తాతరాయి చెప్పిన చరిత్ర

Tatarai Cheppina Katha

అప్పటికి కొంతకాలమైంది నేను నా కొండ నుంచి విడిపడి. పక్కనే వున్న అడ్డరాయితో బాగా పరిచయం కుదిరింది. ఎన్నాళ్ళ నుంచి అలా వుందో కానీ బాగా నునుపుతేలి మిలమిల మెరుస్తూ వుంటుంది. ఆ రోజు కూడా ఎండ నా ఒళ్ళు చుర్రెక్కిస్తుంటే, అడ్డరాయితో పిచ్చాపాటి మాట్లాడుతున్నాను. సరిగ్గా అప్పుడే ఓ చిన్న గులకరాయి దొర్లుకుంటూ వచ్చి మా ముందర ఆగింది. నేనేమో అంత ఎత్తు ఇంత లావు వుంటాను. నా ముందు ఆ గులకరాయి ఏ పాటిది. నేను పెద్దగా పట్టించుకోలేదు.

“ఏంట్రా అబ్బాయిలూ మాట్లాడుకుంటున్నారు” అంటూ అటూ ఇటూ దొర్లింది గులకరాయి.

ఆ మాటతీరు అదీ నాకు బాగా చిరాకు కలిగించాయి. ఏదో పెద్దబండవాళ్ళం మాట్లాడుకుంటుంటే, మా మధ్యలో చేరి అలా మాట్లాడినందుకు నాకు చాలా కోపం వచ్చింది.

“ఏయ్… నీకు చిన్నంతరం పెద్దంతరం లేదా? ఏమిటా మాటలు?” గద్దించాను. చిన్నరాయి గరగరా నవ్వింది.

“ఎవరు? నువ్వు పెద్దా? నిన్నగాక  మొన్న పుట్టావు… అంతెత్తున శారీరం వుంటే సరిపోయిందా? వయసు బట్టి గౌరవం కానీ ఒడ్డుపొడవు బట్టి కాదోయ్..” అంది గులకరాయి.

నా కోపం ఇంకా పెరిగిపోయింది. “అయితే నీ వయసు నా వయసు కంటే ఎక్కువంటావు?” అన్నాను.

“ఓరి నీ బండపడ… కనిపించేదాన్ని బట్టి అంచనాలు వెయ్యకూడదురా… సరిగ్గా చూస్తే నేను మీకు తాతనవుతాను” అంటూ తన మీద పడ్డ ఎదురెండ నా ముఖానికి తిప్పికొడుతూ నిలబడిందా గులకరాయి.

అడ్డరాయి భళ్ళున నవ్వింది. “మేము గట్టిగా దొర్లితే భూమిలోకి దిగిపోతావు… నువ్వు మా తాతవా” అంది నవ్వలేక ఒగురుస్తూ.

“సరే, నా చరిత్ర చెప్తా వినండి. తాతనో కాదో మీరే చెప్పండి.” అని కథ మొదలుపెట్టింది. “మా ముత్తాత ఇరవై వేల ఏళ్ళ క్రితం ఒక పెద్ద కొండగా వుండేవాడు. అప్పుడప్పుడే మనుషులుగా మారుతున్న కొన్ని కోతులు ఆ కొండ మీద వుండేవంట. వాళ్ళు తల దాచుకోడానికి, అక్కడక్కడ సేకరించిన తిండి, జంతుకళేబరాలు పెట్టుకోడానికి మా తాతని తొలిచి ఒక గుహ చేసుకున్నారంట. ఆ కాలంలో అట్టా ఏర్పాటు చేసుకున్నోళ్ళే లేరని ఇప్పటికి కూడా చెప్పుకుంటారు. మా తాత ఒంటిమీద ఏందేందో బొమ్మలు కూడా గీసినారంట ఆ మనుషులు.

