హ్యూస్టన్ లో అడుగు పెట్టిన వేళా విశేషం…!

 

గత సెప్టెంబర్ 2-3-4, 2016 తేదీలలో మా హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి 40వ వార్షికోత్సవాలు దిగ్విజయంగా జరిగాయి. కేవలం $350,000 బడ్జెట్ తో మిలియన్లు ఖర్చుపెట్టి జాతీయ సంఘాలు ప్రతీ ఏడూ జరిపే జాతర్ల స్థాయిలో ఈ సంబరాలు జరిగాయి. అంటే సినిమా తారలు, రాజకీయ నాయకులూ, (అప) హాస్య గాళ్లూ, తదితర దిగుమతి చేసుకున్న వారికి పెద్ద పీట వేసినా, స్థానికులకి కూడా చోటు దొరికింది. ఆ  నలభై ఏళ్ల వార్షికోత్సవాల సందర్భంగా టీసీయే పుట్టిన క్షణం నుంచీ ఈ నాటి వరకూ టీసీయే తో నాకు ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకుంటూ ఆ తొలి దశకంలో నా జ్ఞాపకాలు కొన్ని పంచుకోవడమే ఈ వ్యాసం ఉద్దేశ్యం.  ఇందులో కొన్ని తప్పులు దొర్లి ఉండవచ్చును. కొందరు వ్యక్తుల పేర్లు ప్రస్తావించడం మర్చిపోయి ఉండ వచ్చును. ప్రస్తావించిన వారి అందరి కృషీ తగిన స్థాయిలో నేను వ్రాసి ఉండక పోవచ్చును. ఆ నాడు అందరూ సమానులే కానీ ఎవ్వరూ ఎక్కువ సమానులు కాదు. అన్ని తప్పోప్పులకీ నేనే పాపాల భైరవుడిని కాబట్టీ, ఏదీ బుద్ది పూర్వకంగా చేసిన పొరపాటు కాదు కాబట్టీ పెద్ద మనసు తో ఈ చిన్న వాడిని మన్నించమని ముందే మనవి చేసుకుంటున్నాను. అలాగే నా ‘సొంత డబ్బా’ ఎక్కువగా వినపడితే కాస్త వాల్యూమ్ తగ్గించుకోండి.

నా హ్యూస్టన్ ‘‘రంగ ప్రవేశం”

van1అప్పుడు హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. మా తమ్ముడు చికాగోలో ఉండే వాడు కాబట్టి నేను అప్పటికి మూడు నెలల ముందు ఇండియా నుంచి ఆ ఊళ్ళో అడుగుపెట్టాను – జేబులో బొంబాయి లో యు.ఎస్. కాన్సలేట్ వారు నన్ను మెచ్చి ఇచ్చిన గ్రీన్ కార్డ్ గ్రీన్ కార్డ్, భారత ప్రభుత్వం వారు దయతో మంజూరు చేసిన అక్షరాలా ఎనిమిది డాలర్లు, ఐదారు చొక్కాలు, చెడ్డీలు, పంట్లాలు, నా ఐఐటి డాక్టరేట్ పట్టా తో అన్నీ సద్దుకున్న రేకు పెట్టె…అదీ నా మొత్తం ఆస్తి. చికాగోలో ఆ రెండు నెలలలోనూ ఆర్ధిక మాంద్యంలో ఇరుక్కున్న ఆ ప్రాంతాలలో ఉద్యోగ సద్యోగాలు మనకి దొరకవు అని అర్థం అయిపోయింది. అప్పటికి చికాగోలో నాకు మంచి మిత్రుడు ప్లంజేరి శంకర్ “టెక్సస్ బాగా బూమింగ్ గా ఉంది. అక్కడికి వెళ్లి ట్రై చెయ్యి “ అని సలహా ఇచ్చాడు. ఆ రోజుల్లో అమెరికా చలి ప్రాంతాలు ఆర్ధిక మాంద్యంలో ఉంటే టెక్సస్ లాంటి ఆయిల్ ఎకానమీ రాష్ట్రాల ఎకానమీ పుంజుకునేది. అంచేత నా లాగా నిరుద్యోగులుగా ఉన్న తణుకు తాలూకు ఈమని శాస్త్రి, అతని తమ్ముడు రఘురాం, (వీళ్ళిద్దరూ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో బాగా జూనియర్లే కానీ అక్కడ తెలియదు.) బసంత్ పట్నాయక్ అనే ఒరియా స్నేహితుడు ఆ రోజు సాయంత్రమే ఓ చిన్న కారులో మాకున్న ఆస్తులన్నీ “డిక్కీలో పడుకోబెట్టేసి” ఎక్కడా ఆగకుండా 24 గంటలలో హ్యూస్టన్ వచ్చేశాం. మాలో ఎవరికీ హ్యూస్టన్ మహా నగరంలో ఏ ఒక్క మానవుడి పేరూ తెలియదు. అది 1975 మార్చ్ నెలలో ఓ రోజు -41 సంవత్సరాల క్రితం.

ఆ రాత్రి హిల్ క్రాఫ్ట్ అనే రోడ్డు  -ఇప్పుడు ఆ ప్రాంతం లిటిల్ ఇండియా – మీద ఓ రెండు రోజులు కారులోనే పడుకుని, ఇక లాభం లేదు గురూ అనుకుని ఎవరైనా ఇండియన్ కుర్రాళ్ళు ఉండక పోతారా అని రైస్ యూనివర్సిటీకి వెళ్లి వాకబు చేశాం. అనుకున్నట్టుగానే అక్కడ చదువుకుంటున్న భారతీయ విద్యార్థులు కనపడగానే పరిచయం చేసేసుకున్నాం. వాళ్ళలో మా దగ్గర బంధువు – కేంపస్ లో ఒకే ఒక్క తెలుగు విద్యార్థి కూడా ఉండడం కేవలం యాదృచ్చికం.

