మన తరానికి జాషువా నేర్పిన పాఠం ఇదీ!

శాంతి ప్రబోధ

శాంతి ప్రబోధ

“జీవితం నాకు ఎన్నో పాఠాలు  నేర్పింది.  నా గురువులు ఇద్దరు  – పేదరికం – కులమత భేదం .  ఒకటి నాకు సహనాన్ని నేర్పితే రెండోది నాలో ఎదిరించే శక్తిని పెంచిందే కాని బానిసగా మార్చలేదు .  దారిద్ర్యాన్ని , కులమతాల్ని కూడా చీల్చి నేను మనిషిగా నిరుపించుకోదలిచాను. వాటిపై కత్తి కట్టాను.  అయితే నా కత్తి కవిత ” అంటాడు జాషువా. 
అట్టడుగు జీవితాల హీన , దీన స్థితిని స్వయంగా అనుభవించి మనసులో పడ్డ ఆవేదననూ , ఆర్తినీ కవిత్వ రూపంలో ఆవిష్కరించిన ఆధునిక యుగపు మహాకవి జాషువా.  దారిద్ర్యం , అంటరానితనం , ఆర్ధిక అసమానతలు, వర్ణ వ్యవస్థ, కులవ్యవస్థ, కర్మ సిద్ధాంతాలు వీటన్నిటితో  సతమతమయిన జాషువా, తన తోటివారిని చూసి తిరుగుబాటు చేసి వ్యవస్థను నిలదీసి మానవ విముక్తికి, ఉన్నతికి కవిత్వాన్ని ఒక ఆయుధంగా ఎంచుకున్న సామాజిక దార్శనికుడు.   బిరుదులూ, పురస్కారాలూ ఎన్ని అందుకున్నా సమతా ధర్మాన్ని , సమతా భావనను దర్శించిన క్రాంతి కవి జాషువా.  ప్రాచీన భారతీయ వైభవాన్ని వేనోళ్ళ కవులు స్తుతిస్తున్న ఆ రోజుల్లో తన నిత్య జాగృత కవితలద్వారా ఎప్పటికప్పుడు వర్ణ వ్యవస్థ వైకల్యాన్ని మతాంధ మనస్తత్వాన్ని, సాంఘిక దురాచారాల్ని, స్త్రీల స్థితిని ఎత్తి చూపి ఎలుగెత్తి చాటిన నవయుగ కవి చక్రవర్తి జాషువా.
అందుకు ఆయన ఎన్నుకున్నది సంప్రదాయబద్దమైన చందం. వస్తువుగా తీసుకున్నది సార్వకాలిక సామాజిక ధర్మ ప్రతిష్టాపన.  కులమతాల కుళ్ళుకు అతీతంగా కవిత్వానికి పరమార్ధం ప్రయోజనాన్ని నిర్దేశించడం ఆయన కవితల ఉద్దేశం .  కులము , కట్టుబాట్లు క్రౌర్యాన్ని, కాటిన్యాన్ని అంతగా చీత్కరించిన కవి మనకు ఆధునిక కాలంలో కనిపించరు.  అభ్యుదయ కవితాయుగంలో శ్రీ శ్రీ గేయంతో సాధించింది జాషువా చాల ముందుగానే పద్యంతో సాధించారని ఓ సందర్భంలో అన్నారు సినారె.
“కసరి బుసగొట్టు అతని గాలి సోక నాల్గు పడగల హైందవ నాగరాజు ”  అన్నప్పుడు ఆయన వ్యక్తం చేసింది తననుభవించిన బాధనే కాదు .  ఆనాటి ఆ స్థితిపై అసమ్మతిని.  విద్యాగంధం, సంస్కార సంపద లేని నిరుపేద కుటుంబంలో పుట్టిన జాషువా జీవితంలో తాను అనుభవించిన అవమానాల్ని , తిరస్కారాన్ని అధిగమిస్తూ తనదైన వ్యక్తిత్వాన్ని నిర్మించుకోవడమే కాకుండా తన కవితకి ఆత్మాశ్రయ రూపం ఇవ్వకుండా సాధారణీకరించడం, భావకవిత్వం రాజ్యమేలుతున్న రోజుల్లో వస్తాశ్రయ కవిత్వం రాయడం ఆయన ప్రత్యేకత.
“ప్రతిమల పెండ్లి చేయటకు వందలువేలు వ్యయించుగాని
దుఃఖ మతులైన పేదల ఫకీరుల శూన్యములైన పాత్రలన్
మెతుకు విదల్పదీ భారతమేదిని ముప్పది మూడు కోట్ల దే
వతలెగవడ్డ దేశమున భాగ్య విహీన క్షుత్తులారునే !
అంటూ గబ్బిలంలో పరమ శివునికి పంపు కున్న సందేశంలో దరిద్రులపై దయ చూపని, దైవపూజలని, హృదయ దౌర్భల్యాన్ని, భావ దారిద్ర్యాన్ని ఈ కవి క్షమించలేక పోవడం కనిపిస్తుంది.
‘గబ్బిలం’  కాళిదాసు మేఘసందేశాన్ని మనసులో నింపుకుని చేసిన రచన.  ఇందులో నాయకుడు పరమ దరిద్రుడు.  క్షుద్భాధా  పీడితుడు.  సంఘం వెలివేసిన వాడు.  ఈ భేదం కావ్య వస్తు రూపాన్నే మార్చేసింది.  ఇంట్లో చీకట్లో కూర్చొన్న దీనుడైన , దరిద్రుడైన వ్యక్తి తలెత్తితే  ఓ మూలన గబ్బిలం కనిపించింది.  అతడు తన బాధను దానితో చెప్పుకుంటాడు.  కైలాసంలో  ఈశ్వరునికి తన కథ నివేదించమని వేడుకుంటాడు.  ఇది సాగినంతమేర కనబడే దృశ్యాలు దేశం , చారిత్రక , సామాజిక  స్థితిగతులు.  ఈ సంవిధానం ఎంతో శిల్పవంతంగా ఉంది. కరుణరసం నిండి ఉంది.  కన్నీటి కథకి ఆర్ద్ర హృదయం జత పరచిన మనోజ్ఞ కావ్యం గబ్బిలం .
సాంఘిక న్యాయసాధన నా జన్మహక్కు అనే కృత నిశ్చయంతో ఈ ప్రపంచంలోనే మరో ప్రపంచాన్ని , కావ్యలోకంలో  ‘కొత్త లోకం ‘ సృష్టించాడు జాషువా.  ఈ నీచ నికృష్ట నియంతృత్వ బందురమైన పాతలోకానికి బదులు కొత్త లోకాన్ని ప్రసాదించమని ‘కొత్తలోకం’లో ఆర్దిస్తాడు.  ఆ లోకం ఎలా ఉండాలో చూపిస్తాడు.  జాషువా ‘కొత్తలోకం’ ఒక జీవత్కార్యం.  సామాజిక కావ్యం.  అరుదైన రసవత్కావ్యం.  ఒక కొత్త సాంఘిక వ్యవస్థ కోసం ఆయన పడిన తపన, ఒక విన్నూత్న మార్పు కోసం ఆయన కన్న కళలు , సామాజిక చైతన్యం కోసం ఆయన కనబరిచిన ఆతురత ఆయన  ప్రతి పద్య పాదంలోనూ ధ్వనిస్తుంది.  నినదిస్తుంది.
hyf02VS-gurram-_HY_1537788e
ఆత్మీయాంశతో కూడిన కావ్యం ‘ఫిరదౌసి’.  తండ్రికి తగ్గ కూతురు ఫిరదౌసి కుమార్తె.  ఆమె పాత్ర చిత్రణ , స్త్రీ స్వభావ నిరూపణలో జాషువా చూపిన మెలకువ ‘ఫిరదౌసి ‘లో తెలుస్తుంది.
‘ముంతాజ్ మహల్ ‘ లో ముంతాజ్ సౌందర్య వర్ణనకి అవకాశం ఉన్నా కూడా ఆయన శృంగార వర్ణన చేయలేదు .  ముంతాజ్ – షాజహాన్ల మధుర ప్రణయాన్ని ఔచిత్యంతో, భావనా బలంతో, శబ్ద సౌందర్య వ్యంగ్య స్పూర్తితో అవసరమైనంత వరకే వర్ణించిన తీరు అనితర సాధ్యం .
జాషువా తన భావాలను ఎంత తీవ్రంగా వ్యక్తం చేసినా సమాజంలోని ఏ  వర్గానికీ దూరం కాలేదు.  పైగా అందర్నీ స్పందింప చేశాడు .  అది ఆయన చైతన్య స్థాయికి నిదర్శనం.  జాషువాకి కుల ద్వేషం లేదు.  అందుకే ఆయన ” మతపిచ్చి గాని, స్వార్ధచింతన కాని నా కృతులకుండదు ” అని చెప్పుకోగలిగారు.  జాషువా కవితా చైతన్యం సంకుచితంగా ఆగిపోకుండా ఒక విశాల పరిధిలో విస్తరించి ఒక బాధ్యతాయుతమైన పరిణామాన్ని పొందింది.
‘గబ్బిలం’ కావ్యంలో జాషువాలో ఒక హేతువాది కనిపిస్తాడు.  కాందిశీకుడు , కొత్తలోకం కావ్యాల్లోనూ ఆయన హేతుదృష్టి   కనిపిస్తుంది.  ఆయన కవిత్వంపైన ఆనాటి హరిజనోద్యమం , సహాయ నిరాకరణ , పుల్లరి సత్యాగ్రహం , ఆంధ్రోద్యమం మొదలైన వాటి ప్రభావం కనిపిస్తుంది.  అలాగే ఆయన ఆస్తికుడా, నాస్తికుడా అనే సంశయం కలుగుతుంది.  ఆయన రచనల్లో దళితవాద, స్త్రీవాద శబ్దాలు ప్రయోగించక పోయినా ఒక దళితవాదిగా, స్త్రివాదిగా అప్పుడప్పుడూ దర్శనమిస్తాడు.
“గవ్వకు సాటిరాని పలుగాకుల మూకలసూయచే న
న్నేవ్విది దూరినన్ ననువరించిన శారద లేచిపోవునే
ఇవ్వసుధా స్థలిన్ పొడమరే రసలుబ్దులు ఘంటమమూనెదన్
రవ్వలు రాల్చెదన్ గరగరల్ సవరించెద నాంధ్ర వాణికిన్”
అనే జాషువా ఏనాడూ లోక విపరీత బుద్ధులకు వేరవలేదు. బెదరలేదు.  ఆయన వజ్ర సంకల్పం చెదరలేదు.  రానురాను మరింత తీవ్రమైంది.  ఆ స్వభావమే పై పద్యంలో స్పష్టంగా కనిపిస్తుంది.
“యుగ యుగమ్ముల  భారతీయుడను నేను ” అంటూ సగర్వంగా చాటుకున్న జాషువా ఆ తర్వాతి కాలంలో తన పరిధిని విస్తరించుకున్నాడు.
‘కులమతాల గీచుకున్న గీతలను జొచ్చి
పంజరాన కట్టువడను నేను
నిఖిలలోక మెట్లు నిర్ణయించిన నాకు
తిరుగు లేదు విశ్వ నరుడను నేను ‘
అంటూ తన విశ్వ జనీన దశకు చేరుకున్నాడు. ఆయనే చెప్పుకున్నట్లు   “వడగాడ్పు నా జీవితమైతే – వెన్నెల నా కవిత్వం ‘  అన్న  మాటలు అక్షర సత్యం.
 
వి. శాంతి ప్రబోధ
హైదారాబాద్ లో ఈ వారం 26 న జాషువా జయంతి సభ జరుగుతున్న సందర్భంగా…
MaNaSu Invitation for Jashuva book release

త్రిపురా… ఓ త్రిపురా!

వివిన మూర్తి

 

“ఏమిటి నీ ప్రయత్నం?”

“అర్ధం చేసుకుందామని”

“ఎవరిని?”

“—??—”

“ఆయన్నా.. వాళ్లనా.. ”

“అంతేకాదు”

“కాక?”

“చాలా ఉంది. మొత్తాన్ని. రాతని.. చదువుని.. రాయించే చదువుని… చదివించే రాతని.. కమ్యూనికేషన్ని… సాహిత్యాన్ని.. మనిషిని.. నన్ను. ”

“నిన్నా?”

“అవును. నన్నూనూ”

****

“విశాఖపట్నం అంటే సముద్రం”

“కాదు. రాచకొండ. ”

“ఛఛ 13 నంబరు బస్సు.. కేజీహెచ్ అప్పు.. ”

“తెన్నేటి విశ్వనాధం.. అబ్బూరి.. ”

“సింగు హోటలు.. సొంటి బిస్కట్లు”

“కాదు కాదు.. కనక మాలక్ష్మి.. యారాడ కొండ”

“కిట్టటం లేదోయ్.. పాత ఇశాపట్నమా.. ”

“ఇచ్చట మార్గము మూయబడెను.. మార్గమును వెదుకుడి.. ”

****

“హోటల్లో చదివావా?”

“కాలేజీలో చదివాను. ”

“బీట్ రూట్ లాంటి దిబ్బకుర్రాడు దోసిని తినీసి పెసరెట్టుని తడమటం. తెలుగు సినిమా హీరో ఓ దాన్ని వానలో తడిపేసి.. మరోదాన్ని మంచులో ఎక్సర్సైజులు చేయించి.. డాఫర్ పని చెయ్యటం.. ”

“సంబంధం లేదు”

“స్టేట్మెంటా..? నీక్కనపడలేదు”

“చూపించొచ్చుగా”

“చూసిన నీకే కాపడనప్పుడు.. నానేటి సూపించేది”

“ఏంటీ న్యూసెన్సు!!! ”

“ఇమిటేషను బాబూ.. తమాసకాలు కాదు.. ”

“బొంగేం కాదూ.. ”

“ప్యూర్ కాకపోవచ్చు”

“పూర్ కూడా కాదు.. నీ పద్దతిలో నువ్వేడు”

“నా పద్దతా అదేంటది?”

“వాస్తవం.. రాత ద్వారా వాస్తవం.. ”

“నాకలాటి భ్రమలు లేవు. రాతలో ఉండేది వాస్తవ భ్రమ.  కల్పన.”

“వాస్తవం ఉండదా”

“అద్దంలో ఉండేది నువ్వా?”

“కొండలున్నాయి. వాటి మధ్యలోంచి సూర్యుడు పొడవటం ఉంది. సముద్రం ఉంది. ఆ అలల మీద కిరణాలు పడటం.. వీటిని పడవలు చెదిరించటం ఇదంతా.. వాస్తవమే.. ”

“లేదు. భూమి తిరగటమే వాస్తవం.. ”

“రాతలో ఇదంతా నీ కళ్లకి కట్టిస్తాను. నా మనసుకి పట్టిన ప్రతి అనుభూతినీ.. తట్టిన ప్రతి ఊహనీ.. నీ మనసులో పుట్టిస్తాను.. ఇదంతా వాస్తవం కాక.. ?”

“కాదు. ”

“మరి వాస్తవం ఏమిటి?”

“అదేదో నువ్వు చెప్పాలి”

“నేనా?”

“అవును. ఆయన గురించి రాయాలన్న నిర్ణయం నీది. వాస్తవం – కల్పన అన్న ఆలోచన మెదడున పడ్డది నీకు. దానిని కనటం నీ బాధ్యత.. ”

“వెల్లువలో పూచిక పుల్లలు.. మృత్యుంజయుడు.. అల్పజీవి..అసమర్ధుని జీవితయాత్ర.. హిమజ్వాల.. బుచ్చిబాబు.. చంద్రశేఖరుడు.. మార్క్వెజ్.. సాల్ బెల్లో.. వేణు.. ”

మిత్రబృందంలో త్రిపుర

ముందు వరస 1.అత్తలూరి 2. త్రిపుర 3. భరాగో 4. భైరవయ్య 5. కాళీపట్నం
వెనక వరస 1. ఆదూరి సీతారామమూర్తి 2. అల్లం శేషగిరిగావు 3. అబ్బూరి గోపాలకృష్ణ 4. ఎయస్వీ రమణారావు 5. వివిన మూర్తి

“ఆపాపు.. లిస్టు పెద్దదే.. లింకు తెలీటం లేదు.. ”

“అర్ధం కాకపోటమే లింకు.. అర్ధమయూ కాకపోవటమే సంబంధం.. తరతమ భేదాలు.. స్వపరాలు.. ”

“ఏభై ఏళ్లకి పైబడి చదూతున్నావు.. ఏదో ఒకటి గిలుకుతున్నావు.. అర్ధం కాదంటం పొగరు కాదా.. వాళ్లని అవమానించటం కాదా.. నువ్వు గిలికీదీ అర్ధం కానివాళ్లు చాలామంది.. ”

“ఇంగ్లీషున రాసింది అర్ధం కావాలంటే ఇంగ్లీషు రావాలి.. రాదనటం పొగరెలా అవుతుంది.. మహా అయితే సిగ్గు పడాలి.. ఒప్పుకోటానికి కాస్త ఖలేజా ఉండాలి.. లేకపోతే వినాయకుడి బొడ్డులో వేలే.. అది నాకు గాని వాళ్లకి గాని అవమానమూ గాదు.. సన్మానమూ కాదు.. ”

“ఇంగ్లీషు నేర్వొచ్చుగా.. ”

“ప్రయత్నం చేసా. పట్టు దొరకలేదు”

“అసలు కొందరెందుకు అలా రాస్తారు?”

“కొన్ని వివరణలున్నాయి. ఒక ఎఫెక్టుకి అనేక కాజెస్ ఉంటాయి. అనేక చర్యలకి ఒకే ఫలితం ఉండవలసిన అవసరం లేదు. ”

“అన్నీ చెప్పు”

“పొడుగైపోతుంది. పలచనై పోతుంది”

“నువ్వేప్పుడైనా ప్రచురణ గురించి పొడుగు పొట్టిల గురించి .. ”

“రాయటం మొదలు పెట్టేముందు తనేం చెప్పదలుచుకున్నదీ రచయితకి స్పష్టత ఉంటుంది. అంటే ఆ విషయంలో అతను కాన్షస్ అనవచ్చు. ”

“పాత్రను సృష్టిస్తున్నపుడే నూతిలో పడాలా ఉరేసుకోవాలా అన్నది రచయిత నిశ్చయించేసు కుంటాడంటావు. ”

“కాదు. ఓ క్లిష్టస్థితి నుంచి ఓ స్వభావం కలిగిన పాత్ర లేదా సమూహం బైట పడాలన్నది రచయిత కలం పట్టేముందే మనసులో ఉంటుంది. బయట పడటానికి చంపాలా చావాలా పారిపోవాలా అన్నది కథ రాస్తున్నపుడు మారే అవకాశం ఉంది. చనిపోవటానికి రచయిత అనుమతించితే నుయ్యా, ఉరా, ఎండ్రినా, గార్డినలా అన్నది చాలా చిన్ని సమస్య.”

“ఇలస్ట్రేట్ చెయ్యి”

“చావు అన్న కథలో ఓ గుంపు ఓ ప్రత్యేక పరిస్థితి నుంచి బయటపడాలన్నది రాత ఆరంభించేసరికే కాళీపట్నం రామారావు నిర్ణయం. దానికి జొరావరీగా పుల్లలు కొట్టటం కూడా అతని రచనాపూర్వ నిర్ణయం అయుండాలి. రెండవ నిర్ణయం వెనక రచయిత కన్విన్స్ అయిన న్యాయమో, తాత్విక భావజాలమో అలాంటిదేదో ఒకటుంటుంది. ”

“వద్దొద్దు. నీ వ్యూ పాయింట్ కి సార్వత్రికత ఉందీ అంటే ఈయన కథల నుంచే చెప్పాలి. కొంపదీసి కథలే కావంటావా?”

“నిస్సందేహంగా కథలే.. ఏ కథా.. ?”

“అర్ధం కాలేదంటున్నా అన్నీ చదివావుగదా.. ఒక్కటంటే ఒక్కటి నీ ఇలస్ట్రేషన్ కి పనికిరాదా”

“అన్నింటినీ ఈ భావనతో వివరించవచ్చు. సరే.. చీకటిగదులు.. ”

“కానీ.. ”

tripura

“భాస్కర్ పోగొట్టుకుని, పొంది, పోగొట్టుకుంటాడు కల్యాణిని. ఆవిడని పోగొట్టుకోటం అనే బలితో గాని సుఖమూ, స్వేచ్ఛా భాస్కర్ పొందలేకపోయాడన్నది ‘నిజమే’ అయితే కటువైనది. ఈ నిజం అన్నది కలం పట్టే క్షణానికే కథకుని మనసులో ఉంది. అందువల్ల పోగొట్టుకోటం కథకుని నిర్ణయం. స్వేచ్ఛ పొందానని భాస్కర్ అనుకోటం కథకుని రెండవ నిర్ణయమే. దాని వెనుక కథకుడు కన్విన్స్ అయిన తత్వమో, న్యాయమో, క్రమమో మరేదో ఉంది. అదేమిటో నాకు అందలేదు. ”

“పోనీ.. మిగిలినవన్నీ అందేయా?”

“నాకందినవి చెపుతాను.”

“?”

“శేషాచలపతి పొలిటికల్ మీటింగ్ కి వెళ్తాడు. అక్కడివన్నీ ‘కొత్వాలీ’ లో రిపోర్టు చేస్తాడు. అంతకుముందు రాసిన కథలు పాఠకుడు చదవకపోతే ఈ విషయం పాత్ర స్వభావాన్ని అందిస్తుంది. అప్రధానంగా కనిపించే ఈ వాక్యం ఓ విధంగా ఈకథకి ‘కీ’. శేషాచలపతికి బాల్యం ఉంటుంది. తల్లిని తండ్రి చంపటం.. ఆ చంపటంలోని క్రూరత్వం ఓ వాక్యంలో దాచుతాడు కథకుడు. ‘ఆ పూజాగృహంలో, నాన్న అమ్మని చంపి, వూడిపోయిన పన్నుని అరచేతిలో పట్టుకుని చూసుకున్నాడు-’.. కథ భవిష్యత్తు సూచించే ఓ శక్తి మరో వాక్యంలో.. ‘అతడి దోవలో తగిలినవాళ్ల జీవితాల్లో ఒక మలుపు తిప్పిస్తాడు. అతని ధాటికి నిలవటం కష్టం’. ‘రంగు’ సంగతి భాస్కర్ నోట చెప్పిస్తాడు. ‘నేను’ ‘నాది’ బంధాలే కాదు. బాధ్యతలు.. ’ ‘అవును జీవితం బద్దలయేవుండేది’ అంటాడు ఓల్డ్ స్మగ్లర్ ఇటుకల్లాంటి మాటలకు ప్రాణాలు పోస్తుంటే.. ‘మిగతా అంతా సిన్నింగ్ ఫ్లష్ .. ’ అంటున్నపుడు నవ్వులో అమాయకత్వం కళ్లలో క్రూరత్వం పెట్టుకున్న శేషాచలపతి ముందు అడ్లూ, ఆటంకాలూ తొలగించింది కథకుడా.. ఓల్డ్ స్మగ్లరా.. శేషాచలపతేనా.. ?”

“ఇన్ని అందాక కూడా రచయిత విశ్వసించిన తత్వం.. అందలేదా.. ”

“విశ్వసించిన అనటం నాకు ఇష్టం లేదు. అందరూ కాఫ్కా అంటారు గదా.. ఇన్ ద పీనల్ కాలనీ చదివి చలించిపోయాను. మెటమార్పసిస్, ద ట్రయల్ వంటి ప్రసిద్ధాలు చదివానో లేదో గుర్తులేదు. కాని ఆయన ప్రభావం మన కథకుని కథలలో కనిపిస్తుంది. తండ్రీ-కొడుకు సమస్య.. మార్క్వెజ్ అన్నట్లు కాఫ్కాను చదివాక “that it was possible to write in a different way”… ”

“సరేనయ్యా అందరికీ తెలిసినదే గదా.. ”

“అన్నీ అందరికీ తెలిసినవే గనక .. నాకెందుకు అనుకోవాలంటే మూసేస్తాను.. ”

“సరే సరే నీ గోలేదో నువ్వేడు.. ”

“అబ్సర్డిటీ .. తెలుగులో ఎవడేమంటాడో నాకు తెలీదు.. అసంబద్ధతని కాఫ్కాని కలపటం ఉంది.. కన్నడ సాహిత్యంలో ఇది గుర్తుపట్టగలిగేంత కనిపిస్తుంది.. జీవితానికి అర్ధం లేదని చెప్పే అర్ధం కొందరికి గట్టిగానే పడుతుంది .. ఎందుకు.. అన్నీ తెలిసాక కూడా ఏమీ తెలియకుండా పోతోందనిపించటం వల్లనా.. ఎక్కడో అది కేపిటలిజాన్ని.. అంటేటీ.. జనం బాధలకు కారణాన్ని .. కాదంటుందని కొందరు… వాస్తవాన్నే నిరాకరిస్తుందని కొందరూ.. మార్క్సిస్టులే గట్టిగా వాదించుకునేదాన్ని.. సాహిత్య ప్రతిఫలనంలో.. త్రిపుర వంటి వారు.. కథకులే కారేమో అనిపించే కొందరి.. రచనా లక్ష్యం ఏంటి.. చీకటిగదులలో జీవితపు అసంబద్ధత చూపించటమా.. తనని తను ఎలాంటి purposeనీ లక్ష్యాన్నీ మనసులో ఉంచుకోకుండానే వ్యక్తం చేసుకోటమా.. పెద్దాయన రచన.. వాస్తవం నిరాకరణ కోసం కల్పనా.. కల్పన సొగసు కోసం వాస్తవ నిరాకరణా.. రచయిత కల్పనలో ఉద్దేశిత ఉద్దేశ్యం లేకుండానే వాస్తవాన్ని – పాఠకులని.. ప్రభావితం చేస్తుందని ఇంత స్పష్టంగా తెలిసాక .. రచయిత బుర్రలో ఏమున్నా మానినా అతని కల్పన వాస్తవాన్ని కొట్టిపారేసినా.. అది వాస్తవాన్ని వాస్తవంగా ప్రభావితం చేస్తే.. అందులోనూ సామాజిక ప్రయోజనం గాళ్లని .. ఉందనుకునే వాళ్లని.. ఊపేస్తే.. ”

“…………………”

“పన్ను వూడితేనే సలుపు పోతుంది. కల్యాణి పోతేనే స్వేచ్ఛ.. రామాయణానికి ప్రేరణ జంట విడిపోటం లోని దుఃఖం .. దానిలోని సుఖం ఈ కథకి ప్రేరణా.. సుఖానికి రచయిత నమూనా అలక్ నిరంజన్ యా..సుఖం పట్ల అసంతృప్తా.. సంశయమా.. ”

“అదేదో నీకు అర్ధం కాలేదా.. కథకునికి కూడానా.. ?”

“భగవంతం కోసం .. హోటల్లో .. కెజిహెచ్ ఎంట్రన్స్ ఎదురుగా .. పద్మా నివాస్ అనే గుర్తు.. బుర్రలో తిరిగింది.. అది చదివీ, చదివీ .. వాస్తవం, కల్పనల మధ్య.. బుర్ర తిరిగింది కాని కరగలేదు.. ఎదగలేదు .. అసలది చదవి, వేసిన .. సబ్బు.. కి ఏటి బోద పడిందో నాకైతే కనపడ్డవి కనబడ్డాయి గాని.. బోద పడనేదు.. ఏబైయేళ్ల క్రితం అందులో ఉన్నదేదో .. ”

“దానికి కాలం ఏమిటి?”

“నిరీక్షణకా? మెదలవటానికా? అట్నుంచి ఏడులోనూ.. ఇట్నుంచి పదమూడులోనూ రాని భగవంతం రాటానికి.. ”

“నీకు భాష్యకారులు కావాలి.. ”

“వాస్తవానికి అక్కరలేదు.. సుబ్బారాయుడి రహస్యజీవిత మంత బహిర్గతంగా ఉంటే ఎందుకు?”

“కొన్నింటికి ‘కీ’ అక్కరలేదంటావు”

“కొందరికి కావాలి”

“అందరికీ వకాల్తా ఎందుకు?”

“ఐతే కాసుకు..జైలురోడ్డుకీ సింగుహొటలుకీ మధ్య.. అట్నుంచి కుడివైపు వీరాస్వామి.. ఎడంవైపు నేను.. జర్కన్ వద్దని.. బర్మా కార్గో పడవల పెత్తన ప్రపంచం నుంచి .. నిన్నటి వరకూ తనకిందే పనిచేసిన మనుషుల్తో కలిసి.. మురికి వాడలో.. కుళ్లు కంపులో.. ఎలక్ట్రిక్ దీపాలకోసం అరుస్తూ.. నాస్తిక సమాజం కావాలి రావాలి.. పైసా ఇయ్యి పేరు చెపుతా .. వెంకట్రావు కొడుకు.. ప్రభ పుటల్లోంచి.. ”

“నీకూ భాష్యకారుడు కావాలంటావు.. ”                                                                                                                                            tripura_336x190_scaled_cropp

“అది భాష్యకారుడి కథవుతుంది.. నీకథ ఎక్కాలంటే.. నీ ఏడుపు సంగీతం కారాదు.. ”

“అయిందేమో.. ”

“ఎందుకవదూ.. వానవానగా బాంబులు కుర్దుల మీద కరుస్తుంటే కవనశర్మ ఇరాక్ వాసులు.. వాన తగ్గింది పదండి కూరలు కొనుక్కుందాం.. బజారు చేసుకుందాం.. తొడతొక్కిడి.. టేక్ బహుదూర్ .. పదకొండు ద్వారాలు తెరిచి.. ఓ చాయ్ చిన్నారిని మూసి.. మార్ఫియా వద్దు.. బిస్కట్లు కావాలా.. కర్నాటక ఆంద్రా స్వతంత్ర దేశాలై.. మదనపల్లి బోర్డర్లో తుపాకీగుళ్ల వర్షంలో .. టీ.. చాయ్.. టీ.. చాయ్.. దానికి అక్కరలేని వీసా నీకెందుకు వచ్చెయ్ వివినా అంటూ ఆటునించి వల్లంపాటి.. నాదగ్గర వీసాలేదు.. నాకోసం పన్నెండు ద్వారాలు తెరవటానికి నువ్వు టేక్ బహుదూర్ కాలేవు వల్లంపాటీ.. ఉండుండు.. గాజీ మునిగి పోయింది.. నిస్సార్ సబ్ మెరీన్ రెస్క్యూ షిప్ పంపాలి.. పధండి.. నిద్ర లేవండి.. వైర్లు పీకేసి పని ఆరుగంటలది రెండు గంటల్లో.. డ్రైడాక్ డోర్లు తెరుచుకుంటూ నీరు వదులుతుంటే.. ఓడ కూర్చున్న దుంగలు కదిలి కూలుతున్న శబ్దం.. నెమ్మదిగా సముద్రాన్ని కావలించుకుని హుషారుగా తెల్లారగట్ల మూడుగంటల ప్రాంతంలో డాక్ జట్టీ మీద డాంగ్రీలలో వెళ్తున్నవాళ్లకి చెయ్యూపుతూ నించున్న దృశ్యం.. తిరిగి వస్తారా ప్రశ్నల మొక్కలు తలలో ఎదుగుతుంటే పీకేసిన వైర్ల చుట్టల మధ్య సిటిసి సేవిస్తూ.. ”

“నీకు బాధ్యత లేదా?”

“గొలుసులు గొలుసులుగా జ్ఞాపకాలు వరదలా పొంగుతుంటే.. ఏ కాజ్ ఏ ఎఫెక్ట్ విచికిత్స కొట్టుకుపోతుంటే .. తెగిపడ్డ బాధ్యతలకి సానుభూతి చూపించగలను గాని.. బాధ్యత వహించను. ”

“నువ్వెవరివి?”

“ఈ క్షణానికి ఓ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఛాన్సు వచ్చిన నారాయణావతారాన్ని. ద్వారం కనిపించక సముద్రాన్ని ద్వారం చేసుకున్న నువ్వుని. ”

“చెప్పు చెప్పు”

“నారాయణకి కనుపించని ద్వారాన్ని కనుగొన్నవాడిని.. ప్రపంచమంతటా లాసా మొనెస్టరీలో.. కింబర్లీ వజ్రపు గనులలో బ్లాక్ ఫారెస్టులో.. నీచేల వాల్మీకిలో.. స్మగ్లర్ లో నన్ను చూసుకున్నవాడిని.. ఇక్కడ ఈ ఆస్తి.. సంతకాలు.. తల్లీ తండ్రీ.. అక్కా చెల్లీ వెదుకులాటలో.. యవ్వనం, దేహం.. వారసత్వాన్ని తెగ్గొట్టాలని.. తీర్ధపురాళ్ల మీంచి.. కోస్టల్ బాటరీ పక్కన నువ్వు ఉరికిన రాత్రే .. ఆ రాత్రే.. ఆఖరురూపాయ.. ఆకలి రూపాయ..ద్రోణంరాజు చలపతిరావు అనీ బిలియన్ మిలియన్ స్పెర్మటోజోవాలో ఒక్కటి ఒకే ఒక్కటి ఆకారం దిద్దుకోకపోతే.. ఇది రాయటానికి త్రిపురని చదవటానికి మిగలని వాడిని.. కనిపించని ద్వారం వరకూ వెళ్లి.. కనిపించినవన్నీ నావే.. నేనే.. నని.. వారసత్వాలు తెగ్గొట్టటం కోసం అదే పరిష్కారం అంటూ వెర్రికేకలు వేసుకుంటూ.. పిచ్చిరాతలు రాసుకుంటూ.. ”

“అంతా వ్యక్తిగతం.. టూ పెర్సనస్.. ట్రూ పెర్సనల్.. ”

“పెర్సనల్ అన్నది అసలు ఉందా.. మనం, మనకి ఎదురయీ సమస్యలు.. వాటికి పరిష్కారంగా కలిగే ఆలోచనలు వాటికి రూపాన్నిచ్చే శబ్దాలు.. సంకేతాల భాష అన్నీ సమాజ ఫలాలే.. ఫలితాలే.. మరోలా చెప్పాలంటే నువ్వుండటం వల్లా మరెందరో ఉండటం వల్లా ఎవరెవరో రాసినవి చదవటం వల్లా.. ”

“మరి వంతెనలు ఎందుకూ.. ?”