కొన్నాళ్ళకి మా తాత ఆ కొండ నుంచి విడిపడి చదరంగా వుండే నేల మీద స్థిరపడ్డాడు. ఇంకొన్ని వేల ఏళ్ళ తరువాత ఓ ఎండాకాలం అనుకోకుండా ఓ చినుకు పడి రెండు ముక్కలయ్యాడు. వాళ్ళే మా పెదనాయన, మా నాయన. వాళ్ళిద్దరూ  ఓ శిల్పి కంట్లో పడ్డారు. ముందు మా నాయనని ఆయన చెక్కి చెక్కి ఓ శిల్పంగా మార్చాడు. అయితే దానికన్నా పెద్దది కావాలని రాజుగారు చెప్పాడంట. మా నాన్నని వదిలేసి పెదనాన్నని పెద్ద శిల్పంగా చేశారట. ఆయన్ని ఆ తరువాత దేవుడు అని పూజలు చేశారు. మతం అని ఒక కొత్త మంత్రం చదివారు. అదో రకం విప్లవం. అయితే పెద్దగా పనికిరాలేదంట.

ఇక్కడ మా నాన్న ఎండకి ఎండి, వానకి నాని నాన్న ఎన్నో ముక్కలయ్యాడు. నేనూ, ఇంకోంతమంది తమ్ముళ్ళు ఈ లోకంలో పడ్డాం. ఆ తరువాత ఒక చోటని లేదు, ఒక ఊరని లేదు. తిరిగి తిరిగి, అరిగి అరిగి అదిగో ఆ లారీలో పడి ఇక్కడికి వచ్చాను” అని చెప్పి కాస్త సర్దుకునిందా రాయి.

“అట్నా. అయితే నువ్వు ఖచ్చితంగా మా తాతవే… అయితే నాలాంటి పిల్లరాయికి నీ లాంటి తాతరాయి దగ్గర నేర్చుకోవాల్సిన విషయాలు చాలా వుంటాయే… అవన్నీ నాకు నేర్పించు తాతా…” అని మనవడి గోమంతా పడ్డాను నేను.

“అలాగే చెప్తాలే కానీ మనవడా… ఇంతకీ మీరంతా ఎవరు? మిమ్మల్ని ఎవరు పుట్టించారు? ఆ కథలు చెప్పండి ముందు” అంటా పక్కనే వున్న మెత్తటి గడ్డి మీద కుదురుకున్నాడు తాతరాయి.

“మాదేముంది తాతా! అదిగో కొంచెం అవతలగా రాళ్ళని పగలగొడుతూ కొన్ని వింత జంతువులు తిరుగుతున్నాయే అక్కడ వుండేవాళ్ళం. అందరం కలిసి వున్నప్పుడు కొండగుట్ట అనేవాళ్ళు.”  అని నా పక్కనున్న అడ్డరాయి చెప్తుంటే నేను మధ్యలో అందుకున్నా.

“మధ్యలో ఆ వింత జంతువులు పైన ఎక్కి కొంత మనుషులు వచ్చారు. అప్పుడె తెలిసింది వాటిని మెషీన్లంటారని. ఏదో డెవలప్మెంట్ అంటా తలా ఒక జంతువుని మా మీదకు ఎక్కించి గడగడ మంటూ మమ్మల్ని ఇట్టా పుట్టించారు” అన్నాను.

“డెవలప్మెంటా?” అన్నాడు తాతరాయి ఆశ్చర్యంగా. ముసిలిరాయి చాదస్తం చూస్తే మా ఇద్దరికీ నవ్వొచ్చింది.

“నీకు తెలవదులే తాతా… డెవలప్మెంట్ అంటే అభివృద్ధి” అంది అడ్డరాయి అర్థం చెప్తూ.

తాతరాయి గడ్డి మొత్తం గిరగిరా దొర్లుకుంటూ నవ్వాడు. కాస్త ఆగి మళ్ళీ వెనక్కి దొర్లుకుంటూ నవ్వాడు. “ఈళ్ళకి ఇంకా ఈ అభివృద్ధి పిచ్చి చావలేదా?” అన్నాడు ఆగాక.