ఆ తరువాత నా వ్యక్తిగత జీవితం ఎన్ని ఒడుదుడుకులని ఎదుర్కొన్నా, అప్పుడు జరిగిన అతి ముఖ్యమైన విషయం తలచుకుంటే ఇప్పటికీ మహానందం వేస్తుంది.  ఓ రోజు సొంతంగా వండుకునే వంట తిన లేక విసుగొచ్చి రైస్ యూనివర్సిటీ లో డాక్టరేట్ చేస్తూ మిత్రులు అయిపోయిన మా బంధువు కుంటముక్కుల మూర్తి, గౌరంగ్ వ్యాస్, పట్నాయక్ కి మిత్రుడు , తోటి భువనేశ్వర్ వాడు అయిన మహంతీ “ఇక్కడే ఉన్న మహారాజా అనే ఇండియన్ రెస్టారెంట్ కి వెడదామా?” అనుకుని…ఎవరి దగ్గర ఎంత డబ్బు ఉందో లెక్క వేసుకుని మొత్తం పదిహేను డాలర్లు జమ అవగానే “పరవా లేదు. అక్కడ ఇడ్లీకి, కాఫీకీ సరిపోతాయ్ అందరికీ” అని యూనివర్సేటీ దగ్గరే టైమ్స్ బులావార్డ్ మీద ఉన్న మహారాజా రెస్టారెంట్ కి వెళ్ళాం. లోపలకి అడుగుపెట్టగానే ఒకాయన “వెల్ కం” అని మమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంటే గొప్పగా ఫీల్ అయిపోతూ అతని మొహం చూసి ఆశ్చర్య పోయాను…ఎక్కడో చూశానే..ఎక్కడ చెప్మా అని బుర్ర గోక్కుని “మీ పేరు ఏమిటి సార్” అని ఇంగ్లీషులో అడిగేశాను. “అనిల్ కుమార్” అని వెంటనే అతను కూడా నాకేసి అనుమానంగా చూశాడు. ఇంచు మించు ఇద్దరం ఒకే సారి “గురూ, నువ్వా” అంటే “హారినీ, నువ్వా ఇక్కడేమిటీ ?  అనేసి కావలించుకుని ఒకరినొకరు గుర్తు పట్టేసుకున్నాం.  విషయం ఏమిటంటే ఈ అనిల్ కుమార్ నాకు కాకినాడ ఇంజనీరింగ్ కాలేజ్ లో ఒక ఏడాది సీనియర్. కాలేజ్ ప్రోగ్రాములలో నిహార్ అనే కాశ్మీరీ కుర్రాడు ఎకార్దియన్ వాయిస్తూ ఉంటే ఇతను డ్రమ్స్, బేంగోస్ లాంటివి వాయించే వాడు. అప్పుడప్పుడు అరుపులూ, పెడ బొబ్బలతో “మోసేసే వాళ్ళం”. ఆ రోజుల్లో ఎక్కువ పరిచయం లేదు కానీ ముఖ పరిచయం బాగానే ఉంది. అందుకే పదేళ్ళయినా ఇప్పుడు ఒకరినొకరు గుర్తు పట్ట్టగలిగాం. ఆ రోజుల్లో యావత్ టెక్సస్ రాష్ట్రం అంతటికీ ఈ మహారాజా ఒక్కటే ఇండియన్ రెస్టారెంట్ అంటే ఈ రోజుల్లో నమ్మ బుద్ది కాదు. అనిల్ తో పాటు దువ్వూరి సూరి, శేష్ బాల, వెంకట్ కలిసి సరదాగా ఈ రెస్టారెంట్ మొదలుపెట్టి ఎవరికీ వ్యాపారానుభావం లేక కొన్నాళ్ళకి మానేశారు. ఇప్పుడు సరిగ్గా అదే చోట “శివ” అనే ఇండియన్ రెస్టారెంట్ ఉంది.

ఆ విధంగా నాకు హ్యూస్టన్ లో పరిచయం అయిన మొదటి తెలుగు వక్తి అనిల్ కుమార్. అప్పటి నుంచీ గత ఏడాది పరమపదించేదాకా అనిల్ కుమారే నాకు అత్యంత ఆత్మీయమైన మిత్రుడు.

హ్యూస్టన్ లో తొలి తెలుగు వారు

van2

టెక్సస్ అనగానే గుర్రాలూ, తుపాకులూ , పేద్ద పది గేలన్ల టోపీలూ అనుకుని, ఇవన్నీ మనకెందుకులే అనుకుని భారతీయులు, అందునా తెలుగు వారు అమెరికాలో ఇతర రాష్టాలకి మాత్రమే వలస వరస కట్టిన రోజులలో, విశాఖపట్నానికి చెందిన (స్వర్గీయ) దువ్వూరి అచ్యుత అనంత సత్య నారాయణ రావు గారు , కుటుంబ సమేతంగా , ఆస్ట్రేలియా, కెనడాలలో చదువు తరవాత  హ్యూస్టన్ లోని టెక్సస్ సదర్న్ యూనివర్శిటీలో ఫిజిక్స్ విభాగం ప్రారంభించడానికి 1957 లో హ్యూస్టన్ వచ్చారు. ఆయనే టెక్సస్ కి, అమెరికా లోని ఇతర దక్షిణ రాష్ట్రాలకి వచ్చిన తొలి తెలుగు వారు.

ఆ తరువాత పదేళ్ళలో 1970 నాటికి పట్టిసపు రామజోగి గంగాధరం గారు, పోతు నరసింహారావు గారు మొదలైన కుటుంబీకులూ, అనిల్ కుమార్, మణ్యం మూర్తి, గుంటూరు సీతాపతి రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావు, చింతపల్లి అశోక్ కుమార్ లాంటి బ్రహ్మచారులూ వెరసి ఇంచుమించు 20  మంది తెలుగు వారు హ్యూస్టన్ లో నివాసం ఏర్పరుచుకున్నారు. అప్పుడు అందరూ ముందు భారతీయులూ, తరవాతే తెలుగు వారు. భారతీయులందరూ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్ లో కలుసుకుని హిందీ సినిమాలు వేసుకునీ, పిక్నిక్స్ జరుపుకునే వారు. తెలుగు పండుగలకీ, తెలుగులో మాట్లాడుకోవడానికీ నారాయణ రావు గారు, నరసింహా రావు గారూ, గంగాధరం గారి ఇళ్ళలో అందరూ కలుసుకునే వారు. వారందరి “లివింగ్ రూము” లే ఆ నాటి తెలుగు సాంస్కృతిక వేదికలు. ఆ నాటి తొలి తెలుగు వారిలో చాలా మంది ఇప్పటికీ హ్యూస్టన్ లోనే ఉండడం, అందులో కొంత మంది ఇంకా ఈ నాటి మన తెలుగు సాంస్కృతిక సమితి కార్యక్రమాలలో ఉత్సాహంగా పాల్గొనడం చెప్పుకోదగ్గ విశేషమే!

