కవిత్వం గాలిలోంచి పుట్టలేదు. ఆకాశం నుండి రాల లేదు. ఏ దేవుడో వరమిస్తే మొలకెత్త లేదు. కవిత్వం ఎలా పుడ్తుంది అని ఒక కవిని నిద్ర తట్టి లేపితే ఏకాంతాన్ని ఆస్వాదిస్తున్నప్పుడు కలిగే ఆలోచనల వల్ల పుడ్తుంది అంటాడు. ఒకడు విశ్వంతో మమేకమైతే ( అదెలా ఉంటుందో కొంచెం సంశయాత్మకత ఉన్నా సరే ) కవిత్వం పుడ్తుంది అంటాడు. ఒకడు ప్రకృతి లో పవళిస్తూ ఉంటే కలిగే ఆలోచనల్లో కవిత్వం పుడ్తుంది అంటాడు. మరొకడు కడుపు కాలితే పుడ్తుంది అంటాడు. ఈ కవిత్వం అన్నది ఎటువంటి బ్రహ్మ పదార్థం ? ఎలా పుడుతుంది ? ఈ తర్కాన్ని జాగర్తగా అర్థం చేసుకుంటే మనం కవిత్వం గురించి వచ్చే చర్చలను చాలా మట్టుకు అర్థం చేసుకునే ప్రయత్నంలో సఫలం అవ్వచ్చు. లేదా గాలి ఎటు వీస్తే అటు వీచి పోతాము.
అసలు సమాజం ఎలా పరిణామం చెందిందో అందులో భాష ఎలా పుట్టిందో ఏ నియమాలననుసరించి పుట్టిందో తెలుసుకోకుండా కవిత్వం ఎలా పుడ్తుంది అని చర్చించడం అస మగ్రంగా ఉంటుంది.
ఆదిమానవుడి ప్రపంచంలో ప్రకృతి ప్రధాన పాత్ర పోషించింది. అప్పట్లో ఆదిమానవుడి పరస్పర సంబంధం ప్రధానంగా ప్రకృతి తోనే నడిచింది. ప్రకృతికి మాటలు రావు , వినిపించవు. చెట్టు ను బతిమాలో బామాలో పళ్ళు సంపాయించుకునే యాంత్రికవిధానం లేకపోవడంతో మనిషి తన చేతులకు కాళ్ళకు పని చెప్పవలసి వచ్చింది. లేపొతే మనిషి అంతరించాల్సిన ఆగత్యం వస్తుంది. ప్రకృతితో ఉండే పరస్పర సంబంధం లో మానవుడు తన అవసరాల దృష్ట్యా తన అవయవాలను భౌతికంగా ఉపయోగించాల్సి వచ్చింది. ఆ క్రమంలో మనిషి చేతులు కాళ్ళు రూపాంతరం చెంది ఒక పరిణామ క్రమంలో మనిషి నాలుగు కాళ్ళ జంతువు నుండి మనిషిగా విభిన్న రూపం దాల్చుకోవాల్సి వచ్చింది. కొద్దిగా మళ్ళి ఆలోచిస్తే మనిషి మొట్ట మొదటి ఉత్పత్తి పని ముట్టు చేయి. మనిషిలో ఎదుగుదల జరగడానికి కారణం శ్రమ. ఈ పనిముట్టు అనగా చేయి, దానితో పాటు తదితరై అవయవాలలో జరిగిన మార్పు, అందుకు సమన్వయంగా మెదడు అభివృద్ధి చెందడం ఒక మానవ శ్రమ విధాన క్రమంలో అవసరమయ్యింది. ఇదే పరిణామాన్ని జీవ పరిణామ సిధ్ధాంతాలు మనకు సులువుగా వివరిస్తాయి. ఇక మెదడు అభివృద్ధిచెందిన తర్వాత లేదా చెందుతున్న క్రమంలో తనకు అవసరమైన పనుల గురించి మనిషికి చైతన్యం పెంపొందడం సహజం అయ్యింది. అలా కాకపోయి ఉండి ఉంటే మనిషి అంతరించిపోయే వాడు.
శ్రమ
Physiological development ——–> pshychological development
అంటే మనిషి భౌతిక మానసిక పరిణామ క్రమంలో ప్రకృతి లో మనుగడకు కావాల్సిన కనీస పరస్పర సంబంధం ఎంతైతే కావాలో అంత కలిగి ఉన్నాడు. ఆ మాట కొస్తే ప్రతి పక్షికీ ప్రతి జంతువుకు కూడా స్మృతి చేతన ఉంటుంది. అప్పుడు భాష అవసరం లేదు ఎందుకంటే – మనం ఇంతకు ముందు అనుకున్నట్టుగా కేవలం భౌతిక అవసరాల కోసం ప్రకృతి తో ఉండే పరిమిత పరస్పర సంబంధం కు భాష అనవసరం. ఏం మనిషి కూడా అలానే చీమలానో తేనెటీగలానో ఆ మాత్రం స్మృతి చేతన తో బతక లేడా ? బతకలేడు. బతికి ఉంటే మనిషి కాకుండా ఏ ఏనుగో, గుర్రమో అయి ఉండేవాడు. ఐతే అతని అవయవాలు అతని భౌతిక అవసరాలు పూరించడానికి అనుగుణంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని గమనించాలి.
ఒక విషయం అర్థం చేసుకుందాము. మానసిక ఎదుగుదల భౌతిక ఎదుగుదల ఒక అనుసంధాన క్రమంలో జరిగింది. అంటే గంట క్రితం ఆలోచించిన విషయానికి ఇప్పుడు మాటలు పుట్టితే ఇక మాటల అవసరం ఏముంది ? లేదా ఇప్పుడు చేసిన పని మన మెదడులో ముద్రించుకోడానికి ఒక రోజు పడితే ఇక పని ఎలా చేయగలం ? కాబట్టి మానసిక ఎదుగుదల అన్నది శారీరక ఎదుగుదలతో పాటు జరగాల్సిన ఒక అనివార్య క్రమంగా మనం చూడొచ్చు.
