గాయంలోపలి మనిషి!

ayo

 

ప్రాచీన కావ్యాలకాలం నాటికి పూర్వులు రాసిన పురాణకథలను వర్ణనలను పెంచి  బంధాలుగా,స్వతంత్రకావ్యాలుగా రాసిన వారున్నారు.ఆధునికంగా వచనకవితల్లో ఇలాంటివి అరుదే.ఎందుకంటే ఒక కవితకు, మరోకవితకు మధ్య సారూప్యతలు,సామీప్యతలు గమనించి ప్రేరణలను అర్థం చేసుకోవడం తక్కువ.రేణుకా అయోల “ఒక హిజ్రా ఆత్మకథ”నుంచి పొందిన ప్రేరణ,సహానుభూతిని ఒక దీర్ఘకవితగామలచారు.ఇప్పుడున్న కవిత్వవాతావరణంలో అనేక  వాతావరణాలున్నాయి.”పీడన””అణచివేత”అనే బిందువులు వీటికి మాతృకలు.అది కులం,వర్గం,ప్రాంతం,జెండర్ ఏదైనా ఈ సంఘర్షణ కనిపిస్తుంది.

ఇన్నేళ్ల స్వతంత్ర భారతంలో లైంగికత కారణంగా కనీసం మనుషులుగా కూడా తోటిసమాజం గుర్తించని హిజ్రాల ఆత్మఘోష ఈ దీర్ఘకవితలో ఉంది.పౌరసత్వాన్ని “పునరుత్పత్తి”నుంచి ఎవరూ నిర్వచించలేదుగాని..ఇంత ప్రజాస్వామ్యవ్యవస్థలో పౌరులు రెండురకాలు ఆడ,మగ అనేభావన మాత్రమే ఉంది.ఈ పాదునుంచే ఈ కొత్త సంఘర్షణ  దేశంలో చర్చకు వచ్చింది.ఇది కేవలం సంఘర్షణ,చర్చను మాత్రమే కాక మానవీయతకు సంబంధించిన అనేక ప్రశ్నలను సంధించింది.జెండర్ వరుసలో చూస్తే స్త్రీకి రెండవస్థానం ,పురుషునికి మొదటి స్థానం ఉంది.ఈ స్థితిలో హిజ్రాలకు స్థానం కష్టమే.పైగా ఏహ్యభావం.కొన్ని సంవత్సరాలనుంచి యుగాలనుంచి ఈ వాతావరణం కనిపిస్తుంది.ఇతిహాసాల్లో శిఖండిలాంటిపాత్రలో ఈ స్థితిలో కనిపిస్తాయి.

సామాజిక స్థితి,ఆర్థికస్థితి,రాజాకీయ స్థితి ఈ ఏ పరిధుల్లోకి రాని హిజ్రాల జీవన సంఘర్షణను “మూడవ మనిషి”చిత్రించింది.తెలుగులో వచనకథాకావ్యాలు రావాలని కుందుర్తి కోరుకున్నారు.ఈ కవిత అలాంటిదే.”మూడవ మనిషి”అనే శీర్శిక తీసుకున్నారుకాని ‘మూడవ మనిషి”అనేపదం,ఈ ఆత్మకథను రాసిన రేవతి”కాని,కవిత రాసిన అయోల కాని ఇష్టపడరు..ఈ ఉద్యమం ప్రతిపాదించింది కూడ ఇదే.

కాకి గూట్లోంచి కోడిపిల్లలా/

నెట్టివేయబడిన బతుకులని/

ఎచరో ఒకరుగా బతకనివ్వాలి/

స్త్రీగానో పురుషుడిగానో ఉండనివ్వాలి“-(47పే)

 

మామూలు మనుషులుగా గుర్తించాలి/

మూ జాతి నిర్మాణం ఆగిపోవాలి/

ఎలాంటి ముద్రలు లేని స్వాతంత్య్రం కావాలి“-(46పే)

padam.1575x580 (2)

అయోలా కవిత నిర్ణయించుకున్న లక్ష్యం,హిజ్రాల సంఘర్షణ నిర్దేశించుకున్నది కూడా ఇదే.మూడవ మనుషులుగా కాకుండా వాళ్ల ఇష్టాలకనుగుణంగాఉండాలని.ఏహ్యాభావానికి ఎగతాళికి గురౌతున్నది ఈ గుర్తింపునుంచే.ఈ అంశాన్ని ఆవిష్కరించడం పట్ల అయోలాకు ఈ ఉద్యమం పట్ల ఉండే అవగాహన అర్థమవుతుంది.రేణుకా ఆయోలా కవిత్వంలో ఒక స్వాభావికమైన స్త్రీ ముద్ర ఉన్నది.రేవతి ఆత్మకథతో సహానుభూతిపొంది ఆగొంతుతో రాసినా ,స్వాభావికంగా స్త్రీ పార్శ్వాలు అక్కడక్కడా కనిపిస్తాయి.