1975 ప్రాంతాలకి హ్యూస్టన్ లో ఇంచుమించు యాభై మంది తెలుగు వారు సమకూడారు. వారిలో నాటకాలూ, శాస్త్రీయ సంగీతమూ, కూచిపూడి నృత్యమూ మొదలైన కళలలో అతున్నతమైన మంచి ప్రావీణ్యం ఉన్న ఐదారుగురు కళాకారులు కూడా ఉండడంతో, అందరూ మామూలుగా కలుసుకోవడం, పండగలు చేసుకోవడమే కాకుండా, ఏదో రకమైన సాంస్కృతిక కార్యక్రమాలు కూడా ఉండేవి. అవన్నీ యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, టెక్సస్ సదరన్ యూనివర్శిటీ లేదా మెడికల్ సెంటర్ ఉన్న హాళ్ళలో జరిగేవి. అప్పటికే అమెరికా ఇతర పెద్ద నగరాలలో తెలుగు సంఘాలు, వాటితో చిన్న, చిన్న రాజకీయాలు మొదలయ్యాయి. నాకూ బొంబాయి లో ఉన్న అనుభవంతో మనకి ఇక్కడ కూడా ఒక తెలుగు సమితి ఉంటే బావుంటుంది అనే ఆలోచన లేవనెత్తాను. అంతకు ముందు కూడా ఆ ఆలోచనలు వచ్చాయి కానీ, ఒక తెలుగు సంఘం నిజంగా అవసరమా, ఒక వేళ తెలుగు సంఘం పెట్టుకుంటే, రాజకీయాలకి అతీతంగా దాన్ని ఎలా తీర్చిదిద్దాలనీ అని ఒక ఏడాది పాటు రకరకాల చర్చలు జరిగాయి. మొత్తానికి 1976 లో  తెలుగు సాంస్కృతిక సమితి అనే పేరుతో హ్యూస్టన్ లో లాభాపేక్ష లేని సంస్థగా వెలిసింది. ఆ సమితి ఆశయాలనికీ, నిర్మాణ నిబంధనావళి రచించడానికీ దువ్వూరి నారాయణ రావు, పోతు నరసింహా రావు, తమ్మారెడ్డి చంద్రశేఖర రావులతో ఒక కమిటీ చెయ్యబడింది. వారు అందరితో చర్చలు జరిపి, అప్పటికే దేశంలో ఉన్నమూడు, నాలుగు తెలుగు సంస్థల తీరుతెన్నులూ, సమస్యలూ పరిశీలించి తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి “రాజ్యాంగం”…అంటే “ప్రారంభ నిబంధనలు, సూత్రాలు” ..అంటే Constituition ప్రచురించారు. వంగూరి చిట్టెన్ రాజు తెలుగులో  అక్షరరూపం కలిగించి, హ్యూస్టన్ లో ఉన్న తెలుగు వారందరూ ఏకగ్రీవంగా అంగీకరించిన ఈ  క్రింది తొలి పత్రంలో తెలుగు సాంస్కృతిక సమితి ఆశయాలు:

“తెలుగు భాష మీద తెలుగు సంస్కృతి మీద అభిమానము, అభిరుచి గల వ్యక్తుల సమన్వయమీ తెలుగు సాంస్కృతిక సమితి. లాభాపేక్ష, రాజకీయ విషయములలో జోక్యము చేసుకునే ఆసక్తి లేనిదిది. సభ్యులు తరచు కలుసుకొనుటకు, తెలుగు సంస్కృతికి సంబంధించిన కార్యకలాపములలో పాల్గొనుటకు అవకాశాములను కల్పించుటే ఈ సమితి ప్రధానాశయము. ఈ ప్రాంతములోని తెలుగు వారి సమైక్యతను పెంపొందించి, వారి సంస్కృతికి సంబంధించిన అవసరములు తీర్చుటయే కాక ఆ సంస్కృతిని తెలుసుకోవాలనే ఆపేక్షగల హ్యూస్టన్ మహానగర నివాసుల వాంఛాసాఫల్యమునకు కూడా ఈ సమితి తోడ్పడుతుందని ఆశించవచ్చును”

ఈ కమిటీ వారు మన సాంస్కృతిక సమితికి “అధ్యక్షులు” అనే పదవి అధికారకాంక్షను పెంచే విధంగా ఉండి, రాజకీయాలకు దారి తీస్తుందని భావించి, సమితి  సభ్యులందరూ కలసి ఏడుగురు వ్యక్తులను  నిర్వాహక వర్గం  సభ్యులుగా ఎన్నుకోవాలనీ, ఆ ఏడుగురూ తమలో తామే ఒకరిని “సమన్వయ కర్త” గానూ, మరొకరిని “సహ సమన్వయ కర్త” గానూ నిర్దేశించుకుని, సమితి కార్యకలాపాలన్నింటినీ సమిష్టిగా నిర్వహించాలని నిర్ణయించారు. ఆ ప్రకారం, 1977 జనవరిలో హ్యూస్టన్ తెలుగు సాంస్కృతిక సమితి మొట్టమొదటి కార్యనిర్వాహక వర్గానికి  కోనేరు తాతయ్య సమన్వయ కర్త గానూ, వంగూరి చిట్టెన్ రాజు (నేను) సహ సమన్వయ కర్త గానూ, పుచ్చా వసంత లక్ష్మి, పోతు రాజేశ్వరి, తుమ్మల కుటుంబ రావు, పట్టిసపు గంగాధరం, కొడాలి సుబ్బారావు, తమ్మారెడ్డి చంద్ర శేఖర రావు  గార్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.

