నిగ్గు తేల్చిన “మిగ్గు”

 photo-migguuuuu

దళిత కవిత్వం, దళితచైతన్యం ,దళిత స్పృహలాంటి పదాలతోబాటు “దళిత భాష”అనేపదం కూడా సాహిత్యంలోకి వచ్చి చాలా రోజులైంది.అనేకమైన చర్చలు కూడా జరిగాయి.ఉనికి సంబంధమైన ప్రశ్నలతో వచ్చిన దళిత కవిత ధిక్కార,తిరస్కారాలతో కనిపించినప్పటికీ ఈ ఉద్వేగంలోని అణచివేత వెనుక సన్నని దుఃఖపు జీర ఉంది..బహుశః ఈజీరనే భాష,కళాసౌందర్యం,ప్రతీకలులాంటి పదాల ఉనికిని దళితకవిత్వంలో మరింతపటిష్టం చేసింది.

ఏకాలంలో నైనా వస్తువు మారినంత తొందరగా దానిచుట్టూ ఉండే ఆర్థిక,రాజకీయ,సామాజిక చైతన్యాలు మారినంతగా శిల్పం, దాన్ని పెనవేసుకున్న భాష,కళాసంప్రదాయాలు మారవు.కాని ప్రయత్నాలకు మాత్రం పాదుపడుతుంది.ఈ మధ్యవచ్చిన సంపుటాలు ఈ మార్పును నిరూపిస్తాయి.దళితకవిత్వంలో తమదైన శైలి,భాష,కళ,ప్రతీకలు ఈ కాలంలో కనిపిస్తున్నాయి.తెలంగాణాలోని నల్లగొండప్రాంతం నుంచి వచ్చిన”మేమే””బహువచనం””మొగి”లాంటి సంకలనాలు ఈ మార్పుకు నిదర్శనంగానిలుస్తాయని పరిశీలకుల అభిప్రాయం.ఈ మార్గంలో తనదైన భాషావ్యూహంతో ,కళాత్మకంగావ్యక్తం చేస్తున్న కవి పొన్నాల బాలయ్య”మిగ్గు”అందుకు ఉదాహరణగా నిలుస్తుంది. ఈ కాలపు కవిత్వంలో పై అంశాలు నిలబడడానికి ఒకటి రెండు కారణాలను అంచనావేయవచ్చు.జీవితంపై అణచివేతను,దానికి కారణమైన వర్గాన్నే కాక తమదైన ఉనికిగల సాంస్కృతికతపై దృష్టి కలగడం.అందువల్ల తమవైన పదాలు,పదబంధాలు కులమాండలీకాలను కవిత్వంలోకి తేవడం.జీవితంలోని అణచివేత దాన్నానుకున్న దుఃఖపుజీరనుంచి సంఘర్షణ ప్రతిఫలించే భావ చిత్రాలను గీయడం.తొలిదశనుండివచ్చిన పురాణ ప్రతీకలతోబాటు,జీవితాన్ని సంపద్వంతం చేయగలకొత్తపోలికలను,ప్రతీకలను తెచ్చుకోడానికి కళాత్మకమైన ఊహలు చేయడం.

బాలయ్య కవిత్వం ఈ అంశాలకు ఉదాహరణగా నిలబడుతుంది.సమకాలీన కవిత్వంలో వస్తువుకేవలం ఒక వాతావరణానికి సంబంధించింది కాదు.రెండుకు మించిన వస్తువాతావరణాలుంటాయి.బాలయ్యలోనూ దళిత,తెలంగాణా,ప్రపంచీకరణ మొదలైన అంశాలకుసంబంధించిన వస్తువులున్నాయి.వీటన్నిటివెనుక జీవన సంబంధమైన  నీడకూడా స్పష్టాస్పష్టంగా కనిపిస్తుంది.బాలయ్య కవిత్వాన్ని చదువుతున్నప్పుడు మొదట చర్చకు వచ్చేది కవిత్వీకరణకోసం ఆయన వాడుకున్న భాష.తనదైన సంస్కృతినుంచి వారసత్వంగావచ్చిన భాషను మాత్రమే వాడుకోలేదు.సమకాలీన భాషామార్గాన్ని కలుపుకుని ఒక నిర్మాణ సూత్రాన్ని తయారు చేసుకున్నారు

