా మంటా పెడతాయి కదా.

పైగా జమీందారుకి నడివయసు దాటలేదు. మంచి ఆరోగ్యంగా ఉన్నాడు. అతను పోయాక తన పెళ్ళి ఏమిటి- ఆమె ఇంక ఆలోచించలేక పోయింది.

ప్రతిసాయంత్రమూ గిల్బర్ట్ వాళ్ళింటికి వస్తుండేవాడు. ఆరోజు అతనికి జరిగినదంతా రెనెల్డ్ చెప్పింది. అతనికి చాలా కోపం వచ్చింది – ” ఈ గొడ్డలి తో వాడి బుర్ర బద్దలు కొడితే శని  వదిలిపోతుంది ” అన్నాడు.

రెనెల్డ్ వద్దంది. శుభమా అని పెళ్ళి చేసుకోబోయేముందు- ఎవర్నైనా సరే, చంపటం మంచిది కాదంది. జమీందారిణి తమ పట్ల చాలా దయగా ఉండటాన్ని గుర్తు చేసి ఆమె భర్తని చంపటం ధర్మం కాదని చెప్పింది.

ప్రయత్నించి చూద్దామనుకుని మర్నాడు ఆ పొదల నుంచి పీచుని లాగి వడికింది. ఆశ్చర్యకరంగా ఏ దురదా పెట్టకపోగా మెత్తగా తేలికగా బలంగా ఉన్న దారం తీయటం వీలయింది. త్వరలోనే తన పెళ్ళి గౌన్ కోసం బట్టని నేసి కుట్టేయగలిగింది. అయితే జమీందారు తన శవం మీద కప్పే బట్ట అన్నాడు కదా, దాన్ని మాత్రం నేయటం మొదలుపెట్టలేదు. అందుకు ఆమెకి మనసు రాలేదు. ఎలాగో తన గౌన్ ని తయారుచేయగలిగింది కనుక జమీందారు ఆ రెండో బట్ట సంగతి ఎత్తడులే అని ఆశ పడింది.

జమీందారు వచ్చాడు. తెల్లగా మృదువుగా ఉన్న పెళ్ళి గౌన్ ని చూపించింది.

అతనువెలవెలబోయాడు . ” సరేలే. రెండోది కూడా కానీ మరి ” కరుగ్గా అని వెళ్ళిపోయాడు. ఆమె నేయటం మొదలు పెట్టింది. జమీందారు కోటకి వెళ్ళేలోపే అతనికి నలతగా అనిపించింది. కాసేపటికి జ్వరం తగిలింది. అన్నం తినలేకపోయాడు, నిద్రపట్టలేదు. మరుసటిరోజు పక్కమీదినుంచి లేవలేకపోయాడు. ఆ జబ్బు తగ్గేటట్లుగా అనిపించలేదు. ఇదంతా రెనెల్డ్ నేస్తున్న బట్ట వల్లనేనని అతనికి అర్థమైంది. దాన్ని వాడాలంటే చనిపోవాలి కదా.

వెంటనే ఆ నేయటాన్ని మానేయమని ఆమెకి కబురు చేశాడు. రెనెల్డ్ మానేసింది, ఆ పని ఆమెకే ఇష్టం లేదు.

ఆ సాయంత్రం గిల్బర్ట్ వచ్చాడు. ” జమీందారు మన పెళ్ళికి అనుమతి ఇచ్చాడా మరి ? ” అడిగాడు. ” లేదు ” రెనెల్డ్ చెప్పింది. ” అయితే నేయటం మానేయకు. ఇంక వేరే ఎలాగూ అతను ఒప్పుకునేటట్లు లేడు ” గిల్బర్ట్ అన్నాడు.

సరే, ఆ తర్వాతి రోజు మళ్ళీ ఆమె మగ్గం ముందు కూర్చుంది. రెండు గంటలు గడిచేలోపు జమీందారు సైనికులు వచ్చి ఆమె చేతులూ కాళ్ళూ కట్టేసి నది లోకి విసిరేసి ఆమె మునిగిపోవటం చూసి వెళ్ళిపోయారు. వర్షాలు పడి నది పొంగిపొర్లుతూ ఉంది. రెనెల్డ్ కి ఈత రాదు. కాని ఆమె నీళ్ళ మీద తేలింది, ఒడ్డుకీ చేరింది.

ఆ వెంటనె ఆమె ఇంటికి వెళ్ళి నేయటం మొదలుపెట్టింది. ఈసారి సైనికులు ఆమె మెడకొక బండరాయికట్టి మరీ నదిలోకి విసిరారు. వాళ్ళు అటు తిరగగానే ఆ రాయి ఊడిపోయింది, మళ్ళీ ఆమె తప్పించుకుంది. నేస్తూనే ఉంది. జమీందారు జబ్బు ఎక్కువైంది. తుపాకీ తో కాల్చాడు, ఆమెకి గుండు తగల్లేదు. మగ్గాన్ని విరగగొట్టారు, దానంతట అదే బాగయింది. చెరలో పెట్టారు, ఆమె ముందు మగ్గమూ దారమూ ప్రత్యక్షమయాయి. చేతులు కట్టేస్తే వెంటనే విడిపోతున్నాయి. ఆమెని చంపేసే ప్రతి ప్రయత్నమూ విఫలమైంది. ఇంక చేసేది లేక జమీందారు చావు కోసం ఎదురు చూస్తూ ఉన్నాడు.

wassilij-maximowitsch-maximow-kranker-mann-06299

 

భర్త పరిస్థితి చూసి జమీందారిణి దిగులుపడింది. జబ్బుకి కారణం తెలుసుకుని అతనికి మంచిమాటలు చెప్పింది. అప్పటికి కూడా వాళ్ళ పెళ్ళికి ఒప్పుకోవాలని అతనికి అనిపించలేదు. అంత అహంకారం. అప్పుడు అతనికి తెలియకుండా ఆమె రెనెల్డ్ దగ్గరికి వెళ్ళి ఇంక ఆ బట్టని నేయవద్దని వేడుకుంది. అంత పెద్దావిడ వచ్చి అడిగేసరికి రెనెల్డ్ కాదనలేకపోయింది, అలాగేనని మాట ఇచ్చింది.

ఆమె నేయకపోవటం గిల్బర్ట్ గమనించాడు – ” అయితే మన పెళ్ళికి అనుమతి వచ్చిందా ? ” అడిగాడు. ” లేదు ”

” మరి ? ”

” అమ్మగారికి మాట ఇచ్చాను, మానేస్తానని ”

‘’ అతను చచ్చిపోతే మనకేమిటి ? ”

” అయ్యో, అమ్మగారు ఏమనుకుంటారు ! కొన్ని రోజులు వేచి ఉందాం. అతని మనసు కరుగుతుందేమో ” రెనెల్డ్ అంది.

వాళ్ళు రోజులూ వారాలూ నెలలూ ఎదురు చూశారు. జమీందారు రెనెల్డ్ ని వేధించటం మానుకున్నాడు గానీ పెళ్ళికి అనుమతి ఇవ్వనేలేదు. రెనెల్డ్ మళ్ళీ నేయటం మొదలుపెట్టలేదు. గిల్బర్ట్ కి చిరాకు, కోపం వచ్చాయి. ” ఇంక చాలు ” అన్నాడు. ” ఇంకొద్ది రోజులు చూద్దాం ” అంది ఆమె. గిల్బర్ట్ కి విసుగు పుట్టింది, రావటం మానేశాడు. రెనెల్డ్ చాలా ఏడ్చింది, కాని మళ్ళీ ఆ బట్టని నేయలేదు.

ఒకరోజు జమీందారు ఆమెకి ఎదురు పడ్డాడు. ఇప్పుడతని ఆరోగ్యం బావుంది.

ఆమె చేతులు జోడించి అడిగింది- ” అయ్యా, దయ చూపండి ” అని. అతను తల తిప్పేసుకుని వెళ్ళిపోయాడు. అప్పటికీ ఆమె ఇచ్చినమాట నిలబెట్టుకోవాలనే అనుకుంది. గిల్బర్ట్ ఊరు వదిలి వెళ్ళిపోయాడు. వెళ్ళేటప్పుడు ఆమెకి చెప్పనైనాలేదు. ఆమె కుమిలిపోయింది.

ఇంకొక ఏడాది గడిచింది. జమీందారు మళ్ళీ జబ్బు పడ్డాడు. జమీందారిణి రెనెల్డ్ ఇంటికి వెళ్ళి చూసింది, కాని ఆమె నేయటం లేదు. ఈసారి జబ్బుకి కారణం ఆమె కాదు.

రోజులు గడుస్తున్నాయి. ఆ జబ్బు ఇక కుదిరేది కాదని వైద్యులు చెప్పేశారు. విపరీతమైన బాధగా ఉండేది. మృత్యువు వస్తే బావుండునని జమీందారు అనుకున్నాడు. కాని అతను చనిపోలేదు. ఎంతకాలం గడిచినా అతని స్థితిలో మార్పు రాలేదు. బతకనూ లేడు, చావనూ లేడు.

అప్పటికి తెలిసివచ్చింది అతనికి. తన మీద కప్పబోయే బట్టని రెనెల్డ్ నేసి ఇస్తేనేగాని తను చనిపోలేడు. ఇదీ ఆమె చేతిలోనే ఉంది. పిలిపించాడు. ఆమె వచ్చి మంచం పక్కన నిలుచుంది. మళ్ళీ నేత మొదలుపెట్టమని అజ్ఞాపించాడు. ఆమె జమీందారిణి వైపు చూసి తలదించుకుంది. జమీందారిణి భర్తతో అంది – ” అంతకన్న వాళ్ళ పెళ్ళికి ఒప్పుకుని చూడకూడదా ? ” అతనికి మొదట నచ్చలేదు. చావనైనా చావాలిగానీ తన నోటితో తను ఆమె పెళ్ళికి ఒప్పుకోకూడదని అతని పట్టుదల. భార్య పదే పదే బ్రతిమాలింది. ఆమెని తను ఏనాడూ సంతోషంగా ఉంచలేదు కదా అని అతనికి స్ఫురించింది. చేతిసైగ తో సరేనన్నాడు . రోజు రోజుకీ అతని శరీరం తేలికవుతూ వచ్చింది. రాయిలాంటి మనసు మారింది. పశ్చాత్తాపం వచ్చింది. ఆమెని క్షమించమని అడిగాడు. రెనెల్డ్ గడిచినదేదీ మనసులో పెట్టుకోకుండా అతన్ని క్షమించింది. ఆ ఊర్లో వాళ్ళంతా రెనెల్డ్ కి చాలా మహిమ ఉందని అనుకున్నారు. రెనెల్డ్ మాత్రం ఆకాశం వైపు తిరిగి దణ్ణం పెట్టింది. దేవుడిచ్చిన అవకాశాన్ని అందుకుని జమీందారు ఉత్తముడుగా మారాడు.

గిల్బర్ట్ ఆమెని మరిచిపోలేదు. ఆమె మీద అతనికి ప్రేమ పోలేదు. జమీందారు   తమ పెళ్ళికి ఒప్పుకున్న సంగతి తెలియకుండానే , వారం గడిచేసరికి తిరిగి వచ్చాడు. మొదటినుంచీ , మొత్తం రెండేళ్ళు పూర్తయాక అప్పుడు వాళ్ళకి పెళ్ళి జరిగింది. వాళ్ళిద్దరూ జీవితాంతం సంతోషంగా బ్రతికారు .

Flemish_Wedding_17th_century

  • ఫ్లెమిష్ జానపద కథ
  • సేకరణ- Charles Deulin, Andrew Lang

 

 

నీలిపూల రహస్యం

MythiliScaled

ఒకానొకప్పుడు  హాలండ్ లో  పెద్ద అడవి ఉండేది. అందులో ఒక ముచ్చటైన పాపాయి , తనకి నలుగురు అన్నలు. చెల్లెలిని చాలా ముద్దుగా చూసుకునేవారు.అడవిలో ఆకాలం లో విపరీతమైన చలి. పిల్లల తల్లి జంతువుల చర్మాలతో దుస్తులు కుట్టేది. అవి అందంగానూ మెత్తగానూ ఉండేవి. అమ్మాయి చిన్నపాపగా ఉన్నప్పుడు పొద్దున్నే పాలుపట్టి వాళ్ళ అమ్మ చెట్టుకొమ్మకి వేసిన ఉయ్యాలలో వెచ్చగా కప్పి పడుకోబెట్టేది. పాప నిద్రపోయేది. లేచేసరికి ఉయ్యాల చుట్టూ చిట్టి చిట్టి ఉడతలు మూగి ఆడుతూ ఉండేవి. ఆకుల్లో పాకే సాలీళ్ళని పాప ఆసక్తిగా గమనించేది.అవి పట్టుదారాలు అల్లి గూళ్ళు కట్టుకోవటం ఎంత సేపు చూసినా బావుండేది. వాళ్ళ నాన్న నిపుణుడైన వేటగాడు. అవసరం కొద్దీ  వేటాడే నేర్పుతోబాటు పట్టుబడిన మూగజీవులని దయగా కాపాడటం కూడా అతను పిల్లలకి అలవరచాడు. అలా వాళ్ళ ఇంట్లో చిన్న చిన్న పులిపిల్లలూ తోడేలు పిల్లలూ అడవి పిల్లిపిల్లలూ పెరుగుతుండేవి. వాటి పోషణ అంతా పాప పెద్దదయాక తనే చూసేది, వాటితో ఆడుకునేది. అవి  క్రూరజంతువులు కనుక ఎదిగేకొద్దీ చెల్లెలికి ఏమైనా హాని చేస్తాయేమోనని అన్నలు ఒక కంట కనిపెడుతూ ఉండేవారు. అయితే ఆమె కి ఆ భయమే లేకపోయేది- అవీ ఎంతో స్నేహంగా మసలుకునేవి, ఆమె కళ్ళెర్రజేస్తే భయపడిపోయేవి కూడా.

చక్కటి  ముఖం, దృఢమైన శరీరం- వీటికితోడు తల్లి తయారు చేసే సొగసైన గౌన్ లు- ఆమె ఒక రాజకుమారిలాగా కనిపించేది. వేసవికి తేలికగా రంగు రంగుల ఈకలతో ఆ దుస్తులు ఉండేవి. జుట్టులో సువాసన వేసే  అడవిపూలు  పెట్టుకునేది. చలికాలానికి కోట్ లూ, టోపీలూ చేతితొడుగులూ – ఇవన్నీ తెల్లని చర్మాలతోనే తల్లి కుట్టేది. మెరిసే నల్లని కళ్ళూ గులాబిరంగు బుగ్గలూ తప్పించి ఆమె మంచులోం చే  పుట్టినట్లు ఉండేది. ఉత్తరపుదిక్కున ఉల్ రుం భూమిలో ఉండే  మంచు దేవుడి కూతురే అలా వచ్చిందని అనుకునేవారు. ఆమె పేరు డ్రి-ఫా [ అంటే మంచులాగా తెల్లనిది అని ].

1aba3658d6313642da4d32068e1a43a1

ఆ ప్రాంతాలలో ఎవరికీ లేని అందం, సంపద ఉన్నా ఎందుకో ఆమెకి తృప్తిగా ఉండేది కాదు. చాలా మంది యువకులు పెళ్ళి చేసుకుంటామని అడిగినా ఎవరినీ ఒప్పుకోలేదు. కొంతమంది తాము వేటాడి సంపాదించిన ఉన్ని చర్మాలను, చాలా మేలైనవాటిని – బహుమతిగా ఇవ్వబోయేవారు. ఇంకొందరు తమ బలాన్నీ చాకచక్యాన్నీ ప్రదర్శించేవారు. ఫెయిరీ ల తో స్నేహం చే సీ , కబౌటర్ [ డచ్ దేశం లో పొట్టిపిశాచాల వంటివి ] లను మెప్పించీ తెచ్చిన వజ్రాలనూ  విలువగల లోహాలనూ ,మరికొందరు,  డ్రి-ఫా ప్రేమను పొందేందుకు చూపించేవారు. దూరసముద్రతీరాల లో దొరికిన సాంబ్రాణినీ రత్నాలనూ తీసుకొచ్చిన వారూ ఉన్నారు. ఒకరైతే ఏకంగా పెద్ద ముత్యాలహారాన్నే కానుక చేయబోయారు. ఆ శీతల అరణ్యాలలో ముత్యాలు చూడటమే ఒక అద్భుతం. కాని ఏదీ డ్రి-ఫా ని సంతోషపెట్టనేలేదు. వచ్చినవారంతా అదే దారిని తిరిగి వెళ్ళిపోయేవారు.

 

అందరి కంటే చివరన సాలీడులాగా కనిపించే వింతమనిషి వచ్చాడు. తన పేరు స్పిన్ హెడ్ అని చెప్పాడు. మణిమాణిక్యాలకన్న, బంగారం కన్న, ఉన్ని కన్న విలువైన రహస్యం తనదగ్గర ఉందని చెప్పాడు. డ్రి-ఫా తల్లికి అతన్ని చూస్తే చిరాకు వేసి పంపించేసింది.

 

కొన్నేళ్ళు గడిచాయి. ఇక డ్రి- ఫా కి పెళ్ళి కాదేమోనని తల్లిదండ్రులు దిగులుపడేవారు. ఒకరోజు ఆమె అడవిలో తను చిన్నప్పుడు ఉయ్యాల ఊగిన ఓక్ చెట్టుకింద పచార్లు చేస్తోంది . అప్పటికి వాళ్ళ ఇల్లు అక్కడికి దూరంగా ఏర్పాటు చేసుకున్నారు.

చెట్టుకొమ్మలలోంచి ఒక సాలీడు వచ్చి  పక్కనే కూర్చుంది. అది మాట్లాడింది కూడా.

ఇలా –   ‘’ డ్రి-ఫా ! నిన్ను ప్రేమిస్తున్నాను , ఆ సంగతే చెప్పేందుకు వచ్చాను. నువ్వేమీ ఇప్పుడే నన్ను పెళ్ళాడనక్కర్లేదు. నీ గది లో నన్నొక గూడు అల్లుకోనీ. అక్కడే నీ కనుచూపుమేరలో ఉంటాను. నీకు చాలా మంచి జరుగుతుంది, కాదనకు ” ఆశ్చర్యపోయి, తనకొక గది ఎక్కడుందా అని ఆలోచిస్తూ, డ్రి- ఫా సరేనంది.

వెంటనే పెద్ద గాలిదుమారం వచ్చి ఓక్ చెట్టు కూలిపోయింది. అక్కడ పెద్ద భవంతి వెలిసింది. పక్కనే విశాలమైన తోట. డ్రి-ఫా అందులో అడుగు పెడుతూనే  ఆమె పాదాల దగ్గర ఒక నీలి పూల చెట్టు మొలిచింది. సాలీడు అంది ” ఈ ఇంట్లో నీకు బాగా నచ్చిన గదిని ఎంచుకో. నూరు రోజులపాటు  నన్ను బాగా చూసుకుంటే ఈ నీలిపూవు రహస్యం నీకు చెబుతాను ”

బాగా సూర్యకాంతి పడే గదిని డ్రి-ఫా ఎంచుకుంది. ఆ గది కిటికీ పైనుంచి కప్పు వరకూ సాలీడుకి కేటాయించింది.

వెంటనే అది తళతళమనే దారాల అల్లిక మొదలుపెట్టింది. చీకటిపడేదాకా దాకా అల్లుతూనే ఉంది. డ్రి-ఫా తనకి కూడా ఆ నాజూకైన అల్లిక చేతనయితే బావుండుననుకుంది. ఏదో రహస్యం అంది కదా సాలీడు, అది దీనికి సంబధించినదేమోననే అనుమానమూ ఆమెకి వచ్చింది. రాత్రయింది. ఇంటికి వెళ్ళటం కష్టం. కాని అక్కడే తన గదిలో నిద్రపోయేందుకు పరుపులూ దుప్పట్లూ  ఏమీ లేవు.

Bronx_Zoo_Spider_Web

” నీకు మంచి పక్క వేస్తాను చూడు ” అంది సాలీడు. ఆ గొంతు ఒక యువకుడిది లాగా ఉంది ఇప్పుడు. డ్రి-ఫా విస్తుపోయిందికానీ ఏమీ అనలేదు. చూస్తుండగానే అతి మెత్తటి, వెచ్చటి పక్క దానంట అదే వచ్చింది. ఇంట్లో కంటే కూడా సుఖంగా , సౌకర్యంగా  ఆమె నిద్రపోయింది.

ఆమెకొక కల వచ్చింది. అప్పటివరకూ ఎవరూ చూసిఉండని తెల్లని వింత  వస్త్రాన్ని ధరించి ఉంది ఆ కలలో. జంతువు చర్మం లాగా దట్టంగా లేదు అది, చాలా పల్చగా, తేలికగా ఉంది . పొద్దుటి వెలుతురులో పచ్చిక మీద సాలెగూడు మెరిసినట్లు మెరుస్తోంది, గడ్డిపరకల మీది మంచుబిందువులలాగా కూడా.

 

నూరు రోజులు గడిచాయి. డ్రి-ఫా ఆ ఇంట్లో ఉదయం నుంచి రాత్రివరకూ ఉండేది. . ఇద్దరూ కబుర్లు చెప్పుకునేవారు. సాలీడు దారాలు అల్లుతూనే ఉండేది. డ్రి-ఫా ఆ రహస్యం ఎప్పుడు తెలుస్తుందా అని ఎదురు చూసేది. ఏమైనా సరే, తొందరపడి అడిగేయకూడదని , సాలీడు చెప్పెదాకా ఆగాలని ఆమె నిశ్చయించుకుంది.

 

నూరు రోజులు పూర్తవబోతున్నాయి. శిశిరఋతువు వచ్చింది. డ్రి-ఫా తోటలో తిరుగుతోంది. చలిగాలులు వీస్తున్నాయి, పండిపోయిన ఆకులు రాలుతున్నాయి. ఆ నీలిపూవు కూడా ఎప్పుడో రాలిపోయింది. నల్లటి గట్టి కాడ మాత్రమే మిగిలింది. ” ఏముంటుంది ఇక  ఇందులో అద్భుతం ?” అనిపించింది డ్రి-ఫా కి. ఉన్నట్లుండి చాలా బెంగ వచ్చింది . ఉన్నట్లుండి హోరుమని ఈదురుగా లి – అన్ని ఆకులూ రాలి నేలని పసుపచ్చగా కప్పేశాయి. కొన్ని చెట్లు కూడా పడిపోయాయి. అంతలోనే అంతా నిశ్శబ్దంగా అయింది. డ్రి- ఫా పక్కన ఒక యువకుడు ఉన్నాడు. తన అన్నలకంటే, తనను పెళ్ళాడమని అడిగినవారందరి కంటే- తను చూసిన ఎవరికంటే కూడా అందంగా ఉన్నాడు. సొగసైన తెల్లని దుస్తులు వేసుకున్నాడు. ఆ బట్ట మెత్తగా తను కలలో చూసినదానిలాగే ఉంది. అతని చేతిలో ఆ నీలిపూవు కాడ ఉంది.

” నేనే స్పిన్ హెడ్ ని. నూరు రోజులూ అయిపోయాయి, నా శాపం తీరింది. ఇదిగో నా కానుక నీకు ” అని ఆ పూవుకాడని చూపించాడు. సాలీడు అతనుగా మారినందుకు ఎంతో ఆనందించింది డ్రి-ఫా. అయితే ఆ ఎండిపోయిన కాడ , గొప్ప కానుక ఎలా అవుతుందో ఆమెకి తెలియలేదు. ‘ దాన్ని చీల్చి చూడు ” యువకుడు చెప్పాడు. అలాగే చేసింది ఆమె. లోపల సన్నటి పొడుగాటి నాజూకైన పోగులు, సా లెపురుగు గూటివి లాగా. ఉత్సాహంగా బయటికి లాగింది.

” ఈ విత్తనం నాటితే లక్షల పూలు పూస్తాయి. ఆ కాడల్లోంచి తీసినదారాలతో- ఇదిగో, దీన్ని తయారు చేయచ్చు ” అని చక చకా తెల్లటి బట్టని నేశాడు .అదే లినెన్.

డ్రి-ఫా సంతోషంగా చప్పట్లు కొట్టింది.

1251810-bigthumbnail

” నీ పెళ్ళి గౌన్ కోసం ఇది- పెళ్ళి చేసుకుంటావా నన్ను ? ”

ఆమె సిగ్గుపడింది, అయినా ” ఓ, అలాగే ” అంది.

” నీకు మేలిముసుగుని తయారు చేస్తాను ఉండు ”

మళ్ళీ అతని వేళ్ళు అద్భుతంగా కదిలాయి. ఇంకా సున్నితమైన వస్త్రాన్ని , గజాల కొద్దీ నేశాడు. దాన్ని గాలిలో ఎగరేశాడు, పక్షిలాగా తేలింది అది. అప్పుడు ఆమె మీదికి జార్చాడు. ఆమె ముఖాన్ని కప్పి వీపు మీదినుంచి జీరాడింది. అది  లేస్.

వాళ్ళు పెళ్ళి చేసుకుని  నీలిపూవులు పూయించారు. అవి ఆ నేలకి కొత్త ఆకాశంగా మారాయి. మనుషులు కష్టపడి పని చేశారు.   నగరాలు కళకళలాడాయి. లినెన్ నుంచి బెల్జిక్ ప్రాంతాలకి [ ఇప్పటి నెదర్ లాండ్స్, బెల్జియం, లక్సెం బర్గ్ ] ఐశ్వర్యం వచ్చింది.

linen_history_img_1_blue_flowering_flax

  • డచ్ జానపదకథ
  • అనువాదం: మైథిలి అబ్బరాజు
  • mythili

 

 

 

ప్రేమతో…

MythiliScaled
చాలా కాలం కిందట ఒక పెద్ద మైదానం.. మధ్యలో చిన్న గుడిసె. అందులో ఒక ముసలమ్మా ఒక పడుచు అమ్మాయీ ఉంటుండేవారు. ముసలమ్మ కి మాటలు రావు , పైగా చాలా కోపిష్టిది. అమ్మాయి విచ్చుకునే రోజా మొగ్గ అంత ముద్దుగా ఉండేది. అడవిలో జలజలమనే వాగు గుసగుసల అంత తియ్యగా ఉండేది ఆమె గొంతుక.

