జీవితమే ఒక నాటక రంగం – ‘థియేటర్ స్క్వేర్’

uri_civara

“All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”

 

“Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

“I like this place and willingly could waste my time in it”

 

పైన ఉటంకించినవన్నీ షేక్స్పియర్ వ్రాసిన ‘As You Like It’ లోనివి. ఎప్పుడో డిగ్రీ చదువుకున్నప్పుడు బట్టీ పెట్టిన వాక్యాలు. అసలు ఇవి ఎందుకు చెప్పాల్సివస్తున్నదంటే, కొన్నాళ్ళ క్రితం అఫ్సర్ గారు వ్రాసిన ‘ఊరిచివర’ తిరగేస్తున్నప్పుడు మొట్టమొదటగా ఆకర్షించిన పేజీలో నేను చదివిన కవిత ‘థియేటర్ స్క్వేర్’ దీనికి కారణం. ఈ శీర్షిక చూడగానే ఒకదానివెంట మరొకటిగా పైవన్నీ గుర్తుకొచ్చాయి. అఫ్సర్ గారి కవితల్లో నా స్వభావానికి అంటే నా అంతర్యానానికి నచ్చిన కవిత ‘థియేటర్ స్క్వేర్’.

 

ఇదో అరుదైన, కాకతాళీయమైన సందర్భం. ఎందుకంటే, నాకు గుర్తుకువచ్చిన, పైన ఉటంకించిన మూడు కోటబుల్ కోట్స్ అఫ్సర్ గారు ‘థియేటర్ స్క్వేర్’ లోని తన పద్యాలలో స్పృశించారు! అవేమిటో చూద్దాం…

 

షేక్స్పియర్ ఒక సందర్భంలో అంటాడు “All the world’s a stage, and all the men and women merely players. They have their exits and their entrances; And one man in his time plays many parts”. చాలామంది చాలాచోట్ల ఇదే విషయాన్ని కొద్ది మార్పుచేర్పులతో చెప్పినా, అఫ్సర్ గారు మొదటి పద్యంలో ఇదే విషయాన్ని ఎలా చెబుతున్నారో చూడండి :

 

దృశ్యం – 1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

షేక్స్పియర్ వ్రాసినదానికి, ఈ మొదటి పద్యానికి ఎంత సామ్యం! నా ఆశ్చర్యం అంతటితో ఆగలేదు. నాలుగో పద్యానికి వచ్చేటప్పటికి ‘As You Like It’ లోని మరో వాక్యం కళ్ళముందే దాగుడుమూతలు ఆడటం మొదలేసింది. ముందు ఆ పద్యం :

 

దృశ్యం – 4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

షేక్స్పియర్ అంటాడు “Oh! How bitter a thing it is to look into happiness through another man’s eyes!”

 

సాథారణంగా మనిషికి,  తనకు ఏం కావాలో కూడా తనకు తెలియదు. అలా అని ఉన్నదానితో తృప్తి చెందడు. ఆనందం పొందడు. తను కోరుకున్న వ్యక్తి మరొకరికి చేరువౌతున్నదని తెలిసిన సందర్భంలో ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని, ఎంతో సరళంగా, సున్నితంగా అఫ్సర్ గారు సార్వత్రికం చేసారో!

 

చివరి పద్యానికి వచ్చేటప్పటికి అఫ్సర్ అంటారు :

 

దృశ్యం – 6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

 

శుద్ధ వ్యావహారిక వ్యాపకంగా ఓ పాత్ర చేత షేక్స్పియర్ చెప్పించిన విషయాన్ని (“I like this place and willingly could waste my time in it”) అఫ్సర్ గారు ఎంత గొప్పగా చెబుతున్నారో!

 

***

 

ప్రతి పద్యాన్ని విడమరచి వివరించటం ఔచిత్యం అనిపించుకోదు కాబట్టి, అఫ్సర్ గారి కవిత :

థియేటర్ స్క్వేర్

దృశ్యం-1

 

ఒక నిశ్శబ్దంలోకి అందరూ

మౌనంగా.

 

తెర మీద

ఎవరి కథల్ని వాళ్ళే విప్పుకుంటారు తీరా.

 

దృశ్యం-2

 

ఎవరితో ఎవరు మాట్లాడుతున్నారు?

మాటల మధ్య చీకట్లు

ఎవరి చీకట్లో వాళ్ళు

లోపలి అనేకంతో కలహం.

 

దృశ్యం-3

 

కాసిని కన్నీళ్ళు వుప్పగా

పెదవి మీదికి.

చాన్నాళ్ళయ్యిందిలే కన్ను తడిసి!

ఇంకా కరగనీ

కళ్ళ వెనక శిలలు విరిగివిరిగి పడనీ.

 

దృశ్యం-4

 

ఎవరి జీవితం వాళ్ళకి చేదు

అవతలి బతుకు

కాసేపు అద్దం

తెలియని అర్థానికి.

 

దృశ్యం-5

 

ఎవరూ ఎక్కడా ప్రేక్షకులు కారేమో!

కొద్దిసేపు

పాత్రలు మారిపోతాయి అంతే

నేను అనే పాత్రలోకి

స్వకాయ ప్రవేశం ఇప్పుడు

 

దృశ్యం-6

 

థియేటరు

నన్ను అనువదించే యంత్రం

ఇక్కడ

నన్ను నేను వెతుక్కుంటాను

ప్రతి సాయంత్రం.

***

అనుభవాల అగాధాల్లో జ్ఞాపకాలు పరిభ్రమిస్తూ ఉంటాయి. రెక్కలు విప్పుకుంటూ అవే జ్ఞాపకాలు జలపాతాలై దూకుతుంటాయి. ఇది ఓ నిరంతర ప్రక్రియ. ఇదే జీవితం. ఎగసిపడే కెరటాలని ఒడిసిపట్టుకుంటూ, కొత్త కెరటాలతో సరికొత్త ఎత్తులకు ఎదుగుతూ, జారుతూ సాగిపోతుంది, నిరంతరం నిత్యనూతనంగా ప్రవహిస్తూనే ఉంటుంది  – జీవితం.

 

ఇందులోనే అందం ఉంది… ఆనందమూ ఉంది. బహిర్ముఖుడైన వ్యక్తి అందాన్ని మాత్రమే ఆస్వాదిస్తూ గడిపేస్తాడు. అంతర్ముఖుడైన కవి అది భయానక సౌందర్యమైనా సరే, ఆనందపు లోతులు ఆవిష్కరిస్తూ ఉంటాడు. ఆ అంతర్ముఖత్వంలోనే, కవి తనను తాను చూసుకోగలడు, తన లోతులు అంచనా వేసుకోగలడు. కవిత్వానికి అతీతమైన ఏదో విషయాన్ని, కవిత్వంగా చెప్పగలడు. అలాంటి అంతర్ముఖత్వాన్ని కొందరు మాత్రమే సాధించగలరు. అలాంటి అద్భుతమైన ప్రయత్నం అఫ్సర్ గారి ‘ఊరిచివర’ సంకలనంలోని ‘థియేటర్ స్క్వేర్’ అనే కవిత.

 – కొండముది సాయి కిరణ్ కుమార్

kskk_amtaryaanam

 

కవిత్వ ‘బాధ’లో ఒక సుఖముంది!

మనసుకి బాధ కలిగితే కవిత్వం వస్తుందంటారు. కానీ శరీరానికి బాధ కలిగితే కూడా కవిత్వం వస్తుంది అన్న నానుడి నేను ఎక్కడా వినలేదు. అయితే , శరీరానికి కలిగే బాధలు ఎంత చిన్నవైనా, ఎంతో కొంత మన ఉత్సాహాన్ని , శక్తిని తగ్గిస్తాయి. రోజువారీ దినచర్య కొంత నత్త నడక సాగుతుంది. అదే ఏదైనా భరించలేని నొప్పి వచ్చిందంటే ఇంక చెప్పేదేముంది? తప్పని బాధ్యతలు ముక్కుతూ మూలుగుతూ పూర్తి చెయ్యాల్సి వస్తుంది. చేసే పనిలో ఉత్సాహం , తపన కరువై , తప్పదురా భగవంతుడా అనుకుంటూ చేస్తాం. మొత్తానికి ఏ చిన్న అనారోగ్యమైనా మన కేంద్రీకరణ శక్తిని తగ్గించేసి అలవాటుపడిన దినచర్యకి ఆటంకం కలిగిస్తుంది.

అలా కాకుండా అమితమైన మనోబలం ఉన్న కొద్ది మంది మాత్రం పెద్ద పెద్ద అనారోగ్యాల్ని కూడా త్రుణప్రాయంగా తోసేసి వీలైనంతవరకు అవి తమ కార్యకలాపాలను ప్రభావితం చెయ్యకుండా చూసుకుంటారు. ఇది అరోగ్యకరమైన శక్తి. అలాంటి మనోబలం, మనో నిబ్బరం పొందాలని ఎవరికుండదు? అందుకే చిన్న చిన్న నొప్పులకి సైతం నీరుకారిపోయే కొంతమంది ధ్యానం ద్వారానో, యోగా ద్వారానో అలాంటి మనోబలాన్ని పొందాలని ఆరాటపడుతూంటారు.

64681_101182536614807_2154683_n

అయితే కవిత్వానికున్న శక్తి కూడా అలాంటిదే అని నాకనిపిస్తుంది. మానసికోల్లాసం ద్వారా శారీరక వికాసం కవిత్వం కలిగిస్తుందనేది స్వీయానుభవం ద్వారా మాత్రమే తెలుసుకోగలం. అచ్చంగా అలాంటి అనుభవమే విన్నకోట రవి శంకర్ గారి “బాధ” కవిత మొదటి సారి చదివినప్పుడు నాకు కలిగింది. ఏదైనా అనారోగ్యం కలిగినప్పుడు మన శారీరక, మానసిక స్థితి ఎలా ఉంటుందో చాలా తేలికైన భాషలో కవిత్వీకరించారు. శారీరక బాధ అనేది ఎప్పుడో అప్పుడు ప్రతి ఒక్కరూ అనుభవించే ఉంటారు కాబట్టి ఈ కవిత చాలా తేలికగా మనసుకి హత్తుకుపోతుంది. అంతే కాదు, ఒక్కసారి గుర్తుచేసుకుంటే అలాంటి బాధలనుంచి తాత్కాలిక ఉపశమనాన్నిచ్చి మొరాయించే   శరీరానికి నూతనోత్సాహానిస్తుంది.

 

కవి ఈ కవితలో చెప్పినట్టు

 

“మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు. “

కాబట్టే, బాధను ఉపశమింపజేసే సాధనాల్లో ఈ కవిత కూడా ఒకటయిందంటాను. ప్రతి మనిషీ నొప్పి కలిగినప్పుడు ఇదేరకమైన బాధని అనుభవిస్తాడు. అలాంటి బాధని ఇలా కవిత్వరూపంలో చూసుకోవడం ఒక చిత్రమైన అనుభూతి. పెదవులపై చిరునవ్వులు పూయించి బాధని కాసేపు మర్చిపోయేలా చేస్తుందీ కవిత.

 

అంతా సవ్యంగా ఉన్నంతసేపూ

  

   అన్ని వైపులా పాదులా అల్లుకుపోయే శరీరం

   ఏ చిన్న భాగం ఎదురు తిరిగినా

   బాధతో లుంగలు చుట్టుకుపోతుంది.

 

   వేల ఆనందపుష్పాలు

   విరబూసే శరీరవృక్షం

   ఒకే ఒక బాధా విషఫలంతో

   వాటన్నిటినీ రాల్చుకొంటుంది.

 

శరీరం వీణ మీద

   ఒకో చోట సుఖం ఒకోలా పలికినా,

   బాధ మాత్రం అన్ని చోట్లా     

   ఒకలాగే పలుకుతుంది.

   సుఖాన్ని మించిన సుఖం ఉందనిపిస్తుంది గానీ,

   ఏ బాధా మరొక బాధకి తీసిపోదు.

 

   చుట్టూ ఉన్న ప్రపంచం తన అందాన్ని

   అతి తేటగా ప్రకటిస్తున్నప్పుడు

   ఒక్క బాధ చాలు –

   కళ్ళకి కన్నీటి తెరకట్టి

   మొత్తంగా దానిని మసకబరుస్తుంది.

 

   మనసు బాధని మరొకరితో పంచుకోవచ్చు

  శరీరం బాధని మాత్రం

  ఎవరికి వారే మోసుకోవాలి

  ఎదురైన ఏ సుఖాన్నైనా

  వద్దని ఒదులుకోవచ్చుగానీ,

  బాధని కాదనటానికి కూడా వీలుండదు.

