దిల్దార్‌ కథకుడు

Dilavar book 1రచయిత ఏది రాస్తే అది పాఠకుడు చదువుకోవాలె. అది రచయిత  లేదా సృజనకారుడి హక్కు. హక్కుని గౌరవిస్తూనే బాధ్యతను గుర్తు చేసేవాడు విమర్శకుడు. రచయిత ఏమి రాయాలె, ఏమి రాయొద్దు అనే దాంట్లో పాఠకుడి ప్రమేయం ఉండాలా? వద్దా అనేది ఇవ్వాళ సాహిత్య చర్చలో ప్రధానాంశమైంది.   నిజానికి ఏ రచయితైనా తాను చూసిన, అనుభవించిన, దృష్టికి వచ్చిన లేదా తన మనసుకు తట్టి చర్చకు పెట్టాల్సిన/ తెలియజేయాల్సిన విషయాల్నే రాస్తాడు. ఈ రచనలే సామాజిక చైతన్యానికి తోడ్పడతాయి. రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్‌ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్‌/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ‘మనీ’ సాహిత్యం ‘మెనీ’ సాహిత్యంగా మారాలె!
ఈ కథ రచయిత దిలావర్‌ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్‌ని, దిమాక్‌ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు.
నిజానికి ఇవ్వాళ సమాజంలో జరుగుతున్న విషయాలను తీసుకొని వాటిలోతుల్లోకి పోకుండానే కొంతమంది తమది కాని, తమకు తెలియని జీవితాలను ‘డిమాండ్‌’ కథలుగా అల్లుతున్నరు. అట్లా గాకుండా సమాజ హితంగోరే రచయిత, పాఠకుడికి ఇది కావాలి, ఈ విషయం తెలియాలి అని వాటి మూలాల్లోకి వెళ్ళి తనదైన శైలిలో, శిల్పంలో, భాషలో చెబుతాడు. ఆ పని దిలావర్‌ సమర్ధంగా చేసిండు. కథాసృష్టిలో సమస్య ఉండవచ్చు, సంఘటనలూ, పాత్రలు, ఘర్షణ, జీవితమూ ఉండవచ్చు. అయినప్పటికీ ఆధునిక సమాజంలో సమస్యను తార్కికంగా ఆలోచించి మెజారిటీకి ఆమోదయోగ్యమైన పరిష్కారం చూపించినప్పుడే సాహిత్యానికి విలువ, గౌరవం పెరుగుతుంది. కొన్నిసార్లు మెజారిటీ సమాజం తమ సుప్థచేతన వల్ల కొన్ని విషయాను తిరస్కరించవచ్చు. ఆ విషయాల ఆమోదం పట్ల గుంజాటన ఉండొచ్చు. అట్లాంటి సమయంలో సామరస్యంగా, సమన్వయంతో మనసు నొప్పించకుండానే వారిని కన్విన్స్‌ చేయాల్సిన బాధ్యత కూడా రచయితపై ఉంటుంది. అందుకు వాహిక అస్తిత్వవాదమే! ఆత్మగౌరవం, అస్తిత్వాన్ని పెంపొందించే సాహిత్యమే సమాజానికి ఉపయోగమైంది. అవసరమైంది కూడా!
రచయిత లేదా సృజనకారుడు తనకిష్టంలేని ఏ విషయాన్ని, అంశాన్ని సాహిత్యీకరించబోడు. ఇతివృత్తంపై తాదాత్మ్యత, అవగాహన, పట్టు, లోతైన పరిశీలన, ప్రేమ లేకుండా రాసినట్లయితే అది పేలవంగా, నిస్తేజంగా, నిర్జీవంగా ఉంటుంది. ఆఖరికి రచయితను అభాసుపాల్జేస్తుంది. అందుకే నేటి సమాజంలో ఎట్లా జెప్పిండనే దాని కన్నా ఏమి జెప్పిండనేదే ప్రధానమైంది. ఎందుకు జెప్పిండనేది సామాజిక, రాజకీయాసక్తులపై, వ్యక్తిగత చైతన్యస్థాయిపై ఆధార పడి ఉంటది. వస్తువే అన్నింటికీ మూలం. అస్తిత్వోద్యమాలకు పూర్వం ఈ వస్తువుల ఎంపికలో రచయితలపై అభ్యుదయ, ప్రగతిశీల, విప్లవ భావజాలాల ప్రభావం ప్రస్ఫుటంగా ఉండింది. శైలీ, శిల్పాలు కథలను డామినేట్‌ చేసినవి. ప్రామాణిక భాష పేరిట అజమాయిషీ కొనసాగింది.
తెలుగు సాహిత్యంలో మొదట అగ్రకులస్తులు తమ జీవితంలో భాగమైన ‘సామాజిక సంస్కరణ’ ఇతివృత్తంగా రచనలు చేశారు. దీని లోని డొల్లతనాన్ని ముందు పేజీల్లో తెలుసుకుందాం. అయితే తొలి దశలో అక్షరాస్యులైన బ్రాహ్మణులతో పోలిస్తే వారి ద్వారా, వారి ఆలోచనలు, భావజాలం, ప్రభావాలకు అనివార్యంగా, పూర్తిగా లోబడాల్సి వచ్చిన కింది కులాల వాండ్లు మెల్లమెల్లగా ఒడిదొడుకుల్ని అధిగమించారు. తక్కువగానే అయినా రాజకీయ, ఆర్థిక అంశాలపై రచనలు చేసిండ్రు. తెలంగాణలో గూడూరి సీతారామ్‌, జి.రాము, సీమాంధ్రలో కొలుకలూరి ఇనాక్‌ తదితరులు అట్లాంటి వారికి ప్రతినిధులు. వీళ్ళు బహుజన జీవితాలను చిత్రికగట్టిండ్రు. బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు. ఇట్లా రాసిన వారిలో రాయసీమ నుంచి కె.సభా లాంటి దళితులు, ఆంధ్రా నుంచి అందే నారాయణస్వామి లాంటి బహుజనులున్నారు. సాయుధ పోరాటం, నక్సలైట్‌ ఉద్యమ సందర్భంగా కొంత మేరకు కింది కులాల వారి జీవితాలు కథా సాహిత్యంలోకి వచ్చాయి. ఇందుకు ఉదాహరణ ఆవుల పిచ్చయ్య, అల్లం రాజయ్య కథలు. అయితే ఈ ‘పోరాట రచనలు’ అంతిమంగా అగ్రకులాల వారిని హీరోలుగా, రోల్‌ మోడల్స్‌గా, మరీ ముఖ్యంగా బ్రాహ్మణుల్ని ఉన్నతలుగా నిలబెట్టడానికీ, మరింతమంది ‘అమరు’లు కావడానికి మాత్రమే తోడ్పడ్డాయి.
