ప్రేమ పల్లకీ

లోగో: భవాని ఫణి

లోగో: భవాని ఫణి

 

థ లేకుండా కేవలం ఒక కొత్త జంట మధ్య జరిగే సరదా సన్నివేశాలతో ఒక నవల రాయడం చాలా కష్టం. అది శ్రీరమణ ఎంత సక్సెస్ ఫుల్ గా చేశారంటే,ఆయన ఈ నవలని పెద్దగా నచ్చక పోయినా, పాఠకుల్లో యూత్ అబ్బాయిలంతా అప్పట్లో  హీరోయిన్ గీతను అమాంతంగా ప్రేమించేశారట. ఈ నవల గురించి విశేషాల కోసం శ్రీరమణ గారిని కదిలిస్తే చాలా సంగతులు చెప్పారు. 1976 లో ఆంధ్ర జ్యోతిలో సీరియల్ వచ్చిన ఈ నవలను ఆయన ఆట్టే ఆసక్తి గా ఏమీ మొదలు పెట్టలేదాయన. ఫుల్ టైమ్ గా పని చేస్తూ రెండు చేతుల్తో  బిజీగా ఉన్న ఆ పాతికేళ్ళ వయసులో, టీ కప్పులో సూర్యుడు, రంగుల రాట్నం వంటి ఫేమస్ ఫీచర్లతో అతి బిజీగా ఉంటూ పురాణం సుబ్రహ్మణ్యం గారి కోరిక మేరకు  ఏ వారానికి ఆ వారం హడావుడికి  రాసిచ్చేస్తూ ప్రేమ పల్లకీ ని అలంకరించారు. ఆయన రాసిన ఏకైక నవల ఇది! పైగా ఆయనకు పెద్దగా నచ్చని, తృప్తినివ్వని నవల. అయినా పాఠకులు గీతను తమ ఇంటి పిల్లగా చేసుకుని సూపర్ హిట్ చేసి కూచోబెట్టి అందమైన నేత చీరతో సారె పెట్టారు. 

 aamani1
అందంగా, తెలివిగా ఉంటూ, ఆ తెలివిని అవసరమైన చోట వాడుతూ,  మొగుడి గారి ఇగో గాయపడకుండా చాకచక్యంతో కథ నడిపించి ఎప్పటికప్పుడు గట్టున పడేస్తూ ఉండే గీతకి అసంఖ్యాకంగా ప్రేమికులు ఏర్పడిపోయారు ఆ రోజుల్లో! కుర్రాళ్లంతా , చేసుకుంటే అలాటి పిల్లను చేసుకోవాలని తెగ ఉవ్విళ్ళూరారట. బాపు రమణలకు కూడా  గీత తెగ నచ్చేసింది . అందుకే మిస్టర్ పెళ్ళాం, పెళ్ళి పుస్తకం హీరోయిన్లలో గీత  ప్రతిఫలించేలా చూసుకున్నారు. ముఖంగా మిస్టర్ పెళ్ళాం లో! ఆ సినిమా  చూసినపుడు, ఆమని పాత్ర చాకచక్యం, తెలివీ, పని తనం  ఎక్కడో చూశా ఈ పిల్లను అనిపించేది గానీ ఆ పిల్ల “గీత” అని తట్టనే లేదు. మొన్న శ్రీరమణ గారు చెబుతుంటే “అవును, గీతే సుమా ” అనిపించింది. బహుశా గీతను నేను ఆమని రూపంలో కాక మరో రకంగా మనసులో చిత్రించుకుని ఉంటాను  
 
అన్ని పుస్తకాలూ ఒకే రకంగా నచ్చవు. కొన్ని మెదడులో రగిలించే ఆలోచనలతో పరుగులు పెట్టించి నచ్చితే, మరి కొన్ని చల్లని పడవ ప్రయాణంలా సాగుతూ ఆ పయనం వల్ల నచ్చుతాయి. మరి కొన్ని మరో రకంగా! శ్రీరమణ గారి రచనలెప్పుడూ రెండో రకమే! 
sreeramana
 