“అదీ అసలు ప్రశ్న.. అందులో ఉన్నది త్రిపురే కాదు.. నేనూనూ.. మేం ట్రైటర్సుం.. మేమున్నచోట ధనం ఉంటుంది.. దాన్ని వదులుకోగలం.. అసహ్యించుకోగలం.. జేబులో రాజీనామాలు, గార్డినల్ మాత్రలు, రివాల్వర్లూ అన్నీ మావైపే గురి పెట్టుకోగలం.. రాజూ ఏ పసిబిడ్డల భావి శాంతి స్వప్నాలలో మనిషి కోసం వెక్కివెక్కి ఏడుస్తావ్.. ఏడుస్తూ ఏ ఆయుధం పట్టుకుంటావంటూ మొత్తకుంటాం.. రాజు గురి మారదు.. మా గురి మా గుండెలకి తప్పితే మా మెదడుల మీదకే ఎక్కుపెట్టబడి ఉంటుంది.. అయినా ఆశ.. మేమూ రాజూ ఏ వంతెన మీదైనా కలుసుకుంటామన్న ఆశ.. అందాకా మమ్మల్ని మన్నించమంటూ వేడుకోలు.. మమ్ము తిరస్కరించొద్దని కైమోడ్పులు.. వంతెన ఉందనే మా నమ్మకం.. కాని గురి మారదు.. అతని గురి వేరు.. మాది మాత్రం మావైపే.. నిద్రమాత్రలతో, భర్కీ, రివాల్వర్ నాకోసం నావైపు మృదువుగా మెత్తగా ఎదురుచూస్తుంటే మధ్య పురంలో త్రిపురా.. నేనూ.. ”

“సఫర్ .. ప్రయాణం జరగదా?”

“నడుస్తూనే ఉంటుంది.. రాజు ప్రశ్న వేస్తూనే ఉంటాడు.. ఎందుకంత విషాదం అంటూ.. జవాబుల కోసం మేధావి జీవితంలో.. చీకటి గదుల్లో దొరుకుతుంది.. ప్రవేశించు.. చీకట్లో కనిపించదు.. గదుల్లో చిక్కడి పోతావు కాకుండా పోతావు.. బయట ప్రపంచంలో ఓపెన్ నక్సలైట్ గా అన్నీ వదులుకుని.. లోపలికా బయటకా.. నీ సఫర్? జూడాస్ వి కాగలవు గాని కావుగదా.. ”

“సఫర్ ముగుస్తుందా?”

“ఎలా… కనిపించని ద్వారం లోంచి వంతెనల మీద సఫర్ అభినిష్క్రమణతో కూడా మలుపు.. త్రిపుర రెండవ పురం.. నా మటుక్కు నాకు ప్రధానం.. మొదట జ్ఞాన సేకరణతో.. సేకరించిన జ్ఞానంతో గొడవ.. రెండో దానిలో ఆచరణ ముందు వంగిన తల.. ఆచరించే రాజు ఆచరణ ప్రశ్నల బాణాల ముందు .. వివాహ వ్యవస్థలో సుశీల ప్రేమ స్వంతం..గృహం గృహిణి.. మరి విమల? ఉంటుంది.. జరుగుతుంది.. బయట ఇళ్లంటుకుని.. దేశం దుర్గంధ భూయిష్టమై.. కన్నీళ్ల పర్వతాలను దొర్లించుకుంటున్న చీమల పుట్టల మధ్య.. విమల సాధ్యమా.. సాధ్యమే.. సుశీలా ఎలా ముడెయ్యను మన పిక్నిక్ ముగిసిపోయింది.. అభినిష్క్రమణ కదా ఇది.. రాజూ.. నిన్ను సందేహాలు అడగలేను.. నా ప్రశ్నల కత్తులతో నన్ను నేను చీల్చుకోకుండా ఉండలేను.. బై.. ”

“మూడో పురం.. ?”

“మాలోని అత్తలూరులు చలించి.. ప్రపంచాన్ని చేర్చి.. నువ్విదని.. నీదిదనీ.. నువ్వే ఆహ్వానించని దేన్నో నీముందుంచి.. నీ చుట్టూ ఆరాధకులకి చోటు పెట్టి.. ఎనిమిదేళ్ల ఎడంలో.. ఇంకా ఉన్నానా.. ఓ వాన సాయంత్రం.. సైకిలు కొట్టులో.. సీలలు ఇంకా లూజే.. గ్రీజు వదలదు.. బురదలో కాలు పెట్టకుండా ఉండలేవు.. ఇది అసలు ప్రపంచం కాదు.. కాపీ, నకల్, కౌంటర్ ఫీట్.. మెదడు మడతల్లో డిజార్డర్ చూడు.. డిజార్డర్ లోని ఆర్డర్ కనిపెట్టు.. డాక్టర్ జాన్ పి జాన్ – నీకేం రోగం లేదు బొద్దింక గుర్తింపు.. కుక్క గుర్తింపు కనిపెట్టి కథకట్టే మూర్తీ నీకిలాంటి ఆలోచనలు ఎలావస్తాయి.. నీకు డిజార్డర్ ఏంటి.. ఆర్డర్ లేని ప్రపంచంలో ఆర్డరుందనే వాళ్లలో నారాయణ నట్టులోంచే .. తండ్రి.. ప్రభువు.. సర్వవ్యాపి.. ఎక్కడున్నాడో .. వస్తాడు.. నీచెయ్యి పట్టుకుంటాడని నమ్మవు పట్టుకునీవరకూ.. ”

“మూడోపురంలో నువ్వు లేవా?”

“కౌంటర్ ఫీట్, నకల్, కాపీ ఎక్కడినుంచి వస్తాయి ఒరిజినల్ లేకుండా.. రూపు లేని రాజు చూపూ.. దూరంగా తనలో తనే గొణుక్కునే మూర్తీ.. కల్పనతో కరాలు మోడుస్తున్న వాస్తవ ప్రపంచం ఆరాధకులూ.. ఒరిజనల్ కదా.. ఆ చూపు.. ఆప్రశ్నలు .. చచ్చిపోయాయా.. తుప్పు తుడిపించు.. గీసి పారెయ్.. నట్లు బిగించు.. ఆయిలింగ్ చేయించు.. –ఇవ్వన్నీ ‘పైనే’ – జీవితంలోంచే, ఒరిజినల్ లోంచే కొంటర్ ఫీట్లూ పుడతాయి.. అది గుర్తు పడితే ఒరిజినల్ కుట్ర అవదు. నకలు అన్న ఆలోచనే కుట్ర అవుతుంది. ”

“ఇదీ ఆయనదేనా?”

“నేకపోతే నా పైత్యమా.. నా జొరావరీయా?”

“తేడా తెలీటం నేదు బాబూ”

“తెలాలా?”

నాటి-నేటి త్రిపుర

నాటి-నేటి త్రిపుర

“తెలవాలనీ,  తెలపాలనే గదా నీ ఏడుపు…… ఈ ఏడిపింపూ ”

“ఏడుపా.. కాదే.. ప్రయత్నం.. ఒరిజినల్.. ”

“తేడా ఏంటో?”

“నేనంటే రెండు మనుషులని యిప్పుడిప్పుడే తెలుస్తోంది.. కావాలంటే భగవంతం సంతకం చూడు.. ఒకరినొకరు వెతుక్కుంటూ.. తప్పించుకుంటూ.. ఒకరికొకరు ఎదురైనా గుర్తు పట్టీపట్టనట్లుగా.. ”

“లాభాల గూబల్రాయుడూ నువ్వేనా వలసపక్షీ”

“ఒకవేపే పక్కమీదే మూడు సంవత్సరాల పడుకున్న తర్వాత రెండోవేపు తిరిగి పడుకోటానికి ఉపక్రమించేటపుడు సహజంగా, సంతోషంతో ఎంతో సుఖంగా తేలిగ్గా నిట్టూర్చే వరదరాజులూ.. ఎప్పుడూ ఒకవేపు పడుకోక క్షణంక్షణం మెసిలే నేనూ.. హహ్హహ్హ.. ”

TripuraKathaluPrintBook

“మరినువ్వు?”

”గారబంధ ఆయన్ని గుండోల్లోకి తీసుకున్నవాణ్ణి పెద్దపెద్ద ధియరీలు నాకొద్దు- అతనే నా అంతరాత్మ- నారక్షకుడు.. నా దిగులుకు కారణమూ విరుగుడూ”

“భగవంతం?”

“ఏడేళ్లు ఒక వాక్యాన్ని సరిదిద్దుతూ తెలుసుకున్నది భగవంతం ఒప్పేసుకుని సంతకం పెట్టేసాడు గదా.. ”

“నిజమే గాని-”

“ఒకే ఒక కథని. కుప్పిలి సుదర్శన్ పిల్లిగడ్డాన్ని .. పాలకొండ గ్రంధాలయంలో .. విపుల పాము కరిస్తే.. దాంతో ఇరవై జతల కళ్లని కరపించితే.. పది జతల పెదాలు అర్ధంకాలే అంటే.. ఆరు బుర్రలు ఆంగ్లంకి అను.. అనుమానం చూపుల్తో.. నాలుగు జతల కళ్లు ఉన్మత్త ఉద్విగ్నతతో.. పాము మాజండా జైజై కొట్టి .. అవునవును సాధ్యమే ..ఎప్పుడో  డొస్టోవిస్కీ నేరానికి 67లో మొదలైన శిక్ష ఈ కథాకారాగారంలో ఎవరెవరు ఏఏ పిచ్చి పిచ్చి ఏడుపులతో కాగితాలని పాడుచేసారని లెక్కించుకుంటూ అనుభవిస్తూంటే.. త్రిపుర రామయ్య రాస్తే రాయండి చెక్కొద్దని గొణిగితే .. అసహనం ఫోనుముక్కు మీదనుంచి జారిపోతే.. త్రిపురా ఓ త్రిపురా.. అర్ధమయీ కాని తెలుగు త్రిపురా.. ”

“ఏంటి డౌటు వివినా?”

 “మరేం లేదు గాని త్రిపురా.. నివ్వు ట్రైటరువి.. ”

“నివ్వు కాదేంటి?”

“కాదు. భాషని వాడుకుని దానికి వెన్నుపోటు పొడిచావు. జ్ఞానాన్ని సేకరించి రీసైకిల్ బిన్ లో వేసావు. ‘ఉన్న’ భావనని స్వీకరించి ‘లేని’ భావనగా మార్చేసావు. ‘ఉన్న’ ప్రపంచంలో జీవించి దాన్ని అంతరాత్మ చేసుకుని ‘లేని’ మనుషుల మధ్య అలజడి పుట్టించావు. నువ్వు ట్రైటరువి. బతకటానికే కష్టపడీ ప్రపంచాన్నిమెదడులో మోస్తూ తోచీతోచని ప్రపంచంలో తోపుడుబండి పెట్టుకుని తిరుగుతున్నావు. వాస్తవాన్ని తీసుకుని కల్పనలో వేసుకుని పంచాల్సిన నువ్వు ..వాస్తవాన్నే నిరాకరించే నువ్వు.. నువ్వే ట్రైటరువి.. ”

“వెర్రోడా.. నువ్వూ అంతే.. అక్షరాల గోడల మధ్య సాగని భావప్రసారం కోసం అక్షరాలనే ఆశ్రయించే వాళ్లంతా .. అంతే stabilized అంతటినీ de-stabilize చేయజూసే వాళ్లే వివినా.. పదాల చెకుముకి రాళ్లతో నిప్పు పుట్టించే రచయితలు మనుషులని మాత్రమే కాల్చగలరు.. బండలను కరిగించలేరు. ప్రతి రచనా మనిషిని కాల్చాలనే చూస్తుంది. రైటర్సంతా ట్రైటర్సు కాదనగలవా.. ”

“ మరి రాజు?”

 

 – వివిన మూర్తి

‘సమైఖ్య’గీతిక అనబడు బిస్కెట్టు కవిత

అవ్వారి నాగరాజు

అవ్వారి నాగరాజు

 

ఈ రోజు  ముఖంలో ముఖం పెట్టి

అంటోంది ప్రేమించవేం ప్రియా ?

“సమైఖ్యం” గా ఉందామని

 

ఫ్రెండ్స్, మనకిక పాట కావాలి ఒక ధూమ్ ధాం లాగా ఒక గద్దర్  గోరటోని లాగా

అన్నీ కుదిరాయి కానీ అదొక్కటే కదా ఇక-

 

చచ్చుపుచ్చు గెంతులు గావుకేకలూ వయస్సు మళ్ళీ ఎముకలు కుళ్ళీ

ఒక్కటీ ఇమడక జవజవలాడక తెర మీద ప్రణయం మాదిరి

ఒక చేత యాసిడ్ సీసా మరో చేత వేట కొడవలి బలవంతప్ప్రేమ లాగా

 

చీచ్చీ ఒళ్ళు తెలియడంలేదు సుమీ

తలుచుకుంటే కొన్ని సార్లు ఒళ్ళు అదుపు తప్పుతుంది సుమీ

ఎండాకాలపు ఒరిపిడిలోనూ ఇగరని జీర పాటల ప్రవాహ సవ్వడి సుమీ తెలంగాణం

 

స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక! స్వవచో వ్యాఘాతం ఉపశమించు గాక!

images1

నిజంగానే ముఖంలో ముఖం పెట్టి మాటాడుదాం

రావేం ప్రియా అని బతిమాలుడుదాం

విడిపోతే ఎలా మనం అని విరహాలు పాటిద్దాం

 

కవి గాయక వైతాళికులను రమ్డోయ్ రారమ్డోయ్ అని నినదిద్దాం

ఒక ప్రణయ గీతికను రాయించి నీ కోసం ప్రత్యేకం అని కన్ను గీటుదాం

చెలియలికట్ట దాటకు చెలీ అని గొంతుక మీద కాలునలాగే కొనసాగిస్తూ మురిపెంగా బుజ్జగిద్దాం

అదీ కాక పోతే చరిత్ర తెలియదా అని శపిద్దాం

పొంగుకొచ్చే బాన కడుపులను

అల్లరిగా కాసేపు దాపెట్టి ఒక్క బిసెట్టు కూడా ముట్టలేదు సుమీ అప్పటి నుండి అని అతిశయంగా గారాలు పోదాం

 

జనం ఎటూ పైకెగయని గొంతుకలు కదా

గాలి పారాడని ఆవరణంలో ముముక్షువులై ముడుచుక పడుకున్న జెండాలు కదా

పొద్దునే లేచి లెక్కలేసుకొని జీవితాన్ని జేబిలో పొందికగా మడచి పెట్టుకో జూసే అకాల స్వప్నాలు కదా

చదువుకొని శిక్షణలు పొంది

కనీస్టూబుల్లలాంటి పంతుల్ల సాంగత్యంలో కారాగారాల్లాంటి కలల్ని కావలించుకొని పడుకొనే అర్భక ప్రాణులు కదా

 

ఇంకా ఇక  ఉద్యోగాలుండవని అరుద్దాం

నీళ్ళుండవ్ నేలుండదు చివరాఖరుకు ముడ్డి  మీద గోసి గుడ్డకూడా అని గావు కేకలు పెడదాం

జనం మీద జనాన్ని బంధిఖానా మీద బంధిఖానాను పోటీగా నిలబెడదాం

జారి పోకుందా ఉండేందుకు

అందరమూ కలిసి

సామూహిక ప్రణయ గీతిక రాద్దామని కాణిపాకం వినాయక సామ్మీద సత్యప్రమాణాలు తీసుకుందాం

 

నిజంగానే ఒక్క ప్రేమలేఖయినా రాద్దాం

కాలపు రేఖలమీద ఐక్యతను విడగొడుతూ ‘సమైఖ్యత’నొక ప్రతీకగా నిలబెడదాం

 

ఈ రోజుటి ముఖమ్మీద

తాగి పడేసిన సీసా గాజుముక్కతో వికృతంగా గజిబిజి ఒక్క ప్రేమ లేఖనయినా-

 

-అవ్వారి నాగరాజు

 

 

 

 

 

 

 

 

 

 

 

పలక మీద పెన్సిల్‌తో రాసిందేమిటి?

rajireddi-1

 రాజిరెడ్డి అంటే ఫలానా అని ప్రత్యేకంగా ఇవాళ పరిచయం చేయనక్కర లేదు.  తెలుగు లో ఇప్పుడున్న మంచి వచన రచయితల్లొ రాజిరెడ్ది ది ఒక ప్రత్యేక శైలి. రాజిరెడ్ది కొత్త పుస్తకం ” పలక-పెన్సిల్” ని సారంగ పబ్లికేషన్స్  తెలుగు సాహిత్యభిమానులకు సగర్వంగా అందిస్తోంది . ఈ పుస్తకం  ఆగస్ట్ 30 వ తేదీ నుంచి  హైదరాబాద్ లోని నవోదయ బుక్స్ లోనూ, అమెజాన్ లోనూ, సారంగ బుక్స్ వెబ్ సైట్ లోనూ అందుబాటులో వుంటుంది. ఈ పుస్తకానికి రాజిరెడ్డి రాసుకున్న ముందుమాట ఇది.  

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అటు వెతికీ ఇటు వెతికీ… అబ్బే ఇది ఉండకూడదనుకొని, ఇది ఉంటే బానే  ఉంటుందనుకొని, ఇందులో ఏముందనుకొని, ఏదో కొంత ఉన్నట్టే ఉందనుకొని…
జర్నలిజంలోకి వచ్చిన ఈ తొమ్మిదేళ్లలో సందర్భాన్ని బట్టి రకరకాల ‘వ్యాసాలు’ రాశాను. ఎన్ని రాసినా అన్నీ పుస్తకంగా వేయాల్సిన అవసరం లేదు. కొన్నింటికి ‘టైమ్‌బౌండ్‌్‌’ ఉంటుంది. కొన్నింటికి పుస్తకంలో రావాల్సినంత ‘అర్హత’ ఉండదు. కొన్ని బాగున్నా మ్యాగజైన్‌ ప్రెజెంటేషన్‌లో ఉన్న వీలు ఇందులో ఉండదు. అలా నాకు నేనే వడగట్టుకుని ఈ ఐటెంస్ ను షార్ట్‌ లిస్ట్‌ చేశాను.
ఇంకోలా చెప్పాలంటే, ఏ ఆదివారపు మధ్యాహ్నమో సోమరిగా కూర్చుని, ఫొటో ఆల్బమ్‌ తిరగేస్తుంటే, నిజంగా అప్పుడు మనం బాగుండేవాళ్లం అనిపిస్తుంటుంది చూడండి… అలా నా ‘రాతప్రతులను’ తిరగేస్తుంటే, నిజంగానే నేను అప్పుడు బాగా రాసేవాడిని అనిపించి ముచ్చట గొలిపినవే ఇందులోకి వచ్చాయి.
రాయడం అంటే నాకు వణుకు పుడుతుంది. ఐటెమ్‌ ఎలా వస్తుందోనన్న టెన్షన్‌! బాహ్య ఒత్తిడిలో రాసినవి కొన్ని. అంతర్గత ఒత్తిడి నుంచి రాసినవి కొన్ని. మొదటిది బాధ్యత. రెండోది సహజం.
అయితే ఎంత సహజమైన ప్రక్రియకైెనా కొంత కృత్రిమత్వపు సహకారం అవసరం. అలాగే, ఎంత కృత్రిమంగా మొదలుపెట్టినదానిలోనైనా రాస్తూవుంటే మనకు తెలియకుండానే వచ్చిచేరేది ఉంటుంది, ఇలా రాయబోతున్నామని మనక్కూడా తెలియనిది. అదే అందులోని సహజత్వం.
ఈ ఆర్టికల్స్‌ను నాకు నేనే ముచ్చట పడటానికి ఇవి రెండూ కారణాలు.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే, ఇవన్నీ ఏమిటి?
మనం ఒకటి రాస్తాం. అది ఏదైనా కావొచ్చు. అది ఒకటి. అంతే. రాశాక, అది కవిత్వం అవుతుందా? కథ అవుతుందా? వ్యాసం అనొచ్చా? లేకపోతే ఇంకేం అనొచ్చు? ఇలా ఉంటుంది మన ఆలోచన. అసలు దాన్ని ఏదో ఒక పరిధిలోకి ఎందుకు ఇమడ్చాలి? అది దానికదే స్వతంత్రం ఎందుకవదు? మన వేళ్లు పట్టుకుని ఇంతదూరం నడిపించిన  పాత ప్రక్రియలను నిరసించడానికి నేను ఇది చెప్పట్లేదు. అంత సాహసం కూడా చేయను. నేను రాసిందానికోసం ఈ మాట అనవలసి వస్తోంది.

…తుపాల్‌…

అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
కానీ సమస్యేమిటంటే,
నాకు ఒక పుస్తకం చదువుతుండగానే రివ్యూ ఫామ్‌ అవుతూ ఉంటుంది, అది నేను అదే ఉద్దేశంతో చదువుతుంటే గనక. ఎలా ఎత్తుకోవాలి, ఎలా ముగించాలి, ఏమేం రావాలి… అనేది నాకు ఐడియా వచ్చేస్తూనే ఉంటుంది. అలాగే ఈ పుస్తకం వేద్దామనుకున్నప్పట్నుంచీ ముందుమాట ఇలా రాయాలి, ఇది మెన్షన్‌ చేయాలి, అని రకరకాలుగా ఆలోచించాను. కానీ పుస్తకంలో ఏమేం రావాలి, అన్నది తేల్చుకోవడానికి నాకు చాలా కాలం పట్టింది. ముందు అనుకున్న వెర్షన్స్‌ మారిపోయాయి. దీంతో నోట్స్‌ ఏమో ఉంది. ముందుమాటేమో లేదు. అందుకే ఈ తిప్పలు.
రాయకుండా కూడా వదిలేయొచ్చు. కానీ రచయిత నోటితో అదెందుకు రాశాడో, ఏం ఆలోచించాడో తెలుసుకోవడం నాకు బాగుంటుంది. ఏ పుస్తకాన్నయినా నేను ఈ ముందుమాటలు పూర్తిచేశాకే మొదలుపెడతాను. దీనివల్ల కూడా రచయిత రుచి ఏమిటో నాకు తెలుస్తుంది.
కానీ నాకు నిజంగానే రాయడం అంటే వణుకు పుడుతుంది. రాయకుండా  ఉండగలిగే శక్తి  ఉంటే నేను ఇంకా ప్రశాంతంగా బతకగలను. కానీ ఉండలేను. కాబట్టి ప్రశాంతంగా బతకగలిగే అదృష్టం నాకీ జన్మకు లేదు.
జిడ్డు కృష్ణమూర్తి మీదా, జలాలుద్దీన్‌ రూమీ మీదా, స్వామి వివేకానంద గురించీ, రాహుల్‌ సాంకృత్యాయన్‌ గురించీ, ఇంకా, బి అంటే బ్లాగు, భూటాన్‌ జీవనశైలి (చిన్నదేశం పెద్ద సందేశం)… ఇలా కొన్ని ‘నేను’లు, కొన్ని కవర్‌ స్టోరీలు, మరికొన్ని ఇంకేవో రాశాను. మొదట్లో చెప్పి నట్టు నాకు నేనే ముచ్చటపడగలిగే అర్హత ఉంది వీటికి. కానీ ఇవన్నీ నేను పుస్తకంగా వేయాల్సిన అవసరం ఉందా? నా ఉద్దేశం అవి నేను మాత్రమే చెప్పగలిగినవా? ఇదింకా పొగరు వాక్యంలాగా కనబడుతున్నట్టుంది. మరోసారి ‘తుపాల్‌’ను ఆశ్రయించాల్సి వచ్చేట్టే ఉంది.
తుపాల్‌ అనేది మావైపు పిల్లల ఆటల్లో వినిపించే పదం. ఆటలో ఏదైనా తప్పు జరిగినప్పుడు ఈ మాటంటే ఆ తప్పు తప్పు కాకుండా పోతుంది. చూడండి చిత్రం! ఎంతో గంభీరంగా మొదలుపెడదామనుకున్న ముందుమాట… పుస్తకం టైటిల్‌కు తగ్గట్టే పిల్లవాడు రాసి కొట్టేసినట్టే అయింది.

Palaka-Pencil Cover (2)

 

*

ఓం నమ:శివాయ.
అవునుగదా, ఇవి పుస్తకంగా ఎందుకు వెయ్యకూడదు?
ఈ ఆలోచన వచ్చిన క్షణం నుంచీ నా ప్రాణం ప్రాణంలో లేదు.
అయితే, ఈ పుస్తకం వేయాలనుకున్నప్పటినుంచి నా మానసిక స్థితి రకరకాలుగా మారుతూ వచ్చింది. చివరకు ‘నా’, ‘నేను’ ఈ కోవలోకి వచ్చేవే పుస్తకంలోకి రావాలనుకున్నాను.
ఇందులో దాదాపు అన్నీ సాక్షి ‘ఫన్‌డే’, ‘ఫ్యామిలీ’ల్లో అచ్చయినాయి. ఒకటి ఈనాడు ‘ఆదివారం అనుబంధం’లోది. ఎటూ డైరీ మాట వచ్చింది కాబట్టి, అది ఇందులో చేర్చితే బాగుంటుందనిపించింది. ఒకట్రెండు నేరుగా పుస్తకం కోసమే రాశాను. వీటన్నింటి రచనాకాలం 2007 నుంచి 2011.
అం­తే, నా మొదటి పుస్తకం ‘మధుపం’లాగా వీటన్నింటినీ జనరలెైజ్‌ చేయగలిగే అంతఃసూత్రం ఒకటి లేదు. కొన్ని నాస్టాల్జియా, కొన్ని స్వీయ ఘర్షణకు సంబంధించినవి, కొన్ని సహజంగానే స్త్రీ సంబంధిత ఫీలింగ్స్‌. అలాగే వీటి పొడవు కూడా ఒకటి అరపేజీకి సరిపోతే, ఇంకోటి నాలుగు పేజీలుంటుంది. ఈ వైరుధ్యాన్నీ, వైవిధ్యాన్నీ ప్రతిఫలించేట్టుగా పుస్తకం పేరు, క్యాప్షన్‌ ఉండాలనుకున్నాను.
పుస్తకం ఆలోచన వచ్చినప్పట్నుంచీ ఎందుకో ‘పలక’ నా మనసులోకి జొర బడిరది, టైటిల్‌ తన మీద ఉండేట్టు చూడమని. బాల్యపు రాతలు ఉండటం వల్ల కాబోలు!
అందుకే, పలక బలపం అనుకున్నా.
కానీ ఇందులో పూర్తిగా బాల్యమే లేదు.
తర్వాత, పలక కలం, పలక పెన్ను… ఇలా కూడా ఆలోచించాను. ఎక్కడో తంతోందని తెలుస్తోందిగానీ ఒకటి ఎందుకో గుర్తేరాలేదు. ఆ మాట తట్టగానే, ఇదే కరెక్ట్‌ టైటిల్‌ అనిపించింది.
పలక పెన్సిల్‌…
దానికీ దీనికీ ఏ సంబంధవూ లేదు, ఒక విధంగా.
ఇంకో విధంగా చూస్తే రెండూ పిల్లవాడికి అపురూపమైన విషయాలు.
ఇంకా పిల్లాడే(పలక), కానీ ఆ పిల్లతనాన్ని దాటి(పెన్సిల్‌) కూడా కొన్ని మాట్లాడు తున్నాడు, అనేది కూడా ఈ టైటిల్‌ ఎన్నుకోవడంలో మరో ఉద్దేశం.
ఇంకా ముఖ్యంగా, సమీర అన్నట్టు, ‘పలక పెన్సిల్‌ అంటే బలపం కదా!’
ఎగ్జామ్‌లో ఆన్సర్‌ తప్పు రాశానని తెలిసినా, దిద్దుకోవడానికి ఇష్టపడనంత విచిత్రమైన అలవాటు నాది. దిద్దితే పేజీ ఖరాబు అవుతుందనిపిస్తుంది. మొట్టమొదటగా  అప్రయత్నంగా ఏది వచ్చిందో, అదే ఫైనల్‌. ఇదీ అంతే. సూట్‌ అయ్యిందో లేదో నాకు తెలియదు.
ఇంకా, మగవాడి డైరీ!
ఒక విధంగా ‘డైరీ’ అనడం కరెక్టు కాదు.
కానీ డైరీ రాతల్లో ఒక క్రమం ఉండదు. ఏదైనా రాసుకోవచ్చు. ఈ ఆర్టికల్స్‌ కూడా ఏదైనా మాట్లాడుతాయి. అన్నింటికంటే ముఖ్యంగా, వ్యక్తిగత కోణం ఉండటంవల్లే దీన్ని డైరీ అనగలిగాను. ఇది అంత అర్థవంతమైన పనేమీ కాకపోవచ్చు, అలాగని పూర్తి అర్థరహితం కూడా కాకపోవచ్చు.
మూడో భాగంలోవి మినహా, ఈ ఐటెమ్స్‌ దేనికదే విడిగా రాసిందే అయినా, పుస్తకంలో వాటి క్రమం కోసం ఒక ‘థీమ్‌’ పాటించాను. తొలి అడుగు వేసి, ‘అంమ’ అంటూ మొదటి మాట పలికి, మా ఊరి ముచ్చట్లు చెప్పి,  ప్రేమ గురించి మాట్లాడి, ప్రేమలో పడి, సంసారం, పిల్లల గురించి ఒకట్రెండు మాటలు చెప్పి, ఆ అనుభవంతో కొంత జ్ఞానం సంపాదించి, అటుపై మరణంతో ముగిసేట్టుగా.
ఆర్టికల్‌ చివర్లో మధుపంలో లాగే, నేను వేరే సందర్భాల్లో రాసిన, రాసుకున్న వాక్యాలను ఫుట్‌కోట్‌గా ఇస్తున్నాను. దీనివల్ల ఆ ముచ్చటపడ్డానని చెప్పిన వాటిల్లోని ఒకట్రెండు మాటలైనా పుస్తకంగా రికార్డు చేయగలిగానన్న తృప్తి ఉంటుంది నాకు. అయితే, ఎందులోంచి ఏది తీసుకున్నానో వివరాలు ఇవ్వట్లేదు. బోర్‌. నాకూ మీకూ.
అలాగే, ఇలా ఫుట్‌ కోట్‌ ఇవ్వడం వల్ల ప్రధాన ఐటెమ్‌ ఇచ్చిన భావనను కాసేపు అట్టే నిలుపుకోగలిగే అవకాశం పోతుందని తెలుసు. కానీ రీ`రీడిరగ్‌ (ఆ అర్హత   ఉంటే) లో అది మీరు పొందగలిగే అదనపు వాక్యం అవుతుంది.
త్వరగా మొదలై, ఆలస్యంగా ముగిసిపోయే వేసవికాలపు పగలులాగా (నిజానికి ముందు రాసుకున్న వాక్యం… ఆలస్యంగా మొదలై, , త్వరగా వ­గిసిపోయే శీతాకాలపు రోజులాగా) ఈ పుస్తకం వేయాలన్న ఆలోచన త్వరగా వచ్చింది. పని మాత్రం ఆలస్యంగా పూర్తయ్యింది. ఇదీ మంచిదే అయ్యింది. ‘పదాలు పెదాలు’ ఇందులోకి రాగలిగాయి. నిర్ణయం తీసుకోలేకపోవడం కూడా ఒక్కోసారి మంచే చేస్తుందన్నమాట. పదాలు`పెదాలు గురించి ప్రత్యేకంగా రెండు మాటలు. పత్రికలో పనిచేసేవాడిగా అవసరం నిమిత్తం ఏమైనా రాయవలసి రావచ్చు. ఇందులో ఉన్న ప్రతిదీ, నేను ఎంతో ఇష్టంగా రాసినప్పటికీ, అది రాయడానికి ఒక కారణమో, ఏదైనా సందర్భమో ఉంది. అలా కాకుండా ఏ అవసరంతోనూ, ఏ కారణంతోనూ పని లేకుండా, కేవలం రాయడం కోసమే రాసిన ఖండికలు ఈ పదాలు`పెదాలు.
ఏదేమైనా, ఈ పుస్తకానికి సంబంధించి ఈ ‘సాక్షి’ ఫ్యామిలీకి కృతజ్ఞతలు చెప్పడం, నా ఫ్యామిలీని తలుచుకోవడం నా కనీస ధర్మం.
వై.ఎస్.భారతి గారు
సజ్జల రామకృష్ణారెడ్డి గారు
వర్ధెల్లి వ­రళి గారు
ప్రియదర్శిని రావ్‌ు గారు
ఖదీర్‌ గారు
ఇంకా, అన్వర్‌ గారు
నేను నూటారెండు సార్లు రివైజ్డ్‌ అంటూ కాపీ పంపినా విసుక్కోకుండా ముందుమాట రాసిన అఫ్సర్‌ గారు
ఆప్తవాక్య మిత్రుడు భగవంతం
మల్లేష్‌
అనూష
ఇప్పుడు నాతో టీ, లంచ్‌ పంచుకుంటున్న సహచరులు
నా అక్షరం కనబడగానే బైలైన్‌ వెైపు చూడగలిగే ఆత్మీయులు
కనీసం మెయిల్‌ పరిచయమైనా లేకుండానే పుస్తకం రావడానికి కారకులవుతున్న ‘సారంగ’ రాజ్‌ గారు
కేవలం తన చొరవతో ఈ పుస్తకాన్ని సాధ్యం చేస్తున్న కల్పనా రెంటాల గారు
కనీసం పదిసార్లయినా ఫైనల్‌ కరెక్షన్స్‌ చేసిన అక్షర సీత గారు
నాతో కలిసి ‘తా’, ‘దు’ పెరుగుదల చూస్తున్న నర్మద
నా పెరుగుదల కూడా అలాగే చూసివుండిన అమ్మ, బాపు.
చిట్టచివరిగా…
బాధకు స్థాయీ భేదం ఉండదనుకుంటే… ఒక అక్షరదోషం గురించి శ్రీశ్రీ ‘అనంతం’లో పదేపదే బాధపడతాడు. దాని తీవ్రత తొలి పుస్తకం అచ్చువేశాకగానీ అనుభవంలోకి రాలేదు.
సమయం దొరికినప్పుడల్లా మధుపాన్నిమురిపెంగా తిప్పితే ఎన్నిసార్లు తిప్పినా  బాగుందనిపించేది. మన పుస్తకం మనకు బాగుందనిపించడంలో వింతేముంది! రీ ప్రింట్‌ చేసినప్పుడు ఎక్కడైనా మార్చవచ్చు అనుకుంటే పక్కన రాసిపెడుతున్నాను. శ్రీశ్రీలా నాకు అక్షరదోషాలకు బాధపడాల్సిన బాధ తప్పిందనుకున్నా. కానీ ఎలా మిస్‌ అయ్యిందో ఇండెక్సులోనే తప్పు వచ్చింది. బ్యాచిలర్‌కు బదులు బ్యాచిలచ్‌. నేను గమనించినంత వరకూ ఇంకోటి ఫుట్‌కోట్‌లో ఉంది. కెమిస్ట్రీ బదులుగా కెమిస్త్రీ. అలాగే ‘పేర్లుండవు’లో డ, ‘దొరకలేదు’లో ర అక్షరాలు ఎగిరిపోయాయి. దీనివల్ల మరింత జాగ్రత్తగా పుస్తకం ప్రూఫ్‌ చూడాలనే జ్ఞానం రాలేదుగానీ, ఎవరి పుస్తకంలోనైనా ఒకటీ అరా అక్షర దోషాలుంటే క్షమించేసే ధోరణి అలవడింది.
ఇంకొక్క మాట చెప్పి ముగించేస్తాను. మేము ­ సాక్షి ఆఫీసులో వాడే పత్రిక అనే ఓ సాఫ్ట్‌వేర్‌లో 16 సైజులో పెడితే ఏర్పడే అక్షర స్వరూపం నాకు కంటికి ఇంపుగా  ఉండదు. 14 పెట్టినా నాకు నచ్చదు. 15లోనే నాకు హాయి­. ఏమిటి దానికే ఆ పర్టిక్యు లారిటీ? మిగతావారికి ఇలా ఉండకపోవచ్చు. అది నా వ్యక్తిగత సమస్యే అనుకుంటాను.
ఇప్పుడు ఈ పాత ఐటెమ్స్‌ అన్నింటినీ అచ్చు వేయకపోతేనేం? అంటే, ఏమో!   నాకు ‘15’లో కనబడేదేదో మీకు కనిపించొచ్చు, అన్న సంశయలాభంతోనే వీటిని మీ ముందుకు తెస్తున్నాను.
మరీ చిన్న పిల్లాడి మారాం అనుకోనంటే ఇక ఇది చివరివాక్యం.
అసలు ఏ మనిషైనా ఎదుటివాళ్లతో తానేమిటో ఎందుకు వ్యక్తపరుచుకోవాలి?  ఈ ప్రశ్న ఎన్నాళ్లుగానో నన్ను వేధిస్తోంది. నేను సమాధానపడగలిగే జవాబు ఇప్పటికీ దొరకలేదు.
తద్విరుద్ధంగా, ఒక రసాత్మక వాక్యాన్ని నాకోసం ఏ పుస్తకంలోనో అట్టిపెట్టి, నేను వెతుక్కోగలనా లేదా అని తమాషా చూసే రచయితతో, దొరికింది చూసుకో అని నేను చిలిపిగా నవ్విన క్షణం… నా జీవితంలో అత్యంత విలువైన క్షణం.
అలాంటి ఏ ఒక్క క్షణాన్నయినా మీకివ్వగలిగితే ఈ పిల్లాడి మారానికి ఏమైనా అర్థముంటుంది. పుస్తకం వేయాలన్న నిర్ణయం సరైనదైపోతుంది.

