ప్రాంతీయభాష -తెలంగాణ కవిత

 

 

జీవితం చిత్రించబడకుండా ఒక ప్రాంత సంస్కృతి పరిపూర్ణంగా చిత్రించబడుతుందా అంటే కాదనే అనాలి.చరిత్రలో సాంస్కృతిక పునరుజ్జీవనం భాషవల్ల వ్యక్తమయిన సందర్భాలు చాలాఉన్నాయి.కాని ఒక ప్రాంతీయ సంస్కృతికి అనుబంధంగా ఉండే భాష తనపరిమితులకు లోబడే వ్యక్తమౌతుంది.తెలంగాణా ప్రాంతీయ ముద్రలో ప్రాంతీయభాష ,సంస్కృతి , వ్యక్తులు, వ్యక్తిత్వాలు వెలిగక్కిన కవిత రావడానికి ప్రాంతీయ కవిత కొన్ని మైలురాళ్ళు దాటింది.

Local color or regional literature is fiction and poetry that focuses on the characters, dialect, customs, topography, and other features particular to a specific region.

(స్థానీయవర్ణం లేదా ప్రాదేశిక సాహిత్యం అది కథ, కవిత ఏదైనా పాత్రలు, ప్రజా వ్యవహారంలోని భాష,వేష ధారణ,అయా నైసర్గిక ప్రకృతి చిత్రణ మొదలైన వాటిపై ప్రత్యేక ప్రాదేశిక పరిధిలో దృష్టి పెడుతుంది.)

ప్రాంతీయ కవిత్వం ఉత్పన్నమవడానికి సాంస్కృతిక మూలాలు ఎంత అవసరమో అక్కడి అణచివేతలుకూడా  అంతే కారణం.19వ శతాబ్దం మధ్య భాగాల్లో 20 వ శతాబ్దం మొదటిభాగాల్లో అమెరికాలో ప్రాదేశిక కవిత్వం వచ్చింది.” Donna M. Campbell లాంటి విశ్లేషకులు ఈ సాహిత్యాన్ని అనుశీలన చేసారు. సివిల్ వార్  తరువాత వచిన సాహిత్యంగా దీనిని చెప్పుకుంటారు. ఫిలిప్పిన్స్ సాహిత్యంలోనూ ఇంగ్లీష్ భాష ఆధిపత్యాన్ని తిరస్కరిస్తూ ప్రాదేశిక సాహిత్యం వచ్చింది.. ఈ మార్గంలో తెలంగాణా సాహిత్యం,కవిత్వం మినహాయింపుకాదు.

సాంస్కృతిక ,రాజకీయ అణచివేతల తరువాత బలమైన ప్రాదేశిక కవిత్వం రావడం సాహిత్యంలో కనిపిస్తుంది. ఈ మార్గంలో మొదటి పరికరం భాష.ప్రాతిపదికంగా వర్తమానంలో ప్రవహంలో ఉన్న భాషను రూపగతంగా తిరస్కరించే పరికరం భాష మాత్రమే.తెలంగాణా కవులు కూడా భాషపై తొలిదశలోనే దృష్టి పెట్టారు. తమ ఉనికి వ్యక్తం చేయడానికి భాష ఒక ప్రధానపరికరం అన్న జ్ఞానం ఆనాడే కనిపిస్తుంది.అయితే ఈ కవిత్వం ఆనాటికి శబ్దముఖంగా ఉనికి వ్యక్తం చేసే ప్రయత్నం చేసింది.

వస్తుగతంగా పల్లెను తీసుకుని అక్కడి వాతావరణాన్ని చిత్రించే ప్రయత్నం చేసింది.తొలి ఉద్యమ సందర్భంలో దేవరాజు మహారాజు “గుండె గుడిసె”, డా.ఎన్.గోపి “తంగేడు పూలు” ఇందుకు నిదర్శనం.

