‘మాష్టారూ.. పేకేసుకుందామా..?’

images

గౌరవ పూజ్యులైన మాస్టారికి..

నమస్కారాలతో-

బావున్నారా?, గురుపూజోత్సవం రోజు గుర్తుకు వచ్చారు. నేను గురువునైనా నా గురువు మీరు కదా? మీతో ఫోన్లో రెండు ముక్కలు మాట్లాడేకన్నా నాలుగు ముక్కలు వుత్తరంగా రాద్దామని యెందుకో అనిపించింది. ఇదిగో అదిగో అని మన ‘ఉపాధ్యాయ దినోత్సవం’ వెళ్ళిపోయి ‘ప్రపంచ ఉపాధ్యాయ దినోత్సవం’ వచ్చేసింది.

మాస్టారూ.. మీరంటే చిన్నప్పటి నుండి నాకు చాలా యిష్టం. ఎంత యిష్టం అంటే పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు. మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు. అప్పటికీ నేను మిమ్మల్ని అడిగాను.. ‘ఆ రోజుల్లో- మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట చదివిన పాఠాలకన్నా యెక్కువ గుర్తుంది. ఈ రోజుల్లో- మా రోజుల్లో ‘బతకడానికి బడిపంతులు’ అని అంటున్నారు!

ఔను.. ఇప్పుడు బతకడానికి బడిపంతులు. జీతాలు బాగా పెరిగాయి. బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళున్నారు. పిల్లలతో పాటు మనమూ యింటికి వచ్చేయొచ్చు. పిల్లలతో పాటు మనకూ సెలవులు వుంటాయి. స్ట్రెస్ లేదు. స్ట్రెయిన్ లేదు. ప్రెజర్ లేదు. బ్లడ్ ప్రెజర్ లేదు. పాఠం చెప్పామా.. మన పని అయిపోయిందా.. అంతే. చెప్పినా చెప్పకున్నా నడుస్తుంది. అదంతే. అప్పుడప్పుడూ ప్రభుత్వం ఆపనీ ఈపనీ అని అడ్డమైన పనులూ అప్పజెప్పినా మిగతా ప్రభుత్వ వుద్యోగులతో పోలిస్తే మనమే నయం. మిగతా ప్రభుత్వ శాఖల్లో వుద్యోగులు వుద్యోగుల్లా లేరు. పార్టీ కార్యకర్తల్లా వున్నారు. జెండాలూ చొక్కాలూ వొక్కటే తక్కువ. అలా వుండకపోతే వుద్యోగం చెయ్యలేరు. చెయ్యనివ్వరు. ఏ పార్టీ అధికారంలోకి వొచ్చినా అంతే. ఇప్పుడు యింకాస్తా యెక్కువయ్యింది. మన పనిగంటల్లో మనం పనిచేసి రావడానికి లేదు. సాయంత్రం అయిదు తరువాతే అధికారులు వస్తారు. పగలంతా పని వొదిలి, అప్పుడు విధులు చేపడతారు. పని గంటలు దాటాకే వుద్యోగులకి పనికి ఆహార పథకం ప్రారంభమవుతుంది. కింది నుండి పైదాకా ఆమ్యామ్యాలే. పెరసంటేజీలే. కంచం లేని యిల్లు వుండొచ్చు. లంచం లేని ఆఫీసు లేదు. అయ్యయ్యో అనుకోకుండా అసహ్యించుకోకుండా ‘అయ్యో.. మనకి వాళ్ళలా రెండు చేతులా రాబడి లేదే’ అని వాపోయే వుపాధ్యాయులే మాలో యెక్కువ. డిగ్రీలూ పీజీలూ పీహేచ్దీలూ చేసి చాలక- బియ్యీడీ యెంట్రెన్సులూ రాసి- ర్యాంకుల కోసం కోచింగులకూ వెళ్ళి- చచ్చే చెడీ ర్యాంకులూ తెచ్చుకొని- శిక్షణ పూర్తిచేసి- పాసయినా కాదని లేదని మళ్ళీ టెట్ లూ రాసి- దాని కోసం మళ్ళీ కోచింగులకూ వెళ్ళి మార్కులు స్కోరూ చేసి- మళ్ళీ డియ్యస్సీ నోటిఫికేషన్ కోసం చూసి- కోచింగ్ సెంటర్లో చేరి- పరీక్ష రాసి- నెగ్గితే అప్పుడు వుద్యోగం. ఈ వుద్యోగంలో చేరినాక ఆ అలసట తీరేలా రిలాక్స్ అయిపోవడమే. జీవితాంతమూ రిలాక్స్ అయిపోవడమే!

ఉపాధ్యాయ వృత్తి గొప్పది కావచ్చు. కాని వుద్యోగంలో చేరినాక – వుద్యోగంగా గొప్పది అనుకొనేవాళ్ళు తగ్గిపోయారు. అందుకే వుపాధ్యాయ వుద్యోగంలో చేరినవాళ్ళు సబ్జెక్ట్ చేతిలో వుంటుంది.. గ్రిప్ వుంటుంది.. అన్నంతవరకే వుండి, ఆపైన పిల్లలకి చెప్పాల్సిన పాఠాలు గాలికి వదిలి, ‘కాంపిటేటీవ్ కు ప్రేపేరవడం’లో ములిగి, గ్రూప్సో సివిల్సో సాధిస్తామన్న నమ్మకంలో తేలి, తాము అవకాశం లేకనో ఆపద్ధర్మంగానో అందులో వున్నాం తప్పితే, తమ స్థాయి యిది కాదని ప్రెస్టేజ్ ఫీలవడం.. ఆఫీలింగు అందరికీ చూపించడం ద్వారా యెక్కడో వుండాల్సిన వాళ్ళం యిక్కడ యిలా యీసురోమంటూ యేడవాల్సి వొస్తున్నందుకు దేవుణ్ణి నిందించడమో.. పూజలు చెయ్యడమో.. మొక్కులు మొక్కడమో.. యింతే. కాదంటే ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో.. అంతే!

ఒక్క జీతం మీద బతకడం కష్టం. నాతం కూడా వుండాలి. నాతం లేదని నాతోటివాళ్ళు నానా బాధా పడిపోతున్నారు. నానా గడ్డీ కరుస్తున్నారు. ఇప్పుడు మన వుపాధ్యాయుల్లో చాలా వరకు రియలెస్టేట్ బ్రోకర్లే.. తప్పితే డైలీ కట్టుబడి వ్యాపారం చేసేవాళ్ళే.. ఈ బ్రోకర్లకి యే సైటు యెక్కడవుందో తెలిసినట్టుగా యే పాఠం యెక్కడవుందో తెలీదు. ఈ ఫైనాన్షియర్లకి వడ్డీ లెక్కలు తప్ప మరే లెక్కలూ రావు. మొత్తానికి యేదో వొక వ్యాపారం.. యేదో వొక వ్యవహారం.. యేదీ లేకపోతే ప్రవేటు కాన్సెప్ట్ కార్పోరేట్ స్కూళ్ళలో కాలేజీల్లో పిల్లల్ని పోటాపోటీగా చేర్పిస్తున్నారు. ఒక విద్యార్థిని చేర్పించినందుకు అయిదు నుండి పది వేలు ఆదాయం. అక్కడున్న విద్యాసంస్థలను బట్టి.. యేరియాని బట్టి.. ఆ ధరలు అటూ యిటూ అవుతాయి.. అంతే. గవర్నమెంటు కాలేజీల్లో పనిచేసిన లెక్చరర్లు అయితే రిజైన్ చేస్తే భద్రత వుండదు గనుక సెలవు పెట్టి ప్రవేటు కాలేజీలలో పనికి కుదిరిపోతున్నారు. ఎన్నడూ లేనిది శ్రద్ధగా నోట్సులు కూడా తయారు చేస్తున్నారు. నిజానికి ప్రభుత్వం కంటే ప్రవేటు వాడు యెక్కువ యేమీ యివ్వడు. కాని అసలు కంటే కొసరు మీదే యావ. ఇక్కడ చూస్తే సెలవు పెట్టిన కాలేజీకి కొత్త లెక్చరర్లు రారు. పాఠాలు జరగవు. ఆశించిన ఫలితాలు రావు. కాలేజీలు నడవవు. గవర్నమెంటు ఇన్స్టిట్యూషన్స్ లో చదువులు బాగోవు అని మాట. ఉన్న క్యారక్టర్ని చెరిచేస్తున్నారు. చేరిపేస్తున్నారు. అధికార్లూ అంతే. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు నడుస్తున్నాయి. అవి అర్హత లేనివి కావు. ఆదాయ మార్గాలు. అంతే. ఇక, మాటకారితనమూ చనువూ చతురతా వున్నవాళ్ళు యివికాక యల్ఐసి యితరత్రా యిన్సూరెన్సు యేజెంట్లుగా.. అది కూడా పెళ్ళాల పేర్లతో.. తెగ కష్టబడుతున్నారు. చాలా కష్టపడి యీ దశకు వచ్చామని గొప్పగా చెప్పుకుంటున్నారు.

‘ప్రభుత్వ పాఠశాలలో చదివిన వారికే ప్రభుత్వ వుద్యోగం యివ్వాలి’ అని సోషల్ నెట్ వర్క్స్ లో పోస్టులు పెడుతున్నారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. పాఠాలు చెప్పే మాస్టార్లు తమ పిల్లల్ని మాత్రం తాము పనిచేసే పాఠశాలల్లో చేర్పించరు. తమ పాఠశాల వున్నా చోట కూడా కనీసం వుండరు. ఒకసారి వుద్యోగంలో చేరామా? యిక అంతే. వేసినప్పుడు వేప చెట్టు. తీసినప్పుడు రావి చెట్టు. మన ఈక కూడా యెవడూ తెంపలేడు. అదీ ధీమా. అదీ భీమా. కాదన గలమా? లేదనగలమా?

చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. నేనో బడ్డీ పెట్టుకుంటా.. నేనో దుకాణం తెరచుకుంటా.. అంటే నాకు డబ్బు కట్టు.. నీవు నీ వ్యాపారం చేసుకో అని సెన్సు లేకుండా లైసెన్సులు యిస్తోంది. నచ్చినంత ఫీజు వసూల్ చేయడమే. ఏటికి యేడూ ఫీజుల నియంత్రణ మీద టీవీల్లో చర్చలు. ఎప్పటిలాగే. ఫీజుల నియంత్రణ పోరాట కమిటీలు యేర్పడ్డాయని అంటే పరిస్థితిని అంచనా వెయ్యొచ్చు. కోర్టులు తాఖీదులు యిస్తాయి. కాని యేమి లాభం? ప్రభుత్వమూ అధికారులూ వెచ్చగా ముడ్డి కింద వేసుకు కూర్చుంటున్నారు. చూస్తే స్కూళ్ళకు గ్రౌండ్స్ కూడా లేవు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. చాలక యిన్స్టిట్యూషన్స్ మీద సెల్ టవర్లు. అద్దెలు వస్తాయి కదా? అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!

మాస్టారూ.. నేను మిమ్మల్ని చూసి చెడిపోయాను. అనవసరంగా మాస్టారునయ్యాను. మాస్టారూ.. మా మాస్టారులు యెలా వున్నారో తెలుసా? పాఠం వదిలి యెప్పుడూ యింక్రిమెంట్ల గురించే మాటలు. మీకాలంలో వుపాధ్యాయులు వుద్యమాలు నడిపారు. జనాన్ని నడిపించారు. మీది వొక చరిత్ర. మాది హీన చరిత్ర. దీన చరిత్ర. మాస్టారూ.. మీకు యిక్కడ వొక మాట చెప్పాలి. నిజాయితీగా ప్రభుత్వ పాఠశాల నడిపితే మా వూరి చుట్టూ వున్న మూడు నాలుగు ప్రవేటు స్కూళ్ళు మూతబడ్డాయి. అందుకు బహుమతిగా ప్రవేటు పెద్దల యిన్ఫ్లియన్సుతో నన్ను ట్రాన్స్ ఫర్ చేసారు.

మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము.  అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని, ‘గురూ.. ఆ లం– డబ్బులు తీసుకుంది, రాలేదు..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!

పోనీ ప్రవేటు విద్యాసంస్థల్లో మనకి మర్యాద వుందా అంటే అదీ లేదు. అక్కడ స్టూడెంటు కంటే మనం హీనం. డబ్బులు కట్టేవాడు కస్టమర్. మనం సర్వీసు మాత్రమే యిచ్చే సర్వెంట్స్.. అంతే!

గురు బ్రహ్మ.. గురు విష్ణు.. గురు దేవో మహేశ్వరః అన్నారు. పిల్లలకు రాత నేర్పించే గురువే వారి తలరాతని కూడా మార్చెయ్యగలడని నమ్మాను. కాని మన గురువుల తలరాత అంతకన్నా ముందే చెరిపేసి కొత్తగా రాస్తే కాని యేదీ రాయడం సాధ్యం కాదని తెలుసుకున్నాను. కానీ రాయడం కన్నా చెరపడం కష్టంనిపిస్తోంది.

యిట్లు

మీ

శిష్య గురువు

మీ మాటలు

  1. దేవరకొండ says:

    జగదీశ్వర రావు గారు, మీ మార్కు వ్యంగ్యం కాస్త కనుమరుగయి ఆవేదన ఎక్కువగా ధ్వనించింది. ఒక్క పదం కూడా అతిశయోక్తి గాని, అసందర్భంగాని,అనవసరంగాని లేని చక్కని వ్యాసం అందించారు. అభినందనలు. ఏనాడైతే విద్యా రంగం ‘కొందరి’ చేతుల్లోకి వెళ్లి వాళ్ళు ప్రభుత్వాల్ని నడిపించే స్థాయికి ఎదిగారో ఆనాడే ‘కాటుక కంటి నీరు…’ పద్యం పాడుకుంటూ తెలుగు భారతీ దేవి విశాలాంధ్రమంతా తిరిగింది. మైనారిటీ పోతనలు ఆ తల్లికి ధైర్యం చెప్పలేక (నేటి స్వార్ధ వ్యాపార శుంఠల కంటే ఆనాటి క్రూర రాజులే నయం కనుక) తలవంచుకున్నారు. ఆ మైనారిటీ పోతనల తరఫున మీరు అందించిన ఈ గొప్ప వ్యాసాన్ని కనీసం ఆ ‘వృత్తి/ఉద్యోగంలో’ ఉన్న వారైనా చదివి ఆత్మావలోకనం చేసుకుంటారని ఆశిద్దాం. విద్యాశాఖామాత్యులు, వారి అధికారగణం దీన్ని చదివి తాము ఎంతటి పాపానికి (తప్పు,పొరపాటు,నేరం పదాలు చాలవు) భాగస్వాములవుతున్నారో తెలుసుకోవచ్చు. గాలి, నీరు ఎలాగో అందరికీ చదువు కూడా అలాంటిదే! అలాంటి చదువును ఇలా సర్వ నాశనం చేసి వ్యాపారంగా మార్చడం ….పాపంగాక మరేమౌతుంది? మీవంటి ఉపాధ్యాయుల (మాస్టారు, గురు, పంతులు పదాల్ని భ్రష్టు పట్టించారని ఇప్పుడే చదివాము కనుక) సంఖ్య ఎక్కువగా పెరగాలని ఆశిస్తూ మరొక్కమారు అభినందనలు.

  2. దేవరకొండ says:

    మరొక్కమాట: ఈ వ్యాసాన్ని ముద్రించుకొని విద్యార్థులే స్వచ్చందంగా అన్ని స్కూల్,కాలేజ్ ప్రాంగణాల్లోని ప్రముఖ స్థలాల్లో గోడ పత్రికల్లా అతికించి చైతన్య వ్యాప్తికి తోడ్పడితే అద్భుతంగా ఉంటుంది. కొందరైనా ఆలోచిస్తారు. ఎక్కడో అక్కడ ఎప్పుడో ఒకప్పుడు మంచి ఆరంభమయే అవకాశం ఉంటుంది.

    • నరసింహారావు says:

      వ్యాసాన్ని గోడపత్రికల్లా అంటించాల్సింది యూటియఫ్, ఎపిటియఫ్, డిటియఫ్ లాంటి ఉపాద్యాయ సంఘాల కార్యాలయాల్లో అనుకుంటాను దేవరకొండవారూ!

  3. Excellent Jagadeeswara Rao gaaru..chaalaa baagaa raasaaru.

  4. కె.కె. రామయ్య says:

    తల్లి, తండ్రి, దైవం స్థానాలలో నిలిచిన పూజ్యులైన గురువుని, విద్యాప్రదాత ఉపాధ్యాయుడిని స్మరణకు తెచ్చిన ప్రియమైన శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు మాస్టారు గారికి వినమ్రపూర్వక నమస్కారాలు.

    “చదువుని వ్యాపారం చేసిసింది ప్రభుత్వం. రేకుల షెడ్లలో వేలకొద్దీ లక్షలకొద్దీ ప్రవేటు విద్యాసంస్థలు. కోళ్ళ ఫారంలో కోళ్ళలా పెరుగుతున్నారు పిల్లలు. అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు! ” ఈ పరిస్థిని చక్కదిద్దే రోజుకోసం ఎదురుచూస్తూ ..

  5. Mahendra Kumar says:

    ఆవేదనా పూర్వక వాస్తవ చిత్రణ, సమస్య మూలాలు , పరిష్కారాలు తెలిసినా ఆచరించలేని దుస్తితి.

  6. తమ్మినాయుడు says:

    శిష్య గురువు గారికి మీ శిష్యుడు వినమ్ర ప్రణామములతో (నమస్కారం సరిగా చేసానని భావిస్తున్నాను) రాయునిది ఏమనగా! మీరు పూర్తి ఆరోగ్యంగానే వున్నారని తలుస్తున్నాను. ముందుగా ఈ ఫెస్బుక్ కి కృతఙ్ఞతలు చెప్పాలి. ఎందుకంటే ఈ వేదిక మిమ్మలిని నన్ను తిరిగి కలిపినందుకు. కొన్నేళ్ల క్రితం మీ దగ్గర చదువుకున్నవాడిని(నన్ను గుర్తపట్టి వుండరు). మీలాంటి నిజాయితీపరుడు కష్టించే తత్వం గల వ్యక్తికి శిష్యుడిని కావడం నా అదృష్టం అందుకే ఈ రోజు నేను మీ దయవలన మంచి పొజిషన్లో వున్నాను. ఇన్నాళ్లు… మీలా నేను కూడా మంచి మాస్టారిని కాలేకపోయానే అనే బాధ నన్ను పీడించేది. కానీ ఈ రోజు మీరు రాసిన మూడు ముక్కల వ్యాసం చదివిన తరువాత… కాకపోవడమే మంచిదయ్యింది అనిపిస్తుంది. నిజమా! మేసారు పల్లెటూరి పాఠశాలలో మాష్టారులు మరి అంత అద్వాన్నంగా వున్నారండి. ఏమో మరి నేనైతే ప్రస్తుతం పల్లెకు దూరంగా ఉంటున్నాను కదా ఆ విషయాలు నాకు అంతగా తెలియవులెండి. నేను మీ దగ్గర చదుకునే రోజుల్లోనే అలగున్నారంటే ఇప్పుడు మరీ శృతిమించిపోయి ఉంటారండి. మీరు మంచోళ్లు కాబట్టి అందరూ మీలాగే మంచోళ్ళే అని అప్పుడు నేను భ్రమపడ్డానండి. మేసారు ఈ వ్యాసం ఎంత బాగా రాసారండి మీరు మాస్టార్లకు మా గొప్పగా చురకలెట్టేసారండి. ఒకచోట ‘బ్రోకర్లు’ అని మా గొప్ప పదం వాడేసారండి. మీరు గౌరవ మర్యాదులు తెలిసినోళ్లు కాబట్టి ఆ పదంతో సరిపెట్టారు. అదే నేనైతేనా కోపంతో ఇంకేదో పదం వాడేసేవాడినండి. మరోచోట ‘ఈక కూడా తెంపలేడు’ అబ్బబ్బ…. ఏమి వాక్యమండి. మేసారు మీరు మాత్రమే ఇలా రాయగలరండి. అదే నేనైతే బండ బూతులు వాడేసేవాడిని. అదేనండి మీలో నిగ్రహానికి నాలో ఆగ్రహానికి తేడా. మేసారు ఒకచోట మీరు అనవసరంగా పశ్చాత్తాప్పడ్డారు ‘అనవసరంగా మాస్టారినయ్యాను’ అని. మీరు మాస్టారు అయ్యుండకపోతే నాలాంటి శిష్యుడు మీకు దొరికి వుండేవాడా? అయినా మేసారు అంత బాధపడుతూ ఆ ఉద్యోగంలో మీరుండటమెందుకండి. ఏలాగు రిటైర్మెంటుకు దగ్గర్లోనే వున్నారు. రిజైన్ చేసేయండి మీకు పెన్షన్ (ఇప్పుడొచ్చిన కుర్ర మాస్టార్లయితే జీతాలు చాలక సి.పి.ఎస్ కి వ్యతిరేకంగా ఆందోళనలు చేస్తున్నారట మొన్నీమధ్య పేపర్లో చదివాను) ఎలాగూ వస్తుంది మరియు నాలాంటి శిష్యులు మీకు ఎలాగూ అండగా వుంటారు. మేసారు ఎంత అన్యాయమండీ నిజాయితీగా మీరు పాఠశాలను నడిపినందుకు ప్రైవేట్ స్కూల్ యూనియన్ పెద్దలు మిమ్మల్ని ట్రాన్సఫర్ చేయించారా! కౌన్సలింగ్ పద్దతిలో బదిలీలు జరుగుతున్నాయని పేపర్లో చదివాను అది అంతా అబద్దమా అండీ. పోనీలెండి మేసారు అన్ని కస్టాలు మధ్య మీరొక్కరే నిజాయితీగా నిలబడడం నాకెంతో గర్వముగా వుంది. మేసారు మీరెప్పుడూ ఇంతే… ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేరు. పోనీలెండి మేసారు మీరైనా మాస్టారి జాతిలో ఆణిముత్యమై మిగిలిపోతారు. మేసారు మరిచిపోయాను ఓ విషయం గుర్తొచ్చింది ఇప్పటికీ మన ఊరి బడులు అలానే వున్నాయండి. ఇంటర్వెల్ లో లేడీ టీచర్లు కాలు ముడుచుకోవడానికి తోటలోనికి పోవడాలు. పాము కనిపిస్తే భయంతో పరిగెత్తికొచ్చేయడాలు. మన స్కూల్ ఆడపిల్లలు ప్రకృతావసరాలను తీర్చుకోవడానికి తుప్పల చాటుకి పోవడాలు. బడిలో మరుగుదొడ్లు లేక… వున్నా వాటిలో సరైన నీటి సదుపాయం లేక అమ్మాయిలు ఆరోజుల్లో (నెలసరి సమయం) అర్దాంతరంగా బడినుంచి తలలు దించుకుని ముడుచుకుంటూ ఇళ్లకు పోవడాలు. తరగతి గదులను తుడిచి తుడిచి మేము అరిగిన చీపురులైపోవడం . పీరియడ్ పీరియడ్ కి మేము గంటై మోగడం. ఆటలో దెబ్బ తగిలితే రాసేందుకు మందు లేక ఏడుస్తూ ఇంటికి పోవడం. పెచ్చులూడిన తరగతి గచ్చు, తెల్లగమారిన నల్లబోర్డు, వానోస్తే కురిసే చీకటి తరగతి గది, కూలడానికి సిద్ధంగా వున్న బడి. ఇప్పటికీ అలాగే ఉన్నాయా మేసారు(నా జ్ఞాపకాలలో మాత్రం అలానే వున్నాయి). మేసారు ప్రైవేట్ స్కూల్ లో చదువులు మీరు చెప్పినట్టు మరీ అన్యాయమండీ నేను ప్రత్యక్షంగా చూస్తున్నాను కదాండీ. బడిలో ఆడటానికి గ్రౌండ్ లేదు ఇంటి దగ్గర ఆడటానికి సెలవులు లేవు. ఓ పక్క ప్రభుత్వాన్ని మరోపక్క ప్రభుత్వ పాఠశాలల మాస్టార్లను బలే దులిపేశారండి మీ వ్యాసంలో. మేసారు చివరిగా నాకొక సందేహమండి ఈ మాస్టార్లు ఇలాగా మారడానికి కారణమెవరంటారు? ఆలు మంచిగా మారడానికి మార్గమేదైనా ఉందంటారా? సమస్యలకు కారణాలను మీ చేతిలోని డస్టర్తో చెరిపేసి పరిష్కారాలను మీ చేతిలోని సుద్దముక్కతో రాసేయగలరని ఆశిస్తూ….

    ఇట్లు
    మీ పూర్వ శిష్యుడు

    • నరసింహారావు says:

      మన బడి మనం శుభ్రం చేసుకోవడం అంటే అరిగిపోయిన చీపుర్లవడమా?

      In Japan, there’s a long tradition of students cleaning their own schools.

      There, “school is not just for learning from a book,” says Michael Auslin — a former English teacher in Japan. “It’s about learning how to become a member of society and taking responsibility for oneself,” says Auslin, who is now a resident scholar and director of Japan studies at the American Enterprise Institute.

      http://www.npr.org/sections/ed/2015/04/04/396621542/without-janitors-students-are-in-charge-of-keeping-school-shipshape

      • tamminaidu says:

        నరసింహ రావు గారు నా అభిప్రాయాన్ని ఆసాంతం చదివి మీ సందేహాన్ని వ్యక్తీకరించడంతో పాటు ఓ లింకును కూడా జోడించినందుకు ధన్యవాదాలు.

        ‘తరగతి గదులను తుడిచి తుడిచి మేము అరిగిన చీపురులైపోవడం’ అని అనడంలో ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలూ లేవని చెప్పడం నా ఉద్దేశం. ఇక పిల్లలో పని సంస్కృతిని గూర్చి అంటారా? ఏ వర్గాల పిల్లలలో పని సంస్కృతిని అలవరచాలంటారు? మా పాఠశాలల్లో చదివే దిగువు వర్గాల పిల్లలు పొద్దున్న లేచింది మొదలు పడుకునే వరకు ఇంటిలో , బడిలో పనిలో భాగస్వాములు అవుతూనే వున్నారు.

        ఇక మీరు లింకులో ఇచ్చిన వ్యాసంలో నేను నోట్ చేసుకున్న కొన్ని పాయింట్లు గూర్చి చూద్దాం.

        1. Back in 2011, Newt Gingrich was running for president, and he proposed a radical idea to help schools cut costs: Fire the janitors and pay students to do the cleaning.

