మార్పుని ఆహ్వానించాలి: జానకీ బాల

janaki1

ప్రతి నెలా లేఖినీ  మహిళా చైతన్య సాహితీ, సాంస్కృతిక సంస్థ  జరుపుకునే ముఖాముఖి సమావేశంలో భాగంగా లేఖిని సభ్యులు  అక్టోబర్ రెండున  సమావేశమయ్యారు. ఆ రోజు కలిశాను   ఇంద్రగంటి జానకీ బాలగారిని!

జానకీ బాల  ‘కనిపించే గతం’ నవలకు పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం నుంచి ఉత్తమ రచయిత్రి పురస్కారం, కథారచయిత్రిగా రంగా-జ్యోతి పురస్కారం అందుకున్నారు.

మొదటగా మీ బాల్యం,గురించి చెప్పండి

1945  డిసెంబర్ నాలుగున  రాజమండ్రి లో పుట్టాను.  కానీ  ఆ తరువాత  బాల్యం అంతా  తణుకులో   గడిపాను. నా పుట్టిన రోజున  ఇద్దరు మహా గాయకులైన ఘంటసాల గారు, మహమ్మద్ రఫీ పుట్టారని  చాలా గొప్పగా అనిపిస్తుంది.

సమాజం లో ఒక ఉన్నత వర్గం లో పుట్టినప్పటికి చాల దారిద్ర్యాన్ని అనుభవించవలసి వచ్చింది. మా అమ్మగారు సూరి లక్ష్మినరసమాంబ గారు  రచయిత్రి కూడా . ఆ నాటి  పరిస్థితిల  దృష్ట్యా  ఆవిడ  తన రచనలను కొన్ని ప్రచురించినప్పటికీ  తరువాత అజ్ఞాతంగానే ఉండిపోయారు  ఆవిడ నాకు తల్లిగానే కాకుండా సంగీతం నేర్పిన గురువు గారు కూడా, నా స్కూల్ ఫీజులు కట్టిన గుఱ్ఱాల శకుంతల గారిని  ఈ సందర్భంగా  నన్ను చదువుకోమని ప్రోత్సహించి,  స్మరించుకోవాలి. సాయం చేసే చేతులకు కులమతాలు అడ్డు రావు.  ఆ తరువాత  నేను ఆమె ఋణం తీర్చేసాను.అది వేరే సంగతి.

మీ మీద ప్రభావం చూపించన రచయితలు

ఒక్కరని చెప్పలేను  ముఖ్యంగా శ్రీపాద సుబ్రహ్మణ్య శాస్త్రి గారు,బుచ్చిబాబు గారు, మల్లాది వారే కాదు ఇంకా ఎందరో ఉన్నారు,అలాగే  రంగనాయకమ్మ గారి రచనలు  నాకు అత్యంత  ఇష్టమైనవి నచ్చినవి.

మీరు కవయిత్రి కదా? దానికి ప్రేరణ ఎవరు?

స్కూల్ లో ఉన్నప్పుడే  చిన్న చిన్న కవితలు రాసేదాన్ని. నాకు కవిత్వం మీద ఇష్టం కలగటానికి గల కారణం  ప్రముఖ కవి దేవరకొండ బాలగంగాధర్ తిలక్. వారు స్కూల్ లో జరిగే పోటీలకి జడ్జీగా వచ్చేవారు.  ఆయన అప్పటికే గొప్ప కవి,కానీ ఒక విధమైన  అమాయకత్వంతో నేను రాసిన  కవితలు చదవండి అంటూ ఆయనకి చూపించేదాన్ని. ఆయన  నా కవితలు చదివి ఎంతో ప్రోత్సహించేవారు. భవిష్యత్తులో చక్కటి కవయిత్రివి అవుతావని అనేవారు.

మీ మొట్ట మొదటి కధ ఎప్పుడు రాసారు ఆ వివరాలు తెలపండి

అంటే జగతి పత్రికలో ఓ  రెండు స్కెచ్ లు రాసాను.  ఆ తరువాత 1970 లో మనిషికి మరో మలుపు  అనే కధ  ఆంధ్రపత్రికకి రాసాను.ఆ కధ ప్రచురించబడినప్పుడు ఏదో సాధించినట్లు ఆనందపడిపోయాను. ఈ నలబై ఏళ్ళ కాలం లో దాదాపుగా 130 కధలు రాసాను. మొదటి కధా సంకలనం 1980 లో వేసాను. మొత్తం ఆరు సంకలనాలు వచ్చాయి. అవన్నీ కలిపి జానకీబాల కధలుగా 2013 లో ఒక బృహత్’సంకలనంగా వచ్చింది.

మీరు విలక్షణ మైన కొన్ని  రచనలు చేసారు  దాని గురించిన వివరాలు పంచుకుంటారా?

‘కొమ్మాకొమ్మా కోకిలమ్మా’ అని సినీ నేపధ్య గాయనీమణుల అంతరంగాలను ఆవిష్కరించే దిశగా  ఒక్కో గాయనిమణిని  కలిసి వాళ్ళ అనుభవాలను  అక్షరబద్ధం చేశాను. నా అదృష్టం కొంత మంది  ప్రఖ్యాత గాయనీ మణులను కలిసే అవకాశం  అస్మిత ఫౌండర్  వోల్గా ద్వారా కలిగింది. ముఖ్యంగా, పి.శాంతకుమారి, పి.భానుమతి. పి.లీల, జిక్కిలని  కలవడం  వారి అనుభవాలను వారి ముఖతాః  వినడం జరిగింది.  అలాగే  రావు బాలసరస్వతి, సుశీల,జానకి  గార్లను  కలిసి  వారి అనుభవాలను  కూడా రాసాను.

ఇక్కడ ఇంకో  విషయం నేను పాటలు పాడుతానని తెలిసి  మా తణుకులో ఉండే పి సుశీల వదినగారు రాయసం రాజ్యలక్ష్మి గారి ద్వారా  రెండేళ్లు సుశీలగారి దగ్గర మద్రాసులో ఉన్నాను. అప్పటికింకా నేను చాలా చిన్నదాన్ని.  యశస్విని :సినీ నటి,గాయనీ పి.భానుమతి గారి బయోగ్రఫీ, మార్గదర్శి  దుర్గాబాయి దేశముఖ్ జీవిత చరిత్ర, సంగీత చూడామణి శ్రీరంగం గోపాలరత్నం గారి గురించి కూడా పుస్తకాలు రాసాను.

janaki2

మీ జీవితంలో అతి ముఖ్యమైన మలుపు మీ వివాహం ఆ వివరాలు చెప్పండి.

తప్పకుండా! తణుకు లో శ్రీకాంతశర్మగారి అన్నగారు ఉండేవారు. వారు మాకు దూరపు బందువులే. ఆ కారణంగా వారు వచ్చిపోతూఉండేవారు. వారి తో పాటు శ్రీకాంతశర్మగారు కూడా వచ్చేవారు. అప్పట్లో పుస్తకాలు చదవడం, వాటిని గురించి చర్చించుకోవడం జరుగుతూ ఉండేది. శ్రీకాంతశర్మగారు మనం పెళ్లి చేసుకుందామా అన్నారు. అలా మా పెళ్లి జరిగిపోయింది.

మాకు ఇద్దరు పిల్లలు అమ్మాయి కిరణ్మయి డాక్యుమెంటరీ ఫిల్మ్ మేకర్, అబ్బాయి మోహన్ కృష్ణ అచ్చమైన తెలుగుదనానికి అద్దంపట్టే  చిత్రాలు తీస్తున్నాడు.

మీ కధా రచనలకు ప్రేరణ?

ఇంట్లో ఎక్కువ సాహిత్య వాతావరణం ఉండటం వల్ల రాయగలిగే అవకాశం లబించింది. పెళ్లి  తరువాత ఆర్టీసీలో  ఉద్యోగినిగా అకౌంట్స్ డిపార్టుమెంటులో అంకెలతో సావాసం చేస్తూ  అక్షరాలతో రచనలు చేసేదాన్ని, ఆంధ్రజ్యోతి లో శ్రీకాంత్ శర్మగారు ఉద్యోగం విజయవాడలో  జీవితం ఆరంభం. శ్రీకాంత్ శర్మగారు నా కధలు చదివి సూచనలు, సలహాలు ఇస్తూ ఉండేవారు.

ఎక్కువగా ఎవరినీ ప్రశంసించని నండూరి  రామ్మోహన్ రావు గారు నువ్వు కధలు బాగా రాస్తావమ్మా! అనడం, అలాగే వాకాటి పాండురంగారావు గారు లాంటి మహానుభావులు నా కధని మెచ్చుకోవడం నిజంగా ఆనందంగా, సంతోషంగా  అనిపించింది.

మీ నవలల గురించి?

పన్నెండు నవలలు రాసాను. కాకపోతే నాకు  వీక్లీ సీరియల్ రచయిత్రిగా నాకు పేరు రాలేదు. అందుకు బాధ లేదు. నా నవలలు అన్ని కూడా డైలీ సేరియల్స్ గా వచ్చేవి.

చివరగా మీ మాటలు?

రచనలు చేసేటప్పుడు, ప్రాక్టికల్ ప్రొబ్లెంస్ ని గురించి  రచనలు రావాలి. ఆదర్శాలు,మానవత్వం,నీతులు లాంటివి  వట్టి  పేలవమైన పదాలే

అదే విధంగా పూజలు, వ్రతాలూనోముల పట్ల ఆసక్తి లేదు, దేవుడంటే కనిపించని ఒక శక్తి నడిపిస్తోందని నమ్ముతాను.

కొన్ని సార్లు మనలని మనం మార్చుకుంటూ, అంటే ముందు ఒక విధంగా ఉన్న కొన్ని అనుభవాల దృష్ట్యా  మార్పు తప్పనిసరి అవుతుంది. అప్పుడు అలా అన్నావు? ఇప్పుడు ఇలా మారిపోయా వేమిటీ? అనే వారు గమనించవలసిన విషయం, కొన్ని అనుభవాలు జీవితపు దిశను మార్చేస్తాయి కాబట్టి వాటి తో పాటు సాగి పోవలసినదే!

మంచి రచన, చెడ్డ రచన అనేవి లేవు. అది మనం  రిసీవ్ చేస్కోవడంలో ఉంది.

అన్నింటికంటే చాల ముఖ్యమైన విషయం పుస్తకపఠనం అనేది అన్ని వయసుల వారికీ మంచిది. అందుమూలంగా ఆలోచనా శక్తి పెరుగుతుంది.

ఒక లలిత గీతం పాడి  ముగిస్తాను

“రెల్లు పూల పానుపు పైన జల్లు జల్లులుగా ఎవరో..చల్లినారమ్మా… వెన్నెల చల్లినారమ్మా..!
కరిగే పాల కడవల పైన నురుగు నురుగులుగా   మరిగే రాధ మనసూ పైన తరక తరకలుగా
ఎవరో పరచినారమ్మ… వెన్నెల పరచినారమ్మా..!! కడమి తోపుల నడిమీ బారుల
ఇసుక బైళుల మిసిమీ దారుల  రాసి రాసులుగా…రాసి రాసులుగా…
ఎవరో…పోసినారమ్మా.. వెన్నెల పోసినారమ్మా”

అంటూ మధురమైన గొంతు తో అతి మధురంగా పాడిన కృష్ణశాస్త్రి గీతం  పట్ట పగలే వెన్నెల జల్లులు కురిపించింది

****

 

 

 

 

 

 

 

 

 

 

 

 

 

మీ మాటలు

  1. “కొన్ని సార్లు మనలని మనం మార్చుకుంటూ, అంటే ముందు ఒక విధంగా ఉన్న కొన్ని అనుభవాల దృష్ట్యా మార్పు తప్పనిసరి అవుతుంది. అప్పుడు అలా అన్నావు? ఇప్పుడు ఇలా మారిపోయా వేమిటీ? అనే వారు గమనించవలసిన విషయం, కొన్ని అనుభవాలు జీవితపు దిశను మార్చేస్తాయి కాబట్టి వాటి తో పాటు సాగి పోవలసినదే!
    మంచి రచన, చెడ్డ రచన అనేవి లేవు. అది మనం రిసీవ్ చేస్కోవడంలో ఉంది.”

    ఇంద్రగంటి జానకీబాల గారి ఈ మాటలు నాకు చాలా నచ్చాయి. ఇంటర్వ్యూ చేసిన మణి వడ్లమాని గారికి ధన్యవాదాలు.

  2. Thank you Lalita garu

మీ మాటలు

*