వైద్యుడు  ఉత్త పుణ్యానికిచ్చిన మందు

బతికి నట్టే జేస్తది “/”జలగ గునాలు బెట్కోని ఓఅ మన్శి/దేవతోలె మాటలిడుస్తడు“-(పే.35)

పేమ పజ్యాల వాయిజ్యాలు ఊకెవాగకు“-(పే.34)

ఈ కాలానికి తెలంగాణా ప్రాంతీయ కవితకు కొన్ని ప్రాతిపదికలైతే ఏర్పడ్దాయి. కాని పరిపూర్ణంగా రూపుదిద్దుకుందని అనలేం.దానికి కొన్ని కారణాలున్నాయి. భాషను పరికరంగా ఉపయోగించుకోవడంతో పాటు వస్తువును,అందులోని అంశాలను అనిర్దిష్టంగా ,ఊహాత్మకంగా ప్రతిపాదించడం.భాషా ముఖంగా తెలంగాణా ప్రాంతీయ ముద్ర ఈ పదాల్లో కనిపించినా “వైద్గుడు””పజ్యం””వాయిజ్యాలు”వంటి పదాల ఉనికి సృజనాత్మకమూ ఊహాత్మకమైందే.భాషా ముఖంగా వాడిన క్రియలు”జేస్తది””ఇస్తరు”వాటిలో ప్రాంతీయ ఉచ్చారణారూపం(Local oral form) దగ్గరగా ఉన్నది. డా. గోపి “తంగేడు పువ్వు”లాంటివి సాంస్కృతిక ప్రాతినిధ్యాన్ని(Cultural representation) ఇచ్చాయి. ఈ కవితలో ప్రాంతీయ ముద్ర(Local signet)ఉంది కాని కవితానిర్మాణంలో సాధారణ కవిత రూపమే కనిపిస్తుంది. డా.గోపి రాసిన “పల్లెల్లో మన పల్లెల్లో”కవితలో ప్రాంతీయభాష సజీవంగా కనిపిస్తుంది.అయితే ఈకోవవన్నీ పల్లీయకవిత్వం(Idyllic poetry)కి చెందుతాయి.ఈముద్రనుంచే కొన్ని కవితా శీర్శికలు,కొన్ని చోట్ల నామవాచకాలు. క్రియలు ఉపయోగించుకోవడం రెండవమలుపు. ఇవి ఊహాత్మకనుంచి, సాoస్కృతికత నుంచి వాస్తవికత దాకా ప్రాంతీయకవిత ప్రవహించిన ఆనవాళ్ళు.కాని వస్తు రూపంలో “ప్రాంతం”ప్రధానంగా వ్యక్త మవటం తక్కువ.

తొలిదశ తెలంగాణా ఉద్యమం మలిదశకు మధ్య కాలంలో తెలంగాణా  కవులు వివిధ సామాజిక,రాజకీయ ఉద్యమాలను మోయవలసి రావడం అందువల్ల వస్తువుగా తెలంగాణాను  ప్రధానంగా వ్యక్తం చేయవలసిన అవసరాన్నుంచి దూరం చేసింది.ఎమర్జెన్సీ,సాయుధ పోరాటాలు,రైతాంగ పోరాటాలు,తొలిదశ రాజకీయ ఆకాంక్ష ఇవన్నీ వస్తువులుగా తెలంగాణా  కవుల కవితలను ఆక్రమించాయి.మలిదశకు కొంత ముందుభాగాల్లో ఉన్న ప్రపంచీకరణ, పారిశ్రామిక విధానాలు,పట్టనీకరణ మొదలైనవీ ఇందుకు మినహాయింపు కాదు.

ఈ సమయంలోనే అస్తిత్వ ఉద్యమాలు పెరిగి తెలంగాణా ప్రాంతీయకవిత (Topographical poem)రావడానికి మార్గాలేర్పడ్దాయి.దళిత కవిత,బహుజన కవిత,ముస్లిం మైనారిటీ కవిత అందుకు దోహద పడ్దాయి.ముద్రనుంచి జీవితాన్ని చిత్రించడం ఇక్కడినుండే ప్రారంభమయింది.అందువల్ల సాంస్కృతిక క్షేత్రం,వ్యక్తులు,వ్యక్తిత్వాలు,భాష నిర్దిష్టంగా వెలుగులోకి వచ్చింది.ఈ పై వాదాల కాలంలో కవిత్వం ,కవితలు ప్రాంతీయ లక్షాన్ని కలిగి లేవు.అస్తిత్వ ప్రశ్నలను లక్షంగాచేసుకున్నవి.