మిధునం, బంగారు మురుగు, ధనలక్ష్మి,సోడా నాయుడు.. ప్రతి కథా అంతే! నాకు బుచ్చి లక్ష్మి కంటే ధనలక్ష్మి ఎంతో ఇష్టమైన పాత్ర! ఆ కథను ఎన్ని సార్లు చదివానో లెక్కే లేదు. ఇంట్లో మగవాళ్ల అహాన్ని  తృప్తి పరుస్తూనే మరో వైపు కాడికి రెండు వైపులా తనే ఇద్దరై మోస్తూ.. సంసారాలను కల్పవృక్షాలుగా చేసిన ధనలక్ష్ములు మన చుట్టూరానే ఎంతోమంది ఉంటారు. అలాటి వాళ్ళందరినీ ఆ పాత్ర లో ప్రతిష్టించారు రచయిత.  ఆ భర్తలకు కూడా తెలుసు , భార్యలు తమ అహాన్ని తృప్తి పరుస్తున్నారని, వాళ్ల సామర్థ్యంతో తాము తూగలేమనీ!  
 
శ్రీరమణ రచనలతో ఎక్కడో సున్నితంగా కనెక్ట్ అయిపోతూ… ఆ బంధాలతో మనం కూడా బంధం పెంచేసుకుంటాం.  ఏ రచన అయినా , చదివాక , అక్కడ పడేసి లేచెళ్ళి పోలేం! అపురూపంగా  ఆ రచనను మళ్ళీ మళ్ళీ గుర్తుకు తెచ్చుకుంటూ హాయిగా వెనక్కు వాలి కాసేపు స్థిరంగా దాన్ని అనుభూతించాలని అనిపిస్తుంది. అదెలా ఉంటుందంటే దీపావళి రోజు అమెరికాలో కూచుని ఇండియాలో వెలిగే దీపాల్ని, పేలే టపాసులని దిగులుగా ఊహించుకున్నట్టు .
 
నాలుగు  దశాబ్దాలకు ముందు ఆంధ్ర జ్యోతి వార పత్రికలో సీరియల్ గా వచ్చిన ఈ నవల తర్వాత విడి నవల గా పబ్లిష్ అయింది.ఆ నవల సీరియల్ గా వచ్చినన్నాళ్ళూ, సస్పెన్స్, ఉత్కంఠ రేకెత్తించే అంశాలు ఏవీ లేక పోయినా, గీత రాంపండు ల  ప్రేమప్రయాణం ఈ వారం ఆ పల్లకీ లో ఎలా సాగిందో తెల్సుకోవాలన్న ఉత్సుకతతో పాఠకులంతా ఎదురు చూసే వాళ్లట. 
 
శ్రీరమణ గారి రచనల్లో పాత్రలన్నీ సగటు పాఠకుడికి ఎక్కడో ఒక చోట తారస పడేవే. కానీ వాళ్ళని రచయిత మళ్ళీ మనకు పరిచయం చేస్తుంటే, కొత్తగా అర్థమవుతుంటాయి. మనం మిస్ అయిన కోణాన్ని రచయిత పట్టుకుని మనకు సున్నితంగా అందించేసి నిశ్శబ్దంగా తప్పుకుంటారు.పాఠకుడు మాత్రం ఆ అనుభూతిలో చాలా సేపు ఉండి పోతాడు. 
 
ఈ నవల్లో కథ అంటూ ప్రత్యేకంగా ఏమీ ఉండదు నిజానికి. ఒక కొత్త జంట, పెళ్ళయి ఎనిమిది నెల్లలంటే ఎనిమిది నెలలైన ఒక కొత్త జంట సరి కొత్తగా కల్సి మొదలెట్టిన ప్రణయ నౌకా విహారమే ఈ నవల. చిలిపి కజ్జాలూ, అలకపాన్పులూ, సరదాలూ, కూసింత జీవితం, వీళ్ల చుట్టూ నలుగురు మనుషులూ, వాళ్ల మనస్తత్వాలూ, కొన్ని ప్రేమలూ, పచ్చని తాటాకు పందిరిలో పెళ్ళి వాతావరణంలో చోటు చేసుకునే హాస్యాలూ , పెదవులపై అవి పూయించే చిరునవ్వులూ.. ఇంతే!
 