ఆ గుడిసె పెద్దపెద్ద చెట్టుకొమ్మలతో అల్లిన తేనెతుట్టెలాగా ఉండేది. అందులో ఎప్పుడూ ఆరిపోని నెగడు ఉండేది. దాన్ని ఎవరూ వెలిగించకుండానే, పుల్లలు వేయకుండానే అది అలాగ మండుతూ ఉండేది. చలికాలం లో వెచ్చగా వేసవిలో చల్లగా ఉండేది దాని వెలుతురు. నెగడు కీ గోడకీ మధ్యని రెండు మంచాలు. ఒకటి సాదా కొయ్యతో చేసినది, దాని మీద ముసలమ్మ పడుకునేది. రెండోది మాత్రం మంచి ఓక్ కొయ్యతో చేసినది. మొహం కనిపించేంత నున్నగా చిత్రిక పట్టారు దాన్ని. దాని మీద లతలూ పూవులూ పక్షులూ చెక్కారు కూడా. ఒక రాజకుమారి మంచం లాగా ఉండేది, దాని మీద అమ్మాయి పడుకునేది. తన పేరు ఫినోలా- నిజానికి తనొక రాజకుమారే, ఆ సంగతి ఆమెకే గుర్తు లేదు.
గుడిసె బయట ఎటు చూసినా చెట్టూ చేమా లేని బీడు . మరొక మనిషి పొడైనా- చివరికి ఒక పిట్టైనా పురుగైనా, లేదు – ఏ అలికిడీ వినబడేది కాదు. తూర్పు వైపున పెద్ద కొండ. పగటిపూట నీలంగానూ , పొద్దు కుంకేవేళ వంద వింత రంగులతోనూ కనబడేది. దాన్ని చూస్తుండటం తప్పించి ఫినోలా కి ఏ ఉల్లాసమూ లేదు. కొండ అవతలినుంచి వీచే తుఫాను గాలి కూడా ఈ మైదానం లోకి వచ్చేసరికి నిశ్శబ్దంగా అయిపోయేది. తనతో తనే మాట్లాడుకుంటూ పాడుకుంటూ ఫినోలా కాలం గడిపేది.
నెలకి ఒక్కసారి మాత్రం ఒక మరుగుజ్జు మనిషి కుంటి గుర్రం మీద ఎక్కి వచ్చేవాడు. ముసలమ్మకీ ఫినోలాకీ నెలకి సరిపడా గోధుమలు బస్తాలో తెచ్చి ఇచ్చేవాడు. అదేమిటోకానీ అతనికీ మాటలు రావు. కాని ఫినోలా అంటే అతనికి ఎంతో ఇష్టంగా ఉండేది, ఆమె కోసం ఏమైనా చేయగలననీ చేయాలనీ అతనికి అనిపించేది. ఫినోలాకీ అతను రాగానే ప్రాణం లేచొచ్చినట్లుండేది. తనే ప్రత్యేకంగా తయారు చేసిన కేక్ ని అతని కోసం దాచి ఉంచేది.
ఒకరోజు అతను వచ్చినప్పుడు ఫినోలా ఎప్పటిలాగా ఎదురు రాలేదు. ముసలమ్మని సైగ లతో అడిగాడు ఏమైందని. ఉత్తిపుణ్యానికే ముసలమ్మకి కోపం వచ్చి కర్ర పుచ్చుకు కొట్టబోయింది. ఆమెని తప్పించుకుని గుర్రం ఎక్కుతున్న అతనికి గుడిసె వెనకవైపున కూర్చుని ఏడుస్తున్న ఫినోలా కనబడింది. ఎందుకో తనకి ఆవేళ పెద్ద దిగులు వచ్చేసింది. అది చూసి మరుగుజ్జుకి చాలా బాధేసింది. ఆమె గురించే ఆలోచిస్తూ పరధ్యానంగా కొండ అవతలి అడవిలోంచి వెళుతున్నాడు. అంతలో ఎక్కడినుంచో మాటలు వినిపించాయి
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” అని.
మరుగుజ్జు ఎదురుగా కొండవాలులో అతనిలో సగం ఎత్తున్న మనిషి కనిపించాడు. ఇత్తడి గుండీలు ఉన్న ఆకుపచ్చని అంగరఖా తొడుక్కుని ఎర్రటి టోపీ పెట్టుకుని ఉన్నాడు. అతనొక గంధర్వుడు.
” నువ్వు రావటానికి తరుణం వచ్చింది ” గంధర్వుడు మళ్ళీ అన్నాడు. ” నీకు స్వాగతం. గుర్రం దిగి నాతో రా. నీ పెదవులకి మంత్రదండం తాకించి నీకు మాటలు రప్పిస్తాను. మనం మాట్లాడుకోవలసింది చాలా ఉంది ”
అలాగే మరుగుజ్జు అతని వెంట వెళ్ళాడు. కొండ అడుగున చిన్న బిలం లోంచి ఇద్దరూ లోపలికి దిగారు. ఆ దారి మరుగుజ్జుకే చాలా ఇరుకుగా అనిపించింది. కొన్ని మెట్లు దిగి పెద్ద చావడిలోకి ప్రవేశించారు. అక్కడ బంగారు స్తంభాల మీద వెండి రేకుల కప్పుతో ఒక మంటపం. కప్పు మీదా స్తంభాలమీదా మిలమిల మెరిసే వజ్రాలు పొదిగి ఉన్నాయి. వేరే దీపాలు అక్కర్లేనంత కాంతి వాటిలోంచే వస్తోంది. చావడి మధ్యగా ఒక బల్ల వేసిఉంది. దాని పైన మళ్ళీ బంగారు పళ్ళాలూ వెండి చెం చాలు. అటూ ఇటూ రెండు చిన్న కుర్చీలు, వాటిలో నీలిరంగు పట్టుదిండ్లు. ఆ పక్కనే పెద్ద కంచుగంట.

 

story1
” ఇలా కూర్చో ” అని తనొక కుర్చీలో కూర్చుని మరొక కుర్చీ చూపాడు గంధర్వుడు- ” ముందు నీకు మాటలు రావాలి కదూ ” – కంచుగంట ని మోగించాడు. ఇంకొక మనిషి, మరుగుజ్జు చూపుడువేలంత అంత ఉన్నవాడు , వచ్చాడు.
” మాటలొచ్చే మంత్రదండం తీసుకురా ” అజ్ఞాపించాడు . వేలెడంత వాడు వినయం

గా వంగి వెనక్కి వెళ్ళి పట్టుకొచ్చి ఇచ్చాడు. అదొక నల్లటి కర్ర. దాని చివరన ఎర్రగా మెరిసే కెంపు ఉంది. మరుగుజ్జు మొహం ముందు మూడుసార్లు దాన్ని ఆడించి, ఆ భుజమూ ఈ భుజమూ తట్టి- కెంపుని అతని పెదవులకి తాకించాడు గంధర్వుడు.
తర్వాత
” మాట్లాడు ” అన్నాడు. మరుగుజ్జుకి గొంతు పెగలింది. తన గొంతు ని తాను విని ఆనందం తో గంతులు వేశాడు.
” నువ్వు ఎవరో చెప్పు ?” అడిగాడు గంధర్వుడు.
” నువ్వెవరో చెప్పు ముందు ” మరుగుజ్జు అన్నాడు – ” మాటలు తర్వాత, బాగా ఆకలేస్తోంది ”

story2

సరే, ఇద్దరూ పళ్ళాల ముందు కూర్చున్నారు. గంధర్వుడు మళ్ళీ కంచుగంట మోగించాడు. వేలెడంతవాడు వచ్చి మూడు నాలుగు సార్లుగా రుచి గల రొట్టెలూ కూరలూ తీపి పదార్ధాలూ తెచ్చిపెట్టాడు. ఇద్దరూ తృప్తిగా భోజనం చేశారు. తర్వాత పళ్ళరసాలు తాగారు.
అప్పుడు మరుగుజ్జు చెప్పాడు ” మంచి విందు చేశావు, చాలా సంతోషం. నన్ను అడిగావు కదా నేనెవరని- ఇంతకీ నేనెవరో నాకు తెలియదు ! ”
” అసలు నీ గురించి నీకేమి తెలుసో చెప్పు ” అడిగాడు గంధర్వుడు.
” ఒక రోజున లిఫే నగరం లో రాజు గారి భవనం ముందు ఉన్నాను. అక్కడెవరో గారడీ చేస్తుంటే చూస్తూ ఉన్నాను. వాళ్ళ ఆట అయాక రాజు నన్ను పిలిచి నా పేరేమిటో ఎక్కడనుంచి వచ్చానో అడిగాడు. జవాబు చెప్పటానికి నాకు మాటలు రాలేదు సరిగదా, అంతకుముందరి సంగతులన్నీ మర్చిపోయాను. రాజు నన్ను కొలువులో చేర్చుకుని పని అప్పగించాడు. నెలకొకసారి మైదానం మధ్యని గుడిసెకి గోధుమలు తీసుకుపోవటం , అంతే ” అని మరుగుజ్జు సమాధానం చెప్పాడు.
” అయితే అక్కడి అమ్మాయితో ప్రేమలో పడ్డావు కదూ ? ” గంధర్వుడు అడిగాడు.
మరుగుజ్జు ఒప్పుకుందుకు మొహమాటపడ్డాడు.
” మరేం పర్వాలేదు, నాకు తెలుసులే . ఆ అమ్మాయి ఒక రాజకుమారి. తనకొక శాపం ఉంది. దాన్ని పోగొట్టేందుకు ఏమైనా చేయగలవా మరి ? ”
” నా ప్రాణమైనా ఇస్తాను ”
” సరే అయితే, విను. ఈ రాజ్యం వాళ్ళదే అసలు. నువ్వు పనిచేస్తున్నావే ఒక రాజు కింద, అతను ఈ అమ్మాయి తండ్రిని ఓడించి చపేశాడు. రాజకుమారిని మాత్రం చంపకూడదనీ అలా చేస్తే తనూ చచ్చిపోతాడనీ జ్యోతిష్కులు చెప్పారట. రాజుకి ఒక మంత్రగత్తె తెలుసు. ఆమె నిద్రపోయే రాజకుమారిని మంచం తో సహా అక్కడికి చేర్చింది. ఒక మూగ ముసలమ్మని కాపలా పెట్టింది, మైదానాన్నంతా మంత్రించి నిశ్శబ్దం చేసింది. ఆమె ఉనికి ఎవరికీ తెలియకూడదని ఆ జాగ్రత్త అంతా. రాజకుమారి గతం మర్చిపోయేటట్లు, మైదానం దాటి వెళ్ళలేనట్లు కూడా చేసింది మంత్రగత్తె. ఇంక వాళ్ళకి ఆహారం ఇచ్చేందుకు రాజకుమారి విషయమే తెలియనివారు కావాలి, చూసినది ఎవరికీ చెప్పలేకుండా ఉండాలి. నిన్ను మూగవాడిని చేసి అందుకోసం నియమించారు ” – వివరించాడు గంధర్వుడు.
మరుగుజ్జు అడిగాడు – ” నీకింత తెలుసు కదా, నేనెవరో ఏమిటో చెప్పలేవా ?”
” నెమ్మదిమీద నీకే తెలుస్తుంది. నీకు మాటలైతే రప్పించగలిగాను, తర్వాతి సంగతి నువే చూసుకోగలవు. ఇంతకూ రాజకుమారి శాపం విడిపించే పని మొదలుపెడతావా ? ”
” ఓ ! తప్పకుండా !!! ”
” అందుకోసం దేన్నైనా సరే వదులుకోగలవా ?”
” చెప్పాను కదా, ప్రాణమైనా ఇస్తానని , అసలేం చేయాలో చెప్పు ”
” నువ్వు సరైన ఆయుధాలు సంపాదించుకోవాలి ”
” ఏమిటవి ? ఎక్కడ దొరుకుతాయి ?”

story3 (2)
” ఒక కంచు డాలు , రాగి కత్తి, ఇనప బల్లెం- ఈ మూడూ కావాలి. ఏవి పడితే అవి పనిచేయవు. పశ్చిమసముద్రం లో ఒక దీవి ఉంది. అందులో రహస్య సరస్సు ఉంటుంది. దాని అవతలి ఒడ్డున మాత్రమే ఇవి దొరుకుతాయి. సాహసం గలవారు మటుకే వాటిని సంపాదించగలరు. మైదానం లోకి తెచ్చి ఆ డాలు మీద కత్తితో మూడుసార్లూ బల్లెంతో మూడుసార్లూ కొట్టావా, అక్కడి నిశ్శబ్దం విచ్చిపోతుంది. శాపం తీరి రాజకుమారికి స్వేచ్ఛ వస్తుంది ”
” ఇప్పుడే బయల్దేరుతాను ” దిగ్గున లేచాడు మరుగుజ్జు.
” మళ్ళీ అడుగుతున్నాను, దేన్నైనా సరే త్యాగం చేయగలవు కదా ?”
” నిస్సందేహంగా ! ”
”ఇదిగో, నీ గుర్రం చెవిలో దారి చెబుతున్నాను . అది ఎలా తీసుకువెళితే అలా వెళ్ళు. సరాసరి పశ్చిమసముద్రపు తీరానికి చేరతావు. గుర్రం మీదే నువ్వు సముద్రం దాటి దీవికి చేరుకోవాలి. ఆ సముద్రం లో భయంకరమైన నీటి గుర్రాలు ఉంటాయి. అవి నిన్ను ఆపుతాయి. అవి అడిగినది ఇస్తేగానీ నిన్ను వెళ్ళనివ్వవు. పొరబాటున వాటిని నిర్లక్ష్యం చేసి వెళ్ళిపోవాలనుకోకు, నిన్ను చీల్చి చెండాడతాయి. దీవి లో కాలుపెట్టిన తర్వాత రహస్య సరస్సు లో నీళ్ళు ఎర్రగా మారేదాకా వేచిఉండాలి. ఇక్కడ క్రూరమైన నీటి పక్షులు ఉంటాయి. అవి అడిగినది ఇచ్చాకే అవతలి ఒడ్డుకి వెళ్ళనిస్తాయి. వాటిని తప్పించుకు పోవాలని చూసినా చాలా ప్రమాదం. అంతా సవ్యంగా చేయగలిగితే ఆ ఒడ్డున ఉన్న డాలూ కత్తీ బల్లెం – నీకు దొరుకుతాయి ”

గంధర్వుడికి కి ధన్యవాదాలు చెప్పి సెలవు తీసుకుని మరుగుజ్జు బయల్దేరాడు. కోనలు దాటీ లోయలు దాటీ కనుమలలోంచి వెళ్ళీ వెళ్ళీ పశ్చిమసముద్రతీరం చేరేసరికి పొద్దు వాలుతోంది. చూస్తుండగానే కన్ను పొడుచుకున్నా కనిపించని చీకటి అలముకుంది. అలసటగా గుర్రమూ తనూ అక్కడే నిద్రపోయారు.
తెల్లారి లేచి చూస్తే సముద్రం లో ఎక్కడా నీటిగుర్రాలు లేవు. వేరే ఇంకొక చోటి కి వచ్చానా అని మరుగుజ్జు ఆదుర్దా పడ్డాడు. అంతలో సముద్రపు అలలు విసురుగా విరిగి పడటం మొదలైంది. భీబత్సంగా సకిలిస్తూ చాలా నీటిగుర్రాలు అక్కడికి ఈదుకుంటూ వచ్చాయి. వాటి ముఖాలు భీకరంగా ఉన్నాయి. మింగేస్తాయా అనిపించి మరుగుజ్జు వణికిపోయాడు. తిరిగివెళ్ళిపోదామనుకున్నాడు. అప్పుడు ఎక్కడినుంచో శ్రావ్యమైన హార్ప్ ధ్వని వినిపించింది. కొండ దిగువన గంధర్వుడు అక్కడ ప్రత్యక్షమ యా డు. అతని చేతిలోనే హార్ప్ ఉంది. వింటూనే మరుగుజ్జుకి ధైర్యం వచ్చింది.
” త్యాగం చేస్తావా ? ” మూడుసార్లు అడిగాడు అతను.
అన్నిసార్లూ సరేనన్నాడు మరుగుజ్జు.
” వెనక్కి మరలండి ” నీటిగుర్రాలకి ఆజ్ఞ ఇచ్చాడు గంధర్వుడు. అవి అలాగే చేశాయి.
” ఏమి వదలాలి ?”
” నీ కుడి కంటిని ”
మరుగుజ్జుకి భయం వేసింది. కాని ఫినోలాని తలచుకుని ఆమె కోసం ఒప్పుకున్నాడు. వెంటనే కుడి కంటిలో భరించలేనంత నొప్పి పెట్టింది. చూపు పోయింది. గంధర్వుడు కొత్త పాట హార్ప్ మీద వాయించాడు. వినగా వినగా మరుగుజ్జుకి నొప్పి తగ్గింది. నీటిగుర్రాలు మాయమైనాయి.
” ఇప్పుడు దాటు ” చెప్పాడు గంధర్వుడు.
గుర్రం తో సహా సముద్రం దాటి దీవిలోకి వెళ్ళాడు మరుగుజ్జు. పచ్చటి చెట్లతో సువాసనలు చిమ్మే పూలతో దీవి చాలా ఆహ్లాదకరంగా ఉంది. మెలికలు తిరిగే సన్నటి బాటలవెంట దౌడు తీసి , గుర్రం ఒక సరస్సు ఒడ్డుకి చేరి ఆగిపోయింది. అదే రహస్య సరస్సు. ఏ కదలికా లేకుండా , సూర్యకాంతిలో అద్దంలాగా ప్రకాశిస్తోంది సరస్సు. మరుగుజ్జు గుండె ఎందుకనో వేగంగా కొట్టుకుంది. చాలాసేపటి తర్వాత గుర్రం దిగి ఒడ్డు న ఉన్న పచ్చికలో నడుము వాల్చాడు . ఎంత సేపు చూసినా నీళ్ళు ఎర్రబడనే లేదు.

మధ్యాహ్నం అవుతుండగా ఆకాశం లో పెద్ద నల్లటి మేఘం సరస్సు మీదికి వాలుతున్నట్లు కనిపించింది. పరీక్షగా చూస్తే అది బ్రహ్మాండమైన పక్షుల గుంపు. ఒక్కొక్క పక్షీ గుర్రానికి రెండు రెట్లు పెద్దగా ఉంది. పక్షుల న్నీ ముక్కు ల తో గుమ్మడికాయలంత పళ్ళు తెచ్చాయి. వాటిని తిని గింజలను సరస్సులోకి వదిలాయి. ఒక్కొక్క గింజా పడుతూనే నీళ్ళు ఎర్రగా మారటం మొదలైంది. కాసేపటికి అంతా ఎర్రటి నీళ్ళే. తర్వాత అన్ని పక్షులూ వచ్చిన దారినే వెళ్ళిపోయాయి. మరుగుజ్జు సరస్సు దాటాలని అడుగు ముందుకువేశాడు. మూడు పక్షులు ఎక్కడినుంచో వికృతంగా అరుస్తూ అడ్డు పడ్డాయి. అవి అడిగినది ఇవ్వకుండా సరస్సుని దాటటం కుదరదని గంధర్వుడు చెప్పినమాట గుర్తొచ్చి ఆగాడు. ఏం అడుగుతాయోనని భయం వేసి , వెనక్కి వెళ్ళిపోదామా అనుకున్నాడు. మళ్ళీ హార్ప్ ధ్వని చెవుల్లో అమృతం పోస్తూ వినిపించింది.
గంధర్వుడు ప్రత్యక్షమై ఫినోలా పేరు పలికాడు. ఎలాగైనా ఆమె శాపాన్ని పోగొట్టాలని మరుగుజ్జుకి బలంగా అనిపించింది. ముందుకి కదిలాడు.
” ఏమి ఇవ్వాలి ? ”
” నీ ఎడమ కంటిని ”
గుండె చిక్కబట్టుకుని ఒప్పుకున్నాడు. చూపు మొత్తమూ పోయి నొప్పితో మూర్చపోయాడు. కొంతసేపటికి తెలివి వచ్చింది.
గంధర్వుడు చెప్పాడు ” గుర్రం మెడ గట్టిగా పట్టుకో. దాన్ని నేను నీటిలోకి నడిపిస్తాను. ఏమీ భయపడకుండా సరస్సులో మునుగు. నన్ను నమ్ము, నీకు మంచి జరుగుతుంది ”
తెగించి మరుగుజ్జు గుర్రం తో సహా మునిగాడు. కాళ్ళు తేలిపోతున్నాయి. ఊపిరి ఆడలేదు. మెల్లిగా నీటి అడుగున వెలుతురు. పైకి తేలి వస్తూనే చూపు తిరిగివచ్చిందని తెలుసుకున్నాడు. విపరీతమైన సంతోషం వేసింది. అవతలి ఒడ్డుకి వెళ్ళాక గుర్రంలో మార్పు వచ్చింది. కుంటితనం పోయి గొప్ప జాతిదానిలాగా బలంగా అందంగా అయింది. తన చేతులూ కాళ్ళలో ఏదో కదలిక తెలిసింది అతనికి. ఊహించని శక్తి వచ్చింది. తనని తాను చూసుకున్నాడు- ఇప్పుడు మరుగుజ్జుగా లేడు, పొడుగ్గా దృఢంగా తయారయాడు. కంచుడాలూ బల్లెమూ కత్తీ కనిపించాయి. గబగబా వెళ్ళి మెరుస్తున్న డాలులో మొహం చూసుకున్నాడు. చాలా చక్కగా ఉన్నానని అర్థమైంది. మెల్లిగా అంతా జ్ఞాపకం వచ్చింది.

తనొక పెద్ద రాజ్యానికి యువరాజు. దేశాటన చేస్తూ వేరే రాజ్యానికి వెళ్ళి అక్కడి రాజు మాయలో పడ్డాడు. ఫినోలా మీద ప్రేమతో ఈ సాహసం చేయకపోతే ఎప్పటికీ అలాగే ఉండిపోయేవాడో ఏమో. మూడు వస్తువులూ తీసుకుని తేలికైన మనసుతో వెనక్కి బయల్దేరాడు. ఈ తిరుగు ప్రయాణం లో ఏ అడ్డంకీ రాలేదు. క్రూరమైన పక్షులూ నీటి గుర్రాలకి బదులు సొగసైన హం సలు శాంతంగా ఈదుతున్నాయి.
త్వరలోనే మైదానం మధ్యని గుడిసెకి చేరాడు. కంచుడాలు ని మూడుసార్లు రాగికత్తితో, మూడుసార్లు ఇనపబల్లెం తో కొట్టాడు. గుడిసె మాయమైంది. ఫినోలా నవ్వుతూ అతని ఎదురుగా నిలుచుంది. బీడులో పచ్చిక మొలిచింది, చెట్లు పెరిగాయి, పూవులు పూశాయి, పిట్టలు పాడాయి. ఫినోలాని గుర్రం మీద ఎక్కించుకుని అతను ఉత్తరంగా ఉన్న తన రాజ్యం వైపు ప్రయాణం సాగించాడు.

ఐరిష్ జానపద కథ , సేకరణ – Edmund Leamy .

విధి కన్న బలమైనది

The-prince-of-egypt 1

ఒకానొకప్పుడుఈజిప్ట్ లో ఒక రాజుకి లేక లేక కొడుకు పుట్టాడు. రాజకుమారుడి జాతకం చూసిన జ్యో తిష్కులు మొసలి వల్లనో, కుక్క వల్లనో పాము వల్లనో అతనికి ప్రాణగండం ఉంటుందని చెప్పారు . అలా జరగకుండా ముందుగాఏమీ చేయలేమని కూడాతేల్చారు .   రాజూ రాణీ చాలా దిగులుపడిపోయారు. తమ బిడ్డని ఎలాగైనా కాపాడుకోవాలనుకున్నారు. బాగా ఎత్తైన కొండ మీద కోట కట్టి చుట్టూ సైనికులని కాపలా పెట్టి అందులో రాజకుమారుడిని ఉంచారు. బొమ్మలు, పుస్తకాలు, ఆటవస్తువులు – కావలసినవన్నీ అక్కడే ఏర్పాటు చేశారు. చాలా జాగ్రత్తగా అప్పుడప్పుడూ వెళ్ళి చూసివస్తూ ఉండేవారు.

 

ఒక రోజు రాజకుమారుడు కోట పైకెక్కి ఆడుకుంటూ కింద వెళుతున్న చిన్న కుక్కపిల్లని చూశాడు. అది అతనికి ముద్దొచ్చింది. తెచ్చి ఇవ్వమని అడిగాడు. ఆ చుట్టుపక్కల ఎక్కడా కుక్కలే లేకుండా కట్టుదిట్టం చేసి ఉంచారు , అది ఎలా వచ్చిందో సేవకులకి అర్థం కాలేదు. గాభరా పడుతూ వెళ్ళి రాజుకి విషయం చెప్పారు. రాజకుమారుడి కోరిక ఏదీ అప్పటివరకూ వాళ్ళ అమ్మా నాన్నా కాదనలేదు. ఇప్పుడు కుక్కపిల్ల వద్దని నచ్చజెప్పాలని చూశారు. అతను వినలేదు. చేసేది లేక వాళ్ళు ఒప్పుకున్నారు. తొందర్లోనే రాజకుమారుడికి కుక్కపిల్ల బాగా మచ్చిక అయింది. దానికి మంచి తర్ఫీదు ఇచ్చి అతన్ని రక్షిస్తూ ఉండేలాగా తయారు చేశారు.

రాజకుమారుడికి ఇరవై ఏళ్ళు వచ్చాయి. ఆ నోటా ఆ నోటా తన జాతకం గురించి అతనికి తెలిసింది. అస్తమానం కోట లోనే గడపటం అతనికి విసుగు పుట్టించింది. తండ్రి దగ్గరికి వెళ్ళి ” నేను ప్రపంచం తిరిగి చూడాలనుకుంటున్నాను. నా క్షేమం గురించి ఆదుర్దా పడకండి, నా కుక్కపిల్ల నన్ను కాపాడుతుంది ” అన్నాడు. ఇదివరకులాగే తండ్రి వద్దని చెప్పే ప్రయత్నం చేశాడు. కొడుకు పట్టుదల వదల్లేదు. అయేదేదో అవుతుందని గుండె రాయి చేసుకుని సరేనన్నాడు . ఓడ లో అతన్నీ కుక్కపిల్లనీ నైల్ నది దాటించారు. అక్కడ సిద్ధంగా ఉంచిన మంచి గుర్రాన్ని ఎక్కి రాజకుమారుడు బయలుదేరాడు. బయటి ప్రపంచాన్ని చూడటం అతనికి చాలా సరదాగా సంతోషంగా ఉంది.