“అదేంది తాతా? వీళ్ళ అభివృద్ధి గురించి నీకు తెలుసా?” అన్నాను నా నీడ తాతరాయి మీద పడేలా సర్దుకుంటూ.

“తెలియకేం మనవడా… నేను చెప్పానే మా తాత, ఆయన కూడా ఈ అభివృద్ధి గురించి మా నాయనకి చెప్పాడంట. అంటే పదివేల ఏళ్ళ క్రితం సంగతి. ఆ కథ మీక్కూడా చెప్పమంటారా?” అన్నాడు

మేమంతా “చెప్పు తాతా, చెప్పు తాతా” అంటూ అటూ ఇటూ దొర్లాము. తాత కథ చెప్పడం మొదలుపెట్టాడు.

“ఒకప్పుడు… అంటే మా తాత కాలంలో కూడా ఈ మనుషులు వుండేవాళ్ళు…!! వాళ్ళు ఎప్పుడూ వుంటార్లే. చచ్చేవాళ్ళు చస్తుంటే, పుట్టేవాళ్ళు పుడుతుంటారు… అందువల్ల మునుషులు చచ్చినా మనిషి అనే ప్రాణి బతికే వుంటదంట. మనలాగ కాదు… సరే ఏం చెప్తున్నాను… ఆ… ఆ కాలంలో వాళ్ళు అడవుల్లో బతుక్కుంటా, చెట్టుచేమా ఎక్కుతా దిగుతా, కాయదుంప తినుకుంటా వుండేవాళ్ళు. ఒకోసారి గుంపులు గుంపులుగా పోయి, మీ లాంటి రాళ్ళ వెనక నిలబడి ఏదైనా జంతువు దొరికితే వేటాడి, దాన్ని తిని హాయిగా వుండేవాళ్ళు.” మధ్యలో ఆపి అటూ ఇటూ చూసి కొనసాగించాడు తాతరాయి –

“కొన్నాళ్ళయ్యాక ఒక పెద్ద విప్లవం వచ్చింది. దాన్ని ఇప్పటివాళ్ళు వ్యవసాయ విప్లవం అంటున్నారంట కానీ అప్పట్లో దానికేమీ పేరుండేది కాదు… ఏదైతేనేంది మనుషులందరూ, వేటాడ్డం మానేసి వడ్లు, గోధుమలు, దుంపలు పెంచడం మొదలుపెట్టారు. రాన్రాను పరిస్థితి మారిపోయింది. ఎకరాలకెకరాలు అవే వడ్లు, అవే గోధుమలు, అయ్యే దుంపలు… ఎక్కడో చీకటి రాజ్యంలో మొదలైందంట. ఆ తరువాత ఒక రాజ్యామని లేదు, దేశమని లేదు, నదని లేదు, సముద్రమని లేదు …అన్నింటినీ దాటుకోని పొయ్యినాయి. ఎక్కడ చూసినా అవే. ఓ వందా నూటాభై ఏళ్ళు గడిచినాయి. కావల్సినంత పంట, తిన్నంత తిండి… అప్పటిదాకా ఏడాడో తిరిగిన మనుషుల జాతి ఒక చోట కుదురుకున్నారు. గూడేలు, రాజ్యాలు, దేశాలు పుట్టుకొచ్చినాయి. అదే అభివృద్ధి అని పాటలు గట్టి పాడుకున్నారు..”  నేను ఏదో అడగబోతున్నానని తెలిసి అక్కడ ఆపాడు తాత.

నేను అడిగా –“తాతా! నువ్వు చెప్పినట్లు అభివృద్దే జరిగింది కదా… మరి ఆ మాట విని ఎందుకు నవ్వావు?” అన్నాను.

