నక్షత్రాల్లాంటి ఆ కథలు…

kathana

రిత్రయుగం ఇప్పటికి అయిదువేల ఏళ్ళకిందట మొదలయ్యిందనుకుంటే, తాత్త్వికయుగం క్రీ.పూ 6-5 శతాబ్దాల్లో మొదలయ్యింది. చైనాలో, భారతదేశంలో, గ్రీసులో తలెత్తిన ఈ కొత్తధోరణి పురాణగాథలమీదా, పురాణక్రతువులమీదా, పురాణవిశ్వాసాలమీదా తలెత్తిన తిరుగుబాటు.

గ్రీసులో సోక్రటీస్ కి పూర్వపు తత్తవేత్తలు గ్రీకు పురాణకవులైన హోమర్ నీ, హెసియోద్ నీ  ధిక్కరించడంద్వారా, సాహిత్యంకన్నా, తత్త్వశాస్త్రం సత్యానికి ఎక్కువ సన్నిహితంగా ఉంటుందని వాదించారు. ఆ క్రమంలో పురాణకథల్లోని సంక్లిష్టతను తొలగించి మనిషికి మార్గనిర్దేశనంచెయ్యడానికి మంచిచెడుల్నివిడదీసిచూపించి, మంచికి ఉదాహరణలు చూపించడంకోసం బుద్ధుడుకథలు చెప్పడంతో ఉదాహరణకథలు( ఎగ్జంప్లం) వికసించాయి.

కాని మనిషి కేవలం సత్యంమీదా, నీతిసూత్రాల మీదా మాత్రమే బతకలేడు. మనిషికి సత్యంకన్నా సమగ్రత ముఖ్యం. తనజీవితానికీ, తన జాతిజీవితానికీ కూడా సమగ్రత సిద్ధిస్తుందంటే అతడు అబద్ధాలు చెప్పుకోవడానికి కూడా సంకోచించడు.

ఆసమగ్రతని ప్రతిష్టించుకోవడంలోఅతడికొక సంతోషముంది. ఆ సంతోషాన్నిగ్రీకునాటకకర్తలు play wisdom అన్నారు.

మనిషి తొలినాళ్ళల్లో నీతినియమాలతో సంబంధంలేకుండా కథలు చెప్పుకుంటున్నప్పుడు, చతురపాత్రలు సృష్టించుకుంటున్నప్పుడు అనుభవిస్తున్నది ఆ play wisdom నే. తాత్త్వికులు ఇవ్వలేకపోతున్నఆ play wisdom ని తిరిగి జానపదకథాధోరణిలో అందివ్వాలని నీతికథ ముందుకొచ్చింది. అయితే ఈ నీతికథ జాతకకథల తరహా నీతికథ కాదు. ఇది ఈసోపు తరహా నీతికథ. దీని మూలాలు చరిత్రపూర్వకాలంలోనే ఉండిఉండవచ్చు. కాని తన కాలానికి తగ్గట్టుగా ఈసోపు ఆ ప్రక్రియకు ప్రాణం పోసాడు.

ఈసోపు వల్ల మరొకసారి కథ ఎంత సముజ్జ్వలంగా భాసించిందంటే, సాహిత్యాన్నీ, కవుల్నీ, కథకుల్నీద్వేషించిన ప్లేటో కూడా చివరికి సోక్రటీస్ నోటి  వెంట ఒక ఈసోపు తరహా కథ చెప్పించకుండా ఉండలేకపోయాడు.

ఈసోపు తరువాత కథ రెండుదారులు తీసుకుంది. ఒకటి, పురాణగాథల్లాగ భౌతిక, అభౌతికప్రపంచాల మధ్య సేతువు నిర్మించడం. కాని అందుకోసం పురాణకథల్లాగా అభూతకల్పనల మీద ఆధారపడకుండా, ఈలోకాన్నీ, ఇక్కడి దైనందిన జీవితాన్నీకథావస్తువు చేసుకోవడం. చక్కటి రూపకాలంకారంలాగా, చూస్తున్నదాన్నిదృష్టాంతంగా చూపిస్తూ మనంచూడలేనిదాన్నీ, చూడవలసినదాన్నీచూపించడం.