గీత, రాంపండు(aka రామకృష్ణ) కాపురముంటున్న అద్దె కొంప కి రైలు పెట్టెల్లా వరసాగ్గా మూడు గదులు.  అలాగని ఎవరైనా “ఎంతైనా ఈ ఇంట్లో గాలీ వెలుతురూ తక్కువే” అనంటే ఆ ఇంటి ఓనరు ఉగ్రుడై పోయి “అవును, మాది గాలి కొంప కాదు” అంటాట్ట. రాంపండు మొహమాటమనే కవచంతో పుట్టిన మనిషి. గీతేమో గల గల పారే సెలయేరు.రాంపండుకి  ఎవరితో ఎక్కడ ఏం మాట్లాడాలో బొత్తిగా అర్థం కాదు, తెలీదు. అసందర్భంగా ఏదో ఒకటి అనేసి నిలువునా దొరికి పోతుంటాడు. గీత భగవద్గీతలా రాంపండు  వెనకాలే ఉండి, అతని మొహమాటం వల్ల వచ్చే కష్టాల్ని  ఎప్పటికప్పుడు సాల్వ్ చేసేసి, గట్టెక్కించి “ఆన్సర్ చూసుకో”అన్నట్టు మొహం పెడుతుంది.   
 
 చల్లగా సంసారం సాగి పోతున్నా రాంపండుకి మనసులో ఏదో అసంతృప్తి.  ఏదో షాపులో సేల్స్ గాల్ తో క్లోజ్ గా మాట్లాడుతున్న అబ్బాయిని చూసి “వాళ్ళిద్దరూ లవర్సు! అందుకే అంత క్లోజ్ గా మాట్లాడుకుంటున్నారు. “అని తనే తీర్మానించుకుంటాడు. తనకు “లవర్ లైఫ్” లేకుండానే పెళ్ళై పోయిందని మనసులో ఉన్నా గీత ముందు బయట పడడు. ఆవలింత రాబోతుండగానే పేగులు లెక్కెట్టే గీతకు రాంపండు మనసులో ఏముందో కనుక్కోడం పెద్ద కష్టం కాదు. 
 
రాంపండు కి ఇలా తీరకుండానే మిగిలిపోయిన అతి చిన్న కోరికల్లో పెళ్ళిలో “పల్లకీ” ఎక్కి వూరేగాలని! పాపం అతని పెళ్ళిలో మునసబు గారి ఇంజను లేని కార్లో నెట్టుకుంటూ శక్తి కొద్దీ, స్థోమత కొద్దీ గీతా వాళ్ళు ఊరేగింపు ముచ్చట కూడా తీర్చారు కానీ, ఇంజను లేని  కార్లో ఊరేగింపు అని తల్చుకున్నపుడల్లా రాంపండు ఒళ్ళు జల్దరిస్తూ ఉంటుంది.  
prema-pallaki-cover-page 
రాంపండు ఆఫీసులో పని చేసే చలాకీ భానుమతి, ఆవిడ మొగుడూ వీకెండ్స్ ఇంట్లో బోరు కొట్టించుకోకుండా స్టార్ హోటల్ లో రూము తీసుకుని జాలీగా గడిపేస్తారని తెలుసుకున్న రాంపండు కి స్టార్ హోటల్లో గది ఎలా ఉంటుందో చూడాలని తపన పట్టుకుంటుంది. హోటల్ కి వెళ్ళాక రిసెప్షన్ లో స్కర్ట్ వేసుకున్నమాయి తో ఏం మాట్లాడాలో తెలీక ముందే, ఆ పిల్ల రిజిస్టర్ తీసి “ప్లీజ్” అనగానే , నేను రూము చూడ్డానికొచ్చానని చెప్పడానికి మొహమాటం అడ్డం పడి “సింగిల్ రూం” అంటాడు. రూము బుక్కై పోతుంది. జేబులో డబ్బుల్లేవు. “తర్వాత పంపిస్తాను” అని రూములోకి వెళ్తే, మతి  పోతుంది భయమేస్తుంది. స్కర్టమ్మాయి చూడకుండా బయట పడతాడు గానీ గీతకి చెప్పాలంటే దడ. పాల పాకెట్ కోసం చిల్లర కోసం జేబువెదికిన గీతకు రసీదు దొరికితే.. గీత, అనుమాన పడదు. రాంపండు వ్యవహారం తెలిసిందే కాబట్టి తనే వెళ్ళి రూము డబ్బు కట్టేసి కీ ఇచ్చేసి వచ్చి “ఆన్సర్ చూసుకో” అని మొహం పెడుతుంది.
 
