దృష్టీ సృష్టీ కలిస్తే బాబా కవిత్వం!

baba

 

 

జీవితంలో తారసపడే ఒక సందర్భమో,  సంఘటనో కవిత్వానికి ప్రేరణ. ఆ అనుభవమే కవితకు సృజన రూపం. అనుభవాన్ని నిర్వచించుకోవటం కొంతవరకు అసాధ్యమే. అనుభవానికి కూడా కొన్ని నిర్దిష్టమార్గాలున్నాయి. ఒక దృశ్యం నుంచి సామాజికానుభవాలు ఎదురైతే, సృజన ఆదిశలో రూపాన్ని పొందుతుంది. తాత్వికానుభవం పొందితే ఆ తాత్వికత కవిత్వమౌతుంది. దృశ్యంలో సౌందర్యం, మానవీయత, నైతికత లాంటివి కవిత్వమవటంలోనూ ఇదే ప్రధాన కారణం. ఈ అనుభవం సృజనరూపానికి తగిన భాషను కూడా ఇస్తుంది.

వ్యక్తీకరణ సిద్ధాంతాలు దాని పరిధులమేరకు బోధి,అనుభూతి,రూపం,పద్ధతి,ముగింపు అనే రూపాల్లో అవధారణను కలుగ చేస్తాయి” అంటాడు రూసో.

ధారణ మేరకు కలిగే బోధి సామాజిక, తాత్విక కళావిష్కరణలు వేటినైనా చేస్తుంది.ఇది ఆసక్తిని బట్టి ఉంటుంది.అది ఏ రూపంలో ప్రతిఫలిస్తుందనేదే ప్రధానం.అనుభూతి రూపం కళాసంబంధాలు. ఇవి కళావిష్కరణనే ప్రధానంగా చేస్తాయి.ఇందులోనూ అనుభూతి రస(aesthetic taste) సంబంధమైంది. రూపం ప్రతీక (symbol)సంబంధమైంది. ఈమూడు వ్యక్తీకరణ పద్ధతిని ,ముగింపును నిర్దేశిస్తాయి.

బొల్లోజు బాబా కవిత్వంలోఅనుభూతి ప్రధానమైన కవితలున్నాయి. మానసికంగా అనుభూతికో అనుభవానికో వచ్చిందాన్ని మార్దవంగా చెప్పడం తప్ప నిడివికోసం ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయకపోవడం. మనసు వేసిన ముద్రను అంతే సౌందర్యాత్మకంగా అందించడం ఈవాక్యాల్లో కనిపిస్తుంది.ప్రధానంగా కవిత్వంలో ఒక ధ్యానం ఉంటుంది. ఈ ధ్యానం గొప్ప భావ చిత్రాలను గీసేలా చేస్తుంది.

 

1.చెట్ల ఆకులు ధ్యాన ముద్రలో ఉన్నాయి/కొలను అలలు కూడా వాటిని కలచ సాహసించడం లేదు/నీటిపొడలు నిశ్సబ్దంగా తొంగి చూస్తున్నాయి./పరిమళాలసంచారం నిలచిపోయింది“-(తపస్సు-1)

2.”క్రోటాన్ మొక్కలు ఇంద్ర ధనుస్సుని/పగల గొట్టుకుని/పంచుకున్నట్లున్నాయి/లేకపోతే మొజాయిక్ గచ్చులా/ఇన్ని రంగులెలా వస్తాయి“-(ప్రాగ్మెంట్స్-5)

3.”వేకువని/తలో ముక్కా పంచుకున్నాయి పక్షులు//కిరణాల్ని పేచీలేకుండా పత్రాల సంచుల్లో పంచుకున్నాయి తరువులు

ఇంద్ర ధనుస్సుని/పొరలు పొరలుగా ఒలుచుకుని/పంచుకున్నాయి పూలు“-(అసమానతలు-11)

4.సూర్యుని వేడి రక్తపు చుక్కలు/నెర్రలు తీసిన భూమి చర్మం

చలి చీకటితాగి/మెరుస్తున్న అకాశపుటిరుకు సందులు“-(దేహమూ నీడా-32)