 

   మనసు ఒప్పించలేని

   మనిషి చివరి ఒంటరితనాన్ని

   శరీరం ఒక బాధాదీపపు వెలుతురులో

   సరిపడా రుజువుచేస్తుంది.

– ప్రసూన రవీంద్రన్

PrasunaRavindran

మంత్రి కృష్ణమోహన్ కవిత్వం :మనిషికోసం అక్షరం ఆర్తనాదం

 మళ్ళీ మరొకసారి జాతీయ స్థాయిలో తెలుగు కవిత్వం రెప రెపలాడింది . అయితే ఈ సారి నలమల కొండల నడుమ ఉన్న , కార్పొరేట్ చదువుల వల్ల మనం మర్చిపోయిన ,మట్టి పలకల  గ్రామం ప్రకాశం జిల్లాలోని  మార్కాపురం  కు చెందిన నవ్యభావాల యువకవి మంత్రి కృష్ణ మోహన్ ఆ ఎగసిన జెండా రెపరెపలకు కారకుడయ్యాడు . 2012 లో ప్రచురించిన అతని తొలి వచన కవితా సంపుటి “ప్రవహించే పాదాలు” 2013  కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కార విజేత గా ప్రకటించటంతో కృష్ణ మోహన్ తెలుగు సాహితీ వినీలాకాశంలో మెరుపై మెరిశాడు. 44 వచన కవితలున్న యీ  పుస్తకం,  35 యేళ్ళ యువకవికి    ఈ అత్యన్నత స్థాయి కీర్తి పతాకం  అందించింది.

కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్న మంత్రి కృష్ణ మోహన్ కవిత్వ సంపుటి

కేంద్ర సాహిత్య అకాడెమీ యువ పురస్కారం అందుకున్న మంత్రి కృష్ణ మోహన్ కవిత్వ సంపుటి

దేని గురించి చెప్పాలన్నా సాహసం కావాలి, ప్రేమ కావాలి అన్నట్లు ఈ యువ కవి ఏ  వస్తువు గురించి కవిత అల్లినా అందులో సాహసం తో కూడిన నిజాయితీ, మమేకమై పోయిన ప్రేమ స్పష్టంగా కన్పిస్తాయి ..  కవిత్వ నిర్మాణం లో ప్రారంభ దశ నుండే ఒక టెంపో , టెక్నిక్ చిత్రంగా పట్టుకున్నాడు, కవిత్వానికి పదను పెట్టుకున్నాడు కనుకనే ఇవాళ విజేతగా నిలిచాడు .

విజేతలు భిన్నంగా ఉండరు , వారు చేసే పనులు మాత్రమే విభిన్నంగా ఉంటాయన్నట్లు ఈ యువకవి వస్తువు ఎంపిక లోను , అభివ్యక్తి లోను వైవిధ్యం, నవ్యత కనిపిస్తాయి . అన్నింటి కన్నా సమాజం పట్ల , మనిషి పట్ల ఈ కవికి ఉండే ప్రేమ , కవిత్వమంతా ఆర్త్రంగా గాఢం గా పరచుకొని పాఠకుడ్ని అలరిస్తాయి . నాలుగైదేళ్లుగా కవిత్వాన్ని తన కన్న తల్లిలా , పుట్టిన ఊరిలా ప్రేమిస్తున్నాడు.

Untitled-1

కృష్ణ మోహన్

 

పొరలు పొరలుగా విడి పోయే మట్టి పలకల నేపథ్యంలోంచే తన తొలి పద్యం మొలకెత్తిందంటాడు. సున్నితత్వం,సౌమ్యత ,కరుణ పుష్కలంగా తొణికిస లాడే వ్యక్తిత్వం లో ప్రతి అంశానికి తీవ్రంగా స్పందిస్తాడు. హృదయ  చలువ నేత్రాలు విప్పారి చూస్తాడు. స్వేచ్చగా రెక్కలు విప్పుకుని కదులుతాడు . చివరగా కవిత్వ అలలు పాదాలు తాకుతూ, వెనక్కి వెళుతూ అల్లరి, అలజడి చేసేలా రాస్తాడు.

గత మూడేళ్లుగా  యువ పురస్కారాలు అందిస్తుంది కేంద్ర సాహిత్య అకాడెమీ . తొలి, మలి  పురస్కారం వేంపల్లె  గంగాధర్-‘మొలకల పున్నమి’ నవలకి , జుమ్మా- వేంపల్లి షరీఫ్ కథలకు అందుకున్నారు .

 

 

267652_4261540530952_560180931_n—పెరుగు రామకృష్ణ

వైవిధ్యమే వర్మ సంతకం!

reppala_vantena

వర్మ ఓ నిశ్శబ్ద సైనికుడు…. అక్షరాన్ని ఓ బుల్లెట్ లా వాడుకునే సైనికుడు.

“రక్తమోడుతున్న మీ అక్షరాలు

కవిత్వాన్ని నిలదీసాయి

మీరిలా ముందుకెళ్ళండి

అక్షరాలవే మీ వెంటవస్తాయి

పరిగెత్తుకుంటూ…”

ఇది నేను వర్మ కవితపై రాసిన మొట్టమొదటి కామెంట్. నా ఆ స్పందనే మమ్మల్ని దగ్గర చేసిందనుకుంటా. అప్ప్పట్నుంచే ఆయన నాకో  మంచి మిత్రుడు.!…కానీ వర్మ నాకో బలహీనత …. వర్మ వాక్యాలు ఓ బలం….

ముఖపుస్తకం లొ పరిచయం ఐన కవిమిత్రుల్లో కుమార్ వర్మ ఓ ప్రముఖ వ్యక్తి. అతనితో, అతని కవితలతో పరిచయం ఐదేళ్లపైమాటే. ఇన్నాళ్ళుగా కుమారవర్మ కవిత్వాన్ని చదువుతూ అతని అక్షరాల్లోంచి మోడేస్టీగా తొంగిచూసే భావనలని పట్టుకోవటం ఓ కవితాత్మక హాబీ. కవి తనురాసే కవితల్లో దొరికిపోతాడంటారు కానీ ఇంతవరకూ వర్మ కవిత్వంలో ఇదమిద్ధంగా ఇదీ “వర్మ” అనే ముద్రలేకుండా రాస్తుండటమే అతని రాతల్ని సిన్సియర్ గా చదవటానికి ముఖ్యకారణం.

కవిత్వం రాయటంలో వర్మ కున్న నిజాయితీ (సీరియస్ నెస్) ఆ కవితల శీర్షికలబట్టె అర్ధమవుతుంది. చాలా తక్కువమంది మాత్రమె తమ కవితల టైటిల్స్ ని జాగ్రత్తగా ఎంపికచేసుకుంటారు. ఉదహరణగా ఇవి చూడండి : “మృతపెదవులు” , “రాతిబొమ్మల రహస్యం”, “పత్ర రహస్యం”,  “సమాధుల్ని శుభ్రం చేయాలిప్పుడు”, “దేహకుంపటి” ఇలా చెప్పుకుంటూ పోతే అతను రాసిన కవితలన్నింటినీ ఉదాహరించాలిక్కడ.

వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి.

వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి తన వైవర్మ విధ్యాన్ని వర్మ కవితల్లో ఓ ప్రత్యేక మార్మికత దోబూచులాడుతుంటుంది. అక్షరాన్ని మార్మికతలో చుట్టి వాటితో కొన్ని వందలపదచిత్రాలతో ఓ దండకూర్చి  మనకి బహుమానంగా ఇస్తారు. ఆ అక్షరాలని వలిచి మళ్ళీ వాటినన్నింటినీ మనం పేనుకుని చదివి ఆకళింపుచేసుకునే పని మాత్రం తప్పదు పాఠకులకి. వర్మ కవితల్లో శ్రేణి, వస్తు వైవిధ్యం, పోరాటం, ప్రధాన ఆకర్షణలు. సమాజంలోని నీచత్వం, దిగజారుడుతనం, దోపిడీ వ్యవస్థపై తిరుగుబాటు ఇవి ప్రధానవస్తువులైనా, హఠాత్తుగా ఓ ప్రేమకవితతో ప్రత్యక్షమయి కవిత్వంలో  వైవిధ్యాన్నీ, భాషపై తనకున్న అధికారాన్నీ చాలా మోడెస్ట్ గా వ్యక్తపరుకుంటాడు వర్మ.

నాకతని కవితలు ఇష్టమే…కానీ కొన్ని కవితలు నిరుత్సాహపరుస్తాయి. అందులో ఇదొకటి. ఈ శీర్షికకి రాస్తున్నాను కదాని పూర్తిగా నెగటివ్ గా రాయటం నా ఉద్దేశ్యం కాదు కానీ ఈ కవితలో వర్మ ఎందుకిలా తొందరపడ్డాడా అని బాధపడ్డ క్షణం లేకపోలేదు.

 

 

మాటలు

కొన్ని మాటలు

చెవిలో దూరినా మనసులో ఇంకవు

కొన్ని మాటలు

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు

కొన్ని మాటలు

ముళ్ళులా మారి దేహంతో పాటు మనసును గుచ్చుతాయి

కొన్ని మాటలు

ఆత్మీయంగా పలకరించి జీవం పోస్తాయి

కొన్ని మాటలు

తొలకరి చినుకులా కురిసి చిగురు వేస్తాయి

కొన్ని మాటలు

వెన్నెల చల్లదనాన్ని పంచి ప్రశాంతతనిస్తాయి

కొన్ని మాటలు

రక్తాన్ని మరిగించి కరవాలాన్నందించి యుద్ధోన్ముఖున్ని చేస్తాయి

కొన్ని మాటలు

నిన్ను అంతర్ముఖున్ని చేసి సుషుప్తిలోకి నెట్టి స్వాంతననిస్తాయి

 

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…

 

చాలా మంచి కవిత ఇది..మొదటి వాక్యంలో ఉన్న రిపీట్ లేకపోయుండే ఇంకా బావుండెదనే ఫీల్ మాత్రం తప్పదు.

కొన్ని మాటల/వాక్యాల రిపీట్ కవితా శిల్పాన్ని దెబ్బతీయడమేకాకుండా పాఠకుడు కవితనుంచి వెళ్ళిపోయే ప్రమాదమూ ఉంది.

దూలం కంటే పెద్దగా అయి లోపలికి రాలేవు” ఇలాంటి స్టేట్‌‌మెంట్ లాంటి వాక్యాలు రాసే కవి కాదు వర్మ. మరెందుకనో ఈ కవితలొ కొంచెం తొందరపడ్డాడెమో అనిపించింది.

కానీ ఇదిగో ఇలాంటి వాక్యాలకోసం వర్మ రాసిన ప్రతీ కవిత చదువుతూంటాను.

కొన్ని మాటలు

రావి ఆకు చివరన నీటి బొట్టులా నీ కనులపై పడి వెలుగు నింపుతాయి

కొన్ని మాటలు

అమ్మ చనుబాలులా మళ్ళీ మనిషిని చేస్తాయి…”

కారణం–వర్మ లోని సీరియస్ నెస్. కవిత్వం కంటే తన భావనలని ప్రజలకు చెప్పాలనె సీరియస్ నేస్…….పోరాటం, ప్రొటెస్టీంగ్–ఇవే వర్మ ఆయుధాలు. ఇవే ఇతన్ని కవిగా నిలబెట్టినవి కూడా…..

వర్మ చాలా పరిణతి చెందిన కవి. అక్షరాలతో మనసు దోచుకుంటూ వాక్యాల్ని మనకొదిలేసి విచారించమటాడు. ఇంత వైవిధ్యం ఉన్న కవిని ఇంతవరకూ నేను చూళ్ళేదంటే నమ్మాలి మీరందరూ. ఏం రాసినా సిన్సియర్ గా రాస్తూ, తన రచనకి న్యాయం చేయాలనుకునె కవి వర్మ…వర్మ నిజంగానే ఓ కవి. All the best Varma in all your future endeavours.

