అపురూపం … ఆ… స్వరసంగమం

bhuvanachandra (5)

“సంగీత సాహిత్య సమలంకృతే…” అని వాగ్దేవిని కీర్తించారు సి.నా.రె.గారు. 29.10.2013న రామోజీ ఫిలిం సిటీలో ఆ ‘పాట’ని గుర్తు తెచ్చుకోనివారు లేరు. ఆ రోజున అక్కడ సాక్షాత్తు ‘సంగీత సాహిత్య సరస్వతి’ కొలువైంది. 80 సంవత్సరాల తెలుగు చలన చిత్ర సంగీత, సాహిత్యకారులకు స్వరాభిషేకం ఆ శారదాదేవి సాక్షిగా జరిగింది. ‘కన్నుల పండువ’ అనే పదానికి అర్ధం ఆనాడు ‘కళ్ల’కి తెలిసింది. ‘వీనులవిందు’ అనే పదంలోని విందుని శ్రవణేంద్రియాలు, ఆస్వాదించాయి. అక్కడ వున్న ప్రతి మనిషీ ‘మానసికోల్లాసం’ అనుభవించారు.
మరోసారి అటువంటి ‘మహాసభ’ జరుగుతుందా? ఏమో! జరిగిన మహోత్సవాల్ని తలుచుకుని ఆనందం. ‘మళ్ళీ ఎప్పుడు?’ అని ప్రశ్నించిన గుండెకు ‘మౌనమే’ సమాధానంగా మిగిలింది.
సృష్టికర్త రామోజీ, రధసారధి ‘బాపినీడు’గారు చిరునవ్వుతో ఆహుతుల్ని ఆహ్వానిస్తుండగా, అతిరధ మహారధులు ఆ ‘స్వరమండపాని’కి విచ్చేశారు.
అరుగో.. ఎనభైలు దాటిన సంగీత చక్రవర్తులూ, సాహిత్య సామ్రాట్‌లూ. దర్శకేంద్రులూ, దర్శకరత్నలూ, గాయక, గాయనీ శ్రేణులు,, అబ్బా.. కెమెరాలు పులకించిపోయాయి.
దక్షిణ భారత చలన చిత్ర సంగీతానికి ఓ చిరునామా ఇచ్చిన శ్రీ ఎం.ఎస్. విశ్వనాధన్‌గారు. అరుగో.. చేతులు జోడించి నమస్కరిస్తూ… ఎన్నెన్ని అద్భుతమైన పాటలాయనవీ.
అరుగో… కర్ణాటక సంగీతాన్ని వినీలాకాశంలో నిలబెట్టిన అచ్చ తెలుగు వాగ్గేయకారుడు శ్రీ బాల మురళీకృష్ణ.. “సాక్షాత్తూ శ్రీ కృష్ణుని వేణువే భువిలో బాలమురళియై అవతరించిందా..! అనిపించేంత మహోన్నత సంగీత విద్వాంసుడూ, నవరాగాల సృష్టికర్తా.. మెల్లగా నడిచి వస్తున్నారు. చిరునవ్వుతో వాహ్.. ‘పంచెకట్టు’ని తన కవిత్వంతో ప్రపంచవేదిక మీద నిలబెట్టిన ‘విశ్వంభరుడు’ జ్ఞానపీట్ అవార్డు అందుకున్న సుజ్ఞాన మూర్తి.. ఆచార్య ‘సి.నా.రే’ మెల్లమెల్లగా వస్తున్నారు. ఆ మహనీయులందరికీ పాద నమస్కారాలు చెయ్యని మనిషి ఆ మహోత్సవంలో లేరు. ఎవరు చెప్పారు? . ఆ మహానుభావులు పాదాల మీద వాలమని?

b2
ఆహా నిలువెత్తు మనిషి! పదహారు భాషల్లో ఏభైవేలకి పైగా పాటలు పాడి ‘గిన్నీస్’ బుక్కులో ధృవతారలా మెరుస్తున్న ఆ బిగ్‌బాస్ డా.కె.జె.ఏసుదాస్ కాక ఇంకెవరూ… పక్కనే విజయ్ యేసుదాస్.. వర్ధమాన్ గాయకుడూ, తండ్రికి తగ్గ తనయుడూ..
తెలుగు సినిమాకి నాలుగున్నర దశాబ్దాల పాటు వారే ‘దిశానిర్దేశకులు’.. నేటికీ ‘పెద్ద దిక్కు’ వారే.. శ్రీ దాసరి నారాయణరావుగారూ. శ్రీ కె.రాఘవేంద్రరావుగారూ, వారే … కృష్ణార్జునుల్లా నడిచొస్తున్నారు. ప్రేక్షకుల జేజేలు అందుకుంటూ..
ఎనభైకి దగ్గరవుతున్న ఆయన గుర్తున్నారా… ‘రాజన్ – నాగేంద్ర’ జంటలో నాగేంద్రగారు. ఎన్ని మధురమైన పాటల్ని ‘స్వరించారు’ నిటారుగా నడుస్తూ ‘కాలపు వీణ’కి స్వరాలందిస్తూ వస్తున్నారు.
అట్నుంచి వాణీ, జయరాంగార్లు.. భార్యభర్తలిద్దరూ ఆకూవక్కల్లాగా వస్తున్నారు. వాణీజయరాంగారి ‘బోలీరే పపీ హరా’ గుర్తున్నదా? ఇప్పటికీ అదే ‘గుడ్డీ’వాయిస్.
బి.వసంతగారు. మనకున్న మంచి గాయనీమణుల్లో ఆమె ఒకరు. ఏ ‘హిందీ’పాటని ‘కూనిరాగం’ తీసినా BGMతో ఆ పాటు పూర్తి లిరిక్స్‌తో పాడగల తెలుగు గాయని. ఇక అరుగో సుశీలమ్మ.. దక్షిణ భారత ‘లతా’ మంగేష్కర్. పాడేటప్పుడు ‘శ్వాస’ శబ్దం రానివ్వని ఏకైక గాయనీమణి. అదెలాగో ఇప్పటికీ సీక్రెట్టే.. దక్షిణ భారత దేశపు భాషలన్నీ సుశీలగారిని ‘ఆసరా’గా చేసుకుని తమ గీతాల్ని పల్లవించాయి.
అమ్మయ్యా.. వస్తున్నది చిత్రగారు. ‘వేణువై వచ్చాను భువనానికీ’ అంటూ శ్రోతల్ని కన్నీళ్లు కార్పించక మానదు. చెరగని ‘నవ్వు’ఆవిడకి దేముడిచ్చిన వరం. అందుకే ఆవిడకి ‘ప్రిన్సెస్ ఆఫ్ స్మైల్స్’ అని పేరు పెట్టాను.
చల్లగా నవ్వుతూ వస్తున్నారు ఎస్.పి.శైలజగారు. ఎస్.పి చరణ్ (బాలూగారి అబ్బాయి) ఎస్.పి శైలజ బాలూగారికి చెల్లెలుగా పుట్టకపోతే ‘డ్యూయట్లు’ అన్నిటిమీదా ఆమె పేరే రాయబడి వుండేదేమో.. ‘నాంపల్లీ టేసనుకాడ రాజాలింగో’ ఎవరు మరువగలరు? వాహ్.. ప్రణవి.. టిప్పూ.. టిప్పూగారి భార్య హరిణి.. సందీప్ ఇంకా ‘లిటిల్ చాంప్స్’ లోనూ ‘పాడుతా తీయగా’ లోనూ పాడిన యువ, చిన్నారి గాయకులు.. అదుగో గాయని విజయలక్ష్మి. అరుగో సాంగ్ పహిల్వాన్ ఎస్.పి.బాలూగారు. ఆ పక్కన ‘మనో’.. ఇంకేం కావాలి.. గాలి వాయులీనమైంది. గుండె ‘స్వరస్మృతుల’తో నిండిపోయింది. ఎందుకు నిండదూ? విద్యాసాగర్.. రాజ్.. రమణీ భరద్వాజ్.. ఎస్.ఏ.రాజ్‌కుమార్. గంగై అమరన్, మాధవపెద్ది సురేష్.. చైతన్య ప్రసాద్, దేవిశ్రీప్రసాద్, మణిశర్మ, సాలూరి వాసూరావు. ఆర్.పి. పట్నాయక్, అనూప్ రూబెన్స్, లాంటి సంగీత దర్శకులు తమ శ్వాసల్నే స్వరాలుగా పేరుస్తూ వుండగా.. అరుగో. సిరివెన్నెల సీతారామశాస్త్రి, జొన్నవిత్తుల రామలింగేశ్వరరావు, వెన్నెలకంటి రాజేశ్వర (ప్రసాదు) భాస్కరభట్ల రవికుమార్, జాతీయ పురస్కార గ్రహీత సుద్దాల అశోక్‌తేజ, వాచస్పతి సాయికుమార్.. ఓహ్.. మాటలే పాటలై పరవశిస్తున్నాయా..

ph 1
పరస్పర ఆలింగనలు
పాదనమస్కారాలు
ఆటోగ్రాఫులు
ప్రేక్షకులతో ఫోటోలు
అవిశ్రాంతంగా అందర్నీ, అన్నింట్నీ ‘తమలో’ ఇముడ్చుకుంటున్న వీడియో కెమేరాలు. నవ్వులు. అక్కడక్కడా భావోద్రేకంలో కన్నీళ్లు
ముఖాన తగిలించుకున్న ‘ముసుగు’ లన్నీ తొలగిపోయి స్వచ్చమైన మానవత్వం పరిమళించింది.
హృదయాల్లో స్నేహం పెల్లుబికింది.
బాలమురళీకృష్ణగారు, ‘మౌనమె నీ భాష ఓ మూగ మనసా’ అన్న ‘గుప్పెడు మనసు’ చిత్రంలోని పాటని అందుకోగానే అందరి కళ్లల్లో ఆనంద భాష్పాలు, ఎనభై మూడేళ్ల వయసా ఆయనది? మరి, ‘సలలిత రాగ సుధారస సారం’ పాటకి ఎలా పాడగలిగరబ్బా? నేటి బుల్లి గాయని ప్రణవితో..
“ఆకాశదేశానా… ‘ అని జేసుదాసుగారు పాడుతుంటే ఏమిటీ. యీ స్వరమందిరం పులకించిపోతోందేం..
మళ్లీ చిత్రగారు “వేణువై వచ్చాను భువనానికీ’ అని పాడుతుంటే, ‘గాలినైపోతాను గగనానికీ’ అంటూ వేటూరిగారు గాలిలా మారి అందరి గుండెల్ని సృశించారు.
జ్ఞాపకాల కన్నీళ్లు. స్వర వర్షంతో కలిసి పాటల వరదలయ్యాయి. ‘చినుకులా మారి’ అంటూ బాలుగారు వాణీజయరాంగారూ, ఎస్.పి.శైలజ కురిపించిన మధువుల్ని మనసునిండా నింపుకున్నాం.
అయ్యా.. ఇదో మరపురాని, మరువలేని స్వర సంగీత సాహిత్య సంగమం. ఎంత మైమరచిపోయానంటే, చెన్నై చేరుకున్నాక గుర్తొచ్చింది. మనసుతో తప్ప కెమేరాతో ఒక్క ఫోటో కూడా తీయలేకపోయానని.
అన్ని విషయాలూ, చలోక్తులూ, చమక్కులూ, చెప్పను. ఎందుకంటే నా గుండె మారుమూలల్లో ఓ పాట (రాజ్ కపూర్‌ది, ముఖేష్ పాడింది) వినిపిస్తోంది.
“కల్ ఖేల్ మే.. హం హో న హో” లో
గర్దిష్ మే తారే రహేంగే సదా
భూలోగే హమ్ భూలేంగే తుమ్
పర్ హమ్ తుమ్హారే రహెంగే సదా
రహెంగే యహీ.. ఆప్నీ నిశాన్
ఇస్ కె సివా జానా కహా..
జీనా యహా.. మర్‌నా యహా..
అంటూ ‘రేపటి ఆటలో మనముంటా’మో ఉండమో.. కానీ ఆ నీలాకాశంలో నక్షత్రాలు అక్కడే ఉంటాయి. అంతట్నీ చూస్తూ సాక్షులుగా, నువ్వు మర్చిపోవచ్చు, వారూ, మీరు అందరూ మర్చిపోవచ్చు. కానీ నేను మాత్రం సదా మీ మనిషినే! ఇవిగో.. నా జ్ఞాపకాల నీడల్ని ఇక్కడే వదిలి వెళ్తున్నాను. జీవించడమూ ఇక్కడే.. మరణించడమూ ఇక్కడే. వెళ్ళేది వేరెక్కడికీ..”
ఈ పాట నా గుండెని పిండేస్తోంది. మరోసారి అందరం కలుస్తామా… పోనీ ఏప్పుడో కలిసినా అందరం ఉంటామా? ఎందర్ని తల్చుకుని కన్నీళ్లు కార్చాలో.. ఎందరి జ్ఞాపకాల నీడల్లో నిట్టూర్పులు విడవాలో.. భగవాన్.. ‘కాహెకో దునియా బనాయీ? ఎందుకు సృష్టించావయ్యా యీ లోకాన్ని?

