ఆ వూరు, ఆకాలం గుర్తొస్తే ఏడుపే!

   katya3

           ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక పక్షాన ముప్ఫయి మంది రచయిత్రులం  12-9-2016 నాడు పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాలలో పర్యటించాం.కొత్తదేవరగొండి,కొత్త రామయ్య పేట మొదలైన పునరావాస గ్రామాలలోనూ, వాడపల్లి ,కొత్తూరు మొదలైన ముంపు గ్రామాలలోను  తిరిగి భిన్న ప్రజా సమూహాలను  కలిసి మాట్లాడాము.వారి ఇళ్ళు జీవించే పరిసరాలు, జీవన స్థితిగతులు పరిశీలించాం. రెండు భిన్నవాతావరణాలలోని ఏక రూప విషాదాన్ని అనుభవించి వచ్చాం.

              మేము ముందు చూసినవి  పునరావాస గ్రామాలు. అవి పోలవరం మండల కేంద్రానికి సమీపంలో రోడ్డు పక్కన గ్రామాలు.కొన్ని ఊళ్ళు నాలుగేళ్ల క్రితం ,మరికొన్ని రెండేళ్లక్రితం పొందించినవి. పచ్చదనమే లేని ఎడారిని తలపించే మట్టి దారులలో రెండేసి గదుల సిమెంటు ఇళ్ళు. ఒక ఇంటికి అయిదేసి సెంట్ల భూమి.కొన్నిఇళ్ళు  మూడున్నర సెంట్ల భూమిలో కట్టి ఒకటిన్నర సెంట్ల భూమి వేరే చోట ఇయ్యటం వల్ల అది ఉపయోగంలోకి రానే లేదు.కూలివేతనం కిందనో ,మరే రూపంలోనో వచ్చిన నష్ట పరిహారం ఆ రెండు గదుల ప్రాధమిక నిర్మాణాన్ని వరండాలు దించి పూర్తి చేసుకొనడానికి వ్యయం చేసిన వాళ్ళే చాలామంది.

         గోడలు లేచి ప్రభత్వం కేటాయించిన  నిధులు ఇయ్యకపోవటం వల్ల పూర్తికాని  బాత్ రూములు కొన్నిచోట్ల.దొడ్లకు,స్నానాలకు మరుగు లేక ఆడవాళ్లు పడే ఇక్కట్లు.చుట్టూ నేల మట్టిపోసి చదును చెయ్యక పోవటంవల్ల,డ్రైనేజి చెయ్యక పోవటం వల్ల మురుగు కాలువలమధ్య ముసిరే దోమల మధ్య దుర్భరమైన జీవితం అక్కడి ప్రజలది.శుభ్రమైన గాలికి,పచ్చని పర్యావరణానికి పరాయీకరింప బడిన  వాళ్ళు. ఈ కొత్త ఇళ్ళ మధ్య పశువులను కట్టేసుకొనే చోటు ,వీలు లేక ఉన్నఆవులను అమ్ముకొని పాడికి దూరమైన వాళ్ళు. కొండమొదలు నుండి ఏరుకొచ్చుకొనే కట్టెపుల్లలు లేవు.అడవి నుండి  సేకరించుకుని వచ్చే కుంకుళ్ళు లేవు.జామ,సీతాఫలం వంటి  పండ్లు లేవు. ఇంట్లో పండించుకునే కూరలు లేవు. ఆర్ధికంగా స్వయం సంపూర్ణమైన గొప్ప జీవితం కోల్పోయి అన్నిటినీ డబ్బు పెట్టి కొనుక్కోవలసిన స్థితికి నెట్టబడ్డారు.   

