మరి కొన్ని ప్రాతినిధ్యాలు…!

 katha

saipadmaగాలికీ కులముంది – కధా క్రమంబెట్టి దనిన

 -సాయి పద్మ
ఈ కధ ఎందుకు రాసాను ? అంటే – రాయకుండా ఉండలేక రాసాను. నన్ను చిరాకు పెడుతూ, ఏడిపిస్తోంది కాబట్టి, వదుల్చుకోవటానికి రాసేను. ఇది నాకు చాలా దగ్గరైన వొక దళిత అమ్మాయి నిజ కధ. చాలా కాలం వరకూ ఆమె ఎస్సీ అని నాకు తెలియదు. మాట్లాడుతూ ఉండేది. వొక్కోసారి దుఃఖంగా, వొక్కోసారి సంతోషంగా.. పిల్లలు కావాలి అన్న కోరిక విపరీతంగా ఉండేది. పిల్లల కోసం ఎవరేం తాయత్తు, మహిమ, మంత్రం ఉంది అన్నా, వెళ్ళిపోతూ ఉండేది. చాలా సార్లు సున్నితంగా కపుల్ కౌన్సెలింగ్ ఇలా చెప్పినా , ఏమీ మాట్లాడేది కాదు. వాళ్ళాయన రాడేమో అనుకోని వూరికొనే దాన్ని. నాకు తెలిసిన ఐ వీ ఎఫ్ సెంటర్ల గురించి చెప్పాను, వోకదానికి వెళ్లి ఏదో ప్రాసెస్ స్టార్ట్ చేసింది కూడా. తర్వాత ఏమైందో తెలీదు. చాలా కాలం గ్యాప్ తర్వాత, వొకసారి ఫోన్ చేసి ఏడ్చింది. వాళ్ళ అత్తగారు, తాను కడిగిన గిన్నెలు మళ్ళీ కడుక్కొని పెట్టుకుంటుంది అన్నది, చాదస్తం ఏమోలే అంటే.. కాదక్కా , నేను తక్కువ జాతి దాన్ని కదా అంది. జాతి అంటారు, కులం కూడా కాదు అంటూ ఏడ్చింది. అయ్యో.. ఇంత చదువుకున్నావు బాధపడకు అంటే, వాళ్ళాయన దగ్గరకి తీసుకుంటూ.. ఇలా ఉంటె చాలదా.. నీతో పిల్లలు అంటే మళ్ళీ అదో వారసత్వపు గోల అన్నాడు అని.. కుళ్ళి కుళ్ళి ఏడ్చిన ఆ స్వరం ఇప్పటికీ నన్ను భయపెడుతూనే ఉంది.
నిజ కథలో క్లైమాక్స్ ఏంటి అంటే, వాళ్ళాయన తన కులపు అమ్మాయి, మరదలు వరస ని పెళ్లి చేసుకొని పిల్లల్ని కన్నాడు. ఈ అమ్మాయి, రిజర్వేషన్ ఉపయోగించుకొని వచ్చిన, రాజకీయ పదవి, అనధికారంగా అనుభవిస్తున్నాడు. తోటలో ఇంట్లో, వొంటరిగా , మధ్యలో మొగుడు, ఉంచుకున్న వాడిలా వచ్చిపోతూ ఉంటె, తన వరకూ నగలు, చీరలు చూసుకొని త్రుప్తి పడుతోంది ఆమె. నాతో మాట్లాడినా ముభావంగా ఉంటుంది. పిల్లల కోసం ప్రయత్నించటం మానేసింది. చదువుకోమన్నాను. పీహెచ్డీ మొదలెట్టింది.
నాకే, ఇంకా ఆశ చావక మనుషుల మీదో, సమాజం మీదో, ఆమె గెలవాలన్న కసితో, క్లైమాక్స్ మార్చాను. ముఖ్యంగా థాంక్స్ చెప్పుకోవాల్సింది, రవీందర్ వీరేల్లి గారికి, ఈ కదా వాకిలి లో వేసేముందు, పాపం, సహనంగా నన్ను భరించి, కథని అక్కడక్కడా ఎడిట్ చేయటమే కాకుండా మంచి సూచనలు ఇచ్చారు. ఇంకో పెద్ద థాంక్స్ సామాన్య కిరణ్ గారికి, ఏ కధా సంకలనం లోనూ నా కదా రాలేదు, నా కథలు ఎవరికీ నచ్చవేమో అనుకోనేదాన్ని, ఈ కథ కావాలని అడిగి, ప్రాతినిధ్య లో వేసుకున్నందుకు భలే సంతోషంగా ఉంది.
ప్రాతినిధ్యం గా నిలుస్తున్న , అందరు, రచయిత్రులకీ, రచయితలకీ శుభాకాంక్షలు
~~

సీమ అస్తిత్వానికి  చిన్న చోటు

vijaykumar viktar

-విజయ్ కుమార్ 

 