బహుశా ఈ కఠినబాధ్యతని పారబుల్స్ చెప్పడం ద్వారా క్రీస్తు నిర్వహించినంతగా మరే కథకుడూ నిర్వహించలేకపోయాడని చెప్పాలి.

ఈసోపుకథలు తీసుకున్నమరొకదారి, ఈ ప్రపంచం లోనే వివిధ సామాజికవాస్తవాల మధ్య సేతువు నిర్మించడం. పురాణగాథల్లాగా ఆధికారికవిశ్వాసాలుగా స్థిరపడ్డ సామాజికవిశ్వాసాల్నీ, కథల్నీ, కల్పనల్నీ ప్రశ్నించడం. దీన్నివ్యంగ్యకథ అనవచ్చు. గ్రీకు, రోమన్ బానిస రచయితలు ఇందుకు  మానవాళికి తోవ చూపించారు.

ముఖ్యంగారోమన్ బానిసగా జీవితం ప్రారంభించి రోమన్ చక్రవర్తులతో సమానమైన గౌరవానికి పోటీపడ్డ ఫయాడ్రస్. పురాణగాథకి పూర్తి వ్యత్యస్తరూపం వ్యంగ్యకథ.

ఒక సామూహికవిశ్వాసాన్ని ఇవ్వడం ద్వారా సమాజాన్ని సమగ్రంగా నిలిపి ఉంచుతుందని ఆశ కల్పించిన పురాణకథ, వాస్తవంలో సమాజాన్నిచీల్చడానికే ఉపకరించిందని ఎత్తిచూపడమే వ్యంగ్యకథ ప్రయోజనం.

ఏ అతీతకాలం లోనో ఎన్నోసహస్రాబ్దాలకు పూర్వం గుహలముందు  నెగడి చుట్టూ కూచుని చరిత్రపూర్వయుగ మానవుడు, అక్షరపూర్వయుగ మానవుడు తాను చూసినదాన్నీ, చూడనిదాన్నీకూడా కథలు చెప్పుకోవడం మొదలుపెట్టాడు.

బహుశా వినోదం కోసమే ఆ కథలు పుట్టి ఉండవచ్చు. కాని కాలక్రమంలో అవి సామాజిక, సాంస్కృతిక అవసరాలుగా మారిపోయాయి. కథలే లేకపోతే, సుమేరియన్, ఈజిప్షియన్, గ్రీకు, చీనా, భారతీయ, పారశీక సంస్కృతులిట్లా రూపొంది ఉండేవా అన్నది ప్రశ్నార్థకమే. కథ ఒక సామాజికఅవసరమే కాకపోయుంటే హోమర్, హెసియోద్, వర్జిల్, వ్యాసవాల్మీకులు ప్రభవించి ఉండేవారే కాదు. కథలుగా  చెప్తేనే మనుషులు తమ మాటలు మరింత బాగా వింటారని గ్రహించినందువల్లనే బుద్ధుడూ, క్రీస్తూ వంటి ప్రవక్తలు కూడా కథకులుగా, ఇంకా చెప్పాలంటే అద్వితీయకథకులుగా, మారారు. ఒకవేళ కన్ఫ్యూషియస్ వంటి గురువులు కథలు చెప్పకపోతే, వాళ్ళ జీవితంలోని చిన్నచిన్నసంఘటనల్నేవాళ్ల శిష్యులు కథలుగా చెప్పుకోవడం మొదలుపెట్టారు. సామాజికసమగ్రతని కాపాడటంకోసం తమ చక్రవర్తుల్నిదైవాంశసభూతులుగా ప్రతిష్టిస్తూ పురోహితులు చెప్పిన కథల్లోంచి చరిత్రయుగం మొదలైతే, మళ్లా ఆ పురాణగాథల నుంచి సామాజికసమగ్రతను కాపాడుకోవడం కోసం నిరక్షరాస్యులైన బానిసలు చెప్పుకున్నకథలతో చరిత్ర మరో మలుపు తిరిగింది.

ఈ పరిణామమూ, ప్రయాణమూ సవివరంగా ముందుముందు.