తెలంగాణా మలిదశ ఉద్యమ సందర్భంలో ఈ మార్గాలన్నిటినీ కూర్చుకొని బలమైన ప్రాంతీయ కవిత ముందుకొచ్చింది. తెలంగాణా వచన కవిత్వంలో వేముల ఎల్లయ్య,గ్యార యాదయ్య,చిత్తం ప్రసాద్,ఎం.వెంకట్,భూతం ముత్యాలు,అన్నవరం దేవేందర్,పొన్నాల బాలయ్య,జూపాక సుభద్ర,జాజుల గౌరి,సిద్ధార్థ మొదలైన అనేకమంది కవులు దళిత,బహుజన జీవితాలను వ్యక్తం చేసారు. “మేమే'”బహువచనం”లాంటి సంకలనాలు.కొన్ని కవుల వ్యక్తిగత సంపుటాలు.ఇలాంటి కవిత్వానికి అద్దం పడుతాయి. వీటిలో వస్తువు,జీవితం,భాష అన్ని సమగ్రంగా తెలంగాణా ప్రాంతీయ కవితను వ్యక్తం చేసాయి.ఈ తాత్వికతనే మలిదశ ఉద్యమకవితలో వ్యక్తమయింది. కేవలం ఉద్యమ సంబంధమైన గొంతును కూర్చుకుని జీవితం,సంస్కృతి,ఆచారాలు మొదలైన వాటినుంచి కవిత్వం  వచ్చింది. ఈ కాలంలోనూ తెలంగాణా నుంచి వచ్చిన మొత్తం కవిత్వం అంతా ప్రాంతీయ  ముద్ర ఉన్న కవిత్వం కాదు. ప్రాంతీయోద్యమ కవిత్వం కూడా ఆధునిక రూపంలో వచ్చింది.కాని భాషను మూల పరికరంగా ఉపయోగించుకున్న కవిత గతానికంటే చాలా ఎక్కువ.

నిజానికి ఈ కాలంలో తెలంగాణా కవిత రెండు మార్గాల్లో వ్యక్తమయింది.1.ఆధునిక వచన రూపంలో ఆధునిక కవితా రూపాలతో వర్తమాన వ్యవహారంలో ఉండే భాష తో తెలంగాణ  సంస్కృతి,వ్యక్తులు,వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.2.ప్రాంతీయ సంస్కృతి, భాష, వ్యక్తులు వ్యక్తిత్వాలతో వ్యక్తమైన కవిత.వర్తమానంలోనూ ఈరెండు మార్గాలు కనిపిస్తాయి. ఈ క్రమంలో నే ఆధునిక  తెలంగాణా కవితా రూపాన్ని,తెలంగాణా ప్రాంతీయ కవితా రూపాన్ని రెంటినీ వేర్వేరుగా గుర్తించవచ్చు.

 

1.”మావ్వ దిగూట్లె దీపం గాదు/ఆకాశం గొంగట్ల ఆగమైనపొద్దు/నేలమ్మ కొంగున అంగిటబుట్టిన ఆకలి

   -(దుక్కాల్ని దున్ని పోసుకున్న తొక్కుడుబండ మా అవ్వజూపాక సుభద్ర)

2.”ముని మబ్బులలేసే/తల్లికోడిలెక్క /అడవిల తిరుగాడే/మినుగురులెక్క

అరిచేతిల ముగ్గునుబట్టి/పంచలకు అదునుగ జారిడిసి/సరళరేఖలు గీసే మాయమ్మ/అయ్యలేసిన యాల/తూర్పుదిక్కువెలుగులువిరజిమ్మే తొలిపొద్దుపొడుపైతది