సాంస్కృతికత,పలీయచేతన,వస్తుగతవాతావరణాన్నిప్రతిఫలించే సమకాలీన భాష.ఇవి బాలయ్య కవిత్వభాషలోని మూలకేంద్రాలు.

padam.1575x580 (2)

వత్తులేస్కొని దీపంతైంది కనుపాప/

పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాల చుట్టూ గోసగా/

కొంకులుతెగి కత్తులు బల్లాలు దిగి/

గోనె సంచుల్ల మాసపు ముద్దయి దుక్కిస్తున్న తుంగభద్రమ్మ

చుండూరు ఎదమీద ఎండిపక్కుగట్టిన/రక్తం మట్టిని పిడికిటబిగించి/దప్పులదండు ఎర్రకోటను ముట్టడిస్తది

-(పుండూరు-85)

 

నా తెలంగాణా పల్గిపోయిన పాతడప్పు//

తలమీద దీపం ఎత్తుకొని బాయిలపడ్డ బతుకమ్మ/

తలగొట్టిన తంగెడుపువ్వు త్యాగాల గుమ్మడిపువ్వు/

వాడిపోయిన బంతిపువ్వు రాలిపోయిన గునకరెమ్మ/

నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు“-(పల్గిపోయిన పాతడప్పు-99)

 

కవిత్వంలో చిత్రణ ఒక ప్రధానమైన సృజన బిందువు.సంఘటన నుంచి తనహృదయంపొందిన అనుభవాన్ని చిత్రంగా ఆవిష్కరించడం మొదటి ఖండికాభాగంలో కనిపిస్తుంది.మొదటి కవిత్వాంశంలో దుఃఖాన్ని,రెండవదాంట్లో తిరస్కారాన్ని ఆవిష్కరించారు.అందులోనూ తనదైన సాంస్కృతిక వారసత్వాన్ని,ప్రాంతీయతను సమ్మేళనం చేసి ఒక భాషాగతమైన నిర్మాణాన్ని బాలయ్య సాధించుకున్నారు.”వొత్తులేస్కొని దీపంతైంది కనుపాప”లో కళావిష్కారమెలావుందో,పదాల్లో ప్రాంతీయముద్రకూదా ఆలాగే స్పష్టమైంది.”పచ్చిప్రాణాల తడిపరిభ్రమిస్తుంది పాదాలచుట్టూ గోసగా”లో”గోస”అనేపదం తప్ప మిగతాభాగం అంతాఅధునికభాష.మూడవ వాక్యంలో మళ్ళీ భాషాగతమైన ప్రాంతీయచేతన.చివరి వాక్యంలో కనిపించే తిరస్కారంకూడా ఇలాంటి ఆవిష్కారమే. రెండవ కవిత్వాంశంలో ఒక ప్రాంతీయస్పృహ,సాంస్కృతికస్పృహ తో ప్రాదేశికమైన దైన్యాన్ని ప్రసారం చేస్తున్నాయి.ఈవాక్యాలన్నీ వ్యాఖ్యానాత్మకమైనవే.అందుకోసం వాటుకున్న భాషకూడా సాంస్కృతిక వాతావరణాన్ని ప్రతిఫలించేది.

