నానుంచి నీకు విడుదల ఇక!

mastanకృష్ణ మోహన్ ఝా మధేపురా బీహార్ లో జన్మించారు. తన వున్నత విద్యను ఢిల్లీ విశ్వవిద్యాలయంలో పూర్తి చేసి అస్సాం విశ్వవిద్యాలయంలో సహాయ ఆచార్యులుగా పనిచేస్తున్నారు. సమయ్ కో చీర్కర్ అనే కవిత సంపుటిని హిందీలోనూ,యెక్టా హెరాయల్ దునియా అనే సంపుటిని మైథిలిలోను ప్రచురించారు. యితని కవితలు మరాఠి,మైథిలి,నేపాలి,ఆంగ్ల భాషల్లో అనువదింపబడ్డాయి.

కృష్ణ మోహన్ ఝా కవితలలో కోమల దేహంపై కాలం చేసిన లోతైన గాయాలు వుంటాయి. గాయాల గురుతులు మన సభ్య నాగరికత చేసిన అనేక అసంగతులను సంకేతిస్తాయి. మనుషులు చేసే హింస హింసను కొట్టే దెబ్బలను భరించే ప్రకృతి దుఖంతో యితని కవిత్వం కంపిస్తుంది.యేడ్చే పిల్లవాడు తన మాటలను లిఖించినట్టు,యేడ్చి యేడ్చి లేచొచ్చిన స్త్రీ లా యితని కవిత్వముంటుంది. కవిత్వ రసస్వాదనలో దాని ఆంతరంగిక లయను ఆత్మగతమై రచిస్తాడు కవి.

నిన్ను విడుదల చేస్తున్నాను
————————————-

నేను వో రాతిని తాకుతాను
వారి కలవరంలో రాళ్ళుగా మారిన
వారి గాయాలు కనిపిస్తాయి

నేను మట్టిని తాకుతాను
భూమి చర్మం చుట్టూ అల్లుకున్న
అదృశ్యపు పువ్వుల సువాసనలు చూస్తాను

నేను చెట్టును తాకుతాను
క్షితిజంలో పరుగెత్తే వ్యాకులత నదులు
పాదగురుతులు వినిపిస్తుంటాయి.

ఆకాశం వైపు చూస్తూనే
నీ వీపులో నుంచి పుట్టిన బాణం
నన్ను చీల్చుకొంటూ వెళ్ళిపోతుంది

నా చుట్టు నిశబ్దాన్ని మోగనివ్వాలి
వెళ్ళిఫో
యీ ప్రపంచంలో నాకు ముక్తి లభిస్తుంది
నీతో యేం చెప్పలేను..చెబితే
దానికి అర్థము వుండదు
నేను నిన్ను నానుంచి విడుదల చేస్తున్నాను
యింత కంటే యింకేమి చెప్పలేను

నా దేహం, కళ్ళ నుంచి
నా శరీరపు పరాగాన్ని వూడ్చుకొని
తీసుకు వెళ్ళు

నాలో యెక్కడైన నా పేరున
వో అలికిడి మిగిలి వుంటే
దోచుకు వెళ్ళు

యుగాలు నేసిన దాహపు దుప్పటిని
నా దేహంపై నుంచి లాక్కెళ్ళు

వొక అర్థవంతమైన జీవితం కోసం
యింత దుఖం తక్కువేం కాదేమో…

*

మీ మాటలు

*