బ్రాహ్మణాధిపత్య సాహిత్యానికి భిన్నంగా గ్లోబలైజేషన్‌ తర్వాత, మండల్‌ కమీషన్‌ అమలు, బాబ్రీమసీదు ‘షాహిద్‌’, కారంచేడు, చుండూరు దాష్టికాల  తర్వాత, మరీ ముఖ్యంగా 1990ల  అనంతరమే అస్తిత్వ సాహిత్యం పాదులూనుకుంది. దానికి పై సంఘటనూ, అవి సమాజంలో తెచ్చిన మార్పు, ఉద్యమాలు, ఉద్యమాలకు ఊతమిచ్చిన పత్రికలూ, వాటికి అక్షరరూపమిచ్చిన జర్నలిస్టు, సాహితీవేత్తల  మూలంగా అస్తిత్వ సాహిత్యానికి స్థిరత్వం ఏర్పడింది. దీన్ని తర్వాతి కాలంలో అన్నికులాల  అకడమిషయన్లు అనివార్యంగా గుర్తించాల్సి వచ్చి సాహిత్యచరిత్రలో భాగం చేశారు. 1980వ దశకం నుంచి విద్యారంగంలోకి   టీచర్లుగా బ్రాహ్మణేతరులు కూడా ఎక్కువగా వచ్చారు. దీనికి కొంత రిజర్వేషన్లు, మరికొంత బహుజన చైతన్యం కారణం. దీంతో అప్పటివరకు ప్రభుత్వ పాఠశాలల్లో చదువుకుంటున్న అగ్రకులాల  వాండ్లు, బ్రాహ్మణులు  బహుజనుల  దగ్గర నేర్చుకోవడానికి సిద్ధంగా లేరు. అందుకే వాళ్ళు అప్పటికే అందివచ్చిన ప్రైవేటు, కార్పోరేట్‌ కళాశాలలను ఆశ్రయించారు. గ్లోబలైజేషన్‌ కారణంగా ఈ దశలో ప్రైవేటు విద్యాసంస్థలు, కార్పోరేట్‌ కళాశాలలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటయ్యాయి. వీటిలో ఎక్కువభాగం బోధకు అగ్రకులాల  వాండ్లే కావడం యాధృచ్ఛికం కాదు. ఇవి డాక్టర్లు, ఇంజనీర్లను తయారుచేసే ఫ్యాక్టరీలుగా పనిచేశాయి. ఇట్లా తొలిదశలో ఈ విద్యాసంస్థల్లో అభ్యాసం చేసిందీ, దాని ద్వారా మల్టినేషనల్‌ కొలువులు సంపాదించింది అత్యధిక శాతం కచ్చితంగా అగ్రకులాల  వాండ్లే! నక్సలైట్‌ ఉద్యమం పుణ్యమా అని గ్రామాల నుంచి నగరాల్లోకి మకాం మార్చిన రెడ్లు, వెలమలు, దొరలు, భూస్వాములు, వారికి తోడు అప్పటికే పట్టణ/నగరబాట పట్టిన బ్రాహ్మణులు  తెంగాణలో ఈ అవకాలశాను అందిపుచ్చుకున్నారు. వీరికే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగాలు  తొలిదశలో అందాయి. ఈ తరం పిల్లలు సామాజిక మార్పుకు అనుగుణంగా ప్రజలతో ఎన్నడూ మమేకం కాలేదు. తాము ‘ఎబోవ్‌ ద కట్‌’ అన్న దృక్పథంతోనే వ్యవహరించారు. అదే విషయాలు  సాహిత్యంలోనూ చోటు చేసుకున్నాయి. చేటు చేశాయి.
మొదట చెప్పుకున్నట్టు 1990 కన్నా ముందు ఒకటి రెండు మినహాయింపుతో సాహిత్యమంతా అగ్రకులాధిపత్యాన్ని నిలబెట్టే విధంగానే ఉండింది. (కేవలం  సక్సెస్‌ స్టోరీస్‌ మాత్రమే రాసిన కొలకలూరి ఇనాక్‌ సకల ఆధిపత్యాలను అస్తిత్వ సోయితో ఎదిరించిన వారిలో ఆద్యుడంటే అతిశయోక్తి కాదు) ఈ దశలోని విప్లవ సాహిత్యమూ వర్గ దృక్పథాన్ని మాత్రమే ప్రచారం చేసింది. బహుజనులూ  అదే పంథాను అనుసరించారు. కథా సంకలన కర్తలు, సాహిత్యరంగంలో బ్రాహ్మణాధిపత్య భావజాలం  గల  విమర్శకులు చెప్పిందే తీర్పుగా చలామణి అయింది. వారి ఆలోచన చట్రంలో ఇమడని సాహిత్యాన్ని తూర్పారా పట్టేవారు. చీల్చి చెండాడే వారు. అంతిమంగా అంతో ఇంతో రాయగలిగిన సత్తా వున్న వాళ్ళు సైతం ఈ విమర్శల  మూలంగా అసలే రాయడం మానేసిండ్రు. తప్పు సరిదిద్ది ముందుకు నడిపించేదిగా గాకుండా విమర్శ అనే ఖడ్గంతో కలాలను నరకడమే లక్ష్యంగా పనిచేసిండ్రు. ముఖ్యంగా కింది కులాలవారి అక్షరాలను నరికి కుప్పలు పోసిండ్రు.
kaifiyath
అనాది కాలం  నుంచి దాదాపు గ్లోబలైజేషన్‌ ప్రభావం విస్తృతమయ్యే వరకూ బ్రాహ్మణులు తమ కులంలోని సతీ సహగమనం, వేశ్యాలోలత, వితంతు వివాహం, మధ్యతరగతి ఉద్యోగస్థుల  బాధలు, ప్రేమలు, పెళ్ళి ళ్లు, లైంగిక స్వేచ్ఛ, శృంగారం ప్రధానంగా రచనలు చేసిండ్రు. ఇవే ‘విప్లవ’, ‘అభ్యుదయ’, ‘ప్రగతిశీల’ రచనలుగా చలామణి అయ్యాయి. ఈ సాహిత్యంలో కింది కులాల  జీవితాలుగానీ, ఘర్షణగానీ అతి స్వల్పంగా  రికార్డయింది. నిచ్చెనమెట్ల సమాజాన్ని ఈ సాహిత్యం నిలదీయలేదు. పరిష్కారాలన్నింటినీ వర్గ దృక్పథంతో తాము గిరిగీసుకున్న పరిధిలో, పరిమితిలోనే వెతికారు. 1980వ దశకం నుంచీ పాక్షికంగానే అయినా బెంగాల్‌ బుద్ధిజీవులు ‘సబాల్టర్న్’ జీవితాలను చరిత్రకెక్కించినారు. అయితే వీరికి అక్కడి కానూ సన్యాల్‌ మాత్రమే కనిపించిండు. అణగారిన కులాల వారి బాధలు  వీరి కలాలకు ఆనలేదు.
అందుకే ఇవ్వాళ అస్తిత్వోద్యమ సాహిత్యకారులు ప్రధానంగా సమాంతర సాహిత్యాన్ని సృజిస్తున్నారు. సబాల్టర్న్  దృక్కోణంతో సమాజాన్ని చూస్తున్నరు. ప్రతిమనిషికి సమాన విలువ ఉండే సమ సమాజ నిర్మాణం కోసం సాహిత్యాన్ని వాహికగా ఎంచుకున్నరు. అస్తిత్వ చైతన్యంతో కిందినుండి చరిత్రను నిర్మిస్తూ, తమ సమస్యలకు అదే సోయితో జవాబులు  వెతుకుతున్నారు. ప్రతి సమస్యకూ అస్తిత్వ సోయే సమాధానమిస్తుందని నమ్ముతున్నరు. సృజనకారులతో పాటు విమర్శకులూ  ఇప్పుడు కొత్త తూనికరాళ్ళను తయారు చేసుకున్నరు. మూస పద్దతిలో గాకుండా బహుజన సోయితో వివిధ అంశాలకు, సమస్యలకు సమాధానాలు వెతుకుతున్నరు. కొత్త విషయాల్ని వెలికి తీస్తున్నరు. ఘనతను చాటుతున్నరు. పాఠకుల  తరపున, సమాజం తరపున విమర్శకులు  మాట్లాడుతున్నరు. 1990 నాటి విమర్శకు ఇవ్వాలటి విమర్శకు తేడా ఉంది. అందుకు విప్లవ సంస్థల  నుంచి బయటికి వచ్చిన వారు కొత్తదారులు  వేసిండ్రు. శివసాగర్‌ పయనం అందుకొక ఉదాహరణ. దరకమే లాంటి సంస్థలు  కొత్త ఆలోచనను ప్రోది చేశాయి. దండోరా ఉద్యమం కొత్త వాదనకు వేదిక అయ్యింది. మహాజన, సమాంతర, బహుజన కెరటాలు లాంటి పత్రికలు దారి చూపాయి. ఆనాడు విమర్శ వర్గ దృక్పథంతోనే ఉండింది. ఇవ్వాళటి విమర్శ అస్తిత్వ సోయితోటి, వర్ణ దృక్పథంతోటి ఉన్నది. ఇది రియాలిటీ. ఆనాటిది హైపోథీసిస్‌. అనుభవంలో హైపోథీసిస్‌ తప్పని తేలింది. అనేక చేదు నిజాలు  ముస్లింలు, దళితులు, బహుజనులు తమపై జరిగే దాడుల్ని మరింత బలంగా ఎదుర్కునేందుకు సన్నద్ధం చేస్తోంది.