b1(1)
పోనీలే..
“ఇక్ దిన్ హై మిల్‌నా..
ఇక్ దిన్ హై బిఛడ్‌నా,
దునియా హై దో దిన్ కా మేలా…!” అని కదూ ముఖేష్ తన ‘దర్ద్ భరీ’ స్వరంతో పాడింది.. నిజమే రెండు రోజుల పాటు కలిసుండి తర్వాత ఎవరికి వారు విడిపోవలసిన ‘తిరునాళ్లే’గా జీవితమంటే..
‘చల్‌నా జీవన్ కీ కహానీ
రుక్‌నా మోత్ కి నిషానీ
(నడవడమే జీవితం అంటే.. ఆగటం అంటే మరణించడమే)
అందుకే భయ్యా.. చల్.. చల్తే చల్..
“చల్ అకెలా చల్ అకెలా చల్ అకేలా..”
మనుషుల్నీ, మమతల్నీ, మనుషుల్నీ కలుపుకుంటూ, విడిపోతూ జ్ఞాపకాల మూటల్ని మోసుకుంటూ, ప్రకృతి గీతం వింటూ సాగిపోదామా .. పదండి మరి..

ప్రేమతో
మీ భువనచంద్ర

(ఇంతటి మహాకార్యం అద్భుతంగా నిర్వర్తించి అసాధ్యాన్ని ‘సాధ్యం’ చేసిన శ్రీ రామోజీరావుగరికి పాదాభివందనం చేస్తూ..)

ఎల్లలు దాటుతున్న తెలంగాణా అక్షరం!

Memont Final1

ఎనిమిదేళ్ల కింద తెలంగాణా రచయితల వేదిక నాయకత్వం అగ్రకుల వాసనలున్న వారినుంచి బహుజన వాదుల చేతుల్లోకి వచ్చింది. అప్పటి నుంచి ‘తెరవే’ దొరల నాయకత్వం ఊడిగం నుంచి అసలైన ప్రజల అస్తిత్వ ఉద్యమంలోకి ప్రవేశించింది.

గత 12 సంవత్సరాలుగా తెలంగాణా రచయితల వేదిక తెలంగాణా సంస్కృతి పరిరక్షణగా పనిచేస్తూ, తెరవే తన పరిధిని విస్తృతపరుచుకునే క్రమంలో రెండేళ్ళ క్రితం అఖిల భారత తెలంగాణ రచయితల వేదికను నిర్మాణం చేయడం జరిగింది. హిందీలోకి ‘ఉడాన్’ అనే కవితా సంకలనాన్ని ఆవిష్కరించింది. అయితే దేశ, విదేశాల్లో కవులు, రచయితల గురించి ఆరా తీయగా ముంబాయి, భీవండీ, షోలాపూర్, ఢిల్లీలలో కొందరు, విదేశాల్లో నామమాత్రంగా ఉన్నారు. ఇలా ఉండడానికి కారణాలను వెతుకగా తెలంగాణ ప్రాంతం నుంచి శ్రమాధారిత వలసలే ప్రధానంగా అకనిపించాయి. విదేశాల్లో కవులు, రచయితలు కొద్దిగా ఉన్నారు. తెలంగాణ నుంచి  మేధోపరమైన వలసలు గత దశాబ్దం నుండే జరుగుతుంఢడం వలన అని తేలిపోయింది.

ఇప్పుడు తెలంగాణ రచయితలు ఇక్కడి సాహిత్యం, సంస్కృతులపై ఆధిపత్య ప్రాంతం వారు చేసిన దాడిని మరింత తీవ్ర ఉద్యమంలోకి పరివర్తనం చెందేలా పని చేయాలి. ఇదే కాలంలో తెలుగు వాచకాల్లో,  చరిత్ర పుస్తకాల్లో,  తెలంగాణ ప్రజల చరిత్ర, భాషలను, సంస్కృతిని ప్రవేశపెట్టడానికి ఇంటి, బయటి బ్రాహ్మనీయ ఆధిపత్యవాద భావజాలంతో ఆచరణాత్మక లక్షల అక్షర యుద్ధానికి సన్నద్ధం అవుతుంది. ఈ దిశగా తెలంగాణ రచయీతల వేదిక తీవ్రంగా కృషి చేస్తూ పుస్తక ప్రచురణలను, వివిధ కార్యక్రమాలను, మహాసభలను, ధర్నాలను నిర్వహించింది. ఇకముందు నిర్వహిస్తుంది కూడా.

ఇకపోతే తెలంగాణ రాష్ట్రం విషయంలో కాంగ్రేస్ పార్టీ తన నిర్ణయం చెప్పింది. కానీ అది సమైక్యవాదం పేరుతో చేస్తున్న మీడియా ఉద్యమాన్ని కట్టడి చేయాల్సి ఉంది. కాబట్టి పది జిల్లాల (హైదరాబాద్)తో కూడిన తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు చేయకపోతే 2014 ఎనికల్లో కాంగ్రేస్ నామరూపాలు లేకుండా పోతుంది. మెజార్టీ సీమాంధ్ర పెట్టుబడి రాజకీయ నాయకుల ఒత్తిడితో కేంద్ర ప్రభుత్వం ఏ చిన్న పొరపాటు  చేసినా దాని ఆయుష్షు మూడినట్టే. మొత్తం తెలంగాణ ఉద్యమంలో సీమాంధ్ర నాయకులు ఎట్లయినా వ్యతిరేకులే కానీ తెలంగాణ రాజకీయ నాయకులే మొదటినుంచి పెద్ద ఇంటి దొంగలు. రాజకీయ పరిణామాలను, మోసాలను, కుట్రలను, దగాలను ఎప్పటీకపుడు తెరవే ఎత్తిచూపుతూ సృజనాత్మక ప్రక్రియలైన కవిత్వం, వ్యాసాల ద్వారా దునుమాడుతూనే ఉంది. తెలంగాణ సాయుధ పోరాట  వారసత్వాన్ని అందిపుచ్చుకోలేక యువకులు ఆత్మహత్యలు చేసుకోవడాన్ని తెరవే కీర్తించలేకపోతుంది. ఈ ఆత్మహత్యల శవాల మీది ప్యాలాలను ఏరుకొని బతుకీడుస్తున్న రాజకీయ నాయకులు, కొన్ని ప్రజాసంఘాలు పబ్బం గడుపుతున్న వైఖరులను  తెరవే ఆదినుంచి గర్హిస్తున్నది.

మొదటినుంచి తెరవే ఒక స్పష్టమైన ప్రణాలికా విధానాలతో అడుగులేస్తున్నది. తెలంగాణ వచ్చేదాక ఆధిప్రత్య ప్రాంతాల సాహిత్య, సంస్కృతులపై పోరాటం చేస్తుంది. అదేకాలంలో తెలంగాణ ప్రాంతం సాహిత్య సంస్కృతుల పునర్జీవనానికి కృషి చేస్తున్నది. తెలంగాణ వచ్చినంక బహుజన పక్షం వహించి ఈ ప్రాంతం సంపదలను దోచుకొని రాజకీయ ముసుగులో దోబూచులాడే అధికార నాయకత్వంతో తిరుగులేని పోరు సలుపుతుంది. ఆ దిక్కుగా నిరంతరం అక్షరాయుధాలను లక్ష్యంగా ఎక్కుపెడుతూనే ఉంటూంది.

 -జూకంటి జగన్నాధం

 

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

నలిమెల భాస్కర్, జూకంటి జగన్నాథం

భాష, చరిత్ర నిర్మాణం మీద శ్రద్ధ పెరగాలి

వాస్తవానికి తెలంగాణా రచయితలు చేయవలసిన  కార్యక్రమాలు  మునుపటికన్నా ఎక్కువగా ఉన్నాయి. భాధ్యతలు కూడా ఎక్కువ. భాషా సంస్కృతి, సాహిత్య రంగాల్లో గతంలో జరిగినవన్నీ బేరీజు వేసుకోవాలి. ఆ పనిని భద్రపరచవలసిన అవసరం కూడా ఉన్నది. వర్తమానంలో తెలంగాణా భాషా సాహిత్యాలకు జరుగుతున్న వివక్ష ఇంకా ఎండకట్టాలె. అన్నమయ్యను పట్టించుకున్నంతగా రామదాసును పట్టించుకోలేదు. ఇక్కడి కోటి లింగాల ప్రాధాన్యాన్ని చరిత్ర పుస్తకాల్లోకి ఇంకా ఎక్కించలేదు.

ఇక భవిష్యత్ దర్శనం కూడా చాలా అవసరం. ముఖ్యంగా పత్రికల్లోనూ, సినిమాల్లోనూ, పాఠ్యపుస్తకాల్లోనూ, పాలన భాషగాను తెలంగాణా భాష ఎట్లా ఉండాలె అన్న అంశం పై చర్చ జరగాలి. సమగ్ర తెలంగాణా నిఘంటువు నిర్మాణం, సాహిత్య చరిత్ర పునర్నిర్మాణం మొదలైన అంశాలు పట్టించుకోవాలె. ఇప్పుడున్న స్థితిలో తెలంగాణా వనరుల విధ్వంసం ఆపాలి. పాలకుర్తి సోమన నుంచి ఇప్పటివరకు కోనసాగుతున్న దేశీ కవితా సంప్రదాయాన్ని, జానపద సాహిత్య వారసత్వాన్ని పదిలంగా కాపాడుకోవాల్సిన భాద్యత తెలంగాణా కవులదే..

– నలిమెల భాస్కర్

——————————————————————

పోరాడే గొంతులకు సరిహద్దులు లేవు!

6730_1201798282421_6844587_n

తెలంగాణా దశాబ్దాల తన్లాట  ఒక కొలిక్కి వస్తున్నట్టున్న సందర్భంలో తెలంగాణా రచయితల భాద్యత మరింత పెరిగిందని భావిస్తూ , అఖిల భారత తెలంగాణా రచయితల వేదిక మరొక్క అడుగు ముందుకు వేసింది. వివిధ రాష్ట్రాలలో, ప్రాంతాలలో స్థిరపడి,    తెలంగాణా సంస్కృతీ, సంప్రదాయాలని , చరిత్రని, సాహిత్యాన్ని నలుమూలల  తమ రచనల ద్వారా చాటుతున్నఅఖిల భారత ప్రవాస రచయితలను ఒక్క తాటికి తీసుకు వచ్చి తెలంగాణా ఉద్యమాన్ని మరింత బలోపేతం చేయ తలచినది.

ఈ నెల 22న , కరీంనగర్ లో అఖిల భారత రచయితల వేదిక మహాసభలలో భారత దేశం లోని ఇతర రాష్ట్రాల నుండి తెలంగాణా రచయితలు వచ్చి తమ రచనలను , భావాలను తెలంగాణలో పంచుకోనున్నారు . ఈ మధ్య కాలంలో   తెలంగాణా ఉద్యమ క్రమంలో వచ్చిన కొన్ని కవితలని ‘ఉడాన్’ అనే పేరుతొ హిందీలోకి అనువదించిన పుసకాన్ని ఆవిష్కరించనున్నారు . అట్లానే గాగోజు, అన్నవరం, బూర్ల వెంకటేశ్వర్లు, పెద్దింటి అశోక్ కుమార్   ఇతర రచయితల పుస్తకాలను , సీడీ ల  ఆవిష్కరణ లు ఉంటాయి.