        పై వాక్యంలో అమెరికాలో బడులపై పెట్టే ఖర్చులను తగ్గించుకోవడానికి జానిటర్స్ ను తొలగించి ఆ పనులను పిల్లలకు అప్పగించారన్నారు. ఇక్కడ (భారత దేశంలో) కనీస సదుపాయాల కల్పన అనే మాటే లేదు.

        2.Needless to say, the idea to turn students into moonlighting janitors had about as much support as Gingrich’s presidential campaign.

        పై వాక్యం చదివితే అర్ధమవుతుంది ఆ అంశాన్ని కూడా Gingrich’s presidential కాంపెయిన్ కి ఎలా వాడుకున్నాడో?

        3 . “It’s about learning how to become a member of society and taking responsibility for oneself,” says Auslin,

        మా పాఠశాల దిగువ వర్గాల(ఆర్ధికంగా) పిల్లలు నిత్యం ఇంటా బయటా పనిచేస్తూ సంఘ పౌరులుగా మారుతున్నారనడంలో ఎటువంటి సందేహం లేదు.

        4. If anything, according to staff, parents want to know how to get their kids to clean their room at home as well as they do at school.

        పొద్దున్నే వాళ్ళమ్మా నాన్నలు పొలానికి వెళ్లిన తరువాత పొలం నుండి సాయింత్రానికి ఇంటికి వచ్చే లోపు మగ పిల్లలైతే పొలానికి టీ పట్టుకెళ్ళడం, పశువుల శాలలో పేడ కళ్ళు తీయడం, పాల కేంద్రానికి పాలు పట్టుకెళ్ళడం, అదే ఆడ పిల్లలైతే ఇల్లు ఊడడం, నీళ్లు మోయడం, వంట చేయడం వంటి పనులు నిత్యం చేస్తూనే వుంటారు. ఉన్నకాడికి బడిని శుభ్రంగా వుంచుకోవడంలో వారు ముందే వుంటారు. ఎటొచ్చి మీరు ఉదహరించిన అమెరికా జపాన్ స్కూల్ పిల్లలలాగా వీరి చేతికి glouses మెడకు aparon ఊహించకండి. చీపురే సరిగా ఉండదు.
        పెచ్చులూడిన గచ్చు, గాలి వెలుతురూ లేని చీకటి గదే మీ కళ్ల ముందు కదలాడాలి. అమెరికా, జపాన్ తరగతి గదులతో (fully equipped) మా తరగతి గదులను గబుక్కున పోల్చేయకండి డంగైపోతారు.
        మా పిల్లలు ఎంతలా శ్రమిస్తారంటే (ఇంటిలో, బడిలో) రోజుకు prayer లో కనీసం ఇద్దరు కళ్ళు తిరిగి పడిపోతుంటారు (వారు తీసుకుంటున్న పోషక పదార్థాలుకు చేస్తున్న శ్రమకు balance కుదరక). వీళ్ళలో ఆడపిల్లలే అధికం.

      • నరసింహారావు says:

        మీ స్పందనకు థ్యాంక్స్!
        మీ సమాధానం చదివి నాకు తెలిసినదేమంటే జపాన్ దేశంలోని పౌరులకన్నా మన దేశంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివి పెరిగి పెద్దవారయిన దిగువ ఆర్థిక వర్గాల పిల్లలకే పని సంస్కృతి బాగా తెలుసని, తమ బడిని తామే శుభ్రం చేసుకోమని చెప్పి వారికి మనం పని సంస్కృతి నేర్పనక్కరలేదని, వారిలో అత్యధిక శాతం పిల్లలు ఇంటిలో, బడిలో తీవ్రంగా శ్రమించి చదువుకుంటున్నారని, పోషక పదార్థాలు లేని ఆహారం తీసుకునేటంత ఆర్థిక లేమిలో వున్నవాళ్ళే అత్యధికంగా ప్రభుత్వ పాఠశాలల్లో వున్నారని, పాఠశాలల్లో సింహభాగం పెచ్చులూడిపోయిన చీకటి గదులేనని, పాఠశాలలకు చీపుర్లు కూడా సమకూర్చలేని ఘోరమైన దుస్థితిలో మన ప్రభుత్వాలు వున్నాయని, ఇంత సౌకర్యాల లేమి, దరిద్రం వున్నప్పటికిన్నీ ప్రజాప్రతినిధులు, విద్యార్థుల తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు, వారి సంఘాలు, వార్తా మాధ్యమాలు, పౌరసమాజం పట్టించుకోవడంలేదని.

        అయితే, మీరు చెప్పిన చదువుకున్న, పని సంస్కృతి పూర్తిగా తెలిసిన పిల్లవాడు దీన్ని తప్పించుకోడానికి తన కెరీర్: మేనేజ్ మెంట్ లో ప్రయత్నిస్తున్నాడా, లేక దీన్ని కొనసాగించడానికి ప్రయత్నిస్తున్నాాడా? అనే ప్రశ్నని నిజాయితీగా వేసుకుని, ఇప్పుడున్న వ్యవస్థలో ఎలా జరుగుతోందీ అనేది మనం ఆలోచిస్తే, నిజంగా తన భావనలో పని సంస్కృతిని అలవరచుకుంటున్నాడా, లేక, తప్పనిసరై చేస్తున్నాడా, లేక, ఈ తప్పనిసరినుంచి తప్పించుకోడానికి ప్రయత్నిస్తున్నాడా, అనేది మనకి అర్థమవుతుంది.
        పని సంస్కృతిని ’పనిని ఎగ్గొట్టే సంస్కృతి‘ ప్రభావితం చేస్తోందా, లేక పని ఎగ్గొట్టే సంస్కృతిని ’పని సంస్కృతి‘ ప్రభావితం చేస్తుందా అనే ప్రశ్నకి సమాధానం నేను చెప్పనక్కరలేదు. ఈ రోజుల్లో ఏ ప్రభుత్వ ఉద్యోగ సముదాయాన్ని చూసినా మీకు తెలుస్తుంది. ( అదేకాదు, నేటి యువత తీరు కూడా దానికి అనుగుణంగానే వుంది.)
        లేదా, ’ఇక్కడ చదివే పిల్లలలో ప్రభుత్వ ఉద్యోగాలలో చేిరిన వారు స్వల్పం, వారికి ఆ అవకాశాలు రావు‘, అని మీరు తేల్చేస్తే నేనేం చెప్పలేను.

        ఒక లెక్క ప్రకారం మన ప్రభుత్వాలు పాఠశాల విద్యార్థి గురించి ఖర్చు పెడుతున్న మొత్తంలో 20 శాతం మొత్తాన్ని మాత్రమే ప్రయివేటు విద్యాసంస్థలు వారి పాఠశాలల్లో చదివే విద్యార్థి కోసం ఖర్చుపెడుతున్నాయి..మరి, వారి స్కూళ్ళల్లో పెచ్చులూడిపోయిన గోడలు, చీకటి గదులు వుంటాయా? సౌకర్యాలు కూడా ఇంతకంటే హెచ్చుగానే వుంటాయేమో? పిల్లల చేత ఏ పనీ చేయించరు.
        మరి, మన ప్రభుత్వ బడులు దుస్థితికి కారణం నిధుల కొరత, లేమి అందామా?

        నాకు గుర్తున్నంతలో ’పౌర హక్కుల సంఘాలు ఎందుకున్నాయి, పౌర బాధ్యత సంఘాలు ఎందుకు లేవు?‘ అని ఒక చర్చ జరిగింది. దానికి వారేం చెప్పారంటే బాధ్యతలు సమాజంలో బై డిఫాల్ట్ గానే వారి మీద రుద్దబడుతున్నాయి, కాబట్టి పౌర బాధ్యతల సంఘాలు అవసరం లేదని.

        బాధ్యతల ఊసే ఎత్తని హక్కుల ఉద్యమాల యుగంలో మనం వున్నాం. హక్కులను గురించి అడిగేవారందరూ, అడిగే సందర్భాలన్నీ నూటికి నూరుపాళ్ళూ బాధ్యతాయుతమైనవే అని సాధారణీకరించడం ఎంతవరకూ సబబు?

    • తమ్మినాయుడు says:

      పై నా స్పందనలో ‘ఫేస్బుక్’ కి బదులు ‘సాంఘిక మాధ్యమము’ అని చదువుకోగలరు. ధన్యవాదములు తమ్మినాయుడు

  7. నరసింహారావు says:

    మాస్టార్లు పేకేసుకోవడంలో యూటియఫ్, ఎపిటియఫ్ లాంటి వామహస్తలాఘవం ఏమీలేదా రావుగారూ!

  8. లక్ష్మణరావు says:

    మీరు వ్యాసం రాశారంటే మామూలుగా ఉండదని ఆసాంతం చదివాను. ఈ సారంగ లో సాహిత్య సృజన చేస్తున్న వారిలో ప్రభుత్వ ఉపాధ్యాయులు చాలా మంది ఉన్నారు. వారు సానుకూలంగా గాని, వ్యతిరేకతను గాని అభిప్రాయాన్ని వ్యక్తపరచకపోవడం చూస్తుంటే మౌనం మీ వ్యాసాన్ని అంగీకరిస్తున్నట్లు గా అనిపించింది. లేక మీలా వారు కూడా మేము తప్పా మిగిలిన టీచర్లు అంతా అని మీ వ్యాసంలో రాసినట్లుగా భావిస్తున్నట్లుగా ఉన్నారు. ఆ మేరకు మీరు విజయవంతం కాగలిగారు. అయితే ఈ ఉపాధ్యాయ సంఘాలు విషయంలో మీరు ఏమీ అనకపోవడం మీ వ్యాసాన్ని విమర్శలకు అందని విషయంగా మార్చడంలో మీ నైపుణ్యత బాగా నచ్చింది. అయితే నాదొక సందేహం. ముఖ్యమంత్రి పిల్లలు ప్రభుత్వ స్కూల్ లో చేర్పించాలని డిమాండ్ చేస్తాదనుకున్న మీ వర్గ కలం ఇక్కడెందుకో ఉపాధ్యాయులకే పరిమితం చేయడం మాత్రం సాధారణ రచనల మిమ్మల్ని కూడా ప్రభావితం చేశాయా అనిపించింది.

  9. Dr. Rajendra Prasad Chimata says:

    ఈ పరిస్థితి మారదు,ఇంకా దారుణముగా తయారవ్వచ్చుఁకర్ణుడి చావు లాంటిదే ఈ పరిస్త్తితికి కారణం. రాజకీయం పూర్తిగా వ్యాపారమై పోవడం ఒక ముఖ్య కారణమ్. అన్ని జీవితాలను శాసించగలిగేది పొలిటికల్ పవర్. దాన్ని శాసించేది డబ్బు. డబ్బు దేనినైనా, ఎవరినైనా కరప్ట్ చేయగలదు.ఉపాధ్యాయులెంత!! గవర్నమెంట్ డిపార్టుమెంట్లన్నీ ఇంకా దారుణంగా ఉన్నాయి. వ్యక్తులుగా ఎవరూ ఏమీ చేయలేరు.

  10. తమ్మినాయూడు says:

    నరసింహరావు గారు మీరు పెట్టిన సమాదానాన్ని బట్టి మీరు భారతదేశానికి వెలుపల నుండి మాట్లాడుతున్నారనుకుంటున్నాను. మీరెక్కడనుండి మాట్లాడుతున్నప్పటికి ముందుగా నేను వ్యక్తపరిచిన అభిప్రాయం మీకు అర్ధమయ్యంది.

    ఈ వ్యాస రచయిత జగదీశ్వరరావు గారు లేవనెత్తిన అంశాన్ని దాటి మీరు మరో విషయాన్ని (పని సంస్క్రతి) అంశాన్ని ముందుకు తెచ్చారు. దాని చర్చ ఇక్కడ అప్రస్తుతమని నేను భావిస్తున్నాను.

    ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి పనితీరుపై ఈ వ్యాసరచయతలాగే మీకూ భిన్నాభిప్రాయాలు వుంటే చెప్పండి చర్చను కొనసాగిద్దాం.

    దన్యవాదములు

  11. నరసింహారావు says:

    తమ్మినాయుడు గారికి,
    మీ అభిప్రాయాలు నాకు అర్థమైనప్పటికీ వాటితో నేను దాదాపు ఏ మాత్రమూ ఏకీభవించడంలేదు. ప్రధాన బాధ్యత ఉపాధ్యాయులు, వారి సంఘాలదేనన్నది నా నిశ్చితాభిప్రాయం. ఈ విషయమై బహుశా ఇక మన మధ్య సంభాషణ జరిగే అవకాశంలేదని చెప్పడానికి విచారిస్తున్నాను.
    డాక్టర్ జి. లచ్చయ్యగారు రెండు వ్యాసాలు ఆంధ్రభూమిలో వ్రాసేరు. వారి పరిశీలనతో నాకు పూర్తి ఏకాభిప్రాయం వుంది. అవి మీకోసం ఇస్తున్నాను. ఆసక్తి వుంటే చదవగలరు.

    ప్రభుత్వ బడుల పయనమెటు?
    http://m.dailyhunt.in/news/india/telugu/andhra+bhoomi-epaper-andhrabh/prabhutva+badula+payanametu-newsid-54527087

    సారం లేని చదువులు
    http://m.dailyhunt.in/news/india/telugu/andhra+bhoomi-epaper-andhrabh/saaranleni+chaduvulu-newsid-54262730

    ఇంకొక పరిశీలకుడు వ్రాసిన వ్యాసం
    ‘‘సామ మల్లారెడ్డి’’
    సృజనాత్మకతను చిదిమేస్తున్న చదువు
    http://www.namasthetelangaana.com/EditPage/~/Editorial-News-in-Telugu/%E0%B0%B8%E0%B1%83%E0%B0%9C%E0%B0%A8%E0%B0%BE%E0%B0%A4%E0%B1%8D%E0%B0%AE%E0%B0%95%E0%B0%A4%E0%B0%A8%E0%B1%81-%E0%B0%9A%E0%B0%BF%E0%B0%A6%E0%B0%BF%E0%B0%AE%E0%B1%87%E0%B0%B8%E0%B1%8D%E0%B0%A4%E0%B1%81%E0%B0%A8%E0%B1%8D%E0%B0%A8-%E0%B0%9A%E0%B0%A6%E0%B1%81%E0%B0%B5%E0%B1%81-1-7-491209.html

    • తమ్మినాయుడు says:

      నరసింహరావు గారు ప్రతిసారి మీరు చెప్పదలుచుకున్న విషయంతో పాటు లింకులను కూడా అందించినందుకు దన్యవాదములు. మీరు వ్యాసాలాదారంగా బయటుండి మాట్లాడుతున్నారనిపిస్తుంది. నేనో ఉపాద్యాయుడిగా వుంటూ నేను పరిశీలించిన విషయాలను మీ ముందుంచాను. ఉపాద్యాయ వర్గంలో కొంత శాతాన్ని తీసుకుని ఆ నిందను అందరికీ ఆపాదించడం సబువంటారా? ఉపాద్యాయ వర్గం అలా మారుతుండడానికి ఈ వ్యవస్థ కారణం కాదంటారా?
      మిగతా రంగాలు వీటికి మినహయింపంటారా?

      డాక్టర్ జి.లచ్చయ్య గారి వ్యాసాల నుండి కొన్ని వాక్యాలు

      1.ప్రభుత్వ విద్యారంగ దుస్థితికి కారకులనేకులైనా, కనిపిస్తున్నది మా త్రం కేవలం ఉపాధ్యాయులే

      2.ప్రభుత్వ రంగ విద్య వైఫల్యాలకు ఉపాధ్యాయులే కారణమనడం ఎంతవరకు సబబో యాజమాన్య పాత్ర పోషిస్తున్న ప్రభుత్వం ఆలోచించడంలేదు. 

      3.కుక్కను చంపాలంటే ‘పిచ్చికుక్క’ అనే ముద్ర వేయాలన్నట్టుగా, ప్రభుత్వ పాఠశాలల్ని దెబ్బతీయడానకి ఈ సర్వే హస్తాల్ని కార్పొరేటు సంస్థలు బాగా వినియోగించుకున్నాయి

      4.కానున్న పనిని గంథర్వులు చేశారన్న సామెతలా, ప్రభుత్వ తలంపును, ఉపాధ్యాయులు నెరవేరుస్తూ, సమాజం ముందు దోషుల్లా నిలబడాల్సి వస్తున్నది

      5.ప్రభుత్వం విద్యనందించే బాధ్యతనుంచి తప్పుకుంటూ ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తుంటే చేష్టలుడిగి, చూడడం ఉపాధ్యాయుల తప్పిదమే. 

      లచ్చయ్య గారి వ్యాసాలను మీరంగీకరిస్తే జగదీశ్వరరావు గారి వ్యాసాన్ని ఖచ్చితంగా ఖండించాలి. చెప్పండి ఎవరితో ఏకీభవిస్తారు? ఎవరి అభిప్రాయాన్ని ఖండిస్తారు? చర్చించొద్దు సమాదానం చాలు.

      • నరసింహారావు says:

        తమ్మినాయుడుగారూ!
        లచ్చయ్య గారి మొదటి వ్యాసం, ’’ప్రభుత్వం బడుల పయనమెటు?‘‘ లో మీరిచ్చిన వ్యాఖ్యలతో బాటు ఇవి కూడా వున్నాయి. వాటిని మీరు విస్మరించినట్లున్నారు.
        ఆ రెండు వ్యాసాలలోని ప్రతి విషయం పట్లా నాకు ఏకీభావం వున్నదనే మళ్లీ చెబుతున్నాను. ఆ వ్యాసాలలో, ఉపాధ్యాయుల బాధ్యత అసలు లేదని ఆయన చెప్పారనిగానీ, ఉపాధ్యాయులది ప్రధాన బాధ్యత కాదని అన్నారని గానీ నేను భావించడంలేదు.

        **ఆత్మపరిశీలన, స్వయం విమర్శ లేని ఉపాధ్యాయ వర్గం భవిష్యత్తే అగమ్యగోచరంగా మారింది. రాబోయే పరిణామాలు ఎలా వుంటాయో వీరికి తెలిసిరావడం లేదు. తెలిసి చైతన్యవంతులను చేయాల్సిన బాధ్యతల్ని ఉపాధ్యాయ సంఘాలు ఎప్పుడో భుజాలనుంచి జారవిడుచుకున్నాయి. వీరికి సర్వీసు సమస్యల చింత తప్ప సేవా చింత వెతికినా కానరాని వైనం**
        **ప్రభుత్వం విద్యనందించే బాధ్యతనుంచి తప్పుకుంటూ ఉపాధ్యాయుల్ని టార్గెట్ చేస్తుంటే చేష్టలుడిగి, చూడడం ఉపాధ్యాయుల తప్పిదమే. ఉపాధ్యాయుల్లో గూడుకట్టిన జడత్వాన్ని వదల్చుకోకుంటే, ఆర్‌టిసి కార్మికుల్లా కదిలితే విధిగా ప్రభుత్వ విద్యారంగం కాపాడబడుతుంది. **

        ‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘‘
        ఆయన రెండో వ్యాసం **సారంలేని చదువులు** లోని ప్రతివాక్యంలో చెప్పినదంతా ఉపాధ్యాయులలో గూడుకట్టుకునివున్న అవివేకం, అజ్ఞానాన్ని గురించే. దాన్ని గురించి మీరు ఒక్క మాట కూడా మాట్లాడలేదు.
        ‘‘మూసపోసిన ఉపాధ్యాయ శిక్షణ, చైతన్యాన్ని, క్రియాశీలతను, ఆలోచనను రేకెత్తించని పాఠ్యాంశాల రూపకల్పన, ఉన్న పాఠ్యాంశాల్ని కూడా విశ్లేషించి, వివరించి, విడమరచి చెప్పలేని అత్యధికశాతం ఉపాధ్యాయగణం తరగతి గదిని ఏలినంతకాలం, విద్యాస్థాయి అంతకన్నా భిన్నంగా ఉండదు. జ్ఞానమే సర్వస్వమని, ఇదే ఉద్యోగాన్నో, విదేశీయానాన్నో, లేదా రాజకీయ అధికారాన్నో కలిగిస్తుందనే తప్పుడు భావన వ్యక్తులకే కాదు,మొత్తం వ్యవస్థకే ప్రమాదకరం. విద్య ఒక సామాజిక అవసరానికి, జరగాల్సిన వ్యక్తిగత, వ్యవస్థీకృత మార్పులకై దోహద పడాలనే ఆలోచనకు భిన్నంగా, కేవలం ఉద్యోగ సాధనకు, డబ్బులు పోగు చేసుకోవడానికి మాత్రమే జ్ఞాన సముపార్జన అనేది ఓ తప్పుడు తత్త్వం.‘‘
        ఇలాంటి విద్యావిధానంలో చదువుకుని ఉపాధ్యాయ ఉద్యోగం సాధించినవారంతా ఇంతకంటే భిన్నంగా వుండరని ఆయన ఘంటాపథంగా చెప్పారు.

        ఉపాధ్యాయులు అలా తయారవడానికి వ్యవస్థ కూడా ఒక కారణం కాదని ఎవ్వరూ చెప్పడంలేదు. బాధ్యతల విషయంలో ఆ వ్యవస్థని కారణంగా చూపి అలసత్వం వహించే మనం హక్కుల విషయంలో కూడా అలాగే అలసత్వంగా వుంటే సమతుల్యంగా వుండేది.
        అయితే, ఆ కారణాన్ని తమ బాధ్యతలనుండి తప్పించుకునేందుకు, తాము దోషులం కాదని చెప్పకునేందుకు కవచంగా వాడుకోవడం పెద్ద పొరపాటు.

        మిగతా ఏ రంగాలూ అద్భుతంగా బాద్యతాయుతంగా వున్నవని నేను అస్సలు అనడంలేదు. అయితే వాటిని సాకుగా చూపి మనం స్వీయవిమర్శ చేసుకోకపోతే చివరకి ’ప్రభుత్వ బడి‘ అనేది ఒక చారిత్రక శిథిలంగా మారిపోవచ్చు. అలా మార్చడానికి కార్పోరేట్ల కనుసన్నలలో నడిచే బానిస ప్రభుత్వాలు సిద్దంగా వున్నాయి.

        ఇంకా రెండు వ్యాసాలు కూడా ఇస్తున్నాను. పరిశీలించగలరు.
        విద్యాభివృద్ధిలో టీచర్ల బాధ్యత.
        http://www.namasthetelangaana.com/Editorial-News-in-Telugu/%E0%B0%B5%E0%B0%BF%E0%B0%A6%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AD%E0%B0%BF%E0%B0%B5%E0%B1%83%E0%B0%A6%E0%B1%8D%E0%B0%A7%E0%B0%BF%E0%B0%B2%E0%B1%8B-%E0%B0%9F%E0%B1%80%E0%B0%9A%E0%B0%B0%E0%B1%8D%E0%B0%B2-%E0%B0%AC%E0%B0%BE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%A4-1-7-490842.html

        మరొక వెబ్ సైట్ ‘‘టీచర్స్ ఆఫ్ ఇండియా’’ లంకె కూడా ఇస్తున్నాను. ఈ సైట్ ఉపాధ్యాయులకి బాగా ఉపయోగపడుతుందేమో!
        దానిలోని ఒక వ్యాసం,
        ఉపాధ్యాయుల కారకత్వం -విజయ శంకర వర్మ
        http://www.teachersofindia.org/te/article/%E0%B0%89%E0%B0%AA%E0%B0%BE%E0%B0%A7%E0%B1%8D%E0%B0%AF%E0%B0%BE%E0%B0%AF%E0%B1%81%E0%B0%B2-%E0%B0%95%E0%B0%BE%E0%B0%B0%E0%B0%95%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B5%E0%B0%82-%E0%B0%B5%E0%B0%BF%E0%B0%9C%E0%B0%AF-%E0%B0%B6%E0%B0%82%E0%B0%95%E0%B0%B0-%E0%B0%B5%E0%B0%B0%E0%B1%8D%E0%B0%AE

        ప్రవృత్తిరీత్యా ప్రత్యక్షంగా అనేక పాఠశాలలని చూసిన అనుభవమే నన్ను ఈ వ్యాఖ్య వ్రాయడానికి పురికొల్పింది.
        ఇంకా, నా విచక్షణ ననుసరించి, ఈ విషయంలో సాధికారికమైన పరిశీలన చేయగలిగినవారిని ఎంపిక చేసుకుని వారు చెప్పినదాన్ని బట్టి నేను ఈ అభిప్రాయం ఏర్పరచుకోవడం జరిగింది.
        మనం ప్రతి విషయాన్నీ నూటికి నూరుపాళ్ళూ ప్రత్యక్ష అనుభవం ద్వారానే తెలుసుకోలేమనే విషయం మీకు తెలియనది కాదు.
        సమాజంలో మిగతా ప్రభుత్వ రంగాలు వేరు, ఉపాధ్యాయ వృత్తి వేరు. సమాజంలో దీనికున్న పవిత్రత, సమాజంపట్ల దీనికున్న బాధ్యత గురించి నాకొక విస్పష్టమైన అభిప్రాయం వున్నది. మిగతా ప్రభుత్వ రంగాలలో ( వైద్యం మినహాయించి) దేనికన్నా కూడా ఇది అత్యున్నతమైనదే, అత్యంత ప్రధానమైనదే.

    • తమ్మినాయుడు says:

      నరసింహారావు గారు సమాదానమడిగితే మరలా చర్చను లేవనెత్తే విషయాలను నాముందించినందుకు మరోసారి మీకు దన్యవాదాలు. మీమూలంగా కొన్ని వ్యాసాలను చదువుతున్నాను. ఇంకొక సంతోషకరమైన విషయమేమిటంటే వ్యాసకర్త జగదీశ్వరరావు కంటే మీరే నయం ఉపాద్యాయల మీదనే నెపమంతా నెట్టకుండా వ్యవస్థ కూడా ఒక కారణమని ఒకడుగు ముందుకేశారు. మీరు లింకులో ఇచ్చిన వ్యాసాలలో ఉపాద్యాయులు మాత్రమే విద్యారంగ సమస్యలకు కారణమన్న వాక్యాలను మీరు స్వీకరిస్తే. వారిని నిర్వీర్యులుగా మారుస్తున్న ప్రభుత్వం దానిని నడిపిస్తున్న కార్పోరేట్ సంస్థల(లచ్చయ్య గారి వ్యాసం నుండి)కు సంబందించిన వాక్యాలను నేను స్వీకరించాను. మీరు కొత్తగా ఇచ్చిన లింకులో వాక్యాలను చూడండి

      1.క్లుప్తంగా చెప్పాలంటే, తెలంగాణ విద్యారంగాన్ని బాగుపరచటంలో ప్రభుత్వం, టీచర్ల ఉమ్మడి బాధ్యత ఉంది.

