శకలాలూ, విడి శిబిరాలూ వద్దు: శిఖామణి

yanam1శిఖామణి.

ఆధునిక తెలుగు కవిత్వంలో వొక ప్రత్యేకమైన గొంతు. తొలి కవితా సంపుటి ‘మువ్వల చేతికర్ర’ నుంచి నిన్నటి ‘పొద్దున్నే కవిగొంతు’ కవితాసంపుటి వరకు వొక గొప్ప సాహితీయానం ఆయనది. అతనిలానే అతని కవిత్వమూ అతని కవిత్వంలానే అతనూ వుంటారు. శిఖామణి గారి కవిత్వం వివిధ భారతీయ భాషల్లోకి అనువాదమైంది. ఆయన అనేక విమర్శనాగ్రంధాలూ వెలువరించారు. సంపాదకత్వ బాధ్యతలనూ అంతే ధీటుగా నిర్వహించారు.

శ్రీ పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం తులనాత్మక అధ్యయనకేంద్రం డైరెక్టర్ గా ఇటీవల పదవీవిరమణ చేసిన శిఖామణి గారి పర్యవేక్షణలో అనేక మంది పి.హెచ్.డి, ఎం.ఫిల్ పట్టాలు పొందారు.

ఈ నవంబర్ 26,27 తేదీలలో యానాంలో పొయిట్రీ ఫెస్టివల్ జరగనుంది. ఈ సందర్భంగా కవిసంధ్య యానాం ఫెస్టివల్ ప్రత్యేక సంచిక ఆవిష్కరణ వుంటుంది. ఆ మొత్తం కార్యక్రమం గురించి ఆయనతో కొద్దిసేపు :

 యానాం పోయిట్రీ ఫెస్టివల్ చేయాలనే ఆలోచన ఎందుకు వచ్చింది ? ఈ ఆలోచనకు మూలం ఏమిటి ?

హైదరాబాద్ వంటి ఒకటి రెండు చోట్ల జరిగిన లిటరరీ ఫెస్టివల్స్ / పొయిట్రీ ఫెస్టివల్స్ లో తెలుగు సాహిత్యానికి గానీ కవిత్వానికి గానీ అవకాశం లేకపోవడం, వున్నా అవి ప్రాతినిధ్యం వహించేవి కాకుండా నామమాత్రంగా వుండటం చూసి బాధ కలిగించింది. కేవలం కవిత్వానికే మనమే ఒక ఉత్సవం ఎందుకు చేయకూడదు అన్న ఆలోచన వచ్చింది. ఆ ఆలోచన నుండి పుట్టిందే యానాం పొయిట్రీ ఫెస్టివల్.

 యానాం పొయిట్రీ ఫెస్టివల్ అన్న పేరే ఎందుకు పెట్టారు ?

నిన్నటి వరకూ ఉమ్మడిగా ఉన్న తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాలుగా విడిపోయింది. ఎవరి అస్థిత్వాలు, మూలాల అన్వేషణలో వారున్నారు. దీని ప్రభావం సాహిత్యంపైనా తీవ్రంగా పడింది. ఈ నేపథ్యంలో నేను పుట్టిన ఊరు యానాం పేరుతో కవితోత్సవం జరపాలని మిత్రులం అనుకున్నాం ! యానాంలో జరుగుతుంది కనుక యానాం కవితోత్సవం అనేది పేరుకే గానీ నిజానికి ఇది తెలుగు కవితోత్సవం. ఆ మాటకొస్తే భారతీయ కవితోత్సవం !

ఈ ఫెస్టివల్ నిర్వహణ ప్రధాన ఉద్దేశం ?

 లలితకళల్లో కవిత్వానిదే ప్రథమ స్థానం. తెలుగుతో పాటు ఇతర భారతీయ భాషల్లోనూ సమాజం పట్ల, సంఘటనల పట్ల కవిత్వానిదే ప్రథమ స్పందన. దురదృష్టవశాత్తు అస్థిత్వ ఉద్యమాల పేరుతో కవిసమూహం శకలాలు శకలాలుగా విడిపోయివుంది. ఈ శకలాలు ఎప్పటికైనా ఒకటి కావాల్సి వుంది. అందరి స్వప్నమూ ఒక సర్వోన్నత మానవుడే కనుక అది సాధ్యమే ! అందుకు ఇటువంటి ఫెస్టివల్స్ దోహదం చేస్తాయినుకుంటున్నాను.

 ఎలాంటి కార్యక్రమాలు నిర్వహించబోతున్నారు ?