—పూడూరి రాజిరెడ్డి

ఒక తరానికంతా ఆమె కౌన్సిలర్!

మాలతీ చందూర్ ౩౦ వ దశాబ్దపు తొలి సంవత్సరంలో జన్మించారు. మన దేశానికి స్వాతంత్రం వచ్చేనాటికి ఆమె పదిహేడు సంవత్సరాల ఆధునిక యువతి. ఒక విశాలమయిన అర్థంలోనయినా ‘ఆధునికత’ అంటే చెప్పుకోవటం అవసరం. వ్యక్తికీ, వ్యక్తి కోరికలకూ, ఆకాంక్షలకూ ప్రాధాన్యత పెరగటం, స్త్రీపురుషులిద్దరికీ వ్యక్తులుగా గౌరవం, హుందాతనం దొరకాలనే భావాలు  ఏర్పడటం, స్వేచ్చ, స్వతంత్రతల గురించి, హక్కుల గురించి స్పృహ కలగటం, మానవుల బాధలు కేవలం వారి నుదుటి రాతలు, కర్మలే కాదనీ, ఆ బాధలను కొన్ని ప్రక్రియల ద్వారా తొలగించుకునే అవకాశాలున్నాయనే గ్రహింపు, హేతుబద్ధతకు విలువనివ్వటం, విశాలార్థంలో మానవులంతా సమానమనే భావన, ఈ భావనలకు అడ్డు వచ్చే సంప్రదాయాలను, ఆచారాలను నిరసించటం, ధిక్కరించటం వీటన్నిటినీ స్థూలంగా ఆధునికతగా చెప్పుకోవచ్చు.

5666_062

1947 వ సంవత్సరం, అంటే భారతదేశం స్వతంత్రమయ్యే నాటికి ఏలూరులో స్కూల్ ఫైనల్ పూర్తి చేసిన మాలతి 50 లలో మద్రాసు వచ్చారు. అప్పటి నుంచీ ఆమె సాహిత్య జీవితం ఆరంభమయింది. అప్పుడు మద్రాసు తెలుగు సాహిత్య సాంస్కృతిక రంగాలకు కేంద్రం గా వుంది. ఆకాశవాణి అక్కడే వుంది. కృష్ణశాస్త్రి, శ్రీశ్రీ, ఆరుద్ర, కొడవటిగంటి, పటాభి, బాపు, ముళ్ళపూడి వెంకట రమణ, భమిడిపాటి మొదలయిన రచయితలంతా అక్కడే వున్నారు. ఇంకో వేపు స్త్రీల పరిస్తితి గురించి, అభివృద్ధి గురించి దేశమంతా ఆలోచిస్తున్న కాలం.

మాలతి మంచి పాఠకురాలు. పుస్తక పఠనం ఆమెకు వ్యసనం. ఆ వ్యసనం ఎంత తారాస్థాయిలో ఆమెకు వంట బట్టిందంటే మొత్తం తెలుగు వారందరికీ ఆ వ్యసనాన్ని అంటించాలని ప్రయత్నిచిందావిడ.  తాగండి, తాగండి, ఈ సాహిత్యామృతాన్ని. అనేక జీవితానుభవాలను పిండి, ఫర్మంట్ చేసి వడగట్టిన జీవనామృతం ఇది. ఒక్క సారి తాగితే ఒదిలిపెట్టరు –అంటూ ఆ రుచిని పరిచయం చెయ్యటానికి మాలతి నడుం కట్టుకున్నది. ఆ ప్రపంచ సాహిత్య పఠనం ఆమెలోని రచయిత్రికి తొలి పాఠాలు నేర్పింది.

50 లలో దేశం స్వతంత్రమయ్యాక కొత్త తరంలో ఎన్నో ఆశలూ, ఆధునికతకు ఎన్నో నిర్వచనాలూ, జీవితాలను మార్చుకోవాలని, తీర్చి దిద్దుకోవాలని తపనలూ, నగరాలలో కొత్త పరిసరాలలో వచ్చే వైరుధ్యాలను పరిష్కరించుకోవటమెట్లా, తమని తాము కొత్త పద్ధతులలో సంస్కరించుకోవటమెట్లా అని సతమతమయ్యే యువతరానికి ఒక మంచి సలహాదారు, కౌన్సిలరు, తమకు దూరంగా ఉంటూ తమ జీవితాల్లో కొద్దిగా తొంగిచూచి మంచి మాట చెప్పే పెద్దదిక్కు కావలసి వచ్చింది. సమష్టి కుటుంబాల్లో పెద్దల మాటలూ సలహాలూ క్రమంగా పోతున్నాయి. సమస్యలు, సందేహాలు పెరుగుతున్నాయి. ఎవరితోనయినా పంచుకోకపోతే అవి వాళ్ళని నిలవనీవు. ఆ స్థితిలో ‘ప్రమదావనం’ శీర్షిక అందుకే అంత విజయవంతమయింది. మాలతి చందూర్ కి అంత కీర్తి వచ్చింది. సినిమా తారలకు సమానమయిన గ్లామర్ ఆవిడ సంపాదించటానికి ఆ శీర్షిక కారణమయింది.

ఓల్గా

పద్యం ‘పల్స్’ విజయ్ కి తెలుసు!

దేశరాజు

దేశరాజు

నగరానికి చేరుకోవడమే ఒక విషాదమా ? …. ఏమో చెప్పలేము !

ఉన్న వూరు పదిలంగా లేకపోవడం వల్లనే ఎవరైనా నగరం చేరుకుంటారు. పది కాలాలపాటు సుఖంగా వుండేందుకు  అన్నీ సమకూర్చుకుంటారు. అన్నీ అమరినా ఎండమావి లాంటి ఆ సుఖం ఎప్పటికీ దరి చేరదు. అలవాటు పడిపోయిన నగర జీవి ఈ సాలెగూడుని చేదించుకుని బయటకు వెళ్ళ లేడు. ఆ స్థితి లోనే ఒక పద్యం జన్మిస్తుంది. అయితే, అది మృత పద్యం కావొచ్చు. లేదా, మృత ప్రాయంగా మారిపోతున్న నగర పద్యం కావొచ్చు.  పద్యం పల్స్ ని కరెక్ట్ గా పట్టుకోగలిగిన వాడే అసలైన కవి. అలాంటి అసలు సిసలైన కవి కోడూరి విజయకుమార్.

తన మూడో కవితా సంపుటి ‘అనంతరం’ ను ‘నగరం లో పద్యం మరణిస్తుంది’ అంటూ శాపనార్థాలతో ప్రారంభిస్తాడు. ‘Clearly, then the city is not a concrete jungle, it is a human zoo’   అంటాడు, Desmond Morris  అనే సామాజిక శాస్త్రవేత్త. మృగ తృష్ణ తో సంచరించే ఈ జూ లో కవి యెప్పుడూ  అంతర్మథనం తో నలిగిపోతూనే వుంటాడు.  అందుకే, విజయకుమార్ ఇందులోంచి బయటకు గెంతేయ్యాలని చూస్తాడు. అలా చేయలేక పోతున్నందుకు తనను తానే నిందించు కుంటాడు.

60051_703360903013918_1420695648_n

నిజానికి నగరం ఒక బందీఖానా అనే సూచన తన రెండవ కవితా సంకలనానికి ‘ఆక్వేరియం లో బంగారుచేప’ అని పేరు పెట్టడం లోనే అందించాడు. ‘అనంతరం’ కు వొచ్చేసరికి ఆ భావన మరింత విస్తృతమైంది. అందుకే కేవలం ఒక పద్యంతోనే తృప్తి చెందలేదు. ’40 ఇంచుల కల’, ‘నగర జీవితమూ-శిరచ్చేదిత స్వప్నాలూ’, ‘జలపాశం’, ‘ఒక మహానగర విషాదం’, ‘నగర వీధిలో ఎడారి ఓడ’ … ఇలా ఒక అర  డజను  పద్యాస్త్రాలను సంధించాడు. నగరాన్ని ఎంతగా ద్వేషించాడో, ఊరిని అంతగా ప్రేమించాడు. ఆ వూరి లోని మనుషులనూ, బంధువులనూ అక్కున చేర్చుకోవాలని ఉవ్విళ్ళూరాడు. పెనాన్ని కాదని పొయ్యిపై మోజు పడిన ‘డాలర్లను ప్రేమించిన మిత్రుల ‘ ను చూసి ఆవేదన చెందాడు. ఆ మిత్రుల్లోని గురివిందల ‘గ్లోబల్ సూత్రాల’ ని అవహేళన చేసాడు.

ఎప్పటికప్పుడు వెదర్ రిపోర్ట్ అందించే బాధ్యతను తన తొలి కవితా సంపుటి ‘వాతావరణం’ నుండే చేపట్టిన విజయకుమార్  ఇప్పుడు నగరం ‘అనంతరం’ ఇంకా ఏమయినా ఉన్నట్టా? …. లేక, ఇక ఏమీ లేనట్టా?  అని నిలదీస్తున్నాడు.  ‘సీతాకోక చిలుక రూపాన్ని కోల్పోతూ / గొంగళి  పురుగులా  మారిపోతున్న రహస్యం’ తెలుసుకోమని హెచ్చరిస్తున్నాడు. ఈ జూ లోంచి బయటపడే మార్గమేదో మీరు కనిపెట్టగలిగితే అతనికి కొంచెం చెప్పండి.

(కోడూరి విజయకుమార్ కవితాసంపుటి ‘అనంతరం’ కు 2011 సంవత్సరం తెలుగు విశ్వ విద్యాలయం సాహితీ పురస్కారం లభించిన సందర్భంగా )

 

-దేశరాజు

ప్రాంతీయత వల్ల కథ విశాలమయింది: కేతు

ketu

కర్నూలు సిల్వర్ జూబ్లీ కళాశాలలో ఆగస్ట్  2, 3 తేదీలలో “తెలుగు కథ- ప్రాంతీయ అస్తిత్వం” అనే అంశంపై జాతీయ స్థాయి సదస్సు జరుగుతోంది. ఈ సదస్సు వర్తమాన తెలుగు కథకి సంబంధించి అనేక కీలకమయిన అంశాలను చర్చకు తీసుకురానున్నది. ఈ సదస్సులో ప్రసిద్ధ విమర్శకులు కేతు విశ్వనాథ రెడ్డి గారు కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ సందర్భంగా కేతుతో ఈ ముఖాముఖి:

q సాహిత్యంలో ఇప్పుడు కథా యుగం నడుస్తోందనే వాదనను మీరెలా సమర్ధిస్తారు?

సాహిత్యంలో యుగ విభజన వ్యక్తుల పరంగా గానీ, ప్రక్రియల పరంగా గానీ  నాకిష్టం లేని మాట. మీ ప్రశ్నలోని అంతరార్థాన్ని బట్టి చూస్తే కవిత్వం కంటే కథా రచనకు ఆదరణ ఎక్కువైనదనుకోవాలి. లేదా కథా రచన పట్ల, కథా పఠనం పట్ల ఆసక్తి పెరిగిందనుకోవాలి. దీనికి కారణం వచన వ్యాప్తి. కవిత్వంలో ఇమడ్చలేని ప్రజల ఆకాంక్షలను, మానవ సంబంధాలను, అనుభవాలను స్వీయానుభావాన్నుంచి, పరిశీలన నుంచి, జ్ఞానం నుంచి చిత్రించాలనే కథా రచయితల ఆర్తి. వచన వ్యాప్తి అంటున్నామంటే మనం మాట్లాడుకునేది వచనం. బోధనలో వచనం. ప్రసార సాధనాల్లో ఎక్కువగా అందిస్తున్నది వచనం. నిర్ణీత ప్రయోజనాల కోసం మనం వాడేది వచనం. ఇంత వచన వ్యాప్తి వున్నప్పుడు సృజనాత్మక రచయితలు కూడా తమ అభివ్యక్తికి వచనాన్ని ఒక వాహికగా ఎంచుకోవడంలో ఆచ్చర్యం లేదు. అట్లని కవిత్వం వెనకబడినట్లు నా ఉద్దేశం కాదు. కవిత్వ సంకలనాలు చాలా వస్తున్నాయి. కవిత్వ వస్తువు మీద, రూపం మీద శ్రద్ధ వున్న మంచి కవులు మనకు లేకపోలేదు. ఐతే కొత్త కొత్త సామాజిక వర్గాల నుంచి, ప్రాంతాల నుంచి, ఉప ప్రాంతాల నుంచి చదువుకున్న వారి సంఖ్య పెరిగింది. వారిలో కొందరు సృజనాత్మక కల్పనా సాహిత్యం మీదా, ముఖ్యంగా కథల మీద మునుపటి కంటే ఇప్పుడు ఎక్కువ శ్రద్ధ పెడుతున్నారు.

q సాధారణంగా ఏ వాదమైనా లేక ఉద్యమమైనా మొదట కవిత్వంలో విస్తరించి ఆ తరువాత ఇతర ప్రక్రియల్లోకి వ్యాపించే ఒక భూస్వామిక    లక్షణం తెలుగు సాహిత్యంలో ఉంది.  ఈ కోణంలో ప్రాంతీయ  అస్తిత్వ కథలు వస్తున్న విషయాన్ని ఎట్లా అర్థం చేసుకోవాలి?

ఇది భూస్వామిక లక్షణం కాదు. కాక పోతే కవిత్వానికి ఉన్నంత చరిత్ర కవిత్వేతర ప్రక్రియలకు లేదు. ఉద్యమాలకు కవులు తక్షణం స్పందిస్తారు. వారి గాఢమైన ఆవేశ బలం కావచ్చు. కవిత్వ నిర్మాణానికి అవసరమయ్యే స్పందనల చిత్రణ శబ్ద చిత్రాల రూపంలోనో, భావ చిత్రాల రూపంలోనో, భావ శబలత రూపంలోనో అది వ్యక్తం అవుతుంది. ఇతర వచన ప్రక్రియలకు ఇది కొంత ఆలస్యంగా విస్తరిస్తుంది. ప్రాంతీయ అస్తిత్వ కథల విషయంలో కూడా ఇది వాస్తవం. దీనికి కారణం ఈ అస్తిత్వ కథ లాంటివి తక్షణ స్పందనకు వీలైన నిర్మాణాలు కాదు.

q ప్రాదేశిక నిర్దిష్టతతో తెలుగు కథను ఎట్లా చూడాలి?

తెలుగు సాహిత్యకారులు, విమర్శకులు సాధారణంగా మూడు మాటలు వాడుతుంటారు. అవి స్థానీయత, ప్రాదేశికత, ప్రాంతీయత. స్థానీయత కంటే ప్రాదేశికతకు, ప్రాంతీయతకు మరింత విశాలమైన నేపథ్యం వుంటుంది. ప్రాదేశికత, నిర్దిష్టత అంటున్నప్పుడు ప్రధానమైన ఆరేడు లక్షణాలని మనం దృష్టిలో ఉంచుకొవాలి. 1. ప్రదేశం/ప్రాంతం, భౌతిక జీవితం . అంటే భౌగోళిక స్థితిగతులు, పర్యావరణం, జలవనరులు, అటవీ సంపద, వృక్ష సంపద, ఖనిజ, ఇంధన సంపద, నేల తీరులు, వర్షపాతం, పంటలు, కరువు కాటకాలు, వరదలు వీటి మధ్య ప్రాంతీయ, ఉప ప్రాంతీయ భేదాలు . 2. సామాజిక శ్రేణులు, (మతం, కులం, ఉపకులాలు, తెగలు)సామాజిక విభజన, సామాజిక వైరుధ్యాలు, అసమానతలు, ఆదిపత్య వర్గాల వైఖరులు, ప్రతిఘటనలు, ఉద్యమాలు. 3. వ్యవసాయ, వ్యవసాయేతర రంగాలు. చలనం, అభివృద్ధి, స్వభావం, పరిశ్రమలు, వ్యవసాయం, వృత్తుల సంక్షోభం, చరిత్ర, ఇటీవలి సామాజిక పరిణామాలు. 4. భాష, అధికార భాష, భాషా భేదాలు, మాండలికాలు, ఉపమాండలికాలు, ఆదివాసి భాషలు, అన్యభాషా వ్యవహర్తలు. 5. మహిళా సమస్యలు. 6. సాంస్కృతిక పరమైన అంశాలు, తిండి తిప్పలు, వేష ధారణ, సంప్రదాయాలు, మత విశ్వాసాలు, పండగలు, కళా సాహిత్య రూపాలు. 7. ఒక నిర్దిష్ట ప్రాంతం నుంచి ప్రవాసం వెళ్ళిన వారి అస్తిత్వ సమస్యలు. ఈ అంశాలు ప్రాదేశిక నిర్దిష్టతను ఎత్తి చూపుతాయి. ఈ దృష్టితో తెలుగు కథల్లో ఏ మేరకు ఆ ప్రతిఫలనం జరిగిందో మనం పరిశీలించవచ్చు.

Kethu Viswanatha Reddy

q ప్రాంతీయ అస్తిత్వాన్ని ఎలా నిర్వచించాలి? ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో కథలు వెలువడడం ముందడుగా? వెనుకడుగా ?

అస్తిత్వం అనే మాటను మనస్తత్వ శాస్త్రజ్ఞులు, సామాజిక శాస్త్రజ్ఞులు , తత్వశాస్త్రజ్ఞులు  నిర్వచిస్తున్న క్రమంలో అస్తిత్వం వ్యక్తి జీవ లక్షణం, జన్యు లక్షణం, జన్యుప్రేరితం, గాయపడిన వ్యక్తి స్వభావం, సామాజిక ప్రాంతీయ సాలిడారిటికి సంకేతం అని కూడా భావిస్తున్నారు. అస్తిత్వం అనే మాటకు ఉనికి, గుర్తింపు అనే అర్థాలున్నాయి. “ఐడెంటిటి” అనే  ఇంగ్లీష్ మాటకు సమానార్థకంగా అస్తిత్వం అనే మాటను విరివిగా ఉపయోగి స్తున్నారు. ఉదాహరణకు దళిత అస్తిత్వం, మైనారిటీ అస్తిత్వం, మహిళల అస్తిత్వం, ప్రాంతీయ అస్తిత్వం. ఒక భౌగోళిక ప్రాంతం లేదా ఉప ప్రాంతంలోని లేదా భాషా ప్రాంతంలోని ప్రత్యేక లక్షణాలను, భావాలను, విశ్వాసాలను ప్రతిఫలించే నిర్దిష్ట లక్షణాలను ప్రాంతీయ అస్తిత్వంగా స్థూలంగా నిర్వచించవచ్చు. ప్రాంతీయ అస్తిత్వ స్పృహతో వెలువడుతోన్న కథలు వెనుకడుగు మాత్రం కాదు. అవి  సమాజ అవగాహనకు మునుపటికంటే ఎక్కువగా తోడ్పడుతున్నాయి. ఒక ప్రాంతం ప్రత్యేక లక్షణాలను ఆ ప్రాంతంలోని వివిధ సామాజిక సముదాయాల అవగాహనను పెంచుతుండడం చూస్తూనేవున్నాం. ఉదాహరణకు తెలుగు ప్రాంతంలోని ఆదివాసీల జీవన సమస్యలు, జీవన వాస్తవికత కథల్లో విరివిగా వెలువడడం ఈ రెండు మూడు దశాబ్దాలుగా మనం చూస్తున్నాం. అలాగే ముస్లిం జీవితాలైనా, దళిత జీవితాలైనా, మహిళల జీవితాలైనా మైనారిటీల జీవితాలైనా.  ఇది మన సమాజ అవగాహనను తప్పక పెంచేదే కదా. అంతేగాక సమాజంలో సమానత్వాన్ని/సమభావాన్ని, సౌభ్రాతృత్వానికి  ఈ కథల్లోని  సంవేదనలు, స్పందనలు. తోడ్పడుతాయి. ఇది మనిషి చేసుకున్న మానవ సంస్కార పరిణామంలో ఒక దశ. ఒక చిన్న ముందడుగు..

q ప్రాంతీయ అస్తిత్వానికి ఎందుకింత గుర్తింపు లభిస్తోంది?

ఇది అస్తిత్వ చలనాల దశ. తెలుగు మాట్లాడే ప్రాంతంలోని ప్రజా సముదాయాల జీవ లక్షణాలను భావాలను ఇతర ప్రాంతాల కంటే భిన్నమైనవి అనుకున్న సామాన్య లక్షణాలను ఒక్కోసారి నిర్దిష్ట లక్షణాలకు కూడా (స్థానీయ  లక్షణాలు ) రచయితలు స్పందిస్తున్న దశ ఇది. పాఠకులు కానీ, విమర్శకులు కానీ వీటిని గురించి ఆలోచించాల్సిన దశ కూడా ఇదే.

q ప్రాంతీయ అస్తిత్వ కథ వెనుక జాతీయ అంతర్జాతీయ కారణాలు లేదా ప్రభావాలు ఏమిటి?

ప్రపంచ వ్యాప్తంగా చాలా దేశాల్లో అస్తిత్వ సమస్యలున్నాయి. అమెరికా లో నల్ల జాతీ ప్రజలది అస్తిత్వ సమస్య. బంగ్లాదేశ్ ఏర్పడడానికి భాష ఒక అస్తిత్వంగా ఏ రకంగా పని చేసిందో మనకు తెలుసు. లాటిన్ అమెరికన్,ఆఫ్రికా దేశాల్లోని అస్తిత్వ సమస్యలతో కూడా మన కథా రచయితలకు కొంత మందికైనా అంతో ఇంతో అవగాహన లేకపోలేదు. ఇవి పరోక్ష కారణాలు, ప్రభావాలు ఏవైనా మన రచయితలూ మన వాస్తవికత నుండే కథలను రాస్తున్నారు.

q రాయలసీమలో కవిత్వం కంటే కథే బలంగా వస్తోంది దీనికి ప్రాదేశికతే కారణమా?

ప్రాదేశికత కారణం కాదు. అక్కడి జీవితంలో సామాజిక, రాజకీయ ఉద్యమాలు ఒక రకంగా చాలా చాలా తక్కువే. దీనికి తోడు అక్కడ పద్య ప్రియత్వం ఎక్కువ. అంతకు మించి ఆధునిక వచన కవిత్వానికి అవసరమైన వస్తు రూపాలు చాలా తక్కువ మందికే అబ్బాయి. కవిత్వ విషయంలో సంప్రదాయ విచ్చిత్తి జరగవలసినంత జరగలేదు.

q ప్రాంతీయ అస్తిత్వం అనేది కథా శిల్పానికి ఏమైనా మెరుగులు పెట్టిందా?

ఏ కథకైనా వస్తువెంత ముఖ్యమో, శిల్పమూ  అంతే. ప్రాంతీయ అస్తిత్వం అంటున్నప్పుడు మనం అందులో భాష ఉందనే విషయం మరువరాదు. ఈ భాషా శైలుల విషయంలో రచయిత వాడే కథన శైలి,పాత్రల భాషా శైలుల విషయంలో ప్రాంతీయ  అస్తిత్వాన్ని చిత్రిస్తున్న కథకులు మరింత విశాలం చేశారు.తర్వాత  చాలా కొద్ది మందే కావచ్చు మానసిక ఘర్షణను, మానవ చలనాలను చిత్రించడంలో శ్రద్ధ చూపారు.

q కవిత్వంలో ఆధునికానంతరవాదం వస్తున్నప్పుడు ఆ ప్రభావం కథా సాహిత్యం మీద ఏ మేరకుంది?

కవిత్వంలో ఆధునికానంతరవాద పరిశీలన అఫ్సర్ “ఆధునికత- అత్యాదునికత” ( 1992) వ్యాసాలలోనూ, దానికి తిరుపతిరావు ముందు మాటలోనూ  వారు చేసినట్లు గుర్తు. నిజానికి ఈ వాదానికి సంబంధించిన జ్ఞానాన్ని, సిద్ధాంతాన్ని, మూలగ్రంథాల అనువాదాలు గానీ, స్వంత రచనలు గా గానీ వచ్చిన దాఖలాలు దాదాపు లేవనే చెప్పాలి. కన్నడ విమర్శకులు దీన్ని నవ్యోత్తర వాదం అంటున్నారు. ఇటీవలే అస్తిత్వాలను, అస్తిత్వ చరిత్రను చిత్రించే కథలను ఆధునికానంతర ధోరణి కింద చూస్తున్నారు. నేను కూడా మొన్న మొన్నటి దాకా దళితులు, మైనారిటీలు, బహుజనులు, మహిళలు వీరి శకలీకరణ జీవితాల్ని చిత్రించే కథలు ఆధునికానంతరవాదానికి చెందినవనే అనుకున్నాను. ఇది ఒక రకంగా సిద్ధాంత దృష్టి కాదు. రాజకీయ దృష్టి.

ఆధునికానంతరవాదం అంతః సారాన్ని సర్వ విషయ సాపేక్షతను అంతరంగ చలానాలను చిత్రించడానికి ప్రయత్నించిన   వి. చంద్రశేఖర్ రావు, అఫ్సర్,  మధురాంతకం నరేంద్ర లాంటి రచయితలను వేళ్ళ మీద లెక్కపెట్టవచ్చు. ఇటీవలే ఆధునికానంతరవాదం కంటే భిన్నమైన ఆధునికత, ఆధునీకరణ సాక్ష్యంగా నిలిచే అనుక్షణిక నవీన మోహిని ద్రవాధునికత  (లిక్విడ్ మోడ్రనిజం)-పోలిష్ సామాజిక తత్వవేత్త బౌమన్ ను  పాపినేని శివశంకర్ పరిచయం చేశాడు. చలనం, అస్థిరత లక్ష్యంగా సాగే ఈ ద్రవాధునికత కథా రచనలో ఆధునికోత్తరవాదం లాగే అనే ఒక ఆకర్షణీయమైన గుర్తుగానే మిగులుతుందేమో చూడాలి. వీటి విషయంలో చాలా మందితో పాటు నాదీ పరిమితమైన జ్ఞానమే. ఇది విశాలం చేయడానికి ఆధునికానంతరవాదాన్ని ప్రతిఫలించే కథలను ఒక సంకలనంగా తీసుకురావాల్సిన అవసరమెంతైనా ఉంది. అస్తిత్వ వాదాన్ని తెలుగులో సమూహాల గుర్తింపు వాదంగా వాడుతున్నాం. ఎగ్జిస్టెన్షియలిజం కు సమానంగా వాడుతున్నాం.

జీన్ పాల్ సార్త్రే, మార్షల్ ప్రౌస్ట్ వంటి వారు ప్రతిపాదించిన అస్తిత్వ వాదంలో కీలకాంశం మనిషికి ఇచ్చా శక్తి ఉంది. తానూ చేసే పనులకు తానే బాధ్యుడు. ఐతే- అర్థం పర్థం లేని ప్రపంచంలో. ఏమైనా ఈ రకమైన అస్తిత్వవాదానికి ఆధునికానంతరవాదం ఏ  అంశాల్లో విభేదించిందో తెలిస్తే మనకు మంచిది. తెలుగులో సాహిత్య పరిభాష అభివృద్ధికి ఈ ప్రయత్నాలు మరింత దోహదం చేస్తాయి.

q మిగిలిన భారతీయ భాషల కథలతో పోల్చినపుడు తెలుగు కథా స్థానం ఎక్కడుంది? దీన్ని ఎట్లా చూడాలి?

ఆధునిక భారతీయ భాషల కథల్ని మనం ఆంగ్లం ద్వారానో, తెలుగు ద్వారానో చదువుకుంటున్నాం. కానీ పరిశీలించడానికి తగినంత విస్తారంగా ఈ కథా సాహిత్య సామగ్రి లోటు ఉండనే ఉంది. నేను పరిశీలించినంత వరకు తెలుగు కథ  మెచ్చుకోదగిన స్థాయిలోనే ఉంది- అన్ని మంచివనుకునే ముగ్ధత్వం వదిలిపెడితె. ఏది ఏమైనా తెలుగు కథలు విరివిగా ఇంగ్లీష్ లోకి ఇతర ప్రాంతీయ భాషల్లోకి వెళ్తే ఆ సాహిత్యకారులు ఏమనుకుంటారో కూడా మనం పట్టించుకోవాల్సి ఉంది.

 

                                                                                                        ఇంటర్వ్యూ : వెల్దండి శ్రీధర్ 

 

కడలిని దాటిన కార్తి

ఎల్. ఆర్. స్వామి

మళయాళ రచయిత కె.పి. రామనున్ని

 

(మళయాళ భాష లో 1993 లో వెలువడిన సంచలనాత్మక నవల “ సూఫీ పరాంజే కథ” కు ప్రముఖ అనువాదకుడు , రచయిత ఎల్. ఆర్. స్వామి చేసిన తెలుగు అనువాదం “ సూఫీ చెప్పిన కథ” పుస్తకాన్ని సగర్వం గా ప్రచురిస్తోంది సారంగ పబ్లికేషన్స్. త్వరలో పుస్తకం గా బయటకు రానున్న ” సూఫీ చెప్పిన కథ” నవల నుంచి కొంత భాగాన్ని ప్రత్యేక వ్యాసం గా ఈ వారం సారంగ పాఠకులకు అందిస్తున్నాము. కేరళ సాహిత్య ఆకాడమీ అవార్డ్ తో పాటు మరెన్నో ప్రతిష్టాత్మక అవార్డులు పొందిన ( సినిమా గా కూడా విడుదలై అవార్డులు సాధించింది) ఈ నవల ఇప్పటికే హిందీ, ఇంగ్లీష్, ఫ్రెంచ్, తమిళ, కన్నడ భాషల్లోకి అనువాదమయింది. )

 

***

 

సముద్ర దేవతలు శృంగలావిముక్తం చేసిన గాలిలా ఇసుక తిన్నెలను దాటి వచ్చాడు ముసలియార్‌. మఠానికి చెందిన మమ్ముటి మగతనమూ, పురుష బలమూ తొణికిసలాడే అతడు ‘భారతప్పుళ’ దాటి వచ్చాడు.

పొడుగుగా ఎదిగిన చేతులతో రాక్షసుడిలా కనబడ్డాడు అతడు. అడవి దాటి కొండలను దొర్లించి రెండు మూడు అడుగులతో పొలాలను కొలిచి కొండల నుండి దూకి వచ్చాడు. ధమనుల్లో వేడితో, నరాల్లో బలంతో గుండెలో జాలితో మమ్ముటి పరిగెత్తుకొచ్చాడు. దేనికీ జంకని కనులతో పెదవుల నిండా నవ్వుతో మమ్ముటి తలవంచకుండా వచ్చాడు.

శంకుమీనన్‌కి ఆ సంగతి చెప్పినది వేలాయుధమే. పొన్నాని ఊరి ముస్లిం ఒకరు కొబ్బరికాయలూ, పోకలూ కొని వ్యాపారం చేయడం కోసం ఊరిలోకి వచ్చాడని చెప్పాడు. మశూచి విత్తనాలను పట్టించుకోకుండా మిగతావి కొని ఒక చోట నింపుతున్నాడట!

పంటలు కొనేవాళ్ళు లేక డబ్బుకు బాగా ఇబ్బంది పడే రోజులు అవి. శంకు మీనన్‌ చాలా సంతోషించాడు. కళ్ళంలోనూ, అటకపైనా పోకలూ, ఎండుకొబ్బరి నిండుగా ఉన్నాయి. అంతేకాక పన్నును సవరించడంవల్ల డబ్బు కట్టవలసిన బాధ్యతలు కూడా కొన్ని ఉన్నాయి.

మమ్ముట్టిని పత్తాయపురంలోకి తీసుకొచ్చాడు వేలాయుధం. పడకకుర్చీలో పడుకొని ఉన్న శంకుమీనన్‌ అతన్ని చూసి ఉలిక్కిపడ్డాడు. ఒకటిన్నర మనిషింత పొడుగున్న మమ్ముటి  వినమ్రంగా వంగి నమస్కారం చేస్తూ నిలబడి వున్నాడు. ఎదుట సరుకు బాగుంటే మొత్తం కొనడానికి తాను సిద్ధమేనని అన్నాడు. పొన్నాని సముద్రతీరం నుండి ఇతర దేశాలకు సరుకులు ఎగుమతి చేయటమేనట అతని వృత్తి.

కొత్తగా ఆర్జించిన సంపద తాలూకు మెరుపు మమ్ముటి ముఖం మీద ప్రస్ఫుటంగా గోచరించింది. దగ్గరకు కత్తిరించిన జుట్టు, గుండ్రంగా ఉండే గడ్డం, గంభీరంగా వున్నా నవ్వుతూ కనబడే పెద్ద పడవలాంటి పెదవులు .. ఇది అతని రూపం. కొన్ని వస్తువులను ఒకచోట చేర్చడానికి, విడతీసి కట్టలు కట్టడానికి ఒక చోటు గురించి వెతుకుతున్నాడు అతడు.

తన ‘కళప్పుర’ (పొలాలను ఆనుకొని వుండే చిన్న ఇల్లు) వాడుకోమని శంకు మీనన్‌ అనగానే మనస్ఫూర్తిగా నవ్వాడు మమ్ముటి  కాళ్ళు చేతులు ఒకసారి సవరించుకొని వసారాలో నేల మీద కూర్చున్నాడు. మశూచి రోగమేఘాలను దూరంగా తీసుకెళ్ళే ఒక గాలి అక్కడ నీరసంగా కదులుతూ ఉండేది. ఆ గాలికి మమ్ముటి జుట్టు ఎగిరెగిరి పడింది.