ఇండియాలో ఇవ్వాళ ప్రధానంగా రెండు అంశాలున్నాయి. ఒకటి కులం. రెండు మతం. అయితే విమర్శకుడు మాత్రం రచయితలకున్న హక్కులకు భంగం కలుగకుండానే ఏది? ఎందుకు? ఎలా? ఎప్పుడు? ఎవరు? రాయలేదు, రాశారు! అని విమర్శించడానికి వీలుంటది.  ఈ విషయాలు చర్చకు పెట్టడం ద్వారా మేలైన సాహిత్యం` మెరుగైన సమాజం కోసం రావడానికి వీలవుతుంది. సమస్యలోతుల్లోకి వెళితే పరిష్కారం దొరుకుతుంది. ఈ రెండు సమస్యల్ని రాజకీయార్థిక కోణాల్లో గాకుండా కులం, మతం దృష్టి కేంద్రంగా చూడాలి. రాజకీయంగా ఎవరి జనాభా నిష్పత్తి మేరకు వారికి చట్టసభల్లో ప్రాతినిధ్యం ఎందుకు లేదో తెలుసుకోవాల్సి ఉంది. అలాగే ఆర్థిక విషయంలో పేదరికానికి నిర్వచనాలు మారుతున్నాయి. పేదరికానికి కులం, మతంలో కారణాలు వెతికినప్పుడు ఆధిపత్యుల దోపిడీ, అణచివేత తెలిసి వస్తుంది. అప్పుడు శత్రువెవరో తేట తెల్లమవుతుంది. పేదరికానికి, కులం మతంతో గ సంబంధాను, కార్య`కారణాను విశ్లేషించుకున్నప్పుడు కచ్చితంగా రచయిత జ్ఞానంలో, తద్వారా అభిప్రాయాల్లో మార్పు ఉంటది. కుంపై, మతాధిపత్యంపై తిరుగుబాటు ఉంటది. ఆర్థిక, రాజకీయ రంగాల్లో వర్గాధిపత్యం, అగ్రకులాధిపత్యమే సమాజంలో పేదరికానికి కారణమనే అవగాహన ఏర్పడినట్లయితే సమస్యలు  మరింత సుళువుగా పరిష్కరించుకోవడానికి మార్గమమేర్పడుతుంది. ఈ విషయంలో ఆధిపత్యుల  ‘మేధోత్వాన్ని’, కుట్రలను అర్థం చేసుకోవాలి. ఈ కుట్రలను చేధించడానికి ఫూలే, అంబేద్కర్‌ రచనలు, ఆచరణే శరణ్యం.
పూలే సామాజిక ఆధిపత్యాన్ని మొట్టమొదటిసారిగా గుర్తించి దానికి వ్యతిరేకంగా పోరాటం చేసిండు. అందులో భాగంగా మేలైన మార్పుకోసం విద్యను ఆయుధంగా చేసుకున్నడు. కింది కులాలకు, మహిళలకు చదువు నేర్పడం ద్వారా  సమస్యకు పరిష్కారం చూపించిండు. ‘గులాంగిరీ’ ద్వారా సాహిత్యదారులేసిండు. పూలే చనిపోయిన తర్వాత పుట్టిన అంబేద్కర్‌ తన మేధో సంపత్తితో పూర్తిగా సామాజిక విప్లవానికి కృషి చేసిండు. అంబేద్కర్‌ రచనలు  ఎంత విరివిగా అందుబాటులోకి వస్తున్నాయో అంతే స్థాయిలో బహుజన చైతన్యం పెరిగి గతంలో పాదులూనుకున్న సిద్ధాంతాలను బద్ధలు  కొడుతోంది. తొలితరం అక్షరాస్యు లు ఇవ్వాళ అన్ని ఉద్యమాల్లో ముందున్నరు.
సంస్కరణ పేరిట బ్రాహ్మణీయ సాహిత్యాన్ని ఇంతకాలం  విప్లవ సాహిత్యంగా, అదే సమాజాన్ని మారుస్తుందని అభ్యుదయ వాదులు  తప్పుడు భావనల్ని ప్రచారంలో పెట్టడం జరిగింది. (శ్రీశ్రీ సాహిత్యాన్ని సమగ్రంగా చదివితే ఇది అర్థమైతది) దీని వల్ల  కులానికి వచ్చిన నష్టమేమీ లేదు. దాని స్థానంలో అది ఖాయంగానే ఉంది. ఈ నిచ్చెన మెట్ల సాహిత్యాన్ని తలకిందులుగా చేయాలి. అది సాధ్యం కాని స్థితిలో కనీసం సమాన స్థాయి ఏర్పడే సాహిత్య సృజన జరగాలి. ఆధిపత్యకులాలని తలకిందులు  చేయకుండా నాలుగైదు శాతం మాత్రమే ఉన్న వారి సామాజికాధిపత్యానికి చరమగీతం పాడడం సాధ్యం కాదు. నిజానికి సమాజ పరిణామ క్రమాన్ని అర్థం చేసుకోవడానికి పనికొచ్చినంతగా సమాజాన్ని మార్చడానికి మార్క్సిజం పనికిరాదు. ‘అంతిమ ఘడియ’ (ఫైనల్‌ డిస్టినేషన్‌) వచ్చిన తర్వాత ఏం చేయాలి అనేది మార్క్సిజం చెప్పలేదు. అంతిమఘడియ అంటే విప్లవం వచ్చిన తర్వాత మనిషి పూర్తిగా స్వేచ్ఛా జీవి అవుతాడు. ఏ రకమైన సంకెళ్ళు ఉండవు. సొంత ఆస్తి ఉండదు. ఉదయం వేటాడటం, మధ్యాహ్నం చేపలు  పడుతూ, సాయంత్రం సాహిత్య విమర్శ చేస్తాడు అని మార్క్స్‌ భావన. ఇండియాలో ఈ పనులన్నీ  వేర్వేరు సామాజిక వర్గావారు చేస్తారు. అందుకోసమైనా కులం పోవాలి. అందుకే ఇండియాలో మార్క్సిజం ఆచరణ యోగ్యం కాదు. ఈ విషయాలన్నింటినీ కూలంకషంగా అర్థం చేసుకుంటే గానీ సమాజస్వభావం తెలిసి రాదు. ఇందులో ఆధిపత్యకులాలవారి అజమాయిషీకి ముందుగా తెరదించాలె. ఇది అస్తిత్వ సోయితోనే సాధ్యం. సకల  సమస్యలకు రాజ్యమే కారణం అని ఒక గంపగుత్త సూత్రంతో సామాజిక అంశాల్ని పరిశీలిస్తే సమస్యలకు ఎన్నటికీ పరిష్కారం దొరకదు.
భారతదేశంలో పారిశ్రామికీకరణ జరగకముందే (ప్రిమిటివ్‌స్టేజ్‌) ప్రాథమిక దశలోనే సామాజిక శ్రమ విభజన జరిగిందని మార్క్స్‌ ఇండియా మీద రాస్తూ చెప్పిండు. అంటే మార్క్స్‌ అర్థంలో పారిశ్రామికీకరణ అభివృద్ధి చెందే క్రమంలో శ్రమ విభజన జరుగుతుందనే అవగాహన ఉంది. కాని భారతదేశంలో దానికన్నా ముందే ఈ విభజన సామాజికంగా జరిగింది అంటే దాని అర్థం కులవిభజనే!
దేశీయ మార్క్సిస్టు ఉద్దేశ్య పూర్వకంగానే కులాన్ని 1990కు ముందు పట్టించుకోలేదు. కారంచేడు, చుండూరు సంఘటనల తర్వాత కొంత మార్పు వచ్చింది. అయినా ఈనాటికీ మార్క్సిస్టులకు, వాటి కుల, ప్రజాసంఘాలకు  పైకి కనిపిస్తున్నట్టుగా కులమనేది ప్రధానమైన అంశం కాదు. దీన్ని దృష్టిలో పెట్టుకొనే అంబేద్కర్‌ ‘ఇండియాలో శ్రమవిభజన కాదు. శ్రామిక విభజన ఉంది’ అని వాదించాడు. కుల సమస్యను గుర్తించ నిరాకరిస్తూ, అణగారిన వర్గాలపై అగ్రకులాధిపత్యాన్ని లెఫ్టిస్టు పార్టీలు ఇప్పటికీ స్థిరీకరించుకుంటున్నాయి.
ఇవ్వాళ కమ్యూనిస్టులు, మార్క్సిస్టులూ  రాజకీయ, ఆర్థిక అంశాలకు ప్రాధాన్యత నిస్తూ కులం, మతం వాటి మూల స్వభావాలను విస్మరిస్తున్నారు.  మార్క్సిస్టు భావజాలం  1990లకు ముందు నుంచి రాస్తున్న సృజనకారులను ఆవహించింది. అట్లా అనడానికి ఎవరికైనా అభ్యంతరం ఉంటే ప్రభావం చూపిందని చెప్పొచ్చు. కులం, మతంతో సంబంధం లేకుండా చైతన్యవంతులైన అప్పటి సాహితీవేత్తలందరూ తమకు తెలియకుండానే బ్రాహ్మణాధిపత్య భావజాలానికి లోబడి ఉన్నారు. కులాన్ని, మతాన్ని వీళ్ళు ప్రశ్నించలేదు. ఈ బలహీనతకు కారణం మార్క్సిజం.