      2.ఈ వ్యాసంలో మనం చర్చించిందేమిటంటే  ఉత్తమ విద్యా వ్యవస్థకి కీలకం  ఉత్తమమైన మరియు నిభద్దత కలిగిన ఉపాధ్యాయులు. పాఠ్యప్రణాళికను మరియు పాఠ్యపుస్తకాల రూపొందించడంలో ఉపాధ్యాయునికి ప్రముఖ పాత్ర ఉండాలి అందుకొసం ఈ ప్రక్రియను వికేంద్రీకరించాలి.గుణాత్మకమైన వ్యక్తులను ఈ వృత్తిలోకి ఆకర్షించాలంటే వారికి మెరుగైన జీతాలే కాక మెరుగైన పనిచేసే పరిస్థితులను, సౌకర్యాలను కల్పించాలి. ఉపాధ్యాయుల జవాబుదారీ తనాన్ని చట్ట ప్రక్రియల ద్వారా నియంత్రిస్తూ ఆదే సమయంలో ఉత్తమ విలువలను ఉపాధ్యాయులలోను , విద్యార్థులలోను పాఠశాల వ్యవస్థ ద్వారా అలవరచినప్పుడే  ఇవన్నీ సిద్ధిస్తాయి.

      పై వాక్యాన్ని బట్టి పాఠశాలలో వసతులలేమి తీవ్రత కూడా అర్దమవుతుంది. విద్యారంగ నాశనానికి వ్వవస్ధ కాదు వ్యక్తులే కీలకమని మీరు భావిస్తే మీరేలాగు ప్రవ్రృత్తి రీత్యా అనేక పాఠశాలలను చూశామని అన్నారు. అదేవిదంగా మీకు ఈ విషయానికి సంబందించిన పరిశీలకులు ఆలోచనాపరులతో పరిచయముందన్నారు. కావును ఉపాద్యాయులు వలన నాశనమవుతున్న(మీరనుకున్నట్టు) విద్యారంగ పరిరక్షణకై మరియు ఉపాధ్యాయులు బాధ్యతాయుతంగా వుండటానికై ఓ ప్రణాళికను రూపొందించి ఓ సరికొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టండి. ఉపాధ్యాయులుగా మేము మీతో కలసి నడుస్తాం. కాదు కూడదు వ్యవస్థే కారణమంటారా? ఏ గొడవా లేదు.

  12. దేవరకొండ says:

    సహజంగానో అసహజంగానో ఈ వ్యాసాన్ని అనుసరించి సందర్భం వచ్చింది కనుక యూనియన్ల పనితీరు, ఆలోచనా ధోరణులపై ఓ ‘చిన్న ‘ మాట. ఈ మధ్య ‘నవ్యఆంధ్ర ప్రదేశ్’లో నివసించే (విషయాన్ని సూటిగా చెప్పేస్తాను) నా స్నేహితుడి 23 ఏళ్ల కూతురిని ఆమె భర్త (ఒక టీచర్) చంపి ఆత్మహత్యగా చిత్రించి పోలీసుల్ని, డాక్టర్లని, తాను పనిచేసే శాఖలోని అధికారగణాన్ని, స్థానిక చోటా రాజకీయుల్ని…అందరి సానుభూతినీ సంపాదించి అందర్నీ తనకు అనుకూలంగా మార్చుకున్నాడు. శాఖాపరమైన ఇబ్బందులు లేకుండా యూనియన్లు చాలా సహకరించాయి. బాధిత కుటుంబంతో సెటిల్ మెంటుకు కూడా సదరు యూనియన్లు చాలా కృషి చేశాయి. ఆ ఊళ్ళో చిన్న పిల్లల దగ్గరినుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి వరకు అందరికి వాడు హంతకుడని తెలుసు, అమ్మాయి బలైపోయిందని తెలుసు. నా స్నేహితుడు, అతని భార్య ఆ ఊరి పెద్దల నుండి రాష్ట్రముఖ్యమంత్రి వరకు అందరి కాళ్ళు (నిజంగానే, ఇందులో అబద్ధం, అతిశయోక్తి ఏమీ లేవు) మొక్కి కోరినదేమిటంటే పోస్టుమార్టం రిపోర్టును తారుమారు చేస్తున్నారు, అలా కాకుండా చూడమని, ఆ హంతకుడు స్కూల్కి మామూలుగానే వెడుతున్నాడు, చర్య తీసుకోమని…ఎవ్వరూ వాళ్ళ మొర ఆలకించలేదు. రెండు సంవత్సరాలకి కేసు కోర్టుకి వచ్చింది. ఇంకా విచారణ మొదలు కాలేదు. కేసు ఎప్పటికి తేలుతుంది, న్యాయం జరుగుతుందా లేదా మొదలైన ప్రశ్నలు పక్కన పెడితే వ్యవస్థ గురించి పాతికేళ్లుగా తనకు తెలియని, తాను నమ్మని చేదు నిజాలు అనుభవపూర్వకంగా తెలుసుకున్నాడు నా స్నేహితుడు. ప్రభుత్వం పేదవాళ్లకు న్యాయంచేయడానికే అని ఎవరైనా అంటే పిచ్చి ఎక్కినవాడిలా పగలబడి నవ్వుతాడు బంగారు బొమ్మలాంటి కూతుర్ని పోగొట్టుకున్న నా స్నేహితుడు. యూనియన్లు తమ కామ్రెడ్ కు రక్షణ కల్పించామన్న విజయగర్వంతో ఊరేగుతున్నాయి. ఇది యదార్ధ సంఘటన, నడుస్తున్న చరిత్ర.

  13. vidyasagar says:

    “The bourgeoisie has stripped of its halo every occupation hitherto honoured and looked up to with
    reverent awe. It has converted the physician, the lawyer, the priest, the poet, the man of science,
    into its paid wage labourers.
    The bourgeoisie has torn away from the family its sentimental veil, and has reduced the family
    relation to a mere money relation. “

  14. మెయిద శ్రీనివాసరావు says:

    బమ్మిడి జగదీశ్వరరావు గారు మీ వ్యాసం చదివాను. ఏ ఆదారంగా ఈ వ్యాసం రాశారు. ఉపాధ్యాయులు సరిగా పనిచేయట్లేదు అని అనడానికి మీదగ్గర ఆధారాలేమైనా ఉన్నాయా? లేదా దీని మీద మీరేమైనా పరిశీలన చేశారా? లేదా మీరు విన్న విషయాలు చదివిన వ్యాసాలాధారంగా మరో వ్యాసం రాశారా? కాస్త చెప్పగలరు

    వర్తమానం కంటే గతకాలపు ఉపాధ్యాయులే మేలని మీరెలా భావిస్తున్నారు? తెలుపగలరు

    • బమ్మిడి జగదీశ్వరరావు says:

      మెయిద శ్రీనివాసరావుగారూ.. ఒక రచన చేయడానికి యేమేమి అవసరమో రచయితగా/కవిగా మీకూ తెలుసు అని నాకు తెలుసు. అంచేత ‘ఆధార్’లు అడగడం సరికాదు. విభేదించే/భిన్నాభిప్రాయము కలిగి వుండే హక్కు మీకున్నది. ‘విన్న విషయాలు.. చదివిన వ్యాసాలాధారంగా మరో వ్యాసం రాశారా?’ అనే మీ ప్రశ్నలోనే జవాబున్నది. అంటే మీరు విన్న విషయాల్లోనూ చదివిన వ్యాసాలలోనూ యిదివరకే ఈ విషయం వున్నదని.. వాటి ఆధారంగా ‘మరో వ్యాసం రాశారా?’ అని మీరు చెప్పకనే చెపుతున్నారు. ఇక ఉపాధ్యాయుల పాత్ర గురించి నేను కొత్తగా చెప్పేదేముంది? చరిత్ర చెపుతుంది. వర్తమానంలో ఆ కొనసాగింపును కోరుతూ పోలిక చేసి నిందించడాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.

      ప్రభుత్వ నిర్వాకం గురించి కాక కేవలం ఉపాధ్యాయుల పాత్ర గురించి మాత్రమే అంతా చర్చను కుదించడంలో ప్రభుత్వాన్ని దోషిగా నిలబెట్టకుండా వొదిలేయడం వున్నది.

      ప్రభుత్వాలు విద్య వైద్యాలను విజయవంతంగా బ్రష్టు పట్టించేసాయి. అందులో తలిదండ్రులుగా ఉపాధ్యాయులుగా మనదైన పాత్రని కూడా తోసిపుచ్చలేము. ఇక్కడ వుపాద్యాయుడి వేపు నుండి వుత్తరం వున్నందున దానికి పరిమితులు వున్నాయి. తప్పితే నేరం మొత్తం వుపాద్యాయులదే అని కాదు, ప్రభుత్వాల పాత్ర కూడా నే రాసిన దాంట్లో వుంది.

      మరో మాట: తమ్మినాయుడుగారు ప్రస్తావించిన బదిలీల కౌన్సిలింగుకు సంబంధించి.. రూల్సు వుంటాయి. వాటికి కొన్ని ఎక్సెప్షన్స్ ఎప్పుడూ వుంటాయి. చాలా కాలం కిందట మిత్రుని విషయంలో విశాఖ జిల్లాలో జరిగింది. అతని పేరూ వివరాలు బయట పెట్టడం సరికాదు. మీకు అబద్దమయినా నాకు నిజం. ఇందులో కూడా నిజాయితీగా పోరాడే వుపాద్యాయుడూ వున్నాడు. అతని ఓటమీ వుంది.. మోయిదగారూ గుర్తించండి.

      ‘మేసారు మీరెప్పుడూ ఇంతే… ఎక్కడ అన్యాయం జరిగినా సహించలేరు. పోనీలెండి మేసారు మీరైనా మాస్టారి జాతిలో ఆణిముత్యమై మిగిలిపోతారు’ అని జోల పాడి పిర్ర గిల్లిన తమ్మినాయుడు గారికి నా సమాధానం వొకటే. రచయిత నిత్య ప్రతిపక్షంగా వుండాలి. వున్నాను.

      • మెయిద శ్రీనివాసరావు says:

        బమ్మిడి జగదీశ్వరరావు గారు ఓ ప్రాధమిక స్థాయి కవి/రచయితగా నాకు తెలియకే నా సందేహాలను మీముందుంచాను. ఒక విషయంపై మన రచన చూసిన పైపై అంశాలాధారంగా మరియు వినికిడి జ్ఞానమాదారంతో అశాస్త్రీయంగా వుండాలంటారా? అధ్యయన ఆధారంగా సునిశిత పరిశీలనతో శాస్త్రీయంగా మన ద్రృక్పధాన్ని వ్యక్తపరిచేదిగా వుండాలంటారా? ఓ సీనియర్ రచయితగా చెప్పగలరు. మరేమి చేయమంటారు ఇప్పుడన్నింటికి ఆధార్ అడుగుతున్నారు.

  15. రెడ్డి రామకృష్ణ says:

    డియర్ బజరా,
    మీ వ్యాసము,ఆపై చర్చ చదివాను.మళ్ళీ అంతా తిరగతోడను గానీ మీ సమాధానం పైనే నా అభిప్రాయాన్ని చేప్పాలనిపించి రెండుమాటలు .
    మీ సమాధానంలో ఇలా అన్నారు ‘విన్న విషయాలు.. చదివిన వ్యాసాలాధారంగా మరో వ్యాసం రాశారా?’ అనే మీ ప్రశ్నలోనే జవాబున్నది. అంటే మీరు విన్న విషయాల్లోనూ చదివిన వ్యాసాలలోనూ యిదివరకే ఈ విషయం వున్నదని.. వాటి ఆధారంగా ‘మరో వ్యాసం రాశారా?’ అని మీరు చెప్పకనే చెపుతున్నారు. ”
    అయితే చేప్పినదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడం లో ప్రయోజనమేమిటి.?ఎవరెవరో వారి వారి దృష్టికోణం తో చేప్పివుండవచ్చు . ఒక మార్క్సిస్టు రచయిత వ్యాసంకూడా అలానే ఉండాలా !
    మరో మాట
    “ఉపాధ్యాయుల పాత్ర గురించి నేను కొత్తగా చెప్పేదేముంది? చరిత్ర చెపుతుంది. వర్తమానంలో ఆ కొనసాగింపును కోరుతూ పోలిక చేసి..”
    అనడంలో గతంలో గొప్ప ఉపాధ్యాయులు… బాధ్యతనెరిగినవారు ఉండేవారు వర్తమానంలో ఉపాధ్యాయులు అలా లేరనే మీ ఉద్దేశమనుకుంటాను.ఇలాంటి అభిప్రాయలు చివరికి గతం గొప్పది అనేవైపే దారితీస్తాయి.ఏకాలంలోనూ మంచి చెడు ఉంటాయన్న విషయం మరిచిపోతే ఎలా ?
    వర్తమానంలో మీకు చెడ్డగా అనిపించే అంశాలు గతంలో ఉండకపోవచ్చు కానీ ఆకాలంలో వున్న చెడుపనులు ఆకాలంలోనూ ఉన్నాయి .ఉదాహరణకు విద్యార్థులను వేరువేరుగా కూర్చోబెట్టడం లాంటివి ..చాలాచెప్పొచ్చు .
    వ్యవస్ధ గతమైన మార్పులు …అందుకు దోహదపడే ప్రభుత్వ విధానాలు ను వదిలేసి పైపైన మాట్లాడుకోవడమంటే నవ్వుకోడానికి పనికి వస్తాయేమోగాని ప్రయోజనము ఉంటుందని అనుకోను.
    “ప్రభుత్వాల పాత్ర కూడా నే రాసిన దాంట్లో వుంది.”..ఎంతవుంది ?

    “అసలు ప్రభుత్వం వుందో చచ్చిందో తెలీడం లేదు!” అన్నారు.ఒకప్రయివేట్(కార్పొరేట్)కాలేజీల యజమాని ప్రభుత్వంలో భాగంగా ఉన్న ఈ తరుణంలో ప్రభుత్వ విధానాలు ఈమేరకు ప్రభావితం చేయబడతాయో తెలియని అమాయకులా మీరు
    చివరిగా మీరు చెప్పినమాట “రచయిత నిత్య ప్రతిపక్షంగా వుండాలి. వున్నాను.” ఎవరికి అన్నదే ప్రశ్న

  16. బమ్మిడి జగదీశ్వరరావు says:

    రెడ్డి రామకృష్ణ గారూ..
    చెప్పినదాన్నే మళ్ళీ మళ్ళీ చెప్పడంలో ప్రయోజనం వుండదు. కొన్ని సార్లు అలా చెప్పాల్సిన అవసరమూ రావొచ్చు. కాని యిక్కడ ఈ రెండూ కావు. మొయిదగారు ‘ఆధారాలేమయినా ఉన్నాయా?’ అని అడగడంలోనే యిది లేని విషయం కాదు అని చెప్పాను. దానికి మీరు ‘మళ్ళీ మళ్ళీ చెప్పడం’గా తీసుకోవడంగా తీసుకోవడం సరికాదు. ఒక వస్తువుని వొకరు యెంపిక చేసుకున్నంత మాత్రాన మరొకరు అదే వస్తువు తీసుకోకూడదు అని లేదు. అది మళ్ళీ మళ్ళీ అవదు. మీరే అన్నట్టు అప్పడు యెవరి ‘దృష్టి కోణం’ వారిదవుతుంది. యిక్కడ వొక ‘మాస్టారు’ తను చెప్పడంలో తన వృత్తి వుద్యోగాల మీద మాత్రమే అధికంగా దృష్టి నిలిపి మిగతావాటికి అంత ప్రాధాన్యత యివ్వాల్సివున్నా యివ్వక పోవచ్చు. ఇవ్వడు కూడా. అది ఆ ‘పాత్ర పరిధి’గా మాత్రమే చూస్తే- గుర్తిస్తే- ‘ప్రభుత్వాల పాత్ర “కూడా” నే రాసిన దాంట్లో వుంది’.- అంటే ‘యెంత వుంది?’ లాంటి ప్రశ్నలూ తలెత్తవు.

    “గతంలో గొప్ప ఉపాధ్యాయులు… బాధ్యతనెరిగినవారు ఉండేవారు వర్తమానంలో ఉపాధ్యాయులు అలా లేరనే మీ ఉద్దేశమనుకుంటాను..” అన్నారు. నాకు లేని ఉద్దేశాలు అంటగట్టకండి. ‘పైపైన మాట్లాడుకోవడమంటే నవ్వుకోడానికి పనికి వస్తాయేమోగాని ప్రయోజనము ఉంటుందని అనుకోను’. నాదీ యిదే మాట. మీరు పై పైన మాట్లాడి అదే మాట నన్ను అంటున్నారు. అందుకు రెండు సాక్ష్యాలు.
    ఒకటి- ‘చాలా కాలం కిందట మిత్రుని విషయంలో విశాఖ జిల్లాలో జరిగింది. అతని పేరూ వివరాలు బయట పెట్టడం సరికాదు. మీకు అబద్దమయినా నాకు నిజం. ఇందులో కూడా నిజాయితీగా పోరాడే వుపాద్యాయుడూ వున్నాడు. అతని ఓటమీ వుంది.. మోయిదగారూ గుర్తించండి’ అన్నాను. మీరు కూడా గుర్తించలేదు.
    రెండు- ‘రచయిత నిత్య ప్రతిపక్షంగా వుండాలి. వున్నాను’ అని నేనంటే మీరు ‘ఎవరికి’ అంటున్నారు. ప్రభుత్వాలకే ప్రతిపక్షం వుంటుంది. ప్రజలకి కాదు. ‘ప్రభుత్వానికి’ అనే మాట చెప్పకపోతే తెలియనంత అమాయకులు మీరు కారు. ‘ఒకవేళ ‘ఎవరికి’ అని అన్నదే (మీ)ప్రశ్న’ అయితే కూడా దీనికీ సమాధానం (నన్ను ఎరిగినవారిగా)తెలియని వారూ కారు. పై పై మాటలు పరాచికాలప్పుడు బాగుంటాయి. పరీక్షకు నిలబెట్టినప్పుడు కాదు.

    • రెడ్డి రామకృష్ణ says:

      డియర్ బజరా
      1.మీ వ్యాసం లో ఏముందో ఏమిలేదో చదివిన పాఠకులకు తెలుస్తుంది. నా ఆరోపణేమిటంటే మీ వ్యాసము చదివిన పాఠకుడికి చదువు చెప్పే గురువుల పై అసహనము,ఓ మేరకు అసహ్యం కూడా కలుగుతుంది( మేష్టార్లందరూ యిలా వున్నారా అని) తప్ప ఆ వ్యవస్థని ఇలా తయారుచేసిన ప్రభుత్వమ్మీద కనీసంగానైనా వ్యగ్రత కలగడం లేదు.మీరు మీ పాఠకుడికి ఏమి అందించాలనుకున్నారు.

      2.లేని అభిప్రయలను అంటగట్టకండి…అన్నారు.మీ ఈ వాక్యాలు ఏమి అర్ధాన్నిస్తాయో ఒకసారి పరిశీలించండి.
      “ఉపాధ్యాయుల పాత్ర గురించి నేను కొత్తగా చెప్పేదేముంది? చరిత్ర చెపుతుంది. వర్తమానంలో ఆ కొనసాగింపును కోరుతూ పోలిక చేసి నిందించడాన్ని సానుకూలంగా అర్థం చేసుకోవాలని కోరుతున్నాను.”
      మంచిదే..ఉపాధ్యయ వ్యవస్థకు మంచి చరిత్రే వుంది.కాదనను.అలాగని మొత్తం ఉపాధ్యయులందరూ అందులొ భాగస్వాములయ్యారా.వ్యతిరేకంగా పనిచేసిన ఉపాధ్యాయులు, తమబతుకు తాము బతికే ఉపాధ్యాయులు కూడా వున్నారు.వుంటారు.యిప్పుడుమాత్రమే అలాంటి ఉపాధ్యాయులు లేరు.చరిత్రలో భాగమయిన ఉపాధ్యాయుల వంటి వారు యిప్పుడూ వున్నారు.ఎప్పుడూ వుంటారు.కాకపోతే ఒక్కోసారి వారిసంఖ్యలో వ్యత్యాసముండవచ్చు. ఉద్యమాలు ఉన్నప్పుడు అలంటివారిసంఖ్య సహజంగా పెరుగుతుంది
      వ్యాసంలో మరొకమాట
      “పెద్దయ్యాక నేను కూడా మీలాగ మాస్టారు అవ్వాలనుకున్నాను. అయ్యాను. అయినందుకు చాలా సంబరపడ్డాను. అదే విషయం అప్పుడు మీకొచ్చి చెప్పాను. చాలా ప్రయోజకుడినయ్యానని నన్ను మీరు మెచ్చుకున్నారు. ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు.”ఆ నవ్వుకర్ధమేమిటో..మీరే చెప్పాలి
      3.నిజాయితీగా పోరాడే వుపాద్యాయుడూ వున్నాడు. అతని ఓటమీ వుంది.. మోయిదగారూ గుర్తించండి’ అన్నాను. మీరు కూడా గుర్తించలేదు.
      గుర్తించకపోవడమేమి లేదు.అలాంటి ఘటనలు జరుగుటం నిజమే..నిజాయితీగా వున్నవారిని ఎన్నిరకాల యిబ్బందులు పెట్త్టలో అన్ని రకాల యిబ్బందులు పెడుతున్నదీ వ్యవస్థ.అది కేవలం ఉపాధ్యాయ రంగానికో మరో రంగానికో మాత్రమే చెందింది కాదు.అన్ని రంగాలలోనూ వుంది.కాబట్టి మనగురి ఎటువైపు వుండాలి అన్నదే మనం ఆలోచించాలి.

      మరొక్క మాట
      4.ఉపాధ్యాయులు తమజీవిత భద్రతగురించి ఆలోచించుకోవటం, లేదు మరింత ఉన్నతస్థితికి వెళ్లాలనుకోవడం తప్పా…”ఒక టీచర్ మరో టీచర్ని వృత్తి ద్వారా జీవిత భాగస్వామిగా యెంపిక చేసుకొని యెడ్జెస్ట్ చేసుకోవడమో”… నేరమా
      “మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు’ అని అంటూనే మాస్టార్లపైన ఉన్న కామెంట్లన్నీ ఏర్చి కూర్చి మరీ చెప్పారు.మీరు తెలిసో తెలియకో వాటికి మరింత ప్రచారం చేస్తున్నారు.
      మీరు ప్రధానంగా వ్యక్తులే సమాజాన్ని ప్రభావితం చేస్తారు అనుకుంటున్నట్టున్నారు.సామాజిక వ్యవస్థే వ్యక్తులను ప్రభావితం చేస్తుందని తెలియకపోతేనే యిలాంటి విపరీత వ్యాఖ్యానాలకు దారితీస్తుంది.

      5.పై పై మాటలు పరాచికాలప్పుడు బాగుంటాయి.పరీక్షకు నిలబెట్టినప్పుడు కాదు.
      అదే కదా నేనంటున్నది.యిది పరీక్షా సమయమే.కనకనే పై పై మాటలొద్దని…
      చివరగా ఒక మాట
      ఒక సాంప్రదాయవాది,లేదా ఒక సనాతన ధర్మ ప్రచారకుడు అయినటువంటి వ్యక్తి ప్రాచీన గురుకుల విద్యను పొగుడుతూ ఆధునిక విద్యను ఉపాధ్యయులనో విమర్శిస్తున్నట్టుగానే వుంది మీ వ్యాసము.అంతేతప్ప ఒక మార్క్సిస్ట్ దృక్కోణ మేదీ కనిపించలేదు.