మెదడు అభివృద్ధి జరిగాక మనిషిలో చైతన్యం అన్నది మొదలయ్యింది. చైతన్యం అంటే The manner in which we interpret, analyse, remember and use the information about the social world . అంటే చుట్టు పక్కల ఉన్న పదార్థాలతో ఉండే ఒక నిరంతర పరస్పర సంబంధంవలన మనిషికి ఆలోచనలు కలిగాయి . ఎందుకంటే ఈ చైతన్యం వలన మనిషికి pattern recognition అర్థం అవుతూ వచ్చింది. ఇదంతా ఒక ఏక కాల ప్రక్రియ. ఏ ఒక్క గంటలో జరిగిన విధానం కాదిది. కొన్ని వందల వేల సంవత్సరాలు పట్టింది.
పొద్దున్నే లేచి ఆది మానవుడు లేచి రాతి గొడ్డలితో చెట్టును కొడ్తే ‘ ఠక్ ‘ ‘ఠక్ ‘ అనే చప్పుడే వచ్చేది. అలాకాక ఒక రోజు హఠాత్తుగా ‘ఖణేళ్ ‘ ‘ ఖణేళ్ ‘ అన్నదనుకోండి. వెంటనే అది మొద్దు ఐనా కాకపోయి ఉండాలి లేదా మొద్దుకు ఈ గుణం కొత్తగా ఐనా వచ్చి ఉండాలి అన్న విషయం తర్కించగలడు. అది తేలకపోతే మనిషి మొద్దు మీద ఆధారపడ్డం అన్నా వదులు కోవాలి లేదా ఆ విషయాన్ని శొధించాలి. ( అంటే ఏ ‘X’ మనిషో ‘Y ‘ మనిషో ఐనా మనకెందుకు అని ప్రొసీడ్ అయి ఉండొచ్చు. ఆ వ్యక్తిగత నడవడిక సామాజిక గతి క్రమాన్ని వివరించదు. పైగా ఈ మార్పు ఒక్క క్షణంలో జరిగింది కాదు ). కాబట్టి జాగర్తగా గమనిస్తే పదార్థం ( అంటే పరిసరాల మొత్తం అని సింపుల్ గా చెప్పొచ్చు ) వలన చైతన్యం కలిగింది. చైతన్యం ఒక రకంగా చూస్తే ఆలోచనల సముదాయము.
పదార్థం ——— > చైతన్యం
పరిసరాలలో ఉన్న వైరుధ్య భావనల వల్ల ( ‘మొద్దు ‘ గురించి వివరించిన ఉదాహరణలో చూసినట్టు ) క్రమ క్రమంగా ఆలోచనల సమూహం పెంపొందుతూ వచ్చింది. చైతన్యం అన్నది ఒక శరీర ధార్మిక మార్పు (Physiological change) దశ నుండి పదార్థం చేత ప్రభావితం చేయబడ్డది. మరింత పరిణతి చెందుతూ వచ్చింది. ఇది జాగర్తగా గమనిస్తే పదార్థం తో జరిగిన ఒక శ్రమ విధానం వలన ఉద్భవించిన విశేషఘటన ( phenomenon) గా చెప్పొచ్చు.
మనిషి ఈ క్రమంలో పదార్థం పట్ల పెంపొందించుకున్న అవగాహన వలన లోహం కనుక్కోగలిగాడు. దాని వలన ఉండే ఉపయోగాలు గుర్తించగలిగాడు. ఇదే క్రమంలో ఒక ఉత్పత్తి విధానం ఒక పంపిణీ విధానం అమలు లోకి వచ్చాయి. అదే క్రమంలో తనతో పాటు జీవించే తోటి మానవులతో పరస్పర సంబంధం మరింత పెంపొందించుకోవాల్సిన అవసరం ఏర్పడింది. అంటే మనిషి ప్రకృతి తో పరస్పర ప్రతిస్పందన క్రమంలో ఎదుగుదల చెంది తన చుట్టూ ఉన్న సమాజంతో కూడా పరస్పర ప్రతిస్పందన ను ఏర్పరుచుకోవడం అవసరం అనే ఒక సందర్భానికి లాగ బడ్డాడు. అంత వరకు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతికి ఒక భాష అవసరం అయ్యింది. మనం ఈ క్రమాన్ని అర్థం చేసుకుంటూ వస్తుంటే భౌతిక ఎదుగుదల కు సమన్వయంగా వచ్చిన మానసిక ఎదుగుదల వలన, ఆ మానసిక ఎదుగుదల ఫలితంగా ఏర్పడిన చైతన్యం వలన మరియు ఉత్పత్తి విధానం లో ఒరవడి పెంపొందడం వలన ఆ క్రమంలో మారుతున్న మానవ సంబంధాల వలన ఒక సంస్కృతి ఏర్పడాల్సిన దిశ అవసరం అని తెలుస్తుంది.
ఇంకా చూద్దాం. సైగలకు పరిమితమైన కమ్యూనికేషన్` పద్దతి క్రమంగా సన్నగిల్లి భాష అవసరం ఏర్పడింది. నాగలి తయారు చేసే దశకు వచ్చే లోపు అనగా సుమారు లోహ పరికరాలు విరివిగా వాడ్డం మొదలు పెట్టడం మొదలు పెట్టాక భాష వచ్చింది అని కొంత మంది చరిత్రకారుల అభిప్రాయం. ఐతే అంతకు ముందో అంతకు తర్వాతనో మొత్తం మీద భాష మారిన సామాజిక లేదా మానవ సంబంధాలకు అనుగుణంగా అవసరం అయ్యింది. ఆ భాష లేకపోతే పెద్ద మొత్తంలో ఉన్న సాంఘిక అవసరాలు తీరలేవు.
ఇంతవరకు గమినించిందేంటి ?
- మనిషి తన భౌతిక అవసరాల కొరకు శ్రమ చేసే క్రమంలో ఎదుగుతున్నప్పుడు మెదడు a అభివృద్ధి అన్నది శారీరక ఎదుగుదల క్రమంలో అవసరం అయ్యింది.ఆ క్రమంలోనే మనిషి జంతువు నుండి వేరు పడ్డాడు.