పైకి డాబుగా కనిపిస్తూ, విలాసాల్లో మునిగి తేలే మొగుడూ పెళ్ళాలు మూర్తీ హేమా చీటికీ మాటికీ రాంపండూ గీతల దగ్గర దర్జాగా అప్పులు దబాయించి పట్టుకెళ్తారు. వీళ్ళిద్దరికీ వాళ్ళిద్దరూ చెరో కథా చెప్పేసి బాంక్ లోన్ మీద సంతకాలు పెట్టేస్తారు.వీళ్ళు షాపింగ్ చేసిన వస్తువుల్ని “మేము నిన్ననే సెలెక్ట్ చేసి పెట్టుకున్నాం” అని జబర్దస్తు గా లాక్కు పోతుంది హేమ. సినిమాకెళ్తున్నామంటూ వీళ్ళని కూడా లాక్కు పోయి ఖర్చంతా పెట్టిస్తారు. రాంపండు మొహమాటాన్ని గీత తిట్టదు, విసుక్కోదు. నవ్వుతూనే అతని వెనకాలే ఉంటూ భరిస్తుంది. వీలైనంత వరకూ ప్రతి సమస్యనూ చాక చక్యంగా తేల్చేస్తుంది. 
 
రాంబాబు మనసులో ఉన్న “ప్రేమికుల” కోరికను గీత ఆ మాత్రం  గ్రహించలేదా ? అందుకే ఒక రోజు లంచ్ బాక్స్ తెరిర్చే సరికి “రేప్పొద్దున నుంచీ ప్రేమికులుగా మారి పోదాం, పెళ్ళయిన సంగతి మర్చిపోండి” అని చీటీ కనిపిస్తుంది. ఈ ఎదురు చూడని సర్ప్రైజ్ బాగానే ఉంటుంది కానీ అనుభవంలోకొచ్చాక రాంపండుకి ఒళ్ళు మండేలా చేస్తుంది. గీత “ఏవండీ”లు మనేసి “ఏమోయ్” లోకి దిగుతుంది. ఇంట్లో ఒక ఫుల్ టైమర్ పని పిల్లను పెడుతుంది. “ప్రేమికులన్నాక పొద్దూకులు ఇంట్లో పన్లు చేసుకుంటూ ఉండరు! ఒక ఫుల్ టైమర్ ఉండాలి” అంటుంది. ఆర్భాటంగా ఇంట్లోనే బర్త్ డే చేస్తుంది రాంపండు కి. అదేమంటే “ప్రేమించిన పిల్ల తలంటు పోయడం ఎక్కడైనా ఉందా అసలు ? మనం లవర్స్  కదా “
 
 బట్టలు తనే సెలెక్ట్ చేసి ఖరీదైన టైలర్ దగ్గర బెల్ బాటంస్ కొలతలు ఇస్తుంది. “నువ్వు చాలా హడావుడి చేస్తున్నావ్ గీతా” అని విసుక్కోగానే ” ఇప్పుడు మనం యంగ్ లవర్స్ మి కదా, గుండె కి గుండె అడగ్గానే ఇచ్చి పుచ్చేసుకున్న వాళ్ళం, ఇలాటి చిన్న విషయాల్లో వెంకాడ్డం బాగోదు” అంటుంది. 
 