      ఈ కారణాలచేతనే మీ వ్యాసం చదివిన పాఠకుడికి ఏమి అందుతుందో ఆలోచించాలని అనేది

      • బమ్మిడి జగదీశ్వరరావు says:

        రామకృష్ణగారూ..
        మీ పాయింట్ 1 కు ‘పాత్ర పరిధి’తో సహా వివరిస్తూ నేను యిది వరకే సమాధానం యిచ్చాను. “వ్యవస్థని ఇలా తయారుచేసిన..” దాంట్లో ప్రభుత్వమూ దానిలో భాగమైన ఉద్యోగులూ వున్నారు. వ్యవస్థ తయారీలో తను తయారు చేసిన ఉద్యోగులే తనకు(ప్రభుత్వానికి) సహకరిస్తారు. ఇలా తయారీకి తమ వంతు పాత్ర కూడా నిర్వహిస్తారు. అలా నిర్వహిస్తున్న నిర్వాకంగా వున్న ఉపాధ్యాయులను ప్రధానంగా ఉద్దేశించి రాసింది యిది. దాని పరిమితి అది. మళ్ళీ మీరు ‘మేష్టార్లందరూ యిలా వున్నారా అని’ అడిగితే- అందుకు మీ 2 పాయింటే సమాధానం.
        “అలాగని మొత్తం ఉపాధ్యయులందరూ అందులొ భాగస్వాములయ్యారా.వ్యతిరేకంగా పనిచేసిన ఉపాధ్యాయులు, తమబతుకు తాము బతికే ఉపాధ్యాయులు కూడా వున్నారు.వుంటారు.యిప్పుడుమాత్రమే అలాంటి ఉపాధ్యాయులు లేరు.చరిత్రలో భాగమయిన ఉపాధ్యాయుల వంటి వారు యిప్పుడూ వున్నారు.ఎప్పుడూ వుంటారు.కాకపోతే ఒక్కోసారి వారిసంఖ్యలో వ్యత్యాసముండవచ్చు. ఉద్యమాలు ఉన్నప్పుడు అలంటివారిసంఖ్య సహజంగా పెరుగుతుంది” అన్నది నిజం.
        ‘మన దగ్గరున్నది జ్ఞానమైనా అజ్ఞానమైనా దాచుకోము.. పిల్లలకి యిచ్చేస్తాము..’ అని మీరు నవ్విన నవ్వు కూడా నేను మరిచిపోలేదు.’ మాటకు ‘ఆ నవ్వుకర్ధమేమిటో..మీరే చెప్పాలి’- అన్నారు. ఎవరి అజ్ఞానం వారి జ్ఞానమైనా మన(మాస్టార్ల)అజ్ఞానం మాత్రం అందరిదీ.. భవిష్యత్తు తరాలదీ అని మాత్రమే. అంతే అర్థం. అందుకే ఈ ‘మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు’ అనే కొనసాగింపు మాట.
        మీ పాయింట్ 3కి వస్తే- ‘నిజాయితీగా పోరాడే వుపాద్యాయుడూ వున్నాడు. అతని ఓటమీ వుంది.. మోయిదగారూ గుర్తించండి’ అని అనడంలో పోరాడేతనమున్న ఉపాధ్యాయులూ వున్నారని. అంటే- అందరూ అలానే లేరని. మరోమాట అన్ని వ్యవస్థలూ కలిపి విద్యా వ్యవస్థను నాశనం చేసాయి తప్పితే- ‘అది కేవలం ఉపాధ్యాయ రంగానికో మరో రంగానికో మాత్రమే చెందింది’ అని నేను అనలేదు. ఆ ఆలోచన నాకు లేదు.
        మీ పాయింట్ 4.”ఉపాధ్యాయులు తమజీవిత భద్రతగురించి ఆలోచించుకోవటం, లేదు మరింత ఉన్నతస్థితికి వెళ్లాలనుకోవడం తప్పా..”, కాదు. కాని మీ భద్రతలో పిల్లల భద్రత ఆలోచన లేదు. పిల్లల ఉన్నతస్థితికి తోవ లేదు. మూసుకుపోతోంది. జీవిత భాగస్వామిని వృత్తి ద్వారా ఎంపిక చేసుకోవడం చాలా చిన్న విషయం. బ్రోకర్లుగా ఏజెంట్లుగా రకరకాలుగా తమ వృత్తిని గాలికి వొదిలిన వాళ్ళ సంఖ్యా రోజు రోజుకూ పెరుగుతూ వుండడం దాచేస్తే దాగని సత్యం. ‘సామాజిక వ్యవస్థే వ్యక్తులను ప్రభావితం చేస్తుందని..’ అని వదిలెయ్యలేము.
        మీ పాయింట్ 5 కొస్తే- ‘సాంప్రదాయవాది,లేదా ఒక సనాతన ధర్మ ప్రచారకుడు అయినటువంటి వ్యక్తి’గా నే రాసిన ‘మాస్టారు’ వుండి వుంటే యింత ఆందోళన చెందుతూ తన గురువుకి వుత్తరం రాయడు. ‘ప్రాచీన గురుకుల విద్యను పొగుడుతూ’ లేడు. ‘ఆధునిక విద్యను’ విమర్శిస్తూ లేడు. తోటి ‘ఉపాధ్యయులనో విమర్శిస్తున్నట్టుగానే’ కాదు విమర్శించాడు. అలాగని తనలో(‘మాస్టారి’ పాత్రలో) వూగిసలాట లేకుండా లేదు. అందుకే అనవసరంగా వచ్చానని వొక్క క్షణం అయినా అనుకున్నాడు. తన అవసరం వుందని మర్చిపోయాడు. వ్యవస్థీకృతమైన నేరం రాజ్యానిదే కాదు, రాజ్యం చేస్తున్నదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళది కూడా. ఇది ‘మార్క్సిస్ట్ దృక్కోణానికి’ దూరమైంది కాదు.

  17. నరసింహారావు says:

    ‘‘అసహనం’’ లేదా ‘‘ఇన్ టోలరెన్స్’’ అనే ప్రవృత్తి ఏదో ఒక మతతత్త్వ, పాలకపక్ష భావజాలానికిగానీ, ఏదో ఒక భావజాల ప్రేరిత సమూహానికిగానీ మాత్రమే పరిమితమైన విషయం కాదని నాకిప్పుడు అర్థమైంది. స్వీయ పరిశీలన, ఆత్మ విమర్శ అనేవి లోపించడానికి సంపూర్ణమైన కారణం ఈ వ్యవస్థే అని కూడా నేనీ చర్చ వలన తెలుసుకున్నాను.

    • తమ్మినాయుడు says:

      నరసింహారావు గారు అవునండి అన్నింటికి ఈ వ్యవస్థే కారణం. చివరికంటా నా ప్రశ్నలకు ఓపికగా సమాదానాలిచ్చినందుకు మరియు కొన్ని వ్యాసాల లింకులిచ్చినందుకు. తాపట్టిన కుందేలకు మూడే కాళ్ళు అని కాకుండా నిజానిజాలు గ్రహించి చివరికి మీ అభిప్రాయాన్ని మార్చుకున్నందుకు ధన్యవాదాలు.

  18. బమ్మిడి జగదీశ్వరరావు says:

    మెయిద శ్రీనివాసరావుగారూ..
    “ఒక విషయంపై మన రచన చూసిన పైపై అంశాలాధారంగా మరియు వినికిడి జ్ఞానమాదారంతో అశాస్త్రీయంగా వుండాలంటారా? అధ్యయన ఆధారంగా సునిశిత పరిశీలనతో శాస్త్రీయంగా మన ద్రృక్పధాన్ని వ్యక్తపరిచేదిగా వుండాలంటారా?” అనే మీప్రశ్న మీ ‘ప్రాధమిక స్థాయి’ని ఖండిస్తున్నది. ఈ మీ మాటలు మీ ‘సందేహాలను’ కూడా తొలగిస్తున్నవి. మీకున్నవి సందేహాలు కావు. ఒక ‘మాష్టారు’గా మీరు నా రచనతో విభేదిస్తున్నారు. అందుకని నేరాసిన అంశాలు పైపై అంశాలుగా.. వినికిడి జ్ఞాన సమాచారంగా.. అశాస్త్రీయంగానే కాక సునిశిత పరిశీలన, శాస్త్రీయ దృక్పధాన్ని వ్యక్తపరిచేదిగా లేనిదిగా అభిప్రాయ పడుతూ దానికి డొంకతిరుగుడుగా ‘ప్రాధమిక స్థాయి’నీ ‘సందేహాలను’ ముందుకు తెస్తున్నారు. మీ వృత్తిని మీరు ప్రేమించండి, మీరున్నట్టే అందరూ వున్నారని వుంటారని అనుకోకండి. మీరు (ఉపాధ్యాయులు) ఆత్మగౌరవంతోనే కాదు, కాస్త ఆత్మవిమర్శతో వుంటే యింత అసంతృప్తి, ఆర్గ్యుమెంటూ వుండదు. ఆధార్’లు అక్కర్లేదు. నే రాసింది అసత్యమే అయితే మీరు వొదలకపోయినా కాలం వదిలేస్తుంది. అక్షరాలను అసత్యాలకెత్తవలసిన అవసరం నాకు లేదు. మీరు అన్నారని నా అనుభవాలను రద్దు చేసుకోలేను.

  19. అజిత్ కుమార్ says:

    ఈ వ్యాసంలో ఉపాధ్యాయుని విమర్శించడం జరిగింది. ఉపాధ్యాయుని పని విద్యార్ధులకు విద్యను బోధించడం. ఆ సమయంలో ఉపాధ్యాయుడు తన విధులను సక్రమంగానే నిర్వహిస్తున్నాడు. కానీ మిగిలిన సమయంలో ఉపాధ్యాయుడు చేసే పనులను ఈ వ్యాసంలో తప్పులుగా చెప్పబడింది.
    దేశపాలకులనుండి సాధారణ ఉద్యోగుల వరకూ, ధనవంతుల నుండి ప్రయవేటు ఉద్యోగుల వరకూ తమ పిల్లలను ఇంగ్లీషు మీడియం స్కూళ్ళలో చదివించడం జరుగుతుంది. ఇది విమర్శించదగ్గ అంశం కాదు. టీచర్లు తెలుగు మీడియం స్కూళ్ళలో ఉద్యోగం చేస్తున్నంతమాత్రాన తమ పిల్లలను అదే స్కూళ్ళలోనే చదివించాలనటం తప్పు.
    పూర్వకాలపు టీచర్లకు లేని సదుపాయాలు నేడున్నాయి. ఎల్లైసీ ఏజంట్లుగా, రియలెస్టేట్ ఏజంట్లుగా, ఫైనాన్సు వ్యాపారులుగా, ప్రయివేటు విద్యాసంస్ఠల్లో కాంట్రాక్టు టీచర్లుగా పనిచెయ్యడం ఇలా ఎవరికి వీలైన పనులు వాళ్ళు చేసుకోవడం జరుగుతుంది. ఈ పనులు చేసే పోటీదారులు టీచర్లను విమర్శించడం సహజం.

    • venukrishnamurthy thomala says:

      ఎంద‌రో మ‌హానుభావులు..అంద‌రీకి వంద‌నాలు.
      మాస్టారూ..పీకేసుకుందామా? అన్న టాపిక్‌పై ర‌స‌వ‌త్త‌రంగా చ‌ర్చిస్తున్నారు. ఎవ‌రి అభిప్రాయాలు వారివి. ఎవ‌రూ కాద‌న‌లేం.కానీ స్ర్ట‌యిక్‌గా చెప్పాలంటే ఉపాధ్యాయ వృత్తి గొప్ప‌ది. ఆ వృత్తిని మ‌నం గౌర‌విస్తే..కాపాడితే..అది మ‌న‌ల‌ను కాపాడుతుంది.(వృత్తో ర‌క్షిత ర‌క్షిత‌:) ఐదు వేళ్లు ఒక‌లా ఉండ‌వు.మ‌నుషులంద‌రూ ఒక‌లా ప్ర‌వ‌ర్తించ‌రు. ఉపాధ్యాయులు ఇందుకు మిన‌హాయింపు కాదు.గురువును విమ‌ర్శించ‌డం..వెట‌కారంగా మాట్లాడ‌డం చాలా బాధాక‌రం.నిజ‌మే.కానీ ఈ దుస్థితికి దౌర్భాగ్యానికి కార‌ణం,కార‌కులు ఎవ‌రు? బ‌లుపో..బ‌ల‌హీన‌తో కార‌ణాలేవైనా ఉపాధ్యాయ వ‌నంలో క‌లుపు మొక్క‌లు పీక‌లేనంత‌గా పెరిగిపోయాయ‌న్న‌ది నిజం కాదా? రాజ‌కీయాలు..కుల‌గ‌జ్జి అంటుకున్న ఆ క‌లుపు మొక్క‌ల మూలంగానే మాస్టారు పీకేసుకుందామా? అనే ప‌రిస్థితి వ‌చ్చింద‌న్న‌ది నా ఫీలింగ్. టీచ‌ర్లు సుఖ‌ప‌డిపోతున్నార‌ని ఏడ్వ‌డానికి వీల్లేదు.అలాగ‌ని సుఖాల‌కు దూరమైపోతున్నార‌ని జాలి ప‌డాల్సిన ప‌రిస్థితి లేదు. వృత్తిధ‌ర్మం పాటించే ఉపాధ్యాయులు క‌లుపుమెక్కుల ఎదుట న‌వ్వుల‌పాల‌వుతున్నారు.పోర‌ళ్ల‌కు సిన్మా స్టోరీలు..ఊళ్లో కుర్రాళ్ల‌కు మందు పార్టీలు..లీడ‌ర్ల‌ను గ్రిప్‌లో పెట్టుకొని బ‌డి బియ్యం అమ్ముకునే పంతుళ్లు ఉత్త‌మ ఉపాధ్యాయులుగా చెలామ‌ణి అవుతున్నారు. ఇవేవీ ప‌ట్టించుకోకుండా బుద్దిగా పాఠాలు చెప్పే టీచ‌ర్లు సాటి స్మార్ట్ టీచ‌ర్ల దృష్టిలో ..పిల్ల‌ల దృష్టిలో..జ‌నం దృష్టిలో చెల్ల‌ని నోట్లుగా జ‌ఫ్ఫా ఖాతాలో ప‌డి బ‌తుకు బండి లాగేందుకు గుండెను రాయి చేసుకుంటున్నారు. ఇగ టీచ‌ర్ యూనియ‌న్ల సంగ‌తి.అదో బ్ర‌హ్మ‌ప‌దార్ధం.కక్కుకుంటే కాళ్ల మీద ప‌డుద్దంటారు..(స‌ర్వ‌జ్ఞుల‌కు నేను చెప్పేదేముంది..గురు గురుల మాట‌ల్లో ఐక్య‌త అనే మాట విన్పిస్త‌ది.చేత‌ల్లో మాత్రం ఫుల్‌గా కుటిల‌త్వ‌మే.ఐనా వాళ్ల త‌ప్పేముంది బ‌దిలీ కోస‌మో..సిటీకి ద‌గ్గ‌ర‌లో ఉన్న పోస్టింగ్ కోస‌మో..లీవ్ ఎన్‌క్యాష్మెంట్ కోస‌మో..రీ ఎంబ‌ర్స్ కోస‌మే నేత‌ల చేతులుత‌డిపే గురుపుంగ‌వులు ఎంద‌రు లేరూ..) బ‌తుక‌లేక బ‌డిపంతులు..బ‌త‌క‌నేర్చిన బ‌డిపంతులు.. ఈ ఔడేటెడ్.సామెత‌ల‌ను పాత‌రేయాలిక‌. సింక్ కాదుకావ‌చ్చు కానీ చిన్న స్వ‌గ‌తం. మా నాన్న టీచ‌ర్‌. మా ఊరెళ్తే ఇప్ప‌టికీ న‌న్ను సార్ కొడుకు అంటూ ఆత్మీయంగా ప‌ల‌క‌రిస్తారు.నేనెంత పీకినా ఆ పిలుపు ముందు గ‌డ్డిపోచ క‌న్నా హీన‌మే. అంత‌టి స‌గౌర‌వాన్ని అందించిన మాతండ్రిని ద‌లించి గ‌ర్వ‌ప‌డుతుంటా. ఇప్పుడు మా నాన్న లేరు కానీ ఆయ‌న మంచిత‌నం ఊళ్లో స‌జీవంగా వుంది. బ‌తుకు బాట‌లో ఊరికి దూర‌మైనా ఆ వేరు బంధం న‌న్ను మా వూరి బాట‌ప‌ట్టిస్తుంది. సిన్మాటిక్ చెప్పాలంటే మా వూరు..మా నాన్న పేరు మాకెంతో ఇచ్చింది.అందుకే నాన్న పేరిట మా ఇంటిని గ్రామ గ్రంథాల‌యంగా చేయాల‌న్న‌ది మా(మా అమ్మ‌, నేను మా అక్క‌య్య‌లు,చెల్లె ఆశ‌యం) ఇది ఇందుకు చెప్తున్నానంటే..మా ఆశ‌యానికి ఆర్ధిక ప‌రిస్థితి స‌హ‌క‌రించ‌క పోవ‌చ్చు. మా ఆశ‌యం నెర‌వేర‌చ్చు.లేక‌పోవ‌చ్చు.కానీ ఈ ఆలోచ‌న‌
      రావ‌డానికి కార‌ణం మా నాన్న‌. టీచ‌ర్‌గా మా నాన్న‌కు ఉన్న మంచిపేరు.కొడుకుగా మా నాన్న జ్ఞాప‌ర్ధం కోసం నాకు ఈ ఆలోచ‌న వ‌చ్చింద‌నుకోవ‌చ్చు.కానీ ఓ టీచ‌ర్‌గా మా నాన్న కొంత‌మందినైనా ప్ర‌భావితం చేసివుంటార‌ని నేను క‌చ్చితంగా న‌మ్ముతాను.మా నాన్నే స్పూర్తి కాకున్నా స‌హ‌వాస ల‌క్ష‌ణాల‌తో ఎవ‌రో ఒక‌రు త‌మ‌కు తోచిన రీతిలో కొంద‌రికైనా సాయ‌ప‌డి వుంటారు.ఒక పేద‌విద్యార్ధికి ఫీజు క‌ట్ట‌డ‌మే..బ‌ట్ట‌లు ఇవ్వ‌డ‌మో..కేరియ‌ర్ గైడెన్స్ ఇవ్వ‌డమో.. ఇలా ఏదో ఒక రీతిన త‌మ దాతృత్వం చాటుకుని వుంటారని న‌మ్మ‌కం.
      మా చిన్న‌ప్ప‌టి నుంచి మా నాన్న ఒక మాట చెప్పేవారు. జాబ్‌లో జాయినైన‌ప్పుడు నా జీతం 60 రూపాయ‌ల‌ని.అలా చెప్తున్న‌ప్పుడు ఆయ‌న‌లో ఎంతో సంతోషం క‌న్పించేది. జీతం 30 వేల‌కు పెరిగినా ఆయ‌న‌లో అలాంటి ఆనందాన్ని చూడ‌లేదన్నెడు.నన్ను టీచ‌ర్‌గా చూడాల‌న్న మా పేరెంట్స్ కోరిక‌ను పూర్తిగా తీర్చ‌లేదు.ఈనాడు భాష‌లో ప్ర‌.ఉ..కాక‌పోయిన ప్ర‌యివేట్ టీచ‌ర్‌గిరిని ఎంతో ఎంజాయ్ చేశాను.
      నా ప‌రీక్ష సంగ‌తి ప‌క్క‌న పెట్టి..పిల్ల‌ల‌కు డౌట్లు చెప్తుంటే ఎంతో ఇదిగా ఉండేది. ప‌దేళ్ల‌యినా అప్ప‌టి ఇంట‌ర్ పిల్ల‌లు ఇప్ప‌టికి ట‌చ్‌లో ఉంటారు.విజ‌యానికి ఐదు మెట్లు అనే క‌హానీలు చెప్ప‌లేదు నేను. నా ఫెయిల్యూర్ స్టోరీని అనుభ‌వాల‌ను అప‌జ‌యాల‌ను వాళ్ల క‌ళ్ల‌కు క‌ట్టాను. వాళ్ల‌లో ఒక్క‌డిగా క‌లిసి బ‌తికాను. వాళ్ల‌కు ఎన్నో నేర్పాను.వాళ్ల నుంచి ఎన్నో నేర్చుకున్నాను. ఆదాయం సున్నా..ఆనందం ఆకాశ‌మంత‌. ఇప్పుడు నాక‌న్న ఉన్న‌త‌స్థానాల్లో ఉన్నారు పిల్ల‌లు. అప్పుడ‌ప్పుడు ఫోన్ చేసి మాట్లాడుతారు. ఆస్తుల క‌న్నా ఇలాంటి ఆత్మీయ‌తే గొప్ప‌ద‌ని నాన్న ద్వారా అర్ద‌మైంది. స్వీయ అనుభ‌వంలోకి వ‌చ్చింది.
      ఇక క‌మింగ్ టు పాయింట్‌..
      ప్ర‌క్షాళ‌న వంటి పెద్ద సాహ‌సాల జోలికి పోను కానీ.. ఓ ఆశ‌వాదిగా అంద‌రికీ ఓ విన్న‌పం. టీచ‌ర్ల వ‌ల్ల విద్యావ్య‌వ‌స్థ పాడ‌వుతుందా..స‌మాజ పోక‌డ‌
      ల వ‌ల్లే గురుధ‌ర్మం వ‌క్ర‌దారిప‌డుతుందా? అనేది రెండు మూళ్లు ఆరు అని ఆన్స‌ర్ ఇచ్చే ప్ర‌శ్న కాదు. సో త‌ప్పుఒప్పుల మాట ఎలా వున్నా
      బ‌తుకు బాట‌లేసే బ‌డి బేఇజ్జ‌త్ కాకుండా కాపాడుకోవాల్సిన బాధ్య‌త వుంది. టీచ‌ర్‌ను క్రీచ‌ర్‌గా తుల‌నాడే కుసంస్కృతిని త‌రిమేయాలి.
      టీచ‌ర్ వ్య‌క్తిత్వంతోనే టీచ‌ర్ అనే ప‌దానికి..వృత్తికి గౌర‌వం. ఆ గౌర‌వాన్ని స‌గ‌ర్వంగా గౌర‌వించే రోజులు మ‌ళ్లీ వ‌స్తాయ‌ని ఆశిద్దాం.
      మీ అంద‌రి చ‌ర్చ‌..అభిప్రాయాల‌కు స‌లామ్‌..జై ఉపాధ్యాయ‌.
      నోట్‌:క‌లుపు మొక్క‌ల‌ను పీకేయాల్సిందే.
      గురువుకు స‌గౌర‌వంగా…
      వేణు కృష్ణ‌మూర్తి

  20. లక్ష్మణరావు says:

    బజరా గారు చెప్పింది ముమ్మాటికీ నిజం.
    మొదటి అంశం. బతుక్కోసం అని అనుకునే బడి పంతుళ్లకి వేతనాలు నిర్ణయించడం..ఎప్పటికప్పుడు పి.ఆర్.సి.లు వేయడం…సంఘ నాయకులు కీర్తిస్తున్నట్లు వేలాది రూపాయలు అమాంతం జీతాలు పెరిగిపోవడం వలనే పని సంస్కృతి పూర్తిగా దెబ్బతింటోంది. కేవలం తినడానికి తిండి, ఉండడానికి ఓ గుడిసె, కట్టుకోవడానికి కాదుకాదు చుట్టుకోవడానికి రెండు, మూడు జతులు గుడ్డముక్కలు ఇస్తేనే గాని పని చేయాలన్న తపన పుట్టదు. ఇది వినడానికి పారిశ్రామిక యజమానుల మాటల్లా…అప్పుడప్పుడు ప్రజలు ఏలే ప్రభువుల ప్రకటనల్లా అనిపించినా…సూక్ష్మ స్థాయి పరిశీలనతో చేసి, వడపోసి నిగ్గుతేల్చిన వ్యాసం ఇస్తున్న సాక్ష్యం, తేల్చుతున్న సారాంశం కూడా అదే. ఇందుకు అనేక ఉదాహరణలు మన కళ్ల ముందే ఉన్నాయి. ఆర్టిసీ నష్టాలకు అక్కడి కార్మికులు పనిచేయకపోవడం కారణం కాదా. భీమిసింగి, నిజాం సుగర్స్ నష్టాలు రైతులు స్వార్ధం, కార్మికులు బద్ధకం కాదనగలమా. ఆగ్రోస్ వంటి సంస్థలు మూతపడే దశకు చేరడానికి ఉద్యోగుల బాధ్యతారాహిత్యం కాదా. జూట్ పరిశ్రమల సంక్షోభానికి కూడా కార్మికుల హక్కులు గురించి సమ్మె చేయడాలు కాదా. ఇవి ప్రబల నిదర్శనాలు. పని చేయని సంస్కృతిని, నిజాయితీ రాహిత్యాన్ని పెంచిపోసిస్తున్న వేతనాల పెంపుదలకు వ్యతిరేక వాణిని సిద్ధం చేసినప్పుడే ఈ దేశం సుభిక్షంగా ఉంటుందేమో అని నాకు అనిపిస్తుంది. లోతైన ఈ విషయాన్ని గుర్తించని కొన్ని పార్టీలు సంఘాలు పెట్టడం….వేతనాలు పెంచాలని ఆర్ధిక వాదాల కూపంలో వారు కూరుకుపోతున్నారు. ఈ దేశంలో (నర్సింహారావుగారు చెప్పినట్లు, బజరాగారికి కూడా ఏకాభిప్రాయం ఉన్నట్లుగా) హక్కులు మీద ఉన్న శ్రద్ధ, బాధ్యతల మీద లేకుండా చేస్తోంది. ఈ పరిస్థితి మారాల్సిందే.
    రెండో అంశం. ఈ వేతనాలు పెరుగుదల ఉపాధ్యాయుల్లో అనేక ఆశలకు కారణమవుతుంది. వచ్చిన ఉపాధ్యాయ వృత్తితో సంతృప్తి చెందకుండా ఉన్నత జీవితాల కోసం ఉన్నత ఉద్యోగాల సాధన కోసం ఆలోచించడం శ్రేయోదాయకం కాదన్నది బజరా భావన. పైకి కర్మ సిద్దాంతంగా అనిపించినా ఈ సమాజం నాలుగు కాలాలు పాటు ప్రశాంతంగా కొనసాగాలంటే ఎక్కడివారు అక్కడ ఉండడమే మంచిది. ఎందుకంటే అధిక వేతనాలు పొందుతున్న ఉపాధ్యాయుడు, అధిక వేతనాలు పొందుతున్న ఉపాధ్యాయురాలిని పెళ్లి చేసుకోవడం కూడా నేరమనే చెప్పాలి. ఎందుకంటే మనిషి జీవికకు మించి డబ్బు ఇంట్లోకి వచ్చి పడినప్పుడు ఆశలు పెరుగుతాయి. ఆలోచనలు మారతాయి. ఉన్న స్థితి కన్నా మరింత ఉన్నతంగా జీవించాలన్న కోరికలు రెక్కలు తొడుగుతాయి. ఇక అక్కడ నుంచి ‘అసలు పని’ గాడి తప్పుతుంది. అందువలన పెళ్లి విషయంలో ఓ కొత్త విధానాన్ని తీసుకుని రావాల్సి ఉంది. అలానే ఒక సారి ఉద్యోగం వచ్చిన వాడు అక్కడే ఉండేటట్లు చట్టం చేస్తేనే గాని పని సంస్కృతి అలవడదేమో.
    మూడో అంశం : పని చేసిన చోట ఉపాధ్యాయులు ఉండడం లేదు. కనీసం వారి పిల్లలను ఆ పాఠశాలల్లో చేర్పించడం లేదు. దీనిని కాదనగలమా. ఎవరు స్థాయి బట్టి వారు వ్యవహరించాలి గాని ఉద్యోగ అవకాశాలు కోసం, విదేశాల్లో డాలర్లు వేట కోసం ఇంగ్లీషు చెప్పే ప్రైవేట్ పాఠశాలలో చేర్పించడం ముమ్మాటికీ తప్పే. ఈ ధర్మాలు పాటించకపోవడం వలనే ఒకనాటి పని సంస్కృతి బౌద్దిక రూపం ధరించడం లేదు. యజమానులు పిల్లలు, సివిల్ సర్వీస్ ఉద్యోగుల పిల్లలు, ఏలిన వారి పిల్లల్లా ఇంగ్లీషు చదవాలని, విదేశీాల్లో ఉద్యోగాలు సాధించాలని కలలు గనడం, అందుకోసం ప్రయత్నించడం ‘స్థాయి’ని మించి చేస్తున్న ఆలోచనే. దళిితులు పిల్లలు పశువుల పాకల్లోనూ, వ్యవసాయదారుల పిల్లలు, ఉపాధ్యాయుల పిల్లలు ప్రభుత్వ బడుల్లోనూ, మిగిలిన ఉన్నత వర్గాల పిల్లలు ప్రైవేట్ పాఠశాలల్లో చదవడమే శ్రేయోదాయకం. కాదనగలమా. ఇక్కడ కూడా ‘ఉన్నత ‘ ఆశలు చిగురించడానికి, విదేశాలు వైపు దృష్టి సారించడానికి కూడా ఈ వేతనాలు పెరుగుదలే కారణం. పని సంస్కృతి కోల్పోవడానికి అదే కారణం.
    నాలుగో అంశం : పెరిగిన వేతనాలు వలన సంభవిస్తున్న పర్యవసానాలు గుర్తించే ఈ ‘మాష్టారు’ ఇప్పుడు పశ్చాతాపాన్ని వ్యక్తం చేయడం గొప్ప ఆత్మ విమర్శ. ఆనాడు బతకడం కోసం బడి పంతుళ్లు అదే పనిగా పనిచేసే వారు. ఇప్పుడు జీతాలు పెరిగిన తరువాత ఆ పని చేయాలన్న తపన తగ్గింది. డబ్బును పెంచుకోవాలన్న ఆలోచన దురాశపరులను చేసింది. మొత్తం ఉపాధ్యాయ రంగాన్ని పని సంస్కృతి లేని రంగంగా మార్చేసింది. ఈ వాస్తవాలను గుర్తించారు కాబట్టే ‘నేను చెడిపోయాను’ మాష్టారు అని గురువు వద్ద చిన్న గురువు తన తప్పును అంగీకరించారు. అటువంటప్పుడు ఉద్యోగానికి రాజీనామా చేయవచ్చు కదా అని కొంతమంది గొంతు పెద్దది చేసి అడగవచ్చు. కాని పశ్చాతాపానికి మించి ప్రాయశ్చిత్తం మరొకటి ఉంటుందా. పని సంస్కృతి లేని ఆ పాఠశాలల్లో, డబ్బులు గురించి తప్పా పాఠాలు ఊసే లేని బడుల్లో, బ్రోకర్లుగా మారి అనైతిక ప్రవర్తనా ఆవరణాలుగా బడులను మార్చేస్తున్న వైనాలు కళ్లారా చూశారు. గుర్తించిన ఆ తప్పుడు పద్దతులను మార్చడానికి ఓ టీచర్ గా వ్యాస బోధన చేశారు. కనీసం ఉద్యోగ విరమణకి ముందైనా ఈ ఉపాధ్యాయులను మార్చలేనని తన నిస్సహాయితకి తానే నిందించుకుని రాజీనామా చేసి తీరుతారని ఆయన ఆవేదన, ఆందోళన చెప్పకనే చెబుతుంది. ఈ వాస్తవాలు గుర్తెరగకుండా జీళ్లు బంకలా చర్చను కొనసాగించడం నన్ను ఎంతగానో బాధించింది.
    ఈ వ్యాసం మొత్తం చెప్పేది వేతనం తెచ్చిన జబ్బు గురించి. అప్పుడప్పుడు టి.విల్లోనూ, బయట జరిగే ఆధ్యాత్మిక సభల్లోనూ స్వామీజీలు చెప్పిందానిని ఒకప్పుడు వినికిడి జ్ఈానంతో తెగ ఖండించేస్తుండేవాడిని. రెప్పు పాటి జీవితమని గుర్తురెగకుండా, సుఖదాయకమైన జీవితాల యావలో పడి మనుషులు అమానవీయంగా మారుతున్నారని, సులభంగా డబ్బులు సంపాదించాలన్న దురాశతో పరుగులు పెడుతున్నారని…అదే ప్రశాంతత లోపిండానికి కారణమని వారు గొంతు చించుకుంటుంటే మిడిమిడి జ్ఈానంతో వాదించే వాడిని. కాని…ఇది మార్క్సిస్టు దృక్కోణానికి దగ్గరిదే అని మా బజరాగారే చెప్పినందున ఆయన మీద నాకు ఉన్ననమ్మకంతో నేను కూడా నాడు చేసిన వాదనలకు పశ్చాతాపం పడుతున్నాను. బతడం కోసమే ఉద్యోగంగా మార్చాలని, పని సంస్కృతిని దెబ్బతీస్తున్న వేతనాల పెంపుదలను లేకుండా చేయాలని ఓ ‘బాధ్యత’ గల పౌరుడుగా అబిప్రాయపడుతున్నాను.

