మడులన్నీ అన్నపు కుండలే!

 

padam.1575x580 (2)

కవులు రాసే కవిత్వంలో ఏ కాలంలో నైనా ఆయాకాలాల సమాకాలీన ప్రతిఫలనాలు కొన్ని ఉంటాయి.అలాగే తన దృష్టిని ప్రతిబింబించే దర్శనమూ.సమాజ చింతనా ఉంటాయి.అందువల్ల ప్రతీ కవీ,కవిత్వంలో సమాకాలీనత,వైయక్తికత,సామాజికత అనే మూడు అంశాలు మూకుమ్మడిగా కనిపిస్తాయి.కాని ఒకటి లేదా రెండు మూడు సంపుటాలు వచ్చాక ఆ కవి సృజనలోని ప్రధాన మార్గం  ఏమిటనేది గుర్తించడానికి వీలవుతుంది.మట్టిపొత్తిళ్లనుంచి ‘రెండుదోసిళ్లకాలం”దాక రామోజు  హరగోపాల్లో ఈ ప్రతిఫలనాలన్నీ ఉన్నాయి. సమాకాలీనతల గురించి మాట్లాడుకుంటున్నప్పుడు వీటిని రెండురకాలుకా చూడవచ్చు. ఒకటి పారదర్శక సమకాలీనత.సుస్పష్టంగా వస్తువుయొక్క సందర్భం ,ప్రాంతం,కాలం కనిపిస్తాయి.రెండవది పారమార్థిక సమకాలీనత.ఇది ఒక వస్తువునిచ్చే సందర్భం,కాలం,ప్రాంతాలకు అతీతంగా వస్తువును విశ్వవ్యాప్తంగా ముడివేస్తుంది.అంటే అనేక కాలాలు,ప్రాంతాలు సందర్భాలలో ఈ అంశం యొక్క ఉనికి కవిత్వం లోకనిపిస్తుంది.వస్తువునానుకొని ఉండే సందర్భం, కాలం మొదలైనవి వొలిచి అందులోని సారాన్ని మాత్రమే కవిత్వం చేయడం ఇక్కడ కనిపిస్తుంది.

 

హరగోపాల్ కవిత్వంలో తొలిదశనుంచి కనిపించే విప్లవ కవితావస్తువు పారమార్థిక సమకాలీనతలో కనిపిస్తుంది.ఇందులోని సంఘటనలు ఆర్థమవుతాయి కాని అవి అన్నికాలాల,దేశాల,సందర్భాలను ఒక విశ్వాత్మతో వ్యక్తం చేస్తాయి.ఇవి కొన్ని అంశాల నుంచి ముడిపడి ఉండడాన్ని గమనించవచ్చు.1.వస్తువులో రాజకీయ అణచివేత,వైప్లవికధార కన్నా ఈ అంశాలనానుకొని ఉండే జీవితం పై ధ్యాస ఎక్కువ.2.ఉద్యమంలోనికి వెళ్ళిన పిల్లలకు సంబంధించి,మరణాలకు సంబంధించిన పలవరింత,మానసికమైన సంఘర్షణ ఎక్కువ.తెలంగాణా ఉద్యమ సంబంధమైన కవితలు,రైతులు,చేనేతలు మొదలైన వారిమరణాలపై రాసిన కవితలు పారదర్శకంగా స్థలకాలాలను వ్యక్తం చేసేవి.ఏరకమైన భౌతిక ప్రతిఫలనాలు లేకుండా రాసే కవిత కూడా ఒకటుంది.ఇందులో కనిపించేది సంకల్పవస్తువు అంటే ఒక అంశాన్ని గురించి రాయాలని రాసేది.రాజకీయంశాన్ని వస్తువుగా చేసుకున్న “ఏలినవారిదయ”(27.పే)అలాంటి కవిత.

