ఎందరో అమ్మలు…అందరి కథలివి!

మాతృత్వం స్త్రీ వ్యక్తిత్వానికి, జీవితానికి పరిపూర్ణతని ఇస్తుందని అందువల్ల ప్రతి స్త్రీ తల్లి అయ్యి తన జీవితాన్ని సార్ధకం చేసుకోవాలని భావించే సమాజానికి సవాళ్ళు ఎదురవుతున్న కాలం ఇది.తమ పిల్లల పెంపకంలో తాము చూపగలిగే నైపుణ్యంతో కానీ వారిని బాధ్యతాయుతమైన పౌరులుగా తీర్చి దిద్దగలిగే నైపుణ్యంతో గానీ సంబంధమే లేకుండా తల్లి కావడం ఒకటే తము సాధించిన గొప్ప విషయంగా భావిస్తూ, ఏ కారణంగా అయినా తల్లి కావడం ఆలస్యం అయిన, అసలు కాలేకపోయిన ఒక స్త్రీని ఇంకా గొడ్రాలు అన్నట్లు చూసే స్త్రీలకు కొదవలేని సమాజం మనది. పెళ్ళి చేసుకోకపోయినా తల్లి కావాలునునే స్త్రీలు, పెళ్ళి చేసుకున్నా తల్లవకూడదని గట్టిగా నిర్ణయించుకున్న స్త్రీలు, తల్లి కావడానికి గర్భాన్ని అద్దెకి తీసుకునే స్త్రీలు సమాజంలో ఇలా ఎన్నో మార్పులు వస్తున్నాయి. మార్పులన్నిటినీ ఈనాటి పరిస్తితులకీ, అవసరాలకీ స్త్రీలు కోరుకునే స్వేఛ్చకీ సమన్వయ పరుచుకుంటూ మార్పులనీ, స్త్రీల స్వయం నిర్ణయాధికారాన్ని గౌరవించే దశలో పూర్తిగా ఇప్పుడు సమాజం లేకున్నా ఎదగక తప్పని పరిస్తితి. ఎన్నో వైరుధ్యాలున్న వ్యక్తుల సహజీవనమే సమాజంలో కొత్త పోకడలనీ మార్పులు వచ్చే వేగాన్నీ నిర్దేశిస్తుంది.
ఇలాంటి నేపధ్యంలో సమ్మెట ఉమాదేవి గారు అమ్మ సెంటిమెంటుని పండిస్తూ రాసిన అమ్మ కధలుకూ చక్కని ఆదరణ ఉందని చెప్పాలి. అమ్మ ప్రేమని పొందటమే కాదు, మాతృత్వం కూడా ఎంత పొందినా తనివితీరని ఒక అనుభవం ఎవరి జీవితంలోనైనా . అందుకే అమ్మ ఇతివృత్తంగా వచ్చే కధలకి లింగ బేధం లేకుండా పాఠకుల ఆదరణ ఉంటుంది. ప్రతి పాఠకుడూ/రాలూ ఈ అమ్మ సెంటిమెంటు తొ రిలేట్ చేసుకోగల్గడమే దీనికి కారణం. ఇక రచయిత్రి కధను నడపడంలో నేర్పరి అయితే వేరే చెప్పేదేముంది? ఆణిముత్యాల్లాంటి కధలున్న ఈ సంకలనం ఆమె తొలి సంకలనం అంటే అభినందించాల్సిన విషయం.
ఇక అమ్మ కధల కొస్తే చక్కని శైలి , తను ఎవరి కధ చెప్తున్నారో, వారి వేష భాషల్ని వారి జీవన విధానాన్నీ, వారి జీవితాల్లోని సంఘటనలని చిత్రించిన తీరు ఎంత సహజంగా వాస్తవికతకి దగ్గరగా ఉంటాయంటే, మనకూ ఆ పాత్రల్లోని కొందరు వ్యక్తులు తారసపడటం గుర్తుకు వస్తుంది. ఎందరో అమ్మలు, ఎన్నో కష్టాల నేపధ్యాలు. అయితే అన్నిటిలోంచీ బురదలోంచి విరిసిన కమలంలా తమ సమస్యల్ని తామే ఒంటరిగా పోరాడి పరిష్కరించుకున్న మహిళలే. ఒక రకంగా ఈ కధలు సమస్యల్లోంచి ఎలా బయటపడచ్చో తెలిపే ప్రేరణాత్మక సందేశాలు. మామూలుగా మనకు తెలిసిన కష్టాలే ఆడవారివి, కానీ అందులో ఎన్నో కొత్త కోణాలు ఆవిష్కరిస్తారు రచయిత్రి. ఆమె ముఖ్య పాత్రలన్నిటి ఆర్ధిక సామాజిక నేపధ్యం ఏమైనా, ఎంతో సంస్కారవంతంగా ప్రవర్తిస్తాయి.సానుభూతే కాదు సహానుభూతీ చూపిస్తాయి.
అమ్మంటే!’ అనే కధలొ కొన్ని వాక్యాలు హృదయాన్ని తాకేలా ఉంటాయి. ఉదాహరణకి ఇది చూడండి. “వెన్నెల్లో నల్ల మారెమ్మ విగ్రహంలా మెరిసిపోతున్న తల్లి వంక అపురూపంగా చూసుకున్నాడు కొమరెల్లి.” మామూలుగా ఇలాంటి ప్రేమ తల్లి మాత్రమే వ్యక్తం చెయ్యగలదు. కానీ యూ ఎస్ లో ఉన్నా తల్లిని చూడటంకోసం తపించిపోయే ఓ కొడుకు, చదువుకుని తనూ తన పిల్లలూ ఎంత నాగరికంగా తయారైనా, పిల్లలు ఎంత నాజూకుగా పెరిగినా కాయ కష్టం చేసి తనకున్న చిన్న భూమి చెక్కలో వ్యవసాయం చేస్తూ ఊరిని వదిలి రాని రైతు స్త్రీ అయిన అమ్మని ఆమె త్యాగాన్నీ మరువలేని కొడుకు కధ.
అమ్మపై ప్రేమకి ఆమె రూపం భాష, అనాగరికత చీర కట్టు ఏదీ అడ్డురాదంటూ ఒక చోట చెప్తారు అమ్మంటే పాలరాతి విగ్రహంలా అపురూపమైన అందం కాదు, ఆదమరుపు ఎరుగని ప్రేమ గని.చాలా మంది దృష్టిలో అమ్మంటే అందమైన రూపంతో, చల్లని చిరునవ్వుతో, అసలు కోపమంటే తెలియకుండా, బిడ్డల కోసం ప్రతీ నిమిషం పరితపించే అనురాగమయి. అమ్మను చూడగానే ఆహ్లాదానికి మారుపేరుగా అనిపిస్తుంటుంది, అనుకుంటారు గాని, నా తల్లి చర్మం వెన్నుకంటుకుపోయిన పొట్టతో, కాయకష్టంతో మొరటు తేలిన శరీరంతో, కాలం పోకడలు తెలియని ఆహార్యంతో, నాగరీకం అంటని నిర్మలత్వంతో, ఈ పల్లెలో మూలన నిలబెట్టిన నిచ్చెనలా నిలిచి పోయింది అనుకున్నాడు చెమరించిన కన్నులతో“.
మనస్విని అనే కధ భర్త పోయిన స్త్రీ గురించి. భర్త పోయాకా స్త్రీ జీవితంలో ఎన్ని మార్పులొస్తాయో,తన సమీప బంధువుల, సమాజం వైఖరి ఆమె పట్ల ఎలా మారతాయో మనకి తెలుసు. ఇవన్నీ ముందే ఊహించిన మృణాలిని ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంటుంది. చనిపోతాడని తెలిసిన తన భర్త నుంచి విడాకులు కోరి అందరికీ దూరమవుతుంది. ఆఖరికి తన పిల్లలకి కూడా.ఆమె కున్న కారణాలు, మన సమాజంలో పెళ్ళిళ్ళు పండగలూ పబ్బాల్లో స్త్రీలు భర్త బ్రతికున్నాడన్న ఒకే కారణం వల్ల పొందే గౌరవాలతో పోలిస్తే, భర్త మరణించాడన్న కారణంగా ఎదురయ్యే అవమానాలూ, తన పిల్లల పెళ్ళిళ్ళలో కూడా తను కేవలం ఏపనికీ పనికి రాకుండా చూడటానికి మాత్రమే పరిమితం కావడం ఆమెనెంత బాధకి ఆత్మ క్షోభకీ గురిచేస్తాయో తెలుపుతాయి. ఆమె చెప్పుకునే వరకూ ఆమె పిల్లలు కూడా ఆమెనర్ధం చేసుకోలేకపోవడం ఒక బాధించే విషయం.
తల్లి ప్రేమకి దారిద్ర్యం అడ్డురాదు. రెండోసారీ ఆడపిల్లనే కన్న కమిలిని అత్త నానారకాలుగా హింసిస్తుంటుంది. తననెంతో ప్రేమించే భర్త సూర్యా ఉన్నా ఆమెకు బాధలు తప్పవు. తన పిల్లను ఎక్కడ అత్త ఎవరికైనా అమ్మేస్తుందో, లేక చంపేస్తుందోనని అనుక్షణం భయపడుతూ, ఆ విషయాలన్ని తన భర్తకి చెప్పుకోలేక అవస్థ పడుతుంటుంది. పొలంలో చల్లే మందువల్ల స్పృహ కోల్పోయిన కమిలిని చూసి భర్త ఏడుస్తుంటే, అత్త ఇంకో పెళ్ళి గురించి ఆలోచిస్తుంటుంది. రెండో పెళ్ళయినా, పిల్లల తండ్రయినా పిల్లనిచ్చేందుకో తండ్రి కూడా రెడీ అయిపోతాడు. కమిలిని ఆస్పత్రికి తీస్కెళ్ళే ప్రయత్నం చెయ్యాలంటే డబ్బులు లేని పరిస్తితి. ఎన్నో మైళ్ళు నడిచి వెళ్ళాల్సిన పరిస్తితి, మంచం మీద మోసుకెళ్ళడానికి పొలం పనులు వదిలి ఇరుగు పొరుగు రాలేని పరిస్తితి. ఎంత దుర్భరమైన జీవితాలు గిరిజనులవి, కళ్ళముందు పాత్రలు, వారున్న ప్రదేశాలు కదలాడుతుంటాయి. రెండు మూడు రోజుల తరవాత పాకుతూ వచ్చిన పసిపాప తల్లి మొహాన్ని తడుముతుంటే స్పృహలోకి రావడంతో కమిలి కధ సుఖాంతం అవుతుంది. అద్భుతమైన కధ,కధనం.
సహన అనే కధలో ఉద్యోగస్తులైన తల్లితండ్రులు అల్లారుముద్దుగా పెంచుకునే పిల్లలు, .పసిపిల్లగా ఉన్నపుడు ఆడపిల్ల బయటికెళ్ళి వీధికుక్కలు వెంటబడి తరుముతున్నాయని భయపడితే, నిజంగానే పెరిగిపోయిన వీధికుక్కల బాధనుంచి తప్పించుకోవడానికి కాలనీ వాసులు మున్సిపాలిటీనాశ్రయించి ఆ బాధనుంచి గట్టెక్కుతారు. కాని కొద్దిగా పెరిగిన ఆడపిల్ల అందంగా కనపడగానే ప్రేమించకపోతే చంపేస్తామని, ఆసిడ్ పోస్తామని బెదిరించే, వేధించే కుర్రాళ్ళకి వెకిలిచేష్టలు చేసే చుట్టుపక్కల అంకుల్స్ తోడయితే ఈ వీధికుక్కల్ని ఎలా కాలనీ నుంచి తరమడం, తమ ఆడపిల్లల్ని ఎలా రక్షించుకోవడం. ఈ మృగాలకన్నా వీధికుక్కలే నయమనిపిస్తుంది. ఈవిషయం తెలిసిన తల్లికి ఎంత సామాజిక స్పృహ, బాధ్యత ఉండకపోతే ఆమె మొదట తన కొడుకును దారిలో పెట్టుకోవాలని ఆలోచిస్తుంది?
మాన్వి, అమ్మతల్లిఅమ్మ సెంటిమెంటుని అద్భుతంగా పండించిన కధలు. మిస్ కాకుండా చదవాల్సిన కధలు. క్షణికానందం వల్లనో, వికటించిన ప్రేమల వల్లనో కలిగిన సంతానాన్ని సంపన్నురాలైన తల్లి వదిలించుకుంటే, రెక్కాడితే గాని డొక్కాడని ఇద్దరాడపిల్లల తల్లి భర్త వారిస్తున్నా ఇంకో ఆడపిల్లని అక్కున చేర్చుకోవడం ద్వారా అమ్మతనాన్ని బతికిస్తుంది బతుకమ్మ కధలోని లచ్చిమి. పిల్లల్ని కన్నాకా తల్లియినా తండ్రయినా ఆత్మహత్య గురించి ఎందుకు ఆలోచించకూడదో చెప్పే కధ వెన్నెలమ్మ. పసిపిల్లగానే తండ్రిని పోగొట్టుకున్న చిలుకమ్మని ఎన్నో కష్టాలకోర్చి పెంచితే ఆ పిల్లని పెళ్ళికాకుండానే తల్లి చేసిన ఇద్దరు కాంట్రాక్టర్లకు సమయం చూసి వడిసెలతో బుద్ధి చెప్పిన చిలుకమ్మ, కధలో చిలుకమ్మపై మనకేర్పడిన సానుభూతి వల్ల పాఠకుడి కచ్చ తీరుస్తుంది. గూడు కధలో అత్తని కాపాడుకోవడం కోసం భర్త చనిపోయాకా కూడా ఇద్దరు పిల్లల తల్లయ్యుండి, తన గర్భాన్ని అద్దెకిచ్చి ఆ విషయం చెప్పలేక చెప్పినా ఒప్పుకోరనిపించి ఎన్నో అవమానాలను ఆఖరికి ఎంతో ప్రేమించే అత్త దగ్గరనుంచి కూడా సహించి ఓర్చుకున్న సంతోషి కధ. ఎంతో ఉదాత్తంగా చిత్రిస్తారు ఈ రెండు పాత్రల్ని రచయిత్రి.
ఇవే కాదు ఇంకా ఈ పుస్తకంలో ఇంకా ఎన్నో చక్కని కధలున్నాయి. ఒక్కొక్క కధా ముగించిన ప్రతిసారి మీ గుండె గొంతులోకొచ్చినట్టనిపిస్తే నేను మరీ ఎక్కువగా ఏమీ పొగడలేదని తెలుసుకోవడం మీ వంతు. ఏమైనా చదివాకా ఒక మంచి పుస్తకం, ఎన్నో మంచి కధలు చదివామన్న తృప్తి మిగలడం మాత్రం ఖాయం.

xxxx

మీ మాటలు

  1. D. Subrahmanyam says:

    శారద శివపురపు గారి విశ్లేషణ బావుండడమే కాకా ఉమాదేవి గారి కధలు చదివించేలా రాసారు.

  2. Sharada Sivapurapu says:

    Dhanyavadalu సుబ్రమణ్యm గారూ

మీ మాటలు

*