మిరకిల్స్ జరుగుతయ్ భాయ్, నేన్ నమ్ముత: వంశీ
మార్పు రావల్సిందే, అది మన నుంచే మొదలుకావాల్నని వాళ్లిద్దరికి తెలువడం, ఇద్దరు దోస్తుల దోస్తాని మునుపటికన్న ఇంకింత బలంగ అవుడే ఈ కథల నాకు మస్తు నచ్చిన విషయం.కథ అచ్చైనంక అటు రిజర్వేషన్లు లేనోళ్లనుండీ, ఇటు రిజర్వేషన్లు ఉన్నోళ్లనుండీ అచ్చుగుద్దినట్టు ఒక్కేతీరంగ స్పందన వచ్చింది. అందరు ఒక్కటే మాట అన్నరు “వంశీ ఇది నా గురించే రాశినవ్ కదా? మా సమస్య ఏంటిదో చాన క్లియర్ గ, కరెక్ట్ గ రాశినవ్” అని.
మిరకిల్స్ జరుగుతయ్ భాయ్, నేన్ నమ్ముత. :)
కడగొట్టువాళ్ళ కన్నీళ్లు: కృష్ణ జ్యోతి
‘నేను తోలు మల్లయ్య కొడుకుని’ అని చెప్పుకున్న మారయ్య కథ నిజానికి నేను కావాలని రాసింది కాదు. దానికి ఇంత గుర్తింపు వస్తుందని కూడా ఊహించలేదు. It just happened! ఇంట్లో పనులు త్వర త్వరగా ముగించుకుని, బడి సమయానికి గంట ముందు బడికి వెళ్లి, ఖాళీ తరగతి గదిలో కిటికీ పక్కన వేపచెట్టు గాలీ ఆస్వాదిస్తూ, లోపల వున్న ఆలోచనలను ఊరికే అలా కాగితం మీద పెడితే… మారయ్య, షబానా, ఎలిజిబెత్, కొండయ్య, జగ్గయ్య పంతులూ వీళ్ళంతా జ్ఞాపకం వచ్చారు.
మారయ్య సామాజిక చలనానికీ, విచలనానికీ ‘సర్వధీ సాక్షీభూతం’. షబానా ‘పెళ్లి’అనే సామాన్యమైన భౌతిక, మానసిక, శారీరిక అవసరానికి కూడా నోచుకోని అనేక మంది నిర్భాగ్య స్త్రీలకు ప్రతినిధి. ఎలిజెబెత్, పెళ్ళిలో హింసను నిత్యమూ అనుభవిస్తూ, దాన్నుండీ బైట పడే పరిస్థితి లేని అనేకమంది వివాహిత స్త్రీలకు ప్రతి రూపం. కడగొట్టువాళ్ళల్లోకి కడగొట్టుది ఆడదే! ఇది నిజం. బజార్లో నిలబడి, వర్గ పరంగా తనతో వేరైనా వారిపై ఆవేశంగా విరుచుకు పడిపోతూ, సర్వ జన సమానత్వం అంటూ ఉపన్యాసాలు దంచి, ఇంటికెళ్ళి ఇల్లాలిని కాలితో తన్ని మరీ అదుపులో ఉంచుకునే ‘పోరాట యోధుల్ని’నేను కళ్ళతో చూశాను! ఇక జగ్గయ్య పంతులు, స్థాయి పరంగా మెరుగైన స్థానంలో వున్నట్టు కనబడతాడు. కానీ నిజానికి లోపల వున్న దరిద్రాన్ని లోకం కళ్ళని పడకుండా నీలం గళ్ళ చొక్కా లోపల దాచేసి గుట్టుగా బతికేసే కోట్లాది మధ్య తరగతి ప్రజల్లో అతను ఒకడు. వర్గ పరంగా చెడ్డ మనుషులుండరు. మంచి మనుషులూ వుండరు. వ్యవస్థలో వున్న లోపాలు మనుషుల్ని వేరు వేరు అవధుల మధ్య కట్టి పడేసి పీడిస్తాయి. అంతే. మరి ఈ వేదనకు అంతం ఎలా?! బహుశా ఆర్ధిక అంతరాలను తొలగిస్తే మిగిలిన సమస్యలు చాలా వరకూ సర్దుకుంటాయేమో?! చెప్పినంత సులువు కాదు అమలు. కానీ ఒక ఆలోచన చేయడమైతే తప్పు కాదు కదా!