ఐ.ఏ రిచర్డ్స్ “కవిత్వంలో వాక్యాలు దృక్పథాలను,అనుభవాలను వ్యక్తం చేయడానికి సాధనాలు ‘అన్నాడు.హరగోపాల్ దృక్పథం ప్రజాసంబంధమైన సామాజిక విలువలకు కట్టుబడింది.వైప్లవికమైంది.అనుభావాన్ని వ్యక్తం చేసే విషయంలో మిగతా విప్లవ వస్తువును కవిత్వం చేసే కవులకు హరగోపాల్‌కు మధ్య వైరుధ్యాలున్నాయి.హరగోపాల్ వాక్యాల్లో కళాత్మకత ఎక్కువ.సాధారణంగా వస్తువును కవిత్వం  చేస్తున్నప్పుడు రెండు ధర్మాలుంటాయి.ఒకటి విషయ గత ప్రయత్నం.వస్తువు సంబంధమైన సైద్ధాంతికత,చైతన్యం,ప్రేరణ వంటివాటిని ఇది ప్రసారం చేస్తుంది.మరొకటి కవిత్వీకరణ ప్రయత్నం..విషయాన్ని వస్తువును హృదయానికి చేరేట్టుగా కవిత్వీకరణకు విషయంతో పాటుగా విలువనిచ్చి ప్రయత్నించడం.హరగోపాల్ కవిత అంశాన్ని,తన దృష్టిని పాఠకుడి హృదయానికి చేర్చేందుకే ఎక్కువగా ప్రయత్నిస్తుంది.అనుభూతి కవులను మరిపించే భావచిత్రాలు,కళాత్మక వాక్యాలు కనిపించడం ఈకారణంవల్లే.

ఒక భావనకు,అంశానికి  కళావ్యాఖ్యానం చేయాలన్నప్పుడు కొంత అస్పష్టత కలిగే అవకాశం ఉంది.పాఠకుడికి ఈ  కష్టంలేకుండా  ఉండడానికి హరగోపాల్ కొన్ని వ్యూహాలనుపాటిస్తారు.హరగోపాల్ కవిత్వభాషలో భావార్థకత,పరిసరాత్మకత రెండూ కనిపిస్తాయి.ఐ.ఏ .రీచర్డ్స్ భావార్థకభాష (Emotive language)గురించిరాసాడు- Emotive language is more massive, more   dense with association than referential language

(భావార్థక భాష సంకేతాత్మకమైన నిర్దేశ భాషతో పోల్చినప్పుడు చాలా స్థూలమైంది.సాంద్రమైంది)..ఈ భావార్థక భాష హరగోపాల్ గొంతులో కళావ్యాఖ్యానాన్ని ప్రోది చేస్తుంది.అదే సమయంలో తాను చెబుతున్న వాతావరణాన్ని తలపించే పరిసరాత్మకభాష (ambient language)ఒకటి ఇందులో కనిపిస్తుంది.

పరిసరాలను తలపించే భాష ద్వార వస్తువాతావరణం లోకి తీసుకువెళ్ళి .. కొన్ని రూపాలు,భావార్థాలనిచ్చే పదాలద్వార కవిత్వీకరణ చేయడం కనిపిస్తుంది.

1.నువ్వులేకుండా నేనెట్లుంటా/నువ్వు లేకుండా నేనెట్ల బతుకుత/నువ్వంటే నేనెత్తిన జెండా/నువ్వు నామదిలో మేనిఫెస్టో“-(తూకం)

 2″ఒక్కటంటే ఒక్కటి /వెన్నెలపాయి సెలయేరులాపారక ముందే/ వేట ఏమిటి/ఒక్కటంటే ఒక్కటి/వెలుగురేఖ కంటి నంటక ముందే/మాటుఏమిటి-(కొండవెన్నెల రాలిపోతుంది)

 3.పచ్చపచ్చని ఆలోచనలేవో/అడవుల్లో కొండవాగులై దుంకుతున్నై

కొమ్మలకు కట్టిన ఎర్రచీమలగూడు-(సభ పెట్టుకుందాం)

ఈవాక్యాల్లో “జెండా,మేనిఫెస్టో,వేట,మాటు,ఎర్రచీమలు“లాంటి పదాలు పరిసరాత్మక భాషకు సంబంధించినవి సాపేక్షంగా ఈ పదాలు విప్లవ ఉద్యమ వాతావరణాలను ప్రతిఫలిస్తాయి.-“వెన్నెలపాయి సెలయేరులా పారక ముందే..వెలుగురేఖ కంటి నంటకముందే”లో కనిపించే కళాత్మకత జీవినానికి సంబంధించినది.”వెన్నెల పాయి,వెలుగురేఖ”అనే పదబంధాలు స్థూలమైనవి,సాంద్రమైనవి.విప్లవపోరాటపు వికాసాన్ని ఇవి సంకేతిస్తాయి.”ఎర్రచీమలు”లోని వర్ణం..ప్రధానంగా చీమలు శ్రీకాకుళపోరాటం దగ్గర్నుంచి విప్లవ ప్రతీకలుకూడా.