- మానసిక ఎదుగుదల వలన కలిగిన చైతన్యం వలన ( దీని నిర్వచనం వ్యాసంలో ముందు చూసాము ) పదార్థంతో జరిగే నిరంతర పరస్పర సంబంధం వలన ఉత్పత్తి విధానాని ప్రభావితం చేయగలిగాడు.
- ఉత్పత్తి విధానం పెంపొంది సామర్థ్యము పెరుగుతున్నప్పుడు సైగలకు పరిమితమైన సంభాషణ పద్దతి అనివార్యంగా మారాల్సిన పరిస్థితి సమాజంలో ఏర్పడింది
- తన చైతన్యంతో కొత్తగ ఏర్పడిన ఉత్పత్తి విధానం పంపిణీ విధానానికి అనుగుణంగా మరియు తన సాంఘిక అవసరాలకు అనుసంధానంగా మనిషి సౄష్టించుకున్న సంభాషణా మాధ్యమం భాష.
- పదార్థంతో ఉండే నిరంతర పరస్పర సంబంధం వలన చైతన్యం పెంపొంది ఆలోచన కలుగుతుంది. ఆ చైతన్యం వలననే మనిషి శ్రమ సంబంధాలను మెయింటెయిన్ చేయగలిగాడు. ఇది భాషకు మూలం అయ్యింది.
ప్రకృతి సహజంగా అనుసరించే సహజమైన్ డైయెలిక్టిక్స్ ఉన్నాయి. వాటి ప్రకారమె మనిషి జననం, భాషా జననం జరిగింది. ‘ మనిషికి ఈ పరిణామ క్రమంలో తోక ఎందుకు రాలేదు?’ అని అంటే కోతి ఈ సృష్టిలో ఏర్పడే విధానాన్ని చర్చించినట్టు అవుతుంది తప్ప మనిషి గురించి కాదు. ఇది కేవలం జీవ పరిణామంగా మాత్రమే చూస్తే మనం జీవ శాస్త్రం దగ్గర మాత్రమే ముగిస్తాము. డార్విన్` జీవ పరిణామ సిద్ధాంతం సమాజ చలనాన్ని వివరించదు. అది డార్విన్ తప్పు కాదు. దాన్ని వ్యాఖ్యానించే వాళ్ళది తప్పు. ఆ రకంగా చూస్తే మనకు మన మనుష్య సమాజ పరిణామాన్ని అర్థం చేయించడానికి ఆంత్రోపాలజీ, ఫిలాసఫీ అవసరం లేదన్నమాట. సాంఘిక చలనాన్ని అర్థం చేసుకోడానికి డైయెలిక్టిక్స్ అన్వయించడానికి ఆయా విషయాలకు మాత్రమే సంబంధించిన శాస్త్రాన్ని చూస్తే చాలా పరిమితమైన దృష్టి అవుతుంది. ఆ క్రమంలో మన ముందు ఉన్న ఒక ప్రాథమిక చట్రాన్ని ఉపేక్షించాల్సి వస్తుంది.
ప్రతి పరిణామము కేవలం సహజమే కాదు. ఆ సహజత్వానికి ఒక నియమం ఉంది. ఒక సహజమైన అవసరం ఉంది. లేపొతే జీవం మనుగడనే సాధ్యం కాదు. భాష పుట్టుక ఎంత చారిత్రక, సాంఘిక అవసరమో మనం గమనించాము. అందుకు చైతన్యం ఎలా దోహద పడిందో ఆ చైతన్యం పదార్థం నుండి ఎలా పుట్టిందో చూసాము.భాష పుట్టుక గమనిస్తే లోహ యుగం ప్రారంభమయ్యాకనే మొదలయ్యింది. ఇదేదో కేజువల్ గా జరిగిన విషయం లోహం కనుగొనడం మానవ జీవితంలో ఒక విప్లవం. దీనితో ఉత్పత్తి విధానం విపరీతమైన మార్పులకు గురి అయ్యింది. అందుకనుగుణంగానే ఉత్పత్తి సంబంధాలు మారాయి. మారిన మానవ సంబంధాలకనుగుణంగానే సైగలతో ఉన్న సంభాషణ పద్దతి ప్రతిబంధకమై నిలదొక్కుకోలేక భాష అవసరం వచ్చిపడింది.
ఇప్పుడు ఒక ఉదాహరణ చూద్దాం. తేనె టీగ తన తుట్టెను కట్టుకుంటుంది. దానికుండే ఒక లిమితెద్ చొన్స్చిఔస్నెస్స్ అది. తేనె టీగకు తుట్టె నిర్మించే ముందు తన తుట్టె ఏ రూపంలో ఉంటుందో ఎంత పొడవుంటుందో ఎంత వెడల్పు ఉంటుందో తెలుస్తుందా ?. అదే మానవుడు తనను ప్రకృతినుండి రక్షించుకునే క్రమంలో తన శ్రమ విధానం లో పెరిగిన సామర్థ్యము వలన , పదార్థం పట్ల తనకున్న చైతన్యం వలన తాను కట్టుకునే గుడిసె పొడవు, ఎత్తు, వెడల్పు ఎంత ఉంటుందో కట్టక ముందే చెప్పగలడు.మనిషిలో ఉన్న abstract thinking, logical thinking వలన ( శరీరానికి మెదడుకు ఉన్న సమన్వయంలో భాగంగానే ఆపై మారిన మానవ సంబంధాల ఫలితంగా ఇలా ఏర్పడాల్సిన పరిస్థితి ఉంది అని గమనించాము) ఊహించే లక్షణం మనిషి మెదడుకు అబ్బింది.ఈ ఎదుగుదల ఏ ఒక్క క్షణం లోనో ఏదో ఒక్కరి లోనో ఒక్కసారిగా కలిగినది కాదు అని గమనం లో ఉంచుకోవాలి.