కన్నదే విన్నదే ఈ కథ: శాంతి ప్రబోధ
‘నిప్పులనడకలోంచి కళ్యాణి ‘ కథ నిజానికి కథ కాదు యదార్ధ జీవన దృశ్యం. వికృతమైన మనుషుల మధ్యలోంచి బయటపడిన ఓ బాలిక జీవితం. బంగారు భవిష్యత్ కోసం కలలు కనే ఆ బాలిక చెప్పిన విషయాలు నన్నెంతో కదిలించాయి. నా హృదయంలో తిష్టవేసి యాతనపెట్టాయి. విన్న నాకే ఇలా ఉంటే అనుభవించిన ఆమె పరిస్థితి ఎలా ఉంటుందో .. ?! ఆ నీలినీడలనుండి బయటపడడం ఎంత కష్టమో కదా .. ఇలాంటి
వ్యధ మరే చిన్నారికీ ఎదురుకాకూడదు అనిపించేది. కన్నతల్లి కూడా ఇలా ప్రవర్తించగలదా అన్న అనుమానం వేసేది . కన్నతల్లి కాదనుకున్న బిడ్డ జీవితం, కన్నతల్లే కాసులకోసమో .. మరెందుకోసమో కసాయిలకు అమ్మేసిన వైనం మనసులో మెలిపెడుతూనే ఉండేది. కాలం గడుస్తున్నా అది మరుపుకు రావడం లేదు.
అమ్మాయిల అమ్మకం లేదా వేరే ప్రాంతానికి తరలించడం కొత్తగా జరుగుతున్నదేమీ కాదు. కానీ , అలా ట్రాఫికింగ్ కి గురయిన తల్లిదండ్రుల బాధ ఎలా ఉంటుందో అనుభవమే. అలాంటిది కన్నతల్లి బిడ్డని నరకకూపాల్లాంటి చోటుల్లో అమ్మేసేంతటి పరిస్థితులు ఏముంటాయో.. అనేకానేక ప్రశ్నలు వెంటాడుతుండేవి. అప్పటికే పిల్లల్ని ముఖ్యంగా ఆడపిల్లలకి ఎలా ఎరవేసి తరలిస్తారో తెలుసు. ట్రాఫికింగ్ కి బలైన వారి గాథలు కొన్ని ప్రత్యక్షంగా విని వున్నాను. అప్పుడెప్పుడూ లేని కదలిక ఓ పదిపదకొండేళ్ల బాలిక చెప్పిన విషయాలు విన్న తర్వాత నాలో కలిగింది. భరించలేని యాతన నుండి బయటపడడం కోసం అక్షరీకరించడం జరిగింది. అదే నిప్పుల నడకలోంచి కల్యాణిగా ఇప్పుడు మీ ముందుకు వచ్చింది.
నా ఈ కథలో ముఖ్యపాత్రధారి “కళ్యాణి” ఒక పాత్ర కాదు. ఒకమ్మాయి జీవితమని ముందే చెప్పాను కదా ..నాలో కలిగిన భావ సంఘర్షణ నుండి నేను బయట పడతాను కానీ ఆమెను వెంటాడి వేటాడే గతాన్ని గుర్తుచేయడం నాకిష్టం లేదు. ఆమె జీవితానుభవాలు ఒక కథగా వచ్చాయని తెలిస్తే ఎలా ఫీలవుతుందో తెలియదు. కానీ ఆమె భవిష్యత్తు దృష్ట్యా చెప్పడం సముచితం కాదని నేనయితే ఆమెకీ విషయం చెప్పదలుచుకోలేదు.
ఇది నేను రాసిన కథ అయినా చదువుతుంటే నా కళ్ళు చెమరుస్తూ తనరూపం కళ్ళముందు నిలుస్తుంది. ఈ కథ కళ్యాణి జీవితంలాంటి జీవితంలోంచి, దుర్భర పరిస్థితుల్లోంచి నేర్పరితనంతో బయటపడి భవిష్యత్ కి బాటలు వేసుకుంటున్న కళ్యాణి లకి ఈ కథ అంకితం.
ఈ కథ … 80% పచ్చి నిజం: వనజ తాతినేని
ప్రాతినిధ్య కోసం నా కథ ఎంపిక కావడం ఇది రెండొసారి . ఆ స్థాయికి తగ్గ కథ వ్రాసినందుకు సంతోషంగా ఉంది.ప్రాతినిధ్య వారికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను . ఇక ఈ “మర్మమేమి” కథా నేపధ్యం ఏమిటంటే ..