‘‘నువ్వు అనుకున్నంతా కొనుక్కోవచ్చు. కాని సరుకుకు తగినంత ధర ఇవ్వాలి,’’ శంకుమీనన్‌ లేని గౌరవం తెచ్చుకొని మరోసారి అన్నాడు.

గట్టిగా నవ్వాడు మమ్ముటి.  అప్పుడు పొన్నాని కడలి తరంగాలు గర్జించాయి. తరంగాల లోపల ఉండే అమ్మమ్మ కడలి ఇగిళ్ళు బయటపెట్టింది. కడలి ఒడ్డున మంచి చెడు జిన్నులు చేతులు కలిపి నాట్యం చేశాయి.

హఠాత్తుగా కడలిలోని కెరటాలు శాంతించాయి. అంతా ప్రశాంతత నిండుకుంది. కార్తి మజ్జిగ్గ  గ్లాసుతో శంకుమీనన్ని సమీపించింది. ఆమెను చూస్తూ  అలాగే ఉండిపోయాడు మమ్ముటి.  ఎంత ప్రయత్నించినా ఆ అందాలరాణి నుండి దృష్టి మళ్ళించలేకపోయాడు.

SufiBookFrontCover

తన కళ్ళలోకి, వొంటిలోకి ఒక మగాడు రెప్పవాల్చకుండా చూస్తున్నాడని ప్రప్రథమంగా గమనించింది కార్తి.  పైపైకి తేలిన ఆమె శరీరం మెల్లగా భూమి మీదకు దిగింది. నిప్పురవ్వలు వెదజల్లే ముఖంతో రక్తప్రసారం పెరిగిన నరాలతో కూర్చున్న మమ్ముటిను ఆమె గమనించలేదు. కాని…

అతని చూపుతో తాను వివస్త్ర అయినట్లు తోచింది ఆమెకు. అది మమ్ముటి దృష్టిలో పడినట్లు… ఇంత అందమైన అద్భుత శరీరం తనకుందా? మదమెక్కిన ఏనుగులా తన గురించిన కొత్త విషయాలు కార్తి మదిలో మెదిలాయి.

తనకంటూ ఒక అస్తిత్వమూ, శరీరమూ లభించాయి. మరొకరిలోకి విద్యుత్తులా ప్రవహించే రూపం, ఏ భీతి లేకుండా ఏ సందేహానికి లోనుకాకుండా కళ్ళలో నక్షత్రాలు విరిసే అందం.

‘‘కార్తీ… నువ్వు వెళ్ళు…’’

మొద్దుబారి నిలబడిపోయిన కార్తిని శంకుమీనన్‌ మాటలు లేపాయి.

మమ్ముటి హృదయంలోనూ కెరటాలు లేచాయి. శంకుమీనన్‌తోనూ, వేలాయుధంతోనూ మాట్లాడుతూనే ఉన్నాడు కాని మధ్యలో మాటల తాడు తెగింది. ఎంత అణిచివేసినా ఆగని కెరటాల శక్తీ, సుడుల లోతూ తనలో ఉన్నాయని తెలుసుకున్నాడు మమ్ముటి.  ధమనుల నుంచి వేడి కెరటాలు లేచాయి. హాయిగా నవ్వుతూ పొన్నాని నుండి వచ్చిన మమ్ముటి  మనసులోన ఏదో సలుపుడు.` తనకీ ఆశ్చర్యం కలిగేలా నిశ్శబ్దుడై శంకుమీనన్‌గారి కళప్పురలో నిద్రపోయాడు.

నూతన ప్రపంచాల తలుపులు తన ఎదుట తెరుచుకున్నట్టు తోచింది కార్తికి. తన రూపం గురించి, శరీరం గురించీ అదుపులోకి రాని ఊహాలు ఏర్పడ్డాయి. అంతవరకు ఒక మగాడిని  మత్తెక్కిస్తూ అతని కళ్ళు నక్షత్రాలుగా మార్చే వింత విద్య తనలో ఎక్కడో దాగి ఉందని ఆమెకు తెలియలేదు.

మేడమీదకు పరిగెత్తుకెళ్ళిన ఆమె జిజ్ఞాసతో సతమతమైంది. నిలువుటద్దం ముందు నిలబడి మెల్లమెల్లగా పై దుస్తులు జారవిడిచింది.

ఆ తరవాత ఒక ఆతృత ప్రప్రథమంగా కట్టలు తెంచుకుని దూకే స్వయంకామన యెక్క సూతి పొడుపులు` గబగబా మిగతా దుస్తులు కూడా తీసి విసిరేసింది. ముందుకు దూకే రొమ్ముల నుండి జ్ఞానపరిమళం ఇంటినిండా పాకింది. ఆ లహరిలో సీతాకోకచిలుకలూ, కీటకాలూ, పాములూ, ఎలుకలూ, తోడు కోసం పరుగెత్తాయి.

ఎంత తీసినా, తీరనన్ని చుట్లు తన చీరకి ఉన్నట్లు తోచింది కార్తికి. అద్దం ముందు నించున్న ఆమె చెమటతో తడిసి ముద్దైంది. చీర పూర్తిగా జారవిడిచి ఒక నిమిషం ఆలోచించింది. ఇది చేయాలా? మత్తెక్కిన తన మనసు ఇది భరించగలుగుతుందా? చివరికి తెగించి లో దుస్తులు కూడా విడిచింది. అద్దంలో కనబడిన ప్రతిబింబం రంగులోనూ, రూపులోనూ పరిపూర్ణంగా ఉంది. ఆ రూపాన్ని ఆవహించి మత్తెక్కిన కార్తి బలహీనతతో ఆ రూపాన్ని ప్రేమించి లాలించడానికి తొందరపడిరది. ఈ ప్రపంచంలోని ఏ క్రూరత్వానైనా సానుభూతితో అందుకునే భూదేవి యొక్క జాలితో ఆమె నేలపై వెల్లకిలా పడుకుంది.

  ఉచ్ఛ్వాసాలతోపాటు రొమ్ముల కొసలు పైకి కదిలాయి. కళ్ళు మెల్లగా మూతలు పడ్డాయి. కనురెప్పల లోపలి వర్ణ ప్రపంచంలో తన ప్రతి అవయవమూ కరిగిపోయి మళ్ళీ పునర్జన్మ ఎత్తుతున్నట్లు గమనించింది.

పెదవులు సీతాకోకచిలుకలాగా సంకీర్ణ అరణ్యాలను వెతుకుతున్నాయి. బుగ్గలు వసంత పుష్పాలుగా వికసిస్తున్నాయి. స్తనాలు జోడించిన చేతులతో విడిపోయి గుండె నుండి దిగి పర్వత సానువు లెక్కి అమృత నదులను స్రవిస్తున్నాయి. ఏదో శక్తి యొక్క విస్ఫోటనాన్ని మనసు ధ్యానిస్తోంది. బ్రహ్మాండమంతా తనలో గర్భస్తమైన నిండు అనుభవం. అప్పటికి ఆమె శరీరం దేశాల సరిహద్దులు దాటి ఖండాంతరాల్లోకి వ్యాపించింది.

ఏమిటీ అస్తిత్వపు లహరి! విశాలత యొక్క గర్వం! ఒడ్డు కనబడని కడలి యొక్క ఆత్మవిశ్వాసం! ఆనందంతో గర్వంతో కార్తి మనసు పులకించింది.

కాసేపటికి తాను మేలేప్పురం తరవాడులోని చిన్నమ్మాయి కార్తి అనే వాస్తవం గుర్తు రాగానే ఆమెకు తన మీద తనకే జాలి కలిగింది. ఇప్పటివరకు తన మీద తను ఏర్పరచుకున్న గౌరవం ఒక్కసారిగా సానుభూతిగా మారిపోయింది. కార్తి కళ్ళ నుండి కన్నీరు జాలువారింది.

జ్ఞాపకాల అడుగుదాకా వెళ్ళి చూసింది కార్తి. నష్టపోయిన వాటి, పగిలిన వాటి అవశేషాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఆత్మా శరీరమూ ముక్కలై ఎన్నో సంవత్సరాలుగా చీకటిలో ఒంటరిగా పడి వున్నాయి. అది తెలుసుకున్నవారు కాని, వాటిని కలిపేవారు కాని ఎవ్వరూ లేకపోయారు.

ఉత్సాహంగా  ఉన్నప్పుడు  మామయ్య  దగ్గరకు  వెళ్ళేది  కార్తి. కాని అప్పుడు ఉబ్బసంతో బాధపడేవాడి ముఖకవళికలతో వుంటాడు అతడు. అయినా కాసేపు అక్కడక్కడే తచ్చాడుతూ ఉంది కార్తి. ఆమె దగ్గర అవుతున్న కొద్దీ దూరంగా వెళ్ళేవాడు ఆమె మామయ్య. చివరికి జుట్టు ఊడి తోక ముడిచి దయనీయంగా మరణించే జంతువుగా మారుతాడేమో, తన మామయ్య అనే అనుమానం కలిగినప్పుడు వెనక్కు తిరుగుతుంది కార్తి.

ఆ తరవాత తల్లిని సమీపించినప్పుడు ఆమె శరీరం, అవయవాలు కరిగి అంతా కలిసి ప్రవహించి ఒక అద్భుతమూర్తిగా తనను ఆరాధించే రెండు కళ్ళు మాత్రం మిగిలేవి. అప్పుడు పట్టరాని కోపం వచ్చేది కార్తికి. వెంటనే పరిగెత్తేది అమ్మమ్మ సమాధి వైపు. అక్కడకెళ్ళి అమ్మమ్మను పిలిస్తే, ‘నువ్వు భయపడతావు తల్లీ,’ అని ఆమె కూడా లేవడానికి నిరాకరించేది. చనిపోయినందువల్లనో, లేకపోతే శరీరంలో కురుపులున్నందు వల్లనో తెలియదు. తను బాగానే ఉన్నానని వందసార్లు ఒట్టువేసి చెప్పినా, అమ్మమ్మ నమ్మేది కాదు.

చనిపోయిన వారు లేచి రాకూడదట! ఎంత మూఢనమ్మకం!

మమ్ముటి ఎవరని కానీ ఎందుకు వచ్చాడని కానీ తెలుసుకోవలసిన అవసరం రాలేదు కార్తికి. తన అవయవ సౌందర్యాన్ని కుతూహలంతోనూ నిశితంగానూ అతడు చూస్తూ ఉంటే తను బ్రతికే ఉన్నానని పదేపదే గుర్తు చేస్తున్నాడని అనుకుంది. మళ్ళీమళ్ళీ ఆమె స్వయం పరిచయమవుతుంది. అతడు ఇంటి పెరటిలో వున్నా కళ్ళప్పుర అరుగులో పడుకొని వున్నా అతని దృష్టి తన చుట్టూనే వుందని కార్తి తెలుసుకుంది.

రోజులు గడిచిన కొద్దీ సరుకులు సేకరించడం పట్ల శ్రద్ధ తగ్గింది మమ్ముటికి.  కొబ్బరికాయలను, పోకలను వాటి నాణ్యత ఆధారంగా విడతీస్తూ రోజంతా మేలేప్పురం తరవాడులోనే గడిపాడు.

మమ్ముటి పని చేస్తూ వుంటే నిర్భీతితో నిస్సంకోచంగా అతని వద్ద నిలబడడానికి కార్తి జంకలేదు. చేయకూడని పనియేదో చేస్తున్నట్లు అనిపించలేదు. ప్రేమవల్ల విరిసే లజ్జ కాని, పిచ్చిచేష్టలు కాని ఆమె ముఖాన్ని కలుషితం చేయలేదు. మానవ సహజమైన మైత్రీభావం ఆమె కళ్ళలో తొణికిసలాడుతూ ఉండేది.

కార్తి మమ్ముటి వెంట ఉంటుందనే సంగతి శంకుమీనన్‌ దృష్టిలో పడింది. ఆమెను అడ్డుకోవాలనే ఒక సామాజిక స్పృహ తాలూకు స్పందన అప్పుడప్పుడు శక్తివంతమైన అతని మనసుని పడగగా మారుస్తుంది. ధమనుల గోడలు పగిలి నెత్తురు కారే నొప్పితో మనసు పడగ విప్పి ఆడుతుంది. వెంటనే వాస్తవంలోకివచ్చి సమస్యను తనలోకి తీసుకుంటాడు.

కార్తి గృహస్థితి వల్ల ఇలాంటిదేదో జరుగుతుందని అనుకున్నదేకదా? కార్తి తన సంరక్షణకు అతీతంగా కదా ప్రవర్తిస్తున్నది? పన్నును సవరించడం కోసం వచ్చిన వారు దేవుడు గదిలో ప్రవేశించినప్పుడు కార్తి అది రుజువు చేసింది కూడా. ఆమెను తిట్టే శక్తి కాని, ఆపేశక్తి కాని తనకు లేదుకదా అని అనుకున్నాడు శంకుమీనన్‌. అంతేకాదు కార్తి తల్లియైన అమ్మాళుకు కూడా ఆ శక్తి ఉందని అనుకోలేదు అతడు.

మమ్ముటిని వెంటనే పెట్టే బేడా సర్దుకొని బయలుదేరమని చెప్పాలనే ఆలోచన వచ్చింది అతనికి. కాని అది అనివార్య దురంతాన్ని వేగిర పరిచినట్లు అవుతుందని అనుకున్నాడు. కార్తి కావాలని అనుకున్న దాన్ని ఆపటం, ఎవ్వరివల్లా సాధ్యంకాదని అతనికి ఖచ్చితంగా తెలుసు. తన బలమూ, బలహీనతా, సౌందర్యమూ అంతా అయిన కార్తి కదలికలను ఆమెకు తెలియకుండా గమనిస్తూ వచ్చాడు. జీవితం అందించే వేదన అనుభవించాడు. అనుభవించి అనుభవించి దాన్ని కొంచం కొంచంగా దిగమింగడం నేర్చుకున్నాడు.

సన్మార్గపు వెలుగుతో ముసురులేకుండా చివరికి ఆనాటి ప్రభాతం వికసించింది. ప్రాణానికి ఊపిరి పొయ్యడానికి అన్నట్లు కార్తి ఏటిలోకి వెళ్ళింది. స్వచ్ఛమైన గాలిలో ఆమె ముంగురులూ, ఒంటి మీద దుస్తులూ తేలియాడాయి. మమ్ముటిని వెతుకుతూ వెళ్ళే ఆ యాత్ర ఆమెకు ఒక రోజువారీ కార్యక్రమం. తల్లీ మామయ్యలూ తనను గమనిస్తున్నారనే జంకు కూడా లేదు ఆమెకు.

ఒక కొబ్బరికాయల గుట్ట క్రింద నిలబడి కాయల పీచు తీస్తున్నాడు మమ్ముటి. కార్తి రావటం చూసి కాయలు వలిచే గునపంపై తుఫాను రేపాడు. భుజాల ఎముకలకు రెక్కలు మొలిచాయి. చేతి ధమనుల్లో నుంచి గుర్రాలు లేచాయి. నిమిష నిమిషానికి తరిగే కొబ్బరికాయల గుట్టను చూసి ఆశ్చర్యపోయింది కార్తి. ఒక హిమాలయ పర్వతం నిమిషాల్లో కరిగి కొన్ని కొబ్బరికాయలుగా మిగిలిపోయింది.

మొత్తం కాయలు వలిచి గునపం నేల మీద నుండి లాగి పారేసి క్రింద కూర్చున్నాడు మమ్ముటి.  మెల్లమెల్లగా మనసును అదుపులోకి తెచ్చుకున్నాడు. చాలా మామూలుగా చిరునవ్వైనా నవ్వకుండా రెప్పవాల్చకుండా తనను చూస్తూ నిలబడిన కార్తిని అడిగాడు.

‘‘నువ్వు వస్తావా…?’’

‘‘వస్తాను,’’  కార్తి జవాబిచ్చింది.

‘‘ఎక్కడికి?’’

‘‘నాకు తెలుసుకోవాలని లేదు.’’

పొన్నానిలోని సముద్రపు ఘోష అప్పుడు అక్కడ వినిపిస్తున్నట్లు తోచింది మమ్ముటికి.

తన బలమూ మగతనమూ సౌందర్యరాశిని సొంతం చేసుకోవడం కోసమే పుట్టినవి కదా? పొన్నాని పిల్లలకు ఆరాధనామూర్తియైన తను వాళ్ళ నుండి తప్పించుకొని తిరిగినది ఈ పిల్ల కోసమేనని ఇప్పుడు తెలుస్తోంది.

కాని ఆమె ముందు ఎంత హుషారు ప్రదర్శించినా ఆమె కళ్ళ నుండి ప్రసరించే కాంతిధారల ముందు తను కేవలం ఒక చిన్నపిల్లాడై మారిపోతున్నట్లు… తప్పటడుగులు వేసే పిల్లాడిలాగా ఏవో పిచ్చి పనులు చేసి భయపడుతున్నట్లు. వాత్సల్యపు కుంభాలు తెరిచిపోసిన నవ్వు నవ్వి కార్తి వెళ్ళగానే ఆ చల్లతనానికి మనశ్శాంతి  చేకూరుతుంది.

భారతప్పుళ దాటి వచ్చిన మమ్ముటి  సేకరించిన సామానుతో కళప్పుర నిండి పోయింది. బంగారురంగులోకి మారిన పోకలూ,  నూనెతో నిండిన కొబ్బరికాయలూ వాడుకకు తయారైనాయి. బాధ్యతాయుతంగా వుండే మమ్ముటి తను బయలుదేరడానికి వారంరోజులు ముందే శంకుమీనన్ని కలిసి అన్నాడు. ‘‘దొరా పొన్నానికి వెళ్ళిపోవాలని అనుకుంటున్నాను. లెక్కచూడండి మిగిలినవి ఇచ్చేస్తాను.’’

ఆరోజు రాత్రి ‘పత్తాయప్పుర’ మేడ మీద పడుకున్న శంకుమీనన్‌కు నిద్ర పట్టలేదు. గంటగంటకీ ఒకసారి తలుపు బయటికి వచ్చి చూశాడు. అంతవరకూ సంతరించుకున్న సంయమనపు ఆత్మసంపద వాకిటిలో పడిన వాననీరులా కారి దూరమవుతున్నది. ఏదైనా విషాద సంఘటన అనివార్యమని తెలిస్తే దాన్ని స్వీకరించగల మనోబలం ఉండాలి. లేకపోతే ఎదుర్కోగల ధైర్యం ఉండాలి. కార్తికి వ్యతిరేకంగా వేలెత్త లేని తాను, పట్టించుకోకుండా ఉండడమే మేలని అనుకున్నాడు. అలా ఉండాలంటే మనసు దృఢంగా ఉండాలి. కాని అంతవరకు ఎరుగని ఎత్తుపల్లాల్లో, సుడుల్లో ప్రవహించే తన మనసు తనదేనా అనే అనుమానం కలిగింది శంకుమీనన్‌కి. హతాశుడైన కొన్ని వేళల్లో పరుగెత్తుకెళ్ళి అమ్మాళుకు వివరాలు చెప్పి సలహా తీసుకోవాలని అనిపించేది. లేకపోతే మేనేజర్‌ వేలాయుధానికి అంతా చెప్పి ఏడ్చి ఏదైనా దారి చూపమని అడగాలని అనిపించేది. కాని ఎంతో ఉన్నతుడుగా పరిగణింపబడే తను చెల్లెలి ముందూ, మేనేజర్‌ ముందూ విలపించటమేమిటిని ఊరుకున్నాడు.

కిటికి వద్దకు వచ్చి చూసిన ప్రతిసారి వెన్నెల యొక్క తెల్ల మచ్చ, చీకటి యొక్క మసి నలుపు స్త్రీ పురుష రూపాలుగా కనబడ్డాయి. కనబడేవి నీడా, తెలుపూ అని ఖచ్చితంగా తెలిసినా అతని మనసు వాటిని స్త్రీ పురుష రూపాలుగా మలచుకుంటుంది. మళ్ళీ మళ్ళీ  స్త్రీ పురుష రూపాలు దిగిరావడం ఊహించిన అతని కండరాలు పత్తాయప్పుర నుండి దూకడానికి ప్రయత్నించింది.

ఎంత ప్రయత్నించినా కిటికీ వద్ద నుండి జరగటం కానీ, నిద్రపోవడం కానీ కుదరదని అతనికి తెలుసు. కాని అలాగే నిలబడి ఆలోచిస్తే తను ఏదైనా అఘాయిత్యం చేసుకుంటానేమోననే భయం కలిగింది.

గాలివానలో చిక్కుకున్న మనసులో హఠాత్తుగా ఒక మెరుపు మెరిసింది. గబగబా మెట్లు దిగాడు. క్రింద వసారాలో పడుకుని ఉన్న వేలాయుధాన్ని తట్టిలేపాడు. అటక మీద వెతికించి ఒక లావుపాటి ఇనుపగొలుసూ, తాళమూ తీయించాడు. కిటికికి ఎదురుగా పడకకుర్చీలో కూర్చుని గొలుసుతో తనను కట్టమని ఆజ్ఞాపించాడు. మారు మాట పలకకుండా యజమాని మాటల్ని అనుసరించే వేలాయుధం ఒక రోబోలా ఆ పని చేశాడు. ఇనుపగొలుసుతో కాళ్ళు చేతులు బంధించబడిన శంకుమీనన్‌ స్త్రీ పురుష రూపాల కోసం ఎదురుచూస్తూ కూర్చుని ఆలోచించాడు. తాత్విక చింతన యొక్క అరిటి నారుతో ఎంత బలంగా కట్టిపడేసినా ఆ సమయంలో కట్టలు తెంచుకుంటుంది కోపం. చెడు చూడకుండా దూరంగా వుండే శక్తిలేదు మనసుకి. చూస్తే ఏం జరుగుతుందని ఊహించనూ లేదు. స్వయంగా తెలుసుకోలేనివాడి శరీరం ఇనుపగొలుసులకు బానిసవుతుంది.

మరునాడు తెల్లవారగానే వేలాయుధం వచ్చి గొలుసు విప్పాడు. ఆ తరవాత మరో అయిదు రాత్రులు కూడా అలాగే గొలుసుతో బంధించుకుని రెప్పవాల్చకుండా కిటికి నుండి చూస్తూ కూర్చున్నాడు శంకుమీనన్‌.

ఆరో రోజు రాత్రి` వెన్నెల మసకమసకగా మారిన వేళ` రాత్రి పూట మరో సంధ్య వెలుగు చిక్కపడే లక్షణాలు కనబడ్డాయి. గత అయిదారురోజులుగా శంకుమీనన్‌ తన మనసులో చెక్కుకున్న రూపాలు బయటికి వచ్చాయి. మమ్ముటి నీడ కార్తిని పూర్తిగా కమ్మేసినట్లు కనబడింది.

హఠాత్తుగా ఒళ్ళు మొద్దుబారిపోయినట్టు తోచింది అతనికి. అయినా సంభాళించుకున్నాడు. కిటికి ఊచల్ని గట్టిగా పట్టుకొని నిలబడ్డాడు. పీడకలల్లో ప్రత్యేక్షమయ్యే దుర్భర బాధలే కదా నిజజీవితంలో జరిగే సంఘటనలు. ఇంటి వాకిలి దాటి కార్తి గేటు దగ్గరకు చేరగానే కేవలం  అస్థికలతో  మిగిలిన  ఒంటరి గుండెలా ఉండిపోయాడు.

ఆ తరవాత ఏమైందని గుర్తులేదు. ఎలాగోలా కార్తిని పోగొట్టుకోకుండా చూడమనే సందేశాలు వేలకు వేలు అతని ధమనుల్లో పాకాయి. కోశాలు మొక్కలుగా విభజించి లేపిన శక్తి యొక్క ప్రళయంలో అతడు రాక్షసుడుగా మారాడు. పత్తాయప్పుర మేడ మీద నుండి గాలిలోకి పాదాలు వేసి గేటులోకి దూకడానికి శరీరం ముందుకు వంగింది.

ఇనుపగొలుసులు గర్జించాయి. ఆ ఎదురుదాడికి అవి వేడెక్కి పెద్ద సవ్వడి చేశాయి. గది నేలపై నిలబెట్టిన పడకకుర్చీ విరిగిపోయింది.

చివరి యుద్ధంలో అతని మనసు మరో మార్గం లేక శరీరం నుండి బయటపడి నియంత్రణాతీతమై గేటు దాటే కార్తిని సమీపించింది.

‘‘నువ్వు వెళ్తున్నావా…’’

ఎవరో కుదిపి పిలిచినట్లు కార్తి చివరగా ఒకసారి వెనక్కు తిరిగి చూసింది. ఆ సమయానికి రక్తసిక్తమైన కాళ్ళూ చేతులుతో కుర్చీలోనే స్పృహ కోల్పోయి పడి వున్నాడు శంకుమీనన్‌.

మసక వెన్నెలలో మేలేప్పురం ఇంటి రూపురేఖలు ఒక అస్థిపంజరంగా మిగిలాయి. ఆజానుబాహువులైన వృక్షాలు చీకటికి కాపలాదార్లుగా మేలేప్పురం ఇంటి పెరటిలో కాపలా కాసాయి. ‘పంది పరంబు’లోని మట్టిపొరల్లో నుండి మశూచి యొక్క వేడి నిట్టూర్పులు ఎగిశాయి. చూపులకతీతమైన దూరంలో ఎక్కడో దాగి ఉండే ఒక లేత ఉదయపు పొరల్లోకి నడిచారు మమ్ముటి, కార్తీలు.

మమ్ముటి పాదాలను ఏకాగ్రత రూపమెత్తినట్లు కనబడిన కార్తి ఒక నీడలా అనుసరించింది. ఇంత త్వరలో ఆమె తనతో నడిచి వస్తోందనే వాస్తవాన్ని జీర్ణించుకోలేక పోయిన మమ్ముటి ఒకే ఒక నిమిషంలో ఆమెను భుజానికి ఎత్తుకున్నాడు. అప్పుడు అతనికి నమ్మకం కుదిరింది తనపై, తన అవయవాలపై. తొడలోని కండరాలు అలలా కదిలాయి.

శాప విముక్తులైన ధూళి మేఘాలు మమ్ముటి నడిచిన బాటలో లేచి మిగిలిన జ్ఞాపకాల్లా మేలేప్పురం తరవాడు దాకా పాకాయి.

పొలం గట్టుల మీద నుండి ఇరుకు సందుల్లోకి సందుల్లో నుండి కొండలెక్కి దిగే దారుల్లోకి వాళ్ళు సాగారు.

మమ్ముటి నిశ్వాసాలు వెచ్చని ధారలుగా మారి కార్తి తొడల్ని వెచ్చగా చేస్తున్నాయి. ఒక నిమ్నమ్ నుండి పరిగెత్తుకెళ్ళి సమతలం చేరితే పాదాలు తడబడ్డాయి. మట్టినీళ్ళతో నురుగులు కక్కే భారతప్పుళ్ల దూరం నుండి కనబడగానే అతడు ఆగి ఊపిరి పీల్చుకున్నాడు. నదిని చూసిన కార్తి భుజం మీద నుండి దింపమంది. అతని శరీరాన్ని రాసుకుంటూ క్రిందకి జారుతూ వుంటే అతని నాసిక నుంచి, నోటి నుంచి విడుదలవుతున్న వేడి గాలి తగిలింది ఆమెకు. దాన్ని ఆస్వాదించింది ఆమె. ఆయాసంతో, తడిసిన నేలమీద తడబడే అడుగులతో నడిచారు.

నురగల పెద్దకూటమిలు పగిలి మళ్ళీకలిసి ప్రవాహ విస్తృతిలో ప్రవహిస్తున్నాయి. నదిలో విలీనమై వచ్చేది ఏ పర్వతమో! తన అమూల్యనిధితో ఈది నదికి అవతల ఒడ్డు చేరగలననే దాన్ని గురించి మమ్ముటికి అసలు అనుమానం కలగలేదు. తన శక్తిని ఊది జ్వలింపచేసి అతడు తయారైనాడు.

వంగినప్పుడు బండరాయిగా మారిన తన వీపు మీద ఎక్కమని అతడు కార్తికి చెప్పాడు. ఆమె కదలలేదు, సుడులు తిరిగే ప్రవాహం చూస్తూ నిలబడింది.

‘‘భయపడక, ఎక్కు. నిన్ను మోస్తూ రెండుసార్లు నది దాటగలను, నాకంత బలం ఉంది,’’ మమ్ముటి అన్నాడు.

‘‘నిజమే… కాని పిచ్చి యెక్కిన నదికి అది తెలియదుకదా. నేను వస్తున్నానని దానికన్నా ముందు…’’

మాటలు పూర్తి చేయకుండానే హోమకుండంలో అర్పించే హవిస్సులా కార్తి మమ్ముటి తాపంలో అంటుకుపోయింది. అది ఆమెకు అవసరం, అత్యవసరం. కోరిక నిండిన పెదవులతో ఆమె మమ్ముటి వక్షస్సులోకి ఈదింది.

నది దాటకపోతే… అలాంటి సాధ్యత గురించి ఆలోచించలేకపోయింది కార్తి. అంత సాహసం చేస్తే… జీవితం అభాసుపాలైతే… అలాంటి దిశల్లో సాగాయి కార్తి ఆలోచనలు.

వణికే పెదవులతో మమ్ముటి గుండెలో తల దాచుకుంది. అతని చేతులు ఆమెను వాటేసుకున్నాయి. అంతా అందుకోవడం కోసం ఆమె పడుకుంది. మూర్తీభవించిన సంపూర్ణ స్త్రీ సౌందర్యం యొక్క మూస తడిసిన ఇసుకలో తయారైంది. మమ్ముటి ఒంటిలోని వేడి ఆమె ప్రతి అణువులోనూ పాకింది.  మెడలో, పెదవుల్లో, రొమ్ముల మధ్య, ఊరువులో… ఒకచోట తరవాత మరోచోట రసానందపు మొగ్గలు వికసించి ముడుచుకున్నాయి. చివరికి జననాంగంలోకి పాకిన ఉష్ణంతో ఆమె మైకపు సరిహద్దుల్లోకి జారుకుంది. ముక్కలు చెయ్యబడే తన శరీర సీమలను తెలుసుకుంది. భరించింది.

లొంగిపోవటమనే ఆనంద శిఖరాల్లో నించుని కార్తి తొంగి చూసింది, కోటాను కోటి ఆనందాల సూర్యులు.

‘‘ రా ఇంక పద. ఇక ప్రమాదపు నది కానీ, సముద్రం కానీ… ఏదైనా కానీ… కలిసి దాటుదాం.’’

అవరోహణపు మెట్ల నుండి జారే మమ్ముటి శరీరాన్ని ఆమె తట్టి లేపింది. అభినందనలు అందుకున్న బాలుని అల్లరి నవ్వుతో అతడు కార్తి నుండి ముఖం తిప్పుకున్నాడు. నదీ జలంలోకి శయన ప్రదక్షిణం చేసి తన నగ్నతను దాచుకున్నాడు. అతని స్వచ్ఛమైన నవ్వుని నదిలోని అలలు అందుకొని అద్దంలో లాగా పలుచోట్ల ప్రతిబింబించాయి.

జలస్ఫటికం నుండి వంకరగా తిన్నగా పెరిగిన మమ్ముట్టి యొక్క శరీర చిత్రాలను చూస్తూ కూర్చుంది కార్తి.

ఎంత అందం! ఆమె ఆశ్చర్యబోయింది.

కొన్ని నిమిషాల క్రితం ఇంత అందం తన ఒంటిని కప్పి వేసిందనే విషయం నమ్మలేకపోయింది. ఆమె ఆ అపనమ్మకంలోని భాగంగా నది తన ప్రియుడిని తస్కరిస్తుందేమోననే భయం రాగానే ఆమె నీటిలో దిగి మమ్ముటిని బయటకు లాగింది.

కార్తిని వీపు మీద ఎక్కించుకుని, ఒక తెప్పలా భారతప్పుళ దాటాడు మమ్ముటి. వీపును అంటుకొని ఉండే కార్తీ బరువు తక్కువ ఉండటం వల్ల ఆమె మత్స్యకన్నెగా మారిపోయిందేమోనని ఊహించి సరదాపడ్డాడు. నదిలో ఈదేటప్పుడు ఆమె శరీర స్పర్శకి పులకరించాడు.

ప్రవాహపు శక్తికి తట్టుకొని నది మధ్య ఈదేటప్పుడు కూడా మమ్మటికి ఇబ్బంది అనిపించలేదు.  మేలేప్పురం  తరవాడులో  అంతవరకు  మండిన ఉత్కంఠ, భయాందోళనలు ఎప్పుడో ఎక్కడో కాటువేసి పడగ ముడుచుకున్నాయి. మరణ భయం కూడా కొన్ని నిమిషాల క్రితం జరిగిన స్కలనంతో కొట్టుకుపోయింది. అంతవరకు అనుభవం లోకి రాని ఒక ప్రశాంతత అతన్ని స్థితప్రజ్ఞుణ్ణి చేసింది.

తెలుగు వాడి నవ్వు నరం…

mullapudi budugu

(రమణ గారు కన్ను మూసినప్పుడు..)

 

తెలుగు వాడి నవ్వు నరం తెగిపోయింది.

తెలుగు వాడికి నవ్వడం నేర్పించిన ముళ్ళపూడి వెంకట రమణకి నిష్క్రమణ లేదు.

మన ఇంట్లో బుడుగుల మాటలు విన్నప్పుడల్లా, మన రాజకీయ నాయకుల కార్టూన్ ముఖాలలోంచి పెల్లుబికే ఓటు వాక్కులు విన్నప్పుడల్లా , “ఓ ఫైవ్” కోసం మన చుట్టూ గ్రహంలా తిరిగే అప్పారావుల “నోటు” మాటలు విన్నప్పుడల్లా, చటుక్కున అక్కడ ముళ్ళపూడి ప్రత్యక్షమయిపోతారు. కాబట్టి, ముళ్ళపూడికి కన్నుమూతా, పెన్నుమూతా లేవు.
ముళ్ళపూడి నవ్వుల నావలో ఈ ప్రయాణం ఎప్పుడు మొదలయ్యింది? బుడుగుతోనేనా? ఆ నోటు బుక్కు సైజు పుస్తకం, కాస్త పెద్దచ్చరాలు, మధ్యలో బాపు వొయ్యారి గీతల్లో ప్రాణం పోసుకొని వివిధ భంగిమల్లో బుడుగూ, సీగాన పసూనాంబ..చూస్తున్నప్పుడే కాదు, పుస్తకం మూసి, రమణాక్షరాల్లోకి వెళ్తున్నప్పుడు కూడా కన్ను కొట్టినట్టుండే కొంటె గీతలు…అటు నించి వాక్యాల వెంట ప్రాణాలని లాక్కుపోయే రమణ గారి

మాటలు…బొమ్మ ముందా, మాట ముందా అంటే ఎటూ తేలని సందిగ్ధం. మొత్తానికి బుడుగు ఒక అనుభవం. మనలోపలి చిలిపితనాలని, కొంటె కోణాన్ని నిద్రలేపే రసార్ణవం.
వాక్యాలు అందరూ రాస్తారు. డయలాగుల లాగులు రైటర్ టైలర్లంతా కుడతారు. కాని, కొన్ని లాగులు అరువు లాగుల్లా వుంటాయి. బరువు మూటల్లా వుంటాయి. కాని, ఈ టైలరు అసలు ఎలాంటి కొలతలూ తీసుకోకుండానే మనసుకి కొలత పెట్టి డయలాగులు కుట్టేస్తాడు.

