ఫ్లెమింగోల దారిలో కవిత్వం!

fleming

ప్రపంచం ప్రేమను మరచిపోతున్న తరుణంలో ఒక సౌందర్య వంతమయిన  జీవితాన్ని ప్రేమించుకుంటూ వేల మైళ్ళ దూరాన్ని సునాయాసంగా ఈది తమకై  తాము ఒక నిర్మాణ కర్తలుగా నిలిపే ఈ పక్షుల ముందు మనిషి నిజంగా చాలా చిన్న వాడే .. కాలం ఒడ్డున నిలబడి కవి గొంతెత్తి మనిషిని పిలుస్తున్నట్లే  అన్పిస్తుంది నాకు .. తమ ఆరాటాన్ని మనిషి భాష లోకి అనువదించి లేకపోయినా ప్రాకృతిక భాషలో పరితపించి పోతున్నాయి. వాటి లోపలి స్వరాల్ని పసిగట్ట గలిగిన శక్తి  మనిషికి ఎప్పుడొస్తుందో అనేదే నా ప్రశ్న .. మన ఆశల్ని విప్పి పక్షుల ముందు  పరచే రోజు కాదు వాటి ఆశయాల్ని గుర్తించే రోజు రావాలన్నదే నా తాపత్రయం అంతా .. అందుకే ఒక పక్షి ప్రేమికుడిగా వాటితో పాటుగా చరిత్ర గమనంలో  నా  గొంతు కలాపాలన్నదే నా తపన . అందుకే పక్షుల గురించి పుస్తకం రాసాను. పక్షుల కవిత్వం ఆహ్వానిస్తున్నాను.  పక్షి పాటను ,పక్షి కవిత్వాన్ని గుండె కెత్తుకున్నాను . ఈ తంతు నడిచే దారిలో నిజానికి నేనే ఓ పక్షి లా మారిపోయాను.

ఒక సాయుధుడిగా ,ఒక నిర్మాణ కర్తగా  నిరంతరం ఒక విలక్షణ ,విన్నూత్న మయిన కార్యాలు చేయడమే విధిగా పెట్టుకుని సాకారం చేసుకుంటున్న కలల క్రమం లో 10 ఏళ్ళ క్రితం వృత్తి రీత్యా సుమారు ఏడేళ్ల పాటు నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట లో నివాసం వున్నప్పుడు మొదటి  సారి ఈ నేలపట్టు ,పులికాట్ క్రమం తప్పకుండా ప్రతి దసరా పండుగ నాటికి సైబీరియా లాంటి సుదూర ప్రాంతాలు నుండి సుదీర్ఘ ప్రయాణం చేసి వచ్చే ఫ్లెమింగో ,పెలికాన్ పక్షుల గురించి వినడం ,చూడడం జరిగింది. అప్పుడు అక్కడ కొచ్చే పక్షి శాస్త్రజ్ఞులను కలవడం,వాటి గురించి పలు ఆసక్తి కరమైన అంశాలు తెలుసుకునే అవకాశం దొరికింది.  జీవితం రంగులు కోల్పోయి నిస్సారం అవుతుంది ఈ అయస్కాంత వంతమైన ఆకర్షణ కలిగిన పక్షులు లేకపోతే అనే జవహర్ లాల్ నెహ్రు మాటలు గుర్తు కొచ్చాయి.

శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలో దక్షిణ కోస్తా చివరలో విస్తారమైన పులికాట్ సరస్సు ,దొరవారి సత్రం మండలం లోని కుగ్రామం నేలపట్టు తరాలుగా పెలికాన్ ,ఫ్లెమింగో పక్షుల విడిది కేంద్రాలుగా విరాజిల్లుతున్నాయి .. ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వాటిని పక్షుల రక్షిత కేంద్రముగా వన్య ప్రాణుల సంరక్షణ చట్టం పరిధిలోకి చేర్చి వాటిని అటవీ శాఖ తరఫున కాపు కాస్తుంది .. ఈ విదేశీ విహంగాలు విడిదికొచ్చి సంతాన ఉత్పత్తి చేసుకుని హాయిగా తమ ప్రాంతాలకు తిరిగి వెళ్తుంటాయి . ప్రతి ఏడాది అక్టోబర్ నుండి సుమారు మార్చ్ వరకు ఇక్కడ ఇవి విడిది చేస్తాయి ..నీరు సమృద్ధిగా ఉన్నంత వరకు వుంటుంటాయి .

ఈ పర్యాటక కేంద్రానికి అంతర్జాతీయ పర్యాటక హోదా కల్పించాలనే సంకల్పంతో 2000 సంవత్సరం లో  సముద్రపు రామచిలుకగా అందమైన రంగులతో ఎత్తుగా నడిచే ఫ్లెమింగో పక్షి పేరుతో అప్పటి జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ ప్రతి ఏటా పక్షుల పండుగ జరపాలని నిర్ణయించారు .. అప్పటి నుండి రెండు మూడు రోజుల పాటు సుళ్లూరుపేట ,నేలపట్టు ,అటకానితిప్ప, భీముని వారి పాలెం ప్రాంతాలలో వివిధ కార్యక్రమాలు చేపడుతూ ఈ ప్రదేశం గురించి ప్రచారం చేస్తూ తమిళనాడు ,కర్ణాటక ఇంకా ఇతర ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున పర్యాటకులు ఈ సీజన్లో వచ్చే పక్షుల ను దర్శించి అక్కడి మనోహర దృశ్యాల్ని మనస్సులో ముద్రించుకుని వెళ్లడం ఆనవాయితీగా చేసారు జిల్లా అధికారులు. క్రమేణా ప్రజల్లో స్పందన చూసి భారీగా పర్యాటకులు రావడం చూసిన ప్రభుత్వం 2015 నుండి రాష్ట్ర పండుగగా ప్రకటించి హోదా పెంచింది.