అలా  ప్రయాణిస్తూ ఒక గొప్ప రాజ్యం చేరాడు. అక్కడి రాజు అతనికి ఆతిథ్యం ఇచ్చి తన కూతురిని పరిచయం చేశాడు. ఇద్దరూ ఒకరినొకరు ఇష్టపడ్డారు. ” నాకు నిన్ను పెళ్ళి చేసుకోవాలని ఉంది. కానీ నా విధి ప్రకారం కుక్క కారణంగానో , మొసలి వల్లో పాము వల్లోనాకు ప్రమాదాలు వస్తాయట. బతుకుతానో లేదో తెలియదు ” అని ఆమెకి చెప్పేశాడు.

‘’ అయితే ఆ కుక్క ఎందుకు నీతో ? వదిలేయరాదా ? ” అని ఆమె అడిగింది.

” ఇంకా నయం ” అన్నాడు అతను.

ఆమె ” సరేలే . ఏమీ పర్వాలేదు. మనం విధిని ఎదిరిద్దాం. నిజమైన ప్రేమ దేన్నయినా గెలుస్తుంది ” అని ధైర్యం చెప్పింది. ఇద్దరూ పెళ్ళి చేసుకున్నారు.

కొన్నాళ్ళ తర్వాత తండ్రికి జబ్బుగా ఉందని రాజకుమారుడికి వార్త అందింది. భార్యతో కలిసి ప్రయాణమయాడు. మధ్యలో ఒక నది ఒడ్డున బస చేశారు. ఒక రాత్రి వేళ రాజకుమారి లేచి చూస్తే వాళ్ళ గుడారం లో ఒక మూల చాలా పెద్ద పాము కనిపించింది. వెంటనే భర్త ప్రమాదాల గురించి గుర్తొచ్చింది. మెల్లిగా వెళ్ళి పెద్ద గిన్నె నిండా పాలు తీసుకొచ్చి పెట్టింది. అవన్నీ తాగేసి పాము మత్తుగా పడుకున్నప్పుడు సేవకులని పిలిచి దాన్ని దూరంగా పారేయించింది. జ్యోతిష్కు లను అడిగితే రాజకుమారుడికి పాము వల్ల రాగల  గండం తప్పిందని అన్నారు .

The-prince-of-egypt 2

వీళ్ళు వెనక్కి వెళ్ళిన కాసేపటికే రాజు మరణించాడు. రాజకుమారుడికి పట్టాభిషేకం చేశారు. ఒక రోజు కుక్క తో కలిసి అతను అడవిలో వేటకి వెళ్ళాడు. కాలికేదో తగిలి తట్టుకుని కిందపడ్డాడు. చూస్తే అదొక మొసలి. చిత్రంగా ఎక్కడినుంచో మాటలు వినిపించాయి- ” ఈ మొసలి నుంచి నువ్వు తప్పించుకోలేవు. నువ్వెక్కడున్నా పట్టుకోగలదు. ఇసక లో పెద్ద గొయ్యి తవ్వి నీళ్ళు నింపి ఒక రోజంతా అందులో దాక్కుంటే మటుకే నీకు క్షేమం. రేపటివరకే గడువు ” .

అప్పటికెందుకో ఏమీ చేయకుండా మొసలి వెళ్ళిపోయింది.

ఇసక గోతిలో నీళ్ళు నింపటం ఎలా ? పీల్చేసుకుంటుంది కదా. రాజకుమారి ఆలోచించింది. దూరంగా ఉన్న ఎడారిలో నాలుగే ఆకులున్న మొక్క ఒకటి ఉందనీ అది నీళ్ళు ఇసకలో ఇంకిపోకుండా ఉంచగలదనీ ఆమె వినిఉంది. వెంటనే అక్కడికి తన తెల్లటి గాడిదను ఎక్కి బయలుదేరింది. ప్రయాణం చాలా శ్రమగా ఉండింది. ఇసక తుఫాను లు, వేడి, దాహం.ఆమె   గాడిదను జాగ్రత్తగా చూసుకుంటూ దానితో ప్రేమగా మాట్లాడుతూ చివరికి ఒక కొండ దగ్గరికి చేరింది. దాని నీడన చల్లగా ఉంది. నాలుగాకుల మొక్క కొండ శిఖరం మీద పెరుగుతోంది. కాని కొండ చుట్టూ లోతైన , వెడల్పైన అగడ్త , దాని నిండా నీళ్ళు. తనతో తెచ్చుకున్న తాడు ని ముడి వేసి రాజకుమారి బలంగా కొండ మీదికి విసిరింది. అదృష్టవశాత్తూ అది ఉచ్చుగా ఒక చెట్టుకొమ్మకి తగులుకుంది. దాని ఆధారంతో ఆమె పైకి పాకటం మొదలుపెట్టింది. అది అంత సులువైన పనేమీ కాదు. అయినా పట్టువదలకుండా నిబ్బరంగా చివరికంటా వెళ్ళి మొక్కని సంపాదించింది. హుటాహుటిన ఆమె తిరిగి వచ్చేసరికి రాజకుమారుడు ఇసకలో తవ్వించిన పెద్ద గోతిలో నిలుచుని ఉన్నాడు. కొద్ది దూరం లోనే మొసలి పళ్ళు బయట పెట్టి చూస్తూ ఉంది. ” నీళ్ళు నింపండి ” అని కేక పెట్టింది ఆమె. ఆ గోతిలోకి మొక్కని విసిరీంది. నీళ్ళు ఇంకిపోలేదు, నిలిచి ఉన్నాయి. ఆ రోజంతా అతనికి ధైర్యం చెబుతూ, ఆహారం ఇస్తూ రాజకుమారి భర్త పక్కనే ఉంది. ఇరవై నాలుగు గంటలు గడిచిపోయాయి. మొసలి చూసి చూసి కోపంగా నిరాశగా నదిలోకి వెళ్ళిపోయింది. జ్యోతిష్కులు ఈ గండం కూడా గడిచిందని చెప్పారు. రాజకుమారుడికి భార్యను పొగిడేందుకు ఎన్ని మాటలూ సరిపోలేదు. ఆమె దొరకటం తన పుణ్యమని అనుకున్నాడు.

prince of egypt 3

ఇంకొన్ని రోజులు గడిచాక కుక్కతో ఇద్దరూ ఆ నది ఒడ్డునే షికారుకి వెళ్ళారు. అడవి బాతునొకదాన్ని వెంటాడుతూ కుక్క అతని కాళ్ళ మధ్యలోంచి పరుగెత్తబోయింది. కాలు జారి   అతను కుక్కతో సహా అక్కడి ఊబిలోకి పడిపోయాడు. వేగంగా కూరుకుపోతున్నాడు. రాజకుమారి చప్పున అక్కడికి వచ్చి తన మీద వేసుకున్న బట్టను అందించింది. అతనూ కుక్కా బయటపడ్డారు.

ఇలా కుక్క వల్ల రాగల మూడో గండమూ గడిచింది.

అతను అన్నాడు ” నా విధి కన్న నీ ప్రేమ గొప్పది ” అని.

ఆమె ఆనందంగా అవునంది.

ఇద్దరూ చాలా కాలం పాటు సుఖంగా ఉన్నారు.

  • ఈజిప్షియన్ జానపద కథ

[   ఈ కథను కొంత మార్చి ‘ మూడుగండాలు ‘ పేరుతో 1971 లో కొడవటిగంటి కుటుంబ రావు గారు చందమామలో భేతాళకథగా వేశారు. వడ్డాది పాపయ్య గారు బొమ్మలు గీసిన కొద్ది కథలలో (ఆయన ముఖచిత్రాలు, ప్రత్యేక రచనలకు బొమ్మలు వేసేవారు ) ఇది ఒకటి. చందమామ లో ( కొన్నిసార్లు చెప్పి, కొన్నిసార్లు చెప్పకుండా ) ప్రపంచ జానపద సాహిత్యం లోని చాలా కథలు కొత్త రూపం తో వచ్చాయి. వాటిని తిరగరాసినదీ లోట్లు దిద్దినదీ కుటుంబరావు గారే. ఇంటర్ నెట్, గ్లోబలైజేషన్ లేని రోజులలో మద్రాస్ నగరం లోని ఏ లైబ్రరీలలో ఆ కథలన్నీ దొరికాయో ! ఏ మెప్పు కోసమూ ఎదురు చూడకుండా ఆ మహానుభావుడు బాల సాహిత్యానికి ఎంత చేశారు !!! ]

–మైథిలీ అబ్బరాజు

 

జాగ్రత్త లేనివాడు

MythiliScaled

ఒకానొకప్పుడు యెరెవాన్ అనే  నగరం లో  లో ఒక   వ్యాపారస్తుడు ఉండేవాడు.   అతనికి పెద్ద జబ్బు చేసింది. ఇక ఎంతో కాలం బతకనని తెలిసి కొడుకుని దగ్గరికి పిలిచి ” బాబూ ! మహారాజుల దగ్గర కూడా ఉండనంత ఐశ్వర్యాన్ని సంపాదించాను. అదంతా అనుభవిస్తూ నా వ్యాపారం కొనసాగించు. పొరబాటున కూడా టిఫ్లిస్ నగరానికి మాత్రం వెళ్ళకు ” అని హెచ్చరించాడు.

తర్వాత భార్యని పిలిచి తన గది  తాళం చెవి ఇచ్చి ” మన అబ్బాయి అబ్దల్   ఒకవేళ డబ్బంతా పోగొట్టుకుని బీదవాడైతే నా రహస్యాలని అతనికి చెప్పు ” అని చనిపోయాడు.

ఆ తర్వాత కొన్నాళ్ళకి  అబ్దల్ నలభై ఒంటెల మీద  సరుకులు వేసుకుని వర్తకం కోసం బయలుదేరి వెళ్ళాడు. ఆ రాత్రి ఒక చోట విడిది చేసి ఉండగా ఇద్దరు మనుషులు చిరిగిపోయిన బట్టలు కట్టుకుని అటువైపుగా వచ్చారు. వాళ్ళు గుండెలు బాదుకుని ఏడుస్తున్నారు. అబ్దల్ కి జాలేసి వాళ్ళని పిలిచి భోజనం పెట్టించి  కొత్త బట్టలు ఇచ్చి ఏమైందని అడిగాడు.

” అయ్యా ! అది చెప్పకూడదు ” అన్నారు వాళ్ళు. అబ్దల్ చెప్పమని బలవంతం చేశాడు.

చివరికి వాళ్ళు ఇలా అన్నారు ” మాది కపన్ నగరం .మేమూ నీవంటి వర్తకులమే. మా దగ్గరా చాలా ధనం ఉండేది. కొన్ని రోజుల క్రితం మేము టిఫ్లిస్ నగరానికి వెళ్ళాం. ఆ రాజుగారి కూతురు జగదేక సుందరి అని విని ఆమెని చూడాలనుకున్నాం. ఒకసారి ఆమెని గాజు అద్దాలలోంచి చూడటానికి నలభై బంగారు నాణాలు ఇవ్వాలట. అలాగే ఇచ్చి ఒకసారి చూశాం. మళ్ళీ మళ్ళీ , ప్రతిరోజూ చూడాలనిపించేది. అలా రోజూ మా దగ్గర ఉన్న  సరుకంతా రాజుకే ఇచ్చేస్తూ రోజూ ఆమెని చూసేవాళ్ళం.

ఒకసారి చూశాక తిరిగి చూడాలనుకోకుండా ఉండటం మానవమాత్రులెవరికీ అయే పని కాదు. ఆమె అందం అంతగా ఆకర్షిస్తుంది.

ఎనభై ఒంటెల మీద తీసుకెళ్ళినదంతా ఖర్చయిపోయి, ఇదిగో, ఇలా అయిపోయాం. నువ్వు మంచివాడివిలా ఉన్నావు. మేము నీకు ఎదురు పడకుండా ఉంటే బావుండేది. నీకు ఇలాంటి పరిస్థితి రాకూడదు, టిఫ్లిస్ కి మటుకు వెళ్ళకు ”

 

అంతా విని అబ్దల్ ఏమీ అనలేదు. మర్నాడు వాళ్ళిద్దరికీ గుప్పెడు బంగారునాణాలు ఇచ్చి పంపేశాడు. ఎంత వద్దనుకున్నా ఆ నగరానికి వెళ్ళాలనే అతనికి గట్టిగా అనిపించింది. ఒకసారి చూసి వచ్చేస్తే ఏమవుతుందిలే అనుకున్నాడు. వెళ్ళనే వెళ్ళాడు.

 

మొదటిసారి జగదేకసుందరిని చూస్తూనే ప్రేమలో పడిపోయాడు. ఆమెని పలకరించాలనీ , ఒప్పించి పెళ్ళాడాలనీ రోజూ వెళ్ళి తన డబ్బంతా పోగొట్టుకున్నాడు. ఆమెకి తన మాటలు వినిపించినట్లే  లేదు. ఆ అద్దానికి అటువైపునుంచి  ఎవరూ కనిపించరని అతనికి తెలియలేదు.

ఇక చేసేదేమీ లేక యెరెవాన్ కి తిరిగి వెళ్ళి తల్లితో జరిగిందంతా చెప్పాడు. తండ్రిమాట పెడచెవిని పెట్టి అక్కడికి వెళ్ళినందుకు ఆమె కొడుకుని చెడామడా తిట్టింది. అబ్దల్ క్షమించమనీ మరి ఇంకెప్పుడూ వెళ్ళననీ బతిమాలుకున్నాడు. మళ్ళీ వ్యాపారం చేసి తండ్రి పేరు నిలబెట్టేందుకు పెట్టుబడి కావాలి కదా ! అందుకని తండ్రి తనకు ఇచ్చిన తాళం చెవితో ఆ రహస్యపు గది తలుపు తెరిచి  ఒక చిన్న సంచీని పట్టుకొచ్చింది.

story1

” అబ్దల్ ! ఇదిగో, ఇందులో నువ్వు నలభై రాగినాణాలు పెడితే తెల్లారేసరికి అవన్నీ బంగారు నాణాలుఅవుతాయి

. జాగ్రత్తగా వాడుకో ” అని అతనికి ఇచ్చింది.

పదిరోజులు అలా చేసేసరికి నాలుగు వందల బంగారు నాణాలు పోగయాయి. వాటితో కొత్తగా సరుకులు కొని అబ్దల్ మళ్ళీ వ్యాపారం చేస్తానని బయలుదేరాడు. అయితే కొన్నాళ్ళకే తల్లికి ఇచ్చిన మాట మర్చిపోయాడు. టిఫ్లిస్ నగరానికే వెళ్ళాడు. రోజూ నలభై బంగారు నాణాలు ఇచ్చి రాజకుమారిని చూస్తూనే ఉన్నాడు. ఆ రాజు అతని డబ్బు ఎంతకీ అయిపోకపోవటం కనిపెట్టి ఒక రోజు అతన్ని పిలిచి కబుర్లలో పెట్టాడు. వాళ్ళ అమ్మాయిని పెళ్ళి చేసుకుంటానని అబ్దల్ అడిగాడు.

” ఓ ! దానికేం ! తప్పకుండా …నీ తరగని ధనం రహస్యం ఏమిటో చెబితే అలాగే ఆమెతో నీ పెళ్ళి జరిపిస్తాను ” అని టక్కరి రాజు చెప్పేసరికి అబ్దల్ నమ్మి సంచి సంగతి చెప్పేశాడు. మాయమాటలతో సంచీ తీసేసుకుని రాజు అబ్దల్ ని వెళ్ళగొట్టాడు. అబ్దల్ కి చాలా ఏడుపు వచ్చింది. వెళ్ళి వాళ్ళ అమ్మ కాళ్ళ మీద పడి ” బుద్ధొచ్చిందమ్మా ! నాన్న ఇచ్చింది ఇంకేమీ లేదా నీ దగ్గర ? ఇస్తే బాగుపడతాను ఈ సారి ” అని వేడుకున్నాడు. ఈ సారి తల్లికి కోపం అంత తొందరగా తగ్గలేదు. పెట్టిందేదో తిని ఇంట్లోనే పడిఉండమంది. రెండు మూడు నెలలయినా అబ్దల్ ఆమెను బతిమాలుతూనే ఉన్నాడు. చివరికి కరిగి, తల్లి ఈ సారి ఒక టోపీ తెచ్చి ఇచ్చి

” ఇది తలమీద పెట్టుకుంటే ఎవరికీ కనబడవు. పోయినదాన్ని తిరిగి తెచ్చుకునే ప్రయత్నం చెయ్యి ” అని గట్టిగా చెప్పి పంపించింది.

story2

ఇకనేం ! అతను ఆ టోపీ పెట్టుకుని ఎవరికీ కనిపించకుండా రాజకుమారి దగ్గరికి వెళ్ళి అక్కడే ఉండిపోయాడు. రాజభవనం కనుక భోజనానికి కొరత లేదు, ఎక్కడో ఒక చోట నిద్ర. అయినా కొంతకాలానికి ఎవరో అదృశ్యంగా అక్కడ ఉంటున్నారని చెలికత్తె లు కనిపెట్టి రాజుకు చెప్పారు. రాజుకి ఇది అతనేనేమోనని అనుమానం వచ్చి ” నువ్వెవరో తెలిస్తే కదా, నా కూతురితో పెళ్ళి చేయటానికి ” అని ఆశ పెట్టాడు. అబ్దల్ టోపీ తీసి ప్రత్యక్షమయ్యాడు. రాజు ” నువ్వు వెళ్ళినదగ్గర్నుంచీ తప్పు చేశానని నా కూతురు నా మీద కోపంగా ఉంది. నీ కోసం వెతికిస్తూనే ఉన్నాను. రేపే మీ పెళ్ళి ! ‘’ అని నమ్మించాడు . పెద్ద విందు ఏర్పాటు చేశారు. అబ్దల్ భోజనం లో మత్తు మందు కలిపి తినిపించారు.   స్పృహ పోగానే టోపీ తీసేసుకుని సేవకులతో అతన్ని ఊరవతల పడేయించారు. రాజకుమారికి ఇదంతా ఏమాత్రం ఇష్టం లేదు. తనని అబ్దల్ నిజంగా ప్రేమిస్తున్నాడని అర్థమై తనూ అతన్ని ప్రేమించింది. కానీ తండ్రి చేసే పనులని అరికట్టటం ఆమె వల్ల కాలేదు.

మర్నాడు పొద్దున మెలకువ వచ్చిన అబ్దల్ కి అంతా అల్లకల్లోలంగా అనిపించింది. రాజు మాటలు ఎలా నమ్మగలిగాడో తనకే అర్థం కాలేదు. ఇంటికి వెళితే తల్లి ఏమంటుందోననే భయం తో వెళ్ళలేకపోయాడు. వేలికి ఉన్న ఉంగరం అమ్మి కొన్నాళ్ళు గడిపాడు. ఆ డబ్బు ఖర్చయిపోయాక చివరికి వెళ్ళక తప్పలేదు. కొడుకు తెలివి తక్కువ తనానికీ దురదృష్టానికీ ఆమెకి దుఃఖం వచ్చింది. ఇక ఏమన్నా లాభం ఉండదనుకుందో ఏమో, అబ్దల్ ని పెద్దగా కోప్పడలేదు.

నాలుగు రోజులు పోయాక  తనే ఒక కొమ్ము బూరా తెచ్చి ఇచ్చి ” ఇదే మిగిలింది. దీన్నీ పోగొట్టు కున్నావంటే మనం బిచ్చమెత్తుకోవలసి వస్తుంది , మన మొహాన దేవుడు అదే రాస్తే తప్పించలేం. కానీ ప్రయత్నించు ” అని కొడుకుతో అంది.

ఆమె చెప్పినట్లు ఇద్దరూ ఊరి బయటి కొండ మీదికి ఎక్కిన తర్వాత  అబ్దల్ దాన్ని ఊదాడు. జెమాజెట్టీ ల లాంటి సైనికులు  లెక్కలేనంతమంది ఎక్కడినుంచో వచ్చేశారు. ” దొరా ! ఏమి సెలవు ? ” అని అబ్దల్ ను అడిగారు. ప్రస్తుతానికి ఏం అక్కర్లేదని   ఇంకో వైపునుచి  బూరా ఊదితే వాళ్ళు మాయమైపోయారు.

 

” వీళ్ళకి అసాధ్యమైనదేమీ లేదు, నీకు అన్నీ చేసిపెడతారు. ఆ టిఫ్లిస్  నగరాన్ని కూడా  జయించగలరు. ఆ పని చేయి ” అని తల్లి చెప్పి పంపించింది.

అబ్దల్ వెళ్ళి  టిఫ్లిస్ నగరం బయట కొమ్ము బూరా ఊదాడు. సైనికులకి  నగరాన్ని  ముట్టడించమని ఆజ్ఞ ఇచ్చాడు. అలాగే జరిగింది. నగరం లో ప్రజలు భయపడిపోయి రాజుకి మొర పెట్టుకున్నారు. రాజు దూతలని పంపి ఏం కావాలని అడిగించాడు.

” యుద్ధం ! యుద్ధానికి వచ్చాను ” అని గర్జించాడు అబ్దల్.

రాజు అక్కడికి  వెళ్ళి  ” ఇదిగో ! ఇప్పుడే నా కూతుర్ని తీసుకుపోయి పెళ్ళి చేసుకో ” అని ఆమెని అక్కడికి రప్పించాడు. అబ్దల్ రెండో వైపునుంచి ఊది సైన్యాన్ని పంపించేశాడు. బూరా జేబులోనే పెట్టుకున్నాడు. అయితే పెళ్ళి కోసమని స్నానం చేసేందుకు దుస్తులు పక్కన పెట్టవలసి వచ్చింది. అతన్ని రహస్యంగా వెంబడిస్తున్న రాజు గూఢచారి చటుక్కున దాన్ని దొంగిలించి రాజుకి తెచ్చి ఇచ్చాడు. తర్వాతి కథ మామూలే. ఈ సారీ ఓడిపోయిన అబ్దల్ కి ఇంటికి వెళ్ళబుద్ధి పుట్టలేదు. తండ్రి దాచిఉంచినవన్నీ అయిపోయాయి. తల్లికి మొహం చూపించలేడు.

 

అక్కడికి దగ్గరలో సముద్రపు రేవు ఉంది. ఒక ఓడ దూరదేశాలకి బయలుదేరబోతూ ఉంది. అబ్దల్ అందులో పనివాడుగా చేరాడు. ఓడ ప్రయాణిస్తూ ఉండగా తుఫాన్ లో చిక్కుకుని  ముక్కలైపోయింది. అదృష్టవశాత్తూ అబ్దల్ కి ఏమీ కాలేదు. ఈదుకుంటూ  ఒక ఒడ్డుకి చెరాడు. అదొక దీవి. మనుషులెవరూ లేరుగానీ పుష్కలంగా పళ్ళ చెట్లు ఉన్నాయి. వాటితో ఆకలి తీర్చుకుంటూ కొంతకాలం గడిపాడు. ఒక రోజున రెండు ఆపిల్ చెట్లు పక్కపక్కనే కనిపించాయి. ఒక చెట్టు పండు కోసి తిన్నాడు. కాసేపటికి గాడిదగా మారిపోయాడు. ” ఓహో, నా దురదృష్టం ఇంకా పూర్తి కాలేదన్నమాట ” అన్న దిగులు లో మునిగిపోయాడు. కడుపునింపుకోవటం తప్పదు కనుక గడ్డి మేస్తూ బతకవలసి వచ్చింది. అలా ఇంకొక రోజున  అక్కడే రాలిపడిన ఇంకొక ఆపిల్ తిన్నాడు. మళ్ళీ మనిషి రూపం వచ్చేసింది.

” ఎందుకైనా పనికొస్తాయి ” అనుకుని రెండు రకాల పళ్ళూ కోసి విడి విడిగా దాచిపెట్టాడు. చివరికి ఒకనాడు దూరంగా ఒక ఓడ వెళుతూ కనిపించింది. అబ్దల్ చేతులు ఊపుతూ అరుస్తూ , ఆ ఓడలో వాళ్ళకి తను అక్కడ ఉన్నానని తెలిసేలా చేశాడు. ఓడ అక్కడికి వచ్చి అతన్ని ఎక్కించుకుంది. నావికులు అబ్దల్ కథ  విని జాలిపడి అతను కోరినట్లుగా  టిఫ్లిస్ నగరపు రేవు లో దించారు.

 

పళ్ళు అమ్మేవాడిలాగా మారువేషం వేసుకుని రాజభవనం దగ్గరికి వెళ్ళాడు. రాజకుమారి అతని దగ్గర మొదటి రకం ఆపిల్ పళ్ళు కొంది. ఆమె తినేలోపునే అతను తప్పించుకున్నాడు. తిన్నవెంటనే  వెంటనే జగదేకసుందరి కాస్తా గాడిదగా మారిపోయింది. అంతా గగ్గోలు పెట్టారు.

రాజు ఎంత చెడ్డవాడైనా కూతురి మీద అతనికి చాలా మమకారం. ఎక్కడెక్కడి వైద్యులనీ మంత్రగాళ్ళనీ పిలిపించి ఆమెని మామూలుగా చేయించటానికి ప్రయత్నించాడు. ఎవరూ చేయలేకపోయారు. రాజుకి ఆందోళన ఎక్కువైపోయింది. ఆఖర్న వైద్యుడి వేషం వేసుకుని అబ్దల్ వెళ్ళాడు.

 

” నేను మీ అమ్మాయిని ఎప్పటిలాగా చేయగలను. అయితే రెండు షరతులు. మొదటిది ఆమెని నాకిచ్చి పెళ్ళి చేయాలి. రెండోది నేను అడిగిన వస్తువులన్నీ నాకు ఇచ్చేయాలి, అవి మీ దగ్గర ఉన్నవే ”

 

నగరం లో పెద్ద మనుషులని పిలిపించి ముందే ఒప్పందం రాసుకున్నారు.

story3

 

” ముందుగా కపన్ నగరం వర్తకులనుంచి మీరు తీసుకున్న ఎనభై ఒంటెల మీది సరుకులు. తర్వాత  యెరెవాన్ యువకుడి నుంచి దొంగిలించిన డబ్బు సంచీ, టోపీ, కొమ్ము బూరా. ఇంకా అతని ఆస్తి- నలభై ఒంటెల మీది సరుకులు ”

 

రాజుకి అవన్నీ ఇచ్చేయటానికి ఎంతమాత్రం మనసొప్పలేదు. కానీ తప్పలేదు. తన కూతురు మనిషిగా మారాక మాత్రమే అవన్నీ ఇస్తానని ఒప్పుకున్నాడు. అన్నిటినీ తెప్పించి ఉంచమన్నాడు అబ్దల్.

 

రెండో రకం ఆపిల్ తినగానే రాజకుమారి మనిషిగా అయిపోయింది.

