రోషం, ఆనందం కలగలసి…

 

 

ఎవరిదా శిబిరం?

ఎవరున్నారు అక్కడ?

ఇంకెవరు ?

సాళ్వుడు

అప్పుడు ఎప్పుడో ఉద్యానవనం నుంచి సరాసరి ఇంటికెళ్ళిపోయిన సాళ్వుడు, వాళ్ళ నాన్నగారితో ప్రేమ దోమ గురించి మాట్లాడితే నాన్నగారన్నారు – ఒరే నాయనా, ఈ కాలంలో అలా నడవదు. మగపెళ్లివాళ్ళం మనం వెళ్ళి వాళ్ళను అడగటమేంది ? యుగధర్మం, సాంఘికధర్మం ప్రకారం నా అంచనా తప్పక ఆ కాశీరాజు స్వయంవరం ప్రకటిస్తాడు. అప్పుడు వెళ్ళు, ఆ అమ్మాయి ఎలాగు నిన్ను ప్రేమించిందంటున్నావ్ కాబట్టి, నీ మెళ్ళోనే మాల వేస్తుంది. అప్పుడు ఇంటికి తీసుకొచ్చెయ్. నేను అందరికీ పప్పన్నం, పరవాన్నం పెట్టుకుంటా అన్నాడు

దాంతో సరేనని, స్వయంవరం ప్రకటన జరగటం ఆలస్యం, మనవాడు పరుగెత్తుకుంటూ వచ్చేశాడు

రేపు జరగబోయే స్వయంవరానికి సన్నద్ధమైపోయాడు

అలా వచ్చి విడిదిలో కులాసాగా నిదరపోతున్నవాణ్ణి తట్టి లేపింది అంబ

ఏంటిది? ఈ రాత్రి పూటా వచ్చేవేమి ఎవరన్నా చూస్తే బాగుండదు, వెళ్ళిపో అన్నాడు

అయ్యో ఆడపిల్లనైన నాకుండాల్సిన సిగ్గు నువ్వు పడుతున్నావేమి స్వామీ అని బుగ్గ మీద చిటికె వేసి నీకు తెలుసా గాంగేయుడు వచ్చాడని అని అడిగింది

ఆ తెలుసు, అయినా ఎవరొస్తే నాకేంటి, నీ మాల నా మెళ్ళోనేగా అన్నాడు ఈయన

అది కాదండి, ఆయన ఆయనకోసం రాలేదు, నాకోసమూ రాలేదు, తన తమ్ముళ్ళ కోసం వచ్చాడు అంటూ నాలిక కరుచుకుంది

ఏమిటీ? అని ఆశ్చర్యపోయాడు సాళ్వుడు

తనకోసం కాక తమ్ముళ్ళ కొసం రావటం ఏమిటి? అది నీకెట్లా తెలుసు అని ప్రశ్నల మీద ప్రశ్నలు వేస్తున్నాడు

దేవదూత చెప్పిన సీక్రెటును లీకు చేసినందుకు కొరుక్కున్న నాలిక సరిచేసుకుని, నాకు కల వచ్చింది అలా అని, రేపు యుద్ధం జరగబోతోంది అని కూడా ఆ కల్లో వచ్చింది అంటూ మాట దాటవేసి, ఇప్పుడు ఆ గొడవలన్నీ ఎందుకు మనకి, ఇద్దరం కలిసి ఇప్పుడే మీ ఊరికి వెళ్ళిపోదాం పద అని అన్నది అంబ

గొడవేముంది, యుద్ధానికొస్తే ఊడ్చవతల పారేస్తా ఎవరినైనా అన్నాడు ఈయన

స్వామీ, నువ్వు ఊడ్చవతల పారేస్తావులే కానీ, అటుదిటైతే నా బతుకు చీపుగా చీపురైపోతుంది, అందుకని నా మాటిని పారిపోదాం పద మీ ఇంటికి అన్నది అమ్మాయి