మొదటి ఉగాది: -1977

”కాళయుక్త” నామ సంవత్సర ఉగాది (1977) మన మొట్టమొదటి అధికారిక కార్యక్రమం. యూనివర్శిటీ ఆఫ్ హ్యూస్టన్, స్ట్యూడెంట్ సెంటర్ మూడవ అంతస్తులో ఉన్న హ్యూస్టన్ రూమ్ లో జరిగిన ఆ నాటి తొలి ఉగాది కార్యక్రమంలో పాల్గొన్న కళాకారులలో కొందరు పొలాని జానకి రామయ్య & శారద, బిలకంటి గంగాధర్, రవి తమిరిశ, కిరణ్ తమిరిశ, పుచ్చా వసంత లక్ష్మి & మల్లిక్, రత్నపాప & అనిల్ కుమార్, వంగూరి చిట్టెన్ రాజు, కామేశ్వరీ గంగాధరం, రూపా కోనేరు, రఘు చక్రవర్తి, చావలి రామసోమయాజులు & బాల, చేగు లలిత,  విజయ మరియు రాధ దేవరకొండ, దువ్వూరి సూరి & హీరా, గొల్లపూడి మణి, రేణుకా రెడ్డి, తోట రాణి & సూర్యారావు, సూర్యకుమారి & మహాబలి రాజా, జానీ బేగమ్ & మస్తాన్ వాలీ, తుమ్మల కుటుంబ రావు & కుసుమ  మొదలైన వారు. ఆ తొలి రోజులలో నాకు జ్ఞాపకం ఉన్న అప్పటి తెలుగు వారు కొడాలి సుబ్బా రావు, అనంతనేని ప్రకాశ రావు, కేశవరావు, గోగినేని రమేష్, కొడాలి సూర్యం, ఏలూరు గోపాల కృష్ణ, రేణుకా రెడ్డి, అడవల్లి జనార్ధన రెడ్డి, గోగినేని సుబ్బారాయుడు మొదలైన వారు. ఎవరి పేర్లు అయినా మర్చిపోతే నన్ను మన్నించాలి. ఆ రోజుల్లో పదేళ్ళ లోపు చిన్న పిల్లలు రాధ తమిరిశ, గిరీష్ పుచ్చా, కల్యాణి పొలాని, హరి రాజా, మాధవి చావలి మొదలైన ఐదారుగురు మాత్రమే.

van3

ఈ కార్యక్రమంలో యావత్ అమెరికాలోనే మొట్ట మొదటి తెలుగు సాంఘిక నాటకం వేశాం. ఆ హాస్య నాటిక  “బామ్మాయణం అను సీతా కల్యాణం “ నేనే అంతకు నాలుగేళ్ల ముందు బొంబాయిలో ఉన్నప్పుడు వ్రాశాను. ఇక్కడ వేసినప్పుడు నేను బామ్మ వేషం, అనిల్ కుమార్, మోహన రావు బ్రహ్మచారులు, దువ్వూరి నారాయణ రావు గారు పరంధామయ్య పాత్ర వేశారు.

ఆ తరువాత మే 28-29, 1977 లో న్యూయార్క్ లో “ప్రప్రధమ ఉత్తర అమెరికా తెలుగు సమ్మేళనం” జరిగింది. దానికి మన సమితి తరఫున రత్న పాప, అనిల్, సూరి, నేనూ వెళ్లాం. ఇక్కడ ఒక తమాషా విషయం చెప్పాలి. అప్పుడే మొదలయిన మన సమితికే కాదు, ఎవరి దగ్గరా అంత డబ్బు లేదు కాబట్టి ఓ పాట్ లక్ డిన్నర్ పెట్టి, అందరినీ పిలిచి, ప్లేటుకి పాతిక రూపాయలు విరాళం పెడితే  ఓ అరవై మంది వస్తారు కదా…వారి విరాళాలతో అప్పుడు అందరినీ టీసీయే స్పాన్సర్ చెయ్యవచ్చును అనే ఆలోచన వచ్చింది. ఓ క్లబ్ హౌస్ లో ఏర్పాట్లు చేసి అందరినీ పేరు, పేరునా పిలిచాం. దానికి సూర్య కుమారి, దేవరకొండ సుబ్బలక్ష్మి, వసంత, బాల, హీరా, మరో ఇద్దరు ముగ్గురు మొత్తం వంట అంతా చేసి పట్టుకొచ్చారు. తీరా చూస్తే ఆ వంట చేసి పట్టుకొచ్చిన కుటుంబాలు, నా బోటి బ్రహ్మచారులం నలుగురమూ తప్ప పట్టుమని పది మంది కూడా రాలేదు. చచ్చినట్టు మేమే ప్లేటుకి వంద డాలర్ల చొప్పున కొనుక్కుని, ఏడవ లేక జోకులేసుకుంటూ మా టిక్కెట్లు మేమే కొనుక్కున్నాం!

ఆ న్యూయార్క్ సభలలో సూరి, అనిల్, నేనూ బొబ్బిలి యుద్దం బుర్ర వేశాం. నేనే వ్రాశాను. అమెరికాలో ఆ మొట్ట మొదటి బుర్ర కథ. అందులో మా ఒరిజినల్ హాస్యం గురించి అప్పటి వారు ఇప్పటికీ చెప్పుకుంటారు. ఆ ఫోటోలు ఇక్కడ జతపరిచాను. న్యూయార్క్ లో మరో విశేషం ఇండియా నుంచి ప్రత్యేకంగా వచ్చిన సీత-అనసూయ పాడుతుండగా వాళ్ళమ్మాయి, మన రత్న పాప “మొక్క జొన్న తోటలో” జానపద నృత్యం అత్యద్భుతంగా చెయ్యడం. మరో విశేషం ఆ సభల లోనే అమెరికా మొత్తానికి ఒక “అంబ్రెల్లా’ సంస్థ ఉండాలని అందరం అందుకుని, దానికి రూప కల్పన చెయ్యడానికి ఏడుగురు సభ్యులతో ఒక గవర్నింగ్ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ ని ఎన్నుకోవడం. వారిలో నేను ఒకడిని. దాని ఫలితమే తానా సంస్థ ఆవిర్భావం.