” నన్ను పెళ్ళాడటం నీకిష్టమేనా ? ” అని అసలు రూపం తో కనబడి అడిగాడు అబ్దల్. ఆమె సంతోషంగా ఒప్పుకుంది. రాజు తెప్పించి ఉంచినవన్నీ అప్పటికప్పుడు తీసేసుకుని వెనక్కి తిరిగి చూడకుండా యెరెవాన్ కి బయల్దేరి వెళ్ళాడు.గొప్ప వైభవం తో ఇంటికి వెళ్ళి

 

” అమ్మా ! పోగొట్టుకున్నవన్నీ తిరిగి సంపాదించాను. అదనంగా ఈమెని నీ కోడలిగా తెచ్చాను ” అని తల్లికి అన్నీ చూపించాడు. ఆమె అప్పటికే అబ్దల్ మళ్ళీ ఓడిపోయి ఉంటాడనీ ఇక తనకి కనబడడనీ నిరాశ చేసుకుంది. ఇప్పుడు ఆమె ఆనందానికి హద్దులు లేకుండా పోయాయి. కబురు చేసి వర్తకులిద్దరినీ పిలిపించి అబ్దల్ వాళ్ళ ఆస్తిని వాళ్ళకి అప్పగించాడు. అంతా విని వాళ్ళు ఆశ్చర్యపోయారు. త్వరలోనే అబ్దల్ కీ జగదేకసుందరికీ పెళ్ళి జరిగింది. వాళ్ళు చాలాకాలం సుఖంగా జీవించారు.

రాజకుమారి ఎప్పుడైనా తండ్రిని చూసేందుకు టిఫ్లిస్ నగరానికి వెళ్ళేది కానీ అబ్దల్ మళ్ళీ అక్కడ అడుగు పెట్టలేదు.

  • ఆర్మీనియన్ జానపదకథ

[టర్కిష్  లో అబ్దల్ అంటే నిర్లక్ష్యంగా ఉండేవాడు అని అర్థం. ఈ మాటను అరబిక్ లో సాధువులకి కూడా ఉపయోగిస్తారు]

గాజు కొండ మీద

MythiliScaled

అనగనగా ఒక గాజు కొండ. దాని మీద బంగారపు కోట. కోట ముంగిట్లో ఒక ఆపిల్ చెట్టు. దానికి బంగారు రంగులో  ఆపిల్ పళ్ళు కాసేవి.   కోట లోపల ఒక  వెండి గది. దాని గోడలకి ఆనించి పెద్ద పెద్ద భోషాణాలు, వాటినిండా  వెలలేని వజ్ర వైఢూర్యాలు. అలాంటి గదులు కోటలో చాలా ఉన్నాయిగాని ఈ గదిలో మాత్రం ఒక రాజకుమారి ఉండేది. ఆమె చాలా చాలా అందంగా ఉండేది. నేలమాళిగలనిండా బంగారు కాసులు రాసులు పోసి ఉండేవి. ఒక మాంత్రికుడు ఆమె తండ్రిమీద కోపంతో రాజకుమారిని అక్కడ బంధించి ఉంచాడు. గాజు కొండ పైకి ఎక్కి ఆపిల్  పండు ఒకటి కోసి పట్టుకెళితేనేగాని  కోట తలుపులు తెరుచుకోవని అతను శపించాడు. కోటలోకి ప్రవేశించి రాజకుమారిని పెళ్ళాడి ఆ సంపదనంతా సంపాదించుకోవాలని ఎందరో వీరులు ప్రయత్నించారు. కానీ ఎవరికీ అది సాధ్యం కాలేదు. ఎంత గట్టి పట్టు ఉన్న నాడాలని గుర్రాల కాలి గిట్టలకి తొడిగినా అవి  పైదాకా ఎక్కలేకపోయేవి. నున్నటి గాజుమీద వెనక్కి  జారిపోయి లోతైన లోయలో పడిపోతూ ఉండేవి. ఒక్క వీరుడు కూడా బతికి తిరిగి రాలేదు.

కిటికీ దగ్గరే కూర్చుని ఉండే రాజకుమారికి ఇదంతా కనిపించేది. ఎవరైనా కొత్తగా కొండ ఎక్కబోతూ ఉన్నప్పుడు ఆమెకి విడుదలవుతానని ఆశ పుట్టేది. ఆ వీరులకీ ఆమెని చూస్తే ఉత్సాహం వచ్చేది. అయితే ఏమీ లాభం లేకపోయింది. అలా ఏడు సంవత్సరాలు ఆమె అలాగే ఎదురు చూస్తూ ఉంది. ఏడేళ్ళ తర్వాత ఇక ఆమె బయటికి రాలేదు, ఎప్పటికీ అక్కడే ఉండిపోవాలి.

ఇంకొక మూడు రోజులలో ఏడేళ్ళూ పూర్తి అవుతాయనగా ఆ రోజున బంగారు కవచమూ శిరస్త్రాణమూ ధరించిన ఒక యువకుడు కొండ ఎక్కటం మొదలుపెట్టాడు. అతని గుర్రం బలంగా, చురుకుగా ఉంది. జారిపోకుండా ఉండేందుకు దానికి ప్రత్యేకంగా తయారు చేసిన నాడాలు తొడిగారు. సగం దూరం ఎక్కింది కానీ మరి చేతకాలేదు. అయితే జారకుండా జాగ్రత్తగా వెనక్కి వచ్చి ఆగింది. రెండో రోజు ఇంకా తొందరగా , నేర్పుగా ఇంచుమించు పైదాకా వెళ్ళింది. నాలుగు అడుగులు వేస్తే గుర్రం మీది యువకుడికి ఆపిల్ పళ్ళు అందేలా ఉన్నాయి. సరిగ్గా అప్పుడు ఎక్కడినుంచో భయంకరమైన రాబందు  ఒకటి ఎగిరి వచ్చింది. అది ఏనుగంత పెద్దగా ఉంది. రెక్కలతో చటుక్కున గుర్రం కళ్ళ మీద కొట్టింది. బాధతో గట్టిగా సకిలించి గుర్రం, ముందు కాళ్ళ మీద పైకి లేచింది. అంతే ! వెనకకాళ్ళకి పట్టు జారిపోయింది. గుర్రమూ దాని మీది యువకుడూ ఇద్దరూ గాజు మీద జారిపోయి లోయలోకి పడిపోయారు. చూస్తూ ఉన్న రాజకుమారి వెక్కి వెక్కి ఏడ్చింది. ఎలాగూ తనకి విముక్తి లేదు, తనకోసం ఇంతమంది ప్రాణాలు పోగొట్టుకున్నందుకు ఆమెకి దుఃఖం ఆగలేదు.

glass mountain 1

ఆఖరి రోజున ఒక కుర్రవాడు వచ్చాడు. హుషారుగా సరదాగా ఉన్నాడు. చిన్నపిల్లవాడికిలాగా మొహం లేతగా ఉంది , కానీ బాగా పొడుగ్గా దృఢంగా ఉన్నాడు. అంతమందీ  ఏమీచే యలేకపోయారనీ చచ్చిపోయారనీ అతనికి తెలుసు. అయినా ధైర్యంగా తనవంతు ప్రయత్నం చేద్దామనే అనుకున్నాడు. వాళ్ళ ఊళ్ళో కమ్మరి చేత కాలివేళ్ళకీ చేతివేళ్ళకీ ఇనప గోళ్ళు తయారు చేయించుకున్నాడు. వాటిని తగిలించుకుని చాలా కొండలు ఎక్కి సాధన చేశాడు. అవన్నీ నిట్టనిలువుగా ఉన్న కొండలు, ఎక్కడా పట్టు దొరకనివి. గాజువి అయితే కావు, ఇటువంటి కొండ ఇదొక్కటే.

అతను ఎక్కటం మొదలుపెట్టాడు. ఓపికగా కాస్త కాస్తగా పైకి వెళుతున్నాడు. చూస్తుండగానే పొద్దుకుంకింది. బాగా అలిసిపోయాడు. దాహంతో గొంతు ఎండిపోతూ ఉంది. కాళ్ళకి ఇనపగోళ్ళు గుచ్చుకుపోయి రక్తం చిమ్ముతున్నాయి. చేతులతో మాత్రమే పాకగలుగుతున్నాడు. కొండ మీది ఆపిల్ చెట్టు కనబడుతుందేమోనని పైకి చూశాడు. కనిపించలేదు. కిందికి చూశాడు, అగాథమైన లోయ. తన కంటే ముందు వచ్చినవారంతా అందులోకే పడిపోయారని అతనికి తట్టింది, భయం వేసింది. చేతి గోళ్ళ పట్టు మాత్రం వదిలిపెట్టలేదు. మెల్లిగా చీకటి పడింది. బడలిక వల్ల అలాగే అక్కడే  నిద్రపోయాడు.glass mountain 2

 

అంతకుముందు రోజు యువకుడి గుర్రాన్ని కిందపడేసిన రాబందు అటువైపుగా వచ్చింది. అది మామూలు రాబందు  కాదు , పిశాచపక్షి. ఎవరూ చివరివరకూ రాకుండా  దాన్ని మాంత్రికుడే ఏర్పాటు చేశాడు. రోజూ రాత్రి వేళల్లో అది కొండ చుట్టూ చక్కర్లు కొడుతూ కాపలా కాస్తుంటుంది. ఈ నిద్రపోయే కుర్రవాడిని చూసి చచ్చిపోయాడని అనుకుంది. తినేందుకు దగ్గరికి వచ్చి ముక్కుతో పొడిచింది. అతనికి మెలకువ వచ్చింది, వస్తూనే ఒక ఉపాయం తట్టింది. రాబందు పొడుస్తున్న చోట విపరీతమైన నొప్పిగా ఉన్నా ఓర్చుకున్నాడు. దాని రెండుకాళ్ళూ గట్టిగా పట్టుకున్నాడు. అది బెదిరి పైకి ఎగిరింది. దానితోపాటు అతనూ గాలిలోకి లేచాడు. కొండ పైకంటా ఎగిరి గాలిలో గుండ్రంగా తిరుగుతోంది. అతను కళ్ళు తెరిచి చూస్తే కిందన బంగారుకోట పెద్ద దీపంలాగా కనిపిస్తోంది. రాబందు ఎగరటం లో ఒకసారి ఆపిల్ చెట్టుకి దగ్గరగా వచ్చింది. అతను తటాలున కిందికి దూకాడు. దూకబోయేముందు ఇనపగోళ్ళతో దాన్ని బలంగా కొట్టాడు. అది వికృతంగా అరుస్తూ లోయలోకి పడిపోయింది. కుర్రవాడు ఆపిల్ చెట్టు కొమ్మల్లోకి పడ్డాడు. పెద్దగా దెబ్బలేమీ తగలలేదు. ఆకలేసి రెండు పళ్ళు కోసుకుని తిన్నాడు. చేతులకి ఆ రసం అంటిన చోట గాయాలు మాయమైపోయాయి. ఇంకొక పండుకోసి ఒంటిమీద దెబ్బలు తగిలినచోటల్లా రుద్దుకున్నాడు. అన్నీ నయమైపోయాయి. బోలెడంత శక్తి వచ్చింది. మరికొన్ని పళ్ళు కోసి చేత్తో పట్టుకుని కోట దగ్గరికి వెళ్ళాడు.

glass mountain 3

 

కోట గడప  దగ్గర ఒక డ్రాగన్ పహరా కాస్తోంది. ఆపిల్ ని దానిమీదికి విసరగానే అది మాయమైంది. తలుపులు తెరుచుకున్నాయి. రంగురంగుల  పూల మొక్కలు, పళ్ళ చెట్ల మధ్యలోంచి రాజకుమారి నడిచివచ్చింది. ఆమె వెంట తల్లి, తండ్రి, పరివారం- అంతా ఉన్నారు. వాళ్ళందరికీ అప్పుడే శాపం తీరింది.ఆ కొండ మీదే వాళ్ళ రాజ్యం- చాలా పెద్దది.  చేతిలో ఉన్న పూలమాలని కుర్రవాడి మెడలో వేసింది. అతనికి పదే పదే కృతజ్ఞతలు చెప్పుకుంది. రాజకుమారి ఎంత అందమైనదో అంత మంచిది కూడా. ఆమెతో అతను చాలా సంతోషంగా ఉన్నాడు.

 

మరుసటి  రోజు  వాళ్ళిద్దరూ తోటలో తిరుగుతుండగా గాజు కొండ కింద పెద్ద కలకలం వినబడింది. ఆ రాజ్యం లో వానకోయిలలు అన్ని చోట్లకీ ఎగిరి వెళ్ళి వచ్చి  వార్తలు చెబుతూ ఉంటాయి. కుర్రవాడు ఈల వేసి ఒక వానకోయిలని పిలిచి సంగతి ఏమిటో కనుక్కురమ్మన్నాడు.

 

అది వచ్చి చెప్పింది- ” రాబందు లోయలోకి పడినప్పుడు దాని రక్తపు చుక్కలు చనిపోయిన వీరులందరిమీదా పడ్డాయి. వాళ్ళు వాళ్ళ గుర్రాలతో సహా ఒక్కొక్కరే బతికి లేస్తున్నారు. ఆశ్చర్యంగా, ఆనందంగా ఎవరి ఊళ్ళకి వాళ్ళు బయలుదేరుతున్నారు. అదీ ఆ హడావిడి . ”

                                                                                               [  పోలండ్ జానపద కథ]

                                                                         సేకరణ- Hermann Kletke, Andrew Lang

 

 

ఆశ – దురాశ

MythiliScaled

అనగనగా ఒక ఊర్లో ఇద్దరు అన్నదమ్ములు. హాన్స్ పెద్దవాడు, క్లాస్ చిన్నవాడు. హాన్స్ అదృష్టం బాగుండి ఎక్కువ డబ్బు సంపాదించగలిగాడు. క్లాస్ ఏం చేసినా కలిసిరాలేదు. రాను రాను క్లాస్ కి తిండి దొరకటమే కష్టమయిపోయింది. అన్న దగ్గరికి వెళ్ళి , సంగతి చెప్పి, కొంచెం డబ్బు- అప్పుగానైనా సరే, ఇమ్మని అడిగాడు. హాన్స్ ససేమిరా వీల్లేదన్నాడు.

 

” నేనేమీ రాసులు పోసుకు కూర్చోలేదు ఊరికే ఇవ్వటానికి. నీకు అప్పు ఇస్తే వెనక్కి వస్తుందా ! ఎక్కడో  కాసులు బఠాణీ గింజల్లాగా దొర్లుతున్నాయట, వెళ్ళి వెతుక్కో ”

సరేననుకుని  క్లాస్ బయలుదేరాడు. వెళ్ళే ముందర దగ్గర్లో ఉన్న అడవిలో ఒక హేజెల్ చెట్టు కొమ్మని విరిచి చేతికర్రగా తయారు చేసుకున్నాడు. ఆ చెట్టు నిజానికి మంత్రపు చెట్టు. ఆ కర్ర ఎక్కడెక్కడ నిధులూ నిక్షేపాలూ ఉన్నాయో చూపించగలదు. అదేమీ క్లాస్ కి తెలియనే తెలియదు.

అతను ఏ కష్టమూ లేనట్లే కులాసాగా ఈలవేసుకుంటూ ప్రయాణించి ఒక పట్టణం చేరుకున్నాడు. అక్కడి సంతలో పని కావలసినవాళ్ళంతా బార్లు తీరి ఉన్నారు. వాళ్ళతోబాటు తను కూడా నాలుగు ఎండు గడ్డి పోచలు నములుతూ నిలుచున్నాడు. అలా గడ్డి నోట్లో పెట్టుకుని ఉంటే పని చేసేందుకు సిద్ధంగా ఉన్నారని అక్కడి అర్థం.

అంతలో అక్కడికి ఒక వంగిపోయిన ముసలివాడు వచ్చాడు. పైకి అలా కనిపించడు కానీ చాలా విషయాలు తెలుసు అతనికి, ముఖ్యంగా మంత్రాలూ తంత్రాలూ. క్లాస్ చేతి కర్రకి మహిమ ఉందని చూసీ చూడగానే కనిపెట్టాడు. కాసేపు అటూ ఇటూ తచ్చాడి క్లాస్ దగ్గరికి వచ్చాడు .

” అయితే, పనిలో చేరాలనుకుంటున్నావా ? ” అడిగాడు.

క్లాస్ ” మరే. లేకపోతే ఇలా గడ్డి నములుతూ ఎందుకుంటానూ ?”

మాటలు మొదలయ్యాయి. అటూ ఇటూ బేరాలు సాగి సాగి చివరికి వారానికి ఏడు పెన్నీల జీతానికి క్లాస్ ముసలివాడి దగ్గర పనిచేసేందుకు ఖరారైంది. క్లాస్ ని వెంటబెట్టుకుని కొంత దూరం నడిచాక ముసలివాడు ఆ కర్ర ఎక్కడనుంచి తెచ్చుకున్నావని అడిగాడు.

” ఎక్కడోలెండి ” అన్నాడు క్లాస్.

pepper-and-salt

 

” ఎక్కడో గుర్తు చేసుకోగలవా ?” ముసలివాడు అడిగాడు.

 

” అబ్బే, కష్టం ” క్లాస్ పెదవి విరిచాడు.

 

” ఇదిగో, ఒక వెండినాణెం. ఇప్పుడు ?”

 

” ఊ..సరేలెండి. గుర్తొస్తున్నట్టే ఉంది ”

 

ముసలివాడు పసుపచ్చని నీళ్ళు ఉన్న ఒక సీసాని తెచ్చి క్లాస్ తో అన్నాడు ” ఆ  కొమ్మ ఎక్కడ విరిచావో  ఆ మొదట్లో ఇదిగో, దీన్ని  ఒంపెయ్యి. అక్కడినుంచి ఏడు ఆకుపచ్చటి పాములు వస్తాయి. నిన్ను ఏమీ చేయవు, వాటిదారిన వాటిని పోనీ. ఆ తర్వాత ఆ విరిగిన  కొమ్మ నుంచి కొత్త ఆకులు మొలుస్తాయి. ఒక్కటీ వదలకుండా అన్నీ కోసి ఈ సీసాలో వేసుకురా. అప్పుడు నీకు ఇంకో వెండినాణెం ఇస్తాను ”

అదేమంత బరువుపనిగా తోచలేదు క్లాస్ కి. ఇంత అన్నం పెడితే తినేసి బయల్దేరిపోయాడు.

ఆ హేజెల్ చెట్టు పెద్ద శ్రమ లేకుండానే దొరికింది. ముసలివాడు చెప్పినట్లే చేశాడు. అలాగే ఆకుపచ్చపాములు వచ్చి వెళ్ళిపోయాయి. ఆ తర్వాత మొలుచుకొచ్చిన ఆకులు మటుకు   విడ్డూరంగా ఉన్నాయి. అంచుల్లో వెండిలాగా మెరుస్తున్న అటువంటి ఆకులని అదివరకు  ఏ చెట్టు మీదా అలాంటివాటిని క్లాస్ చూసిఉండలేదు

 

అవి మంత్రపు ఆకులు. వాటిని నిళ్ళలో మరిగించి ఆ కషాయం తాగితే పక్షులూ జంతువులు అన్నిటి మాటలూ అర్థమవుతాయి. అన్నీ కోసి సీసాలో వేసుకుని ముసలివాడి దగ్గరికి తెచ్చాడు. అతను చెప్పినట్లు చితుకులు పోగు చేసి పొయ్యి వెలిగించాడు. బాగా పెద్ద మంట వచ్చాక దానిమీద కుండ లో నీళ్ళు పెట్టి అవి తెర్లుతూ ఉన్నప్పుడు ఆకులన్నీ ఒకేసారి వేశాడు. ఈ లోపు ముసలివాడికోసం ఎవరో వచ్చారు. కుండలోంచి చాలా మంచి వాసనలు వచ్చాయి. క్లాస్ కి నోరూరి ఒక చెంచా అందులో ముంచి నోట్లో వేసుకున్నాడు. గొప్ప రుచిగా ఉంది కషాయం.   కషాయం లో మహిమ అంతా  క్లాస్ ముంచిన చెంచా కి అంటుకుని క్లాస్ నోట్లోకి వెళ్ళిపోయింది. ముసలివాడికి గదిలోకి వస్తూనే ఆ విషయం తెలిసిపోయింది. క్లాస్ ని తెగతిట్టాడు. క్లాస్ కి ఏమీ అర్థం కాలేదు. పొరబాటున ఆ కాస్తా రుచి చూశాననీ క్షమించమనీ  వేడుకున్నాడు. ముసలివాడి కోపం అంతకంతకూ ఎక్కువైపోయింది.

 

” అది తాగావుగా. ఇదీ తీసుకో ” అని క్లాస్  మీదికి వేడి కషాయాన్ని విసిరికొట్టాడు. క్లాస్ చటుక్కున వెనక్కి తప్పుకుని మొహం కాలిపోకుండా కాపాడుకోగలిగాడు. ఇక అక్కడుంటే ముసలివాడు ఏం చేస్తాడోనని భయపడి వీధిలోకి పారిపోయాడు. అక్కడ ఒక కోడిపెట్టా కోడిపుంజూ కబుర్లు చెప్పుకుంటున్నాయి. క్లాస్ కి అవన్నీ తెలిసిపోతున్నాయి. అతను రావటం చూసి

కోడి పెట్ట ” ఇడుగో, కొత్త నౌకరు వెళ్ళిపోతున్నాడు ”

కోడి పుంజు ” వెళ్తే వెళ్ళాడు గానీ అసలైనదాన్ని వెనకాలే వదిలేశాడే ”

 

” దేన్ని ?”

” ఆ హేజెల్ కర్రని. ”

 

” అవునవును. రత్నాలని రాళ్ళనుకుని పారేసుకుంటూ ఉంటారు ”

 

క్లాస్ వెనక్కి వెళ్ళి జాగ్రత్తగా ముసలివాడి ఇంట్లో దూరి  ఆ కర్ర ని తెచ్చేసుకున్నాడు. అది ఎందుకు పనికొస్తుందో తెలియకపోయినా భద్రంగా పట్టు కున్నాడు. ఒక చెట్టుకింద  నిద్రపోయేముందర చొక్కాలో దూర్చుకుని పడుకున్నాడు.

 

నిద్ర పట్టబోతుండగా చెట్టు మీదినుంచి రెండు గుడ్లగూబలు మాట్లాడు మాట్లాడుకుంటున్నాయి.

 

” ఆ హేజెల్ కొమ్మ తో ఏం చేయచ్చో క్లాస్ కి తెలీదు కదా పాపం ”

 

” ఏం చేయచ్చు ?”

” వాళ్ళ ఊళ్ళో హార్ ఆక్సెల్ అనే అతని ఇల్లు ఉంది కదా , ఆ వెనక కొండమీద  మూడు నిలువుల ఎత్తున పెద్ద బండ రాయి ఉంది. ఆ కర్ర తో దాని మీద కొడితే బోలెడంత వెండీ బంగారమూ దొరుకుతా యి ”

 

” ఓహో ” అనుకుని క్లాస్ అప్పటికప్పుడు ఇంటిదారి పట్టాడు.

 

హాన్స్ చూశాడు. ” మళ్ళీ వచ్చావేం ? డబ్బు గడించావా ?” అని వెటకారం చేశాడు. క్లాస్ పట్టించుకోలేదు.

కాస్త చీకటి పడనిచ్చి ఆ కొండ దగ్గరికి వెళ్ళాడు. గుడ్లగూబలు చెప్పినట్లే ఆ కొండ మీద మూడు నిలువుల ఎత్తు  బండరాయి ఉంది. కర్రతో దానిమీద కొట్టేసరికి అది తలుపులాగా తెరుచుకుంది. మెట్లుదిగితే కింద పెద్ద చావడి [ హాల్ ]ఉంది. దాని గోడలకి పేర్చి ధాన్యం  బస్తాల లాగా  చాలా ఉన్నాయి. . దగ్గరికి వెళ్ళి చూస్తే నిండా వెండి బంగారాలు.

 

ఆ చావడి చివరన  రాతి అరుగు మీద హుక్కా తాగుతూ  ఒక మరుగుజ్జు మనిషి కూర్చుని ఉన్నాడు. అతని గడ్డం పొడుగ్గా నేల మీద జీరాడుతూ ఉంది.

” ఎలా వచ్చావు క్లాస్ ఇక్కడికి ” అని అతన్ని పేరుపెట్టి పిలిచి ఏం కావాలని అడిగాడు.

క్లాస్ బెరుగ్గా, వినయంగా ” కొంచెం డబ్బు తీసుకోవచ్చా అండీ ? ” అని అడిగాడు.

‘ నీకు కావలసినంత తీసుకో.అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అన్నాడు మరుగుజ్జు మనిషి.

క్లాస్ జేబుల నిండుగా వెండీ బంగారు నాణాలు నింపుకుని మరుగుజ్జు మనిషికి కృతజ్ఞతలు చెప్పుకుని మూసిన తలుపు మీద కర్రతో కొడితే అది తెరుచుకుంది. ఇవతలికి వచ్చేశాడు.కర్రని జాగ్రత్తగా తెచ్చేసుకున్నాడు. బండరాయి ఎప్పటిలా మూసుకుపోయింది.

 

ఆ తర్వాత  అప్పుడప్పుడూ కొండ దగ్గరికి వెళ్ళి జేబుల్లో నాణాలు తెచ్చుకుంటూ ఉండేవాడు. సంచి పట్టుకెళ్ళి నింపుకోవచ్చునని అతనికి తట్టలేదు. క్లాస్ పెద్దగా పనేమీ చేయకపోయినా అతనికి బాగా జరిగిపోతూ ఉండటం హాన్స్ కి ఆశ్చర్యం కలిగించింది .

 

ఒక రోజు తమ్ముడి దగ్గరికి వెళ్ళి గుచ్చి గుచ్చి అడిగాడు. ముందు ఏమీ చెప్పదలచుకోకపోయినా అన్నకి సాయం చేద్దామని క్లాస్ కి అనిపించింది. అంతా వివరంగా చెప్పాడు. తనకున్నది ఇద్దరమూ పంచుకుందామని అన్నాడు. అయితే హాన్స్ అలా తృప్తి పడే రకం కాదు. మోయగలిగినన్ని సంచులూ హేజెల్ కర్రా తీసుకుని బయల్దేరాడు.

 

మరుగుజ్జు మనిషి ఏం కావాలని అడిగితే ఆ సంచుల నిండుగా బంగారం కావాలన్నాడు.

 

” సరే, నీ ఇష్టం. అసలైనదాన్ని మటుకు మర్చిపోకు ” అని హెచ్చరించాడు.