         పొలానికి పొలం ఇచ్చారు కానీ అన్ని వూళ్ళల్లోనూ అవి ఇళ్ళు కట్టించి ఇచ్చిన చోటికి పది పదిహేను కిలోమీటర్లకు తక్కువ దూరంలో లేవు. అవికూడా చాలావరకు బంజరు భూములే . వర్షాధారపు వ్యవసాయమే చెయ్యాలి. ఈ పరిస్థితులలో ఆడవాళ్లు వ్యవసాయానికి  దూరమయ్యారు.మగవాళ్ళు కూడా  చాలా మంది భూమిని  కౌలుకు ఇచ్చి  కూలిపనులకు  పోతున్నారు. ట్రాక్టర్ లేని వ్యవసాయం ఇప్పుడు సాధ్యం కాదని వాళ్ళు అంటున్నారు. గోదావరి నుండి దూరం తరిమివేయబడిన వాడోళ్లు (జాలరులు)జీవికకు దూరమయ్యారు. పదిపదిహేను కిలోమీటర్లు పోతేగానీ గోదావరి దొరకదు చేపలు పట్టటానికి. సైకిళ్ళమీదనో ఆటోలు పట్టుకొనో మగవాళ్ళు ఆ పనికి పోతున్నారు కానీ ఆడవాళ్లు ఏమి చెయ్యాలో దిక్కు తోచని స్థితిలో ఉన్నారు. మొత్తం మీద స్త్రీలు ఉత్పత్తి క్రమం నుండి వేరు చేయబడ్డారు. వైవిధ్య భరిత మైన జీవికను కోల్పోయి విసుగులోకి ,విచారంలోకి ,దుఃఖం లోకి జారిపోతున్నారు.

           పశ్చిమ గోదావరి జిల్లాలో  పోలవరం ముంపు గ్రామాలు 29 కాగా ఇప్పటికి లేపేసిన ఊళ్ళు ఏడు. చేగొండిపల్లి ,సింగినపల్లి ,పైడిపాక ,దేవరగొండి,రామయ్యపేట ,తోటగొండి,మామిడి గొండి.ఈ క్రమంలో మండల రెవిన్యూ ఆఫసర్లు వూళ్ళల్లోనే తిష్ఠ వేసి  రోజుకు రెండు మూడుసార్లయినా ప్రతి ఇంటికీ వెళ్తూ  బుజ్జగించో బెదిరించో ,ఆశపెట్టొ, వాళ్ళను తమతమ నెలవులు వదిలి వెళ్లేందుకు ఒప్పించారు.బాధితుల మాటల్లోనే చెప్పాలంటే ‘లేపేసే వరకు వెంట పడ్డారు.’పొండి పొండి అని తోలేసారు’.వండుకున్నగిన్నెలతో,తినటానికి అన్నం పెట్టుకున్న కంచాలతో సహా లారీలలోకి ,ట్రాక్టర్లలోకి ఎక్కి వెంటనే ఇల్లు వదిలి పోవాలని వత్తిడి చేశారు.ప్రొక్లెయిన్లు తెచ్చి ముందు పెట్టి ఇల్లు కూలగొడుతున్నాం ఖాళీ చేయండని ఖంగారు పెట్టారు. పూర్తికాని ఇళ్లల్లో ,పూర్తిగా చేతికందని పరిహారాలతో కొత్తజీవితం వాళ్లకు  అనివార్యం చేశారు.

        నష్ట  పరిహార పాకేజిలో 18 ఏళ్ళు నిండిన ఆడపిల్లకు ఐదులక్షల ఎనభైవేలు ఇస్తుండగా 18 ఏళ్ళ వయసు తో నిమిత్తం లేకుండా ఆడపిల్లలందరికీ ఆ పరిహారాన్ని వర్తింప చేయాలన్నది  ప్రజల కోరిక.  అందులో సగమైనా ఇప్పిస్తామని నమ్మించి పబ్బం గడుపుకున్న అధికారులు ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదు. ఇదేమిటని అడిగితే ఏవో చెప్తాము ,చెప్పినవన్నీ చెయ్యటం అవుతుందా అని దాటవేస్తున్నారు.ప్రభుత్వ ఆఫీసుల చుట్టూ తిరుగుతూ యాష్ట పడుతున్న జనం ‘ఓట్లకు కావాలె మేము ,ఓట్లకు ముందూ అక్కరలేదు,తరువాత అక్కరలేదు’ అని పార్లమెంటరీ వ్యవస్థపై తమ ధర్మాగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు.పౌరులుగా ఒక గౌరవకరమైన గుర్తింపు లేక ,తమ సమస్యలు తాము ఎన్నుకున్న ప్రభుత్వానికే పట్టనివి అయి  కొత్త పరిసరాలలో,కొత్త పనుల వెతుకులాటలో తడుముకొంటూ తండ్లాడుతున్న పోలవరం ప్రాజెక్టు బాధిత ప్రజల విషాద  జీవన ముఖ చిత్రం మమ్మల్ని వెంటాడుతూనే ఉంది.