తెలుగు డైరెక్టరీ

1979లో అనుకుంటాను. ఇక్కడ తెలుగు వారందరికీ ఉత్తరాలు పంపించి సమాచారం అందించడానికి ఒక డైరెక్టరీ తయారు చేసుకోవలసిన అవసరం వచ్చింది. నేనూ, మల్లిక్, కొడాలి సుబ్బారావూ ఆనాటి టెలిఫోన్ డైరెక్టరీ లో ఒక్కొక్కళ్లూ  సుమారు వంద  పేజీలు చొప్పున  పంచుకుని, వాటిల్లో ఎక్కడైనా రావు, రెడ్డి, శాస్త్రి మొదలైనవే కాక ఏ మాత్రం తెలుగు ఇంటి పేరులా కనపడిన వారందరినీ పిలిచి, అయిన వాళ్లకి తెలుగు సమితిని పరిచయం చేసి, తెలుగేతరుల చేత చివాట్లు తిని, మొత్తానికి ఆరు నెలలలో ఒక సమగ్రమైన డైరెక్టరీ తయారు చేశాం. దాన్ని అశోక్ కుమార్ భార్య మేరీ ఎగ్నెస్ టైప్ చేసి పెటింది. మొత్తం 154 పేర్లు, ఫోన్ నెంబర్లు, చిరునామాలతో సహా. ‘మాకు ఇలాంటివి అక్కరలేదు’ అన్న తెలుగు బుద్ధి  వాళ్ళు ఆ రోజుల్లో పదుల సంఖ్యలో ఉంటే ఈ నాడు వేల సంఖ్య లోఉన్నారు.

అప్పట్లో ఇంకా అంత ప్రాముఖ్యం లేని షుగర్ లాండ్ , కేటీ, సైప్రస్, క్లియర్ లేక సిటీలలో తెలుగు వారు లేరు. అందరూ మెడికల్ సెంటర్ చుట్టు పక్కలా, సౌత్ వెస్ట్ లోనూ ఉండేవారు.

మధురవాణి ప్రారంభం:

అప్పట్లో, ఇప్పటిలా తెలుగు సంస్కృతికి సినిమా పర్యాయపదం కాదు. సంస్కృతి అనగానే భాష, సాహిత్మం, నృత్యం, సంగీతం అనే అర్థాలు ఉండేవి. శాస్త్రీయ నృత్యాలకి ..అందునా కూచిపూడి ప్రాభవానికి రత్నపాప 1975 లోనే స్థాపించిన అంజలి సెంటర్ ఫర్ పెఫార్మింగ్ ఆర్ట్స్ ఎలాంటి డాన్స్ లకైనా సరే…కేంద్ర బిందువు. ఆ తరువాత కోసూరి ఉమా భారతి మరింత విస్తరింప చేశారు. సంగీతానికీ, జానపద సంగీతానికీ, మంచి సినిమా పాటలకీ –కెవ్వు కేక బాపతు కానే కాదు- హీరా & సూరి, వసంత, చావలి బాల, సుసర్ల కుమారి, పొలాని జానకి రామయ్య, శారద, బిలగంటి గంగాధర్, తుమ్మల కుటుంబ రావూ, అప్పుడప్పుడు నేనూ పాడేవాళ్ళం. అన్ని కార్యక్రమాలకీ రవి తమిరిశ, రఘు చక్రవర్తి తబలా, మృదంగం వాయించే వారు. 1978 లో సీత -అనసూయ హ్యూస్టన్ వచ్చినప్పుడు వాళ్ళ చేత స్టూడియో లో రికార్డింగ్ చేయించి ఒక 78 RPM గ్రామఫోన్ రికార్డు విడుదల చేశాం. అదే అమెరికాలో మొదటి తెలుగు ఆల్బం. 1980 లలో చంద్ర కాంత డేవిడ్ ల రాక పాటకి పట్టం కట్టింది. మరి కొన్నేళ్ళ తరువాత అనుకుంటాను ఉమా మంత్రవాది, మణి శాస్త్రి మన సమితి సంగీత స్థాయిని ఉన్నత స్థాయికి తీసుకెళ్ళారు.

ఇక భాషా సాహిత్యాలకి ఏం చెయ్యాలా అనుకున్నప్పుడు నాకు తట్టిన ఆలోచన ఒక పత్రిక ప్రారంభించడం, వెను వెంటనే ఆ ఆలోచన అందరికీ నచ్చడం, కేవలం సంస్థాగత సమాచారాన్ని అందించే వార్తా పత్రికల కాకుండా దాని సాహిత్య పత్రికగా తీర్చిదిద్డాలి అని “మధుర వాణి” అని నామకరణం చేసి మొదటి సంచిక 1978 ఉగాది ప్రత్యేక సంచికగా వెలువరించాం. సుమారు యాభై పేజీలు  అంతా నా చేతి వ్రాతలోనే.  ఆ రోజుల్లో ఎక్కడ పడితే అక్కడ క్సీరాక్స్ యంత్రాలు ఉండేవి కాదు. ఉన్నా పేజీకి రెండు డాలర్లు ఖరీదు. అంచేత నేను శని, ఆదివారాలు అప్పుడు నేను పనిచేసే పెద్ద కంపెనీ ఆఫీసుకి వెళ్లి పోయి దొంగతనంగా వాళ్ళ పెద్ద క్సీరాక్స్ మీద యాభై కాపీలు తీసేశాను. ఇంచు మించు 1980 దాకా అదే తతంగం. ఆ మొదటి సంచిక నుంచి సుమారు పదేళ్ళు నేనే మధుర వాణి ప్రధాన సంపాదకుడిని. వసంత, హీరా, కలపటపు వేణుగోపాల్, చావలి రామం, శౌరి నందగిరి మొదలైన వారు సంపాదకులు. ముత్యాల సీత ముఖ చిత్రాలు వేసేవారు. ఆనాటి మధురవాణి తొలి సంచికల   ముఖ చిత్రాలు కొన్ని, లోపలి పేజీల నుంచి కొన్నీ ఇందుతో జతపరుస్తున్నాను. 1984 లో వావిలాల కృష్ణ శాస్త్రి మధుర వాణి ని ఇండియాలో టైప్ చేయించి ముద్రించారు. తరువాత, మరో ఐదేళ్లకి చిక్కి శల్యమై, మరో పదేళ్ళకి ఇంటర్నెట్ ప్రభావంలో మదుర వాణి అంతరించింది. కానీ ఇటీవలే హ్యూస్టన్ లో కొందరు ఔత్సాహికులు అదే పేరిట అంతర్జాల సాహిత్య పత్రికని ప్రారంభించి, మళ్ళీ ప్రాణం పొయ్యడం మళ్ళీ పుట్టినంత  సంతోషంగా ఉంది అని వేరే చెప్పక్కర లేదు కదా!