తెలంగాణా మలిదశ ఉద్యమం లో ప్రతినిత్యం ప్రజలతో కలిసి  స్థానిక పోరాటాలలో భాగస్వామ్యం అవుతూ,  తమ రచనల ద్వారా అనేక అంశాలని ప్రజలోకి విస్తృతంగా తీసుకు వచ్చింది తె.ర.వే. అందులో ముఖ్యంగా గల్ఫ్ బాదితుల గాధలు , గ్రానైట్ మైనింగ్ ఇతర వనరుల విద్వంసం  ద్వారా జరుగుతున్న జన, ప్రాణ, నష్టాలు , కోల్పోతున్న  చారిత్రిక కట్టడాల పరిరక్షణ, ఇంకా అనేక రూపాలలో తెలంగాణా భావ వ్యాప్తికి  పది జిల్లాలలో  నిరంతర కార్యక్రమాలు నిర్వహిస్తుంది.

విద్యార్ధులను, ఉద్యోగస్తులను, పట్టణ, గ్రామీణ ప్రాంతాలను ఒక్క తాటిపైకి తెచ్చి అనేకులకు సామాజిక భాద్యత స్పృహను కల్పిస్తున్నారు తెరవే రచయితలు.   తెలంగాణా పునర్నిర్మాణ క్రమం లో,  తెరవే, అభారవే త్వరలో ఏర్పడబోయే అంతర్జాతీయ తెలంగాణా  రచయితల  వేదిక లు ఈ ప్రాంతం  గొప్ప చారిత్రకతని నలుదిశల   వ్యాప్తి చేసేటట్టు, స్వేచ్చా , సమానత్వపు పునాదుల మీద  ఈ ప్రాంతం  నిలబడి  హక్కుల కోసం పోరాడే గొంతుగా రచయితలు తమ అక్షర ఆయుధాలను సంధించేటట్టుగా  ఈ కార్యక్రమం రూపు దిద్దుకుంటుంది.

తెలంగాణా ప్రకటన రాగానే దోపిడీ, పెట్టుబడి దారుల అండతో  సీమ, ఆంధ్రా లో   మొదలైన ఒక బూటకపు సమైక్య ఆరాటం తోని , కేంద్రం జాప్యం తోని ఒకింత అసహనానికి , అధైర్యానికి గురైతున్న తెలంగాణా ప్రజలకి , నిరాశతో ప్రాణాలు కోల్పోతున్న యువతకి మళ్ళి ఉద్యమ చైతన్యాన్ని నింపి , ప్రజలతో కలిసి ప్రజలతో కలిసి ఉద్యమించడానికి ‘అతెరవే’ పిలుపునిస్తుంది. హైదరబాద్ మీద డేగ  కన్ను వేసి, మత విద్వేషాలని రగిల్చి, హింసను ప్రేరేపించి నయాన్నొ భయాన్నొ తెలంగాణా ని అడ్డుకుందామని చూస్తున్న సీమ , అంధ్రా నాయకుల కుట్రలను తిప్పికొట్టి తమ రచనల ద్వారా ప్రజలను ఎప్పటికప్పుడూ  అప్రమత్తం చేస్తూ ఉండే బాద్యతను నిరంతరం చేపడుతుంది రచయితల వేదిక.    దానికి కలిసి, దేశ,  ఖండాంతరాలలో ఉండి నిరంతరం తెలంగాణా కొరకు ఆరాట పడే మిత్రులకు ఇదే మా ఉద్యమ ఆహ్వానం .

 సుజాత సూరేపల్లి

రాష్ట్ర కార్యదర్శి , తెరవే .

1208945_528882817180842_314503988_n 

                 ———————————————————————–

 ఆంధ్ర మూసనుంచిబయటపడాలే!

536547_314947875241005_1061780088_n

ముందుగా అరవై ఏండ్ల కింద మాయమైన తెలంగాణా భాష ను తిరిగి చిగురింప చేసుకోవాలే. ఇప్పుడు కవులు, రచయితలు చేయాల్సిన పని ఇదే.

తెలుగు జాతి పేరిట ఒక్కటై తెలంగాణా సంస్కృతి ని సత్తే నాశనం చేసిండ్రు.  ఎన్నో ఉద్యమాల పలితంగా దళిత బహుజనులు ఆదివాసీలు అస్తిత్వ  చైతన్యం పొందుతున్న తరుణంలో తెలంగాణా ఉద్యమంలో దోపిడీ,  అగ్ర కులశక్తులు సహజంగానే ప్రవేశించాయి  రానున్న రోజుల్లో వీళ్లతోనే మల్లా షమ ఉండే ఉంటది. ఇక్కడి వనరుల విద్వంసం జరిగింది. వందలాది, వేలాది గుట్టలను గ్రైనేట్ పేర దోసుకొని పోతాండ్రు. వాళ్లకు తెలంగాణా రాజకీయ నాయకులు అండగా ఉంటాండ్రు ,

ఇప్పుడు తెలంగాణా పాఠ్యపుస్తకాలు , చరిత్ర పుస్తకాలు మార్చుకోవాలె. కవులు, రచయితలు ఆంధ్ర మూస ,ఆంధ్ర ప్రమాణాలతో సాహిత్యాన్ని బేరీజు వేస్తున్నారు. అది పోయి తెలంగాణా ప్రమాణాలు నిలువాలే. అరవై ఏండ్ల సీమాంద్ర పాలన వల్ల తెలంగాణా సమాజం చెప్పరానంత నష్టపోయింది . దానిని తిరిగి నిర్మించే ఉద్యేశ్యంతో ఈ సభలు నిర్వహిస్తున్నాం.

-అన్నవరం దేవేందర్

 1238254_515385905211021_339088778_n

హైదరాబాద్ లో 27న ‘తొండనాడుకతలు’ పరిచయ సభ

 

954820_612525435436475_1241627260_n
ఇరవై తెలుగు కతలు, ఇరవై తమిళ కతలతో తొండనాడు కతలు పుస్తకం రూపొందింది. ఆంధ్రప్రదేశ్‌లో సగం చిత్తూరు జిల్లా, స్వర్ణముఖి నదికి దక్షిణంగా ఉండే నెల్లూరు జిల్లా, తమిళనాడులోని చెంగల్పట్టు, ఉత్తర ఆర్కాడు, దక్షిణ ఆర్కాడు జిల్లాలు, చెన్నయ్, పాండిచ్చేరి నగరాలు కలిగిన ప్రాంతం తొండనాడు. రెండు వేల ఏళ్లనాటి తమిళ సంగ సాహిత్యంలో తొండనాడు ప్రస్తావన ఉంది. తొండనాడు ప్రాంతంలోని తమిళ, తెలుగు రచయితల కతలు ఈ పుస్తకంలో ఉన్నాయి.

తొండనాడు కతలు పుస్తకం పరిచయ సభ ఈ నెల 27 మంగళవారం సాయంత్రం ఆరున్నర గంటలకు హైదరాబాద్ బంజరాహిల్స్ లోని లామకాన్‌లో జరుగుతుంది. జయధీర్ తిరుమలరావు, సామల రమేష్‌బాబు, వే దగిరి రాంబాబు, ఓట్ర పురుసోత్తం మాట్లాడుతారు. వివరాల కోసం 8142642638, 9346814601 నెంబర్లకు ఫోన్ చేయవచ్చు.

తొండనాడుకతలు లో – తమిళ రచయితలు కీ.శే. అణ్ణాదురై, కీ.శే. ము.వరదరాజన్, జయకాంతన్, సార్‌వాగన్, శివశంకరి, బవా చెల్లదురై, వె. శేషాచలం, పారవి, ఎక్బర్డ్ సచ్చిదానందం, డేవిడ్ కనకరాజ్, అళగియ పెరియవన్, జి.మురుగన్, జె.డేనియల్, కాంచి శాంతన్, కవిపిత్తన్, ము.మురుగేశ్, వెణ్ణిల, యాళన్ ఆది, పడుదళం సుకుమారన్, ఇమైయం కథలు ఉన్నాయి. తెలుగులో- కీ.శే. కె.సభా, సి.వేణు, నామిని సుబ్రమణ్యంనాయుడు, కలువకొలను సదానంద, లంకిపల్లె కన్నయ్యనాయుడు, కీ.శే. మధురాంతకం మహేంద్ర, కీ.శే. పులికంటి కృష్ణారెడ్డి, సౌదా, కీ.శే. మధురాంతకం రాజారాం, మధురాంతకం నరేంద్ర, వి.ప్రతిమ, గోపిని కరుణాకర్, విష్ణుప్రియ, ఆర్.ఎం.ఉమామహేశ్వరరావు, కె.ఎ.మునిసురేష్‌పిళ్ళె, గూళూరు బాలక్రిష్ణమూర్తి, పసుపులేటి గీత, జిల్లేళ్ళ బాలాజి, స.వెం.రమేశ్, ఓట్ర పురుసోత్తం కథలు ఉన్నాయి.

ఈ పుస్తకం కినిగెలో దొరుకుతుంది.

భారతీయ భాషల అభివృద్ధి మండలి సభ్యునిగా కేతు విశ్వనాథ రెడ్డి

ketu

భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేసే జాతీయస్థాయి మండలి సభ్యునిగా తెలుగు భాషకు సంబంధించి ప్రముఖ రచయిత కేతువిశ్వనాధరెడ్డి నియమితులయ్యారు. కౌన్సిల్‌ ఫర్‌ ది ప్రమోషన్‌ ఆప్‌ ఇండియన్‌ లాంగ్వేజెస్‌ (సిపిఐఎల్‌)గా పేరొందిన ఈ మండలి రాజ్యాంగంలో ఎనిమిదో షెడ్యూల్‌లో వున్న భారతీయ భాషల అభివృద్ధికి కృషి చేస్తుంది. మండలి సభ్యునిగా తెలుగు భాష తరఫున ఎంపికైన కేతు విశ్వనాథరెడ్డి కేంద్ర సాహిత్య అవార్డు గ్రహీతగా జాతీయస్థాయిలో సుప్రసిద్ధులు. ఈ పదవిలో ఆయన రెండు సంవత్సరాలు కొనసాగుతారు. కేంద్ర మానవవనరుల అభివృద్ధి శాఖ మంత్రి సిఐపిఎల్‌ ఛైర్మన్‌గా వ్యవహరిస్తారు. జ్ఞానపీఠ్‌, సాహిత్య అకాడమీ అవార్డు పొందినవారు మాత్రమే ఈ మండలిలో సభ్యులుగా నియమితులవుతారు.

మంచి కథల ‘దాలప్ప తీర్థం’

విశాఖలో దాలప్ప తీర్థం ఆవిష్కరణ సభ...

విశాఖలో దాలప్ప తీర్థం ఆవిష్కరణ సభ…

చింతకింద శ్రీనివాస రావు “దాలప్ప తీర్థం”లోని అన్ని కధలూ.. ఆకట్టుకోనేవే, వాన తీర్పు, రాజుగారి రాయల్ ఎంఫీల్ద్ , చల్దన్నం చోరీ ( దొరలేప్పుడూ దొంగతనాలు చేయర్రా.. చేస్తే గీస్తే కాంట్రాక్టులు చేస్తారు..లేకపోతే రాజకీయాల్లో చేరతారు .. అని గీతోపదేశం చేసే సుగ్గు వరాలు కధ ) చెరుకు పెనం (ఎన్ని వరదల్లోనైనా మనుషుల్ని చెరుకు పెనం వేసి దాటించీ, జీవితాన్ని దాటలేక పోయిన భూషణం కధ) , దిగువస్థాయి బ్రాహ్మర్ల దారిద్ర్యపు కధ ( చిదిమిన మిఠాయి) మహా మహా మడికట్టుకొనే ఇల్లాళ్ళ కంటే మడిగా ఆవకాయకి సాయం చేసే హుస్సేను మావ కధ ( పిండి మిల్లు), భయంకర రోగాలని జలగలతో నయం చేసి , పట్నంలో జలగ డాక్టర్ల చేతికి చిక్కిన ఆరేమ్పీ కధ (జలగల డాక్టరు ) – ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీదీ .. ఎంచదగ్గ మంచి కధే ..!!