ముళ్ళపూడి డయలాగులు వదులూ కావు, బిగువూ కావు. మనసుకి వొదిగి పోతాయి. కాబట్టే, తెలుగు వాక్యం ఆయన దగ్గిర చాలా కాలం ఆగిపోయింది. ఆయన వొంపు సొంపుల రేఖల నించి తప్పించుకోవడానికి దానికి చాలా కాలం పట్టింది. ఆ మాటకొస్తే, ఆ వాక్యం ఇంకా అక్కడే ఉండి పోయిందేమో అనీ అనిపిస్తుంది. కనీసం మన నవ్వులు అక్కడ చిక్కడిపోయాయి.

(25 ఫిబ్రవరి 2011, ‘ఆవకాయ’ నించి..)

ఇవాళ ఏమి రాయాలి, ఎలా రాయాలి?

varalakshmi

(ఈ వ్యాసం వరలక్ష్మి గారు విరసం కథా రచయితల వర్క్ షాప్ కోసం రాసారు. కాని, ఇందులో ప్రస్తావించిన అంశాలు వర్తమాన కథకు అవసరమని భావించి ఈ వ్యాసాన్ని పునర్ముద్రిస్తున్నాము. ఇందుకు అనుమతించిన ‘అరుణ తార ‘పత్రిక సంపాదక వర్గానికి, వరలక్ష్మి గారికి ధన్యవాదాలు)

ఒక చీమ రోజూ ఆఫీసుకు పోయేది. ఆడుతూ పాడుతూ పని చేసేది. అది పని చేసే చోట మంచి ఉత్పత్తి వచ్చేది. సిఈవో సింహం చీమను చూసి సంతోషించేవాడు. ఒక రోజు అతను ఇలా ఆలోచించాడు. చీమ దానంతటది పనిచేస్తేనే ఇంత బాగా చేస్తోందే, దీని పైన ఒక మంచి సూపర్‌వైజర్‌ను పెడితే ఇంకెంత బాగా పనిచేస్తుందో అన్న ఆలోచన వచ్చిందే తడవుగా ఒక బొద్దింకను సూపర్‌వైజర్‌గా నియమించాడు. బొద్దింక అప్పటిదాకా లేని టైమ్‌ షీట్‌లు, అటెండెన్స్‌లు ప్రవేశపెట్టింది. వీటిన్నిటినీ చూసుకోడానికి ఒక సాలీడు సెక్రెటరీని అది నియమించుకుంది. సింహంగారు మెచ్చుకుంటూనే ఈ మార్పుల వల్ల ఉత్పత్తి ఎంత పెరిగింది, పనివిధానానికి సంబంధించిన రిపోర్టులు వగైరా అడిగారు. ఇవన్నీ చేయడానికి బొద్దింక కంప్యూటర్‌ను, ప్రింటర్‌ను  తెప్పించుకుని, వాటిని ఆపరేట్‌ చేయడానికి ఈగను నియమించింది. మరోవైపు ఆడుతూ పాడుతూ పనిచేసే చీమ నీరసించడం మొదలైంది. అది చేసే పనికితోడు పైఅధికార్లతో మీటింగులు, ఎప్పటికప్పుడు అందేయాల్సిన రిపోర్టులు దాని నెత్తిమీదికొచ్చి పడ్డాయి. ఈలోగా బొద్దింక అధికారికి తోడు మరో మేనేజరు, వీళ్ళ హోదాకు తగినట్లు ఆఫీసుకు కొత్త హంగులు, ఆర్భాటాలు తయారైనాయి. క్రమంగా చీమకే కాదు ఆఫీసులో ఎవరికీ పని పట్ల ఆసక్తి లేకుండాపోయింది. ఉత్పత్తి పడిపోయింది. సీఈవో సింహంగారు ఈ సమస్యను పరిష్కరించే పని కన్సల్టెంట్‌ గుడ్లగూబకు అప్పగించారు. ఇలాంటి సమస్యలకు పరిష్కారాలు కనుక్కోవడంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన గుడ్లగూబగారు ఆఫీసు స్థితిగతుల్ని అధ్యయనం చేసి అక్కడ అనవసర సిబ్బంది చాలా ఎక్కువగా ఉన్నారని తెల్చారు. వెంటనే సింహం, బొద్దింక మీటింగ్‌ పెట్టుకుని కొంతకాలంగా పనిపట్ల అలసత్వం ప్రదర్శిస్తున్న చీమను పనిలోనుండి తొలగించాలని తీర్మానం చేశాయి.

ఇదొక ఈజిప్టు కథ. ఈ కథ రాసిన రచయితను దేశం నుండి బహిష్కరించారట. గత ఆరేడేళ్లుగా క్రమం తప్పకుండా జరుగుతున్న విరసం కథావర్క్‌షాపుల్లో వర్తమాన విప్లవ కథ గురించిన లోతైన సమాలోచనలు సాగుతున్నాయి. మరీ ముఖ్యంగా గత రెండుమూడు వర్క్‌షాపుల్లో ఏం రాయాలి, ఎలా రాయాలి అనే చర్చ ప్రధానంగా సాగుతోంది. వర్తమాన సమాజాన్ని, సంక్షోభంలో కూరుకపోతున్న జీవితాన్ని, అందులోంచి నిర్మాణాత్మకంగానూ, స్పాంటేనియస్‌గానూ పెల్లుబుకుతున్న పోరాటాలను ఎలా కథలుగా మలచవలసి ఉన్నది? వీటన్నిటినీ చిత్రించవలసిన దృక్పథం, ఈ సంక్షోభాలను, పోరాటాలను పట్టివ్వగల శిల్పం ఈ సమావేశాల్లో ఎక్కువ చర్చనీయాంశం అవుతున్నది.  సమాజంలో మార్పులు వేగవంతమవుతున్న కొద్దీ వాటిని పట్టుకోడానికి సాహిత్యంలో ఎప్పుటికప్పుడు కొత్త పరికరాల తయారు చేసుకోవాల్సి ఉంటుంది. ఉన్న పరికరాల్ని చాకచక్యంగా వాడాల్సి ఉంటుంది. ప్రొద్దుటూరు కథావర్క్‌షాపులో (సెప్టెంబర్‌ 8,9- 2012) ఈ చర్చ జరుగుతుండగా  అల్లం రాజయ్య పైన చెప్పిన  చీమ కథను పరిచయం చేశారు. పెట్టుబడిదారీ వ్యవస్థలోని అసంబద్ధతను, దుర్మార్గాన్ని చాలా అలవోకగా, అద్భుతంగా ఆవిష్కరించిన కథ అని చెప్పారు.  అలాంటి మరో అద్భుతమైన శిల్పంతో మార్క్వెజ్‌ రాసిన డెంటిస్ట్‌ అనే కథను  కూర్మనాథ్‌  పరిచయం చేశారు.

944430_182879141874436_2064579889_n

మన కథలో మార్పుకు సంబంధించిన అంశం కీలకంగా ఉండాలి. అట్లాగే మారుతున్న సామాజిక పరిస్థితుల్ని చిత్రీకరిస్తున్న క్రమంలో సాహిత్యం కొత్త కొత్త వ్యక్తీరణల్ని తీసుకొని రావాలి. జీవన స్థితిగతులు మారినట్టే సాహిత్యంలో కాలానికి తగిన ఎక్స్‌ప్రెషన్‌ తీసుకోవాలి. ఈ మధ్య గాన్‌ విత్‌ ద విండ్‌ తెలుగులో చదివుతున్నప్పుడు మార్పుకు సంబంధించిన అద్భుతమైన వ్యక్తీకరణ అందులో కనపడింది. అట్లాంటాలో జరిగిన అనేక సంఘర్షణలు భూస్వామ్య సమాజం నుండి పెట్టుబడిదారీ సమాజానికి మార్పులు కనిపిస్తాయి.  తెలంగాణ సాంస్కృతిక వ్యక్తీకరణను పోలినవి అందులో చాలా ఉన్నాయి. మాలాంటి వాళ్ళం స్కార్లెట్‌తో, బట్లర్‌తో (గాన్‌ విత్‌ ద విండ్‌ నవలలో పాత్రలు) పోల్చుకోవలసిందే. ఇక్కడా అనేక కోటలు కరిగిపోయాయి. పరిణామాలు చాలా జరుగుతున్నాయి…అంటూ అల్లం రాజయ్య ప్రారంభించిన చర్చలో గ్రామీణ సమాజం నుండి ప్రపంచ రాజకీయాల వరకూ అనేక ఆసక్తికరమైన విషయాలను హాజరైనవాళ్లు ప్రస్తావించి విశ్లేషించారు.

సమాజంలో ఒక ఘటన జరిగేలోపే ఇంకో ఘటన జరిగిపోతూ ఉంది. ఇంత డైనమిక్‌గా సమాజం మారుతూ వస్తున్నప్పుడు ఏ కథ రాయాలి? ఏ ఇతివృత్తం రాయాలి? వ్యక్తం కాని విషయాలను ఎట్లా వ్యక్తం చేయాలి? అనే సమస్యలు సీరియస్‌ రచయితల ముందు ఉన్నాయి. మన సాహిత్యంలో ఎక్స్‌ప్రెషన్‌కు సంబంధించి చాలా ఇబ్బందులున్నాయి. శిల్పపరంగా చాలా నేర్చుకోవాల్సే ఉంది. లాటిన్‌ అమెరికన్‌ సాహిత్యంలో మంచి ప్రయోగాలున్నాయి. మనం ఇక్కడ చేయవలసిన ప్రయోగాలు ఏమిటి? విప్లవ దృక్పథంతో ఎలా ఆ వస్తువులన్నింటిని అర్థం చేసుకోడానికి ఎలా విస్తరించాల్సి ఉంది? అనే దిశగా ప్రొద్దుటూరు వర్క్‌షాపులో మొదటి రోజంతా చర్చ జరిగింది. ఈ విషయంలో వర్క్‌షాపులన్నిటిలో ప్రతిసారీ జరుగుతున్న చర్చ ఈసారి మరింత ముందుకు తీసికెళ్లగలిగామని అందరికీ అనిపించింది.

ఈ చర్చ కేవలం ఆలోచనలకే పరిమితం కాకుండా విప్లవ కథా రచనలో చాలా వరకు వ్యక్తమవుతూనే ఉంది. నిజానికి విరసం 1980ల నుంచి నిర్వహిస్తున్న కథా వర్క్‌షాపులన్నీ ఈ కోణంలో  చాలా మంచి ఫలితాలను ఇస్తూనే వచ్చాయి. ప్రతి థలోనూ ఆ సామాజిక, ఉద్యమ సన్నివేశానికి అనుగుణంగా విప్లవ కథను తీర్చిదిద్దడానికి దోహదపడుతున్నాయి. దృక్పథం, శిల్పం వగైరాల్లో మెళకువలు అందిస్తున్నాయి.  ఇంతే ముఖ్యమైన విషయం మరొకటి ఏమంటే- విప్లవ కథా రచనలోకి మూడు నాలుగు తరాల రచయితలను ఈ వర్క్‌షాపులే తీసుకొని వచ్చాయి. విరసం సభ్యులతోపాటు ఈనాడు సుప్రసిద్ధ కథకులుగా గుర్తింపు పొందిన మార్క్సిస్టు రచయితల్లో చాలా మంది విరసం వర్క్‌షాపుల్లో పాల్గొన్నవాళ్లే. నిర్దిష్టంగా విరసంలో ఈ తరం  కథా రచయితలందరూ చాలా వరకు ఈ సమావేశాల్లో మెళకువలు నేర్చుకున్నవారే. వర్క్‌షాపులే కథలకులను తయారు చేయకపోవచ్చుగాని,  రచన పట్ల ఆసక్తి ఉన్నవాళ్లను  మేలైన కథకులుగా తీర్చిదిద్దడంలో ఈ వర్క్‌షాపులు గణనీయమైన ఫలితాలను ఇస్తున్నాయి. సీనియర్‌ కథకులనుంచి ఔత్సాహిక రచయిత దాకా.. విరసం సభ్యులు, సోదర రచయితలు పాల్గొంటున్న ఈ సమావేశాల్లో  కథా పఠనం జరిగాక  ఆ నిర్దిష్ట కథ విశ్లేషణేగాక,  సాధారణస్థాయిలో కథా సాహిత్యంలో రావలసిన మార్పుల దాకా విస్తరిస్తాయి. ఇవి  ఆ తర్వాత కథలు రాయడానికి  ఉపయోగపడుతున్నాయి.

ఆరేడేళ్ళుగా ఈ సమావేశాల్లో వర్తమానంలో  ఏం రాయాలి, ఎలా రాయాలి అని జరుగుతున్న చర్చ  అనుత్పాదకంగా మిగిలిపోలేదు.  కొత్త కథకుల్ని తయారుచేయడమే కాక, ఈ చర్చల సారాంశం  ప్రయోగాల్లో, దృక్పథ స్పష్టతలో వ్యక్తమవుతోంది. దీనికి ప్రొద్దుటూరు, మిర్యాలగూడ (మార్చి 9,10- 2013) వర్క్‌షాపుల్లో వచ్చిన వైవిధ్యభరితమైన కథలే ఉదాహరణ. ఈ రెండు సమావేశాల్లో చదివిన ప్రతి కథ దానికదే ప్రత్యేకమైనదీ, అవసరమైనదీ అయినా ఇక్కడ కొన్నిటి గురించే ప్రస్తావిస్తాను. ఇక్కడ చదివి, చర్చించి సవరించిన కథల్లో కొన్ని ఇప్పటికే అచ్చయ్యాయి కూడా. అందు వల్ల వర్తమాన కథ కోసం జరుగుతున్న ప్రయత్నానికి ఉదాహరణగా కొన్ని వివరాలు రాస్తాను.

ఒకే ఇతివృత్తం మీద రెండు కథలు (దోషులు, రాజుగారి పులిస్వారీ) తీసుకొచ్చారు కూర్మనాథ్‌. సత్యం ఐటి కంపెనీ పేకమేడలు కుప్పకూలడం కేంద్రంగా తీసుకొని రాసిన కథలు ఇవి. ఫైనాన్స్‌ వ్యవహారాలు రాసే జర్నలిస్టులు అబద్ధాలపై, భ్రమలపై ఆధారపడి రాయడం గురించి, కార్పొరేట్‌ శక్తులు, రాజకీయ వ్యవస్థ, మీడియా కలగలసిపోయి పత్రికా వ్యవస్థను భ్రష్టుపట్టించడం మొదటి కథలో కనపడుతుంది. రెండోది ఫైనాన్స్‌ కాపిటల్‌ వలయంలో పడి పులిస్వారీ చేస్తున్న వ్యాపారవేత్త గురించిన కథ. నిజానికి రెండూ వేరువేరు కథలు. ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నప్పుడు ఇట్లా భిన్నకోణాల్లో వ్యక్తీకరించే ప్రయత్నం చేయడం అరుదైన విషయమే.

ఒక కార్పొరేటు కంపెనీ అట్టహాసంగా జరిపిన తెలుగు మహాసభలను, గ్రామంలో జరిగే తిరుణాలను పోలుస్తూ రుక్మిణి రాసిన కంపెనీ తిరుణాల కథలో చివరికి తెలుగుభాషను, సంస్కృతిని ఉద్ధరిస్తున్నామని చాటుకుని, రచయితల, భాషాపండితుల చేత ప్రశంశలందుకున్న కంపెనీ ప్రాణాంతక రసాయనాలను వదిలి ప్రజల ఎదుట ద్రోహిగా నిలబడుతుంది. భాషాసంస్కృతులు పుస్తకాల కందే మామూలు విషయాలు కావని, అవి ప్రజల జీవనంతో పెనవేసుకున్నవన్న సత్యాన్ని విస్మరించి, పైపై ఆర్భాటాలకు లొంగిపోయే సాహిత్యకారులను చూసి రచయిత్రి ఈ కథ రాశారు. సమకాలీన సాహిత్యరంగానికి, కార్పొరేట్‌ శక్తులకు ఉన్న సంబంధాన్ని చాటే తాజా ఇతివృత్తం ఇది. రుక్మిణి  మిర్యాలగూడ వర్గషాపుకు మరో భిన్నకథాంశంతో వచ్చారు. ఒకప్పుడు విప్లవ విద్యార్థి ఉద్యమ రాజకీయాలతో ప్రభావితమైన తెలుగుసమాజం చాలా మార్పుల గుండా ప్రయాణం చేసింది. ఒక తరం గడిచాక, ప్రపంచ మార్కెట్‌కు మన సమాజం ప్రయోగశాల అయ్యాక విలువలూ, ఆదర్శాలూ మారిపోయాయని తల్లిదండ్రులు విచారించాల్సిన పరిస్థితి ఏర్పడింది. తమ ఆదర్శాలను పిల్లలకు అందించలేకపోయామని, లోపం ఎక్కడో జరిగిందని వాళ్లు తర్కించుకోవలసి వచ్చింది.  తల్లిదండ్రుల సామాజిక ఆచరణలోనే ఉన్న లోపం, కుటుంబం లోపల ఉన్న పరిమితులు, బైటి ప్రభావాలు.. ఏవి ఏ స్థాయిలో  పిల్లలను ప్రభావితం చేస్తున్నాయో ఆలోచింపజేస్తూ సాగిన కథ ఇది. ఈ వర్క్‌షాప్‌లో పాల్గొన్నవాళ్లలో  ముఖ్యంగా మధ్యవయస్కులు ఈ కథతో మమేకయ్యారు.

విజయలక్ష్మి ప్రొద్దుటూరు సమావేశంలో నెల్లూరుజిల్లాలోని ఒక పల్లెటూరులో వీథి అరుగుమీద కూర్చున్న పెద్దాయన కేంద్రంగా నడిపిన కథను ప్రొద్దుటూరులో చదివారు. నిజానికి ఈ కథలో ఆయన చుట్టూ గ్రామీణ సమాజమంతా  పరిభ్రమిస్తుంటుంది. కుటుంబ సమస్యలు, గిట్టుబాటుకాని పంటలు, పట్నంలో చదువులు, పల్లె జీవితంలో సంక్లిష్టమైన కదలికల్ని గమనిస్తూ, వ్యాఖ్యానిస్తూ సాగిన ప్రయోగాత్మక కథ. హాస్యం,  ఎత్తిపొడుపులు, సామెతలు గ్రామీణ పలుకుబళ్లు నిండుగా ఉన్న కథ ఇది.

కథా ప్రక్రియలోకి తాజాగా ప్రవేశించిన పావని అంతే తాజా వ్యక్తీకరణతో పట్టణ మధ్యతరగతి విద్యార్థుల సరదా సరదా సంభాషణలతో రాసిన కథ కొన్ని రంగులూ.. ఒక కల. రాజకీయాలు, ఉద్యమాలూ, స్నేహాలూ, ప్రేమలూ, ఆదర్శాలూ ఇప్పటి తరంలో ఎట్లా వ్యక్తమవుతున్నాయో ఈనాటి భాషలో, సంస్కృతిలో వ్యక్తం చేసిన కథ ఇది.  ఈ తరంలో ఎంత పరిణతిగల మనుషులు ఉన్నారో కూడా ఆశావహంగా ఈ కథ నడిచింది. మిర్యాలగూడాలో ఇంకొన్ని మంచి కథలు వచ్చినా పావని చదివిన కథ విన్నాక అందరూ చాలా తాజాగా  ఫీలయ్యారు. ఇవాల్టి జీవితంలో ఎంత సంక్లిష్టత ఉన్నా ఆశారేఖ కూడా అందులో ఉందని చాటే కథ ఇది.

వస్తువ్యామోహం వల్ల ఈ తరం పిల్లల్లో ఎలాంటి మార్పులు వస్తున్నాయో సుభాషిణి ఒక కథ వినిపించారు. పిల్లలను మన ఆదర్శాల ప్రకారం పెంచాలనుకున్నా వాస్తవానికి వాళ్లను రూపొందిస్తున్న వ్యవస్థ ఒకటి ఉందని, ఈ తరహా పౌరులు లేకుండా అది బతకలేదనే లోతైన అర్థం పలికే కథ ఇది. సరిగ్గా ఈ సమస్యనే వి. ప్రతిమ చదువుల వైపు నుంచి డీల్‌ చేశారు. పిల్లలకు కనీసం తమ పేరుకు ఉన్న అర్థం ఏమిటో కూడా తెలుసుకునే వీలు లేని విధంగా  ఈ చదువులు తయారైపోయాయనే సున్నితమైన విమర్శ ప్రకటించే కథను చదివారు. సుభాషిణి, ప్రతిమ కథలు ఈ స్థితికి ఏదైనా ప్రత్యామ్నాయం ఉంటుందా? అనే ఆశతో ముగుస్తాయి.

ఈ స్థితిని ఎలా అర్థం చేసుకోవాలి? ప్రగతిశీల కథకులు దీని మీద ఎలాంటి కథలు రాయాల్సి ఉంటుంది? అనే చర్చ జరిగే క్రమంలో పాణి దండకారణ్య కథలను  క్లుప్లంగా ఇలా పరిచయం చేశారు.

తెలుగుసాహిత్యంలో ఇప్పుడొస్తున్న కథల గురించి, రావాలసిన కథల గురించి చర్చింవలసింది చాలనే ఉంది. అయితే మన పక్కనే   ప్రధాన స్రవంతి పత్రికలుగాని, తెలుగుసాహిత్య సమాజంగాని పట్టించుకోని కథలు కూడా ఉన్నాయి అవి దండకారణ్యం నుంచి వస్తున్నాయి. వాటిలో అద్భుతమైన ప్రయోగాలు ఉంటున్నాయి. ముఖ్యంగా ఈ నాలుగైదేళ్ళుగా యుద్ధం, ఉత్పత్తి, నిర్మాణం మధ్య అల్లకల్లోలంగా  ఉన్న దండకారణ్యం నుండి నూతన సమాజాన్ని, నూతన మానవుడ్ని ఆవిష్కరిస్తున్న కథలు వస్తున్నాయి. ఇక్కడ మన జీవితంలో సంక్లిష్టమైన సమస్యలు ఆవరించి ఉన్నాయి.   పరిష్కారం తెలీని  సందిగ్ధత,  స్టాగ్నేషన్‌ ఆవరించి ఉన్నది. ఇక్కడ నడుస్తున్న పోరాటాలు ఈ స్థితి మీద ఒక ఆచరణాత్మక విమర్శ పెడుతున్నా, పరిష్కారాలు ఇలా ఉంటాయని చెబుతున్నా.. మొత్తం మీద ఒక సందిగ్ధ స్థితి ఉన్న మాట వాస్తవమే. అయితే దండకారణ్య కథల్లో ప్రతి కథకూ ఒక పరిష్కారం ఉంటుంది. దీనిని మామూలు సాహిత్యకారులు అంగీకరించకపోవచ్చు. ఇది మూస వ్యవహారమని ఈసడించుకోవచ్చు. కానీ దండకారణ్యంలో జరుగుతున్న పోరాటం, నిర్మాణం ప్రతి సమస్యతో ఆచరణాత్మకంగా  ఎదుర్కొంటున్నాయి.  ఈ క్రమంలో చైతన్యవంతులవుతున్న ఆదివాసులు దానికి ఒక పరిష్కారాన్ని కూడా  వెతుక్కుంటున్నారు. ఈ క్రమం అక్కడి కథా వస్తువులో, దృక్పథంలో, శిల్పంలో  కనిపిస్తుంది.  ఈ కథల్ని  ఎక్కువగా మహిళలు రాయడం కూడా ఒక ప్రత్యేకత. ఆదివాసీ తెగలు  పితృస్వామ్యాన్ని, రాజ్యహింసను ఎదుర్కొంటూ యుద్ధంలోనూ, ఉత్పత్తిలోనూ, నూతన సమాజ నిర్మాణంలోనూ పాల్గొంటున్నాయి. ఇది ఒక సామాజిక రాజకీయ పరివర్తనా క్రమం.  అందువల్ల అరుణతార ఈ తరహా రాజకీయ కథలకు వేదికవుతున్నది. వీటికి విస్తృత ప్రచారాన్ని ఇవ్వాల్సిన అవసరం కూడా ఉన్నది… అంటూ చాలా వైవిధ్యమైన వస్తువులు, శిల్ప పద్ధతులు ఉన్న ఆరు కథల్ని తీసుకొని పరిచయం చేశారు.  సల్వాజుడుం, ఉద్యమం నేర్పుతున్న ప్రత్యమ్నాయ చదువులు, విలువలు,  యుద్ధం, రాజ్యనిర్బంధం, జైలుజీవితం, వీటన్నిటి  నేపథ్యంలో మానవసంబంధాలను తీర్చిదిద్దుతున్న వర్గపోరాటం గురించి ఆ కథలు ఎలా చిత్రించిందీ విశ్లేషించారు.  (కొన్ని దండకారణ్య కథలతో  త్వరలో విరసం సంకలనం తేబోతున్నది)

మిర్యాలగూడా సమావేశంలో స్కైబాబ  తెలంగాణ ఉద్యమ సమయ సందర్భాల్లో రాసిన కథ చదివారు.  తన ఊరికి దూరంగా, గతంలో తానున్న స్థితికి దూరంగా ఉన్నత స్థాయి జీవితం గడుపుతున్న వ్యక్తి వైపు నుంచి కథ నడుస్తుంది. అతడికి ఇప్పటికీ గ్రామంలో ఆనాటిలాగే బతుకుతున్న మిత్రుడితో స్నేహం కొనసాగుతూ ఉంటుంది. తన జీవన విధానంపట్ల అసంతృప్తితో ఆ మిత్రుడ్ని కలవడానికి గ్రామానికి వెళ్తాడు. అక్కడ కనిపించే వాస్తవికత అతడిని సంక్షోభంలో పడేస్తుంది. అక్కడ మిత్రుడి కొడుకు గ్రామాల్లో చేస్తున్న కార్యకలాపాలను తెలుసుకున్నాక అంత వరకు తాననకున్న జీవన ప్రమాణాల విచికిత్సకు గురవుతాడు. వర్తమాన పరిణామాల్లోని వాస్తవికతను ఈ కథ ప్రతిబింబించిందనే కోణంలో చర్చ జరిగింది. తెలంగాణ గ్రామ వాతావరణం, భాష కథలో బాగా కనిపించింది. అయితే మిత్రుడి కొడుకు ఎంచుకున్న మార్గంలో సమస్యలు పరిష్కారమవుతాయా? మొత్తంగా ఇలాంటి పరిణామాలకు ఒక ఆశావహమైన ముగింపుఎలా ఉంటుంది? అనే దిశగా చర్చ సాగింది.

కథా వస్తువుకోసం అన్వేషిస్తున్న రచయితకు ఊరి నుండి కాసిన్ని పండ్లు తెచ్చుకుని అమ్ముకునేందుకు జాగా కోసం వెతుకుతున్న మనిషి కనపడతాడు. అతను జాగాకోసం ఎన్నెన్ని తిప్పలు పడతాడో, ఎన్ని శక్తులతో ఘర్షణ పడతాడో అసక్తికరంగా ఫాలో అయిచూస్తుంటాడు. రచయితకు కథా వస్తువు దొరుకుతుంది కాని ఆ మనిషికి జాగా మాత్రం దొరకదు. రియల్‌ ఎస్టేట్‌, భారీ నిర్మాణాల వల్ల ఒక వైపు విస్తరిస్తున్నట్లు కనిపించే నగరాలు నిజానికి ఎంతగా కుంచించుకుపోతున్నదీ, సామాన్యుడికి నిలబడటానికి కాసింత నీడ కూడా ఎట్లా కరువైపోతున్నదీ మిర్యాలగూడా సమావేశంలో ఉదయమిత్ర  ‘జాగా’ అనే కథ చదివారు. అలాంటిదే మరో కొత్త ఇతివృత్తంతో చిన్న కథ చదివారు. బహుశా అన్ని ప్రాంతాల్లో నదుల్లో, వంకల్లో జరుగుతున్న ఇసుక దొంగతనం గురించి రాసిన కథ ఇది. ఇసుక మాఫియా తక్షణ సమస్యగానేగాక, దీర్ఘకాలంలో పర్యావరణ సమస్యగా కూడా ఎట్లా మారబోతోందో వాస్తవికతా శిల్పంలో ఈ కథ చిత్రించింది. ఒక రకంగా గ్రామస్థాయి నుంచి లుంపెన్‌ సెక్షన్‌ ఇసుక రవాణాతో ఎలా తయారవుతున్నదీ, పట్టణీకరణ నేపథ్యాన్ని కూడా ఇది చిత్రించింది.

పాణి రాసిన రాజకుమారుడు.. కార్పేటమ్మ అనే కథ ప్రత్యేకమైన శిల్పంలో సాగింది. వ్యంగ్యం, ఫాంటసీ, వాస్తవికతలతో మూడు విభాగాలుగా గనుల రాజకీయార్థిక మూలాలను తడిమిన కథ ఇది. తాజా ఇతివృత్తంతో, కొత్త శిల్పంలో సాగింది.

ముస్లిం జీవిత నేపథ్యంలో పితృస్వామ్య ఆధిక్యాన్ని ధైర్యంగా ఎదిరించిన మహిళ గురించి మహమూద్‌ ప్రొద్దుటూరులో ఒక కథ వినిపించారు. ఈ తరహా కథల్లో వర్క్‌షాపులకు వచ్చిన కథల్లో ఇది అందరినీ ఆకట్టుకుంది. ఈ సమస్య ముస్లిం కుటుంబాల్లో ఎలా ఉండేదీ ఇది చిత్రించింది. అక్కడే బాసిత్‌ మబ్బులు తొలిగిన ఆకాశం అనే కథ చదివారు. ఇది కూడా మారుతున్న మానవ సంబంధాల్లోకి, విలువల్లోకి అందం, రంగు అనేవి కూడా ఎట్లా ప్రవేశించిందీ చెప్తూ వీటన్నిటికంటే జీవన విలువలపట్ల మనిషి అంతిమంగా మొగ్గు చూపుతాడనే కోణంలో ఈ కథ సాగింది. పైకి చాలా చిన్న ఇతివృత్తాలుగా కనిపించినా సామాజిక నేపథ్యంపట్ల రచయితలకు దృష్టి ఉంటే వీటినే ఎంత లోతుల్లోంచి వివరించవచ్చో ఈ కథలు నిరూపిస్తాయి.

ఇంతకూ ఇటీవల సమాజంలో మన కంటికి కనిపిస్తూ, అనుభవంలో భాగమవుతూ, జ్ఞానానికి అర్థమవుతూ ఎన్ని రకాల మార్పులు జరుగుతున్నాయి? కథకులు వీటిలో ఎన్నిటి గురించి ఎంత శ్రద్ధగా, సరైన దృక్పథంతో రాస్తున్నారు? అసలు కథల్లోకి రాకుండా ఉండిపోయిన పరిణామాలు ఏమిటి? అనే దిశగా ప్రొద్దుటూరులో వెంకటకృష్ణ ఒక ఆసక్తికరమైన పరిశీలనాత్మక ప్రసంగం చేశారు. ముఖ్యంగా గ్రామ స్థాయిలో వ్యవస్థ ప్రజలను తనలో భాగం చేసుకోడానికి ఎన్ని రూపాల్లో, ఎన్ని పథకాలతో ప్రయత్నిస్తోందో చెప్పి, అవి అక్కడి జీవితాన్ని చాలా పెద్ద ఎత్తున ప్రభావితం చేస్తున్నాయని విశ్లేషించారు. అయితే వీటి గురించి మన కథకులకు అంతగా పట్టలేదనే చెప్పాలి. కొన్ని మార్పులు కథా వస్తువులుగా స్వీకరించినా అంత బలంగా కథలు రాలేదనే చెప్పాలి.. అని విశ్లేషించారు. అట్లాగే విప్లవ కథకులు ఏ రకమైన వస్తువులపై ప్రత్యేకమైన శ్రద్ధ పెడుతున్నదీ ఎత్తి చూపి, అంతగా పట్టించుకోని ఇతివృత్తాల గురించి  గుర్తు చేశారు. ప్రత్యేకంగా విప్లవోద్యమం మీద విమర్శనాత్మక వైఖరితో విరసం సభ్యులు ఎందుకు రాయకూడదు? అని ప్రశ్నిస్తూ.. ఇటీవలి విప్లవ కథలోని వైవిధ్యాన్ని స్థూలంగా అంచనా వేశారు.

వెంకటకృష్ణ వేసిన ప్రశ్నపై కూర్మనాథ్‌ స్పందిస్తూ.. విప్లవోద్యమం మీద ఎవరికైనా విమర్శనాత్మక అభిప్రాయాలే ఉండవచ్చు. అయితే నేను మాత్రం అవి కథల్లో  రాయను. వాటి గురించి నేను చర్చించే పద్ధతి వేరేగా ఉంటుంది. అవి కథల్లోకి తేవాలని అనుకోను. అసలు  దానితో కలిసి నడవకుండా, దాని మార్పులేమిటో సన్నిహితంగా తెలుసుకోకుండా విమర్శనాత్మకంగా రాయడం ఎలా సాధ్యమవుతుంది? అన్నారు.

ఇదంతా ఈ రెండు సమావేశాల్లోని కొన్ని కథల గురించే. అన్నిటి గురించీ ఇలాంటి విశ్లేషణలే ఇవ్వవచ్చు. మొత్తం మీద ఈ రెండు సమావేశాల్లో వర్తమాన జీవితాన్ని.. దాని మొత్తంలో భాగంగా, దాని సంక్లిష్ట సారాంశంలో భాగంగా ఎలా కథలు రాయాలి? అనే చర్చ ప్రధానం. కొత్త పరికరాలతో, కొత్త శిల్ప పద్ధతులతో గాఢంగా విప్లవ కథను ఎలా అభివృద్ధి చేయాలనేదే వర్క్‌షాపుల ఇతివృత్తం. మారుతున్న సమాజాన్ని.. మారుతున్న విప్లవోద్యమాన్ని, ప్రజాపోరాటాలను దృష్టిలో పెట్టుకొని కథ అభివృద్ధి చెందాల్సి ఉంది. పరివర్తనాథలో ఉన్న మొత్తం సమాజాన్ని ప్రతిబింబించడం, అందులోని మార్పు క్రమాలను చిత్రించడం ఇవాళ్లి విప్లవ కథలకుల లక్ష్యం. ఆ దిశగా సాగడానికి ఈ సమావేశాలు స్ఫూర్తిని ఇస్తున్నాయి.

నేనేమిటి?

rajireddi-1

రాజిరెడ్డి అనే పేరు కేవలం వొకానొక పేరు కాదని ఇప్పుడు మనకు తెలుసు. ఆ సంతకం పైన కనిపించే వాక్యాలు కూడా సాదాసీదా వాక్యాలు కాదనీ తెలుసు. రాజిరెడ్డి చిరు వచన దరహాసాన్ని “పలక-పెన్సిల్” పుస్తక రూపంలో సారంగ బుక్స్ ద్వారా త్వరలో మీకు అందించబోతున్నామని తెలియజేయడానికి సంతోషిస్తున్నాం. ఈ ఏడాది సారంగబుక్స్ ద్వారా వెలువడుతున్న తొలి పుస్తకం “పలక-పెన్సిల్”. ఆ పుస్తకం నించి వొక మెచ్చుతునక మీ కోసం!

 *

ఇది రాయడానికి నాగ్‌ పంపిన ఒక మెయి­ల్‌ ఆధారం (నవంబర్ 2010). అది చదవగానే నాకు చిన్నగా వణుకు మొదలైంది. ఈ వణుకు భౌతికమైంది కాదు, మానసికమైంది. అందులోని సారాంశం ఏమిటంటే: కోరికలను అణిచి ఉంచడం, దాచిపెట్టడం, మనం లోపల ఒకలా ఉండి బయటకు ఇంకోలా కనబడే ప్రయత్నం చేయడం, వ్యాకులత, నిర్ణయం తీసుకోలేనితనం, తేల్చుకోలేకపోవడం… ఇత్యాదివన్నీ గ్యాస్ట్రిక్‌, అల్సర్… ఇంకా ము­దిరితే క్యాన్సర్స్‌గా పరిణామం చెందుతాయి.

ఇప్పటికిప్పుడు నాలో ఏం తప్పులున్నాయి­? ఏం తప్పులుచేసి దాచిపెట్టాను? ఏం తప్పులు చేయాలనుకున్నాను?

బయటికి చెప్పినవీ చెప్పలేకపోయి­నవీ లోపల ఉన్నవీ లోలోపల దాక్కున్నవీ అంతరాంతరాళాల్లో రక్తంలో ఉన్నవాటిని వేరుచేయడానికి శ్రమపడాల్సినవీ….   తప్పులు ఒప్పులు కన్ఫెషన్లు కోరికలు ఇబ్బందులు హిడెన్‌ ఎజెండాలు ఓపెన్‌ ఆదర్శాలు అన్నింటినీ కలిపి ఒక్కసారి సంచీని దులిపేసినట్టుగా దులపడానికి ప్రయత్నించాను. ఇంకో విధంగా చెప్పాలంటే, నాకు నన్నే ఓసారి తిరిగి పరిచయం చేసుకున్నాను.

* ఎవరినీ నేను పట్టించుకోనట్టు నటిస్తాను కానీ అందరూ నన్ను గుర్తించాలనుకుంటాను.

* టీవీ పాడైతే మెకానిక్‌ను పిలవడం, గిర్నీ ఎక్కడ పట్టించాలో వెతకడం… ఇలాంటివన్నీ నాకు జన్మలో సాధ్యం కాదు.

* నాకు ఫోనోఫోబియా ఉంది.

* ఈ ప్రపంచంలో నా ఒక్కడికే నూటా ఇద్దరు ప్రియు­రాళ్లుండే మినహాయింపు ఉండకూడదా?

*విలాస వస్తువుల మీద నాకు సరైన స్పష్టత లేదు. ఒక్క కెమెరా కొనడానికి కొన్నేళ్లు ఆలోచించాను, అది లగ్జరీ వస్తువే అన్న కారణంగా, నాకు ఆర్థిక ఇబ్బంది లేనప్పటికీ. అది కొంటే ఎలా? కొనకపోతే ఎలా? ఎన్నోసార్లు ఎన్నోవిధాలుగా మథనపడి కొన్నాను. తీరా కొన్నాక కొనకపోతే బాగుండుననిపిస్తోంది. ఒకవేళ కొనకపోయి­వుంటే మళ్లీ నేను కొనలేకపోతున్నానని బాధపడుతుండేవాడిని.

* ప్రభుత్వాఫీసులన్నా, ప్రొసీజర్లన్నా వణుకు. ఆ కారణంగానే కొన్నింటికి నేను అప్లై చెయ్యను. ఇంతవరకు బానే ఉంటుంది. కానీ ఏ ఎక్సో పాపం నా మంచి గురించే, అది ఉంటే మంచిదంటాడు. మళ్లీ నేను డైలమా. అలోచించీ చించీ చించీ నా మనసును మేకప్‌ చేసుకునే సరికి నాకు కొద్దిగానైనా రక్తం ఖర్చయి­పోతుంది కదా!

* కొత్త బట్టలు వేసుకోవడం నాకు చాలా ఆడ్‌-గా ఉంటుంది. వాటి కొత్తదనం చూసేవాళ్లకు ఇట్టే తెలుస్తూనే ఉంటుంది. నెలరోజులు పాతవి అయి­పోతేగానీ నాకు మామూలుగా ఉండదు. పైగా, ఏ విధంగానూ అంతకుముందు పరిచయంలేని ప్యాంటునో, చొక్కానో నా ఒంటిమీదకు ఎలా తెచ్చుకోవడం? ఆ కొత్త చొక్కాతో నా శరీరానికి కొంత పరిచయం జరిగేదాకా నేను దాన్ని ఓన్‌ చేసుకోను.

* నేననుకోవడం నేను పిసినారిని ఏమీ కాను. చాలాసార్లు నేను అనుకున్నవాటికి ఇట్టే ఖర్చుపెట్టేస్తాను. దానికీ నాకూ మధ్య ఏదో ఒక గురి కుదరాలి. అలా లేనప్పుడు మళ్లీ సంశయంలో పడిపోతాను. ఇది ఎంతదాకా వెళ్తుందంటే, ఒక కొబ్బరిబొండాం తాగడానికి నాకు పదకొండేళ్లు పట్టింది. నేను ఆరోతరగతిలో ఉన్నప్పుడు మొ­దటిసారి కొబ్బరిబొండాం గురించి విన్నా. కొబ్బరికాయ తెలుసుగానీ బోండాం తెలియదు. అదేంటో కుతూహలం. కానీ అలా దాగుండిపోయింది తప్ప, అది తీర్చుకునే అవకాశం రాలేదు. ఇంటర్లోకొచ్చినప్పుడు మొదటిసారి చూశాను, హైదరాబాద్‌లో. దగ్గరికి వెళ్లి అడుగుదును కదా, ఏడు రూపాయలని చెప్పాడు. అంత ఖరీదైన వస్తువని నేను ఊహించలేదు. అక్కడ్నించి వచ్చేశాను. మళ్లీ మళ్లీ మళ్లీ ఎన్నోమార్లు ఆ ఒక్క కోరిక  తీర్చేసుకుంటే అయి­పోతుందని అనుకున్నాను. కానీ తీర్చుకోలేదు. అది ఎప్పటికి తీరిందంటే, నా డిగ్రీ అయి­పోయి­, పటాన్‌చెరులో జాబ్‌లో చేరాక.  ఇది మూర్ఖత్వమేనా? అప్పటి నా స్థాయికి బోండాం ఖరీదే. కానీ కచ్చితంగా నేను కొనలేనంత ఖరీదైనదేమీ కాదు. అయి­నా నేను కొనలేదు. అలా అని దాని గురించి ఆలోచించకుండా ఉండనూలేదు. ఎందుకంటే దానికి అంత పెట్టి తాగడం అనవసరం అన్న ఒక పాయింట్‌ నుంచి నేను బయటపడటానికి చాలా సమయం పట్టింది. అలాగని నేనేమీ సినిమాలు చూల్లేదా? సిగరెట్లు కాల్చలేదా? ఒకట్రెండు సార్లయినా మద్యం తాగలేదా? అన్ని వెధవ పనులు చేశానుగానీ దీనికి మాత్రం ఖర్చు పెట్టలేదు. ఇలాంటిది నాకు మాత్రమేనా? ఇంకెవరికైనా ఇలాగే ఉంటుందా?

* ఏ బస్టాండులోనో కనబడిన టాయ్‌లెట్‌ దృశ్యాలు నన్ను తినేటప్పుడు హాంట్‌ చేస్తూనే ఉంటాయి.

* మా ఊరు వెళ్లినా ఊరి నడిబొడ్డునుంచి నేను ఆత్మన్యూనత లేకుండా, లేదా ఏ ఫీలింగ్‌ లేకుండా, లేదా అతి మామూలుగా నడుచుకుంటూ వెళ్లలేను. ఎందుకు వెళ్లలేనో నాకిప్పటికీ మిస్టరీ. ఎవరూ పరిచయం లేదు. అలాగని మొ­త్తానికి పరిచయం లేనట్టూ కాదు. వాళ్లతో ఎలా వ్యవహరించాలో నాకు తెలియదు. మా ఇల్లు, పొలం మీద నాకు ఎంత ప్రేమ ఉన్నా, నా ప్రేమ అక్కడికే పరిమితం. అసలు ‘స్వేచ్ఛగా సంచరించాను,’ అంటుంటారే… అలాంటిది నా జన్మలో ఎప్పుడూ జరిగినట్టు గుర్తులేదు.

* తెల్ల లుంగీ కట్టుకుని, చేతుల బనీన్‌ వేసుకుని ఆఫీసుకు వెళ్లగలిగే స్వేచ్ఛ కోసం చాలారోజులు ఆలోచించాను.

* నేను పెళ్లికిముందు ఒక ఏడాది మొత్తం తెల్లచొక్కా, యాష్‌ కలర్‌ ప్యాంటు కాంబినేషనే వేసుకున్నాను. ఎంపిక సమస్యను అధిగమించడానికి. దానికో సిద్ధాంతం కూడా ఉండేది. తెలుపు కల్మషానికీ, ఆ కల్మషాన్ని కాల్చాలనేదానికి బూడిదా… సంకేతాలు. అన్ని రంగులనూ తనలో ఇముడ్చుకుని పైకి మాత్రం అమాయకంగా కనబడుతుంది కదా తెలుపు… అందుకని అది కల్మషానికి గుర్తు. మనిషి కూడా అలాంటివాడేనేమో!

* అరటిపండు తినడంకంటే, తిన్న తర్వాత తొక్క ఎక్కడ వెయ్యాలన్నది నాకు  పెద్ద సమస్య.

* బాలకృష్ణకి, బాలకృష్ణకు… ఇందులో ఏది కరెక్టు?  చిరంజీవికి కి ఓకేగానీ బాలకృష్ణకు కు యే నాకు వినడానికి బాగుంటుంది.

* లవంగం అని మనం పిలుస్తున్నదాన్ని యాలక్కాయకు పెట్టాల్సింది. రూపపరమైన ధ్వని కుదరలేదు.

* ఇంకొకరి ఇంటికి వెళ్లినప్పుడు, వాళ్ల బాత్రూమ్ వాడుకోవడం నాకు అసౌకర్యంగా ఉంటుంది.

* పేలు చూపించుకునే సుఖం కోసమైనా నేను అమ్మాయి­గా పుడితే బాగుండనిపిస్తుంది నాకు.

* ఓరోరి యోగి నన్ను కొరికెయ్‌రో… పాట నేను ఎంజాయ్‌ చేశాను.

* నిన్న మొ­న్నటిదాకా నాకు వైయక్తికం వైయు­క్తికమే. జానమద్ది జానుమద్దే. యద్దనపూడి యు­ద్దనపూడే. ఈ కొమ్ములు ఎక్కడొచ్చి తగులుకున్నాయో తగులుకున్నాయి. అసలు కొన్నింటిని పూర్తిగా చూడకుండా, నేను ఎలా ఉంటుందని నిర్దేశించుకుంటానో అలాగే చదివేస్తుంటాను. ఎవరో దాన్ని ఇంకోలా పలికితే, ఇలా పలికాడేమిటా అనుకునేదాకా!

* పై సమస్యే నాకు ఎంత తీవ్రంగా ఉంటుందంటే,  నేను రోజూ దాన్ని దాటుకుంటూ నడిచే మా పక్కింట్లో ఉండే పెద్ద మామిడిచెట్టును కూడా నేను చూడకపోవచ్చు. సంభాషణలో ఎవరైనా దాని ప్రసక్తి తెచ్చినప్పుడు, అక్కడ చెట్టుందా? అని నేను ఆశ్చర్యపోతే, నేను నవ్వులాటకు అలా అంటున్నానని వాళ్లు అనుకుంటారు.

* ఆరోగ్యకరమైన జడ నాకు సెక్సీగా అనిపిస్తుంది.

* ఇవి చదువుతున్నప్పుడు, చదివేవాళ్ల ము­ఖకవళికలు ఎలా ఉంటాయో చూడాలన్న కోరిక నాకుంది.

*ఓ వందమంది ఒక చోట గుమిగూడుతున్నారంటే నాకొచ్చే మొ­దటి సందేహం: వీళ్లు టాయ్‌లెట్‌ ఇబ్బందిని ఎలా అధిగమిస్తారు?

* అవసరానికి డబ్బులు తీసుకుని ఇప్పటికీ ఇవ్వనివాళ్లు ఎదురుపడినా, డబ్బులిమ్మని అడగలేను. కాని నాకా విషయం గుర్తుంటుంది.

* చిల్లర కరెక్టుగా లేకపోతే బస్సులో వెళ్లేప్పుడు కండక్టర్‌ను ఎదుర్కోవడం నాకు  ఇబ్బంది.

* ఇందులో చాలా చోట్ల వచ్చిన ఇబ్బంది, భయం అనే మాటలకు నిజమైన ఇబ్బంది, భయం అని అర్థం కాదు. మనిషి లోపలి భావసంచలనానికి తగిన పేర్లు అన్నింటికీ  ఉన్నాయా?

* నాకెందుకో వేడి వేడి సాంబారు గిన్నె నా మీద పడే దృశ్యం చాలాసార్లు గుర్తొస్తుంది, ము­ఖ్యంగా హోటల్లోగానీ, పెళ్లిళ్లలోగానీ భోంచేస్తున్నప్పుడు. బహుశా, మా కీసరగుట్ట స్కూల్‌ దీనికి కారణం. గురుకులం కాబట్టి, మనమే సర్వ్‌ చేసుకోవాలి. రోజుకు కొందరు. నేను సాంబార్‌ బకెట్‌ మోయాల్సి వచ్చినప్పుడు ఎప్పుడో ఈ భయం నాలో జొరబడింది; గిన్నెను నేను కచ్చితంగా ఎత్తేస్తానని. అది ఇలా రూపాంతరం చెంది ఉంటుందా?

* దర్శకుడు అడ్రియన్‌ లైన్ నాకు నచ్చడానికి కారణం అంతకంటే శృంగారాన్ని బాగా చూపించగలిగేవాళ్లు నాకు తెలియకపోవడం.

* ప్యాంటు కుడిజేబులో దస్తీ పెట్టుకోవడం నాకు మొ­దట్నుంచీ అలవాటు. అంటే, ప్యాంటులో కర్చీఫ్‌ అనే వస్తువు ఒకటి ఉండటం అలవాటైనప్పట్నుంచీ. సాధారణంగా దీన్ని భోంచేసి, చేయి­ కడుక్కున్నాక, మూతినీ చేతినీ తుడుచుకోవడానికి తప్ప వాడను. కుడివైపు జేబులో ఉంటే, కుడి చేత్తో తీసినప్పుడు జేబు తడి అయి­పోతుంది. అందుకని నాకోసారి ఎడమవైపు ఎందుకు పెట్టుకోకూడదనిపించింది. అంతే! అప్పట్నుంచీ ఎడమజేబులోనే పెడుతున్నా.

* చక్రగోల్డ్‌ యాడ్‌లో సోనాలి బెండ్రే వచ్చేది. ఎర్రచీర. నవ్వుము­ఖం. నాకు అలాంటి భార్య వస్తే బాగుండేదని కలలు కనేవాణ్ని.

* మగవాళ్లు హాఫ్‌ బనీన్లు ఎలా వేసుకుంటారో నాకు అర్థం కాదు. బనీన్‌ వేసుకోవడంలోని పరమోద్దేశం నెరవేరదు కదా! నిజమే, చేతుల బనీన్‌ చూడ్డానికి కాస్త పల్లెటూరితనంగా ఉంటుంది. ఇదే విషయాన్ని ఎత్తిచూపి నా డిగ్రీ ఫ్రెండ్స్‌ నన్ను వెక్కిరించేవాళ్లు. నేను కూడా ఒకట్రెండుసార్లు నా పల్లెటూరితనాన్ని వదిలిపెట్టి, నగరాన్ని ఆశ్రయించాను. అదే, హాఫ్‌ బనీన్‌ ధరించాను. నా వల్ల కాలేదు. అప్పట్నుంచీ, నా ఓటు చేతు గుర్తుకే.

* సౌండ్‌ ఫ్రూఫ్‌ టాయ్‌లెట్లు ఉంటే బాగుంటుంది కదా!

* పుస్తకం చదవడానికి అవసరమైన బలమైన ప్రేరణ ఏదో అందులో ఉండాలి. అది సినిమా అయి­నా అంతే. లేదంటే నేను చూసినదాన్నే మళ్లీ చూడటానికీ, చదివినదాన్నే మళ్లీ చదవడానికీ ఉత్సాహం చూపిస్తాను తప్ప కొత్తదాన్ని చదవను.

* నాకు చాలామందిని సర్‌/మేడమ్ అని పిలవడానికి అభ్యంతరం ఉండదు. కానీ వీళ్లను కచ్చితంగా సర్‌/మేడమ్ అనాల్సివుంటుందంటే మాత్రం నోరు రాదు.

* ఫొటో ఎందుకు అచ్చువేయాలి?

ఏదో ఒకటి, అది ఏదైనా సరే, నేను అంటూ మొదలుపెట్టి రాసేదాన్లో పాఠకుడు అది రాసిన మనిషిని ఊహిస్తాడు. అది చదువుతున్నప్పుడే రచయిత బొమ్మ పాఠకుడి మనసులో రూపుదిద్దుకుంటూ ఉంటుంది. తర్వాతెప్పుడో, ఆ రచయిత వాస్తవ ముఖాన్ని చూసినప్పుడు, తన ఊహకూ దానికీ మిస్‌మ్యాచ్‌ అయ్యిందంటే (సహజంగానే అవుతుంది) అతడు తీవ్రమైన నిరాశకు లోనవుతాడు.

అలా కాకుండా…

ఫొటోతో సహా ఐటెమ్‌ చదివినప్పుడు, పాఠకుడి ప్రమాణాన్ని ఆ ఫొటో నిర్దేశిస్తుంది. దానికి లోబడే అతడి ఊహ సాగుతుంది. ఇదిగో ఈ ముఖమే ఇది రాసింది, అన్న గమనింపు అతడికి ఉంటుంది. ఆ అక్షరాలు నచ్చకపోతే గనక, ఆ రచయిత ముఖానికి ఏ విలువా ఉండదు. అసలు ముఖం గుర్తింపునకే నోచుకోదు. అలా కాకుండా ఆ అక్షరాలు నచ్చితే గనక, క్రమంగా ఆ ముఖానికి వాల్యూ పెరుగుతూ ఉంటుంది. (నా ఫొటోకు ఇది ఒక వివరణలా కూడా భావించవచ్చు.)

* నేను క్లారిఫై చేసివుంటే, నా మీద ఉన్న బ్యాడ్‌ ఇమేజ్‌ తొలగిపోతుందని అనుకున్నప్పుడు కూడా నేను నూటికి తొంభై తొమ్మిదిసార్లు మౌనంగానే ఉంటాను.

* నాకుగా మొ­దట సంభాషణ ప్రారంభించడం నాకు చాలాసార్లు సాధ్యం కాదు. ఒకవేళ మాట్లాడాలనిపించినా, వందసార్లు రీహార్సల్‌ చేసుకుంటాను.

* ఇదింకో విచిత్రమైన సమస్య. మనం ఒక వాక్యం రాసేస్తాం. అంటే అది చదివేవాళ్లకు శిలాక్షరమై కూర్చుంటుంది. ఒకవేళ నేను వేరేవాళ్లను చదివినా ఇలాగే చదివేస్తానేమో. కానీ అది అలా ఉండదు. ఆ వాక్యంలో నూటికి నూరు శాతం నిజం ఉండదు. అలాగని అది అబద్ధమని కాదు.

ఉదాహరణకు పైన చెప్పిందే తీసుకుంటే, నేను ఎవరితోనూ ఎప్పుడూ చొరవ  తీసుకుని మాట్లాడివుండలేదా?, అంటే ఉన్నాను. మరి అలా అయి­నప్పుడు తీసుకోలేదని ఎందుకు అనాలి?, అంటే జవాబివ్వలేను. వాక్యం వంద శాతం నిజం కావడానికీ, వంద శాతాన్ని తగ్గించేలా చేసే అంశాలకూ మధ్య ఉన్న ఆ చెప్పలేనితనాన్ని ఎవరికి వారే అర్థం చేసుకోవాలని నా సలహా.  లేదంటే, ఇక్కడ రాసినవి చాలా వరకు అబద్ధాలై కూర్చుంటాయి.

* చాలావరకు ఈ ఆలోచన రాగానే వచ్చినవి వచ్చినట్టు రాయడానికే ప్రయత్నించాను. చాలా కొన్నింటినే వాటి స్థానాలను మార్చాను, ము­ఖ్యంగా కింద వచ్చేవి. దానివల్ల కొంత కరెక్టు ఎండ్‌ ఉంటుందని నా ఉద్దేశం.

* కొన్ని చెప్పడం వల్ల చదివేవారికి కొన్ని ఇమేజెస్‌ ఏర్పడతాయన్న ఉద్దేశంతో, కొన్నింటిని రాసి తొలగించాను. అంటే నేను పూర్తి స్వచ్ఛంగా ఉండలేకపోయాను.

* అనుకుంటాంగానీ, నిజంగా మనిషి మనసులో ఉన్నవన్నీ రాయలేం. ఇలాంటి నా లోపలి విషయాలు ఇంకా వెయ్యి ఉన్నాయేమో, అనిపిస్తోంది. ఇంకొకటి చెప్పాలి. నిజంగా రాయలేమా అంటే, ఒక క్షణంలో మనకు కలిగిన భావాన్ని వాక్యంలోకి తర్జుమా చేస్తే అది సంపూర్ణ సత్యం కావాలని లేదు. అది ఆ క్షణానికి సత్యమే. కానీ ఎప్పటికీ నిలిచే సత్యం కాకపోవచ్చు.

* కొన్ని చీకటి విషయాలను కావాలనే రాయలేదు. వీటిని చెప్పకుండా ఉంటే, పై అధ్యయనం ప్రకారం క్యాన్సర్‌తో పోతాననేది నిజమే కావొచ్చుగానీ, మరీ రాళ్లతో కొట్టించుకుని అంతకంటే ముందే చచ్చిపోవడానికి నేను సిద్ధంగా లేను.

* ఇవన్నీ నిజంగాఎందుకు రాయాలీ? జీవితంలో కొన్ని దశలు దాటింతర్వాత వీటికి ఏ విలువా ఉండదు. మరి ఇలాంటి చెత్త విషయాలను ఎందుకు పంచుకోవడం అంటే.. ఏమో, మనిషనేవాడు ఎలా ఆలోచిస్తాడు, ఎలా ఆలోచించగలడు, అసలు ఎంత చిన్న విషయాల గురించి ఎంత బుర్ర పాడుచేసుకోగలడు, అని చెప్పాలని ఒక దుగ్ధ. ఇంకా ము­ఖ్యంగా ఇవన్నీ చెప్పేస్తే ఏర్పడే ఖాళీతనం నాకు ఇష్టం.

* ఇవన్నీ రాసిన తర్వాత, పుస్తకంలో అచ్చు వేయాలా లేదా అనేదాని గురించి కూడా నేను మళ్లీ మళ్లీ ఆలోచించాను. ఇక నన్ను ఎవరూ బాగుచెయ్యలేరు. నన్ను నేను కూడా చేసుకోలేను. ఇక ఇలా చెడీ చచ్చీ, కాలి, బూడిదైపోవాల్సిందే.

చలంతో నా ప్రయాణం మొదలయింది అపార్థంతోనే!

  (తెలుగు సాహిత్యానికి ఒకే ఒక్క చలం పుట్టిన రోజు మే 18 వ తేదీ సందర్భంగా ఈ ప్రత్యేక వ్యాసం )

“ఒక రోజు ఒకరు నాకెంతో ఆప్యాయంగా ఇచ్చిన మల్లెమొగ్గను వదల్లేక , జేబులో వేసుకుని మరచిపోయాను. సాయంత్రం కాలవగట్టు దగ్గర మల్లెపూల వాసనవేసి చుట్టూ వెతికాను , తోటలో ఉందేమోనని . చివరకు నా జేబును గుర్తుపట్టి చూస్తే , తెల్ల్గగా పెద్దదిగా విచ్చుకుని నా వేళ్ళను పలకరించింది  ! నా జేబులో మరచిపోయిన నా మల్లెమొగ్గ ? కళ్ళంబడి నీళ్ళుతిరిగాయి.”

ఒక వానాకాలం సాయంత్రం రోడ్డమ్మట రాలిన పూవులు చూసుకుంటూ తడిచి ఇంటికొచ్చాక , కిటికీ అవతల ఇంకా కురుస్తున్న వానను చూట్టానికి విసుగొచ్చాక  , ఇంట్లో కరెంటు లేకపోవడం మూలాన టీవీ , టేప్ రికార్డ్రర్ పెట్టలేక చేతికి అందిన పుస్తకం ..యాధృచ్చికంగా ” మ్యూజింగ్స్ ” . అందులో యాధృచ్చికంగా నేను తెరచిన పుస్తకంలో పై పంక్తులు.  మొట్టమొదటిసారిగా చలంపై ఇష్టాన్ని పుట్టించాయి.

అంతకుమునుపు రెండు నవలలూ , కొన్ని కథలూ చదివినప్పటికీ వాటితో పెద్ద relate అవలేదు.  అందుకు కారణం ఆ రచనల్లోని అంశాలు కులమతపరమైన వివక్షలూ , స్త్రీలను అణగదొక్కిన , హింసించిన కథలు  ,  కష్టాలు కన్నీళ్ళే అధికంగా ఆగుపించాయి. తెలుగు రచయితల్లో చాల గొప్ప రచయిత అదీఇదీ అని వింటే , నాన్ననడిగి ఆ పుస్తకాలు తీసుకున్నా. నీకివి పెద్ద నచ్చకపోవచ్చు అని తను ముందే ఒక statuatory warning ఇచ్చాడు. అదే నిజమైంది.

ఈ మనిషేమిటి తెలుగు కథల్లో మధ్యమధ్యలో ఇలా ఇంగ్లీష్ పదాలు వ్రాసేస్తాడు అని అడిగితే , అదే అతని revolutionary style అన్నారు.  ఓహో నాక్కూడా ఎప్పుడైనా సరైన తెలుగు పదాలు దొరక్కపోతే ఇలా ఇంగ్లీషు వాడి cover చేసుకోవచ్చన్నమాట అనే అడ్డదారి తట్టింది.  పోన్లే పనికొచ్చే విషయం ఒకటి దొరికింది అని ఇంకొన్ని కథలు చదివితే వాటిల్లో అక్కడక్కడా పాత్రధారులే చలం అనే వ్యక్తిగురించి మాట్లాడటం  , కథనంలో తనకుతనే “చలం ఒప్పుకోడు , చలం ఎవడు చెప్పడానికి , చలం చెప్పినట్లు.. ” ఇలా సోత్కర్ష కనిపించి ఇదేమిటీ మరీ SD ( S=సొంత D =డబ్బా..  కాలేజ్లో ర్యాగింగ్ అప్పుడు మొదటగా చెప్పమనేవారు..

కొందరు లెక్చరర్లు క్లాసులో “క్లాసులు” పీకేటప్పుడు అనేవాళ్ళం  )అనిపించి అదే విషయం నాన్నను అడిగితే..  ” అలా వ్రాసుకోవడానికి ఎంత దమ్ము ఉండాలో తెలుసా” అన్నాడు. “దమ్ము ఏమిటి నాకైతే గర్వం , అహంకారం అనిపిస్తోంది ” అన్నాను.  ” నా దగ్గర అంటే అన్నావు ఇంకెవ్వరిదగ్గరైనా అనేవు , మీ అబ్బాయికి ఏమీ తెలీదండీ అని నన్నే వెక్కిరిస్తారు. ఆయనంత సౌమ్యుడు ఎవరూ లేరు , ముందా పుస్తకాలు నాకిచ్చేయ్ ” అని తగువేసుకున్నారు. ”

మ్యూజింగ్స్ అంట ఏంటా పేరుకు అర్థం ? ” ” ఇంగ్లీషు మహా తెలిసినట్లు మాట్లాడుతావ్ ? musings తెలీదా. muse , amused.. ” అని చెబుతుంటే అప్పుడు అర్థమైంది ఆ టైటిల్. ” ఆ musings  అయితే తెలుగులో మ్యూసింగ్సని కదా వ్రాయాలి ” అనుకుంటూ  ఆ పుస్తకం తీసుకున్నా.  చదవకుండా కొన్నాళ్ళు అలానే నాదగ్గర ఉంచేసాను.  ఆ వానాకాలం సాయంత్రం అనుకోకుండా తెరిచిన ఆ మ్యూజింగ్స్ తో కొత్తగా పరిచయం అయ్యాడు చలం.

పుస్తకం మొదటినుంచి మొదలెట్టాను.  దూరంనుంచి తనకు ఎన్నో మధురోహలనూ తత్వాలను రేకెత్తించిన ఒక అందమైన గులాబీపువ్వును స్పృశించేందుకు పరుగెత్తుకెళ్ళి , తీరా ముట్టుకున్నాక అది ఎవరో నలిపి పారేసిన గులాబీ కాగితం మాత్రమే అని తెలిసి అతని నిస్పృహ ఎన్నో ఆలోచనలను రేకెత్తించింది. అంతకు మునుపు మామూలే అని వొదిలేసిన కథలు మళ్ళీ కొత్త దృక్పథంతో చదివితే , ఈ సారి కథల్లోని ప్రకృతి వర్ణనలూ , మధ్యమధ్యలో కొన్ని పాత్రల తీరుతెన్నులూ నచ్చాయి , కానీ కథావస్తువులు మాత్రం పెద్దగా ఉత్సుకత రేకెత్తించలేదు.  అప్పటికి నాకు ప్రేమ కథలు అంటే మహా అయితే హాలీవుడ్ సిన్మాలు తెలుసు , ముఖ్యంగా సుఖాంతం అయ్యేవి.

ఆఫ్హ్ట్రాల్ ఒక మనిషి ప్రేమ కోసం వేదన , సంఘర్షణ పడిన కథలూ , వ్యక్తులు , అనుభవాలు నాకప్పటివరకూ తెలీవు . మరి చలం కథల్లో అధికశాతం అవే. అందుకే పూర్తిగా రిలేట్ అవలేకపోయాను.   జేబులో మరచిపోయిన మల్లెమొగ్గ తన ఉనికిని అందాన్ని గుబాళించడానికి కొంత సమయం అవసరం అయింది – మల్లెకు. రచన / సాహిత్యం పువ్వులు కావు , అవి విచ్చుకోవు , వాటిని అర్థం చేసుకోవలంటే చదివేవాళ్ళు పరిపక్వత చెందాలి.

2

కొన్నేళ్ళు fast forward .

ఫిలిమ్ మేకింగ్ నేర్చుకుంటున్న రోజులు . సినిమాల ద్వారా ప్రపంచ దేశాల్లోని ప్రముఖులు చరిత్రలూ , వాళ్ళ ప్రేమకథలూ వ్యధలూ , ప్రేమకోసం కరిగిపోయిన జీవితాలూ , ఆత్మార్పణలూ , వాటిని తెరకెక్కించిన ఆర్ఠిస్టులు , మళ్ళీ ఆ క్రమంలో వాళ్ళ భావోద్వేగలూ వీటన్నిటినీ “చూస్తున్నప్పుడు” అప్పుడప్పుడూ చలం కథలు గుర్తొచ్చేవి . మిగతా రాష్ట్రాల స్నేహితులతో ఆ కథలు పంచుకుంటుంటే ” సెక్సీ ” ” బ్యూటిఫుల్ “అని మెచ్చుకునేవాళ్ళు . ఈ చలం ఎవరూ , ఇంగ్లీషు తర్జుమాలు ఎక్కడ దొరుకుతాయి అని అడిగేవారు . “ఒక పువ్వు పూచింది ” కథకు ఒక పరదేశి విపరీతమైన ఫ్యాన్ అయిపోయి , దాన్ని ఎలా అయినా ఏనిమేషన్ చిత్రం చేయాలని అనేవాడు.  Antonioni , Bergmann , Bertulluci , Lors Von , Ki Duk , Wong kar wai , Bunuel , Truffaut , Fellini , Haenke , Fassbinder.. ఇటువంటి ప్రఖ్యాత సినీ దర్శకుల సినిమాలు చూస్తుంటే కొన్ని పాత్రలూ , సన్నివేశాలు , భావోద్వేగలు అంతకు మునుపు చలం కథల్లో చదివినట్లు అనిపించేవి.

ఒకసారి బ్రూక్లిన్ నుంచోచ్చిన  కొందరు ఫిలిం స్టూడెంట్స్ తో ఇలాంటి సినిమా కబుర్లు , సాహిత్యం గురించి పంచుకుంటుంటే , ” ఇండియాలో ఇంత బోల్డ్ కథలున్నాయా ? మరి సినిమాల్లో కనబడవేం ? మీకు తెలుసా ఫ్లైట్ దిగినప్పటినుంచి ప్రతి ఊళ్ళూ చూస్తున్నాం ప్రేమించుకునే జంటలు రోడ్లపై పాటలూ డ్యాన్సులూ చేస్తూ తారసపడతారేమో . నిజజీవితంలో అలా ఏం ఉండదని తెల్సుకున్నాం , మరి ఇలాంటి ఎమోషన్స్ మీ లిటరేచర్లో ఉండి కూడా ఎవరూ తెరకెక్కించరేమిటి ? ప్రేమ , స్త్రీ పురుష సంబంధాలు ప్రపంచంలో ఎక్కడైనా ఒకటే. కానీ దేశాన్ని , అక్కడున్న సామాజిక కట్టుబాట్లు , కులమతాచారాలను బట్టి  ప్రవర్తన మారుతుంది . సమాజంలో కట్టుబాట్లను ప్రశ్నించే ప్రేమ , అది సమాజం ఒప్పుకోనిదైనా , సమాజానికే అవసరం . అటువంటి ఉద్దేశ్యంతోనే ఎవరైనా ఇలాంటి రచనలు చేస్తారు , కానీ మీ సిన్మాల్లో అలాంటి ప్రయత్నాలేవీ ఉండటం లేదు ” అనే మాటలు వొచ్చాయి.