katya2

          పునరావాస గ్రామాల నుండి ముంపు గ్రామాల వైపు చేసిన ప్రయాణంలో దారిపొడుగునా ప్రొక్లైన్లతో కూల్చ బడ్డ ఇళ్ల ఆనవాళ్లు కూడా కానరాకుండా ఊళ్లకు ఊళ్ళుఎత్తైన   రాళ్ళ గుట్టల కింద కప్పివేయబడిన దృశ్యాలు గుండె బరువెక్కించాయి.   ఊళ్ళు ఖాళీ చేయిస్తున్నప్పటి ఆందోళన గురించి ,ప్రస్తుత పరిస్థితి గురించి చెప్తూ కొత్త రామయ్య పేటలో ఒక మహిళ “మమ్మల్ని కూడా కప్పెట్టేత్తారేమో అనిపించింది.ఆవూరు ,ఆ కాలం గుర్తొస్తే ఏడుపు తప్ప ఏమీ లేదు.” అని చెప్పిన మాటల లోని విషాద వాస్తవం కళ్ళకు కట్టినట్టయింది.    

       ముంపు గ్రామాల్లో వాడపల్లి – చలి నుండి ,చిరుజల్లుల నుండి ఒకింత కాపు కోసం హరితారణ్యాన్నిశాలువలా  కప్పుకుని గంభీరంగా ఉన్నతంగా నిల్చున్న కొండ గోడల మధ్య, నిండుగా ప్రవహించే గోదావరి ఒడ్డున ఉన్నవూరు.ఆ వూళ్ళో  ఇళ్ళు  రకరకాల రంగు రంగుల పూల తీగలు పాకిన దడులతో , కూరగాయ పాదులతో కళకళలాడుతున్న పెరళ్ళతో ,అటూ ఇటూ సందడిగా తిరిగే కోళ్లతో పర్ణశాలల వలె ప్రశాంతంగానే ఉన్నాయి .కానీ   ఆ ఇళ్లల్లో  మనుషుల ముఖాలు మాత్రం  దిగులు మబ్బులు కమ్మిన నిర్వేదపు నవ్వులను పూస్తున్న విషయం మా దృష్టిని దాటి పోలేదు.ఈ రోజో రేపో ఊళ్ళు వదిలి పోక తప్పదని వాళ్లకు తెలుసు. బలవంతపు ప్రయాణాలకు ఐచ్ఛికంగా సిద్ధమవుతున్నదుస్థితి వాళ్ళది. తమ ఇళ్ళు  ,జీవికకు ఎన్నో వనరులు ఉదారంగా పంచిపెడుతున్నకొండలు,అడవులు వాటితో వున్నతరతరాల అనుబంధాలు,జ్ఞాపకాలు,సంతోషాలు,సంబరాలు-అన్నిటికీ మూలమైన,అన్నిటికన్నావిలువైన  స్వేచ్ఛ సమాధి కాబోతున్నాయి అని తెలిసి రోజులు లెక్కపెట్టుకుంటూ నిస్సహాయంగా కాలాన్ని ఈడుస్తున్న జనం వాళ్ళు.

                  

ఈ పర్యటనలో మేము గుర్తించిన అంశాలు ;