ఠాట్, ఠూట్ అని మొత్తానికి ఒప్పుకోలా మహానుభావుడు

అంబ ఉస్సురంటూ కాళ్లీడ్చుకుంటూ అంత:పురానికి వెళ్ళిపోయి పొద్దుకిరణాలు పొడిచేదాకా దిండు మీద తలపెట్టుకుని పడుకోకుండా పడుకుండిపోయింది

సన్నగా ఒక నవ్వు, అశరీరవాణి నవ్వు

ఆరు నూరైనా ఆ రాతను, నీ తలరాతను మార్చలేవు నువ్వు అంటూ నవ్వు

నవ్వులతోనే తెల్లవారిపోయింది

స్వయంవరం

అంతా విచ్చేశినారు మంటపానికి

రాజకుమారులందరూ వచ్చేశినారు

ఒక్కొక్కరి అందం వర్ణించనలవి కావట్లా

అంతందంగా ఉన్నారు

అయితే ఎంత అందం ఉంటే ఏమిటి, అమ్మాయీమణులకు నచ్చినవాడే స్వయంవర విజేత

అమ్మాయీమణులు కూడా వచ్చేశారు

అంతా వరసాగ్గా నిలబడుకొని ఉన్నారు

ఇంతలో వచ్చాడు

ఎవరు ?

ఇంకెవరు ?

గాంగేయుడు

సభ అంతా కళకళలాడిపోయింది ఆయన రాకతో

ఆ అందగాడి రాకతో

రావటం, అమ్మాయిలూ రథం ఎక్కెయ్యండి అనటం జరిగిపోయింది

అమ్మాయిలు ఖంగారు పడ్డారు

సభలో గుసగుసలు, కొంతమంది రాజుల్లో పౌరుషాలు పెల్లుబుకినాయి

ఎట్లా ఉన్నది ఆ కొంతమంది రాజుల పరిస్థితి ?

కళ్ళు ఎరుపెక్కినాయ్

పళ్ళు పట పట సవుండ్లు చేస్తున్నాయ్

పెదాలు కొరుకుడు పడుతున్నాయ్

కపోలాలు చెమటలు పడుతున్నాయ్

కనుబొమలు ముడిపడుతున్నాయ్

ఇవన్నీ కోపారంభానికి సూచన

ఆ కోపంలో చేతులు ఒరల మీదకు వెళ్ళిపోయినాయి

గాంగేయుడు ఓరకంట చూశాడు

పక్కవాడి చేయి కత్తి మీద ఉన్నది కదానని ధైర్యం చేశిన మిగిలిన వారి అందరి చేతులు కత్తుల మీదనే ఉన్నవి

కొంతమంది చేతులు వణుకుతున్నవి, అయినా మేకపోతు గాంభీర్యంతో కత్తి పిడులు పట్టుకునే వున్నారు

మీసం మెలివేశాడు గాంగేయుడు

ఎవరురా కత్తి ఒరలోనుంచి బయటకు తీసేది అని సింహనాదం చేసినాడు

ఆ సింహనాదానికే చేతులు కత్తుల మీద నుంచి తీసివేశారు చాలా మంది

మిగిలినవారిలో ఓ పదిమంది తమ ఆసనం మీదనుంచి కిందకు దిగివచ్చి సవాలు చేసినారు

మీ లాటి చిన్న చితక వారికి ధనస్సు ఎత్తటం, దానికి బాణాలు వేష్టు చెయ్యటం ఎందుకని అందరిని దాపుకు రానిచ్చి ఒక ముష్టిఘాతం విసరినాడు

అంతే, ఆ పదిమందీ గింగిరాలు తిరుగుతు పడిపోయినారు

ఎట్లా పడిపోయినారు వారంతా ?

పోతన గారు హిరణ్యాక్షవధను వర్ణించిన ఈ క్రింది విధంగా పడిపోయినారు

 

బుడబుడ నెత్తురు గ్రక్కుచు

వెడరూపముదాల్చి గ్రుడ్లు వెలికుఱుక నిలం

బడి పండ్లు గీటుకొనుచును

విడిచెన్ బ్రాణములు….