                                                                                                                                                                                                                 – వాసుదేవ్

541392_4595388722851_1575449086_n

శబ్దాల చుట్టూ రూపు కట్టిన అనుభవం “దూప”

ఎం. నారాయణ శర్మ

ఎం. నారాయణ శర్మ

సృజనావసరం (creative necessity) అనేదాన్ని ప్రేరేపించే అంశాలు రెండున్నాయి.1.సమాజం 2.స్వీయ జీవితం.మొదటిది నిబద్ద సృజనకి రెండవది తాత్విక కళాసృజనకి సంబందించినదని ఉరామరికగా చెప్పుకోవచ్చు.దానికి కారణం ఈరెంటి మూలంగా జరిగే సంఘర్షణ.ఇందులో సృజనకి ఉపయోగించే పరికరాల్లోనూ వైరుధ్యాలున్నాయి.వీటిని స్థూలంగా సంప్రదాయికాలు,ఆధునికాలు,వైయక్తికాలు అని విభజించవచ్చు.సంప్రదాయానికి శాస్త్రీయత,ఆధునికానికి దార్శనికత,వైయ్యక్తికంలో ఈరెంటినీ మేళవించి ఒక కొత్తదనాన్ని సాధన చేయటం కనిపిస్తుంది.ఈ శతాబ్దిఉత్తరార్థంలో సృజన సంబంధ అంశాలమీద “మనోఙ్ఞానిక భూమిక” ఒకటిచేరివ్యక్తి అంతశ్చేతనలో ఉండేఅనేకాంశాలని ఊతంగాచేసుకుని అభివ్యక్తిని పదును పెట్టింది.అభివ్యక్తి ధర్మాలు,ప్రవర్తనల గురించి  జరగాల్సిన చర్చలు,విశ్లేషణల విషయంలో విమర్శ కవిత్వం కన్నా వెనుకబడి పోయిందని అందరూ చెప్పుకునేదే.ఈమధ్యలో పదాలకుండే అర్థపరమైన ఉనికిని కొంత ప్రత్యేక దృష్టితో(బహుశః ఉపయోగార్థంతో సాహిత్యావసరాలు తీరక)అర్థపరంగా వైశాల్యాన్ని పెంచిన సంధర్భాలున్నాయి.ఈ విషయంలో భాషా శాస్త్ర పరిధిలో కొంత చర్చ తెలుగులో కనిపిస్తుంది కాని,సాహిత్య ముఖంగా అనుమానమే.అంగ్లంలో ఈ పనిని ఐ.ఏ.రిచర్డ్స్ చేసారు.తన మిత్రుడు c.k.ogdanతో కలిసి 1923 కాలంలో “The meaning of the meaning”అనే పుస్తకాన్ని రాసారు.శబ్దాలచుట్టూ రూపుకట్టిన అనుభవ సత్యాలుంటాయి.కవిత్వంలో కనిపించే ఇలాంటి శక్తిని ఎఫ్.ఆర్.లీవిస్ “The explanatory creative use of words upon experience” అన్నాడు.రవి వీరెల్లి తన అనుభవాన్ని వ్యక్తం చేయడానికి పదాలను మరమ్మత్తు చేసుకుని వాటి వైశాల్యాన్ని పెంచి ఉపయోగిస్తున్నారు.”దూప” సంపుటిలో కనిపించే ఆవృత్తి,దూపలాంటి అనేక పదాలు అలాంటివే.రవి వీరెల్లి కవిత్వంలో కొన్ని అంశాలను గమనించవచ్చు.
1.భౌతికతకి ఆంతరికతకి మధ్యన కనిపించే సంఘర్షణ.ఇందులో అనేక సార్లు ఒకే ప్రారంభాన్ని ఒకే ముగింపుని అనుభవిస్తారు.ఇలా రెంటిలోకి ప్రయాణిస్తారు.
2.తాననుభవించే వర్తమానంతోపాటు తనకు దూరంగా ఉండే వర్తమానాన్ని,దానికి మూలంగా ఉండే గతాన్ని అంతే సారవంతంగా అనుభవిస్తారు.
3.ఆధునికతని పులుముకుని వచ్చిన ప్రాంతీయ పదజాలం(preventialism),అర్థ పరంగా వైశాల్యాన్ని పెంచుకున్న పదాలు.వాటిలోంచి వెలువడే కళాధార్మికత-ఇవన్ని ప్రత్యేకంగా కనిపిస్తాయి.”ఊహు!ఆకారంలేని పదాలు/పద్యానికి పనికిరావు”-(ఏం రాస్తాం-42పే.)
“ప్రాణ స్థానం లోతుల్నించి/పదాలు తోడి మనో ఫలకం పై చిలుకరిస్తూ/నీకు నువ్వే మేలుకొల్పు పాడుకో”-(పైదే)ఈ అసంతృప్తినించే పదాల కొత్త జీవాన్ని అన్వేషిస్తారు.ఇందుకోసం రవి పొందే అనుభవాన్ని గురించి కూడా మాట్లాడుకోవాలి.ఎడ్వర్డ్ బుల్లో Physical Distence(భౌతికాంతరత)ను ప్రతిపాదించాడు.రసానుభూతిలో ఉన్నప్పుడు ఉపయోగంతో పెద్దగా సంబంధం ఉండదు.వర్షంలో తడుస్తూ దానివల్ల కలిగే బాధనుమరిచి దాన్ననుభవించడమే రసమయస్థితి.ఈ స్థితిలో రవి తనకు కావల్సినదాన్ని వెదుక్కుంటారు.295408_3506269936822_51199068_n“కళ్లు పగిలి/ఎప్పుడు భళ్లున తెల్లరిందో/కొత్త రెక్కలతో అస్తిత్వపు మూలాలు వెదుక్కుంటూ/తిరిగి విశ్వాంతరాల్లోకి నేను”-(ఆవృత్తి-18పే)
“ఓరోజు చెట్టుకు నిప్పంటుకుంది/ఆ అగ్నికీలల గర్భంలో దాగిన/గూడును వెదుక్కుంటూ/తిరిగి వెళుతున్న ఆత్మని చూస్తూ/బూడిదై/నేను”-(విముక్తి-13పే.)

నిర్దిష్టంగా రవి అనుభవిస్తున్నదిదే.గమనించాల్సిన మరో అంశం అభివ్యక్తిలో నున్న సౌందర్యారాధన.ఈ సౌందర్యం కోసం మళ్లీ మళ్లీ ఆలోచనలు చేస్తారు.సంజీవదేవ్ సౌందర్య వివేచనలో రససిద్దిని గురించి ఉటంకించారు.ప్రకృతివస్తువులోని భౌతికాన్ని,తాత్వికాన్ని కాకుండా భౌతిక కాంతిలో మెరిసే తాత్విక ధారని అనుభవించడం “రస సిద్ది”.ఇది తాత్విక స్థాయికంటే సౌందర్యాత్మకమయింది.భౌతికాంతరతలోని రసదృష్టిని రవి ఈదృష్టితోనే అనుభవిస్తారు.అందువల్లే రవిలో కొన్ని సార్లు సంఘర్షణ,మరికొన్ని సార్లు సౌందర్యం కనిపిస్తాయి.సంఘర్షణని చిత్రిస్తున్నప్పుడు కర్మ,ఆవృత్తి,నశ్వరం,ఆత్మ లాంటి ఒక అర్థ క్షేత్రానికి చెందిన పదాలవల్ల కొన్ని వాక్యాలు వేదాంతాన్ని పులుముకున్నాయి.

“నువ్వు చేస్తున్న కర్మల్లో/కోల్పోయిన నాఉనికిని శోధిస్తూ/
గుండే తడారిపోయి/తపిస్తున్న అస్తిత్వాన్ని”-(నాలో నేను-14పే.)

ఈకవిత్వంలో చాలాసార్లు ఉదయపు వర్ణనలున్నాయి.తన దృష్టికి దగ్గరగా ఉండటం వల్లేమో వీటి సంఖ్య ఎక్కువ.ఇందులోనూ సౌందర్యం ఎక్కువ కనిపించినా తత్వదృష్టే ప్రధానమైనది.

“వెలుగు చోరబడని/చర్మపు గోడలలోపల చిక్కుపడ్డ/ఓ చీకటి మూటను విప్పుతూ/ఒంటరిగా నేను”-(శోధన-17పే.)

“పడమటి కొండల్లో కోసిన/వెలుగుపంటే/తూర్పు కల్లంలో పైకెత్తి తూర్పాలపడుతూ/సూర్యుడు”-(నేను ఉదయం-30పే.)

“పక్క పొర్లించి పొర్లించి/అప్పుడే నిద్ర లేచిన పుడమికి/
తూర్పుకొళాయి వెలుగు నీళ్లతో/శ్రద్ధగా లాలపోస్తుంది”-(కాలం చివర-32పే.)

“తూరుపు తల్లి రెక్కల కింద/విదిగిన వోవెలుగు పిల్ల/
తల చిట్లిస్తూ/అరమూసిన కళ్లలో అప్పుడే నిద్ర లేసినట్టుంది”-(కాలంకింది గూడు-38పే.)

“దివికి భువికి మధ్య దూరన్నికొలుస్తూ/ఓ వెలుగు కిరణం
విచ్చుకుంటుంది/ఓ చీకటి ముద్ద ముదుచుకుంటుంది”-(కొలమానం-61పే.)

చీకటికొసలు వొడిసిపట్టి/కొలన్లో వుతికి/నేలపై అక్కడక్కద ఆరేస్తూ వెయ్యి/వెలుగు చేతులు”-(ఖాలీతనం-63పే.)

“కొండ రాళ్లను పెల్క్లగించుకుని/వొళ్లంతా మండుతున్న ఎర్రటి గాయాల కళ్లతో/పొద్దు పొడుస్తావు”-(ఇగవటు సూరన్న-67పే.)

“నేలంతా సీసం పోసినట్లు/వెలుగు ఫెళ్లున పగులుతుంది”_(ఇక్కడ- 69పే)

అన్ని వాక్యాల్లోనూ వెలుగు పట్ల ఓ సంఘర్షణ కనిపిస్తుంది.”చిక్కుపడటం,తూర్పాలపట్టదం,పొర్లించడం,తల్ అచిట్లించడం,ముడుచుకోవడం,వొడిసిపట్టడం,పెల్లగించడం.ఫెళ్లున పగలడం”లో ఇది వ్యక్తమౌతూ వుంటుంది.భౌతికంగా తెర మాటున తచ్చాడుతూ ఏదో ఆత్మిక సంపదని వెలిగక్కుతారు.రవి వీరెల్లి భాషలో రెండు భాషారూపాలున్నాయి.ఒకటి చాలాతక్కువగ కనిపించే వేదాంత పరిభాష.రెండవది జీవత్వం సంచలించే తెలంగాణా భాష.పరకాయించి,కల్లం,చూరు,మండి,ఓనగాయలు,మోడువారటం,పెయ్యి,పైలంగా,అలపటదాపట,సవారి కచ్చురాలు లాంటివి మరికొన్ని ఎత్తి రాయొచ్చు.

 

రవివీరెల్లి కవిత్వం వెనుక నిర్దిష్టమైన సాధన కనిపిస్తుంది.కవిత్వం కోసం కుదుర్చుకున్న చూపు,పట్టుకున్న పరికరాలే రవి వీరెల్లిని ప్రత్యేకంగాచూపుతాయి.

వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే!

ప్రయత్న పూర్వకంగానే యంత్రమయం చేసుకున్న బ్రతుకుల్ని కూడా కాలం తరుముతూనే ఉంటుంది. నిర్విరామంగా సాగిపోయే ఆ పరుగులో తుప్పట్టిన యంత్రాల వాసనే ఎటు చూసినా. ఆ పరుగైనా కాస్త జీవంతో నవ్వాలంటే మనల్ని ప్రేమించే ప్రకృతి సహాయం ఎంత అవసరమో, మూర్ఖుల్లా కళ్ళుమూసుకుని పరుగెడితే ఏం కోల్పోతామో సుస్పష్టంగా, సూటిగా, సరళమైన వాడుక భాషలో ‘సుహానా సఫర్ ‘ కవితలో చెబుతారు ఇక్బాల్ చంద్. 

iqbal

ప్రకృతి సౌందర్యానికి ఒక చిరునామా కోనసీమ. అక్కడి అందాల్ని పచ్చగా శ్వాసిస్తూ గోదారి పరవళ్ళలాంటి పదాలతో మనకు వర్ణించి చెప్తాడు కవి. మనసారా, తనువారా అక్కడి ప్రకృతి ప్రేమని అనుభవిస్తూ తన దాహార్తిని తీర్చుకోవాలనుకుంటాడు. ఏడ్చే బిడ్డను అక్కున చేర్చుకుని లాలించే తల్లి లాంటిది కోనసీమ అంటాడు మొదటి వాక్యంలోనే. అలా తల్లితో సమానమంటూ అగ్రతాంబూలమిచ్చేయడంలోనే తెలుస్తుంది అక్కడి ప్రకృతి మనకందించే ప్రేమ ఎలాంటిదో.

ఏడ్చే బిడ్డను లాలించి

          స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

          చందమామ చేపపిల్లనై ఎగురుతూ

          దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

అంతటి ప్రకృతి సౌందర్యానికి వర్షం కూడా తోడైతే ఇక భావుకుల పరిస్థితి చెప్పేదేముంది. మానసికానందానికి సమయం కేటాయించుకోలేని దైనందిన జీవితాలు ఎడారిలో పయనిస్తున్నట్టే ఉంటాయి. మనసనేది సంతోషపడకపోతే కళ్ళలోకి వెలుగెలా వస్తుంది మరి? అందుకే

ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

           కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

అంటాడు.