    • బమ్మిడి జగదీశ్వరరావు says:

      లక్ష్మణరావు గారూ.. నా రచనలో యిన్ని విషయాలు వున్నాయని నాకే తెలీదు. తెలియజెప్పిన ‘బాధ్యత’గల పౌరునిగా మీకు నా కృతజ్ఞతలు!

      • లక్ష్మణరావు says:

        ‘చాలా చిన్నవయసు నుంచే సమాజంపట్ల నిబద్ధతతో విప్లవవాదాన్ని నమ్మి సాహిత్య సామాజిక రంగాల్లో కృషిచేస్తూ వచ్చారు బజరా.తన రచనావ్యాసంగపు తొలిరోజుల్లో ప్రచురించిన ‘మట్టితీగలు’, ‘పిండొడిం’ కథాసంపుటాలు ఉత్తరాంధ్ర శ్రామికమహిళలు, ప్రధానంగా గ్రామీణమహిళల శ్రమశక్తిని, ధైర్యసాహసాలను, అదేసమయంలో వారి జీవితాల్లోని పేదరికాన్ని, దైన్యతని చిత్రించాయి. స్త్రీలుకూడా అత్యంత అరుదుగా మాత్రమే రాయగలిగిన సూక్ష్మమైన కోణాలను పట్టుకుని ‘రెక్కలగూడు’, ‘ఎర్రకలువ’ లాంటి స్త్రీవాద కథలు రాసారు. స్త్రీవాద కథలను వర్గదృష్టితో సమన్వయం చేయడానికి ప్రయత్నించిన అతి తక్కువమంది కథకులలో ఒకరు బజరా'(మల్లీశ్వరి గారి అనుమతి లేకుండా వీటిని తీసుకున్నాను). అంతటి అరుదైన కథకునికే తెలియని కొన్ని విషయాలను పిపీలకం లాంటి వాడినైన నేను తెలియజేయగలిగానంటే నన్ను నేను నమ్మలేకపోతున్నాను. ఇంత చిన్న వాడికి ధన్యవాదాలు చెప్పగలిగారంటే ఆయన సహృదయతకు ఓ నిదర్శనం. ఆయన నా పట్ల చూపిన ఈ ‘బాధ్యత’కి కళ్లొత్తుకుని కృతజ్ఈతులు చెప్పుకోగలను తప్పా మరో రూపంలో చెప్పేందుకు నా వద్ద అంతటి సాహిత్య సృజన లేకపోయినందకు చింతిస్తున్నాను. అయినా పర్వలేదు. బజరా గారే నా భుజం తట్టి ప్రోత్సహిస్తున్నందున ఆ లోపాన్ని కూడా రానున్న కాలంలో అధిగమించగలనేమోనని ఆశ పడుతున్నాను.

  21. ఎ కె prabhaakar says:

    మేష్టర్లు ఎలా ఉండకూడదో పిచ్చి ఆవేదనతో చెప్పినందుకు బజరా కి థేంక్స్.
    అనవసరంగా మేష్టర్ని అయ్యానన్న పశ్చాత్తాపం మాత్రం నా ముప్పయ్ ఐదేళ్ళ ఉపాధ్యాయ జీవితంలో నాకెప్పుడూ కలగలేదు.
    మంచి ఉపాధ్యాయుడు ఆత్మ గౌరవాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు.
    ప్రపంచవ్యాప్తంగా అన్ని కాలాల్లోనూ ప్రజా ఉద్యమ నిర్మాతలూ సిద్ధాంత కర్తలూ ఉపాధ్యాయులే అన్న విషయం మరువకూడదు.

  22. రెడ్డి రామకృష్ణ says:

    డియర్ బజరా
    మొన్ననే… పదిరోజుల్లోపే ఆం..ప్ర విద్యశాఖామంత్రి గారైన గంటా శ్రీనివాసరావు గారు ఈవిషయమే చెప్పారు “పాఠశాలల్లో కొందరు టీచర్లు విధులకు గైరు హాజరవుతున్నట్టు తెలుస్తోంది.ఇది సరైనది కాదు.అలాంటివారిపై చర్య తీసుకుంటాం” అని.ఒక నెలరోజులక్రితం ఆం..ప్ర ముఖ్య మంత్రిగారు మాట్లాడుతూ “సుమారు నాలుగు వందలమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉపాధ్యయులు వివిధ నాయకులవద్ద పిఎస్ లు గానో పిఎ
    లు గానో ఉంటున్నారు. వారిని వెంటనే తమ విధులకు పంపించి వేయడం జరుగుతుంది”.అంటే ప్రభుత్వం ఏమి చెపుతోందో మనమూ కూడా అదే చెపున్నామా.(ఒకవేళ మీరు అనవచ్చు.అది వాస్తమైనప్పుడు ఎవరైనా అదే చెప్తారు అని)నిజానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టే అయితే అలాంటి ఉపాధ్యాయులు గానీ వుద్యోగులు గానీ ఎప్పుడో దారిలో కొచ్చేవారుగదా.కానీ అలా ఎందుకు చేయరు.ఎందుకంటే అలాంటి వారిని చూపించి మొత్తం ప్రభుత్వ ఉపాద్యాయులు అలానే ఉన్నారన్న భ్రమను ప్రజల్లో కల్పించి ఆరంగాన్ని నిర్వీర్యం చేయ్యదలచుకున్నారుకాబట్టి.అది కావాలనే ప్రభుత్వాలుఎత్తుగడలతో చేసే పని.నిజానికి అలాంటి వారికి( విధులకు హాజరుకాని) అవకాశమో లేదో ధైర్యమో ఎవరిస్తున్నారు.ఆ ప్రత్వలలోనే పెద్దలే యిస్తారు.మనం కూడా యిలాంటి వ్యాసాలద్వారా ఆప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాం.
    ఇలాచెప్పడంద్వార మనం ఏపక్షములో ఉంటున్నట్టు.
    యిక మీ సమాధానల్లో కొన్ని వాక్యాలు అర్ధం కాక వ్యాసం లోకి వెళ్లి చూస్తే అక్కడా అలాంటి అర్ధం కాని వాక్యాలు,సందేహాలు కలుగుతున్నాయి.మీరు వివరిస్తారని ఆశిస్తాను.
    ముందుగా మీసమాధానాల్లోకి వెళదాం

    మీరు ప్రతిసారి ‘పాత్ర, దాని పరిధీ గురించి మాట్లాడుతున్నారు.మీరు రాసింది కథా! వ్యాసమా!? వ్యాసంలో పాత్రల ప్రమేయం అవసరమా!..అదీ మీరు చెప్పాల్సిన అనేక విషయాలకు ఆ పాత్ర అడ్దంకి అయినపుడు ఆపాత్రనే ఎందుకు తీసుకున్నారు. మేష్టర్లను చెడా మడా తిట్టగలిగి,మరియు మీరు చెప్పాలనుకున్న అన్ని విషయాలు చెప్పగలిగిన పాత్రను తీసుకొనివుంటే బాగుండేదికదా!

    “వ్యవస్థని ఇలా తయారుచేసిన..” దాంట్లో ప్రభుత్వమూ దానిలో భాగమైన ఉద్యోగులూ వున్నారు. వ్యవస్థ తయారీలో తను తయారు చేసిన ఉద్యోగులే తనకు(ప్రభుత్వానికి) సహకరిస్తారు. ఇలా తయారీకి తమ వంతు పాత్ర కూడా నిర్వహిస్తారు. అలా నిర్వహిస్తున్న నిర్వాకంగా వున్న ఉపాధ్యాయులను ప్రధానంగా ఉద్దేశించి రాసింది యిది.
    ఈ వాక్యం అర్ధమేమిటో నాకు అర్ధం కావటం లేదు.వ్యవస్థ తయారీలో ప్రభుత్వానికి తాను తయారు చేసిన ఉద్యోగులు ఉపాధ్యాయులు సహకరిస్తారు.అలా తయారయిందీ వ్యవస్థనికదా అంటున్నారు.అంటే అలా( ప్రభుత్వానికి సహకరించటం) చేయాలంటారా వద్దంటారా,అలాంటి నిర్వాకం ‘చేయడంలేదనికదా వ్యాసంలో అంటున్నారు.

    మొత్తం ఉపాధ్యాయులు అలా లేరన్నది నిజం అని అనిపిస్తే “మాష్టారూ పేకేసుకుందామా” రా అని మొత్తం ఉపాధ్యాయ రంగాన్ని అవమానపరిచే విధంగా వున్న శీర్షిక ఎలా పెట్టగలిగేరు

    “ఎవరి అజ్ఞానం వారి జ్ఞానమైనా మన(మాస్టార్ల)అజ్ఞానం మాత్రం అందరిదీ.. భవిష్యత్తు తరాలదీ అని మాత్రమే. అంతే అర్థం. అంటున్నారు.అంటే మేష్టర్లందరూ అజ్ఞానులనే కదా,అంటే గురువు,శిష్య గురువు కూడా అజ్ఞానులే. అయితే ఆవిషయం మొదటిగురువుకు తెలుసునన్నమాట.తాను ఆజ్ఞానినని తెలుసుకున్నవాడు గొప్ప జ్ఞాని అని కదా కొందరంటారు.బహుసా అందుకే మీరు ఆయన్ని అనగా మొదటి గురువుని ఆదర్సీకరించారు అనుకుంటాను.”అందుకే ఈ ‘మనకి మాత్రమే నిరంతర విద్యార్థిగా వుండే వీలు.. కాదు, అవసరం వున్నదని మీరు గర్వంగా చెప్పారు’ అనే కొనసాగింపు మాట”. యింక ఈ కొన సాగి ఏమి సాధిస్తుంది.మరింత అజ్ఞానమే గదా!

    “మీ భద్రతలో పిల్లల భద్రత ఆలోచన లేదు. పిల్లల ఉన్నతస్థితికి తోవ లేదు. మూసుకుపోతోంది”.అంటున్నారు.కొందరు ఉపాధ్యాయులు అదీ కొద్దిమది గైరు హాజరువల్ల..మరి వేల ఉపాధ్యాయుల ఖాళీలమాటేమిటి.మీరు ప్రతిపక్షంలో వుంటే దేన్ని ప్రశ్నించాలి.
    ” జీవిత భాగస్వామిని వృత్తి ద్వారా ఎంపిక చేసుకోవడం చాలా చిన్న విషయం.” మరి అలాంటి చిన్న విషయాన్ని ఏదో ఘొరం జరిగి పోతున్నట్టు ఏందుకు రాయాల్సి వచ్చింది.

    సాంప్రదాయవాది,లేదా ఒక సనాతన ధర్మ ప్రచారకుడు అయినటువంటి వ్యక్తి’గా నే రాసిన ‘మాస్టారు’ వుండి వుంటే యింత ఆందోళన చెందుతూ తన గురువుకి వుత్తరం రాయడు. ఎలా ఏడిస్తే ఏడుపుగాదు.గురువుకు ఉత్తరం రాయడం ఆధునికమా

    “వ్యవస్థీకృతమైన నేరం రాజ్యానిదే కాదు, రాజ్యం చేస్తున్నదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళది కూడా. ఇది ‘మార్క్సిస్ట్ దృక్కోణానికి’ దూరమైంది కాదు.” ఇదీ మాక్సిస్టు దృక్కోణానికి దగ్గరైనదేనా.అయితే ప్రభుత్వాల ద్రుక్కోణం కూడా మార్క్సిస్ట్ దృక్కోణానికి దూరమైనదేమీకాదు.మరిక సమస్యేమీ లేదు.

    యిక వ్యాసంలో కొస్తే

    పిల్లలతో పాటు సెలవులు మంచి జీతాలు,స్ర్టెస్సు,స్ట్రెయిను లేక జీవితాంతం రిలాక్సు అయిపోవచ్చని తెలుసుకొని బ్యాంకుల్లో వుద్యోగాలు వొదులుకొని వొచ్చిన వాళ్ళుంటుండగా ..అలాంటి మేస్ట్రు ఉజ్జోగాలు వదిలి వెల్లిపోవాలని చూసే వెర్రివాళ్లగురించి ఎందుకండీ బెంగ ఈ శిష్య గురువుకు
    “మీ రోజుల్లో బతకలేక బడిపంతులు అనేవారట కదా?’ అంటే- ‘మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుంది?’ అని మీరన్న మాట..”అర్ధమేమిటో …మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుందని బహుసా మొదటి గురువులు ఆర్నెల్లకో యేడాదికో జీతాలు తీసుకునే వారేమో..మరి ప్రభుత్వమూ బతకాలి గదా..అనుకొని వుండొచ్చు.అంచేత వారు ఆదర్శనీయులే..
    యింకా అడగాలంటే చాలా ..వున్నాయి.అన్నీ ఒక్కసారి అడిగేసినా మీరు చెప్పేసినా నేను అర్ధం చేసుకోలేను.కనుక ప్రస్తుతానికి సెలవు

    • బమ్మిడి జగదీశ్వరరావు says:

      రామకృష్ణగారూ..
      ప్రభుత్వోద్యోగులూ (భాగమైన) ఉపాధ్యాయులూ వివిధ నాయకులదగ్గర పిఎస్ లు గానో పిఎలు గానో వుంటున్న వాళ్ళని వెంటనే తమ విధులకు పంపించి వేయమని హఠాత్తుగా ముఖ్యమంత్రికి విద్యావ్యవస్థ మీద ప్రేమపుట్టుకు వచ్చి అనలేదు. రెండు తెలుగు రాష్ట్రాల మీద అది సుప్రీమ్ కోర్టు వ్యాఖ్య. చీవాట్లు పెట్టి హెచ్చరిస్తే జరిగింది. అది కూడా కోర్టు తనకి తానుగా ఆ అజ్ఞను యివ్వలేదు. ఒకానొక ప్రజావాజ్యం సందర్భంగా చేసింది. తప్పదు కాబట్టి మొక్కుబడి మాటలు. ఇక, గంటా శ్రీనివాసరావు విద్యశాఖామంత్రి ప్రస్తావన తెచ్చారు కాబట్టి.. యిదే ‘మహారాజశ్రీ’ శీర్షికలో ‘ఈ గంట గణగణ మోగాలి’ అని నేను పబ్లిక్ లెటర్ రాసాను. http://saarangabooks.com/retired/2016/07/28/%E0%B0%88-%E0%B0%97%E0%B0%82%E0%B0%9F-%E0%B0%97%E0%B0%A3%E0%B0%97%E0%B0%A3-%E0%B0%AE%E0%B1%8B%E0%B0%97%E0%B0%BE%E0%B0%B2%E0%B0%BF/

      ‘ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టే అయితే అలాంటి ఉపాధ్యాయులు గానీ వుద్యోగులు గానీ ఎప్పుడో దారిలో కొచ్చేవారుగదా’ అని మీరు అమాయకంగా మాట్లాడుతున్నారు. అసలు తమకు కావలసిన విధంగా కావలసిన వ్యక్తుల్ని నియమించుకొని, డిపుటేషన్ మీద తెచ్చుకున్నదే ప్రభుత్వ పార్టీ నాయకులూ పెద్దలు. మీరన్నట్టు నిర్వీర్యం చేస్తున్నారు కాబట్టే, ఆ నిర్వీర్యతకు తమవంతు పాత్రని కొందరు పోషిస్తున్నారనేదే నా విమర్శ(ప్రచారం కాదు). ఈ విమర్శ లోంచి ఆత్మవిమర్శ కలుగుతుందని ఆశించాను. ఆత్మగౌరవంతో వుండడం మంచిదే, ఆత్మవిమర్శ కూడా అవసరం. ఆ అవసరం మాకు లేదు అంటే మీ యిష్టం.

      “మీరు ప్రతిసారి ‘పాత్ర, దాని పరిధీ గురించి మాట్లాడుతున్నారు.మీరు రాసింది కథా! వ్యాసమా!? వ్యాసంలో పాత్రల ప్రమేయం అవసరమా!.. “- నే రాసింది కథ కాదు, వ్యాసం అంతకన్నా కాదు. ‘మహారాజశ్రీ’ శీర్షిక- లేఖా సాహిత్యంలో భాగంగా ఒక్కో సంచికలో ఒక్కో పాత్ర ఒక్కో ఉత్తరం రాస్తుంది. అలా రాసే పాత్రలు మారుతుంటాయి. పాత్ర అన్నాక పరిమితులూ పరుధులూ వుంటాయి. అప్పుడే స్వభావాలూ వ్యక్తిత్వాలు రూపుకడతాయి. “మాష్టారూ పేకేసుకుందామా” అనేది నేను పెట్టిన శీర్షిక కాదు, సంపాదకులు పెట్టింది. నేను “ఉపాధ్యాయుల ‘దినము’ ” అని పెట్టాను. సంపాదకులు ఆకట్టుకొనేలా శీర్షిక మార్చి పెట్టడం పాత సంప్రదాయమే. శీర్షికలో వున్న భావం మీరన్నట్టు అవమానించేదిగా ఆ రచనలో వుందా?
      “మాస్టారూ.. మీ తరంలో యేమో గాని మా తరంలో మాస్టార్లు అంటే గౌరవం లేదు. సినిమాల్లో కూడా యెప్పటి నుండో బఫూన్లని చేసేసారు. అదేమిటో సినిమాలే కాదు, లోకం కూడా అంతే అనిపిస్తుంది. ‘మాష్టారూ.. పర్లేదు యింకో పెగ్గేసుకోండి’ అంటాడు వొకడు. ‘మాష్టారూ.. పేకేసుకుందాము వస్తారా..?’ అంటాడు మరొకడు. ‘మాస్టారూ.. ఓ ఫైవుంటే సర్దుతారా..?’ అని, ‘మాష్టారూ.. మీరు భలే మెగాస్టారు..!’ అని యెకసెక్కానికి మనమే యెబ్రివేషన్లయిపోయాము. అప్పటికీ ‘మాస్టారు’ మన తెలుగు పదం కాదు, ‘గురువు’ కదా అని సరిపెట్టుకున్నాను. సరిపెట్టుకోనిస్తేగా? ఆ వెంటనే ‘గురువుగారూ.. అగ్గిపెట్టి వుందా?’ అని, ‘గురూ.. గుంట భలేగుంది కదూ..’ అని, ‘గురూ.. నీ పెరసెంటేజీ నువ్వు తీసుకో..’ అని, ‘గురూ.. ఆ లం– డబ్బులు తీసుకుంది, రాలేదు..’ అని మనకి మర్యాదే మర్యాద. పోనీ కాసేపు ‘పంతులు’ అనుకుందాము అని అనుకోనేలోపే- ‘పంతులూ పంతులూ పావుసేరు మెంతులూ’ పద్యాలున్నూ!” – యిందులో అవమానించడం వుందో, ఆవేదన వుందో యెవరికి వారే నిర్ణయించుకోవాలి.

      మీరు ఉపాద్యాయుల పక్షం వున్నానని అనేసుకొని మీకే తెలియకుండా ఉపాద్యాయులను అవమానిస్తున్నారు.
      “ఎవరి అజ్ఞానం వారి జ్ఞానమైనా మన(మాస్టార్ల)అజ్ఞానం మాత్రం అందరిదీ.. భవిష్యత్తు తరాలదీ అని మాత్రమే. అంతే అర్థమని నే అంటే- “మేష్టర్లందరూ అజ్ఞానులనే కదా” కదా (నా అర్థం చెప్పినా కూడా) మీ అర్థం మీరు తీస్తున్నారు. మాస్టార్లుగా మనం జ్ఞానంతో మెలగాలని, అందుకే నిత్య విద్యార్థిగా వుండాలని. ఆ అవసరం వుందని. అంతే. అంతకన్నా లేదు అన్నాక కూడా- నాకు లేనివి మీకు మీరు ఊహించేసుకొని- ఆపాదించడం మీ విజ్ఞత.

      నిజమే, ఉపాధ్యాయ ఖాళీల గురించి ఖచ్చితంగా మాట్లాడాల్సిందే. ఖాళీల వల్ల వచ్చిన ‘పని భారం’ గురించి కూడా. మళ్ళీ అచ్చు వేసినప్పుడు చేర్చుకుంటాను. అందుకు మీకు కృతజ్ఞతలు.

      “జీవిత భాగస్వామిని వృత్తి ద్వారా ఎంపిక చేసుకోవడం చాలా చిన్న విషయం.” మరి అలాంటి చిన్న విషయాన్ని ఏదో ఘొరం జరిగి పోతున్నట్టు ఏందుకు రాయాల్సి వచ్చింది?- ఎంత కాలిక్యులేటేడ్ గా వున్నారో చెప్పడానికి. లెక్క మీద వున్నోళ్ళు తమ లెక్కలు మరింత లెక్కగా చూసుకుంటారని. వుపాధ్యాయులేనా? అలా వున్నది అని మళ్ళీ మీరు అనొచ్చు. చురక. ఎవరికైనా (ఏ రంగంలోని వారికైనా) కాలుతుంది అని. బొట్టే పెట్టాలా? ఇష్టా యిష్టాలకన్నా లెక్కలలోకి వొదిగి పోతున్నారని. అందుకు అందరూ అతీతులు కారు. లెక్కల్లో పడితే లెక్కకు దొరకమని. మెతుకు పడితే చాలని.
      సాంప్రదాయవాది,సనాతన ధర్మ ప్రచారకుడు, ఆధునిక విద్య.. సం’బంధము’ లేని చర్చ. ఆందోళన అంటే ఆధునికమా? అంటారు. పదం పట్టి లాగితే అర్థాన్ని ఎవ్వరమయినా కోల్పోతాము.

      “వ్యవస్థీకృతమైన నేరం రాజ్యానిదే కాదు, రాజ్యం చేస్తున్నదానికి ప్రత్యక్షంగా పరోక్షంగా సహకరిస్తున్న వాళ్ళది కూడా. ఇది ‘మార్క్సిస్ట్ దృక్కోణానికి’ దూరమైంది కాదు.” అని నేనంటే అందులో ధ్వని మీకందలేదు, వెటకారమే ధ్వనించి “ఇదీ మాక్సిస్టు దృక్కోణానికి దగ్గరైనదేనా.అయితే ప్రభుత్వాల ద్రుక్కోణం కూడా” అన్నారు. రాజ్యం/ప్రభుత్వం తాను తయారు చేసిన యంత్రాంగం తనకే తిరిగి సహకరించేలా చేసుకుంటుంది. అది ఉద్యోగ సహకారం అన్నంతవరకు చెయ్యవలసిందే. మనమూ అర్థం చేసుకోవలసిందే. ఇక్కడ సహకారము అంటే అది కాదు. రాజ్యం (వ్యవస్థ నిర్వీర్యం అయ్యేలా) కాలుస్తుంటే కర్రలు అందించే లాంటి సహకారం. రాజ్యం అభీష్టం నెరవేరేలా- రాజ్యం అభీష్టంవేగవంతం అయ్యేలా- మరింత త్వరగా మూత పడేలా- తనకి ఉపయోగపడేలాగన్నమాట. ఇక్కడ మన బడులు ముంచెయ్యడానికి ప్రభుత్వం వుద్దేశ పూర్వకంగా చేస్తే – ఉద్దేశం లేకపోయినా – పరిస్థితుల వల్ల నయినా అందుకు సహకరిస్తున్నారని నా వేదన. కొందరనే నా వుద్దేశమండోయ్. ఇంకొందరు చేరకూడదనే నండి.శత్రువుకు బలాన్ని యిచ్చినవాడు శత్రువే కదండీ. ఇప్పుడు ‘నయీం’ చేసిన నేరాలూ ఘోరాలూ ప్రభుత్వమూ అందులోని పెద్దలూ చేయించినవే. నయీంని తయారు చేసిందే ప్రభుత్వం. అలాగని నయీంని మెచ్చలేం!