      -(మాయమ్మజాజులగౌరి)

3.ఇరిగిన బండిగీర విలవిలకొట్టుకుంటూ/మొండిగా మొట్టుకారుమీదిమొర/చుట్ట ఆరెలు కమ్మలు సొప్పబెండ్లరథమోలెకూలినయి“-(ఔగోలిత్తున్నంపొన్నాలబాలయ్య)

4.”గలగల నదులనిండా నీళ్లదోప్కం

  ముల్లెమూటల మీన్నే మానిగురాన్

 “మనోళ్లకొలువులల్ల మన్ను దుబ్బ

మారు మాట్లాడకుండ నోటినిండా బెల్లం గడ్ద

        -(అన్నవరం దేవేందర్పదవి)

 

మొదటి రెండు వాక్యాలు వరుసగా ప్రాంతీయ పాత్రలను,వ్యక్తిత్వాలను చిత్రిస్తాయి.రెండు ఖండికాభాగాలుకూడా తల్లిపాత్రను చిత్రించినవే.ఇందులో దలిత ఈస్తటిక్స్ కనిపిస్తాయి.ప్రతీకలను తమదైన జీవితంలోంచి తీసుకుని సృజించడం ఈ వాక్యాల్లో కనిపిస్తుంది.దళిత బహుజన జీవితాలతోపాటుగా ఆవాదాల స్ఫూర్తితో బాటుగా ఇందులో స్త్రీవాద గొంతుక కూడా కనిపిస్తుంది. మూడో వాక్యం ప్రపంచీకరణ సందర్భంలో కుదేలైన కులవృత్తులను చిత్రించినవాక్యాలు.నాలుగో ఖండికాభాగం రాజకీయాంశది. మొదటి రెండు వాక్యాల్లో  ఈస్తటిక్స్ ఉన్నట్లుగానే చివరి రెండు వాక్యాల్లో వ్యంగ్యం కనిపిస్తుంది.ఒక ఉద్వేగ పరిస్థితుల్లో తెలంగాణాభాషలో నిసర్గమైన వ్యంగ్యం ధ్వనిస్తుంది.వాక్యాల్లో ఉండే సమవృత్తి సూత్రం ఈ అంశాలను పటం కడుతుంది కూడా. వరుసగా వీటిని గమనిస్తే ఈనాలుగు దశల్లో సమగ్రమైన ప్రాంతీయ కవిత ఎలా రూపుదిద్దుకుందో అర్థమవుతుంది.

ఈవాక్యాలన్నీ రాజకీయ స్పృహను,సాంస్కృతిక స్పృహను,ఆర్థికస్పృహను కలిగిఉంటూనే ప్రాంతీయభాషను పరికరంగా తీసుకొచ్చాయి.కళాత్మక వాక్యాలనిర్మాణాన్ని చేయగలిగాయి.ఇవన్నీ తెలంగాణా ప్రాంతీయకవిత బలపడిన సందర్భాలను ప్రతిబింబిస్తాయి.నిజానికి ఉద్యమ సందర్భంలో వచ్చిన కవితలు కొన్ని ప్రత్యేకమైన వ్యక్తీకరణ సంప్రదాయాలను కవిత్వంలో నిర్మించాయి.వీటిని గూర్చిన విశ్లేషణలు ఇంకా రావాల్సిఉంది.

*

మీ మాటలు

  1. బూర్ల says:

    మంచి విశ్లేషణ నారాయణ శర్మ గారూ… తెలంగాణ ఉద్యమ సాహిత్య వస్తువు స్పష్టమే కానీ నిర్మాణం, వైవిద్యం, భాష ఇంకా విస్తృత వ్యాసాలూ మీ నుండి రావాలని కోరుకుంటున్నా

  2. కూకట్ల తిరుపతి says:

    మల్లోజులన్నా!
    మా బాగా రాసినవన్నా!

మీ మాటలు

*