 

కోనసీమ అందాలు చూశాక మనసు తడవని మనిషుండడు. మచ్చుకైనా భావుకత్వం లేని మనిషైనా సరే, అక్కడి ప్రకృతిని కళ్ళార్పకుండా చూస్తాడు. అనుభూతులూ , స్పందనలూ అవసరం లేని కఠినమైన మనిషయినా, అక్కడున్నంతసేపూ, గోదారి నీళ్ళలో కాళ్ళు తడుపుకుంటూ నాట్యమాడే పచ్చని చెట్టవుతాడు. అది చెప్పడానికే

 

ఇక్కడ పాషాణ కత్తులైనా

            విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

అంటాడు కవి.

 

నాగరికత అని అబద్ధం చెప్పుకుంటూ తిరిగే ఈ నాటి బ్రతుకుల్ని రక్షించేది, రక్షించాల్సిందీ ప్రకృతి ఒక్కటే. ప్రకృతిని సంరక్షించుకోలేకపోతున్నాం. ప్రేమించలేకపోతున్నాం. కనీసం ఆటవిడుపుగానైనా ప్రకృతిని కాసేపు చూస్తూ మన కళ్ళని వెలిగించుకోగలిగితే, పచ్చని పాటని కాసేపు వినగలిగితే, బ్రతుకు పరుగు అహ్లాదంగా సాగుతుంది.

  అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

            మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే

మనిషికి ఏనాటికైనా ప్రకృతే గమ్యమని చెప్పడానికి ఇంతకంటే శక్తివంతమైన వాక్యం వేరే అవసరం లేదనుకుంటాను.

 

పూర్తి కవిత:

 

  సుహానా సఫర్

————

  ఏడ్చే బిడ్డను లాలించి

               స్తన్యం పట్టే అమ్మ కోనసీమ

               వర్షం వచ్చి తడిసినా సరే

               కిటికీ తెరిచి చూపుల్తో అల్లుకోవాల్సిందే

               వెలిసిపోయే ఊపిరి చిత్రాలపై

               కొత్త రంగులు పూస్తాయి

               ఎడారిలో తడారి ఆరిన కంటివొత్తులు

               కోనగాలి తాకి మళ్ళీ దీపిస్తాయి

               చిన్న పాయల నీళ్ళ జారుడు లోకి

               చందమామ చేపపిల్లనై ఎగురుతూ

               దాహాన్ని కసితీరా తీర్చుకుంటే బావుండుననిపిస్తోంది

               ఎక్కడి దుఃఖితుల చెంపల్ని తుడవటానికో

               ఆకుల సందుల్లోంచి జారిపోతూ మబ్బు చాపలు

               కాలం తరిమే బ్రతుకులై తేలిపోతూంటాయి.

               జల్లు పడుతూ … ఊగుతున్న చేట్లూ …

               అంతర్ముఖంగా మాత్రమే పలకరించే

               ఇంకా లిపి లేని ఏ భాషో ఆవిష్కరించుకుంటుంది.

               ఏ గంధర్వుడు వదిలి వెళ్ళిన స్వప్నాంతర్యమో

               పచ్చ శాలువా కప్పుకుని నడుస్తున్న

               నిండు గర్భిణీ గుంభనపునవ్వులా ఉంది

               ఎవరూ అల్లని ఈ పహ్చ తివాచీ మీంచి నడుస్తుంటే

               గోలీలాడుతూ పోగొట్టుకున్న క్షణాలు పలకరిస్తాయి

               గుండె ముడతలిప్పుతుంటే

               ఎన్ని నగ్న ప్రపంచాలు రెప్పలు తెరిచి నవ్వుతాయో

               ఇక్కడ పాషాణ కత్తులైనా

               విత్తులై పాతుకుని మొక్కలై ఎదగాల్సిందే

               ఇక్కడి ప్రతీ ఆకుకూ తెలుసు ప్రకృతి రహస్యం

               దాహార్తుల పెదాల్ని ఎలా స్పృశించాలో

               ఇక్కడ కదిలే ప్రతి గాలి పైటకూ తెలుసు

               ప్రకృతి కొత్త రుతువై మనిషిని కవిత్వం చేస్తుంది

               ఈ అనాథస్వామ్యంలో మనిషిని రక్షించేది ప్రకృతే

               అనాగరికపు అబధ్థపు గదుల్లోంచి

               మనిషి వెతుక్కుంటూ పోవాల్సింది ప్రకృతి లోనికే.

– ప్రసూన రవీంద్రన్ PrasunaRavindran

సైరన్ మోతల మధ్య మేలుకున్న స్వరం

devipriya

దేవీప్రియ

దేవిప్రియ సాహిత్య ప్రస్థానం గురించి వ్యాసాలను ‘సారంగ’ ఆహ్వానిస్తోంది. 

 

విశాఖ మొజాయిక్ సాహిత్య సంస్థ, ఎస్వీ ఫౌండేషన్ సంయుక్త నిర్వహణలో ప్రసిద్ధ కవి, ఎడిటర్ దేవిప్రియ సాహిత్యానుశీలనం ఏర్పాటు చేసిన సందర్భంగా ఈ వ్యాసం పునర్ముద్రిస్తున్నాం. ఈ వ్యాసం అఫ్సర్ 1992 లో వెలువరించిన సాహిత్య వ్యాసాల సంపుటి “ఆధునికత- అత్యాదునికత” నించి తీసుకున్నాం. ఇది ఇరవై వొక్క సంవత్సరాల కింద రాసిన వ్యాసం కాబట్టి,  ఇందులో అఫ్సర్ చేసిన విశ్లేషణ  అంత సమకాలీనం కాకపోవచ్చు. 

1970లలో వొక సంధికాలానికి సమాధానంగా బయలుదేరిన విప్లవోద్యమం విలువైన  కవిత్వ వారసత్వాన్ని మిగుల్చుకుంది. కవిత్వ ప్రయోజనానికి స్పష్టమైన గిరి గీసింది. అభ్యుదయోద్యమంతో స్థిరపడిన లక్ష్యనిబద్ధతతొపాటు నిమగ్నత అనే మరో ఆచరణాత్మకమైన పదం కవిత్వ విమర్శలో చేరింది. నిబద్ధతకీ, నిమగ్నతకీ మధ్య వొక వూగిసలాట ప్రారంభమైంది. కవికి నిబద్ధత వుంటే చాలదు, నిమగ్నత కూడ అవసరమేనన్న వాదం వొకవైపు సాగుతుండగా, మధ్యతరగతి కవుల్లో ఆశయానికీ, ఆచరణకీ మధ్య అంతరం ఏర్పడింది. ఇక్కడ రెండు అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి. మొదటిది విప్లవోద్యమ ప్రత్యక్ష ప్రభావం. రెండవది ఆ ప్రభావాన్ని జీవితంలో అన్వయించుకోగలిగినా భౌతిక పరిస్థితులు లేక పరోక్షంగా విప్లవ భాగస్వామ్యం తీసుకోవడం … శివారెడ్డి, దేవిప్రియలవంటి సీనియర్ కవులనుంచి గుడిహాళం రఘునాధం, నందిని సిద్ధారెడ్డి దాకా ఈ విధంగా ఒక వర్గీకరణ కిందికి వస్తారు. అయితే  శివారెడ్డికీ, ఈ వరసలోని మిగిలిన కవులకీ మరో తేడా వుంది. మిగిలిన కవులతో పోల్చినప్పుడు శివారెడ్డిలో అంతర్ముఖత్వం తక్కువ. వీళ్ళందరితో పోల్చినప్పుడు దేవిప్రియలో అంతర్ముఖత్వం ఎక్కువ. దీని కారణాలు ఆయా కవుల భౌతిక జీవన పరిస్థితుల్ని బట్టి వుంటాయి. వీళ్లందరి మీద పని చేస్తున్న ప్రభావాలు వొక్కటే. కాని వీళ్లలో వొక్కొక్కరిది వొక్కొక్క తరహా జీవితం.

దేవిప్రియ జీవితం వడ్డించిన విస్తరి కాదు. ‘పొగాకు కంపెనీ సైరన్ మోత ‘ జీవితాన్ని శాసించే నేపథ్యంలో దేవిప్రియ పుట్టేరు. ‘ఒక గుడిసె కథ’ కవితలో దేవిప్రియ తన కవిత్వానికి ప్రాధమిక ముడిసరుకులేమిటో చెప్పారు. తన పంచేంద్రియాల ద్వారా సంపాదించుకునే జ్ఞానం కవితకి ఎప్పుడూ ప్రాధమికమైందే. ప్రేరణలు ప్రభావాలుగా స్థిరపడకముందు కవిలో నిక్షిప్తమైన భావసంపుటి అది. వ్యక్తి జీవన సారాన్ని సాంద్రతరం చేసేవి ఈ భావాలేనని ఫ్రాయిడ్ అంటాడు. దేవిప్రియ జీవన తాత్వికతని నిర్దేశించి చూపుడువేళ్లు ‘ఒక గుడిసె కథ’లో కనిపిస్తాయి.

“ఈ ‘గుడిసెలో’ నేనా ప్రపంచం వుదయించింది అని కవి అంటున్నప్పుడు ఆ ప్రపంచం కేవలం భౌతిక ప్రపంచం కాదు. కొత్త వ్యక్తిత్వాన్ని రూపుదిద్దే తాత్విక ప్రపంచం. ఈ కవితలో గతం మీద జాలి, ప్రేమ మాత్రమే కాదు వర్తమానం నుంచి భవిష్యత్తులోకి  సాధికారికంగా నడిచి వెళ్లగల ఆత్మస్థయిర్యం వుంది.

అయితే దేవిప్రియ ఆలోచనల మీద ముద్ర వేసిన పరోక్ష అనుభవాల ప్రస్తావన ‘పుట్టినరోజు గురించి’ అనే కవితలో వుంది.

నా పుట్టినరోజుదేముంది

ఒక కాడ్వెల్ తరువాత

ఒక శ్రీశ్రీ తరువాత

ఒక పాణిగ్రాహి తరువాత

ఒక చెరబండరాజు తరువాత

పుట్టినవాణ్ని నేను” అంటారు.

ఇక్కడ సూచించిన నాలుగు పేర్లు కేవలం   పేర్లు కాదు. ఈ వరస క్రమంలో ఒక చారిత్రక వికాసం వుంది. ఆధునిక కవిత్వంలో సామాజిక చైతన్యం ఎన్ని మలుపులు తిరిగిందో ఈ నాలుగు పాదాల్లో కనిపిస్తుంది.

ఈ రెండు కవితలు ముందు చదివితేగాని కవిగా దేవిప్రియ యేమిటో పూర్తిగా అర్ధమయ్యే అవకాశం లేదు. ‘పైగంబరకవి’గా కన్ను తెరిచిన దేవిప్రియ ‘నీటిపుట్ట’లో ఏ వర్గం భావజాలానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఈ కవితల్లో స్పష్టంగా కనిపిస్తుంది. “కవిత్వ నిత్య నిబద్ధం” అని ఆయన నమ్ముతారు. అందుకే చిరకాల స్వప్నాన్ని వాస్తవం చేసిన ” ‘శ్రామికస్వర్గం’ నరకంగా మారుతున్నప్పుడు నిస్సంశయంగా నిరసన వ్యక్తం చేయగలిగారు.

తూర్పు యూరప్‌లో సంభవించిన పరిణామాలు ఏ సామ్యవాద కవికైనా ఆశనిపాతం వంటివే. గ్లాస్‌నొస్త్, పెర్రిస్త్రోయికాల ముసుగులో సోవియట్‌లో ప్రవేశించిన పెట్టుబడిదారీ స్వభావం  ఇక సోషలిస్టు వ్యవస్థ స్వప్నప్రాయమేనని భయపెట్టింది. మనిషి ఆనందానికి ఏ వ్యవస్థ సరిపడ్తుందో తెలియని గందరగోళం యేర్పడింది. ‘ఏది నీ మానవాంశని పరిపూర్ణం చేస్తుందో నాకు అంతుబట్టడం లేదు’ అని వేదన వ్యక్తం చేస్తారు. “ఎర్రబల్బుల్లా వెలిగిన కళ్లలో కలర్ టీవీ వర్ణబింబాలు కదలాడుతున్నప్పుడు, తరతరాల ధార్మిక దాస్యాన్ని ధిక్కరించిన చేతుల్లో కోకాకోలాలు చెమ్మగిల్లుతున్నప్పుడు” సామ్యవాది హృదయ ప్రకంపనలు ఇలాగే వుంటాయి.