సమాజ పరిణామ క్రమంలో సమాజంలో కొన్ని institutions కూడా ఏర్పడగలిగాయి. పెళ్ళి, కుటుంబము, మతము లాంటి కొత్త institutions ఏర్పడ్డం మొదలయ్యింది . ఐతే మనిషి తనకున్న Abstract thinking, logical thinking వలన కలిగిన పరిజ్ణ్జానాన్ని ఉత్పత్తి , పంపిణీ విధానం ( ఇంకో రకంగా చెప్పాలంటే మొత్తంగా ఉత్పత్తి సంబంధాలు అనవచ్చు) వీటిలో ప్రయోగిస్తూ కొత్తగా ఏర్పడిన institutions లో కూడా ఉపయోగించడం మొదలయ్యింది. మనిషి దేహానికి సింహం తల తగిలించడం , లేదా ఏనుగు తల తగిలించడం జరిగింది. ఐతే క్రమ క్రమంగా మనుష్యుల్లో వర్గాలు ఏర్పడ్డంతో సమాజాన్ని నడిపే పగ్గాలు సమిష్టిగా ఉండడం ఆగిపోయింది. ఇదే పరిజ్ణ్జానన్ని తన కట్టుబాట్లలో చూయించాడు. తన అలవాట్లలో చూయించాడు. తన రుచుల్లో చూయించాడు. తనకవసరమైన భాషలో కూడా చూయించాడు. ఆ విధంగా భాష లో ప్రయోగం జరగడం తార్కిక క్రమం లో జరగాల్సిన ప్రక్రియ అయ్యింది. నిజానికి ఈ పరిస్థితి సుమారు 4000 సంవత్సరాల క్రితం మించి ఉండదని కొంత మంది చరిత్ర కారుల అభిప్రాయం. భాష పరిణామం చెందాల్సిన అవసరం చూస్తే మళ్ళీ మనం పదార్థంతో జరుగుతున్న పరస్పర సంబంధం దగ్గరే ఆగాల్సి వస్తుంది.
ఏర్పడిన వర్గాల దౄష్ట్యా , తెగిపోయిన సమిష్టి సంబంధల దౄష్ట్యా ఏదైనా విషయాన్ని సంఘంలో ఆమోదించే క్రమానికి ఒక ప్రభావశీల భావ వ్యక్తీకరణ (effective expression) అవసరం అయ్యింది. ఇదేదో ఒక్క రోజులో ఏర్పడిన ఆలోచన కాదు. అందుకు ఒక విషయాన్ని హత్తుకునేలా అర్థం చేయించడానికి ఆమోదింపజేయడానికి కళలు, సాహిత్యం అవసరమయ్యాయి. ఇందుకోసం సాధారణ వచనాలు సరిపోలేదు. మారిన ఉత్పత్తి సంబంధాలు, ఏర్పడిన వివిధ వర్గ సంస్కౄతులు, మనిషికి ఉన్న భావావేశ వృద్ధి ( emotional development ) ఒక భిన్న భావ వ్యక్తీకరణ జననానికి అవసరాన్ని, అనుకూలతను సూచించాయి ( భాష మొదలు కాక ముందు మానవుడి భావావేశాలకు సంబంధించిన ఎదుగుదల చాలా ప్రాథమిక స్థాయిలోనే ఉండిందని చెప్పుకోవచ్చు. మనకు రాతి యుగం నాటి అవశేషాలు గమనిస్తే మనిషి వేటాడిన జంతువుల బొమ్మలు లాంటివి కనిపిస్తాయి తప్ప ఎక్కడా మనిషి భావావేశాలు ప్రతిబింబించే అవశేషాలు పెద్ద ప్రాముఖ్యంగా దొరకవు).
అదే విధంగా సమాజంలో ఏర్పడిన వైవిధ్య సాంఘిక స్థాయిలలో సమాజం మీద ఆధిపత్యం గురించి, స్వంత ఆస్తి పరిరక్షణ క్రమంలో సాంఘిక అస్తిత్వాన్ని మరింత గట్టి పరుచుకునే క్రమంలో, భిన్న సంస్కృతుల్లో భాగంగా – భాష వివిధ భిన్న రూపాలను ఏక కాలంలో కొనసాగించాల్సి వచ్చింది కూడా. అంటే భాష సమిష్టి ప్రయోజనాల కోసం ఏర్పడి సమాజ పరిణామ క్రమంలో ఆయా సమాజాల్లో ఏర్పడిన institutions ను బట్టి, వర్గ సమాజాన్ని బట్టి, సంస్కృతి లో కలిగిన చీలికలను బట్టి ( ఈ మూలకాలన్నిటినీ కలిపి పదార్థం అంటారు అని అనుకున్నాము ) మార్పు చెందుతూ వచ్చింది.
ఏం వర్గ సమాజం ఏర్పడకపోయి ఉండి ఉండొచ్చు కదా? అటువంటి వర్గ సమాజం మాత్రం ఎందుకు అవసరమయ్యింది ? అంటే వర్గ సమాజ జననం స్థూలంగా గమనిస్తే నిజానికి మనుష్య సమాజంలో వెనుకబాటు కాదు. అది ఒక రకంగా అభివౄద్ధి. ఒక తెగ ఇంకొక తెగపై దాడి చేసినప్పుడు గెలిచిన తెగ ఓడిపోయిన తెగను పూర్తిగా నిర్మూలించే వారు. ఐతే ఉత్పత్తి విధానంలో మార్పుల వల్ల వారిని చంపడం కంటే అలా ఓడిపోయిన తెగను తమ ఉత్పత్తి విధానంలో భాగం చేసి వారిని దోచుకుంటూ వారికి బానిస స్థాయిని కల్పించిండంలో ఎక్కువ ప్రయోజనం కనిపించింది. అప్పటి బానిస వ్యవస్థ ఏర్పడ కూడదు అనుకుంటే మొత్తం మనుష్య జాతి అంతా అంతరించి పోయేదేమో !