ఆ నాటి తెలుగు నాటకాలు

పైన పేర్కొనట్టు 1977 లో మొదటి తెలుగు నాటకం వేశాక, మరో పది, పదిహేనేళ్ళు ఏడాదికి కనీసం ఒక్కటైనా ఒక మంచి నాటకం ఉగాదికో, దసరా, దీపావళికో వేసే వాళ్ళం. అవి నేను వ్రాసినా, ఎవరు వ్రాసినా, అన్నింటిలోనూ నా పాత్ర ఉండి తీరవలసినదే! 90 శాతం అనిల్ డైరెక్ట్ చేసే వాడు. మా ఇద్దరిదీ నూటికి నూరు పాళ్ళు ఒకే పంథా. రిహార్సల్స్ లో రెచ్చి పోయి ఆనంద పడేవాళ్ళం. ఇంకా చెప్పాలంటే ఆ రోజుల్లో మేము కొనుక్కోగలిగే అత్యంత చవక రకం ద్రావకం – బక్ హార్న్ అనే బీర్. అది 99 సెంట్ల కి 12 డబ్బాలు. రుచి వర్షం నీళ్ళలో వేప రసం పిండినట్టు ఉండేది. మేము ఎన్ని కౌనుక్కుని తంటాలు పడినా ఆ కంపెనీ దివాళా తియ్యడానికి ఎక్కువ కాలం పట్ట లేదు.

van5

1975-85 కాలంలో అన్నీ జ్ఞాపకం లేవు కానీ మేము వేసిన నాటకాలలో కొన్ని కుక్క పిల్ల దొరికింది (రావు కొండల రావు), వాంటెడ్ ఫాదర్స్ (ఆదివిష్ణు), ఇల్లు అమ్మ బడును (డి.వి. నరసరాజు), గుండెలు మార్చ బడును (జంధ్యాల). నేను వ్రాసినవి “మగ పాత్ర లేని నాటిక”, ఆఠీన్ రాణి”, “యమ సభ” మొదలైనవి. నాటకం వెయ్యని కార్యక్రమంలో నేను ఏదో ఒక ఏక పాత్రాభినయనం చేసే వాడిని. అందులో జ్ఞాపకం ఉన్నవి “గిరీశం”, “ఎస్ట్రోనాట్ ఆర్ముగం”, “ఈ నాటి దుర్యోధనుడు”, “పోలీస్ వెంకట స్వామి”, “నాదెళ్ళ భాస్కర రావు”,  “యమ సభ” మొదలైనవి. వీటన్నిటిలోనూ నటీ నటులు నేనే కాక, అనిల్, వసంత, ముత్యాల సీత, సత్య ప్రభ రెడ్డి, స్వరూప్ రెడ్డి, రఘు చక్రవర్తి, చార్వాక, అశోక్ కుమార్, కోనేరు ఆంజనేయులు, ఎ.వి,ఎన్. రెడ్డి, జగన్నాథ శాస్త్రి, మణి, వెంకట్ ముక్కు, మోహన్ రావు, చివుకుల కృష్ణ, నారాయణ రావు గారు, కంచెర్ల సుభాష్, బాబ్జీ రావు, కనకం బాబు, పొలాని కల్యాణి, హరి రాజా, దేవరకొండ రమేష్, బళ్లారి పావని మొదలైన వారు. ఇవి కాక సుమారు పదేళ్ళ పాటు ప్రతీ ఉగాది కార్యక్రమం నా హాస్య పంచాంగ శ్రవణం తోటే ప్రారంభం అయ్యేది. ఆ మాట కొస్తే మా నాటకాలు, ఏకపాత్రాభినయనాలూ, అన్నీ హాస్య ప్రధానమే! మధ్య మధ్యలో తెలుగు సామెతలకి చిన్న చిన్న నాటికలు రాసుకుని ప్రేక్షకులని ఆ సామెత ఏమిటో చెప్పమని పోటీ పెట్టె వాళ్ళం.

van4

van6

తెలుగు బడి, తెలుగు గ్రంధాలయం

1980 ల నాటికి పిల్లలకి తెలుగు నేర్పాలి అనే తపన మొదలయింది. దాని ఫలితంగా ముత్యాల సీత, చావలి రామ సోమయాజులు, కలపటపు వేణుగోపాల రావు ల ఆధ్వర్యంలో తెలుగు బడి నిర్వహణ మొదలయింది. రెండు ప్రాంతాలలో జరిగేది అని జ్ఞాపకం. ఇండియా నుంచి తెలుగు వాచికాలు తెప్పించుకుని ఇక్క గరాజ్ లలో ప్రతీ వారాంతం లోనూ ఈ తరగతులు నిర్వహించే వారు. భాష నేర్పడంతో బాటు పిల్లలకి నీతి పద్యాలూ, పాటలూ నేర్పేవారు.

