కొత్త మలుపులో మన కథ!

Katha-15 Cover

 

గత పాతికేళ్లుగా ఉత్తమ తెలుగు కథలకు చిరునామాగా నిలిచాయి కథా సాహితీ వెలువరిస్తున్న వార్షిక సంకలనాలు.  వాసిరెడ్డి నవీన్,  పాపినేని శివశంకర్ ల ఆధ్వర్యంలో నిరాటంకంగా సాగుతున్న ఆ కథా యజ్ఞం ఈ ఏడాదితో ఇరవయ్యారో వార్షిక సంకలనానికి చేరుకుంది.  ఆ క్రమంలో కథ- 2015 ఆవిష్కరణ ఇవాళ ( సెప్టెంబర్ 4- 2016 ) కాకినాడలో జరగబోతోంది.

ఆ సందర్బంగా ఆ కథా సంకలనానికి ఎంపికైన రచయితలతో  ముచ్చటించింది సారంగ. ఇవాళ్టి కథా రచయితలు కథా ప్రక్రియను ఎలా చూస్తున్నారు? కథ ద్వారా ఏం చెప్పాలనుకుంటున్నారు ?? అసలు కథలు ఎందుకు రాస్తున్నారు??? అని అడిగితే ఇలా స్పందించారు. 

 

 

జాన్సన్  చోరగుడి


johnson
కథ నాకు వ్యాసాల రొటీన్ నుంచి అవుటింగ్ లాంటిది. కథలు రాయడం కథలు చదవడంతో మొదలవుతుంది. చదివిన కథ మనలో కొత్త గవాక్షాన్ని తెరుస్తుంది. ఫలితంగా మన మనోఫలకం మీద నూతన ఆవిష్కరణ జరుగుతుంది. అన్నీ సరిగ్గా కుదిరితే మనం రాసింది గొప్ప కథ కూడా కావచ్చు.  నేను చాన్నాళ్లు మంచి కథలు చదివాక, కథలు రాయాలనుకున్నాను.  అది కూడా ఆలస్యంగా కథలు రాయడం మొదలు పెట్టాను. ఇప్పటి దాకా పదిహేను కథలు రాశాను. వెనక్కు తిరిగి చూస్తే ఇప్పటికీ నేను రాయాల్సిన కథలు ఇంకా చాలా ఉన్నాయనిపిస్తుంది.
వ్యాస రచన నా ప్రధాన వ్యాపకం. ఆ రొటీన్ నుంచి బయటపడేందుకు కథలు రాస్తుంటాను. ఈ కథా సంకలనానికి ఎంపికైన …చివరి చర్మకారుడూ లేడు నాకోసం రాసుకున్న కథ. నా వ్యాసాలు అందరికోసం రాస్తే…. ఈ కథ మాత్రం నాకోసం రాసుకున్నాను. కానీ ఈ కథను చాలామంది తమదిగా  చేసుకున్నారు.  ఫోన్లు చేసి స్పందించారు.  అప్పటివరకూ అంతర్లీనంగా వున్న కల్చరల్ ఐడెంటిటీ క్రైసిస్ నుంచి వాళ్లు వెంటిలేట్ కావడాన్ని నేను గమనించాను. అస్తిత్వ ఉద్యమ ఫిలాసఫీ గొప్పతనమది. ఇందులో నేను కేవలం కేటలిస్టును మాత్రమే. తెలిసిన జీవితం కనుక తేలిగ్గా రికార్డు చేయగలిగాను. ఇప్పటిదాకా నాకు కనిపించిన దాని గురించి రాశాను. భవిష్యత్ లో కూడా రాస్తాను.

కే.ఎన్. మల్లీశ్వరి
malliswariఏ కథ ఎందుకు రాశావు అంటే చెప్పడానికి ప్రయత్నించగలనేమో కానీ కథలెందుకు రాస్తారు అంటే మాత్రం తత్తరపాటుగా వుంటుంది. రెడీమేడ్ సమాధానం నా వద్ద లేదు కనుక ఆలోచనలను గాలిపటం వలె ఆకాశంలోకి ఎగరేసి దారపు కొసను పదిలంగా పట్టుకోవడం కథకులకి తెలియాలి అనుకుంటాను. దానిని …శతపత్ర సుందరి కథలో కొంత ప్రాక్టీస్ చేశాను. స్వీయ నియంత్రణ వల్లనే చాలామంది గుర్తించిన
క్లుపత్తని ఆ కథలో సాధించగలిగాను.