ఒక ఔట్లెట్ దొరికింది: పింగళి చైతన్య
ఇది ప్రచురణ పొందిన నా మొదటి కథ. 2015, ఆగస్ట్ నెలలో సారంగ పత్రికలో అచ్చు అయింది. ‘చిట్టగాంగ్ విప్లవ వనితలు’ రాసిన తర్వాత మూడేళ్ళ వరకు నేనేం రాయలేదు. తెల్సిన వాళ్ళు ‘ఈ మధ్య ఏం రాసావ్?’ అని అడిగేవారు. నెత్తికి నూనె రాయటమే బద్ధకం, నేనేం రాస్తాను అని చెప్పలేక ఊరుకునేదాన్ని. వి. ఎం. ఆర్. జి. సురేష్ అనే జర్నలిస్ట్ మిత్రుడు, ఎప్పుడు కల్సినా సరే, ‘కథలు రాయి చైతన్యా’ అని సలహా ఇచ్చేవారు. పైగా ‘కథలు రాయటం తేలిక’ అని కూడా చెప్పారు! ‘ఎంకరేజ్ చేయటానికి వంద చెప్తామ్’ అని అతను ఇప్పుడు నవ్వేస్తారు. కానీ నేను అప్పటికి తెలియక, నమ్మాను. అలా.. ‘కథ రాయటం’ అనే పురుగు బుర్రలోకి వచ్చింది. అదే టైమ్ లో కుప్పిలి పద్మ గారి కథ ఒకటి నచ్చి, ఆమెకి ఫేస్బుక్ లో మెసేజ్ ఇస్తే, ‘మీరెప్పుడు రాస్తారు’ అని అడిగారు. అసలే ఇష్టమైన రైటర్. మాటవరసకి అడిగారు కావొచ్చు కానీ.. నేను మాత్రం… అప్పుడే కూర్చొని ఒక కథ రాసేశాను.
నాకు మొదట మెదిలింది మా అమ్మ. ఆమె విడో. సింగల్ ఉమెన్ పట్ల మన సమాజం చాలా దుర్మార్గంగా ప్రవర్తిస్తుంది. అమ్మ వల్ల సింగల్ ఉమెన్ సమస్యలు బాగా అర్ధం అయ్యాయ్. అయితే, విడో పట్ల సమాజం కొంత దయ చూపిస్తుందేమో కానీ.. విడాకులు తీసుకున్నా, పెళ్లి చేసుకోకూడదు అని నిర్ణయం తీసుకున్నా సరే… ఆ స్త్రీలని వాళ్ళ ఇష్టానికి వదిలేసేపాటి జాలి చూపించదు మన సమాజం. ‘పెళ్లి ఎందుకు చేసుకోలేదు? అని అడిగేవాళ్ళని, పెళ్లి ఎందుకు చేసుకున్నావ్? అని అడిగితే ఎలా ఉంటదా?’ అని ఎప్పటి నుండో నా మనసులో అనిపించేది. దాన్నే పాయింట్ గా తీస్కోని, కథ రాశాను.
స్వాతి వడ్లమూడి అనే ఫేస్బుక్ ఫ్రెండ్ కి కథ పంపా. ఆమె బుర్ర నేను, నా బుర్ర ఆమె తిన్నాక.. ఫేస్బుక్ లో చాలా సార్లు కనిపించిన ‘సారంగ’ పత్రిక ఓపెన్ చేసి.. మెయిల్ ఐ.డి తీస్కోని, అప్పటికప్పుడే పంపించేశాను. అక్షరదోషాలు సరి చేస్కోటానికి వెనక్కి తిరిగి చదవాలన్నా సరే, డిలీట్ చేస్తా అని భయం వేసింది. పంపేశాను. తెల్లారికే నాకు, అఫ్సర్ గారి దగ్గర నుండి మెయిల్ వచ్చింది. ‘అను లో కాదు, యూనీకోడ్ లో పంపండి, మీ గురించి కూడా రాసి పంపండి’ అన్నారు. నాకు ఒక్కటే తెల్సు. ఆ ముక్కే చెప్పాను. అప్పటికి ఈ కథ పేరు ‘తనదే ఆ ఆకాశం’ కాదు. ఏదో పాత, ముతక పేరు. ఇప్పుడు ఆ పేరు చెప్పి, నా పరువు నేనే తీస్కోటం ఇష్టం లేక.. చెప్పట్లేదు. ఆ పేరు తీసేసి, అఫ్సర్ గారే ‘తనదే ఆ ఆకాశం’ అని పెట్టి, యూనికోడ్ లో టైప్ చేయించి ప్రింట్ చేశారు. ‘సారీ సర్, మీకు ఇబ్బంది పెడుతున్నా ’ అని మెయిల్ చేస్తే, ‘కొత్త రచయిత ని చూసినప్పుడల్లా ఒక ఉత్సాహం వస్తుంది; ఇబ్బంది, కష్టం తెలీవ్’ అని కూడా అన్నారు. ఈ కథ ప్రింట్ అయిన ఉత్సాహం లో కొన్ని కథలు రాశాను.