 

ఆత్రంగా సంచులన్నీ నింపి ఒక్కొక్కటే తలుపు దగ్గరికి చేరవేశాడు. హేజెల్ కర్రని అక్కడే వదిలేశాడు. ఎంత నెట్టినా  తలుపు తెరుచుకోకపోతే అప్పుడు హాన్స్ కి కర్ర సంగతి గుర్తొచ్చింది. మరుగుజ్జు అప్పటికి దాన్ని తీసేసుకున్నాడు.

 

” నువ్వు ఎంత అడిగినా దీన్ని ఇవ్వను. నువ్వూ ఇక్కడే పడిఉండాల్సిందే ” అన్నాడు మరుగుజ్జు. అక్కడ తిండీ నీళ్ళూ ఉండవని కూడా చెప్పాడు.

 

హాన్స్ భయపడిపోయి పదే పదే  బ్రతిమాలాక అతను మాత్రం బయటికి వెళ్ళేందుకు మరుగుజ్జు తలుపు తెరిచాడు. బంగారునాణాల సంచులు ఒక్కటి కూడా తీసుకెళ్ళటానికి మరుగుజ్జు ఒప్పుకోలేదు. ప్రాణం దక్కిందే చాలనుకుని హాన్స్ బయటపడ్డాడు.

 

తమ్ముడి దగ్గరికి వెళ్ళి కర్రని పోగొట్టినందుకు క్షమించమని కాళ్ళా వేళ్ళా పడ్డాడు. క్లాస్ ముందు కొంచెం బాధపడినా కావలసినంత సంపద ఉంది కనుక అన్నని ఓదార్చాడు. క్లాస్ తన దగ్గరి డబ్బులో సగం ఇస్తానని అన్నా హాన్స్ కి సిగ్గనిపించి  తీసుకోలేదు. తనకున్నది చాలన్నాడు.

ఆ తర్వాత అన్నదమ్ములిద్దరూ బ్రతికినంతకాలం అన్యోన్యంగా జీవించారు.

 

[ Howard Pyle సేకరించి,తిరగరాసి, బొమ్మలు గీసి ప్రచురించిన fairy tales  సంకలనం Pepper and Salt నుంచి                   స్వేచ్ఛానువాదం: మైథిలి అబ్బరాజు  ]

mythili

 

 

 

 

.

రోజ్ మేరీ

MythiliScaled

ఒకానొకప్పుడు ఒక తండ్రీ కూతురూ ఉండేవారు. వాళ్ళకి కొంచెం పొలం ఉండేది. అమ్మాయి కి రోజ్ మేరీ మొక్క  సువాసన చాలా ఇష్టం. తన గౌన్ లో ఎప్పుడూ  ఆ రెమ్మలు దాచుకునేది. అవి వాడిపోతే మళ్ళీ తెచ్చుకునేది. అసలు పేరు ఏదో కాని అంతా తనని అదే పేరు తో పిలిచేవారు. కష్టపడి ఇంటి పని అంతా చేసేది. ఒక సాయంత్రం పని ముగిసిన తర్వాత తండ్రి ఆమెని అడవి లోకి వెళ్ళి చితుకులు ఏరుకు రమ్మని పంపించాడు, మర్నాడు పొయ్యిలో పెట్టటానికని. తను వెళ్ళి కట్టె పుల్లలు ఏరి పెద్ద మోపుగా కట్టింది. పక్కనే  రోజ్ మేరీ మొక్క కనిపించింది. దాన్ని పెకలించి ఇంటికి తీసుకువెళదామనుకుంటే  అది అంత తేలికగా  రాలేదు. బాగా బలంగా లాగేసరికి ఊడి వచ్చింది.

ఒక అందమైన యువకుడు ప్రత్యక్షమై ” నా కట్టెలు  దొంగిలిస్తున్నావెందుకు ? ” అని గద్దించి అడిగాడు.

అమ్మాయికి భయం వేసింది. వాళ్ళ నాన్న తెమ్మన్నాడని మెల్లిగా గొణిగింది.

రోజ్ మేరీ మొక్క ఉన్న చోట భూమిలో ఒక సొరంగం ఏర్పడింది. ” సరే అయితే. నాతో రా ఇలాగ ” అని యువకుడు పిలిచాడు. అమ్మాయి భయం భయంగా అతని వెంట వెళ్ళింది. సొరంగం లోకి దిగి  చాలా దూరం నడిచాక ఒక  గొప్ప భవంతి  వచ్చింది. లోపల చాలా వైభవంగా ఉంది.  చుట్టూ అందమైన తోట. ఇద్దరూ లోపలికి వెళ్ళాక అతను ” నీ అంత సొగసైనదాన్ని ఎప్పుడూ చూడనేలేదు. నన్ను పెళ్ళాడి నాతో ఉండిపోతావా ? ” అని అడిగాడు.

తనకీ అతను నచ్చాడు. ఆనందంగా ఒప్పుకుంది. వాళ్ళు పెళ్ళి చేసుకుని అక్కడ కొంతకాలం హాయిగా ఉన్నారు.

 

moon

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది

ఆ ఇంటి బాగోగులు చూసేందుకు ఒక పెద్దావిడ ఉంది. ఆవిడ పెద్ద తాళం చెవుల గుత్తిని రోజ్ మేరీ కి ఇచ్చింది. వాటిలో ఒక్క తాళం చెవిని మాత్రం ఎప్పుడూ ఉపయోగించకూడదనీ అలా చేస్తే ఆ భవనం కూలిపోతుందనీ  తన భర్త తనని మరచిపోతాడనీ హెచ్చరించింది. రోజ్ మేరీ సరేనంది. కాని ఆ మాటలని అంతగా నమ్మలేదు

ఏ పని చేయకూడంటారో అదే చేయబుద్ధి వేస్తూ ఉంటుంది. ఆ తాళం చెవి దేనికి సంబంధించినదా అని వెతికితే అదొక పెద్ద భోషాణానిది అని తెలిసింది.అందులో ఏముందా అని ఆరాటం. ఒక రోజు తోచీ తోచకుండా ఉండి ఆ భోషాణాన్ని ఆమె తెరవనే తెరిచింది. లోపల  ఏమీ లేదు. కాని ఆ వెంటనే తన కాళ్ళ కిందన  నేల దడదడలాడింది .భవనం ఒక్కసారిగా మాయమైంది. ఏమవుతోందో తెలిసేసరికి ఒక పొలం మధ్యలో నిలబడి ఉంది. ఎక్కడుందో ఎటు వెళ్ళాలో అర్థం కాలేదు. ఆమె పెద్ద పెట్టున ఏడ్చింది- తప్పు చేశానని, తను ఎంతో ప్రేమించే భర్త కనిపించడని.

కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

rosemary

పక్కనే పెద్ద రోజ్ మేరీ పొద ఉంది. ఒక రెమ్మని   తుంచుకుని వాసన చూసింది. ఇంకొన్ని గౌన్  జేబులో పెట్టుకుంది కాసేపటికి తేరుకుని అతన్ని ఎలా అయినా సరే వెతికాలని నిశ్చయించుకుంది.. కనబడిన దారిలో చాలా దూరం నడిచింది. ఎవరిదో  ఒక పెద్ద ఇల్లు వచ్చింది. తిండి దొరికేందుకు అక్కడ పనిచేయటానికి కుదిరింది.

ఇంటావిడ అమ్మాయిని బాగా చూసుకునేది. తను విచారంగా ఉండటం గమనించి పదే పదే కారణం అడిగింది. రోజ్ మేరీ తన కథ అంతా చెప్పుకొచ్చింది. తన భర్త ని ఎలా వెతకాలో తెలియటం లేదని దిగులుపడింది.

ఇంటావిడ అంది ” సూర్యుడూ చంద్రుడూ గాలీ- వీళ్ళని అడగచ్చు నువ్వు. వాళ్ళు అన్ని చోట్లకీ వెళ్ళగలరు కదా ”

సరే అనుకుని అమ్మాయి సూర్యుడు ఉండే బంగారపు కోటకి దారి అడిగి తెలుసుకుని వెళ్ళింది.

” సూర్యుడా, తప్పు చేశాను. దయ చేసి నా భర్త ఎక్కడో చెప్పు . నీకెంతైనా ఋణపడి ఉంటాను ” అని ప్రాధేయపడింది. సూర్యుడికి ఆమె సంగతి విని జాలేసింది.

” అతను ఎక్కడో మాత్రం తెలియదు. దీన్ని నీ దగ్గర ఉంచుకో. పెద్ద ప్రమాదం ఏమైనా వస్తే  పగలగొట్టు , మేలు జరుగుతుంది ” అని బంగారు రంగులో ఉన్న ఒక కాయని ఆమెకి ఇచ్చాడు. ఆమె సూర్యుడికి దణ్ణం పెట్టి  కృతజ్ఞతలు  చెప్పుకుని మళ్ళీ బయలుదేరింది.

పోగా పోగా ఇంకొక కోట . తలుపు తట్టింది. ఒక ముసలావిడ తలుపు తీసింది.

” దయచేసి నాకు సహాయం చేయండి ” అని  రోజ్ మేరీ వేడుకుంది.

” మా యజమాని చంద్రుడు. ఆయనకి చెబుతాను ఉండు ” అని ముసలావిడ చంద్రుడిని పిలుచుకొచ్చింది. చంద్రుడికీ ఆమె భర్త సంగతి తెలియదు. అతనూ ఇంకొక కాయని ఆమెకి ఇచ్చి ఆపద కలిగినప్పుడు బద్దలు కొట్టమన్నాడు. అది తెల్లగా పాలరాయిలా ఉంది.

ధన్యవాదాలు చెప్పుకుని ఆమె మళ్ళీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ సారి గాలి దేవుడు ఉండే కోటకి చేరుకుంది. గాలి దేవుడు  తనకీ ఆమె భర్త ఆచూకీ తెలియదనే అన్నాడు. మట్టి రంగులో ఉన్న  అక్రూట్ కాయని ఇచ్చి సూర్యుడూ చంద్రుడూ చెప్పినట్లే చెప్పాడు.

అయితే ఈ సారి ఆమె కదలలేదు. విపరీతంగా అలిసిపోయి ఉంది. పైగా పట్టలేనంత దుఃఖం వచ్చింది. ఆ కోట మెట్ల దగ్గరే కూలబడి వెక్కి వెక్కి ఏడ్చింది.

గాలి దేవుడికి పాపం అనిపించింది. ” భయపడకు. ప్రయత్నం చేస్తాను. మళ్ళీ ఒకసారి అంతా వెతుకుతాను. ” అని పెద్ద శబ్దం చేసుకుంటూ తేలి వెళ్ళాడు, తిరిగి వచ్చాడు.

” తెలిసిందమ్మా అంతను ఎక్కడున్నాడో. ఒక రాజు గారి దగ్గర బంధించి ఉంచారు. ఆ రాజు కూతురికి ఇతను నచ్చాడట. ఇతను వద్దన్నా బలవంతంగారేపు పెళ్ళి చేయబోతున్నారు

” అని ఆ రాజ్యం ఎక్కడో చెప్పాడు.

అమ్మాయికి చాలా నిరాశ. ధైర్యం తెచ్చుకుని గాలి దేవుడిని అడిగింది ” ఒక్క రెండు మూడు రోజులు ఆ పెళ్ళిని ఆపగలరా ? నేను అక్కడికి వెళ్ళేందుకు అంత సమయం పడుతుంది కదా ‘’

” ఓ. అదెంత పని ! ” అని గాలి వెళ్ళాడు.

పెళ్ళికూతురు బట్టలు కుట్టే పనివాళ్ళ దగ్గరికి వెళ్ళి మహా విసురుగా వీచాడు. ఆ గౌన్ ల లేస్ లూ అంచులకి కుట్టే  ముత్యాలూ రత్నాలూ చెల్లా చెదురై పోయాయి- చెట్ల మీదికి, నది లోకి, పొలాల్లోకి. కుట్టుపనివాళ్ళు హడావిడిగా వాటిని పట్టుకునేందుకు ఎంతగా  కిందా మీదా పడ్డా ఏమీ లాభం లేకపోయింది. లేస్ లు చిరిగి  పోయాయి. పట్టు బట్టలన్నీ బురద కొట్టుకు పోయాయి. ముత్యాలూ రత్నాలూ గుప్పెడు  కూడా దొరకలేదు. మళ్ళీ బజారుకు వెళ్ళి కొత్తవి కొనుక్కు రావాలి అంతే. రాజు చిరాకు పడ్డాడు.” ఏదయితే అదే అయింది. ఆ గౌన్ లోనే అలంకరించండి ” అని ఉత్తరువు ఇచ్చాడు. దర్జీ లు కూర్చుని  ఏదో కుట్టారు. కాని కూతురిని ఆ చిరిగి మాసికలు వేసిన , మాసిపోయిన  గౌన్ లో చూసేసరికి ” బాగాలేదు, వద్దులే ” అనిపించింది రాజుకి.

కొద్ది గంటలలో అంతా మళ్ళీ సిద్ధం చేయమని ఆజ్ఞ ఇచ్చాడు. ఆ రోజు గడిచిపోయింది.

చాలా వేగంగా నడిచిన  రోజ్ మేరీ తెల్లారేసరికి రాజభవనం వాకిట్లోకి వచ్చింది.

సూర్యుడు ఇచ్చిన కాయని  పగలగొట్టింది . అందులోంచి తళతళలాడుతూ లాడుతూ తెల్లటి పొడుగాటి శాలువా  వచ్చింది. దాన్ని పెళ్ళప్పుడు భుజాల మీదినుంచి వెనక్కి జారేటట్లు వేస్తారు.

అది తీసుకుని రాకుమారి చెలికత్తెలకి చూపించి ” మీ రాకుమారికి ఇది కావాలా ? ఆమె పెళ్ళి ట కదా ? ” అని అడిగింది.

రాకుమారి కి విషయం తెలిసి బయటికి వచ్చింది. పిడికెడు బంగారు కాసులు ఇచ్చి ఆ శాలువా కొనుక్కుంది. రాకుమారి అటు తిరగగానే చంద్రుడు ఇచ్చిన పాలరాయి కాయని రోజ్ మేరీ  పగలగొట్టింది. ఈ సారి  మిలమిలలాడుతూ వజ్రాలు  కుట్టిన మేలి ముసుగు వచ్చింది.  రాకుమారి ఇంకా ఎక్కువ బంగారం ఇచ్చి దాన్నీ  కొనుక్కుంది. రెండుసార్లూ ఇచ్చిన బంగారు కాసులని రోజ్ మేరీ జాగ్రత్త గా దాచుకుంది .

మెట్లుదిగి పక్కకి వెళ్ళి రోజ్ మేరీ అక్రూట్ కాయని కూడా బద్దలు కొట్టింది. పొరలు పొరలుగా ,గాలి అలల లాగా కదిలే చక్కని పెళ్ళి గౌన్ వచ్చింది.రాకుమారి అదీ కావాలంది. దర్జీలు కొత్త గౌన్ ని ఇప్పట్లో తయారు చేయలేరని ఆమెకి తెలుసు.

ఈ సారి రోజ్ మేరీ బంగారం వద్దంది. ” ఒక్కసారి నేను పెళ్ళికొడుకుని చూడాలి. అలా అయితేనే ఈ గౌన్ ఇస్తాను మీకు ”

ఇది రాకుమారికి పెద్ద నచ్చలేదు. అయినా చూసినంత మాత్రాన ఏం మునిగిపోతుందిలే అని ఒప్పుకుంది.

రోజ్ మేరీ ని ఆమె భర్త ఉన్న చోటికి తీసుకు వెళ్ళారు. అతను ఆమెని గుర్తు పట్టలేదు.  ఆమె దగ్గరగా వెళ్ళి తన దగ్గర ఉన్న రోజ్ మేరీ రెమ్మ తో అతన్ని తాకింది. అతనికి మొత్తం జ్ఞాపకం వచ్చింది. ఆనందంగా ఆమెని దగ్గరికి తీసుకున్నాడు. ఆమె కళ్ళనీళ్ళతో తన తప్పుకి  క్షమాపణ అడిగింది. అతను ” కలుసుకున్నాము గా. ఏమీ పర్వాలేదు ” అని ఓదార్చాడు.

అక్కడికి వచ్చిన  రాజుతో ” నాకు ఇదివరకే పెళ్ళైంది. ఈమె నా భార్య. నేను మీ అమ్మాయిని పెళ్ళి చేసుకోలేను ” అని చెప్పాడు. రాజుకి కోపం వచ్చి ఆమె ని చంపేయాలనుకుని బంధించబోయాడు.

ఈ లోపు గాలి దేవుడు భార్యా భర్తలిద్దరినీ ఆకాశం లోకి ఎగరేసి రోజ్ మేరీ ఇంటికి చేర్చాడు. వాళ్ళ నాన్న ఇద్దరినీ చూసి చాలా సంతోషించాడు దుస్తులు అమ్మితే వచ్చిన బంగారు కాసులతో ఇంకొంత పొలం కొనుక్కుని, ఇల్లు బాగు చేసుకున్నారు. ఇదివరకులా వైభవంగా కాకపోయినా  వాళ్ళిద్దరూ  జీవితాంతం సుఖంగా గడిపారు.

[ రోజ్ మేరీ అనేది మూలిక వంటి మొక్క. వంటలలో, సుగంధద్రవ్యం గా, వైద్యం లో దీన్ని ఉపయోగిస్తారు.  Shakespeare రచించిన Hamlet నాటకం లో Ophelia కి మతి స్థిరంగా లేనప్పుడు ఆమె అన్న“There’s rosemary, that’s for remembrance; pray, love, remember.” ’’ అంటాడు. “Rosemary for remembrance’’ .అనేది నానుడిగా ఉండిపోయింది. జ్ఞాపకశక్తిని రోజ్ మేరీ నిజంగానే మెరుగు పరుస్తుంది, మనశ్శాంతిని కూడా ఇస్తుంది]

 

     స్పానిష్ జానపద కథ. సేకరణ -Dr. D. Francisco de S. Maspons y Labros , Andrew Lang

 అనువాదం: మైథిలీ సుబ్బరాజు

అడవిలో ఇల్లు

MythiliScaled

అనగనగా ఒక పెద్ద అడవి. ఆ అడవి అంచున చిన్న  గుడిసెలో  ఒక కట్టెలుకొట్టుకునేవాడు  తన భార్యా ముగ్గురు కూతుళ్ళతో ఉంటుండేవాడు. ఒక రోజు పొద్దున్నే  అతను అడవిలో ఎక్కువ దూరం ఎండుకట్టెల కోసం వెళ్ళాల్సివచ్చింది. వెళ్తూ వెళ్తూ భార్యతో చెప్పాడు ” ఇవాళ మన పెద్దమ్మాయితో నాకు భోజనం పంపించు. తను దారి తప్పకుండా గుప్పెడు జొన్నలు తీసుకుని దోవంతా జల్లుకుంటూ వెళతాను ”

బాగా ఎండెక్కాక అలాగే ఆ అమ్మాయి తండ్రికి భోజనం తీసుకుని బయల్దేరింది. అయితే వాళ్ళ నాన్న జల్లిన జొన్నలన్నీ పిట్టలు తినేశాయి. దారి తెలియలేదు. అలా అడవిలో నడుచుకుని పోగా పోగా చీకటి పడిపోయింది, చలేస్తోంది. అమ్మాయికి భయం వేసింది. అంతలో చెట్లమధ్యలోంచి  మినుకు మినుకు మంటూ  దూరంగా ఒక దీపం వెలుతురు కనిపించింది. తనకి ప్రాణం లేచివచ్చి అటువైపు పరుగెత్తింది. నిజంగానే అక్కడొక పాత పెంకుటిల్లు , కిటికీలనిండా దీపాలు. తలుపు తట్టింది ” లోపలికి రా ” ఒక బొంగురుగొంతు పలికింది. వెళ్తే అక్కడ ఒక బల్ల మీద  చేతుల్లో మొహం దాచుకుని  ముసలివాడు ఒకడు . అతని జుట్టంతా నెరిసిపోయింది. పొడుగాటి  గడ్డం నేలదాకా పాకుతోంది. వెచ్చగా ఉన్న పొయ్యి పక్కనే ఒక కోడి పెట్ట, కోడిపుంజు, ఒక మచ్చల  ఆవు.

అమ్మాయి తన కథంతా చెప్పి ఆ రాత్రికి ఉండనిమ్మని అడిగింది. అతను ఆ మూడు ప్రాణులనీ అడిగాడు ” ఏం చేద్దాం ? ” అని. అవి అన్నాయి కదా, ” మాకిష్టమే ” అని. అతను చెప్పాడు , ” సరేనమ్మాయ్. వెనకాలే  వంటిల్లుంది. నిండుగా సరుకులున్నాయి ”

ఆమె చక్కగా వంట చేసి రెండు కంచాలలో ముసలివాడికీ తనకూ వడ్డించింది. మూడు ప్రాణుల గురించి ఆలోచించనేలేదు. ఆకలి తీరేవరకూ తినేసి ” ఎక్కడ పడుకోను ? ” అని అడిగింది. అతను ” మేడమీద పడక గది ఉంది. ఆ మంచాన్ని బాగా కదిపి ఉతికిన దుప్పట్లు వేసుకో, నిద్రపో ” అన్నాడు. అమ్మాయి అలాగే చేసింది. ఆమె నిద్రపోయాక ముసలివాడు ఒక కొవ్వొత్తి తీసుకుని అక్కడికి వెళ్ళాడు. ఆ వెలుగులో ఆమె మొహం ఒకసారి చూశాడు. ” ఊహూ ” అనుకుని మంచం కింద రహస్యంగా అమర్చిన తలుపు తెరిచాడు. ఆమె మంచంతో సహా నేలమాళిగలోకి పడిపోయింది.

ఇక్కడ కట్టెలుకొట్టేవాడు బాగా పొద్దుపోయాక ఇంటికి వచ్చి తనకి రోజంతా తిండి లేనందుకు భార్యని చీవాట్లు పెట్టాడు. ఆమె అసలు సంగతి చెప్పింది. ఇంకా  అమ్మాయి ఇంటికి రాలేదే అని ఇద్దరూ కాసేపు బాధపడి ” అడవిలో దారి తప్పి ఉంటుంది , తెల్లారగానే వచ్చేస్తుందిలే ” అనుకున్నారు.

images

తెల్లారింది. ఈసారి రెండో కూతురుని పంపించమనీ, దోవంతా కందిపప్పు జల్లుతూ వెళాతాననీ తండ్రి చెప్పాడు. రెండో పిల్ల బయల్దేరేసరికి ముందురోజులానే పప్పులన్నీ పిట్టలు తినేశాయి. తనూ దారి తప్పి అదే ఇంటికి వచ్చింది. అలాగే రాత్రికి ఉంటానని అడిగింది. ముసలివాడు మూడు ప్రాణులనీ అడిగి అలాగేనన్నాడు. తన అక్కలాగే తనూ ప్రాణుల గురించి పట్టించుకోలేదు. వంటా, భోజనం, పడకా- ఆ తర్వాత అతను ఈ పిల్లనీ నేలమాళిగలోకి పడేశాడు.

ఇద్దరు పిల్లలూ ఇంటికి తిరిగి వెళ్ళలేదు. అయినా వాళ్ళ నాన్న మూడోరోజున ఆఖరి కూతురుతో అన్నం పంపించమనే చెప్పాడు . తక్కిన ఇద్దరూ ఇంటికి రాకపోయినా తండ్రి మూడో అమ్మాయిని ఎందుకు పంపించమన్నాడో అతనికే తెలియాలి. ఆమె అక్కలిద్దరినీ  వెనక్కి తీసుకు రాగలదని నమ్మకమో ఏమో. వాళ్ళ అమ్మ ఏడ్చింది ” అయ్యో, నా ముద్దులతల్లినీ పోగొట్టుకోవాలా ? ” అని

తండ్రి అన్నాడు ” భయపడకు. ఇది చాలా తెలివిగలది, దారి తప్పదు. ఈసారి బఠానీ గింజలు జల్లుకుంటూ వెళతాను. అవి పెద్దగా ఉంటాయి కాబట్టి బాగా కనిపిస్తాయి ” అయినా లాభం లేకపోయింది. మూడో పిల్ల వెళ్ళేసరికి అక్కడ ఒక్క బఠానీ గింజా మిగలకుండా పిట్టలు ఖాళీ చేశాయి. ఎంత తెలివిగలదైతే మాత్రం ఎటువెళ్ళాలో ఎలా తెలుస్తుంది ? అక్కలలాగే తనూ రాత్రయేసరికి అడవి మధ్య ఇంటికే చేరింది. మూడు ప్రాణులూ ఇదివరకులాగే  ముసలివాడు అడగగానే ఆమెకి ఆశ్రయం ఇచ్చేందుకు ఒప్పుకున్నాయి. అమ్మాయికి సంతోషం వేసింది. కోడి పెట్టనీ కోడిపుంజునీ వీపు రాసి ముద్దు చేసి ఆవుని గంగడోలు మీద నిమిరింది. వంటింట్లో ఎప్పటిలాగే బోలెడంత ఆహారం. ఆమె వంట చేస్తూ అనుకుంది ” నా కడుపు నిండితే చాలా ? వాటికీ ఆకలేయదూ పాపం ” దోసిళ్ళనిండా బియ్యపుగింజలు పట్టుకెళ్ళి కోడిపెట్టకీ కోడిపుంజుకీ పెట్టింది. ఆ పక్కనే ఉన్న మోపు విప్పి నుంచి ఆవుకి తాజాగా ఉన్న పచ్చగడ్డి తినిపించింది. అవి తృప్తిగా తిన్నాక వెడల్పాటి పెద్ద గిన్నెలో నీళ్ళు నింపి ఉంచింది. అవన్నీ ముక్కులూ మూతులు ముంచి  హాయిగా  తాగాయి.

అప్పుడు ముసలివాడూ తనూ కలిసి భోజనం ముగించారు.

” ఎక్కడ పడుకోను ? ” అని అడిగితే మూడు ప్రాణులూ  ఒకే గొంతుతో ” మమ్మల్ని బాగా చూసుకున్నావమ్మా. కమ్మగా నిద్రపో ” అన్నాయి.

ఆమె మేడ మీదికి వెళ్ళి పక్కవేసుకుని అర్థరాత్రిదాకా కలత లేకుండా నిద్ర పోయింది. అప్పుడు ఒక్కసారిగా పెద్ద పెద్ద శబ్దాలు వినిపించాయి. ఇల్లంతా కూలిపోయేంతగా ఊగిపోయింది. కోళ్ళూ ఆవూ నిద్రలేచి బెదిరిపోయి గోడకేసి తలలు గుద్దుకున్నాయి. కాసే పటికి అంతా సద్దుమణిగింది. అమ్మాయి సర్దుకుని మళ్ళీ నిద్రపోయింది.