దాలప్ప తీర్ధం…కథల సంపుటి లో ఒక కధ పేరు .. మన ఇళ్ళల్లో మురుగు, మన మల మూత్రాలు ఎత్తే వాళ్ళ గురించి చాలా మంది కధకులు చాలానే కధలు రాసేరు. కానీ .. ఈ కధ వేరు అనిపించింది నాకు. ఒక మురుగు ఎత్తేవాడి పేర తీర్ధం వెలవటానికి దారి తీసిన పరిస్థితులు చాలా సరళంగా , కళింగాంధ్ర మాండలికం లో చెప్పుకొని వెళ్ళారు. చాలా మంచి కధల్లాగే .. అనవసరమైన హంగామా ఏమీ లేకుండా .. !!

http://kinige.com/kbook.php?id=1824&name=Dalappa+Teertham

–          సాయి పద్మ

16న అనంతపురంలో ‘జ్ఞానసింధు’ సర్దేశాయి తిరుమలరావు గ్రంథావిష్కరణ!

Sardesai Cover Page front

స్పందన” అనంత కవుల వేదిక ఆధ్వర్యంలో “జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు” పుస్తకావిష్కరణ.

తేదీ: 16, జూన్ 2013, ఆదివారం
సమయం: ఉదయం  10:20
వేదిక: ఎన్.జి.వో. హోం, అనంతపురం

‘ఇలాంటి వ్యక్తి ఈ భూమ్మీద నడయాడాడంటే భావితరాలకు నమ్మకం కుదరదు’ అని మహాత్మాగాంధి గురించి వ్యాఖ్యానిస్తూ ప్రఖ్యాత శాస్త్రవేత్త ఐన్స్టీన్ అన్నాడు. సర్దేశాయి తిరుమలరావు గారి గురించి తెలుసుకుంటుంటే కూడా మనసులోఇదే ఆలోచన మెదలుతుంది. నిజంగా, ఇలాంటి వ్యక్తి ఈ భూమి మీద ముఖ్యంగా, మన ఆంధ్రప్రదేశ్‌లో, ఇంకా ముఖ్యంగా ‘రాయలసీమలో’జీవించాడన్న ఆలోచన ఎంతో అద్భుతం అనిపిస్తుంది. సాధారణంగా ప్రతి వ్యక్తి ఓ సముద్రం లాంటివాడు.

సర్దేశాయి తిరుమలరావుగారు సప్తసముద్రాల సమ్మిశ్రమ మహాసముద్రంలాంటివాడు.అలాంటి మహాసముద్రాన్ని ఆయన చేసిన కొన్ని రచనల ఆధారంగా సముద్రాన్ని నీటిచుక్కలో చూపించే ప్రయత్నం చేసినట్టు చేస్తున్నాము. మా ప్రయత్నం అసంపూర్ణం, అసమగ్రం. ఆ మహోన్నత వ్యక్తిత్వ విశ్వరూపాన్ని సంపూర్ణంగా ప్రదర్శించలేదనటంలో ఎలాంటి సందేహం లేదు. కానీ అటు సాహిత్య ప్రపంచంలోనూ,ఇటు వైజ్ఞానిక ప్రపంచంలోనూ, ఇటు సామాజిక చరిత్రలోనూ మఱుగున పడిన ఒక మహాత్ముడికి ఈ పుస్తకం పరిచయ పుస్తకం లాంటిది మాత్రమే. ఆ మహోన్నత వ్యక్తిత్వానికి కృతజ్ఞతాపూర్వకంగా మేము సమర్పిస్తున్న ‘అంజలి’ లాంటిది మాత్రమే. ఇలాంటి అత్యున్నత వ్యక్తులకాలవాలం మన భూమి అని ఇలాంటి మహాద్భుతమైన వ్యక్తిత్వాలకు వారసులం మనమని భావితరాలకు తెలియజేయాలన్న మా ప్రయత్నంలో భాగమే ఈ పుస్తకం.

మా ఈ ప్రయత్నాన్ని సహృదయంతో అర్థం చేసుకుని స్వీకరిస్తారని ఆశిస్తున్నాము. ఇందులో దోషాలు, లోపాలకు మేమే బాధ్యులం. అయితే మన రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో ఇలాంటి మహనీయులు జీవించారు. తమ మేధతో విశిష్టమైన వ్యక్తిత్వంతో సమాజాన్ని సుసంపన్నం చేశారు. కాని వారు వ్యక్తిగత ప్రచారానికి ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో విస్మరింపబడ్డారు. అలాంటి మట్టిలో కలిసిన మణులను వెలికితీసి భావితరాలకోసం సమాజానికి పరిచయం చేయాల్సిన బాధ్యత మన అందరిపై ఉంది. తన పూర్వీకులను గౌరవించలేని
సమాజానికీ, తన గతాన్ని విస్మరించిన సమాజానికీ భవిష్యత్తు లేదంటారు. అలాంటి ఘోరమైన అంధకారాన్నుంచి తప్పించుకోవాలని ప్రయత్నించడం మన బాధ్యత. ఆ
బాధ్యత నిర్వహించాలనే మా ప్రయత్నంలో భాగం ఈ పుస్తకం. ఈ పుస్తకం చదివిన తరువాత ఎవరికైన సర్దేశాయి తిరుమలరావు గారిపై ఆసక్తి కలిగినా, తమ
ప్రాంతంలో విస్మృతిలో పడిన మాణిక్యాలను ప్రపంచానికి ప్రదర్శించాలన్న తపన కలిగినా మా ప్రయత్నం విజయవంతమని భావిస్తాం.

జ్ఞానసింధు సర్దేశాయి తిరుమలరావు పుస్తకంలోని ప్రకాశకుల మనవి ఇది.

ఈ పుస్తకం అన్ని ప్రముఖ పుస్తక విక్రయ కేంద్రాల్లో (విశాలాంధ్ర, నవోదయ, తెలుగు బుక్ హౌస్, ప్రజాశక్తి, దిశపుస్తక కేంద్రం, సాహిత్యభారతి వగైరా) దొరుకుతుంది. ఆన్‌లైన్ లో కినిగె.కాం ద్వారా పొందవచ్చు. http://kinige.com/kbook.php?id=1813)

గమనిక:

మీ మీ  ప్రాంతాలలో జరగబోతున్న సాహిత్య సభల గురించి వారం రోజుల ముందు మాకు పంపండి. ఇక్కడ ప్రచురిస్తాం.

హోసూరులో తెలుగు కథ హోరు!

మధురాంతకం రాజారాం సాహిత్య సంస్థ తరఫున, మధురాంతకం నరేంద్ర  కథావార్షిక 2012 ఆవిష్కరణకు, మే  18, 2013 న, శనివారం, హోసూర్ కు రావలసినదిగా పంపిన ఆహ్వానం అందగానే ఇది ఒక చక్కటి రచయితల సదస్సు కాగలదనిపించింది. నేను వస్తున్నట్లుగా వారికి ఒక విద్యుల్లేఖ పంపాను. హోసూరు తమిళ్ నాడు లోనే ఉన్నా, బెంగళూరు కి దగ్గరిగా 40 కి.మీ. దూరంలో ఉంది. హైదరాబాదు నుంచి వెళ్ళాలంటే బెంగళూరు మీదుగా వెళ్ళటం సులువు. మిత్రులు అనిల్ ఆట్లూరి తాను హోసూర్ వెళ్తున్నట్లుగా ఫేస్ బుక్ లో సందేశం ఉంచారు. హోసూర్ వెళ్ళాలనే ఉత్సాహం పెరిగింది. దీనికి తోడుగా హైదరాబాదులో ఎండలు మండిపోతున్నాయి. హోసూర్ లో రచయితల సాన్నిహిత్యం లో ఎండల నుంచి కూడా తప్పించుకోవచ్చు అనుకున్నాను.
కథావార్షిక ఆవిష్కరణ సభ నిర్వహిస్తున్న కృష్ణగిరి  జిల్లా తెలుగు రచయితల సంఘం (కృష్ణ రసం) ప్రతినిధులు మాకు స్వాగతం చెప్పి, ఉపాహారం, కాఫీ, టీలు అందించారు. కాఫీ తాగుతుండంగా  కథా వార్షిక సంపాదకులు మధురాంతకం నరేంద్ర కనిపించారు. పుస్తకావిష్కరణకు తీసుకున్న ఏర్పాట్లకు వారిని అభినందించాను. నరేంద్ర తాను కూడా మాలాగే అతిధి లా వచ్చానని శ్రమంతా కృష్ణ రసం వారిదేనని అన్నారు. ఇంతలో విశ్వేశ్వరరావు  వచ్చారు. వీరు కవితా (సమకాలీన కవితల కాలనాళిక) పత్రికకు  నిర్వాహక సంపాదకులు. ఎల్లలు లేని సాహితీమిత్రుల విలాసమైన శ్రీ శ్రీ ప్రింటర్స్, విజయవాడ వీరిదే. చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు, కథావార్షిక 2012 వీరి ముద్రణశాలలోనే అందంగా అచ్చయినవి. పరస్పర పరిచయాల తరువాత తాజాగా వారి ముద్రణాలయం లో అచ్చయిన కొత్త పుస్తకాలు చూపారు. వాటి ముద్రణ బాగుంది.
సభాస్థలి  హోసూరు వారే కాకుండా బెంగళూరు, హైదరాబాదు, బోధన్ లాంటి దూర ప్రాంతాల నుంచి వచ్చిన సాహితీ అభిమానులతో నిండింది. ఆ రోజు కార్యక్రమంలో ఉదయం పుస్తకావిష్కరణ , సాయంత్రం తుమ్మేటి రఘోత్తమ రెడ్డి కి కేతు విశ్వనాథ రెడ్డి -2012 పురస్కార ప్రదానం ఉన్నాయి. అయితే కొన్ని కారణాలవలన రెండో కార్యక్రమం రద్దయినది. కృష్ణరసం గౌరవ అధ్యక్షుడు కలువకుంట నారయణ పిళ్ళై  స్వాగత పలుకుల తర్వాత కథ సంపాదకులు వాసిరెడ్డి నవీన్, మధురాంతకం నరేంద్ర సంపాదకత్వంలో వెలువడిన కథావార్షిక 2012 పుస్తకావిష్కరణ చేశారు.
నవీన్ మాట్లాడుతూ, మధురాంతకం రాజారాం పట్ల ఉన్న గౌరవం, అనుబంధం వలన ఈ పుస్తకావిష్కరణకు అంగీకరించామన్నారు. తన సంపాదకత్వంలో వస్తున్న కథ 2012, కథావార్షిక 2012 లలో కథలు పునరావృతం కాకుండా, తాను మధురాంతకం నరేంద్ర తో సంప్రదిస్తూ జాగ్రత్తలు తీసుకుంటామన్నారు.
విమల కథ “కొన్ని నక్షత్రాలు కాసిని కన్నీళ్ళు”,  రెండు సంకలనాలలో   చోటుచేసుకుని, విశిష్ట కథయ్యింది. ఈ కథ ఆలోచింపచేస్తుంది.ఈ కథలో ప్రధాన పాత్రగా రచయిత్రి ప్రథమపురుషలో మనకు కథ చెప్తారు. 12 ఏళ్ళ తరువాత ఒక పెళ్ళికి వేములవాడ వెళ్ళిన రచయిత్రి, విరసం సభ్యురాలిగా అప్పటి కార్యకర్తలు, కార్యక్రమాలను నెమరువేసుకుంటుంది. డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న మాధవ, అక్కా అంటూ రచయిత్రి దగ్గర కొస్తాడు. అతనితో మాట-మంతీ సందర్భం లో అతను జ్యోతి అనే అమ్మాయి ప్రేమలో ఉన్నట్లు తెలుస్తుంది. అందరి కార్యకర్తలుకూ చెప్పినట్లే అతనికీ కొన్ని గ్రామాల పనిచెప్తుంది. అయితే రామడుగు అనే ఊళ్ళో జరిగిన చిన్న పొరపాటు వలన పోలీస్ ఎన్ కౌంటర్లో, మాధవ చనిపోతాడు. వర్తమానానికొస్తే, రాత్రి జరగబోయే పెళ్ళికి, ఒకామె వచ్చి తనను తాను జ్యోతిగా పరిచయం చేసుకుంటుంది. తన మేన బావతో పెళ్ళయిందని, తనకు ఇద్దరు పిల్లలని చెప్తుంది. గాలికి ఆమె చేతిపై ఉన్న వస్త్రం తొలిగినప్పుడు కనిపించే దీపం బొమ్మ పచ్చబొట్టు, అప్రయత్నంగా మాధవ్ జ్ఞాపకాలు తెస్తాయి. రచయిత్రి కథ చెప్పిన తీరు ఆసక్తికరంగా నడిచింది. నక్సలైట్ ఉద్యమ బాటపట్టి ఎన్ కౌంటర్ లో బలైన వాళ్ల గురించి, ఈ కథ గట్టిగా ఆలోచింపచేస్తుంది. సాంప్రదాయ పద్ధతులలో పనిచేస్తే పోలీస్ ఎన్ కౌంటర్ తప్పదు. ఆరోగ్యం బాగా లేకపోయినా ఉద్యమాన్ని వీడి, జనజీవన స్రవంతిలో కలవాలి. లొంగుబాటు తప్పట్లేదు. కనుక ప్రజాసామ్య పద్ధతిలోనే సామాజిక విప్లవం వచ్చేలా ఉద్యమంలో మార్పులు తీసుకురావాలి. తద్వారా ఎందరో యువకుల అమూల్య ప్రాణాలు గాలిలో కలవకుండా నివారించవచ్చు.
తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి మాట్లాడుతూ తెలుగుభాషలోని అణిముత్యాలైన పుస్తకాలను ఇతర భాషలలోకి తర్జుమాచేయటంలో కేంద్ర సాహిత్య అకాడెమి సవితి తల్లి ప్రేమ చూపిస్తుందన్నారు. హోసూర్ ఎం.ఎల్.ఎ. గోపీనాథ్ మాట్లాడుతూ ఇక్కడి మాండలీకంలో వ్రాసిన రచనలను ప్రోత్సాహించాలన్నారు. తద్వారా ఇక్కడి రచయితలకు మరిన్ని రచనలు చేయటానికి కావలసిన ప్రేరణ ఉండగలదన్నారు. తరువాత బహుమతి గ్రహీతలకు పురస్కారాలను అందచేసారు. ప్రఖ్యాత రచయిత సింగమనేని నారాయణ మాట్లాడుతూ తన కథలలో ముస్లిం పాత్రలు లేవన్నారు. ముస్లింల జీవన పరిశీలన ఖదీర్ బాబు కథలలో తెలుస్తుందన్నారు.
మహమ్మద్ ఖదీర్ బాబు న్యూ బోంబే టైలర్స్ పుస్తకానికి కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. స.వెం. రమెష్ ప్రళయకావేరికథలు కు కథాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు.కథావార్షిక -2011 లోని కథల సింహావలోకనం చేసిన అఫ్సర్ కు కథాకోకిల పురస్కారాన్ని ప్రకటించారు. అఫ్సర్ అమెరికా లో ఉంటుండటం వల్ల అవార్డ్ అందుకోవటానికి రాలేకపోయారు.
డా వి చంద్రశేఖర రావు కథావార్షిక 2012  కథల విశ్లేషణ చేశారు. సింహావలోకనం కై కధాకోకిల పురస్కారాన్ని అందుకున్నారు. మన్నం సింధుమాధురి కథ “కాళాపు” కథావార్షిక 2012 లో ప్రచురణయ్యింది. కథా రచయిత్రిగా తెలుగు సాహిత్య పరిషత్ గౌరవ అధ్యక్షుడు ఎం.ఎస్.రామస్వామి రెడ్డి చేతుల మీదుగా కథావార్షిక 2012 పుస్తకాన్ని సింధుమాధురి అందుకున్నారు. వీరి ఉళేనూరు క్యాంపు కథలు పాఠకుల దృష్టికెళ్ళాయి. గంగావతి కాంప్ (కర్ణాటక) లో పుట్టి పెరిగిన మాధురి, క్యాంపుల లోని జీవన సరళి  నేపధ్యంలో ఈ కథలు వ్రాశారు.కథావార్షిక 2012 సంపాదకులు మధురాంతకం నరేంద్ర, చిటుక్కు పటుక్కు చెనిక్కాయలు కథా రచయిత  అమరనారా బసవరాజులను ఎం.ఎల్.ఎ. గోపీనాథ్  దుశ్శాలువా కప్పి సన్మానించారు.

