బువ్వకుండ-ఒకానొక పురావర్తమాన గాథ

 

 

నూతన పారిశ్రామికవిధానాల తరువాత భారతదేశంలో కులవృత్తులుక్షీణించడం కనిపించినప్పటికి ఈ గుర్తింపు ప్రపంచీకరణ నాటికి ప్రధానంగాకనిపిస్తుంది.తెలుగుకవిత్వంలో దళితకవిత్వం వచ్చిననాటినుండే బహుజన,ముస్లిం మైనారిటీ స్పృహలున్నాయి.ఒక కాలంలో ఇవన్నీ మూకుమ్మడిచైతన్యాన్ని ఆసరా చేసుకుని నడిచాయి.ఇప్పటికి భావజాలంలో అంతగా వైరుధ్యాలు లేవనే అనాలి.జూలూరి గౌరీశంకర్”వెంటాడే కలాలు”,జ్వలితా దెంచనాల మిత్రులు తెచ్చిన “రుంజ”లాంటివి బహుజన స్పృహను సాహిత్యంలో పదిలం చేసాయి.ఇతరంగా కొందరు కవులు రాసిన కవితలు,సంపుటాలు,సంకలానాలుకూడా ఈ మార్గానికి ప్రాతినిధ్యం వహిస్తాయి.

అన్నవరం దేవేందర్ “బువ్వకుండ” దీర్ఘ కవిత ఇలాంటి బహుజన తాత్వికతను ముడివేసుకుని వచ్చిన కవిత.ప్రధానంగా కుండయొక్క పురా చరిత్రను దృష్టిలో పెట్టుకుని వచ్చినప్పటికీ,ఈ కవితలో ప్రపంచీకరణ,కులవృత్తుల విధ్వంసం,కుండ సాంస్కృతికంగా జీవితంలో నిలైపోయిన తీరు మొదలైన అంశాలను చిత్రించారు.మానవ నాగరికతలోనే కుండ తయారీకి ఒక ప్రధానమైన చారిత్రక భూమిక ఉంది.చరిత్రకు మానవశాస్త్రానికి ఉండే భూమిక గొప్పది.చరిత్రకారులు ఆసియా ప్రాంతపునవీన శిలాయుగాన్ని(Neo-Lithical period in Asia)మూడు సాంస్కృతిక దశలుగా చెప్పారు.1.ఆరంభ నవీన శిలాయుగం,2.కుమ్మరిపని తెలియని నవీన శిలాయుగం(Pre -Pottery Neo lithic).3.కుమ్మరిపని తెలిసిన నవీన శిలాయుగం(Pottery Neo lithic) ఈ కాలంలో కుమ్మరిపని తెయటమే ప్రధానం అందువల్ల కేవలం సంస్కృతిలోనే కాకుండా నాగరికతలోనే ఇది ప్రధానకేంద్ర బిందువుగా కనిపిస్తుంది. ఈ కాలం కూడా సుమారు క్రీ.పూ.9000 నుండి 2000 గా చెబుతారు.”కెన్యా”లాంటిప్రాంతాలలో ప్రాచిన శిలాయుగానికి చెందిన కుండ పెంకులు కనిపించినా నవీన శిలాయుగంలోనే వీటి వాడకం ఎక్కువ.

అన్నవరం కవితలో ఏడు భాగాలున్నాయి.నాలుగైదుభాగాల్లో కుమ్మరి వృత్తికారుల పరిస్థితి,చివరిభాగాల్లో ప్రపంచీకరణ పరినామాలు వివిధకులవృత్తుల గురించి చిత్రించారు.కుమ్మరి వృత్తికి,కుండకు చారిత్రక భూమిక ఉన్నా అన్నవరం కవితలో వర్తమాన చారిత్రక,సాంస్కృతిక భాగాలున్నాయి.ఒకటి రెండుచోట్ల చారిత్రక,సాస్త్రీయ అంసాలు చిత్రించడం కనిపిస్తుంది.

 

మూడువేల సంవత్సరాలకింద/సింధూమేపొటేమియా సందుల/నేల తవ్వకాల కిందనే/ఈ కుండ ఆనవాలు దొరికింది”-(3.పే)

‘ పచ్చికుండను వాముల కాల్చి/బువ్వకుండను చేసిన శాస్త్రజ్ఞుడే/కుమ్మరి బ్రహ్మ”-(పే.3)

సారెచక్రం యంత్ర సాంకేతికతకు కేంద్రం/ప్రపంచగమనాన్ని,పనితనాన్ని/వేగిర పరచిన మహా సాధనం”-(7.పే)

మొదటివాక్యం చారిత్రకాంశాన్ని,రెండవది వైజ్ఞానికాంశాలను ప్రకటిస్తాయి.మట్టిని పామిన బుట్ట అనుకోకుందా కాలినప్పుడు కుండకు సంబంధించిన తయారీకి ఆలోచనలు వచ్చాయని శాస్త్రవేత్తల అంచనా.రెండవ వాక్యం కుండల తయారీలోని రెండవ దశను చిత్రించడం కనిపిస్తుంది.కుండల తయారీ వైజ్ఞానిక శాస్త్ర ఆరంభానికి ఉపయోగ పడిందన్న శాస్త్రవేత్తలు అందులోని రసాయనిక చర్యను  విశ్లేషించారు.తయారీకి ఊప్యోగించే మట్టిలో ఉన్న “హైడ్రేటెడ్ సిలికేట్ అఫ్ అల్యూమీనియం”(నిజానికి పలు చర్యల ద్వార మట్టిలో దీన్ని తయారుచేయడం కూడా కుమ్మరుల పనే)ను వేడిచేయడం ద్వారా నీటిని తొలగించడమే.చివరి వాక్యంలో సారె చక్రాన్ని(Potter wheel)గురించిన ప్రస్తావన ఉంది.కాల క్రమంలో బండి చక్రం అంతగా ఉందికాని,ప్రారంభదశలో దీని పరిమాణం చిన్నది.