ఇదే ధోరణిలో రాసిన మరొక అద్భుతమైన కవిత ‘హిట్లర్ నవ్వు’. ఇది ప్రజాస్వామ్య శిలలమీద ఎర్రపూలు రాలుతున్న రుతువు – అంటూ మొదలయ్యే ఈ  కవితలో దేవిప్రియ రాజకీయ భావాల తీవ్రత తెలుస్తుంది. ఒక శ్రీశ్రీ, ఒక చెరబండ రాజు వారసత్వం నుంచి వచ్చిన కవి మాత్రమే ఈ భావాన్ని ఇంత బలంగా వ్యక్తం చెయ్యగలడు. ఈ రెండు సందర్భాల్లో కూడా దేవిప్రియ కవిత్వ సంవిధానం ప్రత్యేకంగా గమనించాలి. ఇక్కడ కవి పదం మీద ఎక్కువ దృష్టి నిలుపుతాడు. సాధారణంగా  దేవిప్రియ కవితకి ఒక రూపపరిమితి వుంది. అలవాటుపడిన గేయ చందస్సుల నడక ప్రతి కవితలో కనిపిస్తుంది. ‘హిట్లర్ నవ్వు’ ‘ఆదిరహస్యం మానవుడు’ కవితల్లో కూడా ఆ నడక వుందిగానీ, భావాల తీవ్రత దాన్ని అధిగమించింది. కవితలో కొసమెరుపులు ఇవ్వడం ‘రన్నింగ్ కామెంటరీ’ లక్షణం. ఆ లక్షణాన్ని మామూలు కవితలో కామిక్ రిలీఫ్‌గా మార్చుకుని నిర్మాణంలో ఒక సౌలభ్యం సమకూర్చారు దేవిప్రియ. దీనివల్ల ఆయన ఇతర ఆధునిక కవుల్ని బాధిస్తున్న నిర్మాణ సంక్లిష్టత నుంచి బయటపడ్డారు.

గొప్ప ఉద్వేగాన్ని కూడా నింపాదిగా చెప్పడం దేవిప్రియ లక్షణం. కార్యకారణ  సంబంధాలు తెలిసి వుండడం వల్ల ఈ కవిలో అకారణమైన ఆవేశం నుంచి పదచిత్రాలు అదేపనిగా రాలవు. ఆయన భావాన్ని ఒక పదచిత్రంతోనే చిత్రిక పడ్తాడు. తాత్విక సంకోచాలు లేనప్పుడు మాత్రమే కవిలో ఈ స్పష్టత సాధ్యపడుతుంది.

వైరుధ్యాల చిత్రీకరణలో దేవిప్రియ కవిత్వ వ్యక్తిత్వం  కనిపిస్తుంది. నిబద్ధత వుండి ఉద్యమాలలో నిమగ్నం కాలేక పోయాననే ఆవేదన చాలా సందర్భాల్లో వ్యక్తమవుతుంది. కాని ఇలాంటి అనేక రకాల వైరుధ్యాల పొరల్ని విప్పి చూసుకునే నిజాయితీ దేవిప్రియలో వుంది. నిజానికి నిబద్ధత విషయంలొ ఏమాత్రం తెలివి వుపయోగించకుండానే ఎవరినైనా ఇట్టే మోసం చెయ్యవచ్చు. కాని లోపల నిజమైన కవి దేవులాడుతున్నవాడు కవిత్వంలో పగటి వేషం వెయ్యలేడు. ఉద్యమం గాలి అయినా సోకని కవులు కూడా ఒక ఫాషన్‌గా ఉద్యమ కవిత్వం రాస్తున్న ఈ కాలంలో ఒక కవి నిమగ్నత గురించి నిజాయితీగా కంఠం విప్పడం విడ్డూరంగానే కనిపించవచ్చు.

 

గార్డెన్ రెస్టారెంట్ చల్లగాలి

రుచిమరిగిన వాణ్ణి నేను

ఫ్యాను విసిరే చల్లగాలిలో

శరీరాన్ని ఆరేసుకోవడానికి

అలవాటు పడ్డవాణ్ని నేను

అయినా అడివీ

నువ్వంటే నాకిష్టం‘ (‘అమ్మచెట్టు’లో)

ఇక్కడ అడవి దేనికి సంకేతమో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. 1970లలో ఒకవైపు ఉద్యమం తీవ్రతని అందుకుంటున్నప్పుడు మరోవైపు మధ్యతరగతి జీవితంలోకి నయా సంపన్న లక్షణాలు ప్రవేశిస్తున్నాయి. ఆర్ధికంగా కొద్దికొద్దిగా స్థిరపడుతున్న ఈ వర్గంలో అసంతృప్తికి తగిన కారణాలు లేవు. సామాజిక చైతన్యం వున్న మధ్యతరగతి మేధావులలో ఈ స్థితిపై అసహనం వుంది. ‘అడవి’ కవితలో దేవిప్రియ ఈ స్థితిని బలంగా వ్యక్తం చేశారు. అంతేకాదు,

ఈ దేశాన్ని

ప్లాస్టిక్ తీగల విషపుష్పాల ఉద్యానవనాల నుంచి కాపాడడానికి,

ఏదో ఒకనాడు,

నేను నీ సాయమే కోరతాను..” అని వాగ్ధానం చేయగలిగారు..

1984లో దేవిప్రియ ఇలాంటిదే మరో కవిత రాశారు. ఇది దాదాపు ‘అడవి’కవితకు ఒకరకమైన కొనసాగింపు. ఎనభయ్యో దశకం వచ్చేసరికి విప్లవోద్యమం మీద పెట్టుకున్న ఆశలు అడియాసలయ్యాయి. గుత్తపెట్టుబడిదారీ మనస్తత్వాల ముందు గొప్ప ఆదర్శాలు కూడా వీగిపోతాయని తీవ్రవాద కమ్యూనిస్టులు కూడా మరోసారి నిరూపించారు. సిద్ధాంతాలను పణంపెట్టి ‘వ్యక్తి’వాద ముఠాలుగా చీలిపోయారు. దేవిప్రియ అన్నట్టు ‘వర్తమానానికి నిన్నటి గుణపాఠాల వర్తమానం అదేమిటో ఇంకా అందలేదు. నేను నడుస్తోన్న ఈ రోడ్డు నా కళ్లు యేరయ్యేదాక నా కాళ్ళు తెడ్లయ్యేదాకా ముగిసేట్టు లేదు.’. ఎదురుచూపులు ఫలించకుండానే కళ్లముందు మళ్లీ చీకటి అలుముకుంది. రాజకీయ, సామాజిక రంగాలలో ఏర్పడిన ఈ స్తబ్దతని కవి ‘అర్ధరాత్రి నిశ్శబ్దంలోని అనిర్వచనీయ శబ్దం’గా అభివర్ణించారు. ఈ ‘నిశ్శబ్దశబ్దం’ తనని భయపెడుతుందనడంలో ఒక మానసిక అంతరాన్ని సూచించారు.

పుస్తకాల పిరమిడ్‌లో మరొక మమ్మీగా మారిపోతానేమోనన్న ఆందోళన వెలిబుచ్చారు. చివరికి ఒక ఆశ. దిగులు  తనని ఎంతగా ఆవరిస్తున్నా నిరీక్షణ ఆగిపోదన్న ధైర్యం. ఉద్యమంలో ఏర్పడిన అవరోధాలు తొలగిపోయి రేపటి చరిత్రని కొత్త రంగుల్లో రాయగలనన్న ధీమా. దేవిప్రియలో Negative element ఏ కోశానా లేదనడానికి ఈ కవిత ఒక్కటే చాలు నిదర్శనంగా.

అఫ్సర్

ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ‘చెర’ కవిత

వందేమాతరం

 

ఓ నా ప్రియమైన మాతృదేశమా

తల్లివి తండ్రివి దైవానివి నీవేనమ్మా

దుండగులతో పక్కమీద కులుకుతున్న శీలం నీది

అంతర్జాతీయ విపణిలో అంగాంగం తాకట్టు పెట్టిన అందం నీది

సంపన్నుల చేతుల్లో మైమరచి నిద్రిస్తున్న యవ్వనం నీది

 

ఊసినా దుమ్మెత్తి పోసినా చలనంలేని మైకం నీది

కోతకొచ్చిన చేనులో కలుగులు తవ్వుతున్న

ఎలకల్నీ పందికొక్కుల్నీ భరిస్తూ నుంచున్న “భారతి” వమ్మా

నోటికందని సస్యశ్యామల సీమవమ్మా

వందేమాతరం వందేమాతరం

 

ఒంటిమీద గుడ్డలతో జెండాలు కుట్టించి

వివస్త్రనై ఊరేగుతున్న చైతన్య నీది

అప్పుతెచ్చి లేపిన మిద్దెల్లో

కాలుగాలిన పిల్లిలా తిరుగుతున్న దీనత్వం నీది

ఎండిన స్తనాల మీదికి ఎగబడ్డ బిడ్డల్ని

ఓదార్చలేని శోకం నీది

ఆకలికి ఎండి మాడి ఎరువు సొమ్ములతో వీధినబడ్డ సింగారం నీది

అమ్మా భారతీ నీ గమ్యం ఏమిటి తల్లీ

వందేమాతరం వందేమాతరం

cherabandaraju(1)

నేను డిగ్రీ ఆఖరి ఏడు  చదువుతున్నప్పుడు మిత్రుని ద్వారా ఈ అగ్ని గోళం వంటి కవిత పరిచయమై నాలో పేరుకున్న జఢత్వాన్ని పటాపంచలు చేసింది. చదవగానే అటు దు:ఖమూ ఆగ్రహమూ కలగలిసి నాభినుండి తన్నుకు వచ్చే దుఖాగ్రహ శకలాల ప్రేరేపితమైన ఉల్కాపాతం దాగివున్న అక్షరజ్వాల ఈ కవిత.

చెర తన కవితకు ప్రేరణ ఏమిటో చెప్తూ నా దేశ ప్రజలే నా కవితా వస్తువులు అంటాడు. దిగంబర కవితోద్యమం నా కవితావేశానికి వేదిక కల్పించి వెన్నెముక ఇచ్చి నిలబెట్టింది. మార్క్సీయమైన శాస్త్రీయ అవగాహన నా కవితాధ్యేయానికి స్పష్టతను ప్రసాదించింది అంటారు. దిగంబరకవిగా ఒకటి రెండు సభల్లో తనపై రాళ్ళు వేయించింది, ఎమర్జెన్సీలో జైల్లో ఒక ఆర్,ఎస్.ఎస్. వ్యక్తిచేత కొట్టించిందీ ఈ గేయమేనని చెప్పారు. అలాగే వందేమాతరం బంకించంద్ర వందేమాతరంనకు అనుకరణా కాదు, అనుసరణా కాదు. దానికి పూర్తి వ్యతిరేకమైనదన్నారు. వందేమాతరంలో బంకించంద్ర సుజలాం సుఫలాం అన్నప్పుడు మన భారతదేశ జల ఖనిజ సంపద మన కళ్ళముందు కదలాడుతాయి. కాని అవి ఎవరికి చేరాలో వారికి చేరడం లేదు కదా అని అందుకనే తాను నోటికందని సస్యశ్యామల సీమవమ్మాఅని రాసానన్నారు. ఈ వందేమాతరం దిగంబర కవుల మూడవ సంపుటంలో మొట్టమొదటి గీతం.

    ఈ తరానికి చెరబండరాజు చిరునామా. ఈ కవిత్వ తరానికీ చెరబండరాజు చిరునామానే. ఆయన కవితలలో దాగివున్న అనంతమైన ఉత్ప్రేరక శక్తి ప్రతి పద చిత్రంలోను దాగివున్న విస్ఫోటనాతత్వం వేరెవ్వరిలోనూ కానరావు. దిగంబరకవులందరిలోకి భవిష్యత్ తరంలోకి మార్పును ఆహ్వానిస్తూ దానికో శాస్త్రీయమైన సశస్త్రబలోపేతమైన మార్క్సిస్టు అవగాహనను చేర్చుకుంటూ వర్తమాన తరానికి దిక్సూచిగా తన ఆచరణ ద్వారా ముందు పీఠిన నిలిచిన వారు చెరబండరాజు కావడం యాధృచ్చికం కాదు. అందుకే చెరబండరాజు మనందరికీ చిరస్మరణీయుడు. 