అలాగే తెలుగు పుస్తకాలు చదవదల్చున్న వారికి నవలలు, కథ పుస్తకాలూ సేకరించి కలపటపు వేణుగోపాల్ కారులో పెట్టుకుని ప్రతీ కార్యక్రమానికీ తీసు కొచ్చి ఒక సంచలన గ్రంధాలయం నిర్వహించే వారు. ఐదారేళ్ళ తరువాత కాలంలో కమిటీలలో ఈ ఆసక్తి కనపడ లేదు.

ప్రముఖుల సందర్శనం

 

నాకు తెలిసీ 1973 ప్రాంతాలలోనే వాణిశ్రీ,  గుమ్మడి, రాజ్ బాబు మొదలైన వారు హ్యూస్టన్ రావడమే ప్రముఖుల రాకకి తొలి మెట్టు. ఇక్కడ నాకు అశోక్ కుమార్ చెప్పిన జోక్ ఒకటి జ్ఞాపకం వస్తోంది. ఇక్కడికి రాగానే వాణిశ్రీ “అసలు డేటింగ్ అంటే ఏమిటీ, ఎలా ఉంటుందీ?: అని అడిగిందిట అమాయకంగా. అప్పుడు అశోక్ కుమార్ బేచలర్ కాబట్టి అతను వాణిశ్రీ ఒక్క దాన్నీ రెస్టారెంట్ కి డేటింగ్ కి తీసుకెళ్లాడుట. వెనక్కి వచ్చాక “ఓస్ ఇంతేనా డేటింగ్ అంటేనూ? ఇంకా ఏమిటో అనుకున్నాను“ అందిట. ఈ జోక్ కి ఇప్పటికీ నవ్వుకుంటాం మా తరం వాళ్ళం!

 

1975-85 దశకంలో హ్యూస్టన్ వచ్చి, మన ఆతిధ్యం స్వీకరించిన ప్రముఖుల వివరాలు TCA History At a Glance లో చూడ వచ్చును. ప్రత్యేకంగా గర్వించదగ్గ విషయం ఏమిటంటే ఎంత గొప్ప వాళ్ళు వచ్చినా, ఎంత మంది వచ్చినా అందరికీ ఆతిధ్యం మా ఇళ్ళ లోనే.  వంటలు మావే! హోటళ్ళు, కేట రింగు లాంటి మాటలు ఎప్పుడూ విన లేదు. అందుకే నా బోటి వారికీ వారందరూ వ్యక్తిగతంగా మిత్రులయ్యారు.

వ్యాస విస్తరణ భయం చేత వారి వెనకాల కథలు వ్రాయడం లేదు. వీలుంటే 50వ వార్షికోత్సవ సంచికలో వ్రాస్తాను…

van7

 

ఆ నాటి తెలుగు సినిమా ప్రదర్శనలు

ఆ రోజుల్లో తెలుగు మాట వినడానికి ఎవరో ఒకరికి ఫోన్ చెయ్యడం ఒకే ఒక్క మార్గం. టీవీలలో, రేడియోలలో, సినిమాలలో, పేపర్లలో, బయట నూటికి నూరు పాళ్ళు అమెరికా ఇంగ్లీషు వాతావరణమే. ఆ పరిస్థితులలో ఎలాగైనా, ఎంత చెట్టది అయినా సరే…ఒక్క సారి తెలుగు సినిమా చూడగలిగితే ఎంత బావుంటుందో అని ఆ తరం వారు పడిన తపన, దానికి పడిన కష్టాలు స్మార్ట్ ఫోన్ లో సినిమాలు చూసి స్టెప్పులు వేసే వారు అధిక సంఖ్యాకులలో ఉన్న ఈ తరం వారికి అర్థం కాదు. అప్పుడప్పుడు అమెరికాలో ఎక్కడో అక్కడ తెలుగు సినిమా వేశారూ అంటే ఆ వార్త దావానలంలా వ్యాపించి పోయేది అన్ని ఊళ్లకీ. అది 35 mm సినిమా అయితే ఎంత ఇష్టమో వెయ్యడం అంత కష్టం…ఎందు కంటే ఒకే ఒక్క షో వెయ్యడానికి సినిమా హాలు వాళ్ళు నిరాకరించే వారు. ఇక రెండో మార్గం 16 mm సినిమాలు. ఈ ఫిల్మ్ సైజు లో సినిమాలు ఆ నిర్మాత ప్రత్యేకం విదేశాలకోసం తయ్యారు చేస్తే కానీ దొరకవు. బాగా ఆసక్తి ఉన్న వాళ్ళు , సినిమా ఇండస్ట్రీ తో పరిచయం ఉన్న వాళ్ళు ఎవరైనా అమెరికా నుంచి ఇండియా వెళ్లి దొరికిన ప్రింట్స్ వారి స్తోమతకి తగ్గవి కొనుక్కొచ్చి అన్ని నగరాలకీ పంపిణీ చేసేవారు. ఆ ప్రింట్ ఖరీదు ఐదారు వేల డాలర్లు ఉండేది కాబట్టి ఆ పెట్టుబడి వెనక్కి రాబట్టు కోడానికి అవస్త పడే వారు.

