తర్జుమా కావాలి: సంగిశెట్టి

 

 

  ఇంటర్వ్యూ : స్కైబాబ 

~

తెలంగాణ  సాహిత్యానికి  చేసిన సేవలకు గుర్తింపుగా సంగిశెట్టి శ్రీనివాస్‌ కి  తెలంగాణ అవతరణ ఉత్సవ పురస్కారం దక్కింది. సంగిశెట్టి 1965లో నల్లగొండ జిల్లా యాదగిరిగుట్ట దగ్గరలోని రఘునాథ పురంలో పుట్టారు. చిన్నప్పుడే  తల్లిదండ్రులతో పాటు హైదరాబాద్‌ వచ్చిన శ్రీనివాస్‌ 1990వ దశకం ఆరంభంలో ఉస్మానియాయూనివర్సిటీ కేంద్రంగా  ఏర్పడి, పనిజేసిన తెలంగాణ స్టూడెంట్స్‌ ఫ్రంట్‌ స్థాపకుల్లో ఒకరు. 1991 నవంబర్‌ ఒకటిన ఆర్ట్స్‌ కళాశాలపై ఆంధ్రప్రదేశ్‌ అవతరణకు వ్యతిరేకంగా పెద్ద నల్లజెండాను ఎగరేశారు సంగిశెట్టి.

తొలి  కవయిత్రి కుప్పాంబికను వెలుగులోకి తెచ్చారు. తొలి తెలుగు కథలు  – భండారు అచ్చమాంబ, ఆవుల  పిచ్చయ్య, సురమౌళి కథా సంపుటాలను వెలువరించారు. మరుగునపడ్డ తొలితరం తెలంగాణ కథల  సూచీ ‘దస్త్రమ్‌’ తీసుకొచ్చారు.  ఆంధ్రా కథకులతో పోలుస్తూ తెలంగాణ కథాచరిత్రను ‘కథాత్మ’ పేరిట వెలువరించారు. ‘తొలినాటి తెలంగాణ కథలు’, తెలుగు  యూనివర్సిటీ ‘నూరేండ్ల తెలుగు కథ’ పుస్తకాలకు సహసంపాదకత్వం వహించారు. ఉస్మానియా యూనివర్సిటీ జర్నలిజం విభాగం పరిశోధనలో భాగంగా తెలంగాణ పత్రికారంగ చరిత్ర ‘షబ్నవీస్‌’ని చిత్రికగట్టారు. ‘హైదరాబాద్‌ సిర్ఫ్‌హమారా’ పేరిట పుస్తకాన్ని రాశారు. సురవరం సమగ్ర కవిత్వం, తెలంగాణ వైతాళికుడు వట్టికోట ఆళ్వారుస్వామి ‘రామప్ప రభస’ పుస్తకాలకు సంపాదకత్వం వహించారు. సురమౌళి కథలు వెలుగులోకి తెచ్చారు. 1969-73 ఉద్యమ కవిత్వానికి, వట్టికోట ఆళ్వారుస్వామి జీవిత చరిత్ర ‘సార్థక జీవనం’కు సహసంపాదకత్వం వహించారు. 30కి పైగా పుస్తకాలను ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ తరపున అచ్చేశారు. తెలంగాణ హిస్టరీ సొసైటీ, సింగిడి, దస్కత్‌, బహుజన కథకుల కచ్చీరు తరపున అనేక కార్యక్రమాల నిర్వహణలో ప్రధాన భూమిక పోషించారు. తెలంగాణ చరిత్ర, సంస్కృతి, సాహిత్యం అభిమాన విషయాలుగా అనేక పరిశోధనా పత్రాల్ని, వ్యాసాల్ని వెలువరించారు. జోగిపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాల లైబ్రరీ సైన్స్‌ విభాగంలో అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ దళిత చరిత్ర రాసే పనిలో ఉన్నారు.

1. మీరు కవిత్వం రాశారు. ఉద్యమాలు చేశారు. చివరికి సాహిత్య చరిత్ర పరిశోధనలోకి ఎలా వచ్చారు?