ఈ కథల రచయిత దిలావర్‌ కూడా ఈ బహీనతల నుంచి బయటపడలేదు. రైతు, చేనేత కార్మికుల ఆత్మహత్యలను సమర్దవంతంగా చిత్రించిండు. అట్లనే ముస్లిం పేదరికాన్ని చిత్రించిండు. దానికి తోడు లంబాడీ దయనీయమైన స్థితిగతుల్ని ఏకరువు బెట్టిండు. కరువు పీడననూ లెక్క గట్టిండు. అత్యాచారాలను ఎమర్జెన్సీ కాలంలోని రమీజాబీ నుంచి ఈనాటి ఆయేషా వరకు గుడ్లనీళ్ళు  తిరిగేలా చెప్పిండు. సరోగసీ లాంటి ఆధునిక అంశాలను అక్షరీకరించిండు. వీటన్నింటినీ ఆయన తనకున్న చైతన్యంతోటి రాజకీయ, ఆర్థిక దృక్కోణంలో రాసిండు. ఈ చైతన్యమంతా లెఫ్టిస్ట్‌ సాంగత్యంతోనే వచ్చింది. ఇది వర్గ దృక్పధాన్నే నేర్పింది గానీ వర్ణ దృక్పథాన్ని, మత దృక్పథాన్ని అలవర్చలేదు. మీదు మిక్కిలి అట్లా చూడడం తప్పని స్థిరీకరించింది. దీని వల్ల  ‘జరీనా’ కథలో లైంగిక హింస, పేదరికం ప్రధాన వస్తువైంది. దాన్ని అస్తిత్వ సోయితో జయించే అవకాశముండింది. ఇట్లా జయించి ఫెయిల్యూర్  స్టోరీని, సక్సెస్‌ స్టోరీగా చెప్పేందుకు అవకాశముండింది. ఇందుకు దిలావర్‌ని తప్పుపట్టాల్సిన అవసరం లేదు. అస్తిత్వసోయిని అందుకోకుండా అడ్డుకున్న సిపిఎం కార్యశాలదే ప్రధాన బాధ్యత. అయినప్పటికీ తనలోని కాన్షియస్‌నెస్‌ ఈ విషయాలను మూగగా ఆమోదించడానికి సిద్ధపడలేదు. అందుకే ‘‘ధనిక పేద వర్గాల మధ్య, అగ్ర దళిత వర్ణాల మధ్య, పెత్తందార్లూ పనివాళ్ళ మధ్య ఈ వివక్ష ఇలాగే కొనసాగితే దేశం త్వరలోనే ప్రమాదపుటంచున పడుతుందని కూడా ఎవరైనా ప్రమాద ఘంటికలు  మోగిస్తే బాగుండును’’ అని తన మనసులోని మాటను ‘నగ్నసత్యం’ కథలో చెప్పిండు. ఇప్పుడు అస్తిత్వ సోయితోటి ముస్లింవాదులు, దళిత, బహుజన వాదులు, స్త్రీవాదులూ  ఈ ప్రమాదాలను ప్రచారం చేస్తున్నరు. నిజానికి తెలుగునాట స్త్రీవాదం పుట్టుకొచ్చిందే రమీజా బీ కేసు నుంచి అంటే అతిశయోక్తి కాదు. స్త్రీ వాదం రావడానికి అంతర్జాతీయ, జాతీయంగా అనేక కారణాలున్నప్పటికీ ఇది తక్షణ కారణమైందని చెప్పొచ్చు. దిలావర్‌ సీనియర్‌ రచయిత కావడం మూలంగానే ఎమర్జెన్సీ కాలం నాటి రమీజా బీ కేసును రెండు కథల్లో పేర్కొన్నడు.
1978 మార్చి 29`30 రాత్రి రమీజా బీ తన భర్తతో కలిసి ‘యమగోల’ సినిమా చూసి వస్తూ ఫీవర్‌ హాస్పిటల్‌ దగ్గర తన భర్త మూత్రం పోయడానికి వెళితే వెయిట్‌ చేస్తున్నది. ఈ సమయంలో నల్లకుంట  పోలీసులు  ఆమెను తీసుకెళ్ళి ఎస్సై, కానిస్టేబుల్స్‌ పోలీస్‌ స్టేషన్‌లోనే అత్యాచారం చేసి ఆమె ప్రాస్టిట్యూట్‌, విటులను ఆకర్షిస్తుండగా పట్టుకున్నామని కేసు పెట్టారు. భర్తని లాకప్‌ డెత్‌ చేసిండ్రు. ఈ కేసు ఆనాడు తెలుగునాట ప్రజాస్వామిక వాదులందరినీ కుల, మతాలకు అతీతంగా కదిలించింది. దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ముఖ్తదర్‌ కమిటీని ఏర్పాటు చేసింది. దోషులను నిర్ధారించింది. ఈ పోరాటంలో చురుగ్గా పాల్గొన్న వారే తర్వాతి కాలంలో ‘విమెన్స్‌ గ్రూప్‌’గా ఏర్పడ్డారు. రమా మెల్కోటె, వసంత కన్నబీరన్‌, లలిత తదితరులు ఈ ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ఈనాటి తరానికి అంతగా తెలియని విషయాన్ని దిలావర్‌ పేర్కొని ఎనుకటి విషయాలను మరొక్కసారి తెరమీదికి తెచ్చిండు. గతాన్ని తోసుకొని వర్తమానంలో విశ్లేషించుకొని భవిష్యత్‌కు దారులు వేయాల్సిన సమయంలో రమీజా బీని గుర్తు చేసినందుకు దిలావర్‌ అభినందనీయుడు.
దిలావర్‌ ఖమ్మం జిల్లా వాడు కావడం, ఆనాదిగా ఆ జిల్లా రాజకీయాలు, ‘చైతన్య’, ‘ప్రగతిశీల’, ‘ప్రభావశీల’ కార్యక్రమాలు, సాహిత్యశాలలు, పుస్తక ప్రచురణలు, సమీక్షలూ  అన్నీ సిపిఎం, సిపిఐ కేంద్రంగా ఆ పార్టీ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ‘విజృంభణ’ ‘తిరుగుబాటు’, ‘న్యూడెమోక్రసీ’, ‘ప్రజాశక్తి’ ఇప్పటి నవ తెలంగాణ అన్నీ ఒకే సామాజిక వర్గం ఆధీనంలో ఉన్నయి. విప్లవ చైతన్యమంతా ఇక్కడే పోగయింది. పోగయింది అనేకంటే పోగు పెట్టబడిందంటే కరెక్టేమో! వీరి ప్రాబల్యం  ఇప్పటికీ అక్కడ కొనసాగుతది. దిలావర్‌ ముఖ్యంగా సిపిఎం పార్టీతో మమేకమై ఉండొచ్చు. శ్రీశ్రీ మొదలు  తెలకపల్లి రవి దాకా అంతా ఆంధ్రత్వమే అక్కడ పరుచుకుపోయి ఉంది. దీంతో తాను ప్రభావితం కావడమే గానీ తాను ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్‌వే. లెఫ్ట్‌ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ  అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం.
ఖమ్మం జిల్లా రాజకీయాలన్నీ ఒకే సామాజికవర్గం ఆధిపత్యంలో కొనసాగుతున్నాయి. పార్టీలు వేరైనా పీడితుల పక్షానా, పీడకుల పక్షానా కూడా వీళ్ళే వకాల్తా పుచ్చుకుంటారు. అందుకే ఇక్కడ అస్తిత్వవాద రాజకీయాలకు, విభిన్న అస్తిత్వాలకు ఆదరువు కరువు. ఉద్యమ కాలంలో తెలంగాణ రచయితల వేదిక అన్ని జిల్లాల్లో మీటింగ్‌లు పెట్టగలిగింది గానీ ఖమ్మం జిల్లాలో ఆ పనిచేయలేక పోయింది. ఖమ్మం జిల్లాలో శీలం సిద్దారెడ్డి, జలగం వెంగళరావు తర్వాత అన్నీ పార్టీల్లోనూ ఏక కులాధిపత్యం నెలకొంది. ఈ కులాధిపత్యం వర్ణ దృక్పథాన్ని తప్పుగా, ద్రోహంగా ప్రచారం చేసి, వర్గ దృక్పథాన్ని ప్రోత్సహించింది. ఈ ప్రోత్సాహ కార్యక్రమాలు క్రమం తప్పకుండా ‘సాహితీ స్రవంతుల’ ద్వారా, పార్టీ పత్రిక ద్వారా, వందిమాగధుల ద్వారా నిరంతరం కొనసాగుతున్నాయి. ఇప్పటికీ తెలంగాణకు అనుకూలంగా ఎక్కడా, ఎప్పుడూ తీర్మానం చేయకబోయినప్పటికీ సిపిఎం పల్లకీని ఇక్కడి బోయీలు మోస్తున్నారు.