అప్పటికి నాలుగేళ్లుగా నేను రాస్తున్న నవలలోని వందలాది ఘటనల్లోంచి రెండింటిని తీసుకుని కథగా మలిచాను. కనుక దాని నేపథ్యం విడిగా చెప్పడం సాధ్యపడదు. వందరేకలుగా వికసించే నవీన మహిళ జీవితంలోనుంచి వొక శకలాన్ని చిత్రించే ప్రయత్నం చేశాను. కథ వచ్చాక జరిగిన చర్చలోంచి గ్రహించగలిచే వొకటి రెండు అంశాలను మౌనంగా స్వీకరించాను. ముగింపు గురించిన ప్రశ్నలనూ అసంతృప్తులనూ గ్రహించాను. ఈ కథ గురించే కాకుండా సాధారణంగా నిశ్చయం, నిర్ణయాలతో కూడిన ముగింపులకి బాగా అలవాటు పడిపోయాం. కానీ జీవితపు నడకలో సందిగ్థస్థితి  ప్రభావమే ఎక్కువ. ఆస్థితిని చెప్పడం కోసమే కథని అట్లా ముగించాను.


విమల

 

విమల

నేను మొదట్లో కవిత్వం రాసేదాన్న.  తర్వాత వొకటి రెండు కథలు రాసిన తర్వాత కొంత విరామం తీసుకున్నాను. కవిత్వంలో చెప్పలేనిది కథ ద్వారా విస్తృతంగా ,  విభిన్నంగా చెప్పగలం. నాలోపల జరిగే ఘర్షణ, నేను నడిచొచ్చిన దారి, నేను చూసిన సమాజం…..నాలో ఆలోచనలను తట్టి లేపాయి. వాటిని సమాజంతో  వివరంగా పంచుకోవాలనిపించింది. ప్రతీ జీవితంలోని రకరకాల ఎత్తు పల్లాలుంటాయి.
వైరుధ్యాలుంటాయి.  నాకు నచ్చేవి, రాయాలనిపించేవి జీవితంలోని అనేక పార్వ్శాలను, మనిషిలోని పొరలను చెప్పగలగిన కథలు. అదే సమయంలో  కథలోపల సున్నితత్వం వుండాలి. జీవితం ఎంత విషాదంగా, దుర్మార్గంగా వున్నా కూడా….. దాంట్లో సౌందర్యం వుటుంది.  చీకట్లోంచి వెలుతురు చూసినట్లు ఆ సౌందర్యాన్ని కథలు చూపగలగాలి. వొక  ఉద్యమకారిణిగా సమాజంలో అనేక పరిణామాల్ని దగ్గర చూస్తుండడం వల్ల…రకరకాల జీవితాల్ని చూశాను. వాటిని కథ ద్వారా చెప్పాలనుకుంటాను.
అదే సమయంలో మన కథల్లో నిజాయతీ వుండాలి. మనం నమ్మని వాటిని రాయకూడదు.  అంటే రాసేదానికి,  జీవించేదానికి మధ్య పెద్ద అంతరం వుండకూడదు అని నేను నమ్ముతాను.   రచయితలుగా మనకు అనేక ప్రతిబంధకాలు వుంటాయి. వాటిని తెంచుకోగలగాలి. అనేక నియంత్రణలుంటాయి. మనం నమ్మింది చెప్పినపుడు సమాజం నుంచి కొంత వ్యతిరేకత రావచ్చు. దాన్ని ఎదుర్కోవడానికి రచయితలు సదా సిద్ధంగా వుండాలి. అలాగే రాసే విషయం పట్ల చిత్తశుద్ధి వుండాలి. ముఖ్యంగా  చెప్పాల్సింది….ప్రపంచీకరణలో భాగంగా ఇవాళ తెలుగు కథ కూడా మార్కెట్ వస్తువుగా మారుతోంది. సంచలనం కోసం, ప్రచారం కోసం రచయితలు ఆరాటపడుతున్నారు. సేలబిలిటీ…కోసం వెతుకుతున్నారు. ఇదో విషాదకరమైన పరిస్థితి. ఇన్ని ప్రతిబంధకాల మధ్య వీటన్నిటికీ లొంగకుండా నిజాయతీగా కథ
రాయాల్సిన బాధ్యత కథకుల మీద ఉంది.