జవాబు: అవును.. 1980-84లో ఆ ప్రాంతంలో చాలా కవిత్వం రాశాను. శ్రీశ్రీని ఇమిటేట్‌ చేస్తూ. ‘స్నిగ్ధశ్రీ’ అనే కలం పేరుతో నేను రాసిన కవితలు పోతుకూచి సాంబశివరావు నడిపిన ‘విశ్వరచన’ పత్రికలో అచ్చయినయి. అందులో శబ్దాల పైనే ఎక్కువగా శ్రద్ధపెట్టిన. శ్రీకృష్ణదేవరాయాంధ్ర భాషానియంలో జరిగిన కవి సమ్మేళనానికి సీనియర్‌ దాశరథి ముఖ్య అతిథిగా వచ్చి నేను చదివిన కవితను మెచ్చుకోవడం ఓ తీపి జ్ఞాపకం.
ఇక ఉద్యమం – పరిశోధన రెండూ నా విషయంలో విడదీయలేనివి. 1990లో ఉస్మానియా విశ్వవిద్యాయంలో జర్నలిజం విద్యార్థిగా తెలంగాణ స్టూడెంట్‌ ఫ్రంట్‌ కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొనే వాడిని. నిజానికి యూనివర్సిటీల్లో ఎన్నికలు నిషేధం విధించిన తర్వాత రాడికల్‌ స్టూడెంట్స్‌ యూనియన్‌ సానుభూతి పరులు స్థాపించారు. ఈ సంఘం కార్యకలాపాల్లో చురుగ్గా పాల్గొన్నాను. ఈ దశలో ఉస్మానియా యూనివర్సిటీలో ప్రతి సంవత్సరం (ఇప్పటికీ) బెస్ట్‌ స్టూడెంట్‌కు ‘షోయెబుల్లాఖాన్‌’ స్మారక అవార్డు ఇచ్చేవారు. ఆయనెవరు? అని ప్రొఫెసర్లని అడిగినా సరైన సమాధానం దొరకలేదు. దాంతో పరిశోధన మొదయ్యింది. మన మూలాలు తెలుసుకోవడం ప్రారంభమయింది.
నేను ఉస్మానియా జర్నలిజంలో ఎంఫిల్‌ మొదటి బ్యాచ్‌ విద్యార్థిని. ‘తెలంగాణాలో తెలుగు పత్రికలు’ అనే అంశంపై పరిశోధన చేసేందుకు నిర్ణయించుకొని అప్పటి మా గురువు ఇప్పటి మాజీ ఎమ్మెల్సీ కె.నాగేశ్వర్‌ని సంప్రదిస్తే ఆయన ‘తెలంగాణలో తెలుగు పత్రికలు ఎక్కడివి? పరిశోధన సాగదు’ అని నిరుత్సాహ పరిచిండు. అయినా నేను పట్టుబట్టడంతో ఒప్పుకున్నడు. ఇది 1992నాటి సంగతి. ఇగ అప్పటి నుంచి హైదరాబాద్‌ల ఎక్కడ పాత లైబ్రరీ ఉన్నా వెళ్ళి అక్కడి పాత పత్రికల జిరాక్స్‌ సేకరించడం. పరిశోధనలో భాగంగా అందులోని విషయాలని నోట్‌ చేసుకునే వాణ్ణి. ఇట్లా పత్రికల నుంచి సాహిత్యంలోకి వచ్చాను.
దాదాపు ఇదే కాలంలో ఆంధ్రా ప్రాంత సాహిత్యకారులు మళ్ళొక్కసారి తెలంగాణ తెలుగు కథ అనే అంశంపై అక్కడక్కడా చర్చలు చేశారు. ఇదే కాలంలో కథ సిరీస్‌ ప్రచురణ ప్రారంభమయింది. ఒక వైపు పాత పత్రికలను అధ్యయనం చేస్తూనే అందులో ఉన్న కథను ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్నాను. ఇట్లా ప్రత్యేకంగా నోట్‌ చేసుకున్న కథల లిస్టు ‘దస్త్రమ్‌’ పేరిట 2005లో మెవరించాను. అలాగే అంతకుముందు పరిశోధన సమగ్రంగా ఉండాలనే తపనతో సేకరణకు, రచనకు ఎక్కువ సమయం పట్టింది. ఈ లోపు ఎంఫిల్‌ సబ్మిట్‌ చేయాల్సిన టైమ్‌ కూడా అయిపోయింది. దాంతో ఈ పరిశోధనను ‘షబ్నవీస్‌’ పేరిట ప్రచురించాను. ఇది 2004 నాటి సంగతి.
1995-96 ఆ ప్రాంతంలో ‘ఉదయం’ సహోద్యోగి, తెలుగు యూనివర్సిటీలో పరిశోధన చేస్తున్న కె.శ్రీనివాస్‌తో కలిసి హైదరాబాద్‌లో ఉన్న అన్ని గ్రంథాయాలను వడపోశాము. అనేక మంది వ్యక్తులను కలిశాము. ఇదే సమయంలో ‘కవిలె’ తెలంగాణ రీసెర్చ్‌ అండ్‌ రెఫరాల్‌ సెంటర్‌ని ఏర్పాటు చేశాము. దీని ప్రధానోద్దేశము అటు ప్రత్యేక తెలంగాణ ఉద్యమానికి కావలసిన ముడి సరుకును అందించి, విస్మరణ, వివక్షకు గురైన విషయాల్ని వెలుగులోకి తీసుకురావడం. ఇప్పటి వరకు ఈ సంస్థ తరపున పది విలువైన సాహిత్య, చారిత్రక పరిశోధక పుస్తకాలు ప్రచురించాము.
అలాగే తెంగాణ సాంస్కృతిక వేదిక, ‘సింగిడి’ తెలంగాణ రచయితల సంఘం నిర్వహించిన సభల్లో పాల్గొనడమే గాకుండా ‘సోయి’ పత్రికలో రెగ్యులర్‌ విస్మరణకు గురైన విషయాల్ని చిత్రిక గట్టాను. సుంకిరెడ్డి నారాయణ రెడ్డి తీసుకొచ్చిన ‘మత్తడి’కి కొంత ముడిసరుకునందించాను. ఇది తెలంగాణ సాహిత్య చరిత్రలో కొత్త చూపుకు పునాది వేసింది.