5.నేలకోరిగిన తూనిగపై పూలవాన/అధ్భుత సమాధి/చుంబించుకున్న పెదాలు అదృశ్యమైనా/ఎప్పటికీ పరిమళించే ప్రేమలా“-(నువ్వుకాదు నేనే-40)

8.రాలిన పత్రాల్ని/లోనికి లాగేసుకుని/పూవులుగా అందిస్తాయి/తరువులు“-(ప్రాగ్మెంట్స్-71)

padam.1575x580 (2)

 

ఈ వాక్యాలన్నీ ధ్యానాన్ని చూపుతాయి. సౌందర్యాన్ని పట్టుకోవడానికి నైపుణ్యం కావాలి. “చూడగలిగిన కళ్ళు తారసపడినప్పుడు వస్తువులో సౌందర్యం రెండితలవుతుంద”న్నారు సంజీవదేవ్.ఈ అనుభవాన్నే శ్యామదేవుడు”కావ్యకర్మణీ కవేః సమాధిఃపరం వ్యాప్రియతే”-(కావ్యరచనలో కవికి సమాధి ఉపయోగపడుతుంది)అన్నాడు.ఈ రమ్యాలోకనను జపానీలు -జెన్ ఆచార్యులు “సతోరి”అన్నారు.పేరేదైనా ఈ ధ్యానాత్మక దర్శనంలోని అనుభవం పై వాక్యాలను అందించింది.

బాబా వాడుకునే భాష ప్రతీకల భాషగాదు.ఉహా మాత్రమైన అనుభూతితో భావచిత్రాలను గీస్తారు.వాస్తవికతకు మించి ఊహించడం వల్ల ఇది సాధ్యపడింది.ప్రధానంగా సౌందర్య చిత్రణలోని ఊహాత్మకత,భావన క్రియల్లో ఉంటుంది.”పరిమళాలు నిలచ్పోవడం””ఇంద్ర ధనస్సుని పగల గొట్టుకుని పంచుకోవడం””చీకటి తాగటం”ఇలాంటివి అందుకు నిదర్శనాలు. ఒక పద్ధతిని అనుసరించి ఊహలో సౌందర్యాన్ని సాధిస్తారనడానికి ఒకటి ,రెండు, మూడవ వాక్యాల్లోని రెండు వాక్యాల్లో “పంచుకోవడం “అనే క్రియ సాధారణ మవడం నిదర్శనం.రూపం,పద్ధతి అనే అంశాలు ఇక్కడ కనిపిస్తాయి.

కావ్యతత్వ విచారాన్ని ఆధునిక దర్శన శాస్త్రాలు వాస్తవ వివేచన,ప్రమాణ విచారణ,ప్రయోజన విచారణ అనే విభాగాలలో జరుగుతుందన్నాయి.ఇవి మీమాంస కాలానికి”ప్రకృతి స్వభావం,దాన్ని తెలుసుకుని సౌందర్యాత్మకం చేసిన పద్ధతులు,సిద్ధించిన ప్రకృతి జ్ఞానం ద్వారా జీవితలక్ష్యాల పరిశీలన”అనే అంశాలద్వారా తాత్విక స్థితికి చేరుతాయి.ఈ పరిక్రియల ద్వారా ప్రకృతి సౌందర్యానికి అక్కడినుండి జ్ఞానానికి ప్రయాణిస్తుంది.నాలుగులో “రక్తపు చుక్కలు,చర్మం “అనే పదాల వల్ల మానవస్వభావం చేరి తాత్విక స్థాయికి ఇలాంటి వాక్యాలు చేరుతాయి.ఇక్కడ మానవ గుణారోపణ చేయడం కనిపిస్తుంది.

ఈ కవిత్వంలో సౌందర్యఛాయ ప్రధానంగా కనిపిస్తుంది కాని సామాజిక సంబంధంగా అనేకమైన మానవీయకోణాలు ఇందులో కనిపిస్తాయి.తాత్విక దృష్టికి,జీవితాన్ని అన్వయం చేయడానికి “రెండు చింతలు”-(77పే)ఉదాహరణగా కనిపిస్తుంది.తాత్విక స్థితిని ప్రకృతికి చేర్చి వ్యాఖ్యానించడానికి బాబా మానవగుణారోపణ(Personification)పై ఆధారపడి తాత్వికంగా జీవితాన్ని సాధిస్తారు.