రచన, చిత్రాలు: సి.బి.రావు

 

నలుగురికి ‘కథా కోకిల’ అవార్డులు

 

ప్రసిద్ధ కథకుడు మధురాంతకం రాజారామ్ స్మృతికి నివాళిగా ఏటా ఇస్తున్న ‘కథాకోకిల’ అవార్డులు 2011 కి స.వే రమేశ్, అఫ్సర్ లకు, 2012 కి మహమ్మద్ ఖదీర్ బాబు, వి. చంద్రశేఖరరావులకు ఇస్తున్నట్టు మధురాంతకం నరేంద్ర ప్రకటించారు. ఈ అవార్డులు మే 18 న హోసూరులో జరిగే కథకుల సదస్సులో ప్రదానం చేస్తారు.

తెలుగులో కథాసాహిత్య రంగానికి సంబంధించి ఇస్తున్న అవార్డులలో మధురాంతకం పేరిట ఇస్తున్న ఈ అవార్డులకు ఒక ప్రత్యేకత వుంది. ఆయా సంవత్సరాలలో కథా రచనలో, కథాసాహిత్య విమర్శ రంగాలలో చేస్తున్న కృషికి గుర్తింపుగా ఈ అవార్డులు ఇస్తూ వుంటారు. ప్రతి ఏటా ప్రచురితమయ్యే కథావార్షికలోంచి ఒక ఉత్తమ కథకి, ఆ కథా వార్షికకి సింహావలోకనం రాసే విమర్శకుడికి ఈ అవార్డు లభిస్తుంది.

గత కొన్ని సంవత్సరాలుగా కథా వార్షిక ప్రచురణ ఒక సత్సంప్రదాయంగా తెలుగు సాహిత్యంలో స్థిరపడింది. ప్రతి ఏడాది ప్రచురితమయ్యే అనేక వందల కథలు చదివి, వాటిల్లోంచి డజను కథల్ని ఎంపిక చేయడమూ, వాటి గురించి విపులమయిన సింహావలోకనం రాయించడమూ ఒక ప్రయోగంగా మధురాంతకం నరేంద్ర చేపట్టారు. ఇందులో కథలన్నీ ఒక ఎత్తు అయితే, సింహావలోకనాలు ఇంకో ఎత్తు. ఆ ఏడాది వెలువడిన కథలని గురించి ఒక అవగాహన ఏర్పరచడం లో ఈ వార్షికలు విజయవంతమవుతున్నాయి.

 

రోజువారీ స్త్రీల జీవితం పై ఓ కొత్త చూపు సజయ ‘ ప్రవాహం’ !

pravaham1pravaham2ఈ నెల 19 న హైదరాబాద్ లో సజయ ‘ ప్రవాహం’ పుస్తకావిష్కరణ

ఈ పుస్తకానికి ముందుమాట రాయమని సజయ అడిగితే వెంటనే ఒప్పుకున్నాను. తనతో ఉన్న సాన్నిహిత్యం ఒక కారణమైతే, ఈ సంకలనంలోని వ్యాసాలు, వ్యాసాలలోని స్త్రీవాద రాజకీయాలతో నాకున్న సంబంధం రెండవదని నేననుకుంటున్నాను.

సజయతో పరిచయం అయి దాదాపు పాతిక సంవత్సరాలయిందనుకుంటా! ఏదో సమావేశంలో ఉపన్యాసాలన్నీ అయిన తర్వాత చర్చ జరుగుతున్న సందర్భంలో సజయ, రెండు నిముషాలు తన అభిప్రాయాల్ని అనుభవాల్ని పంచుకోవటం చూశాను. పక్కనున్న వాళ్ళని అడిగాను ఈ అమ్మాయెవరు అని. తర్వాత చాలా సార్లు సమావేశాల్లో సజయతో కలవటం జరిగేది. అన్వేషిలో నాతోపాటు మనరాష్ట్రంలోని పాతగ్రంథాలయాలన్నీ తిరిగి పంథొమ్మిదవ శతాబ్దం నుంచి వచ్చిన స్త్రీల పత్రికల్ని కాపీలు చేయించి అన్వేషి లైబ్రరీలో చేర్చే ప్రాజెక్టులో కలిసి పని చేసింది. భూమిక స్త్రీవాద పత్రికకు జన్మనిచ్చింది సజయ ఆలోచనలు, కృషీ అనే చెప్పాలి. మమ్మల్నందర్నీ చర్చల్లోకి దింపి, ఒక స్త్రీవాద పత్రిక మనకెంతో అవసరమైనదని అందర్నీ ఒప్పించి భూమిక ప్రారంభించటానికి కారకురాలు అయింది సజయ.

ఆ రోజుల్లో తను శంషాబాద్‌ వెళ్ళేదారిలో వున్న శివరాంపల్లిలో ఉండేది. రోజూ వెనక్కి ఆలస్యంగా వెళ్ళడం, బస్‌ ప్రయాణాలు, ఆ సమయంలో తనుపడ్డ బాధలే, బహుశ తనను ఈ అంశాల మీద వ్యాసాలు రాయటానికి పురికొల్పి ఉంటాయి. ఆ రోజుల్లో స్త్రీలని ఇబ్బందిపెట్టే డ్రైవర్లు, కండక్టర్ల తోటి తరచూ ఘర్షణ పడటం,  వాళ్ళు తననైనా తోటి స్త్రీలనైనా అవమానపరిస్తే, ఇబ్బంది పెడితే కొట్టటానికి సిద్ధమైపోవటం చాలాసార్లు జరిగింది. మేం వారించేవాళ్ళం. మనం ఒంటరిగా ఉన్నప్పుడు వాళ్ళకు బుద్ధిచెప్పటానికి ప్రయత్నిస్తే, పరిస్థితులు మనకు ఎదురు తిరుగుతాయేమోనని, జాగ్రత్తగా ఉండమని.

అందరితో పరిచయాలు, నచ్చిన వాళ్ళతో స్నేహాలు, నచ్చని వాళ్ళతో నిర్మొహమాటంగా వాదనలు ఘర్షణలు`ఇవన్నీ కలిపితే సజయ అవుతుంది. అన్నీ సమర్థించుకుని రాగలిగే వ్యక్తి తను. ఎంతో మందికి అవసరాలకు అండగా ఉండే తత్వం. ఇదీ క్లుప్తంగా సజయ.

ఇక ఈ సంకలనం గురించి. ఇందులోని స్త్రీవాద రాజకీయాల గురించీ, స్త్రీవాద దృక్పథంలో మన జీవితాల్ని, సమాజాన్ని చూడాల్సిన అవసరం గురించీ ఇంతవరకూ మన దగ్గర కావల్సినంత చర్చ జరగలేదనే చెప్పాలి. ఒక సంవత్సరంపాటు ‘వార్త’ దినపత్రికలో కాలమ్‌గా రాసిన వ్యాసాలనన్నింటినీ ఒక చోట కూర్చిన ఈ ‘‘ప్రవాహం’’ సంకలనంలో మనం అటువంటి చర్చలకనుకూలించే సందర్భాల్ని చూస్తాం. ఇందులో యాభై చిరువ్యాసాలున్నాయి. వాటిని సుమారుగా ఏడెనిమిది భాగాలుగా విడదీసి చూడచ్చనిపిస్తుంది. స్త్రీవాద రచనల్లో, పుస్తకాల్లో తరచూ   కనిపించే అంశాలు, ఉదాహరణకి`స్త్రీల ఉద్యమ చరిత్ర, లైంగిక నిర్బంధాలు, దౌర్జన్యాలు, కుల రాజకీయాలు, ఎన్నికల రాజకీయాలవంటివి కొన్ని ఉంటే, ఇంకొన్ని వివిధరకాలైన విషయాల్ని పాఠకులకి పరిచయం చేసేవిగా ఉన్నాయి. అవి పుస్తకాలు, సినిమాలే కాకుండా చాలా ఆసక్తికరమైన చర్చలతో చిత్రలేఖనాలు (లక్ష్మణ్‌ ఏలే వంటి చిత్రకారులు) నృత్యనాటకాలు (అస్మిత ప్రదర్శించినది) వంటి అంశాలను పరిచయం చేసేవి, ఎంతో మందికి మంచి స్నేహితుడనిపించుకున్న హసన్‌ గురించి ‘‘వెలుగుతున్న జ్ఞాపకం’’ చదివితే ఆయన జీవితం, ఆయన ఇంటి వాతావరణం కళ్ళకి కట్టినట్లుగా సజయ చిత్రించటం మన మనస్సుల్ని స్పృశిస్తుంది. ఎవరికీ అంతగా పరిచయం లేని మహాభారతంలో మాధవి పాత్రను మనకు పరిచయం చేయటం కూడా సజయ చాలా ఆలోచించి చేసిన పనే అనటంలో సందేహం లేదు. ఇక హిందూసుందరి లాంటి పంథొమ్మిదో శతాబ్దం పత్రికల్ని పాఠకులకి పరిచయం చేయటం ఎంత అవసరమో ప్రత్యేకంగా చెప్పనక్కరలేదు.