 

ఆ దృశ్యం అచ్చంగా అలాగే ఉన్నది అక్కడ

మరి దెబ్బ విసరినది ఎవరు ?

సాక్షాత్ ఆ పరశురాముని శిష్యుడు

ఆ దేవదేవుని అవతారం ఆ రాముని శిష్యుడు

ఆయన వద్ద విద్య నెర్చుకున్నవాడికి తిరుగు ఉంటుందా?

ఆ విద్యకు ఎదురు నిలవగల శక్తి ఈ లోకంలో ఉన్నదా?

అంతటి విద్య అది, అంతటి ప్రతిభాశాలి ఆ గాంగేయుడు

ఆ పడిపోయిన వారిని చూచి మిగిలినవారికి ముచ్చెమటలు పట్టినాయి

ఎవరి అడుగు ముందుకు పడలా

గాంగేయుడు అమ్మాయీమణుల దగ్గరకు వచ్చి ముగ్గురినీ రథంలోకి ఎక్కించాడు

అశ్వాల వెన్ను మీద ఒక్క చరుపు

అంతే, ధనస్సు విడిన బాణంలా పరుగు అందుకున్నాయ్

అయ్యో అయ్యో అని హాహాకారాలు మిన్ను ముట్టినాయి

సాళ్వుడు అక్కడే ఉన్నాడుగా, చూశాడు, ఆ దృశ్యాన్ని చూశాడు

నోట మాటే రాలా

అయినా చిక్కబట్టుకొన్నాడు

ధైర్యం చిక్కబట్టుకొన్నాడు

మరి అమ్మాయీమణి కావాలిగా

అంబా పాణిగ్రహణం జరగాలిగా

ముందు వెళ్ళిపోతున్న రథం వంక చూచినాడు

ఆ రథంలో దీనంగా నిలబడుకొని ఉన్న అంబ వంక చూచినాడు

రథం తోలుతున్నా గాంగేయుని వంక చూచినాడు

అంబ సైగలు చేస్తోంది ఇంకా నిలబడి ఉన్నావేం అన్నట్లు

ఇక అదే ఊతంగా తీసుకొని వెళ్ళిపోయినాడు

గాంగేయుని రథమ్మీదకు ఉరుకులు పరుగులుగా వెళ్ళిపోయినాడు

సాళ్వుడూ వీరుడేగా?

మొత్తానికి గాంగేయుడి రథం వేగాన్ని అందుకున్నాడు

అందుకోవటమేమిటి, దాటేశాడు కూడాను

ఆపాడు రథాన్ని, ఆపించాడు దేవవ్రతుడి రథాన్ని

కానీ ఆయన్ని ఎదురెదురుగా చూడగానే సాళ్వుడికి ఒళ్ళు గగుర్పొడించింది

ఆ అందానికి, ఆ భీషణత్వానికి, ఆ వీరత్వానికి, సహస్ర సూర్య భగవాను తేజానికి

ఒంటి మీది రోమాలన్నీ నిలబడుకొనిపోయినాయి

అచ్చంగా బ్రహ్మ నిద్ర నుంచి లేచి కాళ్ళు చేతులు విదిలించినప్పుడు పుట్టిన సరీసృపాల్లా, పాముల్లా నిలబడుకొనిపోయినాయి

** తన సృష్టి వృద్ధిలేమికిఁ

గనలుచు శయనించి చింతఁ గర చరణాదుల్

గొనకొని కదలింపఁగ రా

లిన రోమము లుగ్రకుండలివ్రజ మయ్యెన్**

అన్న పద్యం గుర్తుకువచ్చిందా?

