తెలుగు సాహితీమేరువు సోమసుందర్

soma2

1989లో మా యానాం డిగ్రీ కాలేజ్ వార్షికోత్సవానికి శ్రీ సోమసుందర్ గారిని ముఖ్య అతిధిగా పిలిచారు. అప్పుడు ఏం మాట్లాడారో గుర్తులేదు కానీ, ఆయన వస్త్రధారణ ఆకర్షించింది నన్ను. సన్నని దేహం, మడతనలగని పంచె, లాల్చీ లతో గొప్ప కాంతితో కనిపించిన ఆయన రూపం నా ఊహల్లో ఇంకా తాజాగానే ఉంది.

బదిలీపై 2007 లో కాకినాడ వచ్చాకా మరలా ఆవంత్స సోమసుందర్ గారిని కలిసాను. వారితో సంభాషించాకా, వారిగురించి ఏదైనా చిన్నవ్యాసం వ్రాసి అంతర్జాలంలో పెట్టాలన్న కోర్కె కలిగింది. మూడు నాలుగు సార్లు కలిసి కొన్ని వివరాలు సేకరించి వ్యాసం తయారు చేసి వికి పీడియాకు పంపాను. వారు అంగీకరించి యధాతధంగా తీసుకొన్నారు.

ఈ కలయికల ద్వారా సోమసుందర్ గారిని కొద్దిగా అర్ధం చేసుకోగలిగాను. ఆయనకు భాష పట్ల అపారమైన పట్టు ఉంది. ఇప్పటికీ బాగా గుర్తు ఉన్న అంశం – ఒకసారి ఆయన నన్ను “పీయూషమంటే ఏమిటి” అని అడిగారు మా జువాలజీలో పీయూష గ్రంధి (Pituitary gland) ఉంటుంది. కానీ పీయుషం అంటే ఏమిటో తెలీదు. అదే నసుగుతూ అంటే ‘పీయూషమంటే అమృతం” అని చెప్పి ‘కవిత్వం వ్రాసేవ్యక్తికి భాషమీద పట్టు ఉండాలి, అది విస్త్రుతంగా చదవటం ద్వారా వస్తుంది” అన్నారు.

వారికి వాక్యనిర్మాణం పట్ల చాలా శ్రద్ద. నా కవితల్ని కొన్ని చదివి వినిపించుకొన్నారు. ఒక చోట “ఏదైతే ఉందో అది” లాంటి ఒక దూడ వాక్యాన్ని పట్టుకొని “ఛి ఛి ఎందుకలా భావాన్ని అన్ని వంకర్లు తిప్పటం, సూటిగా రాయి” అని మందలించారు.

soma1

శ్రీశ్రీ , తిలక్, నారాయణబాబు, ఆరుద్ర, కృష్ణ శాస్త్రి వంటి మహామహులతో వారి అనుభవాల్ని ఎన్నో చెప్పారు. ఆయనతో జరిపిన ఆనాటి మూడు నాలుగు సమావేశాలు నాకు సంబంధించి మంచి సాహిత్యపాఠాలు. ఆయన శతాధిక గ్రంధకర్త,, వేయి పున్నములు చూసిన పూవనం, మేరుసమానమైన సాహితీమూర్తి, … అయినప్పటికీ, ఏదైనా ఆయనకు నచ్చిన వాక్యం కనిపిస్తే, కల్మషమెరుగని హృదయంతో నిండార నవ్వుతూ, భలే ఉంది ఊహ…. బాగు బాగు అంటూ మెచ్చుకొనే వారు.

ఆ తరువాత  సోమసుందర్ ఏటా నిర్వహించే అవార్డుల సభకు రెండుమూడు సార్లు వెళ్ళాను. పోయినేడాది కాకినాడ బుక్ ఎక్జిబిషన్ ప్రారంభించటానికి ఆయన వచ్చినప్పుడు- పెద్దవయసు కదా గుర్తుపట్టగలరా అంటో సందేహిస్తూ వెళ్ళికలవగా ‘నువ్వు బాబా వి కదూ? ఏం రావటం లేదు, రా ఒకసారి’ అని ఆశ్చర్యపరిచారు.

గత నెల 10 వ తారీఖున  అవధానుల మణిబాబుతో కలిసి వెళ్ళి  సోమసుందర్ గారిని కలిసినపుడు చాలా ఆప్యాయంగా మాట్లాడారు. ఉత్సాహంగా కనిపించారు.

soma3
అక్కడ అల్మారా డిస్ప్లే లో వీరు వ్రాసిన “పాబ్లో నెరుడా కవితా జీవితయాత్ర” పుస్తకాన్ని చూసి ‘సార్ .. ఈ పుస్తకం నాకు కావాలి’ అని అడగ్గా వెంటనే ఆయన పక్కనే ఉన్న కిటికీ గూడులోని ఆ పుస్తకాన్ని తీసి ఇచ్చారు. సంతకం పెట్టి ఇవ్వండి సార్ అంటే సంతకం కూడా చేసారు దానిపై.
నీ వయసెంత అని అడిగారు- చెప్పాను నేను. చాలా చిన్నపిల్లాడిలా కనపడుతున్నావు అన్నారు. బయటకు వచ్చేసాకా – అదేమిటి పెద్దాయన అలాగ అంటారు? అని మణిబాబుని అడిగితే, “ఆయన వయసు 94, ఆయనకు మీరు చిన్నపిల్లాడిలా కనపడక ఇంకెలా కనపడతారు అని తిరిగిప్రశ్నించాడు నన్ను.

అద్దేపల్లి రామమోహనరావు గారు గతించి ఇంకా ఏడాది కూడా కాలేదు, ఇప్పుడు  సోమసుందర్ గారు. కొద్దో గొప్పో వారిరువురితోనూ భౌతికంగానో, మానసికంగానో సన్నిహితంగా మసలిన నాలాంటి వారికిది తీరనిలోటు. వారి ఆత్మకు శాంతి కలగాలని భగవంతుణ్ణి ప్రార్ధిస్తున్నాను.

సోమసుందర్ గారు తమ దేహాన్ని రంగరాయ మెడికల్ వైద్యకళాశాలకు దానమివ్వటం వారి శాస్త్రీయ దృక్పధానికి నిదర్శనం.

సోమసుందర్ గారిపై నేను వ్రాసిన వ్యాసం లింకు

http://sahitheeyanam.blogspot.in/2009/01/blog-post_25.html

 

మీ మాటలు

  1. విజయ్ కోగంటి says:

    బాగుంది. పంచుకున్నందుకు ధన్యవాదాలు.

  2. కె.కె. రామయ్య says:

    ధన్యవాదాలు బొల్లోజు బాబా గారు.

    శ్రీశ్రీ ”మహాప్రస్థానం” తరువాత పరిగణింప దగిన అభ్యుదయ కృతుల్లో ఉత్తమ కృతి ఆవంత్స సోమసుందర్ గారి ”వజ్రాయుధం” కినిగెలో లభ్యం :

    http://kinige.com/kbook.php?id=2322&name=Vajrayudham

మీ మాటలు

*