నాకు అన్నింటికంటే నచ్చినవ్యాసాలు కొన్ని ఉన్నాయని చెప్పాలి. ప్రయాణాల్లో`బస్సుల్లో, రైళ్ళల్లో, బయట ప్రదేశాల్లో మనం ఎదుర్కొనే ఇబ్బందులు, సమస్యల గురించి ఉన్న వ్యాసాలు అవి. మరుగు దొడ్లు సౌకర్యాలు లేని ప్రదేశాల్లో స్త్రీల అవస్థలు, ప్రయాణాల్లో తోటి ప్రయాణికులతో (మొగవాళ్ళతో) పడే ఇబ్బందులు, అవమానాల గురించి, ఇంకా వివరంగా రాస్తే బాగుండేది కదా అని అన్పించేంత సూటిగా నిర్మొహమాటంగా నిలదీసినట్లు రాసిన వ్యాసాలు. స్త్రీవాద రాజకీయాల మీద ఎన్ని రచనలొచ్చినా ఇటువంటి కంటికి కనిపించని అసౌకర్యాలు, ఇబ్బందులు, అవమానాల గురించి మనం ఇంకా చాలా రాయాల్సిన చర్చించాల్సిన అవసరం   ఉంది. ఒకటో అరో కవితలు, పాటలు ఉన్నా లోతుల్లోకి వెళ్ళి విషయాల్ని పరిశీలించిన స్త్రీవాద రచనలు  మనకు లేవనే చెప్పాలి. వ్యాసాల్లో సూటితనంతో విషయాన్ని తమాషాగా హాస్యభరితంగా చెప్పి బలహీన పరచకుండా, పాఠకుల్ని, సభ్య ప్రపంచాన్ని ప్రభుత్వాన్ని నిలదీసినట్లుంటాయి సజయ రచనలు.

కల్చరల్‌`పాలిటిక్స్‌ అనే అంశానికి సంబంధించిన రచనలు ప్రపంచవ్యాప్తంగా కొన్ని దశాబ్దాలుగా వస్తుంటే మనదేశంలో కొంతవరకు ఆ పని జరిగినా, చాలావరకు అది ఇంగ్లీషులోనే జరిగిందని చెప్పాలి. సంస్కృతి రాజకీయాల గురించి స్త్రీవాద దృక్పథంతో వచ్చిన రచనలనే నేను ప్రస్తావించేది. అంటే దైనందిన జీవితంలో స్త్రీలున్న ప్రతిచోటా కనిపించే సూక్ష్మ స్థాయి రాజకీయాల గురించి, అవి స్త్రీశరీరం గురించిన ప్రకటనలు కావచ్చు, రజస్వల అయినప్పటి బాధల గురించి కావచ్చు,  ఇంటి చాకిరీ గురించి కావచ్చు. ఇవన్నీ పరిశీలించి ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. సజయ వ్యాసాలన్నింటిలో ఈ అంశాల గురించి చర్చలే నాకు చాలా విలువైనవి అని చెప్పదల్చుకున్నాను.అయితే ఇందులోని వ్యాసాలు విషయాన్ని తడిమి వదిలేసి నట్లుంటాయనిపిస్తుంది. దానికి కారణం కాలమ్‌ రాయటంలో ఉన్న పరిమితులు మాత్రమే. అందుకే ఈ విషయాల గురించి ఇంకా లోతైన చర్చలతో, వ్యాసాలు, పుస్తకాలు సజయ దగ్గరనుంచి వస్తాయని నాకు నమ్మకం.

( సజయ వ్యాస సంకలనం ‘ ప్రవాహం’ కు కె. లలిత రాసిన ముందు మాట ఇది)

‘గుడివాడ’ వెళ్ళానూ…అను టెంపుల్ టెక్సాస్ సాహిత్య యాత్ర!

56_TX_30th State Telugu Sahithee Sadassu_03302013_Group Photo

మార్చి చివరలో మనందరం టెంపులులో జరగనున్న సాహితీ సదస్సుకి మన బృందం వెళ్ళాలండీ?” అని మా ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం 2013 సంవత్సరానికి సాహిత్యవేదిక సమన్వయ కర్త  శారదా సింగిరెడ్డి గారు చెప్పిన వెంటనే నా కాలెండరులో మార్కు పెట్టుకున్నాను. గత సంవత్సరం టెంపులుకి చెందిన వై.వీ.రావు గారు మా సభకి ముఖ్య అతిథిగా వచ్చాక తెలుగు సాహిత్యానికి రావు గారు చేసిన కృషి నాకు తెలిసింది, నేను డాలస్ కి కొత్త కాబట్టి. వై.వీ రావు గారిని టెంపులు రావు గారు అని కూడా అంటారని తెలిసింది. మాకు వారి ఊరు వెళ్ళే అవకాశం ఇలా దొరికింది, ఇంకేముంది ఎగిరి గంతేసి బయలుదేరడమే.

కుటుంబంతో ఈ కార్యక్రమానికి వెళ్దామనుకున్నా కానీ మా అమ్మాయి స్కూలు పిల్లలతో సినిమా కార్యక్రమంలో ఇరుక్కుపోయింది. చిన్నపుడు నేను పొదలకూరులో స్కూలు పిల్లలతో కలిసి ‘కోడెనాగు’ సినిమా చూసిన జ్ఞాపకం. ఒక్క సినిమానే అయినా ఆ జ్ఞాపకం మాత్రం బాగా ఉండి పోయింది. మా అమ్మాయికి కూడా ఇలాంటిది ఒకటి ఉంటే బాగుంటుంది కదా! టెంపుల్ దాకా వెళ్తున్నాము, పక్కనే మన అఫ్సర్ గారిని కూడా కలిసి వద్దామని మా యాత్రని ఒక రోజు పెంచాను. అఫ్సర్ గారితో పాటూ మా కాన్సాస్ రూమ్మేటు రాం పులికంటిని కలిసి వద్దామని నేను, సోదరుడు ప్రశాంత్ కలిసి శనివారం ఉదయం ప్రయాణం మొదలుపెట్టాం.

ఉదయం 10.30కు టెంపులుకు చేరుకున్నాము. అప్పటికే అక్కడకు చేరుకున్న తుమ్మూరి రామ్మోహనరావు గారితో పార్కింగ్ లాటులోనే ముచ్చట్లు మొదలుపెట్టాము. ఇంతలోనే మద్దుకూరి చంద్రహాస్ గారు, జువ్వాది రమణ గారు మాతో కలిసి ముచ్చట్లలో పాలుపంచుకున్నారు.

“ఎంతో వ్రాయాలనుకుంటున్నాం కానీ, వీలు కావడం లేదు!” అని అందరూ అనుకుంటూ ఉంటే “వారానికి ఒక రోజు కొంత సమయం మనం వ్రాయడానికి కేటాయించుకోవాలి” అని చంద్రహాస్ గారు చెప్పారు.

అందరం లోపలకి నడిచి డాలస్ సాహిత్య వేదిక బృందం  సింగిరెడ్డి శారదా, జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, ఉరిమిండి నరసింహా రెడ్డి, సతీష్ పున్నం, రొడ్డా రామకృష్ణా రెడ్డి గార్లను కలిసాం. టెంపుల్ కి చెందిన వై.వీ.రావు, గిరిజా శంకర్ గారిని పలకరించాము. సత్యం మందపాటి గారు వ్రాసిన “అమెరికా వంటింటి పద్యాలు” ఆవిష్కరణ కూడా ఉంది. వారితో కూడా కాసేపు కబుర్లాడుతుండగా భోజనం పిలుపు వచ్చింది.

పులిహోర, అప్పడాలు, గుత్తి వంకాయ కూర, వడలు, సాంబారు, పెరుగు ఇలా నోరూరించే వంటకాలతో కడుపు నిండా తింటూ సభకు వచ్చిన వారితో కబుర్లు చెప్తూ, లొట్టలు వేస్తూ పెళ్ళి భోజనం లాంటి విందు భోజనం పూర్తి చేసాము. ఈ సభకు సమన్వయ కర్త సుమ పోకల గారు అందరికీ వంటకాలు సమకూర్చిన వారి లిస్టు పంచారు. ఈ భోజన కార్యక్రమంలో ఆస్టిన్ నుంచి వచ్చిన ఇర్షాద్ గారితో మాటలు కలిపాం. భోజనాలు పూర్తి అవగానే అందరం భుక్తాయాసంతో కూర్చున్నాం.  చింతపల్లి శకుంతల గారి ప్రార్థనా గీతంతో సభ మొదలయింది. సుమ పోకల గారు సభకు విచ్చేసిన అందరికీ స్వాగతం పలుకుతూ కార్యక్రమ వివరాలను తెలిపారు. దేవగుప్తాపు శేషగిరిరావు గారు సభకు అధ్యక్షుడిగా వ్యవహరిస్తూ ప్రసంగించేవారికి ఎంత సమయం కేటాయించారో అంతే సమయం వాడుకోవలసిందిగా కోరారు. మధ్య,మధ్యలో చెణుకులు విసురుతూ సభని అలరించారు.

చింతపల్లి గిరిజాశంకర్ గారి దర్శకత్వంలో “పులిని చూసి నక్క” నాటకం అందరినీ బాగా నవ్వించింది. ఆంధ్రదేశంలో మదర్స్ డే, ఫాదర్స్ డే ఇంకా వాలంటైన్స్ డే ప్రభావం పిల్లలపై ఎలా ఉందో చక్కగా చూపించి, నవ్వించి అలోచింపజేసారు. స్వీయ కథా పఠనం శీర్షికన రాయుడు గారు “తాజ్ మహల్” చదివి వినిపించారు. “చెప్పుకోండి చూద్దాం” కార్యక్రమాన్నిసుమ పోకల, మాస్టర్ మర్యాల రిత్విక్ కలిసి నిర్వహించారు. ఎపుడో చిన్నపుడు చదువుకున్న ప్రకృతి-వికృతి పదాలను అందరూ గుర్తు చేసుకుని మరీ ఇందులో పాల్గొన్నారు. చింతపల్లి గిరిజా శంకర్ గారు అన్నిటికీ ఠకీమని సమాధానాలను చెప్పేసారు. ఆస్టిన్ కి చెందిన కాకి ప్రసాద్ గారు “అవనీ నా మనసులో నిరంతరం మెదులుతూనే ఉంటాయి” అని తమ స్వస్థలమైన విజయవాడను గుర్తు చేసుకున్నారు. వింటున్న అందరం “గుర్తుకొస్తున్నాయి” పాటను మనసులో పాడుకుంటూ ప్రసాద్ గారి జ్ఞాపకాలను పంచుకున్నాం.

ఇర్షాధ్ గారు “నిలబడే హాస్యం” గురించి మాట్లాడుతూ అందరినీ పడీ,పడీ నవ్వేలా చేసారు. “మీరు తెలుగులో స్టాండ్ అప్ కామెడీ చేస్తే బాగుంటుందని” చాలామంది ఇర్షాద్ గారిని కోరారు. “మా ప్రాంతీయ దేవాలయాలు” గురించి ఏలేటి వెంకటరావు గారు ఉభయ గోదావరి జిల్లాలలోని దేవాలయాలను సభకు గుర్తు చేసారు. తెలుగులో అవధానం, సంగీతం, సాహిత్యం కలిపి “సంగీత గేయధార” అన్న ప్రక్రియను ప్రారంభించిన వేంకటగిరి రాజా శ్రీ యాచేంద్ర సాయికృష్ణను చొరగుడి రమేష్ కొనియాడారు.