“నీక్కూడా మనుషుల్లానే తొందర ఎక్కువున్నట్లుందే మనవడా ఒక్కరవ్వ ఆగు… చెప్తున్నా కదా… ఎందాక చెప్పాను? ఆ… ఆపాట్న… అందరూ వ్యవసాయ విప్లవం వచ్చిందని సంబరపడ్డారు. నీలాగా నా లాగా కదలకుండా అంతా చూస్తున్న రాయి రప్పా గట్టిగట్టిగా నవ్వుకున్నాయంట. మా తాత (అప్పటికి ఇంకా పిల్లాడే) ఇదంతా చూసి, నీలాగే – “రాళ్ళల్లారా రప్పల్లారా ఎందుకు నవ్వుతున్నారు? అభివృద్ధి జరిగిన మాట నిజమే కదా” అని అడిగినాడంట.

అప్పుడు ఆ పెద్ద పెద్ద రాళ్ళు మళ్ళీ నవ్వేసి – “ఒరేయ్ నాయనా… వాళ్ళకంటే బుద్ధి లేక అనుకుంటున్నారు. నువ్వు ఎందుకు వాళ్ళ మాట నమ్ముతున్నావు?” అని అడిగినాయంట. ఇంకా వివరంగా చెప్పమని అడిగితే అయ్యి చెప్పడం మొదలెట్టినాయంట.

“ఒరేయ్ నాయనా… నువ్వింకా చిన్నరాయివి… సుత్తి దెబ్బకు, ఉలిదెబ్బకి తేడా తెలియనివాడివి. వాళ్ళు చెప్పగానే అభివృద్ధి జరిగిపోయిందని నమ్మితే ఎట్లా? ఒక్కసారి వాళ్ళని చూడు. ఇంతకు ముందు పూటకో రకం తినేవాళ్ళు. ఒకపూట ఆకులు, ఇంకోపూట తేనే, ఇంకోరోజు మాంసం, మళ్ళి ఒకరోజు పండ్లు ఇట్టా అన్ని రకాలు తినేవాళ్ళు, ఇప్పుడు చూడు పొద్దున బియ్యం, మధ్యాన్నం బియ్యం, రాత్రికి బియ్యం… ఇదీ ఒక తిండేనా? ఇట్టా తిని తిని, ఏదో ఒకరోజు శరీరానికి సరిపోయే పోషకాలు అందటంలేదని వాళ్ళే ఏడుస్తారు చూడు” అంది ఓ పెద్దతలరాయి.

“అంతేనా… అప్పుడు ఒకచోటని కాకుండా నాలుగు చోట్ల తిరిగే వాళ్ళు… ఆడవాళ్ళు కూడా అడవుల్లో, గుట్టల్లో తిరిగేవాళ్ళు. అట్టా తిరగడానికి బిడ్డలు ఎక్కువుంటే కష్టమని ఒక బిడ్డకి నడకొచ్చిందాకా ఇంకో బిడ్డని కనకుండా వుండేవాళ్ళు. మరి ఇప్పుడు? ఇల్లు కట్టుకున్నారు. చాటు మాటు కుదిరింది. పంటలు పండించేదానికి ఇంకో రెండు చేతులు వస్తాయిలే అని ఒకళ్ళ తరువాత ఒకళ్ళని కంటూనే వున్నారు. జనాభా పెరిగింది. చేతులున్నోళ్ళకి నోళ్ళు కూడా వుంటాయిగా… దానికోసం ఇంకా ఎక్కువ వడ్లు, గోధుమలు పండిస్తున్నారు…  దానికింకా నేల కావాల. ఇది నాదంటే ఇది నాదంటున్నారు. రేపు ఆ నేలకోసం తలకాయలు పగలగొట్టుకుంటారు…” అన్నాడు ఓ రాయప్ప.

తాతరాయి అక్కడ ఆపి కాస్త ఊపిరి తీసుకున్నాడు.