  • పోలవరం ప్రాజెక్టు వస్తుందని పాతిక ముప్ఫయి ఏళ్లుగా అక్కడి ప్రజలు ఆ నోటా ఈ నోటా వింటూనే ఉన్నారు.అది తమ బతుకులలో  తెచ్చే ఉపద్రవం గురించి   చూచాయగానైనా  వాళ్లకు తెలుసు.ఒక సందిగ్ధ సందర్భంలో జీవించారు వాళ్ళు.
  • 2004 లో రాజశేఖర రెడ్డి ఆంధ్రప్రదేశ్  ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు  కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో  జల యజ్ఞంలో భాగంగా మొదలైన పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణపు పనులను   ఇప్పుడు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నాయకత్వంలో   తెలుగుదేశ ప్రభుత్వం  కొనసాగిస్తున్నది.నష్ట పరిహార పాకేజీలు ఒక్కొక్క ప్రభుత్వ హయాం లో ఒకరకంగా మారుతున్నాయి. అవి ప్రజలలో అసంతృప్తికి కారణమవుతూ పరస్పర అవిశ్వాసాలకు దారితీస్తున్నాయి.
  • నష్ట పరిహారాల నిర్ధారణలో ఆశ్రిత పక్షపాతం ,అవినీతి ప్రధానంగా పని చేశాయి. అందువల్ల నష్టపరిహారం అందరికీ సమానంగా కాక అన్యాయంగా ఎక్కువ తక్కువలుగా అందింది.
  • ఉమ్మడి వ్యవసాయ కుటుంబాలు ముక్కలు చెక్కలు అయ్యాయి.
  • ఏజన్సీ ప్రాంతాల నుండి తరలించ బడిన ఆదివాసీలు తమ సంస్కృతి నుండి దూరం జరప బడ్డారు.
  • ఏజెన్సీ నుండిబయటకు వచ్చారు కనుక  పునరావాస గ్రామాల లోని వారికి  ఏజన్సీ ఎలవెన్సులు లేవు.
  • డబ్బు అవసరాలలోకి ప్రజలు నెట్టబడ్డారు.
  • నష్ట పరిహారపు డబ్బు ఇళ్లకు ఖర్చుపెట్టుకొని , కొత్తగా వచ్చిన వాళ్ళు కనుక పనులు దొరకక ఉన్న డబ్బు ను వాడుకొంటూ ఈ రెండు మూడేళ్లు గడిపేశారు. ఇప్పుడు తమ బతుకు తెరువులు ఎట్లా అన్నది వాళ్ల ముందున్న పెద్ద ప్రశ్న.
  • వూరికి ఒక బడి ఇంకా రాలేదు.
  • ఇంటికి ఒక ఉద్యోగం హామీ ఇంతవరకు ఆచరణకు రాలేదు.
  • అభివృద్ధికి మానవముఖం లేదు . విస్థాపన అంతా అమానవీయంగా జరిగింది.
  • విస్థాపిత ప్రజల పట్ల ప్రభుత్వాలకు ,పాలనా వ్యవస్థకు ఉండవలసిన అదనపు బాధ్యత పూర్తిగా విస్మరించి బడింది.
  • 2018 నాటికి ఈ ప్రాజెక్టు పని పూర్తి చేసి ఫలితాలను పొందాలనే సంకల్పంతో ఉన్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ అత్యుత్సాహం ఇప్పటికింకా తరలించబడని ముంపు గ్రామాల ప్రజల పట్ల అవలంభించే వైఖరి దానికి కొనసాగింపుగా కాక విభిన్నంగా ప్రజాస్వామికంగా ఉంటుందా?

                         katya1 విశాఖ పట్నం -కాకినాడ కారిడార్ అభివృద్ధి అవసరాలకు ,కోస్తాప్రాంత ధనిక వర్గ  వ్యవసాయ ప్రయోజనాలకు ఉపయోగ పడే ప్రాజెక్ట్ కు లక్షలమంది స్థానికులను నిర్వాసితులను చేస్తూ వాళ్ళ అవసరాల పట్ల నిర్లక్ష్యం గా ఉండటం గౌరవంగా జీవించే హక్కును స్వేచ్ఛగా జీవించే హక్కును నిరాకరించటమే. రాజ్యాంగాన్ని అమలు చేయవలసిన ప్రభుత్వాలు  ప్రజల హక్కులకు, ఆదివాసీల ప్రత్యేక హక్కులకు-భంగకరంగా పనిచేస్తూ సాధించే అభివృద్ధి అన్యాయమైనది,అమానవీయమైనది అని భావిస్తున్నది ప్రజాస్వామిక రచయిత్రుల వేదిక.  ప్రజాస్వామ్యాన్ని పార్లమెంటరీ ఎన్నికలకు పరిమితం చేయకుండా ఒక వాస్తవ జీవితాచరణ విలువగా,రాజ్యాంగబద్ధ  పాలనాసారంగా పరివర్తింప చేయాలని కోరుకొంటున్నది. తెలంగాణాలో మల్లన్న సాగర్ ప్రాజెక్ట్ ను వద్దనేది ఈ కోణం నుండే. 2013 చట్టం అమలు చేయమని కోరటం ప్రజల హక్కులను గౌరవిస్తూ అభివృద్ధి దిశగా గమనాన్ని నిర్దేశించుకొనమని చెప్పటానికే. బలహీనుల హక్కులను బలిపెట్టే అభివృద్ధి విధానాన్ని నిర్ద్వందంగా ఖండిస్తూ ప్రరవే ఈ కింది డిమాండ్లు చేస్తున్నది.  