‘మానవ నాగరికత – కవిత్వం’ అనే అంశంపై ప్రముఖ కవి కె. శివారెడ్డి గారు ఫెస్టివల్ ని ఉద్దేశించి కీలకోపన్యాసం చేయబోతున్నారు. ఈ అంశం మీద ఆయన్ని మాట్లాడ్డానికి ఆహ్వానించినప్పుడు ఇంత వరకు ఇటువంటి విషయంపై మాట్లాడమని ఎవ్వరూ అడగలేదని ఆయన ఒకింత ఆనందం ఆశ్చర్యానికి లోనయ్యారు. ఒకప్పుడు తెలుగునాట ఏ పుస్తకం ముఖచిత్రం చూసినా ప్రముఖ చిత్రకారులు శీలా వీర్రాజు గారి బొమ్మ వుండేది. చిత్రకారులు సాహిత్యానికి పరోక్ష ప్రచారకులు. కానీ వారిని సాహిత్యరంగం పెద్దగా గుర్తించినట్టు కనబడదు. ఈ ఉత్సవంలో శీలా వీర్రాజు గారి చిత్ర కళా ప్రదర్శన ఏర్పాటుచేయడం జరిగింది. ప్రధానంగా సమకాలీన భారతీయ కవిత్వంపై సదస్సు – బహు భాషా కవిసమ్మేళనం, సమకాలీన తెలుగు కవిత్వంపై సదస్సు – తెలుగు కవిసమ్మేళనం నిర్వహిస్తున్నాం !

 రెండు రోజుల కార్యక్రమానికి ఎవరెవరు, ఎక్కడెక్కడి నుంచి వస్తున్నారు ?

 రెండు రాష్ట్రాల నుండి, తెలుగేతర రాష్ట్రాల నుండి ప్రసిద్ధులయిన కవులు, రచయితలు, విమర్శకులు చాలా మందే హాజరవుతున్నారు. కొలకలూరి ఇనాక్, మృణాళిని, తనికెళ్ల భరణి , దేవరాజు మహారాజు ( హైద్రాబాద్ ), నలిమెల భాష్కర్ ( కరీంనగర్ ), బన్న ఐలయ్య ( వరంగల్ ), మేడిపల్లి రవికుమార్ ( తిరుపతి ), ఎన్. వేణుగోపాల్, దర్భశయనం శ్రీనివాసాచార్య, యాకూబ్ ( తెలంగాణ ), తుర్లపాటి రాజేశ్వరి ( బెర్హంపూర్ ), మువ్వా శ్రీనివాసరావు, సీతారాం ( ఖమ్మం ), ఖాదర్ మొహియుద్దీన్ ( విజయవాడ ), రసరాజు రాజు, కొప్పర్తి ( తణుకు ), జి. లక్ష్మీనరసయ్య, వినోదిని, ఎం. సంపత్ కుమార్, చందు సుబ్బారావు, ఎల్. ఆర్. స్వామి, రామతీర్ధ, సుధామ వంటి అనేక మంది హాజరవుతున్నారు

 ఇతర భాషా కవులు…. ?

 నిజానికి ఇతర భాషా కవులు సదానందశాలీ, గురుమూర్తి పెండేకురు, గౌరీ కృపానందన్, డేనియల్ నెజెర్స్, జయంత్ పర్మార్, సంతోష్ ఎలెక్స్ వంటి వారిని ఆహ్వానించడం జరిగింది. అయితే ఫెస్టివల్ అనివార్యంగా నవంబర్ 19 నుండి 26 కి వాయిదా పడటం వల్ల వీరిలో ఎంత మంది హాజరవుతారో చెప్పలేను.

 ఈ కార్యక్రమంలో ఇంకేవైనా ప్రత్యేకతలు…. ?

 లేకేం ! చాలనే వున్నాయి. ‘ కవిసంధ్య – కవిత్వపత్రిక – యానాం కవితోత్సవ ప్రత్యేకసంచిక ‘ సుమారు 125 పేజీలలో వెలువడుతోంది. ఇది ఫెస్టివల్ కు ప్రధాన ఆకర్షణగా నిలవబోతోంది. నా మొత్తం కవిత్వంలోంచి దళిత కవితలను ఎంచి ఒక సంకలనంగా ముద్రించి ఉత్సవ వేదిక మీద ఆవిష్కరిస్తున్నాం ! ఇంకా కవులు ప్రసాదమూర్తి, విన్నకోట రవిశంకర్, జి. వి. రత్నాకర్, నేతల ప్రతాప్ కుమార్, నేలపూరి రత్నాజీ, రఘుశ్రీ వంటి వారి కవితా సంపుటులు ఆవిష్కరించబడుతున్నాయి.