2. మీరొక బీసి.. పద్మశాలి. బీసిల గురించి మీరు చేసింది ఏమిటి?

జవాబు: తెలుగు సాహిత్యంలో నా అస్తిత్వాన్ని వెతుక్కుంటున్న దశలో సుద్దాల హనుమంతుపై జయధీర్‌ తిరుమలరావు రాసిన చిన్న పుస్తకం దొరికింది. ఆ తర్వాత అలిశెట్టి ప్రభాకర్‌, తర్వాతి కాలంలో కథకు బి.ఎస్‌.రాములు, ఆడెపు లక్ష్మీపతి, పి.చంద్‌ ఇట్లా… అవును, మన వాళ్ళు కూడా సాహిత్య రంగంలో ఉన్నారు కదా.. తెలుగు సాహిత్యంలో చేనేత కార్మికుల వెతల్ని, ఛిధ్రమౌతున్న బతుకుల్ని రికార్డు చేసిన కథల్ని త్వరలోనే మిత్రులతో కలిసి సంకనంగా తీసుకు రానున్నాము. నేను నా మూలాలను మరువలేదు. దాంట్లో భాగంగానే 18వ శతాబ్దంలోనే  దార్ల సుందరమ్మ రాసిన ‘భావలింగ శతకం’ను త్వరలో పుస్తకంగా ఆధునిక దృక్కోణంలో ఆమె స్థానాన్ని ఖరారు చేస్తూ తీసుకు వస్తున్నాం.
ఇక బీసీల గురించి మీరు ఏమి చేసిందేమిటని? నిజానికి తెలంగాణ సమాజం మరిచిపోయిన ‘కృష్ణస్వామి ముదిరాజ్‌’ని ముందుగా పరిచయం చేసింది నేను. సాయుధ పోరాటంలో స్వయంగా పాల్గొన్న సాహిత్యకారుడు ఆవుల పిచ్చయ్య కథల్ని అచ్చు రూపంలోకి తెచ్చాను. సోయి, తెలంగాణ టైమ్స్‌ పత్రికల్లో చాకలి ఐమ్మ, దొడ్డి కొమురయ్య, హకీం జనర్దానదాస్‌, సంగె లక్ష్మీబాయమ్మ, సరోజిని రేగాని, మల్యా దేవిప్రసాద్‌ యాదవ్‌, మరిపడగ బలరామాచార్య, గూడూరి సీతారామ్‌, డాక్టర్‌ మల్లన్న ఇట్లా కొన్ని వందలమంది బీసీల జీవిత చరిత్రను పాఠకులకు పరిచయం చేసిన. మేము కూడా చరిత్రకు ఎక్కదగ్గ వాళ్ళమే అని నొక్కి చెప్పిన.
ఫోరం ఫర్‌ కన్సర్న్‌డ్‌ బీసీస్‌ సంస్థను ఏర్పాటు చేసి బహుజనులకు వివిధ సాహిత్య, సామాజిక రంగాల్లో జరుగుతున్న అన్యాయాలను నిలదీస్తూ పత్రికా ముఖంగా అనేక వ్యాసాలు వెలువరించడమైంది.