ఉణుదుర్తి సుధాకర్
Sudhakar_Marine Linkకథా సాహితికి నా కథ ఎంపిక కావడం సంతోషకరం. కథలు చెప్పడం చాలా కష్టం. కవిత్వం రాయడం అందరివల్ల సాధ్యం కాదు. నాకు కథలు రాయడం సాధ్యమనిపించింది. నాకు కొన్ని విషయాల పట్ల..ప్రధానంగా చరిత్ర పట్ల ఆసక్తి వుంది. చరిత్ర లోతుల గురించి ఎక్కువగా తెలుసుకుంటాను. ఆ వెతుకులాటలోనే ఆనందాన్ని వెతుకుుంటాను. ఆ ఆనందాన్ని, నేను తెలుసుకున్న సంగతులను కథ ద్వారా చెప్పాలనుకుంటాను. రచయిత కథ ద్వారా అనేక విషయాలు చెప్పొచ్చు.  కథ చిన్నదైనా దాని ద్వారా చాలా సంగతులు ప్రతిభావంతంగా చెప్పవచ్చు.  ప్రముఖ చరిత్రకారుడు ఇ.ఎచ్.కార్ అన్నట్లు ఎవరి చరిత్రలు వారికుంటాయి. చరిత్ర అంటే ఏక శిలా సదృశ్యంగా వొకటే వుండదు. స్త్రీలకు, దళితులకు, గిరిజనులకు….ఇలా రకరకాలుగా ఎవరి చరిత్ర వారికి వేరుగా వుంటుంది. ఇటువంటి విషయాలన్నీ చర్చించేందుకు నేను కథను రాస్తుంటాను.

చిన్నయ్య
కవిత్వం చెప్పలేని విషయాలు కథలో చెప్పగలం. కథలో జీవితాన్ని, జీవితంలో వస్తున్న మార్పులను వివరించవచ్చు. తద్వారా  సమాజాన్ని చూపే ప్రయత్నం చేస్తాము…ఈ చూపే క్రమంలో ఎవరి దృక్పథాలు వారికి వుండవచ్చు. మన దృక్పథం,  నిజాయతీ, ఆచరణను మన కథలు ప్రతిబింబిస్తాయి. కథ రాయడమంటే నా దృష్టిలో వ్యవసాయం చేసినంత కష్టమైన పని. ప్రతీ కథా ఆరుగాలం సేద్యం లాంటిది. పంట చేతికొచ్చేదాకా….రైతు కంటిమీద కునుకులేనట్లు కథ పూర్తయ్యే దాకా నేను ప్రతీక్షణం ఆరాటపడతాను. ఈ క్రమంలో రకరకాలుగా ఆవేదన చెందుతాను.

కొట్టం రామకృష్ణారెడ్డి
kottamకథ గురించి అనేక ఆలోచనలు , అంతర్మథనం జరిగాక ఇక రాయలేనప్పుడే కాగితం మీద కలం కదులుతుంది. ప్రసవానంతరం బిడ్డని చూసుకున్న తల్లికి  పురిటినొప్పుల బాధ మరిచిపోయేంత అలౌకికానందం కలుగుతుంది. కథ పూర్తి చేశాక రచయితకు కూడా అంతే.   కథ పుట్టాక మాతృత్వపు మాధుర్యం అనుభవంలోకి వస్తుంది. దాన్ని ఎవరు మాత్రం వదులుకుంటారు…?

