మన కథల తొలి ఆనవాళ్ళు

kathana

 

 

vadrevuప్రాచీనకాలంలోకథఎప్పుడుపుట్టిఉంటుంది? కఠినమైనప్రశ్న. మనంహోమోసెపియన్స్ గా  పిలుచుకునే ప్రస్తుతమానవజాతి రెండులక్షల సంవత్సరాల కిందట ఆఫ్రికాలో తలెత్తింది. 1,70,000 సంవత్సరాలకిందట మనుషులు దుస్తులు ధరించడం మొదలుపెట్టారు. 82 వేల సంవత్సరాల కిందట సముద్రపుగవ్వలతో ఆభరణాలు ధరించినట్టు ఆధారాలుదొరుకుతున్నాయి. 77 వేలసంవత్సరాల కిందట దక్షిణాఫ్రికాగుహల్లో గీసిన చిత్రలేఖనాలు కనిపిస్తున్నాయి. 40 వేలసంవత్సరాల కిందట స్పెయిన్ లో అల్టామీరాగుహల్లో చిత్రించిన ఆదిమగుహాచిత్రాల్లో జంతువులతోపాటు, మనిషిబొమ్మలు కూడా దర్శనమిస్తున్నాయి. భారతదేశంలో మధ్య ప్రదేశ్ లో వింధ్యపర్వతశ్రేణిలోని భీం భేట్క గుహలు పదిచదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో దాదాపు ఎనిమిదివందలశిలాశ్రయాలతో 500 పైగా చిత్రలేఖనాలతో అతిపెద్ద ప్రాచీనమానవనివాససముదాయంగానిలబడుతున్నాయి.40వేల సంవత్సరాలనుంచి మానవుడిఆలోచనలో ప్రపంచాన్నిగుర్తించి,తిరిగిదాన్నితనకోసంతాను చిత్రించుకునే క్రమంలో గణనీయమైన మార్పు కనిపిస్తున్నదని మనం అంగీకరిస్తే, క్రీ.పూ. 3,200 నాటికి సుమేరియన్లు రాయటం మొదలుపెట్ట్టినదాకా దాదాపు 30-40 సహస్రాబ్దాలపాటు మానవుడు తనకోసంతాను ఎటువంటి కథలు చెప్పుకుని ఉంటాడు?

మనిషి రాయడం మొదలుపెట్టినప్పటినుంచి మానవచరిత్రలో చారిత్రకయుగం మొదలయ్యిందని మనం చెప్పుకుంటున్నాం. అంతకు పూర్వం ఉన్నదంతా చరిత్రపూర్వయుగం. దాన్నికూడా మనం పాతరాతియుగంగా, కొత్తరాతియుగంగా కాలమానంతో గుర్తించుకుంటున్నాం. 2,00,000 నుంచి 70 వేల సంవత్సరాలదాకా మధ్యపాతరాతియుగంగా, 50 వేలనుంచి 21 వేల సంవత్సరాలదాకా కొత్తపాతరాతియుగంగా, 20 వేలనుంచి 10 వేల సంవత్సరాలదాకా మధ్యరాతియుగంగా గుర్తిస్తున్నాం. కొత్తరాతియుగం 10 వేలసంవత్సరాల కిందట, అంటే, క్రీ.పూ. 8,000 కాలంలో మొదలయ్యిందనుకుంటే, అప్పుడే మెసొపొటేమియాలో వ్యవసాయంమొదలయ్యిందనీ, దాదాపుగా పట్టణనిర్మాణం కూడా మొదలయ్యిందనీ మనం చెప్పుకుంటున్నాం. క్రీ.పూ. 6,000 సంవత్సరాల కాలంలో భూతాపం  చల్లారి మానవుడు జీవించడానికి మరింత సానుకూలమైన వాతావరణంఏర్పడిందనీ, క్రీ.పూ. 3,300 నాటికి కాంస్యయుగం మొదలయ్యిందనీ చరిత్ర రాసుకున్నాం. కొత్తపాతరాతియుగం నుంచి కాంస్యయుగం దాకా మానవుడు జీవించిన జీవితం అత్యంతనాటకీయమైన, ఉత్కంఠభరితమైన, తీవ్రసంగ్రామసంక్షుభితమైనకాలం. ఆ  కాలమంతటా తనచుట్టూ ఉన్న ప్రాకృతికశక్తులతో తలపడుతూ మనిషి తనను తాను ఒక సాంఘికజీవిగా తీర్చిదిద్దుకునే క్రమంలోఅగ్ని,  ధనుర్బాణాలు,  బండిచక్రం అతడికి ఎంత సహకరించాయో అంతకన్నాకూడా కథ అతడికి ఎక్కువ దోహదపడిందని ఇప్పుడిప్పుడే  మనం గ్రహించగలుగుతున్నాం.