20110411_Korzukhin

ఆమెకి మెలకువ వచ్చేసరికి ఆ గది గొప్ప వైభవంగా కనిపించింది. పాలరాతి గోడలంతా బంగారుపూలు చెక్కి ఉన్నాయి. తను పడుకున్న మంచం వెండితో చేసి ఉంది. మెత్తటి పట్టు దుప్పటి పరచి ఉంది. కిందని ఒక చిన్న పీట మీద ముత్యాలు పొదిగిన చెప్పులు. ఖచ్చితంగా అదంతా కలేననుకుంది తను. చాలా మంచి బట్టలు వేసుకుని ముగ్గురు వచ్చారు ” ఏమి ఆజ్ఞ ? ” అని అడిగారు. ” నాకేమీ వద్దు. వెళ్ళండి, వెళ్ళండి. నేను లేచి వంట చేసి పెద్దాయనకి తినిపించాలి. కోళ్ళకీ ఆవుకీ మేత వేయాలి ” అని హడావిడిగా జవాబు ఇచ్చింది ఆమె.

అంతలో ఇంకో వైపు  తలుపు తెరుచుకుని ఒక అందమైన యువకుడు వచ్చి  అన్నాడు ” నేనొక రాకుమారుడిని. ఈ అడవి మధ్య ఒక సరస్సూ దాని చుట్టూ ఉన్న పచ్చిక  మైదానమూ ఒక ఫెయిరీవి. ఆమె సరదాకి జంతువుల రూపాలను ధరించి తిరుగుతూ ఉండేది. ఇదంతా నాకు అప్పుడు తెలియదు.

ఒక రోజు వేటాడుతూ దూరంగా గడ్డి మేస్తూన్న జింక ను బాణం తో కొట్టబోయాను.నా బాణం తగలకపోగా ఆ జింక ధగ ధగా మెరిసిపోయే అమ్మాయిగా యి ఇలా అంది-

” నువ్వు ఆకలితో, ఆహారం కోసం నన్ను చంపబోలేదు, నేను క్రూరమృగాన్ని కాదు…నీకు ఏ హానీ చేయలేదు, నా చిన్న పొట్టని నింపుకుంటూ ఉన్నాను అంతే ”

నన్నూ నా అనుచరులనూ శపించింది.     ముసలివాడుగా అయిపోయాను .    అడవిలో నా విశ్రాంతి భవనం ఇది – నువ్వు చూసిన ఇల్లుగా మారిపోయింది. నాతోబాటు ఉన్న  ముగ్గురు సేవకులూ శాపం వల్లే  కోడిపెట్ట, పుంజు, మచ్చలావు గా నాకు ఇన్ని రోజులూ తోడున్నారు. మనుషులమీద  ఉన్నంత దయనీ పశువుల, పక్షుల పట్ల చూపగల అమ్మాయి మాత్రమే మా శాపాన్ని పోగొట్టగలదు. నువ్వే ఆ అమ్మాయివి. మధ్యరాత్రిలో మాకు విముక్తి దొరికింది. నన్ను పెళ్ళి చేసుకుంటావా ? ”

అమ్మాయి ఆనందంగా ఒప్పుకుంది. అంతా రాజధానికి వెళ్ళారు. రాజూ రాణీ కొడుకుని చూసి సంతోషం లో తలమునకలయారు. అతని శాపం విడిపించిన అమ్మాయిని ఆప్యాయంగా చూశారు. సేవకులు వెళ్ళి పిలుచుకొస్తే  అమ్మాయి వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళి విందుకి వచ్చారు. ” మరి మా అక్కల సంగతి ? ”

” ఇక్కడి పశువులశాలలో, కోళ్ళగూటిలో  వాళ్ళు కొన్నాళ్ళు పనిచేయాలి . వాటన్నిటికీ తిండిపెట్టాకే తినాలి. జంతువులకీ ఆకలి వేస్తుందని వాళ్ళకి అర్థం కావాలి కదా . త్వరలో తెలిసివస్తుందిలే. అప్పుడు కనబడదాం ‘’

                                                           -జర్మన్ జానపద కథ కి స్వేచ్ఛానువాదం , సేకరణ – Andrew Lang

 అనువాదం: మైథిలి అబ్బరాజు

 

అన్నదమ్ములు

Three_Brothers_1828
ఒకప్పుడు ఒకాయనకి ముగ్గురు కొడుకులు ఉండేవారు. ఆయనకి వాళ్ళు ఉంటున్న ఇల్లు తప్ప వేరే ఆస్తి ఏమీ లేదు. ఇల్లు కాస్త పెద్దదే.ఆయనకి ముగ్గురు కొడుకులమీదా సమానమైన ప్రేమ. తన తర్వాత ఇల్లు ఎవరికి వచ్చేలా చేయాలో తేల్చుకోలేకపోయాడు. అమ్మేసి డబ్బుని సమంగా పంచవచ్చు, అయితే కొన్ని తరాలనుంచీ తమ కుటుంబానికి చెందినది కాబట్టి ఇంటిని అమ్మేందుకు ఆయనకి ఇష్టం లేదు. చివరికి ఒకరోజు ముగ్గురినీ పిలిచి ఆయన ఇలా అన్నాడు
” మీరు బయటి ప్రపంచం లోకి వెళ్ళి తలా ఏదో ఒక విద్యో, వృత్తో, వ్యాపారమో నేర్చుకోండి. మూడేళ్ళ తర్వాత ఎవరు వాళ్ళు నేర్చుకున్నదానిలో ఎక్కువ ప్రావీణ్యం సాధిస్తారో వారికి ఇల్లు రాసి ఇస్తాను ”
కొడుకులకి ఆ ఆలోచన నచ్చింది. పెద్దవాడు కమ్మరి పని నేర్చుకుందామనుకున్నాడు. రెండోవాడు మంగలి అవాలనుకున్నాడు. మూడోవాడు కత్తిసాము నేర్చుకుందామని. అందరూ బయలుదేరి వెళ్ళారు.

MythiliScaled
అదృష్టం కొద్దీ ముగ్గురికీ మంచి గురువులు దొరికారు. ఎవరికి వారు ఆ విద్యలు చివరంటా నేర్చుకుని మంచి పనితనం సంపాదించారు. ఎంతో నిపుణుడు కావటాన కమ్మరికి రాజు గారి గుర్రాలకి నాడాలు తొడిగే అవకాశం వచ్చింది. ” ఇల్లు నాకే వస్తుంది. సందేహం లేదు ” అనుకుంటుండేవాడు.
మంగలి దేశంలో గొప్ప సంపన్నులకీ పెద్ద అధికారులకీ క్షవరం చేయగలిగేవాడు. అతనూ తనే పోటీలో నెగ్గుతాననే అనుకున్నాడు. కత్తి సాము నేర్వబోయినవాడికి గట్టి దెబ్బలే తగిలేవి. అయితే వాటిని ఓర్చుకునేవాడు . ” ఈ దెబ్బకి భయపడిపోతే ఇల్లు ఎలా దక్కుతుంది ? ” అని తనకి తాను చెప్పుకుంటూ ఉండేవాడు.
feature_1.jpg2
అలా మూడేళ్ళూ గడిచాయి. ముగ్గురూ ఇంటికి తిరిగి వెళ్ళి తీరిగ్గా కూర్చుని తమ విద్యలని ఎలా చూపెడదామా అని మాట్లాడుకుంటున్నారు. అంతలో దూరం నుంచి ఒక కుందేలు వస్తూ కనిపించింది ”మంచి సమయానికి వచ్చావు ” అని మంగలి సబ్బూ నీళ్ళూ సిద్ధంగా పెట్టుకుని ఆ కుందేలు పరుగున వాళ్ళని దాటి వెళ్ళే లోగా దాని మీసాలని పూర్తిగాగొరిగేశాడు. దాని ఒంటి మీద ఒక్క గాటు పడలేదు, ఒక్క వెంట్రుక చెదరలేదు. ఒక్క క్షణం కూడా ఆగలేదు. ఎలా వచ్చిందో అలాగే వెళ్ళిపోయింది.
” భేష్ ! చాలా బాగా చేశావు నాయనా ! తక్కిన ఇద్దరూ నిన్ను మించకపోతే ఇల్లు నీదే ” అని తండ్రి అన్నాడు.
కాసేపటికి ఆ దారి వెంట ఒకరు వేగంగా రథాన్ని నడుపుకుంటూ వస్తున్నారు. ” నాన్నా, చూడు. ఏం చే స్తానో ” అంటూ కమ్మరి ఆ రథం వెనకాల పరుగెత్తాడు. నాలుగు గుర్రాల గిట్టలకీ ఉన్న నాడాలు తొలగించి, రథం వేగం ఏ మాత్రం తగ్గకుండానే మళ్ళీ నాలుగు గుర్రాల పదహారు కాళ్ళ గిట్టలకీ కొత్త నాడా లు తొడిగేశాడు. నడిపేవాడికి ఇదంతా జరిగిందనే తెలియలేదు.
grand12
” చాలా తెలివిగలవాడివిరా నువ్వు. నీ తమ్ముడికి తెలిసినంతా నీ విద్య నీకూ తెలుసు. ఎవరు గొప్పవారో చెప్పలేకపోతున్నాను ” అన్నాడు తండ్రి.
మూడోవాడు ” నేనూ కాస్త చూపించనీ నాన్నా ” అంటుండగానే వాన కురవటం మొదలైంది. అతను కత్తి దూసివిసవిసా తన తలమీద తిప్పటం మొదలుపెట్టాడు. అది ఎంత వేగంగా చేయగలిగాడంటే ఒక్క చినుకు కూడా అతని మీద పడలేదు. వాన అంతకంతకూ పెద్దదయింది. చివరికి తగ్గుముఖం పట్టింది. అంతసేపూ అతను ఇంకా ఇంకా వేగంగా కత్తి తిప్పుతూనే ఉన్నాడు. వాన వెలిశాక, అప్పటిదాకా ఇంట్లో ఉంటే ఎంత పొడిగా ఉండవచ్చో అంత పొడిగా ఉన్నాడు.
అబ్బురంగా చూస్తూ ఉన్న తండ్రి అన్నాడు ” నువ్వే ముగ్గురిలో గొప్ప విద్య చూపావు. ఇల్లు నీకే ఇస్తున్నాను ”
అన్నలిద్దరూ కూడా అతని నేర్పు ఎక్కువదని ఒప్పుకున్నారు. అతన్ని మనస్ఫూర్తిగా మెచ్చుకున్నారు. అంతకుముందువరకూ ఏది జరగాలని కోరుకున్నాడో తీరా అది జరిగాక మూడోవాడికి అంత బాగా అనిపించలేదు. . అతను చెప్పాడు ” అన్నయ్యలూ, మీరు ఎక్కడికీ వెళ్ళద్దు. అందరం ఇక్కడే ఉందాం ”
వాళ్ళు ఉండిపోయారు. తమ వృత్తులలో చాలా నైపుణ్యం ఉన్నవారు కనుక ముగ్గురూ చాలా డబ్బు గడించగలిగారు. పెళ్ళిళ్ళు చేసుకుని పిల్లా పాపా కలిగాక ఆ ఇంటిమీదే మరో రెండు అంతస్థులు వేసుకుని జీవితాంతం సుఖసంతోషాలతో గడిపారు.

జర్మన్ జానపద కథ
సేకరణ -Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

అక్కా చెల్లెళ్ళు

The-Two-Princesses-glass-mask-topeng-kaca-22689515-493-519
ఒకప్పుడు స్కాట్లండ్ లో ఒక రాజు కి వెల్వెట్ చీక్ అని ఒక ముద్దులొలికే కూతురు ఉండేది. చిన్నప్పుడే ఆమె తల్లి చనిపోయింది. తండ్రి కి తనంటే చాలా ప్రేమ. తనకీ ఏమైనా అయితే రాకుమారికి ఎవరూ దిక్కు ఉండరని భయపడి రాజు కొన్నాళ్ళకి ఒక మధ్యవయసు వితంతువుని పెళ్ళి చేసుకున్నాడు. ఆమె కూడా ఒక రాజ కుటుంబానికి చెందినదే. ఆమెకీ కాథరీన్ అని ఒక కూతురు ఉంది.ఇద్దరు అమ్మాయిలూ ఒకరికి ఒకరు తోడుగా ఉంటారని రాజు ఆశపడ్డాడు. అలాగే వాళ్ళిద్దరూ ఒకరి పట్ల ఒకరు చాలా ప్రేమగా ఉండేవాళ్ళు.
అయితే కొత్త రాణి బుద్ధి మాత్రం మంచిది కాదు. వెల్వెట్ చీక్ ఎదిగే కొద్దీ ఎంతో అందంగా తయరయింది. తన కూతురుకన్న ఆమె అందంగా ఉందనీ ఆమెకి గొప్ప సంబంధం వస్తుందనీ రాణి అసూయపడింది. ఆ అందాన్ని ఎలాగయినా పాడు చేయాలనుకుంది. ఒక రోజు చీకటి పడేవేళ దుప్పటి ముసుగు వేసుకుని కోళ్ళని పెంచే ముసలావిడ దగ్గరికి వెళ్ళింది. ఆమె కి మంత్రాలూ మాయలూ వచ్చని రాణి వంటి కొందరికే తెలుసు. అంతా విని మంత్రగత్తె ” పొద్దున్నే ఏమీ తినకుండా రాకుమారిని నా దగ్గరికి పంపించు . పని జరుగుతుంది ” అని మంత్రగత్తె చెప్పింది. మర్నాడు పొద్దునే వెల్వెట్ చీక్ ని పిలిచి ఫలానా ఆవిడ దగ్గర్నుంచి కోడిగుడ్లు తీసుకురమ్మని అడిగింది. ” ఏమీ తినకుండా ఉదయపు గాలిలో తిరిగితే ఆడపిల్లల బుగ్గలు ఎఱ్ఱగా అవుతాయి , కాబట్టి అలాగే వెళ్ళు ” అనిసలహా ఇచ్చింది. కానీ ఎందుకు అలా చెప్పిందా అని అనుమానం వచ్చీ ఆకలేసీ వెల్వెట్ చీక్ ఒక పెద్ద కేక్ ముక్క తిన్నాకే బయల్దేరింది. వెళ్ళి గుడ్లు కావాలని ముసలావిడని అడిగింది. ” అదిగో, ఆ కుండ మీద మూత తీస్తే ఉన్నాయమ్మా, తీసుకో ” అంది ఆమె. అలాగే కుండ మూత తీసి గుడ్లు పట్టుకువెళ్ళింది వెల్వెట్ చీక్. ఆమెకి ఏమీ కానందుకు మంత్రగత్తె ఆశ్చర్యపడింది , రాణి కి చాలా కోపం వచ్చింది. మరుసటి రోజు వంటిల్లు తాళం పెట్టించి ఏ ఆహారమూ వెల్వెట్ చీక్ కి అందకుండా చేసింది. ఖాళీ కడుపుతో వెళ్ళిన రాకుమారికి దారివెంట బఠాణీ లు కోస్తున్న పల్లెజనం కనిపించారు. ఆకలికి ఆగలేక గుప్పెడు గింజలు అడిగి తినేసింది. ఈ సారి కూడా మంత్రగత్తె మాయ పనిచేయలేదు.
ఇలా కాదనుకుని మూడో రోజు రాణి తనే సవతి కూతురుని తీసుకువెళ్ళింది. ఏమీ తినే అవకాశమే రాకుమారికి దొరకలేదు. ఈ సారి కోడిగుడ్లు ఉన్న కుండ మూత తీసేసరికి వెల్వెట్ చీక్ చక్కటి ముఖం మాయమై గొర్రె తల వచ్చేసింది. రాణి అతి సంతోషంతో అంతఃపురానికి వెళ్ళిపోయింది. రాకుమారి కన్నీరు మున్నీరుగా ఏడుస్తూ ముఖాన్ని జేబురుమాలుతో కప్పుకుని వెళ్ళింది. ఆమెని చూసి కాథరీన్ కి విపరీతంగా బాధేసింది. తన సొంత తల్లి మీద చెప్పలేనంత కోపం వచ్చింది. ” మనం ఇక్కడ ఇంకొక్క క్షణం కూడా ఉండద్దు . మా అమ్మ నిన్నింకేం చేస్తుందో ఏమో ” అని వెల్వెట్ చీక్ ని గబగబా బయల్దేరదీసింది.ఆమె గొర్రె ముఖాన్ని పట్టు శాలువాతో కప్పి ఆమె చేయిపట్టుకుని కాథరీన్ రాజధాని నుంచి బయటపడింది . కొన్ని రోజులకి సరిపడా ఆహారం మూట కట్టుకున్నారు. ఎవరూ చూడని చోట్ల ఏ గడ్డివాముల లోనో రాత్రులు నిద్ర పోయేవారు
నడిచి నడిచి రెండు రాజ్యాల అవతల ఉన్న పట్టణానికి వెళ్ళేసరికి తెచ్చుకున్న ఆహారం అయిపోయింది. ఒక పెంకుటింటి ముందు ఆగారు. ” ఈ రాత్రికి ఇక్కడ ఉండనివ్వమ నీ, కాస్త భోజనం పెట్టమ నీ అడుగుదాం. రేపు ఏదైనా పని చూసుకోవచ్చు ” అని కాథరీన్ అంది. వెల్వెట్ చీక్ ” నా ముఖాన్ని చూసి ఇంట్లోవాళ్ళు భయపడరా ? నా చెల్లెలివని నిన్నూ దూరంగా ఉంచాలనే చూస్తారేమో ” అంది.
” నీ ముఖం అలా ఉంటుందని ఎవరికి తెలుస్తుందేమిటి ? నువ్వు మాట్లాడకు. ఆ శాలువా గట్టిగా బిగించుకో. అంతా నేను చూసుకుంటాను ” అని ధైర్యం గల కాథరీన్ జవాబు ఇచ్చింది.అలాగే తలుపు తట్టి వెళ్ళి తన అక్కకి జబ్బుగా ఉందనీ , తీవ్రమైన తలనొప్పితో బాధపడుతోందనీ ఆ రాత్రికి తల దాచుకోనివ్వమనీ అడిగింది. ఆ ఇల్లు ఒక పేదరాసి పెద్దమ్మది. కాథరీన్ నెమ్మదిగా ఉండటం, మృదువుగా మాట్లాడటం గమనించి
” అయితే ఒంట్లో బాగాలేని వాళ్ళని చూసుకోవటం నీకు బాగా తెలుసా ? ” అనిపేదరాసి పెద్దమ్మ అడిగింది. ” ఓ , బాగా తెలుసుగా ” అని కాథరీన్ బొంకింది.
విషయం ఏమిటంటే ఆ రాజ్యపు రాజు గారి పెద్ద కొడుకు ఒక వింత వ్యాధితో బాధపడుతున్నాడు. అతని మతి సరిగా ఉండటం లేదు. రాత్రి వేళల్లో మరీ అలజడిగా ఉంటాడు. అతన్ని ఎవరో ఒకరు కనిపెట్టుకుని ఉండాల్సి వస్తూంది. ఎవరూ ఆ పనిని సక్రమంగా చేయలేకపోతున్నారు. రాజకుమారుడు పొద్దున లేచేసరికి దెబ్బలు తగిలించుకుని ఉంటున్నాడు.
The-Two-Sisters-xx-James-Sant
పేదరాసి పెద్దమ్మకి కాథరీన్ సమర్థురాలిగా అనిపించి మర్నాడు పొద్దున్నే రాజుకి ఆ మాట చేరవేసింది. ఆయనా కాథరీన్ తో మాట్లాడి తృప్తి పడి ఆ పనిని అప్పజెప్పాడు. రాజకుమారుడు క్షేమంగా ఉంటే సంచీడు వెండి నాణాలు బహుమతి ఇస్తానని చెప్పాడు. ఎవరితోనూ సంబంధం లేకుండా విడిగా ఒక గదిని అడిగి తీసుకుని అక్కని అందులో ఉంచి అని కాథరీన్ రాజకుమారుడి గదికి వెళ్ళింది.
రాజకుమారుడు చూసేందుకు చాలా బావున్నాడు. ఏదో జ్వరం తగిలినవాడిలాగా ఉద్రేకంగా కనిపించాడు. అర్థరాత్రి పన్నెండు గంటలకి కాథరీన్ కి కునుకు పట్టబోతుండగా , ఉన్నట్లుండి అతను లేచి మంచి బట్టలు వేసుకుని మెట్లు దిగి వెళ్తున్నాడు. ఆమె అతన్ని వెంబడించింది. అతను సరాసరి గుర్రాల సాలలోకి వెళ్ళి ఒక గుర్రానికి కళ్ళెం తగిలించి ఎక్కగానే ఆమె కూడా చప్పుడు చేయకుండా వెనక ఎక్కి కూర్చుంది. అడవిలోంచి వాళ్ళు ప్రయాణిస్తూ ఉండగా చుట్టూ విరగకాసిన హేజెల్ నట్ చెట్లు ఉన్నాయి. చేతికి అందినన్ని కాయలు కోసి గౌన్ జేబులలో దాచుకుంది కాథరీన్. పోగా పోగా ఒక విశాలమైన మైదానం వచ్చింది. మధ్యలో ఒక చిన్న కొండ. అక్కడ రాకుమారుడు గుర్రం దిగి, ” తెరుచుకో, ద్వారమా. రాకుమారుడినీ అతని గుర్రాన్నీ లోపలికి వెళ్ళనీ ” అని చిన్న గొంతుతో మంత్రం చదువుతున్నట్లు అన్నాడు.” ఆ వెనకే నన్ను కూడా ” అని గొణిగింది కాథరీన్. సరిగ్గా వాళ్ళు పట్టేంతగా కొండలో తలుపు తెరుచుకుంది. లోపలికి వెళ్ళగానే మూసుకుపోయింది.
ఆ లోపల ఒక పెద్ద చావడి. రంగు రంగుల కొవ్వొత్తుల తో వెలిగిపోతోంది. మధ్యలో అద్భుత సౌందర్యవతులు కొందరు నాట్యపు దుస్తు లలో ముస్తాబయి ఉన్నారు. జుట్టులో వెల్వెట్ పూల, గులాబీల కిరీటాలు పెట్టుకున్నారు. అదే వయసుగల అందమైన యువకులు కూడా చుట్టూ ఉన్నారు. వింతయిన సంగీతం వినిపిస్తోంది. వాళ్ళంతా ఎల్ఫ్ లు, దేవతలలో ఒక జాతి అది . రాజకుమారుడినిచూడగానే వాళ్ళలో ఒక యువతి పరిగెత్తుకుంటూ ఎదురు వచ్చింది. ఒక్కసారిగా అతని బద్ధకం, మగత , మాయమైనాయి. ఉత్సాహంగా నవ్వుతూ ఆమెతో అతను నాట్యం చేశాడు. అందరూ జంటలుగా నర్తించటం మొదలుపెట్టారు. ఒక మూలగా మసక చీకటిలో దాక్కున్న కాథరీన్ ని ఎవరూ గమనించినట్లు లేదు. అంతలో ఒక చిన్న పాప ఒక బంగారు బెత్తం తో ఆడుకుంటూ ఆమె ఉన్న చోటికి వచ్చింది. కాథరీన్ కి ముద్దొచ్చి పలకరించబోయింది. ఆ పక్కగా నాట్యం చేస్తూ వెళుతున్న ఒక అమ్మాయి తనతో ఉన్న అబ్బాయితో ఇలా అంది ” ఆ బెత్తంతో మూడుసార్లు తడితే కాథరీన్ అక్క ముఖం మామూలుగా అయిపోతుంది ” కాథరీన్ కి గొప్ప సంతోషం, ఆదుర్దా. మెల్లిగా తన జేబుల్లోంచి హేజెల్ నట్ కాయలు తీసి ఆ పాప ఉన్న వైపుకి దొర్లించింది. పాపకి ఆసక్తి పుట్టి చేతిలో బంగారు బెత్తాన్ని పక్కనపెట్టి కాయలు తీసుకుంది. నింపాదిగా కొద్ది కొద్ది నట్స్ ని అక్కడ వదుల్తూ పాప దృష్టి మరలించి కాథరీన్ బెత్తాన్ని అందుకుని జేబులో దాచుకుంది. సరిగ్గా అప్పుడే నాట్యం ముగిసింది. రాకుమారుడు తప్ప అంతా మాయమయ్యారు. అతను హడావిడిగా వెనక్కి మరలాడు. కాథరీన్ జాగ్రత్తగా వెనకాల ఎక్కి కూర్చుంది. వాళ్ళిద్దరూ మళ్ళీ అతని గదిలోకి ప్రవేశించారు.తెలతెలవారేదాకా అక్కడే ఉండి కాథరీన్ అక్క ఉన్న చోటికి వెళ్ళింది. పాపం, గొర్రె మొహం వేసుకుని వెల్వెట్ చీక్ నిద్రపోతోంది. బంగారు బెత్తం తో మూడుసార్లు తట్టేసరికి ఆమె ఎప్పటిలా అందంగా అయిపోయింది. అక్కచెల్లెళ్ళు ఇద్దరూ ఆనందంతో కన్నీళ్ళు పెట్టుకున్నారు.
fairy ball
రాజు, ముఖ్య సేవికా రాజకుమారుడు రాత్రి ఎలా గడిపాడని కాథరీన్ ని అడిగారు. ” చాలా బాగా గడిపారు ” అని చెప్పింది ఆమె. కొండలోపలి ఎల్ఫ్ యువతులు అతన్ని మంత్రించారనీ దాని సంగతేదో చూడాలనీ మనసులో అనుకుంది . అప్పుడే అక్కడికి తన తలనొప్పి తగ్గిందని అంటూ వెల్వెట్ చీక్ వచ్చింది. రాజు కాథరీన్ మాటలకి చాలా సంతోషించి ఆమె ఖచ్చితంగా నమ్మదగినదని అనుకున్నాడు. వెల్వెట్ చీక్ రూపాన్ని కూడా ఆయన మెచ్చుకుని ఆమె అక్కడే ఉండి పూలు కట్టటం లాంటి సున్నితమైన పనేదో ఒకటి చేయచ్చునని సూచించాడు. రెండో రోజు రాత్రి కూడా కాథరీన్ రాకుమారుడిని కనిపెట్టుకుని ఉంది. అంతా మొదటి రోజు జరిగినట్లే జరిగింది. నాట్యం జరుగుతూ ఉండగా నిన్నటిలాగే ఇంకొక చిన్న పాప వచ్చింది. తన చేతిలో చిన్న కేక్ ఉంది. మళ్ళీ ఒక ఎల్ఫ్ యువతి ఆ పక్కనుంచీ వెళుతూ ” ఆ కేక్ ని మూడు సార్లుగా తింటే రాజకుమారుడి శాపం పోతుంది ” అని తన జతగాడితో చెప్పింది. ఈ పాపనీ హేజెల్ నట్ లతో ఆకర్షించి తను కేక్ ని పక్కన పెట్టగానే తీసుకుని దాచుకుంది. నాట్యం పూర్తయింది.
రాజ భవనానికి తిరిగి వెళ్ళాక రాకుమారుడు ఎప్పటిలా పక్క మీద పడుకున్నాడు. అయితే కాథరీన్ చేతిలో కేక్ ని అతను గమనించాడు. ” నాకు అది తినాలని ఉంది ” అని మత్తుగా అన్నాడు. ఒక్క ముక్క పెట్టేసరికి ముఖం తేటగా అయింది. . ” ఇంకొకసారి ” అడిగాడు. ఈ సారి తినేసరికి లేచి కూర్చోగలిగాడు. మూడో ముక్క తింటూనే లేచి నడిచి తండ్రిని కలుసుకునేందుకు వెళ్ళాడు. రాజు ఆనందం లో మునిగిపోయి కాథరీన్ కి పదే పదే ధన్యవాదాలు చెప్పాడు. ఈ పెద్దకొడుకే తన తర్వాత రాజు అవుతాడు. తన కొడుకుని అంత బాగా చూసుకున్న ఆమె రాబోయే కాలం లో మంచి రాణిగా ప్రజలని కాపాడగలదని ఆయనకి అనిపించింది. ఇద్దరినీ వాళ్ళ ఇష్టం అడిగి పెళ్ళి ఏర్పాటు చేశాడు.
ఆ ముందురోజే, రాజుగారి చిన్న కొడుకు వెల్వెట్ చీక్ ని చూసీ చూడగానే ప్రేమించాడు. వాళ్ళిద్దరి పెళ్ళీ కుదిరిపోయింది. అప్పుడు అమ్మాయిలు ఇద్దరూ వాళ్ళ అసలు కథ చెప్పారు. వాళ్ళ అమ్మా నాన్నా పెళ్ళికి వచ్చారు. వాళ్ళ నాన్న వెల్వెట్ చీక్ ని మళ్ళీ చూడగలిగినందుకు చాలా సంతోషించి కాథరీన్ ని దగ్గరికి తీసుకుని తలమీద ముద్దు పెట్టుకున్నాడు.. ఆయన అనుకున్నట్లే వాళ్ళిద్దరూ ఒకరికొకరు తోడుగా ఉన్నారు.
ఈ రాజ్యం వాళ్ళ రాజ్యం కంటే చాలా పెద్దది. ఈ రాజుగారు ఇంకా ధనవంతుడు. అందుకని కాథరీన్ కి పట్టిన అదృష్టానికి వాళ్ళ అమ్మ మురిసిపోయింది. వెల్వెట్ చీక్ మీద ద్వేషాన్ని మరచిపోయి ఆమెని క్షమించమని అడిగింది. వెంటనే కాదుగానీ, కాలక్రమాన ఆమెని ఇద్దరు కూతుళ్ళూ మన్నించారు. అందరూ సుఖంగా ఉన్నారు.
స్కాట్లండ్ జానపదకథ , By Elizabeth Grierson