వరుస మారిన వందేమాతరం ఇప్పటికీ మనకు  సజీవ సాక్ష్యం. నేటి కార్పొరేట్ శక్తులు ప్రభుత్వాన్ని తమ చేతుల్లోకి తీసుకొని తమ అంతర్జాతీయ వ్యాపార లాభాల స్వలాభాలకు భారతదేశ అపార ఖనిజ సంపదను దోచుకుపోవడానికి సెజ్ ల పేరుతో పారిశ్రామిక అభివృద్ధి పేరుతో విధ్వంసకర అభివృద్ధి నమూనాను బలవంతంగా రుద్దుతూ పర్యావరణాన్ని  ధ్వంసం చేస్తూ, మనుషులలో నైతికతను చెరుస్తూ, మానవత్వాన్ని చెరబడ్తూ, ఓ అభధ్రతా బావాన్ని మనలోకి ప్రవేశపెడ్తూ ఈ దేశ మనుగడను ప్రశ్నార్థకం చేస్తున్న ఈ సందర్భంలో చెర వందేమాతరం మరోమారు మనం ఆలపించి ఆచరణవైపు కదలాల్సిన యుద్ధసందర్భం ఇది.

–కెక్యూబ్ వర్మ

కెక్యూబ్ వర్మ

ఆగ్రహం, ఉద్వేగం…సమంగా కలిస్తే ఈ కవిత!

saikiran

సామాజిక పరిణామ దశల్లోని మార్పులకనుగుణంగా కవిత్వంలో ఎన్నెన్నో మార్పులు వచ్చాయి. ఈ పరిణామాలు కవితా వస్తువులో మార్పులకు కూడా దోహదపడ్డాయి. ఆయా పరిణామదశల్లో దిశలు మార్చుకుంటూ కవిత్వం ప్రవహిస్తూనే ఉంది. స్వరం మార్చుకుంటూ కవులు పయనిస్తూనే ఉన్నారు.

రాజకీయ, సామాజిక అవసరాల దృష్ట్యానైతే నేమి, మారుతున్న పరిస్థితులమీద ఆవేదనతో నేమి, చైతన్యాన్ని కలిగించే మిషతో కవితా వస్తువు మారటమే కాదు, భాష కూడా మారిపోతున్నది. కుహూ కుహూల కలస్వనాల నుండి, నినాద నాద ఘోషణలు, ప్రళయరావ గర్జనలు దాటుకొని తిట్లు, శాపనార్ధాలుగా అక్షరాలు రూపుదిద్దుకుంటున్నాయి, ధిక్కార స్వరాన్ని వినిపిస్తున్నాయి. సమాజాన్నో, సామాజిక వాస్తవాలనో ధిక్కరిస్తూ “మనువు నోట్లో xxxx xxx”, ”పైట తగలెయ్యాలనో” కవిత్వం వ్రాసిపడేయొచ్చు!  ఇది సహజమో అసహజమో తెలీదు. సరే ఇదంతా సామాజిక కవిత్వం మారుతున్న తీరుతెన్నులు.

అదే మరి జీవితాన్ని ధిక్కరించాలంటే? అలా కవిత్వం వ్రాయాలంటే! ఇటువంటి ప్రశ్నలు అప్పుడప్పుడు కుతూహలాన్ని రేకెత్తించేవి. అలానే, అజంతా, శ్రీశ్రీ, దిగంబర కవులు తదితరుల కవిత్వం చదివేప్పుడు వాటిలోని ఇంటెన్సిటీ  అనుభవిస్తున్నప్పుడు కూడా అలాంటి కుతూహలమే కలిగేది. దాదాపు 2004-2005 ప్రాంతాల్లో ఈక్రింది కవిత్వం కంటబడేంతవరకూ ఆ కుతూహలం కొనసాగింది. కవి కె.విశ్వ. ఇతర వివరాలు తెలియవు.

జీవితమంటే కోపం, ఆ కోపాన్ని ప్రదర్శిస్తూ ఓ నిర్లక్ష్యం, నిర్లక్ష్యానికి తగినంత రాజసం, రాజసంతోనే అక్షరాల్లో కొంత అరాచకత్వం, దానికి తోడు మరికాస్త ఉన్మాదం! వెరసి విశ్వ కవిత్వం. ఒళ్ళు గగుర్పొడించి, ఉద్వేగానికి గురిచేసే ఇలాంటి కవిత చదివి చాలా కాలమయ్యింది.

బ్రతికేస్తూ ఉంటాను (విశ్వ)

 

1

బ్రతికేస్తూ ఉంటాను

మహా జాలీగా

ఓల్డ్ మాంక్ సీసాలోనూ

సాని దాని పరుపు మీద మరకల్లోనూ..

ఎప్పటికీ పూర్తికాని కవితల్లోనూ..

 

మత్తులో కారు డ్రైవ్ చేస్తుంటే

నలభై రెండేళ్ళ నెరుస్తున్న జుత్తు

మోహపు గాలిలో క్రూరంగా ఎగురుతుంటుంది.

నా పక్క సీటు ఇప్పటికీ ఖాళీనే

నన్నెవరూ ప్రేమించలేదు

నేనెవరినీ ప్రేమించలేను

 

అసలు ఎవరు ఎవరినైనా ప్రేమించగలరా?

కనీసం ప్రేమంటే ఏమిటో తెలుసుకోగలరా?

రోడ్డు మలుపుల్లో నివురుగప్పిన ఏక్సిడెంట్లు

కుళ్ళిపోయిన కన్నీళ్ళలో తడిసి

మూలుగుతూ కుప్పలుగా పడిఉంటాయి

 

2

రైలు పట్టాలకీ చక్రాలకీ మధ్య

మృత్యువు మీసం మెలేస్తూ ఉంటుంది

మృత్యువు పెద్ద రంకుది

రోజూ లక్షలమందితో రమిస్తుంది

 

రైలులో కూర్చొని

డివైన్ ట్రాజడీలోని

మెటాఫిజికల్ ఎంటీనెస్ ని విశ్లేషించుకుంటున్న

నా పెదవులపైకి ఒకానొక నిర్లక్ష్యపు చిరునవ్వు

నాగరిక ఉన్మాదానికి చిహ్నంగా..

 

రైల్లో అందరికీ నత్తే

అందరూ నకిలీ తొడుగుల బోలు రూపాలే

ఎవడి చావు కబురు ఉత్తరం వాడే

స్టాంపుల్లేకుండా అందుకున్నవాడే

 

బ్రతుకులు ముక్కిపోయిన కంపు కొట్టే చోట

శృంగారం కూడా కాలకృత్యమే

ఇలాంటి కాలంలో

కవిత్వం గురించి మాట్లాడ్డానికి

క్షమించాలి.. నాకు గుండెలు చాలడం లేదు.

అయినా ఎందుకో ఈ పదాలు ఆగడం లేదు

కవిత్వమంటే విష కన్యకతో విశృంఖల రతీ క్రీడ

 

3

సగం చచ్చిన వాన పాముకీ

కుబుసం విడిచిన కాలనాగుకీ

తేడా ఉండొద్దూ?

 

నీకు చెప్పనే లేదు కదూ

నాటకాలన్నీ తెర వెనకే సాగుతాయి

తెరముందు అబద్దాన్ని చప్పరిస్తున్న

గుడ్డి ప్రేక్షకులు

 

నాటకానికి మధ్యలో బ్రేక్

బ్రేక్లో ప్రశ్న

అల్లాటప్పారావు అభినందనలని ఎన్ని సార్లు అన్నాడు?

సమాధానం చెబితే అమలాపురంలో 2 నైట్స్ 3 డేస్

అయ్యో చెప్పలేరా?

పోనీ ఓ క్లూ ఇవ్వనా?

అరవడబ్బింగు సినిమాలో హీరోయిన్ ఎన్ని చీరలు మార్చింది?

ఇదీ తెలీదా? ఐ యాం సారీ!

 

4

ఒకడుంటాడు

తీయని మాటల షుగర్తో బాధపడుతుంటాడు

హిపోక్రసీ గోడల్ని పగలగొట్టలేక

గుండె గదిలో గబ్బిలంలా వేలాడుతూ..

ఎవడి బ్రతుకులోనూ ధాటిగా ఒక నమ్మకాన్ని రాయలేడు

ఆవకాయ బద్దలాంటి అరిగిపోయిన వ్యాఖ్యానాలకి

జనాలు అలవాటు పడిపోయారని మురిసిపోతుంటాడు

 

వాడినని ఏం లాభం లే

ఈ దేశంలో బ్రతుకు చావు ముందు శ్రోత

Uncertainty లోని అందం చూడ్డానికి

బ్యాంకు లాకర్లో మూలుగుతున్న రంగు కాగితాలు తల్చుకుని

మురిసిపోయే వాళ్ళ కళ్ళు చాలవు

 

అందుకే

వాడిన కాగితం పువ్వులను

గాజుకుప్పెల్లో అమర్చుకోవడం వినా

అందం అంటే ఏంటో తెలీని శవాల మధ్య..

నిర్లక్ష్యాన్ని నిర్మోహంతో హెచ్చవేసి

నిషాని కూడి విషాదాన్ని తీసేసి..

మహ దర్జాగా..

ప్రపంచాన్ని దబాయించి మరీ

బ్రతికేస్తూ ఉంటాను.

 

***

 

ఏది ఏమైనా, వైయుక్తికమైన ఆవేదననైనా, సామాజిక సంవేదననైనా కవిత్వీకరించేటప్పుడు – నిరాశా నిస్పృహలతో వెలువడే ధర్మాగ్రహానికి, తిట్లు శాపనార్ధాలతో వెలువడే దురుసుతనానికి తేడా తెలుసుకోగలగాలి. కోపాన్ని వ్యక్తం చేయటానికి, అక్కసు వెళ్ళగక్కటానికి ఉన్న అంతరం అప్పుడే తెలుస్తుంది.

 – కొండముది సాయికిరణ్ కుమార్

ఒక సగటు మనిషి అంతరంగ చిత్రం- క్రాంతి శ్రీనివాస్ కవిత్వం

రమాసుందరి

క్రాంతి శ్రీనివాస రావు కవిత్వం నాకు ఫేస్ బుక్ ద్వారానే పరిచయం. ఆయన కవిత సంపుటి “సమాంతర ఛాయలు”  విడుదలకి ముందు వచ్చిన సమీక్షలు పేపర్లలో, వివిధ లింకుల్లో చదివాను. పుస్తకం తెప్పించుకొని, ముందుమాటలు, వెనుక మాటలు చదివేశాను. ఈయన కవితలు ప్రాచుర్యం పొందటానికి కారణాలు ఇంతకు ముందే రాసేసారు. ఈవెంట్, మెమెరీ, మెటాఫర్ ని కలిపి కుట్టాడన్నారు (అఫ్సర్). మట్టిలో కవితా సేద్యం చేసాడన్నారు(అరుణ్ సాగర్). ఈయన కవితలు “పాప్ బీజింగ్స్ స్వరాలకు నినాద రూపాన్నిచ్చిన ట్రేసీ చాపమెన్ లాగ ఉన్నాయన్నారు (కవి యాకోబ్). “శ్రీనివాసరావు గారి ప్రధాన భావప్రవాహం మానవాళిని నడిపించే ప్రయత్నంగా ఉందన్నారు” (బి.వి.వి. ప్రసాద్). “రైతులు, రైతుకూలీలు, మహిళలు, దళితులు, బహుజనుల అస్తిత్వ సమస్యలను ఒక పేషన్ (ఫేషన్ కాదు) తో పట్టించుకొన్నాడన్నారు” (ఖాదర్ మొహియుద్దీన్). ఈయన కవిత్వం “చనుబాలుకు బదులు కనుబాలు” కార్చింది అన్నారు (సీతారాం). ప్రసేన్ గారు ఈయన రాతల్లో ట్రెడీషనలిజం , మోడ్రనిజం, పోస్ట్ మోడ్రనిజం మూడు కలిసి ఉన్నాయని అంటారు. (మనలో మాట ఇందులో చాలా పదాలు నాకు తెలియవు)

ఇంతమంది మేధావులు వాళ్ళ పరిజ్ఞానాన్ని అంతా వెచ్చించి ఈయన కవితలను విశ్లేషిస్తే, కవిత్వం గురించి అ ఆ లు తెలియని నేను రాయబోవటం సాహసమే అవుతుంది. అయినా ఒక  పాఠకురాలిగా నాకు కూడ హక్కు ఉందని, ఈ కవితల గురించి నా దృక్కోణం నేనూ రాసి చూద్దాం అనిపించి మొదలెట్టాను.

అసలీయన ఇన్ని కవితలు ఎలా రాయగలిగాడు ఇంత తక్కువ కాలంలో?  ఆలోచనలకు అక్షర రూపం కవులు అంత సుందరం గా ఎలా ఇవ్వగలరు? అనే నా ప్రశ్నకు ఆయన ఏ కవి ఇవ్వనంత సరళంగా సమాధానం ఇచ్చాడు. ఇలాంటి కవులు కవిత్వంలోనే ఆలోచిస్తారు. కవిత్వంలోనే శ్వాసిస్తారు. దానికి కావలిసిన ముడి సరుకు పద సంపద, ఈయన ముందే పుష్కలం గా సముపార్జించుకొని కవితా సేద్యం మొదలు పెట్టాడనిపించింది.