గీత చెల్లెలు సీత పెళ్ళి  నవలను సరదాగా నడిపే మరొక ఎపిసోడ్. పెళ్ళికి ఇచ్చే బహుమతి మన అభిరుచిని ప్రతిబింబించేలా ఉండాలని రాంపండు అంటే గీత “స్టీలు కంచం కూడా బాగానే “ప్రతిబింబిస్తుంది” పోనీ అది కొందాం” అంటుంది.`
 
గీతా వాళ్ళ వూర్లో రాంపండుని అందరూ “అతనే గీత మొగుడు” గా చెప్పుకోడం రుచించదు. తనకి కొత్త గాజులు తెమ్మని అతన్ని బజారుకి పంపిన గీత అతను వీధిలో పదడుగులు నడిచాక వీధి అరుగు మీద నిలబడి ” కెంపు రంగు గాజులు తీస్కోండి. నిండు నీలం అయినా పర్లేదు, గానీ మెరుపులు వద్దు.” అని అరిచరిచి చెప్పడం రాపండుకి ఉడుకుమోత్తనం తెప్పిస్తుంది. ఆడంగి పన్లు చెప్పడమే కాక అవి నలుగురికీ తెలిసేలా కేకలు.  సిటీ బస్సెక్కితే, తను ఆడవాళ్ళ సీట్ల వైపు వెళ్ళి కూచుని, వెనక సీట్ల వైపు వెళ్ళిన కండక్టర్ కి “గళ్ల చొక్కాకి ఇక్కడ తీసుకున్నాం” అనగానే బస్ లో అన్ని తలకాయలూ రాంపండు గళ్ళ చొక్కా వైపు తిరుగుతాయి.  
 
ఇలాటి చిన్న సైజు అవమానాలు రాంపండుకి చాలానే జరుగుతాయి. . “ఈ గాజులు మా వారు తెచ్చారు” అని గీత అందరికీ చూపిస్తుంటే వినడానికి బాగానే ఉంటుంది కానీ తన్ని “గాజులు తెచ్చే మగాడి కింద కడతారేమో” అని భయమేస్తుంది. కొత్తగా కొన్న రీలు కెమెరాతో రాంబాబు బల్లలు, కుర్చీలు ఎక్కి పెళ్ళి ఫొటోలు తీస్తుంటే అందరూ వింతగా చూస్తుంటే రాంపండు గొప్ప ఫొటోగ్రాఫర్ గా ఫీలవుతాడు. స్టూడియో ఫొటోగ్రాఫర్ రాగానే గీత అందరి ముందూ “అమ్మయ్య,వచ్చారా?రక్షించారు” అనడం పాపం మింగుడు పడదు గానీ మింగక తప్పదు 
 5th-photo-220x300
 “బాత్ రూంలో కొత్తయ్య గారు స్నానం చేస్తున్నారు, మిమ్మల్ని బావి గట్టు దగ్గర చెయ్యమన్నారు” అని పని మనిషి చెప్పగానే గొప్ప రెస్పెక్ట్ పోయినట్టు ఫీలింగ్. సబ్బు కాస్తా జారి బావి లో పడిపోగానే పని పిల్ల ” అయ్యగారు సబ్బు బావిలో పడేశారు” అని పెద్దగా అరవగానే అందరూ బావి చుట్టూ చేరడం, వాళ్ల మధ్య  టవల్ కట్టుకుని  దోషి లా రాంపండు! “సబ్బు పోతే సరే, ఇప్పుడు వంటకి నీళ్ళు పక్కింటి బావి నుంచి తేవాల్సిందే” అని నిర్మొహమాటంగా విసుక్కుంటుంది పని పిల్ల! 
  