 

1.”భుజాలపై చేతులు వేసుకుని/నిలుచున్న మిత్రుల్లా ఉండేవి/రెండు చింతలూ

2.”నాలుగు తరాల్ని చూసుంటాయి/చివరకు రియల్ఎస్టేట్ రంపానికి/కట్టెలు కట్టెలుగా చిట్లిపోయాయి/వేళ్ళ పేగులు తెంపుకుని /రెండు చింతలునేలకొరిగాయి

3.”వృక్షం  నేలకూలితే పిట్టలు /కకావికలం అయినట్టు/హృదయం చుట్టూ చింతనలు

4.చిత్రంగా జీవితానికి కూడా/నిత్యం రెండు చింతలు/గతం భవిష్యత్తు/వర్తమాన రంపం/పరపరా కోస్తూంటుంది

అలవోకగానే రాసినా ఈ కవితలో ఒక తీరైన సరళి  (methodology) కనిపిస్తుంది. మొదటివాక్యాంశంలో నిర్వచించి, రెండులో మానవగుణారోపణతో ప్రధానంగా “చిట్లిపోవడం,పేగులు తెంపుకోవడం”లాంటి క్రియలతో తాత్విక సమన్వయం చేయడం, మూడులో మానసిక స్థితిని చెప్పడం. నాలుగులో ఏ అన్వయంలేని తాత్విక స్థితి వెళ్ళడం కనిపిస్తుంది.నిజానికి మూడులోని మానసిక స్థితినుంచే రెండుచింతలు ఉపమానాలు పరివర్తన చెందాయి.రెందవ వాక్యం దాకా ఇవి “వేళ్లపేగులు”లాంటి సమాసాలనుంచి ఉపమేయాలుగానే ఉన్నాయి.చలాకవితల్లో ఇలాంటి స్థితిని ఈ ప్రణాలికను గమనించవచ్చు.

ప్రకృతిని జీవితాన్ని సౌందర్యాత్మకంగా,తాత్వికంగా దర్శించడం,అనుభవించడం,అంతే కళాత్మక స్థితినుంచి పాఠకులకు ఇవ్వడం బొల్లోజు బాబా కవిత్వంలో కనిపిస్తుంది.నిజానికి సౌందర్యాన్ని చిత్రించే క్రమానికి అస్పష్టత పెద్ద అవరోధం దీన్ని అధిగమించడానికి అలంకారికతవైపు వెళ్ళడం, సమాసాలద్వార వాక్యాల్ని ఇవ్వడం కనిపిస్తుంది.పాఠకులకు అస్పష్టంగా ఉండకుండా ఇలాంటి శ్రద్ధతీసుకున్నారనిపిస్తుంది. ఇలాంటి వాక్యాల్ని పదబంధాల్ని చూసినప్పుడు. వర్తమాన కవిత్వం అనేక మార్గాల్లో ప్రవహిస్తున్నప్పుడు దృష్టిని సృష్టిని కాపాడుకుని తనదైన శైలితో కవిత్వమౌతున్నారు బాబా.

మీ మాటలు

  1. Suparna mahi says:

    కొన్ని విశ్లేషణలు పాఠాలంత లోతుగా వుంటాయి… సారాంశాన్ని వెలికి తీసి పాఠకుల్ని ముగ్దుల్ని చేస్తాయి… ధన్యవాదాలు సర్…
    బాబా సర్ వెలుతురు తెర 💚 … ణో వర్డ్స్…

  2. నా కవిత్వాన్ని ప్రేమతో విశ్లేషించి, అద్భుతమైన వ్యాసాన్ని ఇచ్చిన శ్రీ నారాయణ శర్మ గారికి వినయపూర్వక ధన్యవాదాలు తెలియ చేసుకొంటున్నాను

    నన్ను నేను అక్షరాలలో చూసుకోవటం ఆనందంగా ఉంది. ఆ అనుభవాన్నిచ్చిన నారాయణ శర్మగారికి కృతజ్ఞతలు.

    బొల్లోజు బాబా

మీ మాటలు

*