దృష్టికి,సృష్టికీ మధ్య కవిత్వాన్ని కళగా నిలపడమే హరగోపాల్ కవిత్వం చేస్తున్నది.సాధారణంగా విప్లవభూమిక,ప్రగతిశీలత లేదా సామాజిక ప్రయోజనాలను ఆనుకుని రాసే కవిత్వం కళాత్మకత,అనుభూతికి దూరమనే మాట ఒకటుంది.హరగోపాల్ కవిత్వం ఇందుకు భిన్నంగా ఉంటుంది.అనేక వాక్యాల్లో మానసికమైన తన్మయీభావన (ecstacy conception),ధ్యానం ఉంటుంది.

dosilla

1.”రాలుతున్న నీటి చినుకుల్లో/ధాన్యపు గింజల రాసులూ

2.”నాట్లేసిన చేతులల్ల నారు పాపాయిలు

3.”మడులు మడులన్నీ అన్నపు కుండలే

4.”ఇన్ని పూలేరి తెచ్చుకుని /తోటలో మొక్కలన్నీ తలలో పెట్టుకున్నాయి

5.”అలసిపోయిన దారిని పాదాలకెత్తుకుని/ఇంటికి తీసుకెళ్తున్న మనుషుల కల లెక్కుంది రాత్రి

6.”రెండుకొమ్మలకు ఉయ్యాలకట్టి/వూగుతున్న ఆకాశం

 “మబ్బు దోసిళ్లలోని వాన చినుకుల్ని దోచుకుంటున్నది

7.”మెట్లు మెట్లుగా అడవుల్ని ఎక్కించుకున్న /గుట్టమీది కోనేరు మునకలేస్తున్నది

8.”బతుకు టెండలో తలకాలకుండ అమ్మకప్పిన కొంగులు చెట్లు

 

ఇలాంటి వాక్యాలు అడుగడుగునా కనిపిస్తాయి.వస్తువుని రూపాల్లోకి అనువదించుకోవటం వల్ల,పరికరాలుగా ప్రాంతీయముద్రగల భాషను వాడుకోవటం వల్ల ఉహాశక్తిని  కవితలో నిక్షిప్తం చేసే అవకాశం ఈ కవిత్వంలో కలిగింది.నిజానికి కవిత్వాన్ని ప్రత్యేకంగా నిలబెట్టేది కూడా ఇదే.మొదటి మూడు వాక్యాల్లో తన్మయీభావన ఉంది కాని వీటి మూలాలు వేరు.మొదటి దాంట్లో  ఊహ,రెండవ దాంట్లో అన్వయం చేయగలిగే జీవితాదర్శం,మూడులో చమత్కారం కనిపిస్తాయి.ఈ అంశాలే వస్తువును అనుభూతిగా చేయడానికి శక్తినిచ్చాయి.ఆరవ వాక్యంలో కనిపించేది కూడా ఇదే.నాలుగు ఐదు ఏడు వాక్యాలల్లో సౌందర్యాత్మకమైన ఊహ కనిపిస్తుంది.సౌందర్యాన్ని మానసికంగా అనుభవించడం మాత్రమే కాక ఆవిష్కారం వల్ల మాత్రమే అది కళగా మారుతుంది.అరవిందులు

“Beauty needs a manifestation to show it self”

hara

(సౌందర్యానికి ఆవిష్కారం అవసరం)అన్నారు.ఈ అవసరాన్ని కూర్చే శక్తులే పైన చెప్పుకున్న ఊహ,ధ్యానం,జీవితాన్వయం,చమత్కారాలు.

చమత్కృతిరానంద విశేషః సహృదయ హృదయ ప్రమాణకః“-(చమత్కారం ఆనందపు విశేషం,అది సహృదయుని హృదయానికి ప్రమాణం)అని ప్రాచీన కావ్య మీమాంస.పాశ్చాత్య దర్శన శాస్త్రం కళాతత్వ విచారం మూడు భాగాలలో సాగుతుందని చెప్పింది 1.ప్రకృతి స్వభావం, 2.దాన్నుంచి పొందిన జ్ఞానం,ఆ జ్ఞానం ద్వార జీవితాదర్శాల పరిశీలన. హరగోపాల్ వాక్యాల్లో కనిపించేదికూడా ఇదే.