ఈ అవమానం నుంచి బయట పడదామని చూస్తుండగానే , దెబ్బ మీద మరో దెబ్బ! మధ్యాహం వేళ ఒక పదేళ్ల పిల్ల వచ్చి “గీతత్తయ్య నిన్ను రమ్మంది” అని చెప్పగానే గీత ఎక్కడుందో తెలుస్కుని మర్యాదగా వెళ్లాలా? ఆ పిల్లని ముద్దు చేస్తూ “ఎవర్నీ? నన్నా? నన్నే రమ్మందా మీ గీతత్తయ్య” అని సాగదీస్తుంటే “సబ్బు మావయ్యంటే నువ్వేగా?” అందా పిల్ల! ఒళ్ళు జల్దరిస్తుంది రాంపండుకి
 
“సబ్బు మావయ్యని రమ్మను” అని చెప్పి పంపిందా గీత! అందరూ తనకి ఆ పేరు పెట్టారా? మళ్ళీ అవమానం
 
మరదలి శోభనం ఏర్పాట్లు జరుగుతోంటే రాంపండుకి తన శోభనం గుర్తొస్తుంది. పాపం అదేమీ రస కావ్యం కాదు. ఫస్ట్ క్లాసు కూపే లో గీతతో కల్సి మద్రాస్ వెళ్దామని ప్లాన్ చేసి రైలెక్కాక, చివరి నిమిషంలో వచ్చిన గీతావాళ్ళ చుట్టాలాయన ఆరేళ్ళ పిల్లకాయని అప్పగించి “ఈ భడవని గూడూరులో వాళ్ళ నానొచ్చి దింపుకుంటాడు, తీసుకుపోండి, ప్రాణాలు తోడేస్తున్నాడు” అని అరటిక్కెట్టు కొని అప్పగించాడాయె, వాడు తెల్లవార్లూ పెట్టిన చిత్ర హింసలకి రాంపండు కలలన్నీ ఆవిరై పోయాయి. 
 
 సీత, సీత మొగుడూ వీళ్ళింటికి వచ్చినపుడు “మీ బావగారికి కజ్జికాయలు, కొబ్బరుండలు, పూతరేకులూ ఇష్టం” అని గీత చెప్పడం నచ్చదు. వెధవ పల్లెటూరి పిండివంటలన్నీ తనకు నచ్చుతాయని దేశమంతా చాటింపేయాలా?
 
“సీత మొగుడితో కాస్త మాట్లాడండి పాపం, ఆ అబ్బాయికి కొత్త కదా, మీరే కలుపుగోలుగా ఉండాలి” అని గీత చెప్పాక రాంపండు తోడల్లుడితో మాట్లాడే మాటలు
 
“మీరు గెజిటెడ్ రాంక్ లో ఉన్నారు కదండీ,మీ ట్రూ కాపీల మీద మీరే అటెస్టేషన్ సంతకాలు పెట్టుకోవచ్చు ఎంచక్కా”
 
ఆఫీసులో అతి సామాన్యుడు గా, అర్భకుడుగా కనిపించే శాస్త్రి పక్కింటి మేష్టారి అమ్మాయిని ప్రేమవివాహం చేసుకున్నాడని తెలిసి ఆశ్చర్య పోతాడు రాంపండు.  హేమ మూర్తీ తాను అనుకున్నంత సంతోషంగా లేరనీ, నిత్యం చలాకీ గా కనిపించే స్టెనో భానుమతి జీవితంలో కనిపించని సుడి గుండాలున్నాయనీ గ్రహిస్తాడు. గీతతో చెప్తే “ఇవన్నీ నాకెప్పుడో” తెల్సంటుంది.
 
“మా శాస్త్రి ఆదర్శ వివాహం చేసుకున్నాడు గీతా”
 
“అంటే పల్లకీ పెళ్ళా?”
  