“ఇట్టా వ్యవసాయ విప్లవం గురించి మా తాతకు కథలు కథలుగా చెప్పాయి ఆ రాయీ రప్పా. ఆ కథలే మా తాత నాకు చెప్పాడు. నేను మీకు చెప్పాను” అన్నాడు తాతరాయి

“ఒక్క విప్లవం వెనక ఇన్ని కథలు వుంటాయా తాతా?” అన్నాను నేను ఆశ్చర్యంగా.

Kadha-Saranga-2-300x268

తాతరాయి నవ్వేసి – “అక్కడితో కథ అయిపోలేదు మనవడా… కాలం గడిచి, మా నాయన ఎదిగేసరికి ఇంకా చానా విషయాలు తెలిసాయి. అంతకు ముందు ఎక్కడ పడితే అక్కడ తిరిగేవాళ్ళు, పంటలు పండిచడం మొదలుపెట్టాక ఒకే చోట కుదురుకున్నారు… ఆ పొలం చుట్టూ కాపలా వుండాలికదా… అందుకే ఒకళ్ళ పక్కన ఒకళ్ళు, ఒకళ్ళ పక్కన ఒకళ్ళు ఇళ్లు కట్టుకున్నారు. అక్కడే తినడం, అక్కడే పిల్లలు, అక్కడే జంతువులు… అప్పటిదాక లేని అంటు రోగాలు మొదలైనాయి. అట్టా కొంతమంది చస్తా వుంటే ఇంకొంత మంది ఇంకో రకంగా చచ్చేవాళ్ళు.

అడవుల్లో వున్నప్పుడు ఇంకో జాతి జనం కొట్లాటకి వస్తే చేతనైతే తిరగబడేవాళ్ళు, చేతకాకపోతే పారిపోయేవాళ్ళు. ఇప్పుడు పారిపోవటం ఎట్లా? పొలం, పాడి, కొంప, గోడు… అన్నీ అక్కణ్ణే వున్నాయయ్యపోయె..!! కాపాడుకోవాల… కాదని పోతే పస్తులుండి చావాల… కొంతమంది కొట్లాడి చచ్చినారు, ఇంకొంత మంది పస్తులుండి చచ్చినారు. ఎప్పుడన్నా వరి మింగే పురుగొచ్చిందంటే వాళ్ళ దిగుబడి తగ్గి చచ్చినారు…”

“అదేంది తాతా… అంతకు ముందు ఒక పండు దొరకకపోతే ఇంకో కాయో, ఆకో, జంతువో తినేవాళ్ళు కదా?”

“అప్పుడు తినేవాళ్ళురా… విప్లవం దెబ్బకి అయన్నీ మర్చిపోయారు… అదే మనిషికి వుండే శాపం. అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడా… ఇంక అంతే… చానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. కష్టమో నష్టమో కానీలే అనీ అక్కడే పడి కొట్టుకుంటా వుంటాడు… అదే అభివృద్ధి అని పాటలు కట్టి పాడుకుంటా వుంటాడు. అసలు ఇంకో రహస్యం చెప్పనా?”

“చెప్పు చెప్పు” అన్నాం మేమిద్దరం

“మనిషి అందరికన్నా తెలివైనవాణ్ణని అనుకుంటాడు కానీ వాడంత ఎర్రోడు ఎవరూ లేరు…”

“అదేంది తాతా అంత మాట అన్నావు?” అని ఆశ్చర్యపోయాను.

“చెప్తా చూడు… ఈ వరి, గోధుమలు పెంచడం మొదలయ్యాక ఇదంతా జరుగుతోంది కదా. ఆ వరి మొలకల్లో ఏదో రహస్యం వుందని, అదేందో తెలుసుకుందామని చాలా సార్లు పొలాల్లోకి దొర్లుకుంటూ పొయ్యాను.”

“కనుక్కున్నావా?”