తరువాత కార్యక్రమం పుస్తక ఆవిష్కరణ, మందపాటి సత్యం గారు వ్రాసిన “ఆమెరికా వంటింటి పద్యాలు” పుస్తకాన్ని అర్షాద్ గారు ఆవిష్కరిస్తూ తెలుగులో తనకు నచ్చిన రచయితలలో మల్లాది వెంకట కృష్ణమూర్తి గారు అని చెప్పారు.  అమెరికాలో ఉండి ప్రవాస జీవితాలను మనకు పరిచయం చేస్తున్న మందపాటి సత్యం గారు అంతే కూడా తనకు ఎంతో ఇష్టం అన్నారు. తన అభిమాన రచయిత పుస్తక ఆవిష్కరణలో భాగమయినందుకు ఎంతో సంతోషంగా ఉందన్నారు. ఈ పుస్తకంలో తనకు నచ్చిన కొన్ని పద్యాలను ఇర్షాద్ గారు చదివి వినిపించారు. కీర్తిశేషులు శ్రీ ఆరుద్ర గారు వ్రాసిన “వంటింటి పద్యాలు” తన “అమెరికా వంటింటి పద్యాలు”కి ప్రేరణ అని రచయిత మందపాటి సత్యం గారు చెప్పుకొచ్చారు.

భారతదేశంలో ఈ పుస్తకావిష్కరణ జరిగినపుడు ప్రముఖ కవి సీ.నారాయణరెడ్డిగారు ఈ పుస్తకంలో కొన్ని పద్యాలు నచ్చి అవి చదివారట, వాటిని మళ్ళీ సత్యం గారు మాకు చదివి వినిపించారు. “పూరించండి చూద్దాం” అంశంపై సత్యం గారు ఒక కథని కొంత భాగం వినిపించి మిగత సగాన్ని పూర్తి చేయమని సభలో ఉన్న కథ రచయితలను ప్రోత్సహించారు. కథను వింటున్నపుడే నా పక్కన కూర్చుని ఉన్న తుమ్మూరి రామ్మోహనరావు గారు అర్థమయినట్లు తల పంకించారు. తేనీరు విరామంలో పూర్తి చేసిన కథని నాకు వినిపించారు. సత్యం గారు ఇచ్చిన క్లూని రామ్మోహన్ గారు అలవోకగా పట్టేసుకున్నారు, ఇదే విషయాన్ని సత్యం గారు తర్వాత చెప్పుకొచ్చారు.

విరామం తర్వాత రెండో భాగాన్ని శానాంటోనియో కొ చెందిన తుర్లపాటి ప్రసాద్ గారు,  సింగిరెడ్డి శారదగారు నిర్వహించారు.. గుడివాడ ప్రముఖులు వై.వీ.రావు గారు “ఆధ్యాత్మిక రామాయణం” పుస్తకాన్ని పరిచయం చేస్తూ రాముడు గురించి కొత్త విషయాలను చెప్పారు. వాల్మీకి రామాయణం, తులసీ రామాయణం నుండి కొన్ని సంఘటనలను వివరించారు.

మొన్న ‘గబ్బర్ సింగ్’ సినిమాలో అంత్యాక్షరి బాగా పండింది, తెలుగు పద్యాలతో అంత్యాక్షరి మీరు ఎపుడన్నా విన్నారా? నేను వినలేదు. తుర్లపాటి ప్రసాద్ గారు నిర్వహించిన పద్యాల అంత్యాక్షరి చాలా సరదాగా జరిగింది. సభలో ఉన్న వారిలో చాలా మంది పద్యాలు పాడడంలో దిట్టలే! తరువాత ఇర్షాద్ గారు రచించిన “గోయింగ్ బాక్ టూ ఇండియా” అన్న హాస్య కథను చదివి వినిపించారు.

తానా సాహితీ సభలలో పాల్గొని జయప్రదం చేయవలసిందిగా తానా సాహిత్యవేదిక సమన్వయ కర్త మద్దుకూరి చంద్రహాస్ గారు సభికులని కోరారు. ఉగాది సందర్భంగా నెల నెలా తెలుగు వెన్నెల సదస్సులో ఏప్రిల్ 12న కవి సమ్మేళనం జరుగనందని ఉత్తర టెక్సాస్ తెలుగు సంఘం కార్యదర్శి జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం గారు తెలిపి, అందరినీ ఆహ్వానించారు. తెలుగు చలనచిత్ర రచయితలను ఉద్దేశిస్తూ చంద్రహాస్ గారు మాట్లాడారు.

ప్రవాస భారతీయులు తెలుగు సాహిత్యానికి చేస్తున్న సేవ గురించి తుమ్మూరి రామ్మోహనరావు గారు తన స్వీయ గేయం “పడమటి ఉగాది రాగం” పాడారు. స్వీయ రచనలో భాగంగా చింతపల్లి గిరిజాశంకర్ గారు “న్యూ స్వీయ రచనలో భాగంగా చింతపల్లి గిరిజాశంకర్ గారు “న్యూ గిరీశం లెక్చర్లు” చదివి అందరినీ నవ్వించారు. జువ్వాడి రమణ గారు ఖడ్గ సృష్టి నుండి కొన్ని గేయాలను తియ్యగా పాడారు.

కరుణశ్రీ జంధ్యాల పాపయ్య శాస్త్రిని గుర్తు చేసుకుంటూ తుర్లపాటి ప్రసాద్ గారు కొన్ని పద్యాలనూ, కవితలనూ పాడారు. చివరగా శ్రీమతి కల్లూరి జయశ్రీ గారు తన కథ “వై దిస్ కొలవరి” చదివి వినిపించారు.  సుమ పోకల గారు వందన సమర్పణ చేస్తూ సభకు విచ్చేసిన సాహిత్య ప్రియులకు వందనాలు అందజేసారు. గుడివాడ వాస్తవ్యుల అతిథి సత్కారాలకు మేము మిక్కిలి సంతోషించి వారి దగ్గర సెలవు తీసుకున్నాము.

ఆస్టిన్ నుండి మమ్మల్ని కలవడానికి వచ్చిన మిత్రులు రాం పులికంటి, గోపీలతో కలిసి ఆస్టిన్ బయలుదేరాము.సాయంత్రం కబుర్లతో కాలక్షేపం చేసి ఆదివారం ఉదయం ఆస్టిన్ లో ఉంటున్న అఫ్సర్, కల్పనా రెంటాలగారిని కలవడం కోసం బయటపడ్డాం.మబ్బులు పట్టిన ఆస్టిన్ వాతావరణంలో స్టార్ బక్సు కాఫీ తాగుతూ చెట్ల కింద కూర్చుని చక్కగా కబుర్లు చెప్పుకున్నాం. అఫ్సర్ గారిని ఇంతకు ముందు ఇండియానా పోలీసులో జరిగిన తెలుగు మహాసభలలో కలిసాను, కొన్ని సంవత్సరాల తరువాత మళ్ళీ ఇపుడే కలవడం! కల్పన గారిని కలవడం ఇదే మొదటిసారి! కానీ మాతో ఎంతో చక్కగా మాట్లాడారు. వారి దగ్గర సెలవు తీసుకుని మా తమ్ముడి చిన్ననాటి స్నేహితుడిని కలవడానికి మళ్ళీ రోడ్డెక్కాం.

ప్రశాంత్, అతని స్నేహితుడి దిలీప్ ఎనిమిదవ తరగతి నుండి కలిసి చదివారు. ఇపుడు ఇద్దరూ అమెరికాలో మాస్టర్స్ చివరి అధ్యాయంలో ఉన్నారు. వీళ్ళిద్దరూ కలిసి “తూనీగ, తూనీగ” పాడుకుంటూ నన్నూ వాళ్ళ జ్ఞపకాలలోకి లాగారు. నాకు కుడా గుర్తుకొస్తున్నాయి ఇంకొక భాగం చూసిన అనుభూతి కలిగింది. ఆస్టిన్ లోని దావత్ రెస్టారెంటులో చాయ్ తాగి డాలస్ వైపు ఉల్లాసంగా తిరుగు ముఖం పట్టాం.

ఫోటో: జొన్నలగడ్డ సుబ్రహ్మణ్యం, డాలస్

తెలుగు సినిమా చరిత్ర పై ఈ తరం వెలుగు రెంటాల జయదేవ !

ఏప్రిల్ 11 న ఉత్తమ సినీ విమర్శకుడి గా  రెంటాల జయదేవ కు నంది పురస్కారం

Nandi-Awards-2011పత్రికా రచనా రంగంలో రెండు దశాబ్దాలకు పైగా పనిచేస్తున్న డాక్టర్ రెంటాల జయదేవను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకమైన ‘నంది’ అవార్డుకు ఎంపిక చేసింది. 2011వ సంవత్సరానికి గాను ‘ఉత్తమ సినీ విమర్శుడి’గా నంది పురస్కారాన్ని ఆయనకు ప్రకటించింది.  ఏప్రిల్ 11 న జరగబోయే అవార్డ్ ప్రదానోత్సవ సభ లో జయదేవ ఈ అవార్డ్ ను అందుకోనున్నారు.

ఇప్పటికి ఇరవయ్యేళ్ళుగా రెంటాల జయదేవ సినీ పత్రికా రచనలో ప్రత్యేక కృషి చేస్తున్నారు. ఆయన సినిమా సమీక్షలు, ప్రత్యేక వార్తా కథనాలు, విశ్లేషణలు, ప్రముఖులతో ఆసక్తికరమైన ఇంటర్వ్యూలు పాఠకులతో పాటు సినీ పరిశ్రమవారినీ ఆకట్టుకుంటున్నాయి.

తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ సరైన విడుదల తేదీని జయదేవ ఇటీవలే తన పరిశోధనలో వెలికితీశారు. తెలుగు సినిమా జన్మదినోత్సవం విషయంలో కొన్నేళ్ళుగా ప్రచారంలో ఉన్న తప్పును ఆయన సాక్ష్యాధారాలు చూపి, సరిదిద్దారు. ప్రముఖ కవి,శతాధిక గ్రంథకర్త, సీనియర్ పాత్రికేయులు, సినీ రచయిత కీర్తిశేషులు రెంటాల గోపాలకృష్ణ ఆఖరి కుమారుడైన జయదేవ తండ్రిగారి నుంచి ఇటు పుస్తక రచననూ, అటు పత్రికా రచననూ వారసత్వంగా పుణికిపుచ్చుకున్నారు.
‘‘తెలుగు సినిమాపై నా పరిశోధన కొనసాగుతూనే ఉంటుంది!’’Dr. Rentala Jayadeva2

‘‘ఇప్పటికి ఇరవై ఏళ్ళకు పైగా పత్రికా రచనలో, ముఖ్యంగా సినీ పరిశ్రమపై చేస్తున్న కృషికి ఇది ఓ గుర్తింపుగా భావిస్తున్నా. గత ఏడాది నేను రాసిన వ్యాసాలను పరిశీలించి, ప్రతిభా వ్యుత్పత్తులను గమనించి, ‘ఉత్తమ తెలుగు సినీ విమర్శకుడి’గా నన్ను ఎంపిక చేసిన అవార్డుల సెలక్షన్ కమిటీకి ప్రత్యేక కృతజ్ఞతలు.

చిన్నప్పటి నుంచి సినిమా అంటే ఇష్టం, ఆసక్తి. నాన్న గారు రెంటాల గోపాలకృష్ణ ఆంధ్రప్రభ దినపత్రికలో సినీ జర్నలిస్ట్ గా కూడా  పనిచేశారు. ఆ సమయంలో నాన్న గారిని కలిసేందుకు వచ్చే గొప్ప గొప్ప నటులు, రచయితలతో పరిచయం, నాన్న గారు రాసే సినిమా వ్యాసాలు చదవడం వంటివి తెలియకుండానే నాకు సినిమాపై ఆసక్తిని కలిగించాయి. నాన్నగారి ప్రభావంతో జర్నలిజంలోకి వచ్చిన తరువాత నేనే సినిమా వ్యాసాలు రాయడం మొదలుపెట్టాను.