“పల్లకీ లో ఏం లేదు గీతా”
 
“ఎన్నాళ్ళకి సత్యం బోధ పడింది స్వామీ “
 
నిజానికి గీత మొదటి నుంచీ రాంపండుకి అనుక్షణం అనుభవంలోకి తేవాలని ప్రయత్నిస్తున్నది ఇదే
 
ఇలా చిన్న చిన్న సరదా సంఘటనలూ, వాటిలో దాగున్న అతి సూక్ష్మమైన సూత్రాలతో హాయిగా సాగి పోతుంది గీత రాంపండుల ప్రేమ పల్లకీ ! చివర్లో రచయిత అంటారు “ఈ కథ పూర్తి కాదు. ఏ కథయినా అంతే!పెళ్ళయ్యాక ప్రేమ కథలు పల్లకీ దిగితే కానీ బయట పడవు. గీత రాంపండులు ఎవర్ గ్రీన్ దంపతులు. ఆ మాటకొస్తే మీరు మాత్రం కారేమిటి?కొన్నాళ్లు ఆగితే వాళ్ళిద్దరూ ఏ కథలు చెప్తారో, మనం కాస్త ఆగాల్సిందే”  
 
అయితే ఆ తర్వాత గీత రాంపండులో లేక శ్రీరమణ గారో  బిజీ అయిపోయినట్టున్నారు. ఏ కథలూ చెప్పలేదు. ఆ పాత్రలతో శ్రీరమణ గారు మరో కథ రాయడం గానీ, దీనికి సీక్వెల్ రాయడం గానీ చేయలేదు.
 
ఒక మిడిల్ క్లాస్ జంట వాళ్ళిద్దరూ! కాలంతో పాటూ మిడిల్ క్లాస్ కి నిర్వచనం మారి పోయింది అనివార్యంగా! రాంపండు వాళ్ళుండే అద్దె కొంపను వర్ణిస్తూ రచయిత ఇలా రాస్తారు.”ఇంట్లో ఉన్న కొద్ది పాటి విలాస వస్తువులనీ మధ్య గదిలో పెట్టుకుని ఆనందిస్తున్నారు. ఒక టేబుల్ ఫాను, పోర్టబుల్ రేడియో,అలారం టైం పీసు,చిన్న సైజు ఇనప బీరువా,దాని మీద రెండు సూట్ కేసులూ, ఒక ఆఫీసు టేబులు, ఇవి కాక డబుల్ కాట్ బెడ్….” ఆ మధ్య గదిలో వొదిగిన విలాస వస్తువుల జాబితా ఇది. అవసరం కొద్దీ కొనడం, అవసరమైనవి మాత్రమే కొనడం అనేవి ఇవాళ్టి జీవితాల్లోంచి మాయమై చాలా కాలమైంది. అందుకే నలభయ్యేళ్ళ క్రితం నాటి ఆ విలాస వస్తువుల్ని చూసి, ఒక్క క్షణం కాంటెంపరరీ పాఠకుడు అబ్బుర పడతాడు.
 
మధ్యతరగతి జీవన సౌందర్యం అనుభవంలోకి వస్తే గానీ తెలియని ఒక గొప్పసత్యం .  ఎంతో శాంతి, పరిపూర్ణత్వం, సమతుల్యం, నిబ్బరం ఇవన్నీ మధ్య తరగతి జీవితం సంపాదించుకున్న ప్రత్యేకతలు, మనిషికి నేర్పే లైఫ్ స్కిల్స్ కూడా  ! 
 
నటి భానుమతి రచయిత్రి జలంధర గారికి చెప్పారట ” మీ ఆయన ఎంత సంపాదించినా సరే, జీవితంలో అప్పర్ మిడిల్ క్లాసు జీవన శైలిని కోల్పోవద్దు” అని!(సారంగలోనే మైథిలి అబ్బరాజు గారు జలంధర గారిని చేసిన ఇంటర్వ్యూలో) ఆ వాక్యాలు ఎంత ఆకట్టుకుంటాయంటే ప్రతి ఒక్కరూ వాటిని ఒక జీవన వేదంగా స్వీకరించాలనిపిస్తుంది . బాపు, రమణలు, శ్రీరమణ గారు కూడా మధ్యతరగతి జీవితాన్ని తాము అనుభవించడమే కాక, దాన్లోని సౌందర్యాన్ని పాఠకులందరిలోనూ నింపి, అవగతం చేసి పాఠకుడి నట్టింట్లో దానికి మాంచి నరసరావు పేట పడక్కుర్చీ వేసి కూచోబెట్టారు. 
 