కానీ తెలుగు సినిమా మీద అభిమానం కొద్దీ, లాభాలు ఆశించకుండా మాయా బజార్, మిస్సమ్మ లాంటి సినిమాల 16 mm ప్రింట్స్ కొనుక్కొచ్చి న వారిలో గర్వించదగ్గ వ్యక్తి మన హ్యూస్టన్ నివాసి డా. రవి తమిరిశ గారే! ఆ సినిమాలు వెయ్యడానికి కావలసిన 16 mm ప్రొజెక్టర్ మా ఆఫీసు లో ఉండేది. స్పెషల్ పెర్మిషన్ తీసుకుని అది పట్టుకెళ్లే వాడిని. ఏదో ఒక హాలులో గోడ మీద తెల్ల దుప్పటీ కట్టి  అనిల్, నేనూ దాన్ని ఆపరేట్ చేసీ వాళ్ళం. ప్రింట్ క్వాలిటీ ని బట్టి ఆ సినిమా రసపట్టులో ఉండగా..అంటే హీరో, హీరోయిన్లు ఘంటసాల -సుశీల పాట రొమాంటిక్ గా అభినయుస్తూ ఉండగా ఆ ఫిల్మ్ ఠకీ మని తెగిపోయేది. చచ్చినట్టు దాన్ని స్కాచ్ టేపు తో అతికించి మళ్ళీ వేసేటప్పటికి సగం డ్యూయెట్ కట్ అయిపోయేది. ఆ తరువాత రవి గారే ఒక ప్రొజెక్టర్ కొన్నట్టు జ్ఞాపకం.  అంత కన్నా ముఖ్యంగా తెలుగు సాంస్కృతిక సమితి తరఫున చందాలు పోగేసి వెయ్యి డాలర్లు పైగా ఉండే ప్రొజెక్టర్ కొనుక్కున్నాం. అది ఇప్పుడు ఎవరి దగ్గర ఉందో?

van8

నాకు గుర్తున్నంత వరకూ హ్యూస్టన్ లో వేసిన మొదటి సినిమా “సుడి గుండాలు”. అది దువ్వూరి నారాయణ రావు గారు టెక్సస్ సదరన్ యూనివర్సిటీ లో ఫిజిక్స్ పాఠాలు చెప్పే గదిలో బ్లాక్ బోర్డ్ మీద తెల్ల దుప్పటీ కట్టి, అందరం క్లాసు బెంచీల మీద కూచుని చూశాం. ఆ తరువాత విశ్వశాంతి నిర్మాత యు. విశ్వేశ్వర రావు గారు తన “తీర్పు: అనే సినిమా ప్రింట్ పట్టుకొచ్చారు. ఆయన సమక్షంలో ఆ సినిమా కూడా  లాగే చూశాం.

అప్పటినుంచి (1976) ఇప్పటి దాకా, అన్ని ఒడుదుడుకులనీ తట్టుకుని, అన్ని సమస్యలనీ సామరస్యంగా పరిష్కరించుకుని, ఉత్తర అమెరికా మొత్తంలో ఒకే తాటిపై నడుస్తున్న ఏకైక అమెరికా తెలుగు సంస్థ అని ప్రపంచవ్యాపంగా అఖండమైన పేరు ప్రఖ్యాతులు తెచ్చుకున్న మన తెలుగు సాంస్కృతిక సమితి ఇక ముందు కూడా అదే బాటలో పయనించి, తెలుగు భాష, సంస్కృతి, సాహిత్యాలకి మరింత సేవలు అందిస్తుంది అనడంలో ఎటువంటి సందేహమూ లేదు.

*

 

మీ మాటలు

  1. శ్రీ వంగూరి చిట్టెన్ (ఖండాంతరాల్లో గత నలభైఒక్క​ సంవత్సరాలుగా వెలుగుతున్న తెలుగు భాషా చిట్టెం) గారూ,
    మీరు ఇన్ని దశాబ్దాలుగా ఎక్కడ ఉన్నా, తెలుగు నేలకు ఎంత దూరంగా ఉన్నా, ఎన్నో వ్యయప్రయాసలు పడి ‘తెలుగు వెలుగులు’ పంచుతున్నారంటే నిజంగా సాటి తెలుగువాడినైనందుకు చాలా గర్వపడుతూ మీ అవిరళ కృషికి మీకు శిరసు వంచి పాదాభివందనాలర్పిస్తున్నాను.
    ధన్యవాదములతో
    సుందరం

  2. Pvb prasadarao says:

    Chala adbhutamaina vyasam.toli taram vaari adugu jadalu aa tarvaata taraaniki karadeepikalu

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      ధన్యవాదాలు ప్రసాద రావు గారూ

  3. ఈ వ్యాసం లో ప్రస్తావించిన పేర్లలో శ్రీ రామజోగిగంగాధరం గారు స్వయానా మా మేనమామ గారు. మా అమ్మకు ఆయన రెండవ అన్నయ్య. ఆయన పక్కన ఉన్నవారు, మా అత్త (ఆయన భార్య). చదివి చాలా ఆనందించాను. ధన్యవాదాలు.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      చాలా సంతోషం ,,మీ మేనమామగారిని మళ్ళీ చేసుకున్నందుకు. వారిద్దరూ నేనంటే చాలా ఆప్యాయంగా ఉండే వారు..

  4. ఆ కాలపు సంగతులన్నీ ఇలా రాసుకోవడం అవసరం.
    ఒక విశేషం;
    ’90 లో పాపినేని ఆనందకిశోర్ సంపాదకుడుగా ఉన్నప్పుడు మధురవాణి టైప్ సెట్టింగ్ అంతా కంప్యూటర్లో చేయడం మొదలయింది. బహుశా కంప్యూటర్ ఫాన్ట్స్ వాడిన మొదటి తెలుగు పత్రిక ఇదే అయి ఉండాలి. యాపిల్ మేకింతోష్ మీద నేరుగా తెలుగులో టైప్ చేయడం కష్టంగా ఉండడంతో కన్నెగంటి రామారావూ, ఆనందకిశోరూ RTS (Rice Transliteration Scheme) ఏర్పాటు చేసుకోవలసి వచ్చింది.

    • వంగూరి చిట్టెన్ రాజు says:

      నిజమే..ఆనంద కిషోరూ, కన్నెగంటి రామారావును ఆ రోజుల్లో రైస్ యూనివర్సిటీ లో చదువుతూ ఋట్శ్ పధ్దతి కనిపెట్టారు. ఆ తరువాత మధురవాణి ని తెలుగు లో సెట్ చేశారు. బహుశా అదే అమెరికాలో మొదటి సారి. అంతకు ముందు ఇండియా పంపించి టైప్ సెట్ చేయించాం ఒక సారి. ఇవన్నీ 1990 ల లో జరిగిన విశేషాలు.

మీ మాటలు

*