      ఇక మీ చివరి మాటలకు వొస్తే- శిష్య గురువు బెంగ గురించి. మీకూ నాకూ యే బెంగా లేకపోతే యింత చర్చ చెయ్యం. బతుకిని బట్టే బెంగ వుంటాది.’మనం మాత్రమే బతికితే అది బతుకెలా అవుతుందని?’ అన్న మాట- జీతంరాని లోటు వున్నా- అది తప్ప మరోటి చెయ్యలేకపోవడం వల్ల- నమ్ముకోవడం వల్ల- తమ వృత్తికి యిచ్చే ప్రాధాన్యత వల్ల- అంతకు మించిన అంకింత భావం వల్ల ఆమాట అన్నారు. మీలాంటి వాళ్ళు దాన్ని కూడా ప్రభుత్వాలు బతకలేవనా అని వెక్కిరిస్తారని తెలియక. ఆదర్శనీయులు.. అని అక్షింతలు వేస్తారని తెలియక.

      మీరు అడిగి అలిసిపోనక్కర్లేదు. నే చెప్పి చెతన తప్పీ పోనక్కర్లేదు. మనమే స్పేస్ ని ఆక్యుపై చెయ్యడం కంటే యితరులకు యిద్దరమూ అవకాశామిద్దాం. చివరగా చెప్పనా? నేను రాసాక యెప్పుడూ చర్చలోకి రాను. అందుకే నిజంగా అభిప్రాయాలతో ఘర్షణ పడాల్సిన వాళ్ళతో పడలేదు. అది శత్రు వైరుధ్యం. ఎవరు రాసేది వాళ్ళు రాస్తారని వదిలేశా. మీది మిత్ర వైరుధ్యం. ఇరువైపులా ఘర్శణ పడుతున్నా మనం కోరుకున్నదేమిటో మనకు తెలుసు. ప్రభుత్వాన్ని పదిసార్లు బట్టలిప్పి వీధిలోకి లాగిన వాణ్ని. అందుకు ఈ సారంగ వేదికే ‘మహారాజశ్రీ’ సాక్ష్యం. నేనేదో ప్రభుత్వాన్ని వెనకేసుకొస్తున్నట్టు చర్చ రంగు మారడం అసంతృప్తిగా వుంది. శత్రువుని కొట్టాలనుకున్నప్పుడు మనకూ కొన్ని దెబ్బలు తగులుతాయి. తగలాలి కూడా. ఇక్కడ ‘మనకూ’ అంటే నాకూ- ఉపాధ్యాయులకూ అని.

  23. దేవరకొండ says:

    సూటిగా విషయాన్ని అందించే వ్యాసాలకూ వ్యంగ్య రచనలకు అభివ్యక్తిలో వ్యత్యాసముంటుందని అందరికీ తెలుసు. ఈ ‘మాస్టారూ…’ రచనకు రచయిత ఇంత ‘సంజాయిషీ’ (?!) ఇచ్చుకోవలసి వస్తుందని అస్సలు ఊహించలేకపోయాను. ఎవరి సెన్స్ ఆఫ్ హ్యూమర్ వారిది కదా, దాన్ని ఎవ్వరూ అంచనా వేయలేరు కదా!

  24. మెయిద శ్రీనివాసరావు says:

    బమ్మిడి జగదీశ్వరరావు గారు ఓ ఉపాధ్యాయుడిగా మీ రచనతో విభేదించాను కాబట్టే మీరు ఏ ఆధారాలతో ఈ వ్యాసం రాసారని అడిగాను. ఓ వామపక్ష భావజాల రచయితగా మీరు ప్రతి విషయాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆచితూచి రాస్తారని మీ రచనలు చదివిన నేను భావించాను కొందరి విజయనగర మిత్రుల మాటల్లో విన్నాను. అందుకే ఈ వ్యాసానికి సంబందించి మీరేమైనా పరిశీలన చేసారేమోనని కుతుహలంతో అడిగాను. మీరన్నట్టు ముందుగా నా వ్రృత్తిని నేను ప్రేమిస్తున్నాను ఆత్మగౌరవంతో మెలుగుతున్నాను అందరూ అలాగే చేస్తున్నారని భావిస్తున్నాను. ఇక ఆత్మవిమర్శ విషయానికొస్తే అవసరమైతే అది అందరూ చేసుకోవాల్సిందే. ఔను మీరు యుద్దమే చేశారు కాకపోతే ఎవరితో అన్నదే ప్రశ్న? విధ్యారంగ మౌళిక సమస్యలను, పాఠశాలల్లో సౌకర్యాల లేమితో విధ్యార్ధులు పడుతున్న అవస్థలను ప్రస్తావిస్తూ దీనికి కారకులైన వారిపై యుద్దం ప్రకటించి దీనిపై ఉపాధ్యాయలను చైతన్యవంతులను చేయడంలో ఉపాధ్యాయ సంఘాల పాత్రను చెప్పి వుంటే బాగుండేదనుకున్నాను. కాని మీరు ఉపాధ్యాయులపై యుద్దం ప్రకటించి ఆత్మవిమర్శ(ఆయుదంతో) పేరిట అతిగా కొట్టారనిపించింది. నేనేమి మీ అనుభవాలను రద్దు చేసుకోమనలేదు ఎవరి అనుభవాలు వారికుంటాయి కాకపోతే కొందరి అనుభవాలను అందరి అనుభవాలుగా సామన్యీకరించడంలోనే సమస్యంతా.

  25. రెడ్డి రామకృష్ణ says:

    డియర్ బజరా!
    నేను ముఖ్యమంత్రినో,లేదా విద్యశాఖామంత్రినో ఉటంకిస్తూ చెప్పినది వాళ్లకు విద్యావ్యవస్థ మీద ప్రేమో లేదా గౌరవమో ఉండి ఏదో చెసేస్తారని కాదు.
    ప్రభుత్వం ఈ విషయంలో ఎంత ఉదాశీనంగావుంటుందో చూడవచ్చని,మాత్రమే
    “నిజానికి ప్రభుత్వాలు ఖచ్చితంగా చర్యలు తీసుకునేటట్టే అయితే అలాంటి ఉపాధ్యాయులు గానీ వుద్యోగులు గానీ ఎప్పుడో దారిలో కొచ్చేవారుగదా.కానీ అలా ఎందుకు చేయరు.ఎందుకంటే అలాంటి వారిని చూపించి మొత్తం ప్రభుత్వ ఉపాద్యాయులు అలానే ఉన్నారన్న భ్రమను ప్రజల్లో కల్పించి ఆరంగాన్ని నిర్వీర్యం చేయ్యదలచుకున్నారుకాబట్టి” అని కూడా రాశాను.
    నా కంత అమాయకత్వమూ లేదు.ప్రభుత్వాలు చేస్తాయనినమ్మకమూ లేదు.కానీ అక్రమ మార్గములో ఉన్నవారిని సక్రమమార్గంలొ పెట్టగలగటం ప్రభుత్వానికే సాధ్యం.అది తలచుకుంటే వెంటనే అరికట్టగలదు.

    “అసలు తమకు కావలసిన విధంగా కావలసిన వ్యక్తుల్ని నియమించుకొని, డిపుటేషన్ మీద తెచ్చుకున్నదే ప్రభుత్వ పార్టీ నాయకులూ పెద్దలు.” కాదన్నదెవరు.వాళ్ల అవసరాలకు వాళ్లు కొందర్ని తెచ్చుకుంటే వీళ్ల అవసరాలకు వీళ్లు మరికొందరు దాన్ని అవకాశంగా ఉపయోగించుకుంటున్నారు.అలా అని నేను వాళ్లను సమర్ధించటంలేదు.ప్రభుత్వాని చిత్తశుద్ధి లేదని చెప్పటానికే.
    ఆత్మ విమర్శ గురించి… ” ఈ విమర్శ లోంచి ఆత్మవిమర్శ కలుగుతుందని ఆశించాను. ఆత్మగౌరవంతో వుండడం మంచిదే, ఆత్మవిమర్శ కూడా అవసరం. ఆ అవసరం మాకు లేదు అంటే మీ యిష్టం.” యిక్కడా స్పష్టతలేదు. ఎవరిని ఆత్మ విమర్స చేసుకోవాలని కోరుకుంటున్నారు.అవకాసాలను అందిపుచ్చుకొని ఆకాశానికి ఎదగాలని చూసే వ్యక్తులు ఆత్మవిమర్శ చేసుకుంటారని ఆశించటం.. ఊహల్లో సాధ్యమేమోగాని,వాస్తవంలో కాదు.
    యిక చర్చలో పాల్గొంటున్న నేనైతే ఆత్మ విమర్శ చేసుకోవడానికి ఎప్పుడూ సిద్ధమే,కానీ యిక్కడ ఆ అవసరం కనపడలేదు.ఎందుకంటే నేను చాలా స్పష్టంగా వున్నాను.

    శీర్షిక మీరు పెట్టింది కాదన్నారు.మీరు పెట్టిన శీర్షిక చూసాక సంపాదకులు మంచిపనే చేశారనిపించింది.ఎందుకంటే మీ శీర్షిక మరీ దారుణంగా వుంది.

    ఒకటి మేష్టారులు ఆకాశంలో నుంచి వూడి పడరు.సమాజంలో నుంచే వస్తారు.సమాజములో వున్న అన్ని అవలక్షనాలు వారిలోనూ వుంటే వుండవచ్చు.ఉండకూడదని ఆశించటం తప్పుకాదు,కానీ అలాలేకపోవటం నేరమూ కాదు.

    మేస్టార్లమీద కామెంట్లు యిప్పుడే కాదు పూర్వమూ ఉన్నాయి.అప్పటివాళ్ళంతా ఆదర్శపురుషులూకాదు.అసలు ఆదర్శము అనేది కేవలం భ్రమ,మార్క్సిస్టులు ఆభ్రమలొ పడకూడదు.
    “మేస్టారు మేస్టారు మెట్టొంకాయ్
    మేష్టారు పెళ్ళాం నీళ్ళొంకాయ్..”ఈనాటిది కాదు.

    యిక సినిమాల్లో కామెంట్లగురించి(యిది చాలాపెద్దచర్చ కనక యిక్కడసాధ్య పడదు)గతంలో మేస్టారు పాత్ర ఒకలా వుండటానికి యివాళ మరొకలా వుండటానికి అనేక కారణాలున్నాయి.సినిమాలెవరు తీస్తున్నారు..ఆయా సినిమాల కాలంలో సమాజ స్థితి గతులు..అప్పటి సమాజంలో చలామనీ అవుతున్న నీతి..ప్రేక్షకుల అభిరుచుల్లో తేడాలు..వానిని ప్రభావితం చేసిన అంశాలు..చాలా వాటిగురించి మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
    “యిందులో అవమానించడం వుందో, ఆవేదన వుందో యెవరికి వారే నిర్ణయించుకోవాలి.”
    ఎలాగూ అదే జరుగుతుంది.కానీ ఒకటి అనేకమంది అనేక సందర్భాలలో అనేక రకాలుగా మాట్లాడు కుంటారు.అందులో బూతులు కూడా ఉంటాయి.అలాగని అలాటివన్నీ వాస్తవం పేరుతో రాసేయలేం కదా…రచయితకు నియంత్రణ ఉండాలని నేనంటున్నాను.
    “మాస్టార్లుగా మనం జ్ఞానంతో మెలగాలని, అందుకే నిత్య విద్యార్థిగా వుండాలని. ఆ అవసరం వుందని. అంతే. అంతకన్నా లేదు అన్నాక కూడా- నాకు లేనివి మీకు మీరు ఊహించేసుకొని- ఆపాదించడం మీ విజ్ఞత.”
    నిన్నటిదాక నాకు తెలుగు భాష వచ్చనే భ్రమలో ఉన్నట్టున్నాను.విన్నది,చదివినది అర్ధం చేసుకోగలననే నమ్మకంఉండేది.మీరు యింత చేప్పేక ఈ విషయంలోతప్పక ఆత్మవిమర్స చేసుకుంటాను.నా విజ్ఞతను నిరూపించుకోవడానికే ప్రయత్నిసాను.

    “ఎంత కాలిక్యులేటేడ్ గా వున్నారో చెప్పడానికి. లెక్క మీద వున్నోళ్ళు తమ లెక్కలు మరింత లెక్కగా చూసుకుంటారని.”
    ఎవరిలెఖ్ఖ వారిది కదనడానికి మనమెవరము.అసలు కేలెక్యులేటెడ్ గా లేనివారెవరు.మనుషులు ఎప్పుడూ కేలెక్యులేటేడ్గానే ఉన్నారు.గతంలో ఆదాయ వర్గాలు తక్కువు సంఖ్యలో ఉణ్డేవారు కనుక అంతగా తెలిసేది కాదు.

    “ఇష్టా యిష్టాలకన్నా లెక్కలలోకి వొదిగి పోతున్నారని.” అని మరొకమాట
    అసలు యిష్టా యిష్టాలను ప్రభావితం చేసేదే లెఖ్ఖ గదా

    నేనన్నది ఒక సంప్రదాయ వాదిగానీ,సనాతాన ధర్మ ప్రచారకుడు గానీ నేటి విధ్య విధానాన్ని గురుంచి లేదా ఉపాధ్యాయులగురించి చెప్పవలసి వస్తే ఎలా చెపుతాడో మీ శిష్య గురువు చెప్పినది అలాగే వుందని.బజరా రాసినట్టుగా (ఒక మార్క్సిష్టు దృక్పధం కలిగిన రచయిత)లేదని అన్నాను తప్ప మీ గురువు గానీ ,శిష్య గురువుగాని సంప్రదాయవాదులని నేననలేదు.

    ప్రధానంగా నేను చెపుతున్నది చెప్ప వలసినది ఒకటే.
    చూసినది చూసినట్టు ఎవరైనా రాస్తారు.మార్క్సిస్టు రచయితలు దానికి గల కారణాలను పరిశీలించి రాస్తారు. ఈ వ్యాసములో మీది సంస్కరణ దృష్టి.సంస్కరణ వాదంలో ఆలోచిస్తున్నారు.అదీ మర్క్సిష్టు దృష్టికాదు.
    మీ వ్యాసంలో ఆవేదనను అర్ధం చేసుకో గలను,కానీ వ్యక్తీకరించే తీరు బాగులేదని చెప్పడానికి వెనుకాడను.
    ‘మీరు అడిగి అలిసిపోనక్కర్లేదు.”
    నేను మీఅంత వేగంగా విషయాలను అర్ధం చేసుకోలేను.కాస్తనెమ్మది.అంచలంచలుగా నే అర్ధం చేసుకోగలను.అందుకే “అన్నీ ఒక్కసారి అడిగేసినా మీరు చెప్పేసినా నేను అర్ధం చేసుకోలేను.” అన్నాను.అది నా అవగాహనా శక్తికున్న పరిమితి.అలాగని ఎప్పటికీ అలిసి పోను.ఆగిపోను.నేను నమ్మినది నిజమని నమ్ముతున్నతవరకు చర్చకు సిద్ధంగానే ఉంటాను

    చివరగా
    బజరా ఏమిటో నాకు తెలుసు.
    బజరా ఎప్పటికీ ప్రభుత్వాన్ని వెనకేసుకు రాడు.కాకపోతే సమస్యను అవగాహన చేసుకోవడంలో పొరపాటు పడి ఎక్కు పెట్టాల్సి దిశలో కాకుండా వ్యతిరేకదిశలో బాణం ఎక్కు పెట్టాడన్నదే బాధ.

    నేను ఎవరో ఏదో రాస్తే పట్టించుకోను.మితృలు,మార్క్సిస్టులు అనుకున్నవారు పొరపాటు చేస్తున్నారని నాకు అనిపించి నప్పుడు అది సరైనది కాదు అని అనుకున్నప్పుడే కలుగు జేసుకుంటాను.అదీ ఆవిషయానికి పరిమితమై మాత్రమే.

    సెలవ్

    • balleda narayanamurthy says:

      ఇదేమి న్యాయం ‘గురు’

      గురువులు.. చాలా విషయాలు చర్చించారు. ఆధారాలు.. సాక్షులను కూడా ప్రవేశ పెట్టమన్నారు . మా వైపు చూస్తే కొరడా దెబ్బలు తప్పవని నిరూపించారు. ఆ మేరకు ప్రయత్నించారు.
      చూడండి .. మాది రాచ పుండు కాదు. మామూలు ఉబ్బెత్తు నిర్మాణం అలా పుండులా అనిపిస్తోంది..అంతే అని మహోపాధ్యాయులు ‘సెలవు’ ఇచ్చారు.
      కత్తి మీద అనుమానం లేదట. కానీ ఇటు తిప్పడం తప్పట…
      బాణం అమోఘమైనేదే అట కానీ వ్యతిరేక దిశలో వచ్చిందట..
      బజారా ఏమిటో తెలుసట కానీ..అతని రాతలు ఇంకోలా అర్థం అవుతున్నాయి అట ..
      ఇంకా మార్క్సిజం పాఠాలు కూడా. ఇంత అసహనం అవసరమా? వ్యవస్థలో వున్నారు.. చూడటం లేదా..? లేదంటే ఎవరూ మాట్లాడొద్దా ? ప్రతికూల అంశాలను చర్చించకపోతే.. అవే అనుకూల అంశాలని భావిస్తూ మరింత ప్రతికూలత లోకి వెళ్లితే ?.. ఎవరికి నష్టం. వ్యవస్థకు తద్వారా సమాజానికి కాదా? యిలా అంటే అది ప్రభుత్వానికి అనుకూలమా..?
      ఇదేమి న్యాయం గురు..

      -బల్లెడ

      • మెయిద శ్రీనివాసరావు says:

        ఇది అన్యాయం ‘సారూ’

        ‘నూరు పువ్వులు వికసించనీ…వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అనే వాక్యానికి బద్దుడై వుండే మిత్రుడితో వ్యాసంలోని అంశాల గూర్చిన నిజానిజాల గూర్చి మేము ముచ్చటించుకుంటుంటే ఇదేదో తగువులాగ చిత్రీకరిస్తారేటి సారూ మీరు. ‘కందకు లేని దురద కత్తిపీటకు ఎందుకు’ అనే సామెత ఇలాగే వుంటాది కాబోలు. ఏటి సారూ మావి కొరడాలా! మరి మీవి కత్తులు..బాణాలా! ఎవరికి దెబ్బలు ఎక్కువ తగిలాయంటారు? ఏటి సారు రాచపుండా? ఏ పుండైతేనేటి మీరు మాత్రం మస్తుగా కారం జల్లేస్తున్నారు. “ఇంత అసహనం అవసరమా? వ్యవస్థలో వున్నారు.. చూడటం లేదా..? లేదంటే ఎవరూ మాట్లాడొద్దా ? ప్రతికూల అంశాలను చర్చించకపోతే.. అవే అనుకూల అంశాలని భావిస్తూ మరింత ప్రతికూలత లోకి వెళ్లితే ?.. ఎవరికి నష్టం” మేమూ అదే అడుగుతున్నాం సారూ…
        ఇది అన్యాయం సారు…
        -మొయిద

  26. కె.కె. రామయ్య says:

    శ్రీ రెడ్డి రామకృష్ణ, శ్రీ మెయిద శ్రీనివాసరావు గార్లకు ఓ విన్నపం.

    వాస్తవ పరిస్థితులకి, విమర్శలకి అతీతంగా సమాజంలో ఇప్పటికీ గురువుకి, ఉపాధ్యాయుడికి గౌరవ స్థానమే ఉంది.
    కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయ సంఘాలు సంఘటిత పోరాటాలు చేస్తే లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాల్లో క్రమేణా మార్పు తీసుకు రావచ్చేమో ఆలోచించగలరు.

    గురువు అంటే అజ్ఞాన తిమిరాన్ని దూరం చేసే జ్ఞానజ్యోతి అని నానుడి. శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు గారు తమ పదునైన రచనలతో మా లాంటి పాఠకుల గుండెల్లో గురు తరమైన స్థానంలో నిలుచున్నారు. అందుకు వారి పట్ల సదా కృతజ్ఞతా భావన కలిగి ఉంటాము. మనమందరమూ ఇలాంటి నిబద్దత కలిగిన బాణీని ప్రోత్సహించవద్దూ.

    • రెడ్డి రామకృష్ణ says:

      శ్రీ కె.కె రామయ్య గారికి,
      నమస్కారం.
      నేను “సెలవ్” చెప్పి వెళ్లిపోయాను.అయినప్పటికి నిన్నబల్లెడ నారాయణ మూర్తి గారు అత్యవసరంగా నా సెలవు రద్దుచేసుకోని రంగమ్మీదికి రమ్మని కేకవేశారు.కాలు దువ్వేరు కత్తి తిప్పేరు..మహోపాధ్యాయులని వెటకరించేరు.అయినా నేను వెనక్కి రాలేదు. ఎందుకంటే బల్లెడ వారి మాటలని జల్లెడ పడితే ఒక్కటి మిగలదని.

      ఈ రోజు మీరు మాకు ‘విజ్ఞప్తి’ అన్నారు. మీరు పెద్దవారు.మీ మాట తీసేయలేక వెనక్కి తిరిగి వచ్చాను.మీరు మాకు విజ్ఞప్తి చేయడం ఆశ్చర్యంగా వుంది.
      “వాస్తవ పరిస్థితులకి, విమర్శలకి అతీతంగా సమాజంలో ఇప్పటికీ గురువుకి, ఉపాధ్యాయుడికి గౌరవ స్థానమే ఉంది.” అని మీరన్న మాటతో నేను విభేదించటంలేదు సరికదా నేను అదే చెపుతున్నాను.అలాంటి గురువులను వీధిలోకి లాగొద్దు.అంటున్నాను.ఏవరో కొద్ది మంది బాధ్యతా రాహిత్యాన్ని చూపించి మొత్తం ఆవ్యవస్థకే మచ్చ పడే వ్యాసాలు రాయకూదదంటున్నాను.

      జగదీశ్వరరావు గారు చెప్పినట్టి గైరు హాజరు ఉపాధ్యాయులు రాష్ట్రం మొత్తం ఉపాధ్యాయుల్లో మొత్తమ్మీద చూసుకుంటే ఒకటి రెండు శాతము మాత్రమే ఉంటారని నా అంచనా . ఆ ఒకటి రెండు శాతాన్ని పట్టుకొని మొత్తం ఉపాధ్యాయులే అలా ఉన్నారంటే ఎలాగ చెప్పండి!? స్కూలు తరువాత వాల్ల ప్రైవేటు జీవితాన్ని గురించి మనకెందుకు చెప్పండి.వాళ్ళు ఏ వ్యాపారాలు చేసుకుంటే మనకేల ,ఏవర్ని పెళ్లాడితే మనకేమి.అనవసర విషయాల ప్రస్థావనల వలన కూడా వారి విలువని తగ్గిస్తున్నాం.
      ఇది చాలా నష్ట దాయకం. ఇలాంటి వ్యాసాలు మరి నలుగురు ఎవరైనా రాసారనుకోండి చూసారా ప్రభుత్వ ఉపాధ్యాయులు ఎవరూ పనిచేయరు.రచయితలే చెప్తున్నారు చూసారా ..వాళ్ళకి జీతాలు దండగ. అని మరింతగా ప్రభుత్వము దాని యంత్రాంగము విపరీత ప్రచారం చేసి,ప్రభుత్వ పాఠశాలలను మూసేస్తున్నాం అని గనక ప్రకటీస్తే ఎవరికి నష్టం.పేద,దళిత,దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకు దూరమౌతారు గదా.
      అలా అది పరోక్షంగా ప్రభుత్వానికి సహకరించే పని అవుతుందనే నా వాదన.
      “కాబట్టి ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయ సంఘాలు సంఘటిత పోరాటాలు చేస్తే లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాల్లో క్రమేణా మార్పు తీసుకు రావచ్చేమో ఆలోచించగలరు.”

      ప్రభుత్వ విద్యా సంస్థల ఉపాధ్యాయ సంఘాలు సంఘటిత పోరాటాలు చేస్తే, అలాంటి పోరాటాలకు రచయితలుగా మనం దోహదపదే రచనలు చేయాలి.మనమే ముందు ఉపాధ్యాయు వ్యవస్థ చెడిపోయిందని అంటే రేపు మనకెక్కడినుంచి బలం వస్తుంది?
      ప్రజా రచయితలు మేధావులు లోపభూయిష్టమైన ప్రభుత్వ విధానాలను,ఉద్దేశపూర్వకంగా వారు చేస్తున్న కుట్రలను బయట పెట్టాల్సిదే.

      సంస్కరణలలో భాగంగా భూమి యిప్పటికే సరుకైపోయింది.శరీరం కూడా సరుకై అవయవానికో రేటు పలుకుతోంది.ప్రభుత్వాలు విద్యనూ సరుకుగా మార్చేయ చూస్తున్నాయి. యిలా ఒక్కొక్కటి సరుకుగా మార్చి ప్రభుత్వాలు బాధ్యతలనుంచి తప్పుకొంటే అపుడు సమాజంలో.
      మనుషులుండరు.అమ్మకం దారులు కొనుగోలు దారులే మిగులుతారు. ఇది మిక్కిలి అవాంచనీయమైనది కాదంటారా.

      మనరచయితల్లో చాలామంది చూసింది చూసినట్టుగా రాస్తున్నారు.అదే యదార్ధమని అనుకోవడంలోనే వుంది అసలు సమస్య.
      కంటితో చూస్తున్నం అంటారు.’మీకు కనపడడం లేదా’ అంటారు.
      గారడీవాడి విద్యలన్నీ మనం కంటితోనే చూస్తాం.అలాగని అది నిజం అనుకోగలమా!?సామాన్యులు ఒకవేళ ఆభ్రమల్లో పడితే పడొచ్చు.రచయితలు కూడా ఆభ్రమల్లో పడితే ఎలా చెప్పండి.