ఇవ్వాళ మొత్తం తెలంగాణాలో ఎస్టీలు ఎక్కువగా ఉన్న జిల్లా ఖమ్మం. 2011 జనాభా లెక్కల ప్రకారం మొత్తం తెలంగాణలో 31,77,940 మంది (ఆంధ్రాకు పోయిన ఏడు మండలాల జనాభాతో కలిపి) ఆదివాసీలు/ గిరిజనులు అంటే ఎస్టీలున్నారు. మొత్తం ఖమ్మం జిల్లా జనాభా  26,07,066. ఇందులో 25.18 శాతం జనాభా 6,56,577 ఎస్టీలున్నారు. అలాగే 16.84శాతం ఎస్సీలున్నారు. అంటే ఈ జిల్లా మొత్తం జనాభాలో దాదాపు 42 శాతం మంది ఆదివాసీలు, దళితులున్నారు. ఈ 42 శాతంతోపాటు మొత్తం జిల్లా ప్రజలందరి తరపున కేవలం నాలుగు శాతం మాత్రమే అదీ ఒక్క సామాజిక వర్గమే మాట్లాడుతోంది. వాళ్ళు ఎంత చెబితే అంత అన్నట్టుగా ఇవ్వాళ పరిస్థితి ఉంది. అందుకే తెలంగాణలోని ఏడు మండలాలు ఆంధ్రాలో కలిపినప్పుడు ఉద్యమం పెద్దగా రూపొందలేదు. ఈ సామాజిక వర్గాల ప్రయోజనాలు ఆంధ్రాతో ముడిపడి ఉండడంతోనే ఉద్యమాలు పెద్దగా రాలేదు. వైఎస్సార్‌ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ముదిగొండ ఘటనలో దళిత రైతులే ఎక్కువగా ప్రాణాలు కోల్పోయారు. ఈ పోరాటానికి సిపిఎం నేతృత్వం వహించింది. ఈ ఉద్యమంలో రైతుల ప్రాణాలు పోయినాయి తప్ప లభించిన ఫాయిదా ఏమీ లేదు. అంటే ఒక ఉద్యమం చేసి దళిత రైతుల ప్రాణాను బలిగొంటే మరో ఉద్యమం చేయకుండా ఉండి ఆదివాసీల ఉసురు తీసింది. నిజానికి సిపిఎం బలంగా ఉన్న ఈ జిల్లాలో ఆదివాసీలకు అండగా ఉండి చైతన్య కార్యక్రమాలు చేపట్టాల్సింది. సాహిత్యంలో వీటిని ప్రతిఫలింప జేసుండాల్సింది. ఉద్యమాలు లేవు, సాహిత్యంలో చోటూ లేదు.
ప్రత్యేక తెలంగాణ ఉద్యమం బలంగా ఉండీ అంతో ఇంతో ఉద్యమం పట్ల జిల్లాలో సానుభూతి ఉన్నప్పటికీ సభలు నిర్వహించడానికి ఇక్కడి నుంచి ఎవ్వరూ ముందుకు రాలేదు. వ్యక్తులుగా కొంతమంది తెలంగాణ వాదులు ఇక్కడ ఉంటే ఉండొచ్చుగానీ సంస్థలుగా తెలంగాణ వాదానికి మద్ధతు దక్కలేదు. అయితే ముస్లిం అస్తిత్వ వాదానికి వచ్చే సరికి ఖమ్మం జిల్లా నుంచి ఇతర ప్రాంతాలకు వలసబోయిన వారే అండగా నిలిచారు. స్థానికంగా జిల్లాలో ఉన్న వాళ్ళు ముస్లిం వాదంతో పెద్దగా మమేకం కాలేక పోయిండ్రు. నిజానికి అనాది నుంచి ఖమ్మం జిల్లా తెలుగులోరాసే అత్యధిక ముస్లిం కవులను/ రచయితలను కన్నది.
ఈ జిల్లా నుంచి షంషుద్దీన్‌ (కౌముది), దావూద్‌ అలీ, సికిందర్‌ మొహసిన్‌, ఎం.ఎ. రెహమాన్‌, సయ్యద్‌ షఫీ, అఫ్సర్‌, షేక్‌ రఫీ, హనీఫ్‌, షుకూర్‌, షంషాద్‌, షాజహానా, ఇక్బాల్‌ చంద్‌, ఖాజా, అక్బర్‌, ఖమ్రొద్దీన్, జావేద్ ఇట్లా అనేక మంది ముస్లిం కవులు తెలుగులో రాసిండ్రు. అట్లనే ఉర్దూలో ముస్లింలతో పాటుగా కవిరాజమూర్తి, హీరాలాల్‌ మోరియా తదితరులు రాసిండ్రు. వీరిలో యాభై ఏండ్ల సాహితీ జీవితం ఉన్న ఏకైక వ్యక్తి దిలావర్‌ ఒక్కడే అంటే అతిశయోక్తి కాదు. 1974లో  ‘వెలుగు పూలు’ కవిత్వం వెలువరించిన నాటి నుంచీ భారతి పత్రికలో సీరియల్‌ నవలాకారుడిగా, ‘వెన్నెల కుప్పలు’ పోసి ‘జీవన తీరాల’కు చేర్చిండు. ‘కర్బలా’ కవిత్వంతో పాటు సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ‘గ్రౌండ్‌ జీరో’ దీర్ఘ కవిత వెలువరించిండు. ఇటీవల తెలుగు యూనివర్సిటీ ‘ప్రతిభా’ పురస్కారం అందుకున్న దిలావర్‌ రచనకు దక్కాల్సినంత గౌరవం దక్కలేదనే చెప్పొచ్చు. పోలవరం, ఆదివాసీ జీవితాన్ని రికార్డు చేస్తూ ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకంగా వెలువరించినా దాన్ని ఏ ‘సాహిత్య శాల’లు గుర్తించలేదు. ఈయన ఎవరితోనైతే ఇన్నేండ్లూ అంటకాగాడో, లేదా కలిసి మెలిసి ఉన్నాడో వాళ్ళు ఆధిపత్య స్వభావంతో మెలగడంతో రాష్ట్ర స్థాయి వ్యక్తిని ఖమ్మం జిల్లాలో కూడా గుర్తించ లేదు. 1972 నుంచి ఇప్పటి  వరకు దాదాపు తన వయసుతో సమానంగా కథలు రాసిండు. అందులో కొన్ని గతంలో ‘మచ్చుబొమ్మ’, ‘కొండా కోనల్లో’ పేరిట పుస్తకాలుగా వెలువడ్డాయి. తన జిల్లా వాడే అయిన జాతీయ కవి ‘దాశరథి కవితా వ్యక్తిత్వ పరిశీలన’ అనే అంశంపై పరిశోధన చేసి డాక్టరేట్‌ పట్టా అందుకున్నడు. నిజానికి దిలావర్‌ తన ముస్లిం/ దూదేకుల అస్తిత్వాన్ని త్యాగం చేసి అభ్యుదయ, ప్రగతిశీల సాహిత్యానికి జీవితమంతా ధారపోసిండు. చివరికి ‘అభ్యుదయ’ సాహిత్యం గురించి విమర్శ చేసే వారెవ్వరూ దిలావర్‌ని పేర్కొనరు. ఆకాశంలో గాకుండా నేలమీద నిలబడి ఏ సామాజిక వర్ణాలకు వాళ్ళు ముందుగా తోడ్పడాలి అనే గుణపాఠాన్ని దిలావర్‌ సాహితీ జీవితం నేర్పుతుంది. ముస్లిం సమాజానికీ ఆ మేరకు నష్టం జరిగింది. అది ఇప్పట్లో పూడేది కాదు. అణచివేతకు గురైన దూదేకుల జీవితం దిలావర్‌కు లేకపోయి ఉండొచ్చు గానీ తాత కాలంలో వందెకరాల స్థలం తన కాలానికి రెండు ఎకరాలుగా మారిన విషయాన్ని, అందుకు కారణాలను  ఆయన వెతకాల్సింది. ‘అభ్యుదయం’లో గాకుండా ‘అస్తిత్వం’తోనే ఈ విద్య అలవడుతది.