“జ్ఞాపకాల ప్రవాహం లోంచి కొట్టుకొచ్చి/ఆలోచనల సుడిగుండాల్లో చిక్కుకున్న/ నాలుగు వాక్యాలను ఏరుకొన్నానీపూట. గణుపులున్న చోట/ వంకర్ల వద్ద/ పొయ్యిలోకి వంట చెరుకును విరిచినట్లు/విరిచేశాను మాటల్ని. ఆనందం పంచాల్సినప్పుడో/ అర్ధం చెప్పాల్సిన దగ్గరో/ ప్రశ్నను సంధించాల్సిన చోటనో/ వాక్యాలను జాగ్రత్తగా తుంచిపెట్టాను. ప్రతీకలతో పదిలంగా చుట్టాను.” అంటూ అరటి పండు వలచినట్లు  పాఠం చెప్పేసాడు. (క్షతగాత్రం)

మనసులోని భావాలు పుటలలో అక్షరాలు గా మారాలంటే మా బోటి వాళ్ళు తల క్రిందులుగా తపస్సు చేయాలి. అహర్నిశలు శ్రమించాలి. కాని ఈయన అలవోకగా ఆ పని సాధించటమే కాకుండా, అంతే సులువుగా భోధించేస్తున్నాడు. ” మనసును మాటల్లో పోసి/ అవసరమైనప్పుడు మార్మికత ఇచ్చాను. అవి వంతెనల్లా/ మెట్ల వరుసల్లా/ వీణా తంత్రుల్లా/ బాణా సంచుల్లా/ ఆయుధాల పాదుల్లా మారి భావాలను పండిస్తున్నాయి.” అని గర్వంగా తన సాహిత్య పంటను మనకు ప్రదర్శిస్తాడు.

అంతే కాదు అస్పష్టమైన తన ఆలోచనలకు ఒక రూపాన్ని ఇచ్చి, తను నేర్చుకొన్న జీవిత పాఠాలను మనకు వినిపించాలని అతి నిరాడంబరంగా అభిలషిస్తాడు.  “ఆకార నిరాకారాల మధ్య/ సంధి కుదిర్చి/ నిన్నటి రేపును ఈ రోజుతో కట్టి పడేసి/దర్శించిన జీవిత సత్యాలకు అక్షర రూపం సమకూర్చాలనివుంది/కవిసంగమంలో నిత్య కచేరీ చేయాలని వుంది.”   (సౌండ్ షేడ్)

కాని మళ్ళీ తనే, అర్ధవంతమైన మాటలు అందమైన కవితలుగా మారాలంటే అంత సులభం కాదని, చాలా శోధన జరగాలని కూడ చెబుతున్నాడు. ( మీ కవితలు చదువుతుంటే మీరంత కష్టపడ్డట్టు అనిపించటం లేదండి)

“అర్ధాలు మోస్తూ మాటలు/ వేల మైళ్ళూ/ మనసు తీరం వెంబడి నడవకుండా/ భావాల అలల్లో తడవకుండా/ వాక్యమై వొళ్ళు విరుచుకోవు. తెల్లకాగితంపై/ కవిత్వం కళ్ళూ తెరుచుకోదు, తీరిక సమయాలు కవిత్వపు కోరికలు తీర్చలేవు.” అని తీర్మానిస్తాడు. (ఖాళీ పాళీ) .

కవితలలో వ్యక్తీకరించిన అన్ని సంగతులు ఆణిముత్యాలు కాలేవు. మంది, మజ్జిగ చందాన సంఖ్య పెరిగే కొలది గుణ దోషాలు అనివార్యమౌతాయి. అయినా సరే “డోంట్ కేర్ ” అట.

“మనసు చెంబుకు/భావాల అరచేతులడ్డు పెట్టి/ఎంత అక్షర కళ్ళాపీ చల్లినా/అంతగా నా అజ్ఞానం రికార్డ్ చేయబడుతూనే ఉంది./అయినా ఆపాలని లేదు/ఒకప్పటి వాక్యాలుగానన్నా/వ్యాఖ్యానించబడతాయని/ అక్షర కాళ్ళాపీ ఆపకుండా చల్లుతూనే ఉన్నా/మనసును మాటలుగా మార్చి రువ్వుతూనే ఉన్నా.” (ఫైర్ బాక్స్) అంటూ ఆశాభావం వ్యక్తం చేస్తాడు.

కవి తాత్వికత, అంతర్గత ప్రపంచ దృక్పధం ఆయన కవిత్వానికి వనరులు అంటారు. ఈ విషయలో ఈయనది “అంతా … లెక్కే.”  “కొలవటం రానివాడు/ కొలువుకు పనికి రాడు. లెక్కలు రాని మనిషి, రెక్కలు తెగిన పక్షి ఒకటే. జరగబోయే సంఘటనలు అంచనా వేయటం రావాలి, ప్రకృతి ప్రమాదాలను ముందే కనిపెట్టే పశుపక్షాదుల్లా” అని మనల్ని గంభీరంగా హెచ్చరిస్తాడు. జీవితగమనానికి సంబంధించిన దృఢ నిర్ణయాలు వ్యక్తమవుతాయి ఈ కవితలో.

అంతలోనే మనసుకు, శరీరానికి జత కుదరటం లేదని సగటు మనిషి లాగా తెల్ల ముఖం వేస్తాడు. “సందేహాలతో మనసు/తీరని దాహంతో దేహం/ సమాంతర రేఖలుగా సాగిపోతున్నాయి. ఇప్పుడెందుకో/ దేహానికి సందేహం/ మనసుకి దాహం వేస్తోంది. మనసూ దేహం/ వెలుగు చీకట్లలా/ ఎప్పుడూ విరహాన్నేఅనుభవిస్తున్నాయి.” అంటూ మనసు విప్పుతాడు. (జతలేని జంట)

ఒక కవి పదే పదే తన కవితల మీద అభిప్రాయాలు పలువురి నుండి అడుగుతున్నాడంటే అతను తనను తాను సంపూర్ణం చేసుకోవటానికి ప్రయత్నిస్తున్నాడని అర్ధం చేసుకోవాలి. కళాకారుడు ఎవరికైనా  ఆ నిబద్ధత ఎంతో అవసరం. మన ప్రజా కవి శ్రీనివాసరావు గారికి ఆ ఆదుర్దా మరీ ఎక్కువ.  “గెలుపంతా ఆమెదే” కవిత చదివి నేను అసంతృప్తి వ్యక్తం చేసాను. ఆ కవిత ” కార్యేసు దాసి” శ్లోకానికి ఆధునిక రూపం లాగా ఉంది, మీరు స్త్రీల మీద నైతిక వత్తిడి పెంచుతున్నారని” చెప్పాను. బుద్దిగా విని ఒప్పుకొన్నారు. సహేతుకమైన విమర్శను ఆహ్వానించటమే కాదు, అన్వేషిస్తాడు ఈయన. తన పాఠకులతో ఇంకా అంటాడు “ప్రియ నేస్తమా/ నాతో మాట్లాడు కాసేపు/ మనసంతా ఆలోచనలే/తూర్పారబట్టుకోవాలొకసారి. నేస్తమా/ వాదులాడవా నాతో ఒక్కసారి భావాలను జల్లెడ పట్టుకోవాలి. తిరిగి తర్కించవా నాతో/ అందులో/ పనికొచ్చేవేవో/ లెక్కించుకోవాలి. ప్రియ నేస్తమా/ సాయం నిలబడవా/ హృదయానికి చిల్లు బడి హోరు గాలి వీస్తోంది.” అని తన అంతర్గత ఆవిష్కరణకు సాయం మనల్ని అర్ధిస్తాడు. (అన్వేషణ)

కవి జ్ఞాని. కవి తత్వవేత్త. కవి అనుభవశాలి. ఈ కవి కూడ జీవితాన్ని కాచి వడపోసి మనకందరికి కరతలామలకం చేయ బూనాడు. వదిలించుకోలేని బంధాల్ని,కాలాన్ని వెనక్కి తిప్పలేని అసాధ్యాన్నిలఘువుగా వివరిస్తాడు “జీవితమంటే/కాలం చెట్టుపై/ నీవు చెక్కిన /హృదయపు బొమ్మలోంచి  కారిన/ జిగురు బంక. జీవితమంటే/ కాలప్రవాహ వాలుపై/ ఒకే ఒక్కసారి ఆడే/ జారుడు బండాట.”. (చంద్రుని పై పాదముద్ర)

కవిత్వం వ్యాపారపరం అవటం కవులందరికి శోకావేశమే. అక్షరాలు అమ్ముడు పోవటం అంటే రక్తమాంసాలు కోసి ఇచ్చిన  నొప్పి నిజమైన కవికి ఉంటుంది. ఈయన తన వేదనను ఈ రకంగా అక్షీకరించాడు. ” వ్యాపార ప్రపంచం వీసాలిస్తుంటే/ కవితా కన్యలు అష్టదిక్కులా పాలిస్తున్నాయి. యాడ్ మాడ్ ప్రపంచమే/ కవిత్వకర్మాగారమై వింతవిపణిని నడిపిస్తుంది. మార్కెట్ మురికితో మాసిన కవితలను/ పేదల కన్నీటి తో కడిగి జలశీల ఉద్యమాలే కవితా వస్తువులుగా అక్షరసేనలు కదలాలిప్పుడు” అంటు తన కళాకారుడి గా తను ఎటో  ప్రకటించుకొన్నాడు.

ఈయన ప్రకృతి ప్రేమికుడు. చాలా మంది సూర్యుడు, చంద్రుడు, చుక్కల మీద కవితలల్లినా, ఈయన స్కూలు వేరు. తను చదివిన విజ్ఞాన శాస్త్రాన్ని కవితల్లోకి అనువదిస్తాడు. అందులోనూ సూర్యుడు తన కవితల్లో ప్రియవస్తువు. ఒకసారి “ఎత్తుకు పోయిన నిద్రను/ వెదుకుతూ ఉంటే /రోజు ఎదురయ్యే దూరపు చుట్టం/ రానే వచ్చాడు/దొర్లటం ఆపి/ పరిగెత్తటం మొదలెట్టమన్నాడు,” అని విసుక్కొంటాడు.( పడక.. నడక) “ఒరేయ్/ నాలుగు నిప్పులు పోయండ్రా/ సూర్యుని నెత్తిమీద. వాడికేమొచ్చిందో/పొడ అగ్గి రూపంలో/కొంపలో జొరబడి/ఉన్న కాస్త చాటును/ చెరుకు గడలా మంటల దవడలతో నమిలేస్తున్నాడు” అని శాపనార్ధాలు పెడతాడు. (సూర్యుడ్ని పొయ్యిలో పెడదాం). “ముగించే లోపు/ అనేక / ప్రారంభాలుండే జీవన సర్కసుకు/ కిరణాల గడలేసుకొని/ పోల్ జంప్ చేస్తూ/ నిత్యం/ గ్రీన్ సిగ్నల్ ఇస్తూనే ఉన్నాడు సూర్యుడు.” అని   ప్రశంసించగలడు కూడ.(అనిత్యం)

ఆకలి చావులను జనాభాలెక్కల పట్టికలో మరణాలుగా చూడగలుగుతున్న మన ఉదాశీనతను చెంప దెబ్బ కొట్టి, వాటి వాస్తవిక తీవ్రతను మనకు పదాలతో దృశ్యీకరించి చూపించాడు. ఆకలి చావుల అంతిమ  దశను “ఒక్కో అవయవం కూలి/అణువణువూ చీలి/ తనువంతా తగలడి/ చితిని చేరకముందే/ మా కపాలం పగిలిన శభ్ధం/ మేమే వింటూ/ ఊహల కందని వేదన/ ఊదర పెడుతుంటే ఊపిరి వదులుతుంటాం.” అని వర్ణించాడు. (బాబోయ్) “మిగతా జంతువులకు మల్లే/ సహజాత సంతోషాలు దొరకవు/సహజ మరణాలు ప్రాప్తించవు. ఆకలి చావులు కావట మావి/ అసలవి లేనే లేవట.” ఇక్కడ ఆయన పద, భావ లయలకు మురిసిపోయే సంతోషాన్ని కూడ ఇవ్వకుండా ఏడిపించేసాడు. (ఆకలి…కొలత).

