ఎడిటర్జీ
మేము ఒట్టి హాస్యము తప్ప చదవరాదని ఒట్టు పెట్టుకున్నవారము. 2013 సం II లో, దాట్ల లలిత గారు ” ఈదేసిన గొదారి” శీర్షికన సారంగ పత్రిక లో కథలు రాసిరి.
” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ” అని లలిత గారు చెప్పిన కారణాన, ఈ కథలు ఒట్టి హాస్యం అనుకుని మేము చదివినాము. కానీ వెళ్ళగా వెళ్ళగా జీవితం అంత, గోదారి అంత లోతైన కథలు అని అర్ధం అయినవి. మేము చెప్పిన దానికి వలయు సాక్ష్యములు కింద దఖలు చేయుచుంటిమి. ఇందుకు పరిహారము గా లలిత గారు మరిన్ని కథలు రాయాలని మేము కోరుచున్నాము.
O – O – O – O
అందరూ ” భానుమతి గారి “అత్త గారి కథలు ” లాగా ఉన్నాయి అన్నారు కానీ, నా ఉద్దేశం లొ ఆ పోలిక అత్త గారి వరకే. నాకైతే – ముళ్లపూడి , నామిని – కథల్లాగా అనిపిస్తాయి.
కేవలం హాస్యం వేరు. అది తక్కువని కాదు. అదో దారి! నిత్య జీవితం లో జరిగే విషయాలని అల’వోకల్’ గా చెబుతూ – కరుణరసం అంతర్లీనం గా పొంగే హాస్య రసం పండించడం కత్తి మీద సాము – రచనా వ్రుత్తి మీద సాము.
X X X X X
“అలసిన వేళనే చూడాలీ….” కథ లో –
“చంద్రుడు వెండి కంచంలా లేడూ” అన్నారు ఆకాశంలోకి చూస్తూ.
నేను “ఊహు…” అని తల అడ్డంగా ఊపేను.
“పోనీ… వెన్నముద్దలా ఉన్నాడా”అన్నారు.
నేను వూహుహు…అని తల అడ్డడ్డంగా ఊపేను.
పోనీ నువ్వే చెప్పవోయ్ అన్నారు గారంగా.
నేను రెప్పవాల్చక చందమామని చూస్తూ,” మధ్యలో ఆ మసేవిటండీ మాడిపోయిన అన్నం తెపాళాలా చిరాగ్గా . ఏవండీ ఓసారి చందమామను కిందికి దించండి సుబ్బరంగా తోమి బోర్లించేస్తాను “ అని చూద్దునుకదా మబ్బు మాటున ఆ చందమామ , ముసుగు చాటున నా చందమామ భయం భయంగా నన్నే చూస్తూ ….
X X X X X
చందమామ లొ మసిపట్టిన అన్నం తపాళా చూడటం – ఒట్టి హాస్యం కాదు !!
కొందరు తోమేది గిన్నెలనయితే –
ఇంకొందరు రోజూ తళతళా తోమేది ఉద్యొగాన్నీ, ఆశించేది – బాసు ఫేసులో కటాక్ష వీక్షణాల తాలూకు వన్నెలనీ , చిన్నెలనీ.
X X X X X
ఎంత నేర్చినా…? కథ లో –
ఆయేడు శ్రీరామ నవమికి చందాలిచ్చినవారి పేర్లు మైకులో చదువుతూ చివరాకర్లో వరాల్రాజు గారి పేరు కూడా ఒక్కరూపాయెక్కువేసి చదివేసి, మర్నాడు పొద్దున్నే ఆయనింటికెళ్ళి చూస్తే తాళం పెట్టుందట . గడపమీద ఆయేటి చందా వందలకట్టతో పాటు ఓ రూపాయి బిళ్ళ ఒత్తెట్టి కనిపించిందట . కొన్నాళ్ళకి రామిండ్రీ నుంచీ , అనపర్తినుంచీ అప్పులోళ్ళొచ్చి తాళం పగలకొట్టి విలువయినవి అనుకున్న సామానులన్నీ పంచుకు పోయారట. అప్పటివరకూ ఆహా అన్నవాళ్ళే అంతా స్వయంకృతం తేల్చేసారట . మాటలేవన్నా కొనితేవాలా? నాలుక మడతేసి ఎటు కావాలంటే అటు ఆడించడమేకదా !రాజంటే వరాల్రాజే అన్నవాళ్ళెవరూ ఆయన గురించి బెంగిల్లిపోలేదు , మనకింత చేసిన మారాజు ఏవయిపోయేడో అని ఆరా తీయలేదు. ఎందరో వరాల్రాజుల్నీ బంగార్రాజుల్నీ మర్చిపోయినట్టే మర్చిపోయి ఊరుకున్నారట . అంతెందుకూ …వరాల్రాజుగారు చేయించి వేసిన ముత్యాల హారాలు, వెండి కిరీటాలు ధరించిన సీతారాములే ప్రతిఏటా ఆ పాడుబడ్డ ఇంటిముందునించీ ఏవీ తెలీనట్టు చిరునవ్వుతో ఊరేగుతూ వెళ్ళిపోతుంటే ఇంక మనుషుల్ని అనుకోటానికేవుందని అత్తగారు తరచూ బాధ పడేవారు
X X X X X
ఎంతటి జీవిత సత్యం !! “అమరావతి కథలు” గుర్తుకొచ్చాయి !!
” నా రాతలన్నీ కాలక్షేపం బఠానీలు ” అన్న లలిత గారి మాట నిజం కాదు. ఆవిడ కథలన్నీ విలువైనవి. నా లాంటి వాళ్ళు ఉజ్యోగం తపాళా తోమటం లో – అలిసిన వేళ ల సేద దీర్చే అద్భుత ఔషధం.
లలిత గారూ
రాయమని మిమ్మల్ని అడగడం తేలికే ; రాయడమేకష్టం.
మరంచాత – మీకు వీలయినప్పుడూ, ఏమీ తోచనప్పుడూ, తోచినప్పుడూ రాయమని శాయంగల విన్నపాలు.
హెబ్బెబ్బే చిన్నయ్య గోరూ – పైన మొదాట్లో కోర్టు నోటీసు భాష అంతా వుత్తిదే… మిమ్మల్ని నవ్వించడానికి ! ఆయ్ !!
సరే !!! అలాక్కానివ్వండి .. మీరు కొత్త కథ రాసే లోగా మీ గోదారి మళ్ళీ ఓసారి ఈదేసి వస్తాం !!
ఈదేసిన గొదారి గురుంచి చాల బాగా రాసారండి.
ఆ కథలకున్న ఎంతోమంది అభిమానుల్లో నేను ఒకరిని, ఆ కథల గొప్పతనం ఎంత చెప్పుకున్న తక్కువే.
నేను భానుమతి గారి అత్తగారికథలు చదివాను అవి ఆడీయో ఫార్మటు లో కూడా లభిచండం వాళ్ళ రోజు వింటుండేవాడిని. ఆ తర్వాత లలిత గారి కథలు చదివాను.అందరూ ” భానుమతి గారి “అత్త గారి కథలు ” లాగా ఉన్నాయి అనడానికి కారణం ” అత్తగారు ” ఆ పాత్ర గొప్పతనం అది.
నావరకు ఇద్దరి కథలలో నేను గమనించిన సారూప్యత ఏమిటంటే కథ చదివేటప్పుడు మనం వాళ్ళ ఇంట్లో పాత్రల చుట్టూ తిరుగుతూ ఉన్నటుంటుంది.
ఇక లలిత గారి కథలు గురించి చెప్పాలంటే ఒక్కో కథకి ఒక్కో వ్యాసం రాయ్యొచ్చు.
లలిత గారు మా కోసం ఇంకా కొన్ని కథల రాయరు…
అత్యాశ అనుకోకపోతే ఏవేరైన ఈదేసిన గొదారి కథలను ఆడీయో ఫార్మటు లోకి మారిస్తే వినాలని ఉంది.
నేను ఎన్నాళ్ళనుండో అడగాలనుకున్నది ఇక్కడ అడిగేసారు. చాలా సంతోషం .ఎవరడిగనా ఆవిడ రాస్తే ఆవురావురుమంటూ అందరం చదువుకుంటాం కదా? రామిండ్రీ లలిత గారి కథలు (కథలు కావవి అందమైన కబుర్లు) చదువుతుంటే ఆమెతోే పాటే వంటింట్లోేకీ గదిలోకీ పెరట్లోకీ ఆవిడ వెనకే తిరుగుతూ ఆవిడ చెబుతున్న కబుర్లు వింటున్నట్లుంటుంది. ఇవాళ సినిమాల్లో వర్చ్యువల్ రియాలిటీ అంటున్నారు . అది ఆవిడకథల్లో ఎప్పుడో సాధించారు .ఆవిడ కథలు ఎన్ని సార్లు చదువుకున్నానో.రాయమని ఆవిడను నేను కూడా కోేరుతున్నాను. రామిండ్రీ వచ్చి బతిమాలమన్నా కూడా రడీ.
1) ” రామిండ్రీ వచ్చి సిన్నయ్యగోరిని బతిమాలామంటే మావూ రడీ ”
~ ఇట్లు రామిండ్రీ సిన్నయ్యగోరి ఆపిమాని, ఓ అబ్బులుగాడు.
2) యానాం లోని దాట్ల దేవదానం మాస్టారు గారి నుండి సిఫార్స్ ఉత్తరం
( రామిండ్రీ సిన్నయ్యగోరిని మళ్ళీ రాయమని ) కూడా తెచ్చుకుంటాము.
3) బెంగుళూరు, హైదరాబాదు, మద్రాసు ల నుండి అమెరికా దాకా ఉన్న సిన్నయ్యగోరి ( దాట్ల లలిత గారి )
అభిమానుల సంతకాలు, లచ్చాపలచ్చలు సేకరించి తెమ్మన్నా లడీవే.
4) త్రిపుర గారి ఆప్తమిత్ర, పెద్దలు శ్రీ భమిడిపాటి జగన్నాధ రావు గారు కూడా రామిండ్రీ సిన్నయ్యగోరి కి పెద్ద అభిమాని.
దాట్ల లలిత గారు మళ్ళీ రాయాలని భజారా గారి ఆకాంక్ష.
5) పతంజలి గారు పట్టుకోలేని విషయాలను దాట్ల లలిత గారు అద్భుతంగా రాశారు అని మురిసారు
వారి మరో అభిమాని, హితైషి విశాఖ డా. మల్లీశ్వరి గారు.
అద్భుతమైన విన్నపం.
లలిత గారు కరుణించేనా!
ఆమజ్జిన ఓసారి దాట్ల దేవదానం రాజుగారు కనపడ్డప్పుడు సాహిత్యద్రోహి నన్ను బిరుదాంకితులని చేసారు.
ఈ మధ్య మళ్ళీ ఓ సభలో కల్సినప్పుడు ఆయన నన్ను సాహిత్యద్రోహి అంటు కొందరు మిత్రులకి పరిచయం చేసారు.
ఈ రెండు సందర్భాల్లోనూ ఆయన దాట్ల లలిత గారి కధల గురించి చెప్పడంతో… అ చదివేసి హాయిగా గోదారి ఈదేసాను.
2013 నుంచీ లలితగారి కధాగోదావరికి అడ్డుకట్ట పడ్దం చాలా బాధాకరం అనిపించింది.
పూసపాటి కృష్ణంరాజుగారు,కె.యన్.వై. పతంజలి, దాట్ల నారాయణమూర్తి రాజుగారి తరవాత రాచకుటుంబాల జీవన వ్యవహారశైళిని ఆవిష్కరించడంలో లలితగారు గోదారిని దాటెసేరనిపించింది.రాచ కుటుంబాలనుంచి ఓ రచయిత్రి రావడం ఆనందం అనిపించింది.కానీ ఆ ప్రవాహానికి అడ్దుకట్ట పడ్డంతో ఆమె అభిమానులంతా గండి గోదావరు లవుతున్నారు. అప్పుడెప్పుడో పాపులర్ రైటర్స్ రాజ్యమేలుతున్నప్పుడు వారం వారం వారపత్రికల కోసం అంతా చకోరాల్లా నిరీక్షించే వాళ్ళం. మళ్ళీ ఇన్నాళ్ళకి ఓ రచయిత్రిని రాయాలి రాయాలి అని అభిమానులు కోరుకోవడం. ఆమె అందుకు ప్రతిస్పందించిందా అని ఎదురు చూడ్డం లలిత గారి విషయంలోనే కనిపిస్తోంది.
ఏ పరిస్థితులమధ్య ఆమె ఇరుక్కుపోయారో. అన్నిటికీ కాలమే సమాధానం చెబుతుంది.
ఆమె రావాలని రాయాలని కోరుకునే వాళ్ళలో నేనూ ఒకడ్ని.
-వత్సవాయి చిట్టివెంకటపతిరాజు.
లలిత గారికి మెసేజ్ లు కూడా పంపాను. రాయండీ అని విన్నవించుకుంటూ
లలిత గారండీ…