పూలన్ని బతుకమ్మలో భాగాలయినపూలు.వాటికి ముందు మానవగుణారోపణ చేస్తూ కొన్ని క్రియాపదాలను చేర్చడంద్వారా సాంద్రమైన సంవేదనాత్మకస్థితిని సాధించారు.చివరలో”నీలికట్లపువ్వు నిరసనల కర్రెపొద్దు”అనడంలో నీలిపువ్వును,కర్రెపొద్దు దళితస్పృహలోవాడినట్టుగా అర్థమవుతుంది.రంగుల గురించి కళాతత్వశాస్త్రం చాలా చర్చించింది.ఇందులో సంప్రదాయ,పాశ్చాత్యాంశాలతో పాటు మనోవైజ్ఞానికాంశాలు ఉన్నాయి.ఆ మార్గంలో “నలుపు”అనేక అంశాలను ప్రసారం చేస్తుంది.ఆధునిక కాలంలో కొన్ని రంగులు రాజకీయ మీమాంసలకు కూడా ప్రతీకలవుతున్నాయి.దళిత బహుజన కవిత్వంలో కనిపించే”నలుపు””నీలి”రంగులు.విప్లవ కవిత్వంలో కనిపించే ‘ఎరుపు”రాజకీయ మీమాసతో సంబంధం కలిగినవిగా కనిపిస్తాయి.తెలుపును శాంతికి,పచ్చదనానికి ఆకుపచ్చరంగుని ఈ కాలపు కవిత్వం ప్రతీకాత్మకంగా ప్రసారం చేస్తుంది.

వస్తుగతంగా పొన్నాల కవిత్వంలోదళిత జీవితం  ప్రధానంగాపరచుకుంది.తస్సలకూర(31)మిగ్గు(52)సోలుపోత(56)మజ్జెతి(58)సఫాయి(75)పుండూరు(84)కొంగవాలు కత్తి(86)గండదీపం(93)అశరఫ్(109)మేడారం జాతర(123)మొదలైన అనేక కవితలు దళితస్పృహలో రాసినవి.తెలంగాణా ఉద్యమ సందర్భంగారాసిన కవితలు.ఒకటిరెండు ఎలిజీలు ఉన్నప్పటికి ప్రధానస్వరం దళితగొంతుకే.

1.పుండ్లు పుండ్లైన కండ్లు కవిసే దుక్కపుపుర్రు

గాయపడిన పెయ్యిలందల మాగేసిన తంగెడుచెక్క సున్నంపూసిన బతుకును మంగకంపల మీద ఆరేస్కున్న-(మిగ్గు)

 

2.దోసిట్లనిండబంగారిపురుగుల ఆటలాడేబాలలకు

రాళ్లరప్పల కొండకోనలపొంటిపొడిసిన పసుపు బండారిపొద్దు

పరిగడుపున్నే పొట్తనింపే తీపిగూగెం సీతఫల్కపండు

 

3.సచ్చిన గంగావు గబ్బుగబ్బు వాసనను

తానుముక్కలు చెక్కలై లంద సుగంధంల కడిగి గాలిచ్చి

అతారలు సరిసె తోలుశుద్ధి కార్బన రసాయనం-(నెలవంకలమునుం)

 

ఈవాక్యాలన్నీ దళితజీవితాన్ని ప్రసారం చేస్తాయి.మొదటిది ప్రధానంగ దళిత జీవనవిధానంపై రాసినది.రెండవ,మూడవభాగాలు తెలంగాణా గురించి రాసినవి.అందులోనూ మూడవభాగం తిరిగి దళిత జీవితాన్నే ఆవిష్కరించింది.పొన్నాల కవిత్వం ప్రధానంగా దళితజీవితం,సంస్కృతి,భాషపై ఎక్కువ దృష్టిపెట్టినట్టుకనిపిస్తుంది.

భాషాముఖంగా దళిత కవిత్వం శిల్పంలో తెచ్చినమార్పుకు “మిగ్గు”నిదర్శనంగానిలబడుతుంది.తానుగా ఏర్పాటుజేసుకున్న సృజనసూత్రం బాలయ్యను ప్రత్యేకంగానిలబెడుతుంది.

*

మీ మాటలు

  1. విలాసాగరం రవీందర్ says:

    బాలన్న కవిత్వపు సొగసును చక్కగా విశ్లేషించారు నారాయణ శర్మ గారు

  2. Siddenky Yadagiri says:

    శర్మ గారు బాలన్న ను బాగా ఆవిష్కరించారు

  3. ponnalabalaiah says:

    Shana gari ki dhanyavadalu (miggu review aathmiya sandesham)

Leave a Reply to Siddenky Yadagiri Cancel reply

*