3. ముఖ్యంగా బ్రాహ్మణుల గురించే ఎక్కువ పనిచేశారని బహుజనకారుల విమర్శ… 

–  ఇది కూడా అర్ధసత్యం. నేను నిజానికి ఎక్కువ పనిచేసిందీ, సమాచార సేకరణ కోసం ఎక్కువ కష్టపడ్డదీ దళితుల కోసం. ఎవ్వరికీ తెలియని తొలితరం దళితోద్యమకారుడు ‘వల్తాటి శేషయ్య’ను రంగం మీదికి తీసుకొచ్చాను. 1857-1956 మధ్య కాలంలో వందేండ్లలో తెలంగాణ సమాజంలో దళితుల్లో వచ్చిన మార్పును పుస్తకంగా ప్రచురించాల్సి ఉంది. ఆ పని జరుగుతోంది. భాగ్యరెడ్డి వర్మ, శ్యామ్‌సుందర్‌, బి.ఎస్‌. వెంకటరావు, సుమిత్రాదేవి, రామారావు, వెం. లక్ష్మయ్య, సదాక్ష్మి, శంకర్‌ దేవ్‌, ‘దళిత పదం’… ఇట్లా అనేక రచనల్ని పాఠకులకు అందుబాటులోకి తీసుకు రావడమయింది. అట్లనే తుర్రెబాజ్‌ఖాన్‌ పోరాటాలను, మహలఖాబాయి చందాను తెలుగు పాఠకులకు పరిచయం చేసింది కూడా నేనే నని గర్వంగా చెబుతున్నాను. 1857 పోరాటం- దాంట్లో ముస్లింల పాత్ర, రజకార్ల నెదిరించిన ముస్లింలు, షోయెబుల్లాఖాన్‌, ఇట్లా అనేక విషయాలపై రాసిన.
నేను ముస్లింల గురించి ఎక్కువగా రాయడానికి కారణం కళాశాలలో ఉద్యోగ సహచరులు. సంగారెడ్డి జూనియర్‌ కాలేజీలో ఉర్దూ మీడియం కూడా ఉండేది. అక్కడ అహ్మదుల్లా ఖురేషి, మహమూద్‌, నజీర్‌ లాంటి మిత్రులతో ఎప్పుడూ బైస్‌ నడిచేది. హైదరాబాద్‌-ముస్లింలకు సంబంధించిన అనేక విషయాలు మా మధ్య చర్చకు వచ్చేవి. మంచి, చెడూ కూడా. కృష్ణస్వామి ముదిరాజ్‌ ‘పిక్టోరియల్‌ హైదరాబాద్‌’,  షీలారాజ్‌ రాసిన ‘మీడివలిజమ్‌ టూ మాడర్నిజం’, రత్నా నాయుడు రాసిన ‘ఓల్డ్‌ సిటీస్‌ న్యూ ప్రిడక్‌మెంట్స్‌’ చదివిన తరవాత ఆలోచనల్లో మార్పు వచ్చింది. నిజాం పట్ల నిష్పాక్షికంగా తెలుసుకోవాల్సిన విషయాలున్నాయని అర్థమయింది. దావూద్‌ అష్రఫ్‌ పుస్తకాలు కొత్త నిజాం చరిత్రలో కొత్త వెలుగులో నింపాయి. ఇవన్నీ ముస్లిం పట్ల ప్రేమను మరింతగా పెంచాయి.
ఆళ్వారుస్వామి, సురమౌళిలను కేవలం బ్రాహ్మణులుగా చూసినట్లయితే తెలంగాణ చరిత్రకు అన్యాయం జరుగుతది. వాళ్ళు తమ జీవితకాలంలోనే ‘డీకాస్టిఫై’ అయ్యిండ్రు. అట్లనే సురమౌళి అయితే కులనిర్మూన సంఘమే పెట్టిండు.
రాయసీమ, ఉత్తరాంధ్ర అంటే కూడా నాకు ప్రత్యేకమైన అభిమానం. ఉత్తరాంద్ర వాళ్ళు కూడా వలసాధిపత్యంలో వనరులు కోల్పోయారు. దాంతో పాటు సంస్కృతి, భాష కూడా కొల్లగొట్టబడింది. ముఖ్యంగా తాపీ ధర్మారావు లాంటి సాహిత్యకారులకు తగినంత గుర్తింపు రాలేదు. అట్లా రావాలని నేను మాట్లాడాను. అట్లనే రాయలసీమ తొలి కథ గాడిచర్ల హరిసర్వోత్తమరావుది బయటపెట్టి వాళ్ళ కథా చరిత్రను ఇంకొంచెం ముందుకు జరిపాను. ఆ తర్వాత పరిశోధనల్లో అది మరింత ముందుకు వెళ్ళింది. ఈ పరిశోధన చేస్తున్న మిత్రులందరికీ అండగా ఉన్నాను. కథా సాహిత్యంపై పరిశోదన చేస్తున్న వారికి మా ‘కవిలె’ సంస్థ పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్నది.