ఏం చేయలేక, ఏం చేయాలో తెలీక, పరిష్కారం అర్ధం కాక.. బాధ పెట్టే విషయాలని, కథలుగా రాస్తున్నా. సాహిత్యం లో వాటి విలువ, స్థానం నాకు తెలీదు. కానీ, ‘కథ’ల ద్వారా నాకో ఔట్లెట్ దొరికింది. అది చాలు.
ఇప్పుడు ‘ప్రాతినిధ్య’ సంకలనం లో ఈ కథ వస్తోంది. ఆ పేరే ప్రేత్యేకం. రకరకాల గొంతులకి, వాదన లకి ప్రాతినిధ్యం వహిస్తున్న చోట.. నా కథ కూడా రావటం.. సంతోషంగా ఉంది. వి.ఎం.ఆర్. జి. సురేష్ గారిలాగా.. నన్ను ఎంకరేజ్ చేయటానికే వేసారేమో అని అనుమానం ఉన్నా సరే, ‘కల్పన’ లాంటి గొప్ప కథ రాసిన సామాన్యకి ఈ కథ నచ్చటం.. కంట్రోల్ చేస్కోలేని సంతోషాన్ని ఇస్తోంది. మొదట అచ్చు వేసిన పత్రికలో.. నా మొదటి కథ.. సంకలనంలో అచ్చు అయిన మొదటి కథ గురించి రాస్తుంటే.. చాలా ఉత్సహం గా ఉంది. ‘ఇక చాల్లే, ఇప్పటీకే జనాలకి బోర్ కొట్టించి ఉంటావ్’ అనిపిస్తోంది కాబట్టి, ఇక్కడితో ఆపుతున్నాను.
మొదటి నాన్ పొలిటికల్ స్టొరీనేమో:వోల్గా
ఒకానొక మీరా కథ: సింధు మాధురి
రాసేసిన కథ గురించి, చనిపోయిన బిడ్డ గురించి ఎక్కువగా తలుచుకోకూడదు అంటాడు మా సోదరుడు జితేంద్ర బాబు. ఎప్పుడు చెప్పినా ఒకటే, నా కథలు నాకు ఎదురైన, నా చుట్టూ ఉన్న మనుష్యులే. అందులో నేను కూడా పాత్రనే. ఎప్పటికీ, ఇష్టమైనా, కష్టమైనా , తేల్చలేని, విసుగు కలిగించనిది స్త్రీల జీవితాలు, వారి అనుభవాలు. ఈ ప్రపంచమంతా హింసే. రూపాలు మార్చుకుంటుంది. ఆ వేదనకు క్రుంగిపోయేది ఆడవాళ్లే. మనుష్యుల వలసలు, నదులు, మట్టి అంటే నివాసం వీటి పైన వివాదాలు ఎప్పటికీ తేలవు, తెమలవు. ఏ స్త్రీ అయినా తన జీవిత కాలపు వివిధ దశల్లో కనీసం ఏదో ఒక దశ లో ఎక్కడో ఒక చోట ప్రశాంతం గా తన కోసం తానుగా బ్రతికే పరిస్థితి ఉండాలని కోరుకోవటం అత్యాశే. రూపం, ధనం, శృంగారం కాకుండా మానవత్వంతో తన ది కాని మతం, దేశం, గాలి, నీరు, భూమి లో మమేకమవటం, అదీ మనుష్యలు, వ్యవస్థలు చేసే గాయాలని , గుచ్చే రక్కిస ముళ్ళని, ఆంక్షల కంచెలని వీటన్నింటిని తట్టుకుంటా, పిట్టలు, చెట్లు, రాళ్ళు , రప్పలు, తుంగభద్ర గలగలలు, తుపాకీ చెలగాట మాడే అమ్మాయితో స్నేహం. కోతుల్ని పెంచుతూ సాధారణం గా కనిపించుతూ, అసాధారణమైన జీవితాన్ని గడుపుతున్న వృద్ధురాలు మీరా. తను, నేను వేరు కాదు. ఆమాట కొస్తే స్త్రీలంతా ఒకటే రూపం. బాధలే వివిధ రూపాలుగా విడిపోతాయి. ఎప్పటికీ, ఎక్కడా తుపాకీ శబ్దం వినిపించొద్దు. పెద్ద ఎత్తున మ్రోగే స్త్రీల రోదనా సంగీతానికి బాణీలు కట్టొద్దు. వాళ్ళ శరీర అవయవాలతో నిత్యం కట్టే బాణీల కూర్పే ఈ మీరా.