తెలంగాణలోని అన్ని జిల్లాలతో పోలిస్తే ఖమ్మం జిల్లాలోనే అత్యల్పంగా ముస్లిములున్నారు. ఈ జిల్లాలో 2001 (2011 లెక్కలు అలభ్యం) లెక్క ప్రకారం 1,37,639 మంది ముస్లిమున్నారు. అయితే తెలుగులో ముస్లింవాద సాహిత్యాన్ని అగ్రభాగంలో నిలబెట్టింది ఖమ్మం జిల్లానే! కవిత్వం, కథలు, నవలల ద్వారా ఈ జిల్లా రచయితలు ముస్లిం జీవితాల ను చిత్రికగట్టిండ్రు. వాదాలను నిలబెట్టేందుకు సాహితీదావాలు ఎదుర్కొన్నరు. ముస్లిం/దూదేకుల స్త్రీల కథలూ, కవిత్వం ఇక్కడి నుంచి వచ్చాయి. దిలావర్‌ తాను స్వయంగా ముస్లిం వాదం గురించి విస్తృతంగా రాయక పోయినప్పటికీ ఆ లోటుని ఆయన కూతురు షాజహానా కథల్లోనూ, కవిత్వంలోనూ, పరిశోధనలోనూ పూరించింది. ఇది ఖమ్మం జిల్లాకు గర్వకారణం కూడా! దేశంలోనే గాకుండా డయోస్పోరా సాహిత్యంలోనూ ఈ జిల్లా ముస్లింలు ముందంజలో ఉన్నారు. అఫ్సర్‌, షంషాద్‌ అందుకుదాహరణ. ముస్లింవాదంతో పాటు తెలంగాణ అస్తిత్వోద్యమంలో కూడా ఇక్కడి వాళ్ళు పాల్గొన్నారు. అయితే వీళ్ళందరూ జిల్లాకు ఆవల ఉన్న వాళ్ళు కావడమే విశేషం.
తన 75 ఏండ్ల జీవితంలో సాహితీ స్వర్ణోత్సవాన్ని జరుపుకుంటున్న దిలావర్‌ ఇప్పటి వరకు ఎనిమిది కవితా సంపుటాలు, నాలుగు నవలలు, రెండు కథా సంపుటాలు వెలువరించాడు. ఇది మూడో కథా సంపుటి. నిజానికి ఖమ్మం జిల్లా కారేపల్లి మండలానికి చాలా సాహిత్య చరిత్ర ఉంది. ఇక్కడే సింగరేణి గనులకు పునాదులేర్పడ్డాయి. 1945 ఆ ప్రాంతంలో జాతీయ గ్రంథాయ మహాసభలు ఇక్కడ జరిగాయి. ఈ మట్టి పునాదుల మీదుగానే తెలంగాణ సాయుధ పోరాట జీవితాన్ని పర్చా దుర్గాప్రసాదరావు కథలుగా మలిచిండు.
మళ్ళీ ఈ పుస్తకం విషయానికి వస్తే ఇది 15 కథల ఈ సంపుటి. ఇందులో దాదాపు పది కథలూ చావులూ, ఆత్మహత్యల చుట్టూ తిరుగుతాయి. రైతు, చేనేత కార్మికుడూ బాధితులు. శవాలు కాస్తున్న చెట్టు, నగ్నసత్యం, ఉరితాళ్ళు ఆత్మహత్యతో ముగిశాయి. క్షతగాత్రుడు, దగ్ధహృదయం, జరీన, నీ పెద్దోడొచ్చిండమ్మా, ఎడారి బతుకు, అమ్మా నన్ను చంపెయ్‌, తీజ్‌ కథల్లో చావు, దాని చుట్టూ ఉన్న వ్యదార్థ జీవితాలు రికార్డు చేసిండు. మరో శాకుంతలం, తీజ్‌లో మోసపోతున్న లంబాడీ స్త్రీల జీవితాలున్నాయి. ఆధునిక ఇతివృత్తంతో పద్మ లేశిపోయింది కథలో ‘సర్రోగసీ’కి ఒప్పుకున్న పేద మహిళ, నోస్టాల్జియాకు సంబంధించి చంద్రుడు గియ్యని బొమ్మలు, మృగణ ఇందులో ఉన్నాయి.
ముందుగా ఆత్మహత్యల విషయానికి వద్దాం. శవాలు కాస్తున్న చెట్లు కథలో గుంటూరు, కృష్ణా జిల్లాల నుంచి ఖమ్మం జిల్లా తల్లాడ అడ్డాగా కోట్ల రూపాయల నకిలీ విత్తనాల వ్యాపారం, అధికార్ల అలసత్వం, నకిలీ ఎరువులు,  నకిలీ పురుగు మందులు వెరసి రైతుని ఎట్లా పీల్చి పిప్పి చేస్తున్నాయో చెప్పిండు. దళారీల మోసం ఒక వైపూ, మరోవైపు వానల్లేక, బోర్లు తవ్వి, అప్పుల పాలై, రెక్కలు తెగిన పక్షిలా విలవిలలాడిన రైతు రామయ్య గురించీ, కూలీలు దొరక్క ఇంటిల్లిపాది పనిచేసినా ఫలితం లేక పోవడంతో రైతు చేనుగట్టు మీదున్న చెట్టుకు ఉరేసుకోవడాన్ని హృదయం ద్రవించేలా చెప్పిండు. అట్లాగే ఇంతకుముందే చెప్పుకున్నట్లుగా ‘నగ్నసత్యం’ కథలో ‘మట్టిలో పుట్టి, మట్టిలో పెరిగి, మట్టిలోనే కలిసిపోవాన్నంత మమైకత్వంలో నేల తల్లిని నమ్ముకున్న బూమయ్య’ను పరిస్థితులు ఏ విధంగా ఆత్మహత్యకు పురిగొల్పాయో చెప్పిండు. కట్నం డబ్బు కోసం అత్తింటి వేదింపుల నెదుర్కొన్న కూతురు, ఇంజనీరింగ్‌ చదువుకు డబ్బుల్లేక దొంగగా మారిన కొడుకు సంగతి రాసిండు. చేతికొచ్చిన పంట తుపాను కారణంగా వర్షం పాలు కావడంతో ‘హలం పట్టిన ఆ చెయ్యి చీకట్లో హాలాహలం కోసం వెదికింది. పురుగుమందుకు పురుగుల్ని చంపే శక్తే కాదు, కష్టాలను రూపుమాపే శక్తి కూడా వుంది. బూమయ్య లాంటి కష్టజీవులకు ఆ విషయం బాగా తెలుసు. అందుకే కష్టాల నుండి శాశ్వతంగా దూరం గావడానికి గరళాన్ని గళంలోకి వంపుకున్నాడు’ అని రైతుని చంపేసిండు. ఇవన్నీ భరించలేక పిచ్చివాడిగా మారిన కొడుకు బతుకుని కూడా దిలావర్‌ గుడ్ల్ల నీళ్ళు తిరిగేలా చెప్పిండు. ‘ఉరితాళ్ళు’ కథలో ఇంటిల్లిపాది పనిచేసినా మగ్గం బతుకు ఆకలిని తీర్చలేకపోవడం, సర్కారీ దవాఖానాలో వైద్యం సరిగ్గా దొరక్క, ఇంకా చెప్పాలంటే చికిత్స నిరాకరించడంతో చనిపోయిన గర్భిణీ కూతురు గురించి చెప్పిండు. ‘‘నూలుకట్టలు ఎప్పుడైతే తడిసిపోయాయో అప్పుడే తన బ్రతుకు చీకిపోయింది. మగ్గం ఆడటం ఎప్పుడైతే ఆగిపోయిందో అప్పుడే తన కాళ్ళూ చేతులూ పడిపోయాయి. రాట్నం తిరగడం ఎప్పుడైతే మానివేసిందో అప్పుడే తన జీవిత చక్రం ఆగిపోయింది. టకటకలాడే ఆసు ఎప్పుడైతే నిశ్చలనమైందో అప్పుడే తనలోని చైతన్యం మాయమైంది. ఇక ఇంతకన్నా మరణం అంటూ వేరే ఏముంటుంది’’ అని చంద్రం గోసను చిత్రించిండు. (అన్ని కథల్లోనూ  గ్రౌండ్‌ వర్క్‌ చేసి పదాలను ఉపయోగించిండు. అయితే ఇక్కడ ఆసు బదు నాడె అనే పదం వాడాల్సింది) పాణం తీసుకున్న తీరుని వివరించిండు. వీటికి భిన్నమైన కథ ‘అమ్మానన్ను చంపేసేయ్‌’. ఇందులో స్త్రీ వ్యదార్థ జీవితాలను, పసిపాపనుంచి ముసలి వాళ్ల వరకూ రోజూ అత్యాచారాలకు గురవుతున్న తీరుని గుండె తడయ్యేలా చెప్పిండు. దిమాక్‌ కన్నా ఎక్కువగా ‘దిల్‌’తోటి ఆలోచించిండు కాబట్టే ఇవి పాఠకుడి గుండెల్ని పిండేస్తయి. ‘అమ్మా నన్ను చంపేసెయ్‌’ కథలో నిర్భయ, ఆయేషా, రమీజాబీలను ప్రస్తావించిండు. వివిధ దేశాల్లో స్త్రీలు ఇంటా బయటా ఎట్లా లైంగిక హింసకు గురవుతుండ్రో రాసిండు. అయితే ఇందులో పాజిటివ్‌ అంశమేంటంటే స్త్రీలపైన ఎన్ని అఘాయిత్యాలు జరిగినా ‘‘ఏది ఏమైనా.. నా చిట్టి తల్లీ..! నిన్ను నేను చంపుకోను… అవసరమైతే మీ నాన్నను.. బామ్మను.. తాతయ్యను.. బాబాయిలను.. అత్తమ్మను.. యీ లోకాన్నైనా ఎదిరించి… నా ప్రాణంలోని ప్రాణమా! నిన్ను బతికించుకుంటాను.. నిన్ను చంపుకోలేను.. నో..నో..నో..’’ అని కరుణతో కరాఖండిగా చెప్పిస్తాడు. చావు కన్నా పాణం విలువ ఎక్కువ అని తేల్చి చెప్పిండు. కథలో భాగంగా చాలా సంగతులు చెప్పుకొచ్చిండు. ఇవన్నీ ఇటీవల జరిగినప్పటికీ సాహిత్యంలో చోటు చేసుకోలేదు. సంఘటనలు సాహిత్యంలో చోటు చేసుకున్నప్పుడే వాటి చారిత్రక విలువ ఇనుమడిస్తది. నోయిడాలో అన్నెం పున్నెం ఎరుగని అమ్మాయి కళేబరాలు, యాసిడ్‌ దాడులు, కూల్‌డ్రింక్స్‌లో మత్తుమందు, ఆఖరికి అంధబాలికపై అత్యాచారాలు జరుగుతున్న తీరుని చెప్పిండు. ఇండ్లల్లో, స్కూళ్ళల్ల్లో, కాలేజిల్లో అమ్మాయిలకు ఎక్కడా భద్రత లేదంటూ, ఆయేషాను ఇబ్రహీంపట్నంలో ఎంత కిరాతకంగా హతమార్చి అనుభవించింది రాసిండు.
ఇక చావుల విషయానికి వస్తే స్త్రీ దృక్కోణంలో దగ్ధహృదయం కథలో  ప్రభుత్వాసుపత్రిలో అవినీతి నిండుగర్భిణిని ఎట్లా పొట్టన పెట్టుకుందో చెప్పిండు. మారుమూల పల్లెల్లో వైద్యసదుపాయం లేని కారణంగా ప్రజలు పడుతున్న ముఖ్యంగా రెక్కాడితేగాని డొక్కాడని రైతు, కూలీ జిందగీని చిత్రించిండు. చావు వాళ్ళ జీవితంలో ఎట్లా భాగమైనాయో రాసిండు. బోర్ల నీళ్ళు సరిగ్గ అందక, కరెంటు కోతకు ఎండిన పంటకు మంట పెట్టిన రైతు ధర్మయ్య గురించీ రాసిండు. ఇక్కడ గర్భిణిని, పొట్టకొచ్చి ఎండిపోతున్న పంటను పోలుస్తూ మనస్తాపానికి గురైన రైతు వ్యథను చిత్రించిండు. తీజ్‌ కథలో సొంత అన్ననే వదినను వశబరుచుకోవడానికి హతమార్చిన లంబాడీ మంగీలాల్‌ దురాగతాన్ని చెప్పిండు. లంబాడీ ఆచార వ్యవహారాలను, వారి భాషను, ఆ స్త్రీ హృదయాలను ఆవిష్కరించిండు. ఎడారి బతుకుల్లో గల్ఫ్‌కుపోయిన వాళ్ళు ఎన్ని ఇబ్బందులు ఎదుర్కుంటున్నారో, ఎలాంటి అత్యాచారాలకు గురవుతున్నారో, ఎవరెవరి మోసాలకు గురవుతున్నారో చెప్పిండు.
చావుల్లో కూడా భిన్నమైన కథ ‘క్షతగాత్రుడు’. స్కూలు చదువు రాకున్నా, నల్లగా ఉన్నా శ్రావ్యమైన గొంతుతో, కంఠస్థమైన భాగోత పద్యాలతో అందరి మన్ననలందుకున్న ‘కర్రోడి’ హృదయవిదారకమైన జీవితాన్ని చెప్పిండు. ఇందులో బయటికి మాత్రం స్వగతంలో కథ చెబుతున్న వ్యక్తే హీరోగా కనిపించినప్పటికీ నిజమైన కథానాయకుడు అభిమానంతో, ప్రాణత్యాగం చేసిన కర్రోడే గొప్ప.
‘పద్మ లేశిపోయింది’ కథ సరోగసీ అనే ఆధునిక అంశాన్ని తెరమీదికి తెచ్చింది. పేదరికం, దుబాయి పోయిన ప్లంబర్‌ భర్త, పిల్లలకు కనీస వైద్యసదుపాయం అందించలేని దయనీయమైన స్థితి పద్మని సరోగసీకి ఎలా ఒప్పుకునేలా చేసిందో రాసిండు. అట్లనే సరోగసీకి దాదాపు మూడు లక్షలు అడ్వాన్స్‌గా ముట్టజెప్పిన తీరు, ఆ డబ్బుని తనను కనీసం ఇంట్లకు కూడా రానివ్వని అత్తమామలకు అందేలా కిటికిలోంచి పడేయడాన్ని, దాన్ని అత్త కాలబెట్టానడం, మామ వాడుకోవాలని చూడడాన్ని వాస్తవ పరిస్థితులకు అద్దం పట్టేలా చిత్రించిండు.
మూడుతరాలు కథలో మాదిగోళ్ళ పనిముట్లన్నీ రికార్డు చేసిండు. అంతేగాదు తరాలు మారిన తలరాతలు మారని మాదిగోళ్ళ జీవితాలను హైదరాబాద్‌ వలసొచ్చినా గ్లోబలైజేషన్‌ మూలంగా ఎదుగూబొదుగూ లేని సంసారాన్ని చిత్రికగట్టిండు.
గుండెను తడి చేసుకొని దిలావర్‌ తన కథల్ని రాసిండు. కండ్ల్ల నీళ్ళు నింపుకొని చదువుకునేలా రాసిండు. చావులు, హత్యలు, ఆత్మహత్యలు ఏది రాసినా వాళ్ళ దుఃఖాన్ని ఫీలయి రాసిండు. దేనికదే ఇగ ఇదే ఆఖరు చావు కావాలని ఆరాట పడ్డడు. దిలావర్‌ పూర్తి కాన్షియస్‌గా రాయకపోయినా దూదేకుల జీవితాన్ని చిత్రించిన కథలు కూడా ఇందులో ఉన్నాయి. అందులో చంద్రుడి గియ్యని బొమ్మలు ఒక బుక్కా ఫకీరు ఊరి నుంచి వలసొచ్చి నగరంలో ఇగ ఇంతకన్నా పోయేదేమి లేని జీవితాన్ని, వెన్నెల ఆస్వాదాన్ని, ఆ వెన్నెల అందరికీ ఒకే తీరుగ వెలుగునివ్వడాన్ని కవిత్వ రీతిలో కథ అల్లిండు. ఇందులోని భాష  తెలుగు-ఉర్దూ మిశ్రమాలతో పక్కా హైదరాబాదీ యాసను పట్టిచ్చింది. ఈ పుస్తకంలోని కథలన్నీ ఖమ్మం జిల్లా నానుడులు, సామెతలతో అలంకరించబడ్డాయి. అంతేగాదు జరీన కథలో బురఖాకు తావులేని, కూలీ బతుకును, రోజు రోజుకూ దిగజారుతున్న ముస్లిం/ దూదేకుల స్త్రీల జీవితాలను, లైంగిక దోపిడీని, భర్త, కొడుకూ ఇద్దరూ గుట్కాకు, తాగుడుకు బానిసలై చనిపోవడాన్ని, బతికుండీ శవంలాగా మారిన తాగుబోతు తండ్రినీ ఇందులో చిత్రించిండు.