 కొత్తగా శిఖామణి సాహితీ పురస్కారం ఏర్పాటు చేసారు కదా ? దాని గురించి.. !

 గత 30 ఏళ్లుగా కవిత్వంలో వున్నాను. ఎందరో కవిత్వాభిమానుల్ని సంపాదించుకున్నాను. వారి మాటలను విన్నప్పుడు ఈ జీవితానికిది చాలు అన్నంత గొప్ప తృప్తి కలుగుతుంది. తెలుగు నాట వున్న దాదాపు అన్ని సాహితీసంస్థలు నా కవిత్వాన్ని పురస్కారాలతో సత్కరించాయి. నాకు ఇంత యిచ్చిన కవిత్వానికి నేను కూడా ఏమైనా యివ్వాలని చంద్రునికో నూలుపోగు చందాన ఈ ఏడాది నుండి ‘శిఖామణి’ సాహితీ పురస్కారం, పదివేల రూపాయల నగదు బహుమతిగా ప్రారంభించాను.

 మొదటి పురస్కారం ఎవరికిస్తున్నారు ?

 పురస్కారం ఏర్పాటు వరకే నా ప్రమేయం ! ఎంపిక కమిటీ చూసుకుంటుంది. ఈ సంవత్సరం పురస్కార కమిటీ సభ్యులుగా సుప్రసిద్ధ సాహితీవేత్తలు డా. సి. మృణాళిని, ప్రముఖ కవి యాకూబ్, కవి – కథారచయిత దాట్ల దేవదానం రాజులు ఏకగ్రీవంగా ప్రముఖ కవి కె. శివారెడ్డి గారిని ఎంపిక చేసారు. ‘శిఖామణి’ సాహితీ పురస్కారానికి ప్రధమంగా ఎంపికైన శివారెడ్డి గారికి శుభాకాంక్షలు.

 కవిసంధ్య నిర్వహణ బాధ్యత, సంచారం, వొక కొత్త పాత్రలోకి ప్రవేశం ఎలాంటి అనుభూతికి లోనవుతున్నారు ?

పాతికేళ్లుగా కవిసంధ్యను నిర్వహిస్తూ వస్తున్నాను. అయితే అది సాహిత్య సంస్థ – ఇది కవిత్వ పత్రిక. ఇష్టంగా చేసే ఏ పని అయినా కష్టం అనిపించదు. ఇదీ అంతే. ఉగాది నుండి పత్రికను తెస్తున్నాం ! మారుమూల యానాం నుండా అని సందేహించినవాళ్లు, సంశయించినవాళ్లు వున్నారు. దాన్ని పటాపంచలు చేయడానికి పత్రికను క్షేత్రస్థాయి కవిత్వ పాఠకుల వద్దకు తీసుకెళ్లడానికి ఈ ఆరునెలలూ పెద్ద సంచారమే చేసాను. సభలకు పిలిచిన చోటల్లా అడిగి మరీ కవిసంధ్య ఆవిష్కరణ పెట్టించాను. అభిమానించారు. ఆదరించారు. ఇలాంటి పత్రిక అవసరం వుందన్నారు. గోరంత పూనికతో మొదలు పెట్టిన ప్రయత్నానికి కొండంత అండనిచ్చారు. నాక్కొంచెం నమ్మకమిచ్చారు. వారందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నాను – ఒక రకంగా ఇది కొత్త అనుభూతి. నిన్నటి వరకు పత్రికలకు పంపి ఎదురుచూసే నాకు కవిత్వాన్ని ఎంపిక చేసి, అచ్చేసే అరుదైన అవకాశం రావడం గొప్ప ఆనందాన్ని అనుభూతిని యిచ్చింది. కవిత్వం రాయడం ఎలా కవుల బాధ్యతో, దాన్ని అచ్చేయడం పత్రికల బాధ్యత. కారణాలు ఏమైనా సరే సుదీర్ఘ నిరీక్షణ, సహనాన్ని పరీక్షించడం, కవులను ప్రమోట్ చేస్తున్నాం వంటివి తొలగిపోవాలి. కవిసంధ్య ఇటువంటి వాటికి దూరంగా వుంటుంది.

 ఆధునిక వచన కవిత్వంలో కవిసంధ్య ఎలాంటి పాత్రని నిర్వహించబోతోంది ?