అసలు ఎందుకీ ముడవ వ్యక్తి ?/తేనె తుట్టకి పొగపెట్టినట్లు/మళ్ళీ ఒక జాతిని నిర్మించడం దేనికి/వివక్షకు కొత్త దేహాలెందుకు

 స్త్రీగా ఉండనిస్తే చాలు/మామూలు మనిషిగాస్త్రీలా/బాత్రూంల దగ్గర/ఉద్యోగాల దగ్గర గుర్తిస్తే చాలు“-(44పే)

మోసగించబడ్డ ముఖాలు/శిథిలమైన దేహాలు/ముఢనమ్మకాలు/వైధవ్యాలు/పెళ్ళిళ్ళు/అందరిదీ ఒకటే చరిత్ర/శరీర చరిత్ర“-(44పే)

మొదటివాక్యంలో మూడవవ్యక్తి అవసరం లేదనే భావన,రెండులో స్త్రీగా గుర్తించడం తో పాటు స్త్రీలు ఎలా వివక్షకు గురౌతున్నారో మూడవ భావాంశం చెబుతుంది.వీటిలో స్త్రీ సంబంధమైన గొంతుక పెనవేసుకుపోయి ఉంది.కవితకు మరింత బలాన్నిచ్చింది ఇదేనేమో.ఈ కవితలో మానసికాభిప్రాయాన్ని  కవిత్వం చేయడం,ఆ సంస్పందనలను రీకార్డు చేయడం ఎక్కువ.లోపలి స్త్రీత్వాన్ని,బాహ్యంగా ఉండే పురుషత్వానికి మధ్య జరిగే సంఘర్షణ కవిత్వం చేయడం కనిపిస్తుంది.పదిహేనుభాగాలుగా ఉన్న కవిత్వంలో మొదటిది ఆముఖం లాంటిది.రెండులో మగవాడుగా పుట్టి, స్త్రీత్వం తొంగిచూడ్డం,మూడులో ఇల్లు,కాలేజీల్లో సంఘర్షణ.నాలుగులో శరీరంలోని అసంపూర్ణ లైంగికత,ట్రాన్స్ జెండర్ గా మారడానికి కలిగే ప్రేరణ,హిజ్రాగామారటం,ఒక కొత్త ప్రపంచపు క్షణికానందం,దుఃఖం,కొత్త జీవితం పై సందేహం,వెకిలి తనం వల్ల కలిగే సంవేదన.ఇంట్లో తిరస్కారం,కోరుకున్న స్త్రీగా జీవించలేని సామాజిక స్థితి,బలవంతంగానైనా బతకడానికి తలవొగ్గడం.ఉద్యొగం గుర్తింపుకోసం న్యాయపోరాటం,దానికొన సాగింపు ఇలాఉరామరికగా ఇందులోని కథను అంశాత్మకంగా చూడవచ్చు.

మగవాడిగా పుట్టి అవయవాల్లో తేడావల్ల స్త్రీగాబతకాలనుకుని,విధిలేక మూడవమనిషిగా మారి స్త్రీలాబతికే హక్కులేక అణచివేతకు విలాసాలకు గురైన,బలైన “ఆత్మకథ””మూడవ మనిషి”

ఒక భారమైన కథను నడిపినప్పటికీ కవిత్వంలో కళాత్మకత కనిపిస్తుంది.అనేక సంవేదనల్లో రాసిన వాక్యాలేకాకుండా అనేక పదబంధాలు అనుభవాన్ని,సహానుభూతిని హృదయానికి ప్రసారం చేస్తాయి.