 

    – ఇప్పటివరకు జరిగిన విస్థాపన విధానాలను ,నష్టపరిహార పాకేజీలను పునఃసమీక్షకు పెట్టి విస్థాపిత ప్రజల మనోభావాలు దెబ్బతినకుండా ,జీవన విధానం ,జీవితం ఎక్కువ నష్ట పోకుండా తీసుకోవలసిన చర్యల గురించి ఆలోచించాలి.

       – వ్యవసాయ జీవితాన్ని నిర్మించుకొనటానికి ఎన్టీఆర్ జలసిరి వంటి పధకాలను విస్థాపిత ప్రజా ప్రయోజనాలకొరకు విస్తరించటంపై దృష్టి పెట్టాలి. ఆవాసాలకు దూరంగా ఉన్న పొలాల సాగుకు వారిని ప్రోత్సహించే పధకాలు రూపొందించాలి

           -వ్యవసాయేతర వృత్తుల వారి అవసరాలను గుర్తించి ,గౌరవ జీవనానికి తగిన మార్గాలు చూపాలి.  

        -ఉద్యోగ పరికల్పన వేగవంతం చేసి వాటిలో మహిళలకు ప్రాధాన్యత నివ్వాలి. సామూహికంగా పాల్గొనగలిగిన చిన్న పరిశ్రమలు  ఏర్పాటు చేసి స్త్రీలకు పని కల్పించాలి.

    – పునరావాస గ్రామాలను ఆవాసయోగ్యాలుగా మోడల్ గ్రామాలుగా తీర్చిదిద్దేoదుకు  సత్వర చర్యలు చేపట్టాలి.  

*

     

                                                                      

 

     

         

        

 

           

 

  

మీ మాటలు

  1. Shanti Prabodha says:

    మీ ఆర్టికల్ చదువుతుంటే మనం తిరిగిన ప్రదేశాలు కళ్ళముందు మెదిలి కలవరపెడుతున్నాయి కాత్యాయని గారూ ..
    జీవించడానికే అభివృద్ది దోహదపడాలి కానీ జీవికనే లేకుండాచేయడం కోసం కాదని మనపాలకులు ఎప్పుడు అర్థం చేసుకుంటారో..?! వేలాది బడుగు బలహీన వర్గాల అస్థిత్వాన్ని, సంస్కృతిని సమాధి చేసి వారిని ఉరికొయ్య కేలాడకట్టి బలం ఉన్న కొంత మంది కోసం చేసే నిర్ణయాలే అభివృద్ధికి కొలమానాలుగా భావించడం ఎప్పుడు మానతారో …?!

    • Katyayani vidmahe says:

      Nijam …thalachukonnte…kadu,kadu,talapuku vasthoo vedhisthunnayi aa voollu,aa janaanni emani odarchagalam!?

  2. దేవరకొండ says:

    రాష్ట్రం ముక్కలైనా అధికార పార్టీలు మారినా దోపిడీ వర్గాల ఉమ్మడి ప్రయోజనాలు, అరకొర తాయిలాలు అమలు చేసే అధికారగణం మారవు. అక్షర జ్ఞానం లేక, ఏ భద్రతా లేని మొరటు జీవన విధానాలకు అలవాటు పడిపోయిన దిక్కూ మొక్కూ లేని జనం అడ్డు తొలగించుకుంటే ఎవరికి కావాల్సిన స్వర్గం వారు నిర్మించుకోవచ్చు. అటువంటి జనానికి బాసటగా నిలుస్తున్న ప్రరవే కి అభినందనలు.

Leave a Reply to Shanti Prabodha Cancel reply

*