ఒకరికొకరు

MythiliScaled
అనగనగా ఒక పల్లెటూళ్ళో ఇద్దరు చిన్న పిల్లలు ఉండేవారు , ఒక అబ్బాయి, ఒక అమ్మాయి. అబ్బాయి పేరు జాక్ , అమ్మాయి జొకోసా. ఇద్దరూ అందంగా, తెలివిగా ఉండేవారు . వాళ్ళ రెండు కుటుంబాలకీ చాలా కాలం కిందట ఏదో దెబ్బలాట అయింది. అది ఎందుకో కూడా ఎవరికీ గుర్తు లేకపోయినా అదొక అలవాటుగా వాళ్ళ అమ్మా నాన్నలు ఒకరితో ఇంకొకరు మాట్లాడుకునేవారు కాదు. కానీ జాక్, జోకోసా లకి ఒకరి మీద ఒకరికి చాలా ఇష్టం. గొర్రెలని కాస్తూ ఒకే పెద్ద మైదానం లోకి ఇద్దరి మందలనీ నడిపించి అలిసిపోయేదాకా ఆడుకుని అప్పుడు చెట్ల నీడలలో నిద్రపోయేవారు.

ఆ మైదానం లో ఒక ఫెయిరీ ఉంటుండేది. వీళ్ళిద్దరినీ చిన్నప్పటినుంచీ గమనించేది. వాళ్ళ ముద్దు ముఖాలూ మంచి పద్ధతులూ ఆమెకి నచ్చేవి. వాళ్ళిద్దరినీ కాపాడే బాధ్యత తీసుకుని అప్పుడప్పుడూ కేక్ లు, రుచి అయిన ఆహారం , అందేలా చేసేది. వాటిని చూసి వాళ్ళిద్దరూ తినేయకుండా అవతలివారికి ఇచ్చేసేవారు. అంత ప్రేమ ఇద్దరిదీ.

munier_1886_05_one_more_please_wm

వాళ్ళు పెరిగి పెద్దయాక ఒక మధ్యాహ్నం విరగబూసిన ఆపిల్ చెట్టు కింద ఫెయిరీ వాళ్ళకి మొదటిసారి కనిపించింది. ఆకు పచ్చని దుస్తులు వేసుకుని పూల కిరీటం పెట్టుకుని సన్నగా పొడుగ్గా చక్కగా ఉన్న ఆమెని చూసి ముందు ఇద్దరూ విస్తుపోయారు. అయితే ఆమె తీయగా మాట్లాడటం మొదలుపెట్టాక వాళ్ళ భయం పోయింది. వాళ్ళిద్దరూ తనకి ఎంతో నచ్చుతారనీ కనబడకుండా వాళ్ళకి తినుబండారాలు ఇచ్చినది తనే అనీ ఆమె చెప్పాక ఇద్దరూ ధన్యవాదాలు చెప్పారు. ముగ్గురూ కాసేపు కబుర్లు చెప్పుకున్నారు. ఫెయిరీ వెళ్ళబోతూ ” మళ్ళీ కనిపిస్తాను ” అని చెప్పి, ” నన్ను మీరు చూడలేనప్పుడు కూడా మీతోనే ఉంటాను ” అని కూడా హామీ ఇచ్చింది. తనని చూసిన సంగతి ఎవరికీ చెప్పద్దని హెచ్చరించింది.

fairy cottage
ఆ తర్వాతి రోజులలో తరచు ఆమె వాళ్ళని కలుసుకునేది. చాలా విషయాలు నేర్పేది. తన లోకపు అద్భుతాలని తెచ్చి చూపేది. కొన్నాళ్ళ తర్వాత ఆమె అంది- ” నేను మిమ్మల్ని ప్రేమగా చూసుకుంటున్నాను కదా. బదులుగా నాకొక చిన్న పని చేసిపెట్టండి. నాకు బాగా ఇష్టమైన నీటి ధార ఉంది, తెలుసు కదా. రోజూ తెల్లవారక ముందే లేచి మీరిద్దరూ దాని చుట్టూ చప్టాని శుభ్రం చేయండి. నీరు ప్రవహించటానికి గులక రాళ్ళు అడ్డు పడితే తీసేయండి. ఎండుటాకులో తీగలో ఉంటే ఏరివేయండి. మీరు ఈ పనిని ఆలస్యం లేకుండా, అశ్రద్ధ చేయకుండా చేస్తే అది మీరు నాకు చెప్పే కృతజ్ఞతగా అనుకుంటాను. ఈ మైదానం లోకల్లా ఆ జలధార లో నీరు స్వచ్ఛంగా , తీయగా ఉన్నంతకాలమూ మీరిద్దరూ ఒకటిగా ఉంటారు, విడిపోరు ”

ఇద్దరూ సంతోషంగా ఒప్పుకున్నారు. ఫెయిరీ వాళ్ళకి చేసినదానికీ, చేయబోయేదానికీ బదులుగా ఇది చాలా చిన్న విషయమని అనుకున్నారు. అలా చాలా కాలం పాటు నీటి ధారని జాగ్రత్తగా కాపాడారు. అందులో నీరు ఎప్పుడూ తేటగానే ఉండేది. ఒక రోజు పొద్దు పొడవకుండానే ఇద్దరూ చెరొక వైపునుంచి నీటిధార దగ్గరికి వస్తూ ఉంటే నేలమీద ఏవో తళతళమన్నాయి. . చూస్తే విలువైన రాళ్ళలాగా అనిపించాయి . రెండు మూడు తీసుకునేలోగా కొంత దూరం లో అలాంటివే రంగురంగులవి . ఒకరికొకరు బహుమతులు ఇచ్చుకోవచ్చు అనుకుంటూ వాటి వెంట ఇద్దరూ వెళ్ళిపోయారు. ఏరుకుని జేబుల్లో నింపుకుంటూ ఉన్నారు. సమయం మించిపోయింది. చటుక్కున సూర్యుడు ఉదయించాడు, ఇద్దరూ ఉలిక్కి పడ్డారు. ఇద్దరూబరువెక్కిన జేబులతో వీలైనంత తొందరగా నీటిధార దగ్గరికి పరుగెత్తారు.

కానీ నెమ్మదిగా చల్లగా పారే నీటిజల పెద్ద ప్రవాహం లాగా మారిపోయింది. చూస్తుండగానే ఇద్దరి మధ్యా దాటలేనంత వెడల్పుగా , వేగంగా ప్రవహించింది. ఒక్క కేక పెట్టి తెచ్చిన రత్నాలని అవతలివారికి ఎత్తి చూపటం మటుకే వీలయింది. జాక్ ఈదుకుంటూ అవతలి ఒడ్డుకి చేరాలని కనీసం ఇరవైసార్లు ప్రయత్నించాడు. అన్నిసార్లూ నీరు ఊపుగా అతన్ని వెనక్కి నెట్టేసింది. ఎండుకొమ్మలు నదిలో కొట్టుకు వస్తూంటే వాటి మీద ఎక్కి అటువైపుకి వెళ్ళాలని జోకోసా ఎంత ప్రయత్నించినా కుదరనేలేదు. బరువెక్కిన గుండెలతో గట్ల వెంట వాళ్ళు నడిచారు. పోను పోను ఒకరి ముఖం ఇంకొకరికి కనిపించటమే కష్టమైపోయింది.

ఎన్నో రాత్రులూ పగళ్ళూ గడిచాయి. కొండలు ఎక్కారు, లోయల్లో దిగారు. చలిలో ఎండలో , అలసటతో ఆకలితో ఇద్దరూ కష్టాలు పడ్డారు. దాచిన రత్నాలని ఎప్పుడో అవతల పారేశారు .మళ్ళీ కలుసుకుంటామన్న ఒకే ఒక్క ఆశతో మూడేళ్ళు గడిపారు. నది దాటేందుకు ఎక్కడా ఒక్క వంతెన అయినా లేదు. చివరికి ఆ నది సముద్రం లో కలిసే చోట చెరొక వైపునా ఎత్తైన కొండ కొమ్ముల మీద నిలిచారు. ఎప్పటికన్నా కూడా ఒకరికొకరు దూరంగా అనిపించారు.

కలుసుకోగలమన్న ధైర్యం పోయింది. నురగలు కక్కుతున్న నీటిలోకి దూకేశారు. అయితే ఒక్క క్షణం అయినా ఏమరకుండా వాళ్ళని కనిపెడుతూ ఉన్న ఫెయిరీకి వాళ్ళు చచ్చిపోవాలని అసలు లేదు. కంగారుగా తన మంత్రదండం ఒకసారి ఆడించింది. వెంటనే ఇద్దరూ ఒడ్డు మీద , బంగారురంగు ఇసుక తిన్నెల మీద, పక్కపక్కనే తేలారు. వాళ్ళిద్దరి సంతోషాన్నీ చెప్పేందుకు ఏ మాటలూ సరిపోవు. ఒకరి చేయి ఒకరు పట్టుకుని తృప్తిగా కళ్ళు మూసుకున్నారు. ఎంతో మాట్లాడవలసి ఉంది, అయితే ఎక్కడ మొదలుపెట్టాలో తెలియలేదు. ఫెయిరీ చెప్పినట్లు నీటిధారని కాపాడే పనిలో నిర్లక్ష్యంగా ఉన్నామని ఎవరిని వారి తిట్టుకున్నారు.

fairies
అప్పుడు ఫెయిరీ ప్రత్యక్షమైంది. ఇద్దరూ ఆమె పాదాలమీద పడి క్షమించమని అడిగారు. ఫెయిరీ వాళ్ళని లేవనెత్తి శిక్ష పూర్తయిందనీ తను ఎప్పటికీ వాళ్ళతో స్నేహంగానే ఉంటాననీ చెప్పింది. తన రథాన్ని అక్కడికి పిలిచింది. దాన్ని ఆకుపచ్చటి తీగలతో అల్లారు. మంచుబిందువులతో అలంకరించారు. ఆరు చిన్న కుందేళ్ళు లాగుతున్న ఆ రథాన్ని ఎక్కి కొద్ది సేపట్లోనే నీటిధార మొదలైన మైదానం లోకి వెళ్ళారు. ఆ తెలిసిన చోటినీ దూరంగా కనిపించే వాళ్ళ ఇళ్ళనీ చూస్తే ఇద్దరికీ ప్రాణాలు లేచివచ్చాయి. వారి సంతోషం కోసం ఫెయిరీ ఆ మూడేళ్ళలో రెండు కుటుంబాల మధ్యా తగాదా తీర్చి స్నేహాన్ని పెంచింది. వాళ్ళ తల్లిదండ్రులు జాక్, జోకోసా లు పెళ్ళి చేసుకోవటానికి సంతోషంగా ఒప్పుకున్నారు.

మళ్ళీ నెమ్మదిగా , శాంతంగా ప్రవహించే ఆ నీటిధారకు కనుచూపుమేరలో చిన్న కుటీరాన్ని ఫెయిరీ కట్టి ఉంచింది. చుట్టూ చిన్న పూలతోట, ఆ పక్కనే పళ్ళ తోట, కొంచెం పొలం. ఇద్దరికీ అంతకన్న కావలసిందేమీ లేదని తెలిసింది. వాళ్ళ ఉల్లాసాన్ని చూసి ఫెయిరీ కూడా ఆనందించింది. అంతా తిరిగి చూసుకుని , మెచ్చుకుని బడలికగా ఇద్దరూ గులాబీ లతలు అల్లించిన వరండా లో కూర్చున్నారు.

ఫెయిరీ అప్పుడు ఇద్దరికీ చెప్పింది ” ఇంతకన్నా వైభవంగా కనిపించేవాటికన్న ఈ కుటీరం, ఈ పరిసరాలూ తృప్తినీ శాంతినీ ఇస్తాయి మీకు. ఈ పొలాలలో సేద్యం చేసుకోండి, మీ గొర్రెల మందలని కాచుకోండి. ఏ కొరతా ఉండదు. రోజు రోజుకీ మీ సంతోషం పెరుగుతూనే ఉంటుంది . ”
పెళ్ళి చేసుకుని , ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఇద్దరూ ఆ కుటీరంలో చిరకాలం హాయిగా బ్రతికారు.

ఫ్రెంచ్ జానపద కథ [by Kelley Morrow] సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

మేలు మరవనివాడు

1950-189

నులివెచ్చటి వసంతకాలపు ఉదయం. స్కాట్లండ్ లో ఒక జమీందారు తనకోట బయట ఆకుపచ్చని మైదానం లో పచార్లు చేస్తున్నాడు . ఆయన అసలు పేరు కొల్జియాన్ జమీందారు. అయితే స్కాట్లండ్ లోని ఆరీషైర్ ప్రాంతం లో అందరూ కో జమీందారు అనే పిలుస్తారు [ వాళ్ళ భాషలో ‘ కో ‘ అంటే సముద్రపు గుహ అని అర్థం. ] కొన్ని ఎకరాల వైశాల్యంగల పెద్ద రాతిమీద ఆ కోటని కట్టారు. దిగువన సముద్రం ఆ రాతిలో గుహలని తొలిచింది.

ఆయన చాలా దయగలవాడు, పెద్దమనిషి. పొరుగువాళ్ళ కష్టాలు విని కదిలిపోయేవాడు. ఎవరికి ఏ సాయం చేయాలన్నా ముందుండేవాడు.

అప్పుడు ఒక చిన్న పిల్లవాడు అక్కడికి నడుచుకుంటూ వచ్చాడు. వాడు ఒక చేత్తో పొడుగాటి గిన్నెని పట్టుకుని ఇంకో చేత్తో మొహం మీద పడే జుట్టుని వెనక్కి తోసుకుంటూ ఉన్నాడు. జమీందారు ముద్దుగా పిల్లాడి తల నిమిరి ఏం కావాలని అడిగాడు. వాళ్ళ అమ్మ జబ్బు పడి కోలుకుంటోందనీ ఆ గిన్నె నిండా ద్రాక్షరసం ఇప్పిస్తారా అనీ వాడు జమీందారుని అడిగాడు. చలిదేశాలలో ఆరోగ్యం కోసం నిలవ చేసిన ద్రాక్షరసాన్ని తాగుతారు. జమీందారు తన సేవకుడిని పిలిచి అన్నిటికన్నా మంచి ద్రాక్షరసాన్ని గిన్నె నిండా ఇచ్చి పంపమని చెప్పాడు.

సేవకుడూ చిన్నపిల్లాడూ నేలమాళిగలో ద్రాక్షరసం నిలవ ఉంచిన చోటికి వెళ్ళారు. యజమాని ఇష్టంగా తాగే మేలైన ద్రాక్షరసం , ఒక పీపాలో సగానికి పైగానే ఉంది. ఆ సగంలోంచి తీసి పోసేస్తే సరిపోతుందని సేవకుడు అనుకున్నాడు. ఆశ్చర్యకరంగా పీపా ఖాళీ అయేంతగా పోసినా ఆ చిన్న గిన్నె నిండనేలేదు. సేవకుడికి అనుమానం వచ్చి కిందని ద్రాక్షరసం పొర్లిపోయిందా అని చూశాడు. నేలంతా అద్దంలాగా శుభ్రంగానే ఉంది.

” అమ్మో, ఇదేదో మంత్రపు గిన్నె లాగా ఉందే ! ” అని సేవకుడికి భయం వేసింది. ” ఇంకో పీపా అయితే తెరవను . సగం నిండిందిగా నీ గిన్నె, తీసుకువెళ్ళిపో. ఇంకెంత కావాలేమిటి ? ఎంత ఖరీదో తెలుసా నీకు? నీ బతుక్కి ఇదే చాలా ఎక్కువ ”

MythiliScaled

చిన్నపిల్లాడు ఎంత మాత్రమూ ఒప్పుకోలేదు. జమీందారు మాట ఇచ్చాడు, గిన్నె నిండాల్సిందే నని పట్టుబట్టాడు. సేవకుడికి కోపం వచ్చి తిట్టటం మొదలుపెట్టాడు. పిల్లాడు మొండికేశాడు.

అప్పుడు సేవకుడు వెళ్ళి జమీందారుకి సంగతి అంతా చెప్పాడు. ” అది మాయదారి గిన్నె అయ్యగారూ. ఎంతకీ నిండటం లేదు. ఇలా అయితే ఎలా ? మీరే వచ్చి పిల్లాడిని వెళ్ళిపొమ్మని చెప్పండి ”జమీందారు ” అలా వీల్లేదు. నా మాటంటే మాటే. వాడి గిన్నె ని నింపే తీరాలి , నా ద్రాక్షరసం పీపాలన్నీ ఖాళీ అయిపోయినా సరే. వెళ్ళి ఇంకొక పీపా మూత తెరువు ” అని అజ్ఞాపించాడు. చేసేది లేక సేవకుడు ఇంకొక పీపా తెరిచి గిన్నెలోకి వొంపాడు.

ఇదివరకు ఆశ్చర్యానికి రెట్టింపు ఆశ్చర్యం ఇప్పుడు. నాలుగు చుక్కలు పడేసరికే పిల్లాడి గిన్నె పూర్తిగా నిండిపోయింది. పిల్లాడు సేవకుడికి ధన్యవాదాలు చెప్పి వెళ్ళిపోయాడు. అంతకుముందు అతను తనను తిట్టిపోసిన సంగతే పట్టించుకున్నట్లు లేదు. ఆ తర్వాత సేవకుడు ఎంతమందిని కనుక్కున్నా ఆ పిల్లాడి సంగతిగాని, వాడి తల్లి సంగతిగాని ఎవరికీ తెలియనే తెలియదన్నారు.

ఏళ్ళు గడిచిపోయాయి. జమీందారు తన రాజు తరపున యుద్ధం చేసేందుకు వెళ్ళి శత్రువులకి పట్టుబడ్డాడు. ఆయనని చెరసాలలో బంధించి మరణశిక్ష విధించారు. అది పరాయి దేశం, స్నేహితులెవరూ లేరు. తప్పించుకునే దారి లేదు.

మరుసటి రోజు ఉరితీస్తారనగా ఆ రాత్రి ఒంటరిగా తన గదిలో ఆయన తన భార్యనీ పిల్లలనీ తలచుకుని కుమిలిపోతున్నాడు. ఇక మళ్ళీ వాళ్ళు తనకి కనబడరు. బ్రహ్మాండమైన తన కోట, ఆ దిగువ సముద్రం, వాకిట్లో డైసీ పూలు – అన్నీ గుర్తొచ్చాయి. ద్రాక్షరసం కోసం వచ్చిన చిన్న పిల్లాడు ఉన్నట్లుండి కళ్ళముందు అగుపించాడు. వాడి సంగతి ఆయన ఏనాడో మరచిపోయాడు. అదంతా నిజంగా అప్పుడు జరుగుతున్నట్లు అనిపించి గట్టిగా కళ్ళు నులుముకున్నాడు.

Deep_jail_by_ChrisRosewarne

రేపు మరణించబోతూ ఉంటే దేవుడిని ధ్యానించుకోవాలి కదా అనుకున్నాడు. ఆయన అలా తలచుకున్నాడో లేదో , చెరసాల గది తలుపు మెల్లిగా తెరుచుకుంది. ఆ గడప మీద అప్పటి పిల్లాడు. అలాగే ఉన్నాడు, ఒక్క ఏడాది కూడా వయసు పెరిగినట్లు లేడు. ఏదో రహస్యం చెప్పబోయేవాడిలాగా నవ్వుతూ మాట్లాడవద్దని పెదవుల మీద వేలు ఆనించాడు.

” కో జమీందారు గారూ, లేవండి, బయల్దేరండి ” అని గుసగుసగా చెప్పాడు. తన వెంట రమ్మని సైగ చేశాడు. జమీందారు ఏ ప్రశ్నా అడిగే పరిస్థితిలో లేడు. అంతగా నిర్ఘాంతపోయాడు. పొడుగాటి చెరసాల నడవాల గుండా పిల్లాడు కదిలాడు, ఆ వెనకే జమీందారు. తాళం వేసిన తలుపులు ఎదురైతే పిల్లాడు తాకగానే అవి తెరుచుకున్నాయి. వాళ్ళు బయటపడ్డారు.

ఆనందం తో తలమునకలైన జమీందారు తన చిన్న రక్షకుడికి ఆపకుండా కృతజ్ఞతలు చెబుతూనే ఉన్నాడు. ” ఆగండి. ఈ దేశం దాటితేగాని మీకు క్షేమం కాదు. నా వీపు మీద ఎక్కండి ” పిల్లాడు ఆజ్ఞాపించాడు. మారుమాట్లాడకుండా జమీందారు అలాగే చేశాడు. పిల్లాడు ఆయన బరువుని అవలీలగా ఎత్తుకున్నాడు. రెప్పపాటులో భూమిమీదా సముద్రం మీదా ప్రయాణించి జమీందారుని దించాడు . తెలతెలవారుతూ ఉంది. తన కోటముందర, పచ్చగడ్డి, డైసీ పూలు. మొదటిసారి చిన్నపిల్లాడిని ఎక్కడ కలుసుకున్నాడో అక్కడ దిగాడు జమీందారు. పిల్లాడు తన చిన్న చేతిని జమీందారు చేతిమీద ఆనించాడు.

” మంచి చేశారు, మంచి జరిగింది. మా అమ్మ మీద దయ చూపినందుకు ధన్యవాదాలు ” అని మాయమయ్యాడు. ఆ రోజునుంచీ వాడిని చూసినవారు లేరు.

 

– స్కాట్లండ్ జానపద కథ. By Elizabeth Grierson

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

అడగవలసిన వరం

MythiliScaled

అనగనగా ఒక పెద్ద తోట. తోట నిండా రంగురంగుల పూలమొక్కలూ నీడ ఇచ్చే పళ్ళ చెట్లూ – చల్లటి జలయంత్రాలు, కలువలు విచ్చే కొలనులు. తోట మధ్యలో చక్కటివిశాలమైన ఇల్లు. అందులో ఒక ఫెయిరీ ఉండేది. చాలా దయ గలది, సరదాగానూ ఉండేది. అప్పటి పద్ధతి ప్రకారం చుట్టు పక్కల రాజ్యాలనుంచి రాకుమారులనీ రాకుమార్తెలనీ వాళ్ళు ఇంకా బాగా చిన్నవాళ్ళుగా ఉండగానే ఆమె దగ్గరికి పంపించేవారు. వాళ్ళందరికీ తన పక్కన ఉండటమే ఎంతో బావుండేది. హాయిగా ఆడుకుంటూ చదువుకుంటూ వాళ్ళు పెరిగి పెద్దయేవారు. బయటి ప్రపంచం లోకి వాళ్ళు వెళ్ళే ముందర ఆ ఫెయిరీ ఒక్కొక్కరికీ వాళ్ళు అడిగినవరాన్ని ఇచ్చేది.