చలం కథలే కానీ , ఆత్మకథను , జీవితచరిత్రను చదవని నాకు అప్పుడే వాటినీ చదవాలి అనిపించింది .  ప్రపంచాన్ని తమ కళలతో జయించిన కొందరు కళాకారుల జీవితచరిత్రలు చాలా నీచంగా  , క్షుద్రంగా ఉండటం తెలిసి అయ్యో ఇలాంటిమనిషినా ఇంతగా అభిమానించింది అని బాధపడటం , ఆ తర్వాత సదరు కళాకారుని కళను మనస్ఫూర్తిగా ఆస్వాదించలేక ఇబ్బందిపడటం అప్పటికి అనుభవమే కనుక కాస్త భయపడుతూనే చలం ఆత్మకథను తెరచాను .

చాలా చిన్నవయసులో తండ్రితో విభేదాలు , బాల్య వివాహంతో తన జీవితంలోకి వొచ్చిన అమ్మాయిని సైకిలు మీద పెట్తుకుని స్కూలుకు తీసుకెళ్ళి చదివించడం , ఇష్టంలేని పెళ్ళికి గురైన చెల్లెలిని శోభనంగదినుంచి రక్షించాలని పడిన తాపత్రయం… ఇలాంటివన్నీ చూసి చాలా ముచ్చట వేసింది . అభిమానం పెరిగింది. అంతలోనే , దేశభక్తి కంటే వ్యక్తిగత శ్రేయస్సూ , సుఖమే ముఖ్యమనే వాదనలూ , అక్రమ సంబంధాలూ , వాటి గురించి కూడా వ్రాయడమూ కొంత చిరాకు కలిగించి అబ్బే ఇలాంటి మనిషినా అభిమానించేది అనిపించేది .

తర్వాత్తర్వాత సమాజం పట్ల విసిగి ఆయన పారిపోవడం , మిత్రుల ఆత్మహత్యలూ , ఆయనలోనూ అలాంటి ఆలోచనలూ , ఆదరించిన అభాగ్య స్త్రీలు పిల్లలను కని వొదిలేసి వెళ్ళిపోతే ఆ శిశు సంరక్షణలూ వంటి ఘట్టాలు చదువుతూ ఉంటే , దాదాపు అర్థ శతాబ్దం దూరంగా ఉండి ఆ మనిషి వ్యధను అర్థం చేసుకోవడం కష్టమని , ఇరవయ్యో శతాబ్దపు కాన్వెంటు మైండుతో అప్పటి సామాజిక పరిస్థ్తితులను విశ్లేషించడం సరి కాదేమో అనిపించింది.

నేను ఒదిలేసుకున్నట్లు ఆయనా తన ఆలోచనలతో తనే అలసిపోయాడేమో అన్నీ వొదిలేసి దేవుడూ ,  బాబాలూ , ఆశ్రమాలకెళ్ళిపోయాడు .  ఇప్పటికీ నేను కలిసే చలం అభిమానులూ , దురభిమానులూ కూడా ఆయన అలా చేసి ఉండాల్సింది కాదని అంటారు కానీ నాకయితే అది చాలా ఊహించిన గమ్యమే అనిపించింది .

మొట్టమొదటి నవలల నుంచి ఆయన పాత్రలూ పదే పదే దేవుడి గురించి మాట్లాడటం , కష్టంలో దేవునితో మొరబెట్టుకోవడం , సుఖాన్ని దైవ సన్నిహిత్యంతో పోల్చడం  ,  శారీరిక వాంఛల గురించి కూడా ఉపనిషత్తుల , భాగవతాల  ప్రస్తావనతో వ్రాయడం గమనించితే , దేవుడు అనే ఆలోచనలోనే అయన ఎక్కువగా బ్రతికాడు . కాబట్టి ఆయన చివరి రోజులలోని ఆధ్యాత్మికత జీవనశైలి చాలామంది అన్నట్లు నాకెంతో వింతగానూ , వేలలక్షలమంది మనసులను రచనలతో ప్రేరేపించి తను మాత్రం పారిపోయినట్లు అనిపించలేదు.  కానీ , నాలోనూ ఒక అసంతృప్తి.

ఆయన ఇంకాస్త బలంగా నిలబడి , సమాజంలోనే ఉండి , ఇలాంటి ఆరోపణలు తలెత్తకుండా జాగ్రత్త పడి ఉంటే బావుండేది కదా అనిపించింది.  ” నేను పరిపూర్ణ పురుషుడ్ని కానంతవరకూ నాకు పరిపూర్ణ స్త్రీ దొరకదు ” అని చలమే చాలా చివరిదశలో గ్రహించినట్లు వ్రాసుకున్నా నన్ను ఓ ప్రశ్న వీడలేదు . సమాజం , వ్యవస్థ , ప్రపంచం అన్నిటిలోనీ perfection కోరుకునే మనిషి తాను మాత్రం perfect ఉండలేడెందుకు అని . సమాధానం  Tolstoy జీవిత చరిత్ర చెప్పింది .2009 THE LAST STATION  సినిమా చూస్తుంటే చాలా వరకు చలం జీవితం చూస్తున్నట్లే అనిపించింది . అందులోని ఒక డైలాగ్ : He is a better Tolstoyan than I am.    మరో సందర్భంలో టాల్ స్టాయ్ సిద్ధాంతాలను బాగా అభిమానించి ఆయనతో బ్రతకడానికి వొచ్చిన ఒక శిష్యుడు , ఒక అమ్మాయికి ఆకర్షితుడైనా Do not lust అనే టాల్ స్టోయ్ నియమానికి భయపడుతూ ఉంటే , అతనితో వాహ్యాళి వెళుతూ ఆయన తాను యవ్వనంలో ఉండగా ఒక స్త్రీతో కలిగిన శారీరిక సంబంధాలను నెమరు వేసుకుంటాడు . నివ్వెరపోయి చూస్తున్న అతనితో టాల్ స్టోయ్ ఇలా అంటాడు ” Let me assure you I am not a good Tolstoyan myself.  You should think twice before you ask my advice on anything. ”  “శరీరం , అందువల్ల కలిగే సుఖం మిధ్య అని అంటారు కదా అని శిష్యుడు ప్రశ్నిస్తే , నేను ఎన్నో చెబుతాను , ప్రతిపాదిస్తాను , కానీ నీ మనసు ఏం చెబ్తుంది ” అని సమాధానం వొస్తుంది. చలం చరిత్రా అటువంటిదే.

ఓ రెండు సంవత్సరాలు fast forward .

చలం నవలలో ఏదో ఒకదాన్ని సినిమా తీద్దాం అనుకున్నాను.  హక్కులు ఎవరి దగ్గర ఉన్నాయో తెలుసుకుందుకు చలంను ఏదో ఒక దశలో చూసిన , ఆయన ఆలోచనలకు ప్రభావితం అయిన కొందరిని కలవాల్సి వొచ్చింది . వారి సహకారం వలన ఒక నవల హక్కులు పొందగలిగాను. కానీ ఒక అసంతృప్తి మొదలు. అందరూ చలం వీరాభిమానులే . ఆయన ప్రతి పనినూ , రచననూ ఆహా ఓహో అనేస్తున్నారు . ఆయన తత్వాలను , పాత్రలను అప్పట్లో చాలా మంది ద్వేషించారు అని చదివానే . మరి ఆ ద్వేషం ఎలా ఉంటుందో కూడా తెలుసుకోనిదే నవలలో పాత్రలు భరించాల్సిన ఒంటరితనం , భయం , తిరస్కారం ఎలా సినిమాలో ఆవిష్కరించగలను అనుకుంటూ , మెల్ల్గగా కథను నాకు తెలిసిన , చలం ను మునుపు చదవని , ఆయనంటె ఎవరో తెలియని వ్యక్తులతో చెప్పడం మొదలెట్టాను. అన్ని రకాల ప్రతిస్పందనలూ వొచ్చాయి . ఇక్కడ కొంతమంది మాటలు నన్ను ఎంతగానో ప్రేరేపించి , చలాన్ని కొత్త రకంగా అర్థం చేసుకోవడానికి సహాయపడితే మరి కొందరి మాటలు , చర్యలు చాలా చవకబారుగా సాగాయి . చవకబారు వ్యక్తుల గురించి ధైర్యంగా వ్రాసేంత చలం నాలో లేడు కనుక , పేర్లకు ముసుగువేస్తున్నాను.

” ఛీ మీరేదో సంస్కారవంతులు అనుకున్నాను , పోయిపోయి ఇలాంటి కథలు సిన్మా తీస్తారా ? ”  అని ఒక స్నేహితుడు చిరాకు పడితే

“చలం గొప్ప రచయిత అండీ , కానీ ఇప్పుడు వాటి అవసరం ఏమిటి ? చలంకే సెక్సు గురించి చెప్పేంతగా ఉన్నారు ఇవ్వాళ ఆడపిల్లలు ” ఇద్దరు కూతుళ్ళున్న ఒక లెక్చరరు అనాలిసిస్

” ఓహ్..చలం నవలా.. సుపర్. అవార్డు గ్యారెంటీ.  వెంటనే ఒక కమర్షియల్ సిన్మా కూడా తీయాలి లేకపోతే ఆర్టు డైరెక్టరని ముద్రేసేస్తారు ఇక్కడ ” ప్రతిపనిలోనూ లాభం నష్టం చూసే ఒక శ్రేయోభిలాషి సలహా
” చలం అద్భుతం అండీ. ఈ సినిమాకు పని చేసే అవకాశం నాకివ్వండి ” ఒక సంగీత దర్శకుడి అభ్యర్థన ” మీకు ఏం నచ్చిందండీ చలంలో , ఆ నవలలో” అని ప్రశ్నిస్తే ” అద్భుతం అండీ , చెప్పడానికి మనం ఎక్కడ సరిపోతాము. కొన్ని అలా అద్భుతం అంతే ” తనకేమీ తెలియదని అందంగా చెప్పేసాడు .

” నువ్వు తీయగలవా? ఎందుకు రిస్క్ ? మన తెలుగువాళ్ళు బాగా అపార్థం చేసుకున్న మహా రచయిత చలం.   వొదులుకోవడం వాళ్ళ ఖర్మ. ఆ ఖర్మనలానే ఉంచెయ్ , our telugu audience dont deserve such great stories ” ఎంతో పాండిత్యం ఉన్నా అప్పుడప్పుడూ చెత్త పాటలు వ్రాయాల్సి వస్తున్నందుకు విసిగిపోయిన ఒక ప్రముఖ పాటల రచయిత కోపం.

“ఇలాంటి సిన్మా తీస్తున్నాం అని తెలిస్తే , నాకు ఇంట్లో అన్నం కూడా పెట్టరు ” సినిమాటోగ్రఫీ చేస్తానని వొచ్చినా తన ఇంట్లోవాళ్ళకు కథ చెప్పకుండా దాచిన ఒక మిత్రుడి భయం

” ఈ కథ చెయ్యాలని ఎంతో ఇష్టంగా ఉంది . కానీ నా బోయ్ ఫ్రెండ్ ఒప్పుకోడు , వెరీ సారీ ” కథను ఎంతో ఇష్టపడినా అందువల్ల తన వ్యక్తిగత జీవితం ప్రభావితం అవుతుందేమోనని ఒక నటి అభద్రతాభావం

” ఈ కథలో ఆ మతం , సెక్స్ ఎలిమెంట్స్నే హైలైట్ చేస్తూ ప్రొమోట్ చేద్దాం. సెన్సార్ ఒప్పుకోనట్లు తీసేసి ట్రైలర్ రిలీజ్ చేద్దాం . ఇక చూస్కో ,  ఎక్కడ చూసినా మన సిన్మా పేరే , తప్పులన్నీ చలంపై తోసేసి మనం సేఫ్ అయిపోవచ్చు , సిన్మాకు భీభత్సమైన కలెక్షన్స్ , మనకు ఫుల్ పబ్లిసిటీ ” నీఛాతినీఛమైన మార్కెటింగ్ ఐడియాలు ఇచ్చే ఒక కుహనా మేధావి.
” ఇలాంటి కథలు సిన్మాలు తీయకూడదండీ . గుట్టుగా ఉండే స్త్రీలను చెడగొడతాయి . సమాజానికి హానికరం ”  self-appointed social guardians కొందరు ఇలాంటి మాటలు , భిన్న ప్రవర్తనలూ సర్వసాధారణం అయిపోయాయి . పేరు చెప్పుకుంటే తమకేదో విశాలభావాలున్నాయి అని కొందరు స్త్రీలు దగ్గరవుతారనే దురుద్దేశాలతో చలాన్ని ఒక pheromoneలా వాడుకునే కాముకులూ , చలాన్ని తిడితే / పొగిడితే తమకు ఫేస్బుక్ లైకులు వొస్తాయి అనేంత మూర్ఖులూ , చలం జాతక చక్రంతో ఆయన జీవితాన్ని పోల్చి చూసే ఛాందసులూ ,  స్వంతంగా డబ్బులు పెట్టుకుని తమ ఊర్లలో చలం పుట్తినరోజు / వర్ధంతి ఉత్సవం చేసి ఆయన గొప్పదనాన్ని ఇప్పటి యివతకు చెప్పాలను యత్నించే సాహితీ ప్రియులు , అలాంటి చోట్ల తమ సొంత టాలెంట్ ప్రదర్శించే ( ఎంతగా అంటే…చలం గొంతును ‘మిమిక్రీ’ చేయడం లాంటి వింత పనులుఅన్నమాట ) ఆత్రగాళ్ళు , చలం అంటే ఎంతో ఇష్టం ఉన్నా ఆ ఇష్టం ప్రదర్శిస్తే తమకు విలువలు లేవనో , సంసార సుఖం లేదనో అపోహ పడ్తారని గాభరాపడే సున్నితమనస్కులు ..ఇలా రకరకాల మనుష్యులు.  తాను చచ్చిపోయి దశాబ్దాలు దాటుతున్నా ఒక రచయిత తన గురించి ఇందరిలో ఇన్ని భిన్నాభిప్రాయాలను , వివిధ ధృక్కోణాలను రేకెత్తించాడు అంటే అది నిస్సందేహంగా తెలుగు సాహితీ చరిత్రలో చాలా గొప్ప విషయం. అన్నా కరేనినాలూ , మేడమ్ బోవెరీలూ నిలబడినన్నాళ్ళు నిలుస్తున్న చలం స్త్రీ పాత్రలు ఇంకో శతాబ్దమైనా అలానే వాదోపాపవాదాలకూ , తర్కాలకూ గురికాక తప్పదేమో.

ఇదంతా ఆయన రచనలు చదివి అభిమానించే ఒక సామాన్య పాఠకుడిగా నా మనోగతమైతే , ఆయనతో బ్రతికి , ఆయన జీవితంలోని ఒడిదుడుకులు కళ్ళారా చూసి సిద్ధాంతాల మార్పులూ  , ఆథ్యాత్మికతా గ్రహించిన ఆయన true followersను మాత్రం నేను ఎవరినీ చూడలేదు. ఒక నెల  క్రితం వరకూ..
ఒక షూట్ పని మీద  భీమిలి వెళితే , ఆ సముద్రాన్ని చూడగానే జీవితాదర్శం గుర్తుకొచ్చింది. చలం అంతగా వర్ణించిన ఆ భీమిలీ బీచ్ చూసాక అక్కడే ఇంకా ఉన్నారేమో చలం భక్తులెవరైనా కొంత వెదగ్గానే , సౌరీస్ నగర్ , సౌరీస్ రోడ్డు అనే బోర్డులు కనిపించాయి. రోడ్డు పక్కన ఉన్న టీ కొట్టులో అడగ్గానే లోపల ఉండే ఆశ్రమం గురించి చెప్పారు.

” రోజూ పూజలూ అవీ చేస్తుంటారు సార్ , బావుంటుంది వెళ్ళి చూడండి ” అని చెప్పాక ఇక ఆగలేదు.  వెళ్ళేటప్పటికి అప్పుడే ఏదో పూజ ముగిసినట్లుంది , చాలా మంది స్త్రీలు బయటకు వొస్తున్నారు.  ఇలా చలం కథను సిన్మా తీస్తున్నవాళ్ళం అనగానే సాదరంగా ఆహ్వానించారు. సౌరీస్ సమాధిని ఒక పూజ మందిరం చేసి నిత్యం సత్సంగాలు , ధర్మోపన్యాసాలు , పునస్కారాలు చేస్తున్నాం అని చెప్పారు.

చలం వాడిన వస్తువులను , ఆయన పుస్తకాలను పవిత్రంగా , పదిలంగా చూసుకుంటున్నారు. ఆయన అభిరుచి మేరకు ఇంటి చుట్టూ పూదోట. లోపల నిద్రపోతున్న , తిరుగాడుతున్న పిల్లులు. అప్పుడప్పుడూ వినిపించే సముద్రపు హోరు.  వారి ముఖాలలో చాలా ప్రశాంతత. ఆ మాట ఈ మాటా మాట్లాడుతూ అన్నాను  ” ఇవాల్టికి కూడా ఆయనను నిందిస్తూ , ఆయన చెప్పింది సమాజానికి హానికరం అనీ , ఆయనదంతా తప్పు అనీ ద్వేషించేవారు ఉన్నారు. ఆయన జీవితాన్ని , వ్యక్తిత్వాన్ని కించపరిచేలా కొందరు వేరే రచనలూ , వ్యాసాలూ వ్రాస్తూనే ఉన్నారు , మరి మీరేమీ సమాధానం చెప్పరా ? ” అని అడిగితే ,
” ఎవరిష్టం వాళ్ళదండీ . నచ్చినవాళ్ళకు నచ్చుతాడు , తిట్టాలనుకునే వాళ్ళను తిట్టుకోనివ్వండి , మాకు ఏమిటి తేడా ? ఆయనేమితో మాకు తెలుసు.. కాఫీ తీసుకుంటారా ? ” చిరునగవుతో సమాధానం.
అక్కడ  చలం ఇంకా సజీవంగా ఉన్నాడనే అనిపించింది .viplove

 

విప్లవ్

వెలుగు రంగుల మంత్రగాడు చలం

veeralakshmi (2)

( నిద్రాణంగా గా ఉన్న తెలుగు సాహిత్యాన్ని తన రచనలతో మేల్కొల్పిన  గుడిపాటి వెంకటా చలం పుట్టిన రోజు  మే 19 సందర్భంగా….)

చాలా ఏళ్ళు గడిచాయి.  చాలా అంటే ముప్పై అయిదేళ్ళు.  అలా గడవక ముందు నా చేతుల్లోకి వచ్చిన చలంగారి రెండవ పుస్తకం ‘ప్రేమ లేఖలు’.  అప్పటికి అయిదారేళ్ళ క్రితం నేను ఆకస్మికంగా చదివిన చలం గారి మొదటి పుస్తకం ‘స్త్రీ’.  ఆకస్మికం అని ఎందుకన్నానో చెప్పాలి.  అది చదవక ముందు నాకు చలం గారి పేరు తెలియదు.  ఆయన గురించి ఎక్కడా వినలేదు.  మా పల్లెటూళ్ళో  పొరిగింట్లో అరుదయిన సాహితీ రసజ్నుడి చెక్క బీరువా నిండా ఉన్న పుస్తకాలే మా గ్రంధాలయం.  అందులోంచి పుస్తకాలు వెతుక్కుని తీసుకొనే స్వేచ్చ మాకు ఉండేది.  అలా వెతకడంలో ఈ పుస్తకం నా చేతికి తగిలింది.  నవలేమో అనుకుని తీసుకుని చదవడం మొదలు పెట్టాను.  తీరా నవల కాదు కాని పేజీలు కదులుతూఉంటే విస్పోటనమే.  నా లోపల తొక్కిపెట్టిన ఉక్రోషాలకు, కోపాలకు అసహాయతలకు- అవన్నీ అర్థవంత మైనవే అని చెప్పే- ఉరట.  అదీ చలంగారి మొదటి కరచాలనం.

చెప్పానుగా తర్వాత మళ్ళీ అయిదారేళ్ళకి పుస్తక ప్రదర్శనలో రచయిత పేరు, పుస్తకం పేరు, మోహావేశం కలిగించగా ఈ ప్రేమలేఖలు కొనుక్కున్నాను.  అప్పటికి పలువురు సాహితీ విమర్శకుల ద్వారా చలం గారి గురించి పలు విధాలుగా విన్నా నా హృదయం మాత్రం ఆయన వేపే మొగ్గుతూ ఉండేది.

‘ప్రేమ లేఖలు’ చదవడం ఎవరి జీవితంలో నయినా సరే ఒక అత్యంత ఆవశ్యకమయిన అవసరం.  అప్పటికే భావుకతా పక్షాలు ఏర్పడిన నా మనస్సులో  ఆ పుస్తకం నా రెక్కలకి బలాన్నిచ్చి ఎగిరేలా చేసింది.  నా రెక్కల్ని నెమలి కన్నులంత మృదువుగా సుందరంగా మార్చింది. చూడవలసిన లోకాలతో పాటు తీసుకెళ్ళి తిప్పవలసిన రెక్కలు కూడా అంత లలితంగా హృద్యంగా ఉండాలని తెలియ జెప్పింది.  నాకు ఉహామాత్రంగానే తెలిసిన లలిత శృంగార లోకాల వెలుగు రంగుల్ని అబ్బుర పరుస్తూ చూపించింది.

‘స్త్రీ’ పుస్తకం స్త్రీల తాలుకు పరమ కఠోరవాస్తవ స్థితిని వినిపిస్తే ‘ప్రేమ లేఖలు’  పుస్తకం’ అయినా సరే’ ఈ మట్టిలో ఈ నెలలోనే పూయించు కోవలసిన పూల గురించి చెప్పింది.

ఈ  రెండు పుస్తకాలూ  నా మీద తక్కువ ప్రభావం చూపలేదు. ఇప్పటికీ అప్పుడప్పుడు ‘స్త్రీ’ లోని ముందు మాటలు చదువు కుంటూ ఉంటాను.  దొంగ మాటలు, నంగిరి బుద్ధులు , టక్కరి పనులు, ఈర్ష్యా ద్వేషాలతో కుళ్ళి పోవడాలూ లేని స్వచ్చమైన, శాంతమైన జీవనం దొరికే మార్గం నాకు అందులో లభిస్తూ ఉంటుంది.  నా మాటలో, రాతలో, జీవన యాత్రలో అది ప్రతిఫలిస్తోందని ఎవరేనా, ఎప్పుడేనా చెప్పడం తటస్థిస్తూ ఉన్నపుడు అది చలంగారి ‘స్త్రీ’ పుస్తకం తాలుకు ఫలశ్రుతిగా (ఫల పఠనం అనాలేమో) భావిస్తుంటాను.

ప్రేమ లేఖలు చదివి చాలా కాలమయింది.  కానీ ఒకప్పుడు చాల ఏళ్ళ పాటు చదివాను. మళ్ళీ ఇప్పుడు తీసి అలవోకగా చదివితే నేను పరాకు పడ్డ సుందర లోకాలన్నీ కళ్ళ ముందుకు వచ్చాయి.  ఒక వ్యక్తి కోసం ప్రాణాలన్ని పెట్టి జీవితమంతా ఎదురు చూడడంతో మొదలయిన స్థితి నుంచి ఇతరులెవరి కోసమయినా మనని మనం మరచి సహాయం చెయ్యడానికి పరుగు పెట్టే లాంటి ప్రేమని ఆ లేఖలు మనసుకి అలవాటు చేస్తాయి.  అంటే  ఆ’ ప్రేమానుభూతి ‘ నిబద్దులయిన వారికి’ సహానుభూతిని’ నేర్పుతుంది.

ఇక ఆ తర్వాత చలంగారి పుస్తకాలన్నీ చదివాను.  ప్రసంగాలు చేసాను.  చలాన్ని ఇష్టపడే స్త్రీని, చలం మీద డాక్టరేట్ చేస్తాననే స్త్రీని, చేసిన స్త్రీని ఇప్పటికీ ‘అదోలా’ చూసే మనుషులున్నారు.  నాకు అలాంటి వాళ్ళ మీద జాలి కలుగుతూ ఉంటుంది.  వాళ్ళు వాళ్ళ జీవితాల్లో ఎంత కోల్పోయేరో కూడా వాళ్లకి తెలీదని.చలం గారు చూపించిన సుందరలోకాలు వాళ్ళకి యెంత దూరమో అని.

ప్రణయ సంబంధాల్లో, ప్రేమ సంబందాల్లో  ఒకరికొకరు నిబద్దులయి ఉండే కొద్దీ ఆనందం పెరుగుతుంది.  నిబద్దత అందుకోసమే.  తమ మద్య కొంత కాలం పాటు ఉన్న ప్రణయం తాలుకు ఆనందాన్నిమనుషులు  అనిబద్దులు, అసత్య వాదులు కావటం వల్ల పోగొట్టుకుంటారు.  ఇష్టాలు పోతే విషయం వేరు.  ‘దైవ మిచ్చిన భార్య’ అన్న నవల అంతటా చలంగారు ఈ అంశాన్నే రాసుకొచ్చారు.

1994 లో చలం శత జయంతి సంవత్సరంలో చలం నవలా నాయికల స్వగతాలతో ‘వాళ్ళు ఆరుగురు’ అనే రూపకాన్ని ‘నూరేళ్ళ చలం’ సంఘ సభ్యులు ప్రదర్శించారు.  అప్పుడు దైవ మిచ్చిన భార్య నవలలోని పద్మావతి పాత్రను నేను  ఎంచుకుని ఆ ప్రదర్శనలో పద్మావతి పాత్రతో నా మనోభావాలు ప్రకటించాను.  ఆ రూపక ప్రదర్శన నాకు అంత మంచి అనుభవం కాదు కానీ పద్మావతిలోనీ  ఆమె ప్రేమికుడు రాధా కృష్ణ లోనీ  తరగని ప్రేమ, దాని పట్ల వారికున్న నిబద్దత నాకు ఆదర్శం.

ఈ మధ్య ఒక మిత్రుడు పేస్ బుక్ లో ఒక ఇంగ్లీషు కొటేషన్ రాసాడు.  ప్రేమ అగ్ని, అది తగిలితే మనలో ఉన్న చెడు కాలిపోయి మంచి వెలుగుతుంది అని.  ఇది చలంగారికి సరిపోయే మాట.  అదే కింద కామెంట్ గా రాసాను.

చలాన్ని చదివిన వాళ్ళందరికీ ఇది ఎంతో కొంత అనుభవంలో ఉండే ఉంటుంది.  చలాన్ని చదివిన వాళ్ళు చెడిపోయినట్లు కనిపించినా  వాళ్ళు ఎంతో మందిలాగ దొంగతనంగా చెడిపోవడం లేదని గుర్తుపెట్టు కోవాలి

అంతిమ నిర్ణయాలలో ఎవర ఎక్కడ మిగిలేరో చూసుకుంటే లెక్కలు బాగా కనిపిస్తాయి కాలకుండా వెలగకుండా కొరకంచు ల్లాగా మాత్రం ఉండరు .

చలంగారి పుట్టిన రోజు వస్తోంది.  ఆయన ఎంత ప్రేమ మూర్తి అంటే ఆయన కోసం పని చెయ్యడం మొదలెడితే మనకి ఎన్నో వేపుల నుంచి ఎంతో ప్రేమ అందుతూ ఉంటుంది.  చలం శత జయంతి సంవత్స

రం అంతా నేను ఆంధ్ర దేశంలో అన్ని ఊళ్ళలోనూ తిరిగాను.  ఎంత ప్రేమని స్నేహాన్ని సంపాదించు కున్నానో మరువలేను.  (ప్రేమ అన్న మాటని కాస్త విశాలార్థం లోనే చదువుకోవచ్చు) చలంగారి పేరు చెప్పగానే  కాస్త స్పందన ఉన్న మనుషులు కొంత కుతూహలంతో కొంత ఇష్టంతో, ఎంతో ఆరాధనతో తొణికి పోతారు.  వాళ్ళ ముఖాలు అప్పుడు మనకి ఎంత ప్రేమాస్పదంగా ఉంటాయో!

“ఏదో అసాధారణ మార్గాన మీరు రాస్తారనీ ,తెలియజేస్తారనీ, ఏదో విశ్వాసం” అంటాడు ప్రేమ లేఖల్లో ప్రియురాలితో చలం

ఈ మాట ఆయన సాహిత్య మంతటికీ సరిపోతుంది.  అసాధారణ మార్గాన రాస్తూ వాటి ద్వారా వచ్చి మన హృదయాలను దోచుకుంటూ ఉన్న ‘ ఈదొంగకు’ మనం పుట్టిన రోజు కాన్కగా ఇవ్వడానికి ఏం మిగిలింది ? ఆనందం తప్ప .

***

                                                            

ఏ పేజీ చూసినా ఆ గతమే గుర్తొస్తుంది: రావూరి భరద్వాజ

jaya with ravuri

రావూరి భరద్వాజ ను ఇంటర్వ్యూ చేస్తున్న రెంటాల జయదేవ

హైదరాబాద్‌లోని మసాబ్‌ట్యాంక్‌ ప్రాంతంలోని విజయనగర్‌ కాలనీలోని మధ్యతరగతి నివాసమైన భరద్వాజ ఇల్లంతా పత్రికలు, చానళ్ళ ప్రతినిధులు, కెమేరామన్లు, ఫోటోగ్రాఫర్లతో నిండిపోయింది. ప్రత్యక్ష ప్రసారం కోసం వచ్చిన వాహనాలతో ఆ ఇంటి సందంతా సందడిలో మునిగిపోయింది. వృద్ధాప్యం తెచ్చిన బలహీనత బాధిస్తున్నా, ఇంట్లో వాళ్ళ సాయంతో రావూరి భరద్వాజ మీడియా ముందుకు వచ్చారు. తెల్లటి పంచె, లాల్చీ, నెరిసిన గడ్డంతో అతి సామాన్యుడిలా, అత్యంత నిరాడంబరంగా అందరికీ నమస్కరించారు.

1944 ప్రాంతంలో మొదలుపెట్టి గడచిన ఏడు దశాబ్దాలుగా సాగుతున్న తన రచనల్లోని వాక్యాలలాగే అంతే సాఫీగా, సహజంగా తన మనోభావాలు పంచుకున్నారు. ఒకపక్క ఉక్కిరిబిక్కిరి చేస్తున్న మీడియా హడావిడి… మరోపక్క అభినందనలందిస్తూ వరుసగా ఇంట్లో మోగుతున్న ఫోన్లు… ఇంకోపక్క ఇంటికి వస్తున్న సాహితీ మిత్రులు, సన్నిహితుల తాకిడి… వీటన్నిటి మధ్యనే రావూరి భరద్వాజ తీరిక చేసుకుంటూ  ఇంటర్వ్యూ ఇచ్చారు. మనసులోని మాటలు పంచుకున్నారు. ముఖ్యాంశాలు:

Q భారతీయ సాహిత్యంలోని అత్యున్నత పురస్కారం ‘జ్ఞానపీఠ్‌’ మీకు దక్కినందుకు ముందుగా అభినందనలు. ఈ పురస్కారం దక్కడానికి ప్రధాన కారణం ఏమనుకుంటున్నారు?

ఈ అరుదైన గౌరవం దక్కడానికి నేను మాత్రమే కారణం అనుకోవడం లేదు. నా జీవితానుభవాలు, ఆ అనుభవాలను ప్రసాదించిన సామాజిక వాతావరణం, ఆ వాతావరణంలోని మనుషులు, దాన్ని మలిచిన పెద్దలు, రాజకీయ నాయకులు అందరూ కారణం. ఈ సమాజం ప్రసాదించిన గొప్ప అనుభవాలకు నేను చేతులెత్తి నమస్కరిస్తున్నాను.

Q ఈ విషయం మీకు ఎప్పుడు తెలిసింది?

ఇవాళ మధ్యాహ్నం 12.30 – ఒంటి గంట సమయంలో విశాఖపట్నం నుంచి ఒకరు నాకు ఫోన్‌ చేసి చెప్పారు. ఇంతలో ఢిల్లీ నుంచి ‘భారతీయ జ్ఞానపీఠ్‌’ వారు కూడా తెలిపారు.

Q ‘జ్ఞానపీఠ్‌’ లభిస్తుందని మీరు ఎన్నడైనా ఊహించారా?

(నవ్వేస్తూ…) లేనే లేదు. ఎన్నడూ కల కూడా కనలేదు. జ్ఞానపీఠం కోసం ప్రయత్నించనూ లేదు.

Q మీరు చాలా ఏళ్ళ క్రితం రాసిన ‘పాకుడు రాళ్ళు’ నవల ద్వారా మీకు ఈ అవార్డు వచ్చింది కదా! ఆ నవలా రచనా నేపథ్యం పాఠకులకు వివరిస్తారా?

నేను దాదాపు మూడున్నరేళ్ళు మద్రాసులో ఉన్నాను. ఆ రోజుల్లో రచయిత ధనికొండ హనుమంతరావు సన్నిహితుడైన కొలను బ్రహ్మానందరావు నడిపిన ‘చిత్రసీమ’ అనే సినీ పత్రికలో పనిచేశాను. నేను తెనాలి నుంచి మద్రాసు వెళ్ళి పోతున్నప్పుడు నా మిత్రుడు ఒకరు నాకు ఓ డైరీ ఇచ్చాడు. ఆ డైరీలో నా దిన చర్య, రోజువారీ అనుభవాలు రాసుకొనేవాణ్ణి. సినిమా ప్రపంచాన్నీ, మను షులనూ దగ్గర నుంచి చూస్తూ, డైరీలో రాసుకున్న అనుభవాలు, జ్ఞాపకాలతో కథ ఎందుకు రాయకూడదని నాకు అనిపించింది. అలా నేను ఓ కథ రాశాను.

Q మరి, అది నవలగా ఎలా మారింది?

ఆ కథను సాహితీ దిగ్గజం మల్లంపల్లి సోమశేఖర శర్మ గారికి చూపించాను. ఆయన అంతా చదివాక, ‘బాగుంది. కానీ, పది మందిని కూర్చోబెట్టాల్సిన చోట వంద మందిని కూర్చోబెట్టావేమిటి?’ అన్నారు. నా మట్టిబుర్రకు మొదట వెలగ లేదు. వివరం అడిగితే, ‘ఇది మూడు, నాలుగు వందల పేజీల నవలగా సరిపడే అంశాన్ని ఒక కథగా రాశావు’ అన్నారు. ఆ మాట నా మనస్సులో ఉండిపోయింది.

ఆ తరువాత హైదరాబాద్‌ వచ్చాక, అప్పటి ‘కృష్ణాపత్రిక’ అధిపతి ముదిగొండ సుబ్రహ్మణ్య శర్మగారు నన్ను ఏదైనా రాయమని అడిగారు. నేను ఈ కథాంశాన్ని దృష్టిలో పెట్టుకొని, సినిమా వాళ్ళ మీద సీరియల్‌ రాస్తాను అన్నాను. వాళ్ళ మీద రాయడానికి ఏముంటుందన్నారాయన. చాలా ఉందని చెప్పి, ముందుగా 12 వారాలకు సరిపడా భాగాలు భాగాలుగా సీరియల్‌ రాసి, తీసుకువెళ్ళాను. అది నచ్చి, ‘కృష్ణాపత్రిక’లో ధారావాహికగా ప్రచురించారు. ముందుగా 30 – 40 పేజీల కథగా అనుకున్నది, చివరకు మూడు నాలుగేళ్ళు పెద్ద సీరియల్‌గా వచ్చింది. ఆ నవలకు విశేష ఆదరణ లభించింది.