అంతిమంగా ఇందులోని ఒకటి రెండు మినహా మిగతా అన్ని కథలూ కింది కులాల వారి ఫెయ్యిూర్‌ స్టోరీలను రికార్డు చేసింది. కనీసం తినడానికి తిండి దొరకని స్థితిలో ఒక పద్మశాలి చేనేత కార్మికుడు ఆత్మహత్య చేసుకోవడాన్ని ‘ఉరితాళ్ళు’ కథలో, మరో శాకుంతం, తీజ్‌ కథల్లో లంబాడీ స్త్రీ మోసాలకు, లైంగిక దోపిడీకి, మైదాన ప్రాంతం వారి చేతిలో ఆటవస్తువుగా మారిన తీరుని చెప్పిండు. పద్మ లేశిపోయింది ఒక ప్లంబర్‌ దుబాయి పోయి సచ్చిండో బతికుండో తెలియని స్థితి. ఎడారి బతుకుల్లో కూడా బహుజనుల జీవితాలే రికార్డయ్యాయి. నగ్నసత్యం, దగ్దహృదయం, శవాలు కాస్తున్న చెట్లు, క్షతగాత్రుడులో బహుజన రైతు, కళాకారుడి చావుల్ని చిత్రించిండు. మూడు తరాలు పూర్తిగా మాదిగోళ్ళ కథ. అట్లనే జరీన, చంద్రుడు గియ్యని బొమ్మలు దూదేకుల పేదరికాన్ని పట్టిచ్చే కళాఖండాలు. జ్ఞాపకాల తెరలను చిన్నప్పటి బతుకును మృగణ, నీ పెద్దోడొచ్చిండమ్మా కథల్లో చెప్పిండు.
ఒక ఉపాధ్యాయుడు జీతంతో సంబంధం లేకుండా, అవిశ్రాంతంగా ఐదు దశాబ్దాలు సాహిత్యమే జీవితంగా గడపడమనేది అబ్బుర పరిచే విషయం. ముఖ్యంగా టీచర్లంతా జీతం రాగానే చిట్టీలు, భవిష్యత్తావసరాలు అని పొదుపు చేస్తూ ఉంటారు. అయితే దిలావర్‌ 1974 నుంచి పుస్తకాలు వేయడమే గాకుండా, ఎక్కడ సాహితీ సమావేశం జరిగినా వెళ్ళిండు. ఏ సాహితీవేత్త వచ్చినా తన ఇంట్లో ఇంత జాగా ఇచ్చిండు.  పరిశోధన, సృజనాత్మక రచనా రెండు భిన్నమైన అంశాలు. అయితే ఈ రెండిరటిని సమన్వయం చేసి నడిపించిన మార్గదర్శి దిలావర్‌. సాహిత్యం తనతోనే ఆగి పోకుండా తర్వాతి తరానికి షాజహానా, షంషాద్‌ రూపంలో అందించిన దిలావర్‌కు అభినందనలు.
*

మీ మాటలు

  1. కవి/రచయిత అంటే తన ఆలోచనలతో కవిత అనే ఓ అమ్మాయిని పుట్టించి ఓలీ లాంటి ప్రతిఫలం పుచ్చుకొని రసజ్ఞుడైన పాఠకునికి తన కవితను అందిస్తాడు. ఇక్కడ కవి ఆ కవితను సృష్టి చేస్తుంది రసజ్ఞుడైన కృతిభర్త కోరిక మీదనే అని గుర్తుంచుకుంటే…కవి ఏమి వ్రాయాలో నిర్ణయించేది పాఠకుడేనని తెలుస్తుంది. ఇక విమర్శకుడంటే అమ్మాయిల బ్రోకర్ వంటివాడు. ఆయా కవితలలోగల ప్రత్యేకతలను పాఠకులకు ఊరిస్తూ చెబుతూ ఆ పుస్తకాలు అమ్ముడుబోవడానికి సహకరించేవాడు. “రచయిత ఏమి రాయాలో పాఠకుడు నిర్ణయించలేడు. పత్రిక, లేదా పాఠకుడి డిమాండ్‌ని బట్టి సాహిత్యం వస్తే/ రాస్తే అది కమర్షియల్‌/ కలుషిత సాహిత్యమే అవుతుంది గానీ కమనీయ సాహిత్యం కాదు. ” అనే వాదనకు భూమిక లేనట్లుంది.
    విమర్శకుడు కధకుని గొప్పదనాన్ని “ఈ కథ రచయిత దిలావర్‌ ‘మెనీ’ అంటే సమాజంలోని మెజారిటీ జీవితాల్నే చిత్రికగట్టిండు. ఇందులో కథకుడు తన జ్ఞాపకాలను నెమరువేసుకున్నడు. తాను దగ్గరి నుండి చూసిన పద్మశాలి, మాదిగ, లంబాడీ జీవితాల్లోని దయనీయమైన వ్యధాభరిత గాథల్ని కళ్ళముందుంచిండు. ఒక వైపు నోస్టాల్జియాను చిత్రికగడుతూనే, చిధ్రమవుతున్న రైతుల, స్త్రీ జీవితాల్ని ద్రవించిన హృదయంలోంచి పాఠకుల మెదళ్ళలోకి ఒంపిండు. దిల్‌ని, దిమాక్‌ని కలెగలిపి కమనీయ సాహిత్యాన్ని మనముందుంచిండు. పాత్రలు ఉరి బెట్టుకున్నా కథలకు మాత్రం పాణం బోసిండు. చేదు నిజాల్ని తీపి పూత లేకుండా పాఠకులకు అందించిండు. ‘ఉత్పత్తి’ జీవితా హృదయావిష్కరణ చేసిండు. “ ఈ విధంగా పొగిడిండు.
    వాస్తవానికి కవులు పాఠకులు విజ్ఞానాన్ని బోధించేవారు కాదు. అలాగా ఇది మంచిది… అది మంచిదిగాదు అని చెప్పేది కవిత్వం కాదు. కవిత్వమంటే నవరసాలను పాఠకులు అనుభవించేలా చేసేది.
    కొలకలూరి ఇనాక్ వంటివారు ప్రత్యేక రకమైన రచయితలు కాదు. వారు కూడా అందరిలాంటివారే. విమర్శకులు ఇనాక్ గారి వంటి కవులలో ఏదో ప్రత్యేకత ఉందని పాఠకులను ఊరిస్తున్నారు. అంతకుమించి మరేమీ లేదనుకుంటున్నాను. రాజుల జీవితాలు లేదా ధనవంతుల జీవితాలను ఆసరాగా తీసుకొని రచనలు చేసేవారు పేదలను లేదా బహుజనుల జీవితాలను ఆసరాగా చేసుకొని రచనలు చేసేవారికంటే వేరైనవారు కారు. అందరూ కవులే.
    “బ్రాహ్మణాధిపత్య విద్యాబోధన నుంచి బయటపడ్డ వారు తర్వాతి కాలంలో ఆలస్యంగానే అయినా కొత్త విషయాలను కథలుగా మలిచిండ్రు” కానీ బ్రాహ్మణ ఆధిపత్య విద్యాబోధన నుండి ఇంతవరకూ ఎవరూ బయటపటలేదు. ఆ ప్రయత్నం కూడా ఎవరూ చేయలేదు. ఎందుకంటే అది ఎలా చెయ్యాలో వారికి తెలీదు. నిజానికి బ్రాహ్మణ ఆధిపత్యము అంటే భావవాదధోరణి అని అనుకుంటున్నాను.

    ( ఇంకా ఉంది . కానీ….)

    • hari venkat says:

      ….ప్రభావితం కావడమే గానీ…. ప్రభావితం చేసేందుకు అవకాశం దక్కలేదు. వేదిక చిక్కలేదు. ఇది వన్‌వే. లెఫ్ట్‌ పార్టీ నుంచి దళిత, బహుజనులు స్వీకరించడమే గానీ తాను నేర్చుకున్నది అప్పజెప్పడానికి, ప్రభావితం చేయడానికి ఏ సాహిత్యశాలలూ, సాహిత్యకారులూ అవకాశం కల్పించబోరు. అది వారి ఆచరణకు విరుద్ధం….కరెక్ట్ #

మీ మాటలు

*