4. ‘సింగిడి’తో అనుబంధం గురించి చెప్పండి…

– తెలంగాణ రచయిత వేదిక నిష్క్రియా పరత్వంలోకి జారిపోయిన సందర్భమే గాకుండా దళిత, బహుజనులకు ఆ సంస్థలో తగిన గౌరవం, గుర్తింపు దక్కక పోవడం, పుస్తకాల ప్రచురణ, పత్రికా నిర్వహణలోనూ సమాజంలో మెజారిటీగా ఉన్న వారిని విస్మరించడం బాదేసింది. దీంతో కొంత మంది ‘లైక్‌మైండెడ్‌’ మిత్రులము కలిసి ఈ ‘సింగిడి’ తెంగాణ రచయితల సంఘాన్ని 2008లో స్థాపించాము. నాతో పాటుగా సుంకిరెడ్డి నారాయణరెడ్డి, స్కైబాబ, పసునూరి రవీందర్‌, జిలుకర శ్రీనివాస్‌, సిలువేరు హరినాథ్‌, ఏలేశ్వరం నాగభూషణాచార్య తదితరులున్నారు. శ్రీకృష్ణ కమిటీ ముందు ఏడుగురం సభ్యులము భిన్న సామాజిక వర్గాకు ప్రాతినిధ్యం వహిస్తూ మా వాదనను వినిపించాం. నిజానికి మొత్తం తెలంగాణలోని అన్ని సామాజిక వర్గాల వాణిని వాళ్ళు ఒక్క దగ్గర విన్నది ఆ ఒక్కసారే అంటే అతిశయోక్తి కాదు. ఆ కమిటీ వాళ్ళు అన్యాయం చేస్తే ‘ఛీ కృష్ణ కమిటీ’ పేరిట వారి భంఢారాన్ని, తప్పుడు నిర్ధారణను తిప్పి కొట్టడం జరిగింది.
1969-73 ఉద్యమ కవిత్వాన్ని, విగ్రహాల కూల్చివేతను సమర్ధిస్తూ వ్యాస సంకలనం ‘బర్మార్‌’ ఇట్లా చాలా పుస్తకాలను ‘సింగిడి’ తరపున వెలువరించాం. సాహిత్యకారులకు అంతవరకు తెలియని ఎన్నో చీకటి కోణాలను ఆవిష్కరించడమైంది.. తెలంగాణ ఆవిర్భావ సందర్భంలోనే బహుజనులకు తక్షణం ఏం కావాలో వివరిస్తూ ‘సింగిడి ఎజెండా’ పుస్తకంగా వెలువరించాం. రాజకీయాలకు అతీతంగా నిర్భయంగా, నిష్పాక్షికంగా సమాజంలోని మెజారిటీ వర్గాలైన బహుజనుల అభ్యున్నతి కోసం ఈ సంస్థ పనిచేస్తున్నది.
    5. సాహిత్య చరిత్ర, పరిశోధనల గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు ?
– ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి ఆంధ్రా సాహితీవేత్తలు సరైన గౌరవం ఇవ్వలేదని వాళ్ళను నిందిస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళని నిందించడం గాకుండా మన చరిత్రను మనం వినిర్మించుకోవాలి. పునాదులతో సహా దళిత, బహుజన, ముస్లిం, ఆదివాసీ, మహిళా చైతన్యంతో తెలంగాణ సాంస్కృతిక ప్రతీకలను నిర్మించుకోవాలి. విస్మరణకు గురైన వ్యక్తులను, సాహిత్యాన్ని ప్రయత్న పూర్వకంగా వెలుగులోకి తేవాలి. తెలుగు విశ్వవిద్యాలయంలో పరిశోధన, ప్రచురణ కోసం ప్రత్యేకంగా నిధులు కేటాయించి ఈ పనిని యుద్ధ ప్రాతిపదికన చేయాల్సిన అవసరముంది.
దున్న ఇద్దాసు, దైదవేము దేవేందరన, సుద్దాల హనుమంతు, ఆళ్వారుస్వామి, సురవరం, మహలఖా యిచాందా, ఇట్లా కొన్ని వందల పేర్లు చెప్పొచ్చు. వాళ్ళందరి రచలను పుస్తక రూపంలో సమగ్రంగా రావాలి. అంతేగాకుండా కేవలం పత్రికల్లోనే ఉన్నటువంటి రచనలను కూడా సేకరించి అచ్చువేయాలి. ఈ పనిని ఎంత తొందరగా చేస్తే అంత మంచిది. లేదంటే అవి కూడా లుప్తమై పోయే అవకాశముంది. అంతేగాకుండా వివిధ విశ్వవిద్యాయాల్లో వివిధ విభాగాల్లో జరిగే పరిశోధనల్లో సమన్వయం ఉండాలి. తెలుగు విభాగం, చరిత్ర విభాగం ఒకే అంశంపై పరిశోధన చేయకుండా చూడాలి. వీటి మధ్యన సహకారం ఉన్నట్లయితే మరింత మెరుగైన పరిశోధనలు వచ్చే అవకాశముంటుంది. అచ్చుకు యోగ్యమైన పరిశోధన ఫలితాలను ఒక కమిటీ ద్వారా పరీక్షింపజేసి ప్రభుత్వమే అచ్చేయాలి. అప్పుడే ప్రజలకు విషయాలు తెలుస్తాయి.
ప్రభుత్వం చరిత్ర నిర్మాణ సంఘాన్ని ఏర్పాటు చేసి దాని ద్వారా రాగద్వేషాలకు అతీతంగా ప్రామాణికమైన తెలంగాణ ప్రజల చరిత్రను రచింపజేయాలి. సాహిత్య కారులు వివిధ ప్రక్రియల్లో వెలువరించే పుస్తకాలకు కేరళ రాష్ట్రం మాదిరిగా వాటిని అచ్చేసేందుకు ఆర్థికంగా అండగా నిలవాలి. తెలంగాణలోని తెలుగు, ఉర్దూ భాషల్లోని క్లాసిక్స్‌ని ఇంగ్లీషులోకి తర్జుమా చేయించాలి.
పుస్తక ప్రచురణకు, ప్రాచుర్యానికి ప్రభుత్వం, గ్రంథాలయాలు  అండగా ఉండేలా చర్యలు చేపట్టాలి.