“యాడ కనుక్కునేది… నన్ను పొలంలో వుండనిస్తే కదా మనిషి… రాత్రి పగులు పొలం మీదే కదా వాడి ధ్యాస… నేను కనపడగానే ఎత్తి అవతలకి పారేసేవాడు. ఆ మొక్కలని ఎంత జాగ్రత్తగా చూసుకునేవాడని… నీళ్ళు తెచ్చి పోస్తాడు, మందు తెచ్చి చల్లుతాడు, రాయి రాకూడదు, పురుగు రాకూడదు ఆ పంటకి కుక్క కాపలా కాసేవాడనుకో…” అన్నాడు తాతరాయి.

“తాతా… అంతా బాగానే వుంది కానీ… కుక్క కాపలా అంటావే? కుక్కని మనిషి పెంచుకున్నాడు. అందుకని అది విశ్వాసంగా మనిషిని చూసుకుంది… వరిని గోధుమని కూడా మనిషే పెంచుకున్నాడు కదా…” చెప్పింది అడ్డరాయి.

“అక్కడే బురదలో పడుతున్నావు. ఎంతసేపు మనిషి వైపు నుంచే చూస్తే ఎట్లా? ఒకసారి ఆ మొక్కల వైపు నుంచి ప్రపంచాన్ని చూడు. అసలు రహస్యం ఏంటో తెలుసా… గోధుమని, వరిని మనిషి పెంచలేదు. గోధుమలు, వరి ప్రపంచమంతా పాకడానికి మనిషిని వాడుకున్నాయి. వాడి బతుకేదో వాడు బతక్కుండా, వాటి మాయలో పడ్డాడు తెలివితక్కువ మనిషి. మనిషి కుక్కని పెంచితే అది అడవి నుంచి వచ్చి మనిషి దగ్గర బతికింది. అట్టాగే అడవిలో వుండాల్సిన మనిషి అడవి వదిలేసి, వరి చేలు పక్కన ఇల్లు కట్టుకుంటే ఎవరు ఎవరిని పెంచుకున్నట్లు?” అన్నాడు తాతరాయి. ఆయన చెప్పింది అర్థం చేసుకోడానికి ప్రయత్నిస్తుంటే మమ్మల్ని తొక్కుకుంటూ ఎవరో వచ్చారు. సరిగ్గా మా ముందు నిలబడి దూరంగా వున్న నేలని చూపిస్తూ మాట్లాడుకుంటున్నారు.

“అదిగో సార్… అక్కడ టెక్నో పార్క్ వస్తుంది. రోబోటిక్స్ ఇక్కడ, ఎనలటిక్స్ ఈ పక్క. అవర్ కంపెనీ విల్ రెవెల్యూషనైజ్ టేక్నాలజీ. ఈ భూమి మీద మనుషుల లైఫ్ మారిపోతుంది మన ప్రాడక్ట్స్ తో…” అంటున్నాడతను.

నేను తాతరాయి వైపు చూసేసరికి ఆయన దూరంగా దొర్లుకుంటూ వెళ్ళిపోతున్నాడు.

***

మీ మాటలు

  1. మీరు చెప్పినట్లు జనాలు అడవుల్లోనే ఉండుంటే ఇప్పుపుడు మీరీ కథ రాసేవాళ్లా?

    లాజిక్ కుదర్లేదు.

  2. Vijaya Karra says:

    రాయి రప్పలు కానే కాని వాళ్ళను కూడా దొర్లి దొర్లి నవ్వించారు !

  3. ఆర్.దమయంతి. says:

    ‘అభివృద్ధి అభివృద్ధి అని అనుకుంటూ ముందుకు పోతాడా… ఇంక అంతే… చానా దూరం పొయ్యాక వెనక్కి వచ్చే దారి మర్చిపోతాడు. ‘
    – నచ్చిందండి కథ.

Leave a Reply to ఆర్.దమయంతి. Cancel reply

*