‘ మూడ్రాల్ముక్రాయ్ ‘ నా మొదటి కథ. రచయితగా వేషం వేసుకున్నాక బయటపడిన మొదటి ప్రాడక్ట్ అది. పశ్చిమ కర్నూలు ప్రాంత నేపథ్యం లో ఉన్న ఫ్యూడల్ వ్యవస్థలో బతికే ఒక యువ జంట ప్రేమ చుట్టూ ఈ కథ ఉంటుంది. ఒక్క రాయలసీమ ప్రాంతం లోనే ఎన్నో డైలెక్ట్స్ ఉన్నాయి. బహుశా ఈ ప్రాంత వ్యావహారిక శైలిలో కథ రావడం ఇది ప్రథమం అనుకుంటున్నా. ఈ కథ ‘ కినిగె ‘ లో ప్రచురణమయ్యింది. మెహర్ గారు నాకు ఇందులో సూచించిన కొన్ని చిన్న చిన్న సలహాలతో ఈ కథ లో డిక్షన్ మార్చడం జరిగింది. అందుకు ఈ సందర్భంగా మెహర్ గారికి కృతజ్ఞతలు  చెప్పుకోకుండా ఉండలేక పోతున్నా.

మాదేవి ఈ కథలో కథానాయిక. ఈ కథ తర్వాత నేను ‘ మా ఊర్ల పాకిస్తానోల్లు ‘ ( కినిగె) ; ‘ బతుకు తునకలు ‘ ( వాకిలి) ; ‘చిల్లర నాణేలు ‘ ( వాకిలి ) లో కథలు రాశాను. ప్రతి కథలోనూ ‘ మాదేవి ‘ అనే ఒక కేరక్టర్ కేమియో గా ఉంటుంది. ఎందుకంటే ‘ మా దేవి ‘ పాత్ర ఈ కథలో స్వచ్చమైన ప్రేమకు , కన్సర్న్ కు తార్కాణంగా ఉండిపోయిందని నా నమ్మకం. ఈ కథ లో మాదేవి కి ముక్రాయి ( ముక్కు పుడక ) బాగుంటుంది అన్న వీరేశు కాంప్లిమెంట్ మీద సాగిపోయే కథ ఇది.

సాహితీ రంగం నా ప్రధాన స్రవంతి కాకపోవడం వలన ఏమో ఎప్పుడో విన్నాను తప్ప సామాన్య గారి నాకు పరిచయం లేదు. మంచి కథలను ప్రోత్సాహిద్దాం అనే ఆమె తలపు అభినందనీయం. నిజానికి ఈ తెలుగు సాహితీ రంగం లో ఎంతో అసంబద్ధత, ఎన్నో తారతమ్యాలు ఉన్నాయనే నా బలమైన భావనతో నేను ఎక్కువగా ఇంగ్లీషు రచనలకు పరిమితమయ్యాను. అటువంటి సమయం లో సామాన్య గారు తనే ఇనీషియేటివ్ తీసుకుని నాకు ఫోన్ చేసి కథను ప్రచురణకు స్వీకరించి ప్రోత్సహించడం వ్యక్తిగతంగా నాకు ఆనందకరమే కాదు సంభ్రమం కూడా కలిగించింది. సారంగ తరపున ఆమెకు ధన్యవాదాలు తెలియ జేసుకుంటూ , రాయలసీమ అస్తిత్వానికి సాహిత్యం లో చిన్న చోటు అయినా కలిపించడం తెలుగు సాహిత్య ప్రగతి వాద పథం లో విధివిహితమైనది అని గుర్తించవలసిందిగా ప్రతి సాహితీ వేత్తకు విన్నవించుకుంటున్నా.

*

ముఖ్యంగా ఒంటరితనం మనిషినెలా చీల్చేస్తుందో..!

 -షాజహానా

shahjahanaమనసుకి తగిలిన గాయాలన్నీ వరుసపెట్టి  ఒకదాని వెంట మరొకటి తరుముకొచ్చాయి. మనసులో మంట. ఎంతకీ ఆర్పలేని కార్చిచ్చులాంటి మంట. రాసాకగాని ఆరలేదు. ఒక్కటా రెండా.. ఎన్నో విషయాలు జలపాతంలా… దూక్కుంటూ దూసుకుంటూ… ఏదీ కావాలని రాసింది కాదు. మనసులో ఏమనుకుంటానో అదే raw గా వచ్చేసింది.. ఊటలా ఉప్పొంగి కన్నీటి నదిలా ఉబికి ఉబికి వచ్చింది. బతకమ్మ పేర్చినట్టు కథ పేరుకుంటూ పోయింది.

చైతన్య స్రవంతి అన్నారు. తాగి రాసావా అనడిగారు.. పాపం, చాలా మంది స్కై నే విలన్ అనుకున్నారు.. నవ్వొచ్చింది.

చాలా ఎక్కువమంది స్త్రీలు కథతో ఐడెంటిఫై అయ్యారు.. మరెంతోమందికి కథ కనెక్ట్ అయ్యింది. చాలామంది పేరు బాగుందన్నారు. కొందరు ఎంతగానో ఏడ్చామన్నారు.. ఇది స్త్రీలందరి కథ అన్నారు.. స్త్రీలందరి తరఫున ఇలాంటి కథ రాయగలగడం బాగుంది నాకు…

*

మీ మాటలు

*