తక్కిన జంతువుల నుంచి మానవుణ్ణి వేరుచేసే అద్వితీయసామర్థ్యాల్లో అత్యంత అద్వితీయసామర్థ్యం కథలు చెప్పుకునే సామర్థ్యమే. మానవుడి మెదడు కుడి ఎడమ భాగాలుగా విడివడి ఉంటుందని మనకు తెలుసు. అందులో ఎడమ భాగంలోని ‘ఇంటర్ ప్రెటర్ ’ మానవుడి అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీకథలుగా అల్లుతుందనీ, అనువదిస్తుందనీ ప్రసిద్ధన్యూరోశాస్త్రవేత్త మైఖేల్ గజానిగ అంటున్నాడు. మానవుడి గ్రహణసామర్థ్యాల్లోనూ, ప్రజ్ఞానసామర్థ్యంలోనూ కథలుచెప్పేవిద్య అన్నిటికన్నా ప్రత్యేకమైన సామర్థ్యమని విజ్ఞానశాస్త్రం చాలాకాలం కిందటే గుర్తించింది. మన జ్ఞాపకాల్ని ఒక కాలక్రమంలో గుర్తుపెట్టుకోవడంలోనూ, గుర్తుకుతెచ్చుకోవడంలోనూ మనిషి ఉపయోగించే సామర్థ్యం కథనసామర్థ్యమే. అంతేకాదు, ఆ జ్ఞాపకాల్ని గుర్తుతెచ్చుకునేటప్పుడు మధ్యలోఉండే ఖాళీల్ని పూరించడానికి జరగని విషయాలుకూడా జరిగినట్టుగా తనకుతాను చెప్పుకునే నేర్పు కూడా మానవుడి మెదడుకి ఉంది. ఇట్లా లేనిదాన్నికల్పించగలిగేశక్తి బహుశా ఈ మొత్తం జీవజాలంలో మనిషికి మాత్రమే సొంతం.  ఈ సామర్థ్యం వల్లనే మనిషి మానవుడుగా మారుతున్నాడు.

తనకు సంభవించిన అనుభవాల్నీ, జ్ఞాపకాల్నీ మళ్లా గుదిగుచ్చుకోవడంలో అక్కడక్కడా మధ్యలో ఉన్నఖాళీల్ని పూరించడానికి లేనిదాన్ని కూడా జరిగినట్టుగా మానవుడు ఎందుకు ఊహించుకుంటాడు? దానికి ప్రధానమైన కారణం, మానవుడికి యథార్థాల్నిశకలాలుగా తిరిగి గుర్తుకుతెచ్చుకోవడంకన్నా, ఆ యథార్థాలను సమగ్రంగా తిరిగి తనకైతాను చిత్రించుకోవడం ముఖ్యం. అటువంటి సమగ్రచిత్రణ మానవుడి మెదడును తృప్తిపరుస్తుంది. అట్లా చిత్రించుకునేటప్పుడు మానవుడిలో ఒక ఉద్దీపన కలుగుతుంది. మామూలుగా జరిగిన సంగతులు జరిగినట్టుగా లెక్కవేసుకోవడంలో మానవుడి మెదడులోని ‘బ్రోకా’ భాగమూ, ‘వెర్నిక్’ భాగమూ మాత్రమే సంచలిస్తాయి. దుకాణం ముందు రాసిఉన్న ధరలపట్టిక చూసినప్పుడు మానవుడి మెదడులో ఆ రెండుభాగాలు మాత్రమే సంచలించి ఊరుకుంటాయి. కాని ఆ జాబితాను తన దగ్గరున్న సొమ్ముతో పోల్చి చూసుకోగానే మానవుడి మెదడు ఊహించలేనంతగా ఉద్దీప్తమవుతుంది. ఒక సాధారణ వార్త విన్నప్పటికన్నా ఒక రూపకాలంకారాన్ని విన్నప్పుడు మనిషి మెదడు మరింత ప్రజ్వలిస్తుంది.