 

***        ***        ***

ప్రాచీనకథారూపాలు: పురాగాథ

 

మా ఊళ్లో ఒక కొండ ఉంది. దాన్నిజెండాకొండ అంటాం. మాది గిరిజనగ్రామం కాబట్టి పండగలప్పుడు ఊళ్లో వాళ్లంతా ఆ కొండ ఎక్కడం ఒక అలవాటు. ఆ కొండ కింద పెద్ద బండరాయి ఉండేది. ఆ రాయి పెద్దపాదం ఆకారంలోఉండేది. అది మధ్యలో పగిలిపోయికూడా ఉండేది. మా చిన్నప్పుడు మా ఊళ్లోవాళ్లు ఆ రాతి గురించి ఓకథ చెప్పేవారు. ఒకప్పుడు భీమసేనుడు ఆ కొండమీంచి కిందకి దిగాడనీ, అతడు పాదం మోపగానే ఆ బండరాయి పగిలిపోయిందనీ చెప్పేవారు. మా చిన్నప్పుడు మాకు అదంతా నమ్మదగ్గట్టే ఉండేది. ఆ శైశవం నుంచి బయటపడ్డాక, ఆ ఊరు వదిలాక, ‘విద్యావంతులం’అయ్యాక ఆ కథను నమ్మడం మానేశాం. కానీ ఇప్పటికీ ఆ కొండ దగ్గరికి వెళ్తే, ఆ బండరాతిని చూస్తే అది భీమసేనుడి అడుగే అని ఎక్కడో మానసికఅగాధాల్లో ఒక జలదరింపుకు లోనవుతూనేవుంటాం. ఆ రాతిచుట్టూ అల్లినకథా, ఆ కథ వినగానే మనసులో రేకెత్తకుండా ఉండలేని జలదరింపూ వీటినే మనం లెజెండ్ అంటాం.

చాలాకాలం పాటు పురాగాథ (లెజెండ్), పురాణగాథ (మిత్), జానపదగాథ (ఫోక్ టే ల్) ల మధ్య తేడా గమనించేవారు కాదు. కానీ వాటి మధ్య సున్నితమైన సరిహద్దురేఖలున్నాయని అత్యంత ప్రాచీనతెగలకు కూడా తెలుసని మానవశాస్త్రజ్ఞులు గుర్తుపట్టడం మొదలుపెట్టారు. ప్రసిద్ధ మానవశాస్త్రజ్ఞుడు మాలినోవస్కీ తన ‘Myth in Primitive Psychology’ (1926) లో టోబ్రియాండ్ ద్వీపవాసులు గురించి రాస్తూ, వాళ్లకి మూడు రకాల కథనరూపాలున్నాయని వివరించాడు.

painting: Annavaram Srinivas

painting: Annavaram Srinivas

  • జానపదకథలు: కల్పితకథలు, నాటకీయంగాచెప్పుకునేకథలు. వ్యక్తులూ, కుటుంబాలూ చెప్పుకునే కథలు. హేమంతకాలంలో పంటలకోతల కాలానికీ, చేపలుపట్టే కాలానికీ మధ్యకాలంలో చెప్పుకునే కథలు. ఆ కథలు చెప్పుకుంటే పంటలు బాగా పండుతాయని నమ్మే కథలు.
  • పురాగాథలు: యథార్థంగా జరిగాయని నమ్మేకథలు. వాటిలో యథార్థమైన సమాచారం ఉంటుంది. అవి ఏ ఒక్క వ్యక్తికో, కుటుంబానికో సంబంధించినవి కావు. తెగ మొత్తానికి చెందినవి. వాటిని చెప్పుకోవడంలో కూడా ఒక మూసపద్ధతి ఉంటుంది. వాటికి మంత్రశక్తికూడా ఉందని నమ్ముతుంటారు.
  • పురాణగాథలు: అవి యథార్థమైన కథలే కాకుండా, పవిత్రమైన కథలు కూడా. వాటి పట్ల ఆ తెగమొత్తానికి  ఆరాధన, గౌరవం, సమర్పణభావం ఉంటాయి. తెగ మొత్తం పాల్గొనే సామాజిక, సామూహికక్రతువుల్లో ఆ పురాణగాథలదే ప్రధానస్థానం.