మన సమాజంలో ఐతే వర్ణ వ్యవస్థ ఏర్పడ్డం వలన ఆధిపత్య వర్గాల ప్రయోజనం కొరకు పాలక వర్గాల భాషనే అధికారిక లేదా అదే సామాజిక భాషగా చెలామణీ అయ్యింది.అదే సంస్కృతమై వెలిసింది. Known ruling classes వారి భాషలైన ప్రాగ్ , ద్రవిడ, పాళీ భాషలకు సముచితమైన సాంఘిక స్థాయి కల్పించలేదు. సంస్కృత భాష ప్రాకౄతిక వ్యావహారిక భాషలపై గొడ్డలి పెట్టు అయ్యి ఒక వర్గ ప్రయోజనాలలో భాగమైన మూలకం అయ్యింది. తమ సంస్కృతికి కి superiority ని పులిమే క్రమంలో సంస్కృతానికి దైవత్వం ఆపాదింపబడింది ( ఇక మనిషి అంటూ వాడ్డం మానేద్దాం. ఎందుకంటే సమిష్టి ప్రయోజనాల నుండి వ్యక్తిగత లేద వర్గ పరమైన ప్రయోజనాలు ముందుకొస్తున్నప్పుడు సంస్కృతి కూడా చీలి పోయింది మనుష్యులతో పాటు ).
ఇక సాహిత్యం అంత:పుర గోడలకు పరిమితమై పోయింది. సంస్కృత సాహిత్యం మెజారిటీ ప్రజలనుండి విడివడింది. సంస్కృతం అంటే అదో దైవత్వ రూపం కలిగి ఉండాలి అనో, అదో ఆధ్యాత్మిక చింతన కలిగి ఉన్న వారి సొత్తు అనో, సంస్కృతం మానవాతీత సంస్కృతిలో భాగం అన్నట్టుగానే project అయ్యింది. అధ్యాత్మికత ముసుగులోనూ దైవత్వం ముసుగులోనూ ఇలా ముక్కు మూసుకుని తపస్సు చేస్తే , లేదా ఉపాసన చేస్తే కవిత్వం పుడ్తుంది అన్న భావన కలిపింపజేసే ప్రయత్నాలు జరిగి ఇలాంటి అభ్యాసం తుచ్చ మానవులకందరికీ రాదు అన్న విశ్వాసాన్ని పాలక వర్గాలు కల్పించినట్టు మనకు స్పష్టమౌతుంది.
ఇందుకు అప్పటి బ్రాహ్మణీయ హైందవ మత వ్యవస్థ బాగా తోడ్పడింది. ఆ రకంగా చూస్తే vernacular languages పుట్టుక సామాజిక సాంస్కృతిక పరిణామంలో ప్రజా సంస్కృతి యొక్క విజయంగా చెప్పొచ్చు. భాష, సాహిత్యము, దానితో పాటు కళలు , సంస్కృతులలో సమభావము నశించి పాలక వర్గం వేపు ఒక భాగం, ప్రజల వేపు ఒక భాగం అయ్యి చీలిపోయాయి. సమిష్టి ప్రయోజనాలు అన్న భావన నశించాక సాహిత్యంలో ప్రజలకు సంబంధించి ఎన్నో కుట్రలు జరిగాయి. సాహిత్యం ప్రజలకు సంబంధించిన విషయంగా కాక తమ ఆధిపత్యాన్ని నిర్ణయించే మూలకంగా చేయాలని మన సమాజంలో ఎన్నో ఎత్తుగడలే నడిచాయి. ఇందుకు వర్ణ వ్యవస్థ బాగా తోడ్పడింది.సాహిత్యం ఎలా పుడ్తుందో కవిత్వం ఎలా పుడ్తుందో అనే ఒక విశ్వాసాన్ని, పదార్థాన్ని వదిలేసి బ్రహ్మ పదార్థంగా చిత్రీకరించే ప్రయత్నాలు ముమ్మరంగా జరిగాయని గమనించవచ్చు.
ఐతే భూస్వామ్య వ్యవస్థ కూలుతున్న క్రమంలో పెట్టుబడి దారి ప్రజాస్వామ్యం ముందుకొస్తున్న తరుణంలో మన దేశంలో sanskritisation ప్రభావం దాని వెనక ఉన్న శక్తులు అనివార్యంగానే బలహీనపడ్డాయి. తమ మనుగడను విస్తృతం చేసే ప్రయత్నాలు జరుగుతూనే ఉన్నాయి.
- భాషకే కాదు సంస్కౄతికీ, సాహిత్యానికీ , మూలము పదార్థం . ఆలోచనలు విడిగా ఉండవు. పదార్థంతోనే ముడివడి ఉంటాయి.
- మనిషి సమిష్టి ప్రయోజనాల కోసం భాష ఏర్పడింది.ఎదుగుతున్న ఉత్పత్తి సంబంధాలను మనగె చేయాలంటే భాష అనివార్యం అయ్యింది.
- మనిషికిదెవెలొప్ ఐన abstract thinking, logical thinking సమాజ పరిణామ క్రమంలో ఏర్పడిన institutions లో ఉపయోగించుకోవడం జరిగింది
- సమాజం లో వర్గాలు ఏర్పడ్డంతో భాష, సంస్కౄతి సాధారణ ప్రజానీక సంస్కౄతి, భాషలతో విడివడ్డాయి. ఇందుకు మత, వర్ణ వ్యవస్థలు మన సమాజంలో బాగా తోడ్పడ్డాయి.
- సంస్కృతం సాధారణ ప్రజల భాషను చావు దెబ్బ తీసి తనకో దైవత్వ రూపాన్ని పులుముకుంది. ఇది వర్ణ వ్యవస్థ పుణ్యమే. ఆధిపత్య వర్గాలు తమ ప్రయోజనాలు కాపాడుకునే క్రమంలో జరిగింది.
- సాహిత్యం అన్నది ఏ ఒక్క వ్యక్తిగత పరిణ్గానం వలన పుట్టుకు రాలేదు. మనిషి తన సాంఘిక అవసరాల కోసం చేసిన ఎన్నో ప్రయోగాల్లో భాషపై జరిగిన ప్రయోగం ఒకటి. అందులో భాగం సాహిత్యం.
