చీకటిని మింగిన వెలుగు తార

hemantహేమంత్ కుక్రేతి హిందీ ఆచార్యులుగా పనిచేస్తూనే తన కవితా సేద్యంలో ఐదు కవితా సంపుటాలు పండించారు. కవిత విమర్శ పై నాలుగు పుస్తకాలు ప్రచురింపబడ్డాయి. హిందీ సాహిత్య వాస్తవ చరిత్ర అనే పరిశోధనాత్మక గ్రంధాన్ని రచించారు. వీరి కవితలు భారతీయ భాషలతోపాటు విదేశీ భాషల్లోనూ  అనువదింపబడ్డాయి.ఆకాశవాణి,దూరదర్శన్లకు తమ రచనా సేవను అందిస్తున్నారు. సాహిత్య పత్రికలకు సంపాదకత్వ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. యిన్ని రకాలుగా సాహిత్యానికి సేవచేస్తున్న వీరికి పురస్కారాలు వరించవా?! వీరి కవిత్వం మనుషుల్ని నమ్మి వారి చుట్టూ తిరిగే అందాలను వర్ణిస్తుంది, మోసాలను పసికడుతుంది. వీరి కవిత్వం చీకటిని మింగి వెలుగు తారలను కురిపిస్తుంది. జీవితం పట్ల విపరీత ప్రేమ వో వైపూ మరో వైపు నిరశన కూడా లేకపోలేదు. దుఖాలను తుడిచే ప్రయత్నంలో చివరి వరకు పోరాడే కవిత్వం. కవిత్వాన్ని చదవాలని కవిత్వమై బతకాలనే ధృఢమైన సంకల్పం వుంటుంది అతని కవితల్లో. వ్యవస్థల పట్ల విపరీతంగా వ్యంగ్యంగా దుయ్యబట్టిన సంధర్భాలు అనేకం. వర్తమానంలో కవిత్వాన్ని వొక ఆయుధంగా వుపయోగించమనే కవుల్లో అగ్రగణ్యుడు.

మట్టి కవిత
—————-

నీరే మట్టిని రాతిలా మార్చుతుంది
నీటిలో నానితే అది మెత్తబడుతుంది
నిప్పు లోపల నీటిచుక్క వుండునేమో
ఆకాశంలో భూమి జీవితంలా

యెన్నో యుగాల నుంచి సీతాకోక చిలుకలు
తమ శరీరాలపై వొణుకుతున్న రంగుల
మౌనాన్ని మోస్తున్నాయి.
పూలు యెవరి ప్రేమ యాతనలోనో కాలుతుంటాయి
మరెవరిలోనో జ్ఞాపకాలు  మట్టిలా మారిపోతుంటాయి

జీవించడానికి ప్రాణానికి ఆత్మ తోడు కావాలి
శరీరమంతటా అన్నపు వాసనే లేదు
పనికి యే కవచము లేదు
తప్పించుకుని వుండడమంటే గింజలా మారడమూ కాదు
యీ పనికి రాని ప్రపంచంలో వో భారీ లాభం దాగుంది
కొన్ని లాభంలేని వుపాదులు
మిగిలిన వ్యాపారమంతా యిలానే వుంటుంది
తనకు తననే కొనుక్కొని
అమ్ముడుపోవడం నుంచి తప్పించుకోవాలి
దేవుడి గొప్పతనం దైనిక భవిషత్తు
ఫలితం తప్ప మరేం లేదు

ప్రేమించేందుకు అడ్డుపడుతూ కాలయాపన కోసం ప్రేమించలేదు
తన జీవితపు వుప్పును పొందేందుకు
తన మట్టినే పిసికి తన ముఖాన్ని తయారు చేసుకున్నాడు

మబ్బుల్లో  మెరుపులు వుంటాయి
మెరిసే ప్రేమమయ ముఖాలపై యెక్కడో లోతుగా గుచ్చుకున్న
గాయాలు వుంటాయి
వీటిల్లో నుంచి వొకరికొకరం దగ్గరగా సమీపిస్తాం
అంతం మమ్మల్నీ విరిచేసి
నిర్మించుకోమనే సవాలు విసురుతుంది

మట్టికి చావు లేదు
అది కొద్దిగా పెరిగుతుంది

వారి ప్రాణాలు యెవరి వద్ద వుంటాయో

పొదలలో దాక్కొన్న వాడు
ఎలుగుబంటి అయ్యుంటాడు
యెందుకంటే బంగాళాదుంప తినేవాడు
దాని కథతోనే భయపడి పోయాడు
బంగాళాదుంపను పండించేవారే
ఎలుగుబంటిని అదిలించారు

వారు వెచ్చదనం కోసం పాలు తాగేందుకు వెళ్ళారు
పశువులను మేపుకొని తిరిగొచ్చారు
వారి చెమట యెంతలా మండుతూ వుందంటే
బంజరును మండించేసేలా వుంది

నివాసించాలనే సాకుతో పల్లెలను కాల్చేస్తున్నారు
హిమాలయాలను కరిగించేసి సప్తసముద్రాలను దాటించేస్తారు
గంగాతీరంలో మధ్యసీసాల్లో నింపి , అమ్మేస్తారు

యిక కాపాడుకునేందుకు తమ
ప్రాణాలు తప్ప యిక యేమి లేనివారు
యిలాటి వారినే యెందుకు యెంచుకుంటాడో
తాను పండించిన బంగాళాదుంపల ఖరీదుతో భయపడి
అక్కడి పొదల్లో దాక్కొంటాడు

వాడు కథలలో నుంచి బయటకు వచ్చి
వారిని లోపలకు యెందుకు పంపడు

వీరి యిళ్ళను ఆక్రమించుకొన్నాక
పొలాల్లో
అంతరిక్ష నరకాన్ని నిర్మించాలనుకొంటున్నాడు.

*

మీ మాటలు

*