1.ఎండుటాకుల్లా ఎగిరిపోయే/ఆలోచనలను తెల్లకాగితం మీద పేర్చాలి-(3)

2.బతుకు గోడు చెప్పుకోవాలనుకున్నప్పుడు/ఒక నిశ్శబ్దపు నీలివర్షం/నాచుట్టు పేరుకుంది“-(3)

3.చీరబొంతలో తమలపాకుల కట్టలానన్ను దాచి/సందేహంలో పడిపోయిన అమ్మ“-(5)

4.తెల్లటి గడ్డిపూవులా నిటారుగా నిలబడి/గాలికి రెక్కలిచ్చి ఆనందపడేఅది“-(15)

5.అందమైన జీవితంలా/నీలినదిలో పడవలో తేలుతున్న చంద్రవంకని/రేపటి వెలుగులోకి చూస్తున్న ఒంటరి నక్షత్రాన్ని“-(21)

6.పాదాలు నడిచీ నడిచి/దూరాలు కొలిచి కొలిచి పుళ్లు పడేవి/నమ్మకాలు కత్తిరిస్తున్న కొమ్మల్లా విరిగిపడేవి(25)

7.అమ్మ ఊరు తొలి వర్షానికి రేగిన  మట్టివాసనలా గుర్తుకొచ్చేది(28)

 

ఈ వాక్యాలన్ని ఊహాత్మకతను,కళను దాచుకున్న వాక్యాలు.అయోలా ఎక్కువగా భారతీయ ఆలంకారిక సామాగ్రిని కళాచిత్రణకు ఉపయోగిస్తారు.”ఎండుటాకులా/తమలపాకుల కట్టలా/గడ్డిపూవులా/కొమ్మల్లా విరిగిపడేవిలాంటివాటిల్లో కనిపించే”లా”ఉపమావచకాన్ని చూపుతుంది.”ఊరు వర్షానికి రేగిన మట్టివాసనలా ఉందనటంతెల్లటి గడ్డిపూవు నిలబడటాన్ని చెప్పడం“ఇవన్నీ సౌందర్య పరిశీలనకు అద్దం పడుతాయి.ఇలాంటి వాక్యాలతో పాటు సమాసాల్లాకనిపించే పదబంధాల్లో కళాత్మకత బాగాకనిపిస్తుంది.

పసితనపు యుద్ధాలు(7)అయోమయాల లోయలు(7)ఇష్తాల రెక్కలు(6)ఆకుపచ్చని చీర(6)ఆడతనం చిగుళ్ళు తొడుక్కోవడం(6)నడక రెక్కలు(13)ధైర్యపు గొడుగు(14)గాయాలపొర(15)చీకటితలుపు(22)ఆకలి చూపులు(23)వెకిలితనం చేతులు(25)పగటి రంగులు(43)ఓదార్పుకాగితాలు(45)జీవిత విత్తనం(49)ఇలాంటివి అనేకంగా కనిపిస్తాయి.ఈ సమాస బంధాలుకూడా భారతీయ ప్రాచ్యకళా సంప్రదాయానికి చెందినవే.ఇవన్నీ కవిత్వీకరణ శక్తిని చూపుతాయి.

తెలుగులో కవితాఖండికలుగా,కథలుగా హిజ్రాల జివితంపై సాహిత్యం వచ్చింది.దీర్ఘకవితగా ఈ కవితే మొదటిది.కథను చెబుతున్నప్పుడు కళాత్మకతకు అవకాశం తక్కువ.కాని అయోల కవిత సాధన దాన్ని సుసాధ్యం చేసింది.తెలుగులో దీర్ఘకవితలు రాసిన కవయిత్రులు తక్కువ.అలావచ్చిన తక్కువ కవితల్లో ఈ కవిత విభిన్నమైనదేకాదు.తనదైన కవితాత్మకతతో నిలబడగలిగేది కూడా.

*

మీ మాటలు

  1. Aranya Krishna says:

    శర్మగారూ! మీరే సమీక్ష చేసినా సహజంగానే లోతుగా ఉంటుంది.

  2. స్వాతీ శ్రీపాద says:

    పుస్తకం సరైన మార్గాన చదివిమ్చేమ్దుకు ఇలాటి సమీక్షలు చాలా అవసరం . సమీక్షకులకు ఒక ఉదాహారణలా బావుంది సమీక్షా పుస్తకం కూడా.

మీ మాటలు

*