- భాషకు దైవత్వం ఆపాదించడం సాహిత్యానికి మానవాతీత రూపాన్ని పులమడం సన్స్క్రితిసతిఒన్ అవుతుంది. దీని వలన ఆధిపత్య సంస్కృతి ఏదైతే చలామణిలో ఉందో అది అభివౄధ్ధి చెందడానికి తోడ్పడింది.
సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. మరో సారి అనుకుందాము. సాహిత్యం అన్నది బ్రహ్మ పదార్థం కాదు. ఇది ఏ ఋషి హిమాలయాల్లో ముక్కు మూసుకుని కళ్ళు మూసుకుని పరధ్యాన్నంగా ఉన్నందు వల్ల మాత్రాన పుట్ట లేదు. ఎందుకంటే మనిషి ఆలోచన పదార్థం లేకపోతే లేదు. పదార్థాన్ని వదిలి పెట్టి మనిషి ఆలోచనలు రెక్కలు కట్టుకుని ఎగర లేవు. నీల్స్ బోరు పరమాణు నమూనాను కనుక్కోక పోయి ఉంటే ఇక ప్రపంచంలో ఏ రసాయన మూలకాలు ఉండేవి కావు అన్నది ఎంత తప్పో అలాగే కేవలం వ్యక్తిగత పరిజ్ణ్జానాఇకి, మానవ సమాజ అభివౄద్ధికి ఉపయోగ పడే సాహిత్యానికి లింకు పెట్టడం అంతే తప్పు. ఒకప్పుడు రాజు సింహాసీనుడై మధువు సేవిస్తూ ‘ మేము ఆనంద డోలికల్లో తేలియాడుచున్నాము. ఏది మన రాజ నర్తకి ఊరువుల మీద ఒక బహు సుందరమగు పద్యం వినిపించుము ‘ అన్న ఆదేశంతో సాహిత్యం పుట్టుకొచ్చిన చరిత్ర ఉంది. సాహిత్యం అంతపురానికి పరిమితమై వర్ణ వ్యవస్థ చట్రంలో అగ్ర భాగాన ఉన్న వర్గాల ప్రయోజనాలు వారి విలాసాలు తౄప్తి పరిచే విధంగా ఉపయోగపడింది.
చరిత్ర కారులకు ఉదయ పూర్ రాజుల కోటలో ‘ అనంగరంగం ‘ అనే గ్రంథం లభించింది. అందులో మొదటి చప్తెర్ ‘ లింగ స్థూలీకరణం ‘. ఒక నాడు సాహిత్యమంటే అదే అన్నట్టు శౄంగారం గొప్పదైన నవరసం అని ( శౄంగార రసం అన్నది విశ్రాంతి అధికంగా ఉన్న వర్గాల వారి విలాస కేళికి సంబంధించిన విషయంగానే పరిమితమయ్యింది. దిగువ వర్ణాలు సమాజానికి తమ శ్రమ నందించి సేవ చేసే విషయంలోనే తమ జీవితాన్ని చూసుకున్నారు ) చలామణీ కూడా చేసారు. అందరూ అదో అద్భుత ప్రక్రియ అని అందులో జరిగిన ప్రయోగాలను నోరు తెరుచుకుని చదివి అసలు సాహిత్య ప్రయోజనాన్ని మనకు కాకుండా చేసారు. శ్లోకాలు ఏ చందస్సును పాటించాయి అని తీక్షణంగా పరీక్షించే ముందు మనం శృంగార రసం పేరుతో రాజుల ‘ లింగ స్థూలీకరణ ‘ గురించి ఆందోళన చెందిన కవి సమూహాన్ని, ఆ సాహిత్య కల్పన తీరు తెన్నులను గమనించడం వదిలేస్తే ఇది సాహితీ కౄరత్వం తప్ప ఏమీ కాదు . సాహిత్యం దేవుడి గొప్ప తనాన్ని ఎంతో ఆధ్యాత్మికంగా వర్ణించడానికి ఉపయోగపడ్డది. ఒక మనిషిని పట్టుకుని ‘ నీవు తక్కువ వాడివి పెద్ద పనికొచ్చే లక్షణాలు ఏమీ లేవు ఉత్పత్తి విధానంలో నీ స్థానం ఇదే ‘ అని బోధించడానికి వాడిని బలవంతంగా ఒప్పించడానికి సాహిత్యం ఉపయోగ పడింది.
‘చాతుర్వర్ణం మయా సౄష్ట్యాం గుణ కర్మ విభాగశ తస్య కర్తార మపిమాం వ్ద్యికర్తార మవ్యయం పరిచర్యాత్మకం కర్మ శూద్రస్యాపి స్వభావజం ‘ (క్లుప్తంగా చెప్తే నాలుగు వర్ణాలను నేనే సౄష్టించాను. అందులో శూద్రుని పని మిగతా వర్ణాలకు పరిచర్య చేయడమే ) సాహిత్యం పుట్టుక కొన్ని ప్రయోజనాలను ఆశించి జరిగింది. అది ఖచ్చితంగా ఆధిపత్య వర్గాల ప్రయోజనాలు మాత్రమే దౄష్టిలో పెట్టుకుని జరిగింది అన్న వాస్తవాన్ని ఇక్కడ గమనించగలరు.
ఐతే సంస్కౄత భాష కాల క్రమేణా బ్రాహ్మణీయ వ్యవస్థ తో పాటు బలహీన పడడంతో వ్యావహారిక భాషలో సాహిత్యం కూడా ఏక కాలంలో అభివౄధ్ధి జరగడం జరిగింది. తెలుగులో గురజాడ, గిడుగు రామ్మూర్తి తదితర కవులు తెలుగు సాహిత్యంలో sanskritisation ను కాదని దేశీయ చందస్సులో తెలుగు సాహిత్యాన్ని ప్రజల ముందు ఉంచారు. ఐతే అప్పటికీ ఇప్పటికీ కవిత్వం అన్నా, సాహిత్యం అన్నా ఒక బ్రహ్మ పదార్థం అదో మానవాతీత రూప ప్రమేయం తోనే పుడ్తుంది అని దాన్ని అడపా దడపా ఆధ్యాత్మికతకు లింకు పెట్టి చూడ్డం జరుగుతుంది.