ఈ అన్వయ శీలత వస్తువుని సాంకేతికంగా ధ్వనింపచేస్తుంది.అది జీవితం,విప్లవ చైతన్యంలోని ఉనికిని స్పష్టంగా ధ్వనిస్తుంది.

1.నీ ఇంటవాకిట అలుకు చల్లిన ఎర్రమట్టిపొద్దుని.

2.ఎన్ని తూటాలైనా ఆకుల్నేరాలుస్తాయ్,పత్ర హరితాన్ని కాదు.

3.నీవు వదిలేసిన పాటొకటి భూజాల మీద కప్పుకున్న.      

4.అడవి పచ్చటాకుల సైగలై నన్ను నిప్పుటేరులో నడిపింది తానే.

5.వాడకట్లన్నీ గుమ్మికట్లూడిన డప్పుల్లెక్క/ఒక్క సారికూడా సంతోషంగ మోగయి.

 

ఇలాంటి వాక్యాలు విప్లవాన్ని ధ్వనిస్తూనే,సౌందర్యాన్ని వ్యక్తం చేస్తాయి.అనేక పొరాటదశలను ఈవాక్యాలు సంకేతిస్తాయి.రెండవ వాక్యంలో వీరులు మరణిస్తారుకాని విప్లవ చైతన్యం కాదని, మూడు,నాలుగు వాక్యాలు  వీరునిమరణం ఇచ్చే ప్రేరణను.నాలగవది మరణం జరిగినప్పుడు ఊరు నిశ్శబ్దాన్ని మూగపోవడాన్ని ధ్వనిస్తుంది.హరగోపాల్ పట్టుకునే పరికరాలుకూడా ఒక పల్లెవాతావరణానికి చెందినవి.వాటి నిర్దిష్ట ప్రాంతాన్ని పరిశీలిస్తే ప్రాంతీయ భాషకు సంబంధించినవి.వీటినుంచి జీవితాన్ని, అనుభవాన్ని,పోరాటాన్ని హరగోపాల్ కవిత్వం చేస్తారు. ఈ కవిత్వం విప్లవ దృక్పథం,చైతన్యంలోని సౌందర్యస్పృహకు ప్రతినిధిగా నిలుస్తుంది.

మీ మాటలు

  1. Mahamood says:

    చాలా చక్కని విశ్లేషణ సార్. విప్లవ కవిత్వం పడగట్టు పదాలకూ నినాదాలకూ పరిమితమైందనే అపోహను దూరం చేయడానికి ఓ రకంగా మీ విష్లేణ ఉపరమకరించడమే కాక కవిత్వాన్ని విమర్శించేటప్పుడు కవి దృక్పథాన్ని అంచనా వేయడం దాని పరిధిలోనే ఆ కవిత్వాన్ని విశ్లేషించాలనే ప్రజాస్వామిక లక్షణాన్ని ఈ విశ్లేషణ పాఠకులకు కలిగిస్తుంది.

  2. హరగోపాల్ కవిత్వం గురించి శివారెడ్డిగారు చాలా గొప్పగా చెప్పారు. నాకీ పుస్తకం ఇంకా దొరకలేదు. ఈ సమీక్ష చదివాకా దొరకపుచ్చుకోవాలన్న కోర్కె మరింత బలపడింది. మంచి సమీక్ష శర్మగారు, థాంక్యూ

  3. Vilasagaram Ravinder says:

    అద్భుతమైన విశ్లేషణ శర్మ గారు.

    • narayana sharma says:

      ధన్యవాదాలు రవిందర్ విలాసాగరం గారు

  4. pallerla says:

    కవిత్వాన్ని మనకు అందుబాట్లో ఉన్న భావజాలంతో కాక..కవిత్వానికి తగ్గ టూల్స్ తో పరిశీలిస్తారు మీరు..మి విశ్లేషణ ఎప్పటిలానే బాగుంది.మీరు చేసే సమన్వయం అంతా బాగుంటుంది.కొంచం అకడమిక్ వాసన కూడా కనిపిస్తుంది

మీ మాటలు

*