 

అన్నవరం కవితలో ప్రధానంగా సంస్కృతి,ఆధునిక దశలు కనిపిస్తాయి.

 

1.”అన్నం వండే బువ్వ కుండ/అందరికీ తల్లి కూర అటికనే ఆది శక్తి”

2.”గరిగ బుడ్ది అయిరేండ్లు కూరాడి కుండలు/లగ్గం నాగెల్లి ఇండ్లల్ల దీవెనార్తుల ఆనవాళ్లు”-(పే.19)

3.”గాజుబొత్తలు దీపంతలు గోలాలు/లొట్లు బింకులు పూలకుండీలు”-(పే.19)

4.చావగానే అగ్గిపట్టేది మట్టిచిప్పలనే/అంతిమ యాత్ర ముందే అగ్గికుండ నడక/మన్నులోంచి మంటలో కలిసేదాకా/మట్టి పాత్రల మహత్మ్యమే ఇది”-(పే21)

 

5.”దీపావళికి దీపంతల పిలుపు/ఉగాదినడు వాకిలినిండా పచ్చటి పట్వల పంచాంగం/పెండ్లికుండలాకు పట్టిన వొల్లెడ ఒక కీర్తి/ఐరేణి కుండలమీద చిత్రకళలు”-(పే.27)

 

ఈవాక్యాలన్నిటిలో మట్టితోచేసిన ఆకృతులు,వాటి రూపంతో సంస్కృతికి ఉన్న సంబంధాలు కనిపిస్తాయి.మానవశాస్త్రంలో సంస్కృతి లక్షణం(Cultural trait) అనేపదాన్ని వాడుతారు.పైవాక్యాల్లో కుండ జీవితంలో అవసరాల్లోనే కాకుండా వివాహం నుంచి చావుదాకా ఎలా సంబంధం కలిగిందో చిత్రించడం కనిపిస్తుంది.

ఈవాక్యాల్లో కుండ సంస్కృతి విస్తరించిన సమగ్ర చిత్రం (Configuration)కనిపిస్తుంది.బెనడిక్ట్,మార్గరేట్ అనే శాస్త్రవేత్తలు సంస్కృతిలో వివిధ విభాగాలున్నాయని,అవి భిన్నమైన ప్రకార్యాలను నిర్వహిస్తాయని ‘విన్యాసవాదం”ను ప్రతిపాదించారు.అన్నవరం వాడుకున్న పదాలను గమనిస్తే “కూర అటిక”కూరాడు పేరుతో కులదేవత గా శుభకార్యాల్లో వాడే కుండ.ఐరేండ్లు-ఐరేణి ,ఐంద్రి లాంటి దేవతలకు ప్రతినిధులు.జీవన వ్యవహారంలో వంటపాత్రలుగ,నిలువకుండలుగా ఉపయోగం తగ్గిందిగాని,సంస్కృతిలో ఇంకా ప్రధాన భాగస్వామిగానే ఉంది.

“ప్రపంచీకరణ మాయకన్నా ముందునుంచే/కులవృత్తులు కునారిల్లుడు మొదలైంది/గ్లోబలీకరణ డేగచూపులకు  అన్నివృత్తుల్లానే/కుండలు వానడం పురాగ ఆగిపోయింది”

“మట్టి మహిమ స్థానంలో స్టెయిన్ లెస్ స్టీల్/కుండల స్థానంలోకుకర్ విజిల్లు/మట్టినిలోహం పురాగ మింగింది”-(పే.29)

ఈవాక్యాలు విధ్వంసాన్ని చిత్రిస్తాయి.ఈ కవితలో “సల్ప,రౌతు,సున్నగంటు సలప,సారె,గుబ్బిగడ్డ,సారెకోల,”వంటి పదాలతోపాటు “”వానుడు”లాంటిపదాలను రికార్డుచేసారు.కులవృత్తులగురించి వచ్చిన కవితల్లో “బువ్వకుండ”తన స్థానాన్ని నిలబెట్టుకోడమే కాకుండా ఇంకా రావాల్సిన అవసరాన్ని చెబుతుంది.ఒక సుదీర్ఘ సృజనానుభవం తరువాత అన్నవరం దేవేందర్  నడకను ఈ కవిత ఒక మలుపుతిప్పిందనడం అతిశయోక్తి కాదు.

మీ మాటలు

  1. Avunoori LAXMI RAJAM says:

    Buvvakunda, Annavaram Devender gari rachana kummari tholi dashanundi kulavrutti masakabarina malidashavaraku kallamundu kadaladuthundi.Adbhutham Devender Anna… Avunoori LAXMI RAJAM. Nizamabad

  2. భాస్కరం కల్లూరి says:

    కుండలు చేయడం గురించిన ప్రాచీనతను తడుముతూ ఆ వృత్తికి చెందిన పదజాలంతో కవిత రాయడం; ఆ కవితా గురించి వ్యాసం రాయడం బాగుంది. నారాయణశర్మగారికి, అన్నవరం దేవేందర్ గారికీ అభినందనలు.” నూతన పారిశ్రామికవిధానాల తరువాత భారతదేశంలో కులవృత్తులుక్షీణించడం కనిపించినప్పటికి ఈ గుర్తింపు ప్రపంచీకరణ నాటికి ప్రధానంగాకనిపిస్తుంది.”అన్న ప్రారంభవాక్యంలోనే మరింత స్పష్టత, వివరణ అవసరమనిపించింది.

Leave a Reply to Avunoori LAXMI RAJAM Cancel reply

*