ఈ నవల్లోని ప్రతి సంఘటనా మిడిల్ క్లాస్ ఇళ్ళలో అందరికీ ఎక్కడో ఒక చోట ఎదురయ్యే ఉంటుంది. భానుమతీ, శాస్త్రీ,మూర్తీ, హేమా,అందరూ మన ఎరికలో వాళ్ళే అనిపిస్తుంది.   అందుకే 1976 నుంచీ ఇవాళ్టి ఉదయం వరకూ కూడా గీత రాంపండు ఎవర్ గ్రీన్ జంటగానే ఉండి పోయారు. ఉండి పోతారు కూడా! నలభయ్యేళ్ళ క్రితం కొత్తగా పెళ్ళాడి విజయవాడ లాంటి సిటీలో కాపరం పెట్టిన ఆ జంటకి ఈ నాటికీ, ఏ నాటికీ వయసు పాతిక, ముప్ఫయి లోపే! 
 
నవలను నవోదయ విజయవాడ వాళ్ళు వేశారు, కవర్ పేజీ బాపూ! ఈ కవర్ పేజీని అడగ్గానే సంతోషంగా పంపిన శ్రీరమణ గారికి చాలా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే నా దగ్గర ఎప్పటి నుంచో ఉన్న ఈ నవలకు అప్పటి నుంచీ కవర్ పేజీ లేకుండానే అనేక సార్లు చదివాను, కవర్ పేజీ ఏమై ఉంటుందా అని ఊహించుకుంటూ.
 నవల బయట షాపుల్లో దొరక్క పోవచ్చు కానీ ఆన్ లైన్లో ఒక చోట ఉందని సమాచారం ఉంది . ప్రయత్నించవచ్చు
 *

మీ మాటలు

  1. కె.కె. రామయ్య says:

    “మధ్యతరగతి జీవన సౌందర్యం అనుభవంలోకి వస్తే గానీ తెలియని ఒక గొప్పసత్యం . ఎంతో శాంతి, పరిపూర్ణత్వం, సమతుల్యం, నిబ్బరం ఇవన్నీ మధ్య తరగతి జీవితం సంపాదించుకున్న ప్రత్యేకతలు, మనిషికి నేర్పే లైఫ్ స్కిల్స్ కూడా ! ” ఎంత గొప్పగా చెప్పారు సుజాత గారు. ఓ తరం రచనల్లో … బాపు రమణల రచనల్లో , బాసూ ఛటర్జీ సినిమాల్లో కూడా ఈ భావన కలిగించే వారు.

    శ్రీరమణ గారి ప్రేమ పల్లకీ నవలను( బాపూ గారి కవర్ పేజీ! తో సహా) పరిచయం చేసిన సుజాత గారికి ధన్యవాదాలు.

    నోట్ : తన మిత్రుడు బీమ్న్ ( B.N. మూర్తి ) గారి దగ్గర ఉన్న “ప్రేమ పల్లకీ” నవల అరుదైన కాపీ కవరు పేజీ స్కాన్ చేసి ఈ వ్యాసం కోసం ఇచ్చినట్లు శ్రీరమణ గారు చెప్పారు. నవోదయా వాళ్లకి చెప్పి మళ్ళీ ప్రింటు పుస్తకం గానో, లేదా కనీసం కినిగె లో e-బుక్ గానో ప్రేమ పల్లకీ నవలను ప్రచురించమని చేసిన విన్నపానికి నవ్వి ఊరుకున్నారు ( తనకు పెద్దగా నచ్చని, తృప్తినివ్వని నవల అంటూ, … ఆంద్రజ్యోతి లోని తన సీనియర్స్ పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు, నండూరి రామ్మోహన్ రావు గార్ల ప్రోద్బలంతో రాసిన నవల అనీ తలుచుకున్నారు.)

మీ మాటలు

*