వాళ్ళలో సిల్వియా అనే రాకుమారి మంచి చురుకైన పిల్ల. పైకి చెప్పకపోయినా ఫెయిరీకి మనసులో సిల్వియా అంటే ప్రత్యేకమైన ఇష్టం ఉండేది. సిల్వియా వాళ్ళ రాజ్యానికి వెళ్ళే సమయం వచ్చింది. ఈ లోపు , ఇదివరకు తనతో ఉండి వెళ్ళిన రాకుమార్తెలు కొందరు ఏం చేస్తున్నారో ఎలా ఉన్నారో తెలుసుకోవాలని ఫెయిరీకి అనిపించింది. ఆమె సిల్వియా తో అంది-” ఐరిస్ అని ఒక రాకుమారి ఉంది. తన దగ్గర రెండు నెలలు ఉండు. నిన్ను ఆమె బాగా చూసుకుంటుంది. ఆ తర్వాత వెనక్కి వచ్చి తన గురించి ఏమనిపించిందో నాకు చెప్పు ”

సిల్వియా కి వెళ్ళటం ఏమంత ఇష్టం లేదు , కానీ ఫెయిరీ అడిగింది కదా అని ఒప్పుకుంది. రెండు నెలలు గడిచాక ఫెయిరీ ఒక సీతాకోకచిలకల రథాన్ని ఐరిస్ రాజ్యానికి పంపింది. సిల్వియా ” అమ్మయ్య ” అనుకుని అందులోకి దూకి వచ్చేసింది. ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు చెప్పు మరి, ఏమనుకుంటున్నావు నువ్వు ? ”

” ఐరిస్ రాకుమారికి మిరుమిట్లుగొలిపే అందాన్ని మీరు వరంగా ఇచ్చారు. తను మీ గురించి మంచిగానే చెబుతూ ఉంటుంది కానీ అంత అందం మీ వల్లనే వచ్చిందని ఎక్కడా ఎవరికీ చెప్పనే చెప్పదు. ముందు ఆమెని చూసి నాకూ కళ్ళు చెదిరిపోయాయి . కానీ – అందంగా కనిపిస్తే చాలు, ఇంకేమీ చేయక్కర్లేదని అనుకుంటోందని అర్థమైంది. సంగీతం, పుస్తకాలు , స్నేహితులు – ఎవరూ అక్కర్లేదు, తనని తను అద్దం లో చూసుకుంటూ రోజంతా గడిపేస్తుంది. పాపం ! నేను అక్కడ ఉండగానే ఆమెకి తీవ్రంగా జబ్బు చేసింది. పూర్తిగా కోలుకుంది గానీ ఇదివరకటి అందం లేదు. తనని తనే అసహ్యించుకునేంత దిగులుపడిపోయింది. దయచేసి తన అందాన్ని తిరిగి ఇప్పించమని మీకు నన్ను చెప్పమంది. నాకూ నిజంగా అది అవసరమేనేమో అనిపిస్తోంది. ఎందుకంటే అందంగా ఉన్నప్పుడు తన ప్రవర్తన బాగానే అనిపించేది. మనసుని , తెలివిని అసలు ఉపయోగించటం ఇన్నాళ్ళూ మానేసింది కదా, ఆమె లోపాలు ఇప్పుడు కొట్టొచ్చినట్లు కనిపించి – ఎవరూ భరించలేకపోతున్నారు . తనకి ఇదంతా అర్థమైనట్లే ఉంది. అందుకే మీ సహాయం అడుగుతోంది. మళ్ళీ తనని ఇదివరకులా చేసేయచ్చు కదా ”

ఫెయిరీ అంది ” అనుకుంటూనే ఉన్నాను ఇలా అవుతుందని. కాని ఏమీ చేయలేనమ్మా, నా వరం ఒక్కసారే పనిచేస్తుంది ”

కొంతకాలం సిల్వియాకి తోటలో, ఇంట్లో ,సంతోషంగా గడిచిపోయింది. అప్పుడు మళ్ళీ ఫెయిరీ సిల్వియాని డాఫ్నె అనే ఇంకొక రాకుమారి దగ్గరికి సీతాకోకచిలకల రథం మీద పంపించింది . వెళ్ళి ఎన్నో రోజులు కాకముందే సిల్వియా వెనక్కి వచ్చేస్తానని కబురు చేసింది. అటుగా ఎగురుతున్న ఒక తూనీగని బ్రతిమాలి చెప్పి పంపింది. ఫెయిరీకి జాలేసి సరే , రమ్మంది. ” అబ్బబ్బా..ఎలాంటి చోటికి పంపారండీ నన్నూ ” అని నసపెట్టింది సిల్వియా.

” ఏం? ఎందుకు అలా ? డాఫ్నె కి నేను మాటకారితనాన్ని వరంగా ఇచ్చానని జ్ఞాపకం. అవునా ?”

2the_fairies_vale

” అవునండీ, అవును. ఆమె బాగా మాట్లాడుతుంది, ఆ మాటయితే నిజమే. భాషని నేర్పుగా ఉపయోగిస్తుంది. మరి , ఆ మాటలు కాసేపైనా ఆపితేనా ? ముందర వినటానికి బాగానే ఉంటుంది కాని వినీ వినీ అలిసిపోతాం . అందరినీ ఒకచోట చేర్చి రోజుకి నాలుగుసార్లు ఉపన్యాసాలు ఇస్తుంది ఒక్కోసారీ రెండు గంటలు. రాకుమారి కాబట్టి అప్పటికి దొరికిపోయినవాళ్ళంతా కిమ్మనకుండా వింటూ ఉంటారు ఆ సమావేశాలు అవుతూనే మళ్ళీ ఏదో ఒకదాని గురించి చెప్పటం మొదలు. చెప్పేందుకు అసలేమీ లేనప్పుడూ అంతే. అక్కడనుంచి వచ్చేస్తుంటే ఎంత హాయిగా ఉందో చెప్పలేను అసలు ! ”

సిల్వియా చిరాకు కి ఫెయిరీకి నవ్వొచ్చింది. కొద్ది రోజులు కోలుకోనిచ్చి మళ్ళీ పంపింది. ఈ సారి సింథియా అనే రాకుమారి దగ్గరికి. మూడు నెలలు అక్కడ ఉండి ఈసారి కొంచెం నయంగానే తిరిగి వచ్చింది సిల్వియా. ఆ రాకుమారికి ఎవరినైనా సరే ఆనందంగా ఉంచగల వరాన్ని ఫెయిరీ ఇచ్చి ఉంది.

సిల్వియా ఇలా అంది ” ముందు నేను అనుకున్నానూ, ఆమె చాలా సంతోషంగా ఉందని. ఏవైపుకి వెళ్ళినా తనని అంతా ఇష్టపడుతున్నారు. తనకేం కావాలంటే అది ఇస్తున్నారు. నాకూ అలాంటి వరమే మీరు ఇస్తే బావుంటుందనుకున్నాను కూడా ” ఫెయిరీ అడిగింది ” ఇప్పుడు నీ మనసు మార్చుకున్నావా ఏమిటి ?”

సిల్వియా ” అవునండీ. సింథియా తో ఉండే కొద్దీ తను నిజానికి అంత సంతోషంగా లేదేమోననిపించింది. అందరినీ మెప్పించాలని ప్రయత్నించటం లో నిజాయితీగా ఉండటం మర్చిపోయినట్లుంది. తన ప్రవర్తన నిజమో అబద్ధమో తనకే తెలియదనుకుంటాను. అవతలి వాళ్ళు ఎలా ఉన్నా, ఎలాంటివాళ్ళైనా ఒకేలాగా ఉంటుంది. తనని నిజంగా ప్రేమించినవాళ్ళకి నిరుత్సాహంగా ఉంటోంది ” అని జవాబు ఇచ్చింది.

uh51577157-1

ఫెయిరీ అంది ” బాగా కనిపెట్టావు. కొన్నాళ్ళు విశ్రాంతి తీసుకో ”
తనకేం కావాలని అడగాలో సిల్వియా ఆలోచించుకోవటం మొదలుపెట్టింది. వాళ్ళ సొంత రాజ్యానికి తనూ త్వరలో వెళ్ళిపోవాలి.

చివరిసారిగా ఫిలిడా రాకుమారి దగ్గరికి పంపింది ఫెయిరీ. సిల్వియా అభిప్రాయం గురించి కుతూహలంగా ఎదురు చూసింది. అది ఇలా ఉంది .

” ఫిలిడా నన్ను ఆప్యాయంగా పలకరించింది. . తనకి మీరు అందరినీ నవ్వించగల శక్తిని ఇచ్చారు కదా. నాకూ ఆ హాస్యం తెగ నచ్చేసింది. ఆమెతో వారం రోజులు ఇట్టే గడిచిపోయాయి. అంతకన్న ఇంకేం కావాలీ అనిపించింది. కానీ అందరినీ సంతోషపెట్టగలగటం లాగే ఇది కూడా పూర్తిగా తృప్తి ఇవ్వదని తోచింది. అస్తమానమూ హాస్యం ఉట్టిపడేలా మాట్లాడటం అయ్యే పని కాదు . అందుకేనో ఏమో, .ఫిలిడా ఒక్కోసారి ఎవరైనా ఏడుస్తున్నా బాధపడుతున్నా కూడా వాళ్ళని వెటకారం చేసి పక్కవాళ్ళని నవ్వించటానికి చూస్తుంది. తప్పు కదండీ ! ”

ఫెయిరీ సిల్వియా చెప్పింది నిజమేనని ఒప్పుకుంది. ఆమెని బాగా పెంచానని మనసులో సంతోషించింది.

చివరికి సిల్వియా తనకి కావలసిన వరాన్ని అడిగే రోజు వచ్చింది. స్నేహితులూ స్నేహితురాళ్ళూ అంతా గుమిగూడారు. ఏం కోరుకుంటావూ అని ఫెయిరీ ప్రశ్న వేసింది.
సిల్వియా ఒక్క క్షణం ఆలోచించి అడిగింది- ” ప్రశాంతమైన హృదయం ! ” .

” అలాగే, ఇచ్చాను. ” అంది ఫెయిరీ.

అది నిజంగా అపురూపమైన వరం. సిల్వియాకి తృప్తినీ సుఖాన్నీ తెచ్చిపెట్టింది. చిన్న చిన్న కష్టాలు అందరికిలాగే తనకీ వచ్చాయి. కాని వాటినుంచి త్వరగా తేరుకోగలిగేది. తనతో ఉన్నవాళ్ళకి కూడా తేలికగా, శాంతంగా అనిపించేది. తగిన రాకుమారుడిని పెళ్ళాడి సిల్వియా చాలా కాలం నిశ్చింతగా జీవించింది.

 

 French fairy tale , by the Comte de Caylus (1692–1765).
సేకరణ- Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

పన్నెండు రూపాల ప్రేమ!

Mythili
ఒకానొకప్పుడు ఫెయిరీల రాణిని ఎన్నుకోవటానికని పోటీ పెట్టారు. సుక్రాంటైన్, పరిడైమీ ఇని ఇద్దరు ఫెయిరీలు అన్ని విషయాలలో గొప్పవాళ్ళని తేలింది. వాళ్ళలో ఏ ఒక్కరిని రాణిగా చేసినా రెండోవారికి అన్యాయం జరిగేంత సమానం గా ఉన్నారు. అందుకని అంతా కలిసి ఒక నిర్ణయానికి వచ్చారు. చలికాలం లో మామిడి పళ్ళు కాయించటం, వానచినుకులకి మల్లెపూల వాసన తెప్పించటం…ఇలాంటి మామూలు ఇంద్రజాలాలు కాకుండా , ఇప్పటివరకూ లేని ప్రత్యేకమైన వింతని సృష్టించాలి. ఎవరి వింత ఎక్కువ విడ్డూరంగా ఉంటే వాళ్ళు రాణి అవుతారు. ఎంత కాలం పట్టినా సరే, చేసి చూపించాలి. ఈ లోపు నలుగురు ముసలి ఫెయిరీలు కలిసి రాజ్యం బాగోగులు చూసే ఏర్పాటు చేశారు.

సుక్రాంటైన్ ఒక రాజకుమారుడిని పెంచుతుంది. అతనికి ఎప్పుడూ ఎందులోనూ కుదురు అన్నదే ఉండకూడదు. పరిడైమీ ఒక రాజకుమారిని పెంచుతుంది. ఆమెను చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడిపోవలసిందే. ఇవీ వాళ్ళు చేసి చూపాలనుకున్నవి. రాజకుమారిని చూసి ప్రేమలో పడని వారెవరైనా ఉంటే పరిడైమీ ఓడిపోయినట్లు. రాజకుమారుడికి కుదురు వచ్చిందా, సుక్రాంటైన్ ఓడిపోయినట్లు పరిడైమీ ఒక రాజూ రాణీ లతో పరిచయం పెంచుకుంది. రాజు బార్డండన్ చాలా మంచివాడు. తన ప్రజలని ఎంతో బాగా చూసుకునేవాడు. రాణి బాలనీస్ కూడా అంతే. ఇద్దరికీ ఒకరంటే ఒకరికి గొప్ప ఇష్టం. వాళ్ళకి చిన్న కూతురు ఉంది. తన బుగ్గ మీద చిట్టి రోజా పువ్వు లాంటి పుట్టుమచ్చ ఉండటం తో ఆ పాపని ‘ రోజానెల్లా ‘ అని పిలిచేవారు. తను ఎంత చురుకైనదంటే, ఎంత తెలివిగా మాట్లాడుతుందంటే రాజసభలో అందరికీ ఆమె మాటలు కంఠతా వచ్చేవి.

ఒక అర్ధరాత్రి రాణి ఉలిక్కిపడి నిద్ర లేచింది. తన చిట్టి పాప గులాబీపూలగుత్తి గా మారిపోయినట్లూ ఒక పక్షి దాన్ని తన్నుకుపోయినట్లూ ఆమెకి పీడకల వచ్చింది. వెళ్ళి చూస్తే రోజానెల్లా నిజంగానే మాయమైంది. ఎంత వెతికినా కనిపించనే లేదు.రాణి ని ఓదార్చటం ఎవరివల్లా కాలేదు. రాజు త్వరగా బయటపడే మనిషి కాదుగానీ ఆయనా దిగులుపడిపోయాడు. రాజధానిని వదిలి ఒక పల్లెటూళ్ళో ఉన్న ఇంటికి వెళ్ళారు ఇద్దరూ , కొంతకాలం ఉందామని.
ఒక చల్లటి సాయంకాలం చెట్లనీడలో కూర్చుని ఉన్నారు అక్కడ. ఆ ప్రదేశం పన్నెండు కోణాల నక్షత్రం ఆకారం లో ఉంది. ప్రతి కోణం లోనూ ఒక కాలిబాట.

ఒక్కొక్క బాట లోంచి ఒక యువతి, నవ్వు మొహంతో నడుచుకుంటూ వచ్చింది. ఒక్కొక్కరూ ఒక్కొక్క అల్లికబుట్ట తో వచ్చారు. ” రాణీ ! మీ పాప కనబడటం లేదు కదా, ఈ పాపను పెంచుకోండి ” అని వాటన్నిటినీ ఆమెకి ఇచ్చారు. మాయమైన రాజకుమారి వయసే ఉన్న పాపలు ఉన్నారు ఆ బుట్టలలో. చూడగానే ముందర రాణి రోజానెల్లా కోసం బెంగ పడింది. మెల్ల మెల్లగా ఆ పాపలు ఆమెకి ముద్దొచ్చారు. ఉయ్యాలలూ వాటిని ఊపేవాళ్ళూ , బోలెడన్ని బొమ్మలూ ఆడించేవాళ్ళూ , రుచి అయిన తినుబండారాలూ తినిపించేవాళ్ళూ ,ఎత్తుకు తిప్పేవాళ్ళూ ఇలా అన్నిటినీ , అందరినీ రాణి పురమాయించింది. ఆ హడావిడిలో ఆమె తన బాధ మరిచిపోయింది. ఆశ్చర్యకరంగా, ఈ పన్నెండు మంది పాపలకీ బుగ్గ మీద రోజా పూవు ఆకారంలో పుట్టుమచ్చ ఉంది. అందరూ ఒక చోట ఉన్నప్పుడు పెద్ద పూలగుత్తిలాగానే కనిపించేవారు. ఒక్కొక్కరికీ ఒక రంగు పేరు పెట్టుకుంది రాణి. వాళ్ళు అందరూ తెలివైనవారే.

అందరూ బాగా చదువుకునేవారు. అయితే అందరూ మంచిపిల్లలే కానీ ఒక్కొక్కరి తీరు ఒక్కొక్కలా ఉండేది. అదివరకు వాళ్ళని ” పాటలీ , ఇంద్రనీలా, శ్వేతా ” అని పిలుచుకునే రాణి ఇప్పుడు వాళ్ళు ఎదిగేకొద్దీ స్వభావాన్ని బట్టి ” ఆనందినీ, మధురిమా, సాంత్వనా ” ఇలా పిలవటం మొదలుపెట్టింది. అందరూ పెరిగి పెద్దయి సొగసైన అమ్మాయిలు అయారు. ఆ నోటా ఈనోటా వాళ్ళ కబుర్లు విని వాళ్ళని పెళ్ళాడేదుకు దేశదేశాలనుంచి రాకుమారులు వచ్చేవారు. అమ్మాయిలని కలుసుకుని పొగిడి ఒప్పించాలని చూసేవారు. వీళ్ళు మాత్రం ఎవరినీ ప్రేమించలేదు, వాళ్ళ హద్దుల్లో వాళ్ళు ఉంటుండేవారు.

draft_lens18387266module152630148photo_1314117728andrew_lang_fairy_books.j
రాజు బార్డండన్ కి మేనత్త కొడుకు ఇంకొక రాజు ఉన్నాడు. ఆయనకి ఒక కొడుకు, అతని పేరు మిర్లిఫ్లోర్. రెండో ఫెయిరీ సుక్రాంటైన్ ఈ రాజకుమారుడిని కుదురు లేనివాడిగా చేయాలని నిర్ణయించుకుంది. అందం, ఆరోగ్యం, తెలివి తేటలు, మంచితనం అన్నీ అప్పటికే ఉన్న ఆ అబ్బాయిని చాలా చాలా ఆకర్షణీయమైనవాడిగా తయారుచేసింది. అతను కోపంగా ఉన్నా శాంతంగా ఉన్నా, అలంకరించుకున్నా సాదాసీదా గా ఉన్నా, గంభీరంగా ఉన్నా సరదాగా ఉన్నా – ఎప్పుడూ అందరినీ ఆకట్టుకోగలిగేవాడు. అతనికి అన్నీ ఉన్నాయి, కుదురు ఒకటి తప్ప. పద్దెనిమిదేళ్ళు నిండేసరికి రాజ్యం లోని అందరు అమ్మాయిలకీ అతను నచ్చటం, వాళ్ళు ఇతనికి మొహం మొత్తటం కూడా అయిపోయాయి. సరిగ్గా అప్పుడు బార్డండన్ రాజ్యానికి రమ్మని అతన్ని ఆహ్వానించారు.

ఒక్కసారిగా పన్నెండు మంది అపురూపమైన అమ్మాయిలు కనబడ్డారు. అతను ఉక్కిరిబిక్కిరి అయిపోయాడు. అందరూ అతనికి నచ్చేశారు, వాళ్ళందరికీ ఇతనూ అంతగానూ నచ్చాడు. అందరూ ఒకే చోట లేకపోతే అతనికి తోచేది కాదు. ఒకరి మాటలు విని నవ్వేవాడు, ఒకరితో తను ముచ్చట్లు చెప్పేవాడు . ఇంకొకరి తో కలిసి కవిత్వం చదివేవాడు, మరొకరితో మౌనంగా ఉండేవాడు. ఒకరితో సంగీతం , ఇంకొకరితోపువ్వులూ పిట్టలు , మరొకరితో ఆకాశం, నీటి మబ్బులు. . గుబులుగా అనిపిస్తే ఒకరు ఊరట, అల్లరి చేసేందుకు ఒకరు తోడు. తన జీవితంలో అతను మొదటిసారి ప్రేమలో పడ్డాడు. అయితే అది ఒక్కరితో కాదు, పన్నెండు మందితో. అతన్ని మార్చిన ఫెయిరీ సుక్రాంటైన్ అనుకుంది, ఇంతకన్న కుదురు లేకపోవటం ఏముంటుందని. పరిడైమీ మాత్రం ఒక్క మాటా మాట్లాడలేదు.

రాజకుమారుడు మిర్లిఫ్లోర్ వాళ్ళ నాన్న అతన్ని ఇంటికి రమ్మని ఎన్నో సార్లు కబురు చెశాడు. ఏవేవో పెళ్ళిసంబంధాల సంగతులు వచ్చిపడుతున్నా మిర్లిఫ్లోర్ తనని కట్టిపడేసిన ఈ పన్నెండుమంది మంత్రగత్తెలని వదిలి వెళ్ళనేలేకపోయాడు.

ఇంతలో ఒక పండగనాడు రాణి ఉద్యానవనం లో విందు ఏర్పాటు చేసింది. అతిథులంతా వచ్చారు. ఆ తోటలో యథాప్రకారం మిర్లిఫ్లోర్ తన సఖులందరితోనూ ఉన్నప్పుడు జుమ్మని తేనెటీగల శబ్దం వినిపించింది. పన్నెండుమంది అమ్మాయిలూ రోజా పూవులో ఏమో , భయపడి దూరంగా పరుగెత్తారు. తేనెటీగలు వెంటపడ్డాయి. చూస్తుండగానే అవి ఇంతింత పెద్దవై రోజా కన్యలని ఎత్తుకు వెళ్ళిపోయాయి. రెప్పపాటులో ఇదంతా జరిగిపోయింది. అంతా నిర్ఘాంత పోయారు.

మిర్లిఫ్లోర్ ముందు విపరీతంగా దుఃఖ పడ్డాడు, ఆ తర్వాత ఏమీ పట్టకుండా , ప్రపంచం లో లేనట్లుగా అయిపోయాడు. ఏదో ఒకటి అతన్ని కదిలించకపోతే అసలు బ్రతుకుతాడా అనిపించింది. ఫెయిరీ సుక్రాంటైన్ ఓదార్చే ప్రయత్నం ఎంతో చేసింది. సుందరులైన రాజకుమార్తెల చిత్తరువులు తెచ్చి చూపించింది. అతను చీదరించుకున్నాడు. ఫెయిరీకి ఏం చేయాలో తోచలేదు ఇంక.

ఒక రోజు పిచ్చివాడిలాగా అతను అటూ ఇటూ తిరుగుతూ ఉండగా ఉన్నట్లుండి పెద్ద కలకలం చెలరేగింది. సూర్యకాంతిలో తళతళ మెరుస్తూ స్ఫటికపు రథం ఒకటి పైనుంచి దిగి వస్తోంది. రెక్కలున్న చక్కటి అమ్మాయిలు ఆరుగురు రోజా రంగు పట్టుతాళ్ళతో ఆ రథాన్ని లాగుతున్నారు. ఇంకా ఎందరో అందగత్తెలు పొడుగాటి పూల హారాలు పట్టుకుని ఆ పైనంతా రంగుల పందిరి వేసేశారు. ఆ రథం లో ఫెయిరీ పరిడైమీ కూర్చుని ఉంది, ఆ పక్కనే ఒక అత్యంత సౌందర్యవతి అయిన రాజకుమారి ఉంది. సరాసరి రాణి బాలనీస్ మేడకి వెళ్ళారు వాళ్ళిద్దరూ, ఆ వెనకే అబ్బురపడే జనం అందరూ.

” మహారాణీ , ఇదిగో మీ అమ్మాయి రోజానెల్లా ” అంది పరిడైమీ.
ఊహించనిది జరిగిన సంతోషం లో రాణి మునిగిపోయింది. అంతలోనే అడిగింది-
” మరి నా పన్నెండు మంది బంగారు తల్లులూ ఏరీ ? ఇంక నాకు కనిపించరా ? ”
పరిడైమీ ఒకే మాట అంది ” త్వరలోనే వాళ్ళందరినీ నువ్వు మరచిపోతావు ”
ఆ అనటం నన్ను ఇంకేమీ అడగవద్దు అన్నట్లుంది. తన రథం ఎక్కి సుక్రాంటైన్ వెళ్ళిపోయింది.

image185
చిన్నప్పుడే తప్పిపోయిన రాజకుమారి తిరిగి వచ్చిందని మిర్లిఫ్లోర్ కి తెలిసింది. ఆమెను చూడాలనే ఆసక్తి ఏమీ అతనికి లేనే లేదు. తప్పనిసరిఅయి, మర్యాద కోసం, ఆమెని కలవటానికి వెళ్ళాడు. ఆమెతో అయిదు నిమిషాలు ఉండగానే అతనికి తాను పోగొట్టుకున్న పన్నెండుమంది లక్షణాలూ ఆమెలో కనిపించటం మొదలెట్టాయి . కాసేపట్లోనే ఒళ్ళు తెలియనంత సంతోషం లో కూరుకుపోయాడు. తనని పెళ్ళాడమని రాజకుమారిని అడిగాడు.

సరిగ్గా అప్పుడే పరిడైమీ ప్రత్యక్షమయింది. విజయగర్వం తో వెలిగిపోతోంది . తను పెంచిన రాజకుమారిని చూసిన ఎవరైనా సరే ప్రేమలో పడాలి, మిర్లిఫ్లోర్ అలాగే అయాడు. పరిడైమీ తను రోజానెల్లా ని ఎలా ఎత్తుకువెళ్ళిందీ, ఆమె ను పన్నెండుగా విడగొట్టి ఒక్కొక్కరితోనూ మిర్లిఫ్లోర్ ప్రేమలో పడేలా ఎలా చేసిందీ , కథ అంతా చెప్పుకొచ్చింది. పన్నెండుగురూ ఒకటి అయిన రోజానెల్లా ను ఇప్పుడు మిర్లిఫ్లోర్ ప్రేమిస్తున్నాడు, ఆమె పన్నెండు గుణాలకీ విడి విడిగా. అన్నీ ఆమె లోనే ఉన్నాయి కనుక అతనికి మరెవరూ అక్కర్లేదు. సుక్రాంటైన్ కుదురు లేకుండా చేద్దామనుకుంది, ఇతను ఈ రకంగా కుదురుగా అయిపోయాడు, ఆమె ఓడిపోయింది.

అయినా రోజానెల్లా ను ఇష్టపడకుండా సుక్రాంటైన్ ఉండలేకపోయింది. ఆ రాజకుమారి అంత అద్భుతమైనది. మిర్లిఫ్లోర్, రోజానెల్లా ల పెళ్ళివిందుకు సుక్రాంటైన్ హాజరైంది. అందమైన కానుక కూడా ఇచ్చింది. పన్నెండు రూపాలలో తను అతన్ని ప్రేమించిన ప్రేమనంతా రోజానెల్లా , మిర్లిఫ్లోర్ మీద కురిపిస్తూ ఉంది. వాళ్ళిద్దరూ సంతోషంగా , శాంతంగా చిరకాలం జీవించారు.

 

ఫ్రెంచ్ జానపద కథ [ by Comte de Caylus , early 17 th century ] సేకరణ – Andrew Lang

అనువాదం: మైథిలి అబ్బరాజు

mythili

లోగో: మహీ బెజవాడ