గాలికీ కులముంది – కధా క్రమంబెట్టి దనిన
సీమ అస్తిత్వానికి చిన్న చోటు
-విజయ్ కుమార్
‘ మూడ్రాల్ముక్రాయ్ ‘ నా మొదటి కథ. రచయితగా వేషం వేసుకున్నాక బయటపడిన మొదటి ప్రాడక్ట్ అది. పశ్చిమ కర్నూలు ప్రాంత నేపథ్యం లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో బతికే ఒక యువ జంట ప్రేమ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్క రాయలసీమ ప్రాంతం లోనే ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి. బహుశా ఈ ప్రాంత వ్యావహారిక శైలిలో కథ రావడం ఇది ప్రథమం అనుకుంటున్నా. ఈ కథ ‘ కినిగె ‘ లో ప్రచురణమయ్యింది. మెహర్ గారు నాకు ఇందులో సూచించిన కొన్ని చిన్న చిన్న సలహాలతో ఈ కథ లో డిక్షన్ మార్చడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా మెహర్ గారికి కృతజ్ఞతలు చెప్పుకోకుండా ఉండలేక పోతున్నా.
మాదేవి ఈ కథలో కథానాయిక. ఈ కథ తర్వాత నేను ‘ మా ఊర్ల పాకిస్తానోల్లు ‘ ( కినిగె) ; ‘ బతుకు తునకలు ‘ ( వాకిలి) ; ‘చిల్లర నాణేలు ‘ ( వాకిలి ) లో కథలు రాశాను. ప్రతి కథలోనూ ‘ మాదేవి ‘ అనే ఒక కేరక్టర్ కేమియో గా ఉంటుంది. ఎందుకంటే ‘ మా దేవి ‘ పాత్ర ఈ కథలో స్వచ్చమైన ప్రేమకు , కన్సర్న్ కు తార్కాణంగా ఉండిపోయిందని నా నమ్మకం. ఈ కథ లో మాదేవి కి ముక్రాయి ( ముక్కు పుడక ) బాగుంటుంది అన్న వీరేశు కాంప్లిమెంట్ మీద సాగిపోయే కథ ఇది.
సాహితీ రంగం నా ప్రధాన స్రవంతి కాకపోవడం వలన ఏమో ఎప్పుడో విన్నాను తప్ప సామాన్య గారి నాకు పరిచయం లేదు. మంచి కథలను ప్రోత్సాహిద్దాం అనే ఆమె తలపు అభినందనీయం. నిజానికి ఈ తెలుగు సాహితీ రంగం లో ఎంతో అసంబద్ధత, ఎన్నో తారతమ్యాలు ఉన్నాయనే నా బలమైన భావనతో నేను ఎక్కువగా ఇంగ్లీషు రచనలకు పరిమితమయ్యాను. అటువంటి సమయం లో సామాన్య గారు తనే ఇనీషియేటివ్ తీసుకుని నాకు ఫోన్ చేసి కథను ప్రచురణకు స్వీకరించి ప్రోత్సహించడం వ్యక్తిగతంగా నాకు ఆనందకరమే కాదు సంభ్రమం కూడా కలిగించింది. సారంగ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటూ , రాయలసీమ అస్తిత్వానికి సాహిత్యం లో చిన్న చోటు అయినా కలిపించడం తెలుగు సాహిత్య ప్రగతి వాద పథం లో విధివిహితమైనది అని గుర్తించవలసిందిగా ప్రతి సాహితీ వేత్తకు విన్నవించుకుంటున్నా.
*
ముఖ్యంగా ఒంటరితనం మనిషినెలా చీల్చేస్తుందో..!
-షాజహానా
మనసుకి తగిలిన గాయాలన్నీ వరుసపెట్టి ఒకదాని వెంట మరొకటి తరుముకొచ్చాయి. మనసులో మంట. ఎంతకీ ఆర్పలేని కార్చిచ్చులాంటి మంట. రాసాకగాని ఆరలేదు. ఒక్కటా రెండా.. ఎన్నో విషయాలు జలపాతంలా… దూక్కుంటూ దూసుకుంటూ… ఏదీ కావాలని రాసింది కాదు. మనసులో ఏమనుకుంటానో అదే raw గా వచ్చేసింది.. ఊటలా ఉప్పొంగి కన్నీటి నదిలా ఉబికి ఉబికి వచ్చింది. బతకమ్మ పేర్చినట్టు కథ పేరుకుంటూ పోయింది.
చాలా ఎక్కువమంది స్త్రీలు కథతో ఐడెంటిఫై అయ్యారు.. మరెంతోమందికి కథ కనెక్ట్ అయ్యింది. చాలామంది పేరు బాగుందన్నారు. కొందరు ఎంతగానో ఏడ్చామన్నారు.. ఇది స్త్రీలందరి కథ అన్నారు.. స్త్రీలందరి తరఫున ఇలాంటి కథ రాయగలగడం బాగుంది నాకు…
*