Q ఆ నవల వల్ల ఇప్పటికే మీకు రెండోసారి ‘ఆంధ్రప్రదేశ్‌ సాహిత్య అకాడమీ అవార్డు’, తొలిసారిగా ‘కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు’ వచ్చాయి. ఇప్పుడిలా ‘జ్ఞానపీఠం’! అది ఇంతటి పేరు తెస్తుందని మీరనుకున్నారా?pakuduraallu

లేదు. అసలు ఆ నవలకు ముందు నేను అనుకున్న పేరు ‘మాయ జలతారు’ అని. కానీ, అప్పట్లో ‘కృష్ణా పత్రిక’లో పని చేస్తున్న సాహితీమిత్రుడు, చిత్రకారుడు శీలా వీర్రాజు దానికి ‘పాకుడు రాళ్ళు’ అని నామకరణం చేశారు. పాచిపట్టి, జారిపడతామని తెలిసినా అందరూ సినీ రంగం వైపు ఆకర్షితులవుతుంటారు… జారి పడుతుంటారు… దెబ్బలు తగిలించుకుంటారు… మళ్ళీ మళ్ళీ దాని మీదే వెళుతుంటారు… అనే విశాలమైన అర్థంతో ఆయన పెట్టిన పేరు అది. ఆ నవల తమిళ, కన్నడ భాషల్లోకి కూడా అనువాదమైంది. అక్కడా అందరి ఆదరణ పొందింది. ఆ నవలను ఆకాశవాణి వారు ఓ గంట వ్యవధితో నడిచే శ్రవ్య నాటకంగా మలిచారు. ఆ నవలపై సిద్ధాంత వ్యాసాలూ వచ్చాయి.

Q ఆ నవలను ఇప్పుడు వెనక్కి తిరిగి చూసుకుంటే మీకు ఏమనిపిస్తుంది?

ఇవాళ్టికీ ఆ నవలలోని ఏ పేజీ చూసినా, అందులోని పాత్రకు నాకు ప్రేరణగా నిలిచిన నిజజీవిత నటీనటులు, వారి స్వభావాలు, ఆ సంఘటనలు గుర్తుకు వస్తాయి. అయితే, ఆ వ్యక్తుల పేర్లు నేను చెప్పడం బాగుండదు.

Q ఆ నవల అంతటి ఆదరణ పొందడానికి కారణం ఏమిటంటారు?

మనం చెబుతున్నది నిజమైనప్పుడు… నిజాన్ని నిజంగా చెబుతున్నప్పుడు… అవతలి వాళ్ళను నొప్పించ కుండానే నిజాయతీగా చెబుతున్నప్పుడు… ఏ రచనకైనా ఎంతో పేరు వస్తుంది. అది అందరి ఆదరణా పొందుతుంది. ‘పాకుడు రాళ్ళు’లో ఉన్నవన్నీ నిజాలు… నిజాయతీగా చెప్పిన నిజాలు. ఇప్పటికే ఆ నవల మూడు, నాలుగు సార్లకు పైగా ముద్రణకు నోచుకోవడమే అందుకు నిదర్శనం.

Q ‘పాకుడురాళ్ళు’ నవలలోని మంజరి పాత్రకూ, మహానటి సావిత్రి జీవితానికీ చాలా పోలికలు ఉన్నాయనీ, అందులోని కొన్ని ఘట్టాలు ఆమె జీవితంలో జరిగినవేననీ సాహితీలోకంలో ఓ మాట ప్రచారంలో ఉంది. దానికి మీరేమంటారు?

ఆ మాట చాలా వరకు నిజమే! నటి సావిత్రి తరచుగా మా ఇంటికి వస్తుండేది. నన్ను ‘బావ’ అనీ, మా ఆవిడను ‘పిన్ని’ అనీ పిలిచేది. ‘అవేమి వరసలే! నన్ను బావ అని పిలిస్తే, మా ఆవిడను అక్కా అని పిలువు! ఆమెను పిన్ని అని పిలిస్తే, నన్ను బాబారు అని పిలువు’ అన్నాను. అందుకు, సావిత్రి సరదాగా ‘సినిమా వాళ్ళకు వరసలేమిటి బావా!’ అని నవ్వేసింది.

Q సినీ జగత్తులోని వ్యక్తుల అంతరాంతరాలను ప్రతిభా వంతంగా బొమ్మ కట్టించారు. ఆ వ్యక్తుల పేర్లు బయటకు వస్తే…

సినీ జగత్తు ఓ చిత్రమైన ప్రపంచం. అక్కడ తండ్రీ కొడుకులిద్దరితో దోస్తీ కట్టిన నటీమణులతో సహా చాలా మంది, చాలా వ్యవహారాలు నాకు తెలుసు. నా డైరీల్లో నా అనుభవాలన్నీ రాసుకున్నాను. అవన్నీ పేర్లతో సహా బయటకు రావాలంటే, నేను చనిపోయాక, నా డైరీలు బయటపెట్టాలి. ‘పాకుడు రాళ్ళ’ లాంటి సినీ రంగంతో సన్నిహితంగా ఉంటూ కూడా జారకుండా జాగ్రత్త పడినవాళ్ళలో ప్రముఖ రచయిత కొడవటిగంటి కుటుంబరావు, నేను – ఇలా కొంతమంది ఉన్నాం.

 

జర్నలిస్ట్లు లు  రాజేశ్వరి కళ్యాణం, రెంటాల జయదేవ, విశాలాంధ్ర బుక్ హౌస్ కు చెందిన ఈశ్వరరెడ్డి

జర్నలిస్ట్లు లు రాజేశ్వరి కళ్యాణం, రెంటాల జయదేవ, విశాలాంధ్ర బుక్ హౌస్ కు చెందిన ఈశ్వరరెడ్డి

Q మీరు వందల సంఖ్యలో కథలు, పదుల సంఖ్యలో నవలలు, నాటకాలు, వ్యాసాలు, పిల్లల కథలు రాశారు. మీ రచనల్లో మీకు బాగా నచ్చినదంటే ఏం చెబుతారు?

మీ కన్నబిడ్డల్లో ఏ బిడ్డ ఇష్టమంటే ఏం చెబుతాం? అయితే, నా రచనల్లో నాకు బాగా నచ్చింది – ‘జీవన సమరం’. సమాజంలోని వివిధ జీవన రంగాల్లోని సామాన్య వ్యక్తులను స్వయంగా కలసి, ఇంటర్వ్యూలు రికార్డు చేసి, వారి మాటలో, వారి యాసలో రాసిన వాక్చిత్రాలు అవి. అందులో కత్తులు సానబట్టేవాడు, చెవిలో గుబిలి తీసేవాడు, సోది చెప్పే అమ్మి, చిలక జోస్యగాడు… ఇలా సమస్త శ్రామిక జీవుల జీవితాలు, వారి జీవన గమనాలు వారి మాటల్లోనే అక్షరబద్ధం చేశాను. ‘ఈనాడు’ దినపత్రిక అధినేత రామోజీరావు ప్రోద్బలంతో, దాదాపు 50 – 60 వారాలు ఆ సిరీస్‌ రాశాను. సామాన్య వ్యక్తులు బతకడం కోసం చేసిన సమరమైన ‘జీవన సమరం’లో బడుగు జీవులు, మధ్యతరగతి వారు… ప్రతి ఒక్కరూ కనపడతారు.

Q అయితే, మీరు జీవితంలో చేసిన పనులు, రాసిన రచనలు అన్నీ ఇలా చిత్తశుద్ధితో నమ్మి, నిజాయతీగా చేసినవేనంటారు! ఇవాళ్టి రచయితలు చిత్తశుద్ధితో రాయాలంటారు!

(సాలోచనగా…) అలా చెప్పలేను. చిత్తశుద్ధిగా నమ్మని పనులు కూడా బతకడం కోసం నేను ఎన్నో చేశాను. ఉద్యోగ రీత్యా నా యజమానులు, నా పై అధికారులు కోరినవి, చెప్పినవి కూడా రాశాను. వృత్తి రీత్యా కానివ్వండి… డబ్బు కోసం కానివ్వండి… బతకడం కోసం అనుకోండి.. నేనూ కొన్ని రాయాల్సి వచ్చింది. రచన ప్రింటులో అనుకున్నంత రాలేదని ప్రచురణకర్త చెప్పినప్పుడు, రూపాయికి పేజీ వంతున రాసిన ఘట్టాలూ ఉన్నాయి. నాకు ఇష్టం లేని పనులు కూడా ఇష్టమున్నట్లు నటిస్తూ చేయడం కూడా అప్పుడప్పుడు తప్పలేదు. కాబట్టి, కాబట్టి, ఆ మాట చెప్పే హక్కు నాకు లేదు.

Q వాస్తవ జీవితంలోని ఘటనలతోనే కాక, సైన్స్‌ ఫిక్షన్‌ లాంటివీ చేసినట్లున్నారు!

అంతరిక్ష ప్రయాణం ఇంకా తెలియని రోజుల్లో 1950 – ’52 ప్రాంతంలో ‘చిత్ర గ్రహణం’ అంటూ స్పేస్‌ ట్రావెల్‌ మీద ‘ఆంధ్రప్రభ’లో సీరియల్‌గా రాశాను. అలాగే, ‘జయప్రళయం’ అంటూ మరో పాపులర్‌ సైన్స్‌ రచన కూడా చేశాను.

Q కథ, నవల, నాటకం, వ్యాసం, బాలసాహిత్యం, శ్రవ్య రూపకం… ఇలా ఎన్నో సాహితీ ప్రక్రియల్లో మీకు అభినివేశం ఉంది. వీటిలో ఏ ప్రక్రియ కష్టమైనదంటారు?

నా అభిమానులు చాలా మందికి నేను రాసిన చిన్న కథలంటే చాలా ఇష్టం. అలా రాయడం చాలా కష్టమని కూడా అంటారు. కానీ, నా దృష్టిలో రేడియోకు రూపకం రాయడం ఎంతో కష్టం. చాలా క్లిష్టమైన రచనా ప్రక్రియ అది. అందులోనూ ఆకాశవాణి వారి నిబంధనలకు తగ్గట్లుగా, వారికి నచ్చేలా రాయడం మరీ కష్టం.

Q ఆకాశవాణిలో ఉద్యోగానికి మీ జీవితంలో ఎలాంటి పాత్ర ఉంది?

(ఉద్వేగానికి గురవుతూ…) కడుపు నిండా తినడానికి పట్టెడన్నం కోసం కష్టపడిన రోజులు నా జీవితంలో ఎన్నో ఉన్నాయి. అలాంటి నేను, నా భార్య, నా బిడ్డలు కడుపు నిండా ఇంత తినడానికి జీతభత్యాలతో కూడిన ఉద్యోగమిచ్చిన సంస్థ – ఆకాశవాణి. అప్పట్లో 185 రూపాయల జీతమంటే చాలా ఎక్కువ. హైదరాబాద్‌ ఆకాశవాణిలో నాకు ఉద్యోగ రావడానికి కారణమైన రచయిత త్రిపురనేని గోపీచంద్‌ను మర్చిపోలేను. నాకు ఎన్నో పుస్తకాలు చదువుకొనే అవకాశం, ఆలోచించే తీరిక, రాసే అవకాశకం ఇచ్చింది ఆకాశవాణే. నాకున్న పరిధిని విస్తృతీకరించిన మహౌన్నత కళాసంస్థ అది. ఆ జీవితాన్ని నేను ఎన్నడూ మర్చిపోలేను. (గొంతు గద్గదికం అవుతుండగా…) నాకు ఒకే ఒక్క కోరిక ఉంది. అది తీరుతుందో, లేదో కానీ… నేను చనిపోయాక, నా పార్థివ శరీరాన్ని ఆకాశవాణి ప్రాంగణంలో భూస్థాపితం చేయాలి. ఆకాశవాణిలోకి వచ్చే కళాకారులు, సాహితీవేత్తలందరూ దాని మీద నుంచే నడుచుకుంటూ పోవాలి. అవకాశం ఉంటే, వచ్చే జన్మలో ఆకాశవాణిలో ఓ చిన్న గరికపోచగా పుట్టాలని కోరిక!

ఇంటర్య్వూ : రెంటాల జయదేవ

                                                                                                                   ( ప్రజాశక్తి సౌజన్యం తో )

 

“నాకు American Way of Life బొత్తిగా నచ్చడం లేదు”

చికాగో  14 – 7 – 95

Dear Narendra,

క్షేమం.

ఫోనుపైన మాట్లాడుతూనే వున్నా వివరాలన్నీ చెప్పడం సాధ్యం కాలేదు. హైదరాబాదుకు ఫోన్ చేసి మీ మామగారితోనూ, దామల చెరువుకు ఫోన్ చేసి సాంబమూర్తితోనూ మాట్లాడాను. ఈ దేశంలో R.S.సుదర్శనంగారితోనూ, దాక్షాయణి దంపతులతోనూ, సిన్‌సినాటీలోని రోజాతోనూ మాట్లాడాను. న్యూయార్కు పరిసరాల్లో వున్న కిశోర్ ఎట్లాగో నంబరు తెలుసుకుని నన్ను కలిశారు. ఎటొచ్చి నైవేలీలోనూ, పలమనేరులోనూ టెలిఫోన్ సంబంధాలు నెట్టుకురానీకి వీల్లేకపోయింది. ఈ రోజు ఉదయం చిత్తూరునుంచి ఫోన్ చేసి మహి, గీత మాట్లాడారు. ఎలా బెంగపడుతు వుందో ఏమో. మీ అమ్మతో మాట్లాడి వుంటే బాగుండేది.

మద్రాసు ఎయిర్‌పోర్టులో మీరు అద్దాలకటు వైపునుండి వీడ్కోలు చెబుతూ వుంటే నా తొందరలో పరిగెత్తవలసి వచ్చింది. అవతల నా లగేజి, టికెట్టు కౌంటర్‌లోని అమ్మాయి దగ్గర వున్నాయి. నేను స్టేట్ బ్యాంకు కౌంటర్ దగ్గరకు వెళ్లి రూ.300/- ట్రావెల్ టాక్స్ కట్టి రసీదు తీసుకొస్తున్నాను. ఆ కౌంటర్ దగ్గరే  పులికంటి కృష్ణారెడ్డి కలిశారు. మేమెక్కిన విమానం ఉదయం 4.30 గంటల  ప్రాంతంలో డిల్లీలో దిగాం. అక్కడ  2 గంటల విరామం. అక్కడి ఏర్‌పోర్టులో చాలా పెద్దదైన బోయింగ్ విమానం ఎక్కించారు. అందులో 400 మంది ప్రయాణీకులుంటారు. ఆహార పానీయాదులకు కొరత లేదు. నేను sweets తినకూడదు కనుక నా ఆహారం పరిమితమైపోయింది. అయినా ఫరవాలేదు. 29 సాయంకాలము  3 గంటలకు డిల్లీ చేరుకున్నాము.

అక్కడ మళ్ళీ రెండు గంటల విరామం. న్యూయార్కు 8 గంటల ప్రయాణం. అయితే న్యూయార్కులో దిగినపుడు తేదీ మారలేదు. చీకటి మారలేదు. అక్కడ అప్పుడు సాయంకాలం 4 గంటలు అయింది.  మా టికెట్టు ఆ విమానంలో న్యూయార్కు వరకే. అందువల్ల 4 గంటల పాటు ఆగవలసి వచ్చింది. బాపు, జగ్గయ్యగార్లతో కలిసి మాకు తానా కార్యకర్తలు అక్కడ మాత్రం ఓ యింట్లో వంటల ఏర్పాటు చేశారు. స్నానం, భోజనం చేసి విశ్రాంతి తీసుకున్న తర్వాత ఆ రోజు రాత్రి 9 గంటలకు విమానమెక్కించారు. రాత్రి 11 గంటలకు చికాగో చేరుకున్నాము.

సభా నిర్వాహకులు విమానాశ్రయంలో కలిసి దగ్గర్లోనే వున్న HYAT హోటలుకు తీసుకెళ్ళారు. అది పదంతస్తుల కట్టడం. వందలకొద్ది గదులున్నాయి. సభలకు ఈ దేశంలో పలు ప్రాంతాల్లో నివసిస్తున్న తెలుగువారు 7 లేక 8 వేలమంది వచ్చారు. బయటినుంచి వచ్చినవాళ్లందరికీ బసలు ఏర్పాటు చేశారు. మన దేశం నుండి దాదాపు వందమంది తానా ఆహ్వానితులు వచ్చినట్టున్నారు. సదాశివరావు, లవణం, ఇస్మాయిల్, చలసాని ప్రసాదరావు, యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ మొదలైన తెలుగువారు కలిశారు. జులై 1, 2, 3, తానా సభలు.నాలుగు రోజులపాటు హోటల్లో వున్నాము.

రెండురోజుల్లో ఉదయం ఉపాహారలు మాత్రం చేసి హోటల్లో బస చేయవలసి వచ్చింది. డా.రాశీ చంద్రలత, డా.సుబ్బారెడ్డి దంపతులది కడపజిల్లా. సభలు జరిగిన రోజుల్లో మాత్రమే మేము అందరితో కల్సి హోటల్లో భోజనం చేశాము. ఒక్కసారిగా 7, 8 వేలమంది ఒకే చోట కూర్చుని భోజనం చేయడం అపురూపమైన సన్నివేశం. ‘తానా’ సభల నిర్వాహకులు ఎంతో ఉదారంగా సర్వ సదుపాయాలు సమకూర్చారు. వేర్వేరు హాల్సులో సాహిత్య, సాంఘిక,  స్త్రీ ఉద్యమ సమావేశాలు జరిగాయి.

కొంతదూరంలోని పెద్ద గుళ్ళో సంగీత, నాట్య కార్యక్రమాలు జరిగాయి. ఒక సాహితీ సభలో నేను, కృష్ణారెడ్డి, మేడసాని మోహన్ పాల్గొన్నాము. విష్ణు, జాషువా, బాపిరాజుల వర్ధంతి సభలు జరిగాయి. మునుపటి సభల్లో కన్నా ఈ సభల్లో ఏర్పాటైన కార్యక్రమాలు బాగున్నట్టు చెప్పుకున్నారు. మమ్మల్ని యిక్కడికి ఆహ్వానించిన డా.రాణీసంయుక్త, డా. కట్టమంచి ఉమాపతి సంతృప్తి పొందగలిగారు. సభలు పూర్తయిన మరునాటినుంచి మా బస సంయుక్తగారి యింట్లోనే, 4,5 తేదీల్లో లవణంగారు కూడా మాతోబాటుగా యిక్కడే వున్నారు.

5వ తేదీ సయంకాలం గ్రేటర్ చికాగోలోని రామాలయంలోని  బేస్‌మెంటులో నాస్తికవాద ప్రవక్త లవణంగారు సత్యాహింసల గురించి  ప్రసంగించారు. సభలో మేడసాని మోహన్, ((నేలబర్కవము)), S.V.రామారావు (సుప్రసిద్ధ చిత్రకారులు, చికాగో వాస్తవ్యులు) పాల్గొన్నారు. నాలుగైదు సార్లు డౌన్‌టౌన్‌లోని రద్దీ ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడి ఆకాశ హర్మ్యాలను చూపించారు. వివేకానందుడు ఉపన్యసించిన భవనం అక్కడే వుంది. C.S.టవర్ అనే 110 అంతస్థుల భవనాన్ని ఎక్కి, విశాల షికాగో నగరాన్ని చూచాము. ఈ నగరానికంతా నీళ్లు సరఫరా చేసే మిచిగన్ మహా సరస్సు వుంది. మరొకరోజు గ్రహాంతర పరిశోధనల మ్యూజియం, ప్లానిటోరియం చూశాము.

ఆ రెండు రోజుల్లోను మధ్యాహ్నాల్లో ఒకరోజు ఇటలీ హోటల్లో పిజ్జా, ఇంకొకరోజు చైనా హోటల్లో వాళ్ళ తిండి భోంచేసాము. ఈలోగా ఒక రోజు డాక్టరుగారింట్లో  నన్ను హాస్పిటల్‌కు తీసుకెళ్లి Blood Sugar చేక్ చేయించారు. 121 మాత్రమే వుంది. ఒకసారి సాయంకాలం కట్టమంచి వారి యింటికి వెళ్లి భోజనానికి పిల్చాము. ఒక యింటికి, మరొక యింటికి, యిళ్ళకు, బళ్లకూ, కార్యాలయాలకు మధ్య 20,25 మైళ్ల దూరముండడం యిక్కడ సామాన్యమైన విషయం. హోటల్లో వుండగానే శ్రీధర్‌కు ఫోన్ చేశాను. కలుపుగోలుగా వుండి యిక్కడివారిలో కలిసిపోయారు.

ఆదివారం నాడు రెండు కార్లలో విస్కాన్సిన్ వెళ్ళాము. ఆ నగరం ఒక పెద్ద పర్యాటక కేంద్రం. దాన్ని ఒరుసుకుని పారే నదిలోని ఒక జలాశయంలో రకరకాల సర్కస్ విన్యాసాలు జరుగుతాయి. నదిలో తొమ్మిదిమైళ్ల స్టీమరు లాంచీ ప్రయాణం. ప్రాచీన రెడ్ ఇండియన్ల గుహలు నదీతీరంలోని కొండల్లో కానవస్తాయి. 30 నుంచి ఈనాటివరకు గృహస్థులందరూ ఉద్యోగులు కావడంవల్ల పగటివేళ  దాదాపుగా అందరం ఇంట్లో వుంటున్నాము.

విష్ణు, వీణ అని వీరి ఇద్దరు పిల్లలు. వాళ్లు యింట్లో వుండడమే అబ్బురం.ఈ నగరంలో యిళ్లు దూర దూరంగా వుంటాయి. ఇరుగుపొరుగు అన్న ప్రసక్తే వుండదు. ఎక్కడో Busy Placesలో తప్ప పాదచారులే కనిపించలేదు. కార్లు, ఫోనులు లేకపోతే నగర జీవితం లేదు. ఈ ఇంట్లో వున్నవారు నలుగురు, ఉన్న కార్లు మూడు. ఈ పరిమితి వల్ల బయటకు వెళ్తే పార్కింగ్ ప్లేసులు దొరకడమే పెద్ద సమస్య.

ఇద్దరు ముగ్గురు కల్సి వచ్చిన కారులో వచ్చిన కత్తిరించి 475 డాలర్లకి బిల్లు వేశారు (475 x 32) ప్రతి వస్తువు గిరాకీగానే  వుంటుంది. కిలో చిక్కుడుకాయలు 6 డాలర్లు (32 x 6= రూ.192)సంపాదనలాగే వీళ్లకు ఖర్చు కూడా ఎక్కువే. సిన్‌సినాటి నుండి రాజా ఫోన్ చేసి తనకు పైసలు చాలడం లేదని చెప్పినప్పుడు నాకు చాలా బాధ కలిగింది. మనవాళ్లకు ఈ దేశం పైన యింత వ్యామోహమెందుకో బోధపడడం లేదు.

నాకు American Way of LIfe బొత్తిగా నచ్చడం లేదు. కార్లకు హారన్లుండవు, ఇళ్ల తలుపులు ఎప్పుడూ మూయబడి వుంటాయి. ఇంట్లో మనుషులున్నారో లేదో బోధపడదు. ఈ ప్రశాంతికి, క్రమబద్ధతకు మనం అలవాటు పడడం చాలా కష్టం. సరే అదంతా అలా వుంచితే వారంలో 5 రోజులు ఏకాగ్రతతో పని చేస్తారు గనుక వీళ్లకు weekendలో మాత్రమే విరామం. అందువల్ల మేము శని ఆదివారాల కోసం వేచి చూస్తు మిగతా 5 రోజులు ఏకాంత గృహంలో చదువుకుంటూనో, నిద్రపోతు, ఫోన్‌కాల్స్‌కు జవాబు ఇస్తూ గడపాలి.

కట్టమంచి ఉమాపతిరెడ్డిగారు గొప్ప గడుసరి వారు. మేము 60లలో సంపాదించాము. పెద్ద పెద్ద యిళ్లు కట్టుకున్నాము. మీరు ఏ గదిలోనైనా వుండొచ్చు. తొందరేముంది? మీరు  మీ దేశం వెళ్లి చెయాల్సిన అర్జంటు పనులేమున్నాయి. ఏవైనా రాయదల్చుకునే యిక్కడే రాసుకోండి. అని మోగమాట పెడుతున్నారు. చివరికలా కుదరదని, తిరుగు ప్రయాణానికి ఒక తేదీ నిర్ణయించుకుని కార్యక్రమాలన్నింటిని ఆ మేరకు ఏర్పాటు చేసుకోవడం బాగుంటుందని తెలియచెప్పుకున్న తర్వాత ఒక ప్లాను తయారు చేశారు.  15,16 తేదీలలో ఒహియో రాష్ట్రంలోని can bush, కడప సుబ్బారాయుడుగారు  డాక్టరు (శతావధాని సి.వి.సుబ్బన్నగారి తమ్ముడు) కార్యక్రమం ఏర్పాటు చేస్తున్నారు.. 20 నుండి 24 దాకా హూస్టన్, డల్లాస్ నగరాలు, 26న మళ్లీ యిక్కడే సభా కార్యక్రమం యింతవరకు ఏర్పాటయింది.

ఈలోగా తలవని తలంపుగా న్యూయార్క్ దగ్గరగా వున్న న్యూజెర్సీనుంచి ఒక ఫోను కాల్ వచ్చింది.  ఆయన పేరు అప్పాజోస్యుల సత్యనారాయణ. న్యూజెర్సీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు. ఆయన చిరకాలంగా నా కథలు చదువుతున్నారట. ఎంతో ఆప్యాయంగా పలకరించి న్యూజెర్సీకి ఆహ్వానించారు.

మాకు నయాగరా చూడాలని వుందంటే డెట్రాయిట్‌లోని తన మిత్రునికి ఫోన్ చేసి ఏర్పాట్లు చేయించారు. దాని ప్రకారం మేము 27న డెట్రాయిట్ వెళ్లాలి. 28న అక్కడే వుండాలి.29 శనివారం నయాగరా చూపిస్తారు. 30 ఆదివారం న్యూయార్క్ చేరుకోవాలి.  అక్కడ సత్యనారాయణగారు రిసీవ్ చేసుకుంటారు. సుదర్శనం, దాక్షాయిణి, కిశోర్ గార్లను కలుసుకోవాలి. ఆగస్టు మొదటి వారాంతంలో తిరుగు ప్రయాణం ఏర్పాటు చేసుకుని న్యూయార్కునుంచి విమానంలో సీట్లు రిజర్వు చేయించుకోవాలి.

ఈ వారంలో సుబ్బారెడ్డిగారు నన్ను వేర్వేరు హాస్పిటల్స్ తీసుకెళ్లి రక్త పరీక్ష, నేత్ర పరీక్ష చెయించారు. రక్తపరీక్ష రిపోర్తు వచ్చింది. ఫలితాలు తృప్తికరంగా వున్నాయని చెప్పారు. నేత్ర పరీక్ష చేసిన డా. చిత్ర.వి.నడింపల్లిగారు ఇల్లిందల సరస్వతీదేవిగారి కూతురట. ఈమె అత్తగారిల్లు తిరుపతి. డాక్టరు వి.రామకృష్ణ అని ప్రసిద్ధ నేత్ర వైద్యులుండేవారు. ఈమె ఆయన కోడలు.ఎంతో శ్రద్ధగా పరీక్షలు చేసి Prescription యిచ్చింది. అద్దాలు తిరుపతిలోనే కొనుక్కోమంది. ఇవీ విశేషాలు. కొనుక్కో దలచిన వస్తువులు కోసం Departmental Stores అన్నీ తిరుగుతున్నాము. వంద డాలర్లు పెడితే గాని మంచి  కెమెరా వచ్చేటట్టు తోచదు. వంద డాలర్లు  అంటే 3200 రూ గదా. అట్లాగే మిగిలిన వస్తువులన్నీ, బాగా తెలిసినవాళ్లని తీసుకెళ్లి ఏమైనా కొనుక్కోవాలి. ఈ మధ్య నైవేలికి, పలమనేరుకు కూడా జాబు రాశాను. అయితే యింత వివరంగా రాయలేదు.  నువ్వు జిరాక్సు తీసి పంపిస్తే వాళ్లు సంతోషిస్తారు. లతకు ఆశీస్సులు.  రాసాని దంపతుల్ని అడిగినట్టు చెప్పు. అల్లాగే జాన్, భాస్కర రెడ్డి యింకా మనవాళ్లందరినీ అడినట్లు చెప్పు.

శుభాకాంక్షలతో

భారతీయ కథలో వేంపల్లె జెండా!

shariff -1

(మన కథకుడు వేంపల్లె షరీఫ్ ఈ ఏడాది కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కారం
గౌహతి లో మార్చి 22 వ తేదీ అందుకుంటున్న సందర్భంగా)

రాయలసీమ ముస్లిం జీవితాల్ని సన్నిహితంగా చూసిన వాళ్ళకి వొక విషయం ఇట్టే తెలిసిపోతుంది –

మిగిలిన  ప్రాంతాల కంటే కూడా సీమలో ముస్లింలు ఇక్కడ స్థానిక జీవితంలో బాగా ఇమిడిపోయారు అని! సీమలో ముస్లింల ఇంటి పేర్లు మిగిలిన చోట ముస్లింల ఇంటిపేర్లలా మహమ్మద్, షేక్, సయ్యద్ అని మొదలవ్వడం చాలా అరుదు. వేంపల్లె, పెనుకొండ, కొదుమూరు, కలికిరి ఇవీ ఎక్కువ మంది ముస్లింల  ఇంటి పేర్లు. ఇంకాస్త ముందుకు వెళ్ళి, పల్లెల్లో పీర్ల పండగలూ, ఇతర సూఫీ పీర్ల స్మృతి చిహ్నంగా జరిగే ఉరుసు ఉత్సవాలు గమనిస్తే సామూహిక స్థాయిలో హిందూ-ముస్లింల మధ్య ఎలాంటి అనుబంధం వుందో తెలుస్తుంది.

తెలుగు సాహిత్యంలో ముస్లిం కథకుల పేర్లు వినిపించడం విశేషమేమీ కాదు. కానీ, వేంపల్లె షరీఫ్ కథలు చదవగానే అవి సాధారణ ముస్లిం కథలకు భిన్నంగా అనిపించడానికి కారణం షరీఫ్ సీమ నేపధ్యమే! అందుకే, షరీఫ్ కథల్లో కనిపించే మెజారిటీ-మైనారిటీ బంధం కూడా భిన్నంగా వుంటుంది. ఇందులో సంఘర్షణ తక్కువగా వుంటుంది, సామరస్యం ఎక్కువగా వుంటుంది. ఇంకా కొన్ని సందర్భాల్లో అసలు ఆ తేడాని గమనించలేనంతగా ఆ రెండు సమూహాల సంబంధాలూ కలగలిసిపోయి వుంటాయి. ఆ కారణంగా షరీఫ్ తన కథల్లో వర్ణించే ముస్లిం జీవన దృశ్యం కేవలం వొక మైనారిటీ కోణంగా కనిపించదు. స్థానికత అనేది సమకాలీన తెలుగు కథ ప్రధాన లక్షణం అనుకుంటున్న ఈ దశలో షరీఫ్ కథలు ఆ లక్షణానికి  పక్కా ఉదాహరణగా నిలుస్తాయి.

స్థానికతకి వొక ప్రత్యేకమయిన శిల్ప సౌందర్యం కూడా వుంటుంది. స్థానికత ఇరుసుగా వున్న కథ ఎక్కువ అలంకారాలు ధరించదు. సాదాసీదా అందంతో మన ముందుకు వస్తుంది. వొక్కో సారి ఈ అందం వొక అందమేనా అన్న సంశయం కలిగేంతగా ఈ కథలో అందం ఇంకిపోయి వుంటుంది. షరీఫ్ కథలు చాలా మామూలుగా మొదలయి, చాలా మామూలుగా నడుస్తూ చాలా మామూలుగా ముగుస్తాయి. అతని వాక్యాలు సాంద్రత కోసం వెతుక్కోవు.

ఇంత మామూలు వాక్యాలు కథలో ఎలా ఇమిడాయా అని ఆశ్చర్యపోతుండగా చదువరిని చివరి దాకా తీసుకు వెళ్ళే అత్యంత పరిచిత వ్యక్తిలా కనిపిస్తాడు షరీఫ్. కథలో వొక ఆత్మీయ స్వరం వినిపిస్తూ వుంటుంది. బయటి జీవితాన్ని ఇతివృత్తంగా తీసుకొని, ఇలాంటి ఆత్మీయ స్వరాన్ని వినిపించడం అంత తేలిక కాదు. ఇది ఖదీర్ బాబు కథల్లో వినిపించే లాంటి ఆత్మీయ స్వరం కాదు. (కథా శిల్పానికి సంబంధించి ఇంకో విషయం: చాలా మంది ఖదీర్ బాబు రచనని నామిని కథాశిల్పంతో ముడిపెట్టి మాట్లాడుతూ వుంటారు. నిజానికి అది వాస్తవం కాదు. నామిని కథనంలో rationalization అసలు వుండదు. ఖదీర్ కథన శిల్పంలోని వొకానొక జీవధాతువు నామిని నించి వచ్చిందే కానీ, ఖదీర్ కథనశిల్పం నామిని కంటే ఆధునికం, సమకాలీనం. అది అతని rationalization వల్ల సాధ్యమయింది. అందుకే ఖదీర్ కథన సంప్రదాయం అనే మాటని విడిగా వాడుతున్నా)

ఈ ఇద్దరి సంప్రదాయాన్ని   సహజ అందంగా కలిపి ముందుకు తీసుకెళ్తున్న కథకుడు షరీఫ్. ఈ కథల్లోని ఆత్మీయ శిల్పం ఆత్మీయంగా వుంటూనే ముక్కు సూటిగా కొన్ని హేతుబద్ధమయిన ప్రశ్నలు అడుగుతుంది. అసలు అలాంటి ప్రశ్న అడక్కుండా షరీఫ్ కథ ముగింపు దాకా రాదు. కథ ముగిశాక ఆ ప్రశ్నకి సమాధానం వెతుక్కోవడంతో ఈ కథల పఠితకి ఇంకో ప్రయాణం మొదలవుతుంది. ‘జుమ్మా’ సంపుటి నించి ఈ సారి “కథాసారంగ”లో ప్రచురిస్తున్న షరీఫ్ సరికొత్త కథ ‘వింత శిశువు’ దాకా ఈ ప్రశ్న వినిపిస్తూనే వుంటుంది. అయితే, ఈ ప్రశ్న స్వరం చెంప మీద చెళ్లుమని కొట్టినట్టుగా కాకుండా, ఆత్మీయ స్వరంతో ధ్వనించడం షరీఫ్ కథనమార్గం!