‘దొరసానుడు’ కవితలో “గడీలకు గడియలేస్తే/ గంగలో కలిసిపోయాయనుకొన్నా/ మారు వేషాలేసుకొని మన మధ్యే తిరుగుతున్నాయని/ ఈ మధ్యే తెలిసింది. రంగు మార్చిన గడీ/ రాజకీయ గారడి  రహస్య ఎజెండాతో /రాజదర్బార్లు రోజూ చేస్తూనే ఉంది.” అంటూ భూసామ్య పెత్తందారీ రాజకీయ ప్రస్థానాన్ని భావగర్భంగా బట్ట బయలు చేసాడు.”

అక్షరాలు ఈయన వేసే భావాల ముగ్గుల్లో బుద్దిగా గొబ్బెమ్మల్లా కూర్చుంటాయి. పిలిస్తే వచ్చే చుట్టాల్లా కాకుండా ఇంటి ఆడబడచులంత సహజంగా ఈయన కవితల్లో అమరిపోతాయి.మార్మికత ఈయన కవితల్లో ముగ్ధంగా ముడుచుకొని ఉంటుంది. గాఢత పాఠకుడు శ్వాసించినంతగలిగినంత దొరుకుతుంది. ఈయన పదాలు సజీవ సాహిత్య ఊటలు. వాక్యాలు వొళ్ళు విరుచుకొన్న సత్యాలు. భావాలు తాత్వికత, తార్కికత సమ్మేళనాలు. ఎంచుకొన్న సందర్భాలు పూర్తిగా సమయోచితాలు. వెరసి శ్రీనివాసరావు గారి కవితలు డాంబికాలు పోని హఫ్ చేతుల చొక్క వేసుకొన్న సగటు మనిషి అంతః చిత్రాలు. ఇవి సాధారణ పాఠకుడికి అందుతాయి. సుద్దులు చెబుతాయి, ప్రేరణనిస్తాయి.

 

 

ఈ కవిత చలిమంచు జలపాతమే!

vasuగుండెలపై వర్షం, కొబ్బరినీళ్ళ సువాసనా, పొలంగట్లపై తాటిముంజెల తీపీ, నీరెండలొ సరస్సులో స్నానం ఇలాంటివన్ని కలగలిపి మరీ అనుభూతిస్తే అది పులిపాటి కవిత్వం.

కవిత్వం ఆనందాన్నిస్తుందని తెల్సు, అనుభూతుల వానలో తడుపుతుందనీ తెల్సు కానీ ఆ వర్షంలో తడిసే అవకాశం వచ్చింది మాత్రం డాక్టర్ పులిపాటి గురుస్వామి కవిత్వం చదివాకనె. వృత్తిరీత్యా శారీరక రుగ్మతలకి వైద్యం చేసే ఈ డాక్టర్ మన మనసుకీ చికిత్స చేస్తాడు. ఈయన కవిత్వం చేదులేని ఔషధాలె. సున్నితంగా మనసుమీట నొక్కుతాడు దానికి మీరు లొంగారా ఇక అంతే! చదవాల్సిందె. మంచులో నానబెట్టిన అక్షరాలకి తేనె అద్ది మరీ అందిస్తాడీ స్వామి. కవితని పండించడంలొ మాటల పల్స్ తెలిసిన వైద్యుడు.

“మీరు కవిత్వాన్ని పట్టారు అది ఇప్పుడు మీకు దాసోహం అంటోంది” అన్నాను ఆయన దీర్ఘకవిత “జీవిగంజి” చదివాక. దానికాయన నిరాడంబరంగా నవ్వి “అదేంలేదు మిత్రమా! కవిత్వం దానంతటదే వచ్చి భుజంపై కూర్చుంటుంది. దాన్ని కిందకి దింపి రంగులద్దుతాను” అన్నారు.

ఈ కవిత చూడండి “చలిమంచు జలపాతంలొ…” అన్న శీర్షికతో!

మొదటి వాక్యమే మనల్ని కట్టిపడేసి మనగురించీ, మన మనసు గురించీ ఇతనికెలా తెలిసిందనే ఆశ్చర్యంలొ నుంచి బయటపడకముందే కవిత్వం ఆసాంతమూ చదివేస్తాం.

పూర్తిగా అనుభూతి ప్రధానంగా సాగే స్వామి కవితల్లొ ఇదొక ప్రత్యేక రచన.

“మంచు ముఖమల్ మనసుమీద నడిచిరా..!” అన్న మొదటి వాక్యం కవిత్వం ఇంత అందంగా ఉంటుందా అని అనుకోవాల్సిందె….ముఖ్యంగా ఆ ఎల్లిటరేషన్ బాగా అచ్చొచ్చినట్టు పండింది. మనసు సున్నితత్వాన్ని కవితాత్మకంగా చెప్పడలగడంలో “మంచులో తడిసిన మఖమల్” ప్రయోగం బాగా పండిందనడంలో ఏమాత్రం అతిశయోక్తిలేదు.

పాఠకుడి మనసుని తన స్వాధీనంలోకి తెచ్చేసుకుంటూ అలా ఓ కవితని మొదలుపెట్టడం చాలా కొంతమందికే చాతనవుతుంది. అందులో  డాక్టర్ స్వామి ఒకరు.

ఇంకా ముందుకెళ్లాక మనల్ని మనమే తట్టిలేపి గుండెలమీద కొట్టుకునే వాక్యం ఉంది “నిలువెల్లా మీటడానికి నీ నాద శరీరం సిధ్ధమేనా..!” అని. ఔను. మన శరీరం ఓ వీణో, సితారో అయితే మీటే వాద్యకారుడు ఉంటే ఎంత చందం అది. ఆ అనుభూతిని ఇక్కడ ఓ క్షణం ఆగి మరీ ఆనందించాల్సిందె…. అదికూడా “నిలువెల్లా  మీటగలిగేలా”!

“పక్షులు నేర్చుకున్న రాగాల
పరవశం నీకోసం
గుప్పెట్లో పట్టి ఉంచుకున్నాయి”

ఇది అర్ధమవ్వటానికి నాకు చాలా టైమె పట్టింది..అర్ధమయ్యాక అర్ధమయ్యిందేంటంటే ఇక్కడొక కామా (,) మిస్సయ్యందని! పక్షులు అన్నపదం తర్వాత ఆ కామా లేకపోవటం కొంచెం కన్ఫ్యూజన్ కి గురిచేస్తుంది పాఠకులని అనే అనుకుంటున్నాను.

“చలిగింతలు మాటుకాస్తున్నాయి” లో చలిగింతలంటే అర్ధంకాకపోయినా ఆ పదం గిలిగింతలుపెట్టకమానదు.

మనకి కుచ్చలిగింత మాత్రమే తెలుసు, ఇప్పుడు మరో కొత్త పదం “చలిగింత.” తెలుగులోని అక్షరాలని ఇలా వాడుకోవచ్చా అనిపిస్తుంది ఇది చదివినప్పుడు. కానీ ఈ ప్రయోగం ఏంటని అనిపించకా మానదు.

“పండు ఊహల సవ్వడి…” ఆ భాగంలో నాకుకొన్ని చోట్ల విభేదాలున్నా “చిటారుకొమ్మల చిలిపి చిగురాకులు” ఓ రసరమ్య అనుభూతే. కానీ తర్వాత వచ్చిన ఆ మూడు వాక్యాలే కవితని నిలబెట్టాయి అని అనడం అతిశయోక్తిగా అనుంటే క్షంతవ్యుణ్ణే.

“వేకువలో జారిపోయే
ఈ పచ్చని వెన్నెల తాగగలిగితె
అమరత్వం దగ్గరగా  జరుగుతుంది

ఇలాంటివి డాక్టర్ పులిపాటిని మనకు దగ్గర చేస్తాయి. ఈ వాక్యాలు అర్ధం అయితే పాఠకులకి అమరత్వం సిధ్దించినట్లే. మీరు మీ ఇంట్లో సన్నజాజి పందిరి కింద నిలబడి వెన్నెలని తాగుతుంటేనో తింటూంటేనొ ఆ అనుభూతిని ఎవ్వరికీ ట్రాన్స్‌‌ఫర్ చెయ్యలేరు. అది మీకు మాత్రమే సొంతం. ఆ వెన్నెలని భోంచేస్తూ ఇది నెమరేస్కోండి, నోట్లో పాన్ పెట్టుకుని మరీ. మీకు కవిత్వం నచ్చినట్లే. ఇప్పుడు మీకూ రాయాలనిపిస్తోందా? అలా అనిపిస్తే అది ఆయన తప్పు కాదు. మీచేత భావుకత్వం నమిలిస్తాడు ఈ డాక్టర్.
అంతా బానే ఉంది కానీ మరి ఇలా మధ్యలో ఒదిలేసి వెళ్ళిపోయాడేంటి అని అనుకుంటే అది మీ తప్పుకాదు. నాకూ అలానే అనిపిస్తుంటూంది ఈయన కవిత్వం చదువుతూన్నప్పుడు.

guru ఔను.
“గుండెని భద్రంగా/ అమలినంగా పట్టుకుని రా
ఒలకని సౌందర్యసత్వం
నిండుగా నింపుకొని పొదువు…”

అని అర్ధాంతరంగా ముగిస్తాడీయన.

అలా మనం చదువుతూ ఉండగానే హఠాత్తుగా కవిత ముగియటం మనసుకి కొంచెం కష్టమె.

నా కంప్లైయింట్స్ లో ప్రధానమైనదిదె. ఈయన కవితలు ఇలానే అర్ధాంతరంగా ముగుస్తాయి. ఓ పద్యం ప్రాంరంభమై దాన్ని చదివి ఆస్వాదించేలోపే అది ఉండదు. ఓ అద్భుతవాక్యంతో అతని కవిత మొదలవుతుంది. మనం మనకి తెలియకుండానే కవిత్వ ఫ్లోలొ కొట్టుకుపోతుంటాం (ఆనందంగానే). ఈలోపులో మాయం. దబ్బున కిందపడతాం.

ఉదాహరణగా ఈ కవితే తీస్కుందాం.

“చలిమంచు జలపాతంలొ.”

ఇదొక underdeveloped కవితగా ఉండిపోతుంది.

“మంచు ముఖమల్ మనసుమీద నడిచిరా..!”  అని మొదలుపెట్టి  ప్రేయసిని (అని అనుకుందాం కొంచెంసేపు) ఉద్దేశించి రాసాడనుకుందాం…. మరి అదే మూడ్‌‌ ని అందించే ముగింపు లేదు.

మధ్యలో చాలా భావుకత్వపు పదప్రయోగాలు నడిచాయి. అవన్నీ కవితని నడిపిస్తాయే తప్ప కవితా వస్తువేంటనే పాఠకుడి ప్రశ్నకి జవాబు నివ్వలేవు. కొన్ని స్టేట్ మెంట్స్ తప్ప.

“అమరత్వం దగ్గరగా జరుగుతుంది” అన్న వాక్యం ఓ డిక్లరేషన్లాగానె మిగిలిపోతుంది, మిగతా వాక్యాల సరళితో పొంతనలేకుండా.

ఈయన కవిత్వంతో ఉన్న పేచీ ఇదేనేమొ. చాలా వరకూ చిన్న కవితలే.

అయితే ఆ కవిత్వాన్ని ఎందుకు చదవాలంటే కొని ఆణిముత్యాల్లాంటి వాక్యాల కోసం.

మీకు ఇలాంటీ వెన్నెలని భోజనం చెయ్యాలంటే అతని బ్లాగు కెళ్ళీ అతని కవిత్వమంతా చదవండి.
http://pulipatikavithvam.blogspot.com

***

చలిమంచు జలపాతం లో…..

 

మంచు మఖమల్ మనసు మీద
నడిచి రా…!

ఇక్కడ ఆకాశం విరిసి
ప్రవహించిన గాలులు
నింపుకున్న నేరేడు ,చింత వేప సోయగాలు
నిలువెల్లా మీటడానికి
నీ నాద శరీరం సిద్ధమేనా…!

పక్షులు నేర్చుకున్న రాగాల
పరవశం నీకోసం
గుప్పెట్లో పట్టి ఉంచుకున్నాయి.

చలిగింతలు
మాటు కాస్తున్నాయి

పండు ఊహల సవ్వడి
వినటానికి
చిటారు కొమ్మల చిలిపి చిగురాకులు
నిశ్శబ్దంగా …
చూపుల్ని భద్రపరిచాయి.

వేకువలో జారిపోయే
ఈ పచ్చని వెన్నెల తాగగలిగితే
అమరత్వం దగ్గరగా జరుగుతుంది.
గుండెని భద్రంగా
అమలినంగా పట్టుకొని రా…!

ఒలకని సౌందర్యసత్త్వం
నిండుగా నింపుకొని పొదువు…

***

కవి స్కెచ్: ఎస్వీ రామశాస్త్రి