చరిత్రను గమనిస్తే సాహిత్యం ఎప్పుడైనా ఏదో సామాజిక ప్రయోజనం ఆశించకుండా పుట్టదు. పుట్టలేదు. ఐతే పదార్థం ఎప్పుడూ మార్పులకు గురవుతుంది.అందువల్ల చైతన్యం మార్పులకు గురవుతుంది. తద్వారా సాహిత్యం మార్పులకు లోనవుతుంది అన్న ప్రక్రియను అర్థం చేసుకోవచ్చు. అలాగే ఆయా సమాజ ప్రయోజనాలు ఆయా వర్గ సమాజ లక్షణాలు బట్టి వేరు వేరుగా ఉంటాయి. పైన చూసిన శ్లోకం ఎలా పుట్టుకొచ్చింది ? ఇందులో ఎంత గొప్ప సాహిత్యం ఉన్నది అని లొట్టలు వేసుకుని చర్చించే ముందు గమనించాల్సిన ముఖ్యమైన విషయం – ఇది రాజులకు పురోహిత వర్గానికి ప్రజలను విధేయులుగా ఉంచే ప్రయత్నంలో భాగంగా, పాలక వర్గల ప్రయోజనాన్ని ఆశించే సౄష్టించ బడినది. అది మరవ రాదు. ఇక ఎంత గొప్ప ప్రయోగం జరిగినా సాహిత్యంలో ఒరిగిందేమిటి ? రాజ్య ప్రయోజనాల కోసం కవిత్వం రాయాలంటే అప్పుడు కవులు ప్రజల నుండి రారు. అది సాధారణ ప్రజలు భాగస్వామ్యం కాలేని సాహిత్యం అవుతుంది. ప్రయోగం మీద ఉన్న మక్కువ ప్రయోజనం మీద చూయించలేదు కవులు. వారి అజెండా మొత్తం వర్ణ చట్రంలో బిగి వేయబడ్డది.
ఐతే సాంఘిక ప్రయోజనాలు ఆశించి కూడా సాహిత్యంలో ప్రయోగాలు జరిగాయి. సాహిత్య శిల్పాల్లో ప్రయోగాలు జరిగాయి. ఈ విషయాన్ని సింపుల్ గా అర్థం చేసుకోడానికి ఒక ఉదాహరణ చూద్దాం. బాల సాహిత్యం కుచేల కథ, గజేంద్ర మోక్షం , భక్త ప్రహ్లాద లాంటి బ్రాహ్మణీయ సాహిత్యం నుండి విడివడి వ్యావహారిక భాషలోనే ఎదిగే ప్రయత్నం జరుగుతుంది. చిన్న పిల్లలను బుజ్జగించడానికి , పడుకోబెట్టడానికి ఉపయోగపడే సాహిత్యం కావాలి. చిన్న పిల్లలను ప్రజాస్వామికంగా త్రేత్ చేయడానికి బాల సాహిత్యం కావాలి.ఆ ప్రయోజనాలను దౄష్టిలో పెట్టుకుని వచ్చిన అందరికీ తెలిసిన ఒక తెలుగు ఋహ్య్మె చూద్దాము ‘ చిట్టి చిలకమ్మ అమ్మ కొట్టిందా తోట కెళ్ళావా పండు తెచ్చావా గూట్లో పెట్టావా గుటుక్కుమన్నావా ‘ ఇక్కడ దయ చేసి గమనించండి. సాహిత్యం ఎటువంటి రూపాన్ని మలుచుకుంటుందో. కొట్టో తిట్టో పిల్లలను మేనేజ్ చేయాలి అన్న వాదన సన్నబడుతుంది. ఈ చైతన్యంతోటే ‘చిట్టి చిలకమ్మ ‘ పుట్టింది. సాహిత్యానికి ఎటువంటి ప్రయోజనాలు లేవు అన్న హైపో తిసిస్ కు అనంగీకారం తెలిపే మంచి ఉదాహరణ ఇది.
ఆ రకంగా ఇది ఒక మంచి సాహితీ ప్రయోగానికి చిహ్నము. అలాగే ఒక వ్యక్తి భావన, వ్యక్తి ఆలోచన పదార్థం పట్ల ఉన్న అవగాహన ద్వారానే రూపుదిద్దుకుంటుంది. మీకు కవిత్వం రాయాలంటే నది ఒడ్డు కెళ్ళొచ్చు. కవిత్వం రాయాలంటే ఆదివారం చార్మినారు వద్దకు వెళ్ళొచ్చు. మీ ఇంట్లో నెట్ ముందు కూర్చోవచ్చు. పదార్థంతో వల్ల కలిగిన వైరుధ్య భావనల మధ్య జరిగే సంఘర్షణ మనలో అవగాహనను పెంపొందిస్తుంది. ఐతే పదార్థం పట్ల మీ అవగాహన ఎలా పెంపొందుతుందో దాన్ని బట్టే మీ కవిత్వం వస్తుంది. మీ పక్కనే కూర్చున్న వ్యక్తి కి అదే వాతావరణం , పదార్థం పట్ల వేరు అవగాహన కలిగించవచ్చు. ఏది సరి ఐనది ఏది కాదు అన్నది వ్యక్తులు నిర్ణయించే సమస్య కాదు. కాబట్టి వ్యక్తిలో కవిత పుట్టుక గురించి మనం గెన్రలిసె చేయలేము. ఐతే సాంఘిక వ్యవస్థలో సాహిత్యం ఒక భాగమని మరిచి చేసే ఏ ప్రయోగమైనా – ఒకప్పుడు ప్రాచుర్యం లభించిన హేతుబద్దమైన ఆధారం లేని ఎంపిరికల్ అప్ప్రోచ్ లేని ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగంలానే – మిగిలి పోతుంది.