2005 లో ఈ పక్షుల పైన పరిశోధనాత్మక దీర్ఘ కావ్యం “ఫ్లెమింగో : ఈ వ్యాస రచయిత  రాసి ఇదే ఫ్లెమింగో పక్షుల పండుగలో అప్పటి కలెక్టర్ ముద్దాడ రవిచంద్ర చేత ఆవిష్కరించి తొలి ప్రతి ఆరోజు సంస్కృతిక కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన గజల్ శ్రీనివాస్ కు అందించడం జరిగింది .. ఒక వైవిధ్యమైన వస్తువు ఎన్నుకోవడంలో నే కవి ఏభై శాతం విజయం సాధించాడు అని ప్రముఖ కవి ,తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యులు ఎండ్లూరి సుధాకర్ కితాబు అందుకున్న కవి గుండెల్లో ఫ్లెమింగో పక్షి చెదరని గూడు కట్టు కుంది .. ఆ కావ్యం విజయాల్ని సుమారు ఐదేళ్లు అనుభూతిస్తూన్న కవి అనేక భారతీయ ,ఇతర దేశ  భాషల్లోకి  ఈ దీర్ఘ కవిత్వం అనువాదం చేయడం ,పలు విశ్వ వేదికల మీద దాన్ని గురించి మాట్లాడుతుండడం వల్ల ఫ్లెమింగో నా జీవితంలో క్రమంగా ఒక భాగమై పోయింది.

unnamed

2015 లో ప్రభుత్వ పండుగగా ఫ్లెమింగో ఫెస్టివల్ ప్రకటన వచ్చిన వెంటనే ఈ కార్యక్రమం లో సాహిత్య వాసన కూడా జోడించాలని తపన పెరిగి ఫ్లెమింగో కవితోత్సవం అనే దక్షిణ భారత కవుల పండుగ పురుడు పోసుకుంది .. ఈ  నా ఆలోచన ముందుగా జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ కి మరియు కొత్తగా జిల్లాలో వెలసిన విక్రమసింహపురి విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య వీ వీరయ్య గార్కి తెల్పి వారి ప్రోత్సాహం తో తెలుగు ,తమిళం ,కన్నడ ,మలయాళం ,తుళు ,ఆంగ్లం భాషలలో సుమారు 15 మంది ఆహ్వానిత కవుల్ని పిలచి వలస పక్షులు అంశంపై నెల్లూరు లో విశ్వవిద్యాలయం కాలేజీ ఆడిటోరియం లో మొదటి కవితా గానం విజయవంతం గా చేసిన సంతృప్తి మిగిలింది.

అలా మొదలైన ఫ్లెమింగో పోయెట్రీ ఫెస్టివల్ 2016 లో డిసెంబర్ ముందస్తుగానే రూపుదిద్దుకుని పక్షుల విడిదికి కూత వేటు దూరంలోనే వున్నా గోకుల్ కృష్ణ కాలేజీ అఫ్ ఇంజనీరింగ్ లో మళ్ళీ దక్షిణ భారత కవులను ఆహ్వానిస్తూ వలస పక్షులు అంశం మీదనే కవి సమ్మేళనం చేయడం ప్రభుత్వ పక్షుల పండుగ కళ పెంచేలా జరిగి కవితోత్సవం అలరించింది. ఈ కవితోత్సవం ముఖ్య అతిధులుగా మళ్ళీ  విశ్వవిద్యాలయం ఉప కులపతి వీరయ్య ,జిల్లా జాయింట్ కలెక్టర్ ఇంతియాజ్ లు హాజరై పక్షుల మీద పలు కోణాల్లో కవిత్వం వెలువరించేందుకు విద్యార్థులు ముందుకు రావాలని ,ఇక్కడకొస్తున్న పక్షుల మీద మరింత పరిశోధన జరగాలని  సూచించారు. ఈ కవిత్వ పండుగలో పాల్గొనేందుకు కవులు ఎంతో ఇష్టంగా వేదిక ప్రదేశం చేరుకున్నారు 24 వ తేదీ డిసెంబర్ ఉదయం తమిళం నుండి సుబ్బరామన్ ,మలయాళం కవులు శ్రీమతి పంకజం ,కుంబ్లేనిగాడు ఉన్నికృష్ణ, హిందీ కవులు డా ఇలియాజ్ ,డా రామలింగేశ్వర రావు ,ఇంగ్లీష్ కవి బెంగళూరు నుండి బి ఎల్ రావు ,సంస్కృత కవి అల్లు భాస్కర్ రెడ్డి , తెలుగు కవులు చిరంజీవి (కర్నూలు),గంగవరపు సునీత (త్రిపురాంతకం ),సరికొండ నరసింహ రాజు (నాగార్జున సాగర్),షైక్ ఖదీర్ షరీఫ్ (సోమశిల )ఈతకోట సుబ్బారావు ,పెరుగు సుజనా రామం ,వర్చస్వి , (నెల్లూరు ) శకుంతలాదేవి (శ్రీహరికోట) పాల్గొని వలస పక్షుల ను విభిన్న కోణాల్లో ఆలపించి ఆనందింప చేసారు.

*

మీ మాటలు

*