 

ఎం.ఎస్.కే. కృష్ణజ్యోతి

jyothi

విషయ వ్యక్తీకరణలో కవిత్వం భావకుల సాధనం. వ్యాసం వొకింత మేధావుల ఆయుధం. ఐతే కథ ఈ రెండిటింకి భిన్నంగా వొక అంశాన్ని జన సామాన్యానికి సులువుగా చేరువ చేసే చక్కని మాధ్యమం. అప్పుడప్పుడే ఊహ తెలిసి వస్తున్న పసివానకి అనుభవాలతో తలపండిపోయిన వృద్ధునికి కూడా ఆసక్తి కలిగించేది కథ. ఇతర సారస్వత మాధ్యమాలకి భిన్నంగా కథలో నిజ జీవితంలో లాగానే ఓ సంఘర్షణ వుంటుంది. ఆ సంఘర్షణ కథకుని ఊహలోంచి లేదా అనుభవం లోంచి వస్తుంది. ఆ ఘర్షణ నుండే పాఠకుడు తనను తాను కథతో తాదాత్మ్యం అవుతాడు. ఇలా కథకునికి, ఇతర ప్రపంచానికి వొక లంకె ఏర్పడుతుంది. నేను నివసించే అతి చిన్న ప్రపంచం నుంచి విస్తృత ప్రపంచంతో సంభాషించడానికి నన్ను నేను అనంతంగా వ్యాప్తి చెందిచడానికి నేను కథను ఎంచుకున్నాను.

గుడిపల్లి నిరంజన్
niranjanనేను చూసిన దళిత, అణగారిన వర్గాల, స్త్రీల జీవితాల్ని చెప్పడానికి కథల్ని రాస్తున్నాను. దళితుల చుట్టూ , వాళ్ల జీవితాల చుట్టూ అనేక సమస్యలున్నాయి. వాటిని సమాజానికి తెలియజేయడం నా బాధ్యతగా నేను భావిస్తాను. దాని ద్వారా సమస్య పరిష్కారం కావచ్చు, కాకపోవచ్చు.

కానీ  సమాజానికి చూపడం మాత్రం అవసరం. వ్యక్తులు, కుటుంబాలతో పాటూ పల్లెలు, ప్రకృతి వనరుల విధ్వంసం యధేచ్చగా జరుగుతోంది. ఆ విధ్వంసాన్ని చూపే క్రమంలోనే నేను నా  నీరెటుకాడి కల… కథను రాశాను.

చందు-తులసి
chandu

కథ రాయడానికి ఫలానా కారణమంటూ ఉంటుందా….అని ఆలోచిస్తే, వెంటనే చెప్పలేము.  కానీ బహుశా బయటకి చెప్పలేని అంతర్మథనం, ఆవేదన, ఆర్తి తప్పకుండా వుంటుంది. సమాజంలోని సంఘటనలకు మనుషులు రకరకాలుగా స్పందించవచ్చు.  బహుశా రచయిత  స్పందన కథ రూపం తీసుకుంటుందేమో. ఆ స్పందన వెంటనే బయటకు రాకపోవచ్చు. కానీ ఏదో వొక రోజు తప్పక బయటకు వస్తుంది.  మొత్తంగా గుండె లోతుల్లోని చెప్పుకోలేని బాధ, వలపోత, దుఖ్ఖ సముద్రం… మనకు నచ్చిన వ్యక్తితోనో, సమాజంతోనో పంచుకోవాలి అన్న ఆరాటమే కథ రూపంలో వస్తుంది.  నా మొదటి కథ… ఊడలమర్రి అలా బయటకు వచ్చిందే.

* * *

 

మీ మాటలు

  1. తహీరో says:

    బాగు బాగు … రచయితల మనసులో మాట మాకు అందింది. ఈ సంకలనం లో మిగిలిన మరో ముగ్గురి అభిప్రాయాలు కూడా జోడించి ఉంటె మహా బాగుగా ఉండేది … అయినా బాగుంది.

  2. కందికొండ says:

    అద్భుతమైన భావోద్వేగాలు రచయితలందరికి శుభాకాంక్షలు, ధన్యవాదాలు

  3. కొత్తగా కథ రాయాలనుకునే నా లాంటి వారికి మీ అభిప్రాయాలు మార్గదర్శనం చేశాయి .

  4. వెంకట్రావ్ దొడ్లంకి says:

    కథ రాయడం గురించి రచయిత(త్రు)ల భావాలు చదివాను, బాగున్నాయి. – ఆప్తచైతన్య

మీ మాటలు

*