*

మీ మాటలు

  1. B.Narsan says:

    I came to know so many things done by sreenivas through this interview. Thanks to sky bhayya and congratulations to sangishetti.

  2. ఆవుల పిచ్చయ్య కధలు ఎక్కడ దొరుకుతుంది ? శ్రీనివాస్ అన్నట్లుగా ఆంధ్ర వారిని తప్పు పట్టకుండా ఇప్పుడు పరిశోధనలు చేయాలి .ప్రభుత్వాన్ని నిధులు అడగాలి.

  3. గోర్ల says:

    తెలంగాణ పరిశోధకుడు, విమర్శకులు, బహుముఖ సాహితీవేత్త సంగిశెట్టి శ్రీనివాస్ గారికి అవార్డు వచ్చిన సందర్భంగా శుభాకాంక్షలు.

    ‘‘ఇన్నేండ్లు తెలంగాణ చరిత్రకు, సాహిత్యానికి ఆంధ్రా సాహితీవేత్తలు సరైన గౌరవం ఇవ్వలేదని వాళ్ళను నిందిస్తూ వచ్చాం. ఇప్పుడు వాళ్ళని నిందించడం గాకుండా మన చరిత్రను మనం వినిర్మించుకోవాలి.’’ ఇది కరెక్ట్. ఇగ పాత ముచ్చట్లు చెప్పొద్దు. మనం ప్రభుత్వం ఉంది. దాన్నుండి మనను మనం మరోసారి నిర్వచించుకుని,నిర్మించుకోవాల్సి ఉంది. మంచి ఇంటర్వ్యూ. స్కై బాబా గారి ధన్యవాదాలు. మంచి ప్రశ్నలు వేసి, మంచి సమాచారం రాబట్టారు.

Leave a Reply to గోర్ల Cancel reply

*