అంతే మరి, భావన అంటే ఒక శక్తి

ఆదిపరాశక్తితో సమానం

అంత గగుర్పాటును అణుచుకొంటూ సింహనాదం చేసినాడు

అమ్మాయీమణులను వదిలెయ్యమన్నాడు దేవవ్రతుడితో

ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకుండా, పొదిలోనుంచి ఒక మహాస్త్రం తీసి ఒక్క వేటు వేసినాడు

మాట మంతీ లేకుండా, ఆ మహాస్త్రపు దెబ్బకు రథమ్మీదనుంచి కిందపడిపోయి ఆమడ దూరం జారిపోయినాడు

అక్కడికి సాళ్వుడి యుద్ధ నైపుణ్యం సమాప్తం

దేవవ్రతుడు వెళ్ళిపోతున్నాడు

హస్తినకు వెళ్ళిపోతున్నాడు

అమ్మాయీమణులను తీసుకొని వెళ్ళిపోతున్నాడు

సాయం సమయమయ్యింది

అమ్మాయిలకు విశ్రాంతి కావాలని విడిది చేశినాడు

మార్గమధ్యంలో ఉన్న అడవిలో విడిది చేశినాడు

రాతిరి ఒకటవ జాము నడుస్తుండగా అంబ వచ్చింది గాంగేయుని దగ్గరకు

నిద్ర పోకుండా ఏమి చేస్తున్నావ్ అన్నాడీయన

భీష్మా, నీవు సత్యానికి బద్ధుడవేనా ? అని నోరు పెగలించుకొని అడిగింది అంబ

సత్యానికొక్కదానికేనేమి, ధర్మానికి కూడా బద్ధుడినే అన్నాడు గాంగేయుడు

మరి నీ శపథం వదిలివేసుకుంటున్నావా అని ప్రశ్నించింది అంబ

ఎవరన్నారు నా శపథం వదిలి వేస్తున్నానని అన్నాడు భీష్ముడు

మరి నీవు పెండ్లాడకపోతే మమ్మల్ని ఎందుకు తీసుకొని పోతున్నావు అని మరో ప్రశ్న వచ్చింది అంబ నుండి

నా తమ్ముడు విచిత్రవీర్యునికి మిమ్మలందరినీ ఇచ్చి కట్టబెట్టటానికి అన్నాడు ఈయన

ఎవరికో ఇచ్చి కట్టబెట్టటానికి నీ వీరాన్ని చూపించావా అంటూ అంబ హేళణగా నవ్వింది

ఆయన మారుమాట్లాడలా

రెట్టించింది అంబ

మీ నాన్న పంపించిన స్వయంవర ఆహ్వానంలో ఉన్నదే నేను చేసినాను, నా తప్పేమీ లేదు అన్నాడీయన

మా నాన్న చెప్పింది చెయ్యటమేమిటి ? ఏమున్నది ఆహ్వానంలో అంటూ ఒక్క క్షణం ఉక్కిరిబిక్కిరి అయినది అంబ

ఎవరు వీరాధివీరులో, ఎవరి రాజ్యంలో అందరూ వీరులేనో, ఎవరు ఆ వీరులకు రాజో, ఎవరు యుద్ధవిజేతో వారికే మా అమ్మాయిమణులను కట్టబెట్టేది అని ఉన్నది

నాన్నగారు అలా అనలేదే మాతో, స్వయంవరం అన్నారే అంటూ అంబ ఆశ్చర్యపడ్డది

అది మీరు మీరు తేల్చుకోవాల్సిన విషయం అన్నాడు ఈయన

ఆ, గుర్తుకు వచ్చింది ఆ ఆహ్వానం మా మంత్రిగారు పంపించారు, ఆయన మతలబు చేశి ఉంటాడు ఇందులో, నరికేస్తా వాడిని అంటూ ఆవేశానికి లోనయ్యింది అంబ

ఇప్పుడు ఆవేశపడి లాభం లేదు కానీ, ఆహ్వానం వచ్చాక మా రాజ్యంలో అంతా వీరులే, ఇంత చిన్నదానికి రాజుగారు రావటం ఎందుకని నేనే వచ్చేశా, మిమ్మల్ని తీసుకెళ్ళి మా చిన్నరాజు గారికి అప్పగించేసి పెళ్ళి చేసేస్తానంటూ అటు తిరిగి నిద్రకుపక్రమించాడు