      “శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు గారు తమ పదునైన రచనలతో మా లాంటి పాఠకుల గుండెల్లో గురు తరమైన స్థానంలో నిలుచున్నారు. అందుకు వారి పట్ల సదా కృతజ్ఞతా భావన కలిగి ఉంటాము”.అన్నారు. చాలా సంతోషం.
      యిక్కడ మీకో విషయం చెప్పాలి
      శ్రీ బమ్మిడి జగదీశ్వర రావు గారు నేను చాలా సన్నిహిత మితృలం,మాది చిరకాల స్నేహం.(పాతికేల్ల పై బడి) అతనికి నేనంటే చాలా అభిమానం ,అలాగే అతను నా కంటే వయసులో చిన్నవాడే అయినా అతనంటే నాకు గౌరవం. విస్తృతంగా రాస్తాడు ,విస్తృతంగా చదువుతాడని. అలాంటి నామితృడిని మీరు అభిమానించటం గౌరవించటం నాకు మిక్కిలి ఆనంద దాయకమే.
      అలాగని అవగాహనలో పొరపాటుందని భావించినపుడు సూచించటం చర్చించటం మానేయలేం గదా సార్.అది అందరికి సంబంధించిన విషయమౌతుంది.చదువరులకు తప్పు సందేశం చేరకూడదుకదా అన్న ఆలోచనే నా చర్చకు మూలకారణం.
      చివరగా మీరన్న మాట”మనమందరమూ ఇలాంటి నిబద్దత కలిగిన బాణీని ప్రోత్సహించవద్దూ…”
      మార్క్సిస్ట్ దృక్పధంతో ఉన్న లేదా దానికి దోహదపడిన ఏ వాణినైనా బాణీ నైనా తప్పక ప్రోత్సహించాలి.నేనూ ప్రోత్సహిస్తాను.ఆ నిబద్ధతను గౌరవిస్తాను.దానికి వ్యతిరేకమైన బాణీలను వ్యతిరేకించక తప్పదు. వారు ఎంతటి నిబద్ధులైనా.( ఒకో సారి పొరపాటు పడోచ్చు)ఎందుకంటే అది సమాజానికి హాని చేస్తుందని నమ్ముతాను గనక.
      ధన్యవాదాలు.

  27. shanthamani says:

    బజారాకు ,బమ్మిడికీ …ఇంకా యావత్టు ఉత్తరాంధ్రా రచయితలకు (కేవలం సీరియస్ గా ప్రజల పక్షాన రాసే రచయితలకే ) ఇందుమూలంగా తెలియజేయునది ఏమనగా …ఇక ముందు మీరు ఏ రచన చేసినా దానిని పత్రికకు పంపించే ముందు…విధిగా ఆ రచనను …రెడ్డి రామకృష్ణకు,లక్ష్మణరావుకు,మొయిద శ్రీనివాసరావుకు,విద్యాసాగర్,చిత్ర,ఇంకా శంబూకుడు,తమ్మినాయుడు మొదలైన వారికి పంపించి ,వారి సూచనలతో మీ రచనలను సరిదిద్ది పత్రికలకు పంపండి. లేనిచో మీ అగ్యాన రాతల వలన ఎంతెంత నష్టం (ఎవరికి అని అడగకండి) జరుగుతుందో,మార్క్సు,లేనినూ వగైరాలు చెప్పిన దానికి ఎంత విరుద్ధంగా మీరు రాస్తున్నారో …పాఠకులకు వివరించాల్సి వఛ్చి ఎంత శ్రమ పడాల్సి వస్తోందో సదరు సాహిత్య రక్షకులకు ఇప్పటికైనా మీకు బోధ పడి ఉండాలి.పాపం ఈ రక్షకులు అంతక ముందు బాలసుధాకర్ మౌళికీ,గౌరునాయుడుకి,ఇంకా మరికొందరు రచనల మీద విశ్లేషించి పాఠకులను సరైన దారిలో పెట్టడం మీరు చూడలేదా?ఎపుడూ ఈ రక్షకులకు ఉత్తరాంధ్రా సీరియస్ రచయితల వలన శ్రమ తప్పటం లేదు.పేజీలకు పేజీలు రాయాల్సి వస్తోంది.(మీరేమో వాళ్లకు సాహిత్యం అర్ధం చేసుకొనే పద్దతి తెలీదంటారు,సాహిత్యం రాయడం రాదంటారు.రాయని భాస్కరులను గౌరవించారు మీరు )దయచేసి మీరు రాయకపోయినా పరవాలేదు .లోకానికి నష్టం లేదు,గానీ ఈ రక్షకులను మాత్రం ఇబ్బంది పెట్టకండి. ప్రజలను తప్పుదారీ,ప్రభుత్వ భజనా చేసే రచయితలు ఏదైనా రాసుకోవచ్చు .అలా సాహిత్యం నిండా పలాయనవాద,ప్రభుత్వ వాద కధలు,కవితలు రాసినా వాళ్ళవలన కించిత్తు కష్టం కలగదు ఈ రక్షకులకు….మీ నుంచే కష్టమల్లా..! నా మాట వింటారు కదా….

    • రెడ్డి రామకృష్ణ says:

      shanthamani గారూ!
      బజరా,బమ్మిడి..ఒకరేనండి.మీరు పొరపాటు పడినట్టున్నారు( బహుశా బజరా,బల్లెడ అనబోయి)
      చూసారా!..మీరు మమ్మల్ని ఏంతో గౌరవించి, మాగురించి మిగతా రచయితలకు చెపుతుంటే అదీ ముందు నాపేరే పెట్టి చెపుతుంటే ఉబ్బి తబ్బిబ్బవ్వకుండా మీలోన కూడా పొరపాట్లను వెతుకుతున్నాను. అంతేనండి.నా బుద్ధి ఎప్పుడూ అంతే. ఎవరిలో పొరపాట్లు కనపడినా టకీమని చెప్పేస్తుంటాను నోటి దురదండి.ఏం చేస్తాం చెప్పండి.
      మీరు మా శ్రమను గురించి ఎంత ఆలోచిస్తున్నారు.ఎంత బాధపడుతున్నారు. మిగతా రచయితలు లోకంలో ఎంతోమందివుండగా “కేవలం సీరియస్ గా ప్రజల పక్షాన రాసే రచయితల” లోని.. తప్పులో పొరపాట్లో…అయినా వెతికేను.యిప్పుడు మీలోని పొరపాట్లను వెతికేను.నిజంగా నేను పాపినండి.యిలాంటి పాపాలు చేస్తున్నందుకు నాకు రౌరవాది నరకాలు తప్పవనుకుంటానండి.పోనివ్వండి.పాపం మీరేం చేస్తారు. మా మంచికోరగలరు తప్ప మా నశీబు తప్పించలేరుగదా! రాతండీ రాత..అదితప్పదు.
      అయినా శాంతామణి గారూ!.. సీరియస్ రచయితలంటే మాటలటండీ,వాళ్ళంతా రాత్రి పొగలూ నిద్దర్లు మానేసి అహోరాత్రాలు దేశం బాగు పడాలని,ప్రజల కష్టాలు పోవాలని అంతగా రాస్తూ కష్ట పడుతుంటే వాళ్లకోసం మేము ఆపాటి కష్టపడ్డం తప్పులేదనిపిస్తాదండి.

      “మీరేమో వాళ్లకు సాహిత్యం అర్ధం చేసుకొనే పద్దతి తెలీదంటారు,సాహిత్యం రాయడం రాదంటారు.”
      హమ్మ!… అంతమాటనీసేరండి.మాకు రాయడం రాదంటారా..నేను రాస్తానండి.వాళ్లకు తెలియక అలాగనీసేరేమో గానీ మా బట్టల పద్దులన్నీ నేనే రాస్తానండి,పచారు సామాన్ల పద్దులు రాస్తానండి..గోడలకు సున్నాలు,కిటికీ గజాలకు రంగులు అన్నీ నేనే రాస్తానండి మాయింటిలో….పోనివ్వండి.అనుకుంటే అనుకోనివ్వండి. ఎవరో ఎదో అనుకుంటారని నాకు బాధలేదండి.
      “రాయని భాస్కరులను గౌరవించారు మీరు”
      అలా బుద్ధి చెప్పండి వారికి. మమ్మల్ని యావన్మందినీ (మీరు ప్రకటించిన లిస్టులో వున్నవారందరూ)గౌరవించొద్దని చెప్పండి. మరీ ముఖ్యంగా నన్ను…అద్వైతం గాన్ని,అనవసరంగా గౌరవించి తప్పు చేయ్యొద్దని గట్టిగా చెప్పండి.అంతేగానీ

      “మీరు రాయకపోయినా పరవాలేదు.లోకానికి నష్టం లేదు”అని మాత్రం వాళ్ళకు చెప్పకండి.తప్పో తడకో రాసీ..రాసీ..రాశి పడెయ్యాలి గానీ..వద్దంటారా,తప్పు తప్పు ఆపొరపాటు పని మాత్రం చెయ్యమని చెప్పకండి.అమ్మమ్మా..మీ పుణ్యముంటాది.

      “ఈ రక్షకులకు….మీ నుంచే కష్టమల్లా..” అని జాలి పడకండమ్మా!…
      మేమందరం..అందరిమాటకేం గానీ నేను మాత్రం ఎంతటి కష్టమైనాపడతాను వారికోసం.
      సదా మీ సేవలో ….
      మీ అభిమానపాతృడు
      రెడ్డి రామకృష్ణ

      • shanthamani says:

        రామక్రిష్గ్ణగారూ…
        సీరియస్ రచయితలంటే మీకెంత చులకన భావమో,దాచుకుందామన్నా దాగకుండా బయటపెట్టేసుకున్నారు…రాత్రీ,పొగులూ నిద్దర్లు మానేసి…అంటూ యెద్దేవా చేసారు. ఒక ప్రక్క బమ్మిడి అంటే గౌరవం అంటారు,అతని రచనలు ఇష్టమంటారు,ఇంకోప్రక్క రాత్రీ,పొగులూ నిద్దర్లు మానేసుకొని…అనే పదాలు వాడతారు. నా ఉద్దేశం లో సీరియస్ రచయితలు అంటే…సమాజమూ,ప్రజలూ,సామాజిక చలనాన్ని ఒక ద్రుష్టికోణం తో ఆలోచించి రాసే రచయితలని. పొగులూ,రాత్రీ నిద్దర్లు మానేసినోల్లు అని కాదు. అసలు అలా యెందుకన్నానంటే, సమాజం,ప్రజలు,సామాజిక స్ప్రుహ…వంటి పదాల్ని అసహ్యించుకొని,అడ్డదిడ్డమయిన రాతలూ రాసే వారినీ, కధకు వస్తు బరువు యెక్కువయిపోయిందని వ్యాసాలు రాసే వారినీ,సాహిత్యం సాహిత్యం కోసమే అనే వారిని యేమీ అనకుండా, ద్రుష్టికోణం ఉన్నవారి మీదనే మీ బ్రుందమ్ దాడి చేస్తోమ్ది. దాడి కాదు,సరిదిద్దుతున్నామంటారు. ఆ సరిదిద్దే కర్తవ్యం పైన చెప్పిన వారిమీద్ యెందుకని చేయరో మీరు. మీ కంటికి…ఒక గౌరునాయుడు,ఒక బాలసుధాకర్ మౌళీ,ఒక బజరా…ఇలా వీరే సీరియస్ రచయితలే యెందుకు కనిపిస్తారు? తప్పో,తడకో రాసీ,రాసీ వీళ్ళు(మీ మాటలే ఇవి) పడేస్తున్నారా?సాహిత్యం ఇతర ప్రాంతాల వాళ్ళూ రాస్తున్నారు,వాళ్ళల్లోనా మీ ద్రుష్టిలో తప్పులు లాంటి తప్పులు రాసేవాళ్ళూ ఉన్నారు,అయినా మీరు వాళ్ళని యేమనరు, ఒక్క ఉత్తరాంధ్రా (సీరియస్)రచయితలనే యేదో ఒకటంటారు. అదంతా…సాహిత్య రక్షణంటారు. ఈ పోలీస్ ఉద్యోగం చాలించండి. యెంతటి కష్టమయినా పడతానంటారు(మీ మాటే).యెందుకండీ,వీళ్ళను దిద్దడానికే? మీకు అంత కష్టమక్కరలేదు,లోకం చూసుకుంటుంది,ఆ కష్టమేదో…లోకానికి పనికి వచ్చే పని మీద పెట్టండి.

    • లక్ష్మణరావు says:

      శాంతామణి గారికి నమస్సులు.
      మీ పేరుకి, మీ మాటలకి పొంతన కుదరడం లేదు. మీరొక మహిళ అని నేను అనుకోవడం లేదు. ఎందుకంటే..పిల్లలు ఏమి చెప్పినా ‘అమ్మ’ వింటుంది. తొలుత మురిసిపోయినట్లు అనిపించినా,ఒక్కో సారి చిరాకుపడినా…తర్వాతర్వాత నెమ్మదిగా తన తప్పునూ గుర్తిస్తుంది. పిల్లల మారాన్ని అర్ధం చేసుకుంటుంది. బయటకి వ్యక్తం కాకపోయినా పరస్పరం సరిదిద్దుకునే ప్రయత్నమూ సాగుతుంది. అదే…’మగ అహంకారం’ కలిగిన వ్యక్తికి తాను చెప్పిందే వినాలని, తాను రాసిందే అంతిమమని, దానిని అంగీకరించి తీరాలని శాసిస్తాడు. ఇదేదో నా జ్ఈానమనుకున్నారు. కాదుకాదు..సాహిత్య సభల్లో తమ లాంటి వాళ్లు చెప్పగా విన్నవి. ఇది నిజమే కావచ్చునని నేను అనుకుంటున్నాను. ఈ విషయాన్ని గుర్తుచేసుకోవడం వెనుక మీ రాతల్లో వినిపిస్తున్న ధ్వనే కారణం.
      ‘బమ్మిడిగారు, బజరా’ గారు అని మీరు వేర్వేరుగా సంభోధించిన దానిబట్టి మీరు మా ప్రాంతం వారు కాదని అర్ధమవుతుంది. అలానే మీరు పేర్చిన పేర్ల వరసక్రమం కూడా మా ప్రాంతంతో కనీస పరిచయం కూడా లేదని స్పష్టమవుతుంది. మీరు చెప్పారు కాబట్టి …ఆ వరసలో కొన్ని మార్పులు చేయాలని మనవి చేస్తున్నాను.అట్టాడ అప్పలనాయుడు, విద్యాసాగర్, చిత్ర,బజరా, గంటేడ గౌరినాయుడు, వర్మ, వేణు, రెడ్డి రామక్రిష్ణలు …వారి సూచనలు, సలహాలతో నడిచే వ్యక్తుల వరసలో మొయిద శ్రీనివాసరావు, నేను వస్తానని తమరకి తెలియజేస్తున్నాను. ఆ వరస క్రమాన్ని మార్చుకోగలరు.
      ఇక్కడ అప్రస్తతమైనా చెప్పకతప్పదు. బజరా గారు నన్ను మిత్రమా అని సంభోధించినా, నాకు సాహిత్య పరిచయం చేసిన వ్యక్తల్లో ఆయనొకరు. విజయనగరం తోటపాలెంలో ఆయన నివాసం ఉన్నప్పుడు ఆయన ఇంటి వద్ద జరిగే సాహిత్య చర్చలను వినే అవకాశం కల్పించిన వ్యక్తి ఆయన. ఆనాడు మాకు చెప్పింది’ ప్రశ్న లేకుండా వెతుకులాట ఉండదని, వెతుకులాట లేకుండా వికాసం ఉండదని’. ఆ వికాసక్రమంలో మా మధ్య జరిగే చర్చే తప్పా ఇదేదో వర్గ పోరాటమని మీరు జోక్యం చేసుకుంటే అది మీ భ్రమే అవుతుంది.(ఇప్పటికే బజరాగారు ఇదే చర్చలో మాది మిత్ర వైరుధ్యమని రామక్రిష్ణ గారిని ఉద్దేశించి చెప్పారు). అది గుర్తించాలని మనవి చేస్తున్నాను.
      హద్దులు లేని ప్రపంచాన్ని, ఒక మనిషి మరో మనిషి దోచుకునే వీలు లేని సమాజాన్ని స్వప్నించే వాళ్లల్లో మా బజరా కూడా ఒకరు. ప్రాంతీయ తత్వాలకు గురికాకుండా విశాల ప్రాతిపదికన శ్రామిక జన గీతం పల్లవించాలని కాంక్షించే వాళ్లల్లో ఒకరు బజరా. అటువంటి వ్యక్తి మీద ఉత్తరాంధ్రా పేరిట ప్రాంతీయ ముసుగు కప్పి బిగపెట్టాలని, సంకుచిత కూపంలోకి మమల్ని నెట్టేయాలని చేస్తున్న మీ ప్రయత్నానికి చింతిస్తున్నాను. ఇక ఈ వ్యాస విషయంలో మా గంటేడ గౌరినాయుడు బావు మా మధ్య జరిగిన చర్చల్లో తన వ్యతిరేకతను వ్యక్తం చేసిన విషయన్ని మీకు వివరించాలని అనుకుంటున్నాను. ఈ శీర్షికను ఆయన తప్పుపట్టారు. ‘మాష్టారు ఇప్పుడేమి చేద్దాం’ అన్న సూచనప్రాయంగా, కొత్తగా ఆలోచన చేసే విధంగా ఉంటే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ఎవరో కొద్ది మంది చేసే తప్పులను అందరికీ వర్తింపచేయడం సరికాదని అన్నారు. వ్యవస్థ ఎలా ఉపాధ్యాయులను మార్చింది. కొద్ది మందిని ఉద్యోగేతర వ్యవహారాలకు అవకాశం కల్పించే పేరిట వారిని ఎలా ప్రభుత్వం ట్రాప్ చేసింది. పర్యవసానంగా ప్రజల్లో ఉపాధ్యాయులు మీద ఎలాంటి ముద్ర వేస్తోంది. భవిష్యత్ ప్రభుత్వ పాఠశాలలు గురించి విశ్లేషించి రాసి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు. అంటే మా మధ్య తండ్రీ బిడ్డల సంబంధం తప్పా శత్రు వైరుధ్యం కాదని మీకు గుర్తు చేయడానికి ఈ విషయాన్ని ఉటంకిస్తున్నానని మనవి చేస్తున్నాను.
      మా వాళ్లు ప్రజల పక్షాన రాసే రచయతలు కాదని కూడా మీ దృష్టికి తీసుకుని వస్తున్నాను. రెండు రెక్కలు తప్పా మరేమి లేని మనుషుల కోసం, రెక్కాడితే తప్పా డొక్కాడనటువంటి వాళ్ల కోసం, చారెడు నేలలో బండ చాకిరీ చేసి ఆత్మహత్యలు చేసుకుంటున్న చిన్నకారు రైతుల కోసమని నేను అనుకుంటున్నాను. ఈ రచనా క్రమంలో లోటుపాట్లు, తప్పుడు సూత్రీకరణలు చోటుచేసుకుంటే చోటుచేసుకోవచ్చు. అవి మా ఆలోచనల్లో తప్పు కావచ్చూ..ఒక్కోసారి సరైంది కావచ్చు. రచన మీద చర్చించే, పరస్పరం అబిప్రాయాలు పంచుకునే, ఒకరిని మరొకరు సరిదిద్దుకునే సుహృద్బావ వాతావరణం మా ప్రాంతానికి ఉంది. మా లాంటి చిన్న వాళ్లకి కూడా మాట్లాడే అవకాశం కల్పించే రచయతలు(ఇదే చర్చలో ‘బజరా సాహిత్య సృజన ముందు పిపీలకం లాంటి నాకు ఆయన ధన్యవాదాలు చెప్పారు. చూడగలరు) మా ప్రాంతంలో ఉండడం పట్ల గర్వపడుతున్నాను. ఈ విషయాలేవీ తమకి తెలియక మా మధ్య గోడలు కట్టే ప్రయత్నం చేస్తే ఏ రచయతకైతే మీరు సూచించారో ఆ బజరాయే అంగీకరించరని మరోసారి గుర్తుచేస్తున్నాను.

      • shanthamani says:

        లక్ష్మణరావుగారూ…
        రాతలు బట్టి లింగ నిర్ధారణ చేయగలిగే మీ గ్యానానికి నా అభినందనలు. తల్లి యెలా ఉండాలో,ఉంటుందో లోకం ఇప్పటిదాకా చెప్పి,చెప్పి మీలా అభినందించి తల్లిని యీ స్తాయిలో ఉంచారో మరొక్కసారి మీ వాక్యాలు గుర్తు చేసాయి,
        ఒక వాక్యమ్ లో గ్యానిని కాదంటారు,మాలాంటి వాల్ళు చెప్పినవి విని తెలుసుకున్నానంటారు,బజరాను దిద్దుతున్నానంటారు మరో వాక్యం లో. ఇంకా…యెవరెవరినో సాక్ష్యాలు(గౌరునాయుడెమన్నాడో) తెస్తారు. బజరా విశ్వమానవ రచయతంటారు,ఉత్తరాంధ్రకు కట్టేయకండంటారు(బజరా మెప్పు కోసం),మీరే మొత్తం,,,బజరా యెంత తప్పు రాసారో చూసారా…అని చూపిస్తారు,మళ్ళీ యేమన్నా అంటే,,,,మామధ్య గోడలు కట్టేకండంటారు. మీరు ఇపుడే కాదు,ఇంతకు ముందూ ఇలానే పోస్టుకో వ్యాఖ్య పెట్టడం (పల్లెను మింగిన పుస్తకం పై చర్చలో రమాసుందరి,మరికొందరి చర్చ),గౌరునాయుడు ఇంటర్వ్య్య్(బాల సుధాకర్) చర్చల్లో ఇలానే చర్చ కాదు,వాదించేరు. వాదన వేరూ,చర్చ వేరూ…
        నేను వాదించదలచుకోలేదు..
        శెలవు
        శాంతామణి

  28. balleda narayanamurthy says:

    పెంకి ‘గురువుల’ పసలేని ముచ్చట్లు

    ప్రభుత్వ గురువుల గురించి బజారా సత్యములు అనేకములు అన్నందుకు.. ఈ విషయంలో నిద్ర నటిస్తున్న లోక ‘జ్ఞాన’ గురువులు మా వైపే చూస్తారా అంటూ … ‘ఒకటే సత్యం.. అది కూడా మేము చెప్పేదే సత్యం’ అనే వాదనకు దిగారు. ఇక ఆయనమీద ‘గ్రూప్’ కట్టి దాడి చేస్తే ఇదేమి న్యాయం గురు అన్నందుకు ‘కందకు లేని దురద కత్తి పీటకు ఎందుకు’ అని తాటాకు చప్పుళ్ళు చేస్తున్నారు. ‘వేల పూలు’ చెవిలో పెడుతూ ‘ఇదంతా తగువులా చిత్రీకరిస్తారా’ మేము యిలాగే ‘ముచ్చట్లు’ ఆడుకుంటాం అంటూ సత్యాలని అంగీకరించే ప్రసక్తి లేదంటున్నారు.
    మరో గురు జ్ఞాని నా అక్షరాలను పిసికి, ముద్దచేసి, నలిపి, అందులో నీళ్లు కలిపి…చాలా చేసి చేసి..లాభం లేదని చివరకు ‘జల్లెడ’.. పట్టి ఛీ… ఇదొట్టి మట్టి, ఇందులో రంగు, రుచి, వాసన ఏమీ లేదని తీర్పు ఇచ్చారు. అలాంటి మట్టిపై ఇంతకూ ముందటి జ్ఞాని ‘మేము అదే అడుగుతున్నాం సారూ’ అనీ , అలాగే ఈ గురు జ్ఞాని కూడా ఎందుకు స్పందించారో అడగొద్దు. ఎందుకంటె ఈ విషయంలో గురు జ్ఞానుల దృష్టి లోపం అలాంటిది. కనిపించినా అది వాళ్లకు గారడీ విద్య తో సమానం. ఏ ప్రభుత్వ పాఠశాల చూసినా ఏమున్నది గర్వకారణం అనే పరిస్థిలో.. దాచేస్తే దాగదు సత్యం గురూ. ఈ జ్ఞాన గురువుల మాదిరిగా తమ వ్యవస్థల్లో లోపాలు లేవనుకుంటే రావి శాస్త్రి రచనలు, పతంజలి పెంపుడు జంతువులు వంటి సాహిత్యం వచ్చి ఉండేది కాదు.
    యావన్మందికి గమనిక…
    ఇక మా ఉత్తరాంధ్ర ‘గురువులు’ అంటే మాకు సదా గౌరవం, అభిమానం వుంది. ఉంటుంది. ఎవరో ఎలాంటి సర్టిఫికెట్స్ ఇవ్వక్కలేదు. మాకు సాహిత్య వారసత్వం వుంది. ప్రతీకలు వున్నాయి. దేశంలో ఏ ప్రాంతానికి లేని సాహిత్య పటిమ వుంది. ఇప్పడు కొత్తగా ఎవరూ ఏమీ చెప్పక్కరలేదు, అనని మాటలను ఆపాదించక్కర లేదు.ఇదే అదనుగా -ముఖ్యంగా అపార్ధాలు సృస్టించక్కర లేదు. మాకు అన్ని రకాలా స్వేచ్ఛ తోపాటు అనుకునే స్వేచ్ఛ, అవి మాటలైనా, రాతలైన, వాతలైన.. ఇచ్చి పుచ్చుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది అని గమనించాలి.

    -బల్లెడ

    • రెడ్డి రామకృష్ణ says:

      నాయనా… నారాయణ మూర్తీ!