పతనమైపోతున్న వ్యక్తి ప్రతిబింబం: వెంకట కృష్ణ
ఉబ్బినకన్ను కథ,మూడు దృశ్యాల్లో ఒక స్త్రీ జీవితం అర్థవంతంగా వుండాల్సింది ఎంత అనర్థవంతంగా,విధ్వంసంగా మారుతుందో చెప్పే ప్రయత్నం చేశాను. మూడు సార్లు చంద్రకళ ముఖం లో ఉబ్బినకన్ను చూసిన నేపథ్యంలో ఆమె జీవితం దుఖమయంగా మారటాన్ని చూస్తాం. . వ్యక్తి గా వున్నతమైన అభిరుచులతో విలువలతో విజ్ఞానవంతగా,సెక్యులర్ గా జీవించాలన్న ఆమె కలలు కథలో విఫలం అవుతాయి.యూనివర్సిటీ లో కులరాజకీయాలు ఆమె ప్రతిభను గుర్తించవు,వెనుకబడిన కులమవడంతో ఎదిగిన ఆమె అభిరుచి కి కుటుంబం ఆసరా యివ్వలేదు,నమ్మిన స్నేహితుల అండ దొరకదు.వ్యక్తి గా తనలో పోరాటతత్వం లేదు. వీటివల్ల ఆమె ఏకాంతం లోకి జారిపోవడం మాసికిస్టిక్ మారిపోవడం జరుగుతుంది .ఎంత ఆధునిక విద్య లు నేర్చినా,పోరాటం లోపిస్తే,సాంప్రదాయ వ్యవస్థలైన కుటుంబం, పెళ్ళి లొంగదీస్తాయనీ వాటిని జయించకుంటే పతనం చేస్తాయనీ చంద్ర కళ విషాదజీవిత చిత్రణ ద్వారాె కథ చె పుతుంది. కథలో చంద్రకళ పోరాటం లేదు. కేవలం పతనమైపోతున్న వ్యక్తి జీవితమే చిత్రింపబడింది.పాఠకులని పాత్ర విషాద జీవితం ఆలోచింపజేస్తుంది కథకుడిగా నమ్ముతున్నాను.
పుస్తకాన్ని పరిచయం చేసిన పద్ధతి చాల బావుంది. రచయిత్రు(ల)లకి అభినందనలు.
ఇంతమంచి వేదికనిచ్చిన సంపాదకులకు కృతజ్ఞతలు :)
సారంగ సారథులకు వందనాలు.
మంచిపని చేస్తున్న మంచి వారికి నమస్కారాలు.
— గుత్తా హరిసర్వోత్తమ నాయుడు,
ప్రధానకార్యదర్శి,
అనంతపురం జిల్లా రచయితల సంఘం,
ఆంధ్రప్రదేశ్ , ఇండియా
ఇవన్నీ ఇక్కడ చదువుతుంటే ఎంత బాగుందో!…
నమస్కారం …. సారంగకి నేను అభిమానిని. మంచి కథల సమాహారంతో ముతాబై వచే సారంగ అంటే ఎంతో అభిమానం ఏర్పడింది.ఆ నడుమ పసునూరి రవిందరన్న కాకి పడగలు గురించి రాసిన వివరణ చాలా బాగుంది. అఫ్సర్ గారికి సలామ్ !