అదంతా నాకు తెలియదు, ఎవరికో కట్టబెట్టటమేమిటి ? నన్ను ఎత్తుకొచ్చిన నీవే నన్ను పెండ్లి చేసుకోవాలి అని మరో మాట విసిరింది

కుదరదు అన్నాడు గాంగేయుడు

ఎట్లా కుదరదు? నన్ను సాళ్వుడికి కాకుండా చేసి, ఎత్తుకొచ్చిన నీకు కాకుండా చేసి, వేరెవరికో కట్టబెడితే నీ అంతు చూస్తాను, నీకు మృత్యుదేవతనవుతాను అంటూ తాండవం చేసింది

ఆయన సాళ్వుడి పేరు వినగానే కాస్త అశ్చర్యానికి లోనైనాడు

సాళ్వుడా? వానికి నిన్ను కాకుండా చెయ్యటమేమిటి అన్నాడు

సాళ్వుని వృత్తాంతం, తమ ప్రేమ వృత్తాంతం తెలిపింది అప్పుడు అంబ

అది విన్న భీష్ముడు మ్రాన్పడిపోయినాడు ఒక్క నిముషం

ఏ నాడు తప్పు చేయని నేను దారి తప్పినట్టే ఉన్నది, తప్పు కాదు కానీ తప్పు అనబడదగ్గ పని చేసినాను. నీ మనసులో మాట రథం ఎక్కక ముందైనా చెప్పినావు కాదు నాకు అని చింతించాడు

అయిపోయిందేదో అయిపోయింది, ఇక సాళ్వపతి దగ్గరకన్నా నన్ను పంపించివేయి, లేదా నీవే నన్ను పెండ్లి చేసుకోమని పట్టు పట్టినది

పట్టు పట్టరాదు పట్టి విడువరాదు అన్న సూత్రముననుసరించి పట్టు పట్టినది

నేను శపథ బద్ధుడిని, అది ఆ పరమశివుడు కూడా మార్చలేడు, అందువల్ల నీవు నా మీద కోరిక వదిలి ఆ సాళ్వరాజు వద్దకు వెళ్ళిపో అని , గుర్రం ఎక్కించి పంపివేశినాడు

అంబ రోషం, ఆనందం కలగలసిన మన:స్థితిలో పరుగు పరుగున సాళ్వుడు పడిపోయిన ప్రదేశానికి దౌడు తీయించింది గుర్రాన్ని…

అక్కడ….

 

(ఇంకా ఉంది….)

మీ మాటలు

  1. Sailaja says:

    ఇది కూడ బాగుంది. తర్వాత భాగం కోసం చూస్తున్నాం

  2. vasanthrao deshpande says:

    ఏదో పురాణ కథ చెపుతున్నారు. బాగుంంది. కాని మధ్య మధ్య ఆ ఇంగ్లిశ్ పదాలేంటీ . కథ చదివేవాడు ఒక మూడ్ లో వుండి కథ చదువుతాడు, అవి పానకంలో పుడకల్లా అనిపించడం లేదా మీకు.ఆలోచించండి

  3. చదివేవాడి మూడు ఎట్లానో, రాసేవాడి మూడు కూడా అంతే! అయితే ఆ మూడు మూడకుండా, మాడకుండా ఉంటే చాలు. రాసింది అసలెవరన్నా చదివారో లేదో తెలియనిదానికి, ఇంగ్లీషు భాషలో రాసినా పిశాచ భాషలో రాసినా ఒకటేనండి. ఒక ఇద్దరు పాఠకుల కోసం మారాలా అన్నది ప్రశ్న? సమాధానం – తప్పకుండా! ఏదో పురాణం నేను చెప్పినట్టే, ఏదో కామెంటు మీరూ పెట్టారు కాబట్టి మీ పానకంలోకి పుడకలు లేకుండా చేస్తా వచ్చే భాగాల్లో… :)

    భవదీయుడు
    వంశీ

  4. ఎవరి కోసమూ …మీ శైలి మార్చుకోవద్దని మనవి.

మీ మాటలు

*