ఉదాహరణకు మీరు ఒక పాత దేవాలయంలో మహా నిశ్శబ్దంలో ధ్యానం చేస్తూ కూర్చున్నారనుకోండి. అప్పుడు మోగిన గంట మీకు Evil dead సినిమా చూసిన అనుభూతిని గుర్తు చేయొచ్చు. మీ ఆఫీసు రిసెప్షనిస్టు నవ్వు లో ఉన్న అనుభూతి గుర్తు రావొచ్చు. లేదా అదో విప్లవ నినాదంగా అనిపించవచ్చు. మీ సాంస్కౄతిక నేపథ్యాన్ని బట్టి మీకు కలిగే భావనలు వేరు. ఐతే అందువల్లనే కవిత్వం పుడుతుంది అని సూత్రీకరించడం అందులోనే ఒక కవితా రూపం జననం దాగుంది అని సైద్ధాంతీకరించడం పూర్తిగా అశాస్త్రీయం. ఒక రకంగా మోసం చేసే ప్రయత్నం కూడా. ఇది మనలో ఉన్న మధ్య తరగతి భయాలను సపోర్ట్ చేస్తుంది తప్ప కవిత్వం పట్ల హేతుబద్దమైన ఆలోచనను పుట్టించలేదు. పైగా అలా ఒక కవితా రూపాన్ని ఊహించి దానికో ఆధ్యాత్మిక రూపాన్ని లేద దైవత్వాన్ని తగిలించడం , సామాన్యులకు సాధ్య మయ్యే విషయం కాదిది అని అన్నట్టు ప్రొజెక్ట్ చేయడం భాషను, సాహిత్యాన్ని సన్స్క్రితిసె చేసే ప్రయత్నం తప్ప ఏమీ కాదు.
అలా ప్రయోగం మేనియాలో పడితే సాహిత్యానికి సమాజానికి వచ్చే ప్రాథమిక ప్రయోజనం ఏమీ లేదు. ఏదో హాబీగా కవిత్వాన్ని చూసుకోడానికి, విశ్రాంతి సమయాన్ని ‘ఖుషీగా’ గడపడానికి, భాష పైన అచదెమిచ్ ఎక్ష్పెరిమెంత్స్ చెయడానికి ఒకరిద్దరు వ్యక్తులు చేసే ప్రయత్నంగా తప్ప ఇక వేరే విధంగా చూడలేము. ఇది ప్రధానంగా ‘ విశ్రాంతి వర్గాల ‘ ఉల్లాస ప్రక్రియ. మనకు చరిత్ర చెప్పిన సత్యం ఏమంటే ఈ ప్రయోగాలు పుట్టిన మరుక్షణం మరణం తేదీలు లెక్కించేలా ఉంటాయి. ‘ ఆయిల్ పుల్లింగ్ ‘ ప్రయోగాలు ఇవి. ” Literature is not merely a form of language gimmick ‘. భాషలో ప్రయోగం గురించి ఆలోచించే ప్రతి ఒక్కరు గుర్తించాల్సిన విషయం.
ప్రయోగం కన్నా ప్రయోజనం ముఖ్యం అని వ్యక్తిగా ఒక్కరు గుండె నిండా నమ్మినా అందులో భాగంగానే ప్రయోగాలు అని అర్థం చేసుకున్నా, ఒకే ఒక్క కవిత రాసినా, ఒకే ఒక్క ప్రయోగం చేసినా ప్రస్తుతానికి అది చాలు. ఆ సమిధ ఆరిపొయేలోపు ఇంకో సమిధ వెలగడం ఖచ్చితం. అదే క్రమంలో వందలు వేలు ‘ చిట్టి చిలకమ్మలూ పుట్టుకొస్తాయి అనడంలో సందేహం లేదు. ఎందుకంటే ‘ విత్తనం మరణించి పంటను వాగ్దానం చేస్తుంది ‘ (శివ సాగర్ ) అన్న నియమం ప్రకృతికే కాదు సాహిత్యానికీ వర్తిస్తుంది.
నరాలు తెంచే
ఇసుక రాళ్ళ వొత్తిళ్ళు మరిచి
కంఠం పెగల నీయని
ప్రాణ కంటక వలయంలో చిక్కుకున్న
నిలయ విద్వాంసులారా !
పడిపోయిన గాయకులారా !
తడి ఆరిన బతుకుల గాథల్లో
నిప్పులు కురిపించే తప్పుడు నియమాలతో
వాస్తవాల కళ్ళు చిదిమే కల్పనా కథకులారా !
కాల గమనంలో
సముద్ర తరంగాలు తలలు వాల్చినా
కవితా హౄదయం సరికొత్త మార్గాలు తొక్కినా
రూపు మాసిన రాజ సౌధాల్ని కీర్తించే
అంత రంగం ఏ మాత్రం మారని
వంది మాగధ నేపథ్య కవనాలు రచించే
ఆత్మ వంచనకొడిగట్టిన కవులారా !
ఆకాశ హర్మ్యాల రాకాసి ముఖాల్ని వదిలి
ఆనంద నిలయ సోపానాలు కూల్చి రండి !!
( చెరబండ రాజు )
Bibliography :
- Social anthropology – S L Doshi, P C Jain
- Social and Cultural Anthropology – Nigel Rapport and Joanna Overling
- Marxist – Leninst Philosophy – T Vlasova
- సాహిత్యంలో వస్తు శిల్పాలు – త్రిపురనేని మధుసూదన రావు
- ౠగ్వేద ఆర్యులు – రాహుల్ సాంకౄత్యయన్
( మరింత చర్చకు లేదా క్లారిటీ కోసం రచయిత మెయిల్ pvvkumar@yahoo.co.uk లేదా ఫేస్ బుక్ ID ” P V Vijay Kumar “ లో కాని కాంటాక్ట్ చేయవచ్చు )
సార్ ‘గూట్లో పెట్టావా…. గుటుక్కు మింగేవా’ అనుకుంటాను.