వీటిలో , పురాగాథని (లెజెండ్) జానపదకథ (ఫోక్ టేల్) నుంచి విడిగాతీసి, శాస్త్రీయంగా అధ్యయనం చేయడం 1975 నుంచి మొదలయ్యింది. మొదట్లో జానపద కథలకి ఉన్నంత నిర్మాణస్పష్టత పురాగాథలకి లేదనుకునేవారు. కానీ పురాగాథల్నిజానపదగాథలతో పోల్చిచూడటం మొదలైన తర్వాత పురాగాథలకు కూడా కొన్నిస్పష్టమైన, నిర్మాణపరమైన లక్షణాలున్నాయని భావిస్తున్నారు. వాటిని మనమిట్లా చెప్పుకోవచ్చు:

  • జానపదకథలు యథార్థవాస్తవాన్నివ్యంగ్యంగా చిత్రించడానికి ప్రయత్నిస్తే, పురాగాథలు యథార్థవాస్తవాన్నినమ్మదగ్గట్టుగా పునర్నిర్మిస్తాయి.
  • జానపదకథలు అంతరంగవాస్తవం గురించి పట్టించుకుంటే పురాగాథలు బాహ్యవాస్తవం గురించి ఆలోచిస్తాయి.
  • జానపదకథలు మనిషి గురించి ఆలోచిస్తే, పురాగాథలు మనిషికి ఏం జరుగుతోంది, మనిషి ఏమౌతున్నాడు ఆలోచిస్తాయి.
  • జానపదకథలు తమ సాంస్కృతిక వాతావరణం నుంచి కూడా బయటికి ప్రయాణించగలుగుతాయి.
  • కానీ పురాగాథలు చాలా స్పష్టంగా తమ సంస్కృతికి మాత్రమే పరిమితమై మనగలుగుతాయి. అవి ఆ సంస్కృతికి సంబంధించిన సంప్రదాయంతో, విశ్వాసాలతో, ఆ మానవసమూహం తాలూకు మానసికసంవేదనలతో ముడివడి ఉంటాయి. పురాగాథలు సాధారణంగా ఏదో ఒక్క సంఘటన మీంచి నిర్మాణమవుతాయి. అవి ఆ మానవసమూహం తాలూకు బాహ్యస్థలాన్నిఆంతరంగికస్థలంతో ముడివేస్తాయి. ఆ సామూహికగతం గురించిన జ్ఞాపకాల్నితరం నుంచి తరానికి అందిస్తూ, ఆ జాతికొక చారిత్రక అంతర్దృష్టి ని  సమకూరుస్తాయి.

పురాగాథల్నీ, జానపదకథల్నీపోల్చిచూసి, తిమోతి.ఆర్. తంగ్హెర్లేని అనే ఆధునిక జానపదవాజ్మయ పండితుడు లెజెండ్ ని  ఇట్లా సమగ్రంగా నిర్వచించడానికి (1990) ప్రయత్నించాడు:

‘లెజెండ్ అంటే సాంప్రదాయిక కథ. ఏక సంఘటనాత్మక కథ. నిర్దిష్టవాతావరణానికి తగ్గట్టుగా, చారిత్రకస్వభావాన్నిసంతరించుకున్నకథనం. సంవాదరూపంలో సాగే అభినయం. ఒక తెగ నమ్మకాల్నీ వారి సామూహికఅనుభవాల్నీమానసికస్థాయిలో నెమరువేసుకుంటూ ప్రతీకాత్మకంగా చెప్పే కథ. ఒక సమూహం తాలూకు సాంప్రదాయికవిలువల్నిపునరుద్ఘాటించడం కోసం చెప్పుకునే కథనం’

నిజానికి పురాగాథలు అచ్చుపుస్తకాల్లో చదువుకునేవి కావు, అవి అభినయరూపాలు. వాటికి నిర్ణీతవేళలుంటాయి. వాటి చుట్టూ కొన్ని నమ్మకాలుంటాయి. ఉదాహణకి సెనెకా ఇండియన్ తెగల్లో, ఇరోకో తెగల్లో ఏ కథలూ వేసవిలో చెప్పుకునేవి కావు. అట్లా చెప్పుకుంటే రెండు రకాల అనర్థాలు వాటిల్లుతాయని వాళ్ళు నమ్ముతారు. మొదటిది, వేసవిలో జంతువులకి పనీపాటా ఉండదు కాబట్టి, అవి మనుషులు చెప్పుకునే కథలు వింటాయనీ, అలా వింటున్నప్పుడు మనుషులు తమని తాము మరీ అతిగా పొగుడుకుంటే విని ఆగ్రహిస్తాయనీ ఒక నమ్మకం. రెండవది, అవి ఆ కథలు వింటూ మైమరచిపోతే ప్రకృతిలో వాటిచోటు తప్పిపోతుందనీ, ప్రకృతి నడక మారిపోతుందనీ మరొక భయం.