 ఇప్పుడే స్పష్టంగా చెప్పలేను గానీ నాకు కొన్ని ఖచ్చితమైన ఆలోచనలున్నాయి. వచనకవిత్వం మొదలై 75 సంవత్సరాలు పూర్తి కావొస్తుంది. ఈ సందర్భంగా ప్రాతినిధ్య రచనలతో 75 సంవత్సరాల వచన కవిత సంకలనం తీసుకురావాలని వుంది. వచనకవితా వజ్రోత్సవాలను ఘనంగా నిర్వహించాలి ! అలాగే కవిత్వంలో ఒక పెద్ద తరం నెమ్మదిగా తరలి వెళ్లిపోతోంది. ఎవరో ఒకరిద్దరు తప్ప తమ రచనానుభవాలను నమోదు చేయలేదు – ‘ నా కవిత్వానుభవాలు ‘ పేరుతో ప్రముఖ అనుభవాలను రాయించాలనే ఆలోచన వుంది. ఇవి కొత్త తరం కవులకు పాఠ్యాంశాలుగా ఉపయోగపడతాయి. రకరకాల పేర్ల మారు వేషాల్లో అకవిత్వం కవిత్వంగా చలామణి అవుతోంది – విషాదం ఏమిటంటే కవితాతత్వం తెలిసిన వాళ్లే ఇటువంటి దుశ్చర్యలను ప్రోత్సహించడం – అచ్చమైన కవిత్వాన్ని పట్టి చూపడం, నిలబెట్టడం కవిసంధ్య చేయబోయే పని !

మున్ముందు కవిసంధ్య నిర్వహణలో ఎలాంటి కార్యక్రమాలు చేయబోతున్నారు ?

 చాలానే వున్నాయి. కవితోత్సవం సందర్భంగా చాలా మంది ఫోను చేసి మేం రావచ్చా, పాల్గొనవచ్చా అని అడిగారు. నేను వాళ్లను అడిగిన ప్రశ్న వినడానికా ? అని – దానికి వాళ్లు ఇక్కడ శతాధిక సమ్మేళనంలో, అక్కడ 36 గంటల సమ్మేళనంలో పాల్గొన్నాం అని సమాధానం. కానీ కవి సమ్మేళనాలు కవిత్వాన్ని ప్రాక్టీసు చేసే వేదికలు కావు. వాటికి శిక్షణా శిబిరాలు అవసరం – అలాగే – అనువాద వర్క్ షాపులు నిర్వహించడం, ఆధునిక కవిత్వ పారిభాషిక పదాలతో వివరణిక రూపొందిచడం, ఎంపిక చేసిన కవుల రచనల నుండి కవితలతో ప్రాతినిధ్య కవితా సంఫుటాలను వెలువరించడం వంటి ప్రణాళికలు వున్నాయి – కాలం కలిసొస్తే ఒక్కటొక్కటి పూర్తి చేయాలని వుంది.

*

yanam

మీ మాటలు

  1. యానాం కవితోత్సవానికి నేను హాజరు అవుతున్నాను. ఫ్రెంచ్ పాలనలో ఉన్న యానాం నేల మీద కవితా సదస్సులో, కవులను, కవయిత్రులను కలుసుకోబోయే సువర్ణావకాశం కోసం వేచి ఉన్నాను.

    • సాదర ఆహ్వానం గౌరి గారూ !పనుల వొత్తిడి వలన నేను ఇంతవరకు మీతో మాట్లాడ లేకపోయాను !మీ రాక వుత్సవం లో తమిళ పూల పరిమళం అద్దుతున్ది !…వణక్కం!…శిఖామణి

  2. Badugu bhaskar jogesh says:

    Kavitvonmathuni karyasadhanaku congratulations

    • thank you jogesh !adi prashansaa ?nindaa !meeru raaboye yugam duutalu !vutsavam anthataa meere sandadi cheyyaali mitramaa !…sikhamani

  3. Aranya Krishna says:

    తెలుగు కవిత్వానికి శిఖామణి వంటి క్రియాశీలత, సృజనాత్మకత సమపాళ్లలో ఉన్న కవి పూర్తి కాలం స్వతంత్ర కార్యకర్తగా వ్యవహరించటం తెలుగు కవిత్వానికి శుభ వార్త. కృతజ్ఞతలు. అభినందనలు. చప్పట్లు. ఆత్మీయ కౌగిలింతలు శిఖామణి గారూ! కవిత్వం పండగకి నేను కుడా వస్తున్నాను. ఎప్పుడో ౨౩ ఏళ్ల క్రితం మీ పెళ్ళి సందర్బంగా వచ్చాను. ఇప్పుడు తిరిగి ఇన్నేళ్లకి.

  4. Soulful congrats for the never before event and best of luck.

  5. కందికొండ says:

    గొప్ప కార్యక్రమం…

    గౌరవనీయులు శిఖామణి గారికి
    ధన్య వాదాలు….

Leave a Reply to Badugu bhaskar jogesh Cancel reply

*