ఇట్లా ప్రజ్వలించడానికిగల కారణాల్నిపరిశోధిస్తున్నన్యూరోసైంటిస్టులు ఇప్పుడు’న్యూరోఈస్తటిక్స్’ అనే కొత్త అధ్యయనాన్నిమొదలుపెట్టారు. ఈ అధ్యయనంలో విశేషమైన కృషిచేస్తున్న వి.ఎస్. రామచంద్రన్ మన మెదడులో, ముఖ్యంగా, దృష్టికి సంబంధించిన భాగంలోని న్యూరాన్లను ఉద్దీపింపజేసేపదిలక్షణాల్నిపేర్కొన్నాడు. వాటిలో ముఖ్యమైన ఒక లక్షణాన్ని ‘పీక్ షిఫ్ట్’ గాగుర్తిస్తున్నారు. 1950 ల్లో నికోటింబర్గన్ అనే శాస్త్రవేత్త సముద్రపక్షుల మీద కొన్ని ప్రయోగాలు చేశాడు. అందులో ఆ పక్షులు తమ కూనలకి ఆహారం తినిపించేటప్పుడు ఆ చిన్నికూనలు ఆ పక్షులముక్కుల్ని తాడిస్తుండటం చూసాడు. టింబర్గన్ ఆ పక్షుల ముక్కుల్ని పోలిన చిన్నచిన్నపుల్లలకి చివర ఎర్రటిచుక్కపెట్టి ఆ పక్షికూనలకు చూపించినప్పుడు అవి ఆ పుల్లల్నికూడా తాడించడం మొదలుపెట్టాయి. అప్పుడతడు ఆ పుల్లలమీద మూడు ఎర్రటిచుక్కలు చిత్రించి చూపించాడు. అశ్చర్యంగా, ఆ పిల్లలు మరింత ఉద్రేకంగా ఆ పుల్లల్నితాడించడం మొదలుపెట్టాయి. దాన్నిబట్టి ఆ శాస్త్రవేత్త రాబట్టిన ప్రతిపాదన ఏమిటంటే బయటప్రపంచంలో మనని ఉద్రేకించే విషయాలు వాటిని వక్రీకరించేకొద్దీ (డిస్టార్ట్) మనని మరింతగా ఉద్రేకిస్తాయనేది .

ఆదిమ మానవుడు తనకళలోనూ, తనప్రజ్ఞానంలోనూ కూడా ఈ సూత్రాన్నేపాటించాడని రామచంద్రన్ ప్రతిపాదిస్తాడు. అంటే మనిషి తనకు సంభవిస్తున్నఅనుభవాల్నిపొదువుకునే క్రమంలో తనను మరింత ఉద్రేకిస్తున్నఅనుభవాలను మరింతగా పొదువుకుంటాడనీ,  తిరిగి వాటిని గుర్తుచేసుకునేటప్పుడు వాటిలో తనను బాగా ఉద్రేకించినవాటిని మరింతగా గుర్తుచేసుకుంటాడనీ మనం భావించవచ్చు. తన అనుభవాలకీ, జ్ఞాపకాలకీ ఒక సమగ్రత సంతరించుకునే క్రమంలో మనిషి వాటిని ఒక కథగాపునర్నిర్మించుకుంటున్నప్పుడు, అవసరమైతే వాటి వరుసక్రమాన్నీ, యథార్థాన్నీ కూడా వక్రీకరించి చెప్పుకుంటాడు. అట్లా చెప్పుకునేటప్పుడు జరిగిన యథార్థాన్నిపక్కనపెట్టి జరగనిదాన్ని జరిగినట్టుగా చెప్పుకోవడానికి కూడా వెనుకాడడు. ఆ వక్రీకరణలో అతడు చూసేది మొత్తం వాస్తవాన్నితిరిగి మెనూకార్డు లాగా గుర్తుచేసుకోవడం కాదు. అందుకు బదులు ఆ జరిగిన సంఘటనలో తనను ఉద్రేకించిన రంగునీ, రుచినీ, సువాసననీ మరింత పెద్దవిచేసి, వాటిని మరింతగా తలచుకోవడం ద్వారా తననుతాను ఉద్దీపింపచేసుకోవడం. ఆ ఉద్దీపనలో అతడి మెదడు ఉద్దీప్తమై తద్వారా సంతోషాన్నిఅనుభవిస్తుంది. తన మెదడు పొందే సంతోషాన్నిఅతడొకప్రాణిగా, తన సంపూర్ణఅస్తిత్వంతో స్వీకరించి, సంతోషిస్తాడు.