సినిమా వ్యాసమంటే అందులో చరిత్ర తప్పక చెప్పాలి. దాంతో సినిమా గురించి మరింతగా తెలుసుకోవడం ప్రారంభించాను. ఆ జిజ్ఞాసే తెలుగు సినిమా చరిత్రపై పరిశోధనకు నన్ను పురిగొల్పింది.  పరిశోధన విషయం లో  ఆరుద్ర గారు స్ఫూర్తి. ప్రతి విషయాన్నీ పరిశోధనాత్మకంగా చూడడం ఆయనకు అలవాటు. ఆయన రాసిన ‘సమగ్ర ఆంధ్ర సాహిత్యం’ అలా రూపొందిందే.

తెలుగు సినిమా చరిత్రపై పరిశోధన చేస్తున్న సమయంలో తమిళ పరిశ్రమకు చెందిన ప్రముఖ సినీ చరిత్రకారుడిని కలిశాను. ఆయనతో జరిగిన సంభాషణలో ఒకసారి తొలి తమిళ – తెలుగు టాకీ ‘కాళిదాస్’ గురించి చర్చ వచ్చింది. తమిళులు ‘కాళిదాస్’ని తమిళ టాకీగానే భావిస్తారు. ఆ సినిమా విడుదల తేదీని నిర్ధారించే ఆధారాన్ని నాకు చూపిస్తూ, తొలి పూర్తి తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ 1931 సెప్టెంబర్ 15వ తేదీనే విడుదలైందనడానికి ఆధారం ఏమిటని ప్రశ్నించారు. ఆ ప్రశ్నే నేను తెలుగు సినిమా పుట్టుక తేదీపై పరిశోధన చేయడానికి కారణం. తెలుగు సినిమా గురించి పరిశోధన చేస్తున్న నాకు పుట్టుక తేదీకి ఆధారాన్ని కనిపెట్టాలన్న సంకల్పం కలిగింది.

కేవలం ఆధారం కనిపెట్టాలన్న లక్ష్యంతోనే పరిశోధన ప్రారంభించాను. కానీ, సమాచార సేకరణలో అసలు సెప్టెంబర్ 15వ తేదీన తొలి సంపూర్ణ తెలుగు టాకీ ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదన్న విషయం తెలిసింది. సెప్టెంబర్ 15న తొలి తెలుగు టాకీ విడుదలైంది అని చూపించే ఆధారం ఎవరి దగ్గరా లేదు. దాని కోసం మద్రాసు, విజయవాడ, రాజమండ్రి, ఢిల్లీ, పూణే తదితర తెలుగు సినిమా జాడలున్న ప్రాంతాల్లో పర్యటించి, చరిత్రకారులను కలుసుకొని వివరాలు సేకరించాను. ఎన్నో పుస్తకాలు చదివాను.

అదే సమయంలో పూణే ఫిలిం ఇనిస్టిట్యూట్ లో ‘ఫిలిం అప్రిసియేషన్’ కోర్సులో చేరాను. అక్కడికి అతి సమీపంలో ‘నేషనల్ ఫిలిం ఆర్కైవ్స్ ఆఫ్ ఇండియా’ ఉంది. అందులో పాత గ్రంథాలు, సినిమాలు, సెన్సార్ సర్టిఫికెట్లు భద్రపరిచి ఉన్నాయి. వాటిలోనే ‘భక్త ప్రహ్లాద’తో సహా అప్పటి చిత్రాల సెన్సార్ సర్టిఫికెట్ వివరాలున్న గవర్నమెంట్ గెజిట్ కనపడింది. 1932 జనవరి 22న ‘భక్త ప్రహ్లాద’ సెన్సార్ జరిగినట్లు అందులో ఉంది. అప్పటికి దశాబ్దం క్రితమే సెన్సార్ చట్టం అమలులో ఉంది కాబట్టి, సెన్సార్ జరగకుండా సినిమా విడుదలయ్యే ప్రశ్నే లేదు. దీనిని బట్టి 1931 సెప్టెంబర్ 15న ‘భక్త ప్రహ్లాద’ విడుదల కాలేదని నిర్ధారణైంది. ఆ తరువాత అసలు తేదీని కనిపెట్టేందుకు శ్రమించి, మరింతగా శోధించాను. అప్పటి పత్రికల్లోని ప్రకటనలను బట్టి 1932 ఫిబ్రవరి 6న ముంబయ్ లోని కృష్ణా సినిమా థియేటర్ లో తొలి సంపూర్ణ తెలుగు టాకీ విడుదలైందని తేలింది. సుమారు రెండు నెలల తరువాత, అంటే 1932 ఏప్రిల్ 2న ‘భక్త ప్రహ్లాద’ మద్రాసులో విడుదలైంది.

ఇది పూర్తిగా నా స్వీయ పరిశోధన. దాదాపు నాలుగున్నరేళ్ళు శ్రమించాను. వ్యక్తిగతంగా చేస్తున్న పరిశోధనలకు వ్యవస్థ సహకారం కూడా ఉండాలన్నది నా అభిప్రాయం.  పరిశోధకుడిగా వాస్తవాలను బయటపెట్టాలన్నదే నా ప్రయత్నం. ఫిబ్రవరి 6నే తొలి తెలుగు సినిమా పుట్టిందని సాక్ష్యాధారాలతో సహా నిరూపించాను.  ఏదో కనిపెట్టాలన్నది నా అభిమతం కాదు. నిరంతర పరిశోధనలో కొత్త విషయాలు బయటపడుతూనే ఉంటాయి. ఇప్పటికీ మన దగ్గర మూకీ చిత్రాల గురించి పక్కా సమాచారం లేదు. సాక్ష్యాధారాల సహితంగా తెలుగు సినిమా చరిత్రను నిర్మించాలన్నది నా లక్ష్యం. అందుకే తెలుగు సినిమా నా పరిశోధన సాగుతూనే ఉంటుంది. నా ముందు తరం నిర్మించిన మెట్లపై నడుచుకుంటూ సాక్ష్యాధార సహిత తెలుగు సినిమా చరిత్ర నిర్మాణానికి నేను సైతం…!

స్టేజీ ఎక్కుతున్న ‘పతంజలి’!

patanjali natakotsavaaluపతంజలి అంటే వొక ఖడ్గ ప్రహారం!

పతంజలిని అక్షరాల్లో చదవడానికి కూడా చాలా ధైర్యం కావాలి. వెన్నెముకలేని లోకమ్మీద కసిగా విరుచుకుపడే అతని పదునయిన వాక్య ఖడ్గం  మనం గర్వపడే మన కాలపు వీరుడు వదిలివెళ్లిన ఆస్తి.

అలాంటి వాక్యాల  సైన్యాన్ని రంగస్థలం మీద చూపించడం వొక సాహసం. కానీ, తెలుగు నాటకం అలాంటి సాహసోపేతమయిన ముందడుగుకి సర్వసిద్ధంగా వుందని నిరూపిస్తూ ఇదిగో ఈ పతంజలి నాటకోత్సవాలు ….ఈ వారం హైదరాబాద్ లో…మీరు హైదరబాద్ లో వుండీ వెళ్లలేకపోతే ఆధునిక తెలుగు నాటక రంగచరిత్రలో వొక అద్భుతమయిన సన్నివేశాన్ని కోల్పోతున్నట్టే!

సాహిత్యానికీ, రంగస్థలానికీ మధ్య వంతెన కట్టే కృషిలో నిమగ్నమయి వున్న పెద్ది రామారావు నిర్దేశకత్వంలో హైదరాబాద్ యూనివర్సిటీ పరిశోధక విద్యార్థులు చంద్రశేఖర్ ఇండ్ల, నరేశ్ బూర్ల, శివ ఈ ‘ప్రయోగానికి’ నాంది పలికారు.

మరో కథన కెరటం ‘ ప్రాతినిధ్య’ !

invitation

స్త్రీ స్వేచ్ఛ, స్త్రీ విద్య కోసం జీవితకాలం కృషి చేసిన మహాత్మా  సావిత్రీ బాయ్ ఫూలే ను ఆదర్శం గా తీసుకొని బాలికావిద్య ను ప్రధాన లక్ష్యంగా చేసుకొని ఏర్పాటైన సంస్థ ‘సామాన్యకిరణ్ ఫౌండేషన్’.  మనిషి సహజాత లక్షణమైన ఆధిపత్య ధోరణిని తిరస్కరిస్తూ , ఏ రకమైన ఆధిపత్యాన్ని, అధికారాన్ని, పీడననైనా ప్రశ్నించగలిగే సమ సమాజ నిర్మాణ కాంక్ష లో భాగంగా అస్తిత్వం పేరిట మొలకెత్తిన ప్రశ్నలకు వేదిక ” ప్రాతినిధ్య”. అందుకు తొలి అడుగు ఈ ” ప్రాతినిధ్య” కథాసంకలనం.

“శైలీ, శిల్పసౌందర్యాల కోసం కథలు రాస్తున్న కాలం కాదు ఇది. కులం పేరిటో, స్త్రీ అనే పేరిటో, మతం, ప్రాంతం అనే పేరిటో దాడులకు, దోపిడీలకు, అణచివేతలకు గురవుతూ, బిట్వీన్ లైన్స్ మలిగిపోతున్న అనేకానేక అస్తిత్వాల  గొంతులు ఇవాళ సాహిత్య రూపాన్ని పొందుతున్నాయి. బలమైన ఈ గొంతుకలకు స్పేస్ ని కల్పించటం, ప్రధాన స్రవంతి సమాజం లోకి ప్రమోట్ చేయడమూ అనే అంశాలే ‘ ప్రాతినిధ్య’ కథల ఎంపిక లో ప్రాతిపదికగా నిలుస్తాయి. ఆయా కథలు వాచ్యంగా ఫలానా అస్తిత్వాన్నే చెప్పాల్సిన పని లేకున్నా, ప్రశ్నలు, వెదుకులాట, తపన, సహృదయత పట్ల ప్రేమ లేని కథలు మాత్రం ‘ ప్రాతినిధ్య ‘ లో చోటు చేసుకోవు.” అంటున్నారు సామాన్య కిరణ్ ఫౌండేషన్ వారు.

ప్రతి ఏడాది అనేకానేక కథాసంకలనాలు విడుదల అవుతున్నాయి.ప్రతి సంకలనం ఒక దిశా నిర్దేశాన్ని సూచిస్తోంది. సదుద్దేశ్యం తో, సంకల్పం తో ప్రారంభమైన ఈ ‘ ప్రాతినిధ్య’ కథా సంకలనానికి  సంపాదకులు గా కథా రచయిత్రులు సామాన్య, కుప్పిలి పద్మ  వ్యవహరించారు. ఈవస్ సంకలనం  లోని  కథలు, వాటి ఇతివృత్తాలు, శిల్పనైపుణ్యాల గురించి ప్రముఖ కవి, విమర్శకుడు అఫ్సర్ ముందు మాట రాశారు. ఈ సంకలనం లో అఫ్సర్, గోపరాజు నారాయణ రావు, సువర్ణకుమార్, వినోదిని, పసునూరు రవీందర్, మెహర్, కుప్పిలి పద్మ, పల్ల రోహిణీ కుమార్, పి, సత్యవతి, వేంపల్లె షరీఫ్, కోట్ల వనజాత, పెద్దింటి అశోక్ కుమార్, సామాన్య ల కథలున్నాయి.

2012 వ సంవత్సరం లో ప్రచురితమైన కథల నుంచి ఎంపిక చేసి  ప్రచురిస్తున్న ” ప్రాతినిధ్య” కథాసంకలనం ఆవిష్కరణ సభ మార్చి 28 , గురువారం  హైదారాబాద్ లోని సుందరయ్య విజ్నాన కేంద్రం మినీ హాలు లో  జరుగనున్నది. సంకలనాన్ని ప్రముఖ రచయిత జి. కళ్యాణ రావు ఆవిష్కరిస్తుండగా,  పాణి, ఖాదర్ మొహియుద్దీన్, జీలుకర శ్రీనివాస్, జి.ఎస్.కె. మీనాక్షీ  ప్రసంగించనున్నారు.