      దేవుడు మిక్కిలి దయామయుడు,
      ఆయన ఎల్లప్పుడూ మీపై కృపను కలిగి ఉండును గాక
      మీ జ్ఞానమును,మా అజ్ఞానమును ఇలాగే వర్ధిల్లును గాక

      సత్యో రక్షతి రక్షితః
      సత్యమును మీరు రక్షింపుడు,ఆ సత్యము మిమ్ములను రక్షించును

      సత్యమేవ జయతే
      జై ఉత్తరాంధ్ర

    • మెయిద శ్రీనివాసరావు says:

      తికమక పెట్టే..’సారు’

      సార్ మీరు రంగప్రవేశం చేయనంతవరకు చర్చ సాఫీగానే సాగింది. మీరడుగెట్టి దానిని చెడగొట్టే’సారు’. మా చర్చలో పసలేకపోయినా(మీ ద్రృష్ఠిలో) నసలేదని భావిస్తున్నాం. మీలాంటి వారి నుండి ఏదో కొత్త విషయం తెలుసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పటికీ నాదొక సందేహం సారు. ఇంతకీ మీరు బ.జ.రా గారికి మీ వ్యంగ్యంతో సహకరించాలని చూస్తున్నరా లేదా ఆయనను మరింత ఇరకాటంలో పెట్టే ప్రయత్నం చేస్తున్నారో మాకైతే అర్ధం కావట్లేదు. బ.జ.రా గారు తన కామెంట్లలలో తను ప్రభుత్వాన్నే ప్రధాన దోషిగా వుంచుతూ దానికి సహకరిస్తున్న ఉపాధ్యాయులను గూర్చి రాసానని (వాస్తవానికి వ్యాసం అలా లేదని మా అభిప్రాయం) ఆయన వివరణ ఇచ్చుకుంటే మీరేమో ప్రభుత్వ ఉపాధ్యాయులదే మొత్తం తప్పని మరలా మొదటికొచ్చారు. ఇది ముమ్మాటికి ఉపాధ్యాయ వర్గానికి బ.జ.రా ని దూరం చేసే ప్రయత్నమేనని మేము భావిస్తున్నాం. మరో విషయం రెడ్డి రామక్రిష్ణ గారికి ఇచ్చిన బదులలో ఆయనే చెప్పారు మాది మిత్రపూరిత వైరుధ్యమని కాని మీరేమో మేము గ్రూపు కట్టి దాడి చేస్తున్నాం అంటున్నారు. దయచేసి వ్యాసాన్ని వివరణలను ఈసారి కాసింత జాగ్రత్తగా జల్లెడ పట్టగలరు.

      సీరియస్ గా జరుగుతున్న చర్చలోకి ‘ఇదేమి న్యాయం గురూ’ (గురూ కి పైన రెండు కొమ్ములు కూడా తగిలించారులెండి)అంటూ వ్యంగ్యాస్త్రాన్ని ప్రయోగించింది మీరు. మేము చేస్తున్నది చర్చే అనడానికి venukrishna murthy గారి కామెంటును మరోసారి చదవగలరు (వీలుంటే a.k.prabhakar, anilkumar గారి కామెంట్లను కూడా)

      ఇక చర్చకు సంబంధించి మావో వాక్యాన్ని ‘నూరు పూలు వికసించని… వేయి ఆలోచనలు సంఘర్షించనీ’ అని నేను వాడితే దానిని సైతం ‘వేయి పూలు చెవిలో పెడుతున్నారు’ అని వెటకరిస్తున్నారు. ‘ఏ ప్రభుత్వ పాఠశాలను చూసినా ఏమున్నది గర్వకారణం’ అని వెటకరించడంలోనే ప్రభుత్వ పాఠశాల పట్ల మీకు ఎంతటి చులకన భావముందో అర్ధమవుతుంది. మీరు మమ్మల్ని కొరడాలగా మిమ్మల్ని కత్తులు భాణాలుగా పోల్చారు కాబట్టే ‘కందకు లేని దురద కత్తి పీటకేల’ అని నేను వాడాల్సి వచ్చింది. మీ వ్యంగ్యంతో పోలిస్తే మా వ్యంగ్యం ఏపాటండి.

      మా బ.జ.రా కూడా రావిశాస్త్ర, పతంజలి వంటి రచయితల సరసన చేరాలని మేము మనస్పూర్తిగా కోరుకుంటున్నాం. వారిలా వ్యవస్థపై వ్యంగ్యాస్త్రాన్ని విసరాలి కాని ఇదేమిటిలా వ్యక్తులపై వ్యంగ్యాస్త్రాన్ని మా బ.జ.రా ప్రయోగిస్తున్నాడు ఇలా అయితే ఆ రచయతల సరసన చేరుకోలేడనే భయంతో మిత్రుడితో సీరియస్ గా చర్చిస్తున్నాం. మీరేమే మీ వ్యంగ్యంతో దానిని చెడగొట్టే ప్రయత్నం చేస్తున్నారు.

      అవును సార్ మావి తాటాకు చప్పుల్లే కాని మీరు కుందేళ్ళు కాకండి. ఇకనైనా చర్చను సీరియస్ కొనసాగిద్దాం. ప్రభుత్వ పాఠశాలలు మరియు ఉపాధ్యాయులు ఎందుకు పనికిరానివని మీరంటున్నారే(అవును మరి అక్కడ చదువు చెప్పే మేజర్ వర్గం s.t, s.c, b.c వారు కదా చదువుకునే పిల్లలు కూడా అదే వర్గానికి చెందిన వారు కదా అందుకనే వారిని మీరు ఒకరిని పనిదొంగలగా వేరొకరిని చదువుల దొంగలగా భావిస్తున్నట్టున్నారు) ఏ ప్రాతిపదిక మీద మీరంటున్నారు. మొత్తం రాష్ట్రంలో పాఠశాలల సంఖ్య వాటిలో ప్రభుత్వ పాఠశాలల సంఖ్య ఏయే వర్గాల ఉపాధ్యాయుల ఎంత శాతం వున్నారు వివిద వర్గాల పిల్లల శాతం వంటి గణాంకాలకై education statics 2013-14 అన్న సైటును ఓపెన్ కాస్త క్షుణ్ణంగా చదవగలరు దాని ద్వారా working force లోకి ఎంత మంది ప్రభుత్వ పాఠశాల విధ్యార్ధులు ప్రతి సంవత్సరం వెళుతున్నారు వారిని తయారీ చేయడంలో ఉపాధ్యాయుల పాత్రను అర్ధం చేసుకోగలరని ఆశిస్తున్నాను.

      ‘మాకు అన్ని రకాలా స్వేచ్ఛ తోపాటు అనుకునే స్వేచ్ఛ, అవి మాటలైనా, రాతలైన, వాతలైన.. ఇచ్చి పుచ్చుకునే స్వేచ్ఛ కూడా ఉంటుంది అని గమనించాలి’ మీరన్నట్టు ఇది మాకూ వర్తిస్తుందని భావిస్తున్నాను.

      చివరిగా సారూ.. మాదొక విన్నపం వ్యంగ్యం అనేది రెండు వైపులా పదునుండే కత్తిలాంటిది తిప్పినప్పుడు జాగ్రత్త వహించకపోతే ఒకోసారి ఎదుటివారి తలకు బదులు మన తలే తెగిపోవచ్చు

      ధన్యవాదములతో

      మొయిద

    • మెయిద శ్రీనివాసరావు says:

      ‘తికమక పెట్టే…సారు’ అనే నా కామెంట్లో ‘చదువు చెప్పే మేజర్ వర్గం s.t, s.c, b.c వారు కదా చదువుకునే పిల్లలు కూడా అదే వర్గానికి చెందిన వారు కదా ‘ అన్న వాక్యానికి బదులు ‘చదువు చెప్పే మేజర్ వర్గం ఆర్ధికంగా వెనుకబడిన s.t, s.c, b.c నేపధ్యం నుంచి వచ్చిన వారు కదా చదువుకునే పిల్లలు కూడా అదే వర్గానికి చెందిన వారు కదా ‘ అని చదువుకోగలరు.

  29. కె.కె. రామయ్య says:

    ప్రియమైన శ్రీ రెడ్డి రామకృష్ణ మాస్టారు గారికి నమస్కరించి రాయునది,

    ప్రభుత్వ పాఠశాలల అండ లేకుంటే పేద, దళిత, దిగువ మధ్యతరగతి పిల్లలు చదువుకు దూరమౌతారు గదా అన్న మీ సంవేదన నన్ను కదిలించింది. ఈ పాఠశాలలు, ఈ కాస్త వనరులే ఆ తరంలోని లాల్ బహదూర్ శాస్త్రి, దివంగత మాజీ రాష్ట్రపతి కె ఆర్ నారాయణ్ లాంటి వాళ్ళు జీవితంలో ఎదగడానికి దోహదం చేశాయి. దుర్భర పరిస్థుల నుండి ఓ ఒడ్డుకు చేరుకోవడానికి నేడు కూడా ఎందరికో విద్య ఆసరాగా ఉంది. ఈ ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ వైద్యశాలలు కూడా లేకుంటే బీదా బిక్కీ ఏవైపోతారు.

    ఆ ఆవేదనతోనే శ్రీ బమ్మిడి జగదీశ్వరరావు గారు ఈ వ్యాసం రాసారని నాకనిపించింది. పనికట్టుకుని ఉపాధ్యాయులను కించపరచడం ఈ వ్యాసం ఉద్దేశ్యం కాదని నా నమ్మకం. విద్యా వ్యవస్తలో మార్పు రావాలని పరిస్థితులు మెరుగవ్వాలనేదే వారి ఆకాంక్ష అని నా భావన.

    వేల, లక్షల కోట్ల ప్రభుత్వ ధనం ఎన్నెన్నో పథకాలకు వెళుతున్నా మౌలిక సదుపాయాలైన విద్యా వైద్యానికి కేటాయిస్తుంది ఎంత? అందులో సద్వినియోగం అవుతున్నది ఎంత ?
    ( Andhra Pradesh Govt. presented a Rs.1.35 trillion budget for the fiscal 2017 with Rs.17,503 Crore for Education and Rs. 6,104 Crores for Medical and Health care ).

    బజరా గారు మీ చిరకాల సన్నిహిత మిత్రుడు అని తెలియజేసి మాకెంతో సంతోషాన్ని కలిగించారు. మీరు ఎన్నెన్ని విధాలుగా రాస్తారో హాస్యస్ఫోరకంగా చెప్పి మనసును తేలిక పరిచారు.

    ( తల్లి దండ్రులు చేసిన పుణ్యం, వారితో సమానంగా వాత్సల్యం చూపించి విద్యా భిక్ష పెట్టిన గురువులు – ప్రభుత్వ పాఠశాలల గురువర్యులు – వల్ల నాకు, నా కుటుంబానికి ఇంత అన్నం దొరుకుతున్నది, నీడలో ఉన్నాను. అంతకు మించి నేనే విధంగానూ మీకంటే పెద్దవాణ్ణి కాను అని మనవి చేసుకుంటున్నాను.)

  30. లక్ష్మణరావు says:

    శాంతామణి గారికి
    నమస్సులు. మీ గ్యానం ముందు మా గ్యానమెంత మేడం. చర్చకి, వాదానికి తేడా తెలియని నాతో మీ లాంటి గ్యానవంతులకు పని ఏమిటి మేడం. కాలం వృధా తప్పా. అనవసరంగా మీ విలువైన కాలాన్ని ఉత్తరాంధ్రా రచయతల కోసం చాటింపు వేసేందుకు ఖర్చు చేయడం, అది కూడా మా బృందం వలన అయినందుకు పెద్ద మనసు చేసుకుని క్షమించగలరు. మిత్రుడు రాశాడు కాబట్టి తలకెత్తుకోవాలని, నచ్చని వాడు రాసాడు కాబట్టి తూలనాడాలని, ప్రాంతీయ కళ్లద్దాలతో చర్చలు కొనసాగించాలన్న గ్యానం మాకు కలగకపోయినందుకు చింతిస్తున్నాను. ఎప్పటికి చర్చించే స్థాయికి చేరుతామోనని ఎదురుచూస్తూ ఉన్నాం. మీ లాంటి గ్యానవంతులు… చర్చకి సంబంధించి ఓ క్లాసు తీసుకుంటానే గాని మా లాంటి వాదనకి తిక్క కుదరదు. తమరు ఏ ప్రాంతం వారో చెబితే,మా గౌరునాయుడు బావు, అప్పలనాయుడు బావుతో పాటు మా బృందమంతా అనుకుని ఓ ప్రత్యేక తరగతిని ఏర్పాటు చేస్తాం. తమరు వచ్చి సెలవిస్తే…భవిష్యత్ లో మీ కాలాన్ని వృధా చేసే ఇటువంటి వాదనలు లేకుండా చూసుకుంటామని మనవి చేస్తున్నాను. ఖచ్చితంగా తమరు వీలు కల్పించుకోవాలి. తమరి గ్యానాన్ని తలా ఇంత పంచిపెట్టాలని ప్రాధేయపడుతూ…
    కృతజ్ఈున్ని
    లక్ష్మణరావు

    • shanthamani says:

      లక్ష్మణ రావుగారు..
      మీరు ఇలా రాస్తారనే uhimchaanu . మీరు ఇంతకుముందటి నేను పేర్కొన్న సందర్భాలలో కూడా ఇలానే రాశారు. తెలీదంటారు.మళ్ళీ వెంటనే మేధావి లా ఒక కామెంట్ చేస్తారు.ఈ పోస్ట్ లో కూడా ఇదే విద్య ప్రదర్సించారు. మీ వాక్యాన్ని మీరే ఖండించు కుంటారు . అది వ్యంగ్యం అనుకుంటారు. చదివే వాళ్ళు ఏమనుకుంటారో ఆలోచించండి సార్ ..
      నాకు బజారా స్నేహితుడనీ,అంచేతనే తలకెతుకున్నాననీ మీ భావన. ప్రాంతీయ కళ్ళద్దాలతో చూస్తానని ( ప్రాంతం భావన తప్పు కామోసు.అంతా విశ్వమానవ భావన ఉండాలి కామోసు.మీ లాంటి వాళ్ళు తెలంగాణ లో లేకపోవడం అదృష్టం .ఉండుంటే తెలంగాణా వాదనను అడ్డుకుందురు మీరు,ప్చ్…)మీరు భలేగా అన్నీ పోల్చుతారు…నన్ను స్త్రీ కాదని పోల్చారు. స్త్రీ రాతలు అలా ఉండవని పోల్చారు. నేను ఏ ప్రాంతమో మీకు చెప్పాలండీ ?మీరు ఉఊహించగలరు …క్లాసుకి గూడా బృందమంతా కలుపుకున్నారు. గౌరునాయుడు మీ బృందం కాదుకదండీ,సీరియస్ రచయితా ,ఉత్తరాంధ్ర రచయిత కదండీ.అతని మీదా మీ బృందం దాడి చేసింది కదండీ. అప్పలనాయుడు గారి సంగతేమో గానీ గౌరునాయుడు గార్ని కలపడంకి కుదరదండీ..
      అవునూ … ఇలా ఉఊహించడం ,వివరాలడగడం ,చెప్పిందే చెప్పడం,తాము చెప్పిందే సరైనదనుకోవడం….పోలీసులకు ,జర్నలిస్టులకు వెన్నతో పెట్టిన విద్య. మీరు ఈ రెంటిలో ఏదో ఒకదానికి చెందుతారా ? ఇలా అన్నానని నన్ను మీలా ఉఊహించే వృత్తి జీవినని అనుకోకండి.
      మీ రాతలు,ఊహలు మీ ఇష్టం … మీరు కోరుకునే విగ్యానమ్ మీకు ఇప్పటికే ఉంది. మీ బృందం ఆ తర్ఫీదు పొందుతుంది. నా క్లాసులవసరం లేదు లెండి.
      శాంతమని

      • లక్ష్మణరావు says:

        శాంతామణి గారికి
        నమస్సులు. మీరు చేయి తిరిగిన రచయతే అనుకున్నా. కాని భవిష్యవాణి చెప్పే నైపుణ్యం కూడా ఉందని ఇప్పుడే తెలిసొచ్చింది. గౌరినాయుడుగారు మా బృందంలో కలపకండి, కుదరదండి అని చెప్పగలిగారంటే మీరు మామూళ్లోళ్లు కాదండి. ఎంతైనా అనుభవస్తులు కదండి. సీనియార్టీ ఊరికినే పోతుందా. మాలాంటి వాళ్లని ఎంత మందిని చూసుంటారు. అందువలనే నా వృత్తిని దాచుకోదలుచుకోలేదు. మీరన్నట్లునే నేను జర్నలిస్టునేనండి. ఊహించడం, చెప్పిందే చెప్పడం అలవాటైపోయింది. అందుకే మేడం. మీ లాంటి వాళ్లతో క్లాసు తీసుకుని గ్యానవంతులు కావాలని ఆశపడ్డాను. ఆ ఆశను అడియాశలు చేయకండి మేడం. ఇదేదో పెంకి ప్రశ్న అని మీరు అనుకోకపోతే గౌరినాయుడు మాతో కలవరని మీరెలా చెప్పగలరండి? నిజానికి మా బావుకి ఈ చర్చ చూసే అవకాశం లేకపోవడం వలన మీకు బదులివ్వలేకపోతున్నారు గాని, లేకుంటే మా బంధం గురించి గట్టిగానే మీకు వినిపించేటట్లు చెప్పి ఉండేవారు. మేడం….ఈ ఉత్తరం మాట అలా ఉంచి…దయచేసి ఈ వ్యాసం మీద మేము చేసిన తప్పు ఏమిటో కనీసం ఇప్పటికైనా చెప్పండి మేడం. అనవసరంగా మాలాంటి అగ్యానుల కోసం మీ విలువైన కాలాన్ని వృధా చేసుకోకుండా, నేరుగా ఈ వ్యాసం గురించి రామయ్య గారు లాగా, నారా‍యణమూర్తిగారు లా కనీసం ఒక్క ముక్కైనా అభిప్రాయాన్ని చెప్పగలరు. మా కళ్లు తెరిపించగలరు. వ్యక్తల విగ్యానాన్ని తూనికలు వేసేందుకు అనవసరంగా మీ అనుభవాన్ని వెచ్చించకుండా…ఈ వ్యాసం ఏమి చెప్పింది? ఆ వ్యాసాన్ని ఎలా చూడాలి? ఆ వ్యాసం చెప్పే నీతి ఏమిటి ? ఆ వ్యాసం ఎంత కరెక్టో ? మేము వేటిని సరిచేసుకోవాలో వివరించగలరు. కనీసం ఇప్పటికైనా తూనికలు, కొలమానాలు, హద్దులు, గ్రూపులు వంటి వాటి మాటున తప్పించుకోకుండా స్పష్టంగా మీరు చెప్పాలని విన్నవిస్తున్నాను. మీ కాలాన్ని వృధా చేస్తున్నందుకు క్షమించగలరు.

  31. At the end of it what we achieved? Pompous, naked display of ego. All know one another and each tries not to lose the persona. All can sit at a place and save the public space.
    I am baffled to be drawn into this. Right. One has to clarify what is meant by “serious”writer, if Sri Ganteda Gourinaidu be made part of that section.

  32. రెడ్డి రామకృష్ణ says:

    శాంతామణి గారూ!
    ప్రశాంతంగా యిలా అడిగితే నా అభిప్రాయం చెప్పకపోదునా,మీరు వేరే దారిలో వచ్చారు కనుక నేనూ ఆదారిలో రాక తప్పలేదు
    ఎప్పుడూ చర్యకు ప్రతి చర్య ఉంటుందని మీకు చెప్పనక్కరలేదనుకుటాను,
    యిక విషయానికొస్తాను.
    “సీరియస్ రచయితలంటే మీకెంత చులకన భావమో,దాచుకుందామన్నా దాగకుండా బయటపెట్టేసుకున్నారు”
    1.అసలు సీరియస్ రచయితలంటే ఎవరు?
    “నా ఉద్దేశం లో సీరియస్ రచయితలు అంటే…సమాజమూ,ప్రజలూ,సామాజిక చలనాన్ని ఒక ద్రుష్టికోణం తో ఆలోచించి రాసే రచయితలని.”అన్నారు.ఏదో ఒక దృష్టి కోణం తో రాసే వారందురూ సీరియస్ రచయితలేనా!? మీ ఉద్దేశంలో బహుశా అది మార్క్సిస్టు దృష్టికోణమనే అనుకుందాం
    సీరియస్ రచయితలని పేరున్నవాల్లు రాసిందంతా సీరియస్ రచనేనా!?.కొ.కు కంటే సీరియస్ రచయితలు తెలుగులో వున్నారా!
    నాకు రచనే ప్రధానం.రచయిత కాదు.

    2.సీరియస్ రచయితలు సమాజము లోని వారేనా లేక వారేమైనా ప్రత్యేకమా! వారు తమకొక ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఆశిస్తున్నారా!లేక తమబాధ్యతగా భావించి రాస్తున్నారా!?
    సమాజంలో అనేక రంగాలవారు ఉంటారు.తమకు సమాజం పట్ల బాధ్యత ఉన్నదని భావించినవారు ఆయారంగాలలో పనిచేస్తునే వున్నారు,వుంటారు. వారు తమకొక ప్రత్యేకమైన గుర్తింపుని గౌరవాన్ని ఆశించరు.మరి రచయితలు మాత్రమే ఎందుకు కోరుకుంతారు.

    యిక నాగురించి.నేను దాచుకోవాలని ఎప్పుడూ అనుకోను,ఏదీ దాచుకోను.ఉన్న మాట, నేను నిజమనుకున్న మాట ఎప్పుడూ చెప్పేస్తునే వుంటాను.అందుకే కదా మీ వంటి వారికి ఆగ్రహమొస్తోంది.లౌక్యము ప్రదర్శించాలనుకొనే వారికి దాపరికం కావాలి.నాకు అవసరంలేదు.

    “సాహిత్యం సాహిత్యం కోసమే అనే వారిని యేమీ అనకుండా, ద్రుష్టికోణం ఉన్నవారి మీదనే మీ బ్రుందమ్ దాడి చేస్తోమ్ది. దాడి కాదు,సరిదిద్దుతున్నామంటారు. ఆ సరిదిద్దే కర్తవ్యం పైన చెప్పిన వారిమీద్ యెందుకని చేయరో మీరు.”

    సాహిత్యం సాహిత్యం కోసమే అనే వారిని ఏమైనా అంటే వారు మారుతారా.అనుభవమైతే తప్ప.అలా మారిపోతే వందేళ్ల అభ్యుదయ సాహిత్యం(గురజాడనుంచి)సుమారు యాభై ఏళ్ల విప్లవ సాహిత్యం ఎందుకు మార్చలేకపోయాయి.
    దృష్టి కోణం వున్నవారిమీదనే నాదృష్టి.ఎందుకంటే వారు పొరపాటున తప్పు చేసినా చెపితే మార్చుకొనే అవకాశముంటుందిగదా అని.( ఐతే ఈ మధ్య ఎవరూ పొరపాట్లను ఎత్తి చూపించడంలేదు.చూపించినా ఆయా రచయితలు సరిదిద్దుకోవడానికి సిద్దంగానూ లేరు.ఎవరికి వారు తామే దిశానిర్దేశకులమని భావిస్తూ వుంటారు)

    “మీ బృందం …”ఒకేలాంటి ఆలోచన ఉన్నవాళ్ళు బృందమే ఐతే మేము (మీరనుకున్నవాళ్లంతా) బృందమే. మీకు తెలుసో లేదో వీళ్లంతా ఒకే వూరిలోనూ లేరు.ప్రణాళీకా బద్దంగా మీరన్నట్టు “దాడి ” చేయనూలేదు.ఎవరి అభిప్రాయలు వారు రాస్తున్నారు.

    “ఒక గౌరునాయుడు,ఒక బాలసుధాకర్ మౌళీ,ఒక బజరా…ఇలా..” ఈ ఒక ఒక లంతా ఒక బృందమేనా! అయినా నాకేమీ అభ్యంతరం లేదు.

    “సాహిత్యం ఇతర ప్రాంతాల వాళ్ళూ రాస్తున్నారు,వాళ్ళల్లోనా మీ ద్రుష్టిలో తప్పులు లాంటి తప్పులు రాసేవాళ్ళూ ఉన్నారు,అయినా మీరు వాళ్ళని యేమనరు, ఒక్క ఉత్తరాంధ్రా (సీరియస్)రచయితలనే యేదో ఒకటంటారు”
    .
    అది తెలుగు సాహిత్యం యొక్క దురదృష్టం అనుకోవాలి.విమర్సించాల్సినవాళ్లు,పొరపాట్లను ఎత్తి చూపించాల్సినవాళ్ళంతా మొహమాటాలకు పోవటం చేత,తాము విమర్శిస్తే మరుచటి రోజునుంచి తాము వర్గశతృవులమైపోతామన్న భయం చేత ఊరుకుంటున్నారు.
    మీరు చెయ్యొచ్చుగదా!అంటారు.
    చెయ్యొచ్చు. ఆయాప్రాంతాల గురించి,అక్కడి సమస్యల గురించి,అక్కడి యాస గురించి అవగాహన వుంటే,నాకవిలేవు.నేను నాప్రాంతపు యాస భాషల గురించి,సమస్యలగురించి అవగాహన వున్న వాన్ని ,ఎప్పటికప్పుడు ఈ ప్రాంతపు రచయితల రచనలు చదువుతున్న వాణ్ణి గనక,నాకు తప్పనిపించిన విషయాన్ని ఎత్తి చూపిస్తుంటాను.
    నేను ఈ విషయం యిలా చెప్పాను.
    “మార్క్సిస్ట్ దృక్పధంతో ఉన్న లేదా దానికి దోహదపడిన ఏ వాణినైనా బాణీ నైనా తప్పక ప్రోత్సహించాలి.నేనూ ప్రోత్సహిస్తాను.ఆ నిబద్ధతను గౌరవిస్తాను.దానికి వ్యతిరేకమైన బాణీలను వ్యతిరేకించక తప్పదు. వారు ఎంతటి నిబద్ధులైనా.( ఒకో సారి పొరపాటు పడోచ్చు)ఎందుకంటే అది సమాజానికి హాని చేస్తుందని నమ్ముతాను గనక.”

    మీరన్నారు”ఈ పోలీస్ ఉద్యోగం చాలించండి.”అని. నా మీద మీ ఆధిపత్యం చెల్లదు.మీరు రాయంటే రాయనూ…. వద్దంటే మానీను.

    “మీకు అంత కష్టమక్కరలేదు,లోకం చూసుకుంటుంది,ఆ కష్టమేదో…లోకానికి పనికి వచ్చే పని మీద పెట్టండి.”
    లోకం అంతాచూసుకునే టట్టే ఐతే మీరు మీలాంటి సీరియస్ రచయితలు మాత్రం రాయటం ఎందుకు చెప్పండి.యిది చూసుకున్నలోకం అది చూసుకోలేదా!?

    నేను చేస్తున్నపని లోకానికి పనికి వస్తుందనే చేస్తున్నాను.పనికి రాదనుకుంటే నేనెందుకు చేస్తాను.
    వచ్చిన చిక్కల్లా మీలాగ నన్ను అలోచించమంటున్నారు.మీకు నచ్చిందే నాకు నచ్చాలంటున్నారు.ఇదేమి న్యాయం మేడం?

Leave a Reply to ఎ కె prabhaakar Cancel reply

*