అందుకని ఆ కథలన్నీశీతాకాలంలో ప్రకృతి కునికిపాట్లు పడేటప్పుడు  చెప్పుకోవలసిందే.

సెనెకా తెగలో ఈ కథలు చెప్పడానికొక కథకుడుంటాడు. అతణ్ణి ‘హగెఓతా’అంటారు. కథలు చెప్పడాన్ని ‘ఎసెగెఒడె’అంటారు. అతడి దగ్గరుండే కథాభాండాగారాన్ని ‘గనొండసహగొ’అంటారు. కథలు చెప్పేటప్పుడు శ్రోతలు నిద్రపోయినా, ఊకొట్టకపోయినా కథకుడు అమర్యాదగా భావిస్తాడు. ఒకవేళ శ్రోతకి నిద్రొస్తుంటే అతడు కథకుణ్ణి కొంతసేపు ఆకథ కట్టెయ్యమని అడుగుతాడు. కథవిన్నాక శ్రోతలు కథకుడికి పూసలో, పొగాకో, ఏదో ఒక చిన్నకానుక ఇవ్వడం తప్పనిసరి.

ఒక జాతి తన సామూహిక, సమష్టిఅనుభవాల్నిఅర్థంచేసుకునే క్రమంలో, గుర్తుపెట్టుకునే క్రమంలో ప్రతీకాత్మకంగా మిగుల్చుకునే ఆనవాళ్లు పురాగాథలు. ఉదాహరణకి  ‘కథలుఎలాపుట్టాయి’అనే ఈ పురాగాథ చూడండి. సెనెకాఇండియన్లు చెప్పుకునే ఈ పురాగాథలో రాయి కథలు చెప్పటం చూస్తాం.

kesavareddyరాయి కథలుచెప్పడం ఆధునికమానవుడి దృష్టిలో, అయితే, ఒక మెటఫర్, లేదంటే, ఒక ఫాంటసి. కానీ సెనెకాఇండియన్లకి తమ చుట్టూ ఉండే ప్రకృతిలో ప్రతి ఒక్కటీ సజీవపదార్థమేనని మనం గుర్తిస్తే, ఈ పురాగాథ వాళ్ల సామూహికవిశ్వాసంతో ఎంతగా పెనవేసుకుపోయిందో మనకు అర్థమవుతుంది.

రామాయణంలోనూ, మహాభారతంలోనూకూడాఎన్నోపురాగాథలున్నాయి. ఐరోపీయ సాహిత్యంలో ఆర్థరియన్ లెజెండ్లు సుప్రసిద్ధం. తెలుగులో డా.కేశవరెడ్డి ‘మూగవానిపిల్లంగోవి’, ఆర్. వసుంధరాదేవి ‘రెడ్డెమ్మగుండు’కథలు లెజెండ్ తరహాలోచెప్పినవే.

 

 

***        ***        ***

సెనెకాఇండియన్లు1చెప్పుకునేకథ:  కథలుఎలాపుట్టాయి?

ఒకానొక కాలంలో ఒక అనాథ పిల్లవాడుండేవాడు. అతణ్ణి అతడి తల్లిదండ్రులకి బాగా దగ్గరగా తెలిసిన ఒక ఆడమనిషి పెంచింది. అతడు పెరిగి పెద్దవాడయినప్పుడు బలవంతుడు గానూ, బుద్ధిమంతుడు గానూ రూపొందాడు. అతడికి తగిన వయసు రాగానే ఒకరోజు ఆమె అతని చేతికి విల్లంబులు ఇచ్చి, ‘ఇక నువ్వు వేటాడడం నేర్చుకునే వయసు వచ్చింది. అడవికి పోయి వేటాడి ఆహారం తీసుకురా’ అని చెప్పింది. ఆ మర్నాడు పొద్దున్నే అతడు వేటకు వెళ్లాడు. మూడు పక్షులను కొట్టాడు. మధ్యాహ్నానికల్లా అతడి అమ్ములపొది వదులైంది. అల్లెతాడు బిగించుకోవడం కోసం అతడొక చాపరాయి మీద కూర్చున్నాడు.

ఇంతలో ఉన్నట్టుండి హటాత్తుగా అతణ్ణి ఎవరో ‘నీకో కథచెప్పమంటావా’అని అడిగారు.

అతడు తన ఎదురుగా ఒక మనిషి నించొని తనని అడుగుతున్నాడనుకుని తలపైకెత్తి చూశాడు. కాని ఎదురుగా ఎవరూ కనిపించలేదు.

‘నీకో కథ చెప్పమంటావా?’ మళ్లీ వినిపించిందాగొంతు.

ఆ కుర్రవాడికి భయమేసింది. అతను అన్నిదిక్కులా చూశాడు. కాని ఎవరూ కనబడలేదు. మళ్లా ఆ గొంతు వినబడేసరికి అప్పుడతనికి అర్థమైంది, ఆ గొంతు తాను కూర్చున్న బండ లోంచి వినబడుతోందని.

‘నీకో కథ చెప్పమంటావా?’

‘కథలంటే ఏమిటి?’ అని అడిగాడు ఆ పిల్లవాడు.

‘కథలంటే చాలాకాలం కిందట జరిగిన సంగతులు. నా కథలు నక్షత్రాల్లాగా ఎప్పటికీ చెక్కు చెదరవు.’

ఆ రాయి కథ చెప్పడం మొదలుపెట్టింది. ఒక కథ పూర్తిచేస్తూనే మరో కథ మొదలుపెట్టింది.

అది కథలు చెప్తున్నంతసేపూ ఆ కుర్రవాడు తలవంచుకుని శ్రద్ధగా ఆ కథలే వింటూ కూర్చున్నాడు. సూర్యాస్తమయవేళకి ఆ రాయి హటాత్తుగా ఇలా అంది.

‘ఇక మనం ఇప్పటికి చాలిద్దాం. రేపు మళ్లారా. మీ వాళ్లందరినీ కూడా తీసుకురా. వాళ్లంతా కూడా నా కథలు వింటారు. వచ్చేటప్పుడు వాళ్లందరినీ నాకోసం తలా ఒక కానుక తీసుకురమ్మని చెప్పు’అంది.

ఆ కుర్రవాడు ఆ సాయంకాలం తన వాళ్లందరికీ ఆ కథలు చెప్పే రాయి గురించి చెప్పాడు. దాంతో మర్నాడు పొద్దున్నే ఆ ఊరిజనమంతా అతడి కూడా అడవిలోకి దారితీశారు. ప్రతిఒక్కళ్లూ రొట్టెలో, మాంసమో, పొగాకో ఏదోఒకటి తలా కొంత తీసుకువచ్చి ఆ రాతి ముందు పెట్టి కూర్చున్నారు.

అంతా నిశ్శబ్దంగా కూర్చున్నాక రాయి మాట్లాడడం మొదలుపెట్టింది.

‘నేనిప్పుడు మీకు చాలాకాలం కిందట జరిగిన కథలు చెప్పబోతున్నాను. మీలో కొంతమందికి నేనుచెప్పే ప్రతి ఒక్కమాటా గుర్తుంటుంది. కొంతమందికి కొంతే గుర్తుంటుంది. తక్కినవాళ్లకి అసలేమీ గుర్తుండదు. శ్రద్ధగా, జాగ్రత్తగా వినండి.’

ఆ ప్రజలంతా శ్రద్ధగా శిరస్సు వంచి విన్నారు. రాయి కథ చెప్పడం పూర్తిచేసేటప్పటికి పడమట పొద్దుకుంకింది. అప్పుడు ఆ  రాయి ఇట్లా అంది.

‘నా దగ్గరున్న కథలన్నీ చెప్పేశాను. మీరు వాటిని మీ పిల్లలకి చెప్పండి. మీ పిల్లలపిల్లలకి చెప్పండి. అలా తరతరాలపాటు చెప్పుకుంటూనే ఉండండి. మీరెవరినైనా కథ చెప్పమని అడిగినప్పుడు మర్చిపోకుండా వాళ్లకిట్లా ఏదో ఒక బహుమతి ఇవ్వండి.’

అదీ, అలా జరిగింది. మనకి తెలిసిన కథలన్నీఆ రాయి మనకి చెప్తే విన్నవే. మన తెలివితేటలన్నీ ఆ రాతినుంచి మనకు దొరికినవే.

 

_________________________________________________________________________

1: సెనేకా ఇండియన్లు: అమెరికన్ఇండియన్లుగా పిలువబడే రెడ్ఇండియన్లు సుమారు 60 వేలఏళ్ల కిందట ఉత్తరఅమెరికాలో అడుగుపెట్టారు. మధ్యఆసియా మైదానాల నుంచి ఈశాన్యదిశగా సైబీరియాసరిహద్దులు దాటి వాళ్లు అమెరికాలో అడుగుపెట్టారు. వేటాడుతూ, ఆహారం ఏరుకుంటూ ఆ సమూహాలు కొలంబియానది పొడవునా రాకీలు దాటి దక్షిణంవైపు మెక్సికన్ మైదానాల మీదుగా సతతహరితారణ్యాలు దాటుకుంటూ యుకాటన్ అడవుల దాకా విస్తరించారు. ఆకాశంలో ఎన్నినక్షత్రాలున్నాయో అన్ని ఇండియన్ తెగలున్నాయని నానుడి. వాళ్లు దాదాపు 300 భాషలు మాట్లాడతారు.

 

1492 లో క్రిస్టఫర్ కొలంబస్ అమెరికాలో   అడుగుపెట్టినప్పటినుండి 1890 దాకా నాలుగు శతాబ్దాల పాటు సభ్యప్రపంచం అమెరికన్లను వేటాడి, వాళ్ల సంస్కృతినీ, నాగరికతనీ ధ్వంసం చేసేసింది.

 

కానీ 19 వశతాబ్దపు ప్రారంభం నుండీ అంటే, 1830 ల నుంచి అమెరికన్ తెగల సంస్కృతి , మౌఖికసాహిత్యం, జీవనశైలి గురించి విరివిగా అధ్యయనాలు మొదలయ్యాయి.

అట్లా సమగ్రంగా అధ్యయనం జరిగిన తెగల్లో సెనెకాతెగ కూడా ఒకటి. సెనకా ఇండియన్లు న్యూయార్క్ ప్రాంతంలో జెనెసె నదికి కేనాన్ డైగువాసరస్సుకీ మధ్యప్రాంతంలో నివసిస్తారు.

ఆ తెగ ఒకప్పుడు చాలా పెద్దసమూహంగా ఉండేది. సెనెకా ఇండియన్లు ప్రధానంగా వ్యవసాయం మీద ఆధారపడ్డ జాతి. ఒకరకంగా మాతృస్వామికతెగ అని కూడా చెప్పవచ్చు.

సెనెకాఇండియన్ తెగలు చెప్పుకునే కథల్నిజెరిమియా కర్టిన్, జె.ఎన్.బి. హ్యూవిట్ నేవారు  Seneca Fiction Legends and Myths’ (1918)  పేరిట ప్రచురించారు.

సాంప్రదాయికఅమెరికన్ తెగల కథలు, పురాగాథల్ని ‘The Story Telling Stone’ (1965) పేరిట సుసాన్ ఫెల్డ్ మాన్  వెలువరించిన సంకలనంలోని కథ ఇది.  ఈ కథను కెనడాలో టొరంటొ దగ్గర సేకరించారు.

***        ***        ***

మీ మాటలు

  1. కథ పుట్టు పూర్వోత్తరాలు , కథల రూపాలలో రకాలు , జానపద ,పురా ,పురాణ కథల లక్షణాలను పరిశోధనాత్మక వ్యాసంగా వివరించారు వాడ్రేవు చినవీరభద్రుడు గారు. కథకులకెంతో ఉపయోగమైన
    విషయాలు .వారికి ధన్యవాదాయాలు .

  2. Yours story of story seems to be incomplete sir. Please continue. It will surely increase the knowledge about stories to new writers. Thanks.

మీ మాటలు

*