ఇలా ఒక మనిషి ఉద్దీపన చెందుతున్నప్పుడు ఆ మనిషిని చూస్తున్న మరొక మనిషి కూడా అటువంటి ఉద్దీపనకే లోనవుతున్నాడు. దానికి కారణం మనిషి మెదడులోఉండే ‘మిర్రర్ న్యూరాన్లు’ అని న్యూరోసైంటిస్టులు చెప్తున్నారు. మిర్రర్ న్యూరాన్ల వల్ల ఒక మనిషి తనకు కలుగుతున్నబాధను గ్రహించడమేకాక, అదే పరిస్థితుల్లో ఎదుటిమనిషికి కలుగుతున్నబాధకికూడా అంతే తీవ్రంగా స్పందించగలుగుతున్నాడు. న్యూరాన్లకు స్వపరభేదం లేదు.

అందువల్ల ఒక మనిషి తాను పొందే సంతోషాన్నిమొత్తం తెగకీ, జాతికీ, తన చుట్టూ ఉంటే మానవసమూహమంతటికీ కూడా అందించడానికి ఉత్సాహపడటమే ప్రాచీనకళాస్వభావం, కథాస్వభావం. అందుకనే, ప్రాచీనమానవుడి కళారహస్యానికి అత్యంతసమీపంగా ప్రయాణించగలిగిన ఆధునికచిత్రకారుడు పికాసో  ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడిచేయడమే కళ’ అన్నాడు.

ప్రాచీనగుహాలయాల్లో, స్పెయిన్ నుంచి ఆస్ట్రేలియా దాకా మానవుడు చిత్రించిన చిత్రలేఖనాల్లో ఈ కథనస్వభావాన్ని మనం గుర్తుపట్టవచ్చు. ఆ చిత్రలేఖనాల్లోని అడవిదున్నల కాళ్లు సన్నగా ఉంటాయి. కానీ మాంసపరిపుష్టమైన వాటి దేహాలు మాత్రం పరిపూర్ణవికాసంతో కనిపిస్తాయి. ఖడ్గమృగాలంటే కొమ్ములే. ఎలుగుబంట్లు బాగా బలిసి కనబడతాయి. మానవుల్ని చిత్రించడంలోనూ ఇదే ధోరణి. ప్రాచీన స్త్రీప్రతిమల్నిచూడండి, వాటిలో బాగా పరిపుష్టంగా ఊగే వక్షోజద్వయం, పెద్ద కడుపులు, కొట్టొచ్చినట్టు కనబడే స్త్రీజననేంద్రియాలు. ఆ ప్రతిమలకు కాళ్లూ, చేతులు, తల ముఖ్యంకావు. 25 వేల సంవత్సరాల కిందట మానవుడి దృష్టిలో స్త్రీ అంటే రతి, ప్రత్యుత్పత్తి, పుష్కలత్వం. అంతే. ఆ స్త్రీప్రతిమను చూడగానే ఆ మానవుడికి అతడి తెగకీ కూడా అవిచ్ఛిన్నసంతానక్రతువూ, ఆశావహమైన భవిష్యత్తు సాక్షాత్కరించేవి.

మానవుడి మెదడులోని కుడిభాగం విషయసేకరణకు సంబంధించింది కాగా, ఎడమభాగం ఆ విధంగా సేకరించినవిషయాల్నిబట్టి మానవుడికొక కథ అల్లిపెడుతుందని గమనించిన న్యూరోసైంటిస్టులు మరొకవిషయం కూడా గమనించారు. అదేమంటే, రకరకాల సందర్భాల్లో మానవుడిమెదడు దెబ్బతిన్నప్పుడు లేదా మెదడులోని రెండుభాగాల మధ్య పరస్పరసంకేతాలు తెగిపోయినప్పుడూ కుడిభాగంనుంచి సంకేతాలు అందినా అందకపోయినా ఎడమభాగం ఏదో ఒక విధంగా ఆ ఖాళీల్నితనకైతాను పూరించుకుని ఏదో ఒక విధంగా తన ముందున్న ప్రపంచాన్ని లేదా తాను లోనవుతున్నఅనుభవాల్నీఏదో ఒక విధంగా వివరించడానికి ప్రయత్నిస్తుంది. కనుకనే ప్రసిద్ధరచయిత జొనాథన్ గాడ్షాల్ మనిషిని ‘ద స్టోరీటెల్లింగ్ ఏనిమల్’ అన్నాడు. అతడిట్లారాశాడు:

‘పరిణామక్రమం మనకి కాలక్రమంలోమన మెదడు లోపల ఒక షెర్లాక్ హొమ్స ని రూపొందించింది. ఎందుకంటే ఈప్రపంచం (ఇతివృత్తాలు, సమస్యలు, సంఘటనలు, కార్యకారణసంబంధాలుమొదలైనవాటితో) పూర్తిగా కథామయం. కారణాల్నీ, కథల్నీవెతకడంలో ఒక ప్రయోజనంఉంది. మానవుడు పరిణామక్రమంలో స్థితిగతులకు తగ్గట్టుగా తనను తాను సర్దుబాటు చేసుకునే క్రమంలో కథలు చెప్పేమనస్సు కూడా ఒక ప్రాకృతికఅవసరంగా రూపొందింది. దానివల్ల మనం మన జీవితాల్నీ, సువ్యవస్థితంగానూ, సార్థకంగానూ అర్థంచేసుకునే అవకాశం లభిస్తున్నది. జీవితం తెంపులేని రణగొణధ్వనిగానూ, సంక్షోభంగానూ కాకుండా మనను కాపాడుతున్నది.

అయితే కథలు చెప్పేమనస్తత్వం పూర్తిగా పరిపూర్ణమైనది కాదు. మానవుడి మెదడులోని ఎడమభాగంలో కథలల్లేభాగాన్ని దాదాపు ఐదుదశాబ్దాలపాటు పూర్తిగా అధ్యయనం చేసిన తరువాత, మనలోని ఈ చిన్నమానవుడు నిజంగానే ఎంతో విలువైనవాడే అయినప్పటికీ, చతురుడు, కట్టుకథలల్లేవాడు కూడానని మైఖేల్ గజనిగ భావించాడు. ఎందుకంటే మానవుడిలోని కథలల్లే మనస్తత్వం అనిశ్చయాన్నీ, యాదృచ్ఛికతనీ, కాకతాళీయతనీ భరించలేదు. దానికి ఏదో ఒక అర్థంకావాలి. అట్లా అర్థంచేప్పుకోవడానికి అది అలవాటు పడిపోయింది. ఈ ప్రపంచంలో కనిపిస్తున్న వివిధవిషయాల మధ్య సార్థకమైన అమరికక నిపించకపోతే అది దాన్ని తనంతటతనుగా ప్రపంచం మీద ఆరోపించడాని కివెనుకాడదు. క్లుప్తంగా చెప్పాలంటే, కథలు చెప్పేమనస్సు ఎంత వీలయితే అంత నిజమైన కథలు చెప్తుంది. అట్లా చెప్పలేనప్పుడు అబద్ధాలు కూడా చెప్తుంది.

ఇట్లా తనముందు కనిపిస్తున్నవాటికి ఏదో ఒక అర్థంచెప్పుకోవడానికి ప్రయత్నించడంలోనూ, అటువంటి అర్థం స్పష్టంగా గోచరించనప్పుడు తానే ఏదో ఒక అర్థాన్నిఆరోపించి చెప్పడంలోనూ, మానవుడు తొలికథకుడుగా రూపొందాడని మనం ఊహించవచ్చు.

అటువంటి తొలికథలు ఎలా ఉండేవో తెలుసుకోవాలంటే, మనం చరిత్రపూర్వయుగంలోకి,  అంటే ఇప్పటికి ఐదువేలసంవత్సరాలువెనక్కివెళ్లాలి.  ప్రపంచమంతటా నేడు అన్నిజాతుల్లోనూ లిఖితవాఙ్మయానికి సమాంతరంగా మౌఖికవాఙ్మయం కూడా ప్రచలితంగా కనిపిస్తున్నది. దీన్ని మనం ‘ఫోక్ లోర్’ అని పిలుస్తున్నాం. కానీ ఈ ఫోక్ లోర్ మీద చరిత్రయుగపు మానవుడిభావజాలం, లిఖిత వాఙ్మయప్రభావం కూడా గణనీయంగా ఉన్నందువల్ల ఈ మౌఖికవాఙ్మయం ఆధారంగా మనం ఆదిమానవుడి తొలికథల్నిగుర్తుపట్టడం కష్టం. ఇటువంటి ప్రభావాలకు అతీతమైన తొలికథల్నిగుర్తుపట్టాలంటే నాగరికమానవుడి నీడ పడని ఆదిమమానవసమూహాలకథల్నిఅన్వేషించాలి. కానీ ఆ కథలు రాతపూర్వకంగా మనకు లభ్యంకావడంలేదు కాబట్టి, మనం చేయగలిగిందల్లా ఆనాటి మానవుడు జీవించిన జీవితానికి సన్నిహితంగా ఉండే జీవనసరళితో జీవిస్తున్న వివిధ మానవసమూహాల కథల్నిఅధ్యయనం చేయడం. ప్రపంచమంతటా అక్షరపూర్వ జీవనవిధానాన్ని అనుసరిస్తున్నఅనేకఆదిమజాతులు చెప్పుకునే కథల్లో మనకు చరిత్రపూర్వయుగం నాటి మానవుడు చెప్పుకున్నకథల తాలూకు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఆఫ్రికాలోని బుష్ మన్లు, జపాన్ లోని ఐనూలు, ఆస్ట్రేలియాలోని వార్లిపిరి, నర్రిన్యేరి తెగలు, పసిఫిక్ మహాసముద్రద్వీపాల్లోనివసించే టికోపియా, ఇఫలుక్ తెగలు, తూర్పుదీవుల్లోని రాపానుయి తెగ, ఆనవాళ్లులేకుండా అంతరించిపోయిన టాస్మేనియన్లు, యమానవంటి మానవసమూహాల కథల్లో మానవుడి తొలికథల పోలికలు కనిపిస్తాయి.

గత రెండుశతాబ్దాలుగా మానవశాస్త్రజ్ఞులు, భాషాశాస్త్రజ్ఞులు, అన్వేషకులు చేస్తూ వచ్చిన వివిధ పరిశోధనలద్వారా, అధ్యయనాల ద్వారా, తులనాత్మక అధ్యయనాల ద్వారా మనకు అటువంటి కథల ప్రాథమికరూపాల గురించి స్థూలమైన అవగాహన లభిస్తున్నది. ఆంద్రేజోల్స్ అనే ఒక కళాచరిత్రకారుడు వీటిని ‘సరళరూపాలు’ అన్నాడు. అతడి ప్రకారం ఆ సరళరూపాలు పురాగాథ, వీరగాథ, పురాణగాథ, పొడుపుకథ, సుభాషితం, ప్రామాణికగాథ, స్మృతి కథ, జానపదకథ, ఛలోక్తీను.

 

(కథలో  సంక్లిష్టత…వచ్చే  నెల)

మీ మాటలు

  1. Mee artical chaala bagundhi.kaalam sidhilaala nunchi,katha ni tavvi posthunnaru.

  2. JSR Murthy says:

    మీ వ్యాసంలో ప్రతి అక్షరం ఆలోచింపజేసేదిగా ఉంది. కథలు రాసేవాళ్ళందరికీ కథ గురించిన మీమాంస తప్పకుండా ఉంటుంది. ఆ కథ పుట్టుక వెనుక ఉన్న చరిత్రని తవ్వి తీసే ప్రయత్నం చాలా సూత్రబద్ధంగానూ, శాస్త్ర సమ్మతంగానూ ఆనిపిస్తోంది. అంతే కాదు, మీ తరువాతి వ్యాసం కథలో సంక్లిష్టత గురించి ఎదురు చూసేలా చేస్తోంది. అభివందనాలు.
    జొన్నవిత్తుల శ్రీరామచంద్ర మూర్తి

  3. krishna jyothi says:

    ‘అసత్యం ద్వారా సత్యాన్ని వెల్లడిచేయడమే కళ’ . మంచి విషయం. మంచి విశ